![RBI added 24 tonnes of gold between January and April this year to diversify reserves](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/23/rbi01.jpg.webp?itok=mWmYdIPe)
భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2024 జనవరి-ఏప్రిల్ మధ్యకాలంలో 24 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2023 ఏడాదిలో చేసిన మొత్తం కొనుగోళ్లు 16 టన్నుల కంటే ఇది చాలాఎక్కువ. ఏప్రిల్ 26, 2024 నాటికి ఆర్బీఐ వద్ద విదేశీ మారక నిల్వల్లో భాగంగా 827.69 టన్నుల బంగారం ఉన్నట్లు ఆర్బీఐ నివేదించింది. 2023 డిసెంబర్ చివరి నాటికి అది 803.6 టన్నులుగా ఉంది.
ఇండియా మొత్తం విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా డిసెంబర్ 2023 చివరి నాటికి 7.75 శాతంగా ఉందని ఆర్బీఐ చెప్పింది. అది ఏప్రిల్ 2024 చివరి నాటికి 8.7 శాతానికి పెరిగింది. ఇటీవల గోల్డ్రేటు పెరగడంతో రిజర్వ్ బంగారం విలువ అధికమైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల సెంట్రల్ బ్యాంకుల మాదిరిగానే కరెన్సీ అస్థిరతను కట్టడి చేసేందుకు ఆర్బీఐ పసిడి నిల్వలను పెంచుకున్నట్లు తెలిపింది.
‘పెరుగుతున్న అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరతల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరుచుకోవాలని భావిస్తున్నాయి. దాంతో సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న క్యాష్ రిజర్వ్లను వివిధ మార్గాల్లో నిల్వచేస్తున్నాయి. అందులో ప్రధానంగా బంగారంవైపు మొగ్గు చూపుతున్నాయి. 2024 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్బ్యాంక్లు 290 టన్నుల బంగారాన్ని కోనుగోలు చేశాయి. మొత్తం ప్రపంచ పసిడి డిమాండ్లో నాలుగింట ఒక వంతు వాటా ఈ బ్యాంకుల వద్దే ఉంది. ఏదైనా అనిశ్చితి ఎదురైతే దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేది బంగారమేనని అన్ని దేశాలు విశ్వసిస్తున్నాయి’ అని ఆర్బీఐ ఆర్థికవేత్తలు నెలవారీ బులెటిన్లో ప్రచురించారు.
ఇదీ చదవండి: ‘వర్కింగ్ ఏజ్’ జనాభా తగ్గడమే పెద్ద సవాలు
భారత్లో బంగారాన్ని ప్రధానంగా వినియోగిస్తున్నప్పటికీ ఆర్బీఐ చాలాకాలంపాటు పసిడి నిల్వలను భారీగా కూడబెట్టలేకపోయింది. 1991లో విదేశీ మారకద్రవ్య సంక్షోభం సమయంలో బంగారం నిల్వల్లో చాలాభాగం తాకట్టుపెట్టి ఆర్బీఐ విమర్శలు ఎదుర్కొంది. అప్పటినుంచి క్రమంగా బంగారం రిజర్వ్లను పెంచుకుంటోంది. కరోనా తర్వాత 2022లో పసిడి కొనుగోలుపై దూకుడుగా వ్యవహరించింది. జనవరి 2024 నుంచి కొనుగోలు కార్యకలాపాలను మరింత పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment