-
టెక్ టాక్: ఈ సరికొత్త వాటిని గురించి ఎప్పుడైనా విన్నారా..!
నిత్య జీవితంలో.. టెక్నాలజీ పరంగా నూతన మార్పులు సంభవిస్తున్నాయి. మానవ అన్నీ అవసరాలను తీర్చిదిద్దేలాగా ఈ టెక్నాటజీ వృద్ధి చెందుతుంది. విద్య, వైద్య, ఉద్యోగాలలోనూ దీని అవసరం మరెంతగానో ఉండేలా కాలం మారుతుంది. అందుకు అనుగుణంగానే ఈ సరికొత్త పరికరాలు మీ ముందుకొచ్చాయి. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది కట్టుకుంటే నొప్పులు మాయం.. జిమ్లో వ్యాయామం చేసేవారికి, మైదానాల్లో ఆటలాడే వారికి ఒక్కోసారి కీళ్లు పట్టేసి నొప్పులు తలెత్తడం మామూలే! ఇళ్లల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి నొప్పులు తలెత్తుతుంటాయి. ఇలాంటి నొప్పులకు నొప్పినివారణ మాత్రలు వాడటం, పైపూతగా ఆయింట్మెంట్లు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇకపై వాటితో పని లేకుండా, ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్నచోట పెట్టుకుని, దీనికి ఉన్న బెల్టుతో బిగించి కట్టుకుంటే చాలు, సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఇటీవల ‘రికవరీ థెర్మ్క్యూబ్’ పేరిట ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం కోరుకున్న విధంగా చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఎంచుకోవడానికి స్విచ్లు ఉంటాయి. నొప్పి ఉన్న చోట ఈ క్యూబ్ను అదిమిపెట్టి బిగించి బెల్ట్ కట్టుకుంటే చాలు, రెండు గంటల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని ధర 149 డాలర్లు (రూ.12,350) మాత్రమే! హైడ్రోజన్తో పరుగులు తీసే కారు.. జపాన్కు చెందిన కార్ల తయారీ సంస్థ ‘హోండా’ తాజాగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడిచే కారును రూపొందించింది. హోండా మోడల్స్లోని ‘సీఆర్–వి’ మోడల్ ఎస్యూవీకి అవసరమైన మార్పులు చేసి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడిచేలా ‘సీఆర్వీ: ఈఎఫ్సీఈవీ’ మోడల్కు రూపకల్పన చేసింది. ఇందులో ఉపయోగించే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్ తయారీకి మరో కార్ల తయారీ సంస్థ ‘జనరల్ మోటార్స్’ సహకారం తీసుకుంది. ఇందులో అమర్చిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్లోని 110 వోల్టుల పవర్ ఔట్లెట్ ద్వారా ఇంజిన్కు దాదాపు 1500 వాట్ల విద్యుత్తు సరఫరా అవుతుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకున్నట్లయితే, ఇది ఏకంగా 435 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఈ కారును హోండా మోటార్స్ వచ్చే ఏడాది నాటికి మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాటరీతో నడిచే ఈ–విమానం ఇది బ్యాటరీతో నడిచే ఈ–విమానం నమూనా. ఇది అందుబాటులోకి వస్తే, విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పు రాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే రోడ్లపైకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే ఈ విమానం కూడా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. డచ్ విమానాల తయారీ కంపెనీ ‘ఎలీసియన్’ ఈ బ్యాటరీ విమానం నమూనాకు ఇటీవల రూపకల్పన చేసింది. ‘ఎలీసియన్–ఈ9ఎక్స్’ పేరుతో రూపొందించిన ఈ విమానం 2033 నాటికి అందుబాటులోకి రానున్నట్లు ‘ఎలీసియన్’ కంపెనీ ప్రకటించింది. సాధారణ విమానాల కంటే చాలా తక్కువ బరువుతో రూపొందించిన ఈ విమానం వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 90 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇవి చదవండి: వీటిని చూశారంటే.. మంత్ర ముగ్ధులు అవక తప్పదు! -
సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారు చేసిన రైతు బిడ్డ, ముచ్చటపడ్డారు కానీ రిజెక్ట్!
మహారాష్ట్రలోని చంద్రపూర్కు చెందిన రైతు బిడ్డ 'హర్షల్ నక్షనేని' (Harshal Nakshane) హైడ్రోజన్తో నడిచే AI కారును రూపొందించి.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 'దేవేంద్ర ఫడ్నవిస్' చేత ప్రశంసలందుకున్న విషయం గతంలో తెలుసుకున్నాం. అయితే ఈ కారు అభివృద్ధికి షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లోని పారిశ్రామిక వేత్తలు పెట్టుబడుల పెట్టడానికి నిరాకరించారు. స్టార్టప్ AI కార్స్కు చెందిన హర్షల్ మహదేవ్ నక్షనేని సుమారు 18 నెలలు శ్రమించి భారతదేశపు మొట్ట మొదటి ఏఐ ఆధారిత హైడ్రోజన్ కారు రూపొందించారు. ఈ కారు నిర్మాణానికి ఏకంగా రూ. 60 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ కారుని హర్షల్ షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లోని పారిశ్రామిక వేత్తలు ముందుకు తీసుకువచ్చారు. ఏఐ కారు రీఫ్యూయలింగ్ సమయం కేవలం ఐదు నిముషాలు మాత్రమే. ఇది 1000 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుందని హర్షల్ వెల్లడించారు. ఈ ఏఐ కారు పారిశ్రామిక వేత్తలను ఎంతగానో ఆకర్శించింది, అయితే పెట్టుబడి పెట్టడానికి మాత్రం నిరాకరించారు. ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ఫాస్ట్ట్యాగ్లు పనిచేయవు! కారణం ఇదే.. హైడ్రోజన్ శక్తితో నడిచే వాహనాలకు మార్కెట్ తక్కువగా ఉండటమే కాకుండా.. ఇలాంటి వాటికి సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం కారణంగా పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపలేదు. అయితే ఈ కారు వారు స్వయంగా డ్రైవ్ చేసి 'హర్షల్' పనితీరుని ప్రశంసించారు. -
అక్కడ మొదటి హైడ్రోజన్ రైలు.. త్వరలోనే ట్రయల్స్
ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఇటీవల ప్రధాన్యత పెరుగుతోంది. కాలూష్య రహిత పర్యావరణం దిశగా ప్రపంచ దేశాలు పయనిస్తున్నాయి. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధనం వెలుగులోకి వచ్చింది. ఈ ఇంధనంతో నడిచే వాహనాలను పలు దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సౌదీ అరేబియా త్వరలోనే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రారంభించనుంది. ఈమేరకు ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో మొదటి హైడ్రోజన్ రైలును పరీక్షించడాన్ని తమ దేశం ప్రారంభిస్తుందని రియాద్లో జరిగిన UN MENA క్లైమేట్ వీక్ కార్యక్రమంలో వెల్లడించారు. (ఇండియన్ ఫుడ్కు భారీ డిమాండ్.. భారత్ను వేడుకుంటున్న దేశాలు) హైడ్రోజన్ రైలు అనేది విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన రైలు. హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి దాని ప్రొపల్షన్ సిస్టమ్కు శక్తినిస్తుంది. సంప్రదాయ డీజిల్తో నడిచే రైళ్ల కంటే పర్యావరణపరంగా మేలైనవి. ఇవి పర్యావరణానికి హాని కలిగించే ఎటువంటి ఉద్గారాలను విడుదల చేయవు. మొట్టమొదటి హైడ్రోజన్ రైలు "కోరాడియా ఐలింట్" అనేది హైడ్రోజన్ శక్తితో ప్రత్యేకంగా నడిచే ప్రపంచంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు. ఫ్రెంచ్ బహుళజాతి రైలు రవాణా సంస్థ Alstom దీనిని తయారు చేసింది. 2016లో దీని పరిచయం రైలు ఆధారిత హైడ్రోజన్ ఇంధన సెల్ సాంకేతికత అభివృద్ధిలో ఒక కీలక మలుపు. ఈ రైలు ఒక ట్యాంక్ హైడ్రోజన్కు సుమారు 1,000 కిలోమీటర్లు నడుస్తోంది. ఇది మొదట 2018 సెప్టెంబర్లో జర్మనీలోని లోయర్ సాక్సోనీలో కమర్షియల్గా ప్రారంభమైంది. భారత్లోనూ.. భారత్ సైతం హైడ్రోజన్తో నడిచే రైళ్లను అభివృద్ధి చేస్తోందని, ఇవి 2023 డిసెంబర్ నాటికి సిద్ధమవుతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో తెలిపారు. హర్యానాలోని జింద్-సోనీపట్ మార్గంలో వీటిని నడపనున్నారు. -
సోలార్పవర్తో ‘హైడ్రోజన్’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గోదావరిఖని: ఇప్పటికే సోలార్ విద్యుత్ రంగంలోకి అడుగిడిన ‘సింగరేణి’ మరో భారీ పర్యావరణహిత కార్యక్ర మానికి శ్రీకారం చుడు తోంది. సంస్థ నిర్వహణలో ఉన్న హైడ్రోజన్ ప్లాంట్ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్గా మార్చేందుకు సిద్ధమైంది. దీనిపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని సింగరేణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) ఎన్.శ్రీధర్ సంస్థకు చెందిన విద్యుత్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో తాజాగా జరిగిన ఈ సమావేశంలో దీనిపై చర్చించారు. హైడ్రోజన్ అవసరం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాడే జనరేటర్లలోని వేడిని తగ్గించేందుకు శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్ను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్లాంట్ ఆవరణలోనే ఒక హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తారు. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. ఈ ప్లాంట్లో ఉన్న హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏటా దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ సాధారణంగా థర్మల్ విద్యుత్ వినియోగించి ఎలక్ట్రాలసిస్ రసాయనిక పద్ధతిలో హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి చేస్తారు. అయితే థర్మల్ విద్యుత్కు బదులు సోలార్ విద్యుత్ వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇలా ఉత్పత్తి చేసే హైడ్రోజన్ను ‘గ్రీన్ హైడ్రోజన్’గా పేర్కొంటారు. సింగరేణి పవర్ ప్లాంట్లో హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 100 కిలోవాట్ థర్మల్ విద్యుత్ను వినియోగిస్తుండగా, రాబోయే రోజుల్లో థర్మల్ బదులుగా సోలార్ విద్యుత్ ఉపయోగిస్తారు. జైపూర్లోనే... జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోనే ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, ఐదు మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ నేరుగా హైడ్రోజన్ ప్లాంట్కు అనుసంధానం చేస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రామగుండం రీజియన్లోనే మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసా«ధ్యాలను పరిశీలించాలని చైర్మన్ సూచించారు. సోలార్ పవర్ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి మొదలైతే దేశంలోనే గ్రీన్ హైడ్రోజన్ వినియోగిస్తున్న తొలి థర్మల్ విద్యుత్ కేంద్రంగా సింగరేణి నిలుస్తుంది. జియోపై దృష్టి వేడినీటి ఊట ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా సింగరేణి ప్రయోగాత్మకంగా జియో థర్మల్ ప్రాజెక్ట్ చేపట్టింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద మూడేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో పాటు సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్లోనే మిథనాల్ ప్రాజెక్ట్పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో సింగరేణిలోని సోలార్ ప్లాంట్ల ద్వారా 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని, తద్వారా ట్రాన్సోకు చెల్లించే విద్యుత్ బిల్లులో రూ.108 కోట్లు ఆదా చేసుకోగలి గామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టర్ డి.సత్యనారా యణరావు, సీటీసీ సంజయ్కుమార్ సూర్, చీఫ్ ఓఅండ్ఎం జే.ఎన్.సింగ్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జనరల్ మేనేజర్ చినబసివి రెడ్డి, జనరల్ మేనేజర్(సోలార్) జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్వీకేవీ.రాజు, జీఎం సూర్య నారాయణ, ఏజీఎంలు కేఎస్ఎన్.ప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు -
తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించండి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్ డీలర్లు.. వాహనాల తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించాలని కేంద్ర రహదారులు, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యుయల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అలాగే హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కూడా కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉందని అయిదో ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగడంలో ఆటో డీలర్లు కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న భారత్.. వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉందన్నారు. దేశాన్ని టాప్ ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దడం తన కల అని ఆయన చెప్పారు. -
గ్రీన్ హైడ్రోజన్కు అదానీ జేవీ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా జపాన్ దిగ్గజం కోవా గ్రూప్తో చేతులు కలిపింది. సమాన వాటా(50:50)తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసింది. తద్వారా జపాన్, తైవాన్, హవాయ్ మార్కెట్లలో గ్రీన్ హైడ్రోజన్ విక్రయాలను చేపట్టనుంది. రానున్న దశాబ్ద కాలంలో దేశీయంగా సమీకృత గ్రీన్ హైడ్రోజన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే 50 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు ప్రకటించింది. దీనిలో భాగంగా తొలి దశలో మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తెరతీయనుంది. తదుపరి దశలో సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నులకు పెంచనుంది. ఈ బాటలో తాజాగా సింగపూర్ అనుబంధ సంస్థ ద్వారా కోవా హోల్డింగ్స్ ఏషియా పీటీఈతో జేవీని నెలకొలి్పంది. వెరసి గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్, వీటి డెరివేటివ్ అమ్మకాలు, మార్కెటింగ్ చేపట్టనుంది. శుద్ధ ఇంధన తయారీకి హైడ్రోజన్ ఉపయోగపడనుంది. ప్రధానంగా రిఫైనింగ్, కెమికల్ రంగాలలో వినియోగిస్తారు. అదానీ ఇప్పటికే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కంపెనీగా ఆవిర్భవించింది. గుజరాత్, ముంద్రా సెజ్లోని సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాలను వార్షికంగా 10 గిగావాట్లకు పెంచుకునే ప్రణాళికల్లో ఉంది. ఇక్కడ మెటలర్జికల్ గ్రేడ్(ఎంజీ) సిలికాన్, పాలీసిలికాన్, ఇన్గాట్స్, వేఫర్స్, సెల్స్ తదితరాలను రూపొందించేందుకు వీలుంది. వీటిని సౌర ఇంధనం ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టే ప్రక్రియలో వినియోగిస్తారు. -
‘గ్రీన్’ ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: వాతావరణ కాలుష్య రహిత, నాణ్యమైన విద్యుత్తు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న చర్యలతో రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం (హబ్)గా అవతరిస్తోంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా, పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి విరుగుడుగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తేవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఏపీ భాగం అవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం గతేడాది కేంద్రం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. దీనికి అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023ని రాష్ట్రం రూపొందించింది. తాజాగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) తయారు చేసిన నివేదిక శ్వేత పత్రాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. అందులోని వివరాలను ‘ఎన్ఆర్ఈడీసీఏపీ’ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు. సమగ్రంగా శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం సౌర, పవన విద్యుత్ వంటి స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. హైబ్రిడ్ వ్యవస్థగా చెబుతున్న పంప్డ్ హైడ్రో స్టోరేజి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రానికి 9 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం ఉంది. అనేక ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో సౌర, పవన, పంప్డ్ హైడ్రో సిస్టం ప్రాజెక్టులు 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. కొత్త టెక్నాలజీల ఆవిర్భావం, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. తద్వారా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10 బిలియన్ డాలర్ల నుంచి 15 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులకు అవకాశాలున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్ర అవసరాలతోపాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ను ఎగుమతి చేయడానికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలంగా ఉంది. రాష్ట్రంలో ఏటా 400 కిలో టన్నుల దేశీయ హైడ్రోజన్ డిమాండ్ ఉంది. దేశ పారిశ్రామిక హైడ్రోజన్ డిమాండ్లో ఇది దాదాపు 8 శాతం. ప్రతి ఏటా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023 ప్రకారం 2030 నాటికి కనీసం 500 కిలో టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది.దీని సాయంతో శిలాజ ఇంధన వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని(డీకార్బనైజ్) భావిస్తోంది. ఇందుకోసం యాక్సిలరేటింగ్ స్మార్ట్ పవర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా (ఆస్పైర్) ప్రోగ్రామ్ కింద ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ సాయంతో ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాల నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం వ్యాపారాలకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, పర్యావరణ వ్యవస్థలపై ‘వైట్పేపర్’లో వివరించారు. ఇది పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర సంసిద్ధంగా ఉందని శ్వేతపత్రంలో పొందుపరిచారు. కేంద్రం ఎంచుకున్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో ఐదు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ హబ్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. వీటిని 25 గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ క్లస్టర్లుగా విభజించి, వివిధ రంగాలకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది. మొదటి తరం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులుగా పిలుస్తున్న వీటిలో పన్నెండు రసాయనాలు, రిఫైనరీ, ఉక్కు పరిశ్రమలలోని పారిశ్రామిక డీ–కార్బనైజేషన్ ప్రాజెక్టులు కాగా మూడు భారీ రవాణా ప్రాజెక్టులు, మరో మూడు సిటీ గ్యాస్ డ్రిస్టిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుల్లో హైడ్రోజన్–బ్లెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మిగిలిన ఏడు ప్రాజెక్టులు మునిసిపాలిటీల్లో వ్యర్థాల నుండి హైడ్రోజన్ను ఉత్పత్తి చేసేవి. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వీటి ద్వారా 2025 నాటికి 150 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి గ్రీన్ హైడ్రోజన్ పాలసీతో ఏపీ జీవం పోసింది. -
కొత్త రకం బస్సు.. దేశంలో తొలిసారి
దేశంలో ఇప్పటి వరకూ ఎన్నో రకాల బస్సులను చూశాం. డీజిల్ నడిచే బస్సులతోపాటు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బస్సులు కూడా పెరుగుతున్నాయి. అయితే దేశంలో తొలిసారిగా కొత్త రకం బస్సు పరుగులు తీయనుంది. అదే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు. అత్యంత ఎత్తైన హిమాలయాల్లోని లేహ్ రోడ్లపై తిరగనుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) చేపట్టింది. కార్బన్-న్యూట్రల్ లడఖ్ను సాధించే దిశగా ఎన్టీపీసీ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్, సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. లేహ్ ఇంట్రాసిటీ రూట్లలో ఆపరేషన్ కోసం ఐదు ఫ్యూయల్ సెల్ బస్సులను అందజేస్తున్నట్లు కంపెనీ ప్రకటన తెలిపింది. మూడు నెలలపాటు ఉండే ఫీల్డ్ ట్రయల్స్, రోడ్వర్తీనెస్ టెస్ట్లు, ఇతర చట్టబద్ధమైన ప్రక్రియల్లో భాగంగా మొదటి హైడ్రోజన్ బస్సు ఆగస్టు 17న లేహ్కు చేరుకుంది. దేశంలో హైడ్రోజన్ ఇంధన బస్సులను వినియోగించడం ఇదే మొదటిసారి. 11,562 అడుగుల ఎత్తులో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్లో భాగంగా 1.7 మెగావాట్ల ప్రత్యేక సోలార్ ప్లాంట్ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ప్రతికూల వాతావరణానికి సరిపోరిపోయేలా ఈ బస్సులను రూపొందించారు. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలవాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బస్సుల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్ను 2020 ఏప్రిల్లో దక్కించుకున్న అశోక్ లేలాండ్ సంస్థ.. ఒక్కొక్కటి రూ. 2.5 కోట్లకు అందజేసింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ బస్సుల్లో ఛార్జీలు సాధారణ డీజిల్ బస్సుల్లో ఛార్జీల మాదిరిగానే ఉంటాయి. దీనివల్ల వాటిల్లే నష్టాన్ని ఎన్టీపీసీనే భరించనుంది. -
రాష్ట్రంలో స్వచ్ఛ ఇం‘ధనం’
సాక్షి, అమరావతి: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూలమైన రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. స్వచ్ఛ ఇంధనం ఉత్పత్తికి అవసరమైన అన్ని వనరులు ఉండటం, ఇందుకోసం రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పాలసీని తేవడంతో కీలకమైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయి. వీటి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రాభివృద్ధికి మరింతగా చేయూతనిస్తాయి. ప్రకృతి పరిరక్షణకు ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందంలో భాగంగా మన దేశంలో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కొత్త పథకాలు, పాలసీలు తెస్తున్నాయి. వాటి ద్వారా ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలో 4.5 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర పభుత్వం టెండర్లు పిలిచింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ సహా 10 రాష్ట్రాలు అనుకూలమని తేలి్చంది. దీంతో త్వరలోనే రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ‘సైట్’తో ప్రోత్సాహకాలు ఏటా 125 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనంతో పాటు 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని కేంద్రం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటునందించడానికి స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ (సైట్) పథకాన్ని గత నెలాఖరులో ప్రవేశపెట్టింది. ఉత్పత్తిదారులకు ఆ ర్థికంగా చేయూతనందించేందుకు రూ.19,744 కోట్లు కేటాయించింది. 2029–30 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. తొలి ఏడాది రూ.4,440 కోట్లు, రెండో ఏడాది రూ.3,700 కోట్లు, మూడో ఏడాది రూ.2,960 కోట్లు, నాలుగో ఏడాది రూ.2,220 కోట్లు, ఐదో ఏడాది రూ.1,480 కోట్లు చొప్పున ఆరి్ధక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఏపీ సొంత పాలసీ రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పాలసీని రూపొందించింది. ఈ ఏడాది కేంద్రం పాలసీని తేవడానికి ఒక రోజు ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ డిమాండ్ ఏడాదికి దాదాపు 0.34 మిలియన్ టన్నులు (ఎంటీ) ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో సంవత్సరానికి 0.5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 2 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక మిలియన్ టన్ను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయగలిగితే 12 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది. ఈ పాలసీ ఐదేళ్లపాటు లేదా కొత్త పాలసీ జారీ అయ్యే వరకు అమలులో ఉంటుంది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ని ఉపయోగించడం ద్వారా నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలనుకునే డెవలపర్లు ఈ పాలసీ పరిధిలోకి వస్తారు. ఈ పాలసీ అమలుకు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ విధానం, ప్రోత్సాహకాలతో రాష్ట్రానికి తప్పకుండా ప్రాజెక్టులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు ♦ ప్రాజెక్టు ప్రారంభించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు గ్రీన్ హైడ్రోజన్ అమ్మకంపై డెవలపర్లకు స్టేట్ జీఎస్టీలో 100 శాతం తిరిగి చెల్లింపు ♦గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి ఉపయోగించే పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుకు వాణిజ్య ఆపరేషన్ తేదీ నుంచి ఐదేళ్ల పాటు విద్యుత్ సుంకంపై 100 శాతం మినహాయింపు ♦ ఇంట్రాస్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల్లో 25 శాతం రీయింబర్స్మెంట్ ♦ క్రాస్–సబ్సిడీ సర్చార్జి ఐదేళ్లు వెనక్కు ♦ ప్రాజెక్టుకు భూమిని ప్రభుత్వమే నోడల్ ఏజెన్సీ ద్వారా నామ మాత్రపు ధరకు లీజుగా కేటాయింపు ♦ భూ వినియోగ మార్పిడి ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు -
హరిత హైడ్రోజన్ వినియోగ విధానాలపై కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా హరిత హైడ్రోజన్ వినియోగానికి సంబంధించి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి భూపిందర్ సింగ్ భల్లా తెలిపారు. పరిశ్రమ తగు స్థాయిలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిమాండ్ను మదింపు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భల్లా ఈ విషయాలు పేర్కొన్నారు. 2030 నాటికి ప్రతిపాదిత హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో 70 శాతం భాగం ఎగుమతుల కోసం ఉద్దేశించినదై ఉంటుందని ఆయన తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి భారత్ను ప్రపంచ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఏడాది జనవరిలో కేంద్రం రూ. 19,744 కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రణాళికను ఆమోదించింది. మరోవైపు, హరిత హైడ్రోజన్ వినియోగానికి మారే క్రమంలో సిబ్బందికి శిక్షణ కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని భల్లా పేర్కొన్నారు. -
హైడ్రోజన్తో స్వావలంబన దిశగా..
సాక్షి, హైదరాబాద్: ఇంధన రంగంలో మన దేశం స్వావలంబన సాధించేందుకు హైడ్రోజన్ ఉపయోగపడుతుందని, ఈ దిశగా పరిశోధనలూ వేగంగా సాగుతున్నాయని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) హైడ్రోజన్ విభాగం జనరల్ మేనేజర్ డీఎంఆర్ పాండా వెల్లడించారు. జాతీయ సైన్స్ దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో డీఎంఆర్ పాండా ‘గ్రీన్ హైడ్రోజన్ ఎమర్జింగ్ ట్రెండ్స్’’అన్న అంశంపై కీలకోపన్యాసం చేశారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూలమైన విధానాల్లో హైడ్రోజన్ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా లేహ్, ఢిల్లీల్లో హైడ్రోజన్ బస్సులు ఇప్పటికే నడుస్తుండగా, సౌర విద్యుత్ సాయంతో హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వలకు కూడా పైలెట్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గింది.. దేశంలో సౌర, పవన విద్యుదుత్పత్తులకు అపార అవకాశాలున్నాయని, ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్తో వేర్వేరు పద్ధతులను ఉపయోగించుకుని హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడం ద్వారా దేశం పెట్రో ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని పాండా వివరించారు. అలాగే కర్బన ఉద్గారాల తగ్గింపూ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చులు ఎక్కువైనప్పటికీ, ఐఐసీటీ, ఇతర విద్యా, పరిశోధన సంస్థల సహకారంతో దాన్ని తగ్గించి విస్తృత వినియోగంలోకి తేవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గిందని గుర్తు చేశారు. ఎలక్ట్రలైజర్లు, ఒత్తిడిని తట్టుకోగల సిలిండర్లు, హైడ్రోజన్ను చిన్న చిన్న సిలిండర్లలోకి పంపేందుకు అవసరమైన కంప్రెషర్ల విషయంలో దేశం ఇప్పటికీ విదేశాలపైనే ఆధారపడుతోందని, ఫలితంగా ఈ ఇంధనాన్ని అందరికీ అందుబాటులోకి తేవడంలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి, డాక్టర్ సమీర్ దవే, డాక్టర్ నెట్టెం వి.చౌదరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగంపై జరుగుతున్న ప్రయత్నాలను క్లుప్తంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లో హైడ్రోజన్ హబ్ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగాలను పెంచే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో హైడ్రోజన్ హబ్ ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ (హైడ్రోజన్ విభాగం) డీఎంఆర్ పాండా తెలిపారు. విశాఖపట్నంలోని ఎన్టీపీసీ కేంద్రానికి దగ్గరగా ఈ హబ్ ఏర్పాటు కానుందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం 1200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే హైడ్రోజన్ హబ్లో హైడ్రోజన్ ఉత్పత్తితోపాటు దానికి సంబంధించిన టెక్నాలజీలు, రవాణా వ్యవస్థలపై విస్తృతమైన పరిశోధనలు జరగనున్నాయని, సౌర శక్తి కోసం పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ హబ్ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, అన్నీ సవ్యంగా సాగితే ఇంకో వారం రోజుల్లో ఎన్టీపీసీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య దీనిపై ఒక అవగాహన ఒప్పందం కూడా జరగనుందని వివరించారు. రానున్న పదేళ్లలో ఈ హబ్ ఏర్పాటుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు పాండా తెలిపారు. ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’ ఈ నెల ఏడు నుంచి! కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిశోధనశాలల కార్యకలాపాలను ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆరు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఐఐసీటీలో జరుగుతున్న పరిశోధనలు, అభివృద్ధి చేసిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నామని చెప్పారు. పరిశోధకులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజిస్టులు, స్టార్టప్లు, సాధారణ ప్రజలు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని సూచించారు. -
హైడ్రోజన్తో నడిచే బస్.. త్వరలో భారత్ రోడ్ల పైకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కు (ఎంఈఐఎల్) చెందిన ఎలక్ట్రిక్ వాహన రంగ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ హైడ్రోజన్తో నడిచే బస్ను తయారు చేసింది. రిలయన్స్ భాగస్వామ్యంతో ఈ వాహనాన్ని రూపొందించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఏడాదిలోగా వాణిజ్యపరంగా వీటి ఉత్పత్తి ప్రారంభించాలని ఒలెక్ట్రా లక్ష్యంగా చేసుకుంది. పూర్తి ఇంధన సామర్థ్యంతో 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించడం బస్ ప్రత్యేకత. బస్ పైభాగంలో టైప్–4 హైడ్రోజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. 12 మీటర్ల పొడవు ఉన్న ఈ బస్సులో డ్రైవర్ సీటు కాకుండా ప్రయాణికులకోసం 32–49 సీట్లు ఏర్పాటు చేయవచ్చు. హైడ్రోజన్ నింపడానికి 15 నిమిషాలు పడుతుంది. (ఇదీ చదవండి: సింథటిక్ వజ్రాల ల్యాబ్.. ఎక్కడో తెలుసా?) -
హిండెన్బర్గ్ ఎఫెక్ట్ : అదానీ - టోటల్ ఎనర్జీ హైడ్రోజన్ ప్రాజెక్టుపై నీలినీడలు
హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక అదానీ గ్రూప్పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా 50 బిలియన్ డాలర్ల హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్తో జత కలిసే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. హిండెన్బర్గ్ నివేదిక విషయమై స్పష్టత వచ్చే వరకు ముందుకెళ్లడం లేదని టోటల్ ఎనర్జీస్ సీఈవో పాట్రిక్ పౌయన్నె తెలిపారు. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో అదానీ గ్రూప్, టోటల్ ఎనర్జీస్ మధ్య చర్చలు జరిగాయి. ఇందుకోసం వచ్చే పదేండ్లలో అదానీ న్యూ ఇండస్ట్రీస్లో టోటల్ ఎనర్జీ 5000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఒప్పందంలో భాగంగా గతేడాది జూన్లో చేసిన ప్రకటన ప్రకారం అదానీ న్యూ ఎనర్జీస్లో టోటల్ ఎనర్జీస్ 25 శాతం వాటా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హిండెన్బర్గ్ నివేదికతో టోటల్ ఎనర్జీస్ వెనక్కి తగ్గింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న అడిటింగ్ నివేదిక వచ్చే వరకు అదానీ న్యూ ఇండస్ట్రీస్తో తమ పార్టనర్షిప్ నిలిపేస్తున్నట్లు టోటల్ ఎనర్జీస్ తెలిపింది. -
అదానీ గ్రూప్ బిజినెస్ల విడదీత
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ బిజినెస్ల విడదీతకు ప్రణాళికలు వేసింది. హైడ్రోజన్, ఎయిర్పోర్టులు, డేటా సెంటర్లను ప్రత్యేక బిజినెస్లుగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రక్రియను 2025లో ప్రారంభించి 2028కల్లా ముగించాలని ఆశిస్తున్నట్లు సీఎఫ్వో జుగెశిందర్ సింగ్ తాజాగా తెలియజేశారు. కాగా.. ఇటీవల గ్రూప్లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 20,000 కోట్లను సమీకరించే సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తొలుత పోర్టులు, విద్యుత్, సిటీ గ్యాస్ బిజినెస్లను ఏఈఎల్ ప్రారంభించి తదుపరి ప్రత్యేక కంపెనీలుగా విడదీసి లిస్ట్ చేసింది. ఈ బాటలోనే ప్రస్తుతం హైడ్రోజన్ తదితర నూతనతరం బిజినెస్లపై రానున్న పదేళ్లలో 50 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని ప్రణాళికలు వేసింది. పెట్టుబడుల జాబితాలో విమానాశ్రయాల నిర్వహణ, మైనింగ్, డేటా సెంటర్లు, రహదారులు, లాజిస్టిక్స్ ఉన్నాయి. అయితే ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకు ఆయా బిజినెస్లు తగిన స్థాయిలో వృద్ధి చెందవలపి ఉన్నట్లు సింగ్ తెలియజేశారు. వెరసి 2025–2028 మధ్యలో ఇందుకు వీలు చిక్కవచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. -
హరిత హైడ్రోజన్కు త్వరలో మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా హరిత హైడ్రోజన్ తయారీకి భారత్ను ప్రధాన హబ్గా తీర్చిదిద్దే విధంగా త్వరలోనే ప్రమాణాలు, మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. దేశీయంగా ఎలక్ట్రోలైజర్ల తయారీ కోసం 15 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించి ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంపై (పీఎల్ఐ) కసరత్తు చేసినట్లు ఆయన చెప్పారు. 2030 నాటికి దీన్ని 60 గిగావాట్ల స్థాయికి పెంచుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే క్రమంలో ఎలక్ట్రోలైజర్లను తక్కువ సుంకాలతో ఎప్పటివరకూ దిగుమతి చేసుకోవచ్చనేది కేంద్రం నిర్దిష్ట గడువు నిర్దేశిస్తుందని, ఆ తర్వాత నుంచి భారీ సుంకాలు అమల్లోకి వస్తాయ ని చెప్పారు. అలాగే హరిత హైడ్రోజన్ తయారీలో దేశీ పరిశ్రమ తగు రీతిలో పోటీపడే స్థాయికి ఎదిగే వరకూ తొలుత కొన్నేళ్ల పాటు పీఎల్ఐ స్కీము అందుబాటులో ఉంటుందని సింగ్ వివరించారు. దాదాపు రూ. 19,744 కోట్ల జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఆయన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మిషన్ కింద వచ్చే అయిదేళ్లలో 5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. -
ఈజిప్ట్లో రెన్యూ పవర్ హైడ్రోజన్ ప్లాంట్
న్యూఢిల్లీ: ఈజిప్ట్లో రెన్యూ పవర్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. సూయిజ్ కెనాల్ ఎకనమిక్ జోన్లో 8 బిలియన్ డాలర్ల (రూ.64 వేల కోట్లు) పెట్టుబడులతో హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి ఈజిప్ట్ ప్రభుత్వంతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పీఎల్సీ (రెన్యూ) అనుబంధ కంపెనీ ‘రెన్యూ పవర్ ప్రైవేటు లిమిటెడ్’ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఏటా 2,20,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది జూలైలోనే ఈజిప్ట్తో అవగాహన ఒప్పందం చేసుకోగా, ఇప్పుడు కార్యాచరణ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు పేర్కొంది. దశలవారీగా ఈ ప్రాజెక్టు ఉత్పత్తిని ఆరంభిస్తుందంటూ, మొదటి దశలో 20,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్, డెరివేటివ్లను ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. కార్యాచరణ ఒప్పందం కింద, ప్రాజెక్టు, క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించి, వచ్చే 12–16 నెలల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు స్థానిక డెవలపర్గా ఎల్స్వెడీ ఎలక్ట్రిక్ ఎస్ఏఈ పనిచేయనుంది. -
హైడ్రోజన్ కారుకు పేటెంట్.. మిర్యాలగూడ వాసి ఘనత
మిర్యాలగూడ: పెట్రోల్, డీజిల్ కారుకు నీటిలోని హైడ్రోజన్ సాయంతో మైలేజీ పెంచేలా తాను రూపొందించిన యంత్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించినట్లు బీఎస్ఎన్ఎల్రిటైర్డ్ ఉద్యోగి కాశీనాథుని పూర్ణమల్లికార్జున్రావు తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏడేళ్లు శ్రమించి నీటినుంచి హైడ్రోజన్ను వేరు చేసి కారు ఇంజన్కు అందించే సాంకేతికతను అభివృద్ధి చేశానన్నారు. 2021, జూన్ 6న కేంద్ర ప్రభుత్వ పేటెంట్ సంస్థకు దరఖాస్తు చేయగా పలు దశల్లో ఇంజనీర్లు పరిశీలించి ఈ నెల 27న పేటెంట్ పత్రం మంజూరు చేశారని చెప్పారు. యంత్రం పనితీరు ఇలా.. డీజిల్, పెట్రోల్ కార్లకు రూ.10 వేల వ్యయంతో నీటి నుంచి హైడ్రోజన్ను వేరుచేసే యంత్రాన్ని అమర్చి ఇంజన్కు అనుసంధానిస్తారు. కారు ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఈ యంత్రం పనిచేయడం ప్రారంభమవుతుంది. యంత్రం నీటి ట్యాంకులోని హైడ్రోజన్ను వేరు చేస్తుంది. అది ఇంజిన్లోకి వెళ్లి కారు ముందుకు వెళ్లేందుకు సాయం చేస్తుంది. దీంతో డీజిల్, పెట్రోల్ కార్లకు అదనంగా 10 కి.మీ. మైలేజీ పెరుగుతుంది. తన కారుకు యంత్రాన్ని అమర్చి ఏడాదికిపైగా పరిశీలిస్తున్నట్లు పూర్ణమల్లికార్జున్రావు తెలిపారు. పెరిగిపోతున్న ఇంధన ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం మందుకొస్తే తన ప్రాజెక్టును అందిస్తానన్నారు. -
ట్రెండ్ మారింది.. పెట్రోల్, డీజల్,గ్యాస్ కాదు కొత్త తరం కార్లు వస్తున్నాయ్!
జర్మనీకి చెందిన కార్ల్ బెంజ్ 1886లో తన కారుకి పేటెంట్ పొందారు. ఆ కారులో వాడిన ఇంధనమేంటో తెలుసా.. గ్యాస్. ఔను.. ప్రపంచంలో మొట్టమొదటి కారు గ్యాస్తోనే నడిచింది. ఆ తరువాత అనేక పరిశోధనలు, ప్రయోగాల కారణంగా పెట్రోల్, డీజిల్ను కార్లలో విరివిగా వినియోగించడం మొదలైంది. దశాబ్దాలుగా ఆ రెండిటితో పాటు గ్యాస్ ఆధారిత కార్లనే మనం రోడ్లపై చూస్తున్నాం. కానీ.. ప్రపంచ పర్యావరణంపై మొదలైన ఆందోళన, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన ప్రయత్నాల ఫలితంగా సరికొత్త ఇంధన ఆవిష్కరణలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. దాని ఫలితమే విద్యుత్ వాహనాల ప్రవేశం. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ సౌర విద్యుత్, హైడ్రోజన్ పవర్తో నడిచే కార్లను తయారు చేసే స్థాయికి చేరుకున్నాం. ఢిల్లీలో పరుగులు నేషనల్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా 6 నెలల క్రితమే హైడ్రోజన్ స్పైక్డ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్పై నడిచే వాహనాలను ప్రారంభించిన మొదటి భారతీయ నగరంగా ఢిల్లీ నిలిచింది. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ కూడా లేహ్, ఢిల్లీలో 10 హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత ఎలక్ట్రిక్ బస్సులు, ఇంధన సెల్ ఎలక్ట్రిక్ కార్లను నడపడానికి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. దేశవ్యాప్తంగా రానున్న ఐదేళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న హైడ్రోజన్ కార్లలో ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీలను హైడ్రోజన్ గ్యాస్తో చార్జ్ చేసి కారును నడిచేలా చేస్తారు. దీనికి అవసరమయ్యే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఫరీదాబాద్లో హైడ్రోజన్ ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. భారత్లో గ్రీన్ హైడ్రోజన్ కారు ప్రపంచంలోనే మొదటి గ్రీన్ హైడ్రోజన్ (హరిత ఉదజని)తో నడిచే కారును మన దేశంలో ఇటీవల పరిచయం చేశారు. బ్రౌన్ హైడ్రోజన్ అంటే పెట్రోల్, బ్లాక్ హైడ్రోజన్ అంటే బొగ్గు. మరి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటనేగా మీ సందేహం. దీనిని నీరు, చెత్త నుంచి తీస్తారు. వీటినుంచి ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్తో నడిచే ఈ కారుకు ‘మిరాయి’ అని నామకరణం కూడా చేశారు. ఇలాంటి కార్లను అతి తొందరలోనే దేశమంతటా నడపనున్నారు. అందుకు అవసరమైన ఈ గ్రీన్ హైడ్రోజన్ స్టేషన్లను ముందుగా నిర్మించనున్నారు. ఆ తర్వాత ఈ కార్ల అమ్మకాలు ప్రారంభించనున్నారు. ఈ కారు కేవలం 5.69 కేజీల గ్రీన్ హైడ్రోజన్తో రెండు రోజుల్లో 1,359 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు వెళ్లిపోవచ్చని నిరూపించింది. దాదాపు రూ.17 లక్షల కోట్ల పెట్రోలియం ఉత్పత్తులను ఏటా దిగుమతి చేసుకుంటున్న మన దేశంలో ఈ గ్రీన్ హైడ్రోజన్ను విస్తరిస్తే రైతులు సైతం దానిని ఉత్పత్తి చేయగలిగే పరిస్థితి వస్తుంది. దూసుకొస్తున్న సోలార్ కార్ ఎలక్ట్రిసిటీ అవసరం లేని కార్ కూడా వస్తోంది. ప్రపంచంలోనే తొలి సోలార్ కార్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. నెదర్లాండ్స్కు చెందిన స్టార్టప్ సోలార్ కారును డిజైన్ చేసింది. ‘లైట్ ఇయర్’ పేరుతో ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ కారుకు ఎండ ఉంటే చాలు. సూర్యరశ్మి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఈ కారును ముందుకు నడిపిస్తుంది. ఈ కారు కూడా త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రీ–ఆర్డర్స్ ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది రోడ్లపైకి దూసుకురానుంది. దీనిలో 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. సోలార్ పవర్ ద్వారా బ్యాటరీ చార్జ్ అవుతుంది. అవసరమైతే ఇంట్లో సాధారణ ప్లగ్కు కనెక్ట్ చేసి విద్యుత్ చార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ పద్ధతి ద్వారా గంట చార్జింగ్ చేస్తే 32 కిలోమీటర్లు, ఫుల్ చార్జ్ చేస్తే 625 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అదే సోలార్ పవర్ ద్వారా అయితే 70 కిలోమీటర్ల రేంజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. కారు పైకప్పు, హుడ్పై డబుల్ కర్వ్ సోలార్ గ్లాస్ ఉంటుంది. మరో విశేషం ఏమంటే.. ఈ కారు చక్రాల నుంచి కూడా కొంత మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా డిజైన్ చేయడం విశేషం. ఈ కారులో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 10 సెకన్లలో అందుకోవచ్చు. 10.1 అంగుళాల టచ్స్క్రీన్ ఉంటుంది. చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్, ‘వారానికి 4 రోజులే పని’ -
హరిత హైడ్రోజన్ దిగ్గజంగా భారత్
హ్యూస్టన్: త్వరలోనే భారత్ హరిత హైడ్రోజన్ విభాగంలో లీడరుగా ఎదుగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇంధనాల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని 2030 నుంచి 2025 నాటికి కుదించుకున్నామని పేర్కొన్నారు. జీవ ఇంధనా లు, హరిత హైడ్రోజన్, పెట్రోకెమికల్స్, ప్రత్యా మ్నాయ వనరుల నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి మొదలైన విభాగాల్లో అమెరికా–భారత్ కలిసి పని చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. దీనికి సంబంధించి నాలుగు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు అమెరికాలోని హ్యూస్టన్లో భారత కాన్సల్ జనరల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. అమెరికన్ ఇంధ న కంపెనీలు, అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం యూఎస్ఐఎస్పీఎఫ్ ప్రెసిడెంట్ ముకేశ్ అఘి తదితరులు ఇందులో పాల్గొన్నారు. కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) క్షేత్రాల వేలానికి సంబంధించి అంతర్జాతీయ బిడ్డింగ్ను మంత్రి ప్రారంభించారు. అలాగే 26 ఆఫ్షోర్ బ్లాకులకు కూడా బిడ్డింగ్ను ఆవిష్కరించారు. అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్లలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ హరిత ఇంధనానికి మళ్లాలన్న లక్ష్యం నుంచి అమె రికా, భారత్ పక్కకు తప్పుకోలేదని పురి చెప్పారు. ఇరు దేశాల మధ్య గ్రీన్ ఎనర్జీ కారిడార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రభుత్వా లు ఇందుకు అవసరమైన విధానాలు, వాతావరణా న్ని మాత్రమే కల్పించగలవని ప్రైవేట్ రంగమే దీన్ని సాకారం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
హైడ్రోజన్ సెల్.. ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు
హైడ్రోజన్ సెల్– దీనిని ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దీని ద్వారా విద్యుత్తును పొందవచ్చు. ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా అనుబంధ సంస్థ ‘వోవెన్ ప్లానెట్’ చిన్నసైజు సిలిండర్లాంటి ఈ హైడ్రోజన్ సెల్కు రూపకల్పన చేసింది. దీని బరువు 5 కిలోలు మాత్రమే! ఈ హైడ్రోజన్ సెల్ గంటకు 3.3 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇంధనం అయిపోయాక వీటిని రీఫిల్ చేసుకోవచ్చు. ఈ హైడ్రోజన్ సెల్స్తో వాహనాలకు, విద్యుత్ పరికరాలకు, ఇళ్లకు విద్యుత్ సరఫరా చేసుకోవచ్చు. ప్రత్యేకించి విహారయాత్రకు వెళ్లేవారికి ఈ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని హైడ్రోజన్ సెల్స్ మరింతగా వినియోగంలోకి వస్తే, ఉద్గారాల సమస్య తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇవి అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చదవండి: వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ టైర్ల కంపెనీ సేల్స్ టెక్నిక్ మైండ్బ్లోయింగ్! -
గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్!
సాక్షి, అమరావతి: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఏపీ భాగం కానుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. విశాఖ, నెల్లూరు జిల్లాల్లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి జరగనుంది. కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖకు, నీతీ ఆయోగ్కు ఇండియా హైడ్రోజన్ అలయన్స్ (ఐహెచ్2ఏ) తాజాగా సమర్పించిన హైడ్రోజన్ హబ్ డెవలప్మెంట్ ప్లాన్లో ఈ విషయాన్ని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ హబ్లను రూపొందిస్తారు. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్లో ఐదు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ హబ్లు ఏర్పాటు చేసి, వీటిని 25 ప్రాజెక్ట్ క్లస్టర్లుగా విభజిస్తారు. వీటి ద్వారా 2025 నాటికి గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే 150 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా ఐహెచ్2ఏ నిర్దేశించింది. వీటిని మొదటి తరం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులుగా పిలుస్తారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ను వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బళ్లారి–నెల్లూరు (కర్ణాటక–ఆంధ్రప్రదేశ్) మధ్య నేషనల్ గ్రీన్ స్టీల్, కెమికల్స్ కారిడార్లోని స్టీల్, కెమికల్ ప్లాంట్ల కోసం 30 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్తో సంవత్సరానికి 5 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల పదేళ్లలో వాతావరణంలో 5 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్డయాక్సైడ్ను తగ్గించవచ్చు. విశాఖపట్నంలో నేషనల్ గ్రీన్ రిఫైనరీ ట్రాన్స్పోర్ట్ హబ్లో 20 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్తో సంవత్సరానికి 4 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తారు. ఇది ఒక దశాబ్దంలో 4 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్డయాక్సైడ్ను తగ్గిస్తుంది. దీని కోసం రాష్ట్ర గ్రీన్ హైడ్రోజన్ విధానాలను రూపొందించనున్నారు. -
భావి ఇంధనం గ్రీన్ హైడ్రోజన్.. ఒకసారి నింపితే చాలు సుదీర్ఘ ప్రయాణం..
(సాక్షి ప్రతినిధి, అమరావతి): విద్యుత్ వాహనాల్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ను ముందుకు తెస్తున్నారు శాస్త్రవేత్తలు. దీనిని భవిష్యత్ ఇంధనంగా కూడా చెబుతున్నారు. విద్యుత్ వాహనాల్లో గ్రీన్ హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగించుకొని నడిచే ఫ్యూయల్ సెల్ ఆధారిత వాహనాల మీదా పలు దేశాలతోపాటు మన దేశంలోనూ ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ మీద నడిచే వాహనాలనూ (ఫ్యూయల్ సెల్ ఎల్రక్టానిక్ వెహికల్స్) (ఎఫ్సీఈవీ) దేశంలో తయారు చేశారు. కాలుష్య రహితంగా రవాణా రంగం రూపు మార్చడానికి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అదే సమయంలో కొన్ని సవాళ్లనూ మన ముందు ఉంచింది. చదవండి: గుజరాత్లో మూడుముక్కలాట.. కేజ్రీవాల్ కింగా? కింగ్ మేకరా? ఇదీ సాంకేతికత హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య ఎలక్ట్రో కెమికల్ రియాక్షన్ వల్ల విద్యుత్ పుడుతుంది. ఈ శక్తిని వాడుకుని ఇంజన్ నడుస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో వాడే ముడిపదార్థాల లభ్యత మన దేశంలో తక్కువగా ఉండటం మనకు సమస్య. కానీ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడంలో ఉపయోగించే ముడి పదార్థాల సమస్య మనకు లేదు. రానురాను తక్కువ ధరకే ఇంధనం దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి పన్ను రాయితీలతో పాటు ఇతర రాయితీలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి ధరలు తగ్గుతున్నందున, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ధరలు కూడా క్రమేణా తగ్గుతాయని నీతి ఆయోగ్ ‘హార్నెసింగ్ గ్రీన్ హైడ్రోజన్’ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం గ్రీన్ హైడ్రోజన్ ఒక కిలో ఉత్పత్తి చేయడానికి 2030లో 1.6 డాలర్లు, 2050కి 0.7 డాలర్లు అవుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్తో ప్రయోజనాలు ఇవీ.. ♦ఒకసారి హైడ్రోజన్ నింపితే సుదీర్ఘ ప్రయాణం చేయొచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ వాహనాలతో పోలిస్తే దీని రేంజ్ బాగా ఎక్కువ ♦రీ ఫ్యూయలింగ్ సులభం. వేగంగా పూర్తి చేయొచ్చు. చార్జింగ్ అవసరం లేదు. బ్యాటరీ చార్జ్ అయ్యే వరకు వేచి చూసే అవసరం ఉండదు. ♦కాలుష్యం వెలువడదు ♦దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అందువల్ల హైడ్రోజన్ను ప్రభుత్వాలు చౌకగా అందించే అవకాశం ఉంది. చౌకగా లభ్యమయితే వ్యయమూ బాగా తగ్గుతుంది. సవాళ్లూ ఉన్నాయి.. ♦హైడ్రోజన్కు మండే స్వభావం ఎక్కువ. నిల్వ చేసిన ట్యాంకు లోహాన్ని పెళుసుగా మార్చే గుణం ఉంటుంది. ఫలితంగా లీకేజీకి అవకాశాలు ఉంటాయి. ♦హైడ్రోజన్ ఉత్పత్తి అత్యంత జఠిలమైన ప్రక్రియ. ఉత్పత్తి వ్యయాన్ని ఇప్పుడే అంచనా వేయలేం. గ్రీన్ హైడ్రోజన్ కాకపోతే ఉత్పత్తి సమయంలో కాలుష్యం వెలువడుతుంది. సంప్రదాయ శిలాజ ఇంధనాలను ఉత్పత్తికి వాడితే వ్యయం తక్కువగా ఉంటుందని ఆశించలేం. ♦ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం.. హైడ్రోజన్ నిల్వ, రవాణా కష్టమైన అంశాలు. అందువల్ల రవాణా కూడా ఖరీదే. ♦దేశంలో డిమాండ్కు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి చాలా సమయం పడుతుంది. వాహనాల తయారీతో పాటు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి టెక్నాలజీ మీద ఏకకాలంలో పనిచేయాలి. హైడ్రోజన్ పలు రకాలు ఉత్పత్తి విధానాన్ని బట్టి హైడ్రోజన్ను 6 రకాలుగా విభజించారు 1. గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలసిస్ ద్వారా నీటిని వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో పవన, సౌర విద్యుత్ లాంటి పునరుత్పాదక వనరులు వాడతారు. ఈ విధానంలో కాలుష్యానికి చోటు లేదు. 2. వైట్ హైడ్రోజన్ (సహజ హైడ్రోజన్) శిలాజ ఇంధనాలు, సహజ వాయువు లభించినట్లుగానే హైడ్రోజన్ కూడా భూమిలో లభిస్తుంది. సహజ వాయువు ఉత్పత్తి మాదిరే డ్రిల్లింగ్ పద్ధతిలో హైడ్రోజన్ను వెలికితీయవచ్చు. అయితే వాణిజ్యపరంగా ఇది ఖరీదైన వ్యవహారం. పరిశోధనలకు మాత్రమే ఈ విధానాన్ని శాస్త్రవేత్తలు వాడుతున్నారు. 3. బ్లూ హైడ్రోజన్ బయోగ్యాస్ను బయోమీథేన్గా మార్చి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో కార్బన్ డై ఆక్సైడ్ అత్యంత కనిష్ట స్థాయిలో వెలువడుతుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ (ఐఈఏ) అంచనా ప్రకారం.. క్లీన్ ఎనర్జీరంగంలో 2050 నాటికి హైడ్రోజన్ ఉత్పత్తికి ఇదొక్కటే విధానం అనుసరిస్తారు. 4. పింక్ హైడ్రోజన్ ఎలక్ట్రోలసిస్ ద్వారా నీటిని వినియోగించి దీనిని ఉత్పత్తి చేస్తారు. విద్యుత్ను న్యూక్లియర్ ఎనర్జీ నుంచి తీసుకుంటారు. 5. యెల్లో హైడ్రోజన్ ఎలక్ట్రోలసిస్ ద్వారా నీటిని వినియోగించి దీనిని ఉత్పత్తి చేస్తారు. సంప్రదాయ విధానంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను దీనికి వాడతారు. 6. బ్లాక్, బ్రౌన్ హైడ్రోజన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బొగ్గు వాడితే బ్లాక్, లిగ్నైట్ వాడితే బ్రౌన్ హైడ్రోజన్ అంటారు. ఇది కాలుష్యకారకమైన విధానం. హైడ్రోజన్ కారు తయారయింది టయోటా, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటీవ్ టెక్నాలజీ (ఐసీఎటీ) పైలెట్ ప్రాజెక్టు కింద హైడ్రోజన్ ఇంధన వాహనాన్ని తయారు చేశాయి. ‘టయోటా మిరాయ్’ పేరిట రూపొందించిన ఈ కారును కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల విడుదల చేశారు. ఇన్టేక్ గ్రిల్ ద్వారా గాలిలోని ఆక్సిజన్ తీసుకొని, ఇంధన ట్యాంకులోని హైడ్రోజన్తో సంయోగం చెంది.. ఇంజన్ నడవడానికి కావాల్సిన శక్తిని విడుదల చేస్తుంది. పొగ గొట్టం నుంచి పొగ కాకుండా, నీరే వస్తుంది. పుణేలో రోడ్డెక్కిన తొలి హైడ్రోజన్ బస్సు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ్రస్టియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), పుణేలోని మల్టీ నేషనల్ సాఫ్ట్వేర్ సంస్థ కేపీఐటీ కలిసి హైడ్రోజన్తో నడిచే బస్సును తయారు చేసి గత వారం రోడ్డెక్కించాయి. దేశంలో ఇదే తొలి హైడ్రోజన్ బస్సు. సాధారణ డీజిల్ బస్సు ఏడాది పాటు తిరిగితే కనీసం 100 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తుందని సీఎస్ఐఆర్ తెలిపింది. డీజిల్ బస్సులు దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నాయని వాటి నుంచి వెలువడే కాలుష్యం అత్యధికమని పేర్కొంది. -
నితిన్ గడ్కారీ.. హైడ్రోజన్ ఫ్యూయల్పై భవీశ్ ఏమన్నాడో విన్నావా?
పెట్రోల్ డీజిల్కు ప్రత్యామ్నయ ఇంధనాలు ఉపయోగించాలంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందులో భాగంగా హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కారు తయారీకి ప్రోత్సహాం అందించారు. ఈ టెక్నాలజీతో తయారైన తొలి కారులో పార్లమెంటుకు కూడా చేరుకున్నారు. మరోవైపు పెట్రోలు/డీజిల్లకు బదులు ఇథనాల్తో నడిచే ఫ్లెక్స్ ఇంజన్ వాహనాలు మార్కెట్లోకి తేవాలంటూ తయారీదారులకు కూడా సూచనలు చేశారు. నితిన్ గడ్కారీ వ్యాఖ్యాలకు పూర్తిగా విరుద్ధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు భవీశ్ అగర్వాల్. హైడ్రోజనల్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీపై ఆయన స్పందిస్తూ.. ‘ఎలక్ట్రిసిటీ ఉపయోగించి భార హైడ్రోజన్ (హెచ్2)ను తయారు చేస్తారు. ఈ హెచ్2ను అధిక పీడనాల వద్ద ఫ్యూయల్ స్టేషన్లలో నిల్వ ఉంచుతారు. దీన్ని తిరిగి ఫ్యూయల్ స్టేషన్ ద్వారా కార్లలో నింపుతారు. కార్లలో ఉన్న సెల్స్ ఈ హైడ్రోజన్ నుంచి తిరిగి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఆ శక్తితో కారు నడుస్తుంది. చూస్తుంటే రవాణా రంగంలో హైడ్రోజన్ వాడకం అంతగా ఉపయోగించే టెక్నాలజీలా అనిపించడం లేదు’ అన్నారు భవీశ్ అగర్వాల్. భవీశ్ అగర్వాల్ ఇప్పటికే ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ పరిశ్రమను స్థాపించారు. దేశంలో ఇప్పుడు నంబర్ బ్రాండ్గా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎదుగుతోంది. దీనికి తోడు త్వరలోనే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తెచ్చేందుకు భవీశ్ ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో శిలాజ ఇంధనాలకు ప్రభుత్వం చెబుతున్న హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ అంత ఉపయోగకరం కాదంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. చదవండి: హైడ్రోజన్ కారుతో పైలట్ ప్రాజెక్టు.. స్వయంగా ప్రయాణించిన మంత్రి -
టోటల్ఎనర్జీస్తో అదానీ జట్టు
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా ఫ్రాన్స్కు చెందిన టోటల్ఎనర్జీస్తో చేతులు కలిపింది. తద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి వెంచర్ను ఏర్పాటు చేయనుంది. దీంతో అదానీ గ్రూప్ కర్బనరహిత ఇంధన తయారీని చేపట్టనుంది. రానున్న దశాబ్ద కాలంలో ఈ రంగంలో అనుబంధ విభాగాలతో కలిపి 50 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. అదానీ గ్రూప్ కొత్త ఇంధన బిజినెస్ విభాగం అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఏఎన్ఐఎల్)లో టోటల్ఎనర్జీస్ 25 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అయితే డీల్ విలువను రెండు సంస్థలూ వెల్లడించకపోవడం గమనార్హం. ఏఎన్ఐఎల్లో 25 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు గ్రూప్లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టోటల్ఎనర్జీస్ ప్రకటించింది. 2030కల్లా ఏఎన్ఐఎల్ వార్షికంగా మిలియన్ మెట్రిక్ టన్నుల(ఎంటీపీఏ) గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టోటల్ఎనర్జీస్ పేర్కొంది. తొలి మైలురాయికింద 30 గిగావాట్ల కొత్త పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకునే ప్రణాళికలున్నట్లు తెలియజేసింది. ఈ జనవరిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ కోసం అదానీ గ్రూప్ ఏఎన్ఐఎల్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దశాబ్ద కాలంలో.. నూతన ఇంధన విభాగంలో రానున్న 10 ఏళ్ల కాలంలో 70 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు అదానీ గ్రూప్ గతేడాది నవంబర్లో ప్రకటించింది. దీనిలో భాగంగా 2022–23కల్లా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఏజీఈఎల్) ఏడాదికి 2 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెచ్చిస్తోంది. కాగా.. టోటల్ ఎనర్జీస్ ఇప్పటికే అదానీ గ్రీన్ ఎనర్జీతో జట్టు కట్టింది. -
అలా చేయడం శుద్ధ దండుగ పని - ఈలాన్మస్క్
ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ని ఉపయోగించుకోవాలనే ఐడియా శుద్ధ దండుగ వ్యవహామని టెస్లా కార్ల అధినేత, ప్రపంచ కుబేరుడు ఈలాన్ మస్క్ అన్నారు. ఫైనాన్షియల్ టైమ్ష్ నిర్వహించిన ఫ్యూచర్ ఆఫ్ కార్ అనే సమ్మిట్లో మాట్లాడుతూ ఈలాన్ మస్క్ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్రోల్,డీజిల్కు ప్రత్యామ్నయంగా సంప్రదాయేతర ఇంధన వనరులు ఉపయోగించాలనే ప్రచారం గత కొంత కాలంగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ను ఉపయోగించాలంటూ కొందరు చెబుతున్న విషయం మస్క్ దగ్గర ప్రస్తావించగా... ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ బ్యాడ్ ఛాయిస్, ఎనర్జీని ద్రవ రూపంలో నిల్వ చేయాలన్నా అతి భారీ ట్యాంకులను నిర్మించాల్సి ఉంటుంది. ఇక అది వాయురూపమైతే నిల్వ చేసే పరిమాణం ఎంత పెద్దగా ఉండాలనేది చెప్పడమే కష్టం. కాబట్టి ఎనర్జీ స్టోరేజికి హైడ్రోజన్ వాడాలనుకోవడం శుద్ధ దండగ అంటూ తెలిపాడు మస్క్. మరోవైపు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మాత్రం ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ ఎంతో చక్కగా పనికొస్తుందని చెబుతోంది. ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయానికి కట్టుబడి ఉంటోంది. చదవండి: ట్విటర్ అలా చేయకుండా ఉండాల్సింది - ఈలాన్ మస్క్
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
వేగంగా బీసీజీ వ్యాక్సినేషన్
గెలుపెవరిదో వారి పాలనే చెబుతుంది!
ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేశాం
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా
వన సంపదకు పెద్ద ఆపద!
ఇజ్రాయెల్పై కొత్త ఒత్తిళ్లు
18అడుగుల ఎత్తులో ఆర్ఆర్ఆర్!
స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్సులు
ఈ పాపం ఎవరిది?
ప్రజాభవన్లో బాంబు కలకలం
తప్పక చదవండి
- రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి
- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా
- వన సంపదకు పెద్ద ఆపద!
- 18అడుగుల ఎత్తులో ఆర్ఆర్ఆర్!
- స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్సులు
- ప్రజాభవన్లో బాంబు కలకలం
- వజ్ర సంకల్పం
- ఇండియా కూటమి వస్తే ఇంటి పెద్దకు లక్ష
- విన్నపాలు వినవలె!
- హృదయం, ప్రాణం, రక్తంతో రాజ్యాంగాన్ని కాపాడుతాం: రాహుల్ గాంధీ
Advertisement