
సాక్షి, గుంటూరు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వంశీని సోమవారం ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుప్రతికి తీసుకువచ్చారు. ఆసుపత్రి వైద్యులు వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వంశీ సతీమణి పంజశ్రీకి కాసేపటి క్రితమే ఆమె జీజీహెచ్కు చేరుకున్నారు. ఆమెను గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఇక, వంశీని ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే జీజీహెచ్ గేట్లను మూసివేశారు పోలీసులు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో, వంశీని సోమవారం ఉదయం జీజీహెచ్కు తీసుకువచ్చారు. అనంతరం, వంశీకి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక, వంశీకి జీజీహెచ్కు తరలించిన వెంటనే పోలీసులు.. ఆసుపత్రి ప్రధాన గేట్లను మూసివేశారు. ఈ నేపథ్యంలో ఆసుప్రతికి వచ్చి పేషంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు సైతం వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం.
మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీని పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రి లోపలికి వెళ్లకుండా ఆమెను గేటు వద్దనే నిలిపివేశారు. ఈ క్రమంలో పంకజశ్రీతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో, వంశీ ఆరోగ్య పరిస్థితిపై పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా సైతం చేరుకున్నారు. ఫాతిమాను కూడా ఆసుపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
