నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు | Banks have been freezing accounts that receive govt DBT funds due to incomplete KYC | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు

Nov 20 2024 4:09 PM | Updated on Nov 20 2024 5:08 PM

Banks have been freezing accounts that receive govt DBT funds due to incomplete KYC

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనల ప్రకారం కేవైసీ అమలులో సరైన విధానాలు పాటించని బ్యాంకులపై చర్యలు తప్పవని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ అన్నారు. సరైన పద్ధతిలో కేవైసీ పూర్తి చేయకుండా కొన్ని బ్యాంకులు ఇప్పటికే నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయని చెప్పారు. దాంతో ఈ ప్రక్రియ పూర్తి చేయని బ్యాంకు కస్టమర్లు ప్రభుత్వం అందించే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) నిధులను పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.

ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో స్వామినాథన్ మాట్లాడుతూ..‘బ్యాంకులు కేవైసీ మార్గదర్శకాలను సరైన పద్ధతిలో అమలు చేస్తున్నట్లు నిర్ధారించుకోవాలి. కస్టమర్ల నుంచి కేవైసీ పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకులదే. దాన్ని సాకుగా చూపి ప్రభుత్వ డీబీటీ నగదును వినియోగదారులకు చెందకుండా చర్యలు తీసుకోకూడదు. కస్టమర్లు కేవైసీ పూర్తి చేసేందుకు బ్యాంకులు విభిన్న మార్గాలు అన్వేషించాలి. లేదంటే మనీ లాండరింగ్‌కు అవకాశం ఉంటుంది. కస్టమర్ల కేవైసీ వివరాలను కాలానుగుణంగా అప్‌డేట్ చేయడంలో బ్యాంకులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సిబ్బందిని తగినంతగా నియమించుకోవాలి. కేవైసీ అప్‌డేట్‌ కోసం కస్టమర్లు హోమ్‌ బ్రాంచ్‌లో సంప్రదించాల్సి ఉంటుంది. ఈమేరకు కస్టమర్లకు వివరాలు తెలియజేయడంతో బ్యాంకులు విఫలమవుతున్నాయి. ఒకవేళ పత్రాలు బ్యాంకులో సమర్పించినా కేవైసీ అప్‌డేట్‌ చేయడంలో కాలయాపన చేస్తున్నారు’ అని తెలిపారు.

ఇదీ చదవండి: గోల్డ్‌ లోన్‌ చెల్లింపు విధానంలో మార్పులు

అంతర్గత అంబుడ్స్‌మన్‌ ఏర్పాటు చేయడంతోపాటు వినియోగదారు ఫిర్యాదుల యంత్రాంగంపై ఆందోళనలున్నాయని స్వామినాథన్‌ తెలిపారు. బ్యాంకులో నెలకొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అంతర్గత అంబుడ్స్‌మన్‌ యంత్రాంగం పని చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement