
టెక్ పరిశ్రమలో కొంత కాలంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఈ తరుణంలో భారతదేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడం మాత్రమే కాకుండా.. వేతనాల పెంపుకు సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేసింది.
2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వేతనాల పెంపుకు సంబంధించిన లెటర్లను.. మార్చి చివరి నాటికి ఉద్యోగులకు అందించనుంది. ఏప్రిల్ నుంచి పెరిగిన జీతాలతో.. చెల్లింపులు మొదలవుతాయి. అయితే వేతన పెంపు 4 శాతం నుంచి 8 శాతం వరకు ఉండే అవకాశం ఉందని అంచనా.
వేతనాలు 2023-24 ఆర్ధిక సంవత్సరం 7.9 శాతం, 2022-23లో 10.5 శాతం పెరిగాయి. అయితే ఈ సారి మాత్రం ఎంత పెరుగుతుంది అనే విషయం అధికారికంగా వెల్లడి కాలేదు. అక్టోబర్ - డిసెంబర్ కాలానికి ఫిబ్రవరిలో కంపెనీ విడుదల చేసిన త్రైమాసిక వేరియబుల్ పే (QVP) తర్వాత.. దానికి అర్హతగల ఉద్యోగులకు వస్తుంది. సీనియర్ స్థాయి ఉద్యోగులు 20 శాతం నుంచి 40 శాతం వరకు తక్కువ చెల్లింపులను పొందుతూనే ఉన్నారు.
ఇదీ చదవండి: సామాన్యులకు దూరమవుతున్న బంగారం!.. మళ్ళీ పెరిగిన ధరలు
టీసీఎస్ కంపెనీలో గ్రేడ్స్ Y (ట్రైనీ, C1 (సిస్టమ్స్ ఇంజినీర్స్), C2, C3-A&B, C4,C5, CXO వరకు వివిధ కేటగిరీలలో ఉద్యోగులు ఉన్నారు. C3Bలో ఉన్న ఉద్యోగులు, ఆపైన బ్యాండ్లో ఉన్న వారిని సీనియర్ కేటగిరీగా పరిగణిస్తారు. ఇటీవల విడుదల చేసిన వేరియబుల్ పేలో 70 శాతం మంది ఉద్యోగులు 100 శాతం అందుకున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల సీ3, కింది స్థాయిలో ఉన్న వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరినట్లు తెలుస్తోంది.