
న్యూఢిల్లీ: రవాణా, వాహనాలకు సంబంధించిన కొత్త తరం టెక్నాలజీలను ఆవిష్కరించే దిశగా ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) కొత్తగా మొబిలిటీ చాలెంజ్ పోటీలను ఆవిష్కరించింది. హైదరాబాద్కు చెందిన టీ–హబ్తో కలిసి దీన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది. దేశవిదేశాలకు చెందిన సిరీస్ ఎ స్థాయిలోని స్టార్టప్లు మొదలుకుని యూనికార్న్ల స్థాయి సంస్థలు ఇందులో పాల్గొనవచ్చని వివరించింది.
మారుతీ ఇప్పటికే మెయిల్ (మొబిలిటీ, ఆటోమొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్) పేరిట స్టార్టప్ల కోసం ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. కొత్తగా ఆవిష్కరించిన మొబిలిటీ చాలెంజ్ .. ప్రత్యేకంగా ప్రారంభ దశలోని, పూర్తి స్థాయిలో విస్తరించిన స్టార్టప్ల కోసం ఉద్దేశించినది. ఎంపికైన స్టార్టప్లకు మారుతీ, టీ–హబ్ నుంచి తోడ్పాటు లభిస్తుంది. గెలుపొందిన రెండు సంస్థలకు చెరి రూ. 10 లక్షల నగదు బహుమానం కూడా ఉంటుంది.