
పూర్వం 15 ఏళ్ల వయసుకే ఆడపిల్లలకు పెళ్లి చేసేవాళ్లు కాబట్టి రజస్వల అయిన వెంటనే పెళ్లి చేయాలని ఆ సమయంలో నేతితో తయారు చేసిన స్వీట్లు ఎక్కువగా తినిపించేవాళ్లు. నిజానికి రజస్వల అయినప్పుడే కాదు, ఏ వయసు పిల్లలకయినా స్వీట్లు, నేతి పదార్థాలు ఎక్కువగా పెట్టకూడదు. పైగా రజస్వల అయిన పిల్లలను కొద్దికాలం పాటు ఇంటికే పరిమితం చేస్తారు కాబట్టి పిల్లలు ఆ కొద్దిరోజుల్లో విపరీతంగా బరువు పెరగటంతో పాటు ఆ ఆహార శైలికి అలవాటు పడి అలాగే కొనసాగుతారు.
అధిక బరువు వల్ల హర్మోన్లలో అవకతవకలు మొదలవుతాయి. ఇది ప్రమాదకరం.రజస్వల సమయంలో హార్మోన్ల స్రావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి. రక్తస్రావం ఎక్కువగా ఉండి ఐరన్ లోపం ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయంలో ఆకుకూరలు, గుడ్లు ఎక్కువగా ఇవ్వాలి.
క్యాల్షియం, విటమిన్ డి లోపాలు రాకుండా పాలు ఇవ్వడంతో పాటు వేరుసెనగ పప్పు, బెల్లం, ఖర్జూరాలు, పప్పులు, అటుకులు, రాగులు, నువ్వులతో తయారుచేసిన చిరుతిళ్లు తినిపించాలి.