
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్ గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను అనకాపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి పరామర్శించారు. 124 మంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుండగా.. వారిలో ఎవ్వరికీ ప్రాణాపాయం లేదన్నారు. మెరుగైన వైద్యం కోసం ఎనిమిది మందిని విశాఖ కేజీహెచ్కు తరలించామన్నారు. జరిగిన ప్రమాదంపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ముత్యాలనాయుడు, ఎంపీ సత్యవతి అన్నారు.
చదవండి: (అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం జగన్ ఆరా)
ఈ మేరకు ఘటనపై మంత్రి ముత్యాలనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. అచ్యుతాపురం సెజ్లో జరిగిన సంఘటన దురదృష్టం. జరిగిన సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే అంబులెన్స్లు ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన వారిని ఎన్టీఆర్ హాస్పిటల్కు తరలించాము. ప్రస్తుతం ఎన్టీఆర్ హాస్పిటల్లో 124 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. వారిలో ఎనిమిది మందికి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు పంపించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 50 బెడ్స్ కేజీహెచ్లో అదనంగా ఏర్పాటు చేశాము. జరిగిన ఘటనపై ఒక కమిటీ ఏర్పాటు చేశాము. జరిగిన ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు.
ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం బాధితులకు అందుతోంది. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదు. మెరుగైన వైద్యం కోసం ఎనిమిది మందిని కేజీహెచ్కు తరలించారు. పరిస్థితిని కలెక్టర్ అధికారులు దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎంపీ సత్యవతి తెలిపారు.
చదవండి: (అచ్యుతాపురంలోని సెజ్లో గ్యాస్ లీక్! పలువురికి అస్వస్థత)