ఆనందం.. అంతలోనే విషాదం | - | Sakshi
Sakshi News home page

ఆనందం.. అంతలోనే విషాదం

Published Tue, Aug 20 2024 2:30 AM | Last Updated on Tue, Aug 20 2024 11:19 AM

-

బాలిక మృతి, మరో నలుగురికి గాయాలు

కొత్తపల్లి: రాఖీ కట్టడానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బాలిక మృతి చెందిన సంఘటన కొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పొన్నాడ శివారు కోనపాపపేటకు చెందిన ఉప్పరపల్లి బలరామ్‌ కుమార్తె ఉప్పరపల్లి దేవి (11) అక్కడి జిల్లా పరిషత్‌ పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. రాఖీ పౌర్ణమి కావడంతో దేవితో పాటు తన స్నేహితులు తిత్తి కస్తూరి, నాగవల్లి, దుర్గ, లక్ష్మిలు ఉప్పాడలో ఉన్న తమ బంధువులు ఇంటికి రాఖీ కట్టేందుకు వెళ్లారు. 

దేవి సోదరుడైన సంతోష్‌కు ఉప్పాడలో రాఖీలు కొనుగోలు చేసి తిరిగి ఆటోలో ఇంటికి బయలు దేరారు. ఉప్పాడ– కోనపాపపేట రోడ్డులో కొత్తమూలపేట సమీపంలోని రొయ్యల శుద్ధి పరిశ్రమ దగ్గరలోకి రాగానే ఎదురుగా వచ్చిన లోడు ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో దేవి సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలైంది. ఆటోలో ప్రయాణిస్తున్న కస్తూరి, నాగవల్లి, దుర్గ, లక్ష్మికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కస్తూరికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

దేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎస్సై వెంకటేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోడు ఆటో కోనపాపపేట నుంచి అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే తన సోదరి వచ్చి రాఖీ కడుతుందనుకుంటున్న సోదరుడు సంతోష్‌కు విషయం తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. దేవీ మృతితో కోనపాపపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమె మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదనలు ప్రతి ఒక్కరినీ కంటితడి పెట్టించాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement