
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భోగాపురం విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. ఇందులో ప్రపంచస్థాయి సౌకర్యాలతోపాటు సరుకు రవాణా కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎయిర్ కార్గో అవకాశాలపై గురువారం ఫిక్కీ ఏర్పాటు చేసిన సమావేశంలో విజయసాయిరెడ్డి వర్చువల్గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విమానాల ద్వారా సరుకు రవాణాకు అనేక అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే నాలుగు విమానాశ్రయాల్లో అందుబాటులో ఉన్న ఎయిర్ కార్గో సేవలను వినియోగించుకోవాల్సిందిగా ఎగుమతిదారులను కోరారు. ఎయిర్ కార్గో సేవల కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్లనవసరం లేకుండా రాష్ట్రంలోనే పూర్తి స్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. వర్చువల్గా జరిగిన ఈ సమావేశంలో కస్టమ్స్ విజయవాడ ప్రిన్సిపల్ కమిషనర్ ఫాహీమ్ అహ్మద్తోపాటు వివిధ ఎయిర్లైన్స్, ఎయిర్పోర్టు అధికారులు, ఎగుమతిదారులు పాల్గొన్నారు.