
Royal Enfield 650 Twins Anniversary Edition Model Unveiled At EICMA 2021: టూవీలర్ వాహనాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కు ఉండే క్రేజే వేరు. ధరతో పట్టింపు లేకుండా బుల్లెట్ బండిని సొంతం చేసుకోవడానికి బైక్ లవర్స్ ఎగబడతారు. తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ 120 వసంతాలను పూర్తి చేసుకుంది. 120 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా రాయల్ ఎన్ఫీల్డ్ రెండు ఫ్లాగ్షిప్ లిమిటెడ్ ఎడిషన్ 650సీసీ మోటర్సైకిళ్లను కంపెనీ మిలాన్లో జరగుతున్న ఈఐసీఎమ్ఏ-2021 షోలో ఆవిష్కరించింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650, రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 బైక్లను కంపెనీ ప్రదర్శించింది.
ఈ రెండు స్పెషల్ ఎడిషన్ బైక్స్ పరిమిత సంఖ్యలోనే కంపెనీ ఉత్పత్తి చేస్తోందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 480 యూనిట్లను మాత్రమే కంపెనీ విక్రయించనుంది. ఒక్కో ప్రాంతానికి 60 కాంటినెంటల్ GT 650 బైక్స్, 60 ఇంటర్సెప్టర్ 650 బైక్లను కంపెనీ సప్లై చేయనుంది. దీంతో భారత్లో 120 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి.
120 వార్షికోత్సవ ఎడిషన్ ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 బైక్లను యూకే, భారత్కు చెందిన బృందాలు రూపొందించాయి. బ్లాక్ క్రోమ్ ట్యాంక్ను ఈ రెండు బైక్స్ కల్గి ఉన్నాయి. ఇంజిన్, సైలెన్సర్ ఇతర భాగాలు పూర్తిగా బ్లాక్ కలర్తో రానున్నాయి. ఫ్లైస్క్రీన్, ఇంజన్ గార్డ్, హీల్ గార్డ్, టూరింగ్ , బార్ ఎండ్ మిర్రర్స్ వంటి అనేక రకాల ఉపకరణాలు కూడా వస్తాయి.
బుకింగ్స్ ఎప్పుడంటే..!
భారత్లో కేవలం 120 యూనిట్లు మాత్రమే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఆసక్తికల్గిన బుల్లెట్ లవర్స్, లిమిటెడ్ ఎడిషన్ బైక్లను నవంబర్ 24 నుంచి వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 120 యానివర్సరీ ఎడిషన్ బైక్లను డిసెంబర్ 6న ఆన్లైన్ విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
120 ఇయర్స్ బ్యాడ్జ్..!
ఈ బైక్లకు 120 ఇయర్స్ డై-కాస్ట్ బ్రాస్ ట్యాంక్ బ్యాడ్జ్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వీటిని భారత్కు చెందిన సిర్పి సెంథిల్ కళాకారులు బ్రాస్ బ్యాడ్జ్లను చేతితో తయారుచేశారు.