Life style
-
‘మొహమాటం వద్దు.. ఏదైనా నన్ను అడిగేయ్!’
కృత్రిమ మేధస్సు.. మనిషి జీవితంలో అంతర్లీనంగా మారిపోవడానికి ఇంకా ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే అనేక రంగాల్లో ఇది మనిషి అవసరాలను తీరుస్తోంది. అతిత్వరలో ఆపద్భాందువు అవతారమెత్తబోతోంది. మైక్రోసాఫ్ట్వారి కొత్త ఫీచర్ కోపైలట్ విజన్ అందుకు ఒక ఉదాహరణ మాత్రమే!.కోపైలట్.. మైక్రోసాఫ్ట్ కంపెనీ రూపొందించిన జనరేటెడ్ ఏఐ చాట్బోట్. చాట్బోట్ రూపంలో యూజర్లకు సమాచారాన్ని చేరవేస్తుండడం తెలిసిందే. ఏఐ సాయంతో పనిభారాన్ని తగ్గించడంతో పాటు ఆ పనిని వేగంగా పూర్తి చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. అంతేకాదు.. తక్కువ టైంలో నాణ్యమైన కంటెంట్ను అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే దీనికి నెక్ట్స్ లెవల్గా కోపైలట్ విజన్ రాబోతోంది.👉ఎడ్జ్ బ్రౌజర్లో ఓ మూలన నీట్గా ‘కోపైలట్ విజన్’ ఏఐ ఫీచర్ను కనిపించనుంది. ఈ టూల్ సాయంతో ఇంటర్నెట్లో నేరుగా ఇంటరాక్ట్ అయ్యి.. ఎలాంటి సాయమైనా కోరవచ్చు. ఉదాహరణకు.. మీరు ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఎక్కడ బస చేయాలనే దానిపై మీకు కచ్చితమైన సమాచారం లేదు. ఆ గందరగోళంలో మీరు మీ డివైజ్లో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కోపైలట్ విజన్ను సంప్రదించొచ్చు.👉మీకు ఎంత బడ్జెట్లో రూం కావాలి.. ఎలాంటి సౌకర్యాలు ఉండాలి.. ఇలాంటి వివరాలను చెబితే చాలూ!. కో పైలట్ విజన్ తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం జల్లెడ పడుతుంది. దానిని మీకు చెబుతూ పోతుంది. తద్వారా మీకు కావాల్సిన పక్కా సమాచారం చేరవేస్తుందన్నమాట. ఇది ఇక్కడితోనే ఆగిపోదు..👉రియల్ టైంలో వెబ్ కంటెంట్తో ఇంటెరాక్ట్ అయ్యేందుకు కూడా ఈ టూల్ ఉపయోగపడుతుంది. మీరు అడిగే ప్రశ్న రాతలు, ఫొటోలు, వీడియోల రూపకంలో కూడా ఉండొచ్చు. ఉదాహరణకు.. మీ స్మార్ట్ టీవీలోగానీ లేదంటే ల్యాప్ట్యాప్గానీ ఏదైనా సినిమా చూస్తుంటే అందులో నటీనటుల వివరాలను కూడా కోపైలట్ విజన్ను అడగొచ్చు. అప్పుడు అది తన దగ్గర ఉన్న సమాచారం సమీక్షించుకుని.. పూర్తి వివరాలు మీకు తెలియజేస్తుంది.👉అలాగే సందర్భోచితంగా సాయం కూడా అందిస్తుంది. అంటే షాపింగ్ చేసే టైంలో మీకు కావాల్సిన వివరాల ఆధారంగా ప్రొడక్టును మీకు చెబుతూ చూపిస్తుంది. అంతెందుకు.. సెలవు రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారో చెబితే.. ఆరోజు మీ వెసులుబాటును బట్టి ఎలా ఎక్కడ, గడపొచ్చో కూడా మీకు సలహా ఇస్తుందది. అంటే.. బ్రౌజింగ్ చేసే టైంలో ఇది మరో జత కండ్ల మాదిరి పని చేస్తుందన్నమాట.👉ఈ ఫీచర్ను యాక్టివేట్లో ఉంచి ఉపయోగించుకోవాలి. ప్రైవసీ విషయంలో గ్యారంటీ ఇస్తోంది మైక్రోసాఫ్ట్. ఒకసారి సెషన్ ముగిశాక.. మనం అడిగిన సమాచారం.. దానికి కోపైలట్ ఇచ్చిన వివరాలు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ప్రస్తుతానికి ఈ ఫీచర్ను అమెరికాలో కోపైలట్ ల్యాబ్స్ ప్రోగ్రాం కింద కోపైలట్ సబ్స్క్రయిబర్స్కు అందజేస్తోంది. ఎడ్జ్బ్రౌజర్లో ఉన్న ఈ టూల్ను.. త్వరలో మిగతా విస్తరించే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉంది. అప్పుడు యూజర్ల నుంచి ఫీడ్బ్యాక్ ద్వారా లోటుపాట్లను సరిదిద్దుకుని మరింత మెరుగైన సేవలు అందిస్తుందట. ఎందెందు వెతికినా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాడ కనిపిస్తున్న కాలంలో మైక్రోసాఫ్ట్ అడుగు గేమ్ఛేంజర్ అనే చెప్పొచ్చు. ఈ ప్రయత్నంతో.. మిగతా కంపెనీలు పోటీగా కోపైలట్ విజన్ తరహా జనరేటెడ్ ఏఐ సేవలను అందించే అవకాశం లేకపోలేదు. -
అల్లు అర్జున్, ఎన్టీఆర్ హీరోయిన్.. ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు
ఒక అడవిలో గుబురుగా ఉన్న చెట్ల మీద ఒక కోతుల జంట నివసిస్తోంది. పెద్దకోతులు మంచివే కానీ పిల్ల కోతులు నాలుగు మాత్రం చాలా అల్లరి చేస్తూ దారిలో వెళ్ళే అందరినీ ఇబ్బంది పెట్టసాగాయి. ఆ చెట్లకు కాస్త దూరంలో ఒక సెలయేరు ఉంది. అందులో కొన్ని తాబేళ్లు, చేపలు నివసిస్తున్నాయి. చేపలు, తాబేళ్లు నీటి మీద తేలియాడగానే కోతులు చెట్ల పైనుంచి పండ్లు, కాయలు, ఎండుకొమ్మలు వాటి మీదకు విసిరి బాధ పెట్టసాగాయి.‘కోతి నేస్తాలూ! మేము మీకు ఏ విధంగానూ అడ్డురావడం లేదు. మరి మీరెందుకు మమ్మల్ని నీటి పైకి రానివ్వకుండా గాయపరుస్తున్నారు?’ అని ఒకరోజు ఒక చేప ప్రశ్నించింది. ‘మేము పిల్లలం, అల్లరి చేస్తూ ఆటలు ఆడుకుంటున్నాం. మేము తినగా మిగిలినవి గిరాటు వేస్తుండగా అవి పొరపాటుగా నీళ్లల్లో పడుతున్నాయి’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది ఓ పిల్లకోతి.‘చేప నేస్తాలూ! పిల్లకోతులు కావాలని అలా గిరాటు వేస్తున్నాయి. మనం వాటిని అడగడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు’ అంది ఓ తాబేలు.రోజురోజుకు కోతుల ఆగడాలు పెరగసాగాయి. పాపం! తాబేళ్లు, చేపలు ఏమీ చేయలేక అలాగే అవస్థపడసాగాయి. ఒక రోజున పిల్ల కోతులు ఒక కొమ్మ మీద కూర్చుని ఉయ్యాలూగుతున్నాయి. ఆ కొమ్మ బలహీనంగా ఉండటం వలన ఫెళ్లున విరిగిపోయింది. ఊగుతున్న కోతులు ఆ వేగానికి సెలయేటి నీళ్లల్లో పడిపోయాయి. వాటికి ఈత రాకపోవడంతో ‘కాపాడండి.. కాపాడండి..’ అంటూ పెద్దగా అరవసాగాయి. ఆ అరుపులకు నీళ్లల్లో ఉన్న చేపలు, తాబేళ్లు బయటకు వచ్చాయి. ‘అయ్యో! పిల్ల కోతులు నీళ్లల్లో మునిగిపోతున్నాయి, వాటిని కాపాడుదాం’ అంది ఒక తాబేలు.‘పిల్లకోతులూ! ఇలా మా వీపు మీద కూర్చోండి’ అంటూ నాలుగు పెద్ద తాబేళ్లు వాటి దగ్గరకు వెళ్ళాయి. అవి తాబేళ్ల మీద కూర్చోగానే ఈదుతూ వాటిని ఒడ్డుకు చేర్చాయి. ‘మేము మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు మా ప్రాణాలను రక్షించారు. ఇక నుంచి మనం మంచి మిత్రులుగా ఉందాం’ అన్నాయి పిల్ల కోతులు. ‘అలాగే!’ అన్నాయి తాబేళ్లు.అప్పటి నుంచి అవన్నీ చాలా స్నేహంగా ఉండసాగాయి. ఒకరోజు అడవికి ఒక బెస్తవాడు సెలయేటిలో చేపలు పట్టడానికి వచ్చాడు. అతణ్ణి చెట్టు మీద ఉన్న పిల్లకోతులు చూశాయి. ఈలోగా బెస్తవాడు వలను నీటిలోకి విసిరాడు. ఆదమరచి ఉన్న చేపలు, తాబేళ్లు వలలో చిక్కుకున్నాయి.‘ఈ రోజు నా అదృష్టం పండింది. చాలా చేపలు, తాబేళ్లు కూడా దొరికాయి’ అంటూ బెస్తవాడు సంబరపడి వాటిని తనతో తెచ్చుకున్న బుట్టలో వేసుకున్నాడు. ‘అయ్యో! మన నేస్తాలను ఇతను తీసుకెళ్లిపోతున్నాడు’ అని పిల్ల కోతులు మాట్లాడుకున్నాయి. అన్నీ కూడబలుక్కుని ఒక్కసారిగా బెస్తవాడి మీదకు దూకాయి. ఊహించని పరిణామానికి అతను కంగారుపడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. కోతులు అతని శరీరాన్ని రక్కేశాయి. బుట్ట, వల అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటూ పారిపోయాడు. కోతులు బుట్టను తెరిచి చేపలను, తాబేళ్లను సెలయేటిలోకి వదిలేశాయి. అవి పిల్ల కోతులకు కృతజ్ఞతలు తెలిపి హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి. ‘మనం ఎప్పుడూ ఇలాగే ఒకరికి ఒకరం స్నేహంగా ఉండాలి’ అనుకున్నాయి అన్నీ! మనం ఒకరికి సహాయపడితే మనకు దేవుడు సహాయపడతాడు. – కైకాల వెంకట సుమలత -
కాకి హంసల కథ! పూర్వం ఒకానొక ద్వీపాన్ని..
పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు ఉండే నగరంలోనే ఒక సంపన్న వర్తకుడు ఉండేవాడు. అతడు ఉత్తముడు. ఒకరోజు ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలింది. వర్తకుడి కొడుకులు ఆ కాకికి ఎంగిలి మెతుకులు పెట్టారు. అప్పటి నుంచి కాకి ఆ ఇంటికి అలవాటు పడింది. వర్తకుడి కొడుకులు రోజూ పెట్టే ఎంగిలి మెతుకులు తింటూ బాగా బలిసింది. బలిసి కొవ్వెక్కిన కాకికి గర్వం తలకెక్కింది. లోకంలోని పక్షులేవీ బలంలో తనకు సాటిరావని ప్రగల్భాలు పలుకుతుండేది.ఒకనాడు వర్తకుని కొడుకులు ఆ కాకిని వ్యాహ్యాళిగా సముద్ర తీరానికి తీసుకెళ్లారు. సముద్రతీరంలో కొన్ని రాజహంసలు కనిపించాయి. వర్తకుని కొడుకులు ఆ రాజహంసలను కాకికి చూపించి, ‘నువ్వు వాటి కంటే ఎత్తుగా ఎగరగలవా?’ అని అడిగారు. ‘చూడటానికి ఆ పక్షులు తెల్లగా కనిపిస్తున్నాయే గాని, బలంలో నాకు సాటిరాలేవు. అదెంత పని, అవలీలగా వాటి కంటే ఎత్తుగా ఎగరగలను’ అంది కాకి.‘సరే, వాటితో పందేనికి వెళ్లు’ ఉసిగొల్పారు వర్తకుడి కొడుకులు. ఎంగిళ్లు తిని బలిసిన కాకి తారతమ్యాలు మరచి, హంసల దగ్గరకు డాంబికంగా వెళ్లింది. తనతో పందేనికి రమ్మని పిలిచింది. కాకి తమను పందేనికి పిలవడంతో హంసలు పకపక నవ్వాయి. ‘మేం రాజహంసలం. మానససరోవరంలో ఉంటాం. విహారానికని ఇలా ఈ సముద్రతీరానికి వచ్చాం. మేం మహాబలవంతులం. హంసలకు సాటి అయిన కాకులు ఉండటం లోకంలో ఎక్కడైనా విన్నావా?’ అని హేళన చేశాయి.కాకికి పౌరుషం పొడుచుకొచ్చింది.‘నేను నూటొక్క గతులలో ఎగరగలను. ఒక్కో గతిలో ఒక్కో యోజనం చొప్పున ఆగకుండా వంద యోజనాలు అవలీలగా ఎగరగలను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం’ కవ్వించింది కాకి.‘మేము నీలా రకరకాల గతులలో ఎగరలేం. నిటారుగా ఎంతదూరమైనా ఎగరగలం. అయినా, నీతో పోటీకి మేమంతా రావడం దండగ. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది’ అన్నాయి హంసలు.ఒక హంస గుంపు నుంచి ముందుకు వచ్చి, ‘కాకితో పందేనికి నేను సిద్ధం’ అని పలికింది.పందెం ప్రారంభమైంది.కాకి, హంస సముద్రం మీదుగా ఎగరసాగాయి.హంస నెమ్మదిగా నిటారుగా ఎగురుతూ వెళుతుంటే, కాకి వేగంగా హంసను దాటిపోయి, మళ్లీ వెనక్కు వచ్చి హంసను వెక్కిరించసాగింది. ఎగతాళిగా ముక్కు మీద ముక్కుతో పొడవడం, తన గోళ్లతో హంస తల మీద జుట్టును రేపడం వంటి చేష్టలు చేయసాగింది. కాకి వెక్కిరింతలకు, చికాకు చేష్టలకు హంస ఏమాత్రం చలించకుండా, చిరునవ్వు నవ్వి ఊరుకుంది. చాలాదూరం ఎగిరాక కాకి అలసిపోయింది. అప్పుడు హంస నిటారుగా ఎగసి, పడమటి దిశగా ఎగరసాగింది. కాకి ఎగరలేక బలాన్నంతా కూడదీసుకుని ఎగురుతూ రొప్పసాగింది. హంస నెమ్మదిగానే ఎగురుతున్నా, కాకి ఆ వేగాన్ని కూడా అందుకోలేక బిక్కమొహం వేసింది. ఎటు చూసినా సముద్రమే కనిపిస్తోంది. కాసేపు వాలి అలసట తీర్చుకోవడానికి ఒక్క చెట్టయినా లేదు. సముద్రంలో పడిపోయి, చనిపోతానేమోనని కాకికి ప్రాణభీతి పట్టుకుంది. కాకి పరిస్థితిని గమనించిన హంస కొంటెగా, ‘నీకు రకరకాల గమనాలు వచ్చునన్నావు. ఆ విన్యాసాలేవీ చూపడం లేదేం కాకిరాజా?’ అని అడిగింది.కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలో పడిపోయేలా ఉంది. ‘ఎంగిళ్లు తిని కొవ్వెక్కి నాకెవరూ ఎదురులేరని అనుకునేదాన్ని. నా సామర్థ్యం ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది. సముద్రంలో పడిపోతున్నాను. దయచేసి నన్ను కాపాడు’ అని దీనాలాపాలు చేసింది. కాకి పరిస్థితికి హంస జాలిపడింది. సముద్రంలో పడిపోతున్న కాకి శరీరాన్ని తన కాళ్లతో పైకిలాగింది. ఎగురుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చింది.‘ఇంకెప్పుడూ లేనిపోని డాంబికాలు పలుకకు’ అని బుద్ధిచెప్పింది హంస. ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు.‘కర్ణా! నువ్వు కూడా వర్తకుడి పుత్రుల ఎంగిళ్లు తిన్న కాకిలాగ కౌరవుల ఎంగిళ్లు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. అనవసరంగా హెచ్చులకుపోతే చేటు తప్పదు! బుద్ధితెచ్చుకుని మసలుకో’ అని కర్ణుణ్ణి హెచ్చరించాడు. – సాంఖ్యాయన -
రెక్కలు..
చెరువు ఏమీ ఎరగనట్టుగా ఉంది. లేత మట్టిరంగు నీరు గాలికి అలలను ఏర్పరుస్తూ ఉంది. చాలా పెద్ద చెరువే అది. ఎంత లోతు ఉంటుందో. లోతును తలుచుకునే సరికి రాఘవకు కొంచెం భయం వేసింది. మళ్లీ తెగింపు వచ్చింది. ఆ తెగింపును చెదరగొడుతున్నట్టుగా గుడి గంట టంగుమని మోగింది. రాఘవ తల తిప్పి చూశాడు.చెరువు గట్టునే ఉన్న గుడికి పనుల మీద వెళుతున్నవాళ్లు ఆగి నమస్కారాలు పెట్టి వెళుతున్నారు. కొందరు దర్శనం కోసమే వచ్చి లోపలికి వెళుతున్నారు. ఉదయం తొమ్మిది అయి ఉంటుంది. అక్కడికి కాస్త దూరంలోనే ఉన్న స్కూల్ ఫస్ట్ బెల్ కూడా టంగుమని మోగింది.రాఘవ అదేమీ పట్టనట్టుగా దృష్టిని చెరువు వైపు మళ్లించాడు. గుడి వైపు చెరువు ఒడ్డు ఉండటంతో నీళ్లు తక్కువగా ఉన్నాయి. గట్టు మీద నడుచుకుంటూ వెళితే కుడి చివర నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. అంచు నుంచి జారినా దూకినా గల్లంతే. రాఘవకు చెమట పట్టింది. వెంటనే ఆకలి కూడా వేసింది. స్టవ్ మీద ఇడ్లీ ఉడుకుతుంటే తల్లి ‘ఆగరా’ అంటున్నా వచ్చేశాడు. తండ్రి గొంతు వెనుక నుంచి వినిపిస్తూనే ఉంది ‘పోనీ వెధవనీ’ అని.వెధవా తను? టెన్త్లో ఎన్ని మార్కులొచ్చాయి. ఇంటర్లో ఎన్ని మార్కులొచ్చాయి. బీటెక్ పూర్తి చేశాక కాలేజీలో అందరూ ‘నువ్వే టాప్. క్యాంపస్ సెలక్షన్లో నీకు ఉద్యోగం వస్తుంది’ అనంటే నిజమే అనుకున్నాడు. మార్కెట్ డౌన్లో ఉందట. క్యాంపస్ సెలక్షన్సే జరగలేదు. ఒక చిన్న కంపెనీ ముంబై నుంచి ఉద్యోగం ఇస్తానని అందిగాని అది బోగస్దని తేలింది. ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. తండ్రిని చేతి ఖర్చులు అడగాలన్నా నామోషీగా ఉంది. తండ్రి మాత్రం ఏం చేయగలడు. చిన్న ఊరు. చిన్న ఉద్యోగం.చేతికందొస్తాడనుకున్న కొడుకు ఖాళీగా ఉంటే బాధ ఉంటుంది. విసుక్కుంటున్నాడు. రాత్రి ఫోన్ చూసుకుంటూ పడుకుని ఉంటే తిట్టాడు. ‘దేశంలో అందరికీ ఉద్యోగాలొస్తుంటే నీకెందుకు రావడం లేదురా. ముప్పొద్దులా తింటూ ఫోను చూసుకుంటూ వుంటే ఎవడిస్తాడు’ అన్నాడు. బాధ కలిగింది. థూ ఎందుకీ జన్మ అనిపించింది. హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్కు ఫోన్ చేశాడు. ‘మేమే బెంచ్ మీద ఉన్నాం బ్రో. ప్రాజెక్ట్లో దూరడం చాలా కష్టంగా ఉంది’ అన్నారు. ఏ ఆశా మిగల్లేదు. ఆ అర్ధరాత్రే వెళ్లి చెరువులో దూకుదామా అనుకున్నాడు. ధైర్యం చాల్లేదు. ఉదయాన్నే లేచి టిఫిన్ కూడా చేయకుండా ఇటొచ్చేశాడు. వచ్చి? దూకాలి. దూకాలంటే మాటలా?ఏదో అలికిడిగా కేరింతలుగా వినిపించింది. గుడి దగ్గర ఎవరో తాత. గుడ్డ పరిచి జామకాయలు అమ్ముతున్నాడు. స్కూలుకెళ్లే పిల్లలు చుట్టూ మూగి ఉన్నారు. పిల్లలు అంతగా మూగడానికి కారణం ఏమిటో చూద్దామని అటుగా అడుగులు వేశాడు. అతనికి తెలియకుండానే పెదాల మీద చిరునవ్వు వచ్చింది. తాత భుజం మీద చిలుక. పిల్లలతో ముద్దు ముద్దు మాటలు చెబుతోంది. ఆ మాటలకు పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతుంటే అది తన రెండు రెక్కల్ని అటు ఇటు ఆడిస్తూ ముక్కుతో శబ్దం చేస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. పిల్లలు ‘హాయ్’ అని పలకరిస్తే అది దాని రెండు రెక్కల్ని కలిపి వందనం చేసింది. జామకాయలు అమ్ముతున్న తాత ‘చిలకమ్మా.. గుడి ఎటువైపుంది’ అనగానే కుడి రెక్కతో గుడి వైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి ఎక్కడుందో చెప్పు’ అనగానే తన ఎడమ రెక్కతో బడివైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి, గుడి అంటే నీకు ఇష్టమా తల్లీ?’ అని తాత అనగానే చిలకమ్మ అవునన్నట్లు బుర్ర ఊపుతూ శబ్దం చేసింది.తాత చిలకమ్మకి ఎంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చాడో అనుకున్నాడు రాఘవ. ఓ పిల్లవాడు తాత భుజాన్ని బలంగా తాకడంతో భుజంపైన ఉన్న చిలకమ్మ కింద పడింది. ‘అయ్యో’ అంటూ దాన్ని చేతిలోకి తీసుకున్న రాఘవకి తెలిసింది దాని రెండు కాళ్లలో బలం లేదని. అది తన పొట్ట మీద తాత భుజం మీద కూచుని ఉందని. తాత వెంటనే చిలకమ్మని తన చేతిలోకి తీసుకుని దాని వీపు మీద నిమురుతూ మరల తన భుజం పైకి ఎక్కించుకుని ప్రేమగా జాంపండు తినిపించసాగాడు.రాఘవ కళ్లల్లోని బాధను చూసి ‘మనుషులకే కాదు పక్షులకు కూడా పక్షవాతం వస్తుంది బాబూ. ఇది ఇంతకు ముందు బానే ఉండేది. ఏమైందో ఏమో ఒకరోజు ఉన్నట్టుండి కాళ్లు పడిపోయాయి. కాళ్లు పడిపోయాక రెక్కలున్నా లాభం లేదు. అయినా మా చిలకమ్మ బాధ పడదు. సందడి చేయడం ఏ మాత్రం ఆపదు. దానికి తెలుసు అది సందడి ఆపేస్తే ఈ తాత దగ్గర పిల్లలు మూగరు. జామకాయలు కొనరు. అందుకే ఎగిరే శక్తి పోయినా ఎగరగలననే ఆశను చావనివ్వదు’ అన్నాడు తాత.ఆ మాటలకు చిలకమ్మ తనకి ఏదో అర్థమైనట్టుగా తాత బుగ్గ మీద ముక్కుతో అటు ఇటు రాస్తూ ముద్దాడింది. దానికి వచ్చిన కష్టంతో పోలిస్తే తనకు వచ్చిన కష్టాలు ఏమంత పెద్దవి? తల్లిదండ్రుల ఆశ తీర్చలేకపోయినందుకు బాధ కలిగి, వారికి తన మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.నిజంగా అలా చేస్తే వాళ్లు ఏమైపోతారు? వాళ్లు మాత్రం సంతోషంగా జీవిస్తారా? నిజంగా అది వాళ్లకి చావు కంటే పెద్ద నరకం. అంటే తన చేతులారా తన కన్న తల్లిదండ్రులని తనే చంపుకున్నట్టు కదా... ఇంతకంటే ఘోర పాపం ఉంటుందా?ఇంత ముసలివాడైన తాత జామకాయలు అమ్ముతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నాడే... యువకుడైన తనకీ నిరాశ ఏమిటి? తాత రాఘవ వైపు చూస్తూ ‘చెరువులో దూకడానికి వచ్చావు గదా బాబూ’ అన్నాడు.రాఘవ ఉలిక్కి పడ్డాడు.‘నీకెలా తెలుసు?’ అన్నాడు.‘ఉదయమే చూశాను బాబూ నిన్ను చెరువు గట్టున. నీలాంటి కుర్రాళ్లు ఒంటరిగా వచ్చి హైరానా పడుతుంటే ఆ మాత్రం కనిపెట్టలేనా బాబూ. నేను ముసలాణ్ణయినా ఇప్పటికీ చెరువులో ఆ చివర నుంచి ఈ చివరకు ఈదగలను. ఒకవేళ నువ్వు దూకితే లటుక్కున దూకి జుట్టు పట్టుకుని లాక్కొద్దామని ఒక కన్ను వేసే ఉంచాను. నువ్వే వచ్చావు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాయనా.. వెతకాలి. కష్టమొచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతే ఈ లోకంలో మనుషులే ఉండరు‘ అన్నాడు.రాఘవ మనసులో ఇప్పుడు ఉదయపు కోరిక పూర్తిగా చచ్చిపోయింది. కొత్త రాఘవ అయ్యాడు.‘ఈ జామకాయ తిను బాబూ’ అంటూ తన జామకాయల బుట్టలో నుంచి ఓ కాయని తీసి తాత రాఘవ చేతిలో పెట్టాడు. రాఘవ ‘అయ్యో.. నా దగ్గర పైసా కూడా లేదు తాతా’ అనగానే ‘మరేం పర్వాలేదు బాబూ’ అన్నాడు. జామకాయ చాలా రుచిగా ఉంది. చిన్న ముక్క అరచేతిలో ఉంచి చిలకమ్మ దగ్గర పెడితే స్వతంత్రంగా పొడిచి గుటుక్కుమనిపించిందది. నవ్వుకున్నాడు.‘కాయ చాలా రుచిగా ఉంది తాతా’‘ఊరవతల తోటలోవి బాబూ. వాళ్లు నాకు తెలిసినవాళ్లే. మంచి కాపొచ్చే తోట. డబ్బున్నోళ్లు. చేసుకోవాలని లేదు. ఎవరికైనా గుత్తకు ఇద్దామనుకుంటున్నారు. ఈ కాయలను ఒక ఆటోలో వేసుకొని టౌన్కు తీసుకెళ్లి అమ్మితే ఇక్కడ పది రూపాయలకు అక్కడ యాభై వస్తాయి. నేనా చేయలేను’ అన్నాడు తాత.రాఘవకు ్రౖడైవింగ్ వచ్చు. చిన్న ట్రాలీ అద్దెకు తీసుకోగలడు. ‘తోట యజమానితో మాట్లాడి నన్ను పరిచయం చేయి తాతా. తర్వాతి కథ నేను చూసుకుంటాను. రేపటి నుంచి మన బిజినెస్ టౌన్లోనే. నువ్వు తోడుండు చాలు’ అన్నాడు రాఘవ.‘ఏంటి బాబూ నువ్వనేది’‘అవును తాతా’ అన్నాడు రాఘవ.తాత కూడా చిరునవ్వు నవ్వాడు.‘ఏం చిలకమ్మా’ అన్నాడు.అది కిచకిచమని అంగీకారం తెలిపింది.ముగ్గురూ లేచి అక్కడ నుంచి కదిలారు. గుడి గంట మరోసారి టంగుమంది. కొత్త రెక్కలతో రాఘవ, తాత, చిలకమ్మ ముందుకు సాగిపోయారు. – నేదూరి భాను సాయి శ్రేయ -
Masaba Gupta: మసాబా.. మసాబా..
మసాబా గుప్తా.. ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఒక వైబ్రెంట్ వేవ్! ఆమె రాకముందు మన ఫ్యాషన్లో బిగ్ అండ్ బోల్డ్ ప్రింట్స్ అంతగాలేవు! ఇప్పుడవి చాలామంది సెలబ్రిటీస్కి మోస్ట్వాంటెడ్ క్యాజువల్స్గా మారి, వాళ్ల స్టయిలింగ్ వార్డ్రోబ్స్కి చేరిపోతున్నాయి. క్రెడిట్ గోస్ టు ‘హౌస్ ఆఫ్ మసాబా!’ కుడోస్ టు క్రియేటర్ మసాబా గుప్తా!నా స్కిన్ కలర్, నా జుట్టు తీరుతో చాలా అవమానాలు ఎదుర్కొన్నా! అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను నిలబెట్టింది. ఏ రంగంలో అయినా ప్రతికూలతలు ఉంటాయి. వాటిని మనకు అనుకూలంగా మలచుకోగలగడమే సక్సెస్! అంటుంది మసాబా గుప్తా.మసాబా గుప్తా ఎవరో సినీ,క్రికెట్ ప్రియులు చాలామందికి తెలిసే ఉంటుంది. నటి నీనా గుప్తా, క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ కూతురు. చిన్నప్పుడెప్పుడూ ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలకనలేదు ఆమె. తండ్రిలా ఆటల మీదే ఆసక్తి చూపింది. టెన్నిస్ ప్లేయర్ కావాలని కష్టపడింది. తనకు పదహారేళ్లు వచ్చేటప్పటికి ఆ ఆసక్తి, ప్రయత్నం మ్యూజిక్, డాన్స్ మీదకు మళ్లాయి. లండన్లో ఆ రెండిటిలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఒంటరిగా ఉండలేక వాటిని మధ్యలోనే వదిలేసి ముంబై చేరుకుంది.వచ్చాక, యాక్టింగ్ ఫీల్డ్ పట్ల ఇంట్రెస్ట్ చూపించింది. అది గమనించిన నీనా గుప్తా, ‘ఇక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసే సంప్రదాయ సౌందర్య ప్రమాణాలు వేరు. నువ్వు అందులో సెట్ కావు. సో.. ఆ ఆలోచనకు ఫుల్స్టాప్ పెట్టేయ్’ అంటూ బిడ్డను వెనక్కి లాగింది. ఏమాత్రం నిరుత్సాహపడక, తన క్రియేటివిటీని తన కాలేజ్ ఈవెంట్స్లో ప్రదర్శించసాగింది మసాబా. ఆ సమయంలోనే ఆమెలోని ఈస్తటిక్ సెన్స్, ఫ్యాషన్ స్పృహను కనిపెట్టిన ఫ్యాషన్ డిజైనర్, ఆథర్.. వెండెల్ రోడ్రిక్స్ ఆమెను ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ప్రోత్సహించాడు. దాంతో మసాబా.. ముంబై, ఎస్ఎన్డీటీ యూనివర్సిటీ(శ్రీమతి నాథీబాయీ దామోదర్ ఠాక్రసే మహిళా విశ్వవిద్యాలయ్)లో అపరెల్ మాన్యుఫాక్చర్ అండ్ డిజైన్ను అభ్యసించింది.తను పూర్తిస్థాయిలో ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టే టైమ్కి.. పెద్ద ప్రింట్లు, డార్క్ కలర్ల జాడ అంతగా కనపడలేదు ఆమెకు. దాంతో ఆ రెండిటినే తన యూఎస్పీగా మార్చుకుని ‘హౌస్ ఆఫ్ మసాబా’ లేబుల్ని ఆవిష్కరించింది. ఇండియన్ ఫ్యాషన్ ప్రపంచంలో అదొక సంచలనం. లేత రంగులు, ప్లెయిన్, చిన్న చిన్న డిజైన్స్నే ఎంచుకుంటున్న సెలబ్రిటీలకు మసాబా ప్రింట్స్æ వైబ్రెంట్గా తోచాయి. ఆ లేబుల్కి మారారు. ఆ అవుట్ఫిట్స్లో సెలబ్రిటీల అపియరెన్స్ రేడియెంట్గా కనిపించసాగింది.ప్రత్యేక స్టయిల్గా గుర్తింపురాసాగింది. అంతే ‘హౌస్ ఆఫ్ మసాబా’ బాలీవుడ్ సెలబ్రిటీల ఫేవరెట్ బ్రాండ్ అయిపోయింది. ఇంట్లో వేసుకోవడానికి మొదలు బీచ్లో వ్యాహ్యాళి, ప్రయాణాలు, సినిమాలు, పార్టీలు, ఫంక్షన్లు, అవార్డ్ ఈవెంట్స్ దాకా దేనికైనా మసాబా డిజైనర్ వేర్ కావాల్సిందే అని కోరుకునే స్థాయికి చేరుకుంది ఆ డిమాండ్! ఆ లిస్ట్లో సోనమ్ కపూర్, ప్రియంకా చోప్రా, కరీనా కపూర్ ఖాన్, కరిశ్మా కపూర్, కత్రినా కైఫ్, రాణీ ముఖర్జీ, విద్యా బాలన్, సొనాక్షీ సిన్హా, మీరా రాజ్పుత్ కపూర్, మౌనీ రాయ్, కరణ్ జోహార్ లాంటి మహామహులంతా ఉన్నారు. ‘హౌస్ ఆఫ్ మసాబా’ వెడ్డింగ్, రిసార్ట్ వేర్లోనూ సిగ్నేచర్ డిజైనింగ్ను మొదలుపెట్టింది. అంతేకాదు స్విమ్ వేర్, మెన్స్ వేర్, ఫ్యాషన్ జ్యూల్రీలోనూ తన నైపుణ్యాన్ని చూపిస్తోంది.ఇవి చదవండి: Elnaaz Norouzi: పర్షయన్ ప్రజ్ఞ! -
పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’
‘దేవరపాలెం.. దేవరపాలెం..’ అంటూ కండక్టర్ కనకరాజు రాబోయే స్టాపులో దిగబోయే ప్రయాణికులను అలర్ట్ చేస్తూ గట్టిగా అరిచాడు. కనకరాజు అరుపులకు కొంతమంది సీట్లలోంచి లేచి, హడావిడిగా తమ సామాన్లను తీసుకుంటున్నారు. ‘రావాలి.. రావాలి..’ అంటూ కనకరాజు వారిని మరింత వేగిరపెట్టాడు. కొంతమంది దిగిపోయాక, కొంతమంది ఎక్కారు. కనకరాజు టికెట్స్ కొట్టే కట్టర్తో ఎదురుగా ఉన్న ఇనుప రాడ్ మీద ‘రైట్.. రైట్..’ అంటూ గట్టిగా కొట్టాడు. అతను ఇచ్చిన శబ్దసందేశానికి బస్సు పొగలు చిమ్ముకుంటూ బయల్దేరింది.ఆ బస్టాపుకి కొద్దిదూరంలో వున్న ఒకావిడ మర్రిచెట్టు కింద కూర్చుని, బస్సులోంచి దిగుతున్న ప్రయాణికులను ఆత్రంగా చూడటం కనకరాజు కొద్దిరోజులుగా గమనిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వచ్చే ఆ బస్ కోసమే ఆమె రెండు పూటలా వస్తోంది. ఆమెకు సుమారుగా నలభై ఐదేళ్లుంటాయి. ఆమె కళ్ళు తీక్షణంగా మెరుస్తూ, దేనికోసమో వెతుకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఇదే ఆమె క్రమం తప్పని దినచర్య!‘ఆమె ఎవరు? రోజూ ఎవరి కోసం ఎదురుచూస్తోంది?’ అనే ప్రశ్నలు ఆమెని చూసినప్పుడల్లా కనకరాజు మదిని తొలిచేస్తున్నాయి. కనకరాజు తన ఆలోచనల్లోంచి బయటికి వచ్చి, ఓ పెద్దాయనకు టికెట్ కొడుతూ ‘బాబాయ్, ఎవరావిడ?’ తన మనసుని కుదిపేస్తున్న ప్రశ్నని అతని ముందు పెట్టాడు.‘ఆవిడో పిచ్చి మాలోకమయ్యా..!’ అతను ముక్తసరిగా బదులిచ్చాడు. కనకరాజు ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.తన డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న కనకరాజు నిస్సత్తువగా హాల్లోని సోఫాలో వాలిపోయాడు. భర్త రాకను గమనించిన అతని భార్య సరోజ వంటగదిలోంచి వస్తూ ‘టీ పెట్టమంటారా?’ అని అనునయంగా అడిగింది.‘వద్దు సరోజా.. అలేఖ్యకి ఇప్పుడెలా వుంది? నిద్రపోతోందా?’ దుఃఖాన్ని గుండె లోతుల్లోనే దిగమింగుకుని నెమ్మదిగా అడిగాడు కనకరాజు.‘జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పట్టడంలేదు. ఏమి తిన్నా వాంతులు చేసుకుంటోంది. ఇప్పుడే పడుకుంది’ చెప్పింది సరోజ బాధని పంటితో బిగబట్టుకుని.కనకరాజుని ఈ మధ్యకాలంలో బాగా వేధిస్తోన్న అతిపెద్ద సమస్య తన ఎనిమిదేళ్ల కూతురి అనారోగ్యం! అతని కూతురు సంవత్సర కాలంగా అంతుచిక్కని కొత్త తరహా న్యుమోనియాతో నరకాన్నే చూస్తోంది. ఏడాదిగా స్కూలుకి కూడా పోవడంలేదు. తెలిసిన వాళ్లు చెప్పిన స్పెషలిస్టులందరికీ చూపించాడు. డాక్టర్లు సూచించిన అన్నిరకాల టెస్టులు చేయించాడు, చేయిస్తూనే వున్నాడు. ఫలితం మాత్రం శూన్యం!కనకరాజుకి ఎప్పటిలాగే ఆరోజు కూడా దేవరపాలెం బస్టాపు దగ్గర రెండు దఫాలూ అదే దృశ్యం ఎదురైంది. ఈసారి ఎవరినీ అడగకూడదని, తనే స్వయంగా ఆమెని కలిసి, విషయమేంటో ఆరా తీయాలని గట్టిగా తీర్మానించుకున్నాడు. తన సెలవు రోజున దేవరపాలెం వెళ్లాడు. బస్టాపు దగ్గర్లోని ఓ బడ్డీ కొట్టులో ఒక వాటర్ బాటిల్ కొంటూ, మర్రిచెట్టు కింద కూర్చున్న ఆవిడను చూపిస్తూ ‘ఎవరండీ ఆవిడ? రోజూ అక్కడ కూర్చుని, ఎవరి కోసం ఎదురు చూస్తుంది?’ అడిగాడు కాస్త చొరవతీసుకుని.‘ఆవిడా? ఎప్పుడో చిన్నప్పుడే పారిపోయిన కొడుకు తిరిగొస్తాడని.. అవిడో పిచ్చిది సార్!’ క్లుప్తంగా బదులిచ్చాడతడు.‘ఈ మాత్రం చాలు. ఆమెని చేరుకోవడానికి’ అనుకుంటూ, ఆ పక్కనే వున్న చెక్కబల్ల మీద కూర్చున్నాడు. ఆ కాసేపటికి బస్సు రావడం, వెళ్లిపోవడం జరిగిపోయాయి. బస్సు వచ్చేటప్పుడు ఆమె కళ్లల్లో అదే వెలుగు. బస్సు వెళ్లిపోయిన మరుక్షణమే నిరాశగా ఇంటిదారి పట్టింది. కనకరాజు దూరం నుంచే ఆమెను అనుసరించసాగాడు. ఆమె వెళ్తూవెళ్తూ ఓ ఇంటి ముందు ఆగిపోయింది. అదే.. తన నివాసం కాబోలు అనుకున్నాడు. అది ఓ సెంటు స్థలంలో కట్టిన చిన్న పాత పెంకుటిల్లు.కనకరాజు ధైర్యాన్ని కూడగట్టుకుని, మరో ఆలోచన చేయకుండా గబగబా ఆమె దగ్గరకు వెళ్లి ‘అమ్మా..! నా పేరు కనకరాజు. మీ బిడ్డకోసం ఎదురు చూస్తున్నారని విన్నాను. నేను డ్యూటీ మీద చాలాచోట్లకు తిరుగుతుంటాను. మీ అబ్బాయి గురించి వివరాలు చెప్తే, నా శాయశక్తులా వెతికిపెడతాను’ నిజాయితీగా తన మనసులోని మాటని ఆమె ముందు పెట్టాడు. ఆమె కనకరాజు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘ఎవరు బాబూ మీరు? మీరు చెబుతున్నది నిజమేనా? నా బిడ్డ నిజంగా నా చెంతకొస్తాడా?’ ఆత్రంగా అడిగింది.‘అవునన్నట్లు’ తలూపాడు కనకరాజు. ఆమె మొహం ఒక్కసారిగా కాంతివంతమైంది.‘బాబూ.. నా కొడుకు పారిపోయి పదిహేనేళ్లు గడిసిపోనాయి. కానీ ఇంతవరకు ఎవ్వరూ యివ్వని భరోసాని యిత్తున్నావు. అందరూ నన్ను ‘పిచ్చిది’ అనేటోళ్లే గానీ, ఎవరూ యిలా చెప్పలేదు బాబూ..’ తన పట్టరాని సంతోషాన్ని, కన్నీళ్ల రూపేణా వ్యక్తపరచింది.ఆమె భావోద్వేగానికి కనకరాజు ఎంతోగానో చలించిపోయాడు. అతని కంట్లో కూడా నీళ్లూరాయి.‘మీ పేరెంటమ్మా..’ అడిగాడు. ‘ఎర్రయ్యమ్మ..’ చెప్పింది.మిగతా వివరాలూ అడిగాడు కనకరాజు. తన కొడుకు పేరు రాజు అని చెప్పింది ఆమె. పదేళ్లప్పుడు మాస్టారు కొట్టారని పుస్తకాల సంచిని అక్కడే విసిరికొట్టి, ఇంటికొచ్చేశాడట. కొడుక్కి బుద్ధి రావాలని రెండు దెబ్బలు వేసిందట ఎర్రయ్యమ్మ. అంతే..కోపంతో రాజు ఊరొదిలి పారిపోయాడు. అది మొదలు ఎర్రయ్యమ్మ పిచ్చిదానిలా చుట్టుపక్కల ఊళ్లే కాదు, సిటీలోని వీథులు, రోడ్లనూ గాలించిందట. తిరిగి తిరిగి కాళ్లు అరిగాయి కానీ కొడుకు జాడ మాత్రం తెలియలేదు. అదో తీరని వెతగా మారిపోయింది. కొడుకు కోసం ఎదురుచూస్తూ లోకం దృష్టిలో పిచ్చిదైపోయింది. ప్రభుత్వం అందిస్తోన్న ఫించనుతోపాటు రెండు ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. తను వుంటున్నది అద్దె ఇల్లే! అయితే ఒకప్పుడు అది తనదేనట. తాగుబోతు భర్త తన వ్యసనాల కోసం ఆ ఇంటిని అమ్మేశాడట. అయితే పెళ్లయిన మూడేళ్లకే చనిపోయాడట అతను. త్వరలోనే తన కొడుకు తనని వెతుక్కుంటూ ఇంటికి వస్తాడని ఈమధ్యనే ఓ సాధువు ఆమెకు జోస్యం చెప్పాడట.ఆమె నోట ఆ వివరాలన్నీ విన్న కనకరాజు ‘ఎర్రయ్యమ్మా, అప్పుడెప్పుడో పారిపోయిన నీ కొడుకు ఇన్నేళ్ల తర్వాత కనిపిస్తే ఎలా గుర్తుపడతావు?’ అనుమానంగా అడిగాడు. అంతే.. ఆమె గబగబా ఇంట్లోకెళ్లి, పోస్టుకార్డు సైజులో వున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి తెచ్చి, ‘మా రాజుగాడి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ వుంది.. చూశావా బాబూ..?’ అంటూ ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోన్న పుట్టుమచ్చని చూపించింది.కనకరాజు ఆ ఫొటోని అడుగుదామనుకునేలోపే ఎర్రయ్యమ్మే ‘ఈ ఫొటో నీ దగ్గర ఉంచు బాబూ.. మా వాడిని గుర్తుపట్టడానికి.. ఇంకా ఇలాంటి ఫొటోలు నాలుగైదు నా దగ్గరున్నాయిలే’ అంటూ ఆ ఫొటోని కనకరాజు చేతిలో పెట్టింది.ఆ ఫొటోని భద్రంగా జేబులో పెట్టుకుంటూ, చిన్న కాగితం మీద తన మొబైల్ నెంబరు రాసి ఆమెకిచ్చాడు కనకరాజు. అలా ఎర్రయ్యమ్మకు అంతులేని విశ్వాసాన్ని కలిగించి, కొండంత ధైర్యాన్ని నూరిపోసి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు.తర్వాత కొన్ని రోజులకే డిపోవారు కనకరాజు డ్యూటీ రూటు మార్చేయడంతో అతనికి ఎర్రయ్యమ్మను చూసే వీలు చిక్కలేదు. కూతురిని తరచుగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి రావడం వల్ల కూడా అతనికి ఎర్రయ్యమ్మను కలిసే తీరిక దొరకలేదు. అలా రెండునెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఎర్రయ్యమ్మే అతనికి ఫోన్ చేసింది తన కొడుకు ఇంటికి వచ్చేశాడంటూ! ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు కనకరాజు. డ్యూటీకి సెలవు పెట్టి, ఉన్నపళంగా దేవరపాలెం బయలుదేరాడు.కనకరాజుని చూడగానే సంతోషంతో ఉప్పొంగిపోయింది ఎర్రయ్యమ్మ.‘అయ్యా! మీరు చెప్పినట్టుగానే నా బిడ్డ నాకు దక్కాడు.. మీరు నా పాలిట భగమంతుడే! తమరు కలకాలం చల్లగా ఉండాలయ్యా..’ అంటూ ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు చెప్పుకుంది.‘నీ కొడుకు ఎక్కడమ్మా..?’అంటూ ఆత్రంగా అడిగాడు కనకరాజు.‘వంట సరుకులు కొనుక్కొత్తానని వెళ్లాడు బాబూ, వచ్చేత్తాడు..’ ఎర్రయ్యమ్మ అంటుండగానే ఓ పాతికేళ్ల యువకుడు రెండు చేతులతో రెండు సంచులను మోసుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు.అతను ఎర్రయ్యమ్మలాగే సన్నగా, పొడవుగా వున్నాడు. ఇంకా పసితనపు ఛాయలు పోలేదు. ఏదో తేజస్సు ఆ కుర్రాడి ముఖంలో! ఎర్రయ్యమ్మ ‘రాజూ, నేను చెప్పానే, గొప్ప మనసున్న మారాజు అని.. ఈ బాబే’ అంటూ కొడుక్కి కనకరాజుని పరిచయం చేసింది.ఆ అబ్బాయి తన రెండు చేతులెత్తి కనకరాజుకి దండం పెట్టాడు. ఎర్రయ్యమ్మ, కొడుక్కి ఏదో చెప్తున్నట్టుగా సైగచేసింది. ఆ యువకుడు చెక్క బెంచీపై కూర్చున్న కనకరాజు కాళ్లకి నమస్కరించాడు.అనుకోని ఆ పరిణామానికి కనకరాజు బిత్తరపోతూ, ఆ కుర్రాడిని పైకి లేపుతూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. భోంచేసి వెళ్లాలని ఎర్రయ్యమ్మ పట్టుపట్టింది. భోంచేసి, వాళ్లిద్దరి దగ్గర వీడ్కోలు తీసుకుని బస్సులో కూర్చున్న కనకరాజు మనసుకి ఎంతో ఊరటగా ఉంది. కానీ.. ఎక్కడో ఏదో తెలియని వెలితి!ఆ వెలితికి సాక్షీభూతంగా నిలిచిన ఓ సంఘటన కళ్ల ముందు కదుల్తూ అతన్ని రెండు వారాల వెనక్కు తీసుకువెళ్లింది.రాజు ఫొటోతో ఎర్రయమ్మ ఇల్లు దాటిన నాటి నుంచి ఎక్కడికి వెళ్లినా.. ఏ కుర్రాడు కనిపించినా ఆ ఫొటోతో పోల్చి చూసుకోవడం కనకరాజు దినచర్యలో భాగమైపోయింది. అలా ఎర్రయ్యమ్మ వేదన గురించే ఆలోచిస్తోన్న కనకరాజుకి ఒకరోజు.. బస్సులో ఓ పాతికేళ్ల యువకుడు బేల ముఖంతో చిన్నగా శోకిస్తూ కనిపించాడు. అది చివరి ట్రిప్ కావడంతో బస్సంతా ఖాళీగావుంది. అతన్ని గమనించిన కనకరాజు, అతని పక్కనే కూర్చుని ‘ఏమైంది బాబూ.. అంతగా కుమిలిపోతున్నావు?’ అంటూ అనునయంగా అడిగాడు. ఆ అనునయానికి కదిలిపోయిన ఆ కుర్రాడు నెమ్మదిగా గొంతు విప్పాడు.‘నా పేరు డేవిడ్ రాజు. ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. మా అమ్మను చూడాలని, ఆమెతో కబుర్లు చెప్పుకోవాలని ఆశ! మా అమ్మ గురించి నా శక్తి మేర చాలా సమాచారం సేకరించాను. అమ్మ నాకు తిండిపెట్టలేని దీనావస్థలో నన్ను మిషనరీ ట్రస్ట్లో వదిలేసిందట. ఏడాది పాటు అమ్మ ఆచూకీ కోసం చాలాచోట్లకి తిరిగాను. చాలామందిని కలిశాను. చిట్టచివరికి తన అడ్రస్ పట్టుకోగలిగాను. కానీ, నాలాంటి దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు సార్! తను ఓ నెల కిందటే ఎవరూలేని అనాథలా చనిపోయింది. నన్ను నిజంగానే అనాథని చేస్తూ..’ అంటూ బొటబొటా కన్నీళ్లుకార్చాడు.తను చదివిన ‘లా ఆఫ్ అట్రాక్షన్’ ప్రత్యక్షంగా ఎదురుకావడంతో మాటల్లో చెప్పలేని వింతానుభూతికి లోనయ్యాడు కనకరాజు. ‘మనం ఏదైనా బలంగా కోరుకుంటే.. అది జరిగితీరుతుంది!’ అని ఆ పుస్తకంలో చదివినట్టు జ్ఞాపకం. కుర్రాడి కళ్ల కిందుగా జారిపోతున్న కన్నీళ్లను తుడుస్తూ ‘నీకు అమ్మ ప్రేమ దక్కేటట్టు చేసే బాధ్యత నాది!’ అంటూ తిరుగులేని హామీనిచ్చాడు.ఆ కుర్రాడు తన్నుకొస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ, కుతూహలంగా కనకరాజు వైపు చూశాడు. ‘అయితే, నీ కుడి చెంప మీద చిన్న పుట్టుమచ్చ ఒక్కటే లోటు’ అన్నాడు కనకరాజు ఏదో ఆలోచిస్తూ!ఆరోజు ఆలా రెండు హృదయాల వేదనలను ‘ఒక సంతోష సాఫల్యం’గా రూపకల్పన చేశాడు కనకరాజు.ఎర్రయ్యమ్మ, రాజును కలిసిన కనకరాజు తన ఇంటికి చేరుకునేసరికి సాయంత్రమైంది. మెయిన్ గేటు తీసి, లోనికి అడుగుపెడుతుండగా ఎదురుగా కనిపించిన దృశ్యం అతన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అతని కూతురు ‘నాన్నా..’ అంటూ కిలకిలా నవ్వుతూ తనకేసి పరుగుతీస్తోంది లేడిపిల్లలా. పట్టరాని భావోద్వేగంతో కూతుర్ని చేతుల్లోకి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు. కళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి. ఎదురుగా వస్తోన్న అతని భార్య, తల్లి ముఖాల్లో వెల్లివిరిసిన వసంతకాలపు వెలుగులు!ఆశ్చర్యంగా భార్య వైపు చూశాడు. ‘ఉదయాన్నే మీరు అలా వెళ్లారో లేదో.. ఎప్పుడూ తిననని మొండికేసే పిల్ల ‘ఆకలీ.. ఆకలీ..’ అంటూ ఒకటే గొడవ. జ్వరం ఉందేమోనని చూశాను. ఏదో మంత్రం వేసినట్టుగా పూర్తిగా మాయం! అప్పటికప్పుడు టిఫిన్ చేసి, వేడివేడిగా తినిపించాను. తిన్నప్పటి నుంచి ఒకటే అల్లరి! ఇల్లంతా ఉరుకులు, పరుగులు! ఉదయం నుంచి పది నిమిషాలకొకసారి ఏదో ఒకటి అడిగి తింటూనే ఉంది. ఒక్క వాంతి కూడా కాలేదు. నాకే ఆశ్చర్యంగా ఉందండీ..’అంటూ ఆమె సంబరంగా జరిగినదంతా చెప్పుకుపోయింది. ‘సాటి మనిషికి సాయం చేసే నీ తత్త్వమేరా నీ బిడ్డకు ఆయుష్షు పోసుంటుంది..!’ అంది కనకరాజు తల్లి, కొడుకు వైపు మెచ్చుకోలుగా చూస్తూ. తల్లి మాటలకు చిన్నగా నవ్వేస్తూ, కూతురిని మురిపెంగా చూసుకుంటూ ఇంట్లోకి నడిచాడు కనకరాజు.ఎర్రయ్యమ్మని రాజు ఎలా చూసుకుంటున్నాడో తెలుసుకోవాలన్పించి, ఒకరోజు దేవరపాలెం వెళ్లాడు కనకరాజు. సాదరంగా ఆహ్వానించింది ఎర్రయ్యమ్మ. రాజు ఇంట్లో లేడు. ఆఫీస్ పని మీద సిటీకి వెళ్లాడని చెప్పింది. సాఫ్ట్వేర్ అయిన రాజు.. వారానికి ఒకటీ, రెండ్రోజులు మాత్రమే ఆఫీసుకి వెళ్తుంటాడు. మిగతా రోజులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎర్రయ్యమ్మ కట్టూబొట్టూ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఒంటి మీదకి బంగారం కూడా చేరింది. కొడుకు కోరిక మేరకు పాచిపనులకు స్వస్తి చెప్పింది.ఎర్రయ్యమ్మ చెప్పిన మరో విషయం రాజు మీద కనకరాజుకి తిరుగులేని నమ్మకాన్ని కలిగించింది. తన భర్త ద్వారా పోగొట్టుకున్న, ఒకప్పటి తన సొంతిల్లు అదే ఇప్పుడు అద్దెకున్న ఆ ఇల్లు, దాన్ని ఆనుకొని వున్న మరికొంత ఖాళీస్థలాన్నీ కొని, ఎర్రయ్యమ్మ పేరిట కాగితాలు రాయించాడని చెప్పింది. విన్న కనకరాజు తన ప్రయత్నం సంపూర్తిగా సఫలీకృతమైంది అనుకున్నాడు. మనసు నిండింది.‘ప్రతి జీవితానికి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలంటారు. నా జీవితానికిది చాలు!’ అనుకుంటూ బయల్దేరడానికి సమాయత్తమయ్యాడు కనకరాజు.కుర్చీలోంచి లేచిన కనకరాజు కాళ్లకి ఎర్రయ్యమ్మ నమస్కరించబోయింది. ఆ హఠాత్పరిణామానికి అతను బిత్తరపోయి దూరం జరుగుతూ ‘ఎర్రయ్యమ్మా, నేను నీ తమ్ముడు లాంటివాడిని. నువ్వు నా కాళ్లకు నమస్కరించడం ఏంటీ?’ అన్నాడు ఇబ్బందిపడుతూ.‘సాటిమనిషి కోసం ఆలోచించే తీరికలేని ఈ కాలంలో.. అనామకురాలైన ఈ ఎర్రయ్యమ్మ కోసం నువ్వు ఎంత తాపత్రయపడ్డావో నాకెరుకే బాబూ..! పారిపోయిన నా కొడుక్కి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ ఉందని చెప్పాను. కానీ, వాడి ఛాతీ మీదున్న పాపిడి బిళ్లంత మరొక పుట్టుమచ్చ గురించి చెప్పలేదు! అది నీకు తెలియదు కదా బాబూ..’ అంటోన్న ఆమెకు బదులేం ఇవ్వాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు కనకరాజు.‘నా బాధ చూడలేక, నా కొడుకు రూపంలో ఈ అబ్బాయిని, నువ్వే పంపించావని నాకు ఎరుకే బాబూ! రాజు నా కడుపున కాయకపోయినా అంతకన్నా ఎక్కువే! ఇలాంటి మారాజు బిడ్డని నాకు చూపించినందుకు నీకు ఈ ఎర్రయ్యమ్మ జనమ జనమలకు రుణపడి ఉంటాది బాబూ..! నా కొడుకు మొన్ననే నీ గురించి ఓ మాట చెప్పినాడు.. ‘కండక్టర్’ అంటే నడిపించేవాడని అర్థమట! నువ్వు, నిజంగా మా బతుకులను నడిపించిన దేవుడివయ్యా..’ అంటూ చేతులెత్తి దండం పెట్టింది.‘ఎర్రయ్యమ్మా.. నీ రాజును నీ దరికి చేర్చే క్రమంలో నిన్ను ఒక అబద్ధంతో మభ్యపెడుతున్నానని ఎంతో అపరాధభావానికి గురయ్యాను. ఆ వెలితిని కాస్త దూరం చేశావు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి’ అన్నాడు కనకరాజు. తేలికపడిన మనసుతో తన ఇంటి దారి పట్టాడు. – శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు -
Lathika Sudhan: రేకులు విప్పిన కలువ.. కొలనైంది!
లతిక సుథాన్ ఇల్లు కలువల కొలను. కమలాల సరస్సు. ఇంటి చుట్టూ నీరు, నీటిలో తేలుతూ పూలు. ఒకటి కాదు, రెండు కాదు. వంద రకాల కమలాలు, ఎనభై రకాల కలువలు వికసించిన సుమనిలయం ఆమె ఇల్లు. వాటిలో ఒకటి అత్యంత అరుదైన వెయ్యి రేకుల కమలం. ఇవన్నీ ఆమెకు చక్కటి ఆదాయ వనరుగా కూడా మారాయి. నెలకు నలభై వేల రాబడినిస్తున్నాయి. లోటస్ ప్రెన్యూర్ అనే గుర్తింపును తెచ్చాయి. విశ్రాంత జీవితాన్ని ఇంత సుగంధ భరితం చేసుకున్న లతిక ఒక స్కూల్ టీచర్. ఉద్యోగ బాధ్యతల్లో నిమగ్నమైన ఉన్నన్ని రోజులూ తనకిష్టమైన మొక్కల పెంపకం అభిరుచిని పక్కన పెట్టాల్సి వచ్చింది. రిటైర్ అయిన తర్వాత ఆమె తన హాబీకి మొగ్గ తొడిగింది. మొక్కలకు దూరంగా ఇరవై ఏళ్లు..లతిక సుథాన్ది కేరళ రాష్ట్రం, త్రిశూర్. ‘చిన్నప్పుడు మొక్కలతోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని. కమలం విచ్చుకోవడాన్ని ఆసక్తిగా చూసేదాన్ని. ఒక్కో రెక్క విచ్చుకుంటూ ఉంటే అబ్బురంగా అనిపించేది. చదువు, పెళ్లి, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగంతో ఇరవై ఏళ్లపాటు మొక్కలకు దూరమయ్యాను. ఉద్యోగం నుంచి 2018లో రిటైరయ్యాను. అప్పటి నుంచి ఇక మొక్కల మధ్య సీతాకోక చిలుకనయ్యాను. ప్రపంచంలో ఉన్న కలువలు, కమలాల జాతుల మీద ఒక అధ్యయనమే చేశాను. దేశంలోని వివిధ ్రపాంతాల నుంచి మొక్కలు తెచ్చి పెంచాను. అలాగే థాయ్లాండ్, వియత్నాం, జపాన్ దేశాల నుంచి కూడా తెప్పించుకున్నాను. పెంపకంలో మెళకువలు నేర్చుకోవడానికి అనేక వర్క్షాపులకు హాజరయ్యాను. వ్యవసాయాభివృద్ధి శాఖ నిర్వహించే సదస్సులకు వెళ్లి నిపుణుల సూచనలను తెలుసుకున్నాను’ అన్నారు లతిక.మొక్కల పాఠాలు..కమలాలు, కలువల్లో అరుదైన జాతులను సేకరించడం, వాటి పెంపకం గురించి మెళకువలు తెలుసుకోవడంతో ఆ మొక్కల పెంపకం గురించి ఉపన్యసించగలిగినంత పట్టు సాధించారు లతిక. పిల్లలకు పాఠాలు చెప్పిన ఆమె అనుభవం ఇప్పుడు మొక్కల పాఠాలు చెప్పిస్తోంది. ఈ పూల గురించి ఒక్క సందేహం వ్యక్తం చేస్తే చాలు... అనర్గళంగా వివరిస్తుంది. కమలాలు, కలువల మొక్కలు, గింజల కోసం హాస్పిటల్, హోటల్, రిసార్టుల నుంచి భారీ మొత్తంలో ఆర్డర్లు వస్తుంటాయి. హాబీగా మొదలైన కమలాల పెంపకం మంచి లాభాలనిస్తూ ఆమెకు స్థానికంగా లోటస్ ప్రెన్యూర్ అనే గుర్తింపును కూడా ఇచ్చింది.ఇవి చదవండి: iSmart హోమ్స్ -
నిద్రలేమిని దూరం చేసే కళ్లజోడు.. ఎప్పుడైనా వాడారా..!?
ఈ కళ్లజోడును రోజూ ధరించినట్లయితే, నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ప్రతిరోజూ సరైన వేళకు చక్కగా నిద్రపడుతుంది. ఆస్ట్రేలియన్ కంపెనీ ‘రీటైమ్’ ఈ హైటెక్ లైట్థెరపీ కళ్లజోడును తాజాగా ‘రీటైమర్–3’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఆడలాయిడ్లోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ లియోన్ ల్యాక్ ‘రీటైమ్’ కంపెనీ కోసం ప్రత్యేకంగా ఈ కళ్లజోడును రూపొందించారు.ఈ కళ్లజోడును ధరిస్తే, దీని నుంచి నిర్ణీత తరంగదైర్ఘ్యంలో నీలి–ఆకుపచ్చ రంగులోని కాంతి కళ్ల మీద పడుతుంది. ఈ కాంతి కళ్ల అలసటను పోగొడుతుంది. దీని నుంచి వెలువడే కాంతి శరీర గడియారానికి అనుకూలంగా పనిచేస్తుంది. ఫలితంగా, వేళకు చక్కగా నిద్రపట్టేలా చేస్తుంది. ఈ కళ్లజోడు రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఆరుగంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 179 డాలర్లు (రూ.15,021) మాత్రమే!ఎక్కడైనా వాడుకోగల పోర్టబుల్ ఏసీ..ఇది పోర్టబుల్ ఏసీ. దీనిని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇళ్లల్లోనే కాదు, పిక్నిక్లకు, ఫారెస్ట్ క్యాంపులకు వెళ్లేటప్పుడు తాత్కాలికంగా వేసుకున్న టెంట్లలో కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. చైనాకు చెందిన ‘హావోరాన్’, ‘యిఫీలింగ్ డిజైన్ ల్యాబ్’లకు ఇంజినీర్లు ‘యూయీ’ పేరుతో ఈ పోర్టబుల్ ఏసీకి రూపకల్పన చేశారు. ఒకదానికి మరొకటి అనుసంధానమై రెండు భాగాలుగా ఉండే ఈ ఏసీని సూట్కేసులా ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు.ఏసీ భాగాన్ని టెంట్ లోపల లేదా గది లోపల పెట్టుకుని, ఏసీ అడుగున ఉన్న భాగాన్ని టెంట్ లేదా గది వెలుపల పెట్టుకుని, ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది గది లేదా టెంట్ లోపల ఉన్న వేడిని బయటకు పంపి క్షణాల్లోనే చల్లబరుస్తుంది. అంతేకాదు, ఇది పనిచేసే పరిసరాల్లోకి దోమలు, ఇతర కీటకాలు చేరలేవు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయే మిల్లీరోబోలు..డచ్ వైద్యశాస్త్రవేత్తలు రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయే ఈ మిల్లీరోబోలను ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఇవి నేరుగా రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయి, సూచించిన దిశలో ముందుకు సాగుతూ, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిన చోట ఏర్పడిన అవరోధాలను సునాయాసంగా తొలగించి, సజావుగా రక్తప్రసరణ జరిగేలా చేస్తాయి. నెదర్లండ్స్లోని ట్వంటీ యూనివర్సిటీ, రాడ్బోడ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ మిల్లీరోబోలను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా రూపొందించారు.అయస్కాంతం ద్వారా వీటి కదలికలకు దిశా నిర్దేశం చేయడానికి వీలవుతుంది. ఈ మిల్లీరోబోల పనితీరుపై ఇంకా లాబొరేటరీ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వచ్చినట్లయితే, గుండెజబ్బులు, పక్షవాతంతో బాధపడే చాలామంది రోగులకు చికిత్స చేసే పద్ధతి మరింత సులభతరమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
అందాలొలికే ఈ బొమ్మలు.. సుమనోహరం!
అందాలొలికే ఈ బొమ్మలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. వీటిని పూర్తిగా పువ్వులు, ఆకులు, రెమ్మలతోనే రూపొందించినట్లు తెలుసుకుంటే, ‘సుందరం.. ‘సుమ’నోహరం’ అని ప్రశంసించక మానరు. కెనడాలో స్థిరపడిన జపానీస్ కళాకారుడు రాకు ఇనోయుయి రూపొందించిన ఈ ‘సుమ’నోహర కళాఖండాలు కొంతకాలంగా ‘ఆన్లైన్’లో హల్చల్ చేస్తున్నాయి. పూలు, ఆకులు, రెమ్మలను ఉపయోగించి, రాకు సృష్టిస్తున్న కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా కళాభిమానుల నుంచి ప్రశంసలు పొందుతున్నాయి.కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఉంటున్న రాకు ఈ పూల కళను 2017లో సరదా కాలక్షేపంగా మొదలుపెట్టాడు. తన ఇంటి పెరట్లో మొక్కల నుంచి రాలిపడిన గులాబీలు, ఇతర పూల రేకులు, వాటి ఆకులు వృథాగా పోతుండటంతో, వాటిని ఎలాగైనా సద్వినియోగం చేయాలని ఆలోచించాడు. తొలి ప్రయత్నంగా పూలరేకులు, కత్తిరించిన రెమ్మల ముక్కలను ఉపయోగించి కీచురాయి బొమ్మను తయారు చేశాడు. కీచురాయి బొమ్మ ఫొటోలను సోషల్ మీడియాలో పెడితే, విపరీతంగా స్పందన వచ్చింది. ఇక అప్పటి నుంచి రాకు వెనుదిరిగి చూసుకోలేదు. నిరంతర సాధనతో తన కళకు తానే మెరుగులు దిద్దుకుంటూ, పూల రేకులు, ఆకులు, రెమ్మలతో అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందే స్థాయికి ఎదిగాడు.పూర్తిగా సహజమైన పూలు, పూల రేకులు, ఆకులు, పూలమొక్కల గింజలు, రెమ్మలు, కొమ్మలు మాత్రమే ఉపయోగించి, కార్టూన్ క్యారెక్టర్లు, చిలుకలు, కొంగలు, గుడ్లగూబలు వంటి పక్షులు, పులులు, సింహాలు, జింకలు వంటి జంతువులు, సీతాకోక చిలుకల వంటి కీటకాల బొమ్మలను జీవకళ ఉట్టిపడేలా తయారు చేయడంలో రాకు తన ఏడేళ్ల ప్రస్థానంలో అపార నైపుణ్యం సాధించాడు.ఈ కళాఖండాలను రూపొందించడానికి గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుందని, ఒక్కోసారి రోజుల తరబడి ఓపికతో పని చేయాల్సి ఉంటుందని రాకు చెబుతున్నాడు. ఆన్లైన్లో రాకు పేరుప్రఖ్యాతులు పెరగడంతో ప్రముఖ కంపెనీలు ఆర్డర్లు ఇచ్చి మరీ అతడి చేత తమ కంపెనీల లోగోలను ప్రత్యేక సందర్భాల కోసం తయారు చేయించుకుంటున్నాయి. ఈ పూల కళాఖండాలు ఎక్కువకాలం ఉండవు. త్వరగానే వాడిపోయి, వన్నె కోల్పోతాయి. అందుకే రాకు వీటి సౌందర్యాన్ని తన ఫొటోల ద్వారా శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు. వృక్షశాస్త్రవేత్త అయిన రాకుకు చిన్నప్పటి నుంచి కళాభిరుచి కూడా ఉండటంతో అతడు ఈ కళలో అద్భుతంగా రాణిస్తున్నాడు. -
Annu Patel: అన్నూస్ క్రియేషన్!
అన్నూ పటేల్.. ఫ్యాషన్ ఇండస్ట్రీలో స్పెషల్ స్టయిల్ ఆమెది! ఆ స్పెషాలిటీకి బాలీవుడ్ ఫిదా అయింది! అటు ఫ్యాషన్లో.. ఇటు స్టార్స్ స్టయిలింగ్లో సీనియర్స్తో ఇన్స్పైర్ అవుతూ, తన ప్రత్యేకతను చాటుకుంటూ సాగుతున్న ఆమె గురించి నాలుగు మాటలు ..అన్నూ పటేల్ స్వస్థలం గుజరాత్లోని వడోదర. ఫ్యాషన్గా ఉండటం, రకరకాల కలర్ కాంబినేషన్స్లో బట్టలు కుట్టించుకోవడమంటే ఆమెకు చిన్నప్పటి నుంచి ఆసక్తి. కనుకే, ఫిజియోథెరపీలో చేరిన కొన్నాళ్లకే అది తన కప్ ఆఫ్ టీ కాదన్న విషయాన్ని గ్రహించింది. ఫ్యాషన్ మీదే మనసు పారేసుకుంది. ఆలస్యం చేయక, వడోదరలోని ఐఎన్ఐఎఫ్డీ (ఇంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్)లో చేరింది. గ్రాడ్యుయేషన్ ఫస్టియర్లోనే ఆమె ఫ్యాషన్ ఐడియాస్కి ముచ్చటపడిన ఇన్స్టిట్యూట్ ఆమెకు ‘ద మోస్ట్ ఇన్నోవేటివ్ కలెక్షన్’ అవార్డ్నిచ్చింది. సెకండియర్లో ఉన్నప్పుడు ‘అన్నూస్ క్రియేషన్’ లేబుల్ను స్టార్ట్ చేసింది.ఆ చిన్న పట్టణంలో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది కానీ.. డిజైనర్ వేర్కి డిమాండ్ ఎక్కడ? అందుకే మొదట్లో తను డిజైన్ చేసిన దుస్తులను ఇంటింటికీ వెళ్లి అమ్మి, డిజైనర్ వేర్ పట్ల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి మోజు కలిగేలా చేసింది. ఆ ప్రయత్నం.. ఆమె చదువైపోయేలోపు ఫ్యాషన్ మార్కెట్లో ‘అన్నూ క్రియేషన్’కి స్పేస్ని క్రియేట్ చేసింది. దాన్ని స్థిరపరచు కోవాలంటే తన లేబుల్కు ఒక స్పెషాలిటీ ఉండాలని ఆలోచించింది అన్నూ. ఈ దేశంలో పెళ్లికిచ్చే ప్రాధాన్యం స్ఫురణకు వచ్చింది.బ్రైడల్ వేర్ డిజైన్లో తన ప్రత్యేకతను చాటుకుంటే తన మార్కెట్ ఎక్కడికీ పోదని తెలుసుకుంది. తన ఐడియాను అర్థం చేసుకునే టీమ్ని ఎంచుకుని డిజైనింగ్ మొదలుపెట్టింది. తొలుత సామాన్యులకే బ్రైడల్ వేర్ ఇచ్చింది. అవి అసామాన్యుల మనసునూ దోచాయి. దాంతో అన్నూ క్రియేషన్ సెలబ్రిటీల స్థాయికి చేరింది. బ్రైడల్ వేర్ చేస్తున్నప్పుడే అన్నూకి ఫ్యాషన్ మార్కెట్లో ఎత్నిక్ వేర్కీ స్పేస్ కనపడింది. ముందు తనకు, తన టీమ్కి క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్ చేసి, వాటిని ధరించి.. ఫొటో షూట్ చేయించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయసాగింది. అవీ సెలబ్రిటీల దృష్టిలో పడి అన్నూ బ్రాండ్కి క్యూ కట్టసాగారు.ఆ డిమాండ్ను చూసి ‘ఎఫ్ అండ్ ఎఫ్ (ఫ్రిల్ అండ్ ఫ్లేర్)’ పేరుతో క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్ను స్టార్ట్ చేసింది. ‘ఎఫ్ అండ్ ఎఫ్’ అంటే కుర్తీలు, ఇండో– వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి పర్ఫెక్ట్ బ్రాండ్ అనే ఫేమ్ని సంపాదించింది. తనే కొత్త అవుట్ఫిట్ని డిజైన్ చేసినా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అన్నూ అలవాటు. అలా ఆమె డిజైన్స్ అన్నిటినీ ఫాలో అయిన కొందరు బాలీవుడ్ సెలబ్స్.. తమకు స్టయిలింగ్ చేయమని ఆమెను కోరారు. తొలుత అప్రోచ్ అయింది మలైకా అరోరా! ఆ తర్వాత కృతి ఖర్బందా, సోఫీ చౌధరీ, తారా సుతారియా, మౌనీ రాయ్, జాన్వీ కపూర్, హెజల్ కీచ్ వంటి వాళ్లంతా అన్నూ పటేల్ స్టయిలింగ్ క్లయింట్ల లిస్ట్లో చేరిపోయారు. ‘సామాన్యులకు డిజైన్ చేస్తున్నా, సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేస్తున్నా.. ఆయా స్థాయిల్లో అంతే ఎఫర్ట్స్ పెడతాను, అంతే కమిట్మెంట్తో ఉంటాను. నా డిజైనర్ వేర్ని.. నా స్టయిలింగ్ని కోరుకుంటున్న వాళ్ల సంతోషమే నాకు ముఖ్యం. అది నాకు కోటి అవార్డులతో సమానం!’ అంటుంది అన్నూ పటేల్.ఇవి చదవండి: Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా! -
Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా!
సనమ్ సయీద్.. బ్రిటిష్ పాకిస్తానీ మోడల్, నటి, గాయని కూడా! ఉర్దూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రసిద్ధురాలు. మన దగ్గరా ఆమెకు ఘనమైన అభిమానగణం ఉంది. జీ5, హమ్ చానళ్ల వీక్షకులకు ఆమె సుపరిచితం.సనమ్ పుట్టింది లండన్లో. తన ఆరేళ్ల వయసులో ఆమె కుటుంబం పాకిస్తాన్లోని కరాచీకి వెళ్లి, స్థిరపడింది. ప్రాథమిక విద్యాభ్యాసం కరాచీలో, ఉన్నత విద్యాభ్యాసం లాహోర్లో గడిచింది. ఫిల్మ్ అండ్ థియేటర్ స్టడీస్లో డిగ్రీ చేసింది.ఆమె తన పదహారవయేట నుంచి మోడలింగ్ మొదలుపెట్టింది. పదిహేడేళ్లప్పుడు ఎమ్టీవీ (పాకిస్తాన్)లో వీజేగా కనిపించింది.‘షికాగో’ అనే నాటకంతో రంగస్థల ప్రవేశం చేసింది. అందులోని ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. దాంతో ఆమెకు టీవీ సీరియల్స్లోనూ అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ‘దామ్’ అనే సీరియల్తో బుల్లితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటు నాటకాలు, అటు సీరియళ్లతో బిజీగా ఉన్న సమయంలో కోక్ స్టూడియో పాకిస్తాన్లో తన గళాన్ని వినిపించి.. తనలోని గాన ప్రతిభనూ చాటుకుంది.సనమ్ మల్టీటాలెంట్ ఆమెను వెండితెరకూ పరిచయం చేసింది ‘బచానా’ అనే ఉర్దూ సినిమాతో! ‘మాహ్ ఎ మీర్’, ‘దొబారా ఫిర్ సే’, ‘ఇశ్రత్ మేడ్ ఇన్ చైనా’ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి.సనమ్ను మనకు ఇంట్రడ్యూస్ చేసి.. ఇక్కడ ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టిన సీరియల్ ‘జిందగీ గుల్జార్ హై’. ఇది హమ్ టీవీలో ప్రసారం అయింది. ఈ సీరియల్ ఆమెకు ఇండియన్ ఫ్యాన్ బేస్ను ఏర్పరచింది.ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆమెకున్న ఫేమ్ను చూసి ఓటీటీ కూడా ఆమెకు ప్లేస్ ఇచ్చింది.. ‘కాతిల్ హసీనాఓం కే నామ్’తో! ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది.మోడలింగ్, థియేటర్, టీవీ, సినిమా, ఓటీటీ, సింగింగ్.. ఇలా అడుగిడిన ప్రతి రంగంలో ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు దక్కాయి. అందులో ఒకటి ‘ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్’.'ఇండియాలో నాకు ఫ్యాన్స్ ఉండటం అనిర్వచనీయమైన ఆనందం. ఇండియన్స్ పరాయివాళ్లన్న భావన నాకెన్నడూ లేదు. ఎప్పుడో.. ఎక్కడో తప్పిపోయి.. వేరువేరు ఇళ్లల్లో పెరిగిన తోబుట్టువుల్లా తోస్తారు. ఇప్పుడు నా సీరియల్స్, సిరీస్తో వాళ్లను కలుసుకుంటున్నట్టనిపిస్తోంది.'ఇవి చదవండి: ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్! -
ఆడంబరాలు.. అనర్థాలు తెస్తాయి!
అవంతి రాజ్యాన్నేలే ఆనందవర్మకి ఒక్కడే కొడుకు. అతని విద్యాభ్యాసం పూర్తయ్యింది. వివాహం చేసి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు ఆనందవర్మ. ఆ మాట రాణితో అంటే, ఆమె ‘అవును.. పెళ్ళి అంగరంగవైభవంగా చేయాలి. ఎందుకంటే మనకు ఒక్కగానొక్క కొడుకాయే!’ అంది. అదే విషయాన్ని రాజు మంత్రితో చెబితే, ఆయనా రాణి అన్నట్లే అన్నాడు. బంధుగణమూ, రాజోద్యోగులూ ‘అవును ఆకాశమంత పందిరేసి, భూదేవంత అరుగేసి చేయాలి’ అన్నారు.రాజుగారు అందరిమాట మన్నించి కుంతల రాకుమారితో యువరాజు వివాహం కనీవినీ ఎరుగనంత వైభవంగా చేశాడు. ఆ వేడుకలు చూసిన రాజ్యంలోని ప్రజలంతా ‘ఇలాంటి పెళ్ళి ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఇక ముందు కూడా జరగబోదు’ అంటూ పొగడటం ప్రారంభించారు. రాజుగారి ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఆ ఆనందం అట్టేకాలం నిలవలేదు. ఒకరోజు చావు కబురు చల్లగా చెప్పాడు మంత్రి.. ఖజానా ఖాళీ అయిందని! ‘పరిష్కారం ఏమిటీ?’ అని రాజుగారు అడిగితే, ‘కొత్త పన్నులు వేసి ధనం రాబట్టడమే’ అన్నాడు మంత్రి. కొత్త పన్నులు విధించాడు రాజు. కొత్తగా పన్నులు వేసినపుడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం రాజుగారికి అలవాటు. అలా రాజు, మంత్రి ఇద్దరూ మారువేషాల్లో బయలుదేరారు.పొద్దుపోయేసరికి రుద్రవరం అనే గ్రామం చేరారు. రాత్రికి అక్కడే సేదదీరి ఉదయాన్నే తిరిగి ప్రయాణం ప్రారంభిద్దామనుకుని, గుడి వద్ద సందడిగా ఉంటే అక్కడికెళ్లారు. గ్రామాధికారి కూతురి పెళ్ళి జరుగుతున్నది. పట్టుమని వంద మంది అతిథులు కూడా లేరు. ‘అంత పెద్ద పదవిలో ఉండి ఇంత నిరాడంబరంగా పెళ్ళి చేస్తున్నాడేమిటీ?’ అని ఆశ్చర్యపోయి రాజుగారు గ్రామస్థుల్ని విచారించాడు. ‘ముందుగా మన రాజుగారిలాగే ఆడంబరాలకు పోయి గ్రామాధికారి తన కుమార్తె వివాహం ఘనంగా చేయాలనుకున్నాడు. ఖర్చులు లెక్కేస్తే లక్షవరహాలు దాటేటట్టు అనిపించింది. ఆయనకది ఇష్టంలేకపోయింది.పెళ్ళి నిరాడంబరంగా జరిపి, ఆ లక్షవరహాలతో ఊర్లో వైద్యశాల నిర్మిస్తే తరతరాలు సేవలందిస్తుందని ఆలోచించాడు. ఇదే విధంగా రాజుగారు కూడా ఆలోచించి ఉంటే అనవసర వ్యయం తగ్గివుండేది. ఆ ధనంతో ఏదైనా సత్కార్యం చేసుంటే తరతరాలు రాజుగారి పేరు చెప్పుకునేవారు. ఆ విధంగా ఆయన చరిత్రలో నిలిచిపోయేవారు. మాకు ఈ కొత్త పన్నుల బాధ తప్పేది’ అన్నారు నిష్ఠూరంగా. రాజుగారికి ఎవరో చెంప ఛెళ్ళుమనిపించినట్లయింది.ఆయన తిరిగి మంత్రితో రాజధాని చేరి, చర్చలు జరిపి కొత్త పన్నులను రద్దు చేశాడు. అంతఃపుర ఖర్చులు తగ్గించాడు. వేట, వినోద కార్యక్రమాల ఖర్చులూ తగ్గించాడు. పాలనలో అనవసర వ్యయాలను తగ్గించాడు. ఆ తర్వాత ఖజానా సులువుగానే నిండింది. అప్పటినుంచి ఆనందవర్మ ఏ కార్యక్రమాన్నయినా ఒకటికి పదివిధాలుగా ఆలోచించి చేయసాగాడు. ఆడంబరాలకు పోక పొదుపు పాటించసాగాడు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా మంచిపేరు సంపాదించుకున్నాడు. – డా. గంగిశెట్టి శివకుమార్ఇవి చదవండి: రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'? -
భీష్ముడు చెప్పిన.. పులి–నక్క కథ!
అంపశయ్య మీదనున్న భీష్ముడి వద్దకు వెళ్లిన ధర్మరాజు ‘పితామహా! లోకంలో కొందరు లోపల దుర్మార్గంగా ఉంటూ, పైకి సౌమ్యంగా కనిపిస్తుంటారు. ఇంకొందరు లోపల సౌమ్యంగా ఉన్నా, పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. అలాంటివాళ్లను గుర్తించడం ఎలా?’ అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు ‘ధర్మనందనా! నువ్వు అడిగిన సందేహానికి నేను పులి–నక్క కథ చెబుతాను’ అంటూ కథను మొదలుపెట్టాడు.‘పూర్వం పురిక అనే నగరాన్ని పౌరికుడు అనే రాజు పాలించేవాడు. బతికినన్నాళ్లు క్రూరకర్మలు చేయడం వల్ల నక్కగా జన్మించాడు. పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల ఈ జన్మలో మంచిగా బతుకుదామని తలచి, అహింసావ్రతం చేస్తూ ఆకులు అలములు తినసాగాడు. ఇది చూసి అడవిలోని తోటి నక్కలు ‘ఇదేమి వ్రతం? మనం నక్కలం. ఆకులు అలములు తినడమేంటి? నువ్వు నక్కల్లో తప్పపుట్టావు. నీకు వేటాడటం ఇష్టం లేకుంటే చెప్పు, మేము వేటాడిన దాంట్లోనే కొంత మాంసం నీకు తెచ్చి ఇస్తాం’ అన్నాయి.పూర్వజన్మ జ్ఞానం కలిగిన నక్క ‘తప్పపుట్టడం కాదు, తప్పనిసరిగా నక్కగా పుట్టాను. నాకు ఆకులు అలములు చాలు. నేను జపం చేసుకునే వేళైంది. మీరు వెళ్లండి’ అని చెప్పి మిగిలిన నక్కలను సాగనంపింది. నక్క అహింసావ్రతం చేçస్తున్న సంగతి అడవికి నాయకుడైన పులికి తెలిసింది. ఒకనాడు పులిరాజు స్వయంగా నక్క గుహకు వచ్చాడు.‘అయ్యా! నువ్వు చాలా ఉత్తముడివని తెలిసింది. నువ్వు నాతో వచ్చేయి. నీకు తెలిసిన మంచి విషయాలు చెబుతూ, నన్ను మంచిదారిలో నడిపించు’ అని వినయంగా ప్రాధేయపడ్డాడు. ‘రాజా! చూడబోతే నువ్వు గుణవంతుడిలా ఉన్నావు. అయినా నేను నిన్ను ఆశ్రయించలేను. నాకు ఐహిక సుఖాల మీద మమకారం లేదు. నీతో రాలేను’ అని బదులిచ్చింది నక్క.‘నాతో రాకపోయినా, నాతో సఖ్యంగా ఉంటూ నాకు మంచీచెడ్డా చెబుతూ ఉండు’ కోరాడు పులిరాజు.‘పులిరాజా! నువ్వూ నేనూ స్నేహంగా ఉంటే, నీతోటి వాళ్లు అసూయ పడతారు. మనిద్దరికీ విరోధం కల్పించడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల కీడు తప్పదు. అందువల్ల నా మానాన నన్ను విడిచిపెట్టు’ బదులిచ్చింది నక్క.‘లేదు మహాత్మా! నీమీద ఎవరేం చెప్పినా వినను. అలాగని మాట ఇస్తున్నాను, సరేనా!’ అన్నాడు పులిరాజు. నక్క సరేనని ఆనాటి నుంచి పులితో సఖ్యంగా ఉండసాగింది.పులిరాజుకు నక్క మంత్రిగా రావడం మిగిలిన భృత్యులకు నచ్చలేదు. నక్క ఉండటం వల్ల తమకు విలువ దక్కడం లేదని అవి వాపోయాయి. చివరకు ఎలాగైనా నక్క పీడ విరగడ చేసుకోవాలని కుట్ర పన్నాయి. ఒకరోజు పులిరాజు గుహలో దాచుకున్న మాంసాన్ని దొంగిలించి, నక్క ఉండే గుహలో దాచిపెట్టాయి.గుహలో మాంసం లేకపోయేసరికి పులిరాజు భృత్యులందరినీ పిలిచి వెదకమని నాలుగు దిక్కులకూ పంపాడు. వెదుకులాటకు తాను కూడా స్వయంగా బయలుదేరాడు. నక్క గుహ దగ్గరకు వచ్చేసరికి మాంసం వాసన పులిరాజు ముక్కుపుటాలను తాకింది. లోపలకు వెళ్లి చూస్తే, తాను దాచిపెట్టుకున్న మాంసమే అక్కడ కనిపించింది.‘ఎంత మోసం!’ పళ్లు పటపట కొరికాడు పులిరాజు.ఈలోగా మిగిలిన భృత్యులంతా అక్కడకు చేరి, ‘మహారాజా! మీరు స్వయంగా గుర్తించబట్టి సరిపోయింది. లేకుంటే, నక్క ఏమిటి? అహింసావ్రతమేమిటి? మీ ఆజ్ఞకు భయపడి ఊరుకున్నామే గాని, దీని సంగతి ఇదివరకే మాకు తెలుసు’ అన్నాయి.‘వెళ్లండి. ఈ ముసలినక్కను బంధించి, వధించండి’ ఆజ్ఞాపించాడు పులిరాజు.ఇంతలో పులిరాజు తల్లి అక్కడకు వచ్చింది. ‘ఆగు! వివేకం లేకుండా ఏం చేస్తున్నావు? భృత్యులు చెప్పేదంతా తలకెక్కించుకునేవాడు రాజుగా ఉండతగడు. అధికులను చూసి హీనులు అసూయపడతారు. ఇలాంటివాళ్ల వల్లనే ఒకప్పుడు ధర్మం అధర్మంలా కనిపిస్తుంది. అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. రాజు దగ్గర సమర్థుడైన మంత్రి ఉంటే, తమ ఆటలు సాగవని దుష్టులైన భృత్యులు నాటకాలాడతారు. అలాంటివాళ్లను ఓ కంట కనిపెట్టి ఉండాలి’ అని హితబోధ చేసింది.పులిరాజు తన భృత్యుల మోసాన్ని గ్రహించాడు. వెంటనే నక్కను పిలిచి, ‘మహాత్మా! నావల్ల పొరపాటు జరిగిపోయింది. మన్నించు. దుర్మార్గులైన నా భృత్యులను దండిస్తాను’ అని వేడుకున్నాడు.‘పులిరాజా! తెలిసిగాని, తెలియకగాని ఒకసారి అనుమానించడం మొదలుపెట్టాక తిరిగి కలుపుకోవాలని అనుకోవడం అవివేకం. ఒకవేళ నువ్వు నాతో సఖ్యంగా ఉండాలనుకున్నా, ఇక నాకిక్కడ ఉండటం ఇష్టంలేదు’ అంటూ పులి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. నిరాహారదీక్షతో శరీరం విడిచి, సద్గతి పొందింది.రాజు ఎన్నడూ చెప్పుడు మాటలకు లోబడకూడదు. మంచిచెడులను గుర్తెరిగి, మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో తెలుసుకుని మసలుకోవాలి’ అని ధర్మరాజుకు బోధించాడు భీష్ముడు. – సాంఖ్యాయనఇవి చదవండి: రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా! -
ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..!
సాక్షి, సిటీబ్యూరో: జిమ్కు వెళ్లడం అనేది శారీరక వ్యాయామం, ఆరోగ్యం కోసం అనేది అందరికీ తెలిసిన విషయం. నాణేనికి మరో వైపు ఆదాయ మార్గం ఉంది. శరీర సౌష్టవం కలిగిన వారికి పార్ట్టైం, ఫుల్ టైం ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నగరంలో వందలాది కుటుంబాలు ఈ రకంగా ఉపాధి పొందుతున్నాయి. కండలు తిరిగిన యువత బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనడం, ఉన్నత శ్రేణి కుటుంబాలకు బాడీగార్డులుగా, ఈవెంట్స్, ప్రముఖ వ్యాపార సంస్థలకు బౌన్సర్లుగా రాణిస్తున్నారు. దీంతో వీరికి ఉపాధితో పాటు సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది.నిత్యం జిమ్ చేస్తూ ఆరోగ్యంగా, బలంగా ఉన్న వారికి మార్కెట్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న వారికి పార్ట్ టైం, ఫుల్ టైం రెండు రకాల ఉద్యోగాలూ లభిస్తున్నాయి. భాగ్యనగరంలో రాజకీయ నాయకులు తమ రక్షణ కోసం ప్రైవేటుగా బాడీగార్డులను నియమించుకుంటున్నారు. ఏవైనా జన సమీకరణ కార్యక్రమాలు ఉన్నపుడు బౌన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఉన్నత శ్రేణి కుటుంబాలు, సినిమా, ఇతర సెలబ్రిటీలు బయటకు రావాలన్నా, ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా బౌన్సర్లను పెట్టడం అలవాటుగా మారిపోయింది. కొన్ని వర్గాలకు బౌన్సర్లను పెట్టుకోవడం స్టేటస్గానూ భావిస్తున్నారు. దీంతో నగరంలో బౌన్సర్లకు డిమాండ్ పెరుగుతోంది.ఈవెంట్స్ను బట్టి..ఒక్కో ఈవెంట్కు అక్కడ పరిస్థితులను బట్టి 8 గంటలు, 12 గంటలు, 24 గంటలు ఇలా సమయాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తారు. బౌన్సర్లకు 8 గంటలకు కనీసం రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ ఇస్తున్నారు. 12 గంటలు, ఆపై సమయాన్ని బట్టి లెక్కలు ఉంటాయి. మరోవైపు పబ్లు, పేరొందిన రెస్టారెంట్లు, స్టార్ హోటల్స్, ప్రముఖ దుకాణాల్లోనూ నెలవారీ వేతనాలకు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. బాడీగార్డు, బౌన్సర్లకు నెలకు కనీసం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ చెల్లిస్తున్నారు.17 ఏళ్ల వయసు నుంచి..నాకు 17 ఏళ్ల వయసు నుంచి జిమ్కు వెళ్లడం ప్రారంభించాను. ఇపుడు 30 ఏళ్లు. తొలి రోజుల్లో ఆరోగ్యం, శరీర సౌష్టవం కోసం వెళ్లాను. అందరిలోనూ మనం ప్రత్యేకంగా ఉండాలని ఆలోచించాను. శరీరం ఆకర్షణీయమైన ఆకృతిలో తయారయ్యింది. తదుపరి రోజుల్లో బౌన్సర్గా అవకాశాలు వచ్చాయి. కొన్నాళ్ల తరువాత సొంతంగా బిజినెస్ ప్రారంభించాను. ప్రస్తుతం పార్ట్ టైం బౌన్సర్గా పనిచేస్తున్నాను. ఈవెంట్స్ ఉన్నపుడు వెళుతున్నా. 8 గంటలకు కనీసం రూ.1500 ఆపైన వస్తాయి. 12 గంటలు అయితే రూ.2 వేల వరకూ ఇస్తున్నారు. ఈ ఆదాయం ఆర్థిక వెసులుబాటు కలి్పస్తుంది. – అమోల్, బౌన్సర్, బంజారాహిల్స్పర్సనల్ బాడీగార్డుగా..గత పదేళ్ల నుంచి జిమ్కు వెళుతున్నాను. డైట్ పాటిస్తాను. ఆరోగ్యంగా, శారీరకంగా ఫిట్గా ఉంటాను. నాకు తెలిసిన వారి రిఫరెన్స్ ద్వారా పర్సనల్ బాడీగార్డుగా చేరాను. నమ్మకంగా పనిచేసుకుంటున్నాను. మంచి వేతనం వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతృప్తికరమైన జీవితం సాగిస్తున్నాను. – ఆదిల్, జూబ్లీహిల్స్ఇవి చదవండి: Pooja Bedi: ప్రతి విషాదం.. నన్ను దృఢం చేసింది! -
పందొమ్మిదేళ్లకు.. ‘ఫ్యామిలీ ట్రీ’ట్!
జపాన్లోని ఒసాకా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్లో ఒక విద్యార్థి రిన్. ఇరవై ఏళ్ల రిన్ని ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా కాలేజీ వాళ్లు ‘ఫ్యామిలీ ట్రీ’ తయారుచేయమన్నారు. తల్లి తప్ప మరెవరూ లేకపోవడంతో తండ్రి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించాడు రిన్. తల్లి సచియే తకహతాను అడిగాడు. తల్లి–తండ్రి విడిపోయే సమయంలో రిన్ వయసు కేవలం ఒక సంవత్సరం మాత్రమే. వారు విడిపోయిన తర్వాత ఇద్దరి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ‘ఆధారాల కోసం వెతికే క్రమంలో కొన్ని పాత ఫ్యామిలీ ఫొటోలు, తండ్రి సుఖ్పాల్ పేరు, అమృతసర్ అడ్రస్ దొరికాయి. గూగుల్ మ్యాప్లో లొకేషన్ కోసం వెతికి, టికెట్ బుక్ చేసుకొని ఆగస్టు 15న పంజాబ్లోని అమృత్సర్కి చేరుకున్నాడు.అయితే విధి అతన్ని మరింతగా పరీక్ష పెట్టింది. సుఖ్పాల్ అక్కడి నుండి ఎప్పుడో వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాడని తెలిసింది. తండ్రి ప్రస్తుతం ఉంటున్న అడ్రెస్ ఎవరూ చెప్పలేకపోయారు. ‘నా దగ్గర మా నాన్న పాత ఫొటోలు ఉండటంతో స్థానిక ప్రజలను అడిగి కనుక్కోవడానికి ప్రయత్నించాను. చాలా మందిని అడిగాక అదృష్టం కొద్దీ ఒక వ్యక్తి నా తండ్రి ఫొటో గుర్తించి, అతని కొత్త చిరునామా నాకు ఇచ్చే ఏర్పాటు చేశాడు. అలా 19 ఏళ్ల తర్వాత మా నాన్నను మళ్లీ కలవగలిగాను’ అని తండ్రిని కలుసుకున్న ఉద్విగ్న క్షణాలను పంచుకుంటున్నాడు రిన్.‘ఇలా జరుగుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ, జరిగింది. నా ప్రస్తుత భార్య గుర్విందర్జిత్ కౌర్, నా ఏకైక కుమార్తె అవ్లీన్ కూడా రిన్ను కుటుంబంలోకి హృదయపూర్వకంగా స్వాగతించినందుకు సంతోషంగా ఉన్నాను. నా మాజీ భార్య సచియేతో ఫోన్లో మాట్లాడాను. రిన్ క్షేమం గురించి చె΄్పాన’ని సుఖ్పాల్ కొడుకును కలుసుకున్న మధుర క్షణాలను పంచుకుంటున్నాడు.రక్షాబంధన్ రోజే...రిన్ తండ్రి కుటుంబాన్ని కలవడం, పండగప్రాముఖ్యతను గురించి తెలుసుకొని, ఆ రోజు సవతి సోదరి అవ్లీన్ చేత రాఖీ కట్టించుకోవడం.. వంటివి రిన్ను థ్రిల్ అయ్యేలా చేశాయి. ‘మా సోదర–సోదరీ బంధం చాలా బలమైనది’ అని ఆనందంగా చెబుతాడు రిన్.కొడుకును అమృత్సర్కి తీసుకెళ్లి..ఇన్నేళ్లకు వచ్చిన కొడుకును వెంటబెట్టుకొని సుఖ్పాల్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించుకున్నాడు. అటారీ వాఘా సరిహద్దులో జరిగిన జెండా వేడుకను వీక్షించారు. సుఖ్పాల్ తన గతాన్ని వివరిస్తూ ‘2000 సంవత్సరం మొదట్లో థాయ్లాండ్ విమానాశ్రయంలో భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు అనుకోకుండా సచియేను చూశాను. విమానంలో మా సీట్లు పక్కపక్కనే ఉన్నాయి. అలా మా మొదటి సంభాషణ జరిగింది. ఆమె వరుసగా ఎర్రకోట, తాజ్మహల్లను సందర్శించడానికి న్యూఢిల్లీ, ఆగ్రాకు వెళుతోంది.గోల్డెన్ టెంపుల్ గురించి చెప్పి, అమృత్సర్కి తన పర్యటనను పొడిగించమని సచియేని నేనే అడిగాను. ఆమె వెంటనే ‘ఓకే’ చెప్పి అమృత్సర్కి నాతో పాటు వచ్చింది. మా కుటుంబంతో కలిసి 15 రోజులకు పైగా ఉంది. ఇక్కడ ఉన్న సమయంలో స్థానిక పర్యాటక ప్రదేశాలతో పాటు ఎర్రకోట, తాజ్మహల్ను సందర్శించాం. సచియే జపాన్కు వెళ్లాక కూడా ఇద్దరం ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. అప్పుడు తనకు 19 ఏళ్లు, నాకు 20 ఏళ్లు. 2002లో సచియేను వివాహం చేసుకుని, జపాన్ పర్యటనకు వెళ్లాను. ఏడాది తర్వాత రిన్ జన్మించాడు. నేను జపనీస్ నేర్చుకున్నాను. అక్కడ చెఫ్గా పని చేశాను.కొన్ని రోజుల తర్వాత మేం కొన్ని కారణాల వల్ల కలిసి ఉండలేకపోయాం. దీంతో నేను భారతదేశానికి తిరిగి వచ్చేశాను. ఆమె రిన్తో కలిసి నన్ను చూడటానికి భారతదేశం వచ్చింది. మరోసారి తనతో కలిసి జపాన్కు వెళ్లాను. కానీ, కలిసి ఉండలేకపోయాం. 2004లో విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత మూడేళ్ళు జపాన్లోనే ఉన్నా కానీ, వారిని కలవలేదు. 2007లో స్వదేశానికి తిరిగి వచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు మేమంతా రిన్తో టచ్లో ఉంటాం’ అని గత స్మృతులను, ప్రస్తుత ఆనందాన్ని ఏకకాలంలో పొందుతూ ఆనందంగా చెబుతున్నాడు సుఖ్పాల్. -
Rakshitha: కాళ్లే కళ్లయ్యి..
కళ్లు మూసుకొని నాలుగడుగులు వేయలేము. కళ్లు కనపడకుండా పరిగెత్తగలమా? ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్లో పారా ఒలింపిక్స్ జరగనున్నాయి. ఒలింపిక్స్లో మన క్రీడాకారులు తేలేని బంగారు పతకం మన దివ్యాంగ క్రీడాకారులు తెస్తారని ఆశ. కర్ణాటకకు చెందిన అంధ అథ్లెట్ రక్షిత రాజు 1500 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనబోతున్న తొలి భారతీయ పారా అథ్లెట్గా చరిత్ర సృష్టించనుంది. పతకం తెస్తే అది మరో చరిత్ర. రక్షిత రాజు పరిచయం.అక్టోబర్ 26, 2023.రక్షిత రాజుకు ఆనందబాష్పాలు చిప్పిల్లుతున్నాయి. కన్నీరు కూడా ఉబుకుతోంది. ఆమె హాంగ్జావు (చైనా) పారా ఆసియా గేమ్స్లో 1500 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది. చాలా పెద్ద విజయం ఇది. ఈ విషయాన్ని ఆమె తన అమ్మమ్మతో పంచుకోవాలనుకుంటోంది. కాని పంచుకోలేక΄ోతోంది. కారణం? అమ్మమ్మకు వినపడదు. చెవుడు. మాట్లాడలేదు. మూగ. కాని ఆ అమ్మమ్మే రక్షితను పెంచి పెద్ద చేసింది. ఆమె వెనుక కొండలా నిలుచుంది. ఆ ఘట్టం బహుశా ఏ సినిమా కథకూ తక్కువ కాదు. నిజజీవితాలు కల్పన కంటే కూడా చాలా అనూహ్యంగా ఉంటాయి.ఊరు వదిలేసింది..కర్నాటకలోని చిక్బళ్లాపూర్లోని చిన్న పల్లెకు చెందిన రక్షిత రాజు పుట్టుకతోనే అంధురాలు. ఆమెకు నాలుగు సంవత్సరాలు ఉండగా తల్లిదండ్రులు మరణించారు. దాంతో ఊరంతా రక్షితను, ఆమె చిన్నారి తమ్ముణ్ణి నిరాకరించారు. చూసేవాళ్లు ఎవరూ లేరు. అప్పుడు రక్షిత అమ్మమ్మ వచ్చి పిల్లలను దగ్గరకు తీసుకుంది. ఆమె స్వయంగా చెవుడు, మూగ లోపాలతో బాధ పడుతున్నా మనవళ్ల కోసం గట్టిగా నిలుచుంది. మనవరాలిని చిక్బళ్లాపూర్లో అంధుల కోసం నిర్వహిస్తున్న ఆశాకిరణ్ స్కూల్లో చదివించింది. అక్కడి హాస్టల్లో ఉంటూ అప్పుడప్పుడు అమ్మమ్మ వచ్చి పలుకరిస్తే ధైర్యం తెచ్చుకునేది. అంధత్వం వల్ల భవిష్యత్తు ఏమీ అర్థం అయ్యేది కాదు. దిగులుగా ఉండేది.వెలుతురు తెచ్చిన పరుగు..ఆశా కిరణ్ స్కూల్లో మంజన్న అనే పీఈటీ సారు రక్షిత బాగా పరిగెత్తగలదని గమనించి ఆమెను ఆటల్లో పెట్టాడు. స్కూల్లో ఉన్న ట్రాక్ మీద పరిగెట్టడం ్రపాక్టీసు చేయించాడు. జైపూర్లో పారా గేమ్స్ జరిగితే తీసుకెళ్లి వాటిలో పాల్గొనేలా చేశాడు. అక్కడే రాహుల్ అనే కర్ణాటక అథ్లెట్ దృష్టి రక్షిత మీద పడింది. ఈమెను నేను ట్రెయిన్ చేస్తాను అని చెప్పి ఆమె బాధ్యత తీసుకున్నాడు. అప్పటివరకూ సింథెటిక్ ట్రాక్ అంటేనే ఏమిటో రక్షితకు తెలియదు. రాహుల్ మెల్లమెల్లగా ఆమెకు తర్ఫీదు ఇచ్చి అంతర్జాతీయ స్థాయి పారా అథ్లెట్గా తీర్చిదిద్దాడు.గైడ్ రన్నర్ సాయంతో..అంధ అథ్లెట్లు ట్రాక్ మీద మరో రన్నర్ చేతిని తమ చేతితో ముడేసుకుని పరిగెడతారు. ఇలా తోడు పరిగెత్తేవారిని ‘గైడ్ రన్నర్‘అంటారు. అంతర్జాతీయ ΄ోటీల్లో రాహులే స్వయంగా ఆమెకు గైడ్ రన్నర్గా వ్యవహరిస్తున్నాడు. హాంగ్జావులో 1500 మీటర్లను రక్షిత 5 నిమిషాల 21 సెకన్లలో ముగించింది. ‘చైనా, కిర్గిజ్స్తాన్ నుంచి గట్టి ΄ోటీదారులు వచ్చినా నేను గెలిచాను. పారిస్ లో జరిగే పారా ఒలింపిక్స్లో స్వర్ణం సాధించగలననే ఆత్మవిశ్వాసం కలిగింది’ అంటుంది రక్షిత.అదే సవాలు..అంధులు పరిగెత్తడం పెద్ద సవాలు. వారు గైడ్ రన్నర్ సాయంతోనే పరిగెత్తాలి. ‘మాతోపాటు ఎవరైనా పరిగెత్తొచ్చు అనుకుంటారు. కాని గైడ్ రన్నర్లకు, మాకు సమన్వయం ఉండాలి. మమ్మల్ని పరిగెత్తిస్తూ వారూ పరిగెత్తాలి. ఎంతోమంది ప్రతిభావంతులైన అంధ రన్నర్లు ఉన్నా గైడ్ రన్నర్లు దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. ఒకప్పుడు నా కళ్ల ఎదుట అంతా చీకటే ఉండేది. ఇప్పుడు పరుగు నాకు ఒక వెలుతురునిచ్చింది. పారిస్లో స్వర్ణం సాధించి తిరిగి వస్తాను’ అంటోంది రక్షిత. -
స్వీయ క్రమశిక్షణ..
మనం అభివృద్ధి చేయగల అత్యంత ముఖ్యమైన జీవన నైపుణ్యాలలో స్వీయ–క్రమశిక్షణ ఒకటి. ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నపుడు ఆ మార్గంలో ఎలాంటి ప్రలోభాలు, ఆకర్షణలు ఎదురైనా వాటికి ఏ మాత్రం ప్రభావితం కాకుండా మనస్సుని నియంత్రించుకుని.. చేస్తూన్న పనిపైనే సంపూర్ణమైన దృష్టిని కేంద్రీకరించడమే‘ స్వీయ క్రమశిక్షణ‘. స్వీయ–క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది. నమ్మకమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ఇది సమయపాలన కూడా నేర్పుతుంది. అలాగే, తనను తాను మలచుకోవడానికి, అభివృద్ధి సాధించడానికి ఇంధనంగా పనిచేస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. పరధ్యానాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అలాగే, ఒత్తిడిని దూరం చేస్తూ, కష్టతరమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా... ధైర్యంగా ఎలా ఉండవచ్చో అవగతం చేస్తుంది.వివిధ కార్యకలాపాలకు ఎలాంటి ప్రణాళికలు అవలంబించాలో, ఎలా నిర్వహించాలో నేర్పుతుంది. స్వీయ–క్రమశిక్షణ కలిగిన వారు తమ లక్ష్యాలపై దృష్టిసారిస్తే, పరీక్షలలో బాగా రాణించడానికి, వారి అభ్యాస లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. ఇతర జీవిత నైపుణ్యాల మాదిరిగానే, స్వీయ–క్రమశిక్షణలో ్రపావీణ్యం సంపాదించడానికి చాలా సంవత్సరాల అభ్యాసం అవసరం. అయితే ఇది బాహ్యంగా ఎవరో మనల్ని అదుపు చేస్తుంటే అలవరచుకునేదిలా కాకుండా మనకు మనమే పరి చేసుకునేలా ఉండాలి. గాంధీజీ, అబ్దుల్ కలామ్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ ఆల్వా ఎడిసన్, అబ్రహాం లింకన్, హెన్రీఫోర్డ్, ఆండ్రో కార్నెగీ, వాల్ట్ డిస్నీ, బరాక్ ఒబామా వంటి మహనీయులంతా తమ తమ జీవితాలలో పాటించిన ‘ స్వీయ క్రమశిక్షణ వల్లే ఉన్నత శిఖరాలకు చేరుకుని, జననీరాజనాలందుకున్నారు.కనుక స్వీయ క్రమశిక్షణను సరైన వయస్సులో నేర్పించి అలవాటు చేసినట్లయితే అది జీవితాంతం మన వ్యక్తిగత అభివృద్ధికి, విజయ సాధనకు సహాయపడుతుంది. స్వీయ క్రమశిక్షణను అలవరచుకోవడానికి ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపించుకుని సాధన చేస్తే స్వీయ క్రమశిక్షణ మన సొంతమై, అనేక విజయాలను సంపాదించి పెడుతుంది. ఇది మన భవిష్యత్ గమ్యాన్ని దిశానిర్దేశం చేయడంతో పాటు, మన జీవితానికి ఓ అర్ధాన్ని, పరమార్థాన్ని అందించి పెడుతుంది. కనుక ఏ మనిషైతే స్వీయ క్రమశిక్షణను అలవరచుకుంటాడో, అలాంటి వారు జీవితంలో అత్యంత సులువుగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి అనిపించుకోదు."స్వీయ క్రమశిక్షణ అనేది ఓ గొప్ప వ్యక్తిత్వపు లక్షణం. ఇది నిరంతరం చేయాల్సిన తపస్సు లాంటిది. ఒకానొక విద్యార్థి తన జీవితంలో పాటించే స్వీయ క్రమశిక్షణ ఆ విద్యార్థి పూర్తి జీవితానికి బంగారు బాట అవుతుంది." – దాసరి దుర్గా ప్రసాద్ -
Fashion: మనుసుకు నచ్చిన రంగులు.. కలర్ – కంఫర్ట్!
‘మనసుకు నచ్చిన రంగులు ఉండాలి. ట్రెండ్కు తగినట్టు ఉండాలి. స్పెషల్ లుక్ అనిపించాలి. అన్నింటికి మించి సౌకర్యంగా ఉండాలి’అంటూ ఎంచుకునే డ్రెస్సింగ్ విషయంలో తీసుకునే జాగ్రత్తల గురించి హైదరాబాద్లోని అత్తాపూర్లో ఉంటున్న నిఖితారెడ్డి తన వార్డ్రోబ్ ముచ్చట్లను ఈ విధంగా పంచుకున్నారు.ఐదేళ్ల లోపు పిల్లలకు ఎంబ్రాయిడరీ డ్రెస్సులు ఆన్లైన్లో చాలా డిజైన్స్ వస్తున్నాయి. నా శారీ కలర్ లేదా పార్టీ థీమ్ కలర్ని బట్టి వాటిని ఎంపిక చేసుకుంటాను. పాప వేసుకున్న పింక్ కలర్ లెహంగా, దుపట్టా అలా ప్లాన్ చేసిందే. పట్టు డ్రెస్సులు మాత్రం మెటీరియల్ తీసుకొని, స్టిచింగ్ చేయిస్తాను.కలర్ కాంబినేషన్స్..నా ఫేవరెట్ కలర్స్ ఆరెంజ్, పింక్. దీంతో నా వార్డ్రోబ్లో ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్సులు ఎక్కువ చేరుతుంటాయి. అయితే, ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. చుడీదార్ ఎంపిక చేసుకున్నా ఒక చిన్న ఆరెంజ్ ఎలిమెంట్ అయినా ఉండాలి. ఇదే కాంబినేషన్లో బేబీ షవర్ సమయంలో మా ఫ్యామిలీ షూట్కి పట్టుచీర, కుర్తా పైజామా సెట్ ఆరెంజ్ కాంబినేషన్ ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాం.సెలబ్రిటీ స్టయిల్..ఆరెంజ్ శారీ స్టైల్లో నటి అదితీరావు హైదరీ ఫొటో సోషల్ మీడియా లో చూశాను. నాకు బాగా నచ్చింది. ఆ విధంగా ఉండాలని ఆరెంజ్ శారీ, బ్లౌజ్ మెటీరియల్ అన్నీ సొంతంగా ఎంపిక చేసుకుని, డిజైన్ చేయించుకున్నాను. ముత్యాలు, పచ్చలు, కుందన్స్ కాంబినేషన్ జ్యువెలరీని దానికి సెట్ చేశాను.మిక్స్ అండ్ మ్యాచ్..పెళ్లి సమయంలో తీసుకున్న చీరలు, అమ్మవాళ్లు కానుకగా ఇచ్చినవి.. ప్రత్యేక సందర్భాలలో వేసుకోవడానికి బ్లౌజ్ డిజైన్స్ ద్వారా మార్పులు చేస్తుంటాను. కానీ, చాలా వరకు ఏ డ్రెస్ సెట్ ఎలా ఉంటే అలాగే వేసుకోవాలనుకుంటాను. పెద్దగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయను.థీమ్ పార్టీలు..ముందుగా కంఫర్ట్గా ఉండే డ్రెస్సులకే ్రపాధాన్యత ఇస్తాను. ఇప్పుడు మదర్ డాటర్ కాంబినేషన్ సెట్స్ వస్తున్నాయి. వాటిని ప్లాన్ చేస్తాను. అలాగే, పాపకు నాకు బర్త్ డే గిఫ్ట్స్ డ్రెస్సులు వస్తుంటాయి. వాటిని చిన్న మార్పులతో థీమ్డ్ పార్టీలకు ప్లాన్ చేస్తాను.ఎంబ్రాయిడరీ.. క్వాలిటీ ఫస్ట్..ఫ్లోరల్ ప్రింట్స్ స్టోర్స్లోనూ ఆన్లైన్లోనూ మార్కెట్లో ఎంపిక చేసుకుంటాను. కానీ, ఎంబ్రాయిడరీ అయితే కొన్ని ప్రత్యేకమైన చోట్లనే బాగుంటాయి. డిజైన్ పరంగానూ, క్వాలిటీ పరంగానూ బాగున్నవి అయితేనే ఎంబ్రాయిడరీ డ్రెస్సులను ఎంపిక చేసుకుంటాను.ఫ్లోరల్స్..దగ్గరి బంధువుల పెళ్లిలో ప్రతిదీ వేడుకగా ఉండాల్సిందే. ముఖ్యంగా సంగీత్, హల్దీ, రిసెప్షన్.. వంటి వేడుకలకు వైవిధ్యంగా ఉండాలి. హల్దీ ఫంక్షన్ కోసం రెడీ అవ్వడానికి ఫ్లోరల్ డిజైన్స్, ఫ్లోరల్ జ్యువెలరీ బాగుంటుంది. ఇందుకు ఆన్లైన్ మార్కెట్లోనూ మంచి మంచి మోడల్స్ లభిస్తున్నాయి. ఫ్లోరల్ డిజైన్స్ అలా ఎంపిక చేసుకుని తీసుకున్నవే. మా కజిన్ హల్దీ ఫంక్షన్కి డ్రెస్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వెస్ట్రన్ స్టయిల్..బ్లాక్ థీమ్డ్ డ్రెస్ను న్యూ ఇయర్ సందర్భంగా, కజిన్స్తో బర్త్డేస్కు వెళ్లాలంటే మోడర్న్గా ఉండేవి ప్లాన్ చేసుకుంటాను.ప్రయాణాలకు ఒక స్టయిల్..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎగ్జిబిషన్స్ స్టాల్స్ పెడుతుంటారు. వాటిలో లాంగ్ ఆరెంజ్ ఫ్రాక్ ఎంపిక చేసుకున్నాను. ఇలాంటివి టూర్స్కి వెళ్లినప్పుడు వేసుకుంటాను. వాటిల్లో ఫొటోస్ కూడా బ్రైట్గా వస్తాయి. అలాగే, లాంగ్ ఫ్రాక్స్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉండేలా చూసుకుంటాను. -
ది వార్ విత్ ఇన్! అడుగడుగునా అంతులేని ధైర్యం!
మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్–ప్లేయింగ్ గేమ్ ‘వరల్డ్ క్రాఫ్ట్: ది వార్ విత్ఇన్’ ఈ నెల 26న విడుదల కానుంది. ‘వరల్డ్ ఆఫ్ వార్క్రాఫ్ట్’కు ఎక్స్΄ాన్షన్ ప్యాక్గా వస్తున్న గేమ్ ఇది. 2004లో వచ్చిన ‘వరల్డ్ ఆఫ్ వార్క్రాఫ్ట్’లో ప్లేయర్ ‘క్యారెక్టర్ అవతార్’ను క్రియేట్ చేసి థర్ట్ లేదా ఫస్ట్–పర్సన్ వ్యూ నుంచి ఓపెన్ గేమ్ వరల్డ్ను ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది.ఇక ‘ది వార్ విత్ఇన్’ విషయానికి వస్తే... ఈ గేమ్లో ఖాజ్ అల్గార్ అనేది ప్రైమరీ సెట్టింగ్. ది ఇజెల్ ఆప్ డోర్న్, ది రింగింగ్ డీప్స్, హాలోఫాల్, అజి–కహెట్ అనే నాలుగు జోన్లుగా విభజించబడి ఉంటుంది.ఈ గేమ్లో ‘డైనమిక్ ఫ్లైయింగ్’ అనే ఫీచర్ ఉంది. న్యూ గేమ్స్ను ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.సిరీస్: వార్క్రాఫ్ట్;ప్లాట్ఫామ్: విండోస్, మ్యాక్వోఎస్;మోడ్: మల్టీప్లేయర్జానర్: ఎంఎంఆర్పీజీ (మాస్వ్లీ మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్–ప్లేయింగ్ గేమ్) -
కథ చెబుతాం.. ఊ కొడతారా..!
‘అనగనగా ఓ మహారాజు ఉన్నాడు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. ఏడుగురూ వేటకువెళ్లి ఏడు చేపలు తెచ్చారు...’ ఇలా పిల్లలకు పాత కథలు మాత్రమే తప్ప కొత్త కథలు, కొత్తగా చెప్పడం రాని ఆధునిక తల్లిదండ్రులు.. కథలు నేర్పే స్టోరీ టెల్లర్స్ దగ్గర బారులు తీరుతున్నారు. వీరు మాత్రమే కాదు పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ల నుంచి కార్పొరేట్ ఉద్యోగులకు పాఠాలు చెప్పే కౌన్సిలర్స్ వరకూ అందరూ కథా కళ..లో నైపుణ్యం కోసం క్యూ కడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రధానంగా నగరంలో ఈ కళకు డిమాండ్ తీసుకురావడంతో తల్లిదండ్రులే మహారాజు పోషకులుగా కనిపిస్తున్నారు. పిల్లలకు కథలు చెప్పడం మానసిక వికాసానికి మార్గమని సైకాలజిస్ట్లు సూచిస్తుండడం ఈ పోకడకు ఆజ్యం పోస్తోంది. పిల్లలకు కథలు చెప్పడం కేవలం వినోదం కాదని, ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఇది తప్పనిసరి అని చెబుతున్నారు స్టోరీ టెల్లర్ దీపాకిరణ్. కథలు చెప్పడం వల్ల పెద్దలు, పిల్లల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని అన్నారామె.ప్రయోజనాలెన్నో...సంభాషించడానికి మాత్రమే కాదు నేర్చుకోవడానికీ.. ఆలోచనల్లో పరిణితికీ భాష అవసరం. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్నారుల్లో భాషా పరిజ్ఞానం సంతరించుకోవడం ఆలస్యం కావడం సహజంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్నారులను ఆకట్టుకునేలా కథలు చెప్పడం నేర్చుకున్న పెద్దలు ఆ నైపుణ్యాన్ని పిల్లలకు అందిస్తారు. కథల ద్వారా సంస్కృతి గురించి నేర్పవచ్చు. అలాగే ప్రవర్తనను తీర్చిదిద్దవచ్చు అంటున్నారు నిపుణులు.మనవడికి కథలు చెబుతున్నా...కొన్ని రోజుల క్రితం నా పదేళ్ల మనవడు అమ్మమ్మా కథ చెప్పమని నన్ను అడగడం నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్ కాలంలో కూడా పెద్దల నోటి ద్వారా కథలు వినడానికి పిల్లలు ఇష్టపడుతున్నారని నాకు అర్థమైంది. స్టోరీ టెల్లింగ్ వర్క్షాప్కి అటెండ్ అయ్యి కొత్త కొత్త కథలు, ఆకట్టుకునేలా చెప్పగలడం అనేది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నా మనవడు/మనవరాళ్లతో అనుబంధం మరింత బలోపేతం చేసింది. – భారతి రామినేనిమెళకువలు నేర్చుకుంటే మేలెంతో..స్టోరీ టెల్లింగ్ సెషన్స్కి హాజరవడం వల్ల కథకు సంగీతాన్ని జత చేయడం, ముఖ కవళికలు, గొంతు పలికే తీరులో మార్పుచేర్పులు చూపడం.. వంటివి నేర్చుకుని నా మూడేళ్ల కొడుకుకి మంచి కథలు చెప్పగలుగుతున్నా. తనతో అనుబంధాన్ని మరింతగా ఆనందిస్తున్నా. – దాసన్నకళ అబ్బింది.. కథ వచ్చింది.. కథలు చెప్పడమే కదా ఎంత సేపు అనుకుంటాం కానీ.. ఈ ఆర్ట్ను నేర్చుకుంటే.. జీవితంలో ప్రతీ సందర్భాన్ని ఒక కథగా మలిచే సామర్థ్యం వస్తుంది. సంగీతాన్ని కలుపుతూ మా అబ్బాయికి కథ చెప్పడం, కథలోని క్యారెక్టర్స్ ఆవాహన చేసుకుని చెప్పడం వంటివి తనకి బాగా కనెక్ట్ అవుతోంది. తన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి బాగా ఉపకరిస్తోంది. విశేషం ఏమిటంటే తనే కథలు అల్లేసి నాకు చెబుతున్నాడు. – సుధారాణిప్రొఫెషనల్ లైఫ్లో ప్రజెంటేషన్స్కూ..ఓ ఐటీ కంపెనీలో పనిచేసే నాకు వృత్తి జీవితంలో స్టోరీ టెల్లింగ్ సామర్థ్యం ఉపకరించింది. ముఖ్యంగా పలు అంశాలపై ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి సహకరించాయి. నిజానికి నా సోదరి కూతుర్ని పెంచాల్సిన బాధ్యత వల్ల స్టోరీటెల్లింగ్ నేర్చుకోవాల్సి వచి్చంది. అలా నేర్చుకుని తనకు చెప్పిన కొన్ని కథలు తనని క్లాస్లో టాపర్గా మార్చాయి. మంచి హాబీస్ను అలవర్చాయి. తను ఎప్పుడైనా ఏడుపు ముఖం పెట్టిందంటే నేను అనగనగా అనగానే ముఖ కవళికలు మార్చేసి ఆసక్తిగా చూస్తుంది. కథలు చెప్పడం వల్ల నా కూతురికి కూడా చాలా మానసిక వికాసం వచ్చేలా చేయగలిగాను. చాలా ఇళ్లలో పిల్లల వల్ల ఎదురయ్యే అల్లరి చిల్లరి ఇబ్బందులెప్పుడూ నాకు ఎదురు కాలేదు. దానికి కారణం కథలే అని చెప్పగలను. అందరు పిల్లలూ వీడియోగేమ్స్లో బిజీగా ఉండే సమయంలో మా పిల్లలు నన్ను కథ చెప్పవా అని అడుగుతారు. – వసుధకథలతో అనుబంధాలు బలోపేతం..స్టోరీటెల్లింగ్ అనే కళలో నైపుణ్యం సాధించే విషయంలో టీచర్లతో పాటు అవ్వా, తాతలకు, తల్లిదండ్రులకు బాగా ఆసక్తి పెరిగి మా స్టోరీ సూత్ర సంస్థను సంప్రదిస్తున్నారు. కథలు చెప్పే కళలో నైపుణ్యం సాధించిన వారు ఇలా పిల్లలతో తమ మధ్య అనుబంధం బలపడిందని, అంతిమంగా అది తమ ఆరోగ్యానికి, ఆనందానికి సైతం ఉపకరిస్తోందని చెబుతున్నారు. – దీపాకిరణ్, స్టోరీ టెల్లర్ -
క్యాన్సర్ కాటుకు వర్కవుట్.. ఫిట్ ఫర్ టాట్!
హీనా ఖాన్ ప్రముఖ నటి. హిందీ టీవీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. కెరీర్ కాంతిపుంజంలా వెలుగుతున్న కాలంలో అనారోగ్యం ఆమె మీద దాడి చేసింది. ఆమె తాను బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు గుర్తించేటప్పటికే మూడవ దశకు చేరినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే క్యాన్సర్ బారిన పడినందుకు ఏ మాత్రం కుంగిపోవడంలేదు. కీమోథెరపీ చేయించుకుంటూ తన ఆరోగ్యంతోపాటు ఫిట్నెస్ మెయింటెయిన్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా జిమ్కెళ్తోంది. వివరాల్లోకి వెళితే...కాళ్లు మొద్దుబారుతున్నాయి..కీమోథెరపీ బాధలు, న్యూరోపతిక్ పెయిన్ను భరిస్తూ కూడా హెల్దీ లైఫ్ స్టయిల్ను అనుసరిస్తోంది. ‘కీమోథెరపీ దేహాన్ని పిండేస్తుంది. వర్కవుట్స్ చేసేటప్పుడు కాళ్లు పట్టుతప్పుతున్నాయి, ఒక్కసారిగా పడిపోతున్నాను’ అని ఒక పోస్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం లేదామె. మెంటల్, ఫిజికల్ వెల్నెస్ కోసం నొప్పుల బాధలను పళ్లబిగువున భరిస్తూ వ్యాయామం చేస్తోంది. ‘అనారోగ్యంతో కుంగిపోయిన వ్యక్తిలా అభివర్ణించుకోవడం నాకిష్టం లేదు. పడినప్పటికీ తిరిగి లేచి నిలబడాలి. వర్కవుట్ చేసే ప్రతిసారీ ‘గెట్టింగ్ బ్యాక్ అప్... అని నాకు నేను చెప్పుకుంటాను.అలా చెప్పుకోకపోతే మానసిక శక్తి రాదు. మానసిక శక్తి లోపిస్తే వ్యాయామం చేయడానికి దేహం సహకరించదు’ అని తన ఇన్స్టా్రగామ్ ఫాలోవర్స్తో పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె రకరకాల వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఒక వీడియోలో జుత్తును తల నుంచి చివరి వరకు నిమిరి అరచేతిలోకి వచ్చిన జుత్తును చూపించింది. గుండు గీసుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. మరొక వీడియోలో వర్షంలో గొడుగు వేసుకుని, ప్రోటీన్ షేక్ ఉన్న ఫ్లాస్క్ పట్టుకుని జిమ్ ఆవరణలో ప్రవేశించింది. గొడుగు మూస్తూ హాయ్ అని పలకరించి విక్టరీ సింబల్ చూపించి జిమ్ గదిలోకి వెళ్లడంతో వీడియో పూర్తయింది. ‘స్టే స్ట్రాంగ్’ అంటూ ఆమె ఫ్లయింగ్ కిస్ విసిరి వీక్షకులకు మనోధైర్యాన్నిచ్చింది.మీ ఆదరణకు కృతజ్ఞతలు..సోషల్ మీడియాలో ఫాలోవర్స్ నుంచి అందుతున్న ఆదరణకు ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ ‘మీ అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతతో ఉంటాను. ఈ చాలెంజ్లో నేను గెలుస్తాను’ అన్నది. కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. అనారోగ్యం వస్తే డీలా పడిపోకూడదు. పోరాడి గెలవాలి అనే సందేశం ఇస్తున్న ఆమె వీడియోలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి. వైద్యం ఎంతగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ, క్యాన్సర్కు చికిత్స చేయించుకున్న తర్వాత సాధారణ వ్యక్తుల్లాగే క్వాలిటీ లైఫ్ను లీడ్ చేయడం మనచేతుల్లోనే ఉందని సమాజానికి ధైర్యం చెబుతున్న వారిలో హీనాఖాన్ ఒకరు.ఫిట్నెస్ చాలెంజ్..అమెరికాలోని స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ సూచనల మేరకు... తేలికపాటి వ్యాయామాలు... రిలాక్స్డ్ బైకింగ్ (గంటకు ఐదు మైళ్లకంటే తక్కువ వేగంతో సాఫీగా ఉన్న నేల మీద సైక్లింగ్), స్లో వాకింగ్ (చదునుగా ఉన్న నేల మీద గంటకు మూడు మైళ్లకంటే తక్కువ వేగంతో నడవడం). చిన్న చిన్న ఇంటిపనులు, తాయ్ చాయ్ (దేహాన్ని నిదానంగా కదిలిస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోవడం), ప్లేయింగ్ క్యాచ్ (బాల్ను లేదా ఫ్రిస్బీ ప్లేట్ను గురి చూసి విసరడం)తీవ్రమైన వ్యాయామాలు...బైకింగ్... (గంటకు పది మైళ్లకు మించకుండా సైక్లింగ్), బ్రిస్క్ వాక్ (గంటకు మూడు నుంచి నాలుగున్నర మైళ్ల వేగం), ఇంటి పనుల్లో బరువైనవి కూడా, యోగసాధన, టెన్నిస్ వంటి ఆటలు.– అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీలు... క్యాన్సర్ పేషెంట్లు వారానికి 150 నుంచి 300 నిమిషాలపాటు వ్యాయామం చేయాలని, రోజుకు అరగంట చొప్పున వారానికి ఐదు రోజుల వర్కవుట్ షెడ్యూల్ ఉండాలని చెప్తున్నాయి. -
ధర్మయోధుడు: ‘‘నాయనా! మాకు నీవు ఒక్కడివే కుమారుడవి.. పైగా..
అది కురుదేశం. దాని రాజధాని నగరం స్థూలకోష్ఠికం. ఆ నగరంలో ధనవంతుడైన పండితుని కుమారుడు రాష్ట్రపాలుడు. రాష్ట్రపాలునికి యుక్తవయస్సు దాటింది. అతనికి గృహజీవితం పట్ల అంతగా ఇష్టం ఉండేది కాదు. సన్యసించాలని, జ్ఞానం పొందాలని అనుకునేవాడు. ఒకరోజు బుద్ధుడు తన బౌద్ధసంఘంతో కలసి నగరానికి వచ్చాడు. తన మిత్రునితో కలిసి వెళ్ళి, బుద్ధుని ధర్మోపదేశం విన్నాడు రాష్ట్రపాలుడు. తానూ బౌద్ధ భిక్షువుగా మారాలి అనుకున్నాడు. బుద్ధుని దగ్గరకు వెళ్ళి నమస్కరించి, విషయం చెప్పాడు.‘‘రాష్ట్రపాలా! నీవు కుర్రవాడివి. నీ తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే నీకు భిక్షు దీక్ష ఇస్తాను’’ అన్నాడు బుద్ధుడు. రాష్ట్రపాలుడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని అడిగాడు. వారు–‘‘నాయనా! మాకు నీవు ఒక్కడివే కుమారుడవి. పైగా మా కోట్లాది ధనానికీ నీవే వారసుడివి. నిన్ను వదిలి మేం బతకలేం. కాబట్టి భిక్షువుగా మారడానికి అనుమతించలేం’’ అని తేల్చి చెప్పారు. రాష్ట్రపాలుడు రెండుమూడు రోజులు వారిని ప్రాధేయపడ్డాడు. చివరికి తన గదిలోకి చేరి, నిరాహార వ్రతం పూనాడు. వారం గడిచింది. రాష్ట్రపాలుడు నీరసించి పడిపోయాడు. తల్లిదండ్రులు భయపడ్డారు. భోరున విలపించారు. అప్పుడు రాష్ట్రపాలుని మిత్రున్ని పిలిపించారు. అతను చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఆ మిత్రుడు– తల్లిదండ్రులతో..‘‘మీరు అంగీకరించడమే మంచిది. కనీసం ఎక్కడో ఒకచోట బతికి ఉంటాడు. అయినా కొందరు కొంతకాలమే భిక్షు జీవనం సాగించి, ఇక సాగించలేక తిరిగి ఇంటిదారి పడుతున్నారు. మన వాడూ అదే చేయవచ్చు ’’ అని చెప్పడంతో ఏదో ఒక మూల ఆశతో తల్లిదండ్రులు అనుమతించారు.మహా ఐశ్వర్యాన్ని వదిలి రాష్ట్రపాలుడు భిక్షువుగా మారాడు. కొన్నాళ్ళు గడిచాయి. కొడుకు తిరిగిరాలేదు. దానితో బుద్ధుని పట్ల, భిక్షువుల పట్ల చాలా కోపాన్ని పెంచుకున్నాడు రాష్ట్రపాలుడి తండ్రి. ఒకరోజు కాషాయ బట్టలు కట్టుకుని, బోడిగుండుతో, భిక్షాపాత్ర పట్టుకుని ఒక భిక్షువు వారింటికి వచ్చాడు. పెరట్లో ఉన్న తండ్రికి వళ్ళు మండిపోయింది. ‘‘భిక్షా లేదు, గంజీ లేదు. పో..పో’’ అంటూ తిట్టాడు. ఇంట్లోకి వెళ్ళిపోయాడు. భిక్షువు చిరునవ్వుతో అక్కడి నుండి కదిలాడు. అంతలో ఇంటిలోని దాసి పాచిన గంజి పారబోయడానికి బయటకు తెచ్చింది. భిక్షువు ఆగి... ‘‘అమ్మా! ఆ గంజి అయినా భిక్షగా వేయండి’’ అన్నాడు.ఆమె ఆ పాచిన గంజిని భిక్షాపాత్రలో పోస్తూ ఆ భిక్షువుకేసి తేరిపార చూసింది.ఆమె ఒళ్ళు జలదరించింది. నేల కంపించింది. నేలమీద పడి నమస్కరించింది. లేచి పరుగు పరుగున ఇంట్లోకి పోయింది.‘‘అయ్యా! ఆ వచ్చిన భిక్షువు మరెవరో కాదు. మన అబ్బాయి గారే’’ అంది. ఆ మాట విని తల్లిదండ్రులు శోకిస్తూ వీధుల్లోకి వచ్చిపడ్డారు. అక్కడ భిక్షువు కనిపించలేదు. వెతుకుతూ వెళ్లారు. ఆ వీధి చివరనున్న తోటలో కూర్చొని ఆ పాచిన భిక్షను పరమాన్నంగా స్వీకరిస్తున్నాడు రాష్ట్రపాలుడు. ‘‘నాయనా! మేము గమనించలేదు. రా! మన ఇంటికి రా! మంచి భోజనం వడ్డిస్తాం’’ అన్నారు. ‘‘గృహస్తులారా! ఈ రోజుకి నా భోజనం ముగిసింది’’ అన్నాడు. మరునాడు రమ్మన్నారు. అంగీకరించాడు. వెళ్ళాడు. ఉన్నతమైన ఆసనంపై బంగారు గిన్నెల్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ముందు ఉంచారు. కొన్ని పళ్ళాల నిండా రత్నరాశులు, వజ్రవైడూర్యాలు నింపి ఆ గదిలో ఉంచారు.‘‘నాయనా! మనకి ఏం తక్కువ! ఈ పళ్ళాల్లో కాదు, గదుల నిండా ఇలాంటి ధనరాశి ఉంది. ఇవన్నీ నీకే... రా! ఆ భిక్ష జీవనం వదులు’’ అన్నారు.‘‘మీరు ఆ ధనరాశుల్ని బండ్లకెత్తించి గంగానదిలో కుమ్మరించండి. లేదా... దానం చేయండి. నాకు జ్ఞాన సంపద కావాలి. ధర్మ సంపద కావాలి. శీలసంపద కావాలి. అది తరగని సంపద. అది తథాగతుని దగ్గర తరగనంత ఉంది. మీరూ ఆ ధర్మ మార్గాన్నే నడవండి. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి’’ అని లేచి వెళ్లిపోయాడు రాష్ట్రపాలుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
మీకు తెలుసా! ఇదీ.. వందేళ్ల వండర్ఫుల్ అరకు కాఫీ!
నురగలు కక్కుతూ నిద్ర మత్తును వదలగొట్టే పానీయం.. మదిని ఉత్తేజపరచే ఔషధం.. అవనిలో దొరికే ఆ అమృతం.. చిక్కటి.. చక్కటి రుచిగల ఉదయాలకు ప్రారంభం! ఈ కాంప్లిమెంట్కి కాఫీనే ఎలిజిబుల్!‘అనుదినమ్మును కాఫీయే అసలు కిక్కు.. కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు.. కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు.. అమృతమన్నది హంబక్కు అయ్యలార.. జై కాఫీ’ అంటూ ‘మిథునం’ సినిమా కోసం జొన్నవిత్తుల కూడా కాఫీ మహిమను కీర్తించారు. ఇలా జనుల జిహ్వన నానుతున్న కాఫీ మన అరకు లోయలోనూ సాగవుతోంది. నిజమే కానీ ఈ ఘుమఘుమల ప్రస్తావన ఇప్పుడెందుకు? జూన్ 30న ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’లో ‘అరకు వ్యాలీ కాఫీని ప్రపంచానికి పరిచయం చేసిన కృషి అభినందనీయం .. అరకు కాఫీని ఆస్వాదించండి’ అని ప్రత్యేకంగా ప్రశంసించినందుకు!టేస్ట్పుల్ ఇమేజ్తో అనేక దేశాలు గ్రోలుతున్న ఈ వండర్ఫుల్ అరకు కాఫీకి వందేళ్లకుపైగా ఘన చరిత్ర ఉంది. 1898లో.. ఓ ఆంగ్లేయ అ«ధికారి.. తూర్పుగోదావరి జిల్లా, పాములేరు లోయలో కాఫీ పంటను వేశారు. 1920 నాటికి విశాఖ ఏజెన్సీలోని అరకు, అనంతగిరి, జీకే వీథి, చింతపల్లి, పెదబయలు, ఆర్వీ నగర్, మినుమలూరు, సుంకరమెట్ట తదితర ప్రాంతాల్లోనూ కాఫీ తోటల పెంపకాన్ని మొదలుపెట్టారు.స్వాతంత్య్రానంతరం ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లా రిజర్వ్ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను వేసింది. ఆ తోటలను 1985లో అటవీ అభివృద్ధి సంస్థకు అప్పగించింది. ఆపై గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ద్వారా ప్రత్యేకంగా కాఫీ తోటల అభివృద్ధి విభాగమొకటి ఏర్పాటైంది. కాఫీ బోర్డు సహకారంతో గిరిజన ప్రాంతాల్లో సుమారు పదివేల ఎకరాల్లో సేంద్రియ (ఆర్గానిక్) పద్ధతిలో కాఫీ తోటల పెంపకాన్ని ప్రారంభించారు. దీనివల్ల పెద్ద ఎత్తున గిరిజనులు పోడు వ్యవసాయం నుంచి కాఫీ సాగు వైపు మళ్లి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.అరకులో కాఫీ తోటలు సరే.. కాఫీ చరిత్రను చాటే కాఫీ మ్యూజియం కూడా ఉంది. 16వ శతాబ్దంలో సూఫీ సన్యాసి బాబా బుడాన్ .. కర్ణాటకలోని చిక్ మగళూరు నుంచి ఏడు కాఫీ గింజలను తెచ్చి తన ఆశ్రమంలో నాటారని కాఫీ బోర్డు వెబ్సైట్లో పేర్కొన్నారు.వాతావరణం అనుకూలం..సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ.. కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. అందుకే పదివేల ఎకరాల్లో మొదలైన కాఫీ సాగు ఇప్పుడు లక్షన్నర ఎకరాలకు పైగా విస్తరించింది. ఇక్కడ పొడవైన సిల్వర్ ఓక్ చెట్లు, టేకు చెట్ల నీడలో.. ఏటవాలు ప్రాంతాల్లో కాఫీ తోటలను పెంచుతున్నారు. ఆ నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం వల్ల ఆ కాఫీకి ప్రత్యేక రుచి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఆ తోటలకు నీడ కోసం.. ఓక్ చెట్ల మొదళ్లలో మిరియాలు వేసి.. అవి ఓక్ చెట్ల మీదుగా పాకేలా చేస్తున్నారు. దీనివల్ల మిరియాలు అదనపు పంటగా మారి.. అదనపు ఆదాయాన్నీ వాళ్లు పొందుతున్నారు.అంతర్జాతీయ ఖ్యాతి..ప్రపంచంలో అధికంగా కాఫీ పండించే దేశాల్లో .. మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో మనం ఏడవ స్థానంలో ఉన్నాం. 25 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో బ్రెజిల్ మొదటిస్థానంలో ఉంది. మన దేశంలో 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుండగా.. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ల నుంచే ఎక్కువ ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలో అరబికా రకం కాఫీని సాగు చేస్తున్నారు. ఈ కాఫీని బెంగళూరులో ప్రాసెస్ చేసి జర్మనీ, వియత్నాం, బ్రెజిల్, ఇంగ్లండ్, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.2007లో ఆదివాసీ రైతులు ఉత్పత్తి చేసిన అరకు కాఫీ.. దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ కాఫీ బ్రాండ్గా గుర్తింపు పొందింది. ప్యారిస్లో ‘అరకు కాఫీ బ్రాండ్’ పేరుతో ఓ కాఫీ షాప్ తెరిచారు. దీని టేస్ట్ జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లండ్ దేశాలకూ పాకింది. బెస్ట్ కాఫీ బ్రాండ్లకు పేరొందిన బ్రెజిల్, సుమత్రా, కొలంబోలు.. అరకు స్ట్రాంగ్ కాఫీ ముందు లైట్ అయిపోతున్నాయి. తద్వారా అరకు కాఫీకి అంతర్జాతీయ డిమాండ్నే కాదు ఫేమ్నీ పెంచుతున్నాయి. అరకు కాఫీ బేవరేజ్గానే మిగిలిపోలేదు. పలు రకాల పండ్లు, ఫ్లేవర్స్తో కలసి చాకోలెట్స్గానూ చవులూరిస్తోంది.జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అటవీ ఫలసాయం, వ్యవసాయోత్పత్తుల కొనుగోలులో రికార్డు స్థాయిలో గిరిజనులకు మేలు జరిగింది. గిరిజన రైతులకు పెట్టుబడి సాయం, యంత్ర పరికరాలను అందించింది. దీనికితోడు జీసీసీ సైతం గిరిజన రైతుల వ్యవసాయానికి, కాఫీ సాగుకు రుణాలు మంజూరు చేసి, అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా మద్దతు ధరను చెల్లించింది. అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంతోపాటు ఆర్గానిక్ సిర్టిఫికేషన్ కోసం ప్రత్యేక చర్యలూ చేపట్టి గిరిజన రైతులను ప్రోత్సహించింది.అవార్డులు.. ప్రశంసలు!గతేడాది సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు బెంగళూరులో నిర్వహించిన ప్రపంచస్థాయి ‘ఫైన్ కప్’ పోటీలో ఏపీ ప్రభుత్వం తరఫున కాఫీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రథమ స్థానంలో నిలిచిన అరకు కాఫీ ‘ఫైన్ కప్’ అవార్డును దక్కించుకుంది. పెదబయలు మండలం లక్ష్మీపురం పంచాయతీ కప్పల గ్రామానికి చెందిన కిల్లో అశ్విని ఈ ఘనతను సాధించడం విశేషం. ప్రపంచ కాఫీ పోటీల్లో 12 ఏళ్ల తర్వాత మన కాఫీకి అంతర్జాతీయ అవార్డు దక్కింది. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో సోషల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ 2022 ఆగస్టు 9 నుంచి 11 వరకు కోల్కతాలో నిర్వహించిన జాతీయ సదస్సులో 14 రాష్ట్రాలు పాల్గొనగా.. మన కాఫీ మొదటిస్థానంలో నిలవడంతో జాతీయ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో నిర్వహించిన జి–20 సదస్సులోనూ సర్వ్ అయిన అరకు కాఫీకి ప్రపంచ దేశాల ప్రతినిధులు హాట్ ఫేవరెట్స్ అయిపోయారు. గతంలో పారిస్లో ప్రి ఎపిక్యూర్స్ పోటీలో అరకు కాఫీ గోల్డ్ మోడల్ గెల్చుకుంది. – యిర్రింకి ఉమమహేశ్వరరావు, సాక్షి, అమరావతి -
Aarti Kumar Rao: ప్రయాణ దారులలో.. ప్రకృతి గీతాలతో..
థార్లోని ఇసుక దిబ్బల గుండె సవ్వడి విన్నది. అరుణాచల్ప్రదేశ్లోని పర్వతశ్రేణులతో ఆత్మీయ స్నేహం చేసింది. అస్పాంలోని వరద మైదానాలలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న కనీళ్లను చూసింది. కేరళ, గోవా తీరాలలో ఎన్నో కథలు విన్నది. కొద్దిమందికి ప్రయాణం ప్రయాణం కోసం మాత్రమే కాదు. ఆనందమార్గం మాత్రమే కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక అన్వేషణ. తన అన్వేషణలో అందం నుంచి విధ్వంసం వరకు ప్రకృతికి సంబంధించి ఎన్నో కోణాలను కళ్లారా చూసింది బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్, రైటర్, ఆర్టిస్ట్ ఆరతి కుమార్ రావు....రాజస్థాన్లో ఒక చిన్న గ్రామానికి చెందిన చత్తర్సింగ్ గుక్కెడు నీటి కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పశ్చిమబెంగాల్లో ఒక బ్యారేజ్ నిర్మాణం వల్ల నిర్వాసితుడు అయిన తర్కిల్ భాయి నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు తక్కువేమీ కాదు. సుందర్బన్ప్రాంతానికి చెందిన ఆశిత్ మండల్ వేట మానుకొని వ్యవసాయం వైపు రావడానికి ఎంతో కథ ఉంది. బంగ్లాదేశ్లోని మత్స్యకార్మికుడి పిల్లాడిని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేస్తే ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ ఏడ్చే దృశ్యం ఎప్పటికీ మరవలేనిది.ఒకటా... రెండా ఆరతి కుమార్ ఎన్నెన్ని జీవితాలను చూసింది! ఆ దృశ్యాలు ఊరకే ΄ోలేదు. అక్షరాలై పుస్తకంలోకి ప్రవహించాయి. ఛాయాచిత్రాలై కళ్లకు కట్టాయి. ఒక్కసారి గతంలోకి వెళితే... ‘ఉద్యోగం మానేస్తున్నావట ఎందుకు?’ అనే ప్రశ్నకు ఆరతి కుమార్ నోట వినిపించిన మాట అక్కడ ఉన్నవాళ్లను ఆశ్చర్యానికి గురి చేసింది.‘ప్రకృతి గురించి రాయాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం మానేస్తున్నాను’ అని చెప్పింది ఆమె. యూనివర్శిటీ ఆఫ్ పుణెలో ఎంఎస్సీ, థండర్ బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్–ఆరిజోనాలో ఎంబీఏ, ఆరిజోనా యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన ఆరతి అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఇన్టెల్లో ఉద్యోగం చేసింది. కొంత కాలం తరువాత తనకు ఉద్యోగం కరెక్ట్ కాదు అనుకుంది. సంచారానికే ప్రాధాన్యత ఇచ్చింది.బ్రహ్మపుత్ర నది పరివాహకప్రాంతాలకు సంబంధించిన అనుభవాలను బ్లాగ్లో రాసింది. పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు ఎన్నోప్రాంతాలు తిరిగిన ఆరతి ‘మార్జిన్ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ పేరుతో రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ప్రకృతి అందాలే కాదు వివిధ రూ΄ాల్లో కొనసాగుతున్న పురా జ్ఞానం వరకు ఎన్నో అంశాల ప్రస్తావన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రకృతికి సంబంధించిన అందం నుంచి వైవిధ్యం వరకు, వైవిధ్యం నుంచి వైరుధ్యం వరకు తన ప్రయాణాలలో ఎన్నో విషయాలను తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను అక్షరాలు, ఛాయాచిత్రాలతో ప్రజలకు చేరువ చేస్తోంది ఆరతి కుమార్ రావు.భూమాత మాట్లాడుతోంది విందామా!ఆరతి కుమార్ రావు రాసిన‘మార్జిన్ల్యాండ్స్’ పుస్తకం కాలక్షేప పుస్తకం కాదు. కళ్లు తెరిపించే పుస్తకం. ఇది మనల్ని మనదైన జల సంస్కృతిని, వివిధ సాంస్కృతిక కళారూ΄ాలను పరిచయం చేస్తుంది.– ‘ప్రకృతి దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం తగినంత సమయాన్ని తప్పకుండా వెచ్చించాలి. దానిలో జీవించాలి. దానితో ఏకం కావాలి’ అంటుంది ఆరతి.– ఈ పుస్తకం ద్వారా మన సంస్కృతిలోని అద్భుతాలను మాత్రమే కాదు తెలిసో తెలియకో మనం అనుసరిస్తున్న హానికరమైన విధానాలు, ప్రకృతి విపత్తుల గురించి తెలియజేస్తుంది.– ‘మన సంప్రదాయ జ్ఞానంలో భూమిని వినండి అనే మాట ఉంది. భూమాత చెప్పే మాటలు వింటే ఏం చేయకూడదో, ఏం చేయాలో తెలుస్తుంది’ అంటుంది ఆరతి కుమార్ రావు.ఇవి చదవండి: Aruna Roy: 'ఈ పయనం సామాజికం'! -
వర్షాకాలంలోనూ వదలకుండా.. జంపింగ్ జాక్స్!
చెమట పడుతోందని వేసవిలో, ముసురు పట్టిందని వానా కాలంలో, మంచుకురుస్తోందని చలికాలంలోనూ వ్యాయామాన్ని మానకూడదు. ఏ సీజన్కు తగ్గట్టు ఆ తరహా వర్కవుట్స్ ప్లాన్ చేసుకోవచ్చని ఫిట్నెస్ ట్రైనర్స్, నిపుణులు అంటున్నారు. వ్యాయామాన్ని స్కిప్ చేయడం మంచి అలవాటు కాదని, దీని వల్ల సీజనల్ వ్యాధుల ప్రభావం తట్టుకునే ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందుకే సీజన్కు తగ్గట్టుగా వర్కవుట్ని డిజైన్ చేసుకోవాలని వ్యాయామ నిపుణులు సూచిస్తున్నారు. నగరంలో సీజన్కు అనుగుణంగా వర్కవుట్ డిజైన్ అనేది ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతోంది. దీంతో ఫిట్నెస్ ఫ్రీక్లకు వెసులుబాటుగా ఉండే ట్రెయినర్లకు డిమాండ్ పెరుగుతోంది. – సాక్షి, సిటీబ్యూరోవర్షాకాలంలో వ్యాయామ ఆసక్తి తగ్గడానికి అధిక తేమ స్థాయిలు, సూర్యకాంతి లేకపోవడం, వాతావరణ పీడనంలో మార్పులు వంటి కారణాలు ఉన్నాయి. వాతావరణ పీడనం పడిపోవడం అనేది మన శరీర ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేసి, అలసట, శక్తి లేకపోవడం వంటి అనుభూతులకు గురిచేస్తాయి. కానీ వర్షాకాలంలో ఫిట్నెస్ను కాపాడుకోవడం మానసిక స్థితిని మెరుగుపరచడంలో మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని అంటున్నారు. దీంతో పలువురు నిపుణులు సింపుల్ వర్కవుట్స్పై సలహాలు, సూచనలు అందిస్తున్నారు...సమయానికి తగినట్లు..– స్పాట్ జాగింగ్ చాలా తక్కువ స్పేస్లో కదలకుండా చేసే జాగింగ్ ఇది. అవుట్డోర్లో జాగింగ్కి సమానమైన ప్రతిఫలాన్ని అందిస్తోంది. చేతులను స్వింగ్ చేయడం వంటి తదితర మార్పు చేర్పుల ద్వారా ఫుల్బాడీకి వర్కవుట్ ఇవ్వొచ్చు. – జంపింగ్ జాక్స్, క్లైంబర్స్, హై నీస్, సిజర్ చాప్స్ వంటివి ఒకే ప్రదేశంలో కదలకుండా చేయవచ్చు. వీటిని మూడు సెట్స్గా విభజించుకుని చేయడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.– స్కిప్పింగ్ రోజంతా చురుకుగా ఉంచే అద్భుతమైన మాన్ సూన్ వర్కౌట్. రోప్ స్కిప్పింగ్ లేదా జంపింగ్ అధిక సంఖ్యలో కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది అన్ని సీజన్లలోనూ చేయవచ్చు. – వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఇండోర్ యోగా ఒక గొప్ప మార్గం. వృక్షాసనం వంటి ఆసనాలతో చల్లని వాతావరణంలో ప్రయోజనకరంగా ఉంటుంది.– వ్యాయామాల్లో వైవిధ్యం కోసం డంబెల్స్ లేదా రెసిస్టెన్స్ బ్యాండ్ల వంటి కొన్ని ప్రాథమిక వ్యాయామ పరికరాలను ఉపయోగించవచ్చు. – సాధారణ నీటికి ప్రత్యామ్నాయంగా హెర్బల్ టీలు, కొబ్బరి నీళ్లను ఉపయోగించడం ద్వారా చురుకుదనాన్ని, ఉత్తేజాన్ని పొందవచ్చు.– ఆన్లైన్లో లేదా ఫిట్నెస్ యాప్ల ద్వారా అందుబాటులో ఉన్న ఫిట్నెస్ ఇచ్చే డ్యాన్స్ వీడియోలను అనుసరించాలి. – ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అందుబాటులో ఉంటే స్విమ్మింగ్ ల్యాప్లు లేదా ఆక్వా ఏరోబిక్స్ క్లాస్లలో పాల్గొనాలి.– వర్షాకాలంలో బద్ధకాన్ని ఎదుర్కోవడానికి, సాధారణ శారీరక శ్రమతో పాటు సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వీలైనంత వరకూ సూర్యరశ్మి శరీరానికి సోకేలా చూసుకోవడం చాలా ముఖ్యం.మార్పు చేర్పులు అవసరం..ఎండలు ఉన్నాయని కొందరు వానలు ఉన్నాయని కొందరు వర్కవుట్కి బద్ధకిస్తుంటారు. కొందరు మాత్రం సీజన్లతో సంబంధం లేకుండా జిమ్స్కు వస్తుంటారు. కనీసం వారానికి 3 నుంచి 4 సార్లు చేసేవారిని సిన్సియర్ అని చెప్పొచ్చు. అదే కరెక్ట్ విధానం కూడా. ఈ సీజన్లో తెల్లవారుఝామున బాగా ముసురుపట్టి ఉన్నప్పుడు ఉదయం లేచిన వెంటనే ఎక్సర్సైజ్ చేయాలనే మూడ్ రాదు. కాబట్టి లేవగానే ఇంట్లోనే కొన్ని స్ట్రెచి్చంగ్ వర్కవుట్స్ చేశాక జిమ్కి రావచ్చు. వాకింగ్, జాగింగ్, యోగా వంటివి అవుట్డోర్లో చేసే అలవాటు వల్ల వానాకాలంలో రెగ్యులారిటీ మిస్ అవుతుంది. కాబట్టి ఇన్డోర్ వర్కవుట్స్ ఎంచుకోవడం మంచిది. వర్షాకాలం వర్కవుట్స్..ఈ వాతావరణం హెవీ వెయిట్/ రిపిటీషన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి ఎక్కువ టైమ్ కేటాయించాలి. వైరల్ ఫీవర్స్ ఫ్లూ వచ్చేది ఈ సీజన్లోనే కాబట్టి, ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ప్రత్యేకమైన వర్కవుట్స్ చేయించాలి. ఈ వాతావరణంలో మజిల్స్ బద్ధకిస్తాయి. కాబట్టి వర్కవుట్కి ముందు వార్మ్ అప్కి కేటాయించే సమయాన్ని కొంత పెంచి చేయిస్తాం. వారానికి 3 నుంచి 4 గంటల పాటు రోజూ 45 నిమిషాలు వ్యాయామం ఈ సీజన్లో చాలా ఉపయుక్తం.– ఎం.వెంకట్, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ లైఫ్స్టైల్ కోచ్ -
హోం బేకర్స్..! ఇంట్లో కిచెన్లోనే బేకరీ ఏర్పాటు..!
ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి క్లౌడ్ కిచెన్ కాన్సెప్్టతో ముందుకు స్పెషల్ థీమ్స్తో ఔరా అనిపించుకుంటున్న యువత కాస్తంత సృజనాత్మకతకు ఆలోచన తోడైతే అద్భుతాలు సృష్టించొచ్చు. పలువురు యువత ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు. చిన్నప్పటి నుంచి కళల పట్ల ఉన్న ఆసక్తికి, ఆలోచనను జత చేసి ఎంట్రప్రెన్యూర్స్గా విజయతీరాలను చేరుకుంటున్నారు. సాధారణంగా బిజినెస్ చేయాలంటే పెట్టుబడి, అనువైన ప్రాంతం దొరకాలి.. అంత కష్టపడి వ్యాపారం చేస్తే, అది సక్సెస్ అవుతుందా అనే అనుమానం ఉంటుంది. అందుకే ఈ తరం యువత సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. క్లౌడ్ కిచెన్ కాన్సెప్్టతో ముందడుగు వేస్తున్నారు. ఇటీవల హోం బేకర్స్ నడుపుతూ వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోపలు థీమ్స్తో కేక్స్ తయారీ..సాధారణంగా పుట్టినరోజు, పెళ్లి, న్యూఇయర్ ఇలా చాలా సందర్భాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటుంటాం. అయితే ఎప్పుడూ ఒకే రకమైన కేక్ కట్ చేస్తుంటే మజా ఏముంటుందని, కొందరు విభిన్న రకాల కేకులు ఆర్డర్ చేస్తుంటారు. పిల్లల కోసం స్పైడర్మ్యాన్, ఏనుగు, బార్బీ, పెళ్లి రోజు, ఎంగేజ్మెంట్ కోసం ప్రత్యేక థీమ్స్తో కేకులు తయారు చేస్తుంటారు. కస్టమర్లకు నచి్చన థీమ్స్ తయారు చేసేందుకు తాము ఎంతో కష్టపడుతుంటామని చెబుతున్నారు.పూర్తి సహజంగా.. ఎలాంటి రసాయనాలూ లేకుండా పూర్తిగా సహజ పదార్థాలతో తయారుచేయాలనే ఉద్దేశంతో చాలామంది హోం బేకర్స్ను ప్రారంభించినట్టు చెబుతున్నారు. దీంతో పాటు పరిశుభ్రమైన వాతావారణంలో మన ఇంట్లో తయారు చేసినట్టుగానే కస్టమర్లకు పదార్థాలు తయారు చేసి ఇస్తామని పేర్కొంటున్నారు. చాలా బేకరీల్లో డాల్డాతో తయారుచేస్తారని, అయితే తాము మాత్రం బట్టర్, బ్రౌన్ షుగర్ను వాడతామని హోం బేకరీ నిర్వాహకులు చెబుతున్నారు.ఇంట్లో కిచెన్లోనే..సాధారణంగా బేకరీ ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ హోం బేకరీని తక్కువ ఖర్చుతోనే ఇంట్లో కిచెన్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎలాగూ ఇంట్లో వంటకాలను చాలా పరిశుభ్రమైన పరిసరాల్లోనే తయారు చేస్తుంటారు. కాబట్టి అక్కడే చిన్న ఓవెన్ వంటి చిన్న చిన్న పరికరాలతో కేకులు, కుకీస్ తయారు చేస్తున్నారు. కేక్స్, కుకీస్తో పాటు మఫిన్స్, చీజ్ కేకులు, డోనట్స్ వంటి ఉత్పత్తులతో చుట్టు పక్కల వారితో ఔరా అనిపించుకుంటున్నారు.సాధికారత కోసం..చాలా మంది మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ హోం బేకర్స్ ప్రారంభిస్తున్నటు చెబుతున్నారు. ఇంట్లో వారి పై ఆధారపడకుండా సొంత గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయమే వారిలో కనిపిస్తోంది. తమలో ఉన్న సృజనాత్మకతను నలుగురూ మెచ్చుకుంటే అంతే చాలు అని చెబుతున్నారు.ఇది కూడా సమాజ సేవే..ఆరోగ్యకరమైన పదార్థాలు అందిస్తే కూడా సమాజానికి సేవ చేసినట్టే అనేది నా నమ్మకం. కాస్త భిన్నంగా కనిపించడమే కాకుండా, మన పనులు భిన్నంగా ఉండి, సమాజంలో గుర్తింపు రావాలనేది నా తాపత్రయం. అందులో భాగంగానే హోం బేకర్స్ కాన్సెప్ట్ ఆలోచన వచి్చంది. నా కేక్స్ డిజైన్స్ బాగున్నాయని అందరూ మెచ్చుకుంటుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. – సాయి శ్రీ, ఓవెన్ కుక్ డిలైట్చాలా టేస్టీగా ఉంటాయి..నేను చాలా సార్లు హోం బేకర్స్ నుంచి కేక్స్ ఆర్డర్ చేసుకున్నాను. సాధారణ బేకరీల కన్నా ఇక్కడ చాలా హైజీనిక్తో పాటు రుచికరంగా ఉంటాయి. ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్స్లో ఇస్తుంటారు. తక్కువ ధరలోనే మంచి కేక్స్ వస్తున్నాయి. – మెరుగు శివ ప్రకాశ్ నాయుడుఇవి చదవండి: ఎర్ర బచ్చలికూరతో అధిక బరువుకి చెక్! -
నాలుక అబద్ధం చెప్పదు..
నీర్ దోసె అంటే నూనె వేయకుండా పెనం మీద నీటిని చల్లి వేసే దోసె. మైసూర్ మసాలా దోసె, రసం ఇడ్లీ, టొమాటో ఉప్మా, ఆనియన్ ఊతప్పం... ఇవన్నీ మనకు తెలిసినవే, ఖోట్టో... ఇది ఇడ్లీ పిండిని పనస ఆకులతో అల్లిన బుట్టలో వేసి ఆవిరి మీద ఉడికించే వంటకం. ఈ దక్షిణాది రుచుల పేరు చెబితే ముంబయి వాసుల నోట్లో నీళ్లూరతాయి. క్రికెట్ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్లు ఈ రుచుల కోసం ముంబయి నగరం, మాతుంగలో ఉన్న మైసూర్ కేఫ్ను విజిట్ చేసేవాళ్లు.స్వాతంత్య్రానికి ముందు 1936 నుంచి ముంబయిలో స్టవ్ వెలిగించిన ఈ కేఫ్కి గవాస్కర్, సచిన్ల కంటే ముందు ఏ ప్రముఖులు క్యూ కట్టారో తెలియదు. కొత్త పెళ్లికొడుకు అనంత్ అంబానీ ఆదివారాలు ఇక్కడే గడిచేవని ఇటీవల తెలిసింది. తన పెళ్లి వేడుకలో ఈ కేఫ్ స్టాల్ కూడా పెట్టించారు. వధువు రాధికా మర్చంట్కు ఈ కేఫ్ నిర్వహకురాలు శాంతెరీ నాయక్ను చూపిస్తూ ‘మీట్ మైసూర్ కేఫ్ ఓనర్’ అని పరిచయం చేశాడు. వధువు ఆ పెద్దావిడపాదాలను తాకి నమస్కరించింది. ఈ వీడియోతో శాంతెరీ ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది.టూర్లో ‘టేస్ట్’ చూస్తాను..ముంబయి నగరం, మాతుంగ ఏరియాలో కింగ్స్ సర్కిల్ రైల్వేస్టేషన్ దగ్గర ఉంది మైసూర్ కేఫ్. శాంతెరీ నాయక్ మామగారు నాగేశ్ రామ నాయక్ ఈ కేఫ్ను స్థాపించాడు. కర్నాటక నుంచి ముంబయిలో అడుగు పెట్టి ఆహారమే తన కుటుంబానికి అన్నం పెడుతుందని నమ్మారాయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టారు శాంతెరీ నాయక్. ఇప్పుడామె కుమారుడు నరేశ్ నాయక్ సహాయంతో కేఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్’ అనే ప్రజల ప్రశంసలే ఆమె అందుకున్న పురస్కారాలు. వివిధ ప్రదేశాలను పర్యటించడం ఆమె హాబీ. పర్యటనలో భాగంగా ఆయా ప్రదేశాల్లో ఏయే ఆహారాలు అందుబాటులో ఉంటున్నాయి, పర్యాటకులు ఏ రుచులను ఎక్కువ గా ఇష్టపడుతున్నారో గమనిస్తూ, వాటిని రుచి చూస్తానని చె΄్తారామె.కస్టమర్ అభిప్రాయమే తుదితీర్పు..‘‘వంటలను ఇష్టపడడమే నా సక్సెస్ ఫార్ములా. అమ్మకు సహాయం చేసే క్రమంలోనే రుచిగా వండడంలో మెళకువలు తెలిశాయి. అమ్మ వండిన పదార్థాలను ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డించే బాధ్యత కూడా నాదే. వాళ్లకు ఏది నచ్చిందో అర్థమయ్యేది. అదే ఫార్ములాను కేఫ్ నిర్వహణలోనూ అనుసరించాను. మన ఉద్యోగులను నమ్మాలి, అంతకంటే ఎక్కువగా కస్టమర్లను నమ్మాలి. రుచి, అభిరుచుల విషయంలో కస్టమర్ల నోటి నుంచి వచ్చిన మాటే వేదవాక్కు. పదార్థాల రుచిని ఆస్వాదించిన నాలుక ఫీడ్ బ్యాక్ విషయంలో అబద్ధం చెప్పదు’’ అంటారు శాంతెరీ నాయక్. డెబ్బైఏళ్ల వయసులో కూడా చురుగ్గా, కేఫ్ నిర్వహణ పట్ల శ్రద్ధగా ఉన్నారామె. వార్థక్యం దేహానికి మాత్రమే, మనసుకు కాదు, పనిచేసే మనస్తత్వానికి కాదని నిరూపిస్తున్నారు శాంతెరీ నాయక్. -
కేవలం వాయుభక్షణతో.. పదివేల ఏళ్లు తపస్సు!
సమస్త లోకాలకు ఆధారభూతమైన ధర్మాన్ని దేవ దానవులు ఎవరూ చూడలేదు. సత్య స్వభావం కలిగిన ధర్మ స్వరూపాన్ని దర్శించడం కోసం దుర్వాసుడు తపస్సు ప్రారంభించాడు.కేవలం వాయుభక్షణతో పదివేల ఏళ్లు తపస్సు కొనసాగించినా, ధర్ముడు కరుణించలేదు. దర్శనమివ్వలేదు. తపస్సు చేసి చేసి దుర్వాసుడు కృశించిపోయాడు. ఆయనకు ధర్ముడి మీద పట్టరాని ఆగ్రహం కలిగింది. కోపం పట్టలేని దుర్వాసుడు ధర్ముడిని శపించాలనుకున్నాడు. అది గ్రహించిన ధర్ముడు వెంటనే దుర్వాసుడి ముందు తన నిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. తనతో పాటు సత్యం, బ్రహ్మచర్యం, తపస్సులను; యమ నియమ, దానాలను కూడా వెంటబెట్టుకు వచ్చాడు.సత్యం, బ్రహ్మచర్యం, తపస్సు బ్రాహ్మణుల రూపంలో రాగా, యమం ద్విజుడి రూపంలోను, నియమం ప్రాజ్ఞుడి రూపంలోను, దానం అగ్నిహోత్రుడి రూపంలోను వచ్చాయి. వారికి తోడుగా క్షమ, శాంతి, లజ్జ, అహింస, స్వచ్ఛత స్త్రీల రూపంలోను, బుద్ధి, ప్రజ్ఞ, దయ, శ్రద్ధ, మేధ, సత్కృతి, శాంతి, పంచయజ్ఞాలు, వేదాలు స్వస్వరూపాలతో వచ్చి నిలిచాయి. ఈ విధంగా ధర్ముడు సపరివారంగా దుర్వాసుడి ముందుకు వచ్చాడు.‘మహర్షీ! తపోధనుడివైన నువ్వు ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? కోపం శ్రేయస్సును, తపస్సును నశింపజేస్తుంది. పుణ్యకర్మలను క్షయింపజేస్తుంది. అందువల్ల ప్రయత్నపూర్వకంగా కోపాన్ని విడనాడాలి. దయచేసి శాంతించు! నీ తపోధనం చాలా గొప్పది’ అన్నాడు ధర్ముడు.ధర్ముడు అనునయంగా మాట్లాడటంతో దుర్వాసుడు కొద్ది క్షణాల్లోనే శాంతించాడు.‘మహాత్మా! దివ్యపురుషుడిలా కనిపిస్తున్న నువ్వెవరివి? నీతో వచ్చినవారంతా తేజస్సంపన్నులుగా ఉన్నారు. వారంతా ఎవరు?’ అడిగాడు దుర్వాసుడు. ధర్ముడు తనతో వచ్చిన తన పరివారాన్ని ఒక్కొక్కరినే దుర్వాసుడికి సవివరంగా పరిచయం చేశాడు. ‘అందరిలోనూ వృద్ధురాలిగా కనిపిస్తున్న స్త్రీ నా తల్లి దయ. గొప్ప తపస్విని. నేను ధర్ముడిని, ధర్మ పురుషుణ్ణి’ అని పలికాడు. ‘ఓ ధర్మపురుషా! మంచిది. మీరంతా నా వద్దకు ఎందుకు వచ్చారు? నేను మీకు చేయగల సాయమేమైనా ఉందా?’ ప్రశ్నించాడు దుర్వాసుడు.‘మహర్షీ! శాంతించు. నా మీద ఎందుకు కోప్పడుతున్నావో చెప్పు? నేను నీ పట్ల చేసిన అపచారం ఏమిటి? కారణం చెప్పాలనిపిస్తేనే చెప్పు. ఇందులో నిర్బంధమేమీ లేదు’ అన్నాడు ధర్ముడు. ‘ధర్మపురుషా! నా కోపం నిష్కారణమైనది కాదు. నా కోపానికి తగిన కారణం ఉంది. చెబుతాను, విను! నేను చాలా కష్టపడి దయా శౌచాలతో నా శరీరాన్ని పరిశుద్ధం చేసుకున్నాను. నీ దర్శనం కోసం పదివేల ఏళ్లు అత్యంత కఠోరంగా తపస్సు చేశాను. అయినా, నువ్వు నన్ను కరుణించలేదు. ఇంతకాలం వేచి ఉండేలా చేశావు. నీకు నా మీద దయ లేదు. అందుకే నీ మీద కోపం వచ్చింది. అందుకే నిన్ను శపించాలనుకున్నాను’ కొంచెం కినుకగా పలికాడు దుర్వాసుడు.‘మహర్షీ! దయచేసి శాంతించు. నువ్వు తొందరపడి శపిస్తే, నీ శాపానికి నేను నాశనమైతే, ఈ లోకమంతా నశిస్తుంది. నీ బాధకు మూలకారణాన్ని తొలగిస్తాను. ఇహపరాల్లో నీకు గొప్ప సుఖం కలిగేలా చేస్తాను. లోకంలో ముందు సుఖాన్ని పొందినవాళ్లు తర్వాత దుఃఖాన్ని పొందుతున్నారు. ముందు దుఃఖాన్ని పొందినవాళ్లు తర్వాత సుఖాన్ని పొందుతున్నారు. పాపాత్ములు ఏ శరీరంతో పాపం చేస్తారో, అదే శరీరంతో బాధలు అనుభవిస్తారు. అది వారు చేసిన పాపానికి ఫలం’ అని ధర్ముడు హితబోధ చేశాడు.అంతా విన్నప్పటికీ దుర్వాసుడు కినుక మానలేదు. ‘ధర్మపురుషా! నువ్వెన్ని చెప్పినా, నీ మీద నాకు కోపం తగ్గడంలేదు. అందువల్ల నిన్ను శపించాలనే అనుకుంటున్నాను’ అన్నాడు. ‘ఓ మహర్షీ! నా వల్ల నీకు కోపం వస్తే, దయచేసి క్షమించు. క్షమించకుంటే నన్ను దాసీపుత్రుడిగా చేయి లేదా రారాజుగా చేయి లేదా చండాలుడిగా చేయి. వినయంగా ఉండేవారిపై బ్రాహ్మణులు ప్రసన్నత చూపరు కదా!’ అన్నాడు. దుర్వాసుడు వెంటనే, ‘ధర్మపురుషా! నువ్వు కోరినట్లే రారాజువుగా, దాసీ పుత్రుడిగా, చండాలుడిగా జన్మించు’ అని ఏకకాలంలో మూడు శాపాలనిచ్చి వెళ్లిపోయాడు.దుర్వాసుడి శాపఫలితంగా ధర్మపురుషుడు తర్వాతి కాలంలో పాండురాజుకు ధర్మరాజుగా, దాసీపుత్రుడు విదురుడిగా, విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని బాధించినప్పుడు చండాలుడిగా పుట్టాడు. చివరకు ధర్మపురుషుడు కూడా తాను చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. – సాంఖ్యాయన -
దేహం.. గాలిలో కదిలే దీపం!
ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఇక్కడ దేనికి, ఎప్పుడు కాలం చెల్లిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. కనుక, ఇక్కడ శాశ్వతమైనది ఏది? అని ప్రశ్న వేసుకుంటే ‘అంతాన్ని గురించిన అనిశ్చితియే!’ అనే సమాధానం దొరుకుతుంది. ఆ అనిశ్చితిని మనసులో ఒక వాస్తవంగా స్థాపించుకున్న వ్యక్తికి దుఃఖం దూరమై, ముక్తి దగ్గరౌతుందని విజ్ఞులు చెప్పారు.వేదాంత పరమైన ఈ వాస్తవాన్ని కనుపర్తి అబ్బయా మాత్యుడు, తాను రచించిన ‘కవిరాజ మనోరంజనం’ ప్రథమాశ్వాసంలోని ఒక సన్నివేశంలో పురూరవుడికి, నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణలో భాగంగా ఒక చక్కటి పద్యంలో చెప్పాడు. తన జనరంజక పాలనను గొప్పగా పొగుడుతున్న నారదుడితో పురూరవుడు ఎందరో రాజులు ఈ పుడమిని ఇంతకు మునుపు గొప్పగా పాలించారు కనుక తనను అంతగా పొగడవలసిన పనిలేదని చెప్పాడు. ఆపై సంభాషణ కొనసాగింపుగా ఇలా అంటాడు..దేహము వాయుసంచలిత దీపిక, పుత్రకళత్ర మిత్ర సందోహము స్వప్నకాలమున దోచెడి సందడి రాజ్యభోగ సన్నాహము జంత్రపుంబ్రతిమ నాట్యము సంపద యింద్రజాల మీయైహికసౌఖ్య మేమి సుఖమంచు దలంచెదనయ్య నారదా!పద్యం ప్రారంభంలోని ‘దేహము వాయుసంచలిత దీపిక’ అనే మాట లలో సామాన్యము, విశేషము అయిన రెండు భావాలు అవగత మౌతాయి. మానవ దేహం గాలిలో కదులుతున్న దీపం వంటిది. ఎప్పుడైనా ఆరిపోవచ్చు. ఆ కారణంగా దాని భవితవ్యం అనిశ్చితం అని సామాన్యార్థం. విన్నవెంటనే మనసుకు తోచే అర్థం. ఇక రెండవది – మానవ శరీరంలో ఊపిరి అనే వాయువు ప్రసరిస్తున్నంత వరకు దేదీప్యమానంగా వెలిగే దీపం వంటిది ఈ దేహం. ఊపిరి ప్రసరణం ఆగిపోగానే అదీ ఆగిపోతుంది, ఆరి పోతుంది అనే విశేషమైన భావం! ఈరెండు భావాలు కూడా పద్యంలోని సందర్భానికి సొగసును కూర్చేవే!‘భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులతో కూడిన జీవితం, సందడి అంతా కలలో జరిగేదిగానే భావిస్తాను. జీవం లేని మరబొమ్మ చేసే నాట్యం వంటిది రాజ్యభోగం అనీ, ఐంద్రజాలికుడు వెదజల్లే ధనం వంటిది సంపద అనీ సదా భావించి, ఇహలోకంలో సౌఖ్యం లేదనుకోవడంలోనే సుఖముందని నేను భావిస్తాను!’ అనేది పురూరవుడు నారదుడితో చెప్పిన మాటలకు అర్థం. – భట్టు వెంకటరావు -
కోపానికి మహోగ్ర రూపం.. మౌనం!
మనుషులు భిన్న వైరుధ్యాలతో ఉంటారు. ఉన్న వారు, లేనివారు అని మాత్రమే కాదు. మంచి వాళ్లు, చెడ్డవాళ్లు; రూపసులు, కురూపులు; ఇంకా... ఉల్లాసంగా ఉండేవాళ్లు, ఉసూరుమంటూ పడి వుండే వాళ్లు; ఆలోచనాపరులు, ఉద్వేగప్రాణులు; తియ్యగా మాట్లాడేవారు, మాటలసలే రానివాళ్లు, అలాగే ఉత్తి పుణ్యానికి భగ్గుమనేవారు కొందరైతే, కోపమే తెచ్చుకోని వారు మరికొందరు. ఈ జాబితా లోని చివరి వైరుధ్యం గురించే నేను ఈ వారం మాట్లాడబోతున్నది. దీనికి కారణం ఏమిటంటే, నేను ఇట్టే చికాకు పడిపోతాను. మర్యాదస్తుల సమాజం నన్ను ‘షార్ట్ టెంపర్డ్’ అంటుంది. అయితే మీరు నన్ను ఓర్పు లేని, సహనం లేని మనిషి అనవచ్చు. చివరికి కోపధారి అని కూడా.నాలోని వైరుధ్యం ఏమిటంటే... శాంతంగా ఉండేందుకు నేను ప్రయ త్నిస్తున్నానని నాకు అనిపించటంతోనే నేను నా ప్రసన్నతను కోల్పోతూ ఉంటాను. ఎంతగానంటే కోపాన్ని అణచుకోవటం నాకు అలవిమాలిన సవా లుగా అనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇంగితజ్ఞానం లేకుండా, ఉద్దేశ పూర్వకంగా నన్ను రెచ్చగొడుతున్నప్పుడు కొద్ది నిముషాలు మాత్రమే నన్ను నేను నిగ్రహించుకుని ఉండగలను. తర్వాత, హఠాత్తుగా పెను వేగంతో నా చిరునవ్వు మాయమవటం మొదలై, నా మెదడు పదునైన మాటలతో పొంగి పొర్లి దెబ్బకు దెబ్బా తిప్పికొట్టటానికి నేను సిద్ధమౌతాను. ఒక మెరుపుదాడిలా నా కోపం బయటికి బద్ధలౌతుంది.వెసూవియస్ అగ్నిపర్వతంలా అది సత్వర మే చిత్రంగా అంతటా వ్యాప్తి అవుతుంది. అదృష్టవశాత్తూ మరిగి ఉన్న టీ పాత్రలా నేను వేగంగా చల్లబడ తాను. కానీ మళ్లీ లావా లాగా – లేదా, చింది పడిన వేడి నీళ్ల మాదిరిగా – ఆ నష్టం చాలా ఎక్కువ కాలం ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే నేను కోపం ప్రదర్శించిన వ్యక్తులు గుంభనంగా ఉండిపోతారు. వాళ్లు అంత తేలిగ్గా బద్దలవరు. నిజానికి వాళ్లు అలా బద్దలవటానికి సిద్ధపడేముందు చాలా సమయం తీసుకుంటారు. ఒకసారి బద్దలయ్యాక రోజుల పాటు వారు రగిలి పోతూ ఉంటారు. వెంటనే చల్లారటం ఉండదు.అలాంటి మనిషి నా భార్య నిషా. మా తొలి తగాదా చాలా చిన్నదైన ఒక విషయం మీద జరిగింది. అది ఇలా సాగింది: తన ధ్యాస నాపై ఉండటాన్ని నేను కోరుకుంటానన్న సంగతి నిషాకు బాగా తెలుసు. నేను ఆశించినట్లే తను ఉండేది. సమస్యేమిటంటే... నేను ఆశిస్తున్నట్లు తను ఉంటున్నానన్న గమనింపును నిషా నాలో కలిగించేది. దాంతో ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నాకు తెలిసిపోయింది. అటువంటి సందర్భాలలో నిషా నన్ను ‘కె.టి. బాబా’ అని పిలిచేది. అలా పిలవటంలో ప్రేమా ఉండేది, నవ్వులాటా ఉండేది.ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నా గ్రహింపునకు వచ్చినప్పుడు మొదట నేను జోక్గానే తీసుకున్నాను. కానీ జోకులతో సమస్య ఏమిటంటే మిగతా వారు కూడా వాటిల్లోకి చొరబడతారు. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్, ఇంకా అఫ్తాబ్, మరొక స్నేహితుడు నిషా మాటల్ని పట్టుకుని నాపైకి నవ్వులాటకు వచ్చేవారు. నిమి షాల వ్యవధిలోనే అది అటువైపు ముగ్గురు, ఇటువైపు ఒక్కరు అయ్యేది. ఆ తర్వాత నా మతిస్థిమితం నాపై విజయం సాధించి హాస్యమంతా పాడైపో టానికి ఎంతో సమయం పట్టేది కాదు.నా ఉద్వేగం నా తలలోకి పరుగులు పెట్టేది. నా ముఖం ఎర్రబడేది. నా గొంతు పైకి లేచేది. దురదృష్టవశాత్తూ, ఇలా జరగటం అన్నది రాబోయే ప్రమాదం నుంచి వాళ్లను హెచ్చరించటానికి బదులుగా వాళ్లను మరింతగా నవ్వులాటకు పురిగొల్పేది. ఆ మాటల యుద్ధంలో నేను తలదూర్చేలా నా కోసం వల పన్ని వేడుకగా చూస్తుండేవారు.ఆ ముగ్గురితో నేను గొడవ పడేవాడినని చెప్పటం సరిగ్గా ఉంటుంది. అయితే ప్రవీణ్, ఆఫ్తాబ్ నవ్వుతూ కొట్టి పడేస్తే, నిషా నా కోపాన్ని తను చిన్నతనంగా భావించి బాధపడేది. మీరు కనుక పెళ్లయినవారైతే భార్యలు... భర్తల (అలాంటి) తత్వాన్ని అక్కడ ఉన్నదాని కంటే చాలా ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తుంది. వాళ్లంతా వెళ్లాక నిషా నాపై తన కోపాన్ని కుమ్మరించింది.‘‘మీరొక పరమ బుద్ధిహీనుడిలా ప్రవర్తించారు.’’ ‘‘నవ్వులాటను తేలిగ్గా తీసుకోలేరా?’’ అని నిషా. ‘‘అదేం తమాషాగా లేదు’’ అని నేను. ‘‘అందరికీ తెలుసు అదంతా తమాషాకేనని. కానీ అది మీ మీద జోక్ కనుక మీకు కోపం వచ్చింది’’ – నిషా. ఇరవై నిముషాల తర్వాత నా కోపం అంతా చల్లారిపోయింది. నేను ప్రశాంతచిత్తుడినై ఉండిపోయాను. కానీ నిషా ఇంకా తన కోపాన్ని లోలోపల అణచుకునే ఉంది.‘‘కాఫీ’’ అని అడిగాను. మౌనం! ‘‘టీ?’’ అన్నాను, అది కాకపోతే ఇది అన్నట్లు. మరింతగా మౌనం! ‘‘ఏంటి నీ బాధ?’’ అని పెద్దగా అరిచాను... ఆమె నాతో మాట్లాడటానికి తిరస్కరిస్తున్నందువల్ల వచ్చిన కోపంతో. అప్పుడు కూడా మౌనం! ‘‘ఛీ పో...’’ అన్నాను. ‘‘నువ్వే ఛీ పో’’ అంటూ అప్పుడు నోరు తెరిచి, మళ్లీ మౌనంగా ఉండిపోయింది. ఇదంతా సర్దుకోడానికి రెండు రోజులు పట్టింది.ఏమైనా, బయటివాళ్లతో వచ్చే తగాదాలు బద్దలయ్యేంతగా గానీ, దీర్ఘ కాలం కొనసాగేంతగా గానీ ఉండవు. ఇట్టే అవి చెలరేగితే చెలరేగి ఉండొచ్చు గాక. నాకిప్పుడు తెలుస్తోంది నా ప్రారంభ ప్రతిస్పందన ఆత్మనిగ్రహం లేని దిగా, సాధారణంగా నా వైపు నుండే తప్పును ఎత్తి చూపించేదిలా ఉంది అని. కానీ ఏం చేయటం, నాకు తెలివి వచ్చేటప్పటికే బాగా అలస్యం అయిపోయింది. తర్వాత నేను చేయగలిగిందంతా నేనే మొదట క్షమాపణలు చెప్పి పరిస్థితిని చక్కబరచుకోవటం. కొన్నిసార్లు అది పని చేస్తుంది కానీ అన్నిసార్లూ కాదు. ఆఫీసులో నా సహోద్యోగులు కొందరు రోజుల తరబడి బిగదీసుకుని ఉండేవారున్నారు.గతవారం, మానవ ప్రవర్తనల్ని విశ్లేషించే ఒక అమెరికన్ ఇచ్చిన వివరణ అనుకోకుండా నా దృష్టికి వచ్చింది. ‘‘షార్ట్ టెంపర్డ్గా ఉండేవాళ్లకు, అంటే... తేలిగ్గా, తరచు తప్పుగా కోపం తెచ్చుకునేవాళ్లకు మనసులో ఏమీ ఉండదు. అంతా పైకే కనబరిచేస్తారు. తమను ఎగతాళి చెయ్యటాన్ని వారు నవ్వుతూ తీసుకుంటారు. అయితే దాని వల్ల వారు తరచు అన్యాయంగా వెక్కిరింపులు పడవలసి వస్తుంది. దాంతో అదుపు తప్పుతారు. వాళ్ల మాదిరిగా నియంత్రణ కోల్పో వటం మంచిదే. కానీ అందులో మీరు నిజాయితీగా ఉండండి. దారి మళ్లించటానికి, మనసులో ఉన్నది దాచిపెట్టుకోటానికి మాత్రమే నిజమైనది కాని మౌనాన్ని కొనసాగించండి.’’నిషా ఈ మాటల్లోని సమర్థనీయతను అంగీకరించి ఉండేదా అని నా ఆశ్చర్యం. లేదంటే, ఆమె పెద్దగా నవ్వి, ‘‘కె.టి. బాబా ఇదంతా మీరు కల్పించారు కదా? వినటానికైతే బాగుంది’’ అని ఉండేదా? కావచ్చు. అప్పుడైతే అది మానవ ప్రవృత్తిలోని గొప్ప విషయం.– కరణ్ థాపర్, వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్ -
మట్టి పరిమళం: ఈ పెర్ఫ్యూమ్తో.. బయట వర్షం పడుతుందేమో అనే అనుభూతి..
వేడి, పొడి వాతావరణంలో ఒక్కసారిగా కురిసే చినుకులతో భూమి నుండి వెలువడే ఆహ్లాదకరమైన సువాసన మనసును సేదతీరుస్తుంది. ఇది మట్టి వెదజల్లే సహజ పరిమళం కావడంతో మన మనసుల్ని సంతోష సాగరంలో విహరింపజేస్తుంది. తొలకరి చినుకులు నేలను తాకినప్పుడు వచ్చే ఈ మట్టి సువాసనను ఆస్వాదించడంలో ఆడ–మగ అనే భేదమేమీ లేదు. అందుకే, ఈ సువాసనలు ఇప్పుడు అత్తరు రూపంలో అందరినీ అల్లుకు పోతున్నాయి.ప్రకృతి నుండి ప్రేరణ పొంది, సురక్షితమైన పదార్థాలతో తయారైన మట్టి అత్తరు పరిమళాలకు వందల సంవత్సరాల నైపుణ్యం గల వారసత్వ కంపెనీలు కూడా ఉన్నాయి. చెమట వాసనను దూరం చేస్తూ విభిన్న శ్రేణి వ్యక్తులను ఆకర్షిస్తుంది. ‘ది సెంట్ ఆఫ్ రైన్’ లేదా ‘పెట్రిచోర్ ఎసెన్షియల్ ఆయిల్’గా ప్రసిద్ధి చెందినవీ ఉన్నాయి. అన్ని దేశాలలోనూ ఈ తరహా సువాసనలను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఆఫ్లైన్–ఆన్లైన్ మార్కెట్లో వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు ఈ ఎర్త్ సెంటెడ్ పెర్ఫ్యూమ్స్ అందుబాటులో ఉన్నాయి.చెక్.. తప్పనిసరి:– మనసును కదిలించే ఈ సువాసనగల అత్తరులో ఆల్కహాల్ వాడకం లేనివి ఎంచుకోవాలి.– అత్తరు లేదా పెర్ఫ్యూమ్ మన చర్మ తత్త్వానికి సరిపడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ముందుగా దూది ఉండతో మణికట్టు, చెవి వెనక భాగాన కొద్దిగా అద్ది/స్ప్రే చేసి, 30 నిమిషాలు ఉండాలి. సరిపడితే రోజూ ఉపయోగించుకోవచ్చు.ప్రయోజనాలు ఏంటంటే?– మట్టి పరిమళం గల సహజ అత్తరు/పెర్ఫ్యూమ్ను వాడి మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్ కావచ్చు.– ఏకాగ్రతను మెరుగుపరుచుకోవాలనుకునేవారికి ఉత్తమమైన సాధానాలలో మట్టి పరిమళం ఒకటి లగ్జరీ హోటళ్లు, యోగా అండ్ ఆయుర్వేద రిసార్ట్లలో, అరోమా థెరపీ రిట్రీట్లలో సుగంధ లేపనాల తయారీలోనూ ఈ మట్టి అత్తరును ఉపయోగిస్తుంటారు.– మట్టి పరిమళం స్ప్రే చేసుకొని వెళితే మీ చుట్టూ ఉన్నవారు బయట వర్షం పడుతుందేమో అన్న అనుభూతికి లోనుకాకుండా ఉండలేరు.ఇవి చదవండి: Healthy Diet: ఓట్స్ – పొటాటో చీజ్ బాల్స్! -
'ఉపవాసం' అంటే.. అసలు అర్థమేంటో తెలుసా!?
ఉపవాసం అంటే పస్తు ఉండటం, నిరాహారంగా ఉండటం అని వాడుక. కానీ ‘ఉప–వాసం’ అనే పదబంధానికి ఆహారంతో సంబంధం కనిపించదు. ‘ఉప’ అంటే ‘సమీపం’, ‘వాసం’ అంటే ‘నివాసం’. కాబట్టి ‘ఉపవాసం’ అంటే దగ్గరగా ఉండటం. దేనికి దగ్గరగా ఉండటం? ఉపవాసం చేసే సాధకుడు దేనికి దగ్గరగా ఉండాలనుకొంటున్నాడో దానికి!ఉదాహరణకు, ఒక భక్తుడు కొంత సమయం పాటు, ఎప్పటికంటే ఎక్కువగా, మనో–వాక్–కాయ–కర్మల ద్వారా తన ఇష్ట దైవానికి సన్నిహితంగా ఉండాలని సాధన చేస్తే, అది ఉపవాస సాధన అవుతుంది. శరీరాన్ని వీలయినంత ఎక్కువ సమయం భగవన్మూర్తికి దగ్గరగా ఉంచుతూ, ఇతర లౌకిక విషయాలకు దూరంగా ఉంచటం శారీరకమైన ఉపవాసం.వాక్కును కొంతకాలం పాటు భగవత్ స్తోత్రాలకూ, భగవద్వి షయమైన చర్చలకూ పరిమితం చేయటం వాక్కుపరమైన ‘ఉపవాసం’. మనసును ఆహార విహారాల లాంటి ఇంద్రియ విషయాల మీదనుంచి కొంతసేపు మళ్ళించి, దైవం మీద నిలిపి ఉంచటం మానసికమైన ఉపవాసం. అలాగే లౌకికమైన పనులకు కొంతకాలం సెలవిచ్చి, ఆ సమ యాన్ని పూజలకూ, ఆరాధనలకూ, అభిషేకాలకూ, వ్రతాలకూ వెచ్చించడం... కర్మల పరంగా దైవానికి సమీపంగా ఉండే ‘ఉపవాసం’.ఈ దేహమూ, ఇంద్రియాలూ, మనస్సు– ఇవే ‘నేను’ అన్న మిధ్యా భావనలో మునిగిపోయి, వీటికి అతీతంగా వెలుగుతుండే ఆత్మజ్యోతి తన అసలు రూపం అని మరిచిపోయిన జీవుడు, కొంతకాలం పాటన్నా దేహేంద్రియ వ్యవహారాలకు దూరంగా, తన స్వ స్వరూపానికి దగ్గరగా వెళ్ళి దానిని గుర్తించేందుకు చేసే సాధన ‘ఉపవాసం’ అని వేదాంతులు వివరణ ఇచ్చారు.మామూలుగా రోజూ తినే ఆహారం మీద నుంచి దృష్టి మళ్ళించేసి, ఒక్కపూట మరేదయినా ఆహారం పుచ్చుకొంటే ఇహానికీ పరానికీ మంచిదన్న భావనతో, దాని మీద దృష్టి పెట్టడం కూడా ‘ఉపవాసమే’. కానీ అది మనో వాక్ కాయ కర్మలన్నిటి ద్వారా, ఆ కొత్త ఆహారానికి ‘సమీపంగా ఉండటం’ మాత్రమే అవుతుంది. – ఎం. మారుతి శాస్త్రి -
గౌరముఖుడి వృత్తాంతం!
కృతయుగంలో సుప్రతీకుడు అనే రాజు ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. వారికి ఎప్పటికీ సంతానం కలగకపోవడంతో సుప్రతీకుడు చిత్రకూట పర్వతంపై ఆశ్రమం ఏర్పరచుకున్న ఆత్రేయ మహర్షిని ఆశ్రయించి, ఆయన అనుగ్రహంతో దుర్జయుడనే పుత్రుణ్ణి పొందాడు.దుర్జయుడు అమిత బలవంతుడు. అపార సేనాసంపత్తితో దిగ్విజయయాత్రకు వెళ్లి, సమస్త భూమండలాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తర్వాత అష్టదిక్పాలకులను జయించి, విజయగర్వంతో తన రాజ్యానికి తిరిగి బయలుదేరాడు. దారిలో గౌరముఖుడు అనే మహర్షి ఆశ్రమం కనిపించింది. దుర్జయుడు తన సేనలను వెలుపలే నిలిపి, తానొక్కడే ఆశ్రమంలోకి వెళ్లాడు. గౌరముఖుడికి నమస్కరించి, ఆశీర్వచనం కోరాడు. గౌరముఖుడు రాజైన దుర్జయుడికి ఆశీర్వచనం పలికి, అతడికి, అతడి సైన్యానికి ఆతిథ్యం ఇస్తానన్నాడు. దుర్జయుడు ఆశ్చర్యపోయాడు. తనకు, లక్షలాదిమంది తన సైనికులకు ఈ ఒంటరి ముని ఎలా ఆహారం పెట్టగలడా అని ఆలోచించాడు.ఇంతలో గౌరముఖుడు సంధ్యావందనం ముగించుకుని వస్తానంటూ దగ్గరే ఉన్న గంగానదికి వెళ్లాడు. గంగలో నిలిచి ఆశువుగా శ్రీమన్నారాయణుడిని స్తుతిస్తూ స్తోత్రం పలికాడు. గౌరముఖుడి స్తోత్రం పూర్తి కాగానే, అతడి భక్తిప్రపత్తులకు అమిత ప్రసన్నుడైన శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గదాధారిగా ప్రత్యక్షమయ్యాడు. పీతాంబరాలతో దేదీప్యమానంగా మెరిసిపోతున్న స్వామిని చూసి గౌరముఖుడు పులకించిపోయాడు.‘వత్సా! ఏమి కోరిక’ అడిగాడు శ్రీమన్నారాయణుడు.‘స్వామీ! నా ఆశ్రమానికి రాజు దుర్జయుడు, అతడి పరివారం వచ్చారు. వారికి ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చాను. వారందరికీ భోజనం పెట్టగలిగేలా నాకు వరమివ్వు చాలు’ అని కోరాడు గౌరముఖుడు. నారాయణుడు అతడికి ఒక దివ్యమణిని ప్రసాదించి, ‘ఈ మణి నువ్వు కోరినవన్నీ ఇస్తుంది’ అని పలికి అదృశ్యమయ్యాడు.నారాయణుడు ప్రసాదించిన మణితో గౌరముఖుడు తన ఆశ్రమం ఎదుటనే ఇంద్రలోకాన్ని తలపించే మహానగరాన్ని సృష్టించాడు. అందులో రాజు దుర్జయుడికి, అతడి పరివారానికి విలాసవంతమైన విడిది ఏర్పాటు చేశాడు. వారంతా ఆనందంగా ఆ నగరంలోకి ప్రవేశించారు. వారికి సేవలందించడానికి దాసదాసీ జనాన్ని సృష్టించాడు. వారందరికీ షడ్రసోపేతమైన మృష్టాన్న భోజనాన్ని ఏర్పాటు చేశాడు. దుర్జయుడు, అతడి పరివారం సుష్టుగా భోజనం చేసి, వారికి ఏర్పాటు చేసిన విడిది మందిరాల్లో హాయిగా విశ్రమించారు.మర్నాడు ఉదయం అందరూ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానానికి గంగానదికి వెళ్లారు. వారంతా స్నానాలు చేసి తిరిగి వచ్చేసరికి, అంతకుముందు వరకు ఉన్న నగరం లేదు. అందులోని దాసదాసీ జనం ఎవరూ లేరు. కేవలం గౌరముఖుడి ఆశ్రమం మాత్రమే యథాతథంగా ఉంది. దుర్జయుడు, అతడి పరివారం గౌరముఖుడి దివ్యశక్తికి అమితాశ్చర్యం చెందారు.రాజు దుర్జయుడు, అతడి పరివారం గౌరముఖుడి వద్ద వీడ్కోలు తీసుకుని బయలుదేరారు. కొంత దూరం సాగాక దుర్జయుడు, అతడి పరివారం అటవీమార్గంలో కొద్దిసేపు విశ్రాంతి కోసం ఆగారు. అప్పుడు దుర్జయుడికి ఒక దురాలోచన వచ్చింది. ఆశ్రమంగా పర్ణశాల తప్ప మరేమీ లేని బడుగు ముని అయిన గౌరముఖుడు తనకు, తన సమస్త పరివారానికి రాజోచితమైన ఆతిథ్యం ఎలా ఇచ్చాడో అతడికి అంతుచిక్కని రహస్యంగా మిగిలింది. వెంటనే వేగులను పిలిచి, ‘మనందరికీ ఆ ముని గౌరముఖుడు ఎలా ఆతిథ్యం ఇవ్వగలిగాడు? దీని వెనుకనున్న మర్మమేమిటి? ఇందులో ఏదైనా మంత్ర మహిమా ప్రభావం ఉందా? అసలు రహస్యాన్ని తెలుసుకుని రండి’ అని పురమాయించి పంపాడు.రాజాజ్ఞ కావడంతో వేగులు హుటాహుటిన గౌరముఖుడి ఆశ్రమంవైపు బయలుదేరారు. వారు మాటు వేసి గౌరముఖుడి వద్ద ఉన్న మణి మహిమను తెలుసుకున్నారు. తిరిగి వచ్చి, రాజుకు అదే సంగతి చెప్పారు.‘ఒంటరిగా తపస్సు చేసుకునే మునికి ఎందుకు అంతటి దివ్యమణి? అలాంటిది నావంటి రాజు వద్ద ఉండటమే సమంజసం. ఆ మణిని నాకు ఇవ్వగలడేమో కనుక్కుని రండి’ అంటూ దుర్జయుడు తన భటులను పంపాడు. వారు గౌరముఖుడి వద్దకు వెళ్లి, తమ రాజు ఆ మణిని కోరుతున్న సంగతి చెప్పాడు. గౌరముఖుడు ఆ మణిని ఇవ్వడానికి నిరాకరించాడు. భటులు వెనుదిరిగి, ఈ సంగతిని రాజుకు నివేదించారు.గౌరముఖుడు తన కోరికను కాదనడంతో దుర్జయుడికి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే సైన్యాన్ని తీసుకుని గౌరముఖుడి ఆశ్రమాన్ని ముట్టడించాడు. దుర్జయుడు సైన్యంతో వస్తుండటం చూసి, గౌరముఖుడు మణిని చేతిలోకి తీసుకుని శ్రీమన్నారాయణుడిని స్మరించుకున్నాడు. రాజు వల్ల, అతడి సైన్యం వల్ల ఆపదను పోగొట్టాలని ప్రార్థించాడు. ఒక్కసారిగా మణి నుంచి వేలాదిగా సాయుధ సైనికులు ఉద్భవించారు.వారు దుర్జయుడి సైన్యాన్ని ఎదుర్కొని, చంపిన వాళ్లను చంపి, మిగిలినవాళ్లను తరిమికొట్టారు. కొంత సమయం తర్వాత గౌరముఖుడు యుద్ధరంగానికి వెళ్లి, అక్కడే కూర్చుని శ్రీమన్నారాయణుడిని ప్రార్థించాడు. ఆయన ప్రత్యక్షమవగానే, దుర్జయుడి ఆగడాన్ని నివారించమని కోరాడు. శ్రీమన్నారాయణుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి, దుర్జయుడి శిరసును ఖండించాడు. – సాంఖ్యాయన -
స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం..
కాలేజీ రోజుల్లో కల కనని వారు అంటూ ఉండరు. ఆ కలకు కష్టం, అంకితభావం తోడైతే ఎంత పెద్ద విజయం సాధించవచ్చో ‘దిగంతర’ నిరూపించింది. అనిరుథ్ శర్మ, రాహుల్ రావత్, తన్వీర్ అహ్మద్ అనే కుర్రవాళ్లు కాలేజీ రోజుల్లో కన్న కలను స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం చేసుకొని తిరుగు లేని విజయాన్ని సాధించారు..‘దిగంతర మొదలైనప్పుడు, ఇప్పటికి తేడా ఏమిటి?’ అనే ప్రశ్నకు వినిపించే జవాబు... ‘దిగంతర’ అంటే అంతరిక్ష వ్యర్థాలను గుర్తించే సంస్థగానే ఎక్కువ గుర్తింపు ఉండేది. తాజా విషయానికి వస్తే... వినియోగదారులకు సేవలు అందించడం మాత్రమే కాకుండా మన దేశ రక్షణ ప్రయోజనాల విషయంలో మౌలిక సదు΄ాయాలను అందించే సంస్థగా అభివృద్ధి చెందింది. ‘అంతరిక్షంలో ఏం జరుగుతుంది?’ అనేది అర్థం చేసుకోవడానికి స్పేస్ డొమైన్ అవేర్నెస్ కంపెనీగా ఎదిగింది.దిగంతరకు సంబంధించిన ఐడియా కాలేజీ రోజుల్లోనే అనిరు«థ్ శర్మ, రాహుల్ రావత్లకు వచ్చింది. బెంగళూరులో శాటిలైట్ క్లబ్ నిర్వహిస్తున్న తన్వీర్ అహ్మద్తో కలిసి ‘దిగంతర’ కలను సాకారం చేసుకున్నారు. విమానయానం, సముద్ర నావిగేషన్కు సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సంస్థలు, నియమాలు ఉన్నాయి. అంతరిక్షానికి సంబంధించి అలాంటివి లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘స్పేస్ డొమైన్ అవేర్నెస్’కు ప్రాధాన్యత ఇస్తోంది దిగంతర.దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోంది. స్పేస్ డొమైన్ అవేర్నెస్ వల్ల అంతరిక్షంలో ఏం జరుగుతుందో అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. స్పేస్–మ్యాప్ (స్పేస్ మిషన్ ఎష్యూరెన్స్ ప్లాట్ఫామ్), స్టార్స్(స్పేస్ థ్రెట్ అసెస్మెంట్ అండ్ రెస్సాన్స్ సూట్) అనే రెండు సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేసింది కంపెనీ. అంతరిక్ష ఆధారిత సెన్సర్లు, గ్రౌండ్ ఆధారిత టెలిస్కోపిక్ అబ్జర్వేటరీల కాంబినేషన్ను ఉపయోగిస్తోంది దిగంతర.ఈ అబ్జర్వేటరీలలో మొదటిది లద్దాఖ్లో రానుంది. సెన్సర్ల నుంచి తీసుకున్న డెటా, వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, ఇతరత్రా సంస్థల నుంచి సేకరించిన డేటాతో తన సొంత లైబ్రరీలను ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఈ లైబ్రరీలను ఉపయోగించి విశ్లేషణలు అందించే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తోంది.‘దిగంతర’కు ‘సింగపూర్ స్పేస్ అండ్ టెక్నాలజీ’లాంటి అంతర్జాతీయ కస్టమర్లు ఉన్నారు. మైత్రి(మిషన్ ఫర్ ఆస్ట్రేలియా–ఇండియా టెక్నాలజీ, రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్)లో భాగంగా ఆప్టికల్ సెన్సర్ల సప్లైకు సంబంధించి ఆస్ట్రేలియాకు చెందిన స్పేస్ మెషిన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.స్పేస్ ఆపరేషన్స్, సిచ్యుయేషనల్ అవేర్నెస్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కటింగ్–ఎడ్జ్ టెక్నాలజీతో దూసుకు΄ోతున్న ‘దిగంతర’ అంతరిక్షానికి సంబంధించి అంతర్జాతీయ కంపెనీగా ఎదిగింది. ‘వర్క్ హార్డ్ డ్రీమ్ బిగ్’ అనేది ముగ్గురు మిత్రులకు ఇష్టమైన మాట. ఆ మాటకు అర్థం ఏమిటో ‘దిగంతర’ విజయం చెప్పకనే చెబుతోంది.ఇవి చదవండి: మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే? -
ఆషాఢంలో అత్తాకోడళ్లు ఒక గడప దాటకూడదా?
ఆషాఢంలో అత్తాకోడళ్ళు ఒక గడప దాట కూడదని, అత్తా అల్లుళ్లు ఒకరికొకరు ఎదురు పడకూడదని, కొత్త దంపతులు కలవకూడదనీ అంటారు. ఎందుకంటే..?సాధారణంగా వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులుప్రారంభిస్తారు. పూర్వం రోజుల్లో కొత్తగా పెళ్లయిన అబ్బాయి ఆరు నెలల కాలం అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో ఉంటే, సకాలంలో పనులు జరగవు.వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటిలా కాల్వల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే కష్టం కదా... అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు. అంతేకాకుండా, కొత్త నీరు వచ్చే ఆషాఢంలో ఆ నీరు తాగటం వల్ల రకరకాల రుగ్మతలకు లోను కావచ్చు.అంతేకాదు, ఈ కాలంలో గర్భధారణ జరిగితే పిల్లలు కలిగే నాటికి మంచి ఎండాకాలం... శిశువు పెరగటానికి అంత మంచి వాతావరణం కాదు అని ఆలోచించారు. అందుకే ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి రోజులకు అన్వయించుకుంటే... వ్యవసాయదారుల కుటుంబాలు కాకుండా ఇతరుల విషయంలో ఈ ఇబ్బంది లేదు.ఇవి చదవండి: పబ్లో.. ఫస్ట్ టైమ్! -
ఫుల్కారీ ఎంబ్రాయిడరీలో విభిన్న డిజైన్లు..
మన దేశీయ సంప్రదాయ కళలప్రాముఖ్యత ఎంతటిదో మనకు తెలిసిందే. పంజాబ్ ‘ఫుల్కారీ కళ’కు ప్రసిద్ధి. వారి సంప్రదాయ వేడుకలలో ప్రధానంగా కనిపిస్తుంది. ‘పూల కళ’గా పేరొందిన ఈ వర్క్ దుపట్టాలు, చీరలమీదనే కాదు ఆధునిక డ్రెస్సుల మీద, ఇతర యాక్సెసరీస్లోనూ కనువిందు చేస్తోంది. నక్షత్రాల్లా మెరిసి΄ోతూ ఆకర్షణీయంగా కనిపించే ఈ కళ పండగల వేళ మరింత ప్రత్యేకతను చాటుతోంది. ఫ్యాషన్ వేదికల మీదా కనువిందు చేస్తోంది.ఒక్కోప్రాంతానికి ఒక్కో విశిష్టత ఉన్నట్టే ఒక్కో కళ కూడా తన ప్రత్యేకతను చూపుతుంటుంది. హిందీలో ‘ఫూల్’ అంటే పువ్వు అని అర్థం. వేదకాలంలోనూ ఈ జానపద కళ మూలాలున్నాయని చెబుతుంటారు. అయితే, 15వ శతాబ్దంలో పంజాబ్లోని మహిళల ద్వారా మొదలైందని తెలుస్తుంది. వివాహాలు ఇతర వేడుకలలో మహిళలు ఫుల్కారీలు ధరించడం, బహుమతులు ఇవ్వడం అక్కడి సంప్రదాయం. ఇది పూర్తిగా గృహసంబంధమైన దేశీయ కళ. ఖద్దరు క్లాత్పైన రంగు రంగుల సిల్క్, కాటన్ దారాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు. రేఖాగణితంలోని జామెట్రీని ఈ డిజైన్లు ΄ోలి ఉంటాయి.ఎవర్గ్రీన్ ఆర్ట్ వర్క్..ఫుల్కారీ కండువాలు, శాలువాలు, దుపట్టాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ నేడు కుర్తాలు, లెహంగాలు, జాకెట్లు, స్టోల్స్, చీరలు, ష్రగ్లు, స్కర్ట్లు, కఫ్తాన్లు, ఫ్యూజన్ అవుట్ఫిట్లు, ΄ాదరక్షలు, బెల్ట్లు, హెయిర్ బ్యాండ్స్, బ్యాగ్లు, ΄ûచ్లు, క్లచ్లు, గొడుగుల డిజైన్లలోనూ.. ఫుల్కారీ కళ కనిపిస్తోంది.విభిన్న డిజైన్లు..ఈ డిజైన్లలో బాగ్, ఛమాస్, నీలక్, చోప్.. వంటి 52 రకాల ఫుల్కారీలు ఉన్నాయి. అయితే, వీటిలో కొన్ని మాత్రమే ఇప్పుడు వాడుకలో ఉన్నాయి. గతంలో ఈ ఎంబ్రాయిడరీని స్త్రీలు చేతులతో చేసేవారు. ఇప్పుడు యంత్రాలు, ఆధునిక పద్ధతులలో కొత్త వస్తువులను ఉపయోగిస్తున్నారు. ఈ కళ టెక్నిక్స్ని చాలా మంది ఆధునిక డిజైనర్లు గ్లోబల్ మార్కెట్ను చేరుకోవడానికి ఎంచుకుంటున్నారు.యాక్ససరీస్లోనూ ఫుల్కారీ వర్క్ప్రకృతితో ప్రేమ..ఫుల్కారీ మూలాంశాలకు ప్రేరణ ప్రకృతియే. తల్లీకూతుళ్ల అనుబంధం, జంతువులు, పక్షులు, ఉద్యానవనాలు, బంతి, మల్లెలు, నెమలి, ఆవ పూలు... స్త్రీల భావోద్వేగాలకు అద్దం పడుతున్నాయా అన్నట్టు ఈ కళ సృజనాత్మకతకు అద్దం పడుతుంది.సంప్రదాయ రంగులు..ఫుల్కారీ కళలో రంగుల వాడకం చాలా ముఖ్యమైన ΄ాత్ర ΄ోషిస్తుంది. సాంప్రదాయకంగా నాలుగు రంగులు మాత్రమే ఉపయోగిస్తారు. కాబోయే వధువులకు ఎరుపు, రోజువారీ వాడకంలో నీలం, నలుపు, ముదురు షేడ్స్ ఉపయోగిస్తారు. ఉత్సాహాన్ని సూచించడానికి ఎరుపు, శక్తి కోసం నారింజ, సంతానోత్పత్తికి ఆకుపచ్చ రంగును వాడతారు. -
అక్కర్లేని వెంపర్లాట!
ప్రాచీన కాలాన్నీ, ప్రస్తుత కాలాన్నీ పోల్చి చూస్తే, ప్రజల జీవన శైలిలో కనబడే ఒక ముఖ్యమైన వ్యత్యాసం నిరాడంబరత. పాత కాలంలో పెద్దలు నిరాడంబరంగా జీవించమని బోధించేవాళ్ళు. శుకమహర్షి నాటి నుంచీ, రమణ మహర్షి నాటి వరకూ తక్కువ అవసరాలతో, వనరులతో జీవనం సాగించే యోగులనూ, త్యాగులనూ సామాజికులు ఎక్కువ గౌరవించేవాళ్ళు. బాహ్యమైన పటాటోపాలనూ, ఆర్భాటాలనూ, వాక్– ఆభరణ – వస్త్రాడంబరాలను వదివేసి, అంతర్ముఖులై ఆత్మనిగ్రహంలో జీవించే వాళ్ళను ఆదర్శప్రాయులుగా భావించేవాళ్ళు.క్రమంగా ఇది తలకిందులవుతున్నట్టు కనిపిస్తుంది. ఇరవయ్యొకటో శతాబ్దంలో ఎక్కడ చూసినా ఆడంబరాల వెంపర్లాటే! వాడుకకు పనికి రాని పాతిక లక్షల రూపాయల చేతి సంచీలు కొని ధరించేవాళ్ళు ఆదర్శం. సమయం సూచించని యాభై లక్షల రూపాయల చేతి గడియారం ధరించడం మహనీయతకు చిహ్నం.కోట్ల రూపాయలు విలువ చేసే కార్లలో తిరిగే వాళ్ళను మించిన ఘనులు, వ్యక్తిగతమైన పుష్పక విమానాలలో తిరిగే ఆచంట మల్లన్నలు. బిడ్డ వివాహం నాలుగయిదు దశలుగా చేసి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం శ్రేష్ఠత్వానికి లక్షణం. ఎవరి పిచ్చి వారికి ఆనందమని సమర్థించవచ్చు కానీ, సామాన్య దృష్టికి ఇది కేవలం వెర్రితనంగా, ధనోన్మాదంగా కనిపిస్తుంది.ఈ ఆడంబర ప్రియత్వం మునుపు లేదని కూడా అనలేం. కానీ ఇటీవలి దశకాలలో ఇది మరింత వెర్రితలలు వేస్తున్నదనటం నిర్వివాదం. సమాజంలో కూడా ఈ ‘అతి’ని గర్హించే ధోరణికంటే, ఎవరికి చేతయినంత వరకు వాళ్ళు ఈ ఆడంబరాలను అనుకరించడమే జీవిత లక్ష్యమని నమ్మే భావజాలం బలపడుతున్నట్టు కనిపిస్తుంది.ఆడంబరాల మీద వ్యామోహం తీరని దాహం అని తెలిసీ దాని వెంట పరుగెత్తడం ఒక వ్యసనం లాంటిదే. దానివల్ల కలిగే కష్టనష్టాలు కూడా అందరూ ఎరిగినదే. ఎరిగి కూడా ఈ ఆడంబరాల మీది నుంచి దృష్టి మళ్ళించకపోతే ఇహపరాలలో ఉభయభ్రష్టత్వం మిగులుతుందేమో శ్రద్ధగా తర్కించుకోవడం శ్రేయస్కరం. – ఎం. మారుతి శాస్త్రిఇవి చదవండి: ఏది వాస్తవ చరిత్ర? -
ఆ ఉత్తరం ఈ దక్షిణం అన్ని రుచులూ అద్భుతః
మన వంటగదికి పొరుగింటి రుచిని అద్దుదాం. కేరళ కొబ్బరితో బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పెరుగుతో పంజాబీ కడీ చేద్దాం. శనగలతో జైసల్మీర్ చనే కూడా ట్రై చేద్దాం. పిల్లలకు అన్ని రుచులూ అలవాటైతే... పై చదువులకు ఏ రాష్ట్రానికి వెళ్లినా సరే... మన ఇంట్లో భోజనం చేసినట్లే ఉంటుంది.కేరళ పాలాపం..కావలసినవి..బియ్యం– పావు కేజీ;పచ్చి కొబ్బరి తురుము – యాభై గ్రాములు;నీరు– వంద మిల్లీలీటర్లు;చక్కెర – అర స్పూన్;ఉప్పు – అర స్పూన్;బేకింగ్ సోడా– చిటికెడు.తయారీ..బియ్యాన్ని శుభ్రంగా కడిగి మంచినీటలో ఐదు గంటల సేపు నానబెట్టాలి.మిక్సీలో బియ్యంతోపాటు కొబ్బరి తురుము కూడా వేసి తగినంత నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.ఇది ఆపం పిండి ∙బాణలిలో నీటిని పోసి, అందులో పై మిశ్రమాన్ని ఒక కప్పు వేసి గరిటెతో కలుపుతూ మరిగించి దించేయాలి.మిశ్రమం చల్లారిన తర్వాత ఆపం పిండిలో వేసి కలపాలి.ఈ పిండిని ఎనిమిది గంటల సేపు కదిలించకుండా ఉంచాలి. రాత్రి గ్రైండ్ చేసి పెడితే ఉదయానికి పొంగుతుంది.ఇందులో చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా వేసి గరిటెతో బాగా కలపాలి.మిశ్రమం గరిటె జారుడుగా ఉండాలి. అవసరాన్ని బట్టి మరికొంత నీటిని వేసుకోవచ్చు.ఆపం పెనం వేడి చేసి ఒక గరిటె పిండి వేసి అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పితే పిండి దోశెలాగ విస్తరిస్తుంది.మీడియం మంట మీద కాల్చాలి. కాలే కొద్దీ అంచులు పైకి లేస్తాయి.అట్లకాడతో తీసి ప్లేట్లో పెట్టాలి. దీనిని రెండవ వైపు కాల్చాల్సిన పని లేదు, కాబట్టి తిరగేయకూడదు.ఈ ఆపం అంచులు ఎర్రగా కరకరలాడుతూ మధ్యలో దూదిలా మెత్తగా ఉంటుంది.నూనె వేయాల్సిన పని లేదు. ఆపం పెనం లేకపోతే దోశె పెనం (ఫ్లాట్గా కాకుండా కొంచెం గుంటగా ఉండే పెనం) మీద ప్రయత్నించవచ్చు.పంజాబీ కడీ..కావలసినవి..– శనగపిండి మిశ్రమం కోసం: శనగపిండి– కప్పు;పెరుగు– 2 కప్పులు;నీరు– 4 కప్పులు;పసుపు– చిటికెడు.– కడీ కోసం: ఆవనూనె లేదా వేరుశనగ నూనె– టేబుల్ స్పూన్;పసుపు – అర టీ స్పూన్;ఇంగువ– పావు టీ స్పూన్;ఆవాలు – టీ స్పూన్;జీలకర్ర – టీ స్పూన్;మెంతులు – అర టీ స్పూన్;లవంగాలు – 3;ఎండుమిర్చి – 2;కరివేపాకు – 3 రెమ్మలు;ఉల్లిపాయ – 1 పెద్దది (తరగాలి);అల్లం– అంగుళం ముక్క (తరగాలి);వెల్లుల్లి– 4 రేకలు (తరగాలి);మిరపొ్పడి– అర టీ స్పూన్;ధనియాల పొడి –2 టీ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్;గరం మసాలా– అర టీ స్పూన్;ఆమ్చూర్ పౌడర్– 2 టీ స్పూన్లు లేదా పచ్చి మామిడి గుజ్జు టేబుల్ స్పూన్;కసూరీ మేథీ (ఎండిన మెంతి ఆకుల పొడి)– 2 టీ స్పూన్.– తడ్కా కోసం: నూనె – టేబుల్ స్పూన్;ఎండుమిర్చి– 2;కశ్మీరీ మిర్చిపౌడర్– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– టేబుల్ స్పూన్తయారీ..ఒక పెద్ద పాత్రలో పెరుగు, శనగపిండి వేసి బాగా కలిసేటట్లు చిలకాలి. అందులో పసుపు వేసి, నీరు పోసి మళ్లీ చిలికి అరగంట సేపు పక్కన ఉంచాలి.స్టవ్ మీద మందపాటి పాత్ర పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసి వేగనివ్వాలి.అవి వేగిన తర్వాత మిర్చిపౌడర్, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలపాలి.ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి– పెరుగు మిశ్రమాన్ని పోసి ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి.ఐదు నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికిన తర్వాత మంట తగ్గించి మూత పెట్టి పది నిమిషాల సేపు ఉడికించిన తర్వాత ఆమ్చూర్ పౌడర్, కసూరీ మేథీ, గరం మసాలా పొడి వేసి కలిపి దించేయాలి.బాణలి పెట్టి నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి, కశ్మీరీ మిర్చిపౌడర్ వేసి వేగిన తర్వాత ఉడికించిన కడీ మిశ్రమాన్ని పోసి చివరగా కొత్తిమీర చల్లితే పంజాబీ కడీ రెడీ.ఇది అన్నంలోకి బాగుంటుంది. పంజాబీ కడీలో నీరు ఎక్కువగా కలిపి పలుచగా చేసుకుని సూప్లా కూడా తాగుతారు.వర్షాకాలం, చలికాలం ఈ సూప్ తాగుతుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తేలిగ్గా, హాయిగా ఉంటుంది.జైసల్మీరీ చనే..కావలసినవి..ముడి శనగలు – కప్పు;నెయ్యి – టేబుల్ స్పూన్;ఇంగువ – చిటికెడు;జీలకర్ర– అర టీ స్పూన్;జీలకర్ర పొడి– టీ స్పూన్;ధనియాల పొడి – 2 టీ స్పూన్లు;మిరపొ్పడి – టేబుల్ స్పూన్;పసుపు– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;పెరుగు– ఒకటిన్నర కప్పులు;శనగపిండి –3 టేబుల్ స్పూన్లు;కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..శనగలను శుభ్రంగా కడిగి ఆరింతలుగా నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి.ఉదయం నీటిని వంపేసి మరోసారి కడిగి ప్రెషర్ కుకర్లో వేసి నాలుగు కప్పుల నీటిని పోసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.దించేసిన తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఒక వెడల్పు పాత్రలో శనగపిండి, పెరుగు, పసుపు, మిరపొ్పడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.పెనంలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, ఇంగువ వేయాలి.జీలకర్ర చిటపట పేలిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని వేసి అడుగుపట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.ప్రెషర్కుకర్లో ఉడికించి సిద్ధంగా ఉంచిన శనగలను నీటితో సహా ఉడుకుతున్న శనగపిండి, పెరుగు మిశ్రమంలో వేసి కలిపి మరో ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ జైసల్మీరీ చనే కర్రీ రోటీ, పుల్కాలతోపాటు అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది.ఇవి చదవండి: ఇంట్లో కూర్చుని.. త్రీడీ కిటికీలు ఎప్పుడైనా చూశారా? -
పిల్లలకు బ్రషింగ్ నేర్పడం ఇలా..
పెరిగే పిల్లల పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే, వాళ్లకు పళ్లు రంధ్రాలు పడటం, పుచ్చుపళ్లు రావడం వంటివి నివారించాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బ్రషింగ్ ప్రక్రియనూ నేర్పాలి..పళ్లపై ఏర్పడే గార తొలగిపోడానికి, అది ఏర్పడకుండా ఉండటానికి పేస్ట్తో రోజూ రెండుసార్లు బ్రష్ చేయడం నేర్పాలి.పళ్ల మీద గుండ్రంగా తిప్పుతున్నట్లుగా బ్రష్ను ఉపయోగించేలా చిన్నప్పటినుంచి అలవాటు చేయాలి.దానికి వాళ్లు అలా అలవడిపోయి, జీవితాంతం కరెక్ట్గా బ్రషింగ్ చేస్తారు.బ్రష్ మీద బఠాణీ గింజ అంత పేస్ట్ వేస్తే.. దానిని వారు మింగకుండా ఉంటారు.నాలుగేళ్లు దాటాక కూడా వేలు చప్పరించే పిల్లల పళ్లు వంకర టింకరగా రావడం లేదా ఒకేచోట గుంపుగా రావడం జరగవచ్చు. అందుకే ఈ అలవాటు త్వరగా మానేలా జాగ్రత్త తీసుకోవాలి.ఇవి చదవండి: Fashion: స్కర్టే.. సూపర్ స్టయిల్! -
Fashion: స్కర్టే.. సూపర్ స్టయిల్!
అమ్మాయిల సంప్రదాయ అలంకరణలో స్కర్ట్కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకేతరహా ఫ్యాబ్రిక్తో స్కర్ట్ సాదాసీదాగా కనిపించేది. దీనికి అదనపు హంగుగా కుచ్చులు జత చేసి, ఒకవైపు నుంచి మరోవైపుకు సెట్ చేస్తే.. వచ్చిన స్టైల్ డ్రేప్డ్ స్కర్ట్. షార్ట్ కుర్తీ, ట్యునిక్, ఖఫ్తాన్ వంటి టాప్స్ ఎంపిక ఏదైనా డ్రేప్డ్ స్కర్ట్కి జత చేస్తే ఆ స్టైల్ అదుర్సే మరి.ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్గా ఆకట్టుకునే డ్రేప్డ్ స్కర్ట్ వెస్ట్రన్ స్టైల్లోనూ యంగ్స్టర్స్ని ఆకట్టుకుంటుంది. ఫ్లోరల్ ప్రింట్లు, ఎంబ్రాయిడరీ వర్క్తో మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటుంది.డ్రేప్డ్ స్కర్ట్ అంచులు ఎగుడు దిగుడుగా ఉండటమే దీని ప్రత్యేకత. అందుకే ఎక్కువ భాగం ఈ స్కర్ట్కి ఎంబ్రాయిడరీ వంటి హంగులు అవసరం లేదు. టాప్గా ఎంచుకునే కుర్తీ, లాంగ్ అండ్ షార్ట్ జాకెట్స్, ఖఫ్తాన్, ట్యునిక్స్ని ఎంబ్రాయిడరీ లేదా ఫ్లోర ల్ వర్క్తో రిచ్లుక్ని తీసుకురావచ్చు.ప్లెయిన్ శాటిన్, సిల్క్ మెటీరియల్తో విరివిగా కనిపించే డ్రేప్డ్ స్కర్ట్ సెట్స్ ఇండోవెస్ట్రన్ లుక్ని సొంతం చేస్తుంది. అందుకే ఈ స్టైల్ యూత్ని అట్రాక్ట్ చేస్తుంది.టాప్ టు బాటమ్ ఒకే రంగులో ప్లెయిన్గా ఉండే డ్రేప్డ్ స్కర్ట్ సెట్స్ ఫ్యామిలీ గెట్ టు గెదర్ వేడుకలకు ప్రత్యేకంగా నిలిస్తే, పట్టు, ఫ్లోరల్, జరీ వర్క్తో డిజైన్ చేసినవి వివాహ వేడుకలలోనూ గ్రాండ్గా కనిపిస్తాయి.ఇవి చదవండి: Priya Sisters: ఆదాయం కన్నా.. అభిరుచిగానే మిన్న! -
Gaming: శతకోటి సూర్యప్రభా భాసిత... వీరాధివీరా!
పురాణాలు ఇప్పుడు కాలక్షేపం కోసం కాదు. వయసు మళ్లిన వారి కోసం మాత్రమే కాదు. మిలీనియల్స్ నుంచి జెన్ జెడ్ వరకు యువతరం పురాణాలను ఇష్టపడుతోంది. అయితే అది చదువు రూపంలో కాదు. గేమింగ్ రూపంలో. ఇండియన్ మైథలాజికల్ గేమ్స్ను ఆడడానికి గేమర్స్లో 82 శాతం మంది ఇష్టపడుతున్నట్లు చెబుతోంది గేమింగ్ అండ్ ఇంటరాక్టివ్ మీడియా ఫండ్ సంస్థ లుమికై. అర్జునుడి నుంచి కర్ణుడి వరకు రకరకాల పురాణపాత్రలలో ‘ప్లేయర్’ రూపంలో పరకాయ ప్రవేశం చేస్తోంది యువతరం...వెల్కమ్ టు గేమ్ జోన్..అహ్మదాబాద్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని శాన్వీకి గేమింగ్ అంటే బోలెడంత ఇష్టం. ఎక్కువ సమయాన్ని టెక్ట్స్బుక్స్తోనే గడిపే శాన్వీ కాసేపు వీడియో గేమ్స్ ఆడడం ద్వారా రిలాక్స్ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ‘డెత్స్ డోర్’ నుంచి ‘మాన్స్టర్ హంటర్’ వరకు ఎన్నో గేమ్స్ ఆడింది. అయితే ఒక ఫ్రెండ్ సలహా ప్రకారం కొన్ని నెలల క్రితం తొలిసారిగా ఇండియన్ మైథలాజికల్ గేమ్ ఆడింది. ఇక అప్పటి నుంచి అలాంటి గేమ్స్ మాత్రమే ఆడుతోంది.‘మైథలాజికల్ గేమ్స్కు ఇతర గేమ్స్కు తేడా ఏమిటో తొలిసారిగా తెలుసుకున్నాను. ఇవి కేవలం కాలక్షేప ఆటలు కావు. పురాణ జ్ఞానాన్ని, తార్కిక శక్తిని పెంచుతాయి’ అంటుంది శాన్వీ. ‘చిన్న పట్టణాలతోపాటు గ్రామీణ ్రపాంతాలలో కూడా స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడంతో గేమ్స్ ఆడేవారి సంఖ్య పెరిగింది. మన దేశంలో పెద్ద గేమింగ్ కన్జ్యూమర్ బేస్ ఉంది. గతంతో ΄ోల్చితే వచ్చిన మార్పు ఏమిటంటే మన సాహిత్యం, సంస్కృతితో ముడిపడి ఉన్న పాత్రలను యువ గేమర్స్ ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్–క్లాస్ టెక్నాలజీతో మనవైన పాత్రలను ఇండియన్ స్టూడియోలు డెవలప్ చేస్తున్నాయి’ అంటుంది ‘విన్జో గేమ్స్’ కో–ఫౌండర్ సౌమ్య సింగ్ రాథోడ్.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మన పురాణాలు, చరిత్ర, సంస్కృతి, జానపద సాహిత్యంలోని పాత్రల ఆధారంగా మరిన్ని గేమ్స్ ఆన్లైన్ గేమింగ్ సెక్టార్ నుంచి రానున్నాయి అంటుంది సౌమ్య. ‘పురాణాలను గేమింగ్తో మిళితం చేయడంతో ప్లేయర్స్ కొత్త రకం అనుభూతికి గురవుతున్నారు. అన్ని వయసుల వారిని ఈ గేమ్స్ ఆకట్టుకుంటున్నాయి’ అంటున్నాడు ‘ఇన్ఫోఎడ్జ్ వెంచర్స్’ ఫౌండర్ చిన్మయ్ శర్మ. ‘మన పురాణాల్లో దాగున్న ఎన్నో ఇతివృత్తాలు డెవలపర్లను ఆకర్షిస్తున్నాయి. ఆ పాత్రలు యూత్ను ఆకట్టుకునేలా గేమ్ను డిజైన్ చేస్తున్నారు’ అంటున్నాడు యుగ్ మెటావర్స్ సీయీవో ఉత్కర్ష్ శుక్లా.మైథలాజికల్ గేమ్స్ అనేవి ఎక్కువగా ఫస్ట్–పర్సన్ షూటర్(ఎఫ్పీఎస్) గేమ్స్. మెయిన్ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి ఆడే గేమ్స్.‘టెస్ట్ యువర్ స్కిల్స్ ఇన్ దిస్ ఎపిక్ స్ట్రాటజీ గేమ్’ అంటూ ఆహ్వానించిన ‘కురుక్షేత్ర: అసెన్షన్’ దిల్లీకి చెందిన సజనికి బాగా నచ్చింది. ఈ వీడియో గేమ్లో అర్జునుడు, భీముడు, కర్ణుడులాంటి ఎన్నో పాత్రలు ఉంటాయి.‘మైథలాజికల్ గేమ్స్ మనల్ని మన మూలాల్లోకి తీసుకువెళతాయి. మన పురాణాలు, జానపదాల ఆధారంగా గేమ్స్ను రూపొందించే అద్భుత అవకాశం ఇప్పుడు గేమ్ డెవలపర్లకు వచ్చింది. దేవ, దానవుల మధ్య యుద్ధానికి సంబంధించి సెకండ్ గేమ్ను రూపొందిస్తున్నాం’ అంటున్నాడు ‘కురుక్షేత్ర’ గేమ్ను రూపొందించిన ‘స్టూడియో సిరా’ కో–ఫౌండర్ అభాస్ షా.‘కురుక్షేత్ర’ను తక్కువ సమయంలో ఆరు లక్షలమంది డౌన్లోడ్ చేసుకున్నారు.మన దేశంలోనే కాదు ఆగ్నేయాసియా దేశాలలో కూడా భారతీయ పురాణాల ఆధారంగా రూపొందించిన గేమ్స్ను ఆడడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టాన్ని క్యాష్ చేసుకోవడం అని కాకుండా ఈ గేమ్స్ ద్వారా యువతలో నైతిక విలువలు పాదుకొల్పే, ఆత్మస్థైర్యం పెంచగలిగే ప్రయత్నం చేస్తే భవిష్యత్ కాలంలో వాటికి మరింత ఆదరణ పెరుగుతుంది. రాజీ పడకుండా...నోడింగ్ హెడ్స్ గేమ్స్ కంపెనీ రూపొందించిన ‘రాజీ: యాన్ ఏన్షియెంట్ ఎపిక్’ మనల్ని మన పురాణ ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. మన దేవాలయాల సౌందర్యం నుంచి ఇతిహాస కళ వరకు ఈ గేమ్లో ప్రతిఫలిస్తుంది. కంపెనీ ్రపారంభం నుంచి మన పురాణాల ఆధారంగా గేమ్ను రూపొందించాలని కల కన్నది పుణేకు చెందిన ‘నోడింగ్ హెడ్స్ గేమ్స్’ కంపెనీ ఫౌండర్ శృతి ఘోష్.‘రాజీ’ రూపంలో తన కలను నిజం చేసుకుంది.‘గ్రీకు ఇతర పురాణాలు సినిమాలు, గేమ్స్ రూపంలో మనల్ని ఆకట్టుకున్నాయి. అయితే ఆ స్థాయిలో మన పురాణాలు గుర్తింపు పొందలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పురాణాల ఆధారంగా రాజీ గేమ్కు రూపకల్పన చేశాం. ఇది ఎంతో మంది డెవలపర్లకు స్ఫూర్తిని ఇచ్చింది. ఎంత చెప్పినా మన పురాణాల్లో నుంచి చెప్పడానికి ఇంకా ఎంతో ఉంటుంది’ అంటుంది శృతి ఘోష్.– శృతి ఘోష్ -
International Day of Yoga 2024: యోగా... మరింత సౌకర్యంగా!
యోగా చేయడానికి సౌకర్యవంతమైన ప్రదేశం మాత్రమే కాదు అనువైన దుస్తులు ఉండటం కూడా అవసరం. నవతరం అభిరుచికి తగినట్టు ఇటీవల యోగా వేర్ కొత్తగా రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా నేతన్నలు చరఖాతో దారం వడికి మగ్గంపై నేసిన కాటన్తో తయారైన యోగా వేర్కి డిమాండ్ పెరుగుతోంది. మేనికి హాయిగొలిపేలా సౌకర్యంగా, వదులుగా ఉండే దుస్తుల డిజైన్లే యోగా వేర్లో కీలకమైన అంశాలు. యోగా డే సందర్భంగా సౌకర్యవంతమైన హంగులను మనమూ సొంతం చేసుకుందాం.– కాటన్ స్మోక్డ్ వెయిస్ట్ క్రాప్ టాప్ బాటమ్గా బ్లాక్ హారమ్ ప్యాంట్ ధరించడంతో క్రీడాకారిణి లుక్ వచ్చేస్తుంది.– ఆర్గానిక్ కాటన్తో డిజైన్ చేసిన ప్రింటెడ్ క్రాప్ టాప్, హారమ్ ప్యాంట్ ఇది.– మిడ్ లెంగ్త్ స్లీవ్స్ కాటన్ టాప్, సైడ్ పాకెట్స్ ఉన్న కాటన్ ప్యాంట్తో యోగా కదలికలలో సౌకర్యంగా ఉంటుంది.– కాటన్ షార్ట్ కుర్తీ లేదా క్రాప్ టాప్స్ని ధోతీ ప్యాంట్తో జత చేస్తే యోగసాధనలో సౌకర్యవంతమైన సంప్రదాయ శైలి కనిపిస్తుంది.– కాటన్ బెల్టెడ్ టాప్కి, పెన్సిల్ కట్ ప్యాంట్ యోగావేర్లో స్మార్ట్ లుక్తో ఆకట్టుకుంటుంది.– యోగా వేర్లో జంప్సూట్ డిజైన్స్ సౌకర్యాన్ని ఇస్తాయి.పర్యావరణ స్పృహ, వ్యక్తిగత శైలి, సౌకర్యం.. వీటిని దృష్టిలో పెట్టుకుని యోగా డ్రెస్ డిజైన్స్ని మెరుగుపరచవచ్చు.యోగా సాధనలో సౌకర్యవంతంగా, పర్యావరణ స్పృహని కలిగించే సంప్రదాయ యోగా డ్రెస్సులను ఎంచుకోవచ్చు. వీటికి ఆధునిక డిజైన్స్నీ కలపవచ్చు.లేత రంగులు, ప్లెయిన్గా ఉండే చేనేత వస్త్రాలు యోగా చేయడానికి సౌకర్యంతోపాటు హుందాతనాన్నీ పరిచయం చేస్తాయి.నడుము దగ్గర కాటన్ బెల్ట్, కాలి మడమల దగ్గర ప్రత్యేకమైన డిజైన్ని జోడించడం ద్వారా యోగా డ్రెస్సులను ఆకర్షణీయంగా మార్చేయవచ్చు.యోగాలో సౌకర్యం చాలా ముఖ్యమైనది. శ్వాసక్రియకు పర్యావరణ అనుకూలమైన దుస్తులను ఎంచుకుంటే ఫ్యాషన్గానే కనిపిస్తాం.శరీర కదలికలకు తగినట్టు డ్రెస్ కూడా ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా సహజ రంగులను ఉంచుకోవాలి.స్టైల్గా ఉండాలనుకుంటే హై వెయిస్టెడ్ ప్యాంట్స్, ర్యాప్టాప్ల వంటివి మార్కెట్లో లభిస్తున్నాయి. హైవెయిస్ట్ లెగ్గింగ్స్, క్రాప్టాప్స్, స్పోర్ట్స్ బ్రాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.హెయిర్ హెడ్ బ్యాండ్స్, సన్నని బ్రాస్లెట్స్, స్టడ్స్ లేదా చెవి ΄ోగులు వంటి తేలికైన ఆభరణాలను ధరించాలి.పార్క్ లేదా యోగా క్లాసులకు వెళ్లేటప్పుడు వెంట ఆర్గానిక్ కాటన్ లేదా రీ సైకిల్ చేసిన బ్యాగ్లో యోగాకు ఉపయోగించే మ్యాట్ను, వాటర్ బాటిల్నూ వెంట తీసుకెళ్లవచ్చు.యోగా ప్రయోజనాన్ని ఆనంద దాయకంగా మార్చుకోవాలంటే మాత్రం మీ అభ్యాసమే ముఖ్యమైనది. -
ఆరోగ్యమే ఆనందం..
అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం అని ఒక సినిమా పాట ఉంది. అదెంత నిజమో ఆరోగ్యమే ఆనందం అనడం కూడా అంతే నిజం. ఇంకా చెప్పాలంటే అందంగా ఉండేవాళ్లు ఆరోగ్యంగా ఉంటారో లేదో చెప్పలేం కానీ, ఆరోగ్యంగా ఉండేవాళ్లు మాత్రం ఆటోమాటిగ్గానే అందంగా కనిపిస్తారు. అందం మన శరీర ఆకృతి మీద ఆధారపడితే, ఆకృతి అనేది శరీర పోషణ మీద, ఆహారపు అలవాట్లమీద, జీవన శైలి మీదా ఆధారపడి ఉంటుంది. శరీర పోషణ మీద తగిన శ్రద్ధ చూపిస్తూ, క్రమబద్ధం గా వ్యాయామాలు చేస్తూ ఉంటే ఎప్పుడూ అందంగా ఆరోగ్యంగా యవ్వనంగా కనిపిస్తారు. అదెలాగో చూద్దాం.ఆహారం విషయంలో... శరీరాకృతి విషయంలో క్రమశిక్షణను పాటిస్తే దీర్ఘకాలం పాటు ఎవరికి వాళ్లు మేలు చేసుకున్న వాళ్ళవుతారు. ముందు నుంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. జబ్బులేమీ జోలికిరావు. మీరు ఏమి తింటున్నారు, ఎలా జీవిస్తున్నారు అన్నదాని మీద మీరు ఎలా కనిపిస్తున్నారు, ఎలా ఫీలవుతున్నారనేది ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా వుంటే ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు.మీ శరీరపు బ్యాటరీని రీఛార్జ్ చేయటానికి, మీ కండరాలలో శక్తిని పెంపొందించటానికి, జబ్బుల్నుంచి దూరంగా ఉండటానికి పెద్దగా కష్టపడిపోవాల్సిన పనేం లేదు. కొద్దిపాటి ఆరోగ్య సూత్రాల్ని పాటిస్తే చాలు. అవేంటో చూద్దామా?తీసుకునే ఆహారంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవటం, ఎక్సర్సైజుల్ని చేయటానికి సమయాన్ని కేటాయించటం, జీవితపు వొత్తిడిల నుంచి రిలాక్స్ కావటానికి ప్రయత్నించటం వంటివి చాలు.ఆరోగ్యంగా తినాలి..మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి కొవ్వు కూడా అవసరమే. అయితే మనలో చాలామంది శరీరానికి అవసరమైన దానికంటే 30 శాతం కొవ్వును అధికంగా కలిగి ఉంటున్నారని ఒక అంచనా. అలాంటి హెచ్చుతగ్గుల్ని నివారించటం కోసం ఆహారంలో సమతుల్యాన్ని పాటించటం చాలా అవసరం. ఇందుకోసం...– రోజూ మీరు తీసుకునే కాయగూరల్లో, ఆకుకూరల్లో వైవిధ్యాన్ని పాటించాలి.– కాఫీ, టీ వంటి వాటి విషయంలో మితాన్ని పాటించడం.– తాగ గలిగినన్ని మంచినీళ్ళను తాగాలి.– రోజుకు 900 కాలరీల లోపుగల ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.ఫిట్నెస్కి ప్రాధాన్యత..శరీరం తగినంత ఫిట్నెస్లో ఉంటే అనారోగ్యం తొందరగా దరిచేరదు. బాడీ అలా ఫిట్నెస్తో ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. ఎక్సర్సైజుల మూలంగా గుండె కండరాలు బలపడతాయి. శరీరంలో రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. రక్తంలో కొలెస్టరాల్ తగ్గుతుంది. శరీరం బరువు ఉండాల్సిన రీతిలో ఉంటుంది.ఇవన్నీ టెన్షన్ తగ్గించే అంశాలు. ఎక్సర్సైజులంటే – నడక, సైకిలింగ్, ఈత మొదలైనవి ఏవైనా సరే. దీనిని మాత్రం ్రపోగ్రామును నిదానంగాప్రారంభించాలి. క్రమ క్రమంగా పెంచుకుంటూ పోవాలి. అంతే తప్ప తొందరపడిప్రారంభంలోనే అతిగా చేయకూడదు.పోషకవిలువలు..శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే 13 ముఖ్య విటమిన్లు, 25 ఖనిజ లవణాలు మనం తీసుకునే ఆహారంలో తగు పరిమాణంలోలభించాలి కాబట్టి సమీకృత ఆహారాన్ని తీసుకోవాలి.ధూమపానం, మద్యపానాలకు స్వస్తి.. పొగ తాగేవాళ్ళకు, మద్యం సేవించే వాళ్లకు గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు రావటానికి రెట్టింపు అవకాశాలున్నాయి కాబట్టి ఈ రెండు అలవాట్లూ ఉన్న వాళ్లు వాటిని మానుకోవటం మంచిది.ప్రారంభంలో కొంచెం కష్టం కావచ్చు గాని గట్టిగా సంకల్పించుకుంటే అసంభవం మాత్రం కాదు కదా...మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి..రోజుకి అరగంట కాలాన్ని మనస్సు ప్రశాంత పరచుకోవటానికి కేటాయించాలి. మంచి పుస్తకాన్ని చదవటం, ధ్యానం, సంగీతం వినడం వంటి వాటి ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లు, అపజయాల గురించి ఆలోచించకుండా భవిష్యత్తుపట్ల ఆశావహ దృక్పథంతో వర్తమానంలో జీవించాలి.శరీరం చెప్పేది వినాలి.. ఆఖరుగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం చెప్పే దానిని వినాలి. శరీరం ఏ ఇబ్బందికి గురవుతున్నా – అంటే అస్వస్థతలకు గురవుతున్నా మనకు కొన్ని సూచనలను అందిస్తుంది. జ్వరం, నొప్పి, దగ్గు, వాంతులు, విరోచనాలు, ఇలాంటి లక్షణాల ద్వారా శరీరంఅనారోగ్య సూచనలను వెలువరిస్తుంటుంది. అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు శరీరాన్ని కండిషన్లోకి తెచ్చుకోవడం ఎవరికి వారు అనుసరించి తీరాల్సిన కర్తవ్యం. -
సరైన చోటు..?
మనం బస్సులో ఎక్కినప్పుడు కూర్చోవటానికి చోటు ఉందా లేదా అని వెతుక్కుంటాం. అది కూడా వెనక్కి అయితే కుదుపులు ఉంటాయని ముందు వరసల్లోనే కూర్చోవటానికి పోటీ పడతాం. రైల్లో ఎక్కినప్పుడు కూడా సౌకర్యంగా కిటికీ దగ్గర చోటుకు ఇష్టపడతాం. అంతేకాదు... సభలకు, సమావేశాలకు వెళ్ళినప్పుడు బాగా వినటానికి, చూడటానికి బాగుంటుందని ముందు వరుసల్లో చోటు చూసుకుంటాం. చదువుకునే రోజుల్లో విద్యార్థులు ముందు బెంచీల్లో చోటు కోసం ప్రతిరోజూ పోటీ పడుతుంటారు.కొన్ని గంటల సేపు ప్రయాణం చేయటానికే సౌకర్యవంతమైన చోటును చూసుకుంటున్నాం. ఆ కాసేపు అదేదో మన సొంత చోటులా భావిస్తూ అందులోకి ఎవరూ రాకుండా జాగ్రత్త పడుతున్నాం. మరి, శాశ్వతమైన చోటు సంపాదించుకోవాలంటే ఎంత ప్రయత్నించాలి? ఆ శాశ్వతమైన చోటు ఎక్కడుంది? దాని నెలా పొందాలి?శాశ్వతుడు, నిత్య సత్యుడు అయిన భగవంతుని హృదయంలో చోటు సంపాదించుకోవాలి. తరతరాలుగా వచ్చే ధన ధాన్యాలు, బంగారం వంటి సంపదలు వదలలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. కష్టాలు కోరకుండానే వచ్చినట్లు, సుఖాలు ఆ సమయానికి అవే వస్తాయి. అందుకోసం ఎంతో విలువైన జీవితాన్ని వృ«థా చేసుకోకూడదంటాడు భాగవతంలో ప్రహ్లాదుడు. ధర్మాన్ని ఆచరించటానికి తగిన మానవ జన్మను పొందటం చాలా కష్టం. ఈ అవకాశాన్ని మనుషులు సార్థకం చేసుకోవాలి.ధర్మాన్ని, సత్యాన్ని శ్రద్ధగా పాటించే వ్యక్తులకు దైవం హృదయంలో చోటు లభిస్తుంది. ఆ పరమ పురుషుని పాద పద్మాలను మన హృదయాలలో నిలుపుకోవాలి. మంచితనం, సత్ప్రవర్తన, సత్సాంగత్యం, భక్తి, పరిపూర్ణ విశ్వాసం వంటి వానితో దైవం హృదయంలో చోటు పొందాలి. అదే నిజమైన పొందవలసిన చోటు. భగవంతుడు మెచ్చుకుంటే మనకు లభించనిది ఏదీ లేదు. – డా. చెంగల్వ రామలక్ష్మి -
టీనేజర్లపై.. స్మార్ట్ ఫోన్ల ప్రభావం! అధ్యయనాల్లో ఏం తేలిందంటే?
ఇటీవల పరిస్థితులను గమనిస్తే చిన్నారుల నుంచి మొదలుకొని పండు ముదుసలి వరకు సెల్ ఫోన్ వాడనీ వారు లేరేమో. సంవత్సరంలోపు పిల్లలు గుక్కపట్టి ఏడిస్తే కన్నతల్లి దగ్గరకు తీసుకొని పాలు తాగించేది. భయంతో ఏడిస్తే నేనున్నానే భరోసాను నింపుతూ ఎత్తుకుని లాలించేది. గోరుముద్దలు తినిపిస్తూ జోలపుచ్చే ది. కానీ ప్రస్తుతం ఇవేవీ కనిపించడం లేదు. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు కనుమరు గయ్యాయి. పిల్లవాడు మారం చేస్తేచాలు సెల్ ఫోన్ చేతిలో పెడితే ఏడుపు ఆగిపోతుంది. సెల్ ఫోన్ మన జీవతంలో ఎంత దూరం వరకు వెళ్లిందో గమనిస్తున్నామా అనిపిస్తుంది.ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే ఇంటిలో ఏది ఉన్నా లేక పోయినా స్మార్ట్ ఫోన్లు మాత్రం ఇంటిలో కనీస ఒక్కరికి ఉంటుంది. అదృష్టమో, దురదృష్టమో కానీ స్మార్ట్ ఫోన్ నేడు మానవ జీవతంలో ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటే చాలు అందలమెక్కేసినట్లుగా భావిస్తున్నారు. జనం నాలుగో జనరేషన్ టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్ ఫోన్లు మరింత స్మార్ట్ గా జనానికి చేరువైపోయింది.అవసరం కోసం మొదలై సౌకర్యంగా అలవాటై చివరికి ఫోన్ కి బానిసలుగా మారే ప్రమాదకరం ఏర్పాడింది. స్మార్ట్ ఫోన్ల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగస్తులు అయిన ఇళ్లల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. సెల్ ఫోన్ వాడకంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం కొరవడుతుంది.సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియో ధార్మిక కిరణాల నుంచి చిన్నారుల బ్రెయిన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల్లో సృజనాత్మకశక్తి, ఆలోచనాశక్తి, తెలివితేటలు, మందగిస్తాయి. ఏకాగ్రత సన్నగిల్లుతుంది. ఆత్మ విశ్వాసం లోపించడంతో పాటుగా కోపం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్లలో వివిధ రకాలైన గేమ్స్ అందుబాటులోకి రావడంతో ఆ గేమ్స్ లో మునిగిపోయిన పిల్లలు పక్కనున్న ఎవరినీ పట్టించుకోని స్థితిలో ఒంటరితనానికి అలవాటుపడి మానవ సంబంధాలకు దూరంగా తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శకు నోచుకోలేక పెరుగుతారు.మొదటగా ఎంతో చిన్నవిగా కనిపించే సమస్యలను సరైన సమయంలో పట్టించుకుని సరైన పరిష్కారాలు వెతకకపోతే అవే పెద్దవిగా మారి పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై త్రీవ ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలు ఏవైనా సమస్యలతో బాధపడుతూ, ఏడుస్తూ తమ దగ్గరకు వస్తే అవి చిన్నవే కదా అని వదిలివేయకుండా వాటిని పరిశీలించి, పరిష్కరించాలి. తల్లిదండ్రులు పని ఒత్తిడిలో ఉండి సెల్ ఫోన్లోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నట్లు యూట్యూబ్ గేమ్స్ కు పిల్లలను అలవాటు చేస్తున్నారు.ఇవి పిల్లవాడి భవిష్యత్తును దెబ్బతీస్తుందని గుర్తించాలి. పిల్లల కోసమే మా జీవతం అని భావిస్తున్న తల్లిదండ్రులు పిల్లల సెల్ ఫోన్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భవిష్యత్తును చేజేతులా పాడు చేసినవారవుతారు. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం చాల ముఖ్యం. సమస్య ఎదురైనప్పుడు ముందుగా గుర్తించి దాన్ని పరిష్కారం చేయగలిగితే పిల్లల భవిష్యత్ బంగారంగా మార్చుకోచ్చు.టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం..టీనేజర్ల ఆరోగ్యం, ప్రవర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని "శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ ఐజెన్ కన్సెల్టింగ్ ఫౌండర్" వైద్యురాలు 'జీన్ త్వెంగె' టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలసి 13 నుంచి 18 వయస్సుగల పది లక్షలకు పైగా పిల్లలపై అధ్యయనం చేశారు.టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుతున్నారనేదే మానసిక ఆరోగ్య కోణంలో ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల యుగం పిల్లల్లో మానసిక సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఇందుకు సంబంధించిన ఓ బలమైన కేస్ స్టడీని ప్రపంచం ముందుంచారు జీన్ త్వెంగె. ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు సంఖ్య బాగా పెరగడం, వారు తమ జీవితం వృథా అయిపోనట్లు భావిస్తుండడం వంటి లక్షణాలు గమనించారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు.ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేరకు పెరిగాయి. తమను తాము గాయపరచుకునేంతగా అవి విజృంభించాయి. బాలికల్లో ఈ ప్రమాదకర ధోరణి రెండు మూడింతలు పెరిగింది. కొన్నేళ్లలోనే టీనేజర్ల అత్మహత్యలు రెట్టింపయ్యాయి. అని జీన్ తన అధ్యయన సారాంశాన్ని వివరించారు."అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్" కలిసి జరిపిన అధ్యయనం ప్రకారం మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లకు పైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారు. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే ఆలోచన వారిని వెంటాడుతోందని, ఇదో వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ లక్షణాలున్న వారు క్రమంగా యాంగ్జయిటీ సంబంధిత సమస్యల బారినపడే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.ఇవి చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా.. -
Gaming: గురి తప్పకుండా..
యాక్షన్ రోల్–ప్లేయింగ్ సర్వైవల్ గేమ్ వి రైజింగ్. ఒపెన్ వరల్డ్లో సెట్ చేసిన ఈ గేమ్ను అయిదు బయోమ్లుగా విభజించారు. కొత్తగా ఉనికిలోకి వచ్చిన రక్తపిశాచిని కంట్రోల్ చేయడం ప్లేయర్ పని. దీని కోసం రకరకాల సాధనాలను, ఆయుధాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది.అంతేకాదు శత్రువుకు చిక్కని దుర్భేద్యమైన కోటను కూడా నిర్మించుకోవాల్సి ఉంటుంది. సూర్యకాంతి, నీడ, రక్తనమూన... ఇలా ఎన్నో అంశాలు ఈ ఆటలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏ అడుగులో ప్రమాదం, నష్టం పొంచి ఉందో కనిపెట్టే స్పృహ ఆటగాడిలో ఉండాలి. ఆటలో నాన్–ప్లేబుల్ క్యారెక్టర్లు(ఎన్పీసీ) కీలకం.ప్టాట్ ఫామ్స్: విండోస్ప్లేస్టేషన్: 5జానర్స్: సర్వైవల్మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ఇవి చదవండి: భారత్లోకి ఎయిర్ టాక్సీ.. ధరలు ఎలా ఉంటాయంటే? -
దైవానుభవానికి మార్గం..
దైవత్వం ఒక అనుభవం. దీనిని హృదయంలో ప్రతిబింబింప జేసుకోవాలి. అద్దం కదులుతూ ఉన్నా లేదా దానిని పొగ కప్పివేసినా లేదా వస్తువుల నుండి చాలా దూరంగా ఉన్నా... అద్దం దేనినీ సరిగా ప్రతిబింబింప చేయలేదు. మనస్సు (అద్దం) నిశ్చలంగా (కదలకుండా) ఉండడమే ఏకాగ్రత. అద్దాన్ని కప్పి ఉంచే పొగ (అహం)ను తొలగించాలి. అదే ‘దైవ సాక్షాత్కారం’.జ్ఞానానికి రెండు స్థాయులు ఉన్నాయి. ఒకటి కిందిస్థాయి, మరొకటి పైస్థాయి. ఇంద్రియాలను ఉపయోగించుకొని, హేతుబద్ధంగా విచారించి తెలుసుకొనేది కిందిస్థాయి జ్ఞానం. చాలామంది కిందిస్థాయి జ్ఞానంతోనే జీవితాన్ని గడుపుతున్నారు. దైవానికి సంబంధించిన జ్ఞానమే పైస్థాయికి చెందింది. ఇది సాధారణమైన జ్ఞానాన్ని మించింది. అంటే సర్వోత్కృష్టమైన దన్నమాట. కొద్దిమంది భాగ్యవంతులు మాత్రమే ఇటువంటి జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు. ఈ విధమైన జ్ఞానాన్ని సద్గురువు మాత్రమే అనుగ్రహిస్తారు.మానవ జన్మ ఉన్నత లక్ష్యం భగవంతునిలో ఐక్యం చెందటమే. మనిషి తన జన్మకు కారణం ఏమిటో మరచిపోయి ‘కామ– కర్మ– అవిద్య’ అనే చక్రంలో చిక్కుకున్నాడు. స్వార్థబుద్ధిని పోనీయక, సొంతలాభం కోసం ఇతరులకు నష్టం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాంటివారికి ఎన్నటికీ విమోచన ఉండదు. కాబట్టి ఆత్మ వివేక మార్గంలో నడచి, భగవంతుడు వరప్రసాదంగా ఇచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇతరుల దోషాలనూ, తన చుట్టూ గల వాతావరణంలోని లోపాలను ఎంచుట మనిషికి గల సాధారణ లక్షణం. ఈ విధంగా తప్పులను ఎంచుటం వలన ఏ ప్రయోజనమూ లేదు. వాస్తవంగా ఈ లక్షణ ం మనిషి మానసిక ప్రశాంతతను భంగపరుస్తుంది. ఇందువలన సమతాస్థితిని పొందలేడు.ఆధ్యాత్మిక మార్గం అనుసరించదలచిన భక్తుడు చిత్తశుద్ధిని పెంపొందించుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక జీవితం సాధ్యమవుతుంది. ఇతరుల దోషాలను ఎంచటం మానివేసి, ఎవరికి వారు తమను తాము సరిచేసుకొని అభివృద్ధి అవ్వడానికి ప్రయత్నించాలి. – శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
Beauty Tips: చర్మ సౌందర్యానికై ఇలా చేస్తే చాలు..
పాలలో బ్రెడ్ ముక్కలు నానవేసి వాటిని మెత్తగా మెదిపి ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం మృదువుగా మిలమిలలాడుతుంది.కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత కడిగేసుకోవాలి. తర్వాత శెనగపిండితో గానీ, నలుగుపిండితో గానీ రుద్ది ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద ముడతలు లేకుండా తాజాగా కనిపిస్తుంది.పులిపిర్లు రాలిపోయిన తర్వాత ఆ మచ్చలు పోవటానికి తేనె, నిమ్మరసం కలిపి ఆ మచ్చల మీద రాస్తూ ఉండాలి.తులసి ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ఆపేస్టును కాని రసాన్ని కాని ముఖానికి రాసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. క్రమంతప్పకుండా రోజూ చేస్తుంటే మొటిమలు, వాటి మచ్చలు పూర్తిగా పోవడంతో పాటుచర్మం నునుపుదేలుతుంది.తేనెను గోరువెచ్చగా చేసి అందులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరినతర్వాత కడగాలి. తేనెను ఎప్పుడూ నేరుగామంట మీద వేడి చేయకూడదు. తేనె ఉన్నపాత్రను ఎండలో కాని, వేడి నీటి గిన్నెలోకాని పెట్టి వేడి చేయాలి.ఇవి చదవండి: ఆమె మాట, పాట, నటన, నృత్యంలో.. ‘వాహ్వా’! -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ఎన్ని చదివాం, ఎన్ని విన్నామనేది కాదు! అసలు..
మనం ఏ విషయాన్ని నిర్ణయించాల్సి వచ్చినా ‘‘తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ...’’ శాస్త్రమే ప్రమాణం. మనకు బుద్ధికి తోచిన దానితో నిర్ణయం చేయడం సనాతన ధర్మంలో భక్తి అనిపించుకోదు. మనం ఎన్ని చదివాం, ఎన్ని విన్నాం... అని కాదు ఎన్ని ఏ మేరకు పాటిస్తాం అన్నది ప్రధానం. ఈ విషయాన్నే రామాయణంలో సీత ‘ఇహ సంతో న వా సంతి సతో వా నానువర్తనే / తథా హి విపరీతా తే బుద్ధిరాచార వర్జితా..’ అంటూ రావణాసురుడికి బోధ చేస్తుంది.అలా మనం ఏదయినా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనకు ప్రమాణం శాస్త్రం. పుట్టుకతో ప్రతివారికీ మూడు రుణాలుంటాయి.. అని శాస్త్రం అంటుంది. అవి రుషి రుణం, దేవరుణం, పితృరుణం. ‘నేనెప్పుడు చేశానండీ ఈ రుణాలు, నేనెలా రుణగ్రస్తుడనయ్యాను’ అన్న ప్రశ్న అన్వయం కాదు. శాస్త్రవాక్కు కనుక అందరికీ ఉంటుంది. వీటిలో ఒక రుణం విషయంలో మాత్రం దానిని తీర్చుకోవడానికి గృహస్థాశ్రమ అవసరం ఉండదు. అది రుషిరుణం. సనాతన ధర్మంలో మనందరం రుణపడి΄ోయింది రుషులకు. మంత్రానికి రుషి ద్రష్ట. వేదమంత్రాలను ధ్యానంతో దర్శించి, విని మనకు స్వరంతో అందించాడు. ఆయన కూడా మనలాగే జీవించినవాడే అయినా రుషి తర్పణం అని... రుషికి వేరు తర్పణం ఉంటుంది.రుషి మన నుంచి ఏ విధమైన ఫలాన్ని ఆశించలేదు, ఏ సత్కారాన్నీ, ఏ బిరుదునూ కోరుకోలేదు. కేవలం మనల్ని ఉద్ధరించడం కోసమని, మనందరికీ కటికచీకటిలో కాంతిరేఖ కనపడాలని, మన జీవితాలు సుసంపన్నం కావాలని, మార్గం చూపించాలని వేదాల ద్వారా అందించి ధర్మానుష్ఠానికి ప్రమాణాన్ని కల్పించాడు. అలాగే ఒకవేళ మనం ఇవన్నీ చదవగలమో లేదో, స్వరంతో మంత్రం చెప్పగలమో లేదో, మంత్రభాష్యాన్ని అర్థం చేసుకోగలమో లేదో, అసలు ఇది అందరికీ అందుబాటులో ఉంటుందో ఉండదో అన్న అనుమానంతో రుషులు పురాణాలను ఇతిహాసాలుగా అందించారు.వ్యాసభగవానుడు 18 పురాణాలను అందించాడు. ‘‘నమో’స్తు తే వ్యాస విశాల–బుద్ధే/ఫుల్లరవిందయత –పత్ర–నేత్ర/యేన త్వయా భారత–తైల–పూర్ణః/ప్రజ్వలితో జ్ఞాన–మయః ప్రదీపః’’ అంటారు. అంతటితో ఆగకుండా ఆయన పరమ దయాళువై వేదాల సారాన్ని అందరూ చదువుకుని అనుష్ఠించడానికి వీలుగా పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి లోకానికి అందించారు. వేదం చదువుకుంటే ఏది తెలుస్తుందో మహాభారతం చదువుకున్నా అదే తెలుస్తుంది.సూర్యవంశాన్ని అంతటినీ కూడా శ్రీరామాయణం ద్వారా వాల్మీకి మహర్షి వర్ణించాడు. ‘‘వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే /వేదః ప్రచేతసదాచిత్ సాక్షాత్ రామాయణాత్మనాః’’ వేదములు ప్రతి΄ాదించిన బ్రహ్మము రామచంద్రమూర్తిగా వస్తే ఆ వేదమే రామాయణ కావ్యంగా వచ్చింది. వేదం ఏం చెప్పిందో తెలియనప్పుడు రామాయణం చదువుకుంటే చాలు. మనకు ఆ ప్రయోజనం నెరవేరుతుంది. రాముడు ఏ పరిస్థితుల్లో ఏం చేసాడో, మానవాళికి అదే వేదం విధించిన కర్తవ్యం కూడా. అందుకే ఎవరయినా అత్యంత విశ్వాసంతో ఒక విషయాన్ని తదేక దృష్టితో నమ్మి ఆచరించేవారయితే ‘రుషి సమానులు’ అంటారు. ఆయన ఒక ‘రుషి’ అంటారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బౌద్ధవాణి: మణి–దీపం!
వేసవి ఎండ తీవ్రంగానే ఉంది. కానీ ఆ మామిడి తోటలో చల్లగానే ఉంది. ఆ మామిడితోట వేణువనానికి ఒక మూలన ఉంది. ఆ తోట మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద విశాలమైన అరుగు. ఆ అరుగు దగ్గరకు నెమ్మదిగా, మందహాసంతో నడిచి వచ్చాడు బుద్ధుడు. ఆయన రాకను గమనించాయి తోటలో ఉడతలు. మనిషి అలికిడి తగిలితే ΄ారి΄ోయే ఉడతలు, బుద్ధుణ్ణి చూస్తే దగ్గరకు వచ్చేస్తాయి.అది ఎప్పటినుండో వాటికి అలవాటు. భిక్షా΄ాత్రలోంచి కొన్ని పళ్ళు తీసి అరుగు పైన ఒక పక్కన చల్లాడు. అవి కుచ్చుతోకలు విప్పుకుని, పైకెత్తుకుని వచ్చి, పండ్లు ఏరుకుని తినసాగాయి. కొంత సమయం గడిచింది.సకుల ఉదాయి అనే పరివ్రాజకుడు వచ్చాడు. బుద్ధునికి నమస్కరించి కూర్చున్నాడు. అతను రాగానే కొన్ని ఉడతలు చెట్లెక్కాయి. వాటిని చూసి– ‘‘భగవాన్! మీ కరుణ అమోఘం. ఉడతలు కూడా మిమ్మల్ని మిత్రునిగా భావిస్తాయి. ఇది విచిత్రం. మీ జీవ కారుణ్యానికి మచ్చుతునక. మీకు మరోమారు ప్రణమిల్లుతాను’’ అని వంగి నమస్కరించాడు. ‘‘సకుల ఉదాయీ! వచ్చిన విషయం?’’ అని అడిగాడు బుద్ధుడు. ‘‘మా గురువుగారు నిగంఠ నాధుల వారు నిన్న ‘పరమ సత్యం, పరమ వర్ణం’’ అంటూ ‘‘పరమం’’ గురించి చె΄్పారు. మీ దృష్టిలో పరమ వర్ణం ఏది? అని అడిగాడు. ‘‘ఉదాయీ! పరమం అంటే?’’‘‘మీకు తెలియంది కాదు. దేని కంటే ఉన్నతమైంది మరొకటి ఉండదో... అదే పరమం’’ ‘‘నీకు ఈ లోకం ఎంత తెలుసు. అందులో ఇదే పరమం అని ఎలా నిర్ణయిస్తావు? నూతిలోని కప్పకి నుయ్యే ప్రపంచం. చెరువులోని చేపకి చెరువే ప్రపంచం. ఈ అనంతమైన విశ్వానికి హద్దులు ఎలా గీస్తావు?’’ అని అడిగాడు భగవానుడు. సకుల ఉదాయి మౌనం వహించాడు.‘‘ఉదాయీ! ఒక చీకటి గదిలో ఒక పసుపురంగు కంబళిలో ఒక సానబెట్టిన మణి ఉంది. అది ఆ చీకటిలో ప్రకాశిస్తుంది. అంతలో ఆ గదిలోకి ఒక మిణుగురు పురుగు వచ్చింది. అప్పుడు ఆ మణి వెలుగు ఎక్కువ ప్రకాశంగా ఉంటుందా? మిణుగురు వెలుగా?’’ అని అడిగాడు. ‘‘భగవాన్! మిణుగురు వెలుగే మిగుల ప్రకాశం’’ అన్నాడు ఉదాయి.‘‘ఇందులో ఒక వ్యక్తి నూనె దీపం తెచ్చాడు. అప్పుడు ఏ వెలుగు ప్రకాశం?’’‘‘దీపం వెలుగే భగవాన్!’’ ‘అలా ఉదాయీ! దీపం వెలుగు కంటే నెగడు వెలుగు ప్రకాశం. దాని కంటే వేగుచుక్క వెలుగు, దానికంటే చంద్రుని వెలుగు, దానికంటే సూర్యుని వెలుగు ప్రకాశం.... ఉదాయీ! సూర్యుని కంటే ప్రకాశవంతమైన వెలుగులు కూడా ఉంటాయి.’’ అన్నాడు. ఉదాయి మనస్సు తేటబడింది. ఆ తేటదనం అతని ముఖంలోంచి తొంగి చూస్తోంది! ఉడతలు కిచకిచ మంటూ బుద్ధుని దగ్గరకు వచ్చాయి. ఆయన ΄ాత్రలో నుంచి మరికొన్ని పళ్ళను వాటిముందు ΄ోశాడు. అవి వాటి పనిలో మునిగి ΄ోయాయి. ‘‘ఉదాయీ! మిణుగురు పురుగు కంటే తక్కువ ప్రకాశించే మణి వెలుగునే ‘పరమం’ అనుకుంటున్నావు? అన్నాడు.‘విజ్ఞానం, విశ్వం, అన్నీ అనంతాలే’ అని గ్రహించాడు. సకుల ఉదాయీ! బుద్ధునికి ప్రణమిల్లాడు! అతని ముఖంలో అనుమాన ఛాయలు తొలిగాయి. సంతోష కాంతులు వెలిగాయి! దోసిలి చాచాడు. బుద్ధుడు కొన్ని పండ్లను అతని దోసిట్లో ΄ోశాడు. ఉదాయి, కొద్దిగా ముందుకు వంగి ఉడతలకు దోసిలి చూ΄ాడు. అవి అతని ముఖం కేసి చూశాయి. ధైర్యంగా దోసిలి లోని పండ్లు అందుకున్నాయి. – డా. బొర్రా గోవర్ధన్ -
ఈ టేస్టీ స్నాక్స్తో.. స్కూల్ లంచ్ బాక్సుకి రెడీ అయిపోండి..!
క్యాలెండర్ పేజీ తిప్పమంటోంది. జూన్కి స్వాగతం పలకాల్సిందే. కొత్త టైమ్టేబుల్నీ స్వాగతించాల్సిందే. లంచ్ బాక్సు... స్కూల్కి రెడీ అయిపోతుంది. పిల్లలు సాయంత్రం వచ్చేటప్పటికి ఏం చేయాలి? ఇవిగో వీటిని మన వంటింట్లో ట్రై చేయండి..బ్రెడ్ పొటాటో రోల్..కావలసినవి..బంగాళదుంపలు– 3 (మీడియం సైజువి);క్యారట్ తురుము లేదా పచ్చి బఠాణీలు – అర కప్పు ;మిరప్పొడి– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;పసుపు – చిటికెడు;నిమ్మరసం –పావు టీ స్పూన్;కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;బ్రెడ్ స్లయిస్లు – 10;వెన్న – టేబుల్ స్పూన్ – 2 టేబుల్ స్పూన్లు;పాలు– అర కప్పు; మొక్కజొన్న పిండి లేదా మైదా లేదా శనగపిండి– 2 టేబుల్ స్పూన్లు (బ్రెడ్ స్లయిస్లను రోల్ చేసి అతికించడానికి).తయారీ..బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించాలి. వేడి తగ్గిన తరవాత తొక్క తీసి చిదిమి ఒకపాత్రలో వేసుకోవాలి.క్యారట్ లేదా బఠాణీలను ఉడికించి పక్కన పెట్టాలి.ఇప్పుడు చిదిమిన బంగాళదుంప గుజ్జులో మిరప్పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కొత్తిమీర, నిమ్మరసం, ఉడికించిన క్యారట్ లేదా బఠాణీలను వేసి సమంగా కలిసే వరకు వేళ్లతో చిదమాలి.ఉప్పు, కారం సరి చూసుకుని అవసరమైతే మరికొంత చేర్చుకోవచ్చు.ఈ మిశ్రమాన్ని పది సమభాగాలుగా చేయాలి. ఒక్కో భాగాన్ని ఓవల్ షేప్ (దొండకాయ ఆకారం)లో చేయాలి.బ్రెడ్ అంచులు కట్ చేసి తీసేసిన తర్వాత బ్రెడ్ స్లయిస్ని పూరీల పీట మీద పెట్టి రోలర్తో వత్తాలి.ఇలా చేయడం వల్ల గుల్లబారి ఉన్న బ్రెడ్ చపాతీలాగ పలుచగా వస్తుంది.పాలలో బ్రష్ ముంచి ఈ స్లయిస్ల మీద చల్లాలి లేదాపాలలో వేళ్లు ముంచి బ్రెడ్ స్లయిస్ మీద చల్లి తడిపొడిగా ఉండేటట్లు మునివేళ్లతో అద్దాలి.బ్రెడ్ చివర్లు అతికించడం కోసం తీసుకున్న పిండిలో నీరుపోసి గరిట జారుడుగా కలుపుకోవాలి.ఇప్పుడు బ్రెడ్ స్లయిస్ మీద బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి అంచులకు పిండి ద్రవాన్ని అద్దుతూ అతికిస్తే బ్రెడ్రోల్ రెడీ.వీటిని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. బయటే ఉంచినప్పుడు ఒకవేళ కాల్చడం ఆలస్యం అయితే బ్రెడ్ అంచులు ఎండిపోయి రోల్ ఊడిపోతుంది.పెనం వేడి చేసి వెన్న రాసి బ్రెడ్ రోల్స్ను ఒకదాని పక్కన ఒకటిగా అమర్చాలి. దోరగా కాలేకొద్దీ మరొక వైపుకు తిప్పుతూ అన్ని వైపులా కాలేటట్లు చూడాలి.పెనం మీద కాల్చినప్పుడు నూనెలో రోస్ట్ చేసినట్లు రోల్ అంతా సమంగా ఒకే రంగులో ఉండదు. కానీ లోపల మిశ్రమం ఉడికిపోతుంది. రోల్ పై భాగం కరకరలాడుతూ రుచిగా ఉంటుంది.మొత్తంగా ఒకేరంగులో ఉండాలంటే బాణలిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి మరిగించి అందులో నాలుగు రోల్స్ వేసి అవి కాలిన తర్వాత మరికొన్ని వేస్తూ కాల్చుకోవచ్చు.ఇలా చేసినప్పుడు నూనెలో నుంచి తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేస్తే అదనంగా ఉన్న నూనెను పేపర్ పీల్చుకుంటుంది.ఒవెన్లో అయితే... 200 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేసి బేకింగ్ ట్రేలో రోల్స్ను అమర్చి పది నుంచి పన్నెండు నిమిషాల సేపు బేక్ చేయాలి.చీజ్ బాల్స్..కావలసినవి..బంగాళదుంపలు –పావు కేజీ;వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్;ఉప్పు –పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి;రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదా పచ్చిమిర్చి తరుగు లేదా మిరప్పొడి – అర టీ స్పూన్;మిరియాల పొడి –పావు టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;బ్రెడ్ క్రంబ్స్ – 6 టేబుల్ స్పూన్లు;నూనె – వేయించడానికి తగినంత.స్టఫింగ్ కోసం.. చీజ్ – 100 గ్రాములు;ఎండిన పుదీన – అర టీ స్పూన్ (ఆకులను అరచేతిలో వేసి వేళ్లతో నలిపి పొడి చేయాలి);రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదా పచ్చిమిర్చి తరుగు లేదా మిరప్పొడి –పావు టీ స్పూన్;మిరియాల పొడి–పావు టీ స్పూన్, గరం మసాలా పొడి– చిటికెడు.కోటింగ్ కోసం.. కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు;ఎగ్ – ఒకటి (ఎగ్ వేయనట్లయితే మరో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోవాలి);బ్రెడ్ క్రంబ్స్– అర కప్పు.తయారీ..బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించి, వేడి తగ్గిన తర్వాత తొక్క తీసి చిదమాలి.అందులో వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, బ్రెడ్ క్రంబ్స్ వేసి సమంగా కలిసేటట్లు చిదిమి ఒకసారి రుచి చూసుకుని అవసరమైతే ఉప్పు, కారం కలుపుకుని మిశ్రమం మొత్తాన్ని బాల్స్ చేసి ఆరిపోకుండా ఒక గిన్నెలో వేసి మూత పెట్టుకోవాలి.స్టఫింగ్ కోసం తీసుకున్న వాటిలో చీజ్ తప్ప మిగిలిన అన్నింటినీ ఒకపాత్రలో వేసి కలపాలి. అందులో చీజ్ ని అర అంగుళం ముక్కలుగా కట్ చేసి వేసిపాత్రను కొద్దిగా కదిలిస్తూ మసాలా పొడులు చీజ్ ముక్కలకు పట్టేలా చేసి వేడి తగలకుండా స్టవ్కు దూరంగా ఉంచాలి.ఇప్పుడు బంగాళదుంప బాల్స్ ఒక్కొక్కటిగా తీసుకుని అరచేతిలో పెట్టి వేళ్లతో చిన్న పూరీలా వత్తి అందులో మసాలా పట్టించిన చీజ్ ఒక ముక్క పెట్టి బంగాళాదుంప మిశ్రమం పూరీ అంచులను మూసేస్తూ బాల్ చేయాలి.ఇలా అన్నింటినీ చేసిన తర్వాత ఒక ప్లేట్లో కార్న్ఫ్లోర్ వేసి అందులో ఒక్కో బాల్ని వేస్తూ మెల్లగా వేళ్లతో కదిలిస్తూ పిండి అన్ని వైపులా సమంగా పట్టేటట్లు చేయాలి.మరొక ప్లేట్లో బ్రెండ్ క్రంబ్స్ వేసుకుని కార్న్ఫ్లోర్ పట్టించిన బాల్స్ని వేసి అన్ని వైపులా సమంగా పట్టేటట్లు చేయాలి.కోడిగుడ్డు సొనను ఒక గిన్నెలో వేసి గిలక్కొట్టాలి.ఎగ్ వాడనట్లయితే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ను తగినంత నీటితో గరిటజారుడుగా కలుపుకోవాలి.పొడి కార్న్ఫ్లోర్ పట్టించిన బంగాళాదుంప– చీజ్ బాల్స్ని కార్న్ఫ్లోర్ ద్రవం లేదా కోడిగుడ్డు సొనలో ముంచి తీసి పదినిమిషాల సేపు ఆరనివ్వాలి.ఈ లోపు బాణలిలో నూనె వేడి చేయాలి. ఒక్కో బాల్ను జాగ్రత్తగా నూనెలో వేసి మీడియం మంట మీద బాల్ అన్ని వైపులా సమంగా కాలిన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.బాల్స్ మీద టిష్యూ పేపర్ని కప్పి ఉంచితే అదనపు ఆయిల్ వదులుతుంది.బంగాళాదుంప– చీజ్ బాల్స్ని టొమాటో సాస్ లేదా కెచప్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.ఇవి చదవండి: చూపులను కట్టడి చేసేలా! -
మిస్ కేరళ ఫిజిక్గా టైటిల్ తనకు సొంతం!
‘కొన్నిసార్లు మీరు భయపడకుండా వేసే ఒక్క అడుగు జీవన గమనాన్ని మెరుగ్గా మార్చేస్తుంది’ అంటుంది 24 ఏళ్ల అశ్వతి ప్రహ్లాదన్. బాడీ షేమింగ్ను ఎదుర్కొన్న అశ్వతి ఇప్పుడు మిస్ కేరళ ఫిజిక్గా టైటిల్ గెలుచుకుంది.. సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి ఫిట్నెస్ కోచ్గా మారింది. సోషల్ మీడియాలో లక్షమంది ఫాలోవర్లతో బిజీగా ఉంది. ఎగతాళి మాటల నుంచి పట్టిన పట్టుదల ఎందరిలోనో స్ఫూర్తిని కలిగిస్తుంది.‘‘ఒక దశలో నేను బాగా బరువు తగ్గిపోయాను. కారణం కొన్నిరోజులపాటు వేధించిన జ్వరం. ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయింది. సరైన ఆహారం తీసుకోలేక బాగా సన్నబడిపోయాను. కొన్నాళ్లపాటు ఆ సమస్యను జనాల నుంచి సూటిపోటి మాటల ద్వారా ఎదుర్కొన్నాను. ‘ఎందుకు ఇంత సన్నగా ఉన్నావు? ఇంట్లో వాళ్లు ఫుడ్ పెట్టడం లేదా? గాలికి ఎగిరిపోయేలా ఉన్నావ్?.. లాంటి మాటలను ఎదురుగానే అనేవాళ్లు. చుట్టుపక్కల, బంధువులు రకరకాల సలహాలు ఇచ్చేవారు. దాంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయినా ఉద్యోగానికి వెళ్లాలంటే భయంగా ఉండేది. అమ్మాయిలు లావుగా ఉన్నా, మరీ సన్నగా ఉన్నా ఈ సమాజంలో జనం ఏదో ఒకటి అంటూ బాధించాలనే చూస్తారు. ఇదో పెద్ద మానసిక ఒత్తిడిగా అనిపించేది. ఈ ట్రామా నుంచి ఎలాగైనా బయట పడాలనుకున్నాను. అప్పుడే ఫిట్నెస్లోకి రావాలనుకున్నాను.నన్ను నేను ప్రేమించుకుంటూ..జనాలు ఎగతాళిగా అనే బాడీ షేమింగ్ వ్యాఖ్యలను అసలు పట్టించుకోవడం మానేశాను. నన్ను నేను ప్రేమించుకోవడం ప్రారంభించాను. నాలా బాధపడేవారికి ఓ రోల్మోడల్గా ఉండాలని జిమ్లో చేరాను. నా జీవనశైలిలో మార్పులు చేసుకున్నాను. సమతుల ఆహారంపై అవగాహన పెంచుకుని, దానిని తీసుకోవడంపై శ్రద్ధ పెట్టాను. ఫలితంగా ఆరోగ్యంలో మార్పు వచ్చింది. మానసిక ఆరోగ్యమూ మెరుగుపడింది. దీంతో ఫిట్నెస్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. ఎంతగా సాధన చేస్తూ వచ్చానంటే బాడీ షేమింగ్ బాధితులకు కేరళ ఫిజిక్ టైటిల్ను అంకితం చేసేవరకు నన్ను నేను మలుచుకోవడంలో ఒక తపస్సే చేశాను.అశ్వతి ప్రహ్లాదన్విమర్శలను పట్టించుకోను..‘ఏమీ చేయని వ్యక్తులే జీవితంలో ఏదైనా సాధించాలని ప్రయత్నించేవారిని నిందిస్తుంటారు. మొదట్లో వారి మాటలకు నేను కూడా ఎదురు సమాధానం చెప్పేదాన్ని. ఇప్పటికి కూడా సోషల్మీడియాలో ఫేక్ అకౌంట్లతో నన్ను నిందించే ప్రయత్నం చేసేవాళ్లున్నారు. టైటిల్ సాధనతో ఇప్పుడు చెడు వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య తగ్గి,పాజిటివ్ కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి.అపోహలు వద్దు..మగవారిలాగా తమ శరీరం కూడా కండలు తిరిగిపోతుందేమోనన్న భయంతో వర్కవుట్ చేయని మహిళలు ఉన్నారు. మరోవైపు వర్కవుట్ చేస్తూ బరువు తగ్గుతూ ఉంటే, ఏదైనా కారణాలతో మధ్యలో జిమ్ ఆపేస్తే మళ్లీ బరువు పెరుగుతామేమోనని అంటూ ఆందోళనపడేవారూ ఉన్నారు. ఇలాంటి అపోహలు మన సమాజంలో చాలా ఉన్నాయి. అలాంటి వారికి చెప్పేది ఏమిటంటే ‘జిమ్లోనూ, ఇంట్లోనూ మంచి జీవనశైలినిపాటించకుండా ఈ దురభి్రపాయాలకు రావద్దు. ముప్పై ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గి, కండరాలు ద్రవ్యరాశిని కోల్పోయే అవకాశం ఉంది.కండర నిర్మాణానికి వ్యాయామం ఆరోగ్యకరం. కండరాలను నిర్మించడం అంటే శరీరం అంతా కండరాలుగా మారడం కాదు. ఫిట్నెస్నుప్రాక్టీస్ చేస్తే మానసిక, శారీరిక ఆరోగ్యంతో సహా అన్ని విషయాలు మెరుగుపడతాయి. అందుకని, అపోహలతో ఫిట్నెస్లోకి రావద్దు. మన వెనక జనాలు ఏదో మాట్లాడుతున్నారని వెనకడుగు వేయద్దు. నా విషయంలో అయితే ఈ రంగంలోకి రావడమే మంచి నిర్ణయం అయింది. అందరూ ఈ విషయాన్ని అంగీకరించారు కూడా. మన శరీరానికి సరైన రీతిలో శిక్షణ ఇస్తే మరిన్ని అద్భుతాలను మనమే చేయచ్చు.నా జీతం మొత్తం..ఏడాదిన్నర క్రితం ఇన్ఫోపార్క్లో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఫిట్నెస్ను కూడా నా జీవితంలో భాగం చేసుకున్నాను. కానీ, పనిలో చాలా ఒత్తిడి ఉండేది. ఒక్కోసారి తొమ్మిది నుంచి పదకొండు గంటలు పనిచేయాల్సి వచ్చేది. ఆ పనుల మధ్య జిమ్కి వెళ్లేందుకు సమయం దొరకడం కష్టమైంది. కుటుంబం నుంచి మద్దతు లభించింది. నా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంది మా అమ్మ.కానీ... వృత్తిని, అభిరుచిని కలపడం చాలా కష్టం అని గ్రహించాను. ఫిట్నెస్లో పోషకాహారం ఖరీదైనది. నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నా అభిరుచిని కొనసాగించగలిగాను. జీతం నా పోషణకు సరిపోయేది. కొన్ని సంప్లిమెంట్ల కోసం స్పాన్సర్లను వెతికాను. కానీ, లభించలేదు. దీంతో నా జీతం మొత్తం నా పౌష్టికాహారం కోసమే కేటాయించే దాన్ని. మరి ప్రయోజనాలు ఏంటి అని ఎవరైనా అడగచ్చు.ఈ రంగంలోకి వచ్చినతర్వాత నేనెవరో నాకు అర్ధమైంది.పాటలుపాడతాను, డ్యాన్స్ చేస్తాను. ఫిట్నెస్ నన్ను ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుతుంది. ఇది విజయంగా భావిస్తున్నాను. అంతేకాదు, నా ఫిట్నెస్ ఇప్పుడు నా ఆదాయ వనరు కూడా. అందుకే, ఉద్యోగాన్ని మానేసి బిజీ ట్రైనర్గా మారిపోయాను’ అంటూ తన ఫిట్నెస్ రహస్యాలను చెబుతుంది అశ్వతి.ఇవి చదవండి: Health: కడుపులోని బిడ్డ జాగ్రత్త! -
లయ తప్పుతున్న గుండె
సాక్షి, అమరావతి: ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాట.. ‘హార్ట్ ప్రాబ్లమ్’. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనం వెరసి గుండె జబ్బులు ఏటా పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు సైతం గుండె పోటుతో మరణిస్తున్నారు. దేశంలో ఏటా సంభవిస్తున్న మొత్తం మరణాల్లో 27 శాతం గుండె జబ్బుల వల్లేనని తేలింది. దీంతో ‘గుండె ఘోష’ను ముందే పసిగట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. ఛాతీలో నొప్పి, అసౌకర్యం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురైతే తాత్సారం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు ఉన్న వారంతా గుండె జబ్బులేనని నిర్ధారణకు రాకుండా.. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ, ఈసీసీ రాష్ట్రంలో ఏటా గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారందరికీ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తోంది. 2019–20వ సంవత్సరంలో ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కార్డియాలజీ, కార్డియాక్, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాల్లో 59,700 చికిత్సలు జరిగాయి. 2022–23 నాటికి ఈ చికిత్సల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. అలాగే 2023–24లో కూడా ఈ ఏడాది జనవరి నాటికి 84 వేల మందికి ప్రభుత్వం గుండె జబ్బులకు ఉచితంగా చికిత్సలు చేయించింది. ఏటా పెరుగుతున్న గుండె జబ్బులను పరిగణనలోకి తీసుకుని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్లో చికిత్స అందించేందుకు ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్(ఈసీసీ) కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో సైతం ఛాతీనొప్పితో వచ్చే బాధితులకు ఈసీజీ తీసి, కార్డియాలజిస్ట్ల సూచనలతో థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్లు చేసి ప్రాణాపాయం నుంచి రక్షిస్తున్నారు. జీవన విధానం మారాలి» 40 ఏళ్లు దాటిన వారు, రిస్క్ ఫ్యాక్టర్స్(బీపీ, షుగర్, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు) ఉన్నవారు తరచూ జనరల్ చెకప్ చేయించుకోవాలి.» రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి చేయాలి.» ఆకుకూరలు, చిరుధాన్యాలు, తాజా పళ్లు, కూరగాయలు, గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. » రెడ్ మీట్ తినడం తగ్గించాలి. జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.» ధూమపానం, మద్యపానం మానేయాలి.» శరీర బరువు పెరగకుండా జాగ్రత్తలు పాటించాలి.» మానసిక ఒత్తిడి తగ్గించేందుకు యోగా, ధ్యానం చేస్తుండాలి.మనం మారితేనే గుండె పదిలంగతంలో గుండె జబ్బులు వయసు పైబడిన వారికి లేదా వంశపారంపర్యంగా మాత్రమే ఎక్కువగా కనిపించేవి. ప్రస్తుతం అన్ని రకాల వయసు వారిలోనూ గుండె జబ్బులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మారిన జీవన విధానమే.అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడికి లోనవ్వడం, శారీరక శ్రమ లేకుండా జీవించడం వంటి విధానాలను మనం వీడాలి. మనం మారినప్పుడే గుండె పదిలంగా ఉంటుంది. అలాగే గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇప్పటికే సమస్యలున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాధిపతి, కర్నూలు జీజీహెచ్ -
ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
వాతావరణంలో జరిగే కాలాల మార్పుల కారణంగా అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. ప్రతీ సంవత్సరం కేవలం మే నెలలో మాత్రమే ఈ పువ్వు పూస్తుందట. మరి అదేంటో చూసేద్దామా!ఆదిలాబాద్, సోన్ మండలంలోని న్యూవెల్మల్ గ్రామంలో మే పుష్పం వికసించింది. ఏటా మే నెలలో మాత్రమే పూసే ఈ పువ్వు గ్రామానికి చెందిన ఎలుగు రాజలింగం ఇంటి ఆవరణలో మంగళవారం వికసించింది. ఒకేసారి మూడు పువ్వులు పూయడం సంతోషంగా ఉందని రాజలింగం కుటుంబ సభ్యులు తెలిపారు. ఈఏడాది మొత్తం ఐదు పువ్వులు పూశాయని పేర్కొన్నారు. ఈ పూలను చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నట్లు వారు తెలిపారు.ఇవి చదవండి: కోటి థెరపీల ఉత్సవం! ఏఎస్డీ..? -
కోటి థెరపీల ఉత్సవం! ఏఎస్డీ..?
కోటి దీపోత్సవంలో దీపాల శిఖలు మిలమిలలాడుతుంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటుంది! అలాగే చిదిమి దీపం పెట్టుకోవాల్సిన చిన్నారులు ఆటిజమ్తో చిన్నబోకుండా ఆ అమాయకపు ముఖాలపై చిరునవ్వుల మిలమిలలను అలాగే ఉంచడానికి పూనుకుంది ‘పినాకిల్’ సంస్థ. లక్షణాల్ని బట్టి ఒక్కో ఆటిజమ్ చిన్నారికి ఒక్కో థెరపీ అవసరమవుతుంది. అలాంటి ‘కోటి థెరపీ’లను పూర్తి చేసింది ఈ సంస్థ,‘ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్’ (ఏఎస్డీ) అని పిలిచే ఈ రుగ్మత ఉన్న పిల్లలకు జ్ఞానేంద్రియాల నుంచి మెదడుకు సమాచారం చేరడమూ... అక్కణ్ణుంచి తాము స్పందించాల్సిన రీతిలో స్పందించక΄ోవడమనే సమస్య ఉంటుంది. సెన్సెస్(జ్ఞానేంద్రియాల)కు సంబంధించిన సమస్య కాబట్టి దీన్ని ‘సెన్సోరియల్ సమస్య’గా చెబుతారు. ఆ పిల్లలు తమదైన ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంటారు. కళ్లలో కళ్లు కలిపి చూడలేరు. స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకు నేర్చుకున్న ఒకే పదాన్ని పదే పదే అదే ఉచ్చరిస్తూ ఉంటారు. తోటి పిల్లలతో కలవడానికీ, ఆడుకోడానికి పెద్దగా ఆసక్తి చూపరు.అలాంటి పిల్లలకు అవసరమైన చికిత్స (థెరపీలు) అందిస్తోంది పినాకిల్ సంస్థ. లోపాల్ని చక్కదిద్దడానికి అవసరాన్ని బట్టి స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, డాన్స్ థెరపీ... ఇలాంటి అనేక థెరపీలు అందిస్తోంది. లక్షణాలూ, తీవ్రతలను బట్టి ఒక్కో చిన్నారికి నాలుగైదేసి థెరపీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి కోటి థెరపీలను ఇటీవలే పూర్తి చేసిందీ సంస్థ. తాము ఈ అసిధారా క్రతువు చేపట్టడం వెనక ఓ నేపథ్యముందంటున్నారు ‘పినాకిల్’ వ్యవస్థాపకురాలు శ్రీజారెడ్డి సరిపల్లి.తొలిచూలు పంటగా పుట్టిన పిల్లాడు మొదట్లో అంతా బాగున్నట్టే కనిపించినా... ఏడాదిన్నర గడిచాక కూడా మాటలు రాక΄ోవడం చూసి ఆందోళన పడ్డారు కోటిరెడ్డి, శ్రీజారెడ్డి దంపతులు. డాక్టర్కు చూపిస్తే వినలేక΄ోతున్నాడనీ, బహుశా ఆటిజమ్ కావచ్చని చెప్పారు. చికిత్స కోసం అనేకచోట్ల తిరిగారు. పరిష్కారం దొరకలేదు. వ్యాధి నిర్థారణ సరిగ్గా జరగలేదు.- శ్రీజా రెడ్డి సరిపల్లిపదిహేను రోజులకు అసలు విషయం తెలిసింది. ఆటిజమ్ కాదు, చెవి సమస్య అని తేలింది. అందుకు అవసరమైన శస్త్రచికిత్సలను రెండు చెవులకూ ఒకేసారి చేయించారు. పరిస్థితి పరిష్కారమైందనుకున్నారు. కానీ కేవలం శస్త్రచికిత్స సరి΄ోదు, స్పీచ్ థెరపీ కూడా అవసరమని వైద్యులు చెప్పారు.అన్నీ ఉండి కూడా తమలాంటివారికే ఇంత కష్టంగా ఉంటే, ఏమీ తెలియని వారికి ఇంకెంత కష్టం ఉంటుందన్న ఆలోచన వారిలో రేకెత్తింది. ఆ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న సంస్థే ‘పినాకిల్’. ఆ ఆటిజమ్ సమస్యను ఎదుర్కొనే పిల్లల తల్లిదండ్రుల దుఃఖం తీర్చడానికీ, ఆ పిల్లలు తమ పనులు తామే చేసుకునేలా, దాదాపుగా మిగతా పిల్లల్లాగే ఆడుకునేలా, నడచుకునేలా చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ అది!‘‘పినాకిల్ సంస్థకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 70కి పైగా సేవాకేంద్రాలున్నాయి. ఆటిజమ్ పిల్లలకు అవసరమైన రకరకాల థెరపీలను అక్కడ అందిస్తుంటారు. లోపల జరుగుతున్న చికిత్సను తల్లిదండ్రులు బయట ఉండి స్క్రీన్ మీద చూడవచ్చు. కేవలం భారత్లోనే కాదు... యూఎస్ఏ, సింగపూర్, దుబాయ్లలోనూ ఈ సేవలున్నాయి. త్వరలో యునైటెడ్ అరబ్ ఎమిటేర్స్లోనూ పినాకిల్ సేవలు అందనున్నాయి. ఖర్చు భరించలేనివారికి ‘సేవా’ విభాగం కింద వారు తాము చెల్లించగలిగేంత లేదా కేవలం ఒక్క రూపాయి చెల్లించి సేవలు ΄÷ందవచ్చు. పద్ధెనిమిది భాషల్లో మా హెల్ప్లైన్ పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా భాషల్లో సమాచారం తెలుసుకునేలా మా ‘థెరపాటిక్ ఏఐ’ రూ΄÷ందుతోంది. మా హెల్ప్లైన్ 9100 181 181 కు ఏ టైమ్లో ఫోన్ చేసినా ఆటిజమ్ పిల్లల తల్లిదండ్రులకుప్రాథమిక సమాచారం ఎల్లవేళలా అందుతుంది.ఏఐ ఎందుకంటే..?ఇలాంటి ఓ రుగ్మత ఉందని కనుగొన్న నాటినుంచి నేటికి దాదాపు 133 ఏళ్లు. ఇంతటి చరిత్రా, వేర్వేరు థెరపీల నేర్పూ, నైపుణ్యాలు ఒక్కోచోట ఒక్కొక్కరిలో ఇలా పరిమితంగానే దొరుకుతుండవచ్చు. ఆ అంతటినీ సమగ్రంగా సమీకరించడం, ఒక్కచోటే అందేలా క్రోడీకరించడం అవసరం. అది ‘ఏఐ’తోనే సాధ్యం. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నాం.’’ అంటూ తమ సేవల గురించి వివరించారు పినాకిల్ సంస్థ ఫౌండర్, చీఫ్ స్ట్రాటజిస్ట్ శ్రీజా సరిపల్లి. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఇవి చదవండి: చక్కని ‘ఫాంగ్’కు చాంగు భళా.. ఇదే! -
చక్కని ‘ఫాంగ్’కు చాంగు భళా.. ఇదే!
కొడితే ‘ఫాంగ్’ జాబ్ కొట్టాలి అనుకుంటోంది యువతరం. ప్రపంచంలోని ఉత్తమ పనితీరు కనబరిచే దిగ్గజ కంపెనీల సంక్షిప్త నామం–ఫాంగ్ (ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫిక్స్, గూగుల్) ‘ఫాంగ్’ కంపెనీలలో ఉద్యోగం చేయాలనే కలను నెరవేర్చుకోవడానికి స్కిల్ లెర్నింగ్ కాన్ఫరెన్స్లకు హాజరు కావడం నుంచి సీనియర్ ఉద్యోగులతో మాట్లాడడం వరకు ఎంతో కసరత్తు చేస్తున్నారు. కలను నెరవేర్చుకుంటున్నారు.ప్రతిష్ఠాత్మకమైన ఫాంగ్ (ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్) కంపెనీలలో ఉద్యోగం చేయాలని యువతరం బలంగా అనుకోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే... కాంపిటీటివ్ స్పిరిట్, వర్క్–లైఫ్ బ్యాలెన్స్, గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీపై పనిచేసే అవకాశం అనేవి ముఖ్య కారణాలు.‘ఫాంగ్’ కంపెనీలలో పనిచేయాలనే కలను నెరవేర్చుకోవడానికి తగిన కసరత్తు చేస్తున్నారు. ‘ఫాంగ్’ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడుతున్నారు. ‘ఫాంగ్’ రిక్రూటర్స్, ఎం.ఎల్. ఇంజినీర్స్, రిసెర్చర్లు హాజరయ్యే స్కిల్ లెర్నింగ్ కాన్పరెన్స్లకు హాజరవుతున్నారు. ‘ఫాంగ్’ ఇంటర్వ్యూల గురించి అవగాహన చేసుకోవడానికిప్రొఫెషనల్స్తో మాట్లాడుతున్నారు.‘నా ఫ్రెండ్ ఒకరు మోస్ట్ టాలెంటెడ్. అయితే మొదటి ప్రయత్నంలో ఫాంగ్ కంపెనీలలో ఒకదాంట్లో ఎంపిక కాలేదు. అలా అని డిప్రెస్ కాలేదు. ఏ పొరపాట్ల వల్ల తనకు ఉద్యోగం రాలేదో లోతైన విశ్లేషణ చేసుకుంది. ప్రొఫెషనల్స్తో మాట్లాడింది. పొరపాట్లను సరిదిద్దుకొని రెండో ప్రయత్నంలో విజయం సాధించింది’ అంటుంది బెంగళూరుకు చెందిన షాలిని.‘ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నా ఫాంగ్ కల నెరవేరలేదు. మొదట బాధ అనిపించింది. అయితే ఆ బాధలో నుంచి త్వరగా కోలుకున్నాను. మాస్టర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్పై దృష్టి పెట్టాను. మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్–సాల్వింగ్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నాను’ అంటున్న శైలిమ శ్రీవాస్తవ రెండవ ప్రయత్నంలో విజయం సాధించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోవాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఖుష్బు గుప్తా గూగుల్లో ఉద్యోగం చేయాలనే తన కలను నెరవేర్చుకుంది.సవాళ్లను అధిగమిస్తే విజయం ఎప్పుడూ మనదే అవుతుంది. ‘గూగుల్లో చేరిన కొత్తలో చాలా మిస్టేక్స్ చేసేదాన్ని. అయితే సీనియర్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా తప్పులు జరగకుండా జాగ్రత్త పడడం నేర్చుకున్నాను’ అంటుంది ఖష్బు గుప్తా.అమెజాన్ పాపులర్ డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ను మన దేశంలో లాంచ్ చేసిన బృందంలో లీలా సోమశేఖర్ ఒకరు. అమెజాన్లో పనిచేయాలనేది ఆమె కల. కంటెంట్ ఎడిటర్గా అమెజాన్లో అడుగులు మొదలు పెట్టిన లీల ఆ తరువాత ప్రోగ్రామ్ మేనేజ్మెంట్లోకి వచ్చింది. ‘ఆన్ది–జాబ్ లెర్నింగ్ ఎక్స్పీరియెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది’ అంటున్న లీల సక్సెస్ మంత్రకు ఇచ్చే నిర్వచనం... కొత్తగా ఆలోచించడం. చిన్న వయసులోనేపోలియో బారిన పడిన రేఖాపోడ్వాల్కు వీల్ చైర్పై ఆధారపడడం తప్పనిసరి అయింది. అయితే ఏదో సాధించాలనే తపన మాత్రం గట్టిగా ఉండేది. ఆ తపనే ఆమెను అమెజాన్ ఇండియా స్టార్ ఉద్యోగులలో ఒకరిగా చేసింది.‘కలను నెరవేర్చుకోవడానికి అదృష్టం, అల్లావుద్దీన్ అద్భుతదీపంతో పనిలేదు. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే ఆత్మవిశ్వాసం ఉంటే చాలు’ అంటుంది పుణెకు చెందిన రేఖాపోడ్వాల్. సుందర సందేశం..ఇటీవల గూగుల్ సీయీవో సుందర్ పిచాయ్ని యూట్యూబర్ వరుణ్ మయ్యా ‘ఫాంగ్’కు సంబంధించి యువత కల గురించి అడిగినప్పుడు అమీర్ ఖాన్ బ్లాక్బాస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’లోని ఒక సన్నివేశాన్ని గురించి ప్రస్తావించాడు పిచాయ్. ‘ఆ సీన్లో మోటర్ అంటే ఏమిటో వివరించే వెర్షన్ ఉంది. మోటర్ అంటే ఏమిటో అర్థం చేసుకునే వెర్షన్ ఉంది. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారానే నిజమైన విజయం లభిస్తుంది’ అంటాడు సుందర్ పిచాయ్. సినిమా సీన్ విషయానికి వస్తే ‘మెషిన్ అంటే ఏమిటో నిర్వచనం చెప్పండి’ అనిప్రొఫెసర్ అడిగిన దానికి అమీర్ సింపుల్గా చెప్పిన సమాధానం, ‘మెషిన్స్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ బాడీస్ సో కనెక్టెడ్ దట్ రిలేటివ్ మోషన్స్....’ అంటూ మార్కులు బాగా తెచ్చుకునే స్టూడెంట్ చెప్పిన సుదీర్ఘ, సంక్లిష్ట నిర్వచనం... ఒక విషయాన్ని వివరించడానికి, అర్థం చేసుకోడానికి మధ్య ఉండే తేడాను తెలియజేస్తుంది.ధైర్యమే దారి చూపుతుంది..కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన సోనాక్షి పాండే స్వభావరీత్యా సిగ్గరి. ఇంట్రావర్ట్. నలుగురిలో ధైర్యంగా మాట్లాడేది కాదు. డేటాబేస్ గురించి ఒక చర్చాకార్యక్రమంలో టెక్ ఎక్స్పర్ట్ ఒకరు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్న, చర్చిస్తు్తన్న యూట్యూబ్ వీడియోను చూసింది పాండే. ఈ వీడియో ఆమె కెరీర్ గమనాన్ని మార్చేసింది. ఈ వీడియోతో ఇన్స్పైర్ అయిన పాండే నలుగురిలో ధైర్యంగా మాట్లాడడం అలవాటు చేసుకుంది. అమెజాన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయింది. ఆ తరువాత అమెజాన్ వెబ్ సర్వీసెస్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి సొల్యూషన్ ఆర్కిటెక్చర్లోకి వచ్చింది. ఇందులో పబ్లిక్ స్పీకింగ్, క్లయింట్ ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అయిదు సంవత్సరాలు అమెజాన్లో పనిచేసిన తరువాత మైక్రోసాఫ్ట్, గూగుల్కు అప్లై చేసింది. రెజ్యూమ్లోని కీ ఎలిమెంట్స్ వల్ల రెండు దిగ్గజ సంస్థల్లోనూ పాండేకు ఉద్యోగం వచ్చింది. -
Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
‘ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న, నిన్నటి దాంక బిస్సగా ఉండ్య?’ అని పెద్దింటి మనిషిని అడిగాడు తగ్గుబజారు మనిషి. మాటలు వినపడేంత దూరంలోనే యేటి తగ్గున దొడ్డికి కూచ్చోని మాట్లాడుకుంటున్నారిద్దరూ. ప్రొక్లెయినర్తో ఏటి గట్టునున్న కంప ఉన్న కంపచెట్లను పీకించేసరికి వరిమళ్లు నున్నగా కనపడతున్నాయి. చింతట్టు మీంద నుంచి తెల్ల కొంగల గుంపొకటి వరిమళ్లల్లోకి దిగింది. గుడ్ల మాడి ఇంటి బరుగోళ్ళు యేట్లో సల్లగా పనుకొని నెమురేచ్చా ఉండాయి.బీడీ పొగ గాల్లోకి ఊత్తా ‘నిన్న పెత్తల్ల అమాస గదరా.. కేజీ మటన్, సీపు లిక్కర్ తెచ్చుకున్యాడంట, ఒక్కడే తిని తాగి సచ్చినాడు. ఉబ్బరం పట్టకల్యాక నిద్రలోనే గుండె పట్టుకుందంటా. మంచి సావు సచ్చినాడులే ముసిలోడు’ అన్యాడు పెద్దింటి మనిషి. ‘ఎంత సావొచ్చరా వానికి, డెబ్బై ఏళ్ళు వొచ్చినా మనిషి తుమ్మసెక్క ఉన్యట్టు ఉండ్య’ అనుకుంటా ఇద్దరూ ఒకేపారి లేసి యేట్లోకి పోయివచ్చినారు. ‘తొందర పోదాం పారా, ఎత్తేలోపే ఒకసారి సూసోద్దామ’ని ఊళ్ళోకి దావ పట్టినారు. ముసిలోల్లు, సావాసగాళ్లు అందరూ నాగన్నను సూన్నీకి పోతనారు. యాపసెట్టు కొమ్మల మద్దే నుంచి పడ్తన్య ఎండలో నాగన్నను రగ్గు మీంద పండుకోబెట్టినారు. తలాపున ఊదిగడ్లు పట్టుకుని కూచ్చోని ఉంది నడిపి కోడలు. వచ్చినోళ్లకు నీళ్ళు, కాపీ అందించా సేలాకీగా ఉంది సిన్న కోడలు. మొగుని కాళ్ళ కాడ కూచ్చోని ‘మటన్ కూరాకు, మటన్ కూరాకు అని కలవరిచ్చా ఉన్యాడు మూడు దినాల నుంచి. ఉన్నది అంత తిని సచ్చిపోయే గదరా’ అని ఏడుచ్చాంది నాగన్న పెళ్ళాం. నాగన్న మొఖం సచ్చిపోయినాంక గూడా కళతోనే ఉంది. వచ్చినోళ్ళు అందరూ దాని గురించే మాట్టాడుకుంటా పోతనారు. నాగన్న సిన్నకొడుకు మాటికి ఒకసారి ఇంట్లోకి పోయొచ్చా మూతి తుడుసుకుని వాళ్ళ నాయనను తలుసుకుని కుమిలిపోతనాడు. మిగిలిన ఇద్దరు కొడుకులు తలకాయ న్యాలకేసి నిలబన్యారు. మనువళ్లు మిగతా పనులు సూసుకుంటా ఉండారు. ఊరు సర్పంచు సెండుమల్లె దండ నాగన్న మీందేసి ఒక పక్కన నిలబడి ‘ఎట్టి మాలోళ్లకు సెప్పినారా?’ అని పెద్దరికం నిరూపించుకున్యాడు. నాగన్న పెద్దకొడుకు ముందుకొచ్చి ‘మా పిల్లోల్లు సెప్పనీకి పోయినారు సామీ’ అన్యాడు. ఇంతలోనే ఊరి నుంచి కూతురు ఏడ్సుకుంటా వచ్చి వాళ్ళ నాయన మీంద పడింది. పెద్దింటి మనిషి, తగ్గుబజారు మనిషి ఇద్దరూ గూడా నాగన్న మొఖం దిక్కు సూసి ఒక పక్కన నిలబన్యారు.కోపంగా ఇంటికాడ బగ్గి ఆపి దిగినారు నాగన్న మనువళ్లు. యాప సెట్టు మీందున్న కాకులు అరుసుకుంటా పైకి లేసినాయి. శాంచేపు నుంచి గాడిపాట్లో ఉండే బరుగోళ్ళు రెండు కొట్టుకుంటా ఉండాయి. వాళ్ళ నాయన కాడికి వచ్చి ‘ఈరన్న గుంత తియ్యనీకి రాడంట’ అన్యారు. ఆడ ఉన్య అందరూ వచ్చినోళ్ల దిక్కేమొఖం పెట్టినారు. ‘ఏంటికి?’ అని అడిగినాడు నాగన్న పెద్దకొడుకు.‘ఏమో నాయన! ఏం ఏంటికి గుంత తియ్యవు అని అడిగితే ఏం పలకల్యా.’ ‘ఏం వానికి పొగరు ఎక్కిందంటనా’ అన్యాడు పసిడెంట్. ‘లెక్క జాచ్చి ఇయ్యాలేమో లేరా’ అన్యాడు నిలబన్య పెద్దమనిషి. ‘ఆడికి అది గూడా సెప్పినాం మామా, నీ లెక్క నా పుల్లాతుకు సమానమని ఎచ్చులు పోయినాడు.’‘బలసినట్టు ఉందే.. ఎవరు అనుకోని మాట్టాడ్తానాడంట? కాళ్ళు ఇర్సాలేమో’ అని మీసం తిప్పినాడు నాగన్న నడిపి కొడుకు. ‘ఒర్యా నడిపే.. ఇది కొట్టాట టైమ్ కాదు.. వాని అవసరం మనది. నువ్వు మీయన్న పోయి మాట్టాడి రాపోరి’ అన్యారు రొంత మంది. కొడుకులు ఆలోచనలో పన్యారు. ‘ఇంగో ఇద్దరూ పెద్ద మనుషులు గూడా పోరి’ అన్యాడు పసిడెంట్. గుంత తీసే ఈరన్నను తిట్టుకుంటా పోయినారు నలుగురు.‘ఏం వచ్చి సచ్చింది గుంత తీనీకి పోయే.. లెక్కన్నా వచ్చాది. పెద్ద మాంసం తెచ్చుకుందాం’ అంది మంచంలో నెత్తి దూక్కుంటా ఈరన్న పెళ్ళాం. ఇంటి పక్కన ఉన్య కానుగ సెట్టు కింద కూచ్చోని హరిశ్చంద్ర పద్యం పాడుకుంటా తాడు పేన్తా ఉండాడు ఈరన్న. ‘వీళ్ళ బజార్లు బాగుంటాయి ప్పా.. నీట్గా ఉండాయి సూడు.. మన బజార్లు సచ్చినాయి ఎప్పుడూ సూసినా కుళాయి నీళ్ళు పార్త బురద బురద ఉంటాయి’ అన్యాడు నాగన్న కొడుకులతో పాటు వచ్చన్య మొదటి పెద్దమనిషి.ఆయన సెప్పినట్టే రోడ్డుకు రెండేపులా సెట్లు ఏపుగా పెరిగి ఉండాయి. ఎండ భూమి మీందకు దిగకుండా ఉంది. ఇంటి దిక్కే వచ్చన్య నలుగురును సూసి మంచం మీంద నుంచి దిగి నమస్కారం సేసింది ఈరన్న పెళ్ళాం. ఈరన్న ఏం పలకనట్టు కూచ్చున్యాడు. హరిశ్చంద్ర పద్దెం గొంతు పెంచి అందుకున్యాడు. జనం రొంత గుంపు అయినారు. ‘ఈరన్న.. ఓ ఈరన్న’ అని పిల్సినాడు నాగన్న పెద్దకొడుకు. ‘ఎవరోళ్ళు..’ అన్యాడు ఈరన్న. ‘బంద నాగన్న కొడుకులం’ అన్యాడు నాగన్న నడిపి కొడుకు. ‘సెప్పండి సామీ’ అని అరుగు దిగినాడు. ‘సెప్పనీకి ఏం ఉంది ఈరన్న.. నాగన్న సచ్చిపోయినాడు తెల్దా ఏందీ?’ అన్యాడు రెండో పెద్దమనిషి. ‘తెల్సు సామీ!’ ‘మరేందీ ఈరన్న.. పిల్లోల్లు వచ్చే గుంత తియ్యవనీ సెప్పినావంట?’‘అవును తియ్యను సామీ.’‘యేంది ఈరన్న.. ఏం కావాలా సెప్పు? ఐదు వేలు లెక్క.. రెండు కోటర్లు మందు ఇచ్చాం రా.. టైమ్ ఐపోతాందీ’ అన్యాడు నడిపి కొడుకు. ‘నాకు పదివేలు ఇచ్చినా గుంత తీయను’ అని తెగేసి సెప్పినాడు ఈరన్న. ‘ఏం ఎందుకు ఈరన్న.. మా తాత సచ్చిపోయినప్పుడు నువ్వే గదా తీసినావ్? మా పెద్దనాయన సచ్చిపోయినప్పుడు నువ్వే తీసినావ్? మా ఇల్లు నీకే కదా.’ ‘అవ్ వాళ్ళందరివి తీసిన. రేప్పొద్దున మీలో ఎవరు సచ్చినా గుంత తీచ్చా, కానీ ఈ గుంత తియ్యను.’భుజం మీందున్న టువాలా సర్దుకుంటూ ‘యేందిబీ.. మాటలు యాడికో పోతనాయి. రొంత సూసుకొని మాట్టాడు’ అన్యారు పెద్దమనుషులు. ‘సూడు అయ్యా.. నా మాటలు యాటికి పోలా. నేను గుంత తియ్యను. నన్ను యిడ్సిపెట్టండి.’‘ఏమైందో సెప్పమంటే ఇకారాలు పోతనాడు, ఈడు రాకపోతే వేరేవాళ్ళు రారా యేంది. వాళ్ళను పిల్సుకొని పోదాం’ అన్యాడు నడిపి కొడుకు. ‘ఆ... అట్నే పోండి సామీ’ అని తాడు పేనే పనిలో పడ్డాడు ఈరన్న. మెత్తగా ‘పెద్దోళ్ళు వచ్చినారు, పోకూడదా’ అంది ఈరన్న పెళ్ళాం.‘నీ యమ్మ నిన్ను నరికి, ఈన్నే గుంత తీసి పూడుచ్చా అతికేం మాట్టాన్యావంటే’ అని ఒంటి కాలు మీంద పెళ్ళాం పైకి లేసినాడు ఈరన్న. ‘నీ దినం కూడు కుక్కలు తినా. ఏమన్యానని నా మీందకు వచ్చనావు? పోయేకాలం వచ్చిందిలే నీకు. పెద్దోళ్ళతో పెట్టుకుంటనావు’ అని తిట్టుకుంటా మంచంలో మళ్ళా కూచ్చుంది.నలుగురు ఎదురుగా ఉన్య ఇంటి కాడికి పోయి నిలబన్యారు. ‘అయ్యా.. ఆ ఈరన్న గానీ ఇల్లుకు మేము పోయినామంటే.. వాడు తాగి అమ్మనక్కను తిడ్తాడు. వాన్తో మాకు కొట్టాట వొద్దు అయ్యా.. వానికి ఏం కావాలో ఇచ్చి వాణ్ణే పిల్సుకొని పోండి’ అన్యాడు ఈరన్న ఎదిరింటి మనిషి.రొంత దూరంలో నిలబన్య ఈరన్న అన్న కొడుకు కెళ్ళి సూసేసరికి వాడు సేసేది ఏంల్యాక తలకాయ దించుకున్యాడు. సెప్పనీకి సూసినా వాళ్ళ మనుషుల మీంద మాటలతో పెద్దపులి పడినట్టు పన్యాడు ఈరన్న. ఎవ్వరూ గూడా నోరెత్తల్యా. సెవులూ కొట్టుకుంటా వెనక్కి పోయినారు నలుగురూ. ఈరన్న పెళ్ళాం భయపడ్తా మొగుని దగ్గరకొచ్చాంటే సింత నిప్పుల మాదిరి ఉన్య ఈరన్న కళ్ళు సూసి దూరం నిలబడి జరగబోయేది తలుసుకొని బిత్తర సూపులు సూచ్చాందినాగన్న తలకాయ కాడ ఉన్య బియ్యం గ్లాసులో కొత్త ఊదిగడ్లు నుంచి పొగ దట్టంగా లేచ్చా అప్పుడే లేపిన షామియానాను తాకుతాంది. రెండు మూడు కొత్త పూల దండలతో నాగన్న మొఖం యింగా వెలిగిపోతాంది. గాడిపాడు ఖాళీ అయ్యింది. ‘వాడు రాడంట!’ అని నలుగురు తలకాయలు దించుకున్యారు. ‘ఆ నావట్టకు ఏం పోయేకాలం వచ్చిందో సూడు క్కా’ అని పక్కన కూచున్య బండకాడ కూరగాయాల ఆమెతో బంకామె కళ్ళు పెద్దవి సేసి సెప్పింది. ‘వాడు ల్యాకపోతే ఏంది? వేరే వాళ్లు లేరా’ అన్యాడు పసిడెంట్. ‘వాని దెబ్బకు ఎవరూ రాకుండా ఉండారు.’నాగన్న పెళ్ళాం ఏడుపు యాపసెట్టు అంతా అయింది. ఉన్య రెండు మూడు కాకులు గూడా ఎగిరిపోయినాయి. ‘ఎంత సేపు పెడ్తార్రా.. వాణ్ని పిల్సి ఈపు పగలగొట్టకుండా? ఇదే మా ఊర్లో అయ్యింటే బొడ్డాలు పగలగొట్టే వాళ్ళం. పెద్దమనుషులు ఉండారా? మా మామతో పాటు సచ్చినారా’ అన్యాడు సావు సూన్నీకి వచ్చిన సుట్టం.అది యిన్య పెద్ద మనుషుల మొఖంలో నెత్తుర సుక్క ల్యాకుండా పోయింది. దొంగకోళ్ళు పట్టే మాదిరి ఒకరి మొఖం ఒకరు సూసుకుని బెల్లం కొట్టిన రాయిలా నిలబన్యారు. పరువు మీందకు వచ్చేసరికి కోపంగా ఈరన్నను పిల్సుకొని రమ్మని పసిడెంట్ మనిషిని పంపినాడు. విషయం ఊరంతా పాకింది. ఊర్లో యాసావు అంత మంది జనాన్ని సూసిండదు. ఏం అయితాదని జనాలు పనులు పోకుండా కూచ్చున్యారు. తిన్నాల ఉన్నట్టు ఉంది సావు. ఏడ్సి ఏడ్సి నాగన్న పెళ్ళాం సోయి ల్యాకుండా పడిపోయింది.తప్పెటోల్లు రెండు పెగ్గులేసుకొని ఒక మూలకు కూచున్యారు. ఏం సెయ్యాలో తెలీక కొడుకులు గమ్మున నిలబడి ఉండారు. నాగన్నకు నలుగురు కొడుకులు అందరికి సమానంగా భూమి పంచి ఇచ్చి సోడమ్మ దేళంలో పూజారి పని సేచ్చా ఉండ్యా. దేళంకి చందాలు వసూలు చేయడం, దేళం బాగోగులు సూసుకుంటా సంతోషంగా బతుకుతుండ్యా. సోడమ్మ దేళంలో దీపం వెలగని రోజు లేదు.పనికోసం యా రోజు ఒకరికోసం సెయ్యి స్యాసింది ల్యా. అంత వయసులో కూడా ఎద్దులతో ఆరు ఎకరాల భూమి పండిచ్చా ఉన్యాడు. రోజుకు రెండు సెంబుల కాఫీ తాగుతా, నాలుగు కట్టలు వకీలా బీడీలు కాల్చేవోడు. పెళ్ళాంతో యారోజు మాట్టాడింది ల్యా ఎప్పుడూ కొట్టాడ్త ఉండేవాడు. ఊర్లో ఉన్నన్ని రోజులు ఉత్తపైనే ఉండేటోడు సంతకు పోవాల్సి వచ్చే కొత్తపెళ్ళికొడుకు మాదిరి పోయేటోడు నాగన్న.ఎండ ఎక్కువైంది. సేతీకి ఉన్య పారేన్ వాచ్ పదే పదే సూసుకుంటా ఉండాడు పసిడెంట్. ఈరన్న పేనే తాడు భుజానేసుకుని నిమ్మళంగా వచ్చి రోడ్డు మీందనే నిలబన్యాడు. ఈరన్న వొచ్చినాడని గందరగోళం అయింది. ఊరి పెద్దోళ్లనే మల్లెసినా మొగోడు ఎవడాని కొత్తగా వచ్చిన సుట్టాలు ఈరన్న దిక్కు నోరెళ్ళబెట్టి సూచ్చనారు. వొంటి మింద కేజీ కండ గూడా లేదు. తాగి తాగి ఎముకలు బయట పన్యాయి. మూతి మొత్తం తిప్పినా మీసాలే. కళ్ళు ఎండిపోయిన కుందు యేరు మాదిరి ఉండాయి.‘యేరా ఆన్నే రోడ్డు మీంద నిలబన్యావ్? రా ఇట్టా’ అన్యాడు పసిడెంట్. ఈరన్న పసిడెంట్ మాటకు ఎదురుసెప్పల్యాక నీళ్ళు నములుతా ఉండాడు. ‘యేందిరా?’ అని కళ్ళు పెద్దవి సేసినాడు పసిడెంట్. రోడ్డు మీందకు కళ్ళేసి ‘నేను ఆడికి రాను రెడ్డి’ అని సెప్పినాడు. కొత్త ఊరోళ్ళు పసిడెంట్ కెళ్ళి సూసినాడు. పసిడెంట్కు తలకాయ కొట్టేసినట్టు అయింది. పెద్దమనుషులు పసిడెంట్కు సర్ది సెప్పినారు. అందరూ రోడ్డు మీందకు వచ్చినారు. ‘సూచ్చనా సూచ్చనా శానా ఇకారాలు పోతనావ్? యేంది వాయ్ కథ’ అన్యాడు పసిడెంట్. అందరూ తల ఒకమాట ఏసుకున్యారు. ఈరన్న ఏం పలకకుండా నిలబన్యాడు. పీర్ల పండగ గుండం మాదిరి నిప్పులు కక్కుతా ఇద్దరు ముగ్గురు సెయ్యి పైకి లేపినారు.‘లాస్ట్ సారి మర్యాదగ సెప్తనా.. పోయి గుంత తీపో’ అన్యాడు పసిడెంట్. ‘నా గొంతు కోసినా.. నేను గుంత తియ్యను రెడ్డి’ అని పసిడెంట్ కళ్ళల్లోకి సూటిగా సూచ్చా సెప్పినాడు. ఈరన్న దొమ్మ పొగరు ఊరు మొత్తం సూసింది. ఇట్టా కాదని కోటోళ్ల తాత ముందుకు వచ్చి ‘ఒర్యా... నీకు, నాగన్నకు ఏమైనా తకరారు అయిందా?’ అని అడిగినాడు. ఈరన్న అందరి దిక్కు సూచ్చా తలకాయ ఊపినాడు.‘ఓర్నీ పాసుగూలా.. ఈ మాట ముందు సేప్తే పోయేది గదరా. ఏం కొట్టాట అయింది’ అని అడిగినారు. ఈరన్న ఏం మాట్టాడకుండా రోడ్డు వెంబడి నడ్సుకుంటా పోతాంటే జనం ఈరన్న దిక్కు సూచ్చా పోయినారు. పెద్దమనుషులు ఈరన్న పీక మీంద కాలేసి తొక్కేమాదిరి ఉండారు. గాడ్దెంకా దాటి సోడమ్మ దేళం ముందు రోడ్డు కాడ ఆగినాడు ఈరన్న. జనం గూడా ఏం సెప్తాడ అని కాసుకొని ఉండారు. ఈరన్న ఊరి మంది దిక్కు సూచ్చా పదేళ్ళ కింద మాట ఇదని మొదలుపెట్టినాడు.ఆ పొద్దు ఇంగా సరిగ్గా తెల్లవారాల్య. ఊర్లో సారాయి బాలన్నను పోలీసులు పట్టకపోయినాంక సారాయి కోసం జనం అందరూ పక్క ఊరికి పోతాండారు. రెండు రోజుల నుంచి సారాయి ల్యాక న్యాలుకా పీక్తాంటే నేను సోడమ్మ వెనక దావ గుండా సచ్చా బతుకుతా పక్క ఊరికి పోయినా. కాళ్ళకు సెప్పులు లేవు. అడ్డదావాలో ముల్లులు ఉండాయని సోడమ్మ ముందు దావ వెంబడి ఊళ్ళోకి వచ్చాంటే పొద్దున పూజ సేసుకొనికీ వచ్చిన నాగన్న దావన పోతన్య నన్ను సూసి ‘ఒర్యా ఈరన్న.. ఒర్యా’ అని క్యాకేసినాడు. ఎవరోబ్బా ఇంత పొద్దునా అని నేను ఆగి తలకాయ తిప్పి సూసినా. ‘మాల నాకొడాకా యా దావ నుంచి రా నువ్వు పొయ్యేది’ అన్యాడు.‘ఓ నాగన్న... మాటలు మర్యాదగా రానీ’ అన్య కైపు బిస్సన.‘తాగుబోతు నా కొడకా నీకు మార్యాద యేందిరా, మీకు వెనక దావ ఉంది గదరా.. పెద్దరెడ్డి మాదిరి ఎవరూ సూల్లేదని ముందు నుంచి పోతానావ్’ అన్యాడు. నాకు కైపు అంత యిడ్సిపోయి కోపం అరికాళ్ళల్లో నుంచి మెదుడులోకి పాకింది.. ‘నీ యబ్బా కట్టిచ్చినాడా రోడ్డు.. ఇది అందరికీ’ అని సెప్పినా. అంతే కోపంతో ఎగిచ్చి తన్యాడు కాల్తో. నా కొడకా.. మళ్ళా మాట్టాడ్తనావే.. మీ బతుకులెంత? మీరెంత? యాపొద్దు పోంది, ఈ పొద్దు ఇట్టా ఎందుకు పోతనావ్ వాయ్ అని కుతిక మీంద కాలేసినాడు. సాచ్చం ఆ సోడమ్మ తల్లే. ‘మీకు ఒక దావ.. మాకు ఒక దావ ఎందుకు?’ అని అడిగినా. ‘మీరు మేము ఒకటేనా వాయ్. మేము ల్యాకపోతే మీ బతుకులు తెల్లవారావ్’ అన్యాడు.‘మేము గూడా ల్యాకపోతే మీ బతుకులు తెల్లవారవ్.. మీ పీనుగ కూడా లేయ్యదు’అని సెప్పినా. ‘అంతా మొగోనివా?’ అన్యాడు. ‘సరే అయితే సెప్తండా సూసుకో.. ఇదే ఆకాశం, ఇదే నేల, ఇదే సోడమ్మ, ఎదురుగా ఉన్య మారెమ్మ మీంద ఒట్టేసి సెప్తనా.. రెండు దావలు పోయి ఒకే దావ వచ్చేగానీ నీ పీనుగకు నేను పికాసి ఎత్తను, పారా ముట్టను’ అని గట్టిగా అర్సి తొడ కొట్టి, మీసం తిప్పినా. ‘పో.. పో వాయ్ సూసినావ్, నీ మూడకాసు మాటలు’ అని నన్ను వెనక దావలోకి మెడకాయ పట్టుకొని గుంజకపోయినాడు’ అని జెప్పి.. సాచ్చం అద్దో ఆ మారెమ్మ తల్లే అని పోతురాజు మాదిరి మారెమ్మ దేళంకెళ్ళి సెయ్యి సూపిచ్చినాడు.జనాలు అందరూ కిక్కురుమనుకుండా సినిమా సూసినట్టు సూసినారు. సోడమ్మ కటాంజన్కు కట్టిన ఎర్ర గుడ్డ గాలికి ఊగుతా ఉంది. పొద్దున్నుంచి దీపం ల్యాక దిగులుగా ఉన్నట్టు ఉంది. సాచ్చం యాడ అడుగుతారో అని సోడమ్మ కళ్ళు మూసుకుని ఏం ఎరగనట్టు వింటా ఉంది. సోడమ్మ వెనక దావాలో నిలబన్య ఈరన్న మనుషులు దీనంగా మొఖం పెట్టినారు.‘మళ్ళా మీకు ఆ దావ ఉంది గదరా.. నువ్వు ఎందుకు ఈ దావలో నడ్సినావ్’ అన్యారు పెద్దమనుషులు. ‘మళ్ళా మీరు అదే పాట పాడ్తారు. నేల అంతా ఒకటే అయినప్పుడు మీకు ఒక దావేంది, మాకు ఒక దావేంది రెడ్డి’ అన్యాడు ఈరన్న ఊగిపోతా. ‘ఇప్పుడు ఏం అంటావ్ రా’ అని పళ్ళు నూరినారు పెద్దమనుషులు. ‘నేను సేప్పేది ఏం లేదు రెడ్డి.. నన్ను యిడ్సిపెడ్తే నా పని నేను సూసుకుంటా!’‘సూడు ఈరన్న అయిపోయిందేందో అయిపోయింది. రా వచ్చి గుంత తీయ్. మా నాయన తరుపున పెద్ద కొడుకుగా నేను నిన్ను క్షమాపన అడుగుతనా’ అన్యాడు నాగన్న పెద్దకొడుకు.‘ఎట్టా అయిపోతాది సామీ.. పది సంవత్సరాల నుంచి గుండెకాయ కాల్తానే ఉంది. ఉప్పు కారం మీకన్నా రొంత ఎక్కువే తిన్యా. కుందరాగు నర్సన్న పెద్దకొడుకు కుందరాగు ఈరన్నను నేను, మాట అంటే పానం లెక్క. మీరు సెప్పినట్టే మా బతుకులా? మీకేమో తారోడ్డులు, మాకేమో మట్టి దావలా? మారాల మారి తీరాల.’అందరూ అర్థంకానట్టు సూచ్చనారు. పసిడెంట్ ముందుకు వచ్చి ‘ఇప్పుడు ఏం కావాలి రా నీకు?’‘అందరికీ ఒకే దావా కావాలా!’ ‘తంతే నాకొడకా యేట్లో పడ్తావ్.. అందరికీ ఒకే దావ యేంది రా.. తలకాయ తిరుగుతుందా?’‘నాకు ఏం తిరగల్యా సామీ.. ఇప్పుడే సక్కగా పనిసేచ్చాంది. మేము గూడా ముందు దావలో నుంచే నడుచ్చాం.’ ‘నడసనియ్యక పోతే..’‘మీ గుంతలు మీరే తవ్వుకోండి.. మీ పీనుగులు మీరే బూర్సుకోండి!’ఈరన్న మనసు అందరికీ అర్థం అయింది. పెద్దమనుషులు అందరూ గుంపు అయి గుస గుసలాడ్త ఈరన్న దిక్కు సంపేమాదిరి సూచ్చాండారు. ఎండ నెత్తి మీందకు వచ్చింది. నాగన్న తలకాయ కాడ ఊదిగడ్లు మారుతానే ఉండాయి. బయట ఊరోళ్ళు పెద్దమనుషుల దిక్కు మనుషుల్లానే సూడకుండా ఉండారు. ఈరన్న దిక్కు వాళ్ళ మనుషులు వచ్చి బలంగా నిలబడి కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్యారు. దమ్ములు ఇరిసి నిలబన్య ఈరన్న దిక్కు పెళ్ళాం కళ్ళు ఆర్పకుండా సూచ్చాంది. వాళ్ళళ్ళో వాళ్ళు కొట్టుకుంటా అర్సుకుంటా ఉంటే తాపకొకసారి మీసం తిప్పుతా బుసలు కొడ్తా ఉండాడు ఈరన్న.కొంతమంది ఈరన్న సంగతి సూజ్జామని పంచెలు ఎగ్గొట్టుకోని తిరిగి పోయినారు. సెసేది ఏం ల్యాక పెద్దమనుషులు సల్లు పోయినారు. సోడమ్మ వెనక దావకి కంపసెట్లు అడ్డంగా పెట్టినారు. ఈరన్నను ఎత్తుకుని క్యాకలేసినారు వాళ్ళ మనుషులు. అప్పుడే గుళ్ళో పెట్టిన దీపం వెలుగులో సోడమ్మ నవ్వుతా ఉన్యట్టు ఉంది. ఊళ్ళోదావ గురించి దండోరా యినపడ్తాంటే పికాసీ, పారా తీసుకొని యేటి పడమటి దిక్కు శ్మశానం కెళ్ళి ఈరన్న ఉదయిస్తా పోయినాడు. – సురేంద్ర శీలం -
నయనతార 'చిన్నారి కవల'లను చూశారా!
పిల్లలు నవ్వినా అందమే, ఏడ్చినా అందమే. ఏ కోణంలో చూసినా అందమే అందం! వారి అల్లరి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఇలా ఇద్దరు పిల్లల అల్లరి... అందులో కవల పిల్లల అల్లరి... ఎంతో గమ్మత్తుగా వామ్మో అనాల్సిందే!నయనతార తన కవల పిల్లల ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ మురిసిపోతుంటుంది. తాజా విషయానికి వస్తే... తన కవల పిల్లలతో నయన ఆనంద క్షణాలను పట్టించే వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. పిల్లలతో సింపుల్గా ఆటో ప్రయాణం చేసిన నయనతార ఈ ఆటో రైడ్ విజువల్స్ను ఇన్స్టాగ్రామ్లోపోస్ట్ చేసింది.‘సూపర్ స్టార్’గా పేరు తెచ్చుకున్న నయనతార సింపుల్గా ఆటోలో ప్రయాణించడం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. పలువురు నెటిజనులు ఈ వీడియోను తమ సోషల్ పేజీలో షేర్ చేస్తున్నారు. మాతృత్వంలోని మధురిమ గురించి తీయటి కామెంట్లు పెడుతున్నారు.ఇవి చదవండి: తాను.. బాలీవుడ్ 'ఆస్థా'న ఫేవరెట్! -
తాను.. బాలీవుడ్ 'ఆస్థా'న ఫేవరెట్!
కాన్స్ రెడ్ కార్పెట్ మీద ఐశ్వర్యా రాయ్ లుక్స్కి వెస్ట్రన్ వరల్డ్ అంతా ఫిదా అయిపోయింది. మనకూ కొత్తగా కనిపించింది. అలా ఆమెను తీర్చిదిద్దిన స్టయిలిస్ట్ ఆస్థా శర్మ. ఆమె అంట్రప్రెన్యూర్ కూడా!ఆస్థా స్వస్థలం ఢిల్లీ. ఫ్యాషన్ ప్రపంచంతో అసలు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్లది లాయర్ల కుటుంబం. ఆమె తండ్రి.. ఢిల్లీలో పేరుమోసిన అడ్వకేట్. కెరీర్ విషయంలో తన తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనుకుని ఇంటర్ అయిపోగానే ‘లా’ ఎంట్రెన్స్ రాసింది. సీట్ వచ్చింది కూడా. కానీ ఆస్థా వాళ్ల నాన్న.. తన కూతురు లాయర్ కాకుండా ఇంకేదైనా రంగంలో స్థిరపడితే బాగుండు అనుకున్నాడు. అదే విషయాన్ని బిడ్డతో చెప్పాడు.. ‘నేను లాయర్ అయ్యాను కాబట్టి.. నువ్వూ కావాలనే మైండ్సెట్తో లా చదవకు. నీకేది ఇష్టమో అదే చెయ్’ అని. అప్పుడు ఆలోచించింది ఆస్థా.. నిజంగా తనకు లా చదవాలని ఉందా? అని! ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించలేదు.దాంతో అది వదిలేసి ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఇంగ్లిష్ లిటరేచర్లో చేరింది. అది చదువుతున్నప్పుడే ఆస్థాకు క్రియేటివ్గా ఏదో చేయాలనే తపన మొదలైంది. ఆ శోధనలోనే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెరిగింది. బీఏ అయిపోగానే ‘పర్ల్ అకాడమీ’ ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ మర్చండైజింగ్ కోర్స్లో జాయిన్ అయింది. కానీ అదేమంత ఇష్టంగా తోచలేదు. అప్పుడే ఒక ఫ్రెండ్ ద్వారా ‘స్టయిలింగ్’ గురించి తెలుసుకుంది.ఫ్యాషన్ మార్కెటింగ్ కోర్స్ పూర్తవగానే స్టయిలింగ్లోకి దిగింది. మ్యాగజైన్ స్టయిలిస్ట్ రిన్ జాజో దగ్గరికి ఇంటర్న్గా వెళ్లింది. అదే సమయంలో మరో స్టయిలిస్ట్ ఆదిత్య వాలియాకూ అసిస్టెంట్గా పని చేయడం మొదలుపెట్టింది. అప్పుడు గ్రహించింది స్టయిలింగ్ అనేది తన కైండ్ ఆఫ్ వర్క్ అని. ఆ ఇంటర్న్షిప్ అయిపోగానే ఆమెకు ఏ్చటp్ఛట’టఆ్చ్డ్చ్చట మ్యాగజైన్లో ఫ్యాషన్ ప్రొడ్యూసర్ కొలువు దొరికింది. అది ఆమెకు పనిలో అనుభవాన్నే కాదు.. ఫ్యాషన్ లోకపు కాంటాక్ట్స్నీ పెంచింది. గొప్ప ఎక్స్పోజర్నిచ్చింది.అది ఒక పంజాబీ సినిమాలోని అగ్రతారలకు స్టయిలింగ్ చేసే చాన్స్ని తెచ్చిపెట్టింది. అంతే మ్యాగజైన్లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆసా, ఆమె కొలీగ్ మోహిత్ ఇద్దరూ ఆ ప్రాజెక్ట్లో తలమునకలయ్యారు. సక్సెస్ సాధించారు. దానిద్వారా వచ్చిన పెద్దమొత్తాన్ని తీసుకుని ముంబై చేరారు. ‘వార్డ్రోబిస్ట్’ అనే ఫ్యాషన్ స్టార్ట్ప్ పెట్టారు. అది ఆస్థాకు బాలీవుడ్ ఎంట్రెన్స్ని కల్పించింది. ఐశ్వర్యా రాయ్ని పరిచయం చేసింది. తన పనితనాన్ని నిరూపించుకునే అవకాశాన్నిచ్చింది. ఐశ్వర్యా రాయ్ మెచ్చి ఆమెను తన పర్సనల్ స్టయిలిస్ట్గా అపాయింట్ చేసుకుంది.ఆ వాసి మరింత మంది తారలకు చేరి.. దిశా పాట్నీ, మృణాల్ ఠాకుర్, నోరి ఫతేహీ, విద్యా బాలన్, భూమి పెడ్నేకర్లకూ స్టయిలింగ్ చేసే ఆపర్చునిటీస్ని అందించింది. అంతేకాదు అంట్రప్రెన్యూర్గా ‘ద వెడ్డింగ్ స్టయిల్’ ప్రాజెక్ట్నూ లాంచ్ చేసే దశకు చేర్చింది. ఆస్థా ఇప్పుడు.. బాలీవుడ్ సెలబ్రిటీస్కి ఫేవరెట్ స్టయిలిస్ట్.. బడ్డింగ్ స్టయిలిస్ట్లకు రోల్ మోడల్!స్టయిలిస్ట్ అవడానికి ఫ్యాషన్ పట్ల ప్యాషన్ మాత్రమే సరిపోదు. ఫ్యాషన్ అండ్ డిజైనింగ్లో చదువు, ఆ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్, అంతులేని ఈ పోటీ రంగంలో అలుపెరగని శ్రమ, ఊహకందని సృజన చాలా ఇంపార్టెంట్! అందుకే ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్ మీద అవగాహన, స్టడీ, రీసెర్చ్ తప్పనిసరి! ఇవన్నీ ఉంటేనే స్టయిలింగ్లో మన మార్క్ చూపించగలం.. బెస్ట్ అనిపించుకోగలం! – ఆస్థా శర్మఇవి చదవండి: ఆ పాత్రలో.. మెప్పించడానికి చాలానే కష్టపడింది! -
Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..?
ప్రతిరోజూ ఎండతోపాటుగా.. వర్షాలు, చల్లదనం, వాతవరణంలో ఓకేసారి మార్పుల కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. అందులో చర్మం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవచ్చు. ఇలాంటి సమస్యలను అధిగమిస్తూ అందంగా కనిపంచాలంటే ఈ బ్యూటీ టిప్స్ ట్రై చేయండి..పుచ్చకాయ.. ద్రాక్ష!పుచ్చకాయ, ద్రాక్ష కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీంట్లో నిమ్మరసం, కోడిగుడ్డు లోని తెల్లసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వేసవిలో ఈ ఫ్రూట్ ప్యాక్ని తరచూ వేసుకోవడం వల్ల చర్మంలో జిడ్డు తగ్గి, కాంతిమంతం అవుతుంది.ఆరెంజ్ జ్యూస్..టీ స్పూన్ తేనె, కొద్దిగా ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ ఓట్స్, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో ఉంచి, చల్లబడ్డాక ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖచర్మం సేదదీరుతుంది.కొబ్బరిపాలతో..ఎండలో నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ఫ్రిజ్లో ఉంచిన కొబ్బరిపాలలో దూది ఉండను ముంచి, దాంతో ముఖం, చేతులపై అద్ది, పది నిమిషాలు సేదదీరాలి. తర్వాత స్నానం చేస్తే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.సోంపుతో..రెండు టీ స్పూన్ల సోంపు గింజలను దంచి, అరకప్పు నీటిలో వేసి, మరిగించాలి. చల్లారాక ఈ నీటిని వడకట్టి, టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమం ఫ్రిజ్లో ఉంచాలి.ఎండ నుంచి ఇంటికి వచ్చినప్పుడు దూది ఉండను సోంపు నీటిలో ముంచి ముఖం, మెడ, చేతులు తుడుచుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ నీళ్లు స్వేదరంధ్రాలలోని మలినాలను తొలగిస్తాయి. దురద, దద్దుర్లు, ట్యాన్ వంటి సమస్యలనూ తగ్గిస్తాయి. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.ఇవి చదవండి: ఖర్జూరతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా! -
ప్రతిరోజూ ఓ అరగంట నడిచారో.. ఈ సమస్యలిక దూరమే!
మనకు తెలిసిన విషయమే కదా అని తేలిగ్గా తీసిపారేయద్దు. అలాగే బద్ధకించవద్దు. క్రమం తప్పకుండా రోజూ ఓ అరగంట పాటు నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. స్లిమ్గా ఉండవచ్చు. డయాబెటిస్, బీపీ వంటి వాటికి దూరంగా ఉండచ్చు.అన్నింటికీ మించి రోజంతా ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉండచ్చు. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు నడవడం కాదు... మన నడక ఎలా ఉండాలి... ఎంత దూరం నడవాలి? ఏ సమయంలో నడవాలి... వంటి ప్రాథమిక విషయాలు తెలుసుకుందాం..!క్రమం తప్పకుండా నడవడం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణంగా, శారీరక వ్యాయామాలు, కార్యకలాపాలు ఆందోళన, నిరాశ, ఒత్తిడి, ఇతర సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయని చెబుతారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 30 నిమిషాల పాటు చేసే మార్నింగ్ వాక్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.వ్యాయామాలన్నింటిలోనూ అతి తేలికపాటి వ్యాయామం ఏదంటే నడకే అని చెప్పచ్చు. బరువును నియంత్రించడంలో, కేలరీలను కరిగించడంలో వాకింగ్ను మించిన మందే లేదు. క్రమబద్ధమైన నడక వార్థక్య ఛాయలను నివారిస్తుంది. అయితే ఆ నడక ఎలా ఉండాలి... ఎప్పడు చేయాలో చూద్దాం...శక్తిని పెంచుతుంది..మార్నింగ్ వాక్ ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతోనే చేయాలి. అలా ఖాళీ కడుపుతో చేసే మార్నింగ్ వాక్ శక్తి స్థాయిని పెంచుతుంది. శరీరం, మనస్సు సాంత్వన పొంది, కణజాలాలు శక్తిని పొందేలా చేస్తుంది. వాకింగ్ వంటి సాధారణ శారీరక శ్రమ శక్తి స్థాయులను పెంచడానికి గొప్ప మార్గం. ఇది అలసట తగ్గించి,, ఉత్సాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది.గుండెకు బలాన్నిస్తుంది..రోజూ ఉదయాన్నే అరగంటపాడు చురుగ్గా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ సాధారణ వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని, రక్త΄ోటును తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బుల ముప్పును ముందుగానే తగ్గించుకోవచ్చు.జీర్ణవ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది..జీర్ణక్రియను ఉత్తేజపరిచేందుకు ఖాళీ కడుపుతో ఉదయాన్నే నడవడం మంచిది. ఈ అభ్యాసం మీ ఉదర కండరాల సహజ సంకోచాన్ని ్ర΄ోత్సహిస్తుంది.మానసిక బలంరోజూ నడవడం వల్ల మెరుగైన ఆత్మగౌరవం, మెరుగైన మానసిక స్థితి, ఆందోళన సమస్యలతో సహా మీ మానసిక ఆరోగ్యానికి వాకింగ్ గొప్ప ప్రయోజనాలను కలిగిస్తుంది. శారీరక శ్రమ మీ శరీరం మానసిక స్థితి ఆత్మగౌరవాన్ని మెరుగుపరిచే ఎండార్ఫిన్ లను విడుదల చేయడంలో సహాయపడుతుంది.చక్కటి నిద్ర: తెల్లవారుజామున వెలువడే సూర్యరశ్మి సహజంగా మీ సిర్కాడియన్ రిథమ్ను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మీ దినచర్యకు 30 నిమిషాల మార్నింగ్ వాక్ అలవాటుతో మీ మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి. శారీరక శ్రమ మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది.పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాకింగ్ వంటి మితమైన వ్యాయామం, కాలక్రమేణా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే వాయిదా వేయకుండా నడుద్దాం. నడకను పడక ఎక్కనివ్వకుండా చూద్దాం.ఖాళీ కడుపుతో 30 నిమిషాల మార్నింగ్ వాక్ అనే నియమాన్ని అలవాటుగా చేసుకోవటం వల్ల రోజంతా శక్తిని పొందుతారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. వార్థక్య లక్షణాలు తొందరగా దరిచేరకుండా ఉంటాయి. దీనిని తేలిగ్గా తీసేయకుండా దిన చర్యలో చేర్చడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. -
ఇన్స్టాగ్రామ్ ‘పీక్’ ఫీచర్ని ఎప్పుడైనా ట్రై చేశారా!
‘పీక్’ అనే కొత్త ఫీచర్ని పరీక్షిస్తోంది ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్. ఈ ఫీచర్ ద్వారా ఒక వ్యూ తరువాత మాయం అయ్యే ఎడిట్ చేయని, అన్ఫిల్టర్, ఇన్–ది–మూమెంట్ ఫొటోలను యూజర్లు స్పీడ్గా క్యాప్చర్, షేర్ చేయవచ్చు. స్నాప్చాట్, బీరియల్ను స్ఫూర్తిగా తీసుకొని ‘పీక్’పై దృష్టి పెట్టింది ఇన్స్టా. ఫొటోలు, వీడియోలను 24 గంటల ΄ాటు చూడడానికి అనుమతించే ఇన్స్టాగ్రామ్లోని ప్రస్తుత ‘స్టోరీస్’ ఫీచర్లా కాకుండా ‘పీక్’ ఫొటోలు సింగిల్ వ్యూలో అదృశ్యం అవుతాయి, ‘లిటిల్ మూమెంట్స్ విత్ ది పీపుల్ యూ లవ్’ అని ‘పీక్’ గురించి చెప్పింది ఇన్స్టాగ్రామ్.గూగుల్ కొత్త ఏఐ వీడియో అండ్ ఇమేజ్ జనరేటర్స్..కొత్త ఏఐ వీడియో అండ్ ఇమేజ్ జనరేటర్స్ వియో, ఇమాజెన్ 3లను గూగుల్ లాంచ్ చేసింది. టెక్స్ట్ ప్రాంప్ట్ల నుంచి వీడియోలను జనరేట్ చేయడానికి వియో ఉపయోగపడుతుంది. ఇమాజెన్ 3 అనేది గూగుల్కు సంబంధించి అత్యంత అధునాతన ‘టెక్ట్స్–టు–ఇమేజ్’ మోడల్. ‘ఇమాజెన్ 3 అనేది టెక్స్›్ట–టు–ఇమేజ్ హైక్వాలిటీ మోడల్.ఫొటోరియలిస్టిక్, లైఫ్లైక్ ఇమేజ్లను సృష్టించే సామర్థ్యం దీని సొంతం’ అంటుంది గూగుల్. మోస్ట్ అడ్వాన్స్డ్ వీడియో మోడల్గా గూగుల్ చెబుతున్న ‘వియో’ వెరైటీ స్టైల్స్లో హై–క్వాలిటీ 1080పి వీడియోలను ్ర΄÷డ్యూస్ చేస్తుంది. ఈ ఏఐ మోడల్ ‘టైమ్ల్యాప్స్’ ‘ఏరియల్ ష్టార్స్’లాంటి సినిమాటిక్ కాన్సెప్ట్లను కూడా అర్థం చేసుకుంటుంది. వీడియో క్రియేటర్లకు ఇది గేమ్–చేంజర్ అవుతుందని ప్రకటించింది గూగుల్.హువావే మేట్ బుక్ 14..సైజ్: 14.2 అంగుళాలు రిజల్యూషన్: 2880్ఠ1920 పిక్సెల్స్బరువు: 1.31 కేజీ మెమోరీ: 16జీబి స్టోరేజ్: 512 జీబి/1టీబిబ్యాటరీ లైఫ్: 19 గంటలు, ఏఐ ఫీచర్స్, ఇన్టెల్ కోర్ ఆల్ట్రా చిప్ఆల్ట్రా హ్యూమన్ రింగ్ ఏయిర్..థిక్: 2.5 ఎంఎంవైడ్: 8.1 ఎంఎం బరువు: 3 గ్రా. కలర్ ఆప్షన్: టైటానియం పీపీజీ ఆప్టికల్ సెన్సర్: హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్, వాటర్ రెసిస్టెంట్,సపోర్ట్స్: 22 వర్కవుట్ మోడ్స్హెచ్ఎండీ టీ21 ట్యాబ్..సైజ్: 10.36 అంగుళాలు వోఎస్: ఆండ్రాయిడ్ 13రిజల్యూషన్: 1200్ఠ2000 పిక్సెల్స్ కలర్: బ్లాక్ స్టీల్ఇంటర్నల్: 64జీబి 4జీబి ర్యామ్/ 128జీబి 4జీబి ర్యామ్ బ్యాటరీ: 8200 ఎంఏహెచ్, స్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్ఇవి చదవండి: గేమింగ్.. 'రక్షకుడు' వచ్చాడు! -
గేమింగ్.. 'రక్షకుడు' వచ్చాడు!
యాక్షన్–అడ్వెంచర్ గేమ్ ‘ఘోస్ట్ ఆఫ్ సుషిమ’ విడుదల అయింది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి ఆడే గేమ్ ఇది. సుషిమ ద్వీపాన్ని రక్షించడానికి రంగంలోకి దిగిన ‘సకాయ్’ అనే సమురాయ్ని ప్లేయర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అకీరా కురోసావా సినిమాలు, కామిక్ బుక్ సిరీస్ ‘ఉసాగి యోజింటో’ ప్రేరణతో ఈ గేమ్ను రూపొందించారు.గేమ్ ల్యాండ్స్కేప్, మినిమలిస్టిక్ ఆర్ట్ స్టైల్ను యాక్షన్–అడ్వెంచర్ గేమ్ ‘షాడో ఆఫ్ ది కొలోసస్’ ప్రభావంతో చేశారు. గేమ్లోని లొకేషన్లు ‘పర్ఫెక్ట్ ఫొటోగ్రాఫర్స్ డ్రీమ్స్’ అనిపించేలా అందంగా ఉంటాయి. ఇలన్ ఎస్కేరి, షిగేర్ ఉమేలయాషి ఈ గేమ్ సౌండ్ ట్రాక్ను అద్భుతంగా కం΄ోజ్ చేశారు.‘చారిత్రకంగా, సాంస్కృతికంగా ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాం’ అని మేకర్స్ చెబుతున్నారు.జానర్: యాక్షన్–అడ్వెంచర్మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ప్లాట్ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ప్లే స్టేషన్ 5, విండోస్.ఇవి చదవండి: అరుదైన ప్రతిభ.. అక్షత! -
డెనిమ్ న్యూ లుక్ డిజైన్..!
ఫ్యాషన్ ప్రపంచంలో అప్ సైక్లింగ్ మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఉన్నదానిని సృజనాత్మకంగా మార్చడంలో కళాత్మక విలువతో ΄ాటు పర్యావరణ స్పృహ కూడా ఉంటుంది. ఎప్పుడూ కొత్తవాటి కోసం పరుగులు తీయకుండా ఉన్నవాటిని కొత్తగా, ఫ్యాషనబుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియజెప్పడానికి డిజైనర్లుపోటీ పడుతుంటారు. దీంట్లో భాగంగా డెనిమ్ అప్ సైక్లింగ్ ఎప్పుడూ బెస్ట్ ఛాయిస్గా ఉంటుంది.మనకున్న రకరకాల డిజైన్ వేర్లలో వివిధ రకాల ఫ్యాబ్రిక్తో రూపొందించినవి ఉంటాయి. వీటిలో డెనిమ్ జాకెట్స్, స్కర్ట్స్, ప్యాంట్స్ కూడా మోడర్న్ డ్రెస్సుల్లో భాగంగా చేరుతుంటాయి. జీన్స్ ప్యాంటులకు ఉపయోగించే నీలం రంగు గట్టి ఫ్యాబ్రిక్ను డెనిమ్ అంటారు. డెనిమ్ డ్రెస్సులైతే సంవత్సరాలుగా ఉపయోగించేవీ ఉంటాయి. కొన్నింటిని తీసిపడేయలేం, అలాగని వార్డ్ రోబ్స్లోనూ ఏళ్ల తరబడి ఉంచేయలేం. ఈ పరిస్థితులలో వాటికో కొత్త రూపు ఇవ్వడం చాలా మేలైన కళ. టాప్స్, కుర్తీస్, శారీస్.. ఇలా అనుకూలతను బట్టి అందమైన డిజైనర్ వేర్ని రూపొందించవచ్చు. లేదంటే విడిగా కొత్త ఫ్యాబ్రిక్తో సరికొత్త డిజైన్నీ క్రియేట్ చేయవచ్చు.అప్ సైకిల్ డెనిమ్ శారీ వర్ణిక సాంగోయి ముంబై ఫ్యాషన్ డిజైనర్. డెనిమ్తో ఎన్నో అప్సైకిల్ డిజైన్స్ చేసిన డిజైనర్. మోడర్న్ డ్రెస్సులే కాదు శారీస్ను కూడా డెనిమ్ టచ్తో,ప్యాచ్ వర్క్తో వివిధ రకాల మెటీరియల్ను ఉపయోగిస్తూ తయారు చేసింది. డెనిమ్ దర్జి పేరుతో స్టూడియో కూడా రన్ చేస్తుంది.– నెట్ ఫ్యాబ్రిక్, డెనిమ్ ఫ్యాబ్రిక్తో రూపొందించిన చీర ఇది. చీర బార్డర్పైన ఘుంగ్రూ వర్క్ డిజైన్ చేశారు. – పోల్కా డాట్స్ప్యాచ్ వర్క్తో రూపొందించిన శారీ– లినెన్ శారీకి జియోమెట్రిక్ స్టైల్లో కట్ చేసిన డెనిమ్ క్లాతతో ప్యాచ్ వర్క్ చేశారు. – స్కర్ట్ శారీని డెనిమ్ను ఉపయోగిస్తూ చేసిన మ్యాజిక్ స్టైల్ డ్రెస్ ఇది. – డెనిమ్ క్రాప్టాప్– కాటన్ ఫ్యాబ్రిక్ – డెనిమ్ జాకెట్ని ఉపయోగిస్తూ రూపొందించిన కుర్తా– లేస్తో లాంగ్ స్లీవ్స్ రూపొందించిన డెనిమ్ జాకెట్– డెనిమ్ ప్యాచ్వర్క్తో మోడర్న్ టాప్– డెనిమ్ ప్యాంట్ బెల్ స్టైల్కి క్రోచెట్ డిజైన్ను అదనంగా జత చేస్తే వచ్చే స్టైల్.ఇవి చదవండి: పవర్ఫుల్ ప్రఫుల్..! -
పిచ్చుకను కాపాడిన బుడతలు..! ఇంతకీ ఏం జరిగిందంటే?
మారుతున్న కాలక్రమేనా పిచ్చుకల జాతే కాదు.. మిగతా మూగ ప్రాణులన్నీ కూడా జాడ లేకుండా పోతున్నాయి. ఈ ఎండలో దాహానికి అలమటిస్తున్నాయి. అలాంటి ఘటనే ఓ పిచ్చుకకి జరగడంతో.. ఈ చిన్నారులు చేసిన గొప్పపనేంటో చూద్దామా!రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం ఓ పిచ్చుకను కాపాడి శభాష్ అనిపించుకున్నారు. వేసవి సెలవులు కావడంతో ఆడుకునేందుకు మండెపల్లికి చెందిన గదగోని నిహాంత్, హర్షిత్, త్రినయ్ సిరిసిల్లలోని బతుకమ్మఘాట్ వద్దకు బుధవారం వెళ్లారు.ఆ సమయంలో నీరు దొరక్క ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పిచ్చుకను గమనించి.. వెంటనే దాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వెంట తెచ్చుకున్న వాటర్బాటిల్ మూతలో నీరు పోసి తాగించారు. కొద్దిసేపు సపర్యాలు చేయడంతో తేరుకుంది. వెంటనే తుర్రన ఎగిరిపోయింది. పిచ్చుక ప్రాణాన్ని కాపాడిన చిన్నారుల సంతోషానికి అవధులు లేవు.ఇవి చదవండి: World Turtle Day: నారి.. తాబేలు మేలు కోరి! -
ఈ నడక ఎంతో ఆరోగ్యం అంటున్నారు.. నిపుణులు!
ఆస్ట్రేలియాలో ‘బేర్ఫుట్ వాకింగ్’ ఇప్పుడు చాలామంది అలవాటు చేసుకుంటున్నారు. ఉత్తకాళ్లతో నడవడం భారతీయులకు వేల ఏళ్లుగా తెలిసినా ఆ తర్వాత వ్యాయామ నడక కోసం తగిన షూస్, చెప్పులు తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. కాని ‘భూమితోపాదాలను తాకించడం’ వల్ల ఆరోగ్యమని ఇంకా ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఉత్తకాళ్ల నడక ప్రయోజనాలేమిటి?ఆస్ట్రేలియాలో ఉత్త కాళ్లతో నడవడం ఇప్పుడు ఒక వ్రతంలా పాటిస్తున్నారు. కొందరు మార్నింగ్ వాక్ కోసం ఉత్త కాళ్లను ఉపయోగిస్తుంటే మరికొందరు ఎల్లవేళలా చెప్పులు, షూస్కు దూరంగా ఉంటున్నారు. ఇదొక పెద్ద ధోరణిగా మారిందక్కడ. మన దేశంలో చెప్పుల్లేనిపాదాలతోనే జనం నడిచారు. ఇప్పటికీ నడిచేవారున్నారు. కాని ఆరోగ్య చర్యల్లో భాగంగా చెప్పుల్లేకుండా భూస్పర్శను ΄÷ందడం అనేది మెల్లమెల్లగా మన దేశంలోనూ కనిపిస్తోంది. గతంలో చూస్తే చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్ తన జీవితంలో ఎప్పుడూ చెప్పులు వేసుకోలేదు. ఆయన ఎన్ని దేశాలు తిరిగినా ఖాళీపాదాలతోనే తిరిగాడు. ఇక ఇటీవల యువ దర్శకుడు అనుదీప్ ఖాళీపాదాలతో నడకను ప్రచారం చేస్తున్నాడు. ఆస్ట్రేలియా వారైనా గానీ, ఇలా నడవడాన్ని ఇష్టపడుతున్నవారుగానీ చెబుతున్నదేమిటి? ఇలా నడవడం వల్ల ఉపయోగాలేమిటి?ఎక్కడ నడవాలి: ఉత్తపాదాలతో నడిచే వారు కూసు రాళ్లు లేదా ముళ్లు లేని మట్టి బాటల్లోగాని, గడ్డి మైదానంలోగాని, ఇసుక దారుల్లోగాని నడవడం మంచిదని నిపుణులు అంటున్నారు. సూపర్ మార్కెట్లో లేదా నున్నటి రాళ్లు పరిచిన స్థలాల్లో నడిస్తే జారి పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.1. ప్రకృతితో అనుసంధానంప్రకృతిలో పుట్టిన మనిషి ప్రకృతితో అనుసంధానం కావడం లేదు. ప్రకృతి స్పర్శను అనుభవించడం లేదు. ఏíసీ గదుల్లో ఉంటూ కాలికి నేలంటకుండా జీవిస్తున్నాడు. నేల తగిలితే– కాలి కింద భూమికి ఉన్న రకరకాల స్వభావాలు అంటుతూ ఉంటే ప్రకృతితో ఒక అనుసంధానం ఏర్పడుతుంది. వినమ్ర భావన కలుగుతుంది. ఇంకా మామూలు భాషలో చె΄్పాలంటే కళ్లు నెత్తికెక్కి ఉంటే అవి కిందకు దిగుతాయి.2. విద్యుదయస్కాంత సమతుల్యతఖాళీపాదాలతో నడవడం వల్ల భూమిలోని నెగెటివ్ అయాన్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. మనం నిత్యం వాడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల శరీరంలో పేరుకున్న అయాన్లను ఇవి బేలెన్స్ చేస్తాయి. దాని వల్ల శరీరంలోని విద్యుదయస్కాంత స్థితి సమతుల్యం అవుతుంది. దీంతో వాపులు తగ్గడం, నిద్ర బాగా పట్టడం వీలవుతుంది.3. ఒత్తిడి దూరంఖాళీపాదాలతో నడవడం వల్లపాదాలలో ఉండే నరాలు క్రమబద్ధంగా తాకిడికి లోనవుతాయి. దాని వల్ల ఒత్తిడి దూరమయ్యి సేదదీరిన భావన కలుగుతుంది.4. సరైన పోశ్చర్ఖాళీపాదాలతో నడిచినప్పుడుపాదాలు, కాళ్లు, మడమలు అనుసంధానంలోకి వస్తాయి. చెప్పులు లేదా షూస్ వేసుకుని నడిచేటప్పుడు తెలియకనే నడకపోశ్చర్ మారుతుంది. కాని ఖాళీపాదాలతో నడిచేటప్పుడు నడకకు వీలుగా శరీరం సరైనపోశ్చర్కు వస్తుంది. అంతేకాదు కాలి కండరాలు బలపడతాయి. శరీరాన్ని సరిగ్గా బేలెన్స్ చేస్తూ నడవడం తెలుస్తుంది. కాళ్లను పూర్తిగా ఆన్చి నడవడం వల్ల నడకలో కుదురు వస్తుంది.5. రక్తప్రసరణ ఖాళీపాదాలతో నడవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.పాదంపై ఒత్తిడి పడటం వల్ల రక్తప్రసరణలో చురుకు వచ్చి గుండెకు మేలు జరుగుతుంది. అంతేకాదుపాదాలపై ఉండే మృతకణాలు వదిలి΄ోయి చర్మం మెరుగవుతుంది. -
అలసిన దేహానికో'టీ'..! భారత్లో మొదటిసారిగా..
పొద్దునో టీ.. సాయంత్రమో టీ.. దోస్తులతో టీ.. చుట్టాలతో టీ.. పని ఆపి ఒక టీ.. పనయ్యాకో టీ.. తాగాల్సిందే టీ అంటూ టీ ప్రియులు చెబుతున్నారు. చెమటలు కక్కే వేడిలోనూ పొగలుకక్కే చాయ్ తాగుతున్నారు. చాయ్ కలిగించే కిక్కులను పేద, ధనిక వ్యత్యాసం లేకుండా ఆస్వాదిస్తుంటారు. ఎంత పేదలైనా ఇంటికి వెళ్లామంటే.. ఓ గ్లాసు మంచినీళ్లు, ఓ కప్పు టీ ఇవ్వాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలకు టీ అత్యంత ఇష్టమైన పానీయం. అలాంటి టీకి ఒక రోజు ఉంది. 2005 నుంచి ఏటా మే 21న అంతర్జాతీయ ‘టీ’ దినోత్సవం నిర్వహిస్తున్నారు.1793 నుంచే..అలిసిన మనసుకు, దేహానికి ఉత్తేజాన్ని ఇచ్చే పానీయం టీ. అరె భాయ్ చటుక్కున తాగరా చాయ్.. అంటూ ఓ సినీగేయ రచయిత టీ గొప్పతనాన్ని వర్ణిస్తూ పాట రాశాడు. ఎంతో చరిత్ర కలిగిన టీని తేనీరు, చాయ్ అని పిలుస్తారు. 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది. మొట్టమొదటగా మన దేశంలో 1793లో కలకత్తాలోని బొటానికల్ గార్డెన్లో లార్డ్ మెకార్డి టీ మొక్కలు పెంచడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇంటింటికీ టీ చేరింది. ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానం భారత్దే. అంతర్జాతీయంగా 30శాతం టీ పొడిని ఒక్క భారతీయులే వినియోగిస్తున్నారు.సహజమైన పానీయం..టీ సహజమైన పానీయం. ఇంటికి ఎవరు వచ్చినా అతిథి మర్యాదలో మొదట చేరిపోయేది ‘టీ’. స్నేహితులు కాలక్షేపానికి టీ పాయింట్కు చేరాల్సిందే. సమావేశాల్లోనూ తేనీటిది ప్రత్యేక స్థానం. ప్రస్తుతం బయట రకరకాల కేఫ్లు వెలుస్తున్నాయి. టీలలో కూడా చాలా రకాలు తయారు చేస్తున్నారు. అల్లం టీ, లెమన్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ, కరోనా టీ రకరకాల టీలను టీ ప్రియులు ఆస్వాదిస్తున్నారు. మండల కేంద్రాల్లో సైతం ప్రస్తుతం వివిధ కంపెనీలు వివిధ పేర్లతో టీ పాయింట్లు ఏర్పాటు చేసి ఒక కప్పు చాయ్కు రూ.10లకు తగ్గకుండా విక్రయిస్తున్నారు. కానీ పలువురు టీ వ్యాపారులు ఇప్పటికీ రూ.5లకే టీ విక్రయిస్తున్నారు.ఇవి చదవండి: నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ! -
'నిజాయితీ'..! ఒక రాజు.. అంతు చిక్కని రోగంతో..
అనగనగా ఒక రాజు. అతనో అంతు చిక్కని రోగంతో బాధపడసాగాడు. తానింక ఎన్నో రోజులు బతకనని అతనికి అర్థమైంది. అందుకే తను బతికుండగానే.. రాజ్యానికి నిజాయితీపరుడైన యువరాజును ఎన్నుకోవాలనుకున్నాడు. మరునాడే రాజ్యంలోని యువకులందరినీ పిలిపించి.. యువరాజు ఎంపిక విషయం చెప్పాడు. అందరికీ తలా ఒక విత్తనం ఇచ్చి, దాన్ని నాటమని చెప్పి.. పదిరోజుల తర్వాత మొలకెత్తిన ఆ మొక్కను తీసుకొని రమ్మన్నాడు. ఎవరి మొక్క అయితే ఏపుగా, బలంగా పెరుగుతుందో అతనే ఈ రాజ్యానికి యువరాజు అవుతాడు’ అని సెలవిచ్చాడు రాజు. ‘అలాగే రాజా..’ అంటూ అందరూ ఆ విత్తనాలను ఇంటికి తీసుకువెళ్లి మట్టి కుండల్లో వేశారు.పది రోజుల తర్వాత వాళ్లంతా ఆ మట్టికుండలను తీసుకుని రాజుగారి కొలువుకు వచ్చారు. మహేంద్ర అనే ఒక యువకుడు మాత్రం ఖాళీ కుండతో వచ్చాడు. రాజు అందరి కుండలను పరిశీలించి.. ఖాళీ కుండ తెచ్చిన మహేంద్రనే యువరాజుగా ప్రకటించాడు. ఆ మాట విన్న మిగతా యువకులంతా విస్తుపోయారు. ఓ యువకుడు కాస్త ధైర్యం చేసి ‘రాజా! మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరి మొక్క అయితే ఏపుగా, బలంగా పెరుగుతుందో వారే కదా యువరాజు! మా విత్తనాలన్నీ మొలకెత్తి చక్కగా పెరిగాయి. పోటీ మా మధ్యనే ఉండాలి. కానీ విత్తనమే మొలకెత్తని మహేంద్రను యువరాజుగా ఎలా ప్రకటిస్తారు?’ అని ప్రశ్నించాడు.అప్పుడు రాజు చిన్నగా నవ్వుతూ ‘నేను మీకు ఉడకబెట్టిన విత్తనాలను ఇచ్చాను. వాటి నుంచి మీ అందరి కుండల్లోకి మొక్కలు ఎలా వచ్చాయి?’ అని తిరిగి ప్రశ్నించాడు రాజు. ఆ ఎదురు ప్రశ్నకు ఆ యువకులంతా బిత్తరపోయారు. తాము చేసిన మోసాన్ని రాజు గ్రహించాడని వాళ్లకు తెలిసిపోయింది. సిగ్గుతో తలవంచుకున్నారు! వాళ్లంతా రాజు ఇచ్చిన విత్తనాలను కాకుండా వేరే విత్తనాలను నాటారు. అందుకే అవి మొలకెత్తి ఏపుగా పెరిగాయి. మహేంద్ర మాత్రం రాజు ఇచ్చిన విత్తనాన్నే వేశాడు. అందుకే అది మొలకెత్తలేదు.అతని నిజాయితీని మెచ్చిన రాజు.. ఆ రాజ్యానికి సమర్థుడైన పాలకుడు మహేంద్రనే అని అతన్నే యువరాజుగా ప్రకటించాడు. తదనంతర కాలంలో ఆ రాజ్యానికి మహేంద్ర రాజు అయ్యాడు. నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు. ప్రజలకు ఏ లోటూ రానివ్వకుండా పాలన సాగించాడు. – పుల్లగూర్ల శీర్షికఇవి చదవండి: 'కిడ్నాప్..'! ఓరోజు సాయంత్రం.. ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా.. -
పాతకాలం వుడెన్ వస్తువులే.. అయినా ఇంత అందంగా!
రీసైక్లింగ్ అనేదిప్పుడు గృహాలంకరణలో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. కలపే కాదు ఫ్యాబ్రిక్ కూడా అందులో భాగమైంది. రీసైకిల్ వుడెన్ ఫర్నిచర్తోపాటు పాతకాలం వుడెన్ వస్తువులు కొద్దిపాటి మార్పుచేర్పులతో అద్భుతమైన షోపీసెస్గా అమరిపోతున్నాయి.ఇంట్లోని రకరకాల ఫ్యాబ్రిక్స్ కూడా! పలు కళాత్మక రూపాలుగా కొలువుదీరి ఇంటి హోదాను.. విలువను పెంచుతున్నాయి. ఇలా రీసైక్లింగ్ మెటీరియల్తో విండో బ్లైండ్స్ నుంచి ఆరుబయట అలంకారాల వరకు ప్రతీదాంట్లోనూ మనదైన సృజనను చూపించవచ్చు.విండోస్కి జూట్, ఆకులతో అల్లిన చాపలను ఉపయోగించవచ్చు. వెదురుతో చేసిన రకరకాల వస్తువులు, ఫర్నిచర్ను బాల్కనీలో అమర్చుకోవచ్చు. వీటివల్ల ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న అనుభూతి కలుగుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగమయ్యామనే ఆనందమూ మిగులుతుంది.ఇవి చదవండి: అమెరికా వీసా కోసం ‘దొంగ’ నాటకం, అడ్డంగా బుక్కైన నలుగురు భారతీయులు -
'అంధకాసుర వధ'! ఒకనాడు కైలాస పర్వతంపై..
శివపార్వతులు ఒకనాడు కైలాస పర్వతంపై ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. శివుడిని ఆటపట్టించడానికి పార్వతీదేవి వెనుక నుంచి ఆయన కళ్లు మూసింది. పరమేశ్వరుడి కళ్లు మూయడంతో కొన్ని క్షణాలు అంతటా చీకటి ఆవరించింది. అప్పుడు అంధుడైన ఒక బాలుడు జన్మించాడు. సంతానం కోసం తన గురించి తపస్సు చేస్తున్న హిరణ్యాక్షుడికి శివుడు ఆ బాలుడిని అప్పగించాడు. పుట్టు అంధుడు కావడం వల్ల ఆ బాలుడికి అంధకుడనే పేరు వచ్చింది.అంధకుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అంధకుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతడి అంధత్వాన్ని పోగొట్టడమే కాకుండా, అనేక వరాలనిచ్చాడు. వరగర్వితుడైన అంధకుడు ముల్లోకాలను పట్టి పీడించడం మొదలుపెట్టాడు. ఒకనాడు అంధకుడు కైలాసంలో సంచరిస్తున్న శివపార్వతులను చూశాడు. అతడికి పార్వతీదేవిపై మోహం కలిగింది. పార్వతీదేవిని తనకు అప్పగించాలని, లేకుంటే తనతో యుద్ధానికి సిద్ధపడాలని శివుడికి కబురు పంపాడు. అంధకుడి అనుచితమైన కోరిక తెలుసుకున్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అంధకుడితో యుద్ధానికి తలపడ్డాడు. అవంతీ దేశంలోని మహాకాలవనంలో ఇద్దరికీ భీకరమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో అంధకుడు శివుడిని నానా రకాలుగా బాధించాడు. సహనం నశించిన పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బకు అంధకుడి శరీరం నుంచి రక్తం ధారలు కట్టింది. ఆ రక్తధారల నుంచి అనేక అంధకాసురులు పుట్టుకొచ్చారు. శివుడు సంహరించే కొద్ది మరింత మందిగా పుట్టుకు రాసాగారు.అంధకుడి నెత్తురు కిందపడకుండానే తాగేయడానికి మహేశ్వరి, బ్రహ్మీ, కౌమారి, మాలినీ, సౌవర్ణీ తదితర 189 మాతృకా శక్తులను శివుడు సృష్టించాడు. ఈ మాతృకా శక్తులు అంధకాసురుడి శరీరం నుంచి ధారగా కారుతున్న రక్తాన్ని తాగేశారు. అంధకాసురుడి రక్తం తాగి తృప్తి చెందిన మాతృకలు కొద్దిసేపు ఆగారు. ఈలోగా మరింతమంది అంధకాసురులు పుట్టుకొచ్చి రకరకాల ఆయుధాలతో పరమశివుడిని బాధించడం ప్రారంభించారు.అంధకాసురుడి బాధ భరించలేక శివుడు చివరకు మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు హుటాహుటిన అక్కడకు చేరుకుని, శుష్కరేవతి అనే శక్తిని సృష్టించాడు. ఆ శక్తి వెళ్లి అంధకాసురుడి శరీరంలోని రక్తాన్ని చుక్కయినా వదలకుండా పీల్చేసింది. దాంతో కొత్త అంధకాసురులు పుట్టడం ఆగిపోయింది. పోరులో మిగిలిన అంధకాసురులను శివుడు సంహరించాడు.చివరకు శివుడు తన త్రిశూలంతో అసలు అంధకుడిని పొడిచాడు. అతడు నేలకూలి మరణించబోతూ శివుడిని భక్తిగా స్తుతించాడు. మరణానంతరం తనకు శివ సాన్నిధ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించాడు. శివుడు ‘తథాస్తు’ అన్నాడు. అంధకాసురుడు తృప్తిగా కన్నమూశాడు. అంధకాసురుడి మరణం తర్వాత రక్తం రుచి మరిగిన 189 మాతృకలకు ఇంకా ఆకలి తీరలేదు. వారంతా శివుడి వద్దకు వచ్చి, ‘శంకరా! మా ఆకలి ఇంకా తీరలేదు. చాలా ఆకలిగా ఉంది. నువ్వు అనుమతిస్తే, సమస్త ప్రాణులనూ భక్షిస్తాం’ అన్నారు. మాతృకల కోరిక విని శివుడు దిగ్భ్రాంతి చెందాడు. ‘మాతృకలారా! మీ ఆలోచన తప్పు. మీరంతా లోకాన్ని రక్షించాలి గాని, భక్షించాలని కోరుకోవడం దారుణం’ అన్నాడు.మాతృకలు శివుడి మాటలను లెక్కచేయకుండా, ముల్లోకాలలోనూ ప్రాణులను భక్షించడం మొదలుపెట్టారు. మాతృకల ఆగడానికి దేవ దానవ మానవులందరూ హాహాకారాలు ప్రారంభించారు. శివుడు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు. తాను సృష్టించిన మాతృకలను తానే సంహరించలేక, కనీసం వాని నిలువరించలేక సతమతమయ్యాడు. చివరకు శివుడు నరసింహావతారాన్ని స్మరించాడు. మెరిసే జూలుతో కూడిన సింహం తల, పదునైన గోళ్లు, పెద్దకోరలతో సాగరఘోషను మించిన భీకర గర్జన చేస్తూ నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు నరసింహుడిని పరిపరి విధాలుగా స్తుతించాడు. ‘స్వామీ! నేను సృష్టించిన మాతృకలు నా అదుపు తప్పారు. నా మాటను లక్ష్యపెట్టకుండా లోకాలను భక్షిస్తున్నారు. నా చేతులతో సృష్టించిన వారిని నేను నాశనం చేయలేకపోతున్నాను. కనుక నువ్వే మాతృకలను అదుపు చేయాలి’ అని ప్రార్థించాడు.శివుడి విన్నపాన్ని ఆలకించిన నరసింహుడు వాగీశ్వరి, మాయ, భగమాలిని, కాళి అనే నాలుగు శక్తులను, వారికి అనుచరులుగా ఉండటానికి మరో ముప్పయిరెండు దేవతా శక్తులను సృష్టించాడు. నరసింహుడి ఆజ్ఞతో ఈ శక్తులన్నీ కలసి లోకాలను భక్షిస్తున్న మాతృకలపై మూకుమ్మడిగా దాడి చేశాయి. నృసింహ శక్తుల ధాటికి తట్టుకోని మాతృకలు పరుగు పరుగున వచ్చి నరసింహుడి పాదాల ముందు మోకరిల్లి శరణు వేడుకున్నాయి. నరసింహుడు వారికి అభయమిచ్చాడు.‘మాతృకలారా! దేవతా శక్తులు మానవులను దయతో పాలించాలి, వారిని భక్షించకూడదు. నా మాట ప్రకారం మీరు ఈనాటి నుంచి లోకాలను పాలిస్తూ, అందరూ పరమేశ్వరుణ్ణి పూజించేలా చేయండి. నా భక్తులకు, శివభక్తులకు, మీకు బలులు సమర్పించేవారికి రక్షణ కల్పిస్తూ, వారు కోరిన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తూ ఉండండి. రానున్న కాలంలో మీరందరూ మానవుల పూజలు అందుకుంటారు’ అని చెప్పి, నరసింహుడు తాను సృష్టించిన శక్తులతో పాటు అంతర్ధానమయ్యాడు. మాతృకలు ఆనాటి నుంచి నరసింహుడు ఆజ్ఞాపించిన ప్రకారం శాంతియుతంగా మారి లోకాలను కాపాడుతూ వస్తున్నారు. – సాంఖ్యాయనఇవి చదవండి: 'క్రమశిక్షణ' అంటే వెంటనే గుర్తుకొచ్చేది...! -
అదీ.. దాంపత్యం అంటే..!
పిల్లలకు వివాహం నిర్ణయించేటప్పుడు పెద్దలు పాటించే ప్రామాణికాల్లో శీలం, వయస్సు, వ్యక్తిత్వం, అభిజనం తరువాత చివరిది లక్షణం. లక్షణం అంటే భౌతికమైన అందం. లోకంలో గుణాలు ఎంత గొప్పవో, అందం కూడా అంత గొప్పది. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. రుక్మిణీదేవి శ్రీ కృష్ణ పరమాత్మను ఇష్టపడింది కేవలం ఆయన బాహ్య సౌందర్యం చూసి కాదు.ఎన్నో గుణాలు వివరించి... ‘కృష్ణా! ఇన్ని గుణాలు నీలో ఉన్నాయి కాబట్టే నాకు నీవంటే అంత ప్రీతి’’ అని ఆమె ప్రకటించింది. భౌతికమైన అందం ఉండాలి. వధూవరులు ఒకరికి ఒకరు తగినవారయి ఉండాలి. నూతన దంపతులను చూసినప్పుడు ‘ఆ పిల్ల చేసుకున్న అదృష్టం’ అనో, ‘ఆ పిల్లవాడిది అదృష్టం అంటే’... అని అనకూడదు. ఒకరికొకరు సరిగ్గా సరిపోయారు’ అనాలి. ఆ తరువాత ప్రేమతో, ఆర్ద్రతతో గృహస్థాశ్రమాన్ని పండించుకోవడం ఆ దంపతుల వంతు.దేవుడి విషయంలో అయినా సరే, ఇదే మర్యాద పాటిస్తారు. శంకరాచార్యులవారు శివానందలహరిలో పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతను ప్రస్తావిస్తూ.. ‘‘ఆమె ఎంత తపస్సు చేసిందో ఈయనకు భార్య కాగలిగింది. ఈయన ఎంత తపస్సు చేసాడో అటువంటి భార్య లభించింది. అదీ దాంపత్యం అంటే. అలా అల్లుకుపోవాలని భగవంతుడే మనకు నేర్పాడు.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
'క్రమశిక్షణ' అంటే వెంటనే గుర్తుకొచ్చేది...!
‘‘ఆబ్రహ్మ పీపీలికాది పర్యంతం’’ అని సమస్తం అనే అర్థంలో ఉపయోగించటం చూస్తాం. చీమ అంటే అల్పజీవి అనే అర్థం ఇక్కడ. అంతేకాదు, చాలా చులకనగా చూడబడే జీవి, చిన్నప్రాణి. చీమ, దోమ అని కలిపి ఒకటిగా పరిగణించటం కూడా ఉంది. కానీ, మనిషి చీమ నుండి నేర్చుకో వలసినది చాలా ఉంది. అసలు చీమలు ఎన్ని రకాలో తెలుసా? ఎర్ర చీమలు, నల్లచీమలు, గండుచీమలు, బెదురు చీమలు, గబ్బుచీమలు, రెక్కలచీమలు... వీటి అన్నింటికీ సామాన్య లక్షణాలూ ఉన్నాయి, ప్రత్యేక లక్షణాలూ ఉన్నాయి. సామాన్య లక్షణాలు ఆదర్శప్రాయమైనవి, అనుసరణీయాలు.అవిశ్రాంతంగా పని చేయటం చీమల సహజగుణం. నిరంతరం ఆహారాన్వేషణ చీమల లక్షణం. తిన్నంత తిని మిగిలినది జాగ్రత్త చేస్తాయి. చీమల పుట్టలని తవ్వి చూస్తే ధాన్యాగారంలో ఉన్నంత ధాన్యం ఉంటుందని చెపుతారు. అంత ధాన్యం తానే తిందామని దాచి పెట్టిందా? తన కోసమో, తన వారి కోసమో అంటే భవిష్యత్తు కోసం భద్రం చేయటం అనే సహజ గుణం అది. అందుకే కొద్ది కొద్దిగా కూడ పెడితే చీమలాగా కూడపెట్టారని అంటారు. అందుకే చిన్న మొత్తాల పొదుపుకి ఆదర్శం చీమలే.చీమలకి ఉన్న ఘ్రాణశక్తి అమోఘం. బెల్లం ముక్క పెడితే ఎక్కడి నుండి వస్తాయో తెలియదు చీమలు కుప్పలు తెప్పలుగా వస్తాయి. ఎవరు చెప్పి ఉంటారు? అవి వాసనతో పసి గడతాయి. ఒక్కటి పసిగడితే చాలు. స్వార్థరహితంగా తన వారందరికీ తీపివార్తని అందిస్తుంది అది. ఇది కూడా అనుసరించ తగిన లక్షణమే కదా! ఏదైనా తీపి పలుకుని ఒక చీమ మోయ లేకపోయినా, ఒక చీమ చనిపోయినా దానిని తీసుకు వెళ్ళటానికి మిగిలినవి అన్నీ సహాయ పడతాయి. కలిసికట్టుగా ఉండటం చీమలని చూసి మనిషి నేర్చుకోవాలేమో!క్రమశిక్షణ అంటే వెంటనే గుర్తు వచ్చేది చీమలే. చీమలు రెండు అయినా నాలుగు అయినా, వందలూ వేలూ అయినా ఒక వరుసలో మాత్రమే వెళ్ళటం గమనించవచ్చు. పైగా ఒక దానితో మరొకటిపోటీ పడవు, దారి తప్పవు. చీమలు నడచిన దారి కాలిబాట లాగా స్పష్టంగా కనపడుతుంది. చీమల క్రమశిక్షణ నడక లోనే కాదు, నడత లోనూ కనపడుతుంది. చీమలదండులో ఒకటి మిగిలిన వాటికన్న పెద్దదిగా ఉంటుంది. అదే ఆ దండుకి నాయకుడు. చీమలదండు తమ నాయకుని మాటనిపాటిస్తుంది.చీమల గృహనిర్మాణశక్తి అద్భుతం. అంత చిన్నప్రాణులు భూమిని తొలిచి, దారి చేసుకుని, భూమి లోపల ఆశ్చర్యకరమైన నివాసస్థలాలని తయారు చేసుకుంటాయి. వాటి ప్రవేశం భూమి పైన ఉన్నా, వెళ్ళేది లోపలికి. రంధ్రంలోపలికినీళ్ళువెళ్ళటం సహజం. కానీ, చీమలు పెట్టిన పుట్ట ద్వారంలోకి నీటిచుక్క కూడా వెళ్ళదు. జాగ్రత్తగా చీమల పుట్టని అనుసరించి తవ్వుకుంటే వెడితే, లోపల ఎంతో శుచిగా, హాయిగా, చల్లగా ఉంటుందిట!గోడలు నున్నగా ఉంటాయి. అందుకేనేమోపాములు ఆ పుట్టలని తమ నివాసస్థానాలుగా చేసుకుంటాయి. ‘‘చీమలు పెట్టిన పుట్టలుపాముల కిరవైన యట్లు ..’’ అనే మాటలు వినే ఉంటాం.చీమలు తయారు చేసుకున్న నివాసాన్ని ఆక్రమించినపాములని అవకాశం చూసుకుని, అవే చీమలు పట్టి బాధిస్తాయి. చంపి వేయవచ్చు కూడా! చీమలు తలుచుకుంటే ఎంతటి పదార్థాన్ని అయినా గంటల్లో మాయం చేయగలవు. ఉదాహరణకి, మనిషిప్రాణంపోయిన తరువాత అట్లాగే ఉంచితే తెల్లవారే సరికి చీమలు ఎముకలని మాత్రమే మిగులుస్తాయి. వాటికి మనిషి మాంసం చాలా ఇష్టమట! బతికి ఉన్నా కదలిక లేకపోతే చాలు, వాటి పని అవి చేసుకుంటాయి. అందుకే మంచంలో ఉన్నవాళ్ళని, శవాలని జాగ్రత్తగా చూసుకోవాలని చెపుతారు. చీమతోపోలిస్తే సంతోషించాలి సుమా! – డా. ఎన్. అనంత లక్ష్మి -
Gaming: యుద్ధంలో ఒకరోజు...
ఆన్లైన్లో గేమ్స్ ఆడుతుంటే ఆ ఉల్లాసమే వేరు. అందులో ఆ గేమ్ అడ్వెంచర్, థ్రిల్లర్, యాక్షన్ని కలిగి ఉంటే అబ్బో చెప్పనక్కర్లేదు. అలాంటి రకాలనే ఈ గేమ్ కూడా కలిగి ఉంది. మరి అదేంటో ఆడేద్దామా!రియల్–టైమ్ టాక్టిక్స్, రియల్–టైమ్ స్ట్రాటజీ గేమ్ మెన్ ఆఫ్ వార్–2. 2011లో వచ్చిన మెన్ ఆఫ్ వార్: అసల్ట్ స్వా్కడ్ సీక్వేల్గా వస్తున్న ఈ గేమ్ వరల్డ్ వార్–2 నేపథ్యంలో సాగుతుంది. 2016లో వచ్చిన ‘మెన్ ఆఫ్ వార్’కు ఇది మోడ్రన్ రీమాస్టర్. లార్జ్ స్కేల్ టాంక్ కంబాట్ చేసే ప్లేయర్స్ కోసం స్కీమిష్ మోడ్ ఉంది.ఇంజిన్: జెమ్ 2ప్లాట్ఫామ్: మైక్రోసాఫ్ట్ విండోస్జానర్స్: రియల్–టైమ్ టాక్టిక్స్, రియల్–టైమ్ స్ట్రాటజీ మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ఇవి చదవండి: ‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్లోని ఈ ముగ్గురి పాట.. వావ్ అనాల్సిందే..! -
ఆవురావురుగా... కమ్మని ఆవకాయ!
ఎండాకాలం... మే నెల సగం అయిపోయింది. మామిడి కాయలు టెంక కట్టి ఎదురు చూస్తున్నాయి. జాడీలు స్నానాలు చేసి ఎండలో సేదదీరుతుంటాయి. ఇంట్లో మిక్సీలు గిర్ర్ర్ అంటూ గోల చేస్తుంటాయి. మామిడి కాయలు కొట్టే కత్తి పుల్లబారి పదునుదేలింది. ముక్కలు కొట్టండి... పళ్లెంలో వేయండి... కారం కలపండి. జాడీలకెత్తండి... పళ్లెంలో వేడి వేడి అన్నం వేసి కలపండి. ఇంటిల్లిపాదీ ఆవురావురుమని తినకపోతే అడగండి.ఆంధ్రా ఆవకాయ..కావలసినవి..పచ్చి మామిడి ముక్కలు – కేజీ;పచ్చి శనగలు – 50 గ్రాములు;సన్న ఆవాలు –పావు కేజీ;మెంతులు – రెండు టేబుల్ స్పూన్లు;గుంటూరు మిరపపొడి –పావు కేజీ;ఉప్పు – నూట యాభై గ్రాములు;పసుపు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె –పావు కేజీ.తయారీ..ఆవకాయ పెట్టడానికి ముందు రోజు మిరపకాయలు, ఆవాలు, మెంతులను విడిగా ఎండబెట్టాలి. మరునాడు ఉదయం ఆవాలను మిక్సీలో పొడి చేయాలి. మిరపపొడి రెడీమేడ్ది కూడా తీసుకోవచ్చు. కానీ ఆవాలు స్వయంగా చేసుకోవాలి.మామిడి కాయలను కడిగి తేమపోయే వరకు తుడిచి ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత కాయలకున్న తొడిమ తొలగించాలి.అప్పటికీ సొన కారుతుంటే శుభ్రమైన నూలు వస్త్రంతో తుడిచేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న మామిడికాయలను టెంకతో సహా చిన్న ముక్కలు చేసుకోవాలి.శనగలను శుభ్రమైన వస్త్రంతో తుడిచి పక్కన పెట్టాలి.వెడల్పుగా ఉన్న పెద్దపాత్రలో మామిడి ముక్కలు వేయాలి. అందులో శనగలు, ఆవాల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.మెంతులు కూడా వేసి బాగా కలపాలి. చివరగా నూనెపోసి ముక్కలకు ఒత్తిడికి కలగకుండా అడుగు నుంచి కలిపితే ఆవకాయ రెడీ. దీనిని పింగాణి జాడీలో పెట్టి అంచులకు తెల్లని శుభ్రమైన నూలు వస్త్రాన్ని కట్టాలి.ఆ పైన మూత పెట్టాలి. ఈ జాడీలోని ఆవకాయను రోజూ మూత తీయకూడదు. రోజువారీ వాడుకకు అవసరమైనంత చిన్న జాడీలోకి తీసుకుంటూ ఉంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.బెల్లం ఆవకాయ..కావలసినవి..మామిడి ముక్కలు – అర కేజీ; బెల్లం – అర కేజీ;మిరపపొడి– 200 గ్రాములు;ఉప్పు – 200 గ్రాములు;ఆవపిండి– 100 గ్రాములు;నూనె – 200 గ్రాములు.తయారీ..మామిడి కాయలను శుభ్రంగా కడిగి తుడిచి టెంకతో సహా ముక్కలు చేసుకోవాలి.బెల్లాన్ని తురిమి వెడల్పుపాత్రలో వేసి అందులో మామిడికాయ ముక్కలు, ఆవపిండి, మిరపపొడి, ఉప్పు, కప్పు నూనె వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని రెండు రోజులపాటు ఎండలో పెట్టాలి. బెల్లం కరిగిపాకంలా జిగురుగా వచ్చినట్లనిపిస్తే సరే, లేకపోతే మూడవ రోజు కూడా ఎండలో పెట్టాలి.పాకం వచ్చిన తర్వాత మిగిలిన నూనె కూడా వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి.ఈ బెల్లం ఆవకాయను పిల్లలు బాగా ఇష్టపడతారు. ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి మహిళలు రోజూ తీసుకోవచ్చు.నువ్వుల ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు – 3 కప్పులు;నువ్వులు – ఒకటిన్నర కప్పులు;మిరపపొడి– ముప్పావు కప్పు;ఉప్పు–పావు కప్పు;పసుపు – అర టీ స్పూన్;వేరు శనగ నూనె – ఒకటిన్నర కప్పులు.తయారీ..నువ్వులను తయారీ దోరగా వేయించి చల్లారిన పొడి చేయాలి.మామిడి ముక్కలను వెడల్పుపాత్రలో వేసి అందులో నువ్వుల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.ఉప్పు, కారం, నువ్వుపిండి సమంగా కలిసిన తర్వాత కప్పు నూనెపోసి మళ్లీ కలపాలి.ఈ మిశ్రమాన్ని జాడీలోకి తీసుకుని, మిగిలిన నూనెను పైన తేలేటట్లుపోయాలి.ఇందులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లి ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు –పావు కేజీ లేదా (మీడియం సైజు కాయలు 3);వెల్లుల్లి – 200 గ్రాములు;ఉప్పు – 100 గ్రాములు;మిరపపొడి– 200 గ్రాములు;ఆవాలు – 150 గ్రాములు (ఎండబెట్టి పొడి చేయాలి);పసుపు – టీ స్పూన్;మెంతులు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె – కిలో.తయారీ..ఒకపాత్రలో నూనెపోసి మామిడి ముక్కలను వస్త్రంతో తుడిచి నూనెలో వేయాలి.వెల్లుల్లిపాయలను పొట్టు వలిచి ఒక ప్లేట్లో వేసి గాలికి ఆరనివ్వాలి.మరొకపాత్రలో మిరపపొడి, ఆవపిండి, ఉప్పు, పసుపు, మెంతులు వేసి సమంగా కలిసేవరకు కలపాలి. ఇప్పుడు వెల్లుల్లి రేకలను వేసి కలపాలి.మామిడి ముక్కల లోని నూనెను ఒక జాడీలోకి వంపాలి. ఇప్పుడు మామిడి ముక్కలలో ముందుగా కలిపి సిద్ధంగా ఉంచిన ఉప్పు, వెల్లుల్లి ఇతర పొడుల మిశ్రమాన్ని వేసి పొడులన్నీ మామిడి ముక్కలకు పట్టేలా కలపాలి.మామిడి ముక్కలను పట్టి ఉన్న నూనె ఈ పొడులను పీల్చుకుని కొంత తడి పొడిగా మారుతుంది.ఈ మిశ్రమాన్ని నూనె వంపుకున్న జాడీలో వేసి అదమాలి.నూనె పైకి తేలుతుంది. వెల్లుల్లి బ్లడ్ థిన్నర్. రక్తాన్ని పలచబరిచి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా నివారిస్తుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ హాయిగా తినవచ్చు. -
ఆ ముగ్గురూ.. పర్యావ'రణధీరులు'...
‘30 అండర్ 30 ఆసియా’ తాజా జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఇన్నోవేషన్, ట్రాన్స్ఫార్మింగ్ ఇండస్ట్రీస్ విభాగంలో మన దేశం నుంచి ఈవీ చార్జింగ్ కంపెనీ ‘స్టాటిక్’ ఫౌండర్స్ అక్షిత్ బన్సాల్, రాఘవ్ అరోర, ‘ది డిస్పోజల్ కంపెనీ’ ఫౌండర్ భాగ్యశ్రీ జైన్లు చోటు సాధించారు..బాల్యస్నేహితులైన అక్షిత్ బన్సాల్, రాఘవ్ అరోరాలు పట్టణ వాయు కాలుష్యం గురించి ఎన్నోసార్లు మాట్లాడుకునేవారు. కాలుష్య స్థాయిలను తగ్గించడంలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) ప్రధానపాత్రపోషించడంపై కూడా మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ)కి సంబంధించిన మౌలిక చార్జింగ్ సదు΄ాయాలపై దృష్టి పెట్టారు. తమ పొదుపు మొత్తాలను ఉపయోగించి 2019లో ఇంట్లో తొలి ఈవీ చార్జర్ను తయారుచేయడంతో ‘స్టాటిక్’ ప్రయాణంప్రారంభమైంది.వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను చార్జ్ చేయడానికి సమీపంలోని చార్జింగ్ స్టేషన్ను గుర్తించడానికి ‘స్టాటిక్’ యాప్ ఉపయోగపడుతుంది. అగ్రశ్రేçణి ఈవీ చార్జర్లు, అడ్వాన్స్డ్ మొబైల్ అప్లికేషన్లను కూడా ‘స్టాటిక్’ డెవలప్ చేసింది. ఈ స్టార్టప్ కార్పొరేట్ ఆఫీసులు, రెసిడెన్సెస్, హోటల్స్, సినిమా హాలు...మొదలైన వాటికి సంబంధించిన యజమానులతో టై అప్ అయింది. ఈప్రాపర్టీ వోనర్స్ను ‘చార్జర్ హోస్ట్స్’గా వ్యవహరిస్తారు.హరియాణాలోని హిసార్లో పుట్టి పెరిగిన అక్షిత్ బన్సాల్ మణి΄ాల్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఏదైనా సాధించాలనే పట్టుదలతో 2018లో ‘డెలాయిట్లో’ చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్నేహితుడు రాఘవ్ అరోర అతడికి వెయ్యి ఏనుగుల బలం అయ్యాడు. ‘వి్ర΄ో’లో డేటా సైంటిస్ట్గా పనిచేసిన రాఘవ్ బాల్య స్నేహితుడికి తోడుగా నిలిచాడు. ఇద్దరి కృషి ‘స్టాటిక్’కు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.‘స్టాటిక్’ యూఎస్పీలలో ఒకటి...సింగిల్ రెవెన్యూ మోడల్పై మాత్రమే కంపెనీ దృష్టి పెట్టక΄ోవడం. సొంతంగా చార్జర్స్ను ఇన్స్టాల్ చేయడంతోపాటు. హెచ్పీసీఎల్, షెల్లాంటి పెద్ద కంపెనీల కోసం చార్జర్లను బిల్డ్ చేయడం, ఇన్స్టాల్, మెయింటెయిన్ చేయడం లాంటివి చేస్తోంది స్టాటిక్.వివిధ బ్రాండ్లు ‘ప్లాస్టిక్ న్యూట్రల్’గా మారడానికి తన స్టార్టప్ ‘ది డిస్పోజల్ కంపెనీ’తో సహాయపడుతోంది దిల్లీకి చెందిన భాగ్యశ్రీ జైన్. ఈ స్టార్టప్ ద్వారా ఏడాదికి 750 టన్నుల ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేస్తున్నారు. నోయిడా యూనివర్శిటీలో బిబిఏ చేసిన భాగ్యశ్రీ కొన్ని సంవత్సరాలు వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో పనిచేసింది. వివాహానంతరం రాజస్థాన్కు మకాం మార్చింది. వేస్ట్ మేనేజ్మెంట్ ఫీల్డ్లో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో రాష్ట్రంలో ఒక్క రీసైక్లింగ్ యూనిట్ లేదనే విషయం గ్రహించింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై దృష్టి పెట్టి ‘ది డిస్పోజల్ కంపెనీ’ అనే రీసైకిలింగ్ కంపెనీ మొదలుపెట్టింది.ఏదైనా బ్రాండ్ తమ కంపెనీలో క్లయింట్గా సంతకం చేసిన తరువాత ఆ బ్రాండ్కు సంబంధించిన ప్లాస్టిక్ ఫుట్ ప్రింట్ను అంచనా వేయడానికి వన్–టైమ్ వేస్ట్ ఆడిట్ నిర్వహిస్తారు. ‘ది డిస్పోజల్ కంపెనీ’కి దేశవ్యాప్తంగా రీసైక్లర్పాట్నర్స్, రాగ్పికర్స్, ఆగ్రిగేటర్స్ ఉన్నారు. 75 లక్షల రూ΄ాయల పెట్టుబడితో ఈ రీసైక్లింగ్ యూనిట్నుప్రారంభించారు. ఎక్సెంచర్, సస్టైనబిలిటీ, యాక్సిలరేటర్ ్ర΄ోగ్రామ్కు ఎంపికైన ఈ స్టార్టప్కు 60 లక్షల రూ΄ాయల సీడ్ ఫండ్ లభించింది.పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై ప్లాస్టిక్ కాలుష్యం చూపుతున్న ప్రభావం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకునే పద్ధతుల గురించి రచనలు, ఉపన్యాసాల రూపంలో ప్రజలకు అవగాహన కలిగిస్తోంది భాగ్యశ్రీ జైన్. -
కిచెన్లోని ఈ వస్తువులతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి!
ఇంట్లో ఉన్నటువంటి వస్తువులుగానీ, తిను పదార్థాలు గానీ చాలారోజులు నిలువలేకుండా పాడవుతుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండాపోతుంది. కానీ మనకు తెలియకుండానే కొన్నిరకాల టిప్స్తో చాలాకాలం మన్నికగా ఉండేట్లు చేయవచ్చు. మరవేంటో చూద్దాం!ఇలా చేయండి..అరకిలో వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. కప్పు సూజీ రవ్వను బాణలిలో వేసి, వేడెక్కిన తరువాత రవ్వలో వెల్లుల్లి ముక్కలను వేసి వేయించాలి. రవ్వ, వెల్లుల్లి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి దించే యాలి. వెల్లుల్లి ముక్కలను రవ్వ నుంచి వేరుచేసి మిక్సీజార్లో వేసి పొడిచేసుకోవాలి. దీనిని పిండి జల్లెడతో జల్లించుకుని మెత్తని పొడిని గాలిచొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. ఇది ఆరు నెలలపాటు తాజాగా ఉంటుంది. వెల్లుల్లి పేస్టుకు బదులు ఈ పొడిని కావాల్సిన కూరల్లో వేసుకోవచ్చు. ఈ పొడి ఉంటే తరచూ వెల్లుల్లి పొట్టు తీసి దంచే పని ఉండదు.అన్నం కొద్దిగా మాడినా, అడుగున మొత్తం మాడిపోయినా మిగతా అన్నం కూడా మాడు వాసన వస్తుంది. ఆ వాసనకు అన్నం తినబుద్ది కాదు. ఒక ఉల్లిపాయను తీసుకుని నాలుగు ముక్కలుగా తరగాలి. మాడిన అన్నం గిన్నె మధ్యలో నాలుగు ముక్కలను నాలుగు చోట్ల పెట్టి పదిహేను నిమిషాలపాటు మూతపెట్టి ఉంచాలి. పావు గంట తరువాత మూత తీసి ఉల్లిపాయ ముక్కలను తీసేయాలి. ఇలా చేయడం వల్ల మాడు వాసనపోతుంది. అన్నం ఉల్లిపాయ వాసన కూడా రాకుండా చక్కగా ఉంటుంది.ఇంట్లో అల్లం ఎక్కువగా ఉన్నప్పుడు... తొక్క తీసి కొద్దిగా నూనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ఐస్ ట్రేలో వేసుకుని ఫ్రీజర్లో నిల్వ చేసుకోవాలి. ఈ అల్లం క్యూబ్స్ ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు.స్ప్రే బాటిల్లో టేబుల్ స్పూను బేకింగ్ సోడా, టేబుల్ స్పూను వెనిగర్, టీస్పూను డిష్వాష్ లిక్విడ్, రెండు గ్లాసులు నీళ్లుపోసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కిచెన్ ΄్లాట్ఫాం, స్టవ్ మీద చల్లుకుని తుడుచుకుంటే ఎటువంటి క్రిములు దరిచేరవు.సాల్ట్ డబ్బా అడుగు భాగంలో కొద్దిగా బియ్యం వేసి తరువాత సాల్ట్ వేయాలి. సాల్ట్లోని తేమను బియ్యం పీల్చుకుని సాల్ట్ను పొడిగా ఉంచుతుంది.ప్లాస్టిక్ రోల్ అతుక్కుని త్వరగా ఊడి రాదు. ఇటువంటప్పుడు అరగంటపాటు రోల్ని రిఫ్రిజిరేటర్లో పెట్టి తరువాత ఓపెన్ చేస్తే అతుక్కోకుండా సులభంగా వచ్చేస్తుంది. -
మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
మీరు.. మీ పిల్లల ఆలోచనలను, వారి నడవడికను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారా? అయితే.. అది మీకు, మీ పిల్లలకి మధ్య భావోద్వేగ అంతరానికి కారణం కావచ్చు. ఈ దూరాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గం మీ పిల్లలతో చాలా మాట్లాడటం. కొన్ని ప్రశ్నలు అడుగుతూండటం చేయాలి. మీరడిగే ప్రతీది వారి మనస్సును మలుచుకోవడంలో సహాయమవుతుంది. భావోద్వేగాలను పంచుకోవడంలో తోడ్పడుతుంది. అలాగే, వారిలో పాతిపెట్టిన విషయాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలా చేసి చూడండి!ప్రతీ తల్లితండ్రులు తమ పిల్లలను అడగాల్సిన ప్రశ్నలివే..1. 'నీవు ఏ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తావు?'.. అనే ఈ ప్రశ్న అడగడంతో.. పిల్లవాడిని ఆలోచించేలా చేస్తాయి. దీంతో మీరు అతని అంతర్గత ఆలోచనలు, సమస్యలను మెరుగైన మార్గంలో ఉంచగలుగుతారు. ఇలాంటి విషయాలను తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్గా అడగడమే ఉత్తమం.2. 'నీకు నచ్చే విషయమేంటి? ఎలా సంతోషంగా ఉంటావ్?'.. ఈ ప్రశ్న అతనికి తన గురించి చెప్పే అవకాశాన్ని ఇస్తుంది. దీంతో తన కోరికలను వ్యక్తం చేయగలడు.3. మీరు మీ పిల్లల్ని తప్పకుండా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే? 'నేను మీతో తక్కువ లేదా ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తోంది?' ఈ విధంగా సూటిగా చూస్తూ అడగడంతో.. వారి కళ్ళ నుంచి మీకు, మీ బిడ్డకు మధ్య ఉన్న సరైన బంధాన్ని అర్థం చేసుకోగలరు.4. పిల్లలు పెరుగుతున్నప్పుడు.. తరచుగా కొన్ని ఆలోచనలలో మునిగిపోతూంటారు. ఆ సమయంలో మీరు వారిని తప్పకుండా అడగాల్సిన విషయం ఇదే.. 'నీ జీవితంలో నీవు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఏదైనా సమస్యా?' అని అడగడంతో వారిలో ఏదైనా ప్రశ్న ఉన్నా భయ సంకోచాన్ని వదిలేస్తారు.5. 'కుటుంబంతో నీవు కలిగి ఉన్న ఉత్తమ జ్ఞాపకం ఏంటి?' ఇలా అడిగితే.. వాళ్లు కుటుంబంతో గడిపిన మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. పిల్లలు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారో కూడా మీరు అర్థం చేసుకుంటారు.6. 'ఒత్తిడికి లేదా ఆందోళనకు గురికావడం వంటివి ఏవైనా ఉన్నాయా?' ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే? నేటి జీవనశైలిలో 'మానసిక ఒత్తిడి' పిల్లల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. వారి వ్యక్తిత్వ ఎదుగుదలపై ప్రభావితం చూపుతుంది. ఈ ఒత్తిడిని పెద్దలు నిర్వహించగలరు. కానీ పిల్లలు తరచుగా ఈ సమస్యలలో చిక్కుకుంటున్నారు. దీని పర్యవసానాలు చాలా ప్రమాదకరమైనవి. కనుక వారిని తరచుగా అడగండి.. ఒత్తిడి నుంచి ఎలా బయటపడాల్లో నేర్పించండి.7. 'మీరు నాతో ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా!' అని అడగడంతోపాటు వారి ఆశను నెరవేర్చాలి. ఎందుకంటే? పిల్లలు తరచుగా ఒంటరిగా ఉంటారు. తల్లిదండ్రులతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపాలని లోలోనే తపిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో వారితో కలిసి కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవడంలో మంచి అవకాశాన్ని ఇస్తుంది. -
గేమింగ్ వరల్డ్కు.. పురాణ సౌరభం నింపిన ‘చిత్తం!’
చెన్నైకి చెందిన చరణ్య కుమార్కు గేమింగ్ అంటే ఎంతో ఇష్టమో, పురాణాలు అంటే కూడా అంతే ఇష్టం. అందుకే పురాణాలలోని ఆసక్తికర అంశాలను, స్ఫూర్తిదాయకమైన విషయాలను గేమింగ్లోకి తీసుకువచ్చింది చరణ్య కుమార్. ఆమెప్రారంభించిన ‘చిత్తం’ గేమింగ్ కంపెనీ విజయపథంలో దూసుకుపోతోంది...యూఎస్లో ఇంజినీరింగ్ చేసిన చరణ్య కుమార్ ఎన్నో పెద్ద కంపెనీలలో కన్సల్టింగ్ విభాగంలో పనిచేసింది. కొన్ని సంవత్సరాల క్రితం వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన సమస్యల వల్ల పురాణాలకు దగ్గరైంది. వాటిని చదవడం తనకు ఎంతో సాంత్వనగా ఉండేది. అమ్మమ్మ ద్వారా పురాణాలలోని గొప్పదనం గురించి చిన్న వయసులోనే విన్నది కుమార్.‘జీవితంలో ప్రతి సమస్యకు పురాణాల్లో సమాధానం దొరుకుతుంది’ అంటుంది కుమార్. ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకున్న కుమార్ ఆ తరువాత ఎంబీఏ చేసింది. ‘పురాణాలు ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితమైనవి కాదు. పౌరాణిక విషయాలు నిత్యజీవితంలో ఎన్నో రకాలుగా దారి చూపుతాయి. కష్టకాలంలో పురాణ పఠనం నాకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు సొంతంగా ఏదైనాప్రారంభించాలనే పట్టుదలను కూడా ఇచ్చింది. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. నేను ధైర్యంగా వేసిన మొదటి అడుగు ఎంబీఏ చేయడం’ అంటున్న కుమార్ గేమింగ్ కంపెనీ ‘చిత్తం’ రూపంలో తన కలను నెరవేర్చుకుంది.తక్కువప్రాడక్ట్లతో మొదలైన ‘చిత్తం’ మొదటి సంవత్సరంలోనే పదమూడుప్రాడక్ట్స్కు చేరుకుంది. ‘ఫన్’ ఎలిమెంట్స్ను జత చేస్తూ ‘చిత్తం’ రూపొందించిన గేమ్స్, యాక్టివిటీస్, బుక్స్ సూపర్ హిట్ అయ్యాయి. తమిళ సామెతలను దృష్టిలో పెట్టుకొని ‘పార్టీ టాక్స్’ అనే గేమ్ను డిజైన్ చేశారు. ‘భరత విలాస్’ అనేది చిత్తం బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ఈ కార్డ్ గేమ్ మన సంస్కృతిలోని రకరకాల నృత్యరూపాలు, వంటల రుచులు... మొదలైన వాటిని వెలికితీస్తుంది.‘సింపుల్ గేమ్ ప్లే–సింపుల్ కంటెంట్ అనే రూల్ని నమ్ముకొని ప్రయాణంప్రారంభించాం. మా నమ్మకం వృథా పోలేదు’ అంటుంది చరణ్య. వ్యాపార అనుభవం లేకపోవడం వల్ల మొదట్లో ఫండింగ్ విషయంలో కాస్తో కూస్తో ఇబ్బంది పడినా ఆ తరువాత మాత్రం తనదైన ప్రత్యేకతతో ఇన్వెస్టర్లను ఆకర్షించి విజయపథంలో దూసుకుపోతోంది ‘చిత్తం’.ఇవి చదవండి: కాన్స్లో ఆ ముగ్గురు -
మన లక్ష్యం ఏమిటి? అందుకు చేయవలసిన పనేమిటి?
మన లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్న లోకంలో తరచుగా వినబడుతూ ఉంటుంది. దానికి ఒక్కొక్కరు ఒక్కోరకమైన సమాధానాన్ని ఇస్తుంటారు. ఈ ప్రపంచం మాయ అనుకున్న వారు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పోతామని అంటారు. శూన్యవాదులు మనం శూన్యం (ఏమీ లేని వస్తువు) నుంచి వచ్చాము కనుక శూన్యంలోకే పోతామని అభి్రపాయపడతారు. భౌతికవాదులు మాత్రం కోరుకున్న భౌతిక పదార్థాన్ని పొందడమే లక్ష్యం అంటారు. కొందరు ఆధ్యాత్మిక వేత్తలు మనం భగవంతుని నుంచి వచ్చాము కనుక అతనిలోనే కలిసిపోతామని చెప్తుంటారు. అభ్యుదయవాదులు కొందరున్నారు. వారు ఐహిక సుఖమే పరమ లక్ష్యం అంటారు. మతవాదులున్నారు, వారు పరలోకంలో సుఖపడడమే తమ లక్ష్యం అంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మానవ లక్ష్యాన్ని పేర్కొంటారు.అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది. కనుక ఇతరప్రాణుల కంటే మానవుడు శ్రేష్ఠుడు. అంతేకాదు, ఇతరప్రాణులకు లేని లక్ష్యం మానవునికి ఉంది. నాల్గు పురుషార్థాలలో అర్థ కామాలను లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళున్నారు. నిజానికి మానవుడు ధనాన్ని సంపాదించి, సుఖపడరాదని ఏ ధర్మ గ్రంథమూ చెప్పదు. అయితే ధర్మబద్ధంగా ధనార్జన చేయాలని, ధార్మిక ప్రవృత్తిలోనే కోరికలను తీర్చుకోవాలని, శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి. అందుకే పురుషార్థాలలో మొదట ధర్మాన్నే పేర్కొన్నారు.తనకే కాక, తోటిప్రాణులకు ఏది హితకరమైందో, ఆ కర్మకే ధర్మమని పేరు. ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే దాన్ని స్వార్థం అంటారు. ఆచారం వ్యక్తిగతమైంది కావచ్చు కాని, ధర్మం సర్వనిష్టమైంది. అందరికీ ఆమోద యోగ్యమైంది. అందుకే పురుషార్థాలను సాధించాలనుకున్న వ్యక్తి మొదట ధర్మపరుడు కావాలి. ధర్మాన్ని దారిబత్తెంగా చేసుకుని ప్రయాణించే వారికి ధన్యప్రాప్తి, సుఖప్రాప్తి కలుగుతాయి. అంతేకాదు, ఆ రెండింటికీ మించి మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. అందువల్ల మానవుని లక్ష్యం కేవలం ధనార్జనతోపాటు సుఖ్రపాప్తి మాత్రమే కాదు, మోక్షం సాధించడమే పరమ లక్ష్యమని తెలుస్తుంది.మోక్షం అంటే విడుదల. దుఃఖం నుంచి బయటపడటమే మోక్షం. అదే మానవుని పరమ లక్ష్యం. బంధనాల్లో చిక్కుకోవడానికి కేవలం కర్మలు చేస్తే చాలు. కాని వాటి నుంచి బయట పడటానికి ధార్మికుడు కావాలి. ధర్మబద్ధమైన కర్మలు చేస్తూ, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ శరీర తత్వంతోపాటు, ఈ శరీరంలో బంధింపబడిన తానెవరో తెలుసుకోవాలి. అంతేకాదు, మోక్ష ప్రదాతను గుర్తించాలి. శరీరం ఉంది. తాను ఉన్నాడు. శరీరం బంధనం. దాన్ని విడిచిపెడితే మోక్షం. కానీ ఎట్లా విడిచిపెట్టాలి? అందుకు చేయవలసిన పనేమిటి? తెలిస్తే గాని పరమ లక్ష్యాన్ని అందుకోలేం. – ఆచార్య మసన చెన్నప్ప -
కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’
కోకిల నాలుగో తరగతి చదువుతోంది. రోజూ బడికి వెడుతుంది. తరగతిలో అందరి కంటే ముందు ఉంటుంది. అయితే కోకిల అస్తమానూ నోట్లో వేలు పెట్టుకుంటుంది. గోళ్లు కోరుకుతుంది. ‘కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’ అంటూ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా ,‘అలాగేనమ్మా! అలవాటు మానుకుంటాన’ని అంటుందే కానీ, మానుకోలేక పోతోంది. రోజూలానే ఆరోజు కూడా బడికి వెళ్ళింది కోకిల. సాయంత్రం చివరి పీరియడ్లో సైన్స్ పాఠాలు చెప్పే సుజాతా టీచర్ వచ్చారు. సుజాతా టీచర్ చెప్పే సైన్స్ పాఠాలు కోకిలకు ఎంతో ఇష్టం.‘పిల్లలూ! ఈ రోజు ‘అలవాట్లు’ అనే అంశం మీద మాట్లాడుకుందామా? మీరంతా ఖాళీ సమయంలో ఏమేమి చేస్తారో? ఒకొక్కరుగా టేబుల్ వద్దకు వచ్చి చెప్పాలి. సరేనా!’ అంటూ పిల్లలను అడిగారు సుజాతా టీచర్. ‘అలాగే టీచర్’ అంటూ ఉత్సాహంగా తలూపారు పిల్లలు. ‘అయితే మీ మీ అలవాట్లను చెప్పండి’ పిల్లల కేసి చూస్తూ అడిగారు టీచర్.శశాంక్ లేచి హుషారుగా టేబుల్ వద్దకు వచ్చి ‘టీచర్! నేను ఖాళీ సమయంలో బొమ్మలు వేస్తాను’ అని చెప్పాడు. ‘గుడ్! మంచి అలవాటు’ మెచ్చుకున్నారు టీచర్. ‘నేనయితే ఖాళీ సమయంలో కథలు చదువు తాను’ ఆనందంగా అన్నాడు కిరణ్. ‘వేరీ గుడ్!’ అని కిరణ్ని ప్రశంసిస్తూ ‘మరి నువ్వేం చేస్తావ్’ అంటూ కమలను అడిగారు టీచర్. ‘ఆడుకుంటాను టీచర్’ చెప్పింది కమల. ‘ఆటలు మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి. మంచిది’ అని చెబుతూ ‘మరి నువ్వేం చేస్తావు కోకిలా?’ అంటూ కోకిలను అడిగారు టీచర్.కోకిల ముందుకు రాలేదు. ‘నేను చెప్పలేను టీచర్.. చెప్పను’ అంటూ విచారంగా జవాబు ఇచ్చింది కోకిల. ‘ముందు నీ అలవాటు చెప్పమ్మా! చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పర్వాలేదు’ అని టీచర్ అనేసరికి ‘గోళ్లు కోరుకుతాను. అమ్మ ఎన్నిసార్లు వద్దని చెప్పినా, ఆ అలవాటు మానుకోలేకపోతున్నాను’ చెప్పింది కోకిల. విన్న పిల్లలంతా ఘొల్లున నవ్వారు. వెంటనే టీచర్ ‘హుష్! పిల్లలూ! అలా నవ్వకూడదు. అలవాటు మంచిదైతే మెచ్చుకోవాలి. చెడ్డదైతే వద్దని చెప్పాలి. అంతే గానీ వెక్కిరించరాదు’ అంటూ మందలించారు. దాంతో పిల్లలంతా కోకిలకు సారీ చెప్పారు. ‘కోకిలా! అలవాటు చెడ్డదైతే అది మన ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. మీకు నా చిన్నతనంలో జరిగిన ఓ కథ చెబుతాను’ అన్నారు టీచర్ పిల్లలందరి వంకా చూస్తూ! కోకిలతో సహా పిల్లలంతా ‘చెప్పండి టీచర్’ అంటూ ఉత్సాహంగా అడిగారు. ‘నా చిన్నప్పుడు నాకు ‘చిట్టి ’ అనే స్నేహితురాలు ఉండేది. తనకు ఖాళీ సమయంలో ముగ్గులు పెట్టడమంటే ఎంతో ఇష్టం. బాగా పెట్టేది. చిట్టి ముగ్గు వేస్తే చాలా బావుంటుంది అని ఇరుగుపొరుగు వాళ్లంతా చిట్టిని మెచ్చుకునే వారు. అయితే చిట్టికి ఒక చెడ్డ అలవాటు ఉంది’ అంటూ పిల్లలకేసి చూశారు టీచర్.‘ఏం అలవాటు టీచర్?’ అంటూ ఆసక్తిగా అడిగింది కోకిల. ‘ఉదయాన్నే నిద్ర లేచేది కాదు. బారెడు పొద్దెక్కే దాకా మొద్దు నిద్ర పోయేది. ‘నిద్ర లే చిట్టీ’ అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా, వినిపించుకునేది కాదు. ఒకసారి ఊర్లో సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టారు. పచ్చని చిలుకలు, మామిడి తోరణాలతో స్వాగతం చెబుతున్న ముగ్గును పోటీలో వేయాలనుకుంది చిట్టీ. ప్రాక్టీస్ కూడా చేసుకుంది. మరునాడు ముగ్గుల పోటీ అనగా, ఆ రాత్రి పడుకోబోతూ.. ‘అమ్మా! ఉదయాన్నే నన్ను నిద్రలేపు. పోటీకి వెళ్ళాలి’ అని చెప్పి పడుకుంది. కానీ మరునాడు.. చిట్టీని అమ్మ ఎన్నిసార్లు నిద్రలేపినా బద్ధకంతో నిద్ర లేవలేదు చిట్టీ.’‘అయ్యో.. అప్పుడేమయింది? టీచర్?’ పిల్లలంతా ఆసక్తిగా అడిగారు. ‘ఏముంది? చిట్టి అక్కడకు వెళ్లేటప్పటికి పోటీ అయిపోయింది. చిట్టీకి ఏడుపొచ్చింది. అమ్మ చెప్పినట్లు ‘బద్ధకమే బద్ధ శత్రువ’ని గ్రహించింది. చిట్టికి ఆ అనుభవం ఒక గుణపాఠం అయింది. ఇంకెప్పుడూ మొద్దు నిద్ర పోలేదు. బద్ధకం చూపించలేదు. చక్కగా చదువు కుంది. టీచర్ అయ్యింది. ఇప్పుడు మీకు పాఠం చెబుతోంది’ అని ఆపారు సుజాతా టీచర్.పిల్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరికన్నా ముందుగా తేరుకున్న కోకిల వెంటనే ‘చిట్టీ అంటే మీరేనా? టీచర్?’ అని అడిగింది. ‘అవును! కోకిలా, చిన్నప్పుడు నన్ను ముద్దుగా ‘చిట్టీ’ అని పిలిచేవారు. అర్థమైంది కదా కోకిలా .. చెడు అలవాట్ల వల్ల నష్టమేంటో.. పట్టుదలతో ప్రయత్నిస్తే చెడు అలవాట్లను మానుకోవడం పెద్ద కష్టమేం కాదని!’ అన్నారు టీచర్. ‘అవును టీచర్.. తప్పకుండా ప్రయత్నిస్తాను’ చెప్పింది కోకిల. ‘వేరీ గుడ్! కోకిల మారింది’ అంటూ టీచర్ అభినందించగానే, పిల్లలంతా కూడా కోకిలను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. – కె.వి.లక్ష్మణరావు -
రాతల్లో నిజాయితీ: రామేశంగారు మాకు..
రామేశంగారు మాకు దగ్గరగా ఉండే, దూరపు బంధువు! ఒకే వీధిలో పక్క పక్క ఇళ్ళల్లో ఉండేవారం! ఆయన భార్య వైపు నుంచి మా నాన్నగారికి బీరకాయపీచు చుట్టరికం ఉండేది. మా అన్నదమ్ములందరం వాళ్ళని అత్తయ్య, మావయ్య అని పిలిచేవారం! మా నాన్నగారు, ఆయన ఒకే డిపార్ట్మెంటులో పనిచేసేవారు. దానికితోడు ఇద్దరూ రచయితలే! ఇవన్నీ కలవడంతో, మా కుటుంబాల మధ్య బంధుత్వం మాట ఎలావున్నా, స్నేహం ఎక్కువ కనబడేది!నేను కాలేజీ చదువులకు వచ్చేసరికే.. మా నాన్నగారు పక్షవాతంతో మంచం పట్టడం, రామేశంగారు బదిలీ మీద వేరే ఊరు వెళ్ళిపోవడంతో, మా కుటుంబాల మధ్య దూరం ఏర్పడి పోయింది. తర్వాత కాలంలో నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చి, మూడు నాలుగు చోట్ల పనిచేసిన తర్వాత బదిలీ మీద నేను తిరిగి మా ఊరు చేరాను. ఓ రోజు బ్యాంకులో పనిచేసుకుంటున్న సమయంలో, కౌంటర్ ఎదురుగా నిలబడి.. ‘నువ్వు చిట్డిబాబు కొడుకువి కదూ!’ అంటూ పలకరించారు. బుర్ర వంచి పని చేసుకుంటున్న నేను, ఆ పిలుపు వినగానే బుర్ర ఎత్తి చూశాను. రామేశం గారే!మా నాన్నగారిని ఆ పేరుతో పిలిచేవారు బహు తక్కువగా ఉండేవారు. అందులో రామేశంగారు ఒకరు! ‘అవునండీ .. మీరు రామేశం మావయ్యగారు కదూ!’ అప్రయత్నంగానే నోటంట ఆ పేరు వచ్చేసింది. ‘అవునయ్యా! ఇక్కడికి ఎప్పుడు వచ్చావూ.. మీ నాన్న ఆరోగ్యం ఎలావుంది.. ఇక్కడే ఉన్నారా? నువ్వు కూడా కథలు రాస్తావుట కదా.. మీ బ్యాంకులో పనిచేసే హరగోపాల్ చెప్పాడు! రిటైర్మెంట్ తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చేశాను!’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.అన్నిటికీ జవాబులిచ్చి.. ‘సాయంత్రం బ్యాంకు అవగానే మీ ఇంటికి వస్తాను!’ అంటూ అడ్రసు తీసుకుని ఆయన పనిచేసిపెట్టి పంపేశాను. అలా.. మా కుటుంబాల మధ్య బంధుత్వం నాతో తిరిగి మొదలైంది! అయితే మా నాన్న కదల్లేని పరిస్థితులలో ఇంటిపట్టునే ఉండేవారు. మా అమ్మ ఏ పేరంటాలకో వెళ్తుండేది. నేను ఖాళీ దొరికినప్పుడో, కథల మీద సలహాలు తీసుకోడానికో, ఆయన పని మీదో వాళ్ళింటికి వెళ్తుండేవాడ్ని! రామేశంగారి భార్య భానుమతిగారు మా ఇంటికి తరచు వస్తుండేవారు. రామేశంగారు మాత్రం ఎవరింటికి వెళ్ళేవారు కాదు! వాళ్ళ పిల్లలు కూడా అంతే.. ఎవరినీ కలసేవారు కాదు. ఇప్పుడు ఆయన మా ఇంట్లోవాళ్లందరి కంటే నాతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారు. మా ఇద్దరి అభిప్రాయాలు కలిసేవి. అలాగే.. ఆయన కథలంటే చాలా ఇష్టపడేవాడ్ని. మంచి శైలి, అభ్యుదయ భావాలతో ఆయన కథలు, ఆసాంతం చదివించేవి. ఆయన్ని కలసినప్పుడల్లా.. నాకు తెలియని చాలా విషయలు చెప్తూ ఉండేవారు.ఆయనతో బాగా చనువు ఎర్పడటంతో, నేను రాసే కథలను ఆయనకే మొదట చూపెట్టేవాడ్ని! బావుండకపోతే.. మొహం మీదే చెప్పేవారు. ఆయన సూచనలు తీసుకుని మార్పులు, చేర్పులు చేసి, మళ్ళీ ఆయన ఓకే అన్న తర్వాతే, పత్రికలకు పంపేవాడ్ని! ఓ సంవత్సర కాలం గడిచిన తర్వాత, ఉన్నట్టుండి రామేశంగారికి మోకాలు నొప్పి వచ్చి, బయటకు వెళ్ళడం తగ్గిపోయింది. ఆ విషయమే ఓ రోజు ఫోన్ చేసి.. ‘చేతి వేళ్లు కూడా పూర్తిగా పట్టు తప్పాయి! నీ అవసరం తరచు ఉంటుంది!’ అంటూ, బ్యాంకు పని ఏదో పురమాయించారు. బ్యాంకులో పని ఎక్కువగా ఉండటంతో, వెంటనే వాళ్ళింటికి వెళ్ళలేకపోయాను.ఓ నెల రోజుల తర్వాత వీలు చూసుకుని రామేశంగారిని చూడ్డానికి వెళ్ళాను. తలుపు తీస్తూ.. ‘రా నాయనా! ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయావు! కూర్చో కాఫీ ఇస్తా!’ అంటూ మా అత్తయ్య, నా మాట వినిపించుకోకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది.‘మార్చి నెల కదా.. బ్యాంకులో చాలా బిజీగా ఉంది! ఇంటికి వెళ్ళేసరికే రాత్రి పది దాటిపోతున్నది!’ అంటూ రామేశంగారి మంచం దగ్గరకి కూర్చి లాక్కుని కూర్చున్నాను. అప్పుడు చూశాను.. మరో కుర్చీలో ఒకావిడ కూర్చుని ఉంది. ఆవిడ్ని నేనెప్పుడూ చూడలేదు.‘ఏంలేదోయ్.. మీ అత్తయ్యలాగే ఈ మధ్య నా చేతివేళ్ళు కూడా నా మాట వినడం లేదు! మెదడు నాదే కదా.. ఇంకా నా చెప్పు చేతల్లోనే ఉంది!’ అంతలో అక్కడికి వచ్చిన మా అత్తయ్య, రామేశంగారి మాటలకు అడ్డం పడుతూ.. ‘చోద్యం కాకపోతే.. డొంకతిరుగుడు లేకుండా విషయం తిన్నగా చెప్పొచ్చుగా!’ అంటూ, నాకు కాఫీ గ్లాసు అందించింది. ‘కథలలో వర్ణనలు, ఉపోద్ఘాతాలు, ఉపమానాలు లేకపోతే, నువ్విచ్చే కాఫీలా చప్పగా ఉంటుంది!’ ఆవిడతో అని..నావైపు చూపు మరలుస్తూ ‘ఏం లేదేయ్.. ఈ మధ్య రాయడం కూడా కష్టంగా ఉంది. అందుకే.. నా రాతకోతలన్నీ ఈ అమ్మాయి చేత చేయిస్తున్నాను. ఓ రకంగా స్టెనోగ్రాఫర్ అనుకో!’ అన్నారు రామేశంగారు.‘కథలు రాసే స్టెనోగ్రాఫర్ అన్నమాట!’ నవ్వుతూ అంటూ, కాస్సేపు మాట్లాడి వచ్చేశాను. తర్వాత రోజుల్లో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ‘ఎక్కడైనా వంట మనిషినో, పని మనిషినో పెట్టుకుంటారు గాని, ఇలా కథలు రాయడానికి మనిషిని పెట్టుకోవడం ఎప్పుడూ వినలేదురా అబ్బి!’ మా అత్తయ్య నవ్వుతూ నాతో అంటుండేది.‘కదల్లేని కథల మనిషికి, నీలా కథలు చెప్పేవారు కాకుండా, కథలు రాసేవారు కావాలి కదోయ్!’ ఆయన కూడా నవ్వుతూ అనేవారు. ‘ఎప్పుడు చూసినా మన కొంపల్లో పదిమంది ఉండేవారు! ఇప్పుడేం వుంది.. లింగు లింగుమని ఇద్దరేసి ఉంటున్నారు! ఈ వయసులో మరో మనిషి సాయం మంచిదే కదా నాయనా!’ అంటూ మా అత్తయ్య కూడా ఆవిడతో సరదాగానే ఉండేది.ఓ రోజు బ్యాంకులో పని చేసుకుంటుంటే, రామేశంగారి నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అత్తయ్య చనిపోయింది, అర్జంటుగా నువ్వు రావాలి’ అంటూ కంగారుగా చెప్పి ఫోన్ పెట్డిశారు!ఒక్కసారిగా నిర్ఘాంత పోయాను. ‘ఆవిడ ఎప్పుడూ ముక్కు చీదిన సందర్భం కూడా లేదు.. అలాంటిది ఈ ఘోరం ఎలా జరిపోయిందో..’ అనుకుంటూ బ్రాంచి మేనేజరు దగ్గరికి వెళ్ళి, విషయం చెప్పి, సెలవు పెట్టి రామేశంగారింటికి వెళ్ళాను. అప్పటికే వాళ్ళ పిల్లలు, బంధువులు వచ్చి, తర్వాత కార్యక్రమం గురించి అటూ ఇటూ తిరుగుతున్నారు. రామేశంగారు దిగులుగా ఓ పక్కన కూర్చుని ఉన్నారు. ఆయన్ని ఎలా పలకరించాలో తెలియలేదు. దగ్గరకి వెళ్ళి గట్టిగా చేతులు పట్టుకున్నాను. ప్రశాంతంగా నిద్ర పోతున్నట్టున్న మా అత్తయ్యని చూడగానే, నా కళ్ళు చెమర్చాయి.‘నిన్న రాత్రి వరకు బానే ఉందయ్యా.. ఉదయాన్నే కొంచెం నలతగా ఉందంటే, డాక్టరు రామ్మూర్తికి ఫోన్ చేశా. ‘మీరు రావొద్దు.. నేనే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు, మీ ఇంటికి వచ్చి చూస్తానులెండి!’ అంటూ ఓ పది నిమిషాల్లో వచ్చాడు. ఆయన వచ్చేలోగా.. అదిగో ఆ దివాను మీద పడుకుంది పడుకున్నట్టే పోయింది! హార్ట్ అటాక్ట. పాపం అది చెప్పడానికి రామ్మూర్తి వచ్చినట్టైంది! బీపీ, షుగరు, బెల్లం అన్నీ నాకున్నాయి గాని, మీ అత్తకి ఎప్పుడూ తుమ్ము కూడా రాలేదు! సునాయాసంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది!’ అంటూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకున్నారు. ఓ గంటలో కార్యక్రమం అంతా ముగిసి, రామేశంగారు ఇంట్లో ఒంటరైపోయారు. ఆయన పక్కన మౌనంగా కాస్సేపు కూర్చున్నాను. ఆ కథలు రాసే ఆవిడ కూడా ఆయన పక్కనే కూర్చుంది. ‘నాకు తప్పదులే.. పనేమైనా ఉంటే ఫోన్ చేస్తాను! అన్నట్టు.. మీ అమ్మా, నాన్నలకి ఈ విషయం అంత అర్జంటుగా చెప్పకు. మెల్లగా వీలు చూసుకుని చెప్పు’ అంటూ ఆయన నెమ్మదిగా కళ్ళు మూసుకున్నారు. జలజలరాలే నీటిబొట్లు ఆయన ఒళ్లో పడుతుండటం నేను మొదటిసారి చూశాను. కాలగర్భంలో ఆర్నెల్లు గడిచిపోయాయి. ఆ రోజు లంచ్ టైములో.. ‘నీకీ విషయం తెలిసిందా!?’ అంటూ మా కొలిగ్ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నోట్లో ఇడ్లీ ముక్క పెట్టుకుంటూ.. తెలియదన్నట్టు తలూపాను. ఎడం చేత్తో సెల్ఫోన్లో ఓ ఫొటో చూపెట్టేడు. అది చూస్తూనే ఒక్కసారిగా షాక్ తగిలినట్టైయింది. నా నోటంట మాట రాలేదు.‘నిజం కాదే’ అన్నట్టు అతని వైపు చూశాను. ‘ఓ వారం కిందట.. మా ఫ్రెండ్ అక్కడకి ఏదో పని మీద వెళ్తే, కనబడ్డారుట.. మీ మావయ్యగారు వీల్ చైర్లో ఉన్నారుట, పక్కన ఆవిడ ఉందిట!’ అంటూ ఆ విషయాన్ని మా కొలిగ్ కళ్ళకు కట్టినట్లు చెప్తుంటే, నమ్మలేకుండా ఉండిపోయాను. లంచ్ తర్వాత కౌంటర్లో కూర్చుని పని చేసుకుంటున్నానే గాని, ఆలోచనలతో మనసంతా కకావికలమైంది!ఓ నాలుగు రోజులు ఆ ఆలోచనలతోనే గడిపాను. ఏం చేయాలో తోచలేదు. ‘అసలు ఏం చేయగలను?’ అనుకుంటూ సమాధాన పడిపోయాను.ఆ రోజు.. బ్యాంక్లో పని పూర్తిచేసి, టేబుల్ సర్దుకుంటుంటే సెల్ఫోన్ మోగింది. రామేశంగారి నుంచి.. ఉలిక్కిపడ్డాను! ఫోన్ ఆన్ చేశాను గాని, మాటలు వెతుక్కుంటూ, తడపడ్డాను!‘బ్యాంకులో ఉన్నావా.. అందరూ బావున్నారా?’ ఆయన మాటల్లో కాస్త వ్యంగం కనబడింది. కారణం.. ఈమధ్య కాలంలో నేను ఆయన్ని కలవలేదు, ఫోన్లో మాట్లాడిందీ లేదు! ‘అందరూ బావున్నారండీ! బ్యాంకులో చాలా బిజీగా ఉంది.. రాలేకపోయాను!’ పొడి పొడిగా వచ్చాయి నా మాటలు.‘ఏం లేదోయ్.. మీ బ్యాంకులో ఉన్న నా పెన్షన్ అకౌంట్కి నామినేషన్ మార్చాలి! ఆ ఫారం పట్టుకుని ఓసారి రా.. !’ ఎప్పటిలాగే.. హుకుం జారిచేసినట్టు అన్నారు. భార్య పోయిన తరువాత పెన్షన్ అకౌంట్కి నామినేషన్ ఇవ్వకపోయినా కొంపలు మునిగిపోవు! అయితే ఆయన చాదస్తం తెలిసిన వాడ్ని కాబట్టి ‘రేపు వస్తాను!’ అంటూ ఫోన్ కట్ చేశాను.ఆయనింటికి వెళ్ళి, ఆయన్నెలా ఫేస్ చెయ్యాలో అర్థం కాలేదు! మర్నాడు ఉదయం బ్యాంకుకి ఓ పావుగంట ముందే బయలుదేరి, మధ్యలో ఆయనింటికి వెళ్ళాను.‘ఏమిటీ.. ఈ మధ్య మరీ నల్లపూసవై పోయావు..’ ఆ మాటలకి సమాధానం చెప్పకుండా.. ముభావంగా నా చేతిలో బ్యాంకు ఫారం ఆయనకి ఇచ్చి ఎదురుగా కూర్చున్నాను. ఆయన ఆ ఫారం నింపుతూ.. ‘ఏంలేదోయ్.. పోయే వయసే కదా, తర్వాత పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఈ జాగ్రత్తలు!’ అంటూ నా వైపు క్రీగంట చూస్తూ అన్నారు. వంటింట్లో నుంచి ఆవిడ కాఫీ తెచ్చి, నాకు అందించింది. ఆవిడలో మార్పు నాకు ఏం కనబడలేదు. ‘మా పిల్లలు బానే చూస్తారు, వాళ్ళ దగ్గరకి వచ్చేయమని అంటారు. కానీ, నాకీ కాగితాల్ని వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు! ఆ మాట ఎలా ఉన్నా, ఓసారి చూసి.. అన్ని సరిపోయాయో లేదో చెప్పు!’ అంటూ నింపిన ఫారాల్ని నా చేతిలో పెట్టారు. ఫారంలో ఆయన ఫించన్ అకౌంట్ ఎదురుగా నామినీ పేరుని చూసి, నుదురు చిట్లించి, ఆయన వైపు చూశాను.‘ఉన్న ఈ రెండిళ్లు, బ్యాంకు డిపాజిట్లు మా పిల్లలకి రాసేశాను. ఆ ఫించన్..’ అంటూ నా వైపు చూశారు. నా మొహంలో ఏం కనబడిందో.. మళ్ళీ ఆయనే అన్నారు.. ‘ఈ అమ్మాయి తెలుసుగా, ఆమెకి ఎవరూ లేరు. ఓ అనాథ! నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నీకేమిటి.. అందరికీ తెలుసులే, అదేం రహస్యం కాదు! ఇదిగో ఇలా ఈ వీల్ చైర్లోనే అక్కడికి వెళ్ళాను! ఎవరికీ నచ్చదు, కాని..’ అంటూ ఓ పుస్తకంలో ఉన్న, ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ నాకందించారు. అయితే.. ఆయన దాన్ని మామూలు విషయంలా చెప్పడం నాకు చాలా చిరాకు కలిగింది.మాట్లాడాలనిపించలేదు! ‘మీ అత్తయ్య వెళ్ళిపోయిందిగా, నా తదనంతరం నా పెన్షన్ తీసుకోవడానికి ఎవరూ లేరు! ఈ అమ్మాయికా.. పాపం ఎవరూ లేరు, జీవనాధారం కూడా లేదు! అందుకే.. అలా చేశాను! అంతే గాని, అందరూ అనుకుంటున్నట్టు కాదులే! ఈ సర్టిఫికెట్తో అమ్మాయికి ఓ ఆధారం దొరుకుతుంది! ఆ విషయమే మా ఆఫీసు వాళ్ళకి ఈ రోజే ఆర్జీ కూడా పంపిసాను! బ్యాంకులో కాస్త ఈ పని చేసి పెట్టు!’ అంటూ గబగబా ఆయన చెప్పదలుచుకుంది చెప్పేశారు.ఆ క్షణంలో.. ఆయనకి.. ఏం చెప్పడానికీ నాకు ధైర్యం సరిపోలేదు! ‘సరే.. వస్తాను!’ అంటూ బ్యాంకు దారి పట్టాను.బ్యాంకులో ఉన్నంతసేపు ఆయన గుర్తుకు రాలేదు. కాని సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత, తిరిగి నా ఆలోచనలు ఆయన చేసిన పని చూట్టూరే తిరిగాయి!ఆ రాత్రి ఏదో ఆలోచిస్తున్న నాకు ఒక్కసారిగా.. ఏదో స్ఫురించి, సెల్ఫోన్ తీసుకున్నాను. ‘మావయ్యగారు నమస్కారం! నా ఈ అభిప్రాయాన్ని మీ ముందు చెప్పే ధైర్యం లేదు.. అలా అని చెప్పకుండా ఉండనూ లేను! అందుకే ఈ మెసేజ్! మీ మ్యారేజ్ని సమాజం కొందరు తప్పని అనొచ్చు.. లేదా వెనుకనున్న మీ ఆలోచనని కొంతమంది మెచ్చుకోవచ్చు! కాని నిజానికి.. మీ ఆలోచనని అచరణలో పెట్టడానికి, మీకు పెళ్ళి తప్పనిసరైంది! అసలు మీ ఆలోచనే తప్పు! మీ ఆస్తిలో కొంత ఆవిడకి ఇచ్చుంటే హర్షించేవాడ్ని, కాని ప్రభుత్వం ఇచ్చే ఈ సౌకర్యాన్ని, మీరు దుర్వినియోగం చేశారు! ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయాలు పెన్షన్ల కింద ప్రభుత్వం ఇస్తున్నది. సమాజసేవ అంటూ మీలా అందరూ పెన్షన్లని ఎవరికో ఒకరికి రాసేస్తుంటే.. ఈ దుర్వినియోగనికి ఇంక అంతు ఉండదు! వాటిని చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి మన మీదే పన్నులు వేస్తుంది!మీరు చేసిన పని చట్టసమ్మతం కావొచ్చు. కాని ఈ దేశ పౌరుడుగా నాకు సమ్మతం కాదు! మీ రాతల్లో కనబడే నిజాయితీ, చేతల్లో కనబడలేదు!క్షమించండి.. ఇది మూమ్మాటికీ తప్పే!’ మెసేజ్ టైపు చేసి, రామేశంగారికి పంపాను! తర్వాత.. నాకు నిద్ర పట్టడానికి అట్టే సమయం పట్టలేదు! – జయంతి ప్రకాశశర్మ -
కోపంగా ఉంటే.. ఇక్కడికొచ్చి కేకలేయండి చాలు!
ఒత్తిడి, చిరాకు ఎక్కువైనప్పుడు సహనం కోల్పోవడం, సహనం కోల్పోయినప్పుడు కేకలేయడం సహజం. కోపం వచ్చినప్పుడు కేకలేయడం ఆఫీసుల్లో అధికారంలో ఉన్నవాళ్లకు కుదురుతుందేమో గాని, సామాన్య ఉద్యోగులకు కుదరదు. పనిఒత్తిడి మితిమీరినప్పుడు సామాన్య ఉద్యోగులకు కూడా కోపతాపాలు రావడం సహజం.ఆఫీసుల్లో కేకలేయలేని దుర్భర స్థితి వాళ్లది. మరి వాళ్లు తమ కోపాన్ని, అసహనాన్ని తీర్చుకోవడం ఎలా? కోపతాపాలను ఎక్కువకాలం అణచిపెట్టి ఉంచుకుంటే, తర్వాత రక్తపోటు నుంచి గుండెజబ్బుల వరకు నానా వ్యాధులకు లోనయ్యే పరిస్థితి దాపురిస్తుంది. కోపం తీర్చుకోవాలనుకునే వారికి ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి వేదికా లేదు.ఈ లోటును తీర్చడానికే పారిస్లోని ‘అర్మాత్వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా తన అతిథులకు కోపం తీరేలా కేకలు వేసుకునే అవకాశం కల్పిస్తోంది. హోటల్ చుట్టూ 400 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ప్రైవేటు చిట్టడవిలో అతిథులు గొంతు చించుకుని కేకలు వేయవచ్చు. తమ కోపానికి కారణమైన వారిని తలచుకుని కసితీరా బూతులు తిట్టుకోవచ్చు. కోపావేశాలు చల్లబడేంత వరకు ఎవరి శక్తి మేరకు వాళ్లు ఇలా కేకలు వేసుకోవచ్చు.ఈ ప్రక్రియను ‘అర్మాత్ వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా యాజమాన్యం ‘స్పా థెరపీ’గా చెబుతోంది. దీనివల్ల మనుషుల కోపావేశాలు చల్లబడి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని, తద్వారా వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఈ హోటల్ స్పా మేనేజర్ లోరెలా మోవిలియానో చెబుతుండటం విశేషం.ఇవి చదవండి: 'పుష్పవజ్రమా'..! అదెలా ఉంటుంది అనుకుంటున్నారా? -
ఈ అలవాట్లను మార్చుకున్నారో.. విజయం మీదే..!
జీవితంలో విజయాన్ని సాధించాలని, అన్నింటిలోనూ సక్సెస్ అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది. అంతదాకా ఎందుకు, మీరు సక్సెస్ కోరుకుంటున్నారా అని అడిగితే ప్రతి ఒక్కరూ అవుననే అంటారు. అయితే మనం అనుకున్నంత సులువేం కాదు విజయాన్ని సాధించడం. ఇందుకోసం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఎన్నో అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. జీవితంలో విజయం సాధించాలంటే కచ్చితంగా కొన్ని రకాల అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం... సక్సెస్ని చవిచూద్దాం...విజయం సాధించిన ప్రతి ఒక్కరి వెనకాల ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉండే ఉంటాయి. అయితే ఆ కష్టాలను ఇష్టాలుగా... ఆ కన్నీటిని పన్నీటిగా స్వీకరిస్తేనే వారు విజయాన్ని సొంతం చేసుకుని ఉంటారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.సమయాన్ని సద్వినియోగం... అందరికీ రోజులో ఉండేది 24 గంటల మాత్రమే. అయితే ఎవరు ఎక్కువగా ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారన్న సూత్రమే సాఫల్యాన్ని సూచిస్తుంది. అందుకోసం చేసుకోవాల్సిన మొదటి అలవాటు ఉదయాన్నే త్వరగా నిద్ర మేల్కొనడం. కనీసం ఉదయం ఐదింటికల్లా నిద్రలేవడాన్ని అలవాటు చేసుకుంటే... రోజంతా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎంత సమయం మిగులుతుందో మనకే అనుభవంలోకి వస్తుంది.బుక్ రీడింగ్..విజయం సాధించే వారిలో ఉండే మరో మంచి లక్షణం పుస్తక పఠనం. జీవితంలో గొప్ప స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా స్ఫూర్తిదాయకమైన పుస్తకాలను, గొప్పవారి జీవిత కథలను, ఆత్మకథలను చదవడం వల్ల మనసు పొరలు తెరుచుకుంటాయి. కొత్త ఉత్సాహం వస్తుంది. ఒక్కసారి పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే సరి... ఆ తర్వాత పుస్తకాలు చదవకుండా ఉండలేరు.ఆరోగ్యం... ఆకృతి!జీవితంలో అనుకున్నది సాధించాలంటే ముందుగా మన ఆరోగ్యం బాగుండాలి. అందుకే సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుంటారు. కచ్చితంగా ఉదయం వ్యాయామాలు చేస్తుంటారు. మంచి ఆహారం తీసుకుంటారు. రాత్రి సమయానికి నిద్ర΄ోతారు. ఆరోగ్యం బాగున్న వారే అహరహం శ్రమించగలిగే శక్తిని కలిగి ఉంటారనే విషయాన్ని మరచి ΄ోకూడదు.సరైన స్నేహం..మనం ఎప్పుడూ మంచి స్నేహితులనే ఎంచుకోవాలి. శల్య సారథ్యం చేసేవారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. శల్య సారథ్యం అంటే నువ్వు ఆ పని చెయ్యలేవు, నీ వల్ల అది సాధ్యం కాదు అంటూ వెనక్కి లాగడం. అందువల్ల మన పక్కన సానుకూల దృక్పథంతో ఉండేవారే ఉంటే మనకు చాలా మంచిది. అందువల్ల అలా పాజిటివ్గా ఉండే వారినే ఎంచుకోవడం, అలాంటి వారితోనే స్నేహం చేయడం చాలా మంచిది. కొందరు నిత్యం నెగిటివ్ ఆలోచనతో, నెగిటివ్ మాటలతో విసిగిస్తుంటారు. అలాంటి వారితో స్నేహం చేస్తే మీరు కూడా నెగిటివ్ దారిలోనే వెళ్తారు.వాదనలకు దూరంగా ఉండటం..జీవితంలో విజయం సాధించిన వారు ఎప్పుడైనా ఇతరులతో వాదనలకు దూరంగా ఉంటారు. వీలైనంత తక్కువ వాదిస్తుంటారు. ఎదుటి వ్యక్తితో వాదించే సందర్భంగా వచ్చినా మౌనంగా ఉంటారు తప్ప.. వాదనలకు దిగరు.ఇవి చదవండి: మీ బ్రెయిన్ ఆక్టివ్ ఉండాలంటే.. ఇలా చేయండి! -
సిమెంట్ వాడకుండా.. గోరువెచ్చని ఇల్లు!
బెల్లం, పసుపు, మెంతి ఆకు, వేప ఆకు... ఇదంతా ఇప్పుడు కిచెన్ మెటీరియల్ మాత్రమే కాదు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఈ నిజానికి నిదర్శనం కోసం రాజస్థాన్ కెళ్లాల్సిందే. రాజస్థాన్ లోని అల్వార్కు చెందిన ఆర్కిటెక్ట్ శిప్రా సింఘానియా తన మేధను రంగరించి ఇల్లు కట్టుకుంది. అందరూ సిమెంట్, ఇసుక కలిపి ఇల్లు కడుతుంటే మీరెందుకిలా కట్టుకున్నారని అడిగితే ఆమె చెప్పే సమాధానమేమిటో చూద్దాం...‘‘మాది ఎడారి రాష్ట్రం. ఉష్ణోగ్రతలు వేసవిలో 41 డిగ్రీలకు చేరుతాయి, శీతాకాలంలో ఎనిమిది డిగ్రీలకు పడిపోతాయి. ఆ వేడిని భరించడమూ కష్టమే, అంత చలిని కూడా తట్టుకోలేం. ఇంటి నిర్మాణం ఈ ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే విధంగా ఉండాలని కోరుకున్నాను. అందుకోసం బురదమట్టి, సున్నపురాయిలో వేపాకులు బెల్లం, పసుపు, మెంతి ఆకు వంటి అనేక పదార్థాలను సమ్మిళితం చేసి ఇల్లు కట్టుకున్నాను. నిజానికి ఈ ఫార్ములా నేను కొత్తగా కనిపెట్టినదేమీ కాదు.ఇంటి లోపల అధునాతన సౌకర్యాలతో..భవన నిర్మాణంలో సిమెంట్ ఉపయోగించడానికి ముందు మనదేశంలో పాటించిన విధానాన్నే పునరుద్ధరించాను. ఇది రెండువేల చదరపు అడుగుల నిర్మాణం. పైకప్పు కేంద్రభాగం 23 అడుగుల ఎత్తు ఉంది. ఇందుకోసం స్వయంగా నేనే డిజైన్ గీసుకున్నాను. వేపాకు చెద పురుగుల నుంచి రక్షణనిస్తుంది. బెల్లం, మెంతిలోని జిగురుకు నిర్మాణ ముడిసరుకులో ఇతర వస్తువులను గట్టిగా పట్టుకునేటంతటి సామర్థ్యం ఉంటుంది.ఈ నిర్మాణంలో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తాయి. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రే వాటర్ సిస్టమ్లు కూడా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే జీరో సిమెంట్ నిర్మాణం అన్నమాట’’ అని చెప్పారు శిప్రా సింఘానియా. ఈ విధమైన నిర్మాణ శైలి ఇప్పుడిప్పుడే అందరి దృష్టిలో పడుతోంది. బహుశా ఇక నుంచి ఆ ఇంటిని ‘శిప్రా సింఘానియా ఇల్లు’ అని చెప్పుకుంటారేమో. ఇంతకీ ఈ ఇల్లు ఎండను, చలిని ఎంత మేర తగ్గిస్తుందంటే వేడిని కనీసంగా ఎనిమిది డిగ్రీలు తగ్గిస్తుంది. శీతాకాలంలో పదహారు డిగ్రీలకు తగ్గకుండా కాపాడుతుంది.ఇవి చదవండి: 'నిద్ర'కూ ఓ స్టార్టప్.. సూపర్ సక్సెస్! -
‘నిద్ర’కూ ఓ స్టార్టప్.. సూపర్ సక్సెస్!
ఒకరోజు నిద్ర పట్టక రకరకాలుగా ఆలోచిస్తుంటే... ‘నిద్ర’కు సంబంధించిన స్టార్టప్ ఐడియా తట్టింది ప్రియాంక సలోత్కు. ఆ రాత్రి వచ్చిన ఐడియా తనని ‘ఉద్యోగి’ స్థాయి నుంచి ‘ది స్లీప్’ కంపెనీ ద్వారా ‘ఎంటర్ప్రెన్యూర్’గా మార్చింది. దిండు నుంచి పరుపుల వరకు పేటెంటెడ్ స్మార్ట్గ్రిడ్ టెక్నాలజీతో ‘ది స్లీప్ కంపెనీ’ రూపొందించిన ఉత్పత్తులు మార్కెట్లో ప్రత్యేకతను చాటుకున్నాయి.రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాకు చెందిన ప్రియాంక సలోత్ స్కూల్ రోజుల్లో హిందీ మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి వచ్చింది. అంతా కొత్త కొత్తగా అనిపించింది. అయితే అదేమీ తనని భయపెట్టలేదు. ఉత్సాహాన్ని ఇచ్చింది. హిందీ మీడియంలోలాగే ఇంగ్లిష్ మీడియంలోనూ చదువులో దూసుకుపోయింది. ఐఐఎం కోల్కత్తాలో చదువు పూర్తయిన తరువాత కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.యంగ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అయినæప్రియాంక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ జేపీ మోర్గాన్తో కెరీర్ప్రారంభించింది. ఆ తరువాత సింగపూర్లో వేరే కంపెనీలో చేరింది. కొన్ని నెలల తరువాత... కన్సల్టింగ్ అండ్ ఇన్వెస్టింగ్ రోల్స్ తనకు సరికాదేమో అనిపించింది. నిజానికి ఈ రియలైజేషన్ అనేది ప్రియాంకకు ఇదే మొదటిసారి కాదు.దిల్లీలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ‘షూడాగ్’ ‘స్టీవ్ జాబ్స్’ పుస్తకాల ప్రభావంతో ‘సాంకేతిక రంగంలో ఉండాలనుకోలేదు. ఇంజినీర్ కావాలనుకోలేదు. మరి నేనెందుకు ఇంజినీరింగ్ చేస్తున్నాను?’ అని తనని తాను ప్రశ్నించుకుంది. చాలామంది టాపర్స్లాగే ‘ఇంజనీరింగ్ లేదా మెడిసిన్’ అని ఆలోచించి ఇంజినీరింగ్ చేస్తుందే తప్ప ప్రత్యేక కారణం అంటూ లేదు. ఈ నేపథ్యంలోనే మేనేజేమెంట్ విషయాలపై తనకు ఉన్న ఆసక్తితో మేనేజ్మెంట్ కోర్సు చేసింది.సింగపూర్ నుంచి తిరిగివచ్చిన తరువాత ముంబైలోని కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ ‘పీ అండ్ జీ’లో చేరి కన్సూ్యమర్ బ్రాండ్స్పై ఆసక్తిని పెంచుకుంది. ఏరియల్ డిటర్జంట్ బ్రాండ్లో పనిచేసిన తరువాత బేబీ డైపర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ‘΄ాంపర్స్’ హెడ్గా నియామకం అయింది. ఆ తరువాత... ప్రెగ్నెన్సీ వల్లప్రొఫెషనల్ లైఫ్ నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చింది.ఆ సమయంలో ‘ఉద్యోగం కాదు సొంతంగా ఏదైనా వ్యా΄ారం చేయాలి’ అనే ఆలోచన ఆమెలో పెరిగి పెద్దదైంది. అదే సమయంలో చిన్న భయం కూడా మొదలైంది. ‘పెద్ద జీతాన్ని కాదనుకొని వ్యా΄ారం చేస్తే... ఎన్నో రిస్కులు ఎదురవుతాయి. వృత్తిజీవితంలో ముందుకు దూసుకుపోతున్నప్పుడు రిస్క్ చేయడం ఎందుకు?’ అనిపించింది. అయితే కొద్దిరోజుల్లోనే ఆమె కంఫర్ట్ జోన్ ఆలోచనల నుంచి బయటికి వచ్చింది.ఒక బిడ్డకు జన్మనిచ్చిన ప్రియాంక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. అలాంటి ఒక రాత్రి వచ్చిన ఆలోచనే... ది స్లీప్ కంపెనీ. తనలాగే ఎంతోమంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తే ‘స్లీప్ అండ్ కంఫర్ట్’ బిజినెస్కు సంబంధించి మంచి అవకాశం ఉంది అనిపించింది. తన స్టార్టప్ ఐడియా మిత్రులకు నచ్చలేదు. మళ్లీ ‘రిస్క్’ అనే భయం ముందుకు వచ్చింది. అయితే ఆ భయాన్ని వెనక్కి నెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసి తన ఐడియాపై సంవత్సరానికి పైగా పనిచేసింది.డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో పని చేసిన మాజీ ఉద్యోగి ఏకే త్రి΄ాఠీతో కలిసి హైటెక్–్ర΄ాడక్ట్ రూపకల్పన చేసింది. తరువాత భర్త హర్షిల్ సలోత్తో కలిసి ‘ది స్లీప్ కంపెనీ' ప్రారంభించింది. ప్రియాంక బిజినెస్ ఐడియా సక్సెస్ అవుతుందని నమ్మినవారి సంఖ్య తక్కువ. అయితే పేటెంటెడ్ స్మార్ట్గ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన ‘ది స్లీప్ కంపెనీ’ మార్కెట్లో తనదైన ప్రత్యేకతను సృష్టించుకుంది. మొదట్లో రకరకాల సవాళ్లు ఎదురైనా కంపెనీకి సంబంధించిన ఫండింగ్ జర్నీ సాఫీగా సాగింది. పెద్ద సంస్థలు కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించాయి. మ్యాట్రస్ బ్రాండ్ నుంచి స్లీప్ అండ్ కంఫర్ట్ టెక్ సొల్యూషన్ కంపెనీగా ఎదిగింది ది స్లీప్ కంపెనీ.వెయ్యి ఫెయిల్యూర్స్ తరువాత...‘ది స్లీప్ కంపెనీ’ లాంచ్ చేయడానికి ముందుప్రాడక్ట్స్కు సంబంధించి వెయ్యికి పైగా ప్రయోగాలు చేస్తే అన్నీ విఫలం అయ్యాయి. ఈ పరాజయాలు ఒక దశలో నన్ను నిరాశలోకి నెట్టి ‘ఉద్యోగానికి రాజీనామా చేసి తప్పు చేశానా?’ అని సందేహించేలా చేశాయి. ఫండ్ రైజింగ్ క్రమంలో ‘మీప్రాడక్ట్లో కొత్త ఏం ఉంది’ అంటూ రిజెక్షన్స్ మొదలయ్యాయి. ‘ఇక వెనక్కి వెళదాం’ అని ఆ సమయంలో అనుకొని ఉంటే ఎంటర్ప్రెన్యూర్గా నాకు పెద్ద విజయం దక్కేది కాదు. – ప్రియాంక సలోత్, కో–ఫౌండర్, ది స్లీప్ కంపెనిఇవి చదవండి: Sankari Sudhar: మాతృత్వం వరం! కెరీర్ రీ లాంచ్... అవసరం! -
Sankari Sudhar: మాతృత్వం వరం! కెరీర్ రీ లాంచ్... అవసరం!
తైవాన్ మహిళల అక్షరాస్యత శాతం 99.99. ప్రపంచంలో ఆ దేశానిదే తొలి స్థానం. మనదేశంలో మహిళల అక్షరాస్యత శాతం 70 దగ్గరే ఉంది. కానీ ఆశ్చర్యంగా ఉన్నత చదువులు చదువుకుని కూడా గృహిణులుగానే ఉండిపోతున్న మహిళలు మన దేశంలోనే ఎక్కువ. కారణం మాతృత్వం. వీరిలో ఎక్కువ మంది కొంతకాలం ఉద్యోగం చేసి బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ సంరక్షణ కోసం ఉద్యోగాన్ని వదిలేస్తున్న వాళ్లే. వీరంతా ఉద్యోగం అవసరం లేని వాళ్లు కాదు.ఉద్యోగం అవసరం ఉండి కూడా తప్పని స్థితిలో ఉద్యోగం మానేస్తున్న వాళ్లే ఎక్కువ. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఉన్న అవకాశాలు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉండడం లేదు. దాంతో ఉన్నత చదువులు చదివినప్పటికీ గృహిణులుగా మిగిలిపోతున్న మహిళలు ఏడాదికేడాదికీ పెరుగుతున్నారు.చెన్నైకి చెందిన శంకరి సుధార్కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. ‘‘మా కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చి ఉంటే పాప నిద్ర పోయే సమయంలో ఆఫీస్ పని చేసుకునేదాన్ని. ఆ సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. నాలాంటి మహిళలను తిరిగి పని లోకి తీసుకురావడానికి నేనే ఒక వేదికను ఏర్పాటు చేశాను’’ అంటున్నారు శంకరి. ప్రపంచం ముందుకెళుతోంది!కంపెనీల ప్రతినిధుల సమావేశంలో శంకరి‘‘నేను మద్రాస్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేశాను. ఎనిమిదేళ్లపాటు ఉద్యోగం చేసిన తర్వాత 2020లో మాతృత్వం కారణంగా ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. నాతోపాటు ఉద్యోగంలో చేరిన వాళ్లు ప్రమోషన్లతో పెద్ద పొజిషన్లకు వెళ్లారు. కొంతమంది విదేశాలకు వెళ్లారు.ప్రపంచం అంతా ముందుకెళ్తుంటే నేను మాత్రం నాలుగ్గోడల మధ్య చిక్కుకుపోయాననే భావన కలిగింది. నేను మాత్రమే కాదు ఇలా నాలాగ ఎందరో. మనదేశంలో 180 రోజులు ప్రసూతి సెలవులు, బిడ్డ సంరక్షణ కోసం మరో రెండేళ్ల సెలవులు ఇవ్వాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటి ఆచరణ మాత్రం కష్టసాధ్యమే. చాలా కంపెనీలు రాజీనామా ఇచ్చి మళ్లీ చేరమని సూచిస్తుంటాయి. ఒకసారి రాజీనామా ఇచ్చిన తర్వాత మళ్లీ చేరడం అనేది ఎందుకో కానీ చాలామంది విషయంలో సాధ్యం కావడం లేదు.ఆయా కంపెనీల్లో సదరు పని నైపుణ్యానికి సంబంధించిన ఖాళీలు లేకపోవడం వంటి అనేకం ఇందుకు కారణాలు కావచ్చు. ఇలాంటి స్థితిలో చాలా మంది మహిళలు నిస్పృహలోకి జారిపోతున్నట్లు నా పరిశీలనలో అవగతమైంది. 73 శాతం మంది ప్రసవం సమయంలో, యాభై శాతం మంది బిడ్డ సంరక్షణ కోసం ఉద్యోగంలో విరామం తీసుకుంటున్నారు. వారిలో కొంతమంది బిడ్డ పెద్దయిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరినప్పటికీ చేరిన ఆరు నెలల్లోనే మళ్లీ మానేస్తున్నారు. మరికొంతమంది అదే సంస్థలో ఉద్యోగంలో చేరినప్పటికీ తక్కువ వేతనానికి చేరాల్సి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు.కొత్త సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించాలంటే వయసు అడ్డంకి అవుతోంది. మనదేశంలో మహిళల ఎదుగుదలకు కుటుంబం, పిల్లల బాధ్యతలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇలాంటి మహిళల్లో తమకంటూ ఉనికి కోల్పోయామనే ఆవేదన ఉంటోంది. మొత్తంగా నాకు తెలిసిందేమిటంటే... ఆర్థిక అవసరాల రీత్యా కావచ్చు, చదువుకుని ఖాళీగా ఉండడం ఇష్టం లేక కావచ్చు అనేక మంది మహిళలు కెరీర్ని పునరుద్ధరించుకోవాలని ఆశిస్తున్నారు. స్టార్టప్ల వైపు వెళ్తున్న వాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే. ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకు సరైన మద్దతు అందడం లేదు. మాతృత్వం అనేది నిజంగా వరమే. అది మహిళ పురోభివృద్ధికి నిరోధకంగా మారకూడదనిపించింది.ఆ ఖాళీని నేనే ఎందుకు భర్తీ చేయకూడదు అని కూడా అనుకున్నాను. సమాజంలోని ఈ పరిస్థితికి అద్దం పట్టే విధంగా ‘ఓవర్ క్వాలిఫైడ్ హవుస్ వైఫ్’ అని నా స్టార్టప్కి పేరు పెట్టాను. పిక్ మై యాడ్, నౌ ఇన్ టెక్నాలజీస్ వంటి ఏడు వందల కంపెనీలతో మా కంపెనీని అనుసంధానం చేశాను. ఆ కంపెనీల్లో కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, వీడియో ఎడిటింగ్, డెవలపింగ్, టెస్టింగ్ వంటి ఉద్యోగాల అవసరం ఉంటుంది.ఆయా కంపెనీలకు అవసరమైన స్కిల్స్ ఉన్న మహిళల రెజ్యూమ్ను వారి దృష్టికి తీసుకురావడం మా కర్తవ్యం. మా దగ్గర ఎన్రోల్ అయిన మూడు వేల ఐదు వందల మందిలో ఇప్పటికి ఆరువందలకు పైగా మహిళలు ఉద్యోగంలో చేరారు. నేను ఎంటర్ప్రెన్యూర్గా మారింది 2022లో. ఈ సర్వీస్లో నేను కూడా గౌరవప్రదమైన రాబడిని అందుకోగలుగుతున్నాను’’ అని తన రీ లాంచ్ జర్నీని వివరిస్తూ మహిళలు పని చేయడం తమ కోసం మాత్రమే కాదు దేశాభివృద్ధికి కూడా చాలా అవసరం అన్నారు శంకరి సుధార్. -
పెదవుల నిగారింపుకై.. ఇలా చేస్తే చాలు..!
పెరుగుతున్న ఎండవేడికి చర్మంతోపాటు, పెదవులపై నలుపు రంగు పేరుకుపోతూంటుంది. పెదవులపై చీలికలతో పాటు మెరిసేతత్వం కూడా తగ్గుతుంది. మరి పెదవులు సహజంగా, కోమలంగా ఉండాలంటే ఈ ట్రిక్స్ ట్రై చేయండి..!ఇలా చేయండి..రోజూ ఉదయాన్నే బ్రష్ చేసిన తరువాత.. బ్రష్ మీద కొద్దిగా తేనె వేసి రెండు పెదవులపైన గుండ్రంగా ఐదు నిమిషాలపాటు రుద్దాలి. ఇలా రోజూ చేయడం వల్ల పెదవులపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. మర్ధన వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి పెదవులు మృదువుగా మారతాయి.ఉదయం బ్రష్తో మర్దన చేసాక, రాత్రి పడుకునేముందు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాయాలి. ఇందుకోసం.. కొద్దిగా బీట్రూట్ రసాన్ని వేడి చేయాలి. వేడిచేసిన రసంలో అర టీస్పూను కార్న్ఫ్లోర్ వేసి ఐదు నిమిషాలపాటు బాగా కలిపి దించేయాలి. తరువాత ఈ మిశ్రమంలో అర టీస్పూను గ్లిజరిన్, పావు టీస్పూను కొబ్బరి నూనె కలిపి ఎయిర్టైట్ కంటైనర్లో నిల్వచేయాలి. ఈ మిశ్రమం గట్టిపడిన తరువాత పెదవులకు రాసి మర్ధన చేసి పడుకోవాలి. ఉదయం నీటితో కడిగేయాలిఈ రెండింటిని ఒకదాని తరువాత ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తే పెదవులు గులాబి రేకుల్లా కోమలంగా పింక్ కలర్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.ఇవి చదవండి: Beauty Tips: కనురెప్పల సోయగానికై.. ఇలా చేయండి! -
కనురెప్పల సోయగానికై.. ఇలా చేయండి!
ఆర్టిఫీషియల్ ఐ లాషెస్తో కళ్లను మీనాల్లా మెరిపించవచ్చని తెలిసినాకూడా వాటిని ఎలా అమర్చుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే... ఒకసారి ఇలా ట్రై చేయండి.ఆర్టిఫీషియల్ ఐ లాషెస్ (సౌందర్య సాధనాల మార్కెట్లో దొరుకుతాయి) ఒక సెట్, వాటిని అమర్చడానికి ఐలాష్ గ్లూ తీసుకోవాలి.వీటితోపాటు కత్తెర, ట్వీజర్, ఐ లాష్ కర్లర్, ఐ లైనర్, మస్కారా తీసుకోవాలి.ఆర్టిఫీషియల్ ఐ లాషెస్ మరీ పొడవుగా ఉన్నట్లనిపిస్తే తగినంత మేరట్రిమ్ చేయాలి.ట్వీజర్ సహాయంతో లాషెస్కు గ్లూ పట్టించాలి. ఇప్పుడు వాటిని జాగ్రత్తగా కనురెప్ప మీద అమర్చాలి. గ్లూ ఆరి లాషెస్ సెట్ అయ్యే వరకు ఆగాలి. స్కిన్కు అంటుకోకుండా గ్లూవిడిగా ఆరిపోతున్నట్లు అనిపించినా, ఆరాక ఊడి వచ్చేటట్లు అనిపించినా కనురెప్పల మీద ఆర్టిఫీషియల్ లాషెస్ కరెక్ట్గా సెట్ అయ్యేటట్లు మెల్లగా నొక్కాలి.గ్లూ ఆరిన తర్వాత లాషెస్కు డార్క్షేడ్ ఐ లైనర్ అప్లయ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అసలు కనురెప్పలకు, ఆర్టిఫీషియల్ లాషెస్కు మధ్య తేడా కనిపించకుండా అంతా ఒకేలా ఉంటాయి.చివరగా ఐలాష్ కర్లర్తో వంపు తిప్పాలి. అవసరమనిపిస్తే (మరింతడార్క్గా కనిపించాలనుకుంటే) మస్కారా అప్లయ్ చేయాలి.ఇవి చదవండి: మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి! -
Rashi Agarwal: కళను 'రాశి' పోస్తోంది..!
ఒక ఠావు పేపర్ తయారు కావాలంటే పది లీటర్ల నీళ్లు కావాల్సి వస్తుంది. రాసుకోవడానికి ఒక రీము పేపర్ సిద్ధం అవ్వాలంటే పాతికేళ్లు పెరిగిన చెట్టు కొమ్మలను సమూలంగా నరకాలి. చెట్టును నరక్కుండా, నీటిని వృథా చేయకుండా ఒక డైరీ తయారయితే? అంతకంటే ఇంకేం కావాలి? ఇంతే కాదు, టెక్స్టైల్ ఇండస్ట్రీ వృథాను హరాయించుకోవడానికి భూమాత పడే యాతన కూడా తగ్గిపోతుంది. ఇలాంటి వినూత్న ప్రయత్నానికి తెర తీసింది సూరత్లో ఓ ఆర్కిటెక్ట్. స్టేషనరీ వస్తువులు, ఇంటీరియర్ డెకరేషన్ని కలగలుపుతూ చేసిన ప్రయోగమే రుహానీ రంగ్. ఆ ప్రయోగం వెనుక దాగిన నేపథ్యాన్ని వివరించింది రాశి అగర్వాల్. ఆమె మదిలో వెలిగిన ఈ ఆలోచన తొమ్మిది వేల కిలోల పత్తికి పుస్తక రూపాన్నిచ్చింది.మనదేశంలో కళ ఉంది!‘‘నేను ఆర్కిటెక్చర్ ఫైనలియర్లో ఉన్నప్పుడు మన సంప్రదాయ నిర్మాణాలు, కళలు, చేతివృత్తుల అధ్యయనం కోసం విస్తృతంగా పర్యటించాను. ఢిల్లీ నుంచి జైపూర్, అహ్మదాబాద్, కచ్, పాండిచ్చేరి నుంచి పూనా వరకు పరిశీలిస్తే మనదేశంలో రకరకాల కళలు, కళా నైపుణ్యాలున్న పని వాళ్లున్నారని తెలిసింది. వాళ్ల చేతుల్లో ఉన్న ప్రతిభను ప్రదర్శించే వేదికలు తగినంతగా లేవు.అలాంటి ఒక వేదికను ఏర్పాటు చేసి, నా వృత్తిలో ఇంటీరియర్ డిజైనింగ్కు దోహదం చేసే విధంగా ఒక ప్రయోగం చేశాను. అది విజయవంతమైంది. రకరకాల కళలను ఒక వేదిక మీదకు తీసుకురావాలనే ఉద్దేశంతో ‘రుహానీ రంగ్’ పేరుతో ఆర్ట్ స్టార్టప్ మొదలు పెట్టాను. ప్లానర్ బుక్ కవర్ పేజీ మీద మధుబని ఆర్ట్ ఉంటే ఇంట్లో అందమైన షో పీస్ ఉన్నట్లే. ప్లానర్ బుక్ని కార్నర్ స్టాండ్లో అందంగా అమరిస్తే డ్రాయింగ్ రూమ్ కళాత్మకంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో హస్త కళలను పునరుద్ధరించగలుగుతున్నాను. రుహానీ రంగ్ను ఐదు వేల రూపాయలతో మొదలు పెట్టాను. నాతో కలిసి 50 మంది కళాకారులు, 40 మంది ఇతర ఉద్యోగులు పని చేస్తున్నారు. వస్త్రాలను తయారు చేసే భారీ పరిశ్రమలకు పెద్ద సంఖ్యలో పత్తి బేళ్లు వస్తుంటాయి. ప్రతి బేలు లోనూ మెషీన్లో అమరికకు తగినట్లు ఉపయోగించగా మిగిలిన పత్తి వృథా అవుతూ ఉంటుంది.అది భూమిలో కలిసి పోవాల్సిందే తప్ప మరో పనికి ఉపయోగించేవారు కాదు. ఎందుకూ పనికి రాదని వదిలేస్తున్న ఆ పత్తే నా కుటీర పరిశ్రమకు ముడిసరుకు. నాకు కోవిడ్ సమయం కూడా మంచే చేసింది. ఆ టైమ్లో పెద్ద చిన్న పరిశ్రమలన్నీ మూత పడ్డాయి. హస్తకళాకారులు పని లేక ఆర్థికంగా మానసికంగా దెబ్బతిని ఉన్నారు. ఆ సమయంలో నేను ఒక్కొక్కరిని కలిసి నా ఆలోచన చెప్తుంటే వాళ్లు ఉత్సాహంగా నాకు మరికొన్ని ఐడియాలు చెప్తూ తమ అనుభవాన్ని జోడించారు.అలా 2020లో మొదలు పెట్టిన నా కుటీర పరిశ్రమ ఇంత వరకు హ్యాండ్ మేడ్ పేపర్తో ప్లానర్స్, క్యాలెండర్లు, నోట్బుక్స్, జర్నల్స్, స్కెచ్ బుక్స్ వంటి 15 వేల ఉత్పత్తులకు రూపమిచ్చింది. వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే నలభై వేల ఫాలోవర్స్ను తెచ్చి పెట్టింది. ఆర్ట్ పీస్ కేవలం కళాభిరుచి, కళారాధన కోసమే కాదు. అది మన దైనందిన జీవితంలో భాగంగా మారాలి. అప్పుడే కళ ఎప్పటికీ నిలిచి ఉంటుంది’’ అని వివరించింది రాశి అగర్వాల్.ఇవి చదవండి: పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు! -
మీ పనులు సులువుగా అవ్వాలంటే.. ఇవి వాడాల్సిందే..!
కొన్ని పనులు చేయాలంటే.. విరక్తి కలిగేలా, విసుగు పుట్టించేలా ఉంటాయి. కానీ అవి చేయకతప్పదు. అవి మన నిత్యవసరాలను తీర్చే పనులే అయితే.. వాయిదా వేయడం చాలా కష్టం. కానీ వాటిని కూడా ఈ సరికొత్త పరికరాలతో సులువుగా చెయ్యొచ్చు. మరి అవేంటో చూద్దామా!టేబుల్టాప్ స్టవ్..చిత్రంలోని ఈ మినీ స్టవ్.. స్టెయిన్ లెస్ స్టీల్తో రూపొందింది. ఇది చాలా తేలికగా, వినియోగించడానికి సులభంగా ఉండటంతో పాటు.. వేగంగానూ పని చేస్తుంది. స్నేహితులతో దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. ఇంట్లో వీకెండ్ పార్టీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు.. క్షణాల్లో అందరి ఆకలి తీర్చేస్తుందీ గాడ్జెట్. పైగా దీనికి ప్రత్యేకంగా ఇంధనమే అక్కర్లేదు. కొన్ని చెక్కముక్కలు వేసి నిప్పు రాజేసి కబాబ్ స్టిక్స్ సాయంతోనూ అప్పటికప్పుడు గ్రిల్ చేసుకోవచ్చు. పైనాపిల్, చికెన్ పీసెస్ ఇలా అన్నింటినీ నచ్చిన విధంగా కాల్చుకుని తినొచ్చు.మినీ పాత్రలను ఉపయోగించి టీ, కాఫీలు, సూప్స్, కర్రీస్ వంటివీ రెడీ చేసుకోవచ్చు. దీనికి అదనంగా పెల్లెట్ బర్నర్ అడాప్టర్ కూడా లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో చెక్క ముక్కలు, కట్టె పుల్లలు దొరకని సమయంలో.. పెల్లెట్ గుళికల ప్యాకెట్ ఒకటి వెంట ఉంచుకుంటే దీనిపై కుకింగ్ ఈజీ అవుతుంది. ఈ స్టవ్ని టేబుల్ మీద పెట్టి.. ఉపయోగించినా ఏం కాదు. ఎందుకంటే స్టవ్ కింద భాగంలో.. ప్రత్యేకమైన బేస్ ట్రే ఉంటుంది. అవసరాన్ని బట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు లేదా తీసేయొచ్చు. ధర 69 డాలర్లు (రూ.5,749)స్మార్ట్ మగ్ వార్మర్..కాఫీ, టీలు లేనిదే రోజు గడవదనుకునేవారికి.. ఈ స్మార్ట్ మగ్ వార్మర్ చక్కగా యూజ్ అవుతుంది. సిస్టమ్ ముందు పనిచేసేవాళ్లు.. క్షణం తీరికలేని షెడ్యూల్స్తో ఉండేవారు ఈ డివైస్కి ఫిదా కావాల్సిందే. చిత్రంలోని ఎలక్ట్రిక్ డెస్క్టాప్ కాఫీ వార్మర్ 40 డిగ్రీల.. 50 డిగ్రీల.. 75 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో.. మూడు ఆప్షన్స్తో పనిచేస్తుంది. దీని మినీ డిజిటల్ డిస్ప్లే పక్కన.. టెంపరేచర్ పెంచుకోవడానికి ఒక బటన్, తగ్గించుకోవడానికి మరో బటన్ ఉంటాయి.అలాగే టైమ్ సెట్టింగ్ బటన్ తో పాటు పవర్ ఆఫ్.. ఆన్ బటన్ కూడా ఉంటుంది. ఇది కాఫీ, టీ, హనీ టీ, మిల్క్, మిల్క్ షేక్, హాట్చాక్లెట్ వంటివాటికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఆటో ఆఫ్ ఆఫ్షన్ ఉంటుంది. సేఫ్టీ ఫంక్షన్ తో పని చేస్తుంది. ఈ వార్మర్ చాలా రకాల మగ్లకు అనువుగా ఉంటుంది. దాంతో దీన్ని ఆఫీస్ టేబుల్ మీదా పెట్టుకోవచ్చు. ధర 30 డాలర్లు (రూ. 2,499)స్మార్ట్ మగ్ వార్మర్, ఆపిల్ కోరెర్ టూల్ఆపిల్ కోరెర్ టూల్..స్టెయిన్ లెస్ స్టీల్, ట్విన్ బ్లేడ్తో రూపొందిన ఈ కోరెర్ టూల్.. ఆపిల్, పైనాపిల్, పియర్ వంటి పండ్లను ఈజీగా కట్ చేసిపెడుతుంది. దీన్ని పిట్టర్లా, సీడ్ రిమూవర్గానూ వాడుకోవచ్చు. స్మూత్ ఎర్గోనామిక్ హ్యాండిల్తో ఉన్న ఈ మినీ గాడ్జెట్ని.. పిల్లలైనా, వృద్ధులైనా సులభంగా వినియోగించుకోవచ్చు.ఈ టూల్తో ఉల్లిపాయలు, టొమాటోల మధ్య భాగాలనూ తొలగించి, శుభ్రం చేసుకోవచ్చు. చెత్తలో వేయాల్సిన సీడ్స్ భాగాన్ని ఈ టూల్లోంచి బయటికి తీసి పారేయడం, దీన్ని క్లీన్ చేయడం రెండూ తేలికే! యాపిల్ కట్టర్స్, పిట్టర్స్, డివైడర్స్, వెడ్జర్, హల్లర్, కోర్స్లైసర్, ప్రోగ్రెసివ్ స్లైసర్ వంటి ఉపకరణాలతో పోలిస్తే.. ఈ కోరెర్ భలే ఉపయోగకరంగా ఉంటుంది. ధర 9 డాలర్లు (రూ.749)ఇవి చదవండి: సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..? -
తాత్త్వికథ: 'ద.. ద.. ద..' మెరుపులోంచి వచ్చిన మూడు రహస్య సంకేతాలు..
ప్రజాపతి దగ్గర సురలు, అసురులు, మానవులు తమ బ్రహ్మవిద్యాశిక్షణ పూర్తయిన తరువాత ప్రజాపతిని కలసి సందేశాత్మక ఆశీర్వాదాలు తీసుకోవాలనుకున్నారు. ప్రజాపతిని కలసి గురుదేవా ‘‘మీ నుంచి మేం నేర్చుకున్నది మా జీవితాల్లో అలవరుచుకుంటూనే విధులు, బాధ్యతలు నిర్వహించదలచాము’’ అన్నారు. ప్రజాపతి ధర్మపథంలో నడవమని ఆదేశించారు. దేవతలు ముందుకొచ్చి, ‘‘మీ ఆదేశానుసారం మేము విధులను ధర్మపథంలో నిర్వహిస్తాం. మీ ఆశీస్సులతో పాటు మంచి సందేశమివ్వమని కోరారు.అప్పుడు ఒక మెరుపు ఆకాశంలో మెరుస్తూ ‘ద’ అనే శబ్ద సంకేతాన్నిచ్చింది. అప్పుడు ప్రజాపతి మీకు ఆ మెరుపు సంకేతం ఏమి అర్థమయిందని? దేవతలన్నారు మేము ‘ద’ ని దమ్యత అంటే స్వయంనిగ్రహంగా అర్థం చేసుకున్నాం. మా మనస్సాక్షి చెబుతున్నదేమంటే సుఖ, సౌఖ్య జీవనాన్ని అనుభవించేటపుడు లేదా ఆ వాంఛలు కలిగినపుడు స్వయంనిగ్రహం కావాలని. ప్రజాపతి సంతసించి బాగా అర్థం చేసుకున్నారు అన్నారు.తదుపరి ఇది చూసి మనుష్యులు కూడా ప్రజాపతిని దివ్య ఆశీస్సులతో కూడిన వీడ్కోలు సందేశాన్ని కోరారు. అప్పుడు మళ్ళీ ఆకాశంలో మెరుపు ‘ద’ ధ్వనితో కనిపించింది. దాని సంకేతాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు అని అడగ్గా మనుషులన్నారు ‘‘మేము ‘ద’ ని దత్త గా అర్ధం చేసుకున్నాము. దత్త అంటే ఇవ్వు లేదా దానంచెయ్యి అని అర్థం. మేము స్వార్థ పరులం. మేము మా గురించే ఆలోచిస్తుంటాం. ఇతరులను పట్టించుకోం. కనుక మాకు అదొక దివ్యసంకేతం. మేము మాకున్నది అభాగ్యులకు దానం చేసేందుకు ప్రయత్నిస్తాం అన్నారు.ప్రజాపతి సంతోషించి, మీరు బాగా అర్థం చేసుకున్నారు అన్నారు. చివరగా అసురులు వచ్చారు. అప్పుడు ఆకాశంలో మెరుపు ‘ద’ ధ్వనితో మెరిసింది. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు అని అడగగా మేము ‘ద’ ని దయాగుణంగా అర్థం చేసుకున్నాము. అనగా దయాగుణం కలిగి ఉండడం. మాది క్రూరస్వభావం. మా మనసు చెబుతున్నదేమంటే, ఇతరుల ఎడ ఎక్కువ దయ, జాలి కలిగి ఉండాలని, తద్వారా ప్రశాంతంగా, సంతోషంగా వుండాలని. మనం గమనిస్తే మనిషిలో ఒక్కొక్కప్పుడు దైవత్వం, మరొకప్పుడు రాక్షసత్వం కనబడతాయి.మెరుపు నుంచివచ్చిన 3 రహస్యసంకేతాలూ ద ద ద మనిషికి చక్కగా అన్వయించబడతాయి. మనలో దేవత్వం కనిపించినపుడు స్వయం నిగ్రహం పాటించాలి. అది మనకు సమయాన్ని, శక్తిని, అస్థిత్వాన్నీ ఇస్తుంది. మనం మన శక్తిని, అస్థిత్వాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. మనం యితరులతో పంచుకుంటుంటే, అది మనలో దయను కలిగించి ఇతరులలో ఎంతో మానవత్వాన్ని పరిమళింప చేస్తుంది. – డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ‘నీవు నాతో ఏడు అడుగులు నడిచావు'! ఇకపైన..
గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి యువతీ యువకు లకు ఉండవలసిన సాధారణ లక్షణాలు ఐదింటిని రామాయణం నిర్దేశించింది. వాటిలో వ్యక్తిత్వం ఒకటి. భార్య ప్రవర్తన దగ్గరికి వచ్చేసరికి... ఆమె నీతో కలిసి పుట్టలేదు. నీతో కలిసి పెరగలేదు. వేరొకరి ఇంట పుట్టింది. ఎవరికో కూతురు. ఆమెకూ ఆశలు ఉంటాయి. కోరికలున్నాయి, సంతోషం కావాలి, ఆమె నీ ఇంటి కోడలిగా వచ్చింది. ఆమె సంతోషం గా ఉండేటట్టు చూడవలసిన మొట్టమొదటి కర్తవ్యం మామగారిది. తరువాత భర్తది. రామాయణంలో మామగారి పేరు చెప్పగానే ఆయన ఆ΄్యాయతను తలచుకుని సీతమ్మ పరవశించిపోతుంది. ఇది మానవీయ సంబంధాలకు భారతదేశం చేసిన పట్టాభిషేకం.అందుకే సప్తపది మంత్రాల్లో ఒక విశిష్టమైన విషయాన్ని చెప్పారు. సప్తపది అయితే తప్ప వివాహ తంతు పూర్తి అయినట్టు కాదు.. అంటారు. ఏడడుగులు నడిచిన తరువాత వరుడు – వధువుతో ఒక మాట అంటాడు. ‘నీవు నాతో కలిసి ఏడు అడుగులు నడిచావు కాబట్టి ఇకపైన ‘నీవు నాకు మంచి స్నేహితురాలివికా. నా మనసు ఎరిగి ప్రవర్తించు’ అంటాడు. అంటే – జన్మతః అనుబంధం కాదు. కానీ ఇప్పుడు జీవితంలో మధ్యలో ప్రవేశించింది. ఇక జీవితానికి నిర్ణయాత్మక శక్తి ఆమెయే.స్నేహమంటే మనసు మనసుతో కలవాలి. ఒకరు మరొకరికి అర్థం కావాలి. వారి సంతోషం కోసం... ఇవతలివారి వైపునుంచి కొంత త్యాగం ఉంటుంది. అలాగే వీరి సంతోషం కోసం అవతలివారి వైపునుండి కొంత త్యాగం ఉంటుంది. ఇలా జరిగితేనే దాంపత్యం సంతోషంగా సాగుతుంది.అలా కాక నీకిది సంతోషం కాకపోయినా నాకిది ఇష్టం, నేనిది చేస్తాను.. అన్నప్పడు గృహస్థాశ్రమం అర్థం ఏమిటి? దాంపత్య లక్ష్యం నీరుకారిపోతుంది. అది కాదు... ఒకరి సంతోషానికి మరొకరు కారణం కాగలగాలి. సుమనస్క... అంటారు. అంటే నీవు మంచి మనసుతో ప్రవర్తించు, నేను మంచి మనసుతో ప్రవర్తిస్తా. అలా మనిద్దరం అరమరికలు లేకుండా సఖ్యంగా సంతోషంగా మంచి స్నేహితులుగా ఉందాం. నాకున్న బలహీనతలేమిటో, బలమేమిటో నీవు తెలుసుకోవాలి.అలాగే నీ బలాలు, బలహీనతలు నేను తెలుసుకోవాలి. వాటికి తగిన విధంగా మనం నడుచుకుంటూ, తప్పులు చేస్తే మన్నించుకుని సర్దుకుపోతూ ప్రేమగా ఉండాలి. అంతే తప్ప ఒకరి తప్పులు మరొకరు వెతకడమే ధ్యేయంగా సంసారం చేస్తూ, ఇద్దరి పరువును, కుటుంబ గౌరవాన్ని, వంశ ప్రతిష్ఠను బజారుకీడ్చవద్దు. ఒకరిపట్ల మరొకరు అవగాహనతో, ఆప్యాయతతో, ప్రేమతో సంతోషంగా బతకడానికి ఇంటిని శాంతి స్థానం చేసుకుందాం.బయట ఎన్ని ఒత్తిడులున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా... ఇంటికొచ్చి ఒకరి ముఖం మరొకరం చూసుకోగానే ఉపశమనం పొందగలగాలి. సాహచర్యంలో పరస్పరం శాంతి పొందాలి. ఒకరం తప్పు చేస్తే మరొకరం ప్రేమ తో మందలించుకోగలగాలి. అరమరికలొద్దు. వాటిని అర్థం చేసుకుని ఎవరికి వారం సంస్కరించుకుందాం.’’ అనుకోవాలి.అంటే నిజానికి గృహస్థాశ్రమ ప్రవేశం చేసేటప్పుడు ఇద్దరి మధ్య ఎంత అవగాహనతో ప్రారంభం కావాలో, సుఖమయమైన సంసార జీవితానికి ప్రేమ ఎంత అవసరమో పెద్దలు తెలియపరుస్తారు.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాశ్వతంగా రద్దే!
‘ఫాస్ట్ బీట్ వద్దు.. మెలోడీయే ముద్దు’ అంటూ ఓ కొత్త నినాదాన్ని అందుకున్నాడు చెచెన్యా అధ్యక్షుడు రమ్జాన్ కాదిరోవ్. ‘చెచెన్ సంగీతం చెచెన్ మనస్తత్వానికి అనుగుణంగానే ఉండేట్టు చూడండి’ అంటూ ఆ దేశపు సాంస్కృతిక శాఖ మంత్రి మూసా దాదయేవ్కి ఆదేశాలూ ఇచ్చాడు. విషయం ఏంటంటే.. చెచెన్యా బహిరంగ వేడుకలు, సంబరాల్లో ఫాస్ట్ బీట్ మ్యూజిక్ని రద్దుచేశారు.ఇది కిందటి నెల నుంచే అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఆ దేశ సంప్రదాయ సంగీతం ఆధునిక పాశ్చాత్యా సంగీత బాణీలతో ప్రేరణ, స్ఫూర్తి చెందకుండా.. తమ కల్చర్కి తగ్గట్టే ఉండాలి. ప్రదర్శనల్లో పాటలకు, ఆ పాటల మీద డాన్స్లకు ప్రేక్షకులు వెర్రెత్తి ఊగినా.. ఈలలతో గోల చేసినా ఆ షోకి ఇక అంతే సంగతులు.అప్పటికప్పుడు దాన్ని రద్దు చేస్తారు. అందుకే బీట్స్ మరీ స్పీడ్గా కాకుండా అలాగని మరీ స్లోగా కాకుండా నిమిషానికి 80 నుంచి 116 మధ్యలో ఉండాలని చెచెన్యా సర్కారు వారి ఆనతి. తమ దేశం మీద వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ని రూపుమాపడానికే ఈ చర్య కాకపోతే.. సంగీతానికి హద్దులు, నిషేధాలు ఏంటని అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు కొంతమంది గ్లోబల్ మ్యూజిక్ లవర్స్.అయితే స్థానిక సంగీతకారులు మాత్రం.. ఈ రద్దును జూన్ నుంచి అమలు చేయాల్సిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నారట. రద్దుకు ముందే ఖరారై, అన్నిరకాలుగా ప్రిపేర్ కూడా అయిన మే నెలలోని తమ ప్రోగ్రామ్స్కి కొత్త ఉత్తర్వుల ప్రకారం తిరిగి మ్యూజిక్ నోట్స్ రాసుకోవడం.. రిహార్సల్స్.. రికార్డింగ్స్ ఎట్సెట్రాకు టైమ్ కావాలి కాబట్టి.. వాళ్లంతా ఆ రద్దును జూన్ వరకు వాయిదా వేయమని కోరుతున్నారు. సర్కారు మాత్రం సమస్యేలేదంటోందట.ఇవి చదవండి: ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..! -
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
పూర్వం సింహపురిని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యం చుట్టూ పెద్దపెద్ద దేశాలు ఉన్నా ఈ రాజ్యం కేసి కన్నెత్తి చూసే సాహసం లేదెవరికి. కానీ పొరుగు దేశమైన విజయపురినేలే జైకేతుడికి మాత్రం ఎలాగైనా సింహపురిని జయించి తన రాజ్యంలో కలుపుకోవాలనే కోరిక ఉండేది. అందుకోసం రెండుసార్లు యుద్ధం చేసి ఓటమి చవిచూశాడు. అయినా అతనిలో ఆశ చావలేదు.ఒకసారి మంత్రి మండలిని సమావేశపరచి ‘సింహపురి మన కంటే చాలా చిన్న దేశం. సైనికబలమూ తక్కువే. అయినా దాన్ని మనం ఎందుకు జయించలేకపోతున్నాం? ఈసారి యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లో సింహపురిని ఓడించాల్సిందే. మన దేశంలో విలీనం చేసుకోవాల్సిందే. మన విజయపురిని సువిశాల సామ్రాజ్యంగా తీర్చిదిద్దాల్సిందే’ అన్నాడు రాజు. అతనిలోని ఈ యుద్ధకాంక్ష వల్ల దేశంలో కరువుకాటకాలు పెరిగిపోవడమే కాక ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోసాగారు.ఎలాగైనా ఈ యుద్ధకాండను ఆపించి రాజు కళ్ళు తెరిపించాలని మంత్రి నిర్ణయించుకున్నాడు. అందుకే రాజుతో ‘క్షమించండి మహారాజా! దేశం.. సైన్యం.. ఎంత పెద్దవైనా.. ఎదుటివారి శక్తిని అంచనా వేయకుండా యుద్ధం ప్రకటిస్తే ఏమవుతుందో మీకు తెలిసిందే! ఇప్పుడు శక్తి కన్నా యుక్తి కావాలి. సింహపురి బలమేంటో.. బలహీనతేంటో వారి విజయరహస్యం ఏమిటో తెలుసుకోగలగాలి. అప్పుడు విజయం మనకు సులువు అవుతుంది.అందుకోసం సమర్థుడైన వ్యక్తిని వినియోగిద్దాం’ అన్నాడు మంత్రి. రాజుకు మంత్రి సలహా సరియైనదే అనిపించింది. ఒక్క క్షణం ఆలోచించి ‘ఎవరినో ఎందుకు? మనమే మారు వేషాలతో వెళ్దాం. అక్కడి రాజకీయ పరిస్థితులు, వారి విజయరహస్యాలను తెలుసుకుందాం’ అన్నాడు. దానికి మంత్రీ సరే అన్నాడు. మరునాడు ఉదయాన్నే రాజు, మంత్రి.. మామూలు ప్రయాణికుల్లా.. తమ గుర్రాలపై సింహపురికి బయలుదేరారు.ఆ నగరంలో అడుగు పెడుతూనే ఇద్దరికీ విస్మయం కలిగింది. నగరం చుట్టూ పొలాలు.. పండ్లతోటలతో ఆ నేలంతా ఆకుపచ్చ తివాచీ పరచినట్టు శోభయమానంగా కనిపించింది. జలాశయాలన్నీ నిండుగా కళకళలాడసాగాయి. నగరవీథులైతే.. శుభ్రంగా అద్దంలా మెరిసిపోసాగాయి. నగరవాసులు ఎవరిపనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కుటీర పరిశ్రమల్లో రకరకాల వస్తువులు.. రంగురంగుల దుస్తులు తయారవసాగాయి.ఒక ఇంటి ముందు పనిచేసుకుంటూ కనిపించిన వృద్ధుడిని చూసి.. రాజు, మంత్రి తమ గుర్రాలను అతని దగ్గరకు నడిపించారు. అతణ్ణి సమీపిస్తూనే ‘అయ్యా మేము బాటసారులం. విదేశ సంచారం చేస్తూ ఈ దేశానికి వచ్చాము. ఈ దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణాలు ఏమిటో చెబుతారా?’ అని అడిగారు. దానికా వృద్ధుడు ‘మా రాజు పాలనాదక్షుడు. ప్రజారంజకుడు. మా దేశవాసులు స్వయంకృషిని నమ్ముకుంటారు. మాకు ఆహార కొరతలేదు.మేం పండించిన ధాన్యాన్ని, తయారుచేసిన వస్తువులను మా చుట్టుపక్కల దేశాలకు ఎగుమతి చేస్తుంటాం. మా పొరుగున ఉన్న విజయపురి అయితే అచ్చంగా మా దేశ ఉత్పత్తుల మీదనే ఆధారపడి ఉంది. ఆ దేశవాసులు కొనే వస్తువులన్నీ మా దేశానివే. మా విజయ రహస్యానికి వస్తే.. మా దేశంలో ప్రతి పౌరుడు సైనిక శిక్షణ పొందవలసిందే! యుద్ధం అంటూ వస్తే అందరూ సైనికులై పోరాడుతారు. వారిని ప్రజాదళం అంటారు. వారిది స్వచ్ఛంద పోరాటం’ అని చెప్పాడు.తర్వాత రాజు, మంత్రి తమ గుర్రాలపై అలా నగర వీథుల్లో తిరుగుతూ.. పౌరులతో మాట్లాడుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నారు. ఆరాత్రి అక్కడే బసచేసి మర్నాడు తిరిగి తమ దేశానికి బయలుదేరారు. మార్గంలో మహారాజు.. మంత్రితో ‘సింహపురి వైభవం చూశాక నాకెంతో సిగ్గుగా అనిపిస్తుంది. ఆ పరిపాలన, అక్కడి ప్రజల క్రమశిక్షణ నాకెంతో నచ్చాయి’ అన్నాడు. దానికి మంత్రి ‘ఆ దేశం చిన్నదైనా పచ్చని పాడిపంటలతో తులతూగుతూ ఉంది. ఎటు చూసినా కుటీర పరిశ్రమలు నెలకొని ఉన్నాయి.అక్కడి ప్రజలు తమ అవసరాలకే కాదు ఎగుమతులకూ అవరసమయ్యేంత శ్రమిస్తూ దేశ ఆర్థికపరిపుష్టికి పాటుపడుతున్నారు. క్షమించండి రాజా.. సింహపురితో మన దేశాన్ని పోల్చుకోలేము. మన దేశం విశాలమైందే. కానీ ఎక్కడ చూసినా ఎండిన బీళ్ళు. ఇంకిపోయిన చెరువులు, ఆకలి, నిరుద్యోగం దర్శనమిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగు దేశాన్ని గెలుచుకుని మన సువిశాలసామ్రాజ్యాన్ని పెంచుకోవటమంటే మన దారిద్య్రాన్ని, కరువుని పెంచడమే! మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెబుతాను.. ముందు మనల్ని మనం సంస్కరించుకుందాం.మన దేశాన్ని పాడిపంటలతో తులతూగేలా చేద్దాం. ప్రతి పౌరుడికీ చేతినిండా పని కల్పిద్దాం. సింహపురిని ఆదర్శంగా తీసుకుందాం. ఇప్పుడు యుద్ధానికి కన్నా మనకు ఈ సంస్కరణలు అవసరం’ అని చెప్పాడు. అదంతా విన్నాక రాజు ‘నిజమే! ముందు మన దేశాన్ని సుభిక్షంగా.. సుస్థిరంగా తయారు చేద్దాం! వ్యవసాయానికి పెద్ద పీట వేద్దాం. త్వరలోనే విజయపురిని మరో సింహపురిగా మార్చేద్దాం! అందుకు కావలసిన ప్రణాళికను సిద్ధం చేయండి’ అని ఆజ్ఞాపించాడు రాజు.‘చిత్తం మహారాజా! మీ ఆశయం తప్పక నెరవేరుతుంది’ అంటూ భరోసా ఇచ్చాడు మంత్రి. — బూర్లె నాగేశ్వరరావు -
మధిర టు తిరుపతి.. ‘సారూ.. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!'
‘సారూ..’ అన్న శబ్దం నా చెవి గూబను కాస్త గట్టిగానే చరిచింది. నా భార్యతో మాటలకు మధ్యలో కామా పెట్టి, ఎవరాని అటు దిరిగి చూశాను. వయస్సు అర్ధసెంచరీకి అవతలిగట్టు. అరవై ఏళ్లవరకూ ఉండొచ్చు. మాసిన చొక్కాకు అక్కడక్కడా చిన్నపాటి చిరుగులు. కింద లుంగీ.. ఇంకొంచెం పెద్ద చిరుగులతో చొక్కాను డామినేట్ చేస్తోంది. నెత్తిన జుట్టు దుమ్మును పులుముకొని చిందరవందరగా వుంది. కుడికాలికి పిక్క మునిగే వరకు కట్టు. కట్టుకట్టి చాలారోజులైందన్నట్టు తెల్లటి కట్టు మట్టి పులుముకొని కనిపించింది. మనిషిని చుట్టుముట్టిన పేదరికం ఛాయలు.‘ఏంటన్నట్లు?’ అతనివైపు చూశాను. ‘సారూ.. నేను హైదరాబాద్కు పొయ్యే రైలెక్కాలి. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!’ బతిమిలాడుతున్నట్లు మాట, అభినయం. ‘సరే చెబుతా! అక్కడ కూర్చోనుండు’ పక్కనే ఉన్న అరుగు చూపించి అన్నాను. ‘మర్చిపోవద్దు సారూ.. నీ కాళ్లు మొక్కుతా’ అంటూ మరింత దగ్గరగా వచ్చి నా కాళ్లపైకి వంగాడు.అతన్నుంచి జారి మందు వాసన నా ముక్కు పుటాలను తాకింది.ముఖం చిట్లించి ‘చెప్పాను కదా.. అక్కడ కూర్చో, రైలొచ్చినప్పుడు చెబుతా’ కాస్త విసుగ్గా అన్నాను.‘గట్లనే సారూ ..’ రెండడుగులు వెనక్కువేసి నిలుచున్నాడు.నేను, నా భార్య హైదరాబాద్ వెళ్లేందుకు బాపట్ల రైల్వేస్టేషన్ లో రైలు కోసం వెయిట్ చేస్తున్నాము. మా కూతురు, అల్లుడు హైదరాబాదులో కాపురంపెట్టి నెలన్నర. ప్రసవం పూర్తయి బిడ్డకు జన్మనిచ్చాక అయిదవ నెల వచ్చేవరకు కూతురు గాయత్రి మాతోనే ఉంది. అప్పటికే మనవడు గిర్వాన్ కాస్త వొళ్లుచేశాడు. కాళ్లు, చేతులు హుషారుగా ఆడించడం, కనుగుడ్లు పెద్దవిచేసి చూడడం, బోర్లా తిరగడం, మనం నవ్వితే.. నిశితంగా పరిశీలించి నవ్వడం, హెచ్చరికలకు స్పందించడం మొదలు పెట్టాడు.మనవడి మురిపెంలో అయిదు నెలలు అయిదు రోజుల్లా గడిచాయి. అల్లుడిది ప్రైౖవేటు కంపెనీలో ఉద్యోగం. తానెలాగోలా బాబును సగదీరుకుంటానని చెప్పి కూతురు హైదరాబాద్కు వెళ్లిపోయింది. మనవడి జ్ఞాపకాలు మరువలేక బుడ్డోన్ని చూడాలని నా శ్రీమతి తహతహలాడిపోయింది. నాకూ కాస్త అలానే ఉన్నా బయటపడలేని స్థితప్రజ్ఞత.ఇంతలో ఆరవనెల అన్నప్రాశన అని కూతురు కబురుపెట్టింది. కాగలకార్యం కాలం తీర్చినట్లు హైదరాబాద్ ప్రయాణం ఖరారైంది. రాత్రి పది గంటలకు సింహపురి ట్రైన్ లో ప్రయాణం. మనవడి కోసం బట్టలు, పెద్ద దోమతెరతో పాటు ఏమేమి తీసుకురావాలో కూతురు రెండు రోజులుగా పదేపదే లిస్ట్ చదివింది. నా శ్రీమతి.. కూతురు వద్దన్న వాటిని కూడా బ్యాగుల్లో బలవంతంగా కూర్చి ఉరువుల సంఖ్యను అయిదుకు పెంచింది.‘బయలుదేరేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు బ్యాగులను కౌంట్ చేయండి’ అన్న కూతురు ముందుచూపు సూచనలతో ఉరువులు లెక్కగట్టి రైల్వేస్టేషన్కు చేరుకునేసరికి రాత్రి తొమ్మిదిన్నర గంటలైంది. ప్లాట్ఫారంపై మరోమారు బ్యాగులు లెక్కగట్టి సంతృప్తి చెందాక అక్కడే ఉన్న అరుగుపై కూర్చుంది మా ఆవిడ. రైలు రావడానికి అరగంట సమయముంది. ‘అన్నీ సర్దావా? ఏవైనా మరచిపోయావా?’ అన్నమాటకు ‘గుర్తున్నకాడికి’ అంది. ఇంతలో కూతురు ఫోన్ . లగేజీల ప్రస్థానంపై ఆరా.ఆమె కొడుకు అన్నప్రాశన కోసం తీసుకున్న వెండి గిన్నె, స్పూన్, గ్లాసు ఎక్కడ మరచి పోతామో? అన్నది ఆమె టెన్షన్ . ఒకపక్క రైళ్ల రాకపోకల అనౌన్స్మెంట్లు, ప్రయాణికుల ఉరుకులు, పరుగులు. రైళ్లు ఎక్కి, దిగే ప్రయాణికుల రద్దీతో ప్లాట్ఫారాలు సందడిని నింపుకోగా, ఈ మధ్యే రంగులద్దుకున్న రైల్వేస్టేషన్ రాత్రిపూట ఎల్ఈడీ కాంతుల వెలుగుల్లో కన్నులకింపుగా కనపడుతోంది.‘సార్.. సార్’ అంటూ పెరుగెత్తుకుంటూ వచ్చాడు మళ్ళీ ఆ వ్యక్తి. ‘ఏమిటన్నట్లు?’ చూశాను.‘రైలు వస్తున్నట్టుంది సార్! హైదరాబాద్ దేనా?’ అన్నాడు. సీరియస్గా ముఖం పెట్టి ‘నువ్వెక్కడికెళ్లాలి?’ అన్నాను. ‘హైదరాబాద్ పొయ్యే రైలుకే సార్’‘ఎక్కడ దిగాలి?’ ఊరి పేరు చెప్పాడు. ఏపీ సరిహద్దులో ఉన్న తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఊరు.‘మేమూ ఆ రైలుకే వెళుతున్నాము, మాతో పాటు ఎక్కుదువులే’ అన్నాను. ‘దండాలు దొరా.. ఈ ఒక్క సాయం చెయ్యి.. మా అయ్య కదూ’ అని మరీ వంగి కాళ్లను తాకుతూ దండం పెట్టాడు. మందు వాసన నాతోపాటు పరిసరాలనూ పలకరిస్తోంది. నేను వెనక్కు తగ్గాను. ‘మర్చిపోబాకు సారూ రైలు రాగానే నాకు చెప్పు.. ఏమీ అనుకోకు’ అంటూ చేతులు జోడించాడు.తను పదేపదే దగ్గరగా రావడం నన్ను మరింతగా ఇబ్బంది పెడుతోంది. కోపం, చిరాకు తెప్పిస్తోంది. ‘సరే.. చెబుతానన్నా గదా, రైలు రాంగానే చెబుతా, పొయ్యి అరుగు మీద కూర్చో’ అన్నాను.‘కోప్పడకు సారూ.. మరచిపోతావేమోనని చెపుతాండాలే ’ కొంచెం దూరం జరిగాడు. మరికొద్దిసేపట్లో గూడూరు– సింహపురి ఎక్స్ప్రెస్ మూడవ నంబర్ ప్లాట్పారంపైకి రానుందని తెలుగు, ఇంగ్లిష్, హిందీలో అనౌన్స్మెంట్. అప్పటికే కిక్కిరిసిన జనం అలర్ట్ అయ్యారు. రైలు వస్తుందంటూ తోటి ప్రయాణికులతో చర్చలు. కొందరు షాపుల్లో వాటర్ బాటిళ్లు కొంటున్నారు, ఇంకొందరు పిల్లలకు బిస్కెట్లు, కూల్డ్రింక్స్ కొనిపిస్తున్నారు, మరికొందరు ఫోన్లో రైలు వచ్చిందంటూ ఇంటికి కబురు చెబుతున్నారు, కొందరు బయలుదేరుతున్నామంటూ గమ్యంలోని వారికి సమాచారం చేరవేస్తున్నారు. ప్రయాణికుల కోలాహలం పెరిగింది.మరోమారు నా భార్య మా లగేజీ బ్యాగులు లెక్కగట్టింది. మా కూతురు కౌంటింగ్ సూచనల ప్రభావం ఆమెను వీడనట్లుంది. ‘బ్యాగులు అన్నీ ఉన్నాయా?’ అన్న అర్థం వచ్చేలా ఆమెవైపు చూశాను. ఈసారి ఆమె నవ్వింది. ‘సార్..సార్ ఇదో టీ తీసుకోండి, వేడివేడి టీ..’ పరుగులాంటి నడకతో వచ్చాడు ఆ వ్యక్తి. సీరియస్గా చూశాను. ‘మీ కోసమే తెచ్చాను, టీ తాగండి సర్’ అన్నాడు. నాకు కోపం నసాలానికెక్కింది. చుట్టుపక్కల ప్రయాణికుల దృష్టి చాలాసేపటి నుంచి మా ఇద్దరిపైనే ఉంది. ప్రతిసారీ అతను వేరెవరి దగ్గరకు వెళ్లకుండా నావద్దకు వచ్చి బతిమిలాడుతుండడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరోమారు అందరూ నావైపు చూశారు. కోపం కంట్రోల్ చేసుకున్నాను.‘ఇప్పుడే ఇంట్లో అన్నం తిని వస్తున్నాను, ఇప్పుడు టీ తాగను, నువ్వు తాగు’ ఒక్కో అక్షరం గట్టిగా నొక్కి పలికుతూ కళ్లెర్ర చేశాను.నా ఆగ్రహం పసిగట్టినట్లున్నాడు, దూరంగా వెళ్లి టీ తాగి అక్కడే నిల్చున్నాడు. ట్రైన్ వస్తోందంటూ మరోమారు అనౌన్్సమెంట్. ప్లాటుఫారంపై డిస్ప్లేలలో రైలు నంబర్, బోగీ నంబర్లు వేస్తున్నారు. అది చూసి ప్రయాణికుల్లో హడావుడి. అటూ ఇటూ వేగంగా కదులుతున్నారు. ‘సార్ రైలొచ్చిందా?’ ఈసారి కాస్త దూరం నుంచే అడిగాడు ఆ వ్యక్తి.‘ఆ.. వస్తాంది. ఇక్కడే ఉండు ఎక్కుదాం’ అన్నాను. ‘సరే.. సరే’ అంటూ నాకు దగ్గరగా వచ్చి నిల్చున్నాడు.నా భార్య మరోమారు బ్యాగులను చూపుడు వేలితో లెక్కించడం కనిపించింది. రైలు కూతతోపాటు దాని వెలుతురు తోడుగా ప్లాట్ఫారం పట్టాలపైకి భారంగా వచ్చి ఆగింది. మేమున్న దగ్గరకి కొంత అటు ఇటుగా మేము ఎక్కాల్సిన బీ–5 ఏసీ స్లీపర్ బోగి ఉంది. నా భార్య, నేను చెరో రెండు బ్యాగులు చేతికి తీసుకున్నాం. ఆదరబాదరగా వచ్చి ‘ఇటివ్వు తల్లీ’ అంటూ నా భార్య చేతిలోని రెండు బ్యాగులు తీసుకున్నాడా వ్యక్తి. ఆమె ఇంకో బ్యాగు తీసుకుంది. నా వెంటే బ్యాగులు మోసుకొచ్చాడు. బోగీలో మాకు కేటాయించిన సీట్ల వద్ద బ్యాగులు పెట్టాను. నా భార్యకు సీటు చూపించి కూర్చోబెట్టి.. ‘నీది యే బోగి?’ అడిగాను ఆ వ్యక్తిని. ‘నాదిక్కడ కాదు సారూ..’ అన్నాడు. ‘పద నీ బోగీలో దిగబెడతా’ అన్నాను. ‘నాదిక్కడ కాదులే సారూ..’ అన్నాడు మళ్లీ. ‘ఏదీ.. నీ టిక్కెట్ చూపించు? సీటెక్కడో చెబుతా’ అన్నాను. ‘టికెట్ లేదు సారూ..’ అన్నాడు.‘అదేంటి! టికెట్ తీసుకోలేదా?’ ‘లేదు సారూ.. అయినా మాకెందుకు సారూ టికెట్, మమ్మల్ని టికెట్ అడగరులే’ అన్నాడు. ‘టీసీ వచ్చి చెక్ చేస్తే?’ ‘అది మీకు సారూ.. మాకు కాదులే’ నసగుతూ అన్నాడు‘ఎందుకు?’ అన్నట్లు చూశాను. ‘నేను అడుక్కునేటోన్ని సారూ.. మాకు టిక్కెట్ గట్ల లేదులే’ అన్నాడు. ఆశ్చర్యమేసింది. మాసిన బట్టలు, ఆహార్యం చూస్తే అచ్చమైన పల్లెటూరి అమాయకుడిలా ఉన్నాడు తప్పించి మరీ అడుక్కునేవాడిలా కనిపించలేదు.‘నువ్వు అడుక్కుంటావా?’ అన్నాను. ‘అవును సారూ.. నేను బిచ్చగాన్ని’ అన్నాడు.నాముందు దాదాపు గంటపాటు రైల్వేస్టేషనులో ఉన్నాడు, నాకే టీ ఇవ్వబోయాడు, ఎవ్వరినీ డబ్బులు అడుక్కోలేదు. మనస్సు ఏదోలా అయ్యింది. తను అబద్ధం చెబుతున్నాడేమో! ‘నిజం చెప్పు నువ్వు అడుక్కుంటావా?’ అడిగాను. ‘నిజం సారూ.. నేను బిచ్చగాన్నే, ఆరేళ్లుగా అడుక్కుంటున్నాను’ అన్నాడు. ‘అంతకుముందు?’‘రైతును సారూ’ అన్నాడు. ఉలిక్కి పడ్డాను. తనవైపు తేరిపార చూశాను. రైతు కుటుంబంలో పుట్టిన నాకు తన మాటలు మనస్సులో అలజడి సృష్టించాయి. నా భార్యకు మళ్లీ వస్తానని చెప్పి తనతో పాటు బోగీల వెంట నడుస్తున్నాను. నాగటి చాళ్లలో నడచినట్లు కాలి పాదాలు తొసుకుతున్నాయి. సరిగ్గా అడుగులు వేయలేకపోతున్నాను. మనసుదీ అదే స్థితి. మెదడు గతితప్పింది.‘యే.. టిఫినీ.. టిఫినీ.. ఇడ్లీ వడా, ఇడ్లీ వడా... సార్ వాటర్.. వాటర్, కూల్డ్రింక్స్..’రైలు బోగీల్లో అరుపుల గోల. నా మనసు ఘోషపై ధ్యాసపెట్టిన నా చెవులు వాటిని పట్టించుకోలేదు. ఎలాగోలా జనరల్ కంపార్ట్మెంట్ కొచ్చాను. ఖాళీగా ఉన్న సీటుపై కూర్చున్నాను. ‘కూర్చో’ ఆ వ్యక్తికి సీటు చూపించాను.‘పర్లేదు సారూ నేను నిలుచుంటా’ అన్నాడు. చెయ్యిపట్టి కూర్చోబెడుతూ ‘నీ పేరు..?’ అడిగాను. ‘సోమయ్య సారూ..’‘నీ కథ వినాలని ఉంది చెప్పు సోమయ్యా..’ అన్నాను. ఒక్కక్షణం.. మొదలుపెట్టాడు.‘మాది మధిర దగ్గర పల్లెటూరు సారూ. చిన్న రైతు కుటుంబం. ఒక కొడుకు, ఒక కూతురు. రెండెకరాల మెట్ట. వానొస్తేనే పైరు, లేకుంటే బీడు. రెక్కలు గట్ల కట్టెలు జేసుకొని పని చేసేటోల్లం. అప్పులతో పెట్టుబడి, కరువులతో కష్టాలు. ఒక పంటొస్తే నాలుగు పంటలు పొయ్యేటియి. వడ్డీలు పెరిగొచ్చి అప్పులు కుప్పబడె. తీర్చే దారి దొరక్కపాయ.ఎదిగొచ్చిన కూతురును ఇంట్లో పెట్టుకోలేంగద సారూ.. ఎకరం అమ్మి బిడ్డ పెండ్లిజేస్తి. నా కష్టం పిల్లోడికొద్దని వాన్ని డిగ్రీ దాకా చదివిస్తి. అప్పులోల్లు ఇంటిమీద పడి ఆగమాగం జేస్తిరి. నానా మాటలు పడితి. అయి భరించలేక ఉరిపోసుకుందామని తీర్మానం జేసుకుంటి. భార్యా, కొడుకు దావలేని రీతిన వీధిన పడ్తరని మనసు మార్చుకుంటి. సేద్యం ఇక కుదిరేకత లేదని తీర్మానం జేసుకుంటి. ఉన్న అప్పు వడ్డీలతో గలిపి అయిదు లక్షలకు ఎగబాకె. ఎకరం అమ్మి లొల్లిజేసేటోల్లకు కొంత అప్పుగడ్తి. మా ఊర్లో నా దోస్తుగాల్లు కొందరు సేద్యం ఎత్తిపెట్టి చిన్నచిన్న యాపారాలకు బొయ్యి బాగానే సంపాదిస్తున్నారు. వో దినం నా బాధ వారికి మొరపెట్టుకుంటి.‘మాతో వస్తావా?’ అనిరి. అట్టే అని జెప్పి వొకనాడు వాల్లతో పాటు తిరుపతి రైలెక్కితి. ఎట్టోకట్ట గడ్డనెయ్యి స్వామీ అని ఎంకన్న స్వామికి మొక్కుకుంటి. తిరపతి బొయ్యి చూస్తే నా దోస్తుగాల్లు జేసే యాపారం బిచ్చమెత్తకోవడమని తెలిసె సారూ. పొద్దున లేచింది మొదలు రాత్రి దాకా అడుక్కోడమే. ‘ఇదేందయ్యా ఇట్టాంటిదానికి దెస్తిరే’ అని తొలిరోజు మనసురాక యాతనపడితి.కలోగంజో కలిగిన కాడికి నలుగురికి పెట్టినోల్లం, ఇప్పుడు అడుక్కునే రోజులొచ్చే అని కుమిలిపోతి. అప్పుతీర్చాల, కొడుకును దారిలో పెట్టాల. మనకాడ యేముందని యేం యాపారం జేస్తాం! మనసుకు నచ్చజెప్పుకుంటి. ఆ రోజు నుంచి అడుక్కోడం మొదలు పెడ్తి సారూ. రెండువారాలు బిచ్చమెత్తడం ఇంటికి రాడం, రెండు రోజులుండి మల్లీ పోడం, నెలాఖరుకు రావడం రెండు రోజులుండి మల్లీ పోడం. ఆరేండ్ల కాలం గడచిపాయ దొరా.’మనసు బాధను పంచుకొనేదానికి దోస్తానా దొరికిండనుకున్నాడేమో? ఏకబిగిన తన కథ చెప్పాడు సోమయ్య. మనసును పిండేసే కథ. నేలను కదలించే కథ. కొన్ని నిమిషాలపాటు మా మధ్యన మాటల్లేవు. అంతా నిశ్శబ్దం. రైలు ఇనప చక్రాల రోదనా నా చెవికెక్కడం లేదు.కొద్దిసేపటి తరువాత.. ‘ఇప్పుడెలా ఉంది పరిíస్థితి’ అడిగాను. ‘బాగుందిసారూ .. అప్పులు తీర్చాను, ఊర్లో పాత ఇంటిని రిపేర్ చేసుకున్నాను. కొడుకు హైదరాబాద్లో కంపెనీలో చేరాడు’ చెప్పాడు.‘రైతుగా పదిమందికి పెట్టినోడివి బిచ్చమెత్తడం ఇబ్బందిగా లేదా సోమయ్యా..’ ‘ఎందుకుండదు సారూ.. ఎదుటి మనిషి ముందు చేయిచాచగానే కొందరు చీదరించుకుంటారు, కొందరు పనిజేసుకొని బతకొచ్చుగా అంటారు. కొందరు అసహ్యంగా చూస్తారు. కొందరైతే నానాతిట్లు తిడతారు’ అన్నాడు.‘మాటలు పడ్డప్పుడు బాధనిపించదా?’ అన్నాను.‘అనిపిస్తుంది సారూ.. కచ్చితంగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడల్లా రైతుగా నేను పడిన కష్టాలు కళ్ల ముందేసుకుంటాను. పంట కోసం తెచ్చిన అప్పులు గట్టమని అప్పులిచ్చినోల్లు తిట్టిన తిట్లు గుర్తుకు తెచ్చుకుంటాను. తోటి మనిషన్న జాలి లేకుండా ఇంటి మీదకొచ్చి పరువు బజారుకీడ్చినప్పుడు పడ్డ యాతన గుర్తుకు తెచ్చుకుంటాను.పెండ్లాన్ని అమ్మైనా బాకీ తీర్చాలన్న మాటలకు గుండెపగిలి ఏడ్చిన ఏడుపు గుర్తుకు తెచ్చుకుంట సారూ. చుట్టుపక్కోల్లు గుమిగూడి ఓదార్చకుండా మాట్లాడిన వెకిలి మాటలకు పడ్డ యాతన, వేదన గుర్తుకు తెచ్చుకుంటా, ఆ మాటలు పడలేక ఉరిపోసుకొని చచ్చిపోదామనుకున్న రోజులు యాదికి తెచ్చుకుంట. ఆ కష్టాలు, అవమానాల కంటే బిచ్చమెత్తుకొనేటప్పుడు పడే మాటలు సిన్నయిగా అగుపిస్తాయి సారూ. రైతుగా ఉన్న నాటి కష్టాలతో పోలిస్తే ఇప్పటి నొప్పి గుండెను పిండదు సారూ.’సోమయ్య మాటలు ఆర్ద్రంగా మారాయి. చొక్కా చెరుగుతో కళ్లను తుడుచుకున్నాడు. నా కళ్లకు సోమయ్య మసగ్గా కనపడుతున్నాడు. మనస్సు బాధగా మూలిగింది. ‘సోమయ్యా .. ఉద్యోగం చాలించి నేనూ రానా..’ ఆయన మనస్సు తేలిక చేయాలన్న ఉద్దేశంతో అన్నాను. ఒక్కసారి నావైపు చూసి చిన్నగా నవ్వాడు. ‘మీకెందుకు సారూ ఆ కర్మ? ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు’ అన్నాడు. ‘అవును సోమయ్యా! తిరుపతికే ఎందుకు వెళ్లడం అంతదూరం?’ అన్నాను.‘భక్తులు దేశం నలుమూలల్నుంచి వచ్చేతావు సారూ, పాపాలు చేసి పుణ్యం పట్టకపోయేటందుకు మొక్కులతో వస్తరు, దండిగా డబ్బులతో వస్తరు, ఖర్చుపెట్టేందుకు సిద్దపడే వస్తరు, దేవుడికింత , మాకింత’ చెప్పాడు. ‘అయితే బిక్షమెత్తి పాపులకు పుణ్యం పంచే దేవుడి ఉద్యోగం అన్నమాట’ అన్నాను. ‘ఊరుకొండి సారూ.. వెంకన్నస్వామే దేవుడు, నేను కాదు’ నవ్వుతూ అన్నాడు. సోమయ్యలో నవ్వు చూశాను. కొంచెం బాధ తగ్గింది. సెల్ఫోన్ లో టైమ్ చూశాను. పన్నెండు కావస్తోంది. ఎవరిగోడూ పట్టని సింహపురి ఎక్స్ప్రెస్ విజయవాడ దాటి మధిర వైపు వేగంగా పరుగెడుతోంది.‘మీరెల్లిపడుకోండి సారూ.. మేడం ఒక్కరే ఉంటారు, నేను ఇంకో గంటలో దిగిపోతా ’ అన్నాడు. ‘అవును సోమయ్యా.. నువ్వు బాపట్లలో ఎందుకున్నావు?’ అన్నాను. ‘తిరపతిలో తొందరతొందరగా రైలెక్కాను సారూ.. తీరాచూస్తే అది మావూరి దగ్గర ఆగదంట. అందుకే ఇక్కడ దిగాను, దసరా పండక్కు కొడుకు, కూతురు పిల్లలు ఊరికి వచ్చిండ్రు సారూ.. రేపే పండగ, మల్లీ రైలెక్కడ పోగొట్టుకుంటానో అని బయపడి మిమ్మిల్ని ఇబ్బంది పెట్టాను’ అన్నాడు.‘సరే’ అని లేచాను. ఇప్పుడు సోమయ్య దగ్గర నాకు మందు వాసన రావడం లేదు, మట్టి వాసన వస్తోంది, రైతు చమట వాసన వస్తోంది. చేయి కలిపాను. పాలకుల ఆదరణ కరువై వో రైతు కాడిదించాడు. వందల మంది జనం ఆకలి ఆర్తనాదాలు నా చెవుల్లో మారు మోగుతున్నాయి. అన్యమనస్కంగానే నా బోగీవైపు అడుగులు వేశాను. — బిజివేముల రమణారెడ్డి -
May-5: 'జపాన్లో బాలల దినోత్సవం'! ఎలా జరుగుతుందో తెలుసా!
జపాన్లో బాలల దినోత్సవం ఏటా మే 5న జరుగుతుంది. జపాన్ రాచరిక సంప్రదాయం ప్రకారం ఏటా జరిగే ఐదు వార్షిక ఉత్సవాలలో ఇది ఒకటి. జపాన్లో దేశవ్యాప్తంగా జరిగే వేడుకల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. రకరకాల ప్రదర్శనలు చేస్తారు. జపాన్లో బాలల దినోత్సవం పన్నెండో శతాబ్దిలో పరిపాలించిన కమకురా వంశస్థుల హయాం నుంచి జరుగుతూ వస్తోంది.తొలినాళ్లలో బాలల దినోత్సవాన్ని ఏటా చాంద్రమానం ప్రకారం ఐదో నెలలోని పున్నమి తర్వాత వచ్చే ఐదో రోజున జరుపుకొనేవారు. తర్వాత పంతొమ్మిదో శతాబ్ది నుంచి ఈ వేడుకను గ్రెగేరియన్ కేలండర్ ప్రకారం ఏటా మే 5న జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ వేడుకలో ఊరూరా ఆరుబయట ఎత్తుగా నిలిపిన స్తంభాలకు కట్టిన దండాలకు చిత్ర విచిత్రమైన రంగురంగుల గాలిపటాలను ఎగురవేస్తారు. వీటిని ‘కొయినొబొరి’ అంటారు.అలాగే, ఇంటింటా బయటి ఆవరణల్లో గాని, పెరటి స్థలాల్లోగాని నిలిపిన స్తంభాలకు సంప్రదాయకమైన ‘నొబోరి’, ‘ఫుకునుకె’ జెండాలను ఎగురవేస్తారు. బహిరంగ వేదికల మీద సమురాయ్ బొమ్మలను ప్రదర్శనతో పాటు చిన్నారుల విచిత్ర వేషధారణలు, సంగీత, నృత్య ప్రదర్శనలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో జనాలు ఆరుబయట విందుభోజనాలు చేస్తారు.ఈ విందుభోజనాల్లో ఓక్ ఆకుల్లో చుట్టిన రెడ్బీన్స్ జామ్ నింపిన బియ్యప్పిండి ముద్దలను ఆవిరిపై ఉడికించిన వంటకం ‘కషివామొచి’, గంజితో తయారు చేసే మద్యం ‘సాకె’లను తప్పనిసరిగా వడ్డిస్తారు. ఓక్ ఆకులను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఈ వేడుకల్లో ఓక్ ఆకుల వినియోగానికి అత్యంత ప్రాధాన్యమిస్తారు.ఇవి చదవండి: రేటే 'బంగారమాయెనే!' -
'విడిపోతామని విపరీతమైన భయం'! అసలు కారణమేంటి?
భారతికి ఇద్దరు పిల్లలు. భర్త భరత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. భారతి గతంలో పనిచేసినప్పటికీ, ప్రస్తుతం పిల్లలకోసం ఇంట్లోనే ఉంటోంది. కానీ పిల్లలను స్కూల్కు పంపాలంటే విపరీతంగా భయపడుతోంది. వాళ్లు తనకు దూరమవుతారేమోనని ఆందోళన చెందుతోంది. స్కూలుకెళ్తే పిల్లలు దూరమవుతారనే భయమేంటోయ్ అని భరత్ జోక్ చేసినా ఆమె ఆందోళన తగ్గకపోగా, భర్త ఎక్కడ దూరమవుతాడోననే భయమూ మొదలైంది. నీవన్నీ పిచ్చి భయాలని భర్త ఎంత చెప్పినా ఆమెకు ధైర్యం రావడం లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో కౌన్సెలింగ్కి అటెండ్ అయింది.భారతితో మాట్లాడుతున్న క్రమంలో ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో పెరిగిందనే విషయం తెలిసింది. తల్లిదండ్రుల మధ్య గొడవల వల్ల ఆమెను హాస్టల్లో ఉంచారని చెప్పింది. పేరెంట్స్ ఎక్కడ విడిపోతారోనని రోజూ భయపడేదాన్నని, తాను భయపడినట్లు వాళ్లు విడిపోయారని బాధపడింది. అప్పటినుంచీ ఒంటరిగానే ఉంటున్నానని, కానీ ఒంటరితనం విపరీతమైన ఆందోళనను పెంచిందని చెప్పింది. భారతి గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఆమె సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్తో బాధపడుతోందని అర్థమైంది. ఇష్టమైన వ్యక్తి నుంచి విడిపోతామనే భయమే ఈ డిజార్డర్. ఇది పిల్లల్లో సహజం. అయితే భారతిలానే కొందరు పెద్దల్లో కూడా ఉంటుంది.ఎప్పడు మొదలవుతుంది?విడిపోతామనే ఆందోళన సాధారణంగా ఎనిమిది నెలల వయసు నుంచి ప్రారంభమవుతుంది. ఈ వయస్సులో పిల్లలను విడిచిపెట్టి తల్లిదండ్రులు పక్కకు వెళ్లినప్పడు ఆందోళన చెందుతారు. రెండేళ్ల వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు తమను వదిలి వెళ్లరని, తిరిగి వస్తారని అర్థం చేసుకోవడం మొదలుపెడ్తారు. అయితే కొందరిలో ఇది ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. జీవిత భాగస్వామితో లేదా రక్తసంబంధీకులు, స్నేహితులతో విడిపోతామని ఆందోళన చెందుతుంటారు.పిల్లల్లో సెపరేషన్ యాంగ్జయిటీకి కారణాలు..సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ జన్యుపరమైనది కావచ్చు. ఇది కుటుంబ పరంగానూ రావచ్చు. జీవితంలో జరిగే సంఘటనలూ కారణం కావచ్చు. ఉదాహరణకు..కుటుంబ సభ్యుల మరణంతల్లిదండ్రులు విడిపోవడం తల్లిదండ్రులు లేకపోవడంవలస వెళ్లాల్సి రావడంపాఠశాల మార్పుతల్లిదండ్రుల్లో ఆందోళనతల్లిదండ్రుల మద్య వ్యసనందత్తతకు వెళ్లడంపెద్దల్లో కారకాలు..ప్రియమైన వ్యక్తిని కోల్పోవడంకఠినమైన పెంపకంజీవితంలో నిత్యం సవాళ్లు, ఒత్తిళ్లుచిన్నతనంలో ఆందోళన రుగ్మతపిల్లల్లో కనిపించే లక్షణాలు..పిల్లల్లో తరచుగా ప్రీస్కూల్, డేకేర్ సమయంలో ఇది ప్రారంభమవుతుంది. మిమ్మల్ని వదిలివెళ్లడానికి బిడ్డ నిరాకరించవచ్చు, కోపం ప్రదర్శించవచ్చు. · కుటుంబ సభ్యులకు ఏదైనా చెడు జరుగుతుందనే భయం· ఒంటరిగా మిగిలిపోతానేమోనని భయం· తప్పిపోతామేమో, ఎవరైనా ఎత్తుకెళ్తారేమోననే భయం· పీడ కలలు· నిద్రలో మూత్రం పోయడంపెద్దల్లో కనిపించే ఇతర లక్షణాలు..· ఇష్టమైన వారు దగ్గర లేనప్పుడు భయాందోళనలు · ప్రియమైన వ్యక్తి గాయపడతారనే భయం · ఎవరితోనూ కలవకపోవడం · ఏకాగ్రత కోల్పోవడం.జీవితంపై తీవ్ర ప్రభావం..సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అది పాఠశాల, ఉద్యోగ జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కడుపు నొప్పి, తలనొప్పి, తల తిరగడం, వికారం, వాంతులు, అతిసారం, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. వీటితో పాటు డిప్రెషన్, ఇతర యాంగ్జయిటీ డిజార్డర్స్, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్లూ తలెత్తవచ్చు.నివారించడమెలా?సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ను నివారించడానికి ఎలాంటి మార్గాలూ లేవు. అయితే పిల్లల్లో ఈ సమస్య రాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. · నమ్మకమైన బేబీ సిట్టర్ను ఏర్పాటు చేయడం ద్వారా వేరుగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి..· కొద్ది సమయంపాటు విడిగా ఉండటం పిల్లలకు అలవాటు చేయాలి..· ఎక్కడైనా వదిలివెళ్లినప్పుడు, చెప్పిన సమయానికి రావడం ద్వారా నమ్మకాన్ని పెంచాలి.. · అయినప్పటికీ పిల్లల్లో ఆందోళన కనిపిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ను కలవాలి..· కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఈ రుగ్మతకు చికిత్సను అందించొచ్చు. · డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీతో పాటు ఫ్యామిలీ థెరపీ, గ్రూప్ థెరపీ కూడా ఎమోషనల్ మేనేజ్మెంట్లో సహాయపడతాయి. · అవసరమైతే సైకియాట్రిస్ట్ను కలసి మందులు తీసుకోవాల్సి ఉంటుంది.— సైకాలజిస్ట్ విశేష్ -
రేటే 'బంగార'మాయెనే..!
1990లో 1 కేజీ బంగారం = మారుతీ 800 కారు2000లో 1 కేజీ బంగారం = మారుతీ ఎస్టీమ్2005లో 1 కేజీ బంగారం = టయోటా ఇన్నోవా2010లో 1కేజీ బంగారం = టయోటా ఫార్చూనర్2016లో 1 కేజీ బంగారం = బీఎండబ్ల్యూ ఎక్స్12019లో 1 కేజీ బంగారం = వోల్వో ఎస్602024లో 1 కేజీ బంగారం = ఆడి క్యూ52030 వరకు దాచిపెట్టుకుంటే... ఏకంగా ప్రైవేట్ జెట్నే కొనేయొచ్చేమో!అతిశయోక్తిగా ఉంది కదూ! ఆకాశమే హద్దుగా.. రోజు రోజుకు కొత్త రికార్డులతో దూసుకెళ్తున్న పుత్తడి దూకుడు చూస్తే ఏమో.. పసిడి పెరగావచ్చు అనిపించక మానదు!! ఏడాది క్రితం 10 గ్రాములు రూ.60,000 స్థాయిలో ఉన్న బంగారం రేటు తాజాగా రూ. 75,000 స్థాయికి చేరి ధర‘ధగ’లాడిపోతోంది. అసలే రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అట్టుడుకుతుంటే... పులిమీద పుట్రలా పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయెల్ మిసైళ్ల మోతతో ప్రపంచానికి ముచ్చెమటలు పడుతున్నాయి.అధిక ధరలతో అతలాకుతలం అవుతున్న ఆర్థిక వ్యవస్థలను ఈ యుద్ధభయాలు వెంటాడుతుండటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత సాధనమైన బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. దీనికితోడు అమెరికా డాలర్ ప్రాభవానికి గండిపడటంతో ప్రభుత్వాలు కూడా కనకాన్నే నమ్ముకుని, ఎగబడి కొంటున్నాయి. మరోపక్క, రేటెంతైనా తగ్గేదేలే అంటూ జనాలు సైతం పసిడి వెంటపడుతున్నారు.ఇలా అన్నివైపుల నుంచి డిమాండ్ పోటెత్తి రేటు ’మిసైల్’లా దూసుకెళ్తోంది. అసలు ఈ స్వర్ణకాంతులకు కారణమేంటి? ప్రపంచవ్యాప్తంగా పసిడి నిల్వల సంగతేంటి? ఈ గోల్డ్ రష్.. పుత్తడిని ఇంకెన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుంది? పసిడిలో పెట్టుబడికి ఏ రూటు బెటర్? ఇవన్నీ తెలుసుకోవాలంటే బంగారు‘గని’ అలా తవ్వొద్దాం పదండి!!యుగాలుగా ప్రపంచమంతా కాంతులీనుతున్న లోహం ఏదైనా ఉందంటే నిస్సందేహంగా బంగారమే! అందుకే వేల సంవత్సరాల నుంచి, ఏ నాగరికత చూసినా పసిడి వేట కొనసాగుతూనే ఉంది. అయితే, ప్రస్తుతం భూమ్మీద ఉన్న బంగారం మొత్తంలో దాదాపు 86 శాతం గడచిన 200 ఏళ్లలోనే తవ్వి తీసినట్లు చరిత్రకారులు, జియాలజిస్టులు చెబుతున్నారు. అధునాతన మైనింగ్ టెక్నిక్లు అందుబాటులోకి రావడంతో 18వ శతాబ్దం ఆరంభంలో పెద్దయెత్తున పసిడి ఉత్పత్తి ప్రారంభమైంది.కాలిఫోర్నియా గోల్డ్ రష్ అన్నింటిలోకెల్లా ప్రాచుర్యం పొందింది. 1848 నుంచి 1855 నాటికి ఇక్కడ 2 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని వెలికి తీయడం విశేషం. ఇక 1890 వరకు అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా టాప్–3 పుత్తడి ఉత్పత్తి దేశాలుగా ఉండేవి. అయితే, 1886లో దక్షిణాఫ్రికాలోని విట్వాటర్స్రాండ్ బేసిన్లో కనుగొన్న నిక్షేపాలు ఆ దేశ ముఖచిత్రంతో పాటు ప్రపంచ పసిడి మార్కెట్ను సైతం సమూలంగా మార్చేశాయి. అతిపెద్ద బంగారు క్షేత్రాల్లో ఒకటిగా ఇది చరిత్ర సృష్టించింది.శతాబ్దం పాటు ఉత్పత్తిలో రారాజుగా స్వర్ణకాంతులతో మెరిసిపోయింది. 1970లో దక్షిణాఫ్రికా పసిడి ఉత్పత్తి 1,002 టన్నుల గరిష్ఠ స్థాయిని అందుకుంది. ఇప్పటిదాకా ఏ దేశం కూడా ఒకే ఏడాదిలో ఇంత బంగారాన్ని ఉత్పత్తి చేయలేదు. 1980 నుంచి పసిడి ధరలు అంతకంతకూ పెరగడంతో ప్రపంచంలో చాలా చోట్ల స్వర్ణం కోసం వేట జోరందుకుంది. 2007 నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఆవిర్భవించడం విశేషం. ప్రస్తుతం 40కి పైగా దేశాల్లో పుత్తడి మైనింగ్ జోరుగా సాగుతోంది.ఉత్పత్తి మందగమనం...వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 2018లో ప్రపంచవ్యాప్తంగా 3,655 టన్నుల బంగారం గనుల నుంచి ఉత్పత్తయింది. ఇదే ఇప్పటిదాకా ఆల్టైమ్ గరిష్ఠ స్థాయి. అక్కడి నుంచి తగ్గుముఖం పట్టి, గత మూడేళ్లుగా ఉత్పత్తి ఎదుగూబొదుగూ లేకుండా 3,600 టన్నులకే పరిమితమవుతోంది. ఒకప్పుడు ప్రపంచ బంగారు గనిగా పేరొందిన దక్షిణాఫ్రికా ఇప్పుడు వెలవెలబోతోంది. చైనా 2023లో 370 టన్నులను ఉత్పత్తి చేసి ‘టాప్’లేపింది. తర్వాత టాప్–10లో రష్యా (310 టన్నులు), ఆస్ట్రేలియా (310), కెనడా (200), అమెరికా (170), కజక్స్థాన్ (130), మెక్సికో (120), ఇండోనేషియా (110) దక్షిణాఫ్రికా (100), ఉజ్బెకిస్థాన్ (110), పెరూ (90) ఉన్నాయి. రికార్డు ధరల నేపథ్యంలో పాత బంగారం రీసైక్లింగ్ కూడా పుంజుకుంటోంది. 2023లో 9 శాతం పెరిగి 1,237 టన్నులకు చేరింది. ప్రస్తుత ప్రపంచ పసిడి ఉత్పత్తిలో 32 శాతం వాటా చైనా, రష్యా, ఆస్ట్రేలియాలదే కావడం గమనార్హం.తవ్విందెంత.. తవ్వాల్సిందెంత?ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా భూమి నుంచి వెలికితీసిన బంగారం మొత్తం 2,01,296 టన్నులుగా అంచనా. ఇందులో ఆభరణాల రూపంలోనే దాదాపు సగం, అంటే 93,253 టన్నులు ఉంది. దీని విలువ 7.2 ట్రిలియన్ డాలర్లు. ప్రైవేటు పెట్టుబడుల రూపంలో 3.4 ట్రిలియన్ డాలర్ల విలువైన 44.384 టన్నుల (22%) స్వర్ణం వాల్టుల్లో భద్రంగా ఉంది. వివిధ దేశాల (సెంట్రల్ బ్యాంకులు) వద్ద నిల్వలు 34,211 టన్నులు (17%). వీటి విలువ 2.7 ట్రిలియన్ డాలర్లు. పారిశ్రామిక అవసరాల కోసం వినియోగంలో ఉన్నది 29,448 టన్నులు (15%). 2.3 ట్రిలియన్ డాలర్లు. ప్రస్తుత ధర ప్రకారం ఈ బంగారం మొత్తం విలువ 15.6 ట్రిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 1,303 లక్షల కోట్లు. ఇక భూమిలో ఇంకా నిక్షిప్తమై ఉన్న బంగారం విషయానికొస్తే, ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ కంపెనీలు కనుగొన్న కచ్చితమైన నిల్వలు 53,000 టన్నులు మాత్రమే మిగిలాయి. ప్రస్తుత వార్షిక ఉత్పత్తి (3,600 టన్నులు) ప్రకారం చూస్తే, మరో 15 ఏళ్లలో ఈ నిల్వలన్నీ అయిపోతాయి. ఈలోగా కొత్త నిక్షేపాలను కనిపెట్టాలి. లేదంటే ఉత్పత్తి అడుగంటి, రీసైక్లింగ్పై ఆధారపడాల్సిందే!రేటెందుకు పరుగులు పెడుతోంది?ఏ వస్తువు (కమోడిటీ) ధరకైనా గీటురాయి డిమాండ్, సరఫరానే. గత కొన్నేళ్లుగా గనుల నుంచి పసిడి ఉత్పత్తి మందగించింది, భూమిలో మిగిలున్న నిల్వలు అడుగంటుతున్నాయి. 2021 నుంచి భారీ నిక్షేపాలేవీ దొరకడం లేదు. దీంతో భవిష్యత్తులో స్వర్ణం మరింత అరుదైన లోహంగా మారనుంది. మరోపక్క ఆభరణాల డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. వన్నె తగ్గని సురక్షిత పెట్టుబడి, ద్రవ్యోల్బణానికి విరుగుడుగా ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ల వంటి సాధనాల ద్వారా పుత్తడిలో మదుపు చేసేందుకు ఎగబడుతున్నారు. ప్రపంచ దేశాలు డాలర్లలో వాణిజ్యానికి క్రమంగా చెల్లు చెప్పడంతో పాటు తమ విదేశీ కరెన్సీ నిల్వల్లో డాలర్ నిధులను తగ్గించుకుంటున్నాయి.ఫలితంగా డీ–డాలరైజేషన్ జోరందుకుంది. ఆంక్షల భయాలకు తోడు కరెన్సీ క్షీణతకు విరుగుడుగా బంగారం నిల్వలను సెంట్రల్ బ్యాంకులు పెంచుకుంటూ పోతున్నాయి. గత పదేళ్లలో సగటున ఏటా 800 టన్నులు కొన్నాయి. ఇటీవల కొనుగోళ్ల జోరు పెంచిన మన ఆర్బీఐ వద్ద 817 టన్నుల బంగారం ఉంది. ఇక పారిశ్రామిక అవసరాలు (ఎలక్ట్రానిక్స్, డెంటిస్ట్రీ, అంతరిక్ష రంగం) ఎగబాకుతున్నాయి. ఇలా సరఫరా మందగించి.. డిమాండ్ పెరిగిపోవడమే బంగారం పరుగుకు ప్రధాన కారణం. ఇక రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తోడు, ఇరాన్–ఇజ్రాయెల్ దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది.ఈ భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలతో ద్రవ్యోల్బణం ఎగసి జేబుకు చిల్లుపెడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లో ఆదుకునే సురక్షిత సాధనాల్లోకి, ముఖ్యంగా బంగారంలోకి తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. ఫిబ్రవరిలో 2,000 డాలర్లకు అటూఇటుగా ఉన్న ఔన్స్ బంగారం ధర ఇరాన్–ఇజ్రాయెల్ ఘర్షణలతో భగ్గుమంది. తాజాగా 2,449 డాలర్ల ఆల్టైమ్ గరిష్ఠాన్ని తాకింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొండెక్కి కూర్చున్న వడ్డీరేట్లు ఇకపై దిగొచ్చే అవకాశాలున్నాయి. ఇది పసిడికి మరింత డిమాండ్ను పెంచడంతో పాటు ధరలు ఎగిసేందుకు దారితీసే అంశం.స్టోర్ ఆఫ్ వాల్యూలో టాప్..ప్రపంచంలో ఏ అసెట్ (ఆస్తి)కీ లేనంత స్టోర్ ఆఫ్ వాల్యూ బంగారం సొంతం. స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే మన దగ్గర ఏదైనా అసెట్ (కరెన్సీ, బంగారం, భూమి, ఇళ్లు, షేర్లు ఇతరత్రా) ఉంటే, ఎన్నాళ్లయినా దాని విలువ పెరగడమే కానీ ఆవిరైపోకుండా ఉండటం అన్నమాట. ఉదాహరణకు లక్ష రూపాయలు పెట్టి బంగారం కొని, అదే సమయంలో లక్ష రూపాయలను దాచామనుకోండి. కొన్నేళ్ల తర్వాత పసిడి విలువ కచ్చితంగా పెరుగుతుందే తప్ప దిగజారదు. కానీ నగదు విలువ మాత్రం పడిపోతుంది. రెండేళ్ల కిందట కేజీ బియ్యం ధర రూ.40 స్థాయిలో ఉంటే ఇప్పుడు 70కి చేరింది. అంటే కరెన్సీకి ఉన్న కొనుగోలు విలువ అంతకంతకూ ఆవిరైపోతోందని అర్థం. స్టోర్ ఆఫ్ వాల్యూ కలిగిన అతి కొద్ది అసెట్లలో భూమి కూడా ఉన్నప్పటికీ, పుత్తడిలా వెంటనే సొమ్ము చేసుకోవడం (లిక్విడిటీ) కష్టం. కాబట్టి అసలుకు మోసం రాకుండా... లిక్విడిటీలోనూ పసిడిని మించింది లేదు. మన పెద్దలు ‘పొలం పుట్రా.. నగా నట్రా’ వెనకేసుకోమన్నది అందుకే!ఎలా కొన్నా.. బంగారమే!ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారంలో దాదాపు సగం ఆభరణాల రూపంలోనే ఉంది. మగువలకు బంగారమంటే ఎంత మక్కువో చెప్పేందుకు ఇదే నిదర్శనం. రేటు ఎగబాకుతుండటంతో అందకుండా పోతుందేమోనన్న ఆతృత అందరిలోనూ పెరిగిపోతోంది. అందుకే పసిడి పెట్టుబడులూ జోరందుకున్నాయి. మరి ఏ రూపంలో కొంటే మంచిది అనేది చాలా మందికి వచ్చే డౌటు. నిజానికి పెట్టుబడికి కూడా మన దేశంలో ఇప్పటికీ ఆభరణాల రూపంలో కొనేవారే ఎక్కువ. ఎందుకంటే నచ్చినప్పుడు ధరించి, ఆనందించవచ్చనేది వారి అభిప్రాయం.దీనివల్ల తరుగు, మజూరీ పేరుతో కొంత నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి, ధరించేందుకు అవసరమైనంత ఆభరణాలను పక్కనబెడితే, పెట్టుబడికి మాత్రం కాయిన్లు, బార్ల రూపంలో 24 క్యారెట్ల బంగారాన్ని కొనడం బెటర్. అయితే, ఇందులో కూడా అదనపు చార్జీల భారం ఉంటుంది. అంతేకాకుండా భౌతిక రూపంలో బంగారాన్ని కొన్నా, అమ్మినా 3 శాతం వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బాదుడు తప్పదు. ఆభరణాలు, నాణేలు, కడ్డీల రూపంలో కొని దాచుకోవడం రిస్కు కూడా. పోనీ లాకర్లలో దాచుకోవాలంటే ఫీజులు కట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మెరుగైన ప్రత్యామ్నాయం సార్వభౌమ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీలు), గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) తదితర రూపాల్లో లభించే డిజిటల్ గోల్డ్.అయితే, వీటిని కొనాలంటే డీమ్యాట్ ఖాతా ఉండాలి. బంగారం మార్కెట్ ధరకు అనుగుణంగా షేర్ల మాదిరిగానే ఇవి కూడా ట్రేడవుతాయి. నచ్చినప్పుడు విక్రయించుకొని సొమ్ము చేసుకోవచ్చు. ఈటీఎఫ్లలో నామమాత్రంగా చార్జీలు ఉంటాయి. కానీ, ఎస్జీబీలకు ఎలాంటి చార్జీలూ లేవు. అంతేకాదు, వార్షికంగా 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. అయితే, ఏ రూపంలో కొన్నాసరే ఇన్వెస్టర్లు తమ తమ పెట్టుబడి మొత్తంలో కనీసం 10–15 శాతాన్ని బంగారానికి కేటాయించడం ఉత్తమమని, క్రమానుగత పెట్టుబడి(సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయాలనేది ఆర్థిక నిపుణుల ‘బంగారు’ మాట!బంగారు భారత్!ఆర్బీఐ దగ్గరున్న 817 టన్నుల బంగారాన్ని పక్కనబెడితే, అనధికారిక లెక్కల ప్రకారం భారతీయుల వద్ద ఆభరణాలు, ఇతరత్రా రూపాల్లో ఉన్న బంగారం మొత్తం 25,000 టన్నులకు పైగానే ఉంటుందని అంచనా. భూమ్మీద ఉన్న మొత్తం బంగారంలో ఇది 13 శాతం. అంటే దాదాపు 1.93 ట్రిలియన్ డాలర్లు. మన కరెన్సీలో రూ. 161 లక్షల కోట్లు. భారత స్థూల దేశీయోత్త్పత్తి (3.7 ట్రిలియన్ డాలర్లు)లో సగానికి సమానమన్నమాట!తులం... రూ. లక్ష!కనకం.. పూనకాలు లోడింగ్ అంటూ నాన్స్టాప్ ర్యాలీ చేస్తోంది. ఫిబ్రవరి నుంచి మొదలైన దూకుడుతో ఏకంగా 20 శాతం పైగా ఎగబాకింది. ఇప్పుడు కొనొచ్చా.. తగ్గేదాకా వేచి చూడాలా? ఇంకా పెరిగితే ఏంటి పరిస్థితి? అందరిలోనూ ఇవే సందేహాలు. అయితే, పుత్తడిని ఏ రేటులో కొన్నా దీర్ఘకాలంలో లాభాలే కానీ, నష్టపోయే పరిస్థితైతే ఉండదనేందుకు దాని ‘ధర’ చరిత్రే సాక్ష్యం! ఈ ఏడాదిలోనే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్కు 2,700 డాలర్లను తాకొచ్చని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. దీని ప్రకారం చూస్తే, దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం రేటు రూ. 85,000కు చేరే అవకాశం ఉంది. అంటే తులం (11.6 గ్రాములు) బంగారం కొనాలంటే రూ. లక్ష పెట్టాల్సిందే. అయితే, పశ్చిమాసియా, ఉక్రెయిన్ వివాదాలు శాంతించడం, అమెరికాలో వడ్డీరేట్లు మరింత పెరగడం, లేదంటే యథాతథంగా కొనసాగించడంతో పాటు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లకు బ్రేక్ పడితే పసిడి ధరలకు కళ్లెం పడుతుందని గోల్డ్మన్ శాక్స్ అంటోంది.రూపాయి వాత.. సుంకం మోత!మన దేశంలో మగువలే కాదు పురుషులూ పసిడి ప్రియులే. అయితే, పుత్తడి రేటు విషయంలో మన జేబుకు అటు ప్రభుత్వం, ఇటు ‘రూపాయి’ బాగానే చిల్లుపెడుతున్నాయి. పసిడి దిగుమతులపై ప్రభుత్వం 15 శాతం సుంకం విధిస్తోంది. మరోపక్క, రూపాయి విలువ కూడా అంతకంతకూ బక్కచిక్కుతూ పసిడి ధరకు ఆజ్యం పోస్తోంది. అది ఎలాగంటే, వాస్తవానికి ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ (31.1 గ్రాములు) పసిడి ధర 2,400 స్థాయిలో ఉంది. ప్రస్తుత రూపాయి విలువ ప్రకారం 10 గ్రాముల మేలిమి బంగారం రేటు దాదాపు రూ.65,000. కానీ రేటు రూ.75,000 స్థాయిని తాకింది. అంటే 15 శాతం సుంకం లెక్కన ప్రభుత్వానికి రూ.10,000 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇక రూపాయి పతనం విషయానికొస్తే, 2022లో డాలరుతో రూపాయి మారకం విలువ 80 వద్ద ఉండేది. ఇప్పుడు 83.5కు పడిపోయింది. రూపాయి 80 స్థాయిలోనే ఉంటే ప్రస్తుత పసిడి ధర రూ.62,400. దీనికి 15 శాతం సుంకం కలిపితే, 71,720 కింద లెక్క!సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు ఎందుకు...ఏ దేశానికైనా ఎగుమతి–దిగుమతులు సజావుగా జరిగేందుకు విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు ఎంత అవసరమో, అందులో బంగారం నిల్వలను తగినంతగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే, ఏదైనా అనుకోని ఆర్థిక విపత్తులు తలెత్తినప్పుడు, అంటే ఫారెక్స్ నిధులు అడుగంటి పోవడం వంటి సందర్భాల్లో ప్రభుత్వాలకు దన్నుగా నిలిచేది పుత్తడే! 1991లో దేశంలో ఫారెక్స్ నిల్వలు (డాలర్లు) నిండుకున్నాయి.దిగుమతులకు చెల్లించేందుకు, విదేశీ రుణాలపై వడ్డీ కట్టేందుకు డాలర్లు లేక చెల్లింపుల సంక్షోభం తలెత్తింది. దీంతో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) వద్దనున్న బంగారాన్ని కుదువపెట్టి విదేశీ రుణాలను సమీకరించారు. దేశం దివాలా తీయకుండా కాపాడారు. అంటే, అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బంగారం చేతిలో ఉంటే మనకు ఇట్టే అప్పు ఎలా పుడుతుందో.. ప్రభుత్వాలకు సైతం ఆపదలో ఆదుకునే ఆపన్న హస్తం స్వర్ణమే!మరికొన్ని ‘బంగారు’ ముచ్చట్లు...ప్రపంచంలో ఇప్పటిదాకా వెలికితీసిన బంగారం అంతటినీ కరిగించి ముద్దగా చేస్తే ఎటు చూసినా 21.8 మీటర్లుండే క్యూబ్లో పట్టేస్తుంది.అత్యధిక సాంద్రత, సాగే గుణం కారణంగా ఔన్సు (31.1 గ్రాములు) బంగారాన్ని 187 చదరపు అడుగుల పలుచని గోల్డ్ లీఫ్గా సాగదీయొచ్చట.ప్రతి యాపిల్ ఐఫోన్లో 0.034 గ్రాముల పసిడి ఉంటుందని అంచనా.దక్షిణాఫ్రికాలో కనుగొన్న ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని (విట్వాటర్స్రాండ్ గోల్డ్ఫీల్డ్) కార్మికుల కోసం 1900 శతాబ్ది ఆరంభంలో నెలకొల్పిన జొహానస్బర్గ్ సెటిల్మెంట్.. ఇప్పుడు ఆ దేశంలో అతిపెద్ద నగరం.ప్రస్తుతం సాధారణ గ్రేడ్ టన్ను క్వార్ట్›్జ ముడి ఖనిజం నుంచి ఓపెన్ పిట్ గనిలో సగటున 1.4 గ్రాములు, భూగర్భ గనిలో 5–8 గ్రాములు మాత్రమే బంగారం లభిస్తోంది.నేరుగా ముద్దల రూపం (నేటివ్ స్టేట్)లో కూడా దొరికే అతి విలువైన లోహం కూడా బంగారమే. ప్రపంచంలో అతిపెద్ద బంగారం ముద్ద ఆస్ట్రేలియాలోని విక్టోరియా గోల్డ్ ఫీల్డ్స్లో 1869లో దొరికింది. ‘వెల్కమ్ స్ట్రేంజర్’గా పేరు పెట్టిన దాని బరువు ఏకంగా 72 కేజీలు! మన కోలార్ గనుల్లోనూ బొప్పాయి, గణేషుడి రూపాల్లో ఇలా పసిడి ముద్దలు లభించాయట.అతిపెద్ద పసిడి భాండాగారాన్ని (వాల్ట్) న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తోంది. మాన్హటన్లోని బ్యాంక్ బేస్మెంట్లో ఉన్న భూగర్భ వాల్ట్లో ప్రస్తుతం వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు చెందిన 7,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా.లండన్ బులియన్ మార్కెట్ పసిడి ట్రేడింగ్లో నంబర్ వన్గా నిలుస్తోంది. ప్రపంచంలో ట్రేడయ్యే మొత్తం గోల్డ్లో 70 శాతం వాటా దీనిదే.భారత్లోని మొత్తం బంగారంలో 3,000–4,000 టన్నులు దేవాలయాలకు చెందినవేనని అంచనా. కేరళ పద్మనాభస్వామి గుడిలోని నేలమాళిగల్లో దాదాపు 1,300 టన్నుల బంగారం నిక్షిప్తమై ఉందట. ఇక తిరుపతి వెంకటేశ్వరస్వామి తరఫున టీటీడీ ఇప్పటిదాకా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన బంగారం 11,329 కేజీలు (11.32 టన్నులు). ఒక్క 2023–24లోనే 1,031 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేసింది.కేజీఎఫ్.. మన బంగారు కొండ!భారత్లో క్రీస్తు పూర్వం 1వ సహస్రాబ్ది నుంచి దక్కన్ ప్రాంతంలో పసిడి వేట జరుగుతోందని చరిత్ర చెబుతోంది. కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో క్రీస్తు శకం 2–3 శతాబ్దాలకు పూర్వమే బంగారాన్ని వెలికితీశారు. ఆ తర్వాత గుప్తులు, చోళుల కాలంలో ఇక్కడ పుత్తడి మైనింగ్ కార్యకలాపాలు విస్తరించాయి. విజయనగర సామ్రాజ్యంలో, ఆపై టిప్పు సుల్తాన్ హయాంలో పసిడి ఉత్పత్తి జోరందుకుంది. అయితే, బ్రిటిష్ పాలనలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) దశ తిరిగిపోయింది. జాన్ టేలర్ అండ్ కంపెనీకి బ్రిటిషర్లు దీన్ని అప్పజెప్పారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ‘లిటిల్ ఇంగ్లండ్’గా పిలిచేవారు.1884–1904 మధ్య చాలా తక్కువ లోతులోనే బంగారం దొరికేది. మొదట్లో ఒక టన్ను క్వార్ట్›్జ ముడి ఖనిజం నుంచి 45 గ్రాముల పసిడి వచ్చేదట. దీంతో ప్రపంచంలో అత్యంత శ్రేçష్ఠమైన పసిడి నిల్వలున్న గోల్డ్ ఫీల్డ్గా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత అమెరికాలోని నెవాడాలో కనుగొన్న ఫైర్ క్రీక్ భూగర్భ బంగారు గనిలో టన్ను ఖనిజం నుంచి గరిష్టంగా 44.1 గ్రాములు లభించింది. కానీ, మన కేజీఎఫ్ ‘గోల్డెన్’ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. కేజీఎఫ్ 120 ఏళ్ల జీవిత కాలంలో సగటున టన్ను ఖనిజాన్ని శుద్ధి చేస్తే 15 గ్రాముల బంగారం లభ్యమైంది.దక్షిణాఫ్రికాలో అతిపెద్ద గోల్డ్ మైన్ విట్ఫాటర్స్రాండ్ బేసిన్లో సగటు ఉత్పత్తి 9 గ్రాములే. 1956లో ప్రభుత్వం కేజీఎఫ్ను జాతీయం చేసింది. అప్పటిదాకా జాన్ టేలర్ కంపెనీ చేతిలోనే ఉండేది. కేజీఎఫ్ చరిత్రలో దాదాపు 1,000 టన్నుల బంగారం ఉత్పత్తి అయినట్లు అంచనా. ఇందులో చాలావరకు బ్రిటిషర్లే తన్నుకుపోయారు. అయితే, తలకు మించిన ఉత్పాదక వ్యయం, పర్యావరణ సమస్యలతో కేజీఎఫ్ 2021లో పూర్తిగా మూతబడింది. అప్పటికి ‘చాంపియన్’ రీఫ్ మైన్ భూగర్భంలో 3.2 కిలోమీటర్ల లోతు వరకు మైనింగ్ జరిగింది. ప్రపంచంలోని అత్యంత లోతైన బంగారు గనుల్లో ఒకటిగా చరిత్రి సృష్టించింది.భూగర్భంలో 1,400 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు కేజీఎఫ్ కింద విస్తరించి ఉన్నాయట. అప్పుడప్పుడూ అవి కుంగడం వల్ల ఇప్పటికీ కోలార్లో భూమి కంపిస్తుంది. ఇక ప్రస్తుతం భారత్లో ఉత్పత్తి జరుగుతున్న ఏకైక గోల్డ్ మైన్ హట్టి. ఇదీ కర్ణాటకలోనే (రాయచూరు) ఉంది. ఇప్పటిదాకా 84 టన్నుల బంగాన్ని వెలికితీశారు. టన్ను ఖనిజానికి 3 గ్రాముల బంగారమే లభ్యమవుతోంది. ఏటా 1.5 టన్నుల పసిడి ఇక్కడ లభిస్తోంది. కాగా, దేశంలో కనుగొన్న పసిడి నిల్వల్లో 88 శాతం కర్ణాటకలోనే ఉన్నాయి.వినియోగంలో భారత్, చైనాలే టాప్..2023లో ప్రపంచ బంగారు ఆభరణాల డిమాండ్లో 50 శాతం భారత్, చైనాల్లోనే నమోదవుతోంది. దీనికి తోడు పసిడి పెట్టుబడులు కూడా క్రమంగా ఎగబాకుతున్నాయి. 2023లో గనుల నుంచి 3,600 టన్నుల బంగారం వెలికితీయగా అందులో భారత్ దాదాపు 800 టన్నులు, చైనా 824 టన్నులు దిగుమతి చేసుకున్నాయి. తద్వారా వినియోగంలో భారత్ను అధిగమించింది చైనా. అయితే, భారత్ పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతుండగా. చైనా బంగారు ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండటం విశేషం.ద్రవ్యోల్బణానికి విరుగుడు... పెట్టుబడికి నిశ్చింత! ధరల పెరుగుదలకు సరైన విరుగుడు బంగారం. ఎందుకంటే ధరలు పెరిగే కొద్దీ.. కరెన్సీ విలువలు పడిపోతూనే ఉంటాయి. రాబడికి కూడా చిల్లు పడుతుంది. ఉదాహరణకు 5 ఏళ్ల వ్యవధికి ఓ లక్ష రూపాయలు బ్యాంకులో (ఫిక్స్డ్ డిపాజిట్) దాచుకుంటే సగటున 7 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం వచ్చే మొత్తం సుమారు రూ.1,41,500. అయితే, ద్రవ్యోల్బణం 7 శాతం గనుక ఉంటే, వచ్చే రాబడి సున్నా. పెట్టుబడి మాత్రమే మిగులుతుంది.ద్రవ్యోల్బణం మరింత పెరిగితే పెట్టుబడికీ చిల్లే! షేర్లు, బాండ్లు, క్రిప్టో కరెన్సీ, చివరికి బంగారం... ఇలా ఏ పెట్టుబడిలోనైనా ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుంది. అయితే, పసిడి పెట్టుబడులు మాత్రం దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించిన రాబడులే (రెండంకెల స్థాయిలో) అందిస్తున్నాయి. దానికితోడు ఏమాత్రం రిస్కులేని వ్యవహారం. పసిడి ధర ఐదేళ్లలో రెట్టింపునకు పైగా పెరిగింది. పదేళ్లలో నాలుగు రెట్లు ఎగబాకింది.స్టాక్ మార్కెట్లో (షేర్లలో) ఇంతకుమించి లాభాలొచ్చే వీలున్నా, అనుకోని పరిస్థితుల్లో మనం షేర్లు కొన్న కంపెనీ మూతబడితే అసలుకే మోసం రావచ్చు. నూటికి నూరు శాతం రిస్కుతో కూడుకున్నవి. ఇక భూమి, ఇళ్లు ఇతరత్రా స్థిరాస్తులు కూడా బంగారంలాగే రిస్కులేనివే! అయితే, పసిడి మాదిరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకుని సొమ్ము చేసుకునే అవకాశం వాటికి తక్కువ. అంతేకాదు, అతితక్కువ వడ్డీకే, బంగారంపై ఇట్టే రుణం కూడా పొందొచ్చు. అందుకే బంగారం అంటే భరోసా. పెట్టుబడికి ఢోకా లేకుండా, కష్టకాలంలో ఆదుకోవడంలో బంగారాన్ని మించింది మరొకటి లేదు!‘కంచు మోగినట్లు.. కనకంబు మోగునా’ అన్నట్లు.. ఎన్ని రకాల పెట్టుబడి సాధనాలున్నా పసిడికున్న విలువ, వన్నెకు సాటిరావు. అందుకే బంగారం ఎప్పటికీ బంగారమే! – శివరామకృష్ణ మిర్తిపాటి -
చిన్న ఉపాయమే ఈ సోలార్ ఫ్యాన్.. నాన్స్టాస్ వ్యాపారం!
ఎండ వేడిని భరించాలంటే ఎవరికీ సాహసపడదు. ఆ వేడినుంచి తప్పుకోడానికే శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ వ్యాపారాలు చేసేవాళ్లు, ఎండలో కష్టించి పనిచేసేవాళ్లు తప్పకుండా ఏదో ఒక ఉపాయమైతే చేస్తారు. అలాంటి ప్రయత్నమే.. ఓ హహిళ చేసింది. అదేంటో చూద్దాం. ఎండ తీవ్రత నుంచి తప్పించుకునేందుకు పండ్లు అమ్ముతున్న ఓ మహిళ వినూత్న ఆలోచన చేసింది. పైన గొడుగు ఉన్నా ఉక్కపోతనుంచి కాపాడుకునేందుకు బుల్లిఫ్యాన్ తెచ్చుకుంది.అందుకు సోలార్ప్యానెల్ తెచ్చి పక్కనే పెట్టి దానినుంచి వచ్చే విద్యుత్తో ఆ ఫ్యాన్ గిరాగిరా తిరుగుతుండగా చల్లని గాలిలో తన వ్యాపారం చేసుకుంటోంది. ఈ దృశ్యం జనగామ జిల్లాకేంద్రంలోని నెహ్రూ పార్క్ సెంటర్ వద్ద శుక్రవారం కనిపించగా ‘సాక్షి’ క్లిక్మనిపించింది. – ఫొటో: సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్ -
Health Tips: ఈ చిట్కాలతో.. మీ ఆరోగ్యం నిలకడగా..
ప్రతీరోజూ.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంచాలంటే ఎన్నో విధానాలు, జాగ్రత్తలు పాటించక తప్పదు. మరి ఈ టిప్స్తో మీ ఆరోగ్యం మీ చేతిలోనే.. మరి అవేంటో చూద్దాం.కిస్మిస్లలో జింక్, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. రాత్రిపూట కొన్ని కిస్మిస్లను తిని గోరువెచ్చటి నీరు తాగితే మరుసటి రోజు ఉదయం విరేచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. దీంతో పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. అలా కాకపోతే రాత్రి పూట కిస్మిస్లను నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం కూడా తినవచ్చు. ఎలా తిన్నా సమస్య నుంచి బయట పడతారు.బాదంపప్పులో ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. అందువల్ల బాదంపప్పును రోజూ తింటే పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇందుకు గాను బాదంపప్పును రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే వాటిని పొట్టు తీసి తినాలి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవడంతో΄ాటు మలబద్దకం తగ్గుతుంది. పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు.జామపండ్లలో విటమిన్లు, మినరల్స్ అనేకం ఉంటాయి. ఇవి దంతాలు, చిగుళ్ల సమస్యలు, జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. జామ పండ్లను తినడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. అలాగే పైల్స్ కూడా తగ్గిపోతాయి. రోజూ రాత్రి భోజనం చేసిన తరువాత నిద్రకు ముందు ఒక జామ పండును తింటే ఈ ప్రయోజనం కలుగుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.రోజూ పరగడుపునే మూడు లేదా నాలుగు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పెనంపై వేసి వేయించి వాటిని అలాగే తినాలి. నేరుగా తినలేం అనుకుంటే తేనెతో కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం నుంచి బయట పడతారు. మలబద్దకం తగ్గి పైల్స్ నుంచి విముక్తి పొందవచ్చు.జీర్ణ సమస్యలను తగ్గించడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ రాత్రి భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కను చప్పరిస్తూ తినాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. క్రమం తప్పకుండా రోజూ రాత్రి బెల్లం తింటే పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు.ఇవి చదవండి: Summer Special - ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త! -
Summer Special: ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త!
ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ లోనుంచి బాటిల్ తీసుకుని చల్లని నీళ్లు గటగటా తాగడం చాలా మందికి అలవాటే. విపరీతమైన వేడిలో మన శరీరానికి రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీరు కొంత ఉపశమనం కలిగించేమాట నిజమే అయినా ఇలా చేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగడం వల్ల గొంతు నొప్పి, టాన్సిలైటిస్ సమస్య మాత్రమే కాదు.. జీర్ణక్రియ నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు... చివరకు గుండెపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీటిని తాగడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. అదేవిధంగా ఆహారం తిన్న తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఘన ఆహారం సరిగా జీర్ణం కాదు. ఫలితంగా మలబద్ధకం వస్తుంది.అంతేకాదు, చల్లటి నీటిని తాగడం వల్ల ఈ నాడి చల్లబడుతుంది. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా తగ్గితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో వివిధ రకాల సమస్యలు సంభవిస్తాయి. చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు గట్టిపడుతుంది. ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది.అందువల్ల వీలయినంత వరకు ఎండలో నుంచి రాగానే చల్లటి నీళ్లు తాగకూడదు. అందులోనూ ఫ్రిజ్లోని నీళ్లు తాగడం అసలు మంచిది కాదు. కొంచెంసేపు ఆగిన తర్వాత కుండలోని నీళ్లు లేదా నార్మల్ వాటర్ ముందు తాగి, ఆ తర్వాత చల్లటి నీళ్లు తాగినా ఫరవాలేదు.ఇవి చదవండి: Summer Special: పిల్లల్లో... వ్యాధి నిరోధకత పెంచండిలా! -
Summer Special: పిల్లల్లో... వ్యాధి నిరోధకత పెంచండిలా!
వేసవి సెలవలు ఇచ్చేశారు. పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు. ఈ సమయంలోనే వారికి వ్యాధినిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెరిగే ఆహారాన్ని అందించడం వల్ల స్కూళ్లు తిరిగి తెరిచి, వర్షాలు పడినా కూడా చిన్నా చితకా వ్యాధులు రాకుండా ఉంటాయి. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలో తెలుసుకుందాం...సాధారణంగా పోషకాలన్నీ ఉన్న సమీకృత ఆహారం అందించడం వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది. అందుకు ఏం చేయాలో చూద్దాం...గుడ్డు: కోడిగుడ్డులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి. కండరాలు, చర్మం, గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచిది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్ ఎ, బి2 (రైబోఫ్లేవిన్) కోడిగుడ్డులో లభిస్తాయి.ఆకుకూరలు: ఆకుపచ్చటి ఆకుకూరలు, కొత్తిమీర, పాలకూర, ఈ సీజన్లో సమృద్ధిగా లభించే మునగకాడలు వంటివి తప్పనిసరిగా పెట్టాలి. వీటిలో ఫైబర్తోపాటు ఐరన్, జింక్, మినరల్స్ లభిస్తాయి.పెరుగు, మజ్జిగ: పెరుగులో ప్రొబయోటిక్స్, విటమిన్ బి12 లభిస్తాయి. ఇది పొట్టలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా ఫ్రూట్ యోగర్ట్, వెజిటబుల్స్ రైతా, బూందీ రైతా రూపంలో ఇవ్వొచ్చు.పసుపు: పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. పిల్లలకు రోజూ ఇచ్చే ఆహారంలో చిటికడు పసుపును చేర్చడం వల్ల ఆస్తమా, అలర్జీకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాలల్లో పసుపు వేసి తాగించడం అలవాటు చేయవచ్చు.బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్నట్స్, అప్రికాట్స్ వంటివి ఎక్కువగా తినిపించడం వల్ల మెదడు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభించడంతో పాటు పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది.ఇంకా సీజనల్ ఫ్రూట్స్ అయిన మామిడి, జామ, తాటిముంజలు, సపోటా వంటివి ఇవ్వాలి. పిల్లలకు స్వీట్స్, పంచదార ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలైన ఫ్రూట్జ్యూస్లు, చాక్లెట్స్, ΄్యాకేజ్డ్ స్నాక్స్ను ఎక్కువగా తినిపించకూడదు. ఇవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. ముఖ్యంగా పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి. గంటసేపైనా బయట ఆడుకునేలా ్రపోత్సహించాలి. ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది.ఇవి చదవండి: Health: ఇంతకీ.. పనీర్ స్వచ్ఛమైనదేనా? ఏం కొంటున్నామో! ఏం తింటున్నామో!! -
Health: ఇంతకీ.. పనీర్ స్వచ్ఛమైనదేనా? ఏం కొంటున్నామో! ఏం తింటున్నామో!!
పనీర్తో ఎన్ని రకాలు వండవచ్చో తెలుసా! అలాగే ఒక కేజీ పనీర్ తయారు కావాలంటే ఎన్ని పాలు కావాలో తెలుసా? పాలను విరగ్గొట్టి నీరు మొత్తం కారిపోయే వరకు బరువు పెట్టి ఎదురు చూసే సమయం ఎవరికీ ఉండడం లేదు. పైగా మనం ఇంట్లో తయారు చేసే పనీర్ మెషీన్లో చేసినట్లు క్యూబ్స్గా రావడం కష్టం. రెస్టారెంట్లో తిన్న పనీర్లాగ ముక్కలుగా ఉంటే తప్ప పిల్లలు ఇష్టపడరు. ఇంకేం చేస్తాం... రెడీమేడ్గా మార్కెట్లో దొరికే పనీర్ తెచ్చుకుని సింపుల్గా వండేస్తాం.పనీర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసిన తర్వాత ఇటీవల పనీర్ వాడకం పెరిగింది. అయితే వాడకం పెరిగినంత వేగంగా పనీర్ తయారీ పెరుగుతోందా? పనీర్ లభ్యత పెరుగుతోంది కానీ సహజమైన పనీర్ తయారీ జరగడం లేదు. మార్కెట్లో దొరికే పనీర్లో అసలు కంటే నకిలీ ఎక్కువ.ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల ఢిల్లీ– ముంబయి ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్న ఫుడ్ స్టాల్స్ను తనిఖీ చేసినప్పుడు 13వందల కిలోల నకిలీ పనీర్ దొరికింది. దొరికింది గోరంతే, నిజానికి నకలీ పనీర్ వ్యాపారం కొండంత జరుగుతోంది. మనం ఇంట్లో వండుకోవడానికి కొనుక్కున్న పనీర్ అసలుదా కల్తీదా అని తెలుసుకోవడానికి ఇంట్లోనే పరీక్షించుకోవడానికి మూడు పద్ధతులను తెలియచేసింది ఎఫ్ఎస్ఎస్ఏఐ.పనీర్ కొద్దిగా ఒక పాత్రలోకి తీసుకుని నీరు పోసి వేడి చేసి అందులో నాలుగైదు చుక్కల అయోడిన్ వేయాలి. పనీర్ నీలం రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం. అసలైన పనీర్ అయితే రంగు మారదు.పనీర్ని నీటిలో ఉడికించిన తర్వాత చల్లటి నీటిలో వేయాలి. అదే నీటిలో కందిపప్పు పది గింజలు వేయాలి. పది నిమిషాల సేపు కదిలించకుండా ఉంచాలి. నీరు లేత ఎరుపు రంగులోకి మారితే ఆ పనీర్ కల్తీ అని అర్థం. రంగు మారకపోతే నిర్భయంగా ఆ పనీర్ను వాడుకోవచ్చు.ఇంత ప్రక్రియ లేకుండా వాసన ద్వారా కూడా పనీర్ స్వచ్ఛతను గుర్తించవచ్చు. కంపెనీ ప్యాకింగ్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ముద్ర లేకుండా లూజ్గా అమ్ముతుంటారు. ఆ పనీర్ను కొద్దిగా చేతిలోకి తీసుకుని వాసన చూడాలి. పాల వాసన వస్తే అది మంచి పనీర్. అప్పుడు రుచి చూడవచ్చు. మెత్తగా పాల రుచిని గుర్తు చేస్తుంటే కొనుక్కోవచ్చు. అలా కాక నమిలినప్పుడు రబ్బర్లాగ సాగుతుంటే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దు. అలాగే పాలతో చేసిన పనీర్ అయినా సరే పుల్లటి వాసన వస్తుంటే అది సహజమైనదే అయినా తాజాగా లేదని అర్థం. దానిని కూడా కొనకూడదు.నిర్ధారిత అధీకృత ముద్ర, కంపెనీ ప్యాకింగ్ ఉన్న పనీర్ కొనేటప్పుడు కూడా దాని కాల పరిమితిని సరి చూసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ చూడకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు.పాల ఉత్పత్తిని మించిన పాల ఉత్పత్తులు మార్కెట్లో రాజ్యమేలుతున్నాయి. పాల వ్యాపారులు ఒకప్పుడు పాలను కల్తీ చేసేవాళ్లు. ఇప్పుడు నకిలీ పాలను తయారు చేస్తున్నారు. మనం ఏం తింటున్నామో? ఎక్కడ తింటున్నామో? ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలి. మన గురించి మనమే నిశితంగా పరిశీంచుకోవాలి, పరీక్షించుకోవాలి. -
Shahnaz Habib: 'ప్రయాణాల వెనుక రాజకీయాలు'.. ఉంటాయని తెలుసా..!
వేసవి వస్తే ప్రయాణాలు గుర్తుకు వస్తాయి. విమానం ఎక్కితే మొబైల్ ఫోన్ను ఎయిర్ప్లేన్ మోడ్లో ఉంచాలి. కాని ఈ ప్రయాణాల వెనుక చాలా రాజకీయాలు ఉంటాయంటోంది షెహనాజ్ హబీబ్. అమెరికాలో ప్రొఫెసర్గా ఉన్న ఈ కేరళ వనిత స్థానిక సంపదను ‘డిస్కవరీ’ చేయడానికే సామ్రాజ్యవాదులు ప్రయాణాలు చేశారని చెబుతుంది. సగటు మనిషి ప్రయాణాలకు ఎన్ని అడ్డంకులున్నాయో ఆమె పుస్తకం ‘ఎయిర్ప్లేన్ మోడ్’ విశదంగా తెలియజేస్తోంది. ట్రావెల్ రైటర్ షెహనాజ్ పరిచయం.‘ప్రయాణాల్లో కూడా వివక్ష ఉంటుంది’ అంటుంది షహనాజ్ హబీబ్. ‘మీ ఒంటి రంగు, మీ పాస్పోర్ట్ రంగు మీ ప్రయాణం సులభం చేయవచ్చో, జటిలం చేయవచ్చో నిర్ణయిస్తాయి’ అంటుందామె. అమెరికాలోని బే పాత్ యూనివర్సిటీలోప్రొఫెసర్గా పని చేసే షహనాజ్ హబీబ్ కేరళలోని ఎర్నాకుళంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించింది. కాని ఆమె నేర్చిన ఇంగ్లిష్ భాష, ఆమె వ్యక్తీకరణ ఆమెకు విశేషమైన గుర్తింపు తెచ్చి పెట్టింది. అమెరికాలోని వ్యాసకర్తల్లో ఆమెకు గుర్తింపు ఉంది. న్యూయార్క్ టైమ్స్లో షహనాజ్ హబీబ్ వ్యాసాలు వస్తాయి.కేరళ రచయిత బెన్యమిన్ రాసిన ఒక నవలను ‘జాస్మిన్ డేస్’ పేరున షహనాజ్ మలయాళంలో అనువదిస్తే ప్రతిష్టాత్మక 25 లక్షల రూపాయల జె.సి.బి. పురస్కారం లభించింది. కవిత్వం, కథలతో పాటు ట్రావెలోగ్స్ కూడా రాసే షహనాజ్ ఇటీవల వెలువరించిన యాత్రా కథనం ‘ఏరోప్లేన్ మోడ్’. అమెరికాలోనూ ఇండియాలోనూ విడుదలైన ఈ పుస్తకం యాత్రల విషయంలో కొత్త చూపును కలిగిస్తోంది.‘ప్రపంచ దేశాల పర్యటనలు తెల్లవాళ్లకు ఒక రకంగానూ రంగు తక్కువ ఆసియా, ఆఫ్రికా దేశాల వారికి ఒక రకంగానూ జరుగుతాయి. అమెరికా, యూరప్ దేశాల వారి తెల్లరంగు చూడగానే వారి ప్రయాణాలకు ఒక విలువ, గౌరవం ఉన్నాయని భావిస్తారు. వారిని అధికారులు చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. అదే బ్రౌన్, బ్లాక్ కలర్ ఉన్నవారికి అన్నీ ఆటంకాలే. ఇక అమెరికా పాస్పోర్ట్ ఉండి, వారు తెల్లవారైతే వారికి వీసా క్యూలన్నీ లేనట్టే. అమెరికా పాస్పోర్ట్ ఉంటే చాలా దేశాలకు అసలు వీసాయే అక్కర్లేదు. అంటే ఒక మనిషికి ప్రయాణ గౌరవం పాస్పోర్ట్ వల్లే వస్తోందన్న మాట. దీనినే నేను పాస్పోర్టిజమ్ అంటాను’ అంటుంది షహనాజ్.సంస్కృతి, సంపదల కోసం..‘17, 18 శతాబ్దాల్లో యాత్రీకులకు యూరప్ ప్రభుత్వాలు నిధులు ఇచ్చేవి. అలా ఇచ్చేది యాత్రికులను గౌరవించడానికి కాదు. వారు దేశ దేశాలు తిరిగి అక్కడి సంస్కృతులు, పంటలు, డబ్బు, బంగారం, వస్త్రాలు, మతాలు... వీటన్నింటి గురించి సమాచారం తెస్తే ఏ దేశాన్ని ఏ విధంగా కబళించవచ్చో ఆ ప్రభువులకు తెలిసేది. ఖండాలు, దేశాలు వాటిలోని ప్రజలు అనాదిగా జీవిస్తున్నా ఈ యూరోపియన్ యాత్రికులు వారిని ‘డిస్కవరీ’ చేశామని చరిత్రలు రాసుకున్నారు. కాని ఆ చరిత్రల్లో స్థానికులను ఏ విధంగా తుడిచి పెట్టారో ఉండదు.అలాగే ఇప్పుడు బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ల నుంచి ప్రపంచం తిరిగే పర్యాటకులకు వారి దేశాల్లోని పాఠ్య పుస్తకాల్లో తమ దేశాలు ఏయే దేశాలను ఎలా ఆక్రమించాయి, ఎలా దోచుకున్నాయో తెలియజేయరు. యాత్రల వెనుక చాలా చరిత్ర ఉంటుంది. అది తెలుసుకోవడం అవసరం’ అంటుంది షహనాజ్.ఎన్నో అందాలు..‘టూరిజమ్ను ఒక వ్యసనంగా మార్చారు. దీని వెనుక చాలా వ్యాపార ఎత్తుగడ ఉంది. కొత్త ప్రాంతాలు చూడకపోతే వెనుకబడతారనే భావజాలం సృష్టించారు. మా నాన్న ఎక్కడికీ తిరగడానికి ఇష్టపడేవాడు కాదు. మా అమ్మకు కొత్త ప్రాంతాలు చూడటం ఇష్టం. ఇద్దరూ కరెక్టే. ఈ టూరిజమ్లో కూడా తెల్లవారి దేశాలకే గిరాకీ ఎక్కువ. కాని ఆఫ్రికాలో ఎన్నో అందమైన దేశాలు ఉన్నాయి. ఇథియోపియాలోని అండర్గ్రౌండ్ చర్చ్లను చూస్తే మతి పోతుంది. కాని వాళ్లకు ప్రమోట్ చేసుకోవడానికి డబ్బు లేదు. ప్రతి దేశంలో సాంస్కృతిక చిహ్నాలుంటాయి. వాటి ఘన చరిత్ర ఉంటుంది. అయితే దానిని వర్తమానంలో ప్రతీకారాలకు ఉపయోగించకూడదు’ అంటుందామె. – షెహనాజ్ హబీబ్ -
Summer Special: వేసవిని తట్టుకునేలా.. కంఫర్ట్ & స్టైలిష్గా లాంగ్ ఫ్రాక్స్
వేసవి వేడిమిని తట్టుకోవాలి, కంఫర్ట్గా ఉండాలి అదే టైమ్లో స్టైలిష్గానూ కనిపించాలి. కాటన్ కుర్తీ పైకి బాందినీ, చందేరీ, ఇకత్, సిల్క్ ఓవర్ కోట్లు ఇప్పుడు బెస్ట్ ఛాయిస్గా ఉంటున్నాయి. బోహోస్టైల్ని తలపిస్తూ, సమ్మర్ స్పెషల్గా ఉండే ఈ స్టైల్ ఏ సందర్భానికైనా బాగా నప్పుతుంది.కలర్ఫుల్గా.. కంఫర్టబుల్గా..సంప్రదాయ వేడుకల్లో షిమ్మరీ లుక్ ఉండే లాంగ్ ఫ్రాక్ట్, వాటి మీదకు సిల్క్ డిజైనర్ లాంగ్ ఓవర్ కోట్స్ ప్రత్యేకతను చూపుతాయి.లాంగ్ ఫ్రాక్ లేదా లాంగ్ కుర్తీ ఈ స్టైల్కి ఎంచుకోవచ్చు. సౌకర్యాన్ని బట్టి స్లీవ్స్ లేదా స్లీవ్లెస్ టాప్స్ని సెలక్ట్ చేసుకోవాలి. కాటన్ కుర్తీ ఏ ఫ్యాబ్రిక్ అయినా ఫ్లోరల్స్లో లేదా భిన్నమైన ప్రింట్లు ఉన్న ఓవర్ కోట్స్ బాగా నప్పుతాయి. ఈ స్టైల్ డ్రెస్సింVŠ బోహో లుక్తో అట్రాక్ట్ చేస్తుంది. ఈ కాలానికి తగినట్టుగా ఫ్యాషన్ జ్యువెలరీ దీనికి సరైన ఎంపిక అవుతుంది.కాటన్ కుర్తీ–పైజామా మీదకు ఫ్లోరల్ ప్రింట్ ఉన్న కాటన్ ఓవర్కోట్ను ధరించవచ్చు. దుపట్టా అవసరం లేని ఈ స్టైల్ క్యాజువల్ వేర్గానూ, పార్టీవేర్గానూ సెట్ అవుతుంది.కాటన్ లాంగ్ కుర్తీకి ఇక్కత్ లాంగ్ ఓవర్ కోట్ ధరిస్తే ఉక్కబోతను, స్టైల్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయవచ్చు.సింపుల్ అండ్ గ్రేస్గా కనిపించే లుక్ టాప్ అండ్ బాటమ్కి ఫ్లోరల్ ఓవర్ లాంగ్ కోట్ సూపర్ స్టైలిష్ లుక్గా కనిపిస్తుంది. ప్లెయిన్ డ్రెస్ ధరించినప్పుడు పూర్తి కాంట్రాస్ట్ ఓవర్ కోట్ వేసుకుంటే ఎక్కడ ఉన్నా స్పెషల్గా కనిపిస్తారు.లాంగ్ ఫ్రాక్కి అటాచ్ చేసినట్టుగా ఉండే ఫ్రాక్ స్టైల్ ఓవర్ కోట్ పార్టీలో స్టైలిష్ లుక్తో వెలిగిపోతుంది.ఓవర్కోట్లా అనిపించే లాంగ్ ఫ్రాక్ డ్రెస్ను కూడా ఈ స్టైల్కి ఎంపిక చేసుకోవచ్చు. సమ్మర్లో ఈవెనింగ్ పార్టీకి స్పెషల్ అట్రాక్షన్గా వెలిగి΄ోవచ్చు.సిల్క్ టాప్స్ అయినా ఈవెనింగ్ టైమ్కి ఓకే అనుకున్నవారు అదే కాంబినేషన్లో వచ్చే సిల్క్ ఓవర్ కోట్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.ఇదీ చదవండి: Madhumita Murgia: డీప్ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు! -
ఈ సమ్మర్ సీజన్లో.. నేరుగా 'చల్లని పెరుగుతోనే వెరైటీ కర్రీలు'!
మే నెల వచ్చేసింది... ఎండలు మండుతున్నాయి. భోజనం చేయాలంటే చెమటలు పడుతున్నాయి. కూరలను చూస్తేనే ఆకలి పోయి దాహం వేస్తోంది. నేరుగా మజ్జిగలోకి వెళ్లాలనిపించేంత దాహం అది. అందుకే పెరుగుతోనే కూరలు చేసుకుందాం. ఇవన్నీ నాలుకకు హితవుగా ఉంటాయి. తిన్న తర్వాత పొట్టను చల్లగా ఉంచుతాయి.దహీ బైంగాన్..కావలసినవి.. వంకాయ – 1 (మీడియం సైజు); నూనె – టేబుల్ స్పూన్ (వంటకు ఉపయోగించే నూనె ఏదైనా) ; ఆవనూనె – టేబుల్ స్పూన్ (పోపు కోసం) ; యాలకులు – 2 ; లవంగాలు – 2 ; పెరుగు – పావు లీటరు (చిలకాలి). గ్రేవీ కోసం: మెంతిపిండి – టేబుల్ స్పూన్ ;అల్లం పేస్ట్ – టేబుల్ స్పూన్ ; కశ్మీర్ మిర్చిపౌడర్ – టేబుల్ స్పూన్ ; నీరు – కప్పు (పై వన్నీ కలపడానికి) ; ఇంగువ– చిటికెడు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; పసుపు – టీ స్పూన్.తయారీ..ఒక పాత్రలో కప్పు నీరు పోసి అందులో మెంతిపిండి, మిర్చిపౌడర్, అల్లం పేస్టు వేసి కలపాలి.వంకాయను మందపాటి చక్రాల్లా తరిగి ఉప్పు రాయాలి.నూనె వేడి చేసి వంకాయ ముక్కలను వేయించి పక్కన పెట్టాలి(ఎయిర్ ఫ్రయర్ ఉంటే నూనె లేకుండా ఫ్రై చేసుకోవచ్చు)అదే బాణలిలో మిగిలిన నూనెలో ఆవ నూనె వేసి వేడెక్కిన తర్వాత లవంగాలు, యాలకులు, ఇంగువ వేయాలిఇందులో మెంతిపిండి, అల్లం, మిరప్పొడి కలిపిన మిశ్రమం, పసుపు వేసి కలిపి సన్న మంట మీద మరిగించాలిఆ మిశ్రమం వేడెక్కిన తర్వాత పెరుగు వేసి గరిటెతో కలుపుతూ ఐదారు నిమిషాల పాటు మరిగించాలిమిశ్రమం మరగడం మొదలైన తర్వాత మరో కప్పు నీటిని పోసి కలిపితే చిక్కటి గ్రేవీ తయారవుతుందిఇప్పుడు ఉప్పు కలిపి గ్రేవీ చిక్కదనాన్ని సరిచూసుకుని అవసరమైతే మరికొన్ని నీటిని పోసి మరగనివ్వాలిఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి కలిపి వడ్డించాలిఇది అన్నంలోకి రోటీకి కూడా మంచి కాంబినేషన్.పులిస్సెరి..కావలసినవి.. పెరుగు – పావు లీటరు ; పసుపు – పావు టీ స్పూన్ ; నీరు – పావు లీటరు. కొబ్బరి పేస్టు కోసం: పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు ; పచ్చిమిర్చి– 3 ; జీలకర్ర– టీ స్పూన్; నీరు – కప్పు లేదా కొబ్బరి పేస్టు చేయడానికి తగినంత.పోపు కోసం: నూనె – 2 టేబుల్ స్పూన్లు (వంటకు ఉపయోగించే కొబ్బరి నూనె లేదా ఇతర వంట నూనె) ; ఆవాలు – అర టీ స్పూన్ ; కరివేపాకు – 2 రెమ్మలు ; మెంతులు– పావు టీ స్పూన్ ; ఎండుమిర్చి– 2 ; ఉల్లిపాయ ముక్కలు– పావు కప్పు ; అల్లం – అర అంగుళం ముక్క (సన్నగా తరగాలి) ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీలో గ్రైండ్ చేయాలి. తగినంత నీటిని వేస్తూ మెత్తగా చేసుకోవాలిఒక పాత్రలో పెరుగు, పసుపు, నీరు కలిపి చిలికి అందులో ఉప్పు, కొబ్బరి పేస్టు వేసి కలపాలిఈ పాత్రను స్టవ్ మీద పెట్టి మీడియం మంటమీద మధ్యలో గరిటెతో కలుపుతూ వేడిచేయాలి.దీనిని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. మరగడం మొదలైన వెంటనే దించేయాలిబాణలిలో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు వేసి చిన్న మంట మీద మగ్గనివ్వాలిఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత పోపును ముందుగా వేడి చేసి సిద్ధంగా ఉంచిన పెరుగు– కొబ్బరి పేస్టు మిశ్రమంలో కలిపి, కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. ఈ కేరళ వంట అన్నంలోకి రుచిగా ఉంటుంది.గుజరాతీ కడీ..కావలసినవి: శనగపిండి– 4 టేబుల్ స్పూన్లు; అల్లం పచ్చిమిర్చి పేస్ట్– అర టేబుల్ స్పూన్ (అల్లం అంగుళం ముక్క, రెండు పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేయాలి); తాజా పెరుగు – కప్పు ; బెల్లం లేదా చక్కెర – టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నీరు – రెండున్నర కప్పులు. పోపు కోసం: నూనె – టీ స్పూన్ ; ఆవాలు – అర టీ స్పూన్ ; జీలకర్ర– అర టీ స్పూన్ ; దాల్చిన చెక్క – అంగుళం ముక్క ; లవంగాలు – 2 ; కరివేపాకు – ఒక రెమ్మ ; ఎండు మిర్చి – 2; మెంతులు – పావు టీ స్పూన్ ; ఇంగువ – చిటికెడు ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..ఒక పాత్రలో శనగపిండి, అల్లం–పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, బెల్లం, ఉప్పు వేసి బాగా చిలకాలిబాణలిలో నూనె వేడిచేసి ఆవాలు వేయాలిఅవి పేలిన తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు, ఎండు మిర్చి (విరిచి వేయాలి), మెంతులు, ఇంగువ వేసి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలిఈ పోపును ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగు – శనగపిండి మిశ్రమంలో వేసి కలపాలిఇప్పుడు ఆ పాత్రను మీడియం మంట మీద ఉంచి మిశ్రమం అడుగుకు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలిమిశ్రమం మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి కలుపుతూ మాడకుండా చూసుకోవాలిశనగపిండి పచ్చి వాసన పోయిన తర్వాత మిశ్రమం మంచి రుచికరమైన వాసన వస్తుంటుంది. అప్పుడు కొత్తిమీర చల్లి దించేయాలిగుజరాతీ కడీని సూప్లాగ భోజనానికి ముందు తాగవచ్చు. అన్నంలో కలుపుకోవచ్చు, రోటీలోకి కూడా తినవచ్చు. ఇది వేసవి, శీతాకాలాల్లో కూడా ఆరోగ్యకరమైన ఆహారం.గుజరాతీ కడీ, కుకురార్కుకురార్..కావలసినవి.. చికెన్ – అర కేజీ ; చిక్కటి పెరుగు – 5 టేబుల్ స్పూన్లు ; బంగాళదుంప – 2 (ముక్కలుగా తరగాలి) ; అల్లం వెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు ; ఉల్లిపాయలు – 3 (తరగాలి) ; ఆవ నూనె లేదా సాధారణ వంటనూనె – 5 టేబుల్ స్పూన్లు ; చక్కెర – చిటికెడు ; ఉప్పు – 2 టీ స్పూన్లు లేదా రుచిని బట్టి ; ఎండు మిర్చి– 5 ; పచ్చిమిర్చి– 3 (నిలువుగా చీరాలి) ; పసుపు – టీ స్పూన్ ; మిరప్పొడి– 2 టీ స్పూన్లు ; గరం మసాలా పొడి – టీ స్పూన్ ; చికెన్ మసాలా పొడి– టీ స్పూన్ ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..చికెన్ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేయాలి.అందులో పసుపు, చికెన్ మసాలా పొడి, మిరప్పొడి వేసి మసాలా పొడులు చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్లు కలిపి 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలిఈ లోపు ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో ఇంగువ, చక్కెర, ఎండు మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలిఇవి చల్లారిన తరవాత మిక్సీలో గ్రైండ్ చేయాలి.అందులోనే పెరుగు కూడా వేసి సమంగా కలిసేటట్లు ఒకసారి తిప్పి ఒక పాత్రలోకి తీసుకుని పక్కన పెట్టాలిఉల్లిపాయలు వేయించిన బాణలిలో మిగిలిన నూనెలో బంగాళాదుంప ముక్కలు వేయించి ఒక పాత్రలోకి తీసుకుని పక్కన ఉంచాలిఅదే బాణలిలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయించి తీసి పెట్టుకోవాలిఇప్పుడు మిగిలిన నూనెలో మారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి మీడియం మంట మీద వేయించాలిచికెన్ ముక్కలు ఎర్రగా వచ్చేవరకు వేయించి అప్పుడు ఉప్పు వేసి ముక్కలకు పట్టేటట్లు కలపాలిచికెన్ ముక్కల నుంచి నూనె వేరవుతున్న సమయంలో బంగాళాదుంప ముక్కలను వేయాలిఈ రెండింటినీ కలిపి పది నిమిషాల పాటు వేయించిన తర్వాత అందులో రెండు కప్పుల నీరు పోసి కలిపి మంట పెంచి ఉడకనివ్వాలిచికెన్ ఉడికేటప్పుడు అందులో ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చితోపాటు గరం మసాలా పొడి, చిలికిన పెరుగు మిశ్రమాన్ని వేయాలిఇవన్నీ కలిసి ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. ఈ కుకురార్ అస్సాం వాళ్ల వంట. అన్నం, రోటీల్లోకి రుచిగా ఉంటుంది.ఇవి చదవండి: Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు.. -
'సముద్ర గర్భం'లోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ గేమ్ ట్రై చేయండి!
సముద్ర గర్భంలోకి వెళ్లడం అంటే మరో ప్రపంచంలోకి వెళ్లినట్లే. పరిచిత, అపరిచిత, వింత, క్రూర.. రకరకాల జీవులు మనకు సవాలు విసురుతాయి. సాహసం ఏమాత్రం నీరు కారి΄ోయినా జీవితం నీటిపాలు కావాల్సిందే. అందుకే సముద్ర గర్భంలో ప్రతి క్షణం...విలువైన సాహసమే. సముద్ర గర్భంలో సాహస యాత్ర చేయాలని ఉందా? అయితే ఈ గేమ్ మీ కోసమే.అడ్వెంచర్ సిమ్యూలెషన్ గేమ్ ‘ఎండ్లెస్ ఒషియన్ లుమినస్’ విడుదలైంది. జపాన్ గేమింగ్ కంపెనీ ‘అరిక’ డెవలప్ చేసిన గేమ్ ఇది. ‘ఎండ్లెస్ ఓషన్’ సిరీస్లో వస్తున్న థర్డ్ గేమ్. సముద్రగర్భ ప్రపంచాన్ని రికార్డ్ చేయడానికి ఈ గేమ్లో ప్లేయర్ స్కూబా డైవర్ పాత్ర పోషించాల్సి ఉంటుంది.ప్లాట్ఫామ్: నిన్టెండో స్విచ్,జానర్స్: అడ్వెంచర్, సిమ్యులేషన్,మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీ ప్లేయర్ -
Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
సోషల్ ఎంటర్ప్రెన్యూర్గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన హరి ప్రసాద్. ఈఎస్జీ (ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) మేనేజ్మెంట్కు సంబంధించి మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు, కార్పోరేషన్లకు సహాయపడడానికి ‘బియాండ్ సస్టెయినబిలిటీ’ అనే స్టార్టప్ను ప్రారంభించాడు.పది మందికి మేలు చేసే వ్యక్తులు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల గురించి విన్నప్పుడు, చదివినప్పుడు హరి ప్రసాద్ భావోద్వేగంతో కదిలిపోయేవాడు. ఫ్రీడమ్ ఫైటర్స్కు సంబంధించిన సినిమాలను చూసినప్పుడల్లా ‘నా వంతుగా సమాజానికి ఏదైనా చేయాలి’ అనుకునేవాడు.జీవితానికి పరమార్థం ఉండాలనే భావన చిన్న వయసులోనే హరి ప్రసాద్లో మొలకెత్తింది. కాలేజీ సెకండ్ ఇయర్లో వాతావరణ మార్పులపై వచ్చిన ఎన్నో డాక్యుమెంటరీలను చూశాడు. ‘ఇలా చూస్తూ బాధ పడాల్సిందేనా! నా వంతుగా ఏమీ చేయలేనా’ అనుకుంటూ ‘తప్పకుండా ఏదైనా చేయాలి’ అనే పట్టుదలతో క్లైమెట్ యాక్షన్ వైపు అడుగులు వేశాడు.ఆ పచ్చటి అడుగులు ‘బియాండ్ సస్టెయినబిలిటీ’ అనే స్టార్టప్ మొదలు పెట్టేలా చేశాయి. ఈఎస్జీ (ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) ప్రకారం పర్యావరణానికి సంబంధించి ఉన్నతస్థాయి ప్రమాణాలను సాధించడానికి మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు, పెద్ద సంస్థలకు ఈ స్టార్టప్ తోడ్పడుతోంది.‘ఆర్గనైజేషన్స్కు నాలెడ్జి పార్ట్నర్స్గా వ్యవహరిస్తాం’ అంటున్నాడు హరి ప్రసాద్. సస్టెయినబిలిటీ, బాటమ్–లైన్ చాలెంజెస్కు సంబంధించి సంస్థల విజన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా కార్బన్ మేనేజ్మెంట్పై దృష్టి పెడుతోంది బియాండ్ సస్టెయినబిలిటీ. కంపెనీల పర్యావరణ ప్రమాణాలకు సంబంధించి బేస్లైన్ స్టడీని నిర్వహిస్తోంది. కర్బన ఉద్గారాలు, వ్యర్థాల ఉత్పత్తి, మెటీరియల్ వినియోగం, కంపెనీ ఉద్యోగులలో వైవిధ్యం... మొదలైన అంశాలు ఇందులో ఉంటాయి.రకరకాల విషయాను దృష్టిలో పెట్టుకొని యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తారు. కంపెనీలకు సంబంధించి షార్–్ట టర్మ్, మిడ్–టర్మ్, లాంగ్–టర్మ్ టార్గెట్లను సెట్ చేస్తారు. కెపాసిటీ డెవలప్మెంట్, కార్బన్ మేనేజ్మెంట్, ఈఎస్జీ మేనేజ్మెంట్, క్లెమేట్ చేంజ్....మొదలైన వాటిపై ఆన్లైన్, ఆఫ్లైన్లలో ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించింది బియాండ్ సస్టేనబిలిటీ.అవగాహన సదస్సుల ద్వారా 65కు పైగా కంపెనీలకు, వందలాది మంది ప్రజలకు దగ్గరైంది. తయారీ ప్రక్రియలో వాతావరణ ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఈ సదస్సులు కంపెనీలకు ఉపయోగపడుతున్నాయి.‘బియాండ్ సస్టెయినబిలిటీ వోఎస్’ పేరుతో టెక్ ప్లాట్ఫామ్ కూడా బిల్ట్ చేశారు. కంపెనీల పాస్ట్ పర్ఫార్మెన్స్తో పోల్చుతూ విశ్లేషణ చేయడమే కాదు సస్టెయినబిలిటీ పర్ఫార్మెన్స్ను మెరుగుపరుచుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. స్థూలంగా చెప్పాలంటే... కంపెనీల మైండ్సెట్ మార్చడంలో, పర్యావరణ స్పృహ వైపు నడిపించడానికి ‘బియాండ్ సస్టేనబిలిటీ’ కీలక పాత్ర పోషి స్తోంది.స్టార్టప్కు ముందు..డిగ్రీ పూర్తి చేసిన తరువాత వాతావరణ మార్పుల గురించి లోతుగా తెలుసుకోవడానికి నెదర్ల్యాండ్స్లోని ‘యూనివర్శిటీ ఆఫ్ ట్వంటే’లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేశాడు హరి ప్రసాద్. కర్బన ఉద్గారాలు తగ్గించడానికి సంబంధించిన ఎన్నో ప్రయోగాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తన స్టార్టప్ మొదలు పెట్టడానికి ముందు ‘ఎస్పీ ఎడ్జ్’ అనే సోషల్ స్టార్టప్లో పనిచేసి ఎంతో అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. – హరి ప్రసాద్ -
కొత్త టెక్నాలజీ పరికరాలతో ఆరోగ్య సమస్యలకు చెక్! ఎలా అంటే?
మారుతున్న టెక్నాలజీ పరంగా.. మానవ అవసరాలను, ఆరోగ్య సమస్యలను తీర్చే సరికొత్త టెక్నాలజీ పరికరాలు కూడా చాలానే వస్తున్నాయి. అందులో ఎన్నోరకాల పరికరాలను చూసుంటాం. మోకాళ్ల నొప్పులను, వినికడి లోపాలను సరిచేసేటువంటి వీటిని మీరెప్పుడైనా వాడటంగానీ, చూడటంగానీ చేశారా..! అవేంటో మరి చూద్దామా..మోకాలి నొప్పులకు చెక్!ఆటలాడేటప్పుడు గాయాలు కావడం వల్ల కొందరు మోకాలి నొప్పుల బారినపడుతుంటారు. ఇంకొందరు కీళ్ల అరుగుదల వల్ల మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. నొప్పులు తగ్గడానికి రకరకాల మందులు వాడుతుంటారు. కాపడాలు పెట్టించుకుంటుంటారు. వీటి వల్ల వచ్చే ఉపశమనం అంతంత మాత్రమే! మోకాలి నొప్పుల నుంచి సత్వర ఉపశమనం కలిగించేందుకు అమెరికన్ కంపెనీ ‘నీ ఫ్లో’ హెల్మెట్ ఆకారంలో ఉన్న ఈ మసాజర్ను రూపొందించింది.ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. మోకాలికి దీనిని బిగించి కట్టుకుని, దీనికి ఉన్న స్విచ్ను ఆన్ చేసుకుంటే చాలు– దీని లోపలి వైపు నుంచి కాంతి, వేడి వెలువడటమే కాకుండా, లయబద్ధంగా వెలువడే ప్రకంపనలు మోకాలి కీళ్లకు కండరాలకు మర్దన చేస్తాయి. దీని వల్ల వాపు, నొప్పి ఉన్న భాగాల్లో రక్తప్రసరణ మెరుగుపడి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.అలాగే కీళ్ల కదలికలు త్వరగా చురుకుదనాన్ని పుంజుకుంటాయి. ‘నీ ఫ్లో’ మసాజర్ మోకాలి ఉపరితలానికి మాత్రమే కాకుండా, లోపలి భాగాలకు కూడా ఫిజియో థెరపీ అందిస్తుంది. దీని ధర 249 డాలర్లు (రూ.20,775) మాత్రమే!కళ్లకు జోడు.. చెవులకు తోడు..ఇది కళ్లజోడులా కనిపిస్తుంది. అలాగని కేవలం కళ్లజోడు మాత్రమే కాదు, వినికిడి సమస్యలు ఉన్నవారి చెవులకు తోడు కూడా. అంటే, ఇది స్పెక్టకిల్ కమ్ హియరింగ్ ఎయిడ్ అన్నమాట! జర్మన్ కంపెనీ ‘ఆడియా అకాస్టిక్’ ఈ స్పెక్టకిల్ కమ్ హియరింగ్ ఎయిడ్ను ‘బ్రకాఫ్’ బ్రాండ్ పేరుతో ‘స్పెక్టకిల్ ఎయిడ్’గా రూపొందించింది.దృష్టి లోపాలు, వినికిడి సమస్యలు రెండూ ఉన్నవారికి ఇదొక వరమనే చెప్పాలి. ఇందులోని కళ్లద్దాలు దృష్టిని స్పష్టం చేస్తాయి. కళ్లజోడు చెవులకు పెట్టుకునే భాగంలో చివరివైపు ఉన్న హియరింగ్ ఎయిడ్ శబ్దాలను స్పష్టంగా వినేందుకు దోహదపడుతుంది. మిగిలిన హియరింగ్ ఎయిడ్ పరికరాల మాదిరిగా దీనిని చెవి లోపల పెట్టుకోనవసరం లేదు. మామూలు కళ్లజోడు తొడుక్కున్నట్లే పెట్టుకుంటే సరిపోతుంది.దృష్టి లోపాలు లేకుండా వినికిడి సమస్యలు మాత్రమే ఉన్నవారు జీరో పవర్ గ్లాసెస్తో తీసుకుని, దీనిని తొడుక్కుంటే చాలు. కోరుకున్నంత ధ్వనిలో శబ్దాన్ని వినేందుకు వీలుగా ఇందులో అడ్జస్ట్మెంట్స్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. దీని ధర 495 పౌండ్ల (రూ. 51,593) నుంచి ప్రారంభం. ఎంపిక చేసుకున్న ఫ్రేమ్ మోడల్స్ బట్టి కొంత ఎక్కువ కూడా ఉంటుంది.ఇవి చదవండి: ప్రపంచంలోనే అతిపొడవైన మహిళ కన్నుమూత -
ఈ వంటకాలను ఎప్పుడైనా ట్రై చేశారా..!
మారుతున్న అభిరుచులనుబట్టి వంటకాలలో కూడా కొత్త కొత్త పద్ధతుల అనుసరిస్తున్నారు. ఆ పద్ధతులనుగుణంగా రుచులలో కూడా కొత్తదనం కనిపిస్తుంది. ఎన్నడూ ఇటువంటి కమ్మని రుచులను చూడలేదనే విధంగా సరికొత్త వంటలు ఎదురుపడుతున్నాయి. మరి ఆ విధానాలననుసరించి మనం కూడా తయారుచేద్దామా.. స్వీట్ కార్న్ రైస్ కేక్..కావలసినవి..స్వీట్ కార్న్ – 2 (మెత్తగా ఉడికించి.. చల్లారక గింజలు ఒలిచి పెట్టుకోవాలి); బియ్యప్పిండి – 2 కప్పులు; జొన్న పిండి– పావు కప్పు; గుడ్డు – తెల్లసొన (అభిరుచిని బట్టి); చీజ్ తురుము – కొద్దిగా; బటర్ – కొద్దిగా; పంచదార – ఒకటిన్నర కప్పులు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు); చిక్కటి పాలు – పావు లీటర్ (కాచి చల్లార్చినవి).తయారీ..ముందుగా స్వీట్ కార్న్ గింజల్ని.. పాలతో కలిపి మిక్సీ పట్టుకోవాలి.అందులోనే జొన్నపిండి, బియ్యప్పిండి, చీజ్ తురుము, బటర్ వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకోవాలి.ఆ మిశ్రమం పలుచగా ఉంటే కొద్దిగా బియ్యప్పిండి, గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్లా చేసుకుని.. ఆ మిశ్రమాన్ని కేక్ బౌల్లో వేసుకుని బేక్ చేసుకోవాలి.అనంతరం నచ్చినవిధంగా కట్ చేసుకుని తినొచ్చు.లేదంటే.. క్రీమ్స్ సాయంతో బర్త్డే కేక్లా కూడా చేసుకోవచ్చు.మీల్మేకర్ సమోసా..కావలసినవి.. మీల్మేకర్ – పావు కప్పు (వేడి నీళ్లల్లో శుభ్రం చేసుకుని, ఉడికించి, చల్లారాక తురుములా చేసుకోవాలి); మైదా పిండి – పావు కిలో; రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్; సోయాసాస్ – 2 టీ స్పూన్లు; వాము – అర టీ స్పూన్; అల్లం – వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్; క్యాబేజీ తురుము, క్యారట్ తురుము, ఉల్లికాడ ముక్కలు – 3 టీ స్పూన్ల చొప్పున; మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్ (కొద్దిగా నీళ్లు కావాలి); ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడాతయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ, ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.తర్వాత ఒక కళాయిలో నూనె వేసుకుని, వేడి కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి.. అందులో క్యాబేజీ తురుము, క్యారట్ తురుము, ఉల్లికాడ ముక్కలు, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసి బాగా వేయించాలి.తర్వాత సరిపడా ఉప్పు, కొద్ది నీళ్లల్లో కలిపిన మొక్కజొన్న పిండి, మీల్ మేకర్ తురుము వేసుకుని.. గరిటెతో నిమిషం పాటు అటూ ఇటూ తిప్పి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలి.పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల ఆ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసెయ్యాలి.అలా తయారు చేసుకున్న సమోసాలను నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.రా బనానా – కోకోనట్ కట్లెట్..కావలసినవి.. కొబ్బరి కోరు – పావు కప్పు; అరటికాయ ముక్కలు – పావు కిలో (బాగా శుభ్రం చేసుకుని మెత్తగా ఉడికించి, చల్లారక ముద్దలా చేసుకోవాలి); అల్లం తరుగు – కొద్దిగా; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; పచ్చిమిర్చి – 3, పెరుగు – పావు కప్పు; గరం మసాలా – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత, నూనె – సరిపడా;తయారీ..ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో.. అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి.ఈ మిశ్రమానికి తగినంత ఉప్పు, పసుపు, పెరుగు, గరం మసాలా, నిమ్మరసం, ఉడికించిన అరటికాయ గుజ్జు, కొబ్బరి కోరు వేసుకుని బాగా కలిపి.. ముద్దలా చేసుకుని.. కట్లెట్స్ చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి.అభిరుచిని బట్టి వీటిలో కొన్ని ఇన్గ్రీడియంట్స్ కలుపుకోవచ్చు లేదా చేంజ్ చేసుకోవచ్చు.ఇవి చదవండి: Beauty Tips: చూడటానికి ఇది ల్యాండ్ ఫోన్లాగా.. కానీ ఇదొక బ్యూటీ మసాజర్..! -
Beauty Tips: చూడటానికి ఇది ల్యాండ్ ఫోన్లాగా.. కానీ ఇదొక బ్యూటీ మసాజర్..!
యవ్వనాన్ని కోరుకోంది ఎవరు! దాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఇంటి చిట్కాల నుంచి శస్త్రచికిత్సల దాకా అన్నిటినీ ప్రయత్నిస్తారు. అయినా పరిష్కారాన్ని అందనివ్వదు పెరిగే వయసు. ఆ వరుసలో ఇంకో ప్రయత్నంగా వచ్చింది ఇదిగో ఈ ‘కిస్కీస్ స్కిన్ రెజూవనేషన్ ఐ రికిల్ రిమూవర్ మెషిన్.’ నిత్య యవ్వనాన్ని ఇవ్వకపోయినా వృద్ధాప్యాన్నయితే వాయిదా వేస్తుంది.. కళ్ల దగ్గర ఏర్పడే మచ్చలు, ముడతలను పోగొట్టి!చూడటానికి ఇది ల్యాండ్ ఫోన్ మాదిరిగా ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసినట్లుగా.. దీని మసాజ్ హెడ్ని చేత్తో పట్టుకుని.. కళ్ల చుట్టూ ఉన్న ముడతలు, మచ్చల మీద మసాజ్ చేసుకోవాలి. ఈ మెషిన్ తోపాటు కాథోడ్ క్లిప్ ఒకటి లభిస్తుంది. ట్రీట్మెంట్ తీసుకునేవారు ఈ క్లిప్ని చేతికి అటాచ్ చేసుకుని మసాజ్ స్టార్ట్ చేసుకోవాలి.ఈ టూల్ సాయంతో ఐ బ్యాగ్స్, డార్క్ సర్కిల్స్ అన్నీ తొలగిపోతాయి. మొదట్లో పది రోజులకు ఒకసారి ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరు లేదా ఎనిమిదిసార్లు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రిజల్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ధర 876 డాలర్లు. అంటే 73,265 రూపాయలు అన్నమాట. ఇలాంటి మోడల్స్ మార్కెట్లో చాలానే ఉన్నాయి. క్వాలిటీ, ఆన్లైన్ రివ్యూస్ని బట్టి కొనుగోలు చేయడం ఉత్తమం. మోడల్ని బట్టి.. ఒక్కో గాడ్జెట్.. ఒక్కో ధర ఉండొచ్చు.ఇవి చదవండి: గృహస్థాశ్రమ వైశిష్ట్యం : ఇష్టాయిష్టాలు కలిసాయా!? -
ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడేది! ఒకరోజు..
పూర్వం అంగీరస మహర్షికి భూతి అనే శిష్యుడు ఉండేవాడు. భూతి ముక్కోపి, మహా తపస్సంపన్నుడు. అతడికి కోపావేశాలకు అందరూ భయపడేవారు. ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడి సక్రమంగా ప్రవర్తించేది. అంగీరసుడి వద్ద విద్యాభ్యాసం పూర్తయ్యాక భూతి స్వయంగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వివాహం చేసుకుని, గృహస్థాశ్రమం చేపట్టాడు.భూతి మహర్షి తన ఆశ్రమంలో శిష్యులకు వేదవేదాంగాలను బోధించేవాడు. అతడి ఆశ్రమం నిత్యాగ్నిహోత్రంతో వేదమంత్రాలతో కళకళలాడుతూ ఉండేది. భూతి కోపాన్ని ఎరిగిన శిష్యులు అతడికి కోపం రాకుండా వినయంగా మసలుకుంటూ, శుశ్రూషలు చేసేవారు. భూతి మహర్షికి సువర్చుడు అనే సోదరుడు ఉన్నాడు. సువర్చుడు ఒకసారి యాగాన్ని చేయాలనుకున్నాడు. యాగానికి రమ్మంటూ సోదరుడు భూతిని ఆహ్వానించాడు. సోదరుడి యాగానికి వెళ్లాలని నిశ్చయించుకున్న భూతి, తన శిష్యుల్లో శాంతుడు అనేవాణ్ణి పిలిచి ఆశ్రమ బాధ్యతలను అప్పగించాడు.‘నేను తిరిగి వచ్చేంత వరకు ఆశ్రమంలో అగ్నిహోత్రం చల్లారకూడదు. అగ్నిహోత్రం చల్లారకుండా ఉండేందుకు నిత్య హోమాలు కొనసాగేలా చూడు’ అని ఆజ్ఞాపించి, సోదరుడి యాగాన్ని చూడటానికి బయలుదేరాడు. ఒకరోజు శాంతుడు, మిగిలిన శిష్యులు ఆశ్రమానికి సంబంధించిన వేరే పనుల్లో ఉండగా, అగ్నిహోత్రం చల్లారిపోయింది. అది చూసిన శిష్యులు గురువు తిరిగి వస్తే తమను ఏమని శపిస్తాడోనని భయపడుతూ గజగజలాడారు. జరిగిన దానికి శాంతుడు మరింతగా దుఃఖించాడు. గురువు తనకు ముఖ్యమైన బాధ్యత అప్పగించినా, అది సక్రమంగా నిర్వర్తించలేని తన అసమర్థతకు, నిర్లక్ష్యానికి విపరీతంగా బాధపడ్డాడు. ఇప్పుడు తాను తిరిగి హోమగుండాన్ని వెలిగించినా, గురువు దివ్యదృష్టితో జరిగిన తప్పు తెలుసుకుని, తనను శపించి భస్మం చేసేస్తాడనుకుని భయపడ్డాడు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇప్పుడు ఏం చేయాలని పరిపరి విధాలుగా ఆలోచించాడు. చివరకు అగ్నిదేవుడిని శరణు వేడుకుంటే, ఆయనే ఆపద నుంచి గట్టెక్కించగలడని తలచాడు. ‘నమః సర్వభూతానాం సాధనాయ మహాత్మనే/ ఏక ద్విపంచధిష్ణ్యాయ తాజసూయే షడాత్మనే...’ అంటూ అగ్నిదేవుడిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రం పలికాడు. ‘ఓ అగ్నిదేవా! దేవతలందరికీ ముఖానివి నీవే! హోమ యజ్ఞాలలో సమర్పించే హవిస్సులను, ఆజ్యాన్ని ఆరగించి దేవతలందరికీ తృప్తి కలిగిస్తున్నావు. దేవతలందరికీ నువ్వే ప్రాణస్వరూపుడివి. హుతాశనా! ‘విశ్వ’ నామధేయం గల నీ జిహ్వ ప్రాణులందరికీ శుభాలను ప్రసాదిస్తుంది. ఆ నాలుకతోనే మహాపాపాల నుంచి, భయాల నుంచి మమ్మల్ని రక్షించు. నా అశ్రద్ధ వల్లనే హోమగుండం చల్లారిపోయింది. నన్ను అనుగ్రహించు’ అని ప్రార్థించాడు.శాంతుడి ప్రార్థనకు అగ్నిదేవుడు సంతుష్టుడయ్యాడు. వెంటనే అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! ఏమి నీ కోరిక? ఏ వరాలు కావాలో కోరుకో!’ అని అడిగాడు. ‘దేవా! నా అలక్ష్యం వల్ల హోమగుండం చల్లారిపోయింది. ఈ హోమగుండంలో పూర్వం నుంచి ఉన్న విధంగానే అగ్ని నిలిచి ఉండాలి. నా గురువుకు ఇప్పటి వరకు సంతానం లేదు. ఆయనకు పుత్రసంతానాన్ని అనుగ్రహించాలి. నా గురువు ఇకపై ప్రాణులపై స్నేహభావంతో ఉండాలి. నీ అనుగ్రహం కోసం నేను చేసిన స్తోత్రాన్ని ఎవరు పఠించినా వారిపై నీ అనుగ్రహాన్ని కురిపించాలి. ఇవే నేను కోరే వరాలు’ అన్నాడు శాంతుడు. శాంతుడి మాటలకు అగ్నిదేవుడు ముగ్ధుడయ్యాడు. అతడు కోరిన వరాలన్నింటినీ అనుగ్రహించాడు. ‘లోకంలో నువ్వు ఉత్తమ శిష్యుడివి. నీకోసం ఒక్క వరమైనా కోరుకోకుండా, నీ గురువు గురించే వరాలు కోరుకున్నావు. నీ గురువుకు పుట్టబోయే పుత్రుడు ‘మనువు’ అవుతాడు. నువ్వు చెప్పిన అగ్నిస్తోత్రం పఠించిన వారికి çసకల శుభాలూ జరుగుతాయి’ అని పలికి అదృశ్యమయ్యాడు. సోదరుడి యాగం పూర్తికావడంతో భూతి మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆశ్రమంలో హోమగుండంలోని అగ్ని దేదీప్యమానంగా మండుతూ ఉండటంతో సంతృప్తి చెందాడు. శాంతుడిని దగ్గరకు రమ్మని పిలిచాడు. ‘శిష్యా! ఎన్నడూ లేనివిధంగా నాకు అందరి మీద స్నేహభావం కలుగుతోంది. ఇదేదో వింతలా ఉంది. నాకు అంతుచిక్కడం లేదు. నీకమైనా తెలిస్తే చెప్పు’ అని అడిగాడు.గురువు ఆశ్రమాన్ని విడిచి వెళ్లినప్పటి నుంచి జరిగినదంతా శాంతుడు పూసగుచ్చినట్లు చెప్పాడు. అయితే, శాంతుడు భయపడినట్లుగా భూతి మహర్షి కోపగించుకోలేదు. శపించలేదు. పైగా అంతా విని ఎంతో సంతోషించాడు. తన శిష్యుడైన శాంతుడు అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకున్నందుకు గర్వించాడు. శాంతుడిని అభినందించాడు. నాటి నుంచి మరింత ప్రత్యేక శ్రద్ధతో శాంతుడికి సకల వేద శాస్త్రాలనూ, వాటి మర్మాలనూ క్షుణ్ణంగా బోధించి, తనంతటి వాడిగా తయారు చేశాడు.కొంతకాలానికి అగ్నిదేవుడి వరప్రభావంతో భూతి మహర్షికి కొడుకు పుట్టాడు. అతడే భౌత్యుడు. కాలక్రమంలో భౌత్యుడు పద్నాలుగో మనువుగా వర్ధిల్లాడు. అతడి భౌత్య మన్వంతరం ఏర్పడింది. – సాంఖ్యాయనఇది చదవండి: బౌద్ధవాణి.. మట్టికుండ నేర్పిన పాఠం -
Health: సిజేరియన్ చేయించుకోవడంలో ఏమైనా ప్రమాదం ఉంటుందా?
నాకిప్పుడు 9వ నెల. ఫస్ట్ టైమ్ డెలివరీ చాలా కష్టమైంది. ఇప్పుడు నాకు సిజేరియన్ చేయించుకోవాలనే ఉంది. దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు ఆపరేషన్ను సేఫ్గా చేసే సదుపాయాలు చాలానే ఉన్నాయట కదా! ఫస్ట్ టైమ్ నార్మల్ డెలివరీ అయితే రెండోసారి సిజేరియన్కి వెళ్లకూడదా? దయచేసి నా డౌట్స్ క్లియర్ చేయండి! – ప్రసూన వనరాజు, హన్మకొండఏ మెడికల్ రీజన్ లేకుండా సిజేరియన్కి వెళ్లటం మంచిదికాదు. మీకు మొదటి కాన్పు నార్మలే అయింది కాబట్టి ఈ సెకండ్ డెలివరీ త్వరగా.. ఈజీగా అయ్యే చాన్సేసే ఎక్కువ. అయితే మీకు ఫస్ట్ డెలివరీ కష్టమైందని సిజేరియన్కి వెళదామనుకుంటున్నారు కాబట్టి ఎందుకు కష్టమైందో.. ఆ ప్రాబ్లమ్ ఏంటో మీరు మీ గైనకాలజిస్ట్తో వివరంగా చర్చించండి. అది మళ్లీ రిపీట్ అయ్యే ప్రాబ్లమ్ లేదా పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్ కాకపోతే నార్మల్ డెలివరీకి ప్రయత్నించడమే మంచిది.రిస్క్స్, ప్రయోజనాలు రెండూ రెండు (నార్మల్ లేదా సిజేరియన్) డెలివరీల్లో ఉంటాయి. రికవరీ టైమ్ నార్మల్ డెలివరీ కన్నా సిజేరియన్ డెలివరీలో ఎక్కువ. అనవసరంగా సిజేరియన్ చేయకూడదని ప్రభుత్వం నుంచీ సీరియస్ అడ్వయిజెస్ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే మాటను చెబుతోంది. దీన్నిబట్టి ఆపరేషన్ రిస్క్ ఎక్కువనే కదా అర్థం. ఇందులో షార్ట్ టర్మ్ / లాంగ్ టర్మ్ రిస్క్స్ ఉంటాయి. వెజైనల్ బర్త్లో కొంత ఆందోళన, అన్ప్రిడిక్టబులిటీ ఉంటాయి. పెయిన్ రిలీఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ రిస్క్ని ఆపరేషన్తో నివారించినా సిజేరియన్తో కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది.ఇది పదిమందిలో ఒకరికి వస్తుంది. తగ్గటానికి కొన్ని నెలలు పడుతుంది. అలాగే సిజేరియన్ అయిన వాళ్లల్లో కాళ్లల్లో, ఛాతీలో రక్తం గడ్డకట్టే ప్రమాదం అయిదు రెట్లు ఎక్కువ. అంతేకాదు బ్లీడింగ్ ఎక్కువై రక్తం ఎక్కించాల్సి వచ్చే రిస్క్ కూడా సిజేరియన్ కేసుల్లోనే ఎక్కువ. అధిక బరువు ఉన్న వారిలో ఈ రిస్క్స్ రెండింతలెక్కువ. బిడ్డలో కూడా టెంపరరీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. కొన్నిసార్లు ఎన్ఐసీయూ కేర్లో అడ్మిట్ చేయాల్సి రావచ్చు. సిజేరియన్ను ఎంత జాగ్రత్తగా చేసినా వెయ్యిలో ఒకరికి బవెల్ / బ్లాడర్ ఇంజ్యూరీ, యురేటర్ ఇంజ్యూరీ కావచ్చు. మళ్లీ తర్వాత డెలివరీ కూడా సిజేరియనే చేయాల్సి వస్తుంది.తర్వాత ప్రెగ్నెన్సీలో ప్లెసెంటా సిజేరియన్ స్కార్కి అతుక్కుని బ్లీడింగ్ ఎక్కువయ్యే ప్రమాదం ఉండొచ్చు. వెజైనల్ డెలివరీలో కూడా కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ చాన్సెస్ ఉండొచ్చు. వెజైనల్ టేర్స్ లేదా ఎపిసియోటమీ (్ఛpజీటజీ్టౌౌఝy) పెయిన్ ఉండొచ్చు. కానీ పైన చెప్పిన సిజేరియన్ రిస్క్స్ కన్నా ఇవి చాలా తక్కువ. తేలికగా ట్రీట్ చేయొచ్చు. ఈరోజుల్లో మంచి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి .. మీకు ఇంతకుముందు ఎదురైన ఇబ్బంది ఈసారి తలెత్తకుండా భద్రంగా వెజైనల్ డెలివరీ చేయటమే మంచిది. ఒకసారి మీ గైనకాలజిస్ట్తో అన్ని సవివరంగా చర్చించి మీకు, పుట్టబోయే బిడ్డకు ఏది సురక్షితమో ఆ సలహా, సూచనను తీసుకోండి.— డా. భావన కాసు, ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీ నిలుపుదలలో.. పెరుగుతున్న భయం తగ్గాలంటే?
నాకు ఇదివరకు రెండుసార్లు 5 వ నెలలో నొప్పులు రాకుండానే అబార్షన్ అయింది. సెర్విక్స్కి కుట్లు వేసినా ప్రెగ్నెన్సీ ఆగలేదు. ఇప్పుడు రెండవ నెల. ఈ ప్రెగ్నెన్సీ నిలవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – వి. మౌనిక, సికింద్రాబాద్మీరు చెప్పిన కండిషన్ని సెర్వైకల్ ఇన్కంపిటెన్స్ అంటారు. కొంతమందికి పుట్టుకతోనే సెర్విక్స్ వీక్గా ఉంటుంది. దీనివల్ల గర్భస్థ శిశువు బరువు పెరిగే కొద్ది మోయలేక మూడు నెలల తర్వాత గర్భస్రావం లేదా కాన్పు సమయం కంటే ముందుగానే వాటర్ బ్రేక్ అవడం లేదా నెలలు నిండకుండానే ప్రసవం అవుతుంది. ఇన్ఫెక్షన్ లాంటివి ఏవీ లేకుండా, నొప్పులూ లేకుండా సెర్విక్స్ తెరుచుకుని అబార్షన్ లేదా నెలలు నిండకుండానే డెలివరీ అయిపోతుంది. మొదటి ప్రెగ్నెన్సీలో అలా అయినప్పుడు రెండవసారి ప్రెగ్నెన్సీలో 3వ నెలలో ట్రాన్స్వెజైనల్ సర్క్లేజ్ అంటే వెజైనాలోంచి సెర్విక్స్ దగ్గర టేప్తో కుట్లు వేస్తారు.ఇవి సెర్విక్స్ని మూసి ఉంచుతాయి. నెలలు నిండిన తరువాత 37–38 వారాల్లో ఈ కుట్లను విప్పి నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేస్తారు. అయితే కొన్ని కేసేస్లో ఈ కుట్లు వేసినా అబార్షన్ అవుతుంది. అలాంటి వారికి ట్రాన్స్అబ్డామినల్ అప్రోచ్ అంటే ప్రెగ్నెన్సీకి ముందు లేదా మూడవ నెలలో పొట్టను ఓపెన్ చేసి సెర్విక్స్కి కుట్లు వేస్తారు. ఇవి సెర్విక్స్ని టైట్గా క్లోజ్ చేసి ఉంచుతాయి. ఈరోజుల్లో ఈ ప్రొసీజర్ని లాపరోస్కోపీ ద్వారా చేస్తున్నారు. పొట్ట మీద కోత లేకుండా చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటి ద్వారా సెర్విక్స్కి కుట్లు వేస్తారు.ఇది తల్లికీ, బిడ్డకూ ఇద్దరికీ సురక్షితమైన ప్రక్రియ. దీనికోసం ఆసుపత్రిలో జాయిన్ అవాల్సిన అవసరం లేదు. డే కేర్లోనే చేసేస్తారు. చేసిన రోజే ఇంటికి వెళ్లిపోవచ్చు. కొన్ని జాగ్రత్తలు, సూచనలు చెప్తారు. అయితే ఈ కుట్లు తీయడం కష్టం కాబట్టి.. ఈ కేసుల్లో సిజేరియన్ డెలివరీయే చేయాల్సి ఉంటుంది. కుట్లు అలాగే ఉండి.. తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీని కాపాడుతాయి. ఒకవేళ తరువాత పిల్లలు వద్దు అనుకుంటే సిజేరియన్ టైమ్లోనే కుట్లు తీసేస్తారు. ఈ ప్రక్రియను అనుభవజ్ఞులైన లాపరోస్కోపీ సర్జన్ చాలా భద్రంగా చేస్తారు. కాన్పు సమయం దగ్గరపడుతున్నా.. లేదా నొప్పులు మొదలైన వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు.ఏదైనా గర్భిణీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని కలసి, రెండవ నెలలో రక్త, మూత్ర పరీక్షలు చేయించుకొని యూరిన్ లేదా వెజైనాలో ఏ ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారణ చేసుకోండి. వయబిలిటీ స్కాన్ చేస్తారు. సెర్విక్స్కి కుట్లు వేయాలి అనే నిర్ణయానికి వస్తే అవి ఏ టైమ్లో వేయాలో నిర్ధారించుకుంటారు. మామూలుగా అయితే.. మూడవ నెలలో గర్భిణీలందరికీ చేసే Nuఛిజ్చి∙్టట్చnట uఛ్ఛిnఛిy టఛ్చిn (Nఖీ స్కాన్) తర్వాత లాపరోస్కోపిక్ సెర్వైకల్ సర్క్లేజ్కి ప్లాన్ చేస్తారు. ఇప్పటివరకు జరిగిన పలు అధ్యయనాల్లో.. ఇలా కుట్లు వేసిన వారిలో 89 శాతం మందిలో గర్భం నిలబడి.. సురక్షితంగా బిడ్డను కన్నట్టు వెల్లడైంది.— డా. భావన కాసు, ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ఈ భూగర్భ వాణిజ్య కేంద్రం గురించి మీరెప్పుడైనా విన్నారా!?
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ వాణిజ్యకేంద్రం. అమెరికాలోని కాన్సస్ నగరంలో మిస్సోరీ నదీ తీరానికి ఉత్తర ప్రాంతంలో ఉంది. నేలకు 150 అడుగుల లోతున 5.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భూగర్భ వాణిజ్య సముదాయంలో నిరంతరం వెయ్యిమందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు.ఈ ప్రాంతంలో 27 కోట్ల ఏళ్ల నాటి సున్నపురాతి నిల్వలు బయటపడటంతో, ఇక్కడి సున్నపురాతినంతా తవ్వి తీసి, సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి ఈ భూగర్భ వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు.హంట్ మిడ్వెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్మించిన ఈ వాణిజ్య సముదాయంలో ఎన్నో సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. పలు ఈ–కామర్స్ సంస్థలు, ఆహార ఉత్పత్తుల సంస్థలతో పాటు కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్’ కూడా ఇక్కడి నుంచి కొన్ని కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రైవేటు సంస్థలతో పాటు అమెరికన్ ప్రభుత్వం కూడా ఇక్కడ కొన్ని కార్యాలయాలను నిర్వహిస్తోంది.ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యాలయాల్లో ఒక పోస్టాఫీసు, ఆర్కైవ్స్ కార్యాలయం, రికార్డు స్టోరేజీ కార్యాలయం ఉన్నాయి. పేరుకు ఇది వాణిజ్య సముదాయమే అయినా, విస్తీర్ణం దృష్ట్యా, వసతుల దృష్ట్యా ఇది నగరాన్ని తలపిస్తుంది. ఇందులో సరుకుల రవాణాకు వీలుగా 3.4 కిలోమీటర్ల రైలుమార్గం, సరుకులతో పాటు మనుషుల రవాణాకు వీలుగా 17 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉండటం విశేషం. బయటి వాతావరణం ఎలా ఉన్నా, ఇందులోని వాతావరణం మాత్రం ఏడాది పొడవునా 19–21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేలా ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఇవి చదవండి: అవును! అతను.. విమానాల్లో లోకం చుట్టిన వీరుడు..! -
అవును! అతను.. విమానాల్లో లోకం చుట్టిన వీరుడు..!
విమానాల్లో అత్యధిక దూరం ప్రయాణించిన ఈ పెద్దమనిషి పేరు టామ్ స్టూకర్. అమెరికాలోని న్యూజెర్సీవాసి. ప్రస్తుతం ఇతడి వయసు 69 ఏళ్లు. విమాన ప్రయాణాల మీద మక్కువతో 1990లో యునైటెడ్ ఎయిర్లైన్స్ నుంచి 2.90 లక్షల డాలర్లకు (రూ.2.41 కోట్లు) లైఫ్టైమ్ పాస్ తీసుకున్నాడు.ఇక అప్పటి నుంచి తోచినప్పుడల్లా విమానాల్లో దేశాదేశాలను చుట్టేయడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు ఇతగాడు విమానాల్లో ఏకంగా 20 మిలియన్ మైళ్లకు (3.21 కోట్ల కిలోమీటర్లు) పైగా ప్రయాణాలు చేశాడు. ప్రపంచంలోనే అత్యంత విరివిగా విమాన ప్రయాణాలు చేసే వ్యక్తిగా రికార్డులకెక్కాడు. లైఫ్టైమ్ పాస్ కోసం అప్పట్లో తాను పెద్దమొత్తమే చెల్లించినా, అలా చెల్లించడం వల్ల ఇప్పటి వరకు లెక్కిస్తే తనకు 2.44 మిలియన్ డాలర్లు (రూ.20.30 కోట్లు) మిగిలినట్లేనని టామ్ చెప్పడం విశేషం. అతి తక్కువ లగేజీతో తాను ప్రయాణాలు చేస్తానని, చేసే ప్రయాణాల కంటే, ప్రయాణాల్లో మనుషులను కలుసుకోవడం తనకు చాలా ఇష్టమని అతడు చెబుతాడు.ఇవి చదవండి: అరాచక పరిస్థితుల్లో జరిగిన ఓ వింత.. నేటికీ మిస్టరీయే! -
మిస్టరీ.. దగ్గరకు వెళ్లేకొద్దీ.. అస్పష్టంగా పిల్లల స్వరం వినిపించసాగింది..
అది 12వ శతాబ్దం. వారసత్వ సంక్షోభంతో ఇంగ్లండ్ సింహాసనం కోసం అంతర్యుద్ధం జరుగుతున్న కాలమది. దాన్ని చరిత్రలో ‘ది అనార్కీ’ అని పిలుస్తారు. ఆ అరాచక పరిస్థితుల్లో జరిగిన ఓ వింత.. నేటికీ మిస్టరీయే!సఫెక్లోని వూల్పిట్ అనే గ్రామంలో కొందరు పొలం పనులు చేసుకుంటున్నారు. అప్పుడే ఉన్నట్టుండి, సమీపంలో తోడేళ్ల కోసం తవ్విన గుంతలో ఎండుటాకుల అలికిడి బాగా పెరిగింది. ‘అబ్బ.. తోడేళ్లు పడినట్లు ఉన్నాయి. ఈ రోజుకి మన పంట పండింది’ అనుకున్నారు. వారంతా నెమ్మదిగా తోడేళ్ల గుంత వైపు నడిచారు. దగ్గరకు వెళ్లేకొద్దీ.. అస్పష్టంగా పిల్లల స్వరం వినిపించసాగింది. ఆ అస్పష్టతకు కారణం స్వరం కాదు, భాష. ఆ పిల్లలు ఏం మాట్లాడుతున్నారో అక్కడున్నవారెవ్వరికీ అర్థంకాలేదు.దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూస్తే ఆ గుంతలో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. చూస్తుంటే వారిద్దరూ అక్కా, తమ్ముడు అని అర్థమవుతోంది. కానీ ఇద్దరూ ఆకుపచ్చ చర్మంతో ఉన్నారు. వారి ఒంటి మీద దుస్తులు అసాధారణంగా, వింతగా కనిపించాయి. మానవులు కాదనే అనుమానం ఓ వైపు.. పసివాళ్లు అనే జాలి మరోవైపు.. పెనుగులాడుతుంటే.. చివరికి జాలే గెలిచింది. ఆ పిల్లల్ని జాగ్రత్తగా పైకి తీసి, ‘రిచర్డ్ డి కాల్నే’ అనే ఊరిపెద్ద ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడే పిల్లలకు ఆవాసం ఏర్పాటు చేశారు. అయితే తినడానికి ఏం పెట్టినా పిల్లలు వద్దన్నారు. వాళ్లు చెప్పిన మాటలు పిల్లలకు అర్థం కాలేదు. పిల్లల అవసరం పెద్దలకు బోధపడలేదు.ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ ఇద్దరు చిన్నారులు.. చాలారోజుల పాటు తిండి తినలేదట. అయితే కొంత కాలానికి.. ‘కాల్నే’ తోటలో పెరుగుతున్న బఠాణీ మొక్కల నుంచి బఠాణీలను తెంపుకుని తినడం మొదలుపెట్టారు. అలా కొన్ని నెలల పాటు వాటి మీదే బతకారు వాళ్లు. దాంతో ఆ పిల్లలు వేరే లోకం నుంచి వచ్చి పడ్డారన్న వాదన స్థానికుల్లో బలపడింది. తర్వాత కొంత కాలానికి.. ‘కాల్నే’ ఇంట్లో కాల్చిన రొట్టెలను తినడం మొదలుపెట్టారా పిల్లలు. దానివల్ల క్రమంగా వారి చర్మం రంగు మారుతూ వచ్చింది. పిల్లలు స్థానిక భాషను నేర్చుకుని.. మాట్లాడటం ప్రారంభించారు. అలా నెమ్మదిగా వాళ్లు సాధారణ మనుషులుగా మారుతున్న తరుణంలో.. ఉన్నట్టుండి పిల్లాడు చనిపోయాడు.తమ్ముడి మరణంతో ఆ పాప చాలా కుంగిపోయింది. తేరుకోవడానికి నెలలు పట్టింది. ఆ బాధలో చుట్టుపక్కలవారితో అనుబంధం పెరిగి.. అమ్మాయి మాటల్లో స్పష్టత వచ్చింది. ఆమె ఇంగ్లిష్ మాట్లాడటం నేర్చుకుంది. భాష పూర్తిగా నేర్చుకున్న తర్వాత.. ఆ అమ్మాయి మాటలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ‘నేను, నా సోదరుడు గతంలో ఉన్న చోటకి.. ఇప్పుడు ఉంటున్న చోటికి చాలా తేడా ఉంది. అది వేరే గ్రహంలా అనిపిస్తోంది.మేము ఇక్కడికి ఎలా వచ్చామో మాకు తెలియదు. మేము తోడేళ్ల గుంతలో పడకముందు వరకూ మా నాన్నతోనే ఉన్నాం. ఉన్నట్టుండి పెద్ద గంటల మోత వినిపించింది. మేము ఆ సమీపంలో పెద్ద నదిని కూడా చూశాం. ఆ క్షణంలో మాకేమైందో తెలియదు. కళ్లు తెరిచేసరికి మీ ముందు ఉన్నాం’ అని చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి. ఆ పిల్ల అంత చెప్పుకొచ్చినా ఆ అక్క, తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారనేది అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు.అలా ‘కాల్నే’ ఇంట్లోనే పెరిగిన ఆ అమ్మాయికి.. ‘ఆగ్నెస్ బారే’ అనే పేరుపెట్టారు. దగ్గర్లోని కింగ్స్ లిన్ పట్టణానికి చెందిన ‘ఆర్చ్డీకన్ రిచర్డ్’ని పెళ్లి చేసుకుంది. నివేదికల ప్రకారం ఆమెకు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఆమె వంశస్థుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. ఆమెకు పుట్టిన పిల్లలు ఆకుపచ్చరంగులో పుట్టారని, వారు తిరిగి తమ పూర్వీకులను వెతుక్కుంటూ వెళ్లిపోయారంటూ ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ఆనాడు ఆ పిల్లల్ని చూసిన కొందరు చిత్రకారులు.. కొన్ని చిత్రాలను గీసి భద్రపరచారట.అయితే తర్వాత కాలంలో .. ఈ అక్కా తమ్ముళ్లిద్దరూ బెల్జియంలోని ఫ్లాండర్స్కి చెందిన ఫ్లెమిష్ వలసదారుల పిల్లలు కావచ్చు అనే ఓ వాదన పుట్టుకొచ్చింది. 12వ శతాబ్దంలో అనేక మంది ఫ్లెమిష్ వలసదారులు.. వూల్పిట్ సమీపంలోని ఫోర్న్హామ్ సెయింట్ మార్టిన్ పట్టణానికి చేరుకున్నారనే ఆధారాలూ దొరికాయి. ఫోర్న్హామ్ను, పూల్పిట్లను.. లార్క్ నది వేరు చేస్తుంది. ఆ పాప చెప్పిన నది అదే కావచ్చని అంచనా వేశారు.కింగ్ హెన్రీ ఐఐ పాలనలో, ఫోర్న్హామ్ యుద్ధంలో చాలామంది ఫ్లెమిష్ వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ యుద్ధం కారణంగా ఆ అక్కాతమ్ముళ్లిద్దరూ తమ వాళ్లను కోల్పోయి అనాథలుగా మారి ఉండొచ్చు. పాప విన్న పెద్ద గంటల చప్పుడు .. యుద్ధానికి సంబంధించిందే అయ్యుండొచ్చు. అలా అనాథలైన ఈ పిల్లలు.. అడవి బాటలో పడి పోషకాహారం కరవై అనారోగ్యానికి గురై ఉండొచ్చని, పిల్లల్ని కాపాడినవారికి వీరి డచ్ భాష అర్థమై ఉండకపోవచ్చని అంచనా వేశారు.ఈ అంచనా నిజమైతే.. పిల్లల చర్మం ఎందుకు ఆకుపచ్చగా ఉంది? అనే ప్రశ్న.. మరింత లోతుగా ఆలోచించేలా చేసింది. పోషకాహారం అందకుంటే చర్మం ఆకుపచ్చ రంగులోకి మారే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. అందుకే సమతుల ఆహారం తీసుకున్నా కొద్ది రోజులకే వాళ్ల చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరిందని గుర్తుచేస్తూ.. పై వాదనకు బలాన్నిచ్చారు నిపుణులు.ఇదిలా ఉండగా.. ఆర్సెనిక్ పాయిజనింగ్ వల్ల కూడా చర్మం ఆకుపచ్చగా మారుతుందనే మరో వాదన వచ్చి షాక్నిచ్చింది అందరికీ! పిల్లలపై ఆ విషప్రయోగం జరిగి ఉంటుందా? కావాలనే పిల్లలకు ఈ విషం ఇచ్చి.. అడవిలో వదిలేసి వెళ్లారా? అనే ప్రశ్నలు ఈ కథను ఉత్కంఠగా మార్చాయి.అయితే ఆ ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు దొరకలేదు. ఆ దిశలో అన్వేషణ కొనసాగుతుండగానే.. ఆ పిల్లలు ఏలియ¯Œ ్స అని కొందరు నమ్మసాగారు. పిల్లలు దొరకడం నిజమే. కానీ ఎలా దొరికారు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే ఊహాజనితమైన ఈ కథనాన్ని ప్రేరణగా తీసుకుని.. ఎన్నో నవలలు, పద్యాలు, నాటకాలు, సినిమాలు, డ్రామాలు పుట్టుకొచ్చాయి. దాదాపు ఎనిమిది శతాబ్దాలకు పైగా ఈస్టోరీ మిస్టరీగా కొనసాగుతునే ఉంది. — సంహిత నిమ్మనఇవి చదవండి: Funday Story: చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’? -
చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’?
పాత ముతక చీర కట్టిన పండు ముసలమ్మలా ఉందా పాక. అటూ ఇటూ నల్లరంగేసిన రెండరుగులు, మధ్యలో గడప. ఓ అరుగు మీద కూర్చున్న ఆడవాళ్ళు ఆల్చిప్పతో కలెక్టరుకాయలు తొక్కతీసి, మాగాయ, తొక్కుపచ్చడికి సిద్ధం చేస్తున్నారు. రెండో అరుగు మీద చంటి ఒక్కడే పేకాడుకుంటున్నాడు.‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’ అడిగిందొకావిడ ఓ పండుముక్క నోట్లో వేసుకుంటూ. ఓ సారి అటువైపు చూసి మళ్ళీ ఆటలో పడిపోయాడు చంటి. ‘పాచి పళ్ళు, తలంతా ఈళ్ళు, పుల్లల్లాంటి కాళ్ళు, ఎక్కడో బంగారు పూల పూజ చేస్తోంది వీడి గురించి’ సాగదీస్తూ వెక్కిరించింది మరొకావిడ. అంతలో ఎదురింటి ముందు సామాన్లతో వేన్ ఆగింది. తండ్రి వేను దిగి చేతులు అందించాడు. అతని చేతుల్ని పక్కకి నెట్టి, చెంగుమని దూకింది చిన్న. ‘జాగ్రత్తే చిన్నా’ అంటోంది వెనక రిక్షాలో వచ్చిన తల్లి. ఆ చప్పుడుకి చేతిలో పేక మూసి పాకలోంచి పైకి చూశాడు చంటి. కృష్ణుడి రంగు, ముందుకేసుకున్న రెండు జడలు, కోడి కత్తిలాంటి చిన్న ముక్కు, ముఖ్యంగా ఆ కళ్ళు, ఒక్క క్షణం ఓ చోట నిలవకుండా చుట్టూ పరిశీలిస్తూ గుండ్రంగా తిప్పుతూ, చంటి మీద ఓ రెండు సెకన్లు ఎక్కువసేపు నిలిపి, కళ్ళతోనే ఓ నవ్వు చిలికి, మిగిలినవాళ్ళు సామాన్లు సర్దుతూ ఉండగానే వీధి మొత్తం ఓ రౌండ్ కొట్టి వచ్చింది చిన్న.‘ఏవండీ,’ అంటూ వాకిట్లోకి వచ్చింది సరస్వతి. ‘రండి, కూర్చోండి’ అంటూ పేడలో ఎండుగడ్డి కలిపి బెందడి గోడకి పిడకలు వేస్తున్న పనాపి, చెయ్యి కడుక్కుని, పక్కనే ఉన్న చెక్క స్టూల్ లాగింది లక్ష్మి కూర్చోమని. ‘నమస్తే. నిన్ననే మీ ఎదురింట్లో దిగాము. పాలు వాడకం పెట్టుకుందామని’ అంది సరస్వతి కూర్చుని ఆ పాకంతా పరికిస్తూ. ‘అలాగే, వీధంతా మా చుట్టాలే. నేనే పోస్తాను పాలు. మీరు నలుగురులా ఉంది. సేరు పాలు సరిపోతాయేమో. పూటకి తవ్విడు చొప్పున పొయ్యమంటారా లేక సేరూ ఒకేపూట కావాలా?’‘ఉదయాన్నే సేరు పోసేయ్యండి. రేటు ఎక్కువైనా పరవాలేదు, పొదుగు దగ్గర పాలు కావాలి, మేము రావాలా?’ అడిగింది సరస్వతి ముక్కుకి చీర చెంగు అడ్డుపెట్టుకుంటూ. ‘ఈ వీధిలో అందరూ మా చుట్టాలే. అందుకని కాదు కానీ, మీరు అడిగినా నీళ్ళు కలపం. మా పాలతో బొట్టు పెట్టుకోవచ్చు. ఓ వారం చూస్తే మీకే తెలుస్తుంది. పాలు మా చంటి తెస్తాడు. గిన్నె వెంటనే ఇచ్చెయ్యాలి. ఉండండి కొంచెం కాఫీ పెడతాను’ అంది లక్ష్మి ఆప్యాయంగా. ‘వద్దండీ, అలవాటు లేదు’ అంది సరస్వతి వాకిట్లో ఉన్న జాంచెట్టుని చూస్తూ. ‘అన్నయ్యగారు ఏం చేస్తారు. పిల్లలు చదువుతున్నారా?’ అడిగింది లక్ష్మి అప్పుడే లోపలికొచ్చిన చంటిని జాంకాయలు కొయ్యమని సైగ చేస్తూ. ‘ఆయన ట్రెజరీలో చేస్తారు. అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. పిల్ల ఎయిత్’ అని, ‘అన్నయ్యగారు ఊళ్ళో లేరా?’ అడిగింది సరస్వతి చుట్టూ పరికిస్తూ.‘లేరు, వీడి ఆరో ఏటే పోయారు. అప్పటినించి నాలుగు గేదెల్ని సాకుతూ పాలవ్యాపారం చేసుకుంటూ వాణ్ణి పెంచుతున్నా. మా అమ్మ వాళ్ళదీ ఇదే వీధి చివరిల్లు’ అంది లక్ష్మి చంటి కోసిచ్చిన కాయల్లో ఓ నాలుగు దోరకాయల్ని సరస్వతి చేతిలో పెడుతూ. అవి మొహమాటంగా అందుకుని, ‘సరే వస్తానండి, పాలు రేపటినించి పొయ్యండి’ అని వెళ్ళిపోయింది సరస్వతి.గొళ్ళెంతో తలుపు మీద మెత్తగా కొట్టాడు చంటి. చటుక్కున తలుపు తీసి అతని వేళ్ళు తగిలేలా పాల గిన్నె అందుకుంటూ నవ్వి కన్ను గీటింది చిన్న. కంగారుగా అటూ ఇటూ చూసి, గిన్నె ఖాళీ చేసి ఇచ్చేవరకూ ఆగకుండా ఇంటికి పరిగెత్తాడు చంటి. ‘గిన్నేదిరా’ అడిగింది లక్ష్మి. ‘తర్వాత ఇస్తామన్నారమ్మా’ అనేసి అరుగు మీద కూర్చుని పేక ముక్కలు పేర్చుకోవటం మొదలు పెట్టాడు. కాసేపట్లో ఖాళీ గిన్నెతో వచ్చింది చిన్న. అటూ ఇటూ చూసి ఓ చీటీ చంటి మీదకి విసిరి లోపలికి వెళ్ళింది. ‘పాలు’ అన్నాడు చంటి బెరుగ్గా. ‘తెలుసు’ అందామె కొంటెగా. ‘అమ్మ గిన్నె తెమ్మంది’. ‘తినెయ్యంలే నీ గిన్నె. లోపలికి రావొచ్చుగా!’ చంటి భయంగా అటూ ఇటూ చూసి, ‘మీ అన్నయ్య లేడా?’ అడిగాడు. ‘ఉంటే నిన్నేమీ కట్టెయ్యడులే!’ ‘ఆంటీ?’ అడిగాడు సిగ్గుపడుతూ.‘అమ్మ పెరట్లో ఉంది’ అంది అదే సొట్ట బుగ్గల నవ్వుతో. వెళ్లి రేక్కుర్చీలో ముందుకు కూర్చున్నాడు భయంగా. ‘మొహమంతా మొటిమలు, చింపిరి జుట్టు, వాడు నీకెలా నచ్చాడే’ అంటోంది మా ఫ్రెండ్ ఇందిర’ అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ.‘నేనేం నీ వెంట పడలేదు. నచ్చకపోతే మానెయ్’అన్నాడు ఉక్రోషంగా. ‘సరదాగా తను అన్నది చెప్పాను తప్ప నేననలేదు కదా, నాకు నీ కళ్ళంటే ఇష్టమని చెప్పాను’ అంది అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ‘కళ్ళు నచ్చటమేంటి?’ అడిగాడు చంటి ఉత్సాహంగా. ‘నువ్వు చిన్నపిల్లాడివి నీకు తెలీదులే. అది సరే, టె¯Œ ్త ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. కాసేపు ఆ పేకముక్కలు పక్కన పెట్టి చదువుకోవచ్చుగా. కావాలంటే నేనూ వస్తా కంబైండ్ స్టడీస్కి’ అంది.‘అక్కర్లేదు. నువ్వు మాత్రం ఏం చదువుతున్నావు? ఎంతసేపూ వీధంతా తిరుగుతావు అందరిళ్ళకీ!’ ‘బాబి వాళ్ళ ఇంటికి వెళ్ళాననే కదా నీ కోపం. ఫిజిక్స్లో ఏదో డౌట్ ఉంటే అన్నయ్య తీసుకెళ్ళాడు.’‘నాకెందుకు కోపం. వాడు మంచోడు కాదు, సిగరెట్లు కాలుస్తాడు. అవునూ, ఫిజిక్స్ అంటే జీవశాస్త్రమేనా?’ అడిగాడు అనుమానంగా. ‘ఆహా మరి పేకాడే వాళ్ళు మంచోళ్ళా?’ అని, ‘మా అన్నయ్యకి చెప్పి ఈసారి డౌట్లు నిన్నే అడుగుతాలే తెలుగు మీడియం అబ్బాయి’ అంది అల్లరిగా నవ్వుతూ. ‘చిత్రలహరికి వాణ్ణి లోపల కుర్చీ వేసి కూర్చోబెడతారు. నేనేమో బయట కిటికీ ఊసలు పట్టుకుని వేళ్ళాడుతూ చూడాలి’ అన్నాడు చంటి ఉక్రోషంగా. ‘బావుంది అతను మా అన్నయ్య ఫ్రెండ్. నిన్ను రమ్మంటే రావు దానికి నేనేం చేయను’ అంది జాలిగా. ‘బాబి వాళ్ళింట్లో ఉసిరి చెట్టున్నట్టుంది, కాయలు కోసావా’ అడిగాడు మాట మారుస్తూ ఊరేసిన ఉసిరికాయలు ఇస్తుందేమో అని ఆశగా. ‘నాకు ఉసిరికాయలు నచ్చవు. జాంకాయలంటేనే ఇష్టం’ అంది కొంటెగా. అందులో శ్లేష అతనికి అర్థంకాలేదని తెలిసి కాస్త కోపంగా ‘రేప్పొద్దున్న పెళ్ళయ్యాక పేక ముక్కలు ముట్టుకున్నావో చేతులు విరక్కొడతా?’అంది.‘ష్! మీ అమ్మగారు వింటారు..’‘మన సంగతి మా అమ్మకి ఎప్పుడో చెప్పేశా. ఇంకో విషయం తెలుసా, మొన్న మీ అమ్మగారే అడిగారు నన్ను ‘మా చంటిని చేసుకోవే, ఈ పాడి నువ్వైతేనే బాగా చూసుకుంటావు’ అన్నారు తెలుసా?’ ఆ మాటకి చంటి తెగ సిగ్గుపడిపోయాడు. అతని సిగ్గు చూసి ముద్దేసి అతని రెండు బుగ్గలూ గట్టిగా పట్టుకుని లాగింది చిన్న. ‘అమ్మా..’ అన్నాడు కందిపోయిన బుగ్గల్ని రాసుకుంటూ.‘చిన్నా ఎవరే?’ పెరట్లోంచి సరస్వతి కేకేసింది. ‘పిల్లి.. తరుముతున్నాను’ అంది చిన్నా చంటిని వెళ్ళిపొమ్మని సైగ చేస్తూ.‘అమ్మా బాబిని నేను చేసుకోను. నీకు ఎప్పుడో చెప్పాను చంటిని తప్ప ఎవర్నీ చేసుకోనని, దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు’ అంది చిన్న విసురుగా. అప్పటికి రెండు గంటల్నించి నడుస్తోంది యుద్ధం. అమ్మ, నాన్న, అన్నయ్య ఒక వైపు చిన్న ఒక్కర్తీ ఒకవైపు. ‘ఏంటే నువ్వొప్పుకునేది? అసలు నీకు ఎనిమిదో తరగతినించీ ఈ ప్రేమలేంటి. అప్పుడే ఓ నాలుగు తగిలిస్తే ఇంతవరకూ వచ్చేది కాదు. వాడింకా బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పైగా ఆ పేకాట పిచ్చొకటి. ఎప్పుడు సెటిల్ అవుతాడో, ఏ ఉద్యోగం వస్తుందో తెలీదు. బాబికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మనం తొందరపడాలి’ కోపంగా అన్నాడు ఆమె అన్నయ్య. ఆమె తండ్రి ఎవరు మాట్లాడితే వాళ్ళకేసి చూడ్డం తప్ప ఇంకేం చెయ్యట్లేదు. ‘గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదా? నీ చెల్లిని ప్రేమించాడు కాబట్టి నీకు నచ్చటం లేదు తప్ప, చంటి తెలివైన వాడురా! పదమూడు ముక్కలూ పేర్చకుండా ఆడతాడు, కళ్ళతో ఓసారి చూసి కౌంట్ చెప్పేస్తాడు. వాడికీ మంచి ఉద్యోగమే వస్తుంది. మీరు ఒప్పుకుంటే సరే లేదంటే....’ అంతే విసురుగా సమాధానం చెప్పింది చిన్న.అన్నయ్య కొంచెం తగ్గి, ‘ఏముందే వాళ్ళింట్లో? పేడ కంపు కొట్టే ఆ పాక, నాలుగు గేదెలు, వర్షమొస్తే కారకుండా ఇల్లంతా పేర్చిన సత్తు గిన్నెలు, ఓ రోజు గేదె తంతే నాలుగు రోజులు కూరలేకుండా గడుపుకోవాలి. నా మాట విను’ అన్నాడు. సరస్వతి కల్పించుకుని, ‘దానికి నేను నచ్చచెబుతా లేరా?’ అంటూ చిన్నని గదిలోకి తీసుకెళ్ళింది. ‘చిన్నమ్మా, నీకు తెలుసుకదా నాన్నగారికి ఏం తెలీదు. మనింట్లో నిర్ణయాలన్నీ మగపిల్లాడు, అన్నయ్యే చూసుకుంటాడు. వాడు కూడా ఏం చేసినా నీ మేలు కోరే చేస్తాడు. ఊడ్చిన చేను కంటే ఉడికిన అన్నం నయం కదా. వాడి మాట విను’ అంది సరస్వతి చిన్నని ఓదారుస్తూ. ‘అమ్మా, అయిదేళ్ళ నించి చూస్తున్నావు, నీకు తెలీదా చంటి మంచోడని? ఆ విషయం గ్యారంటీ కార్డు లాంటి వాడి కళ్ళు చూసి చెప్పొచ్చు ఎవరైనా. వాడితో ఉంటే అభయాంజనేయుడు తోడున్నట్టే. ఇక ఉద్యోగం అంటావా, ఉసిరి చెట్టు తొందరగా కాపు కొస్తుంది, జాంచెట్టు కాస్త ఆలస్యమౌతుంది’ అని చిన్నమ్మ ఇంకా చెప్పేలోపు మధ్యలో అడ్డుపడి ‘చంటి మంచోడంటే బాబి చెడ్డోడని కాదు కదమ్మా’ అంది సరస్వతి.‘నిజమేనమ్మా, కానీ ఇక్కడ సమస్య స్వేఛ్చ గురించి. నేనో పిల్లని చూసి అన్నయ్యని చేసుకోమంటే చేసుకుంటాడా. మంచో, చెడ్డో నా జీవితానికి సంబంధించిన నిర్ణయంలో నన్ను కూడా భాగం చెయ్యండి అంటున్నా అంతే’ అని, ‘అమ్మా.. నాకింకా పద్దెనిమిదే కదా. ఒక్క రెండేళ్ళు చూడండి. ఈలోగా నా డిగ్రీ కూడా పూర్తవుతుంది. అప్పటికీ చంటి సెటిల్ కాకపోతే మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం మీరు ఎంత చెప్పినా ఏం చేసినా నేను ఈ పెళ్ళి చేసుకోను’ అంది చిన్న ఏడుస్తూ.అదే సమయంలో.. ఎదురింటి పాకలో లక్ష్మి, చంటి దిగులుగా కూర్చున్నారు. నాలుగింటికిలేచి, పాలుపితికి, వీధంతా పొయ్యటం, పేడకళ్ళెత్తడం, పిడకలు చెయ్యటం, మిల్లుకెళ్ళి చిట్టు, తౌడు, సంతకెళ్లి పచ్చగడ్డి, కొనుక్కురావటం, రాత్రిళ్ళు గేదె తప్పిపోతే హరికెన్ లాంతరు, చేపాటి కర్ర.. పట్టుకుని ఇంటి వెనకున్న తమలపాకు తోటంతా వెతికి పట్టుకోవటం, ఇలా అన్ని పనులూ పంచుకునే ఆ తల్లీ, కొడుకులు ఆ క్షణం దుఃఖాన్ని కూడా పంచుకుంటున్నారు.‘ఊరుకోరా.. ఏం చేస్తాం! నువ్వు మంచోడివని నీకూ, నాకూ తెలిస్తే చాలదు. లోకానికి తెలియాలి. ఆ పేక ముక్కలు వదలరా అంటే విన్నావు కావు. మీ నాన్న కూడా ఇలాగే పేకాట పిచ్చితో ఇంటికే వచ్చేవాడు కాడు. ఓ రోజు మీ తాత తిట్టాడని ఉరేసుకున్నాడు. నువ్వు కూడా ఎక్కడ అలాంటి పని చేస్తావో అని భరిస్తున్నాను. అయినా నిన్నని ఏం లాభం. వీధి వీధంతా ఏ అరుగుమీద చూసినా, ఐదేళ్ళ పిల్లాడి నించి ఎనభై ఏళ్ల ముసలాళ్ళ వరకూ, ఆడ మగ తేడా లేకుండా ఇదేం అలవాటో. ఇక్కడినించి పోదాం అంటే సొంతిల్లు, పాడి వదులుకుని ఎక్కడకని పోతాం. ఇప్పుడు చూడు. పాపం వెర్రిది. నువ్వంటే పిచ్చి దానికి. ఇరవై ఏళ్లకి ఉద్యోగం లేదని ఎందుకూ పనికిరావని నిర్ణయించేశారు. చిన్నమ్మ ఎంతో చురుకైనది, నువ్వా నెమ్మది. దాన్ని నీకు కట్టబెడితే నీ బతుకు బావుంటుందని ఆశపడ్డాను’ అంది చంటి తల్లి భారంగా.‘అమ్మా, జీవితంలో మళ్ళీ పేక ముట్టుకోనమ్మా. నువ్వు ఎలాగైనా వాళ్ళకి చెప్పమ్మా. ఒక్క రెండేళ్ళు టైము ఇమ్మనమ్మా. టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నా, మంచి ఉద్యోగం సంపాదిస్తాను. నాకు చిన్న కావాలమ్మా’ అతనికి దుఖం ఆగటం లేదు. ‘ఊరుకోరా. రేపు వాళ్ళమ్మగారితో ఓసారి మాట్లాడి చూస్తా. నువ్వు బెంగెట్టుకోకు’ అంది లక్ష్మి చంటిని దగ్గరకి తీసుకుని తల నిమురుతూ! ‘ఆ చెప్పు చిన్నమ్మా’ అతని మాట ముద్దగా వస్తోంది ఫోన్లో. క్లబ్బులా ఉంది పక్కనే అంతా గోలగోలగా ఉంది.‘చిన్నాడికి వొంట్లో బాగోలేదు. ఇంటికెప్పుడొస్తావు’ విసుగ్గా అడిగింది చిన్న. ‘వచ్చేస్తా బంగారం. ఈ ఒక్క రౌండ్ అయిపోగానే వచ్చేస్తా అంటూ ఫోన్ ఆఫ్ చెయ్యకుండానే పక్కన పెట్టేశాడతను.ఉసూరుమంటూ ఫోన్ పెట్టేసి పిల్లాడికి పాలు, బ్రెడ్డు పెట్టి టాబ్లెట్ వేసి పడుకోమని చెప్పి పక్కనే ఉన్న రైతు బజారుకి బయల్దేరింది చిన్న. ‘నువ్వు చిన్నవి కదూ’ అంది కూరలు ఏరుతూ ఉంటే పక్కనున్నామె.‘అవును. నువ్వు .. ఇందిర కదూ, నువ్వుండేది హైదరాబాద్ కదా!’ అడిగింది చిన్న. ‘అవునే. మా అక్కయ్య గృహప్రవేశం ఉంటే వచ్చాను. పూల దండల కోసం ఇలా వచ్చా. బావున్నావా చిన్నా’ అడిగింది ఇందిర చిన్నమ్మ చేతిని అందుకుంటూ. ‘హా, బావున్నాం. మా ఇల్లు ఇక్కడే శివాజీ పాలెం. రా ఇంటికి వెళదాం’ అంటూ కూరలు కొనుక్కోవటం అయిపోయాక ఇద్దరూ చిన్నమ్మ ఇంటికి వెళ్ళారు.ఇందిర కేసి చూసింది చిన్న. చిన్నప్పుడు కళ్ళపుసులతో, పుల్లలా ఉండేది. ఇప్పుడు దబ్బపండులా, ఎండమొహం ఎరుగనట్టు నిగ నిగ లాడుతూ, ఒతై ్తన జడ, మితంగా బంగారం, చక్కటి డ్రెస్సు, హుందాగా ఉంది. ‘నువ్వేమిటే ఇలా అయిపోయావు చిన్నప్పుడు చిలకలా ఉండేదానివి’ అడిగింది ఇందిర. నవ్వి ఊరుకుంది చిన్న.‘మీ ఆయనా పిల్లలు బావున్నారా?’ అడిగింది మాట మారుస్తూ. ‘హా’ అంటూ నంబర్ తీసుకుని ఫ్యామిలీ ఫొటో వాట్సాప్లో షేర్ చేసింది ఇందిర. ఆ ఫొటో కేసి చూస్తూ, ‘నిన్ను బాగా చూసుకుంటాడా?’ అడిగింది చిన్న.‘రాత్రి పొడవాటి కురులని పొగిడి, పొద్దున్నే పచ్చట్లో అదే వెంట్రుక కనబడితే విసుక్కునే రకం కాదే. అమ్మలా అభిమానంగా, బిడ్డలా గారంగా చూసుకుంటాడు. ఏ లోటూ రానివ్వడు. ఇంటి పనిలో సాయం చేస్తాడు, సాయంత్రం ఆరుకల్లా ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇంతవరకూ మేము ఓ మాట అనుకున్నది లేదు. మనకి అంతకన్నా ఇంకేం కావాలే, ఓ సారి మా ఇంటికి రా నీకే తెలుస్తుంది’ అంది ఇందిర మురిసిపోతూ. మనస్పూర్తిగా సంతోషించడానికి ప్రయత్నించింది చిన్న. కాసేపు మాట్లాడాక, జాకెట్ ముక్క, ఓ యాపిల్ చేతిలో పెట్టింది చిన్న. తెలిసిన ఆటో మాట్లాడి ఎక్కించి, ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సరస్వతి ఫోను ‘చిన్నమ్మా కార్తీకమాసం కదా, యమ ద్వితీయ నాడు భగినీ హస్త భోజనం చేస్తే అన్నయ్యకి ఆయుష్షు వృద్ధి, నీ కాపురం బావుంటుందట ఈ శనివారం అన్నయ్యని ఇంటికి పిలు’ అంది.అంతే అప్పటివరకూ అణచిపెట్టిన దుఖం ఎగజిమ్మింది. ‘అమ్మా, వాడు నాకేం చేశాడని? నేను చంటిని అందగాడనో, వయసు వ్యామోహం వల్లో ప్రేమించలేదు. ఫలానా వాడితో నా జీవితం భద్రంగా ఉంటుందని ప్రతీ అమ్మాయికీ ఓ నమ్మకం ఉంటుంది. నాకు వాడి కళ్ళు చూస్తే అదే అనిపించి వాణ్ణి ఇష్టపడ్డాను. మీరు పడనివ్వలేదు. ఏదో చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని వాడు ప్రయోజకుడు కాడని నిర్ణయించేశారు. ఆడపిల్లకి జీవితంలో అతి పెద్ద బెట్టింగ్ పెళ్ళి.మా ఆయనెప్పుడూ ఏం చెబుతాడో తెలుసా, కౌంటు ఇచ్చినా పర్లేదు కానీ ఎవడి పేక వాడే ఆడాలట. నా బాధల్లా అదే. ధర్మరాజు జూదమాడితే ద్రౌపది అడవుల పాలైనట్టు అన్నయ్య నిర్ణయానికి నేను బలైపోయాను. ఉంటాను, మళ్ళీ మీరు ఏరి కోరి మరీ చేసిన బాబి తాగి, ఇంటికొచ్చేటప్పటికి నేను ఫోన్ మాట్లాడుతూ కనబడితే గొడవ చేస్తాడు’ అందామనుకుని, గ్రీష్మాన్ని గుండెల్లోనే దాచి, పెదవులపై వసంతం పూయిస్తూ, ‘సర్లే, ఆరోజు అన్నయ్యకి కుదిరితే రమ్మను’ అంటూ ఫోన్ పెట్టేసి ఎందుకో ఇందిర షేర్ చేసిన ఫొటోలో ఆమె భర్తని తదేకంగా చూసింది.అభయాంజనేయుడిలా భద్రత నిస్తూ గ్యారంటీ కార్డు లాంటి కళ్ళు, అవి కనబడకుండా చిన్నమ్మ కళ్ళ నిండా నీళ్ళు. — ఉమా మహేష్ ఆచాళ్ళ -
Nidhi Bhist: మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే..! కానీ ఇప్పుడు నిధి ద బెస్ట్!!
‘జాబ్ కన్నా యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్నట్టుంది. షారూఖ్ ఖాన్తో కలసి స్క్రీన్ మీద కనిపిస్తావన్నమాట’ అంటూ బాస్ ఎగతాళి చేశాడు. ‘గుండ్రటి మొహం.. అక్క, వదిన, పిన్ని పాత్రలకైతే పనికొస్తావ్. మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే!’ అని బాలీవుడ్ రిజెక్ట్ చేసింది. ఆమె ఇప్పుడు వండర్ఫుల్ యాక్ట్రెస్, రైటర్ అండ్ డైరెక్టర్గా సినిమా ప్రేక్షకుల, వెబ్ వీక్షకుల మన్ననలందుకుంటోంది. అన్నట్టు షారూఖ్ ఖాన్తోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ బహుముఖ ప్రజ్ఞ పేరు.. నిధి బిష్ట్! ► ఢిల్లీలో పుట్టి, పెరిగింది. అమ్మ.. టీచర్. నాన్న.. ఐపీఎస్ ఆఫీసర్. ఆ ఇద్దరూ తమ కూతురు డాక్టర్ కావాలని కలలు కన్నారు. వాళ్ల కోరిక మేరకు ఇంటర్లో బైపీసీలో జాయిన్ అయింది నిధి. కానీ రెండు రోజులకే అది తన నోట్స్ ఆఫ్ స్టడీ కాదనుకుంది. దాంతో కామర్స్ గ్రూప్కి మారింది. అదీ తనకు సరిపడదని గ్రహించి ఆ వెంటనే హ్యుమానిటీస్లోకి వెళ్లి సెట్ అయింది.► ఇంటర్ తర్వాత .. జామియా మిలియా యూనివర్సిటీలో లా చేసింది. అక్కడ థియేటర్ వింగ్ ఇప్టా (ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్) చాలా యాక్టివ్. చిన్నప్పటి నుంచీ నిధికి నటనంటే ప్రాణం. అందుకే ‘లా’ కోసం ఆ యూనివర్సిటీని ఎంచుకుంది. తన అయిదేళ్ల లా కోర్స్లో ఇప్టాతోనే ఎక్కువ గడపింది నాటకాలు రాస్తూ.. వేస్తూ! ఆ ఆసక్తి, ఉత్సాహంతోనే లా అయిపోగానే పుణె వెళ్లింది అక్కడి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవడానికి. కానీ అందులో సీట్ రాలేదు. నిరాశతో మళ్లీ ఢిల్లీకి వచ్చేసి ఒక లా ఫర్మ్లో చేరింది.► ఉద్యోగం చేస్తున్నప్పుడే ఒక నాటకంలో నటించే అవకాశం వచ్చింది నిధికి. ఉదయం 9 కల్లా ఆఫీస్కి చేరి.. అక్కడి నుంచి కోర్ట్.. మళ్లీ ఆఫీస్ అలా రాత్రి 9 వరకు పని చూసుకుని.. అక్కడి నుంచి నేరుగా థియేటర్ రిహార్సల్స్కి వెళ్లేదట. ఉదయం మూడు గంటల వరకు రిహార్సల్స్ చూసుకుని ఇల్లు చేరేది. అలా కొన్ని నెలల శ్రమానంతరం స్టేజ్ మీద నాటకం ప్రదర్శించే రోజు రానేవచ్చింది. నిధి తన బాస్నూ ఆహ్వానించింది. అతను ఆ రోజు చప్పట్లతో ఆమె ప్రతిభను ప్రశంసించాడు. కానీ మరుసటి రోజు ఆఫీస్లో పది పనులు చెప్పి .. సాయంకాలానికి డెడ్లైన్ ఇచ్చాడు. చేయలేకపోయింది నిధి. అప్పుడే ‘షారూఖ్ ఖాన్తో కలసి కనిపిస్తావన్నమాట’ అంటూ ఆ బాస్ కామెంట్ చేశాడు. ‘తప్పకుండా కనిపిస్తాను చూడండీ..’ అంటూ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చింది నిధి.► యాక్టింగ్ మీదే పూర్తి దృష్టి పెట్టాలని ముంబై చేరింది. కనీస అవసరాల కోసం p్చnజ్ఛ్చ3 అనే లీగల్ ఔట్సోర్సింగ్ సంస్థలో చేరింది. జాబ్.. ఆడిషన్సే లోకమయ్యాయి ఆమెకు. అయితే ఎక్కడికి వెళ్లినా రిజెక్షనే ఎదురైంది. అయినా అధైర్యపడలేదు. తన ఫిక్స్డ్ డిపాజిట్ని బ్రేక్ చేసి ‘న్యూ బ్రెయిన్ థియేటర్ వోక్స్’ అనే బ్యానర్ని స్థాపించి ‘హూ లెట్ ద డాగ్స్ అవుట్’ అనే నాటకాన్ని డైరెక్ట్ చేసింది. అది చూసి యూట్యూబ్ చానెల్ ‘టీవీఎఫ్ (ద వైరల్ ఫీవర్ ) వీడియోస్’ ఫౌండర్ అరునాబ్ కుమార్ టీవీఎఫ్లో అవకాశం ఇచ్చాడు. అందులో ఆమె స్క్రిప్ట్ రైటర్గా, యాక్టర్గా, కాస్టింగ్ డైరెక్టర్గా మల్టిపుల్ రోల్స్ని పోషించింది. ఆ టాలెంట్ ఆమెకు ఇటు ఓటీటీ.. అటు సినిమాల్లో ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది. దేశమంతటా అభిమానాన్ని సంపాదించిపెట్టింది.► క్రియెటివిటీకి బెంచ్ మార్క్ ఉండదనే కాన్ఫిడెన్స్ నాది. కాబట్టే ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా లైట్ తీసుకున్నా. వచ్చిన అవకాశంతో నేనేంటో నిరూపించుకున్నా! అందుకే ఆ రోజు రిజెక్ట్ చేసినవాళ్లే ఈ రోజు నాతో పనిచేయడానికి డేట్స్ అడుగుతున్నారు!‘తుప్పాకీ’, ‘చాయ్ సుట్టా క్రానికల్స్’, ‘పర్మినెంట్ రూమ్మేట్స్’, ‘టీవీఎఫ్ పిచర్స్’, ‘ఉమ్రీకా’, ‘టీవీఎఫ్ ట్రిప్లింగ్’, ‘ఫిల్లోరి’, ‘బిష్ట్.. ప్లీజ్’, ‘పిఏ గాళ్స్’, ‘డ్రీమ్ గర్ల్’, ‘క్యూబికల్స్’, ‘మిస్టర్ అండ్ మిసెస్’, ç‘ßోమ్ శాంతి’, ‘ఫోన్ బూత్’. ‘మామ్లా లీగల్ హై’ వంటి షోస్, సినిమాస్, సిరీస్కి కాస్టింగ్ డైరెక్టర్, రైటర్, డెరెక్టర్, యాక్టర్గా పనిచేసింది. టీవీఎఫ్లోనే.. షారూఖ్ ఖాన్ పాల్గొన్న ‘బేర్లీ స్పీకింగ్ విత్ అర్నబ్’ అనే షోకి నిధి మోడరేటర్గా వ్యవహరించి.. తన బాస్కి చెప్పినట్టు షారూఖ్ ఖాన్తో స్క్రీన్ కూడా షేర్ చేసుకుంది. – నిధి బిష్ట్.ఇవి చదవండి: Cover Story: 'స్వేదవేదం'! చెమటచుక్కకు దక్కుతున్నదెంత? -
'పుదీనా'తో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో? మీకు తెలుసా!
ప్రకృతి ప్రసాదించిన, తాజాదనాన్ని ఇచ్చే ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉన్న ఆకు పుదీనా. దీనిని నిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో పుదీనా వాడకం మరింత ప్రయోజనకరం.పుదీనా ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి–6 లతోపాటు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్, ్రపోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండడంతో ఇది మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ పుదీనా వాటర్ తీసుకుంటే చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడానికి, ముసలితనం త్వరగా రాకుండా ఉండడానికి పుదీనా ఎంతో ఉపయోగపడుతుంది.పుదీనా నీటిని తాగితే శరీరానికి శక్తి లభించడమే కాకుండా చర్మ సమస్య లు తగ్గుతాయి. కళ్ళ కింద నలుపు తగ్గటానికి పుదీనాతో తయారు చేసిన లేపనం ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని మలినాలను తొలగించి జీర్ణక్రియను సాఫీగా చేయడానికి, జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడానికి ఉపయోగపడుతుంది. çపుదీనాను మజ్జిగతో కలిపి తీసుకుంటే మన శరీరంలో వేడి తగ్గుతుంది.అందానికి కూడా!పుదీనా ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా ప్రకాశవంతంగా మారుతుంది. మన అందాన్ని పెంచటంలో కూడా పుదీనాది ప్రత్యేక స్థానం. చర్మ సమస్యలను నివారిస్తుంది. మొటిమలను, మచ్చలను తగ్గించడంలో పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది. దంత సమస్యలను, చిగుళ్ల సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనకు చెక్ పెట్టి, దంతాలను తెల్లగా మెరిసేలా చేస్తుంది. ఉదయాన్నే నిమ్మరసం, తేనె, పుదీనా కలిపి తీసుకుంటే ఆరోగ్యాన్ని అది బాగు చేస్తుంది.పుదీనాతో ఉత్సాహం..వేసవిలో అధిక దాహం, అలసట సర్వ సాధారణం. అధిక దాహం సమస్యకు చెక్ పెట్టడానికి పుదీనా వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, అలసటగా ఉన్నప్పుడు పుదీనా వాటర్లో కాస్తంత నిమ్మరసం, పటికబెల్లం లేదా చిటికడు బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగితే అలసట ఇట్టే తీరుతుంది.ఇవి చదవండి: ఆరోగ్యం విషయంలో.. ఇలా ప్రవర్తిస్తున్నారా? జాగ్రత్త! -
ఆరోగ్యం విషయంలో.. ఇలా ప్రవర్తిస్తున్నారా? జాగ్రత్త!
కూరలను బాగా నూనె పోసి వేయించి ఉప్పూకారం మసాలా దట్టించినందువల్ల నోటికి రుచిగా ఉండచ్చేమోగాని ఆ కూరలలోని పోషక విలువలన్నీ చచ్చిపోయి నిస్సారమవుతాయి. త్వరగా జీర్ణం కావు. నూనె ఎక్కువైనందువల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం, శరీరంలో కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం రావటం తదితర ఇబ్బందులు తలెత్తుతాయి. విపరీతంగా ఉడకబెట్టినా అంతే... సారం లేని పదార్థాన్ని తిన్నట్టే. అది తినడం వల్ల ఆ ఆహారం మన ఒంటికి పట్టదు. అసలు మనం ఎలాంటి కూరలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. మనం తిన్న ఆహారం వంటబట్టాలంటే నూనెలో వేయించిన కూరలను తినే అలవాటును మానుకోవాలి. ఉడికించిన కూరలలో కొద్దిగా తాలింపు వేసుకుని తినే విధంగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.గింజధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు అన్నింటిలోను అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. వాటి మోతాదుల్లో మాత్రమే తేడా ఉంటుంది. అందువల్ల మనకు అన్నీ అవసరమే. అయితే అన్నీ అందరికీ ఒకే రీతిలో అవసరం కావు. ఉదాహరణకు పాలు తాగే పసిపిల్లలకు ఒకరకమైన పోషకాలు కావాలి. చిన్న పిల్లలయితే మరొక రకమైన పోషకాలు కావాలి. యుక్తవయస్కులకు ఇంకొక రకం పోషకాలు కావాలి. అదేవిధంగా గర్భిణులకు ఒక రకమైన పోషకాలు, పెద్దవారికి, వృద్ధులకూ మరొక రకమైన పోషకాలూ కావాలి. అంటే అవసరాలనుబట్టి పోషకాలు మారతాయి. కాబట్టి తీసుకోవలసిన ఆహారం కూడా మారుతుంది. అదే విధంగా ఆహార చికిత్సా ప్రక్రియలో కూడా వ్యాధిని బట్టి, రోగిని బట్టి తీసుకోవలసిన ఆహారం మారుతుంది. ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం అంటే ఇదే.నిజానికి ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం అనుకున్నంత తేలికకాదు. పోషకాలను బట్టి పరిశీలిస్తే గింజధాన్యాలలో అన్ని రకాల పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయని, ఆకు కూరలు, పండ్లు, దుంపలతో సహా బాదం, ఖర్జూర మొదలైన ఎండు ఫలాలలో ఏదో ఒక పోషక విలువ లోపించి ఉండటాన్ని మనం గమనించవచ్చు. కేవలం ఈ కారణం వల్ల గింజధాన్యాలను మాత్రమే తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి.అవి త్వరగా జీర్ణంకావు. అందువల్ల, గింజధాన్యాలతోబాటు తప్పనిసరిగా త్వరగా జీర్ణం అయ్యే ఆకు కూరలు, పండ్లు కూడా అవసరం. ఇవి అన్నీ తెలిసినప్పుడే సమీకృత ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం సులభం అవుతుంది. ఈ విషయంలో మనలో చాలామందికి ఉన్న సాధారణ ఆహార విజ్ఞానం సరిపోదు. పోషకాహార నిపుణులతో లేదా ప్రకృతి వైద్యులతో సంప్రదించి, వారి సలహా తీసుకోవటం అవసరం.సమీకృత ఆహారం.. కొన్ని సూచనలు..ఎటువంటి ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలన్న విషయాన్ని అలా ఉంచితే సాధారణ ఆరోగ్యం దృష్ట్యా ఈ కింది సూచనలను పాటించటం మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతుంటారు. రోజూ ఉదయం పచ్చికూర ముక్కలు (వెజిటబుల్ సలాడ్) తీసుకోవటం మంచి అలవాటు. దంతాల పటుత్వం లేని వారు కూర ముక్కలను మిక్సీలో వేసుకుని చిన్న చిన్న ముక్కల రూపంలోగాని, లేక జ్యూస్ రూపంలోగాని తీసుకోవచ్చు. అన్నిరకాల, అన్ని రంగుల పండ్లను లేదా పళ్లరసాలను తీసుకోవాలి. ఆ క్రమంలో కాలానుగుణంగా వచ్చే సీజనల్ ఫలాలను తప్పనిసరిగా తీసుకోవాలి. మనం తినే ఆహారంలో కనీసం 30 లేక 40 శాతం పండ్లు ఉంటే మంచిది. దంపుడు బియ్యం లేక మర పట్టని ముతకబియ్యం శ్రేష్ఠం. చిరుధాన్యాలు వాడటం మంచిది. మొలకెత్తిన గింజలు, కొబ్బరి, ఖర్జూర ప్రతిరోజూ తీసుకోవటం మంచిది.ఇలా తీసుకోవాలి..కనీసం వారానికి నాలుగు రోజులు ఆకుకూరలను ఇగురు లేదా పప్పు రూపంలో తీసుకోవాలి.కాఫీ, టీ తాగే అలవాటును నెమ్మదిగా మానుకోవటం మంచిది, అలా మానుకోవడం సాధ్యం కాకపోతే, కనీసం మోతాదును తగ్గించాలి. రోజుకి ఒకటి లేక రెండుసార్లకు మించి తీసుకోరాదు.పొగాకు, జర్దా, ధూమపానం, మత్తుపానీయాలను పూర్తిగా మానుకోవాలి.కృత్రిమ రసాయనాలతో తయారు చేసిన, నిల్వ ఉన్న బేకరీ వస్తువులు, శీతల పానీయాలు (కూల్ డ్రింక్స్), చాక్లెట్లు, ఫాస్ట్ఫుడ్స్, ఐస్ క్రీమ్ లాంటివి మన శరీరానికి హాని చేస్తాయి. అందువల్ల వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించటం మంచిది.ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. ఎందుకంటే, మన శరీరానికి అవసరమైనంత ఉప్పు మనం తీసుకునే పండ్లు, కూరగాయలలోనే ఉంటుంది.ఆహారం ఎంపికలో మరొక ప్రధాన సమస్య అమ్లయుతమైన ఆహారం, క్షార యుతమైన ఆహారం, ఆమ్లాలు, క్షారాలు రెండూ మనకు అవసరమే అయినా, వాటి నిష్పత్తిలో తేడా ఉంది. ఆమ్లాల కన్నా క్షారాలు మనకు అధికంగా కావాలి. మనం తీసుకునే ఆహారం కూడా అదేవిధంగా ఉండాలి. అంటే ఆమ్లయుతమైన పదార్థాలు తక్కువగా, క్షారయుతమైన పదార్థాలు. ఎక్కువగా ఉండే విధంగా ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.అదేవిధంగా రోగగ్రస్థుల విషయంలో వ్యాధినిబట్టి ఆహార ఎంపిక ఉంటుంది. ఇది. అయితే ప్రధానంగా వైద్యుల పర్యవేక్షణలో జరగాలి.ఇవి చదవండి: మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో.. ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్.. -
మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో.. ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్..
ఇంటి పనులతోనే రోజంతా గడిచిపోతుంటుంది. అభిరుచిని మెరుగుపరుచుకోవాలన్నా సమయమే సరిపోదనిపిస్తుంది. కానీ, కొందరు మాత్రమే ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమతోపాటు మరికొందరికి ఉపాధి అవకాశాలను అందిస్తుంటారు. ఈ కోవకే చెందుతారు సవిత ఆలంపల్లి. తెలంగాణలోని జహీరాబాద్ వాసి అయిన సవిత కాటన్ ఫ్యాబ్రిక్పైన సహజసిద్ధమైన పువ్వులు, ఆకులతో సహజమైన ప్రింట్లను తీసుకువస్తుంది. అదే ఫ్యాబ్రిక్ని ఉపయోగిస్తూ మోడ్రన్ డ్రెస్సులను డిజైన్ చేస్తోంది. వర్క్షాప్స్ నిర్వహిస్తూ, బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేసి, సెల్ఫ్ మేడ్ బిజినెస్ ఉమన్గా తనని తాను నిరూపించుకుంటుంది. ఆసక్తిని ఉపాధిగా మలుచుకునేందుకు చేసిన ప్రయాణంలో తాను వేసిన అడుగుల గురించి ఆనందంగా వివరించింది.‘‘డిగ్రీ వరకు చదువుకున్న నేను పెళ్లయ్యాక మావారు రామకృష్ణతో కలిసి అమెరికాకు వెళ్లాను. గృహిణిగానే కొన్నాళ్లు ఉండిపోయాను. న్యూయార్క్ ఎఫ్ఐటిలో ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన కోర్స్ చేశాను. పదేళ్ల క్రితం ఇండియా వచ్చి బెంగళూరులో స్థిరపడ్డాం. రోజంతా ఇంటిపనులు, పిల్లల పనులు ఉన్నా నా కోసం కొంత సమయాన్ని కేటాయించుకునేదాన్ని.ఫాస్ట్ ఫ్యాషన్లో ఉపయోగించే ఫ్యాబ్రిక్ తీవ్రమైన కాలుష్యానికి గురి చేస్తుందని తెలుసుకున్నాను. అప్పటినుంచి నా వంతుగా ఏదైనా చేయాలనుకుని ప్రయత్నాలు చేస్తుండేదాన్ని. ఫ్లోర్ క్లీనర్స్, సుగంధ ద్రవ్యాలు వంటివి ఇంట్లో తయారు చేస్తుండేదాన్ని. వాటివల్ల ఇంట్లో వాళ్లు కూడా చాలా మెచ్చుకునేవారు. ఎకో ప్రింటింగ్, సస్టెయిన్బుల్ ఫ్యాబ్రిక్స్ పైన వర్క్ చేయడం మొదలుపెట్టాను. ప్రకృతి ద్వారా లభించే వస్తువులతో రోజూ ఏదో ఒక ప్రయోగం చేస్తుండేదాన్ని. ఆకులు – పువ్వులు..పూజలు, ఇతర సంప్రదాయ వేడుకలలో పువ్వులు, ఆకులను కూడా ఉపయోగిస్తుంటాం. సాధారణంగా వాటిని ఉడకబెట్టి, టై అండ్ డై చేస్తుంటారు. నేను వాటిని ఎండబెట్టి, కొన్నింటిని తాజాగా ఉన్నప్పుడే ఫ్యాబ్రిక్ మీద చల్లి, దగ్గరగా చుట్టి, కొన్ని రోజులు అలాగే ఉంచి ప్రయోగాలు చేసేదాన్ని. ప్రయత్నాలు చేయగా చేయగా ఫ్యాబ్రిక్పైన రకరకాల డిజైన్స్ అమితంగా నన్ను ఆకట్టుకున్నాయి. మోదుగ, శంఖపుష్ప, పారిజాత.. వంటివే కాదు అరుదుగా పూసే పువ్వులనూ సేకరిస్తాను. వాటిని ఎండబెట్టి నిల్వ ఉంచుతాను. మామిడి, జామ, మందార ఆకులనూ డిజైన్కు వాడుతుంటాను. ఏ మాత్రం రసాయనాలు లేని ప్రయోగం ఇది.ఇంటి నుంచి స్టూడియో వరకు..రసాయనాలతో పండించే పత్తి కాకుండా వర్షాధార పంటద్వారా వచ్చే కాటన్ ఫ్యాబ్రిక్ను కలెక్ట్ చేసి, నా ప్రయత్నాలను ఇంకా విరివిగా చేయడం మొదలుపెట్టాను. సస్టెయిన్బుల్ డ్రెస్సులు అంటే చాలావరకు వదులుగా ఉండే దుస్తులు అనుకుంటారు. కానీ, మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్ చేయాలనుకున్నాను.కార్పొరేట్ ఉమెన్కు నప్పే విధంగా, అలాగే టీనేజ్ కలెక్షన్స్ కూడా ప్రిపేర్ చేస్తుంటాను. ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్, ప్రింటింగ్.. డ్రెస్సులు ధరిస్తే ఒంటికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉన్నామన్న అనుభూతి సొంతం అవుతుంది. ఏడెనిమిదేళ్లుగా సస్టెయినబిలిటీ మీద రకరకాల ప్రయోగాలు చేసి, ఐదేళ్ల క్రితం ‘టింక్టోరియా’ పేరుతో బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేశాను. ఆకులలో ఉండే జీవాన్ని టింక్టోరియా అంటారు.దానిని ఫ్యాబ్రిక్ మీదకు తీసుకురావాలని చేసిన ప్రయత్నం కాబట్టి అదే పేరును నా డిజైన్స్కు పెట్టాను. ఇంటినుంచి స్టూడియోదాకా మారేందుకు చేసిన రకరకాల ప్రయోగాల వల్ల ఇప్పుడు నాతోపాటు మరో ఐదుగురు మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాయి. మేమంతా కలిసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్కు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం పని చేస్తుంటాం.అవగాహనకు వర్క్షాప్స్..ఎకోప్రింటింగ్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి హైదరాబాద్, బెంగళూరు ఇతర క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్లలో ఉచితంగా వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాను. స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటాను. అక్కడి వచ్చి, ఆసక్తితో నేర్చుకుంటాను అనేవారు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ప్రింటింగ్ ్రపాసెస్ అడుగుతుంటారు. చాలా మందికి ఆకులతోనూ, పువ్వులతోనూ డిజైన్ చేస్తారని తెలియదు. ఈ డిజైన్ ఉతికితే పోతుందేమో అనుకుంటారు. కానీ, సరైన విధంగా చేస్తే రంగు ఏ మాత్రం పోదు.ముందు కుంకుడుకాయ రసంతో ఫ్యాబ్రిక్ను శుభ్రం చేస్తాం. ఆ తర్వాత ఆకులను, పువ్వులను అనుకున్న డిజైన్స్లో అమర్చి, దగ్గరగా చుట్టి, ఆవిరిమీద ఉంచుతాం. ఆ తర్వాత బయటకు తీసి, ఒకరోజంతా అలాగే ఉంచుతాం. ఆ తర్వాత పూర్తిగా విప్పి, క్లాత్ని శుభ్రం చేస్తాం. సరైన డిజైన్ రావడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. షిబోరి, టై అండ్ డై, కలంకారీ డిజైన్స్తోపాటు నేతకారులతో ముందే మాట్లాడి ఫ్యాబ్రిక్ డిజైన్లో మోటిఫ్ ప్రింట్స్ వచ్చేలా గైడెన్స్ ఇస్తుంటాను.కొన్ని రకాల ఆకులు, పువ్వుల ప్రింటింగ్లో థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది. ప్రకృతిపైన ప్రేమ, ఇష్టంతో నన్ను నేను కొత్తగా మార్చుకునే క్రమంలో ఎంచుకున్న మార్గం ఇది. ఇంట్లో వాడాల్సిన కెమికల్స్ స్థానంలో ఏ మాత్రం రసాయనాలు లేని వస్తువులను తయారు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాను. ఈ విధానం వల్ల ఐదారేళ్లలో నాదైన ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాను అనిపిస్తుంది’ అని ఆనందంగా వివరిస్తారు సవిత. – నిర్మలారెడ్డిఇవి చదవండి: Devika Manchandani: పాకశాస్త్ర ప్రవీణ! వంటలపై ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే? -
Devika Manchandani: పాకశాస్త్ర ప్రవీణ! వంటలపై ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే?
చండీగఢ్కు చెందిన 23 సంవత్సరాల దేవిక మన్చందానీ ఇప్పుడు న్యూయార్క్లోని ప్రముఖ చెఫ్లలో ఒకరు. వంటలకు సంబంధించిన ఎన్నో పోటీల్లో బహుమతులు గెలుచుకుంది. పేస్ట్రీ చెఫ్గా రకరకాల ప్రయోగాలు చేస్తూ తనదైన ప్రత్యేకత చాటుకుంటోంది.చిన్నప్పటి నుంచి దేవికకు వంటలన్నా, కొత్త వంటకాల గురించి తెలుసుకోవడం అన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనని చండీగఢ్ వీధుల నుంచి న్యూయార్క్లోని ప్రసిద్ధ రెస్టారెంట్ల వరకు తీసుకెళ్లింది. ఆమె కుటుంబంలో, బంధువులలో పాకశాస్త్ర ప్రవీణులు ఎంతో మంది ఉన్నారు. వారి దగ్గరి నుంచి ఎన్నో కుటుంబ వంటకాలను నేర్చుకుంది.వంటలపై దేవిక ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే న్యూయార్క్లోని కలినరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెరికా(సిఐఎ)లో చదివే వరకు. పాకశాస్త్ర పరిధిని విస్తరించుకోవడానికి,ప్రావీణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ చదువు దేవికకు ఉపయోగపడింది.‘సిఐఎ’లో అకడమిక్ ఎక్స్లెన్స్ అవార్డ్ నుంచి నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఇచ్చే అవార్డ్ వరకు ఎన్నో అవార్డ్లు అందుకుంది దేవిక. ‘స్కిల్స్ యూఎస్ఏ బేకింగ్ అండ్ పేస్ట్రీ ఆర్ట్స్’ పోటీల్లో పాల్గొనడం దేవిక కేరీర్లో మైలురాయిగా నిలిచింది. ఆ పోటీలో పాల్గొన్న ఏకైక భారతీయురాలిగా గుర్తింపు పొందింది. అంతేకాదు, ఆ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయం తనని రెండు అడుగులు ముందుకు వేసేలా చేసింది. ప్రసిద్ధ ‘గాబ్రియెల్’ రెస్టారెంట్కు సంబంధించి ముఖ్యమైన ఈవెంట్స్కు నాయకత్వం వహించేలా చేసింది.ఆ రెస్టారెంట్లో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త సవాళ్లు ఎదురయ్యేవి. క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి బాగా తెలిసిన దేవిక ఆ సవాళ్లను అధిగమించింది. ఒక విజేతగా సిఐఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేసే అవకాశం దేవికకు వచ్చింది. ‘పాత్ వేస్ టు ఎక్స్లెన్స్’ అంశంపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసింది. ‘ఎగ్జయిట్మెంట్కు ఎనర్జీ తోడైతే ఎంత విజయాన్ని అయినా సాధించవచ్చు’ అంటుంది దేవిక. ‘స్కిల్స్ యూఎస్ఎ’ రాష్ట్ర స్థాయి పోటీలకు న్యాయనిర్దేత పాత్ర పోషించిన దేవిక ‘బేకింగ్ అండ్ పేస్ట్రీ ఆర్ట్స్’కు సంబంధించిన పోటీకి పోటీ పడుతున్న తరువాతి తరం విద్యార్థులకు మార్గనిర్దేశం చేసింది.పేస్ట్రీ చెఫ్ కావాలనే కలతో చండీగఢ్ నుంచి అమెరికాకు వెళ్లిన దేవిక తన కలను నెరవేర్చుకోవడమే కాదు చిన్న వయసులోనే ప్రముఖ ‘పేస్ట్రీ చెఫ్’గా పెద్ద పేరు తెచ్చుకుంది.సూపర్ స్పీకర్..దేవిక మన్చందానీ చెఫ్ మాత్రమే కాదు స్ఫూర్తిదాయక వక్త కూడా. ఆమె వంటలతో పాటు ఉపన్యాసాలకు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పనిచేస్తున్న క్రమంలోనే క్రైసిస్ మేనేజ్మెంట్కు సంబంధించిన సూత్రాలు పట్టుబడతాయని చెబుతుంది దేవిక. చదువుల కోసం వేరే దేశం వెళ్లే విద్యార్థులకు రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి.తాను అమెరికాకు వచ్చినప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, వాటిని అధిగమించిన తీరును విద్యార్థులకు చెబుతుంటుంది దేవిక. ‘ఎంతో కొంత నేర్చుకున్నాను అనే తృప్తి కంటే ‘ఇంకా ఎంతైనా నేర్చుకుంటాను’ అనే దాహం విజయానికి దారి చూపుతుంది అంటుంది దేవిక. ‘లక్ష్యం మీద అయోమయం కాదు స్పష్టత ఉండాలి’ అంటున్న దేవిక ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తుంది.ఇవి చదవండి: Summer Season: ఈ సమ్మర్ సెలవుల్లో.. పిల్లలు ఫోన్కి దూరంగా ఉండాలంటే? -
ఈ సమ్మర్ సెలవుల్లో.. పిల్లలు ఫోన్కి దూరంగా ఉండాలంటే?
సెలవులొచ్చేది ఆటల కోసం, స్నేహాల కోసం బంధువుల కోసం, విహారాల కోసం, వినోదాల కోసం పిల్లలు ఇంతకాలం ఫోన్లలో కూరుకుపోయారు. వారిని ఫోన్ల నుంచి బయటకు తెండి. మీ బాల్యంలో సెలవుల్లో ఎలా గడిపారో అలా గడిపేలా చేయండి. పెద్దయ్యాక తలుచుకోవడానికి బాల్యం లేకపోవడానికి మించిన విషాదం లేదు.ఆటస్థలాలు లేని స్కూళ్లలో చదివించడం, ఆడుకునే వీలు లేని ఇళ్లలో నివసించడం, పార్కులు లేకపోవడం, ఆడుకోవడానికి తోటి పిల్లలు లేని వాతావరణంలో జీవించడం, ఇవన్నీ ఉన్నా పిల్లలతో గడిపే సమయం తల్లిదండ్రులకు లేకపోవడం... వీటన్నింటి వల్ల పిల్లలకు స్కూల్, ఇల్లు కాకుండా తెలిసింది ఒకే ఒక్కటి. సెల్ఫోన్. పిల్లలకు సెల్ఫోన్లు ఇచ్చి వారు వాటిలో కూరుకుపోతే ‘అమ్మయ్య. మా జోలికి రావడం లేదు’ అనుకునే తల్లిదండ్రులు ఉన్న ఈ కాలంలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆటలు, విహారం, అనుబంధాల విలువ, కొత్త విషయాల ఎరుక ఎలా కలుగుతుంది?అందుకే వేసవి సెలవలు ఒక పెద్ద అవకాశం. ఇరవై ముప్పై ఏళ్ల క్రితం వరకు తెలుగు ్రపాంతాలలో వేసవి సెలవులు వస్తే పిల్లలు ఎలా గడిపేవారో ఇప్పుడూ అలా గడిపే అవకాశం కల్పించవచ్చు. కాకుంటే తల్లిదండ్రులు ప్రయత్నించాలి. పిల్లలను మోటివేట్ చేయాలి.బంధువులు– బంధాలు..బంధువులు ఎవరో తెలియకపోతే బంధాలు నిలవవు. ఎంత స్వతంత్రంగా జీవిద్దామనుకున్నా, సాటి మనుషుల విసిగింపును తప్పించుకుని తెగదెంపులు చేసుకుని బతుకుదామనుకున్నా మనిషి సంఘజీవి. అతడు బంధాలలో ఉండాల్సిందే. బంధాల వల్ల బతకాల్సిందే. పిల్లలకు బంధాలు బలపడేది, బంధాలు తెలిసేది వేసవి సెలవుల్లోనే. ఇంతకు ముందు పిల్లలు వేసవి వస్తే తల్లిదండ్రులను వదిలిపెట్టి పిన్ని, బాబాయ్, పెదనాన్న, తాతయ్య... వీళ్ల ఇళ్లకు వెళ్లి రోజుల తరబడి ఉండేవారు. వారి పిల్లలతో బంధాలు ఏర్పరుచుకునేవారు.దీని వల్ల కొత్త ఊరు తెలిసేది. ఆటలు తెలిసేవి. కలిసి వెళ్లిన సినిమా అలా ఓ జ్ఞాపకంగా మిగిలేది. ఇవాళ పెద్దల పట్టింపులు పిల్లలకు శాపాలవుతున్నాయి. రాకపోకలు లేని బంధుత్వాలతో పిల్లలు ఎక్కడకూ వెళ్లలేని స్థితి దాపురించింది. దీనిని సరి చేయాల్సిన బాధ్యత పెద్దలదే. లేకుంటే పిల్లలు ఫోన్లనే బంధువులుగా భావించి అందులోని చెత్తను నెత్తికెక్కించుకుంటారు. జీవితంలో సవాళ్లు ఎదురైన సమయంలో ఒంటరితనం ఫీలయ్యి అతలాకుతలం అవుతారు.తెలుగు ఆటలు..సెలవుల్లో పిల్లలకు తెలుగు ఆటలు తెలియడం ఒక పరంపర. బొంగరాలు, గోలీలు, వామనగుంటలు, పరమపదసోపాన పటం, ఒంగుళ్లు–దూకుళ్లు, నేల–బండ, ఏడుపెంకులాట, పులి–మేక, నాలుగు స్తంభాలాట, వీరి వీరి గుమ్మడిపండు, లండన్ ఆట, రైలు ఆట, ΄÷డుపుకథలు విప్పే ఆట, అంత్యాక్షరి, కళ్లకు గంతలు... ఈ ఆటల్లో మజా తెలిస్తే పిల్లలు ఫోన్ ముట్టుకుంటారా?కథ చెప్పుకుందామా..కథలంటే పిల్లలకు ఇష్టం. పెద్దలు చె΄్పాలి గాని. ఈ సెలవుల్లో రాత్రి పూట భోజనాలయ్యాక, మామిడి పండ్లు తిన్నాక, పక్కలు వేసుకుని అందరిని కూచోబెట్టి పెద్దలు కథలు చెప్తే ఎన్నెన్ని తెలుస్తాయి! ఎన్ని ఊహల కవాటాలు తెరుచుకుంటాయి. మర్యాద రామన్న, తెనాలి రాముడు, బేతాళుడు, సింద్బాద్, ఆలీబాబా, పంచతంత్రం, రామాయణం, మహాభారతం... భీముడిలోని బలం, అర్జునుడిలోని నైపుణ్యం... ఇవి కదా చె΄్పాలి.బలం కోసం తిండి..పిల్లలను సరిగ్గా గమనించి వారికి కావలసిన బలమైన తిండి తినిపించడానికి వీలయ్యేది ఈ సెలవుల్లోనే. బలహీనంగా ఉండే పిల్లలు, ఎదిగే వయసు వచ్చిన ఆడపిల్లలకు ఏమేమి వొండి తినిపించాలో పెద్దల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు ఈ కాలంలో తినిపిస్తారు. శిరోజాల సంరక్షణ, చర్మ సంరక్షణ, పంటి వరుస సరి చేయించడం, జీర్ణశక్తిని ఉద్దీపన చేయడం, బంధువుల రాక వల్ల లేదా బంధువుల ఇంటికి వెళ్లడం వల్ల పిల్లలందరికీ కలిపి వారికి వృద్ధి కలిగించే ఆహారం చేసి పెట్టవచ్చు. తోటి పిల్లలు పక్కన ఉంటే ఇష్టం లేకపోయినా పిల్లలు తింటారు.సెలవులొచ్చేది పిల్లల మానసిక, శారీరక వికాసానికి. కదలకుండా మెదలకుండా ఫోన్ పట్టుకుని కూచుని వారు ఈ సెలవులు గడిపేస్తే నింద తల్లిదండ్రుల మీదే వేయాలి... పిల్లల మీద కాదు.ఇవి చదవండి: Indian Navy Women Officers: సముద్రంపై సాహస సంతకం -
Beauty Tips: పాదాలలో.. ఇలాంటి సమస్యలున్నాయా? అయితే ఇలా చేయండి!
మారుతున్న వేడి వాతావరణం కారణంగా చర్మ సమస్యలు రావచ్చు. పాదాల విషయానికొస్తే.. దుమ్ము, దూళితో పాదాలు నలుపెక్కే అవకాశం ఉంది. చెమటతో మరింత మందంగా చీలికలేర్పడవచ్చు. కనుక మృదువైన పాదాల సంరక్షణకై ఈ చిన్న చిట్కాలు ఏంటో చూద్దాం.ఇలా చేయండి..చేతులు, పాదాలపై నల్లటి మచ్చలుంటే వాడేసిన నిమ్మతొక్కతో రుద్దితే పోతాయి.సమ్మర్లో బయటకు వెళ్ళేటప్పుడు పాదాలకు సాక్స్ వేసుకుంటే పగుళ్ళు రాకుండా ఉంటాయి.రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత మసాజ్ క్రీమ్ లేదా ఆయిల్తో ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి.పదిహేను రోజులకు ఒకసారి పెడిక్యూర్ చేసుకోవాలి.స్నానం పూర్తయిన తర్వాత పమిస్ స్టోన్తో పాదాలను మెల్లగా రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగిపోయి పాదాలు నునుపుగా ఉంటాయి.ఇవి చదవండి: ఎముక పుచ్చిపోయింది..నడవొద్దన్నారు: ఇపుడు ఏకంగా సిక్స్ప్యాక్ -
ఫీజుకు బదులు ప్లాస్టిక్!
ఈ భూగోళం మీద ప్లాస్టిక్ తొడుగు ఉంది. అది నీటిలో నానదు. మట్టిలో కలవదు. నిప్పులో కాల్చితే విషంగా మారుతుంది. అలాంటి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. లేదా రీసైకిల్ చేయాలి. అందుకే అసోంలోని ఆ స్కూల్ 2016లో వృథా ప్లాస్టిక్కే స్కూల్ ఫీజ్గా ప్రారంభమైంది. ఏడేళ్లు గడిచినా దిగ్విజయంగా నడిచి పర్యావరణ హితమైన స్కూల్గా ప్రశంసలు అందుకుంటోంది.ఫీజుకు బదులు ప్లాస్టిక్ వేస్ట్ను ఎవరైనా తీసుకుంటారా? ఆ స్కూల్లో తీసుకుంటారు. ఎంత వేస్ట్ తెస్తే అంత మెచ్చుకుంటారు కూడా. పర్మితా శర్మ, మజిన్ ముక్తార్ అనే పర్యావరణ ప్రేమికుల, బాలల హితుల వినూత్న ఆలోచన ఇది. అసోంలోని పమోహీలో ‘అక్షర్’పేరుతో వీరిద్దరూ ఒక పాఠశాల స్థాపించారు 2016లో. దీనిని భిన్నంగా నడపాలని నిశ్చయించుకున్నారు.చదువు, స్కిల్స్, పర్యావరణ స్పృహ సిలబస్గా ఉండాలనుకున్నారు. అందుకే ఫీజు కట్టాలంటే నోట్లు తేవద్దు వేస్ట్ ప్లాస్టిక్ తెండి అని చెప్పసాగారు. వీలైనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకెళ్తే ఫీజు కట్టినట్లు రసీదు ఇస్తారు. మరో విషయం ఏమిటంటే ఇక్కడ విద్యార్థులను వారి వయసును బట్టి కాకుండా అవగాహన స్థాయిని బట్టి తరగతుల్లో వేస్తారు. ఎనిమిదేళ్లు వచ్చిన వారు 3వ క్లాస్లో ఉండాలని రూల్ లేదు. నాలుగులో ఉండొచ్చు లేదా రెండులోనూ ఉండొచ్చు.ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడాలని..మనుషులు బాగా చలి పుడితే దేనితోనైనా చలిమంట వేసుకోవడానికి వెనుకాడరు. అసోంలో చలి ఎక్కువ. కాని కట్టెలు ఖర్చు. అందుకే చలిమంటల కోసం ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లను, కవర్లను తెచ్చి మంటల్లో వేయసాగారు. ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగంగా తగులబెట్టడం పర్యావరణానికి తీవ్రమైన హాని. దీనిపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదు.దానికి తోడు ప్లాస్టిక్ తగులపెట్టడం వల్ల వెలువడే విష వాయువులు పీల్చి పిల్లలు జబ్బు పడసాగారు. దీంతో సామాజిక కార్యకర్త అయిన పర్మితా శర్మకు ఓ ఆలోచన తట్టింది. తన మిత్రుడు, అమెరికాలో బాలల విద్యారంగంలో పని చేస్తున్న నిపుణులు మజిన్తో తన ఆలోచనను పంచుకుంది. అసోం భౌగోళిక పరిస్థితుల గురించి, అక్కడ నెలకొన్న సవాళ్ల గురించి మజిన్కు వివరించింది. అలా వారిద్దరి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ‘అక్షర్’ విద్యాలయం.ప్లాస్టిక్ను రీసైకిల్ చేస్తున్న విద్యార్థులుఎవరు చేరుతారు?స్కూలంటే డబ్బు తీసుకుని చదువు చెప్పాలి. ప్లాస్టిక్ తెండి స్కూల్లో చేరండి అంటే ఎవరు చేరతారు. పైగా సంప్రదాయ విద్యకు, వృత్తి విద్యకు మధ్య వారధిగా ప్రారంభించిన ఈ పాఠశాలకు విద్యార్థులను రప్పించడం మొదట్లో సవాలుగానే మారింది. ఇక అక్కడి పేద పిల్లలు దగ్గర్లోనే ఉన్న రాళ్ల క్వారీలలో పనిచేస్తారు. వారిని బడికి పంపిస్తే ఆదాయం కోల్పోతామని తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపేందుకు ససేమిరా అన్నారు. దీంతో తల్లిదండ్రుల అవసరాలకు తగిన విధంగా స్కూల్ సమయాన్ని, బోధనను ‘అక్షర్’ లో రూపకల్పన చేశారు.ప్లాస్టిక్ ఇటుకలు..‘అక్షర్’లో నెదర్లాండ్స్ నుంచి తెప్పించిన మెషినరీ ద్వారా ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తారు. పాత ప్లాస్టిక్తో ఇటుకలు తయారు చేస్తారు. వీటిని నిర్మాణాల్లో వాడొచ్చు. పిల్లలు స్కూల్ అయ్యాక ఈ ఇటుకల తయారీ నేర్చుకుంటున్నారు. అలాగే పూలకుండీలు, బౌల్స్ వంటివి ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు రెండున్నర వేల ప్లాస్టిక్ బాటిళ్లు, ఏడు లక్షల ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ రీసైకిల్ అయ్యాయి.అసోంను ప్లాస్టిక్ పీడ నుంచి విముక్తం చేయాలంటే తమ స్కూల్ మోడల్ని ఫాలో కావాలని పర్మిత, మజిన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికి 5 స్కూళ్లు ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయి. అంటే ఫీజుగా ప్లాస్టిక్ను తీసుకుంటున్నాయి. మరో వంద స్కూళ్లు ఇలా చేస్తే బాగుంటుందని పర్మిత, మజిన్ భావిస్తున్నారు. అసోంలో మాత్రమే కాదు దేశమంతా ఈ మోడల్ను ఉపయోగిస్తే ప్లాస్టిక్ వ్యర్థాలను కచ్చితంగా తరిమికొట్టడం వీలవుతుంది.ఇవి చదవండి: Kalaiyarasi: తను ఒక ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’.. -
Kalaiyarasi: తను ఒక ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’..
బాధ పడి ఆ బాధను కాలగమనంలో మరచిపోయేవారు కొందరు. బాధ పడి ఆ బాధలో నుంచి కొత్త అడుగు వేసేవారు కొందరు. కలైయారసి రెండో కోవకు చెందిన మహిళ. నేతకార్మికుల బంగారు కాలాన్ని కళ్లతో చూసిన కలైయారసి అవే కళ్లతో వారి కష్టాలను చూసింది. ఆ బాధలో నుంచి ‘రాటై’ స్టార్టప్కు స్వీకారం చుట్టింది. సంప్రదాయ నేతకళకు డిఐవై(డూ ఇట్ యువర్ సెల్ఫ్) కిట్స్ ద్వారా కొత్త వెలుగు తెస్తోంది తమిళనాడుకు చెందిన కలైయారసి రామచంద్రన్. పిల్లలు, పెద్దలు ఉపయోగించేలా ఈ కిట్ను డిజైన్ చేశారు. సంప్రదాయ కళకు విస్తృతప్రాచుర్యం కల్పిస్తున్న కలైయారసి గురించి...కొన్ని సంవత్సరాల క్రితం..‘చదువుకోవాలని ఉంది’ అని తన మనసులోని మాటను భర్తకు చెప్పింది కలైయారసి. పెళ్లికి ముందు పై చదువులు చదువుకోడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డుగోడలుగా నిలిచాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. కలైయారసి మనసులో మాట విన్న భర్త ‘తప్పకుండా’ అని ప్రోత్సహించాడు. అలా కలైయారసి ఎంసీఎ పూర్తి చేసింది. ఆ తరువాత ఒక ఐటీ కంపెనీలో డెవలపర్గా పని చేసింది.ఈరోడ్(తమిళనాడు) జిల్లాలోని సాలంగపాలయం గ్రామానికి చెందిన కలైయారసి నేతకార్మికుల కుటుంబం నుంచి వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసినా నేతకళపై ఆమెకు ఉన్న ప్రత్యేకాభిమానం మాత్రం దూరం కాలేదు. సెలవుల్లో సొంత ఊరుకు వచ్చిన కలైయారసి అక్కడ నేతకార్మికుల కష్టాలను ప్రత్యక్షంగా చూసింది. ఊళ్లో చేనేత మగ్గాల సంఖ్య 7,500 నుంచి 2,500కు పడిపోయింది.కష్టాలలో ఉన్న నేతకార్మికులకు ఆసరాగా నిలవడానికి తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది కలైయారసి. నేతకళ గురించి మరిన్ని వివరాలు తెలుసుకొని ‘రాటై హ్యాండ్లూమ్’ పేరుతో స్వగ్రామంలో ఎకో–ఫ్రెండ్లీ హ్యాండ్లూమ్ స్టార్టప్కు శ్రీకారం చుట్టింది. పర్యావరణహిత కోణంలో ఆలోచించి ఆర్గానిక్ క్లాత్ వీవింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టింది.‘నేతపని ద్వారా ఉపాధి పొంది సంతోషంగా ఉన్న కార్మికుల ఆర్థికపరిస్థితి ఆ తరువాత దిగజారిపోయింది. చాలామంది ఉపాధి వెదుక్కుంటూ పట్టణాల బాట పడ్టారు. డబుల్ షిఫ్ట్లలో పనిచేసేవాళ్లు. కొందరు వాచ్మెన్గా పని చేశారు. తల్లిదండ్రులు ఊళ్లో లేకపోవడంతో పిల్లల చదువు గాడి తప్పింది. తమిళనాడులో ఎన్నో గ్రామాలకు వెళ్లి నేతకార్మికులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నాను. ఈ పరిస్థితి నాకు బాధాకరంగా అనిపించింది’ అంటున్న కలైయారసి తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి నేతకళను స్వయంగా నేర్చుకుంది. సహజరంగులతో పాటు అరటి పీచు, జనపనార, ఇతర పదార్థాలతో తయారుచేసిన సేంద్రియ నూలును ‘రాటై’ ఉపయోగిస్తోంది. ప్రస్తుతం 28 కుటుంబాల వరకు ‘రాటై హ్యాండ్లూమ్’ కోసం పనిచేస్తున్నాయి.సంప్రదాయ చేనేత వస్త్రాలకు ఊతం ఇచ్చేందుకు పోర్టబుల్ డిఐౖవై హ్యాండ్లూమ్ కిట్ల ఆలోచనకు శ్రీకారం చుట్టింది కలైయారసి. ఎక్కడికంటే అక్కడికి చేతితో తీసుకెళ్లగలిగే ఈ మగ్గాలకు యూజర్ మాన్యువల్, క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. దీని ద్వారా యూట్యూబ్ వీడియోల సహాయంతో పరికరాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవచ్చు. తమిళనాడులోని ఎన్నో స్కూల్స్లో పిల్లల దగ్గర పోర్టబుల్ లూమ్స్ కనిపిస్తున్నాయి. స్కూల్స్లో వీవింగ్ క్లబ్స్ ఏర్పాటు కావడం మరో విశేషం. మూడు ఆప్షన్లలో, మూడు స్థాయుల్లో అందుబాటులో ఉన్న వీటిని పెద్దలు, పిల్లలు ఉపయోగించవచ్చు.‘రాటై’ స్టార్టప్ ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ గెలుచుకుంది. టాన్సీడ్ (తమిళనాడు స్టార్టప్ అండ్ ఇనోవేషన్ మిషన్) ద్వారా పది లక్షల గ్రాంట్ వచ్చింది.‘నేతకార్మికులకు ఉపాధి కల్పించడమే కాదు ఈ తరానికి ఆ కళపై ఆసక్తి కలిగేలా, నేర్చుకునేలా చేయాలనేది నా లక్ష్యం’ అంటుంది కలైయారసి.పిల్లల కోసం వర్క్షాప్..‘రాటై’ ద్వారా నేత కార్మికులకు అండగా నిలిస్తూనే మరో వైపు నేతకళపై పిల్లలకు అవగాహన, ఆసక్తి కలిగించడానికి వర్క్షాప్లు నిర్వహిస్తోంది కలైయారసి. పెద్దలకు ‘నేతపని’ని స్ట్రెస్–బస్టింగ్ ఎక్సర్సైజ్గా పరిచయం చేస్తోంది. ‘వీలైనన్ని ఎక్కువ స్కూల్స్కు వెళ్లి పిల్లలకు నేతకళ గురించి చె΄్పాలనుకుంటున్నాను. ఒక ఆర్ట్గా మన విద్యావిధానంలో నేతకళ భాగం కావాలని ఆశిస్తున్నాను’ అంటుంది కలైయారసి.ఇవి చదవండి: Naima Khatoon: వందేళ్లకు ఆమె వచ్చింది.. -
Naima Khatoon: వందేళ్లకు ఆమె వచ్చింది..
వందేళ్ల చరిత్ర ఉన్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఎప్పుడూ ఒక మహిళను వైస్ చాన్సలర్గా చూడలేదు. కాని మొదటిసారి ప్రొఫెసర్ నైమా ఖాతూన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్మువి.సి.గా నియమించారు. దీంతో నైమా ఖాతూన్ చరిత్ర సృష్టించారు. ఆమె మైనారిటీ వర్గ మహిళలకు గొప్ప స్ఫూర్తి కాగలదంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నైమా ఖాతూన్ పరిచయం..నైమా ఖాతూన్కు ముస్లిం మహిళల చదువు గురించి చాలా పట్టింపు ఉంది. ‘ఉత్తరాదిలో నేను ప్రిన్సిపాల్గా పని చేసిన అలీగఢ్ విమెన్స్ కాలేజ్ చాలా ముందంజలో ఉంది. అక్కడ మూడు వేల మంది ముస్లిం ఆడపిల్లలు చదువుకుంటున్నారు. కాని ఇదొక్కటే సరిపోదు. ఉత్తరప్రదేశ్, బిహార్లలో ముస్లిం బాలికల విద్య చాలా వెనుకబడి ఉంది. దక్షణాదిలో ముస్లిం సమూహాలు విద్యా రంగంలో ముస్లిం బాలబాలికలను ఫ్రోత్సహిస్తున్నాయి. ఉత్తరాదిలో ఆ పని జరగడం లేదు. రాజకీయ, ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని జయించాలంటే విద్యార్జనకు మించిన వేరే మార్గమేదీ లేదు’ అంటుందామె.విద్యారంగంలో బాలికల విద్య కోసమే కాదు ఉన్నతవిద్యలో ముస్లింల ్రపాతినిధ్యం పెరగాలని కోరుకునే నైమా ఖాతూన్ను భారత ప్రభుత్వం గుర్తించి రెండు రోజుల క్రితం అత్యంత ప్రతిష్టాత్మకమైన అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్ను చేసింది. దాదాపు 100 ఏళ్లకు మించిన ఘన చరిత్ర ఉన్న ఈ విశ్వవిద్యాలయానికి ఇలా ఒక మహిళ వి.సి. పదవిలో కూచోవడం ఇదే మొదటిసారి.గమనించాల్సిన విషయం ఏమంటే ఇన్నాళ్లు పురుషులు మాత్రమే వి.సి.లుగా ఉన్న జె.ఎన్.యుకు శాంతిశ్రీ పండిట్ మొదటి మహిళా వి.సి. కావడం, అలాగే జామియా మిలియా ఇస్లామియాకు నజ్మా అక్తర్ తొలి వి.సి. కావడం (ఆమె పదవీకాలం ముగిసింది) పాతమూసలను బద్దలు చేయడమే. ఆ వరుసలో ఇప్పుడు నైమా ఖాతూన్ చేరారు.సైకాలజీప్రొఫెసర్..ఒడిశాకు చెందిన నైమా ఖాతూన్ ఉన్నత విద్య అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోనే జరిగింది. అక్కడే ఆమె బి.ఏ. సైకాలజీ చదివింది. ఆ తర్వాత పి.హెచ్డి. వరకూ అక్కడే కొనసాగి 1988లో అదే యూనివర్సిటీలో లెక్చరర్గా తన ఫ్రయాణం మొదలెట్టింది. ఆ తర్వాత అసోసియేట్ప్రొఫెసర్గా,ప్రొఫెసర్గా పదోన్నతి పొంది సైకాలజీ డిపార్ట్మెంట్ చైర్పర్సన్ అయ్యింది.పొలిటికల్ సైకాలజీ అధ్యయనంలో భాగంగా ‘హిందూ ముస్లిం యువతపై రాజకీయ భావోద్వేగాల ప్రభావం’ అనే అంశం మీద ఆమె చేసిన పి.హెచ్డి. కీలకమైనది. అలీగఢ్ విమెన్స్ కాలేజ్కు ప్రిన్సిపాల్గా పని చేస్తూ ఉండగా ఆమెను వి.సి.గా పని చేసే అవకాశం వరించింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది కనుక ఇ.సి. అనుమతి తీసుకోని ఆమె నియామకం చేసింది ప్రభుత్వం. నైమా ఖాతూన్ తరచూ అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో తన పరిశోధనా పత్రాలను సమర్పిస్తుంటారు.రాజకీయ ప్రాతినిధ్యం..భారతదేశంలో మహిళలకు రాజకీయ ్రపాధాన్యం లభించడం లేదని నైమా ఖాతూన్ అంటారు. ముఖ్యంగా అణగారిన వర్గాల స్త్రీలు పార్లమెంట్ వరకూ చేరుకోవడానికి చాలా అడ్డంకులు ఉన్నాయని, రాజకీయ అధికారం లేకుండా కీలకమైన విధానమార్పు తేలేమని అభి్రపాయపడతారు. ‘ఆర్థిక శక్తిని, రాజకీయ శక్తిని పొందడటంలో అణగారిన వర్గాల స్త్రీలు నిస్సహాయంగా ఉన్నారు’ అంటారామె.ఇవి చదవండి: Neelima Penumarthy: కథలకో గంట 1/24.. నీలిమ చెప్పే కథ చదవండి! -
సరికొత్త వంటకాలను కోరుకుంటున్నారా? వీటిని ట్రై చేయండి!
ప్రతీరోజూ తిన్న వంటకాలని మళ్లీ మళ్లీ తినాలంటే.. చాలా మంది ముఖం తిప్పేసుకుంటారు. కొంచెం కారంగానో, తీయగానో కావాలని కోరుకుంటారు. విశ్రాంతి సమయంలో ఏదో ఒకటి నమిలేవరకూ వారికి పొద్దేపోదు. మరి అలాంటి వారి కోసం ఈ వెరైటీ వంటలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. పుట్టగొడుగు లాలీపాప్స్.. కావలసినవి: పుట్టగొడుగులు – 15 లేదా 20 (వేడి నీళ్లతో శుభ్రం చేసుకుని పక్కనపెట్టుకోవాలి), మైదాపిండి – 1 కప్పు, ధనియాల పొడి, పసుపు – పావు టేబుల్ స్పూన్, కారం, చాట్ మసాలా, మిరియాల పొడి – అర టేబుల్ స్పూన్ చొప్పున, కార్న్ఫ్లేక్ మిక్సర్ – 1 కప్పు (కవర్లో వేసి.. చపాతీ కర్రతో అటు ఇటు నొక్కి పొడిపొడిగా చేసుకోవాలి), బ్రెడ్ పౌడర్, ఓట్స్ పౌడర్ – అర కప్పు చొప్పున, అల్లం పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ.. ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, ధనియాల పొడి, పసుపు, కారం, చాట్ మసాలా, మిరియాల పొడి, అల్లం పేస్ట్, తగినంత ఉప్పు వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పేస్ట్లా చేసుకోవాలి. అనంతరం మరో బౌల్ తీసుకుని కార్న్ఫ్లేక్ మిక్సర్, బ్రెడ్ పౌడర్, ఓట్స్ పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ప్రతి పుట్టగొడుగుకు పుల్ల గుచ్చి.. ఒక్కోదాన్ని మొదట మైదా మిశ్రమంలో తర్వాత బ్రెడ్ పౌడర్ మిశ్రమంలో ముంచి.. మిశ్రమాన్ని బాగా పట్టించి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీల్మేకర్ – టొమాటో గారెలు.. కావలసినవి: మీల్మేకర్ – 1 కప్పు (పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుముకోవాలి), టొమాటో – 3 (మెత్తగా మిక్సీ పట్టుకుని.. జ్యూస్లా చేసుకోవాలి), ఉల్లిపాయ తరుగు – పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, ఓట్స్ పౌడర్ – 1 కప్పు చొప్పున, మినుముల పిండి – 2 కప్పులు (మినుములు నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి), జీలకర్ర – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా తయారీ.. ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో మినుముల పిండి, మీల్ మేకర్ తురుము, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, జీలకర్ర, ఉప్పు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు అన్ని వేసుకుని టొమాటో జ్యూస్ కొద్దికొద్దిగా వేసుకుంటూ గారెల పిండిలా చేసుకోవాలి. అనంతరం కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని.. గారెల్లా ఒత్తుకుని, కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి. వాటిపై మజ్జిగ ఆవడ వేసుకుని, నానబెట్టి తింటే భలే బాగుంటాయి. మీల్మేకర్ – టొమాటో, గారెలు చెర్రీ హల్వా.. చెర్రీ హల్వా.. కావలసినవి: చెర్రీస్ – రెండున్నర కప్పులు (గింజలు తీసి శుభ్రం చేసుకోవాలి) యాలకుల పొడి – పావు టీ స్పూన్ మొక్కజొన్న పిండి – రెండుంపావు కప్పులు పంచదార – 1 కప్పు, నట్స్ – కావాల్సినన్ని నెయ్యి – అర కప్పు, నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు డ్రైఫ్రూట్స్ – అభిరుచిని బట్టి తయారీ.. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి.. అందులో జీడిపప్పు దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం చెర్రీస్ వేసుకుని గరిటెతో తిప్పుతూ మగ్గేవరకు చిన్న మంట మీద ఉడికించాలి. అనంతరం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, పంచదార వేసుకుని తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత.. మొక్కజొన్న పిండిలో నీళ్లు పోసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని చెర్రీస్ మిశ్రమంలో వేసుకోవాలి. కాసేపటికి మరోసారి కొద్దిగా నెయ్యి వేసుకుని తిప్పాలి. దగ్గరపడుతున్న సమయంలో జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి చల్లారాక.. మరిన్ని డ్రైఫ్రూట్స్ తురుముతో సర్వ్ చేసుకోవాలి. ఇవి చదవండి: సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా! -
'యూ, యూ, యూ, లైక్ ఇట్స్'.. ఈ మాగ్నటిక్ సాంగ్ను విన్నారా!?
కొరియన్–పాప్ సెన్సేషన్ ‘ఇలిట్’ మ్యూజిక్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. డెబ్యూ–సింగిల్ ‘మాగ్నెటిక్’ బిల్బోర్డ్ చార్ట్ ‘హాట్ 100’లో చోటు సాధించడం ద్వారా ‘ఇలిట్’ గ్లోబల్ స్టేజీపై గ్రౌండ్ బ్రేకింగ్ విజయాన్ని సొంతం చేసుకుంది. యునహ్, మింజుచ, మోకా, వోన్హీ, ఇరోహ అనే అయిదుగురు అమ్మాయిల బృందంతో ‘ఇలిట్’ మ్యూజిక్ బ్యాండ్ గత నెల ప్రారంభమైంది. తొలి అడుగుల్లోనే స్పాటిఫై ‘డైలీ టాప్ సాంగ్ గ్లోబల్’ చార్ట్లో చోటు సంపాదించింది. యూకే ‘అఫిషియల్ సింగిల్స్ టాప్ 100’లో మెరిసింది. ‘మాగ్నెటిక్’ సాంగ్ను ‘ఇలిట్’ సభ్యుల ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించారు. ఈ గ్రూప్ డెబ్యూ ఆల్బమ్... సూపర్ రియల్ మీ. ‘మై వరల్డ్’, ‘మాగ్నటిక్’, ‘మిడ్నైట్ ఫిక్షన్’, ‘లక్కీ గర్ల్ సిండ్రోమ్’ అనే నాలుగు ట్రాక్లు ఈ ఆల్బమ్లో ఉంటాయి. తొలి వారంలోనే ‘సూపర్ రియల్ మీ’ అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. ‘యూ, యూ, యూ, లైక్ ఇట్స్ మాగ్నటిక్/ యూ, యూ, యూ, సూపర్’ అంటూ ‘మాగ్నటిక్’ను పాడాలనుకుంటే ఇప్పుడే వినండి మరి! ఇవి చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..! -
స్టెల్లర్ బ్లేడ్..! గ్రహాంతరవాసులతో వార్..!!
యాక్షన్ అడ్వెంచర్ గేమ్ ‘స్టెల్లర్ బ్లేడ్’ ఈ నెల 26న విడుదల కానుంది. కథ విషయానికి వస్తే భూమి మీద ఉన్న మనుషులకు, గ్రహాంతవాసులకు మధ్య యుద్ధం జరుగుతుంది. గ్రహాంతరవాసులతో యుద్ధంలో ఓడిపోయిన తరువాత మానవాళి తరిమివేయబడుతుంది. కోల్పోయిన తమ స్వస్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఈవ్తో పాటు ఆమె దళం ‘నయతిబా’ అనే గ్రహాంతరవాసులతో పోరాటానికి సిద్ధం అవుతుంది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి ఆడే గేమ్ ఇది. శత్రువు వ్యూహాల ఆధారంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్కు సంబంధించిన డెమోను గత నెల విడుదల చేశారు. జానర్స్: యాక్షన్, అడ్వెంచర్.. ఇంజిన్: అన్రియల్ ఇంజిన్4 మోడ్స్: సింగిల్–ప్లేయర్ ప్లాట్ఫామ్: ప్లేస్టేషన్ 5 ఇవి చదవండి: ఈ షాకింగ్ నిజాల గురించి మీకు తెలుసా? -
ఈ షాకింగ్ నిజాల గురించి మీకు తెలుసా?
ప్రతీరోజు ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటున్నాం. వింత ప్రదేశాలు, వింత చేష్టలు, ఆశ్యర్యపరిచే నిజాలు, అద్భుతాలు.. ఇలా ఎన్నోవాటి గురించి ఎంతోకొంత అవగాహనకు వస్తూనే ఉన్నాయి. మరి ఈ కొత్త పదాలు, వింత వింతల గురించి ఎప్పుడైనా విన్నారా! లేదా? మరేంటో తెలుసుకుందామా..!! అవే ఇవి.. పే త్రూ ది నోస్.. సాధారణంగా చెల్లించేదాని కంటే ఎక్కువగా చెల్లించే సమయంలో వాడే మాట...పే త్రూ ది నోస్. ఉదా: వీ హ్యాడ్ టూ పే త్రూ ది నోస్ ఫర్ అవర్ రూమ్ బికాజ్ ఇట్ వాజ్ ఏ లాంగ్ వీకెండ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ వర్ బుక్డ్. గోయింగ్ గ్రేట్ గన్స్.. ఒక రంగంలో, పనిలో విజయ వంతంగా దూసుకువెళ్లే సందర్భంలో వాడే మాట... గోయింగ్ గ్రేట్ గన్స్. ఉదా: ది ఫర్మ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ గోయింగ్ గ్రేట్ గన్స్ విత్ హిజ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్. అవును.. ఇది నిజమే! ఆడ నెమలిని పీహెన్ అని పిలుస్తారు. అగ్గిపుల్లల కంటే ముందుగానే లైటర్ను తయారుచేశారు. కరెంట్ మూడ్ ఆధారంగా పాటలను ప్లే చేసే హెడ్ఫోన్లను న్యూరబుల్ కంపెనీ తయారు చేసింది. ఇవి చదవండి: అతిపెద్ద పాము ఉనికి వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..! -
Aditya Srivastava: యువతలో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న పేరు.. 'ఆదిత్య శ్రీవాస్తవ'?
యువతలో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న పేరు.. ఆదిత్య శ్రీవాస్తవ. యూపీఎస్సీ పరీక్షలో టాప్ 1లో నిలిచిన ఆదిత్యకు తొలి ప్రయత్నంలో ‘ఫెయిల్యూర్’ ఎదురైంది. మరింత కష్టపడి రెండో ప్రయత్నంలో 236 ర్యాంకు సాధించాడు. ‘ఇది చాలదు’ అనుకొని తప్పులను సరిద్దుకొని మరో ప్రయత్నంలో నెంబర్ వన్గా నిలిచాడు లక్నోకు చెంది ఆదిత్య. ‘కష్టపడడం అవసరమేగానీ ఒక పద్ధతి ప్రకారం పడాలి’ అని స్మార్ట్ స్ట్రాటజీతో అపూర్వ విజయం సాధించాడు ఆదిత్య శ్రీవాస్తవ.. ప్రపంచంలోని లీడింగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులలో ఒకటైన ‘గోల్డ్మాన్ శాక్స్’తో ప్రొఫెషనల్ జర్నీ ప్రారంభించాడు ఆదిత్య. ‘బెంగళూరులో పెద్ద బ్యాంకులో పని చేస్తాడు’ అని చుట్టాలు, మిత్రుల తన గురించి కొత్త వారికి పరిచయం చేసేవారు. తన గురించి గొప్పగా పరిచయం చేస్తున్న సంతోషంలో ఉండి, అక్కడికే పరిమితమై ఉంటే ఆదిత్య సివిల్ సర్వీసెస్లోకి అడుగు పెట్టేవాడు కాదేమో. పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా సరే ఆదిత్య హృదయంలో సివిల్ సర్వీసులలోకి వెళ్లాలి అనే కోరిక బలంగా ఉండేది. సివిల్స్ విజేతల మాటలు తనకు ఇన్స్పైరింగ్గా అనిపించేవి. ఒక ప్రయత్నం చేసి చూడాలనిపించేది. పదిహేను నెలల తరువాత.. ఉద్యోగాన్ని, బెంగళూరును వదిలి హోమ్ టౌన్ లక్నోకు వచ్చాడు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ కావడంప్రారంభించాడు. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అని కొద్దిమంది అన్నా ఆ మాటను పట్టించుకోలేదు. 2021.. పరీక్ష సమయం రానే వచ్చింది. అయితే ప్రిలిమినరీ స్టేజిలోనే ఫెయిల్యూర్ పలకరించింది. మామూలుగానైతే రథాన్ని వెనక్కి మళ్లించి వేరే కంపెనీలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. అయితే ఆదిత్య నిరాశపడలేదు. వెనకడుగు వేయలేదు. ఎలాగైనా సరే తన కలను నిజం చేసుకోవాలి అని గట్టిగా అనుకున్నాడు. గత సంవత్సర ప్రశ్నపత్రాల ఆధారంగా ఇన్–డెప్త్ ఎనాలసిస్తో ప్రిపరేషన్ విధానాన్ని రూపొందించుకున్నాడు. ప్రశ్నల సరళి, సెంటెన్స్ ఫార్మేషన్పై దృష్టి పెట్టాడు. మాక్ టెస్ట్లు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేవాడు. స్ట్రాటజిక్ ప్రిపరేషన్కుప్రాధాన్యత ఇచ్చాడు. 2022 యూపీఎస్సీ ఎగ్జామ్లో 236 ర్యాంకు సాధించాడు. ఇండియన్ పోలిస్ సర్వీస్(ఐపీఎస్)కు ఎంపికయ్యాడు. ట్రైనింగ్కు కూడా వెళ్లాడు. అయినా సరే, ఇంకా ఏదో సాధించాలనే తపన. టాపర్లతో పోల్చితే తాను ఎందుకు వెనకబడిపోయాననే కోణంలో లోతైన విశ్లేషణప్రారంభించాడు. చేసిన తప్పులు ఏమిటి, వాటిని ఎలా సరిద్దుకోవాలి అనేదానిపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. యూపీఎస్సీ తాజా ఫలితాల్లో అపూర్వమైన విజయాన్ని సాధించాడు. నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. రిజల్ట్ ప్రకటించడానికి ముందు మనసులో.. ‘టాప్ 70లో ఉండాలి’ అనుకున్నాడు ఆదిత్య. అయితే ఏకంగా మొదటి ర్యాంకు దక్కింది. అది అదృష్టం కాదు. కష్టానికి దొరికిన అసలు సిసలు ఫలితం. ‘సివిల్స్లో విజయం సాధించడానికి సెల్ఫ్–మోటివేషన్ అనేది ముఖ్యం’ అంటాడు ఆదిత్య శ్రీవాస్తవ. పక్కా ప్రణాళిక.. ఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవకు పరీక్షలలో బోలెడు మార్కులు సొంతం చేసుకోవడం కొత్తేమీ కాదు. ఐఐటీ, కాన్పూర్లో బీటెక్, ఎంటెక్ చేశాడు. బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఐఐటీలో డెవలప్ చేసుకున్న ఎనాలటికల్ స్కిల్స్ యూపీఎస్సీ ప్రిపేరేషన్కు ఉపయోగపడ్డాయి. ‘కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్’లాంటి వాటితో ప్రిపరేషన్ మెథడ్ను రూపొందించుకున్నాడు. ‘కష్టానికి పక్కా ప్రణాళిక తోడైతేనే విజయం సాధ్యం’ అనేది ఆదిత్య నమ్మే సిద్ధాంతం. పాఠ్యపుస్తకాలకు ఆవల ఆదిత్యకు నచ్చిన సబ్జెక్ట్...రాక్షస బల్లులు. వాటికి సంబంధించిన కొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఆదిత్య శ్రీవాస్తవ నోటి నుంచి తరచుగా వినిపించే మాట ‘మన దేశంలోనే ఉంటాను. దేశం కోసమే పనిచేస్తాను’ ఇవి చదవండి: యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్! -
Beauty Tips: పసుపుతో పింక్ లిప్స్..
ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాగానీ, కొన్ని సమస్యలు మనకు తెలియకుండానే పెద్ద తలనొప్పిగా మారుతాయి. వాటినుంచి ఎలా తప్పుకొవాల్లో కూడా తెలీక ఇబ్బంది పడుతుంటాం. మరి ఈ సమస్యల నుంచి ఉపశమనం లభించాలంటే ఇలా ప్రయత్నం చేసి చూడండి.. ఇలా చేయండి.. పాలలో చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి పావుగంట మర్దన చేయాలి. రాత్రంతా అలానే ఉంచుకుని ఉదయం నీటితో కడిగేయాలి. రోజూ రాత్రిపూట క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల పెదవులు గులాబి రంగులోకి మారతాయి. చిటికెడు పసుపులో మూడు చుక్కల నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల పెదవులపై ఏర్పడిన మచ్చలు పోతాయి. హెయిర్ కలర్గానీ హెన్నాగానీ జుట్టుకు పెట్టే ముందుకు చెవులు, నుదురుకు పెట్రోలియం జెల్లిని రాయాలి. తరువాత హెన్నా పెట్టుకోవాలి. చెవులు, నుదురు ్రపాంతంలో హెన్నా పడ్డప్పటికీ నీటితో కడిగితే ఇట్టే పోతుంది. పెట్రోలియం జెల్లి లానే ఆలివ్ ఆయిల్ను కూడా డైకు ముందు చెవులు, నుదురు, మెడకు అప్లై చేసి మర్దన చేయాలి. తరువాత డై పడినా నీటితో కడిగితే పోతుంది. ఇవి చదవండి: Kitchen Tips: ఈ చిన్న చిన్న పదార్థాలతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి! -
Kitchen Tips: ఈ చిన్న చిన్న పదార్థాలతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి!
కిచెన్లో.. వంటచేసేటప్పుడు చిన్న చిన్న వస్తువులతో విసిగిపొతూంటాం. కొన్నిరకాల తిను బండారాలను కాపాడలేక, మరికొన్ని వస్తువులను ఎక్కువకాలం నిల్వచేయలేక ఇబ్బంది పడుతూంటాం. అలాగే కొన్ని పదార్థాలనుంచి వెలువడే చెడు వాసనతో కూడా తలనొప్పిగా భావస్తాం. మరి వీటినుంచి బయటపడాలంటే ఈ కిచెన్టిప్స్ ఓసారి ట్రై చేయండి.. కుల్చానుకాల్చేటప్పుడు.. పాన్ మీద కుల్చాను వేసి చుట్టుపక్కల కొద్దిగా నీళ్లు చల్లి మూతపెట్టాలి. ఒక వైపు కాలాక మరో వైపు తిప్పి చుట్టుపక్కల కొద్దిగా నీళ్లు చల్లి మూతపెడితే కుల్చా చక్కగా కాలుతుంది. చివరగా నూనె లేదా నెయ్యి చల్లుకుని సర్వ్ చేసుకుంటే కుల్చా చక్కగా కాలి రుచిగా వస్తుంది. ఉల్లిపాయ తరిగాక.. ఉల్లిపాయను ముక్కలుగా తరిగాక చేతులు ఉల్లివాసన వస్తుంటాయి. ఇలాంటప్పుడు బంగాళ దుంప ముక్కతో చేతులను ఐదు నిమిషాలు రుద్ది, తరువాత నీటితో కడిగితే ఉల్లివాసన వదులుతుంది. ఇవి చదవండి: సమ్మర్ సీజన్ కదా అని.. తొందరపడి పచ్చళ్లు పెట్టేస్తున్నారా! -
సమ్మర్ సీజన్ కదా అని.. తొందరపడి పచ్చళ్లు పెట్టేస్తున్నారా!
మామిడి కాయల సీజన్ కదా.. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మామిడి కాయలు కనిపిస్తున్నాయి. అలాగని తొందరపడి ఆవకాయ, మాగాయ పెట్టేయకూడదు. ఎందుకంటే ఎండలు ఇంకాస్త ముదరాలి. ఎండలతోపాటే మామిడి కాయలు కూడా బాగా టెంకపట్టాలి. అప్పుడయితేనే ఏడాదంతా నిల్వ ఉంటుంది ఆవకాయ. అయితే అప్పటిదాకా చూస్తూ ఊరుకోవాలా? ఏమక్కరలేదు. ఆవకాయ పెట్టేలోగా రెండు మూడు వారాల నుంచి నెలరోజుల దాకా తాజాగా ఉండే ఈ పచ్చళ్లు ట్రై చేద్దామా మరి! మ్యాంగో ఇన్స్టంట్ పికిల్.. కావలసినవి: పచ్చి మామిడికాయ – ఒకటి; కశ్మీర్ మిరప్పొడి – టేబుల్ స్పూన్; నువ్వుల నూనె– 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు– టీ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఇంగువ – పావు టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్. తయారీ.. మామిడికాయను శుభ్రంగా కడిగి తుడిచి, సొన పోయేటట్లు తొడిమను తొలగించాలి. గింజను తొలగించి, తొక్కతో సహా ముక్కలు తరగాలి. ముక్కలకు ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. సుమారు ఒక కప్పు ముక్కలు వస్తాయి. బాణలిలో మెంతులు వేసి (నూనె లేకుండా) దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అదే బాణలిలో నువ్వుల నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఇంగువ, మెంతిపొడి, మిరప్పొడి, పసుపు వేసి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ పోపును మామిడి ముక్కల్లో వేసి కలపాలి. అరగంట సేపటికి ఉప్పు, కారం, మసాలా దినుసుల రుచి ముక్కలకు పడుతుంది. ఈ పచ్చడిని తేమ లేని పాత్రలో నిల్వ చేసుకుంటే నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటుంది. చనా మేథీ మ్యాంగో పికిల్.. కావలసినవి: పచ్చి మామిడి ముక్కలు – కప్పు; మామిడి తురుము – కప్పు; పచ్చి శనగలు – అర కప్పు; మెంతులు – అర కప్పు; ఆవాలు›– అర కప్పు; ఉప్పు – అర కప్పు; మిరప్పొడి– అర కప్పు, నూనె – కప్పు. తయారీ.. మందపాటి బాణలి వేడి చేసి పచ్చి శనగపప్పును దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మెంతులు, ఆవాలను (నూనె లేకుండా) వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో మామిడి ముక్కలు, మామిడి తురుమును వేయాలి. అందులో శనగలు, మెంతిపొడి, ఆవపిండి, మిరప్పొడి, ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తడిలేని సీసాలో కూరినట్లు పెట్టి గట్టిగా మూతపెట్టాలి. మూడు రోజుల తర్వాత నూనెను మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నూనెను సీసాలో ఉన్న మిశ్రమం పై నుంచి పోయాలి. ఈ పచ్చడిని మూడు రోజుల తర్వాత తినవచ్చు. నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇది గుజరాతీ శైలి మామిడి పచ్చడి. మామిడి తురుము పచ్చడి.. కావలసినవి: మామిడి తురుము – 2 కప్పులు; మిరప్పొడి– పావు కప్పు; ఉప్పు – పావు కప్పు; ఆవ పిండి– టేబుల్ స్పూన్; మెంతిపిండి– టేబుల్ స్పూన్; వెల్లుల్లి రేకల తురుము – టేబుల్ స్పూన్; నల్లజీలకర్ర (కలోంజి) – అర టీ స్పూన్; మెంతులు – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఆవ నూనె – పావు కప్పు; పసుపు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్. తయారీ.. మామిడి తురుములో పసుపు, ఉప్పు, వెల్లుల్లి, కలోంజి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బాణలి వేడి చేసి (నూనె లేకుండా) మెంతులు, జీలకర్ర వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసి మామిడి తురుములో వేసి కలపాలి. ఇప్పుడు మామిడి తురుములో ఆవపిండి, మెంతిపిండి, మిరప్పొడి, నూనె వేసి కలిపి ఉప్పు సరి చూసుకోవాలి. అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవచ్చు. ఇది నాలుగు రోజుల నుంచి వారం వరకు తాజాగా ఉంటుంది. మామిడి తురుమును పలుచని వస్త్రంలో కట్టి నీరు పోయేటట్లు చేసిన తర్వాత మసాలా దినుసులు కలిపి, నూనె పైకి తేలేటంత మోతాదులో పోసినట్లయితే ఆ పచ్చడి నెలలపాటు నిల్వ ఉంటుంది. -
వేసవికి నప్పే.. వింటేజ్ స్టైల్ ఇదే..!
పెరిగే ఉష్ణోగ్రతలకు తట్టుకునేలా ఉండాలి. మిక్స్ అండ్ మ్యాచ్ ఎంపిక క్యాజువల్ అనిపించాలి. పాతకాలపు కాంతులు కట్టిపడేస్తున్నట్టే ఉండాలి. వెస్ట్రన్ టచ్తో ఆకట్టుకునేలా ఉండాలి. కాలానికి తగినట్టు, కలర్ఫుల్గా కనిపించాలి. తమవైన నైపుణ్యాలను జోడించే ఫ్యాషన్ ఔత్సాహికులు వింటేజ్ స్టైల్ని మెరిపిస్తున్నారు. మట్టి రంగులు.. సాధారణంగా లేత రంగులను ఈ సీజన్కి ఎంచుకుంటాం. అయితే, వెస్ట్రన్ వింటేజ్ స్టైల్కి ముదురు గోధుమ, ఎరుపు, నారింజ ఈ సీజన్లో మొదటి వరసలో ఉంటాయి. ఈ రంగులు వెస్ట్రన్ వస్త్రధారణకు సహజ సౌందర్యాన్ని జోడించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ రంగులు ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని వెల్లడిస్తాయి. క్యాజువల్ వేర్కి సొగసును అందిస్తాయి. లేసులు, అల్లికలు.. ఈ సీజన్లో మరో ఆకర్షణగా కనిపించేది డెనిమ్ ఎలిమెంట్స్, లేసులు, అల్లికల అంచులు గల డ్రెస్సులు వెస్ట్రన్ ఫ్యాషన్లో మనకు ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఇవి, డ్రెస్సులకు ఉల్లాసభరితమైన అలంకరణను జోడిస్తాయి. ముదురు గోధుమ రంగులో ఉండే ప్లెయిన్ స్వెడ్ టాప్ లేదా జాకెట్స్, అంచులతో డిజైన్ చేసినవి ఈ సీజన్ స్టైల్కి బాగా నప్పుతాయి. ఇవి మోడ్రన్ టచ్, వింటేజ్ స్టైల్తో ఆకట్టుకుంటాయి. డెనిమ్తో జత చేసే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ స్కర్టులు, బ్లేజర్లతో మ్యాక్సీ డ్రెస్సులు ధరిస్తే ఆధునికపు హంగులతో మెరిసి΄ోతారు. స్టెట్సన్ టోపీలు, కౌబాయ్ బూట్లు డ్రెస్సులకు వెస్ట్రన్ లుక్ని ఇట్టే తీసుకువస్తాయి. పూసల దండలు, ఇతర ఫ్యాషన్ జ్యువెలరీ, సన్నని హ్యాండల్ గల బ్యాగ్తో పూర్తిగా వింటేజ్ లుక్తో అట్రాక్ట్ చేస్తారు. ఇవి చదవండి: Srishti Dabas: పగలు ఉద్యోగం... రాత్రి చదువు.. ఇప్పుడు ఐ.ఏ.ఎస్. -
వేసవి ఉష్ణోగ్రత పెరగనుంది.. జర జాగ్రత్త! : వాతావరణశాఖ హెచ్చరిక
ప్రతిరోజూ ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుండగా.. 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. సోమవారం 40 నుంచి 42 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఇకపై ఈ ఎండ తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. అందుకు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎండ తీవ్రత ఇలా.. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు కొంత హెచ్చతగ్గులతో కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత ప్రారంభం కాగా.. మార్చి ఆరంభంలో 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉన్నా ఈసారి మాత్రం 35 నుంచి 39 డిగ్రీల మధ్య నమోదైంది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మూడో వారానికి 40 డిగ్రీలు దాటగా, ఏప్రిల్ మొదటి వారంలో మరింతగా పెరిగాయి. ఏప్రిల్ 7న కొన్ని చోట్ల 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. ఆతర్వాత మధ్యలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఈనెల రెండో వారం నుంచి సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఇప్పటికే వడదెబ్బల ఘటనలు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో ఎలాంటి మార్పు లేకుండడంతో రాబోవు ముందు రోజులు ఎండ తీవ్రత పెరిగే అవకాశంఉందని, తగిన జాగ్రత్తలో పాటు, ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు వైద్యులని సంప్రదించాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవి చదవండి: వేసవిలో మనుషులకే కాదు.. పశువులకూ ఆ డేంజర్! -
వేసవిలో మనుషులకే కాదు.. పశువులకూ ఆ డేంజర్!
వేసవిలో మనుషులే కాదు పశువులూ వడదెబ్బకు గురవుతాయి. నిర్లక్ష్యం చేస్తే పశువులు మరణించే ప్రమాదం ఉంది. వడదెబ్బ నివారణ గురించి పశువైద్యాధికారి సగ్గం మహేశ్ రైతులకు అందిస్తున్న సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. ‘ఉష్ణోగ్రత పెరిగి గాలిలో తేమ తగ్గినప్పుడు పశువులు ఎక్కువగా వడదెబ్బకు గురవుతాయి. గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, పశువులు షెడ్లలో ఎక్కువ సంఖ్యలో ఉండటం, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం, వడగాల్పుల తాకిడికి వడదెబ్బకు గురవుతాయి. తెల్లజాతి కంటె నల్లజాతి పశువులు ఎక్కువగా వడదెబ్బబారిన పడతాయి.’ వడదెబ్బ ప్రాణాంతకమే.. వేసవి కాలంలో బయటి ఉష్ణోగ్రత పశువుల శరీర ఉష్ణోగ్రత కన్నా ఎక్కువైనప్పుడు మెదడులోని హైపోథాలమస్ స్వేద గ్రంథులపై నియంత్రణ కోల్పోతుంది. దీంతో చర్మంపై గల స్వేద రంధ్రాలు చెమటను అధికంగా విడుదల చేసి శరీరంలోని ఎలక్ట్రోలైట్లను కోల్పోయి శరీర పక్రియ మందగిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస, గుండె, నాడి వేగం పెరుగుతాయి. మూత్ర పిండాలు సరిగా పనిచేయకపోవడంతో మూత్ర విసర్జన కుంటు పడుతుంది. పశువుల ఆరోగ్య పరిస్థితి విషమించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాయి. శ్వాస ఆడక మరణిస్తాయి. నివారణకు ముందస్తు చర్యలు.. వేసవిలో ముఖ్యంగా పశువులను పగటి వేళలో మేతకు వదలరాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు పంపాలి. తాగునీరు అన్నివేళలా అందుబాటులో ఉంచాలి. పశువులను రోజుకు కనీసం రెండుసార్లు చల్లని నీళ్లతో కడగాలి. చెరువులు, కుంటల్లో ఈద నివ్వాలి. గాలి వెలుతురు ప్రసారమయ్యేలా ఎత్తయిన కొట్టాలను గడ్డితో నిర్మించాలి. రేకులు ఉంటే మధ్యాహ్నం వేళల్లో వరిగడ్డి పరిచి నీరు చల్లాలి. వేసవిలో దాహంతో ఉన్న పశువులు కలుషిత నీరు తాగకుండా జాగ్రత్త వహించాలి. షెడ్డుపై వరిగడ్డివేసి మధ్యాహ్నం వేళ్లలో నీరివ్వాలి. షెడ్ల నిర్మాణం తూర్పు, పడమర దిశలలోనే జరగాలి. దీనివల్ల వడ గాల్పుల నుంచి, తూర్పు, పడమర ఎండల నుంచి రక్షణ లభిస్తుంది. పాడి గేదెలకు ఉదయం, సాయంత్రం పాలు పితికేటప్పుడు పొదుగును చల్లని నీటిలో కడగాలి. పశువులకు గోమార్లు లేకుండా చూసుకోవాలి. పరిశుభ్రమైన నీరు ఎల్లవేళలో అందుబాటులో ఉంచాలి. వడదెబ్బ లక్షణాలు.. వడదెబ్బ తగిలిన పశువుల శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల ఫారన్ హీట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. చర్మ సున్నితత్వం కోల్పోయి గట్టిపడుతుంది. పశువులు సరిగ్గా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. నీడ కోసం చెట్ల కిందకు చేరుతాయి. అధిక దాహం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 104 ఫారన్హీట్ దాటితే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఫిట్స్ లక్షణాలతో క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 109 డిగ్రీలు దాటితే ప్రాణపాయం సంభవిస్తుంది. వడదెబ్బ ప్రభావంతో చూలు పశువుల్లో గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. పశువుల్లో పునురుత్పత్తి ప్రక్రి య కుంటుపడుతుంది. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. చికిత్స ఇలా.. వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రాంతానికి మార్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి తీసుకరావడానికి పలుమార్లు కడగాలి. తాగు నీటిని అందుబాటులో ఉంచాలి. వెంటనే పశువైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వైద్యుల పర్యవేక్షణలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఇంజెక్షన్లు వేయించాలి. రక్తంలోకి సైలెన్ ద్వారా గ్లూకోజు, ఎలక్ట్రోలైట్స్ అందిస్తే నీరసం నుంచి పశువులు బయటపడతాయి. - సగ్గం మహేశ్, పశువైద్యాధికారి -
Ashish Chanchlani: టాలెంట్తో.. బిలియన్ల వ్యూస్.. మిలియన్ల సబ్స్క్రైబర్స్..
'Ashish Chanchlani Vines అనే యూట్యూబ్ చానెల్తో clout అయ్యాడు. కామెడీ వీడియోస్కి వెల్నోన్. అమ్మాయిగా.. తండ్రిగా.. కొడుకుగా.. ఇలా డిఫరెంట్ రోల్స్ వేయడంలో ఆశీష్ని మించిన క్రియేటర్ లేడు. సోషల్ మీడియాలో, స్టూడెంట్ లైఫ్, ఎగ్జామ్స్, ఆఫీస్ డ్రామా, ఫ్యామిలీ ఇష్యూస్.. ఇలా ఈ కుర్రాడు ఫోకస్ చేయని టాపిక్ లేదు.' సబ్జెక్ట్ ఏదైనా హిలేరియస్ ట్విస్ట్స్ కడుపుబ్బా నవ్వించే కంటెంట్ని చూపిస్తాడు. ఆశీష్ పుట్టి, పెరిగింది మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్లో. ఇంజినీరింగ్ చదువు కోసం నవీ ముంబై చేరాడు. ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ అతనిలో యాక్టింగ్ ఇన్స్టింక్ట్ ఉండటంతో టీన్స్లో అది డామినేట్ చేసింది. దాంతో మధ్యలోనే ఇంజినీరింగ్కి గుడ్ బై చెప్పేశాడు. ఆ గట్స్ అండ్ గట్ ఫీలింగ్తో సోషల్ మీడియాలో జర్నీ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ చానెల్ పెట్టి.. చదువు మధ్యలోనే వదిలేసినందుకు రిగ్రెట్ ఫీలయ్యే చాన్స్ ఆశీష్కివ్వలేదు డెస్టినీ! ఫన్నీ వీడియోస్తో వితిన్ ద షార్ట్ టైమ్ వెరీ పాపులర్ అయిపోయాడు. ఎంతలా అంటే బాలీవుడ్ బిగ్గీస్ తమ మూవీస్కి అతనితో ప్రమోషనల్ వీడియోస్ చేయించుకునేంతలా! అంతేకాదు షాహిద్ కపూర్, కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్తో కలసి యాడ్స్ చేశాడు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్.. 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' అనే హాలీవుడ్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. 'ఆఫ్రీ సఫర్' అనే షార్ట్ హారర్ ఫిల్మ్ తీసి తనలోని డైరెక్షన్ చూపించాడు. ఆశీష్ యూట్యూబ్ చానెల్, ఇన్స్టా హ్యాండిల్ వంటి వేరియస్ సోషల్ మీడియా అకౌంట్స్కి బిలియన్ల వ్యూస్.. రెండు అంకెల మిలియన్ల ఫాలోవర్స్.. అంతకన్నా ఎక్కువ రేంజ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు లక్షల్లో ఆమ్దనీ వస్తోంది. అవార్డులు కూడా బాగానే గెలుచుకున్నాడు. 'బెస్ట్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్' కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ అందుకున్నాడు. వరల్డ్ బ్లాగర్స్ అవార్డ్స్ ప్రారంభించిన ఏడాదే (2019) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'బెస్ట్ కామెడీ ఇన్ఫ్లుయెన్సర్' అవార్డును సాధించాడు. ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ లిస్ట్ అయ్యాడు. కాన్ఫిడెన్స్ ఉంటే కేన్స్ దాకా వెళ్లొచ్చని భలే ప్రూవ్ చేశాడు కదా! ఇవి చదవండి: అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు .. డైట్ సీక్రెట్స్ ఇవే.. -
ఈ మల్టీకలర్ ఫేస్మాస్క్ ధర వింటే షాకే..!
కరోనా బారీనుంచి ఆ సమయంలో ఎన్నోరకాల ఫేస్మాస్క్లను వాడారు. వాటి వలన ఫలితాలు, నష్టాలు కూడా అనుభవించారు. అదొక విధమైతే.., ఈ చర్మ సమస్యలు మరో విధము. వయసు పెరిగేకొద్దీ చర్మం ముడతలు బారుతుంది. ముఖంలో గ్లో తగ్గుతుంది. ఈ సమస్యలను డీల్ చేయాలంటే ఈ లైట్ థెరపీ మాస్క్ను వాడాల్సిందే.. దీన్ని 15 నుంచి 25 నిమిషాల వరకు ముఖానికి పెట్టుకుని ఉంచితే.. మంచి ఫలితం లభిస్తుంది. ఆప్షన్స్లో మల్టీ కలర్స్ని మార్చుకోవడంతో వివిధ చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎటువంటి నొప్పి, శ్రమ, ఇబ్బంది లేకుండా ముఖంలో మెరుపుని సొంతం చేసుకోవచ్చు. ఈ మాస్క్ సాయంతో రెడ్, బ్లూ, ఆరెంజ్, పర్పుల్, వైట్, గ్రీన్, సియాన్ ఇలా మొత్తంగా 7 రంగుల్లో ట్రీట్మెంట్ని అందుకోవచ్చు. రిమోట్ సాయంతో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పోర్టబుల్గానూ, కంఫర్టబుల్గానూ పని చేస్తుంది. స్త్రీల సౌలభ్యం, సౌకర్యం కోసం రూపొందిన ఈ ఎల్ఈడీ బ్యూటీ మాస్క్.. ఫుడ్–గ్రేడ్ సిలికాన్ మెటీరియల్తో తయారైంది. ఇంట్లోనే కాదు ప్రయాణాల్లోనూ సులభంగా ఉపయోగించుకోవచ్చు, ఈ మాస్క్ బిజీ లైఫ్స్టయిల్కి సరైనది. ఎప్పుడైనా, ఎక్కడైనా.. ఏపని చేసుకుంటూ అయినా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. ఈ స్కిన్కేర్ టూల్.. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ముడతలు, మచ్చలు వంటి ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. బ్లూ లైట్ చికాకు, అలసటలను దూరం చేస్తుంది. వైట్ లైట్ చర్మానికి పునరుజ్జీవాన్ని అందిస్తుంది. సియాన్ లైట్ స్కిన్ టోన్ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా ఒక్కో కలర్ ఒక్కో సమస్యను దూరం చేస్తుంది. ఈ పరికరం ఇంట్లో ఉంటే హోమ్ స్పాను ఎంజాయ్ చేయొచ్చు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,083 రూపాయలు. ఇవి చదవండి: ఈ భయం.. ఒక ఫోబియా అని మీకు తెలుసా! -
ఈ భయం.. ఒక ఫోబియా అని మీకు తెలుసా!
నిత్యం కాలం పరుగెడుతున్నట్లూ.. ఈ లోకం పరుగెత్తక తప్పదు. అందులో ఎన్ని చిక్కులున్నా, ఎన్ని అడ్డంకులున్నాగానీ వాటిని అధికమిస్తూ సాగక తప్పదు. ఇలాంటి తరుణంలో మనుషుల విషయానికొస్తే.., వారిలో ఒక్కొక్కరి తీరు ఒక్కోలాగా ఉంటుంది. కొందరు ఎంతో ధైర్యవంతులుగానూ, మరికొందరు పిరికితనంగానూ కనిపిస్తుంటారు. ఇది సహజమే. ఇలాంటి ధైర్యాలకూ, భయాలకు రకరకాల ఫోబియాల పేర్లతో పిలుస్తుంటాం. అలాగే నిద్దుర విషయానికొస్తే.., ప్రతిరోజూ ఆహారం ఎంత అవసరమో, నిద్ర కూడా అవసరమే! అయితే, కొందరు నిద్దుర అంటేనే చికాకు పడుతూ, అసలు నిద్దురే రావటంలేదంటారు. ఏదో ఒక పనిలో నిమగ్నమౌతుంటారు. నిద్రపోవాలంటేనే కొందరు విపరీతంగా భయపడతారు. ఇలాంటి ఈ భయాన్నే ‘సోమ్నిఫోబియా /హిప్నోఫోబియా’ అంటారు. ఇవి చదవండి: ఫెయిర్నెస్ క్రీమ్ల వల్ల ఆ సమస్యలు ! పరిశోధనలో షాకింగ్ విషయాలు -
బౌద్ధవాణి: నిద్రకు దూరం చేసే పనులు..
ఈర్ష్య, అసూయ, ద్వేషం – ఈ మూడు దుర్గుణాలు మూర్తీభవించినవాడు చలమ దీప్తుడు. తానే పెద్ద తత్వవేత్తననీ, తనకంటే గొప్ప ప్రబోధకుడు ఎవరూ లేరని, తాను గురువులకే గురువని భ్రమించేవాడు. ఇతరుల్ని ఎవ్వరినీ గౌరవించేవాడు కాదు. అతని శిష్యుడు అహితుడు అన్నింటా గురువుని మించిన శిష్యుడే! రాజగృహ నగరానికి ఉత్తర దిక్కులో ఉన్న ఒక పర్వతంపై అతని నివాసం. తనకంటే బుద్ధునికి ఎక్కువ కీర్తి ప్రతిష్టలు కలగడం అతనిలో కోపాన్ని పెంచింది. కుటిలత్వాన్ని రేపింది. బుద్ధుణ్ణి ఇబ్బందుల పాలు చేయాలనీ, అపకీర్తి కలిగించాలనీ పథకం వేశాడు. అలా చేస్తే తనకు అధిక గౌరవ మర్యాదలు కలుగుతాయని నమ్మాడు. వెంటనే తన ప్రియ శిష్యుడు అహితుణ్ణి పిలిచి, తన మనస్సులోని పథకాన్ని చెప్పాడు. అహితుడు అందుకు అంగీకరించి, నగరంలోకి నడిచాడు. ఆరోజు ఒక రాజపురోహితుడు బుద్ధునికీ, బుద్ధ సంఘానికీ ఆతిథ్యం ఇచ్చాడు. బుద్ధుడు భిక్ష స్వీకరించాక ధర్మోపదేశంప్రారంభించాడు. ఆ సమయానికి అహితుడు అక్కడికి చేరాడు. ఉపదేశానంతరం బుద్ధునికి నమస్కరించి‘‘భగవాన్! నన్నూ మీ భిక్షుసంఘంలో చేర్చుకోండి’’ అని వేడుకున్నాడు. బుద్ధుడు అంగీకరించాడు. కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు బుద్ధుడు తన భిక్షుసంఘంతో కలసి నగరంలో భిక్షార్థం బయలు దేరాడు. తన భిక్షా పాత్రను తీసుకోవడానికి చేశాడు. అది కనిపించలేదు. ఆరామం బయట ద్వారం దగ్గర నిలబడిన అహితుడు అటూ ఇటూ చూస్తూ–‘‘భగవాన్! మీ భిక్షాపాత్ర కోసం నేను వెదకనా?’’ అని అడిగి ఆరామం నలుమూలలా చూశాడు. బుద్ధుడు అతని వంక చూసి, చిరునవ్వు నవ్వాడు.‘‘అహితా! వెదకనవసరం లేదు. పద’’ అంటూ బయటకు నడచాడు. బుద్ధుని వెనకే అహితుడు నడచాడు. భిక్షు సంఘం రాజగృహ నగరానికి వెళ్ళే దారిలో ఒక తటాకం ఉంది. బుద్ధుడు ఆ తటాకం వైపు నడచాడు. అది చూసి అహితుడు. ‘నేను ఆ భిక్షాపాత్రను, పగులగొట్టి, ఈ తటాకంలో పడవేసిన విషయం బుద్ధునికి తెలిసింది’ అని భయపడ్డాడు. బుద్ధుడు తటాకం లో దిగి విశాలమైన తామరాకుని తుంచి, దాన్ని, శుభ్రపరిచాడు. దాని అంచులు గిన్నెలా మలిచాడు. ఆరోజు బుద్ధుని భిక్షాపాత్ర అది! మరో రెండు రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి బుద్ధుడు పడుకోడానికి తన సంఘాటి (దుప్పటి) కోసం చూశాడు. అది కనిపించలేదు. బుద్ధుడు అలా వెదకడం గమనిస్తూనే, లోలోపల నవ్వుకుంటున్నాడు అహితుడు. అంతలో... ‘‘అహితా!’’ అనే బుద్ధుని పిలుపు విని ఉలిక్కిపడ్డాడు అహితుడు. ‘‘భగవాన్! సెలవియ్యండి’’ అన్నాడు అతివినయం గా ‘‘నీకు సంఘాటి ఉందిగా’’ అని అడిగాడు. ‘‘భగవాన్! ఉంది’’ ‘‘నీవు పక్క పరుచుకొని పడుకో’’ అని, నేలను శుభ్రం చేసుకుని, తన చీవరాన్ని పక్కగా పరచుకుని బుద్ధుడు పడుకున్నాడు. ఆ రాత్రి బుద్ధునితో సహా భిక్షువులందరూ హాయిగా నిద్ర΄ోయారు. అహితునికి కంటిమీద కునుకే రాలేదు. వేకువ కాకముందే లేచి, తన గురువు చలమదీప్తుని దగ్గరకు వెళ్లి చేరాడు. తెల్లారింది. ‘‘అహితుడు ఏమయ్యాడు?’’అని అందరూ ఆలోచించసాగారు. ఇంతలో... ‘‘అదిగో... అటు చూడండి. అహిత భిక్షు ఎవరినో తీసుకుని వస్తున్నాడు అన్నాడు ఒక భిక్షువు. అహితుడు తన గురువును వెంటబెట్టుకుని వచ్చాడు. ఇద్దరూ బుద్ధుని పాదాలకు నమస్కరించారు.‘‘భగవాన్! మీ మీద క్రోధంతో, అసూయ తో వచ్చాను. మీ భిక్షాపాత్ర నేనే పగులగొట్టాను. మీ సంఘాటిని తుప్పల్లో దాచాను. ఆ విషయం మీరు గ్రహించారు. అయినా నన్ను మందలించలేదు. అందరిముందు అవమానం చేయలేదు. ఈ పనులు చేసిన రెండుసార్లూ నేను నిద్రకు దూరమయ్యాను. మనశ్శాంతి కోల్పోయాను. తప్పు తెలుసుకున్నాను. ద్వేషం కంటే ప్రేమ గొప్పదని తెలుసుకున్నాను. వెళ్ళి మా గురువు గారికి విషయం చెప్పాను. మేమిద్దరం తప్పు తెలుసుకున్నాం. మీ శరణు వేడుకుంటున్నాం’’ అన్నాడు అహితుడు. బుద్ధుడు ప్రేమతో వారిని దగ్గరకు పిలిచి భిక్షు దీక్ష ఇచ్చాడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: స్నాతక పాఠం అంటే..? -
‘ఫోస్ డీయోన్’.. ఈ బావిలోకి దిగితే తిరిగి రావడం కష్టమే..!
సృష్టి రహస్యాల్లో.. ప్రకృతి ఒడిసిపట్టిన అందాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి సోయగానికి మానవనిర్మాణం జతకలిస్తే ఇదిగో ఇలానే.. అద్భుతం అనిపిస్తుంది. ‘ఫోస్ డీయోన్’.. ఇదో భూగర్భం జలాశయం. చూడటానికి పెద్ద బావిలా కనిపిస్తుంది. కానీ నిరంతర ఊట లాంటిది ఇది. ఫ్రాన్స్కు ఈశాన్యంలో ఉన్న టోనెరే నగరం నడిబొడ్డునున్న ఈ నీటి కొలను.. 18వ శతాబ్దంలో బయటపడిందట. ఆ వెంటనే ‘షెవాలీర్ డి ఇయాన్’ అనే రాయబారి దీన్ని అందమైన కట్టడంగా మార్పించాడు. గుండ్రటి పెద్ద నుయ్యి.. లోపలికి బయటికి కొన్ని మెట్లు.. అర్ధచంద్రాకారంలో ఇల్లు మాదిరి పెంకులతో చూరు కట్టించాడు. ఒకవైపు ఆ ప్రహరీకి ఆనుకుని పెద్దపెద్ద బిల్డింగ్స్ ఉంటే.. మరోవైపు ఆ జలాశయానికి తోవ ఉంటుంది. నీటిధారకు అనువుగా ఎత్తుపల్లాలతో నిర్మించిన ఈ నిర్మాణం.. స్వచ్ఛమైన నీళ్ల మధ్య ఆకుపచ్చని నాచుమొక్కలతో.. పరిసరాల ప్రతిబింబాలతో.. ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఈ పురాతనమైన నుయ్యి.. పైకి కనిపించినంత రమ్యమైనది మాత్రం కాదు. దీని లోతెంతో.. మూలమేంటో.. నేటికీ తెలియదు. తెలుసుకునే ప్రయత్నాలలో చాలామంది ప్రాణాలనే కోల్పోయారు. ఈ బావి నుంచి ప్రతి సెకనుకు 311 లీటర్ల నీరు బయటికి వస్తుంది. అయితే కాలానికి తగ్గట్టుగా దీని వేగం.. పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. దీనిలోపల పెద్దపెద్ద గుహలు, సున్నపురాయితో ఏర్పడిన సన్నటి సందులు, మలుపులు ఉంటాయి. అయితే ఫ్రెంచ్ ఇతిహాసాలు.. ఈ జలాశయం గురించి చాలా కథలను వినిపిస్తాయి. మధ్యయుగంలో మనుషులు.. ఈ నీటిని ఉపయోగించుకునే జీవనం కొనసాగించారట. 7వ శతాబ్దంలో ఈ కొలనును కాకాట్రైస్ అనే పాములాంటి జీవి ఆక్రమించుకుని.. మనుషుల్ని దరిదాపుల్లో తిరగనిచ్చేది కాదట. ఈ జీవి డ్రాగన్స్లా రెండు కాళ్లతో.. సగం కోడిపుంజులా.. సగం బల్లిలా కనిపిస్తుందట. ‘సెయింట్ జీన్ డి రీమ్’ అనే సన్యాసి.. అప్పట్లో ఈ కాకాట్రైస్ను చంపి.. ఈ బావిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడట. ఈ ఫోస్ డీయోన్లో పొంగుతున్న నీరు.. ఎక్కడినుంచి వస్తుందో తేలలేదు. ఎంత ప్రత్యేక శిక్షణపొందిన డైవర్ అయినా సరే.. ఈ బావిలోకి దిగితే తిరిగి రావడం కష్టమే. మొదటిసారి 1974లో ఇద్దరు డైవర్స్.. దీని లోతును, జన్మస్థానాన్ని కనిపెట్టడానికి లోపలికి వెళ్లారు. కానీ తిరిగి రాలేదు. 1996లో మరొక డైవర్ అదే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో చాలా ఏళ్లపాటు దీనిలో ఈతకు అనుమతుల్లేకుండా పోయాయి. ఇక 2019లో డైవర్ పియరీ–ఎరిక్ డిజైనే.. దీనిలో 1,214 అడుగుల (370 మీటర్లు) మార్గాలను అన్వేషించారు. అదృష్టవశాత్తు అతను సజీవంగా తిరిగి వచ్చాడు కానీ.. దీని మూలాన్ని మాత్రం గుర్తించలేకపోయాడు. అయితే అతడికి ఆ బావిలో ఎలాంటి పాములు, చేపలు, అతీంద్రియశక్తులు కనిపించలేదట. కానీ లోపల మార్గం మాత్రం.. ఎంతటి తెలివైన వారినైనా తికమక పెట్టేలానే ఉందట. ఏది ఏమైనా ఈ జలాశయం ఎక్కడ పుట్టింది.. దీని లోతెంత? ఇందులో నిరంతరం నీరు ఎలా ఊరుతోంది? వంటి సందేహాలు తేలకపోవడంతో ఇది.. మిస్టీరియస్గానే మిగిలిపోయాయి. — సంహిత నిమ్మన ఇవి చదవండి: 'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త! -
ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ పాజిటివ్ అంటే..? ప్రమాదమా..!
నాకు 40 ఏళ్లు. మూడవ నెల ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ పాజిటివేమో అనే డౌట్ చెప్పారు. చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఉమ్మనీరు టెస్ట్ చేస్తామన్నారు. దీనివల్ల అన్నీ కనిపెట్టొచ్చా? బేబీ హెల్దీగా ఉన్నట్టు ఎలా గుర్తించడం? – ఎన్. వైశాలి, షోలాపూర్ ఆమ్నియోసెంటీసిస్ (Amniocentesis) ద్వారా ఉమ్మనీరును టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. తగు జాగ్రత్తలతో ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్.. పొట్టలోపల బేబీకి టెస్ట్ చేసే ప్రక్రియ ఇది. ఈ వైద్య పరీక్షను ముఖ్యంగా క్రోమోజోమల్ సమస్యలేమైనా ఉన్నాయేమో అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి సూచిస్తారు. జన్యు వ్యాధుల విషయంలోనూ ఈ టెస్ట్ను చేస్తారు. 40 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ కావడం, మీ బ్లడ్ టెస్ట్లలో డౌట్ రావడం వల్ల క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కనిపెట్టడానికి ఈ టెస్ట్ని సజెస్ట్ చేసి ఉంటారు. దీన్ని చాలా అనుభవం ఉన్న స్పెషలిస్ట్లే చేస్తారు. మీరు మామూలుగా ఫుడ్ తినే ఈ టెస్ట్కి వెళ్లొచ్చు. ఔట్ పేషంట్ డిపార్ట్మెంట్లోనే చేస్తారు. అల్ట్రసౌండ్ చేసి.. బేబీ, ప్లాసెంటా, పొజిషన్ను చెక్ చేసి వివరించి కన్సెంట్ తీసుకుని చేస్తారు. టెస్ట్ రిజల్ట్స్ 5 నుంచి 15 రోజుల్లో వస్తాయి. వచ్చే రిజల్ట్స్ని బట్టి తదనంతర పరిణామాలను మీతో డిస్కస్ చేస్తారు. ఈ టెస్ట్లో అన్నిరకాల అబ్నార్మిలిటీస్ని కనిపెట్టలేము. దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. సెరిబ్రల్ పాల్సీ, ఆటిజం, స్పీనల్ బిఫడా, ఫిజికల్ చేంజెస్ను ఇందులో కనిపెట్టలేం. అలాంటివాటికి కొన్నిసార్లు అడ్వాన్స్డ్ స్కాన్ అవసరం అవుతుంది. ఈ ప్రొసీజర్లో 0–5 శాతం గర్భస్రావం అయ్యే రిస్క్, ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. యాంటీబయాటిక్స్ ఇస్తారు. ప్రొసీజర్ తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుని ఇంటికి వెళ్లొచ్చు. మైల్డ్ క్రాంప్స్ ఉంటాయి. పారాసిటమాల్ లాంటివి ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ప్రొసీజర్ తర్వాత బాగా కడుపు నొప్పి వచ్చినా, బ్లీడింగ్ అవుతున్నా.. వాటర్ లీక్ అయినా ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలి. ఇంటికి వెళ్లాక ఇలాంటి లక్షణాలు కనపడినా.. చలి, జ్వరం ఉన్నా వెంటనే ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్లాలి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ ఫీలవకుండా.. పౌష్టికాహారం తీసుకోవాలి. — డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
వెజైనా నుంచి బ్యాడ్ స్మెల్ వస్తే పరిస్థితి అంతేనా..!
నాకు 18 ఏళ్లు. వెజైనా నుంచి బ్యాడ్ స్మెల్ వస్తోంది. నేను హాస్టల్లో ఉంటాను. నా ప్రాబ్లమ్కి సరైన మెడిసిన్ని సజెస్ట్ చేయగలరు. – అనామిక, హైదరాబాద్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్లో చాలా కామన్గా వచ్చేది బ్యాక్టీరియల్ వెజైనోసస్. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. వెజైనా నుంచి బ్యాడ్ స్మెల్ ఉంటుంది. రాషెస్, ఇచింగ్ ఉండవు. ఇది వెజైనాలో ఉండే నార్మల్ బ్యాక్టీరియా ఎక్కువైతే వస్తుంది. పలచగా.. వైట్గా డిశ్చార్జ్ కావచ్చు. ఫిషీ స్మెల్ ఉంటుంది. వెజైనా ఎసిడిటీ చేంజెస్ వల్ల వస్తుంది. సువాసనగల సబ్బులు, బబుల్ బాత్స్, వెజైనల్ డియోడరెంట్స్ వాడేవారిలో ఇది ఎక్కువ. ఇన్నర్వేర్ని గాఢమైన డిటర్జెంట్స్తో ఉతికినా.. తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతున్నా ఇది ఎక్కువ అవుతుంది. మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే కాటన్ స్వాబ్తో వెజైనా నుంచి శాంపిల్ తీసి యూరిన్ని కూడా టెస్ట్కి పంపిస్తారు. ఆ రిజల్ట్స్తో కన్ఫర్మ్ అయితే యాంటీబయాటిక్ మాత్రలు, Doxycycline, Metronidazole లాంటివి ఇస్తారు. డాక్టర్ సలహా మేరకు పూర్తి కోర్స్ వాడాలి. కొంచెం తగ్గగానే మందులు ఆపేస్తే తిరగబెట్టే రిస్క్ పెరుగుతుంది. స్ట్రాంగ్ వెజైనల్ వాషెస్ కూడా వాడకూడదు. రోజుకు నాలుగైదుసార్లు వేడి నీళ్లతో శుభ్రం చేసుకుని.. పొడిగా ఉంచుకోవాలి. కాటన్ ఇన్నర్వేర్నే వాడాలి. ఎక్కువసార్లు ఈ ఇన్ఫెక్షన్ అవుతూంటే యూరిన్ కల్చర్, సెన్సిటివిటీ చెక్ చేయాల్సి ఉంటుంది. — డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Funday Story: బాలిశెట్టి అహం..!
బాలిశెట్టి.. కిరాణా కొట్టు వ్యాపారి. నిత్యావసర సరుకులు బియ్యం, బెల్లం, పప్పు, ఉప్పు, చింతపండు వంటివి అమ్మేవాడు. వ్యాపారం బాగా సాగటంతో చేతికింద పనివాడిని పెట్టుకోవాలని అనుకున్నాడు. పక్క గ్రామంలో ఉండే నర్సయ్య పనికి కుదిరాడు. బాలిశెట్టికి తన కింద పనిచేసేవారంటే చులకన ఎక్కువ. తన ముందు వాళ్లు దేనికీ సరితూగరనీ, ఎందుకూ పనికిరారనే అహంతో ఉండేవాడు. నర్సయ్యది కష్టపడి పనిచేసే స్వభావం. దుకాణం తెరిచినప్పటి నుండి మూసేవరకు బాలిశెట్టి చెప్పే రకరకాల పనులన్నిటినీ కాదనకుండా చేసేవాడు. దుకాణంలో దుమ్ము దులపడం, సరుకులు పొట్లాలు, మూటలు కట్టడం చేసేవాడు. అతనికి ఏమాత్రం విరామం దొరికినా.. పప్పులు, బియ్యంలో ఉండే రాళ్లు ఏరమని పురమాయించేవాడు బాలిశెట్టి. ఎంతపని చేసినా తృప్తి ఉండేది కాదు. పని వేళలు ముగిసి నర్సయ్య ఇంటికి వెళ్లబోతుంటే ఉల్లిగడ్డల బస్తాను కరణం గారింట్లోనో, బియ్యం బస్తాను మునసబు గారింట్లోనో వేసి పొమ్మనేవాడు. ఇంటికి ఆలస్యం అవుతుంది, మరునాడు వేస్తానంటే కించపరుస్తూ, వెక్కిరిస్తూ మాట్లాడేవాడు. బాలిశెట్టి కూతురు పెళ్ళీడు కొచ్చింది. చదువుకున్న పిల్ల కావటంతో మంచి సంబంధం కుదిరింది. నర్సయ్యను దుకాణం పనులతోపాటు, పెళ్ళి పనులకూ తిప్పుకోవటం మొదలుపెట్టాడు. దాంతో ఏ అర్ధరాత్రో ఇంటికి చేరేవాడు నర్సయ్య. ఇంట్లోవాళ్ళు బాలిశెట్టి దగ్గర పని మానేయమని ఒత్తిడి చేశారు. పెళ్ళికి మూడురోజుల ముందు బాలిశెట్టి ఇంట్లో దొంగలు పడి ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. కూతురు పెళ్లి ఆగిపోతుందని బాలిశెట్టి భయపడి నర్సయ్యకు చెప్పుకుని భోరున ఏడ్చాడు. ‘అయ్యా! మీరేం కంగారు పడకండి. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి ఖర్చులు నేను సర్దుతాను’ అన్నాడు నర్సయ్య. ఆమాటకు బాలిశెట్టి ఆశ్చర్యపోయాడు. నర్సయ్యకు తన ఊరిలో పదిహేను ఎకరాల మాగాణి, ఇరవై ఎకరాల మామిడితోట, సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు కొడుకు వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు. అతనికి ఇంట్లో కూర్చోని విశ్రాంతి తీసుకోవటం ఇష్టంలేకనే బాలిశెట్టి వద్ద పనిలో చేరాడని తెలిసింది. తన కూతురు పెళ్లికి నగదు సహాయం చేశాడు నర్సయ్య. ఆనాటి నుండి ఇతరులను తక్కువ అంచనా వేయటం, చులకనగా చూడటం మానేశాడు బాలిశెట్టి. — తేజశ్రీ -
Hrithik Roshan: ఈ బాలీవుడ్ యాక్టర్ ముద్దు పేరు వింటే షాకే..!
ఒక్కొక్కరికి ఒక్కో ముద్దుపేరు ఉండటం సహజం. వారి ప్రవర్తనతో గానీ, అలవాట్లు.. ఇష్టాలతోగానీ, కనిపించే తీరుతోగానీ.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. చాలా రకాలుగా మారుపేర్లు, ముద్దుపేర్లు వస్తూంటాయి. కొన్ని ముద్దు పేర్లు మాత్రం స్థిరపడిపోతాయి కూడా. ఇలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు అయినటువంటి హృతిక్ రోషన్కి కూడా ఓ చిన్న కథ ఉంది. అదేంటో చూద్దామా! బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ పెట్ నేమ్ దుగ్గూ. ఈ ముద్దు పేరుకీ.. హృతిక్ వాళ్ల నాన్న.. బాలీవుడ్ ఒకప్పటి అందాల హీరో రాకేశ్ రోషన్ పెట్ నేమ్కీ ఏదో కనెక్షన్ ఉండే ఉంటదని బాలీవుడ్ వర్గాలు.. తన పేరునే కాస్త తిరగేసే కొడుకును పిలుచుకుంటున్నాడా ఏంటీ అని హృతిక్ ఫ్యాన్స్ డౌట్ పడతారట. ఇంతకీ రాకేశ్ రోషన్ ముద్దు పేరేంటంటే.. గుడ్డూ! ఇవి చదవండి: ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు! -
Funday Story: 'వనప్రస్థపురం'.. మరెప్పుడైనానా? ఎన్నేళ్ల నుంచి ఇదే..!?
హాలిడే ట్రిప్కు పిల్లలు, మనవళ్ళతో ఓలా కార్లు బయల్దేరిపోయాయి. తలుపు దగ్గరగా వేసి వచ్చి, హాల్లో సోఫా మీద కూర్చున్నాను. డైనింగ్ టేబులు మీద ఆఖరు మనవడు చివరి క్షణం వరకూ తిననని మారాం చేస్తూ వదిలేసిన పప్పు, నేయి అన్నం. దాని పక్కనే హడావుడిలో మరచిపోయిన మంచినీళ్ళ బాటిల్. ఇల్లంతా నిశ్శబ్దం కరెంటు పోయినట్టుగా. గదిలో సుభద్ర ఒత్తిగిల్లుతూ, దుప్పటి పైకి లాక్కున్న చప్పుడు. ఎంగిలి కంచం సింకులో వేసి, బెడ్రూమ్లోకి తొంగిచుశాను. ‘ఎట్లా ఉంది’ ‘తగ్గుతున్నది జ్వరం. పిల్లలు చాలా డిసప్పాయింట్ అయ్యారు నావల్ల’ ‘మరెప్పుడైనా వెళదాంలే ఏం పోయింది’ ‘మరెప్పుడైనానా? ఎన్నేళ్ల నుంచి అనుకుంటున్నాము తాజ్మహల్ చూద్దామని. అందరికీ కుదిరి, వాతావరణం బాగుండి, సెలవులు దొరికి, పరీక్షలు లేకుండా, ఇదిగో ఇన్నాళ్ళకి వీలయితే, ఈ వైరల్ ఫీవర్ మొత్తాన్ని దెబ్బతీసింది’ నిస్పృహగా నవ్వింది సుభద్ర. చేయి పట్టుకుని నిమిరాను. పలుచటి ముఖం. జ్వరంలోనూ తగ్గని ఆ ముఖంలోని నిర్మలత. కాకుంటే ఒత్తుగా ఉండే జుట్టొకటే ఈ మధ్య పలచబడింది. కాసేపటికి కునుకులోకి జారింది. బయటకు వచ్చి సోఫాలో కూర్చుని, క్రాస్వర్డ్ చేయటం మొదలు పెట్టాను. ఇరవై నిముషాలు పట్టింది. అలవాటయితే తేలికయిన ప్రక్రియే. సాయంత్రం నాలుగు గంటలు కావస్తోంది. ఫ్రిజ్ నుంచి పాలు తీసి బయటపెట్టాక, టీ డబ్బా కోసం వెతుకుతుంటే అకస్మాత్తుగా లాసా–లమ్సా చాక్లెట్ టీ గుర్తుకొచ్చింది. ఈ రోజుల్లో ఎవరయినా తాగుతున్నారా? అనుమానమొచ్చింది. ఫోను చేశాను. త్రివేణి సూపర్ మార్కెటులో ఆశ్చర్యకరంగా స్టాక్ ఉంది. పదినిమిషాల్లో పిల్లవాడితో పంపాడు. కొంచెం పాలతో, తక్కువ పంచదారతో, లైట్గా పెట్టిన టీ మరుగుతుంటే, వాసన కాస్త బలంగానే తగులుతోంది. రెండు మగ్గుల్లో పోసి బెడ్ రూమ్కు తీసుకువెళ్ళాను. చూస్తూనే లేచి కూచుంది సుభద్ర. మొదటి సిప్కే ముఖం విప్పారింది. ‘ఇదెక్కడిది’ ఆశ్చర్యంగా అడిగింది. ‘తెప్పించాను ఇప్పుడే’ టీ కప్పును చేతితో తిప్పుతూ చూస్తుండి పోయింది తాగడం మానేసి. ‘చల్లారిపోతుంది తాగు’ ‘ఈ రుచి, వాసన నీకు ఏం గుర్తుకు తెస్తున్నాయి’ ‘ముంబైలోని మాతుంగా కింగ్స్ సర్కిల్. అక్కడి పూలమాలలు. పక్కనే శృంగేరి మఠం. గిరి బుక్ స్టోర్’ ‘ఇంకా’ ‘బొంబాయ్ బ్లాస్ట్స్... మోకాళ్ళలోతు నీటిలో పెద్దవాడి బస్సు కోసం మెయిన్ రోడ్డు వరకూ చుడీదార్ ఎగగట్టి నడచిపోవడం’ జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా జాగ్రతగా నెమరువేస్తూ అవి అయిపోతాయేమో అన్న భయంతో కొంచెం కొంచెంగా టీ తాగాం. ‘ఎన్నేళ్ళయింది చాక్లెట్ టీ తాగి’ ‘1982లో ఆఖరిసారి తాగాము. బాంబే నుంచి స్విట్జర్లాండ్. వెనక్కు చెన్నై. కొన్ని రోజులు అమెరికా మళ్ళీ చెన్నై. ఎక్కడా దొరకలేదు మనకు’ అందామె. ‘మనం ప్రయత్నించలేదుగా’ ‘అంటే అత్తగారికి ఇష్టం లేదు. రెండు రకాల టీలు పెట్టే ఓపిక నాకు లేదు. మామయ్య, అత్తయ్య పోయాక, ఎప్పుడూ రుచిచూడని పిల్లలకు ఈ రుచి నచ్చలేదు’ ‘హోటల్స్లో దొరకదు’ నేను ముక్తాయింపుగా అన్నాను. మరుసటి రోజు ఉదయం ఢిల్లీ నుంచి ఫోను చేశారు పిల్లలు. అమ్మ ఎట్లా ఉంది. వంట ఏం చేసుకున్నారు వగైరా వగైరా. అమ్మ జ్వరం తగ్గిందనగానే వాళ్లకు కాస్త రిలీఫ్. కార్న్ ఫ్లేక్స్ను బౌల్స్లో తీసుకుని వేడి పాలు ఒంపుకొని డైనింగ్ టేబులు మీద కూర్చున్నాము. అల్మారాలో పై తంతెలో గోధుమ రంగులో ఉంది పెళ్లి ఆల్బమ్. దుమ్ము తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. దాదాపు నలభై ఏళ్ళ క్రితం ఆల్బమ్. పసి పిల్లలుగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళయినారు. చిన్న గొలుసు రెండు పిలకలతో అక్కయ్య ఎత్తుకొని ఉన్న రమ్య ఇవాళ అమెరికాలో సెటిల్ అయింది. కళకళలాడుతున్న ముఖాల్తో అత్తయ్యలు, మామయ్యలు, బాబాయిలు, పిన్నులు. కండువాతో తాతయ్య, అమ్మమ్మ. ఫ్యామిలీ ఫొటోలో దాదాపు 65 మందిమి ఉన్నాము. మనిషి మనిషిని లెక్కపెడితే ప్రస్తుతం అందులో నలభయి అయిదు మంది ప్రపంచంలోనే లేరు. పది మంది ఇండియాలో లేరు. ‘పెళ్ళిలో మామయ్య పాడిన పాట జ్ఞాపకముందా. భక్ష్యాలతో పాల మీగడ లేదని మీ ఆత్తకు కోపం వచ్చింది’ సుభద్ర జ్ఞాపకం చేసింది. ఆల్బమ్స్ వెనక్కి పెట్టేయబోతుంటే, సుభద్ర టీపాయి మీద ఉంచమన్నది– మధ్యాహ్నం తీరికగా చూసుకోవడానికి ఇద్దరం కలిసి. రోజుకు రెండుసార్లు పిల్లల ఫోనులు కొనసాగుతూనే ఉన్నాయి. టాక్సీ ప్రయాణం, హోటల్స్లో తందూరీ రోటీ రుచి. ఆగ్రా దారిలో ధాబాలు.. పుల్కాలు.. మజా కూల్డ్రింకు... బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరుసటి రోజు స్నానం చేసి స్లీవ్లెస్ నైటీలో బయటకు వచ్చింది సుభద్ర. చేతిలో కాగితాల కట్ట. ‘ఎన్నేళ్ళయింది నువ్వీ పింక్ స్లీవ్ లెస్ వేసుకొని’ అశ్చర్యంగా అడిగాను. ‘ఏమో! అల్మారా తెరిస్తే వేసుకోవాలనిపించింది’ ‘ఇన్నేళ్ళయినా ఎంత బాగుందో’ పెద్దగా అనేసి నాలిక కరుచుకొని చుట్టూ తిరిగి చూశాను. ఇంట్లో మేమిద్దరమే అన్న సత్యం మరోసారి గుర్తొచ్చింది. ‘ఏమిటి కాగితాల కట్ట’ ‘ఉత్తరాలు’ ‘ఏ ఉత్తరాలు’ ‘పెళ్ళికి ముందు ఆరు నెలలు మీరు నాకు, నేను మీకు రాసినవి’ నవ్వుతూ టేబుల్ మీద పెట్టింది సుభద్ర. ఒక కట్టకు గ్రీన్ బాండు. అవి సుభద్ర రాసినవి. రెడ్ రబ్బర్ బాండ్తో నావి. ‘ఉప్మా చేయమంటారా?’ ‘నువ్వేం చేయద్దు. కాస్త తొందరగా భోజనం చేద్దాము. ఉత్తరాలిచ్చి సోఫాలో కూర్చో’ సుభద్ర ఉత్తరాలు నేను, నా ఉత్తరాలు సుభద్ర తీసుకున్నాము. ఎన్ని ఆశలు. ఎన్ని ఆలోచనలు. ఎంత అర్థం లేని కవిత్వం. ఎప్పటి సినిమా పాటలు. మూడు వేలతో హనీమూన్ ఎక్కడికంటూ ఎన్ని చర్చలు. పెళ్ళికి ముందు ఎదుర్కోలులో కట్టుకోబోతున్న కాఫీ రంగు కంచి పట్టుచీర వర్ణన. రాసి కొట్టేసిన చిలిపి మాటలు. అప్పుడు చదివిన నవలల ప్రశంస. కనబోయే పిల్లల మీద బెరుగ్గా సాగిన చర్చలు. తెలుగు రాత అర్థం కావడానికి కూడా కొంచెం సమయం పడుతోంది. నాకు మాత్రం ఆ ఉత్తరాలు కృష్ణబిలం కన్నా లోతుగా, ఎంకి పాటల కన్నా మధురంగా అనిపించాయి. గంట తరవాత ఉత్తరాల కట్ట మార్చుకున్నాము. ఉత్తరాలు చదువుతూ అరవయి ఏళ్ళు దగ్గర పడుతున్న సుభద్రలో అప్పుడప్పుడు అణచిపెట్టుకున్న నవ్వు, ముంచెత్తుతున్న సిగ్గు చూస్తుంటే ఒక్కసారి గుండె పొరలో ఏదో కదిలింది. శిథిలమయిన దేవాలయం తలుపులు తీస్తే, చెక్కు చెదరని అమ్మవారి విగ్రహం కనబడినట్లు అనిపించింది నాకు. పుస్తకాలు చదవడం మొదలెట్టాం. ఒకరోజు ‘మిడ్ నైట్స్ చిల్ట్రన్’ కొంతభాగం నేను చదివాను. సుభద్ర విన్నది. మరుసటి రోజు ‘వెన్నెల్లో ఆడపిల్ల’ యండమూరి రచన సుభద్ర చదివింది. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దగ్గరి సుధా హోటల్లో మసాలా దోశె. మూడోరోజు ఎన్నేళ్ళుగానో పోలేకపోతున్న శర్మ ఇంటికి సాయంత్రం ఓ గంటసేపు టీకి. ఎప్ప్పుడో టీటీడీ నుంచి తెప్పించిన పోతన భాగవతం తీసి చదవడం ప్రారంభించాం ఇద్దరం. ఉదయాన్నే ఐదున్నరకల్లా లేచి ఒక అరగంట ఐ.ఎం.లో నేర్చుకున్న యోగా చేయడం, ఆ తరువాత మరో అరగంట పాటు ఏ ఆలోచనా లేని మౌనం కోసం ధ్యానంలో కూర్చోవడం. మనవళ్ల స్కూలు, పిల్లల ఆఫీసు తొందర లేకపోవడంతో, పనిమనిషిని కూడా లేట్గా రమ్మన్నాము. ఒక విధమైన నిర్వా్యపారత్వంతో చాలారోజుల నుంచి వెతుకుతున్నది, కొంచెం కొంచెం దొరుకుతున్న తృప్తి మొదలైంది. వారం రోజులు త్వరగా గడిచిపోయాయి. ఆదివారం వచ్చేసింది. పిల్లలు సాయంత్రం దిగుతారు. ఉదయాన్నే లేచి కాఫీ కూడా తాగకుండా, కాలనీ పార్కులో మౌనంగా అరగంట కూచున్నాము. శరీరాలు కొంచెం తగులుతున్నాయి. మనసులు పెనవేసుకున్నాయి. నెమ్మదిగా లేచి ఇంటికి వచ్చేశాము. పిల్లలు వచ్చేశారు. ఇల్లంతా మళ్ళా సందడి. పొద్దున స్కూలుకు తయారయ్యేవాళ్ళు, హోమ్వర్క్ మరచిపోయిన వాళ్ళు, స్కూలు బాగ్ దొరకని వాళ్ళు, బ్రేక్ఫస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికి హడావుడి.. పూర్తి బిజీ రొటీన్ మళ్ళీ మొదలయింది. మనవళ్ల బస్సు కోసం రోడ్డు మీద నిలుచోవడం, ఎన్డీటీవీలో ఊదరగొట్టే రాజకీయ చర్చలు, పాత సినిమా పాటలను కొత్త వాళ్ళతో పాడించే కార్యక్రమాలు. అప్పుడప్పుడు రాని నీళ్ళు, ఎప్పుడూ ఎగ్గొట్టే పనిమనిషి. పాత మూసలోకి క్రమంగా జారిపోతున్నాము. ఒంటరిగా ఉన్న వారం రోజులు వెనక్కి తిరిగి చూసుకుంటే, అవి ఒకసారి ఏడాది లాగా, మరోసారి ఏదో కలలాగా అనిపించడం ప్రారంభించాయి. నెలరోజుల తరువాత రెండోవాడి కొలీగ్ పెళ్ళికి పిలుపు వచ్చింది. పెళ్ళి చేసుకునే అమ్మాయి మాకు కూడా బాగా పరిచయం. ఇంటికి వచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టి కార్డు ఇచ్చి రమ్మనమంటూ పిలిచింది. ఇంటిల్లిపాది బయలుదేరారు. ‘నాకెందుకో రావాలని లేదురా’ ప్రయాణానికి గంట ముందర చెప్పాను. ‘ఏం నాన్నా? ఒంట్లో బాలేదా’ ఆదుర్దాగా అడిగాడు మా రెండోవాడు. ‘ఒంట్లో బానే ఉంది. అక్కడికొచ్చి క్యూలో నిల్చుని, బఫే తినే ఇంట్రెస్టూ, రాను పోను నాలుగు గంటలు కార్లో కూచునే ఓపిక రెండూ లేవు’ నేనూ రానంటూ సుభద్ర ఉండిపోయింది. మమ్మల్ని వదిలి వాళ్లకు వెళ్లక తప్పలేదు. ఆ పైవారం బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం. కుటుంబసమేతంగా వనభోజనాలు. మరో వారం బిర్లామందిర్ ప్రయాణం. అన్నీ ఆఖరి క్షణంలో మానేశాము నేను, సుభద్ర. మమ్మల్ని, మా ప్రవర్తనని, ఆలోచనలను చిన్నప్పటి నుండి ఎరిగి ఉన్న పిల్లలకు, ముఖ్యంగా కోడళ్ళకు, ఏం జరుగుతున్నదో అంతుపట్టడం లేదు. మేమేమీ కోపంగా లేము. సాధింపులు లేవు. పిల్లలతో చిరాకు పడటం లేదు. పైపెచ్చు పూర్వం కన్నా కొంచెం సంతోషంగా ఉన్నట్లు కూడా వాళ్ళకు, మాకూ తెలుస్తూనే ఉంది. ఆదివారం ఉదయం. అందరం బ్రేక్ఫస్ట్ కానించి కూర్చున్నాము. పిల్లలు ఆడుకోడానికి వెళ్లారు. పెద్దకొడుకు, కోడలు, చిన్నకొడుకు, కోడలు హాల్లో సోఫాల్లో కూర్చొని ఉన్నారు. సుభద్ర వంటింట్లో టీ పెడుతోంది. పేపరుతో బయటకు వచ్చిన నన్ను చూసి, సింగల్ సీటరు సోఫా ఖాళీ చేసి కూర్చొమన్నాడు పెద్దవాడు. ‘అమ్మా నువ్వు కూడా ఇటురా’ పిలిచాడు. టీ కప్పులు ట్రేలో పట్టుకొని వచ్చింది సుభద్ర. మా దగ్గరున్న స్వతంత్రం వల్ల, ఇంట్లో ఉండే మంచి వాతావరణం వల్ల, ఏ ఉపోద్ఘాతం, డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడిగాడు పెద్దవాడు. ‘నాన్నా ఈ మధ్య మీరు ఇద్దరూ మాతో బయటికి రావడాన్ని ఎవాయిడ్ చేస్తున్నారు. ఒంట్లో బాలేదా? మనసు బాలేదా?’ ‘అదేమీ లేదురా’ మాట దాటేశాను. ‘పోనీ పిల్లలతో, పనితో బాగా అలసిపోతున్నారా? వంటకు సహాయంగా మనిషిని పెడదామంటే మీరేగా వద్దన్నారు’ ‘పనిలో ఏ ప్రాబ్లమ్ లేదురా’ ‘ఎందులోనూ ఏ ప్రాబ్లమ్ లేకపోతే మరి ఈ మార్పు ఎందుకు వచ్చింది. తాజ్మహల్ ట్రిప్ కాన్సిల్ అయినప్పటి నుంచి మీరు దేనికీ మాతో కలిసి రావట్లేదు. ఎందుకు?’ సుభద్ర, నేను మార్చి మార్చి చూసుకున్నాము. ఏమీ మాట్లాడవద్దన్నట్లు తల ఆడించింది సుభద్ర. నామటుకు నాకు, ఈ మౌనం, ముసుగులో గుద్దులాట కొనసాగితే, మనస్పర్థలు మొదలయితాయేమో అనిపించింది. ఆలోచించుకొని నెమ్మదిగా అన్నాను. ‘మేము వనస్థలిపురంలోని మన పాత ఇంట్లో ఉందామనుకుంటున్నాము. కనీసం ఓ ఆర్నెల్లు’ కొడుకులు, కోడళ్ళు అందరూ ఉలిక్కిపడ్డారు. ‘ఎందుకు నాన్నా? ఏమయింది’ చిన్నవాడి ప్రశ్న. ‘ఏమీ కాలేదు. మీరు మమ్మల్ని ఒక్కమాట అనలేదు. పిల్లలు కూడా ఏమీ నోరుజారలేదు. అంతా ఎంతో ప్రేమగా ఉంటున్నారు’ ‘మరి?’ ‘నేను చెప్పే కారణాలు కొన్ని మీకు నవ్వు తెప్పించవచ్చు. కొన్ని మీకు అర్థం కూడా కాకపోవచ్చు. మా అమ్మ చెప్పేది... రామాయణ వనవాస ఘట్టంలో దశరథుడి ఆక్రోశం అర్థం కావాలంటే పిల్లలుండాలని. అట్లాగే నేను చెప్పేవి, అనుకునేవి, మీకు అరవై, డెబ్బై ఏళ్ళు వస్తేగాని పూర్తిగా అర్థం కావు. వయసు పైబడ్డాక భార్య భర్తలకు ఏకాంతం యవ్వనంలో కన్నా ఎక్కువ అవసరం అని నా అభిప్రాయం. పెళ్ళయిన మొదటి రెండేళ్లలో ఎట్లా ఉన్నామో, ఏం మాట్లాడుకున్నామో కూడా జ్ఞాపకం లేదు నాకు. మీ చదువులు, మా అమ్మ, నాన్న, బంధువులు, రోగాలు, ప్రయాణాలు కొన్ని దశాబ్దాలు హాడావుడిగా గడిచిపోయాయి. మీ అందరి మధ్య ఎంత ప్రేమగా ఉన్నా, మేమిద్దరం నిశ్శబ్దంగా పక్కపక్కన కూర్చోవడమో, మా పెళ్లి ఆల్బమ్ చుసుకోవడమో, మాకు ఎంతో సహాయం చేసిన స్నేహితుల విషయం మాట్లాడుకోవడమో, ఇప్పుడు దాదాపు అసంభవం అయింది. కృష్ణశాస్త్రి పాటలు వింటుంటే మనవరాలు చానల్ మార్చేస్తుంది. తలత్ మెహమూద్ గజల్ చిన్నకోడలికి మలేరియా వణుకుపాట. పాత ఆల్బం టీపాయ్ మీద పెడితే పిల్లల పుస్తకాల్లో కలసిపోతుంది. ఏమీ చేయకుండా ఉండటం, చేయదలచుకున్నది మాత్రమే చేయడం, ఈ స్వతంత్రం కాస్త కావాలి అనిపిస్తోంది రా’ నా మాటలకు చిన్నకోడలు కాస్త గిల్టీగా తలదించుకుంది. ‘ఓ పదిహేను రోజులు ఎక్కడి కన్నా వెళ్ళిరండి నాన్నా!’ చిన్నవాడు సలహా ఇచ్చాడు. ‘నేను కోరుకునేది ఎక్కడికీ పోనక్కరలేని స్థిరత్వం, ప్రశాంతత. నాకు అరవై అయిదు ఏళ్ళు. మహా అయితే మరో పదిహేనేళ్ళు, ఆరోగ్యం బాగుంటే ఇరవై. మా ఇద్దరిలో ఒకరు ముందు, ఒకరు వెనక పోక తప్పదు. మా ఇద్దరిలో ఒంటరిగా మిగిలిన వాళ్ళకి మనుమలు, మనవరాళ్ళు తప్ప, ఏ జ్ఞాపకాల గుబాళింపు, ఏ మాటల మంద్రధ్వని ఆలంబనగా ఉండనక్కరలేదా? కళ్ళు మూసుకొని మీ అమ్మను తలచుకుంటే కాఫీ పెడుతూనో, పసిపిల్లకు పాలు పడుతూనో కనబడుతున్నది. ఆ రూపం తప్ప మరే రూపమూ ఎంత ప్రయత్నించినా నా కళ్ళ ముందుకు రావడం లేదు’ ఉద్యోగం చేస్తున్న పెద్దకోడలు తలదించుకొని నెమ్మదిగా అన్నది – ‘పోనీ మేమే ఎక్కడికన్నా మారిపోమా’ ‘మళ్ళా అదే మాట. మీరు మమ్మల్ని కష్టపెట్టడం లేదు. కాని మనమలు మనవరాళ్ళతో ఉండే సుఖం కన్నా కొంచెం వేరే సుఖం, శాంతి కావలసిన సమయం వచ్చిందేమో అనిపిస్తున్నది. ఏదో పొద్దున లేచి, గబగబా దీపం పెట్టి, హాడావుడిగా చేసే పూజ తప్ప, అరగంట ప్రశాంతంగా ఆత్మావలోకనం చేసుకునే తీరిక, వ్యవధి లేకుండా ఉన్నది జీవితం. తండ్రిగా, తాతగా, భర్తగా, ఉద్యోగిగా కాకుండా భగవంతుడు ఇచ్చిన జన్మకు ఒక వ్యక్తిగా నేను సాధించినదేమిటి? నన్ను, నేను ఎంతవరకు తెలుసుకున్నానన్న ప్రశ్న నన్ను ఒక్కొక్కసారి కలవరపెడుతున్నది.’ ‘అయితే వెళ్ళిపోతారా’ కూతురు లేని లోటును తీర్చిన చిన్నకోడలు ఒక్కసారి బావురుమంది. ‘అదేమిటమ్మా, ఆరునెలలు అనుకుంటున్నాము. ఉండగలమో, లేదో? మనసంతా ఇక్కడికే లాగుతుందేమో? చంటివాణ్ణి జోకోట్టకపోతే నాకు నిద్ర పట్టదేమో? ఏ అవసరం వచ్చినా చెప్పండి రెండు గంటల్లో హైటెక్ సిటీలో వచ్చివాలతాము. ఏం తినాలనిపించినా, మమ్మల్ని చూడాలనిపించినా, వెంటనే బయలుదేరి రండి. మన పూర్వులు నిర్ణయించినట్లు వానప్రస్థ ఆశ్రమాన్ని కొన్ని నెలలు అయినా వనస్థలిపురంలో గడుపుదామని మా ప్రయత్నం. భగవంతుడి దయ వల్ల మొదటి రెండు నెలలు ఈ ప్రయత్నం సఫలమయితే, తరువాతి రెండు నెలలు ఉత్తరాలు రాసుకునే వెనకటి రోజులకు పోదామనుంది. వీలయితే వాట్సప్ని ఫోను నుంచి తీసేద్దామనీ ఉంది. రోజువారీ వ్యవహారంలో మీరంతట మీరు నిర్ణయాలు తీసుకోవడం, బాగా అవసరమనుకుంటేనే మా సలహాను అడగడం మీకూ మంచిది. మాకూ మంచిది. ఎవరు చూడొచ్చారు? ప్రతిరోజు కనబడకపోతే మూడు దశాబ్దాల క్రింది నా యూరోపియన్ అనుభవాలు మీకు వినాలనిపిస్తుందేమో! మనవరాలు సంగీతం క్లాసు టయిమ్కి వాకింగ్ పెట్టుకోకుండా నేను ఇంట్లోనే ఉండి దాని ముద్దు పాటలు వింటానేమో’ ‘అహంకారమడగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరతీసుకో అన్న పాట అంతరార్థం తెలుసుకోవాలని ఉందిరా మీ నాన్నకు’ సుభద్ర వత్తాసు పలికింది. తేలికపడిన మనసుతో కుర్చీలోంచి ఉత్సాహంగా లేచాను. — బారు శ్రీనివాసరావు ఇవి చదవండి: Psychological Facts: 'తెలివైనవారి' పది అలవాట్లు ఏంటో మీకు తెలుసా!