
దేశీ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. ఫిబ్రవరిలో నమోదైన 2.7 శాతంతో పోలిస్తే మార్చిలో పెద్దగా మార్పులు లేకుండా 3 శాతంగా నమోదైంది. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల పేలవ పనితీరు కారణంగా గత ఆర్థిక సంవత్సరం మార్చిలో నమోదైన 5.5 శాతం పోలిస్తే మాత్రం తగ్గింది. ఇక 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐఐపీ వృద్ధి నాలుగేళ్ల కనిష్టమైన 4 శాతానికి నెమ్మదించింది.
2023–24లో ఇది 5.9 శాతంగా, 2020–21లో ఏకంగా మైనస్ 8.4 శాతంగా నమోదైంది.
2021–22లో 11.4 శాతంగా, 2022–23లో 5.2 శాతంగా ఉంది.
ఇదీ చదవండి: వ్యాపార ‘పద్మా’లు..
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) ప్రకారం ఈ ఏడాది మార్చిలో తయారీ రంగ వృద్ధి 5.9 శాతం నుంచి (వార్షికంగా) 3 శాతానికి, మైనింగ్ ఉత్పత్తి 1.3 శాతం నుంచి 0.4 శాతానికి, విద్యుదుత్పత్తి 8.6 శాతం నుంచి 6.3 శాతానికి నెమ్మదించింది.
ఐఐపీ గణాంకాలను 28వ తారీఖున విడుదల చేయడం ఇదే ప్రథమం.
ఇప్పటివరకు నెల ముగిసిన ఆరు వారాల తర్వాత ప్రతి నెల 12వ తారీఖున విడుదల చేసేవారు. ఇకపై నాలుగు వారాల తేడాతో ప్రకటిస్తారు.