జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో నలుగురి అరెస్టు | Sakshi
Sakshi News home page

జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో నలుగురి అరెస్టు

Published Thu, Aug 11 2022 2:11 AM

Telangana: Four More People Arrested For Attempt To Kill MLA Jeevan Reddy - Sakshi

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో నలుగురు నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్మూర్‌ నియోజక వర్గం కల్లెడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ లావణ్యగౌడ్‌ భర్త ప్రసాద్‌ గౌడ్‌ ఈ నెల 1వ తేదీన రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని వేమిరెడ్డి ఎన్‌క్లేవ్‌లో నివసించే ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి కత్తి, గన్‌ చూపించి బెదరించడమే కాకుండా హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

నిందితుడిని విచారించగా హత్యకు ఉసిగొలిపిన వారి సమాచారం వెల్లడైంది. కేసులో ఏ2గా ఉన్న ప్రసాద్‌గౌడ్‌ భార్య లావణ్యతో పాటు ఏ4గా ఉన్న సంగరత్న పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కొండా సంతోష్‌గౌడ్‌ (46), బొంత సుగుణ (40), సురేందర్‌ (56), దయాసాగర్‌(36)లను బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సస్పెన్షన్‌కు గురైన లావణ్యగౌడ్‌ను తిరిగి సర్పంచ్‌గా నియమించాలంటూ ప్రసాద్‌గౌడ్‌  ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చుట్టూ తిరుగుతున్నాడు.  స్పందన లేకపోవడంతో ఆయన అంతుచూసేందుకు ప్రణాళిక వేసి దొరికిపోయాడు. ఈ ఘటనలో ఇంకా  పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.

 
Advertisement
 
Advertisement