
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా హరిత హైడ్రోజన్ తయారీకి భారత్ను ప్రధాన హబ్గా తీర్చిదిద్దే విధంగా త్వరలోనే ప్రమాణాలు, మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. దేశీయంగా ఎలక్ట్రోలైజర్ల తయారీ కోసం 15 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించి ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంపై (పీఎల్ఐ) కసరత్తు చేసినట్లు ఆయన చెప్పారు. 2030 నాటికి దీన్ని 60 గిగావాట్ల స్థాయికి పెంచుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
దేశీయంగా తయారీని ప్రోత్సహించే క్రమంలో ఎలక్ట్రోలైజర్లను తక్కువ సుంకాలతో ఎప్పటివరకూ దిగుమతి చేసుకోవచ్చనేది కేంద్రం నిర్దిష్ట గడువు నిర్దేశిస్తుందని, ఆ తర్వాత నుంచి భారీ సుంకాలు అమల్లోకి వస్తాయ ని చెప్పారు. అలాగే హరిత హైడ్రోజన్ తయారీలో దేశీ పరిశ్రమ తగు రీతిలో పోటీపడే స్థాయికి ఎదిగే వరకూ తొలుత కొన్నేళ్ల పాటు పీఎల్ఐ స్కీము అందుబాటులో ఉంటుందని సింగ్ వివరించారు. దాదాపు రూ. 19,744 కోట్ల జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఆయన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మిషన్ కింద వచ్చే అయిదేళ్లలో 5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment