
టెక్నిక్తో జీవితం సెట్
● ఏప్రిల్ 30న పాలిసెట్ పరీక్ష
● జిల్లాలో 8 పాలిటెక్నిక్ కళాశాలలు
● అందుబాటులో 1820 సీట్లు
రాజమహేంద్రవరం రూరల్: ప్రపంచం సాంకేతికంగా దూసుకుపోతోంది. ఆ వేగాన్ని అందుకోవాలనే లక్ష్యంతో నేటి యువత సైతం తత్సంబంధమైన విషయ పరిజ్ఞానాన్ని అభ్యసించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంజినీరింగ్లో సైతం కంప్యూటర్ ఆధారిత కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల కంటే ముందుగానే ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం పాలిటెక్నిక్ ఉత్తీర్ణులకు లభిస్తుంది. దీంతో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులపై దృష్టిపెడుతున్నారు.
సాంకేతిక విద్యకు పునాది..
సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ జరగనుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2025ను ప్రకటించింది. పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా మార్చుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పాలిసెట్ ద్వారా పలు కోర్సులతో సాంకేతిక విజ్ఞాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచిస్తున్నారు.
ఏప్రిల్ 15 తుది గడువు..
పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఈ నెల పదో తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఈ నెల 12వ తేదీ నుంచే ఫీజులను ఆన్లైన్లో గేట్వే ద్వారా చెల్లించే సౌకర్యం అందుబాటులో ఉంచారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాయదలుచుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు ఉంది. 10వ తరగతి, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, ఈ ఏడాది అటువంటి పరీక్షలు రాస్తున్నవారు కూడా పాలిసెట్కు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష 120 మార్కులకు నిర్వహిస్తారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాయడానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
లభించే కోర్సులు ఇవీ..
పాలిటెక్నిక్లో వివిధ కోర్సులను జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచికి 60 నుంచి 120 వరకు సీట్లు అందుబాటులో ఉంటాయి. పాలిటెక్నిక్ కోర్సుల కాల వ్యవధి మూడేళ్ల వరకు ఉంటుంది. ఆరు నెలల పాటు విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ కూడా ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకునే శిక్షణ సైతం ఇస్తారు.
జిల్లాలో 8 కళాశాలలు
జిల్లాలో విద్యార్థులకు మొత్తం 8 పాలిటెక్నిక్ కళాశాలల్లో 1820 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనపర్తిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రాజానగరం గైట్ పాలిటెక్నిక్, రాజానగరం ఐఎస్టీఎస్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, పిడింగొయ్యిలోని రైట్ పాలిటెక్నిక్, పాలచర్లలోని బీవీసీ పాలిటెక్నిక్, కొండగుంటూరు ఎస్ఎస్ పరిమళ పాలిటెక్నిక్, బూరుగపల్లి బెన్నయ్య పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి.
సద్వినియోగం చేసుకోవాలి
పదో తరగతి ముగిసిన వెంటనే పాలిటెక్నిక్ చదివితే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు ఉంటాయి. పాలిసెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బొమ్మూరులోని జీఎంఆర్ పాలిటెక్నిక్లో ఉచిత శిక్షణ తో పాటు స్టడీమెటీరియల్ ఇస్తారు. పాలిటెక్నిక్ పూర్తయిన తరువాత ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు.
– వి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్,
బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల,
ఏపీ పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్
పాలిసెట్కు ఉచిత శిక్షణ
బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్కు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఉచిత శిక్షణతో పాటు ప్రవేశపరీక్షకు సంబంధించి స్టడీ మెటీరియల్ సైతం ఉచితంగా అందజేస్తారు. ఆసక్తి గల విద్యార్థులు ముందుగా పాలిటెక్నిక్ కళాశాలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

టెక్నిక్తో జీవితం సెట్
Comments
Please login to add a commentAdd a comment