పోలవరం నుంచి కావేరికి గోదావరి | Meeting of Governing Body of National Water Development: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పోలవరం నుంచి కావేరికి గోదావరి

Published Tue, Jul 16 2024 4:39 AM | Last Updated on Tue, Jul 16 2024 4:39 AM

Meeting of Governing Body of National Water Development: Andhra pradesh

ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశంలో ఏపీ ప్రతిపాదన 

బొల్లాపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోయాలి

అక్కడి నుంచి కావేరికి తరలించాలని వినతి 

సమ్మక్క బ్యారేజ్‌ నుంచి అనుసంధానం చేపట్టాలన్న తెలంగాణ 

ఇచ్చంపల్లి, సమ్మక్క బ్యారేజ్‌ల నుంచి అనుసంధానానికి అంగీకరించబోమన్న ఛత్తీస్‌గఢ్‌ 

రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే అనుసంధానం చేపడతామన్న కేంద్ర జల్‌ శక్తి శాఖ 

త్వరలో బేసిన్‌ పరిధిలోని రాష్ట్రాలతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడి

సాక్షి, అమరావతి: గోదావరి నది పరీవాహక ప్రాంతం (బేసిన్‌)లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ హక్కులను పరిరక్షిస్తూ పోలవరం నుంచి గోదావరి – కావేరి అనుసంధానం చేపట్టాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్యూడీఏ)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పోలవరం నుంచి గోదావరి జలాలను బొల్లాపల్లి వద్ద 300 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి కావేరికి తరలించాలని సూచించింది. 

ఇచ్చంపల్లి నుంచి కాకుండా సమ్మక్క బ్యారేజ్‌ నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని, దీని ద్వారా తరలించే నీటిలో 50 శాతం తమకు కేటాయించాలని తెలంగాణ ప్రతిపాదించింది. తెలంగాణ ప్రతిపాదనను ఛత్తీస్‌గఢ్‌ వ్యతిరేకించింది. సమ్మక్క, ఇచ్చంపల్లి బ్యారేజ్‌ల వల్ల తమ రాష్ట్రాంలో ముంపు ఉత్పన్నమవుతుందని,  దీనికి తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. బేసిన్‌ పరిధిలోని రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని, ఇందుకు త్వరలోనే ఆ రాష్ట్రాలతో సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ స్పష్టం చేశారు.  

వాడీవేడిగా ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశం
దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి 73వ సమావేశం సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్‌ జనరల్‌ భోపాల్‌సింగ్, ఏపీ ప్రభుత్వం తరఫున హైడ్రాలజీ విభాగం సీఈ కుమార్, తెలంగాణ తరఫున ఈఎన్‌సీ అనిల్‌కుమార్, అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్‌  నిర్మించి, అక్కడి నుంచి జలాలను కావేరికి తరలించాలన్న ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనను తెలంగాణ ఈఎన్‌సీ అనిల్‌  వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్రానికి 158 టీఎంసీల (దేవాదులకు 38, సీతారామకు 70, తుపాకులగూడెంకు 50 టీఎంసీ) నీటి అవసరాలున్నాయని,  ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్‌ నిర్మిస్తే తెలంగాణ, ఏపీ అవసరాలతోపాటు గోదావరి– కావేరీ అనుసంధానం ప్రాజెక్టు అవసరాలను ఏకకాలంలో ఎలా తీరుస్తారని ప్రశి్నంచారు. సమ్మక్క బ్యారేజ్‌ నుంచి అనుసంధానం చేపట్టాలని కోరారు.

దీనిపై ఛత్తీస్‌గఢ్‌ సర్కారు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇచ్చంపల్లి, సమ్మక్క బ్యారేజ్‌ల వల్ల తమ ప్రాంతం ముంపునకు గురవుతుందని, అందువల్ల ఆ బ్యారేజ్‌ల నిర్మాణానికి అంగీకరించబోమని తేలి్చచెప్పింది. ఇచ్చంపల్లి, సమ్మక్క బ్యారేజ్‌లను ఎగువ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ సీఈ కుమార్‌ ప్రతిపాదించారు. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి సోమశిలలోకి, అక్కడి నుంచి కావేరికి తరలించాలన్న ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని తేలి్చచెప్పారు.

గోదావరికి జూలై ఆఖరు నుంచి ఆగస్టు వరకు భారీ వరద ఉంటుందని,  ఆగస్టులో కృష్ణాకు కూడా వరద వచ్చి నాగార్జునసాగర్‌ కూడా నిండుగా ఉంటుందని వివరించారు. గోదావరి–కావేరి అనుసంధానంలో నాగార్జున సాగర్‌ను భాగం చేస్తే దాని ఆయకట్టుకు కూడా విఘాతం కలుగుతుందన్నారు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించాలంటే పోలవరం నుంచి గోదావరి జలాలను కొత్తగా బొల్లాపల్లి వద్ద నిరి్మంచే రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి సోమశిల.. అటు నుంచి కావేరికి తరలించాలని సూచించారు.

ఇదే ప్రతిపాదనను ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులు గతంలో రాష్ట్రంలో పర్యటించినప్పుడు అందజేశామని, దాన్ని పరిశీలించాలని కోరారు. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు తరలిస్తున్న 80 టీఎంసీలకుగానూ.. ఆ మేరకు సాగర్‌ ఎగువన కృష్ణా బేసిన్‌లో వాడుకునేలా రాష్ట్రాలకు ట్రిబ్యునల్‌ అనుమతి ఇచ్చిందని ఏపీ, తెలంగాణ అధికారులు గుర్తు చేశారు.

మహారాష్ట్ర 14, కర్ణాటక 21 టీఎంసీలు అదనంగా వాడుకుని, గోదావరి–కావేరి అనుసంధానం వల్ల కృష్ణా జలాలను ఆ రాష్ట్రాలకు అదనంగా వాడుకోవడానికి అవకాశం కలి్పస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిజే‹Ùకుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వెలువడ్డాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని తెలంగాణ ఈఎన్‌సీ అనిల్‌ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement