
న్యూఢిల్లీ: ఈ మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్ల సంపద రూ. 59.75 లక్షల కోట్లకుపైగా ఎగసింది. ఇందుకు మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 18 శాతం జంప్చేయడంతోపాటు.. దేశీ స్టాక్స్ ర్యాలీ దోహదపడింది. ఏడాది చివర్లో కొంతమేర సవాళ్లు ఎదురైనప్పటికీ సెన్సెక్స్ నికరంగా 9,059 పాయింట్లు(18.3 శాతం) లాభపడింది.
యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు, విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) అమ్మకాలలోనూ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 59.75 లక్షల కోట్లకుపైగా పురోగమించింది. రూ. 2,64,06,501 కోట్లను అధిగమించింది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ ఈ ఏడాది జనవరి 17న రూ. 280 లక్షల కోట్లకు చేరడం ద్వారా సరికొత్త రికార్డుకు తెరతీసింది. కాగా.. 2021 అక్టోబర్ 19న సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టం 62,245 పాయింట్లను తాకడం విశేషం!
ఆర్ఐఎల్ దూకుడు
మార్కెట్ క్యాప్(విలువ)రీత్యా దేశీయంగా రూ.17,81,834 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రపథాన నిలిచింది. ఇక రూ. 13,83,001 కోట్ల విలువతో టీసీఎస్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఈ బాటలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(రూ. 8,15,167 కోట్లు), ఇన్ఫోసిస్(రూ.8,02,309 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్(రూ. 5,07,434 కోట్లు) తదుపరి ర్యాంకులను పొందాయి. కాగా.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ ఏకంగా 68 శాతం దూసుకెళ్లడం గమనార్హం!
చదవండి: గ్యాస్ ధరలు డబుల్...! సామాన్యులపై ప్రభావం ఎంతంటే..?