'ఆలిండియా ర్యాంకుల్లో అందుకే వెనుకబడి పోతున్నాం' | Professor Bobby Vardhan write contract lecturers issue in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యను వికసింపజేయాలి!

Jun 3 2025 7:07 PM | Updated on Jun 3 2025 7:25 PM

Professor Bobby Vardhan write contract lecturers issue in Andhra Pradesh

అభిప్రాయం

విద్యకు ప్రోత్సాహకాలు అందించడం అనేది అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వడంతో సమానమన్నది అంగీకరించాల్సిన అంశం. విద్యకు నిధులు కేటాయించడం అంటే అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడంతో సమానమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అనడమే కాదు తదనుగుణంగా విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు కూడా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. గ్రామీణ, గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేసేందుకు విశేష కృషి చేశారు. 

కేవలం యూనివర్సిటీలు స్థాపించడమే కాకుండా కనీస వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. యూనివర్సిటీ గ్రాంట్ల సంఘం నిబంధనలు మేరకు ఒక్కో విభాగంలో ‘కోర్‌ అధ్యాపకుల’ నియామకాలకు కేటాయింపులు చేశారు. దీని ప్రకారం ఒక్కో విభాగంలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకం జరుగుతుంది. హార్టికల్చర్‌ యూనివర్సిటీ (తాడేపల్లిగూడెం), వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్, ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేశారు. జేఎన్‌టీయూ (అనంతపురం) కూడా ఈ ప్రణాళికలో భాగమే. ఇదంతా గతం.

ప్రస్తుతం ఉన్నత విద్య సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతోంది. యూనివర్సిటీల మనుగడకు అత్యంత ప్రధానమైన బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా పీడిస్తోంది. కొత్త కోర్సులు (New Courses) ప్రవేశపెట్టినా, మౌలిక వసతులు లేక విద్యలో నాణ్యత లోపిస్తోంది. ఒప్పంద అధ్యాపకులు, (రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో నాలుగు వేల పైబడి వున్నారు), అతిథి అధ్యాపకుల (సుమారు మూడు వేలమంది సేవలు అందిస్తున్నారు) సహకారంతో నెట్టుకొస్తున్నారు. ఖాళీలను భర్తీ చేసే నియామక ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. దీంతో వయస్సు పెరిగిపోయి ఎక్కడ అర్హత కోల్పోతామోనని ఆందోళన చెందుతున్నారు అభ్యర్థులు.

ఒప్పంద, అతిథి అధ్యాపకుల్లో మెజారిటీ సభ్యులు యాభై ఏళ్లు దాటిన వారుండడం విచారించదగిన అంశం. గత ప్రభుత్వం ఎంపిక నియామకాల కోసం ప్రకటన విడుదల చేసినా, కోర్టు కేసులతో ప్రక్రియ నిలిచిపోయింది. సిబ్బంది కొరత కారణంగా బోధన కుంటుపడడంతో పాటు, పరిశోధన పూర్తిగా నిలిచి పోయింది. జాతీయ స్థాయిలో ర్యాంకుల (All India Ranks) విషయంలో మనం పూర్తిగా వెనుకబడి పోతున్నాం. నిర్దేశకులు(గైడ్స్‌) లేక పీహెచ్‌డీ (Phd) ప్రవేశాలు పూర్తిగా తగ్గిపోయాయి. సిబ్బంది నియామకం అత్యంత ప్రాధాన్యతాంశంగా భావించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలి.

చ‌ద‌వండి: సోష‌ల్ ఇంజనీరింగ్ అంటే ఇదేనా? 

శాశ్వత నియామకాల్లో తమకు పాధాన్యం ఇవ్వాలని ఒప్పంద, అతిథి అధ్యాపకులు కోరుతున్నారు. కనీసం అప్పటివరకు టైమ్‌ స్కేల్‌ వేతనాలు ఇవ్వాలంటున్నారు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యామండలి ఒప్పంద అధ్యాపకులకు తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆదేశిస్తూ కాకినాడ జేఎన్‌టీయూ, అనంతపురం జేఎన్‌టీయూ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలకు ఓ సర్క్యులర్‌ పంపింది. రెండు దశాబ్దాల అనుభవం ఉన్న తమకు మళ్లీ ఇంటర్వ్యూలేమిటని, ఇది ‘పొమ్మన లేక పొగబెట్టడం లాంటిదే’నని, తమకు ఇష్టమొచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు ఇది ఒక పన్నాగమని ఒప్పంద అధ్యాపకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్వ్యూలను తాము బహిష్కరిస్తున్నట్లు ఒప్పంద అధ్యాపకుల సంఘం ప్రకటించింది. అతిథి అధ్యాపకులు సైతం తమకు నెలనెలా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో జూన్‌ నాలుగో తేదీన ఉన్నత విద్యామండలి నిర్వహించ తలపెట్టిన సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఒప్పంద, అతిథి అధ్యాపకులు (contract lecturers) ఆశగా ఎదురు చూస్తున్నారు.

- ప్రొఫెస‌ర్‌ పీటా బాబీ వర్ధన్‌  
మీడియా విశ్లేషకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement