
సాక్షి, అమరావతి: ప్రజల సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వం ప్రారంభించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై టీడీపీ నీచ రాజకీయాలకు తెరతీసింది. మీడియా సాక్షిగా జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్ సెల్కు టీడీపీ నేత వర్ల రామయ్య, కార్యకర్తలు మూకుమ్మడిగా ఫోన్లు చేశారు. వెటకారంగా మాట్లాడుతూ ఉద్యోగులను వేధింపులకు గురిచేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నుంచే వర్ల రామయ్య.. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
తనతోపాటు మరో 20 మంది పార్టీ నేతలు, కార్యకర్తలను మీడియా సమావేశంలో కూర్చోబెట్టి వారితో 1902 హెల్ప్లైన్కి ఒకేసారి ఫోన్లు చేయించారు. తాను కూడా తన ఫోన్ నంబరు, ల్యాండ్లైన్ నంబర్ల నుంచి ఫోన్ చేశారు. హెల్ప్లైన్లో మాట్లాడుతున్న ఉద్యోగులతో అసభ్యంగా మాట్లాడుతూ, వెటకారం చేస్తూ వర్ల రెచ్చిపోయారు. ‘నీ పేరేంటి.. నీ ఫోన్ నంబర్ చెప్పు.. నీ దుంప తెగ.. నువ్వు చాలా తెలివైనవాడివయ్యా.. నా సమస్యను జగనన్నకు చెప్పే అవకాశం లేదా? అన్ని సమస్యల్ని వెంటనే పరిష్కరించేస్తామన్నారుగా..’ అంటూ ఉద్యోగిని వేధించారు. ‘సీఎం జగన్ అవినీతి చేస్తున్నారు.. ఫిర్యాదు రాసుకో అంటూ’ ఉద్యోగిని చాలాసేపు ఇబ్బంది పెట్టారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమమైన ‘జగనన్నకు చెబుదాం’ను అడ్డుకోవడం, దానిపై బురద జల్లడమే లక్ష్యంగా వర్ల రామయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ తన నీచ రాజకీయాల కోసం ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడం అన్యాయమని మండిపడుతున్నారు. ప్రజల నిజమైన ఫిర్యాదుల పరిష్కారానికి అవకాశం ఇవ్వకుండా రాజకీయ డ్రామాలాడడం టీడీపీ నైజానికి నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, టీడీపీ నేతలు ఎంతకైనా దిగజారతారనే దానికి ఇది నిదర్శనమని అంటున్నారు. ప్రభుత్వంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ నేతలు అడ్డుకోవడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులను వేధించడానికి, వారి విధులకు ఆటంకం కలిగించడానికి చేసిన ప్రయత్నంగానూ ఇది కనిపిస్తోందని ధ్వజమెత్తుతున్నారు.