చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Comments About Opposition Status In Press Meet, Speech Highlights Inside | Sakshi
Sakshi News home page

YS Jagan: చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం

Published Thu, Mar 6 2025 5:39 AM | Last Updated on Thu, Mar 6 2025 11:27 AM

YS Jagan mohan Reddy about opposition status

ఐదుగురు ఎమ్మెల్యేలు పక్కన కూర్చున్నా..

పదిమందిని లాగేద్దామని మావాళ్లు అన్నారు.. నేనే వద్దన్నా: వైఎస్‌ జగన్‌

అసెంబ్లీలో ఏం మాట్లాడుతావో మాట్లాడు అని మైక్‌ ఇచ్చాం

ఇప్పుడు శాసన సభలో ఉన్నవి రెండే పక్షాలు..

ప్రజల గొంతుక వినపడకూడదనే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు

ఇంతమంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే నిబంధన ఎక్కడా లేదు

ఢిల్లీ అసెంబ్లీలో మూడే సీట్లున్న బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేయడం ఎప్పుడైనా చూశామా?

పవన్‌ కళ్యాణ్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ

జీవితకాలంలో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు  

సాక్షి, అమరావతి: ‘ఇవాళ అసెంబ్లీలో ఉన్నవి రెండే పక్షాలు. ఒకటి అధికార పక్షం. రెండోది ప్రతిపక్షం. సభా నాయకుడికి సభలో మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటానికీ అంతే సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజల గొంతుకను ప్రతిపక్షం వినిపించగలుగుతుంది. కానీ, ప్రజల గొంతుక వినిపించకూడదని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 

‘‘గవర్నర్‌ ప్రసంగం, బడ్జెట్‌లో లోపాలను సాక్ష్యాధారాలతో ఎండగడుతూ ప్రజలకు వివరించడానికి ఇప్పుడు మీడియా సమావేశంలో రెండు గంటలు పట్టింది. ప్రతిపక్ష హోదా కల్పించినప్పుడే అసెంబ్లీ వేదికగా ఈ తరహాలో ప్రజలకు వివరించడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష హోదా కల్పించలేదు కాబట్టే మీడియా ద్వారా ప్రజల గొంతుక వినిపిస్తున్నాం’’ అని పునరుద్ఘాటించారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు వైఎస్‌ జగన్‌ జవాబిచ్చారు. ఇంత మంది సభ్యుల బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న నిబంధన ఎక్కడా లేదన్నారు.

ఆప్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ అసెంబ్లీలో ముగ్గురు సభ్యులే ఉన్న బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని గుర్తు చేశారు. ‘‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. టీడీపీకి 23 మంది సభ్యులే ఉన్నప్పుడు.. వారిలో ఐదుగురు ఎమ్మెల్యేలు పక్కన కూర్చున్నారు. మరో పదిమందిని లాగేద్దాం.. సభలో టీడీపీ బలం తగ్గిద్దామని మావాళ్లు చెబితే నాడు నేను వద్దని వారించా. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం. అసెంబ్లీలో ఎంత సమయం మాట్లాడతావో మాట్లాడు అంటూ చంద్రబాబుకు మైక్‌ ఇచ్చాం. 

ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ఇదీ.. చంద్రబాబుకు మాకు ఉన్న తేడా’’ అని చెప్పారు. ‘‘గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేయడం ఎప్పుడైనా చూశామా? ఇక్కడ చంద్రబాబు చేశాడు.. అయినా ఉత్తరాంధ్ర టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలో మాస్టార్లు కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పారు కదా? ఎందుకంటే, అక్కడ రిగ్గింగ్‌ సాధ్యం కాదు. కారణం.. టీచర్లే ఓటర్లు, ఏజెంట్లు కాబట్టి’’ అని మరో ప్రశ్నకు వైఎస్‌ జగన్‌ సమాధానం పేర్కొన్నారు. ‘‘పవన్‌ కళ్యాణ్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ. జీవితకాలంలో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు’’ అంటూ ఇంకో ప్రశ్నకు బదులిచ్చారు.

అప్పులపైఅవే అబద్ధాలు..
» మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు..!
»మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీలు, రీసెర్చ్‌లు చేస్తున్నారు : వైఎస్‌ జగన్‌  
»అమరావతి పేరిట ఇంతింత అప్పులు చేస్తూ సెల్ఫ్‌ సస్టైనింగ్‌ ప్రాజెక్టు అని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు?
»బాబు వచ్చాక రెవెన్యూ తగ్గిందని ప్రస్ఫుటంగా కనిపిస్తోంది
»రాష్ట్రానికి సొంత ఆదాయాలు పెరగలేదు
»మూలధన వ్యయంలో గణనీయంగా తగ్గుదల కనిపిస్తోంది
» మరి చంద్రబాబు చెబుతున్నట్లు జీఎస్‌డీపీ 12.94 శాతానికి ఎలా పెరుగుతుంది?  

‘‘చంద్రబాబు మోసాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు బహిరంగ సభలో రాష్ట్ర అప్పులు రూ.పది లక్షల కోట్లు అని అబద్ధాలు చెప్పాడు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్లన్నారు. ఆ తర్వాత రూ.12 లక్షల కోట్లన్నారు. గతేడాది బడ్జెట్‌లో గవర్నర్‌ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లని చెప్పించారు. రాష్ట్రానికి అప్పులుఎంత ఉన్నాయన్నది కాగ్‌ రిపోర్టులో ఉంది. 

2023–24లో కాగ్‌ అకౌంట్స్‌లో అప్పులు రూ.4,91,734.11 కోట్లు, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పు రూ.1,54,797.11 కోట్లు. రెండు కలిపితే  మొత్తం అప్పులు రూ.6,46,531 కోట్లు’’ అని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎంవైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు.  – సాక్షి, అమరావతి 

2018–19 నాటికి అంటే.. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.2,57,509 కోట్లు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు రూ.55,508 కోట్లు. రెండు కలిపి రూ.3.13 లక్షల కోట్ల అప్పులున్నాయని తన తొలి బడ్జెట్‌లోనే చంద్రబాబు ప్రకటించారు. ఆ అప్పులు మా ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.6.46 లక్షల కోట్లకు చేరాయి. వాస్తవాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా ఇంకా దుష్ఫ్రచారం చేస్తూనే ఉన్నారు. 

చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, అన్యాయస్తుడు అంటే.. మొన్న చిత్తూరులో గంగాధర నెల్లూరు పబ్లిక్‌ మీటింగ్‌లో రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు అని చెప్పాడు. ఆయన మనిషి రూపంలో ఉన్న రాక్షసుడా కాదా? అబద్ధాన్ని ఇంతలా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? ఒక అబద్ధాన్ని చెప్పిందే చెప్పి.. అదే నిజమని నమ్మిస్తూ.. అందుకే సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ అమలు చేయడం లేదని ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు.

ప్రజల ముందు లెంపలేసుకుని గుంజీలు తీయి. అప్పుడు ప్రజలేమైనా క్షమిస్తారేమో.. అలాంటివి చేయకుండా అబద్ధాలు చెప్పడం, మళ్లీ మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీలు, రీసెర్చ్‌లు చేస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌ ఎట్‌ ఏ గ్లాన్స్‌లో అప్పుల ప్రస్తావన కనపడకుండా మాయ చేసేందుకు ప్రయత్నించారు. బడ్జెట్‌ డాక్యుమెంట్‌ లోతుల్లోకి వెళ్లి వాల్యూమ్‌ 5లో బడ్జెట్‌ డాక్యుమెంట్‌ డెట్‌ అండ్‌ గ్యారంటీస్, వాల్యూమ్‌ 2 బడ్జెట్‌ డాక్యుమెంట్‌లో రెవెన్యూ అండ్‌ రిసీప్ట్స, వాల్యూమ్‌ 3/5 ఫైనాన్స్‌ అండ్‌ ప్లానింగ్‌ డిపార్టుమెంట్‌.. ఇలా ఇన్ని డాక్యుమెంట్లు క్రోడీకరించి రాష్ట్రానికి చెందిన అప్పులు ఎంత ఉన్నాయని మేం ప్రజెంటేషన్‌ చేయగలుగు­తున్నాం. 

రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్‌ విషయాలు, వివరాలు సామాన్యులకు అర్ధం కాకూడదన్న దుర్బుద్ధితో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. చంద్రబాబు ఎంత దారుణమైన వ్యక్తో చెప్పడానికి ఇదొక నిదర్శనం. 

మా ప్రభుత్వంతో పోలిస్తే.. చంద్రబాబు ఎడాపెడా అప్పులు చేస్తున్నారు. 2023–24లో రూ.62,207 కోట్లు అప్పు చేస్తే,. ఈ పెద్దమనిషి 2024–25లో రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌లో రూ.73,362 కోట్లు అప్పు చేసినట్లు చూపించారు. రూ.93 వేల కోట్లు అప్పులు చేసి, దాన్ని ఎడ్జెస్ట్‌మెంట్‌ చేసి రివైజ్డ్‌ ఫైనల్‌ ఎస్టిమేట్స్‌లో రూ.73 వేల కోట్లుగా చూపించారు. అయినా సరే మా హయాంతో పోలిస్తే ఏ మేరకు ఎక్కువగా అప్పులు చేశారో కనిపిస్తోంది. 

ఈ అప్పులకు తోడు అమరావతి పేరుతో వరల్డ్‌ బ్యాంక్,  ఏడీబీ రుణాలు రూ.15 వేలు, హుడ్కో రుణం రూ.11 వేల కోట్లు, మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.8 వేల కోట్లు, సివిల్‌ సప్లయిస్‌ ద్వారా మరో రూ.5 వేల కోట్లు అప్పులు తెచ్చారు. కేఎఫ్‌డబ్ల్యూ రుణం మరో రూ.5 వేల కోట్లు ప్రాసెస్‌లో ఉంది. ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్టు అని చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారు. 

కానీ బడ్జెట్‌ డాక్యుమెంట్‌లో ఒక మాదిరిగా, స్పీచ్‌లో మరో మాదిరిగా ఉంటుంది. అమరావతి కన్‌స్ట్రక్షన్స్‌ కింద రూ.6 వేల కోట్లు చూపించారు. అమరావతి పేరిట ఇంతింత అప్పులు చేస్తూ సెల్ఫ్‌ సస్టైనింగ్‌ ప్రాజెక్టు అని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు?

బడ్జెట్‌ మొత్తం అంకెల గారడీ..
రాష్ట్రానికి సొంత ఆదాయం 2023ృ24లో రూ.93,084 కోట్లు వస్తే.. 2024-25లో రూ.1,01,985 కోట్లకు పెరిగిందని, 9.56 శాతం పెరుగుదల నమోదైందని బడ్జెట్‌లో చూపారు. కానీ కాగ్‌ ఆడిటెడ్‌ ఫిగర్స్‌ చూస్తే.. 2023-24లో రాష్ట్రాదాయం పది నెలల్లో రూ.72,866 కోట్లు ఉంటే 2024-25లో పది నెలల్లో రూ.72,873 కోట్లుగా చూపించారు. అంటే  మైనస్‌ 0.01 శాతం తక్కువగా నమోదైనట్టు కనిపిస్తోంది. రెండు నెలల్లో ఏకంగా రూ.1,01,985 కోట్లకు పోతుందని చూపిస్తున్నారు. 

2025-26లో 25.63 శాతం పెరుగుదల చూపిస్తూ రూ.1,28,125.82 కోట్లకు పెరుగుతుందని చూపిస్తున్నారు. ఎందుకింత అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకింత మోసాలు చేస్తున్నారు? ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి, ఖజానాకు రావడంలేదు. ఇసుక మద్యం, క్వార్ట్స్, సిలికా  ఏదైనా సరే చంద్రబాబు మనుషులజేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. 

నాన్‌ ట్యాక్స్‌  రెవెన్యూ కింద మిస్లీనియస్‌ జనరల్‌ సర్వీస్‌ కింద ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది. 2024-25 రివైజ్డ్‌ బడ్జెట్‌లో రూ.226.43 కోట్లు చూపిస్తే 2025-26 బడ్జెట్‌కు సంబంధించి రూ.7,916.60 కోట్లుగా చూపిస్తున్నారు. మిస్లీనియస్‌ జనరల్‌ సర్వీస్‌ అంటే ఏమిటి? ఏ విధంగా బాదబోతున్నారో, ఏం చేయబోతున్నారో ఆర్థిక వేత్తలకు కూడా అర్ధం కావడం లేదు. ల్యాండ్‌ రెవెన్యూస్‌ కింద రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ రూ.1,342 కోట్లు చూపిస్తున్నారు. ఈ పది నెలల కాలానికి వచ్చింది రూ.196 కోట్లు. అంటే రైతులను సిస్తు, నీటి తీరువాతో ఈ రెండు నెలల్లో బాదుతారా? ఏ విధంగా వసూలు చేయబోతున్నారు?

2023-24లో మూలధన వ్యయం రూ.23,330 కోట్లుగా ఉంది. 2023-24లో పది నెలలతో ఇప్పుడు గత పది నెలల కాలాన్ని పోల్చి చూస్తే.. నాడు మేం రూ.20,942 కోట్లు ఖర్చు చేస్తే చంద్రబాబు ఇప్పుడు రూ.10,854 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. మాకంటే 3.18 శాతం ఎక్కువ ఖర్చు చేశామని చూపించేందుకు రివైజ్డ్‌ ఎస్టిమెట్స్‌లో రూ.15 వేలు కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు చూపించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2025ృ26లో మూలధన వ్యయం రూ.40 వేల కోట్లుగా చూపిస్తున్నారు. ఇంత దారుణంగా లెక్కలు చెబుతూ, మోసాలు చేస్తుంటే ఏమనాలి ఈ మనిషిని?

ఈ లెక్కలన్నీ చూస్తే చంద్రబాబు వచ్చాక రెవెన్యూ తగ్గిందని ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్రానికి సొంత ఆదాయాలు పెరగలేదు. మూలధన వ్యయంలో గణనీయంగా తగ్గుదల కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు జీఎస్‌డీపీ 12.94 శాతానికి పెరుగుతుందంటున్నారు. ఎలా పెరుగుతాయి? రెవెన్యూ తగ్గుముఖంలో ఉన్నప్పుడు జీఎ‹స్‌డీపీ ఏ విధంగా పెరుగుతుంది? మూలధనం వ్యయం ఎస్క్‌లేట్‌ చేసి 2023-24 కంటే 318 శాతం అధికంగా పెంచి చేసినట్టు చూపిస్తున్నారు. 

ఎస్‌ఓపీ 2023-24 కన్నా 9.5 శాతం ఎక్కువ పెంచి చూపిస్తున్నారు. వీటన్నింటిని పెంచి జీఎస్‌డీపీని కూడా పెంచి 12.94 శాతం పెరుగుతుందని తప్పుడు లెక్కలు చూపుతున్నారు. 2025-26లో రూ.3,22,359 కోట్ల బడ్జెట్‌ అంకెల గారడి కాదా? ఇవన్నీ మోసంకాదా ? దీన్ని బాహుభళీ బడ్జెట్‌ అనడం మీకు మాత్రమే చెల్లుతుంది!! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement