
న్యూఢిల్లీ: జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్) పథకాన్ని మరింత ఆకర్షణీయంగా చేయాలన్న లక్ష్యంతో పింఛను నిధి అభివృద్ధి, నియంత్రణ సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) నిబంధనలను సవరించింది. 65 ఏళ్ల తర్వాత చేరిన చందాదారులు ఈక్విటీలకు గరిష్టంగా 50 శాతం వరకు కేటాయింపులు చేసుకునేందుకు అనుమతించింది. ఎన్పీఎస్లో గరిష్ట వయసును 65 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచిన విషయం గమనార్హం.
75 ఏళ్ల వరకు
ఇప్పటి వరకు ఎన్పీఎస్ పథకంలోకి 18–65 ఏళ్ల వయసు మధ్యన ప్రవేశించే అవకాశం ఉండగా.. ఇకమీదట 65 ఏళ్ల తర్వాత కూడా చేరొచ్చు. 75 ఏళ్ల వరకు పథకంలో కొనసాగొచ్చు. ఇప్పటికే రిటైర్మెంట్ వయసు ఆధారంగా ఎన్పీఎస్ ఖాతాను మూసేసిన వారు సైతం.. తాజా సవరణలతో తిరిగి కావాలనుకుంటే ఖాతాను తెరుచుకోవచ్చు. 65 ఏళ్ల తర్వాత ఎన్పీఎస్లో చేరే వారు ఆటో ఆప్షన్ కింద ఈక్విటీలకు 15 శాతం, యాక్టివ్ చాయిస్ ఆప్షన్ కింద 50 శాతాన్ని కేటాయించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇదిలావుండగా, ఆదాయపన్ను నుంచి పింఛనుకు మినహాయింపునివ్వాలని భారతీయ పెన్షనర్స్ మంచ్ డిమాండ్ చేసింది.