opinion
-
అన్ని భాషలు సమానం... హిందీ మరింత సమానం!
దేశంలో ఇప్పుడు హిందీ వివాదం రగులుకుంది. తమిళ నాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ దక్షణ భారతదేశంలో హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి నడుం బిగించారు. తమిళనాడులో పెరియార్ ఇవీ రామసామి నాయకర్ కాలం నుండే హిందీ వ్యతిరేకతకు చాలా చరిత్ర వుంది. స్టాలిన్ పిలుపు మీద దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పంది స్తాయో వేచి చూడాలి. మనకు జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీషు, రాష్ట్ర భాష తెలుగు (Telugu) అనే ఒక తప్పుడు అభిప్రాయం సామాన్యుల్లోనేగాక విద్యావంతుల్లోనూ కొనసాగుతోంది. ఏపీ తెలుగు, తెలంగాణ (Telangan) తెలుగు రెండూ వేరే భాషలు, ప్రజలు వేరే జాతులవారు అనే అభిప్రాయాన్ని కొన్నాళ్ళుగా కొందరు కొనసాగిస్తు న్నారు. అది ఆ యా సమూహాల ఉనికివాద కోరికలు కావచ్చు. ఇవిగాక ఈ రెండు రాష్ట్రాల్లోనూ చెరో పాతిక భాషలు మాట్లాడే సమూహాలున్నాయి. ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో గోండి, కోయ, కొంద, కువి, కోలామీ, పెన్గొ, మంద, యానాది, లంబాడ, సవర (Savara Language) తదితర చిన్న సమూహాలు ఓ పాతిక వరకు ఉంటాయి. అధికార భాషల ప్రాబల్యంలో చిన్న సమూహాలు చితికి పోతాయి; వాళ్ళ భాషలు అంతరించిపోతాయి. భాష కూడ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ లాంటిది. తనకన్నా కింద ఉన్న కుల సమూహాన్ని అణిచివేసే సమూహాన్ని అంతకన్నా పైనున్న కుల సమూహం అణిచివేస్తుంటుంది. చిన్న సమూహాలు తమ మాతృభాషను వదులుకోవాల్సిన పరిస్థితుల్ని సృష్టిస్తారు. ఒక భాష అంతరించిపోవడం అంటే ఒక జాతి తన సంస్కృతీ సంప్రదాయాలనూ, తను సృష్టించినకళాసాహిత్యాలనూ కోల్పోవడమే అవుతుంది. అంటే ఆ జాతి ముందు జీవన్మృతిగా మారిపోతుంది. ఆ తరు వాత అంతరించిపోతుంది. బ్రిటిష్ ఇండియా మతప్రాతిపదిక మీద ఇండియా–పాకిస్తాన్గా చీలిపోయినట్టు మనకు తెలుసు. అయితే, ఒకేమత సమూహం అయినప్పటికీ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ భాషా ప్రాతిపదిక మీద విడిపోయిందని మనకు గుర్తు ఉండదు. మనుషులకు భాష ప్రాణమంత ముఖ్యమైనది. యూరోప్ దేశాలన్నింటిలోనూ క్రైస్తవ మతసమూహాల ఆధిక్యత ఎక్కువ. అయినప్పటికీ, అవి అన్ని దేశాలుగా విడి పోవడానికి ప్రధాన కారణం భాష. సంస్కృతాన్నిసంఘపరివారం దైవవాణిగా భావిస్తుంది. తాము నిర్మించ తలపెట్టిన ‘హిందూరాష్ట్ర’లో సంస్కృతం జాతీయ భాషగా ఉంటుందనేది ఆ సంస్థ అభిప్రాయం. అంతవరకు దేవనాగరి లిపిలోని హిందీని జాతీయ భాషగా కొనసాగించాలని వారి ఆలోచన. జాతీయ భాష మీద చర్చ రాజ్యాంగ సభలోనే జోరుగా సాగింది. మనకు అందుబాటులో ఉన్న భాషల్లో ఏదో ఒకదాన్ని జాతీయ భాషగా చేస్తే అది మిగిలిన భాషల్ని మింగేస్తుందని చాలా మంది తీవ్ర ఆందోళన, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలు 22 భాషలకు గుర్తింపు ఇచ్చినప్పటికీ ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదు. అన్ని భాషలూ సమానమే. మనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న భాషలే తెలుసు. బోడో, డోగ్రీ, మైథిలి, సంథాలి తదితర భాషలకు కూడ రాజ్యాంగంలో స్థానంఉందని మనం తరచూ గుర్తించం. హిందీ జాతీయ భాష కాదు; అది కేంద్ర ప్రభుత్వానికి అధికార భాష మాత్రమే. హిందీ సరసన ఇంగ్లీషును కూడ అనుసంధాన భాషగా గుర్తిస్తున్నారు. జనాభాను బట్టి లోక్సభ స్థానాలు నిర్ణయం అవుతాయని మనకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచే సమయంలోనూ జనాభా, లోక్సభ సీట్లు తదితర అంశాలు ప్రాతిపదికగా మారుతాయి. అదీగాక, త్వరలో లోక్సభ నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగబోతోంది. ఉత్తరాది స్థానాలు మరింతగా పెరిగి దక్షిణాది స్థానాలు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉన్నట్టు కొందరు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. అంచేత ఇది భాషా సమస్య మాత్రమే కాదు; రాజకీయార్థిక సమస్య. ఎవర్ని ఎవరు పాలించాలనే ప్రాణప్రదమైన అంశం ఇందులో ఉంది. 1955లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన... మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకుఅంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమా దకరం అని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్ అంబేడ్కర్ కూడా ఉన్నారు. ఎందుకయినా మంచిది ఉత్తరప్రదేశ్ను నాలుగు భాగాలు చేయాలని ఆయన అప్పుడే సూచించారు. ఇప్పుడు అంబేడ్కర్ భయపడి నట్టే జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్ పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్లతో సహా దాదాపు 29 స్థానిక భాషల్ని హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధం అయింది.‘యానిమల్ ఫార్మ్’ వ్యంగ్య నవలలో జార్జ్ ఆర్వెల్ ఒకచోట విరోధాభాసాలంకారం ప్రయోగిస్తాడు. ఫార్మ్లో అధికారాన్ని చేజిక్కించుకున్న పందుల సామాజిక వర్గం ‘జంతువులన్నీ సమానం; కానీ, పందులు మరింత సమానం’ అంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటి విరోధాభాసాలంకారాన్ని తరచూ ప్రయోగిస్తున్నది. రాష్ట్రాలన్నీ సమానం కానీ, హిందీ బెల్టు మరింత సమానం. ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా సమానం అంటున్నది. ఇప్పుడు ‘భాషలన్నీ సమానం; కానీ, హిందీ మరింత సమానం’ అంటూ కొత్త పాట మొదలెట్టింది.-డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు -
వారిని సోషల్ మీడియాకు ఎడిక్ట్ చేయాలని..
అనాదిగా స్త్రీ ఒక ప్రకృతి శక్తిగా, ఉత్పత్తి పరికరాల సృష్టికర్తగా, చరిత్ర నిర్దేశకురాలుగా ఉంది. పితృస్వామ్య ఆధిపత్యం వచ్చేవరకూ ఆమెది విజయ గమనమే. మానవజాతి శైశవ దశలో తన సంతానాన్ని కాపాడుకోవటానికి కాయలు, దుంపలు, పళ్ల లాంటి ఆహార సేకరణలో తల్లే ప్రధాన పాత్ర వహించింది. ఇప్పటికీ ఆహార సేకరణ దశలో ఉన్న జాతుల్లో మాతృస్వామ్యం అమలులో ఉంది. నిప్పు ఉపయోగాన్ని తెలుసుకున్న కాలంలో, జలచరాలైన చేపలు, పీతలు, నత్తలు (Snails) తినే కాలంలో, నదీ తీర నాగరికతలను రూపొందించే కాలంలో స్త్రీ శ్రమయే కీలకం. వేటాడి తెచ్చిన మాంసాన్ని వండవలసిన అవసరాన్ని కూడా స్త్రీయే ముందుగా గమనించి ఉంటుంది. శరీరాన్ని కప్పుకోవాలనే ఆలోచన, కట్టుకోవటానికి చెట్టు బెరడును ఉపయోగించాలనే ఆలోచన స్త్రీకే వచ్చి ఉంటుంది. కుండను చేయడం ద్వారా నీటిని, ధాన్యాన్ని నిలవచేయడం, నేలలో విత్తునాటడం ద్వారా ఆహార సృష్టి... ఇలా నూత్న జీవన వ్యవస్థలను ఆమె సృష్టిస్తూ వెళ్ళింది.సింధు నాగరికతలో స్నాన వాటికలు ప్రసిద్ధంగా విలసిల్లాయి. వీటి ప్రభావం తరువాత ఆర్యుల సంస్కృతి మీదా కనిపిస్తుంది. ఆ తరువాత దేవాలయాలకు అనుబంధంగా ఉమ్మడి స్నానఘట్టాలు రూపొందాయి. వీటి వద్ద అప్సరసలు లేదా జల దేవతలు ఉంటారని ఆనాడు నమ్మేవారు. ఈ స్నానఘట్టాల నిర్మాణంలో స్త్రీ ప్రాధాన్యత, స్త్రీ ఉమ్మడి తత్వానికి సంబంధించిన సంస్కృతి దృగ్గోచరమవుతుంది. మాతృభావన వీరి మతపరిణామ క్రమంలో ఆనాటికే రూపుదిద్దుకొని వున్నదని చెప్పటానికి మొహంజెదారో, హరప్పా లలో దొరికిన ఫలకాలు బలమైన ఋజువు అని పురావస్తు శాస్త్రజ్ఞుడు సర్ జాన్ మార్షల్ పేర్కొన్నారు. ప్రాచీన భారతీయులు స్త్రీ మూర్తిని (ప్రకృతి మాతగా) ఆరాధించినట్టు సింధూ లోయలో దొరికిన విగ్రహాలను బట్టి తెలుస్తుంది. ఇటువంటి ప్రతిమలే మెసపటోమియా, పశ్చిమాసియా, ఆసియా మైనర్లోనూ లభించాయి. స్త్రీమూర్తి ఆరాధన సింధూ లోయ (Indus Valley) నుంచి నైలునది వరకు వ్యాపించి వున్నట్లు భావించవచ్చు.కానీ ఆ తరువాత అనేక పరిణామాలు భారతదేశంలో చోటు చేసుకుంటూ వచ్చాయి. ముఖ్యంగా మనుస్మృతి భావజాలం వల్ల స్త్రీ అణచివేత బహుముఖంగా ప్రారంభమైంది. ధర్మ సూత్రాలు స్త్రీ వ్యక్తిత్వానికి సంకెళ్ళు వేశాయి. స్త్రీ విద్య నిరోధానికి గురైంది. మనుస్మృతి (Manusmriti) క్రీ.పూ. రెండవ శతాబ్దిలో రాయబడి ఉంటుందని అంబేడ్కర్ అన్నారు. బౌద్ధయుగం అంతరించి హిందూ రాజ్యాలు ఆవిర్భవించే క్రమంలో పుష్యమిత్ర దీన్ని బ్రాహ్మణ రాజ్య నిర్మాణానికి సాధనంగా వాడుకున్నారు. వర్ణవ్యవస్థ పునరుద్ధరణ, స్త్రీ అణచివేత ఇందులో ప్రధానమైన అంశాలుగా ముందుకు వచ్చాయి.కొనసాగాల్సిన పోరాటం వీటన్నింటిని ఎదుర్కొంటూ స్త్రీ యుగ యుగాల ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చింది. అనేక అవాంతరాలను అధిగమించి జీవన గమనంలో కొత్త పుంతలు తొక్కింది. ఆమెను అణగదొక్కడం పురుషుని వల్ల కాదు అని తెలుసుకోవడానికి చాలాకాలం పట్టింది. ఎందుకంటే ఆమె విద్యుల్లత. ఆమె ప్రకాశానికి తట్టుకోలేక పురుషుడు ఆమెకు సంకెళ్ళు బిగించాడు. ఆమె ఆ సంకెళ్ళను పటాపంచలు చేసి ముందుకు వెళుతోంది. స్త్రీకి శరీర సౌందర్యమే కాదు, మనో సౌందర్యమూ ఉంది. ఆమె మనస్సు వెన్నకంటే మెత్తనిది. ఆమె హృదయ వాది. ఆమె హృదయము లోతైనది. సూర్యగోళాలను, చంద్ర గోళాలను మనము పరిశీలించవచ్చు కాని స్త్రీ అంతరంగాన్ని అందుకోగలిగిన శక్తి ఇంకా పురుషుడికి రాలేదు. ఆ విషయంలో పురుషుడు అబలుడు. ఆమె అమ్మే కాదు, గొప్ప నాయకురాలు. భారత రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము త్రివిద దళాల సైనిక వందనాన్ని స్వీకరించారు. భారతదేశ కళాత్మక దృష్టి ఎంత గొప్పదో ద్రౌపదీ ముర్ము ఒక గిరిజన స్త్రీగా అత్యున్నత సింహాసనాన్ని అధిష్ఠించి నిరూపించారు.‘ఆడపిల్ల గడప దాటకూడదు’ అనే భావాలు పాతవైనాయి. ఆడపిల్లలు దేశాంతరాలకు వెళ్ళి చదువుకొంటున్నారు. పిల్లల్ని పెంచే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఈనాడు స్త్రీలలో వస్తున్న గుణాత్మకమైన మార్పు ‘నేను సంపాదిస్తూ బతకా’లనే అంశం. కేవలం గృహిణిగా ఇంట్లోనే ఉండటానికి స్త్రీ ఈనాడు ఇష్టపడటం లేదు. ఈ మార్పులన్నీ రావడానికి ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మహారాష్ట్రలో సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్ ఉద్యమాలు; బ్రహ్మసమాజం, ఆర్య సమాజాలు చేసిన పోరాటాలు, తమిళనాడులో పెరియార్ రామస్వామి నాయకర్ చేసిన పోరాటం, కేరళలో నారాయణ గురు చేసిన విద్యా పోరాటం... ఇవన్నీ స్త్రీల అభ్యున్నతికి మార్గం వేశాయి. చదవండి: ఆకాశంలో సగమైనా.. వివక్షేనా?అయినప్పటికీ స్త్రీలు పితృస్వామ్య ఆధిపత్యానికి ఎదురీదుతూనే ఉన్నారు. వారిని వస్తు వ్యామోహితులుగా మార్చాలనీ, సోషల్ మీడియాకు ఎడిక్ట్ చేయాలనీ ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గృహహింస పెరుగుతోంది. బాల్య వివాహాలు ఆగడం లేదు. కొడుకుతో సమానంగా కూతురికి ఆస్తి ఇవ్వడం ఆచరణలో అమలు కావడం లేదు. రాజకీయాల్లో స్త్రీలను అవమానించే ధోరణులు పెరుగు తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పాలకవర్గాలు, పితృస్వామ్య ఆధిపత్యాలను కొనసాగిస్తున్నాయి. వీటన్నింటిని స్త్రీలు ఎదుర్కొనే క్రమంలో ఇంకా పోరాటాన్ని చేయాల్సి ఉంది. ఇది మహిళా సాధికారతా యుగం. ఈ యుగ స్ఫూర్తిలో భాగంగా మనమూ నడుద్దాం. తల్లిని, చెల్లిని, సహచరిణిని, తోటి స్త్రీని గౌరవిద్దాం. వారి చైతన్యానికి తోడు నిలబడదాం. అదే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి.- డాక్టర్ కత్తి పద్మారావు దళితోద్యమ నాయకులు -
క్రీడారంగంలో తెలుగు రాష్ట్రాలు ప్చ్..
శాస్త్ర, సాంకేతిక, ఐటీ లాంటి రంగాల్లో దూసుకుపోతున్న తెలుగు రాష్ట్రాలు (Telugu States), మొత్తంగా భారత్... క్రీడారంగంలో మాత్రం వెలవెల బోతున్నాయి. అంతర్జాతీయ క్రీడల్లో భారత్, జాతీయ క్రీడల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు అట్టడుగుకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపుదిద్దుకొన్న భారత్కు ఈ దుఃస్థితేమిటి?జనాభా పరంగా ప్రపంచంలోని రెండు అతి పెద్ద దేశాలలో ఒకటైన భారత్ (India) పరిస్థితి క్రీడారంగంలో ‘రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కి’ అన్న చందంగా మారింది. పారిస్ ఒలింపిక్స్లో 200కు పైగా దేశాలు పాల్గొంటే... పతకాల పట్టికలో భారత్ స్థానం 71 మాత్రమే. 2020 టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది భారత్.2024 ఒలింపిక్స్కు వచ్చేటప్పటికి 23 స్థానాలు దిగువకు పడిపోయింది. కనీసం ఒక్క బంగారు పతకమూ సాధించలేకపోయింది. వందకు పైగా అథ్లెట్ల బృందంతో 16 రకాల క్రీడల్లో పాల్గొన్న భారత్ ఒకే ఒక్క రజత పతకం, ఐదు కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ (Olympics) పతకాల పట్టికలో మన పొరుగు దేశం పాకిస్తాన్ది 62వ స్థానం కాగా మనకు దక్కింది 71వ స్థానం మాత్రమే. గత 128 సంవత్సరాలుగా ఒలింపిక్స్లో పాల్గొంటూ వచ్చిన భారత్ ఇప్పటి వరకూ సాధించినవి 41 పతకాలు మాత్రమే. వీటిలో పది మాత్రమే బంగారు పతకాలు. మొత్తం స్వర్ణాలలో హాకీజట్టు అందించి నవే ఎనిమిది ఉన్నాయి. ఆర్థికంగా, జనాభా పరంగా పాకిస్తాన్ కంటే ఎన్నోరెట్లు బలమైన భారత్ ఒలింపిక్స్ పతకాల సాధనలో వెనుకబడిపోతూనే ఉంది. పారిస్ ఒలింపిక్స్లో మాత్రమే కాదు... 1960, 1968, 1972, 1976, 1984, 1992 ఒలింపిక్స్ పతకాల పట్టికలో సైతం పాకిస్తాన్ను భారత్ అధిగ మించలేకపోయింది.ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన అతిపెద్ద దేశం భారత వార్షిక బడ్జెట్ (2025–26) 50.65 లక్షల కోట్లలో క్రీడారంగానికి 3 వేల 800 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం చూస్తే క్రీడలకు మనం ఏమాత్రం ప్రాధాన్యం ఇస్తున్నదీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత బడ్జెట్ వరకూ క్రీడలకు కేటాయించిన మొత్తం రూ. 800 కోట్లు మాత్రమే. ప్రపంచ పటంలో అంతగా కనిపించని అతిచిన్న దేశాలు బంగారు పతకాలతో పతకాల పట్టిక అగ్రభాగంలో నిలుస్తూ ఉంటే భారత్ మాత్రం రజత, కాంస్య పతకాలకే పరిమితం కావడం మన వెనుకబాటుతనానికి నిదర్శనం కాక మరేమిటి?మిగిలిన రంగాలతో పాటు క్రీడారంగంలోనూ ఉన్నతిని సాధించిన దేశాలను మాత్రమే సమగ్ర అభివృద్ధి సాధించిన దేశాలుగా ఐక్యరాజ్యసమితి (United Nations) పరిగణిస్తోంది. ఈ కోణం నుంచి చూస్తే భారత్ అభివృద్ధి ఏపాటిదో మనకు స్పష్టంగా కనిపిస్తుంది.అంతర్జాతీయ క్రీడారంగంలో భారత్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో... జాతీయ క్రీడారంగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పరిస్థితీ అంతే దారుణంగా తయారయ్యింది. ఉత్తరాఖండ్ వేదికగా ఈమధ్యనే ముగిసిన 38వ జాతీయ క్రీడల్లో 29 రాష్ట్రాల జట్లు పోటీపడితే... పతకాల పట్టికలో తెలుగు రాష్ట్రాలకు దక్కిన స్థానాలు చూస్తే (18వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 26వ స్థానంలో తెలంగాణ) ముక్కుమీద వేలువేసుకోవాల్సిందే! 2002 జాతీయ క్రీడలు నిర్వహించిన సమయంలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో 94 బంగారు పతకాలతో ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. అయితే... కేరళ వేదికగా ముగిసిన 2015 జాతీయ క్రీడల పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం, తెలంగాణ 33 పతకాలతో 12వ స్థానం సాధించాయి. రెండు రాష్ట్రాలుగా వేరు పడిన తరువాత మన రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారిపోతూ వచ్చింది. జనాభా, వైశాల్యం, క్రీడామౌలిక సదుపాయాల పరంగా తమకంటే ఎంతో దిగువన ఉన్న పలు (ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా) రాష్ట్రాలు పతకాల పట్టికలో మెరుగైన స్థానాలలో నిలిస్తే 5 కోట్లకు పైగా జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 7 స్వర్ణ, ఒకే ఒక్క రజత, 6 కాంస్యాలతో సహా మొత్తం 14 పతకాలతో 18వ స్థానం సంపాదించింది.చదవండి: వాడుకున్నవాళ్లకు వాడుకున్నంత.. దేశంలోనే అత్యాధునిక క్రీడా మౌలిక, శిక్షణ సదుపాయాలు కలిగిన రాష్ట్రంగా పేరుపొందిన తెలంగాణ పతకాల పట్టికలో 26వ స్థానానికి దిగ జారింది. 212 మంది క్రీడాకారుల బృందంతో 23 క్రీడాంశాలలో పోటీకి దిగిన తెలంగాణ చివరకు 3 స్వర్ణ, 3 రజత, 12 కాంస్యాలతో సహా మొత్తం 18 పతకాలతో గతంలో ఎన్నడూలేని విధంగా పతకాల పట్టిక అట్టడుగు నుంచి 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత జరిగిన జాతీయ (2022 గోవా, 2023 గుజరాత్) క్రీడల్లో 12, 15 స్థానాలు సాధించడం గమనార్హం.చదవండి: BSNLకి ఈ లాభం ఎలా వచ్చింది?దేశంగా భారత్, రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ – తెలంగాణలు క్రీడారంగంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నిర్లక్ష్యం చేస్తే యువశక్తి నిర్వీర్యం కావడమే కాక ‘సమగ్ర అభివృద్ధి’ అనే భావనే కొండెక్కి కూర్చుంటుంది!- చొప్పరపు కృష్ణారావు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు -
డాక్టర్లు, ఇంజినీర్లు అవుతారనుకుంటే..
తెలుగు నేలపై పుట్టి మొత్తం దక్షిణాదిలో విద్యను వ్యాపారీకరించిన రెండు కార్పొరేట్ విద్యాసంస్థలు (corporate colleges) పిల్లలు, తల్లిదండ్రుల కలలపై వ్యాపారం చేస్తున్నాయి. ఇటువంటి సంస్థలు దేశవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. ఎందరో పిల్లల జీవితాలు ఇవి చేసే వ్యాపారంలో సమిథలవుతున్నాయి.నేడు భారతదేశంలో ఆత్మహత్యలు అనేది ఒక జాతీయ సామాజిక సమస్యగా మారిపోయింది. భారతదేశంలో ప్రతి 40 నిమిషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. సగటున ప్రతిరోజూ సుమారుగా 36 మంది విద్యార్థుల ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. మనదేశంలో ప్రతి సంవత్సరం ఆత్మ హత్యల ద్వారా సుమారుగా 7–8 శాతం వరకు విద్యార్థులు మరణి స్తున్నారు. గత 25 ఏళ్లుగా (1995 నుండి 2021 వరకు) దాదాపుగా 2 లక్షల మంది విద్యార్థులను భారత్ ఆత్మహత్యల ఫలితంగా కోల్పోయింది.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఆధారంగా, వార్షిక ఐసీ–3 కాన్ఫరెన్స్– ఎక్స్పో– 2024 (ఆగస్టు 28)లో ‘విద్యార్థుల ఆత్మహత్యలు: ఎపిడెమిక్ స్వీపింగ్ ఇండియా’ నివేదిక విడుదల చేయబడింది. మొత్తం ఆత్మహత్యల సంఖ్య ఏటా 2% పెరుగుతుండగా, విద్యార్థుల ఆత్మహత్యల కేసులు 4% పెరిగాయని ఈ నివేదిక ఎత్తి చూపింది. గత రెండు దశాబ్దాలుగా, విద్యార్థుల ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే రెట్టింపు స్థాయిలో వార్షికంగా 4% పెరిగాయి. 2022లో మొత్తం ఆత్మహత్యల్లో 53% మంది విద్యార్థులు ఉన్నారు. 2021, 2022 మధ్య విద్యార్థులలో మగపిల్లల ఆత్మహత్యలు 6% తగ్గగా, బాలికల ఆత్మహత్యలు 7% పెరిగాయి అని ఐసీ–3 ఇన్స్టిట్యూట్ రూపొందించిన నివేదిక పేర్కొంది.చాలా మంది దిగువ – మధ్యతరగతి నేపథ్యాల వారు కార్పొరేట్ కాలేజీల్లో చేరి ఇటు ఫీజులు కట్టలేక, అటు కాలేజీల్లో ఉన్న ఒత్తిడి వాతావరణాన్ని తట్టుకోలేక సతమతమవుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉండే అసహజ వాతావరణం తల్లిదండ్రులకు తెలిసినా... వాటిలో చేరితేనే తమ పిల్లలు మంచి ర్యాంకు పొంది డాక్టర్లు, ఇంజినీర్లు అవుతారనే నమ్మకంతో వాటిల్లోనే చేరుస్తున్నారు. ప్రభుత్వాలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు విచారణా కమిటీలు నియమించి చేతులు దులుపుకొంటున్నాయి. తమ డబ్బు, పలుకుబడులతో అవి మేనేజ్ చేయగలుగుతున్నాయి.చదవండి: ఈ సైకోల నుంచి రక్షణ లేదా?ఆత్మహత్య చేసుకున్న వారిలో చాలామంది నిరాశా నిస్పృహలకు లోనైనవారే ఉంటారు. ఏ వైపు నుంచి కూడా ఎలాంటి సహాయం అందని పరిస్థితుల్లో మాత్రమే వారు ఈ చర్యకు పాల్పడతారు. చనిపోకముందే చాలా సార్లు మాటల ద్వారా, చేతల ద్వారా చనిపోవాలనే ఆలోచనను వ్యక్తపరుస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆ మాటలు – చేతల్లోని భావాన్ని అర్థం చేసుకుని జాగ్రత్త పడకపోవడం వల్ల ఎక్కువమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. అందుకనే విద్యాసంస్థలలో కచ్చితంగా ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులను గుర్తించి సహాయమందించే ఏర్పాట్లు చెయ్యాలి. భావిభారత యువతను కాపాడుకోవాలంటే కార్పొరేట్ కాలేజీలపై కన్నేసి ఉంచాల్సిందే.-డాక్టర్ బి. కేశవులు ఎండి. సైకియాట్రీ, తెలంగాణ ఆత్మహత్యల నిరోధక కమిటీ చైర్మన్ -
ఈ సైకోల నుంచి రక్షణ లేదా?
విజయవాడలో అశేష జనవాహిని నడుమ వేదికా రెడ్డి అనే చిన్నారి... మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోన్ రెడ్డిని కలవాలని ఏడ్చింది. అది చూసిన ఆయన చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయత పంచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అంతే... తెలుగుదేశం – జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల్లోని సైకోలు నిద్రలేచారు. బాలిక, ఆమె కుటుంబంపై దుష్ప్రచారానికి తెరతీశారు. ‘ఆమె కుటుంబ నేపథ్యం ఇదీ’ అంటూ తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు. తాము స్పాన్సర్ చేస్తున్న సోషల్ మీడియా యాప్స్లో మీమ్స్, రీల్స్ (Reels) పెట్టి వ్యక్తిత్వ హనానికి పూనుకున్నారు. వీళ్లకు ఇలా చేయడం కొత్తేమీ కాదు. పాదయాత్ర సమయంలో, వివిధ కార్యక్రమాల్లో జగన్ చిన్నారులను దగ్గరకు తీసుకున్నప్పుడు ఎంతో దారుణంగా ట్రోల్స్ చేశారు.టీడీపీ మొదటి నుంచి సోషల్ మీడియా (Social Media) ద్వారా జగన్పై తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనికి జనసేన తోడైంది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రెండు పార్టీల సోషల్ మీడియా సభ్యులు రెచ్చిపోయి పోస్టులు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బెండపూడి విద్యార్థులు అమెరికన్ శ్లాంగ్లో ఇంగ్లిష్లో మాట్లాడారు. దీనిపై టీడీపీ– జనసేన నేతలు, కార్యకర్తలు చేసిన ట్రోల్స్ అంతా ఇంతా కాదు. టీడీపీకి అనుకూలమైన టీవీ, సినిమా సెలబ్రిటీస్ కూడా ఆ జాబితాలోకి ఎక్కారు. అలాగే నాడు జగన్ ప్రభుత్వం చేసిన మంచిని ఓ మహిళ సంతోషంగా చెప్పింది. ఇది ఆ పార్టీల్లోని సైకోలకు నచ్చలేదు. వెంటనే ఆమెపై ట్రోల్స్ (Trolls) మొదలుపెట్టి చివరికి ఆత్మహత్యకు కారణమయ్యారు. అయినా వారిలో మార్పు అనేది రాలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇటువంటి వికృత చేష్టలు మరింత పెరిగాయి. తాజాగా విజయవాడలో జగన్ను కలి సిన చిన్నారిపై చేసిన ట్రోల్స్ ఇందుకు నిదర్శనం.ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. టీడీపీ, జనసేనల సోషల్ మీడియా కార్యకర్తలు అనేక విషయాల్లో చెత్త పోస్టులు పెడుతుంటారు. రాజకీయ ప్రత్యర్థిని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేని ఆ పార్టీల అధిష్ఠానాలు సోషల్ మీడియాలో జగన్పై తప్పుడు ప్రచారం చేయడం కోసం... చాలామంది నిర్వహించే ఖాతాలను (పేజీలను), యూట్యూబ్ చానళ్లను స్పాన్సర్ చేస్తున్నాయి. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రెమ్లా జరుగుతుందనేది నిజం.డబ్బులు తీసుకుని తమ పేజీల్లో బెండపూడి విద్యార్థులు, గీతాంజలి అనే మహిళపై దారుణమైన మీమ్స్ చేసి పెట్టారు. నేడు ఓ చిన్నారిని ట్రోల్ చేస్తూ చైల్డ్ అబ్యూజ్కు పాల్పడుతున్నారు. వాస్త వానికి సోషల్ మీడియాలోని ఈ స్పాన్సర్డ్ పేజీలు పైకి వేరే ముసుగుల్లో కనిపిస్తాయి. సినిమా రిలీజ్లు, సమీక్షలు, నటుల ఫొటోలను పెడుతుంటాయి. నవ్వించే మీమ్స్ పోస్టు చేస్తుంటాయి. దీంతో ఫాలోయర్స్ సంఖ్య అధికంగానే ఉంటుంది. దీని వెనుక ఎత్తుగడ ఏంటంటే... మధ్య మధ్యలో వైఎస్సార్సీపీ, జగన్పై దారుణమైన పోస్టులు పెడుతూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేయడమే! ఇప్పటికే అబద్ధపు రాతలతో ఎల్లో పత్రికలు కొన్ని తరాల మెదళ్లను తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఇప్పుడు టీడీపీ మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో స్పాన్సర్డ్ పేజీల ద్వారా సమాజానికి హానికరమైన వ్యవస్థను నడుపుతోంది.చదవండి: మీరు చాలా మారాలి సార్!కూటమి ప్రభుత్వంలోని లోపాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇతర అంశాలను ట్రెండింగ్ లోకి తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో ట్రోల్ చేయడమనే విష సంస్కృతికి వారు బీజం వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియాలో చిన్న పిల్లలు, మహిళలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. కానీ ఇప్పుడు జగన్ను కలిసిన చిన్నారిపై జుగుప్సాకర రీతిలో పోస్టులు పెట్టినవారిపై ఏ చర్యా తీసుకోకుండా మౌనం దాల్చారు. దీన్ని జనం ముమ్మాటికీ హర్షించరు. సమయం వచ్చినప్పుడు సరైన తీర్పు చెబుతారు.– వెంకట్ -
ఇకనైనా ఈ నిషేధం ఎత్తివేయాలి!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్సిటీలలో, కళాశాలల్లో స్టూడెంట్ బాడీ ఎన్నికల నిర్వహణపై నిషేధం విధించి 36 ఏళ్ళు అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1988లో ఉస్మానియా విశ్వ విద్యాలయ (Osmania University) అనుబంధ నిజాం కళాశాలలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణలో ఓ విద్యార్థి హత్య గావించబడ్డాడనే నెపంతో అప్పటి పాలకులు విద్యార్థి సంఘం ఎన్నికలపై (Student Polls) నిషేధం విధించారు.ఎనభయ్యో దశకంలో విద్యార్థి సంఘం ఎన్నికలు విద్యార్థుల ఆలోచనలను మెరుగుపరిచి అభివృద్ధి వైపు నడిపించాయి. విద్యా సంస్థల్లో ఈ ఎన్నికల నుండి ప్రేరణ, చైతన్యం పొంది ప్రధాన స్రవంతి రాజకీయాలలోకి వచ్చిన అనేక మంది సాధారణ విద్యార్థులు నేడు భారత పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలో తమ ప్రభావాన్ని చూపు తున్నారు. మరికొంత మంది విద్యా ర్థులు ప్రజల ఆకాంక్షలను సఫలం చేసేందుకు భారత విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. నాడు క్యాంపస్లలో స్టూడెంట్ బాడీ ఎన్ని కలలో ఎన్నికైన విద్యార్థులు విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి ముందు వరుసలో ఉండేవారు. విద్యార్థుల అకడమిక్ సమస్యలు, వసతి సమస్యలు పరిస్కారమయ్యేవి. దాంతో యూనివర్సిటీలు జ్ఞాన కేంద్రాలుగా, ఉద్యమ కేంద్రాలుగా సమాజంపై గొప్ప ప్రభావాన్ని వేశాయి. నేడు విద్యార్థి సంఘ ఎన్నికలు లేకపోవడంతో విద్యార్థుల డిమాండ్లను లేవనెత్తడం, ఆయా యాజమాన్యాలు, ప్రభుత్వాలను సంప్రదించి పరిష్కరించడం సవాలుగా మారింది.ఇటీవల కాలంలో విద్యార్థుల పోరాటాలతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైందనీ, విద్యార్థులు రాజకీయాలలోకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఒకవైపు విద్యార్థి సంఘాల ఎన్నికలపై గత పాలకులు విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ... మరోవైపు విద్యార్థులు రాజకీయాలలోకి రావాలని అనడం విద్యార్థులను మోసం చేయడమే అవుతుంది. ముఖ్యమంత్రి తక్షణమే విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాలి. అందుకు గతంలో జేఎమ్ లింగ్డో కమిటీ (JM Lyngdoh Committee) సూచనలు పాటిస్తూ విశ్వవిద్యాలయాల నిధుల సంఘం విడుదల చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆర్డరుతో 2005 డిసెంబర్ 2వ తేదీన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జేఎమ్ లింగ్డో అధ్యక్షతన ఐదుగురు సభ్యులు ఉన్న కమిటీని... యూనివవర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థి సంఘం ఎన్నికల నిర్వహణ అంశంపై అధ్యయనం చేసేందుకు నియమించింది. 2006 మే 26న కమిటీ తన నివేదికను సమర్పించింది.ఈ నివేదిక ముఖ్య ప్రతిపాదనలుదేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థుల ప్రాతినిధ్యతో స్టూడెంట్ బాడీ/యూనియన్ ఎన్నికలు జరపాలి. విద్యార్థి సంఘాలు ఎన్నికల నిర్వహణ కొరకు క్యాంపస్లలో శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పాలి. నామి నేషన్ల స్వీకరణలో విద్యార్థుల అకడమిక్ ప్రతిభను పరిణనలోకి తీసుకోవాలి. ఐదేళ్లకు ఒకసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలను, ప్రెసిడెంట్ ఎన్నికలను నమూనా మోడల్గా తీసుకోవాలి. ప్రతి రెండేళ్లకు ఒకసారి విద్యార్థి సంఘం ఎన్నికలపై సమీక్ష జరగాలి. ఆఫీస్ బేరర్ల ఎన్నికలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ – ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణ నమూనా పాటించాలి. విద్యార్థి సంఘం ఎన్నికలు (student union elections) రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలి. యూనివర్సిటీ ఎన్నికలలో పాల్గొనే విద్యార్థుల తరగతిగది హాజరు 70% ఉండాలి.చదవండి: చంపాల్సింది కులాన్ని... ప్రేమికుల్ని కాదు!ఈ నివేదికను అమలు చేస్తూ స్టూడెంట్ బాడీ ఎన్నికలు జరపాలని 2006 సెప్టెంబర్ 22న సుప్రీంకోర్టు మరో ఆర్డరు జారీచేసింది. దాంతో, యూనివర్సిటీ నిధుల సంఘం (యూజీసీ) 2007లో దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో ఎన్నికల నిర్వహణకై ఆదేశాలు జారీచేసింది. తదనుగుణంగా దేశంలో స్టూడెంట్ బాడీ ఎన్నికలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. కానీ ఎన్నికలపై విధించిన నిషేధం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగడం లేదు. విద్యార్థులు ఇందుకోసం ఉద్యమించాలి.– కోట ఆనంద్ విద్యార్థి నాయకుడు -
గుండెల్ని మండిస్తున్న మిర్చి ధర
గత కొన్ని వారాలుగా వివిధ రకాల మిరప ధరలు విపరీతంగా పడిపోవడంతో గుంటూరులోని మిర్చి రైతులు గుండెల్లో మిర్చి మంటతో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆక్రందనలు చేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ అయిన ‘గుంటూరు మిర్చి యార్డ్’ (Guntur Mirchi yard) ఏటా 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ రూ. 10,000 కోట్ల టర్నోవర్తో రాష్ట్రప్రభుత్వానికి రూ. 100 కోట్ల ఆదాయాన్ని అందిస్తోంది. అయితే, అన్ని మిరప రకాల ధరలు ఇటీవలి వారాల్లో ఒక్కో బస్తాకు రూ. 1,000 నుండి రూ. 4,000 వరకు పడిపోయాయి. కర్నూలు, నంద్యాల, దాచేపల్లి, సత్తెనపల్లి (Sattenapalle) తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ నుంచి కూడా అధిక లాభాలు వస్తాయనే ఆశతో గుంటూరుకు వెళ్లిన రైతులు... ఇప్పుడు నష్టాల బారిన పడుతున్నారు.అధికారిక సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్లో మిర్చి సాగు 1.94 లక్షల హెక్టార్లలో ఉంది, ఈ సీజన్లో 11.29 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉంటుందని అంచనా. అయితే ప్రస్తుతం వరుస చీడపీడల వల్ల సాగు ఖర్చులు 30% పైగా పెరిగాయి. చాలా మంది రైతులు తమ ఉత్పత్తులను లాభసాటి ధరలకు అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పల్నాడు జిల్లాలో ఎకరాకు రూ. 2.5 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టి మిర్చి సాగు చేసిన అనేక మంది నష్ట భయంతో గజగజలాడుతున్నారు. ‘ప్రస్తుత మార్కెట్ ధర లతో, మా పెట్టుబడులను తిరిగి పొందేందుకు మార్గం కనబడడం లేద’ని రైతులు వాపోతున్నారు.అనూహ్యంగా గత కొన్ని వారాలుగా మిర్చి కొనుగోళ్ల పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారి పోయింది. ముఖ్యంగా చైనా, బంగ్లాదేశ్, నేపాల్ వంటి కీలక మార్కెట్ల నుంచి అంతర్జాతీయ వాణిజ్యం గణనీయంగా మందగించిందని మిర్చి యార్డ్లో కొందరు వ్యాపారస్తులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2023–24లో 0.179 మిలియన్ టన్నుల దిగుమతులతో చైనా భారతీయ ఎర్ర మిరప కాయల అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. ఇది పరిమాణంలో సుమారుగా 14 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఒలియోరెసిన్, పాక రంగాల నుండి పెరుగుతున్న డిమాండ్ కారణంగా చైనాకు ఎర్ర మిరప ఎగుమతులు పుంజుకున్నాయి. విలువ పరంగా రెండవ అతిపెద్ద కొనుగోలుదారు అయిన థాయ్లాండ్, దాని దిగుమతులు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 10.6 శాతం పెరిగాయి. గడచిన కొంత కాలంలో భారత దేశం నుండి అమెరికాకు ఎర్ర మిర్చి ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. గత ఏడాది 29,173 టన్నుల నుంచి 2023–24లో ఎగుమతులు 25 శాతం పెరిగి 36,413 టన్నులకు చేరుకున్నాయి. అంటే ఎగుమతుల డిమాండ్ తగ్గిందన్నది దీనినిబట్టి చూస్తే అవాస్తవమే అన్నమాట!గిట్టుబాటు ధర లభించక మిర్చి రైతులు విలవిల్లాడి పోతున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో అన్ని విధాలా విఫలమైందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న తెలుదేశం పార్టీ అధి నేత తన అధికారులతో మంతనాలు, సమీక్షల తోనూ; కేంద్రంవైపు సహాయం కోసం చూసే చూపులతోనూ కాలం గడుపు తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాని, మిర్చి రైతులను ఆదుకోవడానికి నిర్దిష్టమైన చర్యలైతే తీసుకోవడం లేదు. నిజంగా రైతుకు మేలు చేయడమే సీఎం నైజం అయితే తమకు వెంటనే భరోసా ఇచ్చే చర్యలను చేపట్టాలని రైతాంగం కోరుకుంటోంది.చదవండి: రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాంరాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ వ్యాపారులు, విక్రయదారులు, ప్రభుత్వ అధికారులతో చర్చించారని చెబుతున్నారు. ఈ చర్చల్లో వ్యాపారులను కొనుగోలు కార్యకలా పాలను పెంచాలని డైరెక్టర్ కోరినా... మార్కెట్లో ఎటువంటి నిర్ణయాత్మక మార్పు కనబడడం లేదు. ఈ అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి నుండి రైతులను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోక తప్పదు. లక్షల్లో అప్పుచేసి మిరప సాగు చేసిన రైతులు కనీసం పెట్టుబడి కూడా రాబట్టుకోలేని దయనీయ స్థితిలో ఉండగా, వ్యాపారులు నిశ్శబ్దంగా అసంబద్ధ చర్యలకు పాల్పడుతున్నట్టుగా పలు అనుమానాలు కలుగుతున్నాయి. లేకుంటే అంతగా అభివృద్ధి చెందిన మిరపకు మార్కెట్ పడిపోవడం ఎలా సాధ్యం? చైనాతో సహా 20కి పైగా దేశాలు గుంటూరు మిర్చి వైపు చూస్తుండటం, గత సంవత్సర లాభసాటిగా మార్కెట్ ఉండటం చూస్తుంటే ఈ పతనం వెనుక ఉన్న కాణాలు అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెను నిద్దర వదిలి మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి.- బలిజేపల్లి శరత్ బాబు ప్లాంట్ ప్రొటెక్షన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త -
జమ... ఖర్చుల్లో... ఆమె ఎక్కడ?
ఎక్కడైనా జమ, ఖర్చులదే లెక్క! దాన్ని బట్టే ఇంటికైనా.. దేశానికైనా జరుగుబాటు!అప్పు, ఆదా సమంగానే పంచినా బలహీనుల పట్ల ఆపేక్ష సహజం!అయితే ఆ బలహీనత అర్థమే మారిపోతోంది ఇంటి బడ్జెట్లో అయినా.. దేశ బడ్జెట్లో అయినా!చిత్రంగా ఆ వర్గంలో ఎక్కడా స్త్రీ కనిపించదు! అమ్మాయి నుంచి ఆంట్రప్రెన్యూర్ వరకు ఎవరికీ కేటాయింపులు ఉండవు! ఇల్లాలి సేవలకైతే గుర్తింపే కరవు!మహిళలకు బడ్జెట్లో స్థానం కల్పించాలని ‘జెండర్ బడ్జెటింగ్’ పేరుతో ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ప్రపంచానికి వినిపించేలా గళమెత్తింది. ఆప్రాధాన్యాన్ని గ్రహించిన దేశాలు భారత్ సహా జెండర్ బడ్జెట్ మీద దృష్టిపెట్టాయి!కానీ కొన్నేళ్లుగా మన దగ్గర ఆ పదం వినిపించకుండా పోవడమే కాదు... బడ్జెట్లో మహిళలు కనిపించడమూ తగ్గుతోంది. ఫిబ్రవరి 1న కేంద్రబడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ‘జెండర్ బడ్జెటింగ్’ మీద పలు రంగాల్లోని మహిళా నిపుణుల అభిప్రాయాలు ...సంక్షేమపథకాలు జెండర్ బడ్జెట్ కిందికి రావుపదిహేనేళ్లుగా జెండర్ బడ్జెటింగ్ను మరచిపోయారు. మహిళలకు ఇస్తున్న పెన్షన్లు, గృహలక్ష్మి, ఉచిత రవాణా సౌకర్యాలు వంటివన్నిటినీ విమెన్ బడ్జెట్ కింద చూపిస్తున్నారు. అధికార పార్టీల సంక్షేమపథకాలు జెండర్ బడ్జెట్ కిందికెలా వస్తాయి? మహిళలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, శాఖలన్నిటి కేటాయింపుల్లో మహిళలకుఇస్తున్న వాటా, స్త్రీ చదువు, జీవనోపాధి, ఆంట్రప్రెన్యూర్షిప్ గురించి, మొత్తం స్ట్రక్చర్ను విమెన్ ఫ్రెండ్లీ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు, స్త్రీ, పురుష అసమానతలను రూపుమాపడానికి తీసుకుంటున్న చర్యలు విమెన్ బడ్జెట్ కిందికి వస్తాయి. కేరళలో గ్రామ పంచాయతీ బడ్జెట్లో కూడా 30 శాతం మహిళలకు కేటాయిస్తారు. సాధారణ బడ్జెట్లోనూప్రాధాన్యం ఇస్తారు. దాన్ని కేంద్రప్రభుత్వమూ అనుసరించాలి. కిందటేడు కేంద్ర బడ్జెట్లో నరేగా(మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎం΄్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్)కు రూ.35 వేల కోట్లు తగ్గించారు. సవరించిన బడ్జెట్లో 120కోట్లకు గాను 95వేల కోట్లను కేటాయించి, కేవలం రూ. 60 వేల కోట్లతో సరిపెట్టారు. ఈ కోతలు గ్రామీణ ఉపాధిరంగంలోని స్త్రీల మీద తీవ్రప్రభావం చూపిస్తున్నాయి. వ్యవసాయరంగంలో 58 శాతం మహిళలున్నారు. వాళ్లు ఎక్కువగా కౌలు చేస్తారు. వాళ్ల పేరుమీద పొలాలుండవు. భర్త పేరుమీదో.. ఉమ్మడి కుటుంబ ఆస్తిగానో ఉంటాయి. లేదంటే పిల్లల పేరుమీద ఉంటాయి. ఈ లెక్కన వాళ్లకు ఆర్థిక భద్రత ఏది? పట్టణ ఉపాధి రంగంలో 23 శాతమున్న మహిళల పరిస్థితీ అంతే! నరేగా లాంటివి అక్కడ అప్లయ్ చేయరు. ఇక భద్రత, రక్షణ విషయాలకు వస్తే.. నిర్భయ ఫండ్కి గత మూడేళ్లుగా కేటాయింపుల్లేవు. మొదట్లో వెయ్యి కోట్లేమో కేటాయించారు. తర్వాత తగ్గించుకుంటూ వచ్చారు. ఎవరూ దరఖాస్తు చేసుకోవట్లేదని ఇప్పుడు దానికి బడ్జెట్టే లేకుండా చేశారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో అప్లయ్ చేసుకోవచ్చో రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టతనివ్వలేదు. స్త్రీ విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రత రంగాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు బడ్జెట్లో కేటాయింపులు ఉంటేనే అది జెండర్ బడ్జెట్. అది అత్యంత అవసరం! – దేవి, యాక్టివిస్ట్‘అవగాహన’కు ఖర్చు చేయాలి ఎమ్మెస్సెమ్మీలో 20 వేల కోట్ల రూపాయల మిగులు నిధులున్నట్లుగా డేటా చూపిస్తోంది. దాని అర్థం ఆ స్కీమ్స్ ప్రజలకు చేరట్లేదని! ఆ మిగులును చూసి కేటాయింపులు తగ్గిస్తారు లేదంటే రివర్స్ చేస్తారు తప్ప.. దాన్ని మహిళా సాధికారత మీద అవగాహన కలిగించే కార్యక్రమాలకో, ఆడపిల్లల చదువుకో మళ్లించరు! ఎమ్మెస్సెమ్మీ స్కీమ్స్ గురించి కాలేజీల్లో అవేర్నెస్ క్యాంప్లు పెట్టండని ప్రభుత్వాన్ని పోరుతున్నాం. కాలేజీస్థాయిలోనే అవగాహన వస్తే చదువైపోయాక ఉద్యోగం కోసం వెంపర్లాడకుండా తక్కువ పెట్టుబడితోనే ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టుకుంటారు. దీనివల్ల ప్రభుత్వాల మీదా ఒత్తిడి తగ్గుతుంది. యువతలో ఆంట్రప్రెన్యూర్షిప్ పెరుగుతుంది. ఓరియంటల్ మహిళా వికాసం, ముద్ర లోన్స్, స్త్రీ శక్తి యోజన.. సిం«ద్ మహిళాశక్తి యోజనలాంటి వాటితో భారతీయ మహిళా బ్యాంక్ (బీఎమ్బీ) లాంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. బీఎమ్బీలో రూ. 50 వేల నుంచి రూ. 50 లక్షల వరకు లోన్స్ «తీసుకోవచ్చు. ధరావత్తు అవసరం లేదు. అయితే వీటి గురించి ఎవరికీ అంతగా తెలీదు. ఈ కోవలోనిదే స్టార్టప్ ఇండియా స్కీమ్. దీన్ని ఎస్సీ, ఎస్టీ, మహిళల కోసం డిజైన్ చేశారు. ఇంకా గ్రూప్ లోన్స్ ఉన్నాయి. అయిదుగురు మహిళలు కలిసి ఓ సంస్థను పెట్టుకోవచ్చు. ఈరోజున ఒక ఆంట్రప్రెన్యూర్ మహిళ నెలకు రూ. 3 లక్షలు సంపాదిస్తోంది. గ్రామీణ, పట్టణ, దళిత మహిళలందరినీ ఆంట్రప్రెన్యూర్షిప్ వైపు నడిపించాలంటే.. వారికోసం ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలకు బడ్జెట్లో కేటాయింపులు సమృద్ధిగా ఉండాలి. ఆ కార్యక్రమాలతో ఇల్లిల్లూ తిరిగి చైతన్యం కలిగించాలి. కేక్ తయారీ నుంచి చేపల పెంపకం దాకా అన్నిటికీ ఎమ్మెస్సెమ్మీలో శిక్షణ ఉంది. అవగాహన కల్పించాలంతే! – బి.ఎన్. రత్న, ప్రెసిడెంట్, దలీప్ (దళిత్ ఆదివాసీ విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ అసోసియేషన్)ప్రత్యేక కేటాయింపులు కావాలిఆంట్రప్రెన్యూర్షిప్ స్కిల్స్ని డెవలప్ చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి సరిపోయేంత బడ్జెట్ ఉండట్లేదు. దానికోసం ప్రత్యేక కేటాయింపులు కావాలి. పెట్టుబడి కోసం కూడా మహిళల దగ్గర డబ్బు ఉండదు. అందుకే పది, పదిహేను శాతం సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ కూడా ఉంటే బాగుంటుంది. – అరుణ దాసరి, ప్రెసిడెంట్ డిక్కీ, తెలంగాణవాళ్లూ జాతీయోత్పత్తిలో భాగస్వాములే!వ్యవసాయం లాంటి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు క్షేత్రస్థాయిలో ఈ రోజుకీ ఎలాంటి వసతులు లేవు. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్, బేబీ కేర్ సెంటర్స్ను ఏర్పాటుచేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడినప్పుడల్లా అది మహిళల మీద అదనపు భారాన్నే మోపుతోంది. వీరి ఈ శ్రమను ఇంటిపనిగానే చూస్తున్నారు తప్ప ఉత్పత్తిలో భాగంగా చూడట్లేదు. ఎలాంటి కూలీ చెల్లించట్లేదు. మహిళా రైతుల ఆత్మహత్యలను లెక్కలోకి తీసుకోవట్లేదు. వాళ్లను అసలు రైతులుగానే గుర్తించట్లేదు. ఒంటరి మహిళలకు అందాల్సిన పెన్షన్లు, ఎక్స్గ్రేషియా విషయంలోనూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. నిర్వాసిత ప్రాజెక్ట్ నిర్మాణాల వల్ల) మహిళలైతే అనేకరకాల అభద్రతలకు లోనవుతున్నారు. వీళ్లంతా జాతీయోత్పత్తిలో భాగస్వాములే! వీళ్లందరి అభివృద్ధి, భద్రత, రక్షణలకు బడ్జెట్లో స్థానం ఉంటోందా? నిజాయితీగా సమీక్షించుకోవాలి. నిష్పక్షపాతంగా ఒప్పుకోవాలి. అప్పుడే బడ్జెట్లో స్త్రీకి సముచితస్థానం లభిస్తుంది. – పద్మ వంగపల్లి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్కేర్ ఎకానమీకీ స్థానం ఉండాలిస్త్రీ, పురుష ఆర్థిక సమానత్వ సాధనలో జెండర్ బడ్జెటింగ్ అనేది కీలకం. ఆర్థిక వనరులను నేరుగా ప్రభావితం చేసే రంగాల్లో స్త్రీలకు ఎంతమేర కేటాయింపులుంటున్నాయి, వాటినెలా ఉపయోగిస్తున్నారు, మహిళల భద్రత కోసం ఎంత కేటాయిస్తున్నారు లాంటివన్నీ పరిగణనలోకి వస్తాయి. కేర్ ఎకానమీ అంటే ఇంట్లో స్త్రీల సేవలు.. ఇంటి పని, వంటపని దగ్గర్నుంచి భర్తకు ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్, పిల్లలు.. పెద్దవాళ్ల బాగోగుల దాకా మహిళలు చేసేదంతా జీతం లేని శ్రమ. మరుగునపడిన వీరి సేవలను, శ్రమను ఆదాయ పట్టీలోకి చేర్చాలి. భార్య అన్నిరకాలుగా సహకరిస్తేనే భర్త బయటకు వెళ్లి పనిచేయగలుగుతున్నాడు. అలా ఆమె కూడా ఉత్పత్తిలో భాగమవుతూ, జాతీయ ఆదాయానికి ఊతమవుతోందని గ్రహించాలి. ఈ కేర్ ఎకానమీకీ బడ్జెట్లో స్థానం ఉండాలి. స్థూల విధానాలు జెండర్ ఈక్వాలిటీ, సామాజిక న్యాయం, మిలీనియల్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు దగ్గరగా ఉండాలి. మహిళలు, జెండర్ మైనారిటీల చదువు, ఆరోగ్యం, భద్రత, ఉపాధి, జీవన నైపుణ్యాలు పెంపొందించడం వంటివన్నీ బడ్జెట్లో భాగం కావాలి. ఆ కేటాయింపులన్నీ సక్రమంగా ఖర్చవ్వాలి. కానీ అవన్నీ వేరేచోటికి మళ్లుతున్నాయి. జెండర్ ఈక్వాలిటీ మీద ఒకరకమైన ఉపేక్ష కనబడుతోంది. – అపర్ణ తోట, జెండర్ కన్సల్టెంట్ ట్రైనర్, ద పర్పుల్ వరండా– సరస్వతి రమ -
ఓబీసీల వర్గీకరణతో సమన్యాయం
ఓబీసీ కులాల వర్గీ కరణ ఆవశ్యకతను గుర్తించి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2017 అక్టో బర్ 2న ముగ్గురు సభ్యులతో జస్టిస్ రోహిణి అధ్యక్షతన ఒక జాతీయ కమిషన్ను (justice rohini commission) ఏర్పాటు చేసింది. దానికి దేశంలో ఓబీసీ కోటాలో విద్యా–ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న సుమారు 2,640 కులాలను వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేయడంలోని సాధ్యా సాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించడానికి 12 వారాల గడువు ఇచ్చింది. నాటి నుండి కేంద్ర ప్రభుత్వం కమిషన్ పదవీ కాలాన్ని ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి పెంచింది. ఎట్టకేలకు కమిషన్ తన నివేదికను జూలై 2023లో సమర్పించింది. కానీ దాని అమలుకు ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశం అయ్యింది. మరోవైపు దేశవ్యాప్తంగా సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన ఓబీసీ కులాల వారు(OBCs) వర్గీకరణను వ్యతిరేకిస్తున్న వైనం కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో రాజకీయంగా నష్టం కలుగుతుందనే ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం (BJP Government) ఓబీసీలను వర్గీకరించక పోవచ్చని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. 2023 ఆగస్టులో సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం.. ‘స్టేట్ అఫ్ పంజాబ్ వర్సెస్ దావీందర్ సింగ్’ కేసు తీర్పులో ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను వర్గీకరణ ద్వారా అమలు చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. ఇప్పటికే దేశంలోని 11 రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగాల్లో వర్గీకరణ ద్వారా అమలు చేస్తున్నారు. బీసీ/ఓబీసీ కులాల మధ్య సామాజిక, విద్య, ఆర్థికపరమైన వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి.అందుకే కేంద్రం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు అమలు చేస్తున్నప్పటికీ, నేటికీ కేంద్రంలో 1,600 కులాలకు పైగా ఎలాంటి రిజర్వేషన్ల ఫలాలూ పొందలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అధిక జనసంఖ్య కలిగి సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలంగా ఉన్న కులాల వారే అధిక ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర ఓబీసీ జాబితాలోని బీసీ కులాలు నేటి వరకు కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్ల ఫలాలను ఏ మేరకు అనుభవించాయనే లెక్కలను, వారి జనసంఖ్యను పరిగణలోకి తీసుకొని శాస్త్రీయంగా జస్టిస్ రోహిణి కమిషన్ ఓబీసీలను 4 గ్రూపులుగా వర్గీకరించి గ్రూప్–ఏలో 1,654 కులాలకు 2 శాతం, గ్రూప్–బీలో 534 కులా లకు 6 శాతం, గ్రూప్–సీలో 328 కులాలకు 9 శాతం, గ్రూప్–డీలో 104 కులాలకు 10 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్లు ప్రచారం జరిగింది. నిజమేమిటో తెలియదు. చదవండి: రూపంలో తేడా ఉన్నందుకేనా దొంగలు? మండల్ కమిషన్లోని సభ్యులు ఎల్ఆర్ నాయక్ ఆనాడే (1978–80) ఓబీసీ కులాల మధ్య అసమానతలను గమనించి ఆ కులాలను రెండు గ్రూపులుగా వర్గీకరించి 27 శాతం కోటాను అమలు పరచాలని డిసెంట్ నివేదికను కేంద్రానికి సమర్పించారు. అందులో అణిచివేయబడిన బీసీ కులాలకు 15%, మధ్యస్థ బీసీ కులాలకు 12% రిజర్వే షన్లు కేటాయించారు. కానీ, నాటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, 1993 నుండి ఉద్యోగాల్లో, 2008 నుండి విద్యాసంస్థల్లో వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే ఓబీసీల్లోని అత్యంత వెనుకబడిన కులా లకు న్యాయం జరిగి ఉండేది. మండల్ కమిషన్కు సంబంధించిన తీర్పులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం... బీసీల వర్గీకరణకు ఆమోదం తెలిపింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కులాల మధ్య సమ న్యాయం కోసం వెంటనే జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను అమలు పరచాలి.- కోడెపాక కుమార స్వామిబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు -
రూపంలో తేడా ఉన్నందుకేనా దొంగలు?
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ ఎస్సీ–ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీసులు తాము చేయని దొంగతనం కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ డిసెంబర్ 19న సెల్ఫీ వీడియో ద్వారా అభ్యర్థన పెట్టి, హెయిర్ డై తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఇదే కాలనీకి చెందిన ఆటో నడుపుకొనే ఎరుకల కులానికి చెందిన మరో యువకుడు ఏడాది కింద పోలీసులు తనపై అనేక కేసులు బనాయిస్తున్నారని భయపడి పోలీస్ స్టేషన్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకున్నాడు. దాని కంటే ముందు ఒకసారి గొంతు కోసుకున్నాడు. ఆత్మహత్యా ప్రయత్నాల్ని ఆ యువకులు చనిపోయే ఉద్దేశంతో చేయకపోయినా, తామున్న పరిస్థితి నుండి ఎట్లా బయట పడాలో తెలియక ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇలాంటి పెనుగులాటల వెనుక సామాజిక, ఆర్థిక, వ్యవస్థాపరమైన అంశాలున్నాయి.ఈ ఎస్సీ–ఎస్టీ కాలనీ అనేక ప్రాంతాల నుండి ఒకప్పుడు వలస వచ్చి, కాలరీ ఏరియాలో రోజూవారీ కూలీ చేసుకొని బతికే నిరుపేదలు నివసించే ప్రాంతం. స్థిరపడిన వారిలో మాదిగ, నేతకాని, ఎరుకల కులాలే ప్రధానంగా ఉన్నాయి. వాళ్ల తరువాత తరాలు కూడా ఇక్కడే పుట్టి పెరుగుతున్నాయి. ఈ కాలనీ కుటుంబాలకు నిర్మాణ రంగంలో దొరికే రోజువారీ అడ్డ కూలీ పని, యువకులైతే ఆటోలు నడుపు కోవటం, పాన్ టేలలు, వెల్డింగ్, చిన్న చిన్న మెకానిక్ పనులే జీవనా ధారం. తల్లిదండ్రుల జీవితాల్లోనే స్థిరత్వం లేకపోవటం, పరిసరాల ప్రభావం, ఇతర సాంస్కృతిక కారణాల వలన పిల్లలు పెద్దగా చదువులో రాణించటం లేదు. వీళ్లలో కొందరిపై గతంలో చిన్న చిన్న స్క్రాప్, కాపర్ వైర్ల, ఇతర దొంగతనాల కేసులున్నాయి. ఇద్దరిపై గంజాయిని స్థానికంగా అమ్మి పెట్టే కేసులున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ కేసుల్లో ఎవ్వరికీ ఎప్పుడూ కోర్టులో శిక్ష పడలేదు. నేరం జరగటానికి గల సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని వదిలేసి బ్రిటిష్ పాలకులు ఒకప్పుడు కొన్ని తెగలను నేరస్త తెగలుగా ముద్ర వేసి, వారిని క్రిమినల్ ట్రైబ్స్ అని పిలిచేవారు. ఫలితంగా ఆ తెగలో పుట్టిన వారు గతంలో నేరాలు చేసి ఇప్పుడు మానేసినా లేదా అసలు ఎప్పుడూ నేరం చేయకపోయినా నిరంతరం అంతులేని పోలీసు అకృత్యాలకు బలయ్యేవారు. ఆ ముద్ర చెరిపేసుకోవటానికి వారికి కొన్ని తరాలు పట్టింది.ఇతరుల కళ్ళు గప్పి, మన కష్టార్జితం కాని దాన్ని కైవసం చేసుకోవటమే దొంగతనం. సమాజంలో లంచగొండులు, అక్రమార్జనపరులు, బ్యాంకులను కొల్లగొట్టే వ్యాపారులు, ప్రజల ఉమ్మడి భూములను, వనరులను తమ హస్తగతం చేసుకొనే వైట్కాలర్ మనుషులు దొంగలు కారా? సభ్య సమాజం అనబడే దాంట్లో ఎంత మంది ఇవ్వాళ కేవలం వారి నైతికమైన కష్టార్జితం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నారు? వీరంతా సమాజంలో ఎంతో దర్జాగా బతుకుతుండగా నిమ్న కులాలకు చెందిన వాళ్లు, కటిక పేదలు మాత్రం పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్నారు. కేవలం దొంగ తనం రూపంలో తేడా ఉన్నందుకేనా?పేదరికం, తగిన ఉపాధి మార్గాలు లేకపోవడం, పాలకులే పెంచి పోషించే వ్యసనపర సంస్కృతి, మనుషులందరినీ సమానంగా చూసే ప్రజాస్వామ్య సంస్కృతి లేని పరిపాలనల పర్యవసానంగానే చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయి. దీనికి వ్యక్తిగతంగా వారినే బాధ్యులను చేసి శిక్షించటం కంటే పాలకులే ఆ స్థితికి నైతిక బాధ్యత వహించటం నాగరిక పద్ధతి. నేరం జరగటానికి గల నేపథ్యాన్నీ, నివారించడానికి గల అవకాశాలనూ పరిశీలించకుండా నేరస్తులను మాత్రమే శిక్షించే సాంప్రదాయం సంకుచితమైనది. నేర సంస్కృతి పెరగటానికి కావలసిన భౌతిక పరిస్థితులను పెంచి పోషించే పాలకులే నేరాల అదుపు పేరుతో పేదవర్గాలపై కేసులు బనాయించటం అనైతికమైన విషయం. చదవండి: విస్మృత చరిత్రపై వెలుగు రేకలు దేశంలో కొన్ని వర్గాలు మాత్రమే దొంగలుగా ఉంటారనే సామాజిక విలువలో ఆర్థిక, కులవివక్ష ఉంది. మేం మాత్రం దొంగలం కాదు సుమా అనే ఆత్మవంచన కూడా ఉంది. ఈ మానసిక భావనను సమీక్షించుకోవాల్సిన బాధ్యత పాలకులది, సభ్య సమాజానిది. సమాజంలోని పౌరులందరూ గౌరవప్రదమైన ఉపాధితో, సమానమైన హోదా, అవకాశాలతో జీవించేటట్టు చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత పాలకులది.- డాక్టర్ ఎస్. తిరుపతయ్య మానవ హక్కుల వేదిక, తెలంగాణ సభ్యులు -
ఆ పేరును ఎందుకు స్మరించాలంటే...
డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ భారతీయ (BR Ambedkar) చరిత్రలో మహోన్నత వ్యక్తి. భారత రాజ్యాంగ నిర్మాతగా, దళిత హక్కుల పరిరక్షకుడిగా విస్తృతంగా ప్రశంసలు పొందిన అంబేడ్కర్ అందించిన సేవలు కుల, ప్రాంతీయ పరిమితులను దాటి ఉన్నాయి. ఆయన కేవలం సామాజిక సంస్కర్తగానే కాకుండా దేశ సమగ్రాభివృద్ధి కోసం పారిశ్రామీకరణ, పట్టణీకరణ, ఆధునికీకరణ, నాగరికత (Civilisation) గురించి దశాబ్దాల ముందే చర్చించిన దూరదృష్టి కలిగిన తత్వవేత్త. ఆయన కేవలం దళితులకు మాత్రమే చెందినవారు కాదు. ఆయన విశ్వ మానవతా సిద్ధాంతాలు, సేవలు ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోవాలి. పారిశ్రామికీకరణ ప్రజల సాంఘిక–ఆర్థిక స్థితులను మెరుగుపరచడానికి మార్గమని ఆయన విశ్వసించారు. గ్రామాధారిత ఆర్థిక వ్యవస్థ (Economy) ఒక్కటే భారతదేశ అవసరాలను తీర్చలేదని ఆయన స్పష్టంగా గ్రహించారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెంచి, పేదరికాన్ని తగ్గించి, ఆర్థిక పురోగతిని సాధించవచ్చనేది ఆయన నమ్మకం.అలాగే, పట్టణీకరణ ద్వారా సామాజిక సమానత్వానికి మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాలు విద్య, సాంకేతికత, సామాజిక మార్పు కేంద్రాలుగా; కులవాదం నుండి విముక్తి కలిగించే చోట్లుగా ఉండాలి అని ఆయన బలంగా విశ్వసించారు. ఆధునికీకరణ గురించి ఆయన అభిప్రాయాలు శాస్త్రీయ ద్రుఃక్కోణం, సామాజిక సమానత్వం, బుద్ధివాదం ఆధారంగా ఉన్నాయి. ముఖ్యంగా మరుగునపడిన వర్గాల అభివృద్ధిలో విద్య ప్రాముఖ్యాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇది భారతీయుల మనోభావాలను ఆధునికీకరించే క్రమంలో పెద్ద ముందడుగు. ఆయన ప్రధానంగా భారత రాజ్యాంగ రూపకర్తగా ప్రఖ్యాతి పొందారు. కానీ ఇది కేవలం చట్టపరమైన విజయం మాత్రమే కాక ఒక తాత్విక విజయంగా నిలిచింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆవశ్యక విలువలను రాజ్యాంగంలో ప్రతిష్ఠించారు.అలాగే కార్మిక సంక్షేమం, మహిళా హక్కులు, అంటరానితనం నివారణ వంటి రంగాల్లో ఆయన రూపకల్పన చేసిన విధానాలు ఈ రోజు కూడా అద్భుతంగా పని చేస్తున్నాయి. ‘హిందూ కోడ్ బిల్లు’ ద్వారా మహిళలకు వారసత్వ ఆస్తిహక్కును కల్పించడం ద్వారా లింగ సమానత్వానికి ఆయన బలమైన పునాది వేశారు. ఆయన రాసిన ‘ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ: ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్’ అనే గ్రంథం ఆర్థిక స్థిరత్వం, కేంద్ర బ్యాంకింగ్ సంస్కరణల ప్రాముఖ్యాన్ని చూపిస్తుంది. అలాగే ఆయన సైన్సు ఆధారంగా ఆధునిక సమాజాన్ని నిర్మించడమే కాకుండా, సర్వలోక మానవ హక్కులకూ అంకితమయ్యారు. ఆయన తత్త్వం ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను (ఎస్జీఈఎస్) ముందుగానే ఊహించింది. లింగ సమానత్వం, అసమానతల తగ్గింపు, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలకు ఆయన జీవితమే మార్గదర్శి.చదవండి: బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నంఅంబేడ్కర్ పేరును స్మరించడం అనేది కేవలం ఆరాధన కాదు, ఆయన విలువలను మన జీవితాల్లో అమలు చేయడం. ఆయన పేరు మనం న్యాయ సమానత్వం, ఆర్థిక పురోగతి వంటి గౌరవప్రద విలువల వైపు అడుగులు వేస్తున్నామని గుర్తు చేస్తుంది.– ప్రొఫెసర్ ఎం. జేమ్స్ స్టీఫెన్, చైర్ ప్రొఫెసర్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చైర్, ఆంధ్రా యూనివర్సిటీ -
జనాన్ని కాలుష్యంలో ముంచెత్తుతారా?
డిసెంబర్ 19న జరగనున్న ఎన్టీపీసీ 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ జీవించే హక్కుకే వ్యతిరేకం. దీన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాలి. రామగుండం ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్టేషన్ టీఎస్టీపీపీ 4,000 మెగా వాట్ల (మె.వా.) విస్తరణలో భాగంగా రెండోదశలో 3గీ800 మె.వా. స్థాపనకు, విద్యుత్పత్తికి పర్యావరణ అనుమతి కోసం (ఈసీ) పెద్దపల్లి కలెక్టర్ ఆధ్వర్యంలో నియమానుసారం... ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నది. కేవలం 13 కి.మీ. దూరంలో గోదావరి నది పక్కన మంచిర్యాల జిల్లా జైపూర్లో ఎస్సీసీఎల్ సొంత 1,200 మె.వా. థర్మల్ ప్లాంట్కు తోడుగా రామగుండం ఎన్టీపీసీలోని 4,200 మెగా వాట్లకు ఇది నూతన స్థాపిత సామర్థ్య ప్రతిపాదన. కొత్తగా టీజెన్కో రామగుండంలో 1,200 మెగావాట్లు, సింగరేణి వారు జైపూర్లోనే మరో 1,200 మెగావాట్ల విస్తర ణకు ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వ, ప్రజామోదంతో ఈ పరిశ్రమల ప్రతిపాదనలన్నీ కార్యరూపానికి వస్తే... కేవలం 13 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు ఆధార విద్యుదుత్పత్తి సామర్థ్యం (10,200 మె.వా.) ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర కాలుష్య కేంద్రంగా మారుతుంది.రాక్షసి బొగ్గు, విద్యుత్తు ప్లాంట్లు, సిమెంటు, ఎరువుల పరిశ్రమలన్నీ దేశాభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. వీటికోసం స్థానికంగా రామగుండం, కమాన్పూర్, మంచిర్యాల మండలాల్లో సేకరించిన 90,000 ఎకరాల భూమికి ఇప్పుడున్న మార్కెట్ ధరలతో పోల్చితే అత్యంత స్వల్ప పరిహారం సమర్పించారు. ఈ 15 కి.మీ. పరిధిలోని దాదాపు 3 లక్షల పైచిలుకు కుటుంబాలలోని 12 లక్షల మంది ప్రజలు తమ శాశ్వత జీవనాధార వ్యవసాయ, ఉపాధులను కారు చౌకగా త్యాగం చేశారు. అయినా స్థానిక యువతకు భూములు కోల్పోయిన కారణాన పరిహారంగా పట్టుమని 100 ఉద్యోగాలు కూడా అందలేదు. ఈ పచ్చినిజాన్ని అసత్యమని ఎవ్వరైనా అనగలరా?విద్యుత్ భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం క్రిటికల్, సూపర్, అల్ట్రా సూపర్, సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ల ఇంధన దహన సామర్థ్యం 35– 40 శాతం లోపే కదా! దూర ప్రాంతాల థర్మల్ విద్యుత్ స్టేషన్లకు బొగ్గు రవాణా చేసే ఖర్చు ఆదా చేయడానికి రామగుండం నుండి 13 కిలోమీటర్ల పరిధిలో 10,200 మె.వా. సాంద్ర స్థాయిన థర్మల్ విద్యుత్పత్తి చేయ డాన్ని, చౌకధరకు (యూనిట్ 12 రూపాయలు) విద్యుత్పత్తి చేసే నెపంతో అనుమతించడమంటే... రామగుండం నుండి 15 కిలోమీటర్ల పరిధిలో 21,000 మెగావాట్లకు సమానమైన ఉష్ణరాశితో, పరిసరాలను వేడిచేసే హీటర్లతో నిరంతరాయంగా మంటలు పెట్టినట్టే కదా?భారత ప్రభుత్వ అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, నవరత్న ఎన్టీపీసీ సంస్థ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారందరూ కలసి స్థానిక ప్రజారోగ్యాలను, జీవన నాణ్యతను రాజ్యాంగ నియమాలను పణంగా పెట్టి ఈ విస్తరణ చేపట్టడం సబబేనా? 15 కిలోమీటర్ల పరిధిలోని పర్యావరణ కాలుష్య మోతాదు తీవ్రతను పరిగణనలోకి తీసుకొన్న తర్వాతే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, ఎమ్ఓఎఫ్ఈసీసీ వారు కొత్త పరిశ్రమలకు, పాతవాటి విస్తరణలకు అనుమతులివ్వా లని సుప్రీంకోర్టు సూచించిన విషయాన్నెలా విస్మరించారు?సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అధిక లాభాపేక్షతో 706 చ.కి.మీ. విస్తీర్ణంలో అధిక సాంద్ర పారిశ్రా మికీకరణ చేపట్టడమే కదా! తక్కువ స్థలంలో ఎక్కువ ఒత్తిడితో, మనుషులు, జంతువులు కనీసం జీవించలేని పరిస్థితులను సృష్టిస్తున్న వైనాన్ని ప్రశ్నించడం ప్రజల రాజ్యాంగబద్ధ హక్కే కదా! పక్కనే పారుతున్న గోదావరి నది నీరు నాణ్యతా ప్రమాణాల్లో ఏ, బీ, సీ, డీ కేటగిరీలు దాటి హెచ్ కేటగిరీలోకి చేరింది. ఈ నీరు కనీసం జంతువులు తాగడానికి కూడా పనికి రాదు. 1,465 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే గోదావరిని అతి ఎక్కువగా కలుషితపరిచేది, ట్రీట్మెంట్ చేయకుండా రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి మైన్స్ వాడుకొని వదిలేస్తున్న వ్యర్థ జలాలు. ఇందుకు కారణం అది కాదని, పర్యావరణ మంత్రిత్వ శాఖ లేదా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చెప్పగలరా?ప్రజారోగ్య సంరక్షణార్థం ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్లు విధిగా థర్మల్ స్టేషన్ల నిర్వహణలో అంతర్భాగంగా నిర్మించాలి. పర్యావరణంలోకి విడుదలవుతున్న సల్ఫర్ డయాక్సైడ్ను 2022 నాటికే నివారించవలసిందిగా భారత సుప్రీంకోర్టు కఠినమైన డెడ్లైన్ విధించింది. ఇంతవరకు దేశంలో ఎన్నో థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వీటి నిర్మాణం ప్రారంభమే కాలేదు. ఉన్నవి కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు.ఎన్టీపీసీ వెబ్సైట్లో స్పష్టంగా చెప్పిన ప్రకారం... 76,531 మె.వా. విద్యుదుత్పత్తి కోసం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 17,794. ఒక మెగా వాట్ విద్యుదుత్పత్తికి ఆరుగురికి ఉద్యోగం కల్పిస్తామని ఎన్టీపీసీ సంస్థ ప్రారంభంలో చెప్పారు. ప్రస్తుత ప్రతిపాదిత 2,400 మెగావాట్లకు 96 మందికి ఉద్యో గాలిస్తామని ఈఐఏ రిపోర్ట్ ‘సోషల్ ఇంపాక్ట్’ సెక్షన్లో చెప్పారు. అంటే, 25 మెగావాట్ల స్థాపనకు ఒక ఉద్యోగాన్ని కల్పించగలుగుతారట. రేపు ఆచరణలో ఏం చేస్తారో తెలియదు.చదవండి: మూసీ మృత్యుగానం ఆగేదెన్నడు?ఈ ప్రాంతంలో స్థానికంగా ప్రతిపాదిత ప్లాంట్కు 15 కి.మీ. పరిధిలోని పరిసర ప్రాంతాలలో 12 లక్షల జనాభా ప్రతీ క్షణం పీల్చుకుంటున్న సాధారణ గాలి నాణ్యతా ప్రమాణం 45కు దిగువన ఉందనీ, ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్కు దిగువన, ధ్వని తీవ్రత 50 డెసిబల్స్కు దిగువన ఉన్నాయనీ... అంటే అన్నీ సాధారణ స్థాయిలో ఉన్నాయని అవాస్తవ సమాచారాన్ని నివేదికలో సమర్పించి, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ద్వారా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పొందారు. మరిన్ని పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజాభిప్రాయ సేకరణకు రామగుండం ఎన్టీపీసీ విస్తరణ ప్రాజెక్టుకు పూనుకుంటున్నది.ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టులో సుప్రీంకోర్టు ఆర్డర్లు, పర్యావరణ చట్టాలు తెలియనట్లు అమాయక రీతిలో 10 కి.మీ. పరిధిలో సర్వే చేసినామని చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదించిన ప్రాంతంలో... గాలి నాణ్యత 48 ఏక్యూఐ కన్నా దిగువన ఉన్నట్టు, ధ్వని తీవ్రత 40 డెసిబెల్స్ కన్నా తక్కువ ఉన్నట్టు, స్థానికంగా అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లు రాయడం పచ్చి అబద్ధాలే.చదవండి: మళ్లీ తెరపైకి రెండో రాజధాని?నిరూపిత శాస్త్ర సాంకేతిక సత్యాల పరిమితిలో విషయాలను అర్థం చేసుకోవాలి. రామగుండం ఎన్టీపీసీ– టీఎస్ఎస్టీపీపీ ప్రతిపాదిత 2,400 మె.వా. విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయదలచిన వేదికపై ఈ విషయాలన్నీ కలెక్టర్ గారు అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి చొరవ చూపాలి.ఇదివరకే జంతువులు, మనుషులు జీవించడానికి వీలుకాకుండా పరిసరాలు అధిక సాంద్ర పారిశ్రామికీకరణ వల్ల విధ్వంసమైపోయాయి. అందుకే జల, వాయు, ఘన వ్యర్థాల కాలుష్యాన్ని పరిహరించాలి. గాలి నాణ్యతను మెరుగుపరచాలి. సర్వత్రా కలుషితమైన భూగర్భ జలాలనూ, గోదావరి నదినీ మెరుగుపరిచే అన్ని చర్యలూ తీసుకోవాలి. ఇకముందు సుస్థిరాభివృద్ధికి దోహదం చేసే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ పరి శ్రమలనే ఈ కాలానికి కావలసినవిగా గుర్తించాలి. దేశాభివృద్ధి కోసం అంతటా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిర్మించాలి.- ఉమామహేశ్వర్ దహగామపర్యావరణ నిపుణులు -
అలాంటి చిల్లర కవులు ఎక్కువయ్యారు!
విద్యకు సాటి వచ్చే ధనం లేదనేది సుభాషితం. కాని నేటి వ్యాపార యుగంలో ధనం అన్ని రంగాలనూ శాసిస్తున్నట్టే... విద్య మీద కూడా ఆధిపత్యాన్ని చలాయిస్తూ దాన్ని అంగడి సరుకుగా దిగజారుస్తోంది. నేడు సాధారణ డిగ్రీలు మొదలుకొని విద్యారంగంలో అత్యున్నత అర్హతలకు సంబంధించిన పట్టాల వరకు కొనగలిగిన స్తోమత ఉన్నవారికి లభించడం ఈ దుఃస్థితికి నిదర్శనం.ముఖ్యంగా విదేశాలలోనూ, ఉత్తర భారతదేశంలోనూ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న నకిలీ విశ్వవిద్యాలయాలు విక్రయిస్తున్న ఈ డిగ్రీలను ప్రచార వ్యామోహం గల సంపన్నులు తమ పేర్లకు అలంకారాలుగా తగిలించుకొని, అవి తమ ప్రతిభాచిహ్నాలుగా చాటుకుంటున్నారు. ఊరేగింపులు, అభినందన సభలు, విందులు, వినోదాలు ఏర్పాటు చేసుకొని అవి తమ కీర్తి కిరీటాలుగా జనాన్ని భ్రమపెడుతున్నారు. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి తనకో విదేశీ సంస్థ డాక్టరేట్ను ఇవ్వజూపితే ‘డాక్టరేట్ ఇంత తేలికా?’ అని నిజాయతీగా వ్యాఖ్యానించడమే కాదు, తెచ్చుకున్న ఆ డాక్టరేట్ బిరుదును ఎప్పుడూ తన పేరు ముందు, కనీసం ‘నవ్విపోదురు గాక’ పుస్తక రచయితగా కూడా ఉపయోగించలేదు. అలా ప్రలోభాలకు లొంగకుండా అర్హత లేని బిరుదులను తోకలుగా ఉపయోగించని వారు అరుదు. నకిలీ విద్యార్హతలతో ఆత్మవంచనకు, పరవంచనకు పాల్పడుతున్న పెద్దమనుషులే ఎక్కువ.డాక్టరేట్ల సంతర్పణకు కాణాచులుగా మన విశ్వవిద్యాలయాలను చెప్పుకోవాలి. పీహెచ్డీ పట్టాల కోసం పరిశోధనలు ఉద్యోగాలకో, పదోన్నతులకో అవసరం కావడంతో నాటి ప్రమాణాలు దిగజారుతున్నాయి. ఈ జాతరలో పరిశోధక విద్యార్థులు అడ్డదారులను వెతు క్కుంటుంటే పర్యవేక్షకులు వారి కోర్కెలకు అనుగుణంగా తోడ్పడి లబ్ధి పొందుతున్నారు. ‘కాదేదీ కవిత కనర్హం’ అన్నట్లు పరిశోధన ఆవశ్యకత లేని, కేవలం ‘మెథడాలజీ’ చట్రంలో ఇమిడ్చి పీహెచ్డీ పట్టాను పొందే సులభమైన, ఎందుకూ పనికిరాని అంశాన్ని పరిశోధక విద్యార్థికి సూచించడం... విద్యార్థి ఆర్థికంగా ఆశపెడితే సిద్థాంత గ్రంథాన్ని తామే అన్నీ రాసి ఇవ్వడం కొందరు పర్యవేక్షక గురువులు చేస్తున్న నిర్వాకాలు. విశ్వవిద్యాలయాల వెలుపల సిద్ధాంత గ్రంథ రచనకు ధరను మాట్లాడుకొని రాసిపెట్టడం వృత్తిగా కలిగిన నిరుద్యోగ మేధావులు కూడా ఉండడంతో కొందరు పరిశోధకులు వారు అడిగిన డబ్బిచ్చి శ్రమ పడకుండా ‘డాక్టర్లు’ అనిపించుకుంటున్నారు.తెలుగే కాదు, ఆంగ్లం, హిందీ వంటి ఇతర భాష ల్లోనూ, సాంఘిక విజ్ఞాన శాస్త్ర విభాగాల్లోనూ పరిశోధనల స్థాయి భిన్నంగా లేదు. కొందరు ప్రబుద్ధులు ఎలాగోలా ‘పీహెచ్డీ’ అనిపించుకుంటే చాలని పూర్వుల కృషిని కొల్ల గొట్టి రాసిన సిద్ధాంత గ్రంథాలకు కూడా అయ్యవార్ల ఆశీస్సులతో ఆమోద ముద్రను వేయించుకొని ‘మమ’అంటున్న సందర్భాలు కూడా లేక పోలేదు. అయితే పరిశోధనలన్నీ కాకి బంగారం బాపతేననీ, యోగ్యతకూ నిజాయతీకి స్థానం లేదనీ అనడం కువిమర్శే అవుతుంది. విశ్వవిద్యాలయాలు వివిధ రంగాలలో– ప్రతిభామూర్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్లను, కళాప్రపూర్ణ వంటి బిరుదులనూ ప్రకటించడం ఆనవాయి తీగా వస్తోంది. అయితే వాటిని కానీ, కొన్ని ప్రామాణిక సంస్థలు ఇస్తున్న బిరుదులను కానీ విశ్వనాథ, శ్రీశ్రీ, జాషువా, పుట్టపర్తి, సినారె, ఆరుద్ర వంటి దిగ్దంతులెవరూ ఎప్పుడూ, ఎక్కడా భుజకీర్తులుగా వినియోగించుకోలేదు. ఏనుగులపై ఊరేగించినా, గురుతుల్యుల చేత గండ పెండేరాలతో సన్మానింపబడినా వారు వాటిని స్వోత్కర్షగా వాడుకోలేదు. కానీ నేడు కీర్తి కాంక్షతో అభినవ కృష్ణదేవరాయలం అనుకునే కవి పోషకులు, ‘అంతా కవులము కామా’ అనుకునే చిల్లర కవులు ఎక్కువయ్యారు. చదవండి: ఇది మాయ కాక మరేమిటి?వారు ఆశ్రిత కవులకు ‘కవిరత్న’, ’కవిశేఖర’, ‘కవితిలక’ వంటి బిరుదులను ప్రదానం చేసి శాలువాలను కప్పడం... వీరు మరునాడు స్థానిక పత్రికలలో ఆ సత్కారాల గురించి ఘనంగా రాయించుకోవడం ప్రహస నమైపోయింది. ఇటీవల కొన్ని సంస్థలు ఏకంగా కొందరు స్థానిక కవులకు ‘గౌరవ డాక్టరేట్’లను కూడా ప్రదానం చేస్తున్నాయి. కొంతనయం– పద్మ పురస్కారాలను కూడా ప్రకటించడం లేదు! ఏ హక్కు, అధికారం లేకుండా ఎవరు పడితే వారు ఇలా బిరుదులనివ్వడం, ప్రతిభాశూన్యులైన కవులు కూడా వాటిని అలంకారాలుగా ప్రదర్శించడం సమాజానికి హానికరం. దీనికి నియంత్రణ అవసరం!చదవండి: ఎవరిని ఎలా పిలవాలి?ఇటీవల ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు రాహుల్ ద్రావిడ్కు బెంగుళూరు విశ్వవిద్యాలయం వారు ‘గౌరవ డాక్టరేట్’ను ప్రకటిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించడమే గాక ‘అవసరమనుకుంటే ‘నేను థీసిస్ను సమర్పించి డాక్టరేట్ తీసుకుంటాను కాని ఉచితంగా కాదు’ అని వ్యాఖ్యానించడం అభినందనీయం. ఆదర్శవంతులు ముఖ్యంగా రాజకీయ, చిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు ఎటువంటి ప్రలోభాలకూ లోను కాకుండా గౌరవ డాక్టరేట్ల ప్రత్యేకతను కాపాడుతారని ఆశిద్దాం.- పైడిపాలవిశ్రాంత తెలుగు ఉపన్యాసకులు -
మూసీ మృత్యుగానం ఆగేదెన్నడు?
గత నలభై సంవత్సరాలుగా మూసీ నది మృత్యుగానం వినిపిస్తోంది. 1997లో ఈ వ్యాసకర్త మూసీ కాలుష్యం తీరు తెన్నులపై, దాని పరివాహక ప్రాంతంలోని గ్రామాలపై కాలుష్య ప్రభావం గురించి రాసిన పరిశోధనా వ్యాసంలోని అంశాలు... ఆ ప్రాంత ప్రజలను కదిలించాయి. ముఖ్యంగా ఎదులాబాద్ గ్రామ ప్రజలు చేసిన పోరాటం మరువలేనిది. మేధాపట్కర్, గజేంద్రసింగ్లు కూడా మూసీ కాలుష్యం, దాని ప్రభావం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఉద్యమానికి సంఘీబావం ప్రకటించారు. విషపూరిత రసాయనాలతో, మానవ, పశువుల విసర్జనాలతో నిండిన ఈ కలుషిత నీరే అత్యధిక ధాన్య (వడ్లు) ఉత్పత్తికి దోహదపడింది. నిజాం రాచరిక పాలన కాలంలో నిర్మించిన 23 కత్వల (చిన్న ఆనకట్టలు) ద్వారా 25 వేల ఎకరాలకు సాగు నీరు అందించే ఏర్పాటు జరిగింది. నేడు సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.‘పిలాయిపల్లి కాల్వ’, ‘బునాది గాని కాల్వ’ అనే రెండు కొత్త కాలువల నిర్మాణం ఇటీవల జరిగింది. అంటే అవే 23 కత్వల కింద ఆయకట్టు దాదాపు పదమూడు రెట్లు పెరిగిందన్నమాట! ఇదెలా సాధ్యమైనట్టు? 1925లో జంట నగరాలకు తాగునీటి సరఫరా రోజుకు 23 మిలి యన్ గాలన్స్గా ఉండేది. అది క్రమంగా పెరుగుతూ ఈ రోజు రమారమి 600 మిలియన్ గాలన్స్గా ఉంది. ఇందులో 80 శాతం నీరు వాడిన తర్వాత తిరిగి మూసీలో కలుస్తోంది. ఈ కలుషిత నీరే నదిని జీవనదిగా మార్చింది. ఈ నీరే పైన ఉదహరించిన 2 లక్షల ఎకరాల వరి సాగుకు మూలం. లక్షలాది టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఎందరికో పని దొరుకు తోంది. అదే సమయంలో కాలుష్య జలాల కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.హానికరమైన రసాయనాలతో నిండిపోయిన నది ఉపరితల జలాలు, భూగర్భజలాలు, ఆహార గొలుసంతా విషతుల్యమయింది. బియ్యం, పాలు, కాయగూరలు దేనికీ మినహాయింపు లేదు. బాధ్యతా రహితంగా కంపెనీలు రసాయన వ్యర్థాలను ట్రీట్మెంట్ చేయకుండా నదులు, చెరువులు, వాగుల్లోకి వదిలి వేస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. జంట నగరాల చుట్టూ ఉన్న కంపెనీలు విడుదల చేస్తున్న వ్యర్థాలు మూసీనే కాకుండా వందకు మించిన చెరువులకు కూడా మరణ శాసనం లిఖిస్తున్నాయి. నిజానికి ఇవ్వాళ దేశంలో చాలా నదుల స్థితి ఇదే. తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పరిమిత వనరులను జాతి శాశ్వతంగా కోల్పోయే ముప్పు పొంచి ఉందన్న భారత సైన్స్ సంస్థ బాధ్యులు డాక్టర్ రామచంద్ర ప్రభు హెచ్చరికల్ని ప్రభుత్వాలు ఇంక ఎంత మాత్రం ఉపేక్షించటానికి వీలులేదు.జల వనరుల కాలుష్యం వల్ల ఏటా రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు ‘నీతి ఆయోగ్’ లెక్క గట్టింది. ఈ మధ్యనే విడుదలయిన నదుల నీటి నాణ్యత ఇండెక్స్లో మూసీ నది నీటిలో ఆక్సిజన్ స్థాయులను ప్రభావితం చేసే టర్బిడిటీ స్థాయులు 1–4 మధ్యన ఉండాల్సింది... నల్లగొండ జిల్లా వివిధ ప్రాంతాలలో 13, 15 స్థాయులుగా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాలలో 258 నదులపై స్విస్ సంస్థ ఒకటి ఔషధ కాలుష్యంపై అధ్యయనం చేసింది. 2022 సంవత్సరంలో ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్యంగా మారిన నదులలో మూసీ నది 22వ స్థానంలో ఉంది. నదిలో 48 రకాల రసాయన అవశేషాలు ఉన్నట్టు ఆ పరీక్షలలో తేలింది. ఈ రసాయనాల వల్ల మనుషులు వివిధ రకాల క్యాన్సర్, మూత్ర పిండాల వ్యాధులు, చర్మ వ్యాధులు, అబార్షన్లు, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి, గొంతునొప్పి వంటి రోగాల బారిన పడతారని తెల్చింది. ఈ రోగాల ముప్పు అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఉంది. ప్రజలు, పశు పక్ష్యాదుల ఆరోగ్యాలకు ముంచుకొస్తున్న ముప్పు నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడటాన్ని అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ ప్రక్షాళన, సుందరీకరణ చేసి తీరుతామని చెప్పటం ఒక శుభ పరిణామం. ఈ విషయంలో సీఎం సీరియస్గానే ఉన్నారనే విషయం స్పష్టంగానే కపిస్తోంది. అందుకు ఆయనను అభినందించాలి.చదవండి: నీటి యుద్ధాలు రానున్నాయా!అయితే ఈ సమస్యపై అధికార ప్రతిపక్షాల మధ్య సాగు తున్న వాదోపవాదాలు కొంత గందరగోళానికి దారి తీశాయి. దానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వం ప్రాజెక్టుపై తన కార్యచరణను తలకిందులుగా మొదలు పెట్టడమే కాకుండా హైడ్రాతో ముడిపెట్టింది. దాంతో నదిలో ఉన్న నివాసాల తొలగింపు మొదలైంది. ఇక్కడ రెండు విషయాల పట్ల ప్రభుత్వం స్పష్టంగా ఉండాలె. ఒకటి నది ప్రక్షాళన అయితే, రెండోది నది ప్రాంత సుందరీకరణ. ఈ రెండింటినీ ఏక కాలంలో చేపట్టాల్సిన అవసరం లేదు. ఏది ముందు ఏది తర్వాత అనేది ప్రశ్న. జవాబు స్పష్టమే! ముందు ప్రక్షాళన, తర్వాతే సుందరీకరణ. నది ప్రక్షాళన కోసం చేయాల్సిందేమిటి? కంపెనీల నుంచి వెలువడే హాని కరమయిన రసాయనాలను, మావన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నదిలోనికి వదలొద్దు. వ్యర్థాల శుద్ధి కోసం సమగ్రమైన ప్రణాళిక అవసరం. పెట్టుబడి, పట్టుదల నిజాయితీతో కూడిన కార్యాచరణ ఎంతో అవసరం. ఇదొక దీర్ఘకాలిక ప్రణాళిక. నదికి మొలసిన ఈ నారీ పుండ్లను తొలగిస్తేనే సుందరీకరణ సాధ్యం.చదవండి: ఈ మార్పులతో ఏం ఒరుగుతుంది?ఈ సుందరీకరణకు ముందు జరగాల్సింది చాలా ఉంది. ముందు నది వైశాల్యాన్ని తేల్చాలి. దాని వాస్తవిక వైశాల్యం ఎంత ? భారీ వరద వస్తే ఎంత ఎత్తున పారుతుందో (నది పారు ప్రాంతం) గుర్తించాలి. దాని లోపల నివాసాలు ఉన్నట్లయితే తొలగించాల్సిన/సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ భూసేకరణ చట్టం యొక్క అవసరం ఏర్పడుతుంది. నిర్వాసితుల పునరావాసానికి, వారి ఆర్థిక సామాజిక, సాంస్కృతిక పునర్నిర్మాణానికి 2013 చట్టాన్ని పాటించాలి, ఇంకా మెరుగుపర్చుకోవాలి. నది ప్రక్షాళన, సుందరీకరణ ఎంత ముఖ్యమో ప్రజల జీవితాలు అంతకన్నా ముఖ్యం. ప్రాజెక్టు పేరుతో ఇప్ప టికే ఉన్న ఒక ఆర్థిక, సామాజిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నా మన్న స్పృహ ప్రభుత్వానికి ఉండాలె. అప్పుడే కూల్చిన వ్యవస్థను పునర్నిర్మించడానికి ఆలోచనాపరంగా అడ్డంకులు ఉండవు. ప్రకటించిన ప్రాజెక్టులను ప్రజాగ్రహం మూలంగా వెనుకకు తీసుకోవాల్సిన అవసరం రాదు. ప్రభుత్వానికి ఈ విషయంలో సరైన సలహాలు అవసరం.- ఆచార్య కట్టా ముత్యం రెడ్డి ప్రెసిడెంట్, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ -
ఈ తిరుగుబాట్లు ఎందుకు జరిగాయంటే...
సరిగ్గా నాలుగు నెలల కిందట బంగ్లాదేశ్ ప్రధాని నివాసంలో కనిపించిన దృశ్యాలే ఇవాళ సిరియా అధ్యక్ష భవనంలో కనిపిస్తున్నాయి. ప్రజా ఆగ్రహానికి గురై షేక్ హసీనా దేశాన్ని వీడిన వెంటనే ఆమె ప్రధానమంత్రి అధికారిక నివాసంలో తిరుగు బాటుదారులు దాడిచేసి ఇంటిని లూటి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇదే సీన్ సిరియా అధ్యక్ష భవనంలో రిపీట్ అయ్యింది. ఆ దేశ నియంత బషీర్ అల్ అసద్ తిరుగుబాటుదారుల దాడికి దేశాన్ని వీడారు. ఆ వెంటనే అధ్యక్ష భవనంలోకి తిరుగుబాటుదారులు జొర బడి కనిపించిన వస్తువులను ఎత్తుకెళ్లటం చూస్తున్నాం. సిరియా అధ్యక్షుడిగా రెండున్నర దశాబ్దాల పాటు ఆ దేశాన్ని ఏలిన బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి పారి పోవాల్సిన పరిస్థితి వచ్చింది.సిరియా దాదాపు 13 ఏళ్లుగా అంతర్యుద్ధంతో సతమతం అవుతూనే ఉంది. దీనిలో ‘తిలాపాపం తలా పిడికిడు’ అన్నట్లు రష్యా, అమెరికా వంటి దేశాల పాత్రను కూడా మరిచిపోకూడదు. అసద్ తండ్రి హఫీజ్ 1970లో తిరుగుబాటు ద్వారా అధికారం చేజిక్కించుకున్నారు. ఆయన మరణానంతరం అసద్ అధికారంలోకి వచ్చారు. అంటే ఏకంగా 54 ఏళ్ళుగా అసద్ కుటుంబ నియంతృత్వ పాలనలోనే సిరియా మగ్గి పోయింది. ఉగ్రవాదాన్ని, అంతర్యుద్ధాన్ని కట్టడి చేయ లేకపోవటం ప్రజాస్వామిక విధానాలను దరిదాపుల్లోకి రానీయకపోయిన ఫలితాన్ని అసద్ ఇవాళ చవిచూస్తున్నారు. దేశాన్ని వదిలి రష్యా నీడన ఆశ్రయం పొందుతున్నారు. తిరుగుబాటుకు నేతృత్వం వహించిన హయాత్ తహరీర్ ఆల్ షామ్ (హెచ్టీఎస్) సంస్థను ఐక్యరాజ్య సమితి గతంలోనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న అబూ మహమ్మద్ అల్–జులానీ ఒకప్పుడు అల్ ఖైదా ఉగ్రవాది. అంటే సిరియా దేశంలో నియంతృత్వం అంతరించే సూచనలు కనుచూపు మేరలో కనిపించకపోగా... ఆ దేశ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.సిరియా, బంగ్లాదేశ్ పరిస్థితులను ఒకే గాటన కట్టలేకపోవచ్చు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు రేగి అవి హింసాత్మంగా మారటంతో పరిస్థితి చేయి దాటిపోయింది బంగ్లాదేశ్లో. హసీనా ప్రభుత్వం కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే నిర్ణయం తీసు కున్నా... అప్పటికే ఆమె నిరంకుశ వ్యవహారశైలి పట్ల ప్రజల్లో పేరుకుపోయిన వ్యతిరేకత ఒక్కసారిగా ఎగిసిపడింది. ఆమె దేశాన్ని వదిలి పారిపోవాల్సిన పరిస్థితిని తెచ్చింది. ఈ పరిణామాల తర్వాత బంగ్లాదేశ్ మత ఛాందస దిశగా అడుగులు వేయటం ఆందోళనకరమైన అంశం. నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో అక్కడి హిందూ మైనార్టీలపై దాడులు, చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాలన్న డిమాండ్లు వీటికి సంకేతాలు.కాస్త వెనక్కి వెళితే... రెండేళ్లు వెనక్కి వెళితే 2022 జూలైలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సా కూడా ఇదే విధంగా పెట్టేబేడా సర్దుకుని ఉన్నపళంగా దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆ దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తటంతో తిరుగుబాటుదారులు అధ్యక్ష భవనంపై దాడి చేశారు. అదే సమయంలో ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసానికి కూడా నిప్పు పెట్టారు. ప్రజాగ్రహానికి తలొంచి రణిల్ సైతం ఆ రోజు రాజీనామా చేయక తప్పలేదు. ఇక సిరియా లాంటి తిరుగుబాటును 2021 ఆగష్టులో అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ చవిచూశారు. దశాబ్దాలుగా తీవ్ర సంక్షోభం, ఉగ్రవాదం, అంతర్యుద్ధాలకు కేంద్రంగా మారిన అఫ్గానిస్తాన్లో అష్రఫ్ ఘనీ నియంతలా పాలన చేశారు. చివరకు తాలిబాన్ల దాడిని ఎదుర్కోలేక దేశం విడిచి పారిపోయారు. ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇస్లాం చట్టాల పేరుతో ఏ విధంగా మానవ హక్కులను కాలరాస్తున్నారో యావత్ ప్రపంచం చూస్తూనే ఉంది.చదవండి: ఆ వ్యతిరేకత మనకు కలిసొచ్చేనా?ఈ నాలుగు దేశాల్లో సంక్షోభాలకు కారణాలు వేర్వేరు కావచ్చు, తీవ్రతల్లో తేడాలు ఉండొచ్చు. కాని ఫలితం మాత్రం ఒకటే. అంతే కాదు, పర్యవసానాల్లోనూ సారూప్యత కనిపిస్తోంది. శ్రీలంక మినహాయిస్తే అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, సిరియాల్లో మత ఛాందసవాదమే రాజ్యమేలేటట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఆ యా దేశాల ప్రజలకే కాదు ప్రపంచానికి సైతం ప్రమాదకరం.- రెహానా బేగం రాష్ట్ర సమాచార కమిషనర్, ఏపీ -
ఈ మార్పులతో ఏం ఒరుగుతుంది?
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదయిన సందర్భంలో అన్ని వర్గాల్లోనూ చర్చ చాలా లోతుగానే జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తొలి పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తమ ఆకాంక్ష లకు అనుగుణంగా లేదని చాలా స్పష్టంగా ప్రజలు చెప్పారు. తెలంగాణ కోసమే ఒక రాజకీయ పార్టీ స్థాపించి, తెలంగాణ పేరుతో ప్రతినిత్యం తన రాజకీయం నడిపించిన కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినా ప్రజలు శాశ్వతంగా పట్టం కట్టలేదనీ, కట్టరనీ ఏడాది క్రితం ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి.నిజానికి 2014 ఎన్నికల్లో కేసీఆర్కు పట్టం కట్టిన ప్రజలు 2019 ఎన్నికలలోపే ఆ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తూ వచ్చారు. ఇది కనిపెట్టిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలతో (2019) పాటు అసెంబ్లీ ఎన్ని కలు జరిగితే మోదీ సునామీలో అధికారం కోల్పోవడం ఖాయం అని ఇంటెలిజెన్స్ వర్గాలు, ఇతర వర్గాల ద్వారా సమాచారం సేకరించారు. అందుకే ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ తనదైన టక్కు టమార విద్యలతో 2018 లోనే అసెంబ్లీకి ప్రత్యేకంగా ఎన్నికలు వచ్చే విధంగా ప్రయత్నం చేసి విజయం సాధించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగి ఉంటే అదే స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉండేది. రెండవ దఫా ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ళనుంచి తెలంగాణ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. తెలంగాణలో అనుకోకుండా దుబ్బాక నియోజకవర్గంలో వచ్చిన ఉప ఎన్నిక ఈ వ్యతిరేకత చూపించడానికి తొలి వేదిక అయ్యింది. సొంత జిల్లా సిద్దిపేటలో అటు గజ్వేల్, ఇటు సిరిసిల్లకు మధ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రజలు బీజేపీ తరఫున నిల బడిన నన్ను గెలిపించడం దీనికి నిదర్శనం.ప్రత్యామ్నాయం కోసం తెలంగాణ ప్రజలు తప్పని సరి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపితే అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు... ఏడాది కాలంగా సరిగ్గా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నది. ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రకటించిన మేనిఫెస్టోలో 42 పేజీలలో వారు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మారి ఏడాది కూడా గడవక ముందే తెలంగాణలో కొత్త సర్కారుపై తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకతలు మొదలయ్యాయి.కేసీఆర్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ‘ఆరు గ్యారెంటీల’ పేరుతో అలవి కాని హామీలను ఇచ్చి ప్రజల ఓట్లను కొల్లగొట్టి గద్దెనెక్కి... ఇప్పుడు ప్రజలపై స్వారీ చేస్తోంది రేవంత్ సర్కార్. 6 గ్యారంటీలలో నెర వేర్చినవి కూడా అరకొరగా మాత్రమే ఉండటం గమ నార్హం. ప్రజలకు అవసరం లేని... పేర్లలో మార్పు, విగ్రహాలలో మార్పు చేయడం మాత్రమే ప్రజా పాలనకు నిదర్శనమా? తెలంగాణ తల్లి విగ్రహం మలిదశ ఉద్యమంలో ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ప్రజల మన సుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ విగ్రహం మార్పు చేయడం వల్ల ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉన్నదా? నిజానికి తల్లి... దేవతతో సమానం. అట్లాంటి తెలంగాణ తల్లిని దేవత రూపంలో ఉండకూడదని కాంగ్రెస్ సర్కార్ అనుకోవడమే వారి మూర్ఖత్వానికి పరాకాష్ట. మార్పు చేసిన విగ్రహం కూడా తెలంగాణలో బలిదానాలకు మూల కారణమైన సోనియా గాంధీ పుట్టిన రోజున ఆవిష్కరణ చేయడం తెలంగాణ ఆత్మగౌరవ వంచనగా భావించాల్సిందే. ‘అన్ని బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం’ అని ప్రమాణ పత్రంలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ... కేవలం ‘పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సు’ల్లో మాత్రమే ఆడపడుచులు ప్రయాణించడానికి అర్హులని అవమా నిస్తోంది. ఇలా ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ కొట్టు మిట్టాడుతోంది. కేసీఆర్కు వ్యతిరేకంగా ఓటేసిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు అవుతాయని ఎదురుచూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి.చదవండి: వ్యవసాయాన్ని పండుగ చేశాం!అత్తాకోడళ్ళతో సహా కుటుంబంలోని మహిళలందరికీ ఇస్తానన్న నెలకు రూ. 2,500 ఎక్కడకు పోయినాయి? వరి ధాన్యానికి రూ. 500 బోనస్ అని... ఇప్పుడు కేవలం కొన్ని రకాల సన్న ధాన్యాలకు ఇస్తా మని చెప్పడం మోసం చేయడం కాదా? రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి, తర్వాత ‘షరతులు వర్తిస్తాయ’ని కార్పొరేట్ తరహా మోసం చేసిన ప్రభుత్వం ఇది. ‘రైతు భరోసా’ పెంచి కౌలు రైతులకు కూడా 15 వేల రూపా యలు ఇస్తామని ముఖం చాటేసిన గొప్ప సర్కారు ఇది. అందుకే మేనిఫెస్టోలో ఉన్న 42 పేజీలపై ప్రజాక్షేత్రంలో చర్చకు రావాలి. వారు అమలు చేశామని చెప్పుకుంటున్న హామీలపై కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సంతృప్తిగా లేరన్న విషయాన్ని రుజువు చేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ తాము ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిపక్షంలో ఎన్నికల వరకు కూడా ప్రజలు తిరుగుబాటు చేయకుండా నిలిచే పరిస్థితి మాత్రం కనబడటం లేదు. తిరుగుబాటు సహజ గుణంగా ఉన్న తెలంగాణ ప్రజలకు ఇది కొత్త కూడా కాకపోవచ్చు.- రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ సభ్యులు -
ఆ నిర్ణయంతో అమెరికాకే నష్టం.. ట్రంప్ భయం అదే!
అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్, ‘తాను 2025 జనవరి 20న అధికారం చేపట్టిన వెంటనే అమెరికాతో వాణిజ్యం చేస్తున్న మూడు అగ్రభాగ దేశాలైన చైనా, కెనడా, మెక్సికోలపై భారీ సుంకాలను విధిస్తానని’ చెప్పారు. చైనాపై ఇప్పటి వరకూ ఉన్న 60 శాతం సుంకాలతో పాటుగా అదనంగా 10 శాతం, కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకాలను విధిస్తానని ప్రకటించారు. అమెరికా సరిహద్దు వెంబడి అక్రమ మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయనీ, అనధికార వలసదారుల ప్రవేశానికి ప్రతిస్పందనగా తాజా చర్యలు తీసుకోబోతున్నాననీ నవంబరు 26 నాడు ప్రకటించారాయన. తాజాగా నవంబరు 30న ఏకంగా బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలను విధిస్తానని ప్రపంచం విస్తుపోయేలా ప్రకటించారు. ‘బ్రిక్స్ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ దేశాలు) డాలరుకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ, ప్రత్యామ్నాయ కరెన్సీకి కృషి చేస్తే... బ్రిక్స్ దేశాలు అద్భుతమైన, శక్తిమంతమైన అమెరికా ఆర్థిక వ్యవస్థతో వాణిజ్య సంబంధాలకు వీడ్కోలు చెప్పాలి. డాలరును వ్యతిరేకించననే నిబద్ధత ఈ దేశాల నుంచి మా కవసరం’ అని ట్రంప్ సోషల్ మీడియాలో రాశారు.2023లో ప్రపంచ దేశాలతో మొత్తం 773 బిలియన్ల (77,300 కోట్ల డాలర్లు) వాణిజ్య లోటుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ జబ్బుపడి ఉంది. కేవలం బ్రిక్స్ దేశాలతోనే 43,350 కోట్ల డాలర్ల వాణిజ్య లోటును అమెరికా కల్గి ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ చైనాతో 279 బిలియన్లు (27,900 కోట్ల డాలర్లు), మెక్సికోతో 15,200 కోట్ల డాలర్లు, చిన్న దేశమైన వియత్నాంతో 10,400 కోట్ల డాలర్ల వాణిజ్యలోటును కలిగి తన కృత్రిమ డాలరు మారకపు విలువతో పబ్బం గడుపుకుంటోంది. బ్రిక్స్ దేశాల నుంచి దిగుమతులను నిషేధిస్తే... ఆ దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే తయారీ వస్తువులను వర్తమాన దేశాలకు, యూరప్కు మళ్లించే అవకాశాలుంటాయి. అమెరికాలోని వస్తు ఉత్పత్తి రంగం వెనుకబడి ఉంది. స్వదేశీ డిమాండును ఇప్పుడున్న అమెరికాలోని పరిశ్రమలు తీర్చలేవు. అందువల్ల వస్తు ధరలు విపరీతంగా పెరగవచ్చు. బ్రిక్స్ దేశాలు కొత్త మార్కెట్లను వెతుక్కుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం దిశకు మరలవచ్చు. డాలరు ఏకఛత్రాధిపత్యం కోసం అమెరికా తీసుకొంటున్న చర్యలకు ప్రత్యామ్యాయంగా ఇప్పటికే 3 దశాబ్దాల నుండి యూరో కరెన్సీని ఐరోపా యూనియన్ ప్రవేశపెట్టింది. చైనా, రష్యాలు పరస్పరం తమ కరెన్సీలతోనే వాణిజ్యం చేసుకొంటున్నాయి.2వ ప్రపంచ యుద్ధంలో నష్టపోని అమెరికా ఆయుధ అమ్మకాలతో విపరీతమైన బంగారు నిల్వలను పోగు చేసుకొంది. 1944 జులై నుంచి ‘బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్’ అనే అంతర్జాతీయ ద్రవ్యసంస్థను ఏర్పాటు చేసుకుంది. దాని ద్వారా 44 దేశాల మద్దతుతో డాలరును అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా ఏర్పాటు చేసుకొని 1971 వరకూ బంగారం ఆధారిత డాలరుగా కొనసాగించింది. వాస్తవానికి తన వద్దనున్న బంగారు నిల్వలకు పొంతన లేకుండా డాలరు నోట్లను ముద్రించుకొంటూ ఆధిపత్యం చలాయించింది. ప్రస్తుతం అమెరికా వద్ద 8,133.46 టన్నుల బంగారు నిల్వలున్నాయి. ఈ నిల్వలను అమ్మితే వచ్చే 69,100కోట్ల డాలర్లతో అమెరికా సుమారు 36 లక్షలకోట్ల రుణాలను ఎలా తీరుస్తుంది?1971 మేలో జర్మనీ డాలరుతో తెగతెంపులు చేసుకొని బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్ నుంచి బయటపడిన 3 నెలల్లోనే అనూహ్యమైన ఆర్థిక పురోభివృద్ధి సాధించింది. డాలరుతో పోల్చుకొంటే జర్మన్ మార్కు 7.5 శాతం వృద్ధి రేటు సాధించింది. వెనువెంటనే ప్రపంచ దేశాలన్నీ డాలరు విలువను బంగారం విలువతో సరిపెట్టమని డిమాండు చేశాయి. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్లు జర్మన్ బాటలో పయినించటంతో తీవ్ర ఒత్తిడికి లోనైన అమెరికా బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్ ఆధిపత్యాన్ని కోల్పోయింది. 1971లో (ప్రెసిడెంట్ నిక్సన్ షాక్గా పిలవబడే) బంగారు నిల్వతో డాలరు విలువను రద్దు చేసుకొని నేటి ‘డాలర్ ఫియట్ ఫ్లోటింగ్’ విధానాన్ని ప్రవేశపెట్టింది.ప్రస్తుతం ట్రంప్ విధిస్తానన్న వాణిజ్య ఆంక్షలతో బ్రిక్స్ కరెన్సీ ఏర్పడి... రానున్న కాలంలో డాలర్, యూరోలతో పోటీపడినా ఆశ్చర్యపోనవసరంలేదు. అదీగాక రష్యా, చైనా, భారత్ దేశాలు వాణిజ్యపరంగా ఐక్యమైతే ప్రపంచ దిశనే మార్చే అవకాశం ఉంది. ఒకప్పటి ప్రపంచాన్ని తమ కరెన్సీలతో ఆధిపత్యం చలాయించిన దేశాలన్నీ ఇప్పుడు అత్యంత బలహీనమైన ఆర్థికదేశాలుగా మిగిలాయి. అమెరికా కూడా ఈ తరహా దేశంగా మిగులుతుందని ట్రంప్ భయం. పరిస్థితులును పసిగట్టిన ట్రంప్ వాణిజ్య సుంకాలతో ఈ కృత్రిమ డాలరు విలువను నిలబెట్టాలని అనుకుంటున్నారు.- బుడ్డిగ జమిందార్కె.ఎల్. యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ -
ఈ చర్య మతసామరస్యానికి శరాఘాతం!
అజ్మీర్ దర్గాకు సంబంధించిన వార్తలు ముస్లింలకు మాత్రమే బాధ కలిగిస్తాయనుకుంటే పొరపాటు. తరతరాలుగా హిందువులు ఆ దర్గాలో ఆరాధనలు జరుపుతున్నారు. ‘చాదర్’ సమర్పిస్తు న్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా ‘గరీబ్ నవాజ్’ అని పిలుచుకునే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఎదుట మొక్కులు తీర్చుకుంటున్నారు. భారత దేశంలోని ముస్లింలు, హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్రాన్ని ప్రతి రోజూ 1.5 లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. భారతీయ ముస్లింలలో అత్యధికులు అజ్మీర్ దర్గాను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకుంటారు. అజ్మీర్ దర్గా భారతదేశంలోని ముస్లింలకు మక్కా లాంటిదని పలువురు భావిస్తారు. అజ్మీర్ ఖ్వాజాను ‘హిందూస్థాన్ కే వలీ’ లేదా ‘హింద్ వలీ’ అని పిలుస్తారు.కాని ఇటువంటి ఈ సామరస్య కేంద్రం ఇప్పుడు వార్తల్లో అనవసర కారణాలతో నిలవడం బాధాకరం. భారతదేశంలో బాబ్రీ తర్వాత సాగుతున్న హైందవ సంస్కృతి ఆనవాళ్ల వెతుకులాట మసీదుల చుట్టూ ఇంతకాలం ఉండగా... ఇప్పుడు దర్గాలకు చేరడం, అదీ కోట్లాది మంది సెంటిమెంట్గా భావించే అజ్మీర్ దర్గాకు చేరడం ఆందోళన కలిగించే అంశం. చినికి చినికి గాలివాన అయినట్టుగా ఇది ఎక్కడకు చేరబోతున్నదో పాలకులకూ, ఈ వివాదాన్ని రేపుతున్నవారికీ అంచనా ఉందా? ఈ వివాదాన్ని లేపేవారు భారతీయ హిందూ– ముస్లింల మధ్య ఎడతెగని అనిశ్చితి, ఘర్షణ, విభజన, ద్వేషం ఆశిస్తున్నారా? ఒక దేశంలో కలిసిమెలిసి ఉండవలసిన రెండు ప్రధాన మతాలు నిత్యం ఘర్షణల్లో ఉంటే ఆ దేశ ప్రగతి ఏ రీతిలో కొనసాగుతుందనేది మనలో ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాలి.అయోధ్యలో ప్రార్థనా స్థలంపై జరిగినట్లుగా అజ్మీర్లో దీర్ఘకాలంగా పోరాటం లేదు. ఇది మసీదు వంటి బహిరంగ ప్రదేశం కాదు. ఇది సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి. అజ్మీర్ దర్గాపై ఎటువంటి న్యాయపోరాటం లేనప్పుడు, 800 ఏళ్ల సూఫీ సాధువు సమాధి వద్ద యంత్రాలు, గునపాలు చేరడం చట్టవిరుద్ధం. హిందూసేన కోర్టు సహాయంతో అజ్మీర్ ఖ్వాజా దర్గాను సర్వే చేయాలనుకుంటోంది. ఈ సర్వేను నిలిపివేయాలని ఈ దేశంలో బాధ్యతగల పౌరులెవరైనా ఆశిస్తారు. తాజ్మహల్, కుతుబ్మినార్ల విషయంలో చేసినట్లుగా అజ్మీర్ దర్గా సర్వేను తిరస్కరించాలి. వివాదాలు లేని చోట వివాదాలు సృష్టించవలసిన అవసరం ఏమిటని గౌరవనీయమైన పెద్దలు ముందుకు రావాలి.హిందూ ముస్లింలకు ఇది దర్గా అని తెలుసు. ఇది రెండు మతాలకు చెందినది కాబట్టి వారు దానిని ఒకే దృష్టితో చూశారు. భక్తులు అక్కడ సంతోషంగా ప్రార్థనలు చేస్తున్నప్పుడు వారిని భంగపరచి దేశవ్యాప్తంగా ఎందుకు హింసను ప్రేరేపించాలి? శివలింగం ఉందా... లేదా ఉందని వెలికితీయడానికీ, లేదా లేకపోయినా ఉందని వాదించడానికీ పవిత్రమైన 800 సంవత్సరాల నాటి సూఫీ సాధు సమాధిని అన్వేషించడం 140 కోట్ల జనాల మనోభావాలను దెబ్బతీసినట్లే. దర్గా హిందువులు– ముస్లింల మధ్య వారధిగా నిలుస్తుంది. ఈ వంతెనను దెబ్బ తీస్తే, హిందువులు – ముస్లింల మధ్య సంబంధాన్ని విచ్ఛిన్నం చేసినట్లే. ఇలా చేసి చివరికి ఏమి సాధించబోతున్నారు?గత పాఠాలు బోధించడం, అవగాహన పెంపొందించడంలో చరిత్రకు దాని విలువ ఉంది. ప్రజలను విభజించడానికి లేదా శాంతికి భంగం కలిగించడానికి చరిత్రను ఆయుధంగా వాడకూడదు. చరిత్రను తవ్వకూడదు. చరిత్రకు దానిదైన విలువ ఉంటుంది. చరిత్ర గతిలో గడిచిపోయిన విషయాలను కొన్నింటిని వర్తమానంలోకి తెచ్చినప్పుడు అవి మనం కోరే వ్యాఖ్యానాలు, ఫలితాలు మాత్రమే ఇవ్వవు. తేనెతుట్టెను కదిల్చి తేనెటీగలను ఒక వరుస క్రమంలో ఎగిరి వెళ్లమని కోరడం లాంటిది ఇది. సమాజంలో అన్ని మతాలకూ, వారి పవిత్ర స్థలాలకూ గౌరవం అవసరం. సామరస్యాన్ని కాపాడుకోవాలంటే విశ్వాసం విభజితం కాకుండా ఏకం కావాలని గుర్తించాలి. ఈ మతాతీత ప్రదేశాలు గౌరవం, ఐక్యతలకు సంబంధించిన స్థలాలుగా ఉండాలి.చదవండి: ఒక అపరిచితుడి దయగత రెండు సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ‘మేము కొన్ని పరిస్థితుల్లో ప్రకృతికి విరుద్ధంగా బాబ్రీ మసీదు సమస్యను లేవనెత్తాము. ఇప్పుడు ఆ సమస్య సమసిపోయింది. ఇప్పుడు మరలా ప్రతిరోజూ మసీద్–మందిర్ గొడవలు దేనికని? ఎందుకు అనవసర గొడవలు సృష్టిస్తు న్నారు? ప్రతీ మసీదులో శివలింగం ఉందని వాదించడం సరైనది కాదు. విధానం వేరైనప్పటికి మసీదుల్లో ముస్లింలు చేస్తున్నది కూడా దైవ ఆరాధనే. వారు మనవాళ్ళే, బయట నుండి ఏమి రాలేదు. ఇది అందరూ అర్థం చేసుకోండి’ అని చెబుతూనే వస్తున్నారు. కానీ, జరుగుతున్నది వేరు.సూఫీ సాధువు సమాధి కింద శివలింగం ఉందనడానికి ఎటువంటి ఆధారాలూ లేవు. హింసను ప్రేరేపించడానికి అలాంటి కల్పనలను వదిలివేయాలి. భాగవత్ మాటలను గౌరవించమని హిందూ సోదరులకు విజ్ఞప్తి. అలాగే ముస్లిం సోదరులు కూడా సంయమనం పాటించాలి. ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ కలిసి నడుద్దాం. భారతదేశ జెండాను ప్రపంచంలో ఉన్నత శిఖరాల్లోకి ఎగరవేద్దాం. మేరా భారత్ మహాన్ హై! జై హింద్!!- జహారా బేగంసామాజిక కార్యకర్త (ఇండియా/యు.ఎస్.ఎ) -
ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ దిశగా అడుగులు!
కనీస మద్దతు ధరల చట్టం... దశాబ్దాలుగా రైతులు కంటున్న కల! ప్రపంచంలో గుండు సూది నుంచి విమానం వరకు ఏ వస్తువు కైనా ధరను నిర్ణయించే అధికారం వాటిని ఉత్పత్తి చేసే వారికే ఉంటుంది. కానీ ఇంటిల్లి పాది రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసే పంటలకు ధరలు నిర్ణయించుకునే అధికారం రైతులకు లేదు. రిటైల్ ధరలలో మూడో వంతు కూడా సాగు దారులకు దక్కని దుస్థితి కొనసాగు తోంది. రైతులు పండించే పంట ఉత్పత్తులపై ఆధారపడి జీవించే దళారులు, టోకు, రిటైల్ వ్యాపారులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వర్గాలు మాత్రం కోట్లు గడిస్తు న్నారు. వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసే కెచప్, మసాలా వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్టులకు ఎమ్మార్పీలు ఉంటాయి. వాటికి ప్రాథమిక ముడి సరుకైన రైతు పండించే పంటలకు ఉండవు. అదే విషాదం!ఏటా పెరుగుతున్న పెట్టుబడులు రైతులకు తలకు మించిన భారంగా మారాయి. ప్రకృతి వైపరీత్యాలకు తోడు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే తెగుళ్లు, పురు గులు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మార్కెట్ మాయాజాలం కారణంగా పంట కోతకొచ్చే నాటికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. పంట సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఆదాయం అందాలనీ, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందనీ డాక్టర్ స్వామినాథన్ కమిటీ 2005లో నాటి యూపీఏ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. వాస్తవానికి 23 పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ)తో చట్టబద్ధత కల్పించాలనీ, ఈ విషయాన్ని ప్రభుత్వం రైతుల ఆర్థిక కోణంలో చూడాలనీ రైతులు కోరుతున్నారు. అయితే ఇందుకు ఏమాత్రం తలొగ్గని కేంద్రం ఏటా 10–15 పంటలకు మాత్రమే మద్దతు ధరలను ప్రకటిస్తోంది. ఎమ్ఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తే కేంద్రంపై ఏటా రూ. 12 లక్షల కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని నీతి అయోగ్ చెబుతున్న విషయాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి ముఖం చాటేస్తోంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధ్యయనం ప్రకారం... డెయిరీ రంగంలో పాడి రైతులు తమ ఉత్పత్తులకు రిటైల్ ధరలలో 60–70 శాతం పొందగలు గుతున్నారు. మాంసం రిటైల్ ధరలో 60 శాతం పొందుతున్నారు. టమోటా రైతులు 33 శాతం, ఉల్లి రైతులు 36 శాతం పొందుతున్నారు. ఇక పండ్ల విషయానికి వస్తే అరటి పండ్లకు 31 శాతం, మామిడి పండ్లకు 43 శాతం, బత్తాయి, కమల వంటి పండ్లకు 40 శాతం పొందుతున్నారు. మార్కెట్లో కిలో రూ. 50–75 మధ్య పలికే బియ్యం (ధాన్యం) పండించే రైతులకు మాత్రం ఆ ధరలో కనీసం 10–20 శాతం కూడా దక్కని దుఃస్థితి నెలకొంది.రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు 77 జాతీయ నమూనా సర్వే వెల్లడిస్తోంది. ఈ సర్వే ప్రకారం దేశంలో సన్నకారు రైతు కుటుంబాల నెలసరి ఆదాయం సగటున రూ. 10,218 మాత్రమే. రైతు కూలీల సగటు నెలవారీ ఆదాయం రూ. 4 వేలకు మించిలేదు. ఆదాయాలు పెరగకపోవడంతో వారి రుణభారంలో తగ్గుదల కనిపించడంలేదు. వ్యవసాయం గిట్టుబాటు కాక, రుణ భారం తట్టుకోలేక రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు ఏటా పెరుగు తున్నాయి.చదవండి: నీటిలో తేలియాడే రాజధానా?స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత గడచిన 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా... కేంద్రం ప్రకటించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించడమే కాదు... మార్కెట్లో ధర లేని సమయంలో ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్’ కింద మద్దతు ధర దక్కని ఉత్పత్తులను కొను గోలు చేసి మద్దతు ధర దక్కేలా కొంత మేర కృషి చేయగలిగింది ఏపీలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గ్రామస్థాయిలో ఏర్పాటైన ఆర్బీకే వ్యవస్థ, రైతులకు వెన్నుదన్నుగా నిలవగా, వాటికి అనుబంధంగా దాదాపు రూ. 16 వేల కోట్ల అంచనా వ్యయంతో కోల్డ్ స్టోరేజ్లు, కలెక్షన్ రూములు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు బీజం పడింది. మద్దతు ధరల నిర్ణయం, కల్పన, అమలు కోసం జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఏపీ ఫామ్ ప్రొడ్యూస్ సపోర్టు ప్రైస్ ఫిక్సేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టు–2023’కు రూపకల్పన చేసింది. కానీ అధికారుల తీరు వల్ల అసెంబ్లీలో చట్టరూపం దాల్చలేక పోయింది.చదవండి: విద్యారంగంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంఏపీ తయారు చేసిన చట్టాన్ని మరింత పకడ్బందీగా జాతీయ స్థాయిలో తీసుకొస్తే రైతులకు ఎంతోమేలు జరుగుతుంది. ఈ విషయంలో జాప్యం చేసే కొద్దీ మద్దతు ధర దక్కని రైతులు వ్యవసాయానికి మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుత వ్యవసాయ దారుల్లో 60 శాతం మంది లోటు ఉత్పాదకత కారణంగా సాగును వదలి వేయాలని నిర్ణయించుకున్నట్లు దేశంలోని 21 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ఓ జాతీయ సర్వే సంస్థ ఇటీవల తేల్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ దిశగా అడుగులు వేసి ఈ రంగాన్ని బలోపేతం చెయ్యాలి.- తలకోల రాహుల్ రెడ్డి మార్కెట్ ఎనలిస్ట్, కన్సల్టెంట్ -
తెలంగాణ సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థుల మరణాలు ఆగేదెన్నడు?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళలో వరుసగా ఆహారం కలుషిత మైన (ఫుడ్ పాయిజన్) సంఘటనలు, విద్యార్థుల మరణాలు కొనసాగున్నాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపాన్నీ, సౌకర్యాల కల్పనలో వైఫల్యాన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఘటనలన్నిటికీ రాష్ట్ర సర్కారే భాధ్యత వహించాలి. ఈ ఏడాది విద్యాసంవత్సర ప్రారంభం నుంచి నేటి వరకు 500 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం పాలవ్వగా, 42 మంది విద్యార్థుల మరణాలు సంభవించాయి. వీరిలో ఫుడ్ పాయిజన్ వలన అనారోగ్యంతో మరణించిన వారు, బలవన్మరణానికి పాల్పడినవారూ, అనుమానాస్పదంగా మృతి చెందినవారూ ఉన్నారు.ఇదే ఏడాది ఆగస్టు నెలలో తెలంగాణ ప్రభుత్వ సంస్థలైన ఏసీబీ, తూనికలు, శానిటరీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పది బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా 10 హాస్టళ్ళలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ తనిఖీలలో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందడం లేదని గుర్తించారు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వడ్డిస్తున్నారని తెలిసింది. ఎక్కడ కూడా ఆహార మెనూ పాటించడం లేదు. అరటిపండ్లు, గుడ్లు ఇవ్వడం లేదు. హాస్టళ్ళ చుట్టూ ప్రహరీ గోడలు లేవు. వంటశాలలు రేకుల షెడ్లలో కొనసాగుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు నిలువచేస్తున్నారనీ, మరుగుదొడ్లు– బాత్రూంలలో కనీస శుభ్రత లేదనీ, విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగా లేదనీ తేలింది. తాజాగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఈ పర్వం ఇంకా కొనసాగుతున్నదని రుజువవుతోంది. నవంబర్ ఆరవ తేదీన మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినులు ఆరోగ్యం దెబ్బతిన్నది. అక్టోబర్ 30వ తేదీన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 50 మందికి పైగా గిరిజన బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మార్చి 8న జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థినులు, ఆగస్టు 7న మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని తెలంగాణ మైనారిటీ రెసి డెన్షియల్ బాలుర పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.ఆగస్టు 9న జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మార్చి నెల నుంచి నవంబర్ 15 వరకు 200 మంది గురుకుల, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఏప్రిల్ 14వ తేదీన భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 27 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా... 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆగస్టు 22న భువనగిరిలోని ఈ గురుకులాన్ని ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్’ బృందం సందర్శించినప్పటికీ న్యాయం మాత్రం జరగలేదు.చదవండి: విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. పిల్లలకు నాణ్యమైన చదువు దూరం!ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసు కోకపోతే పరిస్థితులు మరింతగా విషమిస్తాయి. ప్రభుత్వం శిక్షణ పొందిన పర్మనెంట్ వంట మనుషులను నియమించాలి. ప్రతి హాస్టల్లో కౌన్సిలింగ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్స్లను నియమించాలి. ఇటీవల పెంచిన మెస్ చార్జీలను వెంటనే అమలు చేసి నాణ్యమైన భోజనాన్ని అందించాలి. వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు మండల స్థాయిలో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ దిశలో ప్రభుత్వం పనిచేసే విధంగా విద్యార్థి – యువజనులు, విద్యార్థుల తల్లి దండ్రులు, ప్రజలు వివిధ రూపాలలో పోరాటాలు కొనసాగించి ఒత్తిడి తేవాలి.– కోట ఆనంద్ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు -
మూసీ ప్రక్షాళన జరగాల్సిందే... మానవీయంగా!
మహా నగరాలకు ఒక ప్పుడు త్రాగు నీటిని అందించిన స్వచ్ఛమైన జల ప్రవాహాలు ప్రస్తుతం కనీసం పుక్కిలించడానికి కూడా వీలులేని కాలుష్య జలాలుగా కదులు తున్నాయి. ఉద్యోగ, ఉపాధి తదితర బతుకు తెరువు కోసం అసంఖ్యాక జనావళి నగరాలకు తరలి రావడంతో మహానగరాలు ఉక్కిరిబిక్కిరి అవు తున్నాయి. పారిశ్రామిక కాలుష్యం, జన జీవనం అందించే దైనందిన కాలుష్యం... నదీ, నదాలలో కలుస్తున్నాయి. పల్లెల నుంచి నగరాల వరకు జనం నీటి శుద్ధి కేంద్రాలపై ఆధారపడి జీవిస్తున్నారు. నిరుపేద జనసామాన్యం నివాస స్థలాలు, త్రాగు నీరు వంటి కనీస సౌకర్యాల కోసం తపిస్తూ మురికివాడల కాలుష్య కూపాలలో మృత్యుసంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనం ఆరోగ్యం, సంక్షేమం గురించి కార్యాచరణ దృష్ట్యా మురుగునీటి పారుదలపై దృష్టి సారించవలసి వస్తోంది.ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవహిస్తున్న దుర్గంధపూరిత కాలుష్య ప్రవాహం కలిగిన మూసీ పునరుజ్జీవం తెరపైకి తెచ్చింది. ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా)... అక్రమ కట్టడాలనే వంకతో పేదలు కష్టించి నిర్మించుకొన్న మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లు కూల్చడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు ఆగ్రహంతో ప్రభుత్వ అమానవీయతపై విరుచు కుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ కొరియా సియోల్ నగరం నమూనాలో పథకం అమలుకు ఆలోచిస్తోంది. మూసీ జలాల ప్రక్షాళనను పర్యాటక ఆదాయాభివృద్ధికి ముడి పెట్టడం ప్రతిపక్షాల విమర్శలకు దారి తీస్తోంది.గుజరాత్లోని అహ్మదాబాద్ నగరానికి ఆను కొని ఉన్న సబర్మతి నది... నగరానికి ఒకప్పుడు త్రాగునీటిని అందించి క్రమేపీ మురికి కాలువగా మారింది. అయితే నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ దృఢ దీక్షా సంకల్పంతో మళ్లీ కాలుష్యరహిత జలవాహినిగా రూపొందింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు సాగాలి.రెండు దశాబ్దాల క్రితం సబర్మతీ ప్రక్షాళన ప్రాజెక్ట్ చేపట్టక ముందే... గుజరాత్ ప్రభుత్వం, పది వేల కుటుంబాలకు పునరావాసం కల్పించింది. అహ్మదాబాద్లో 11.5 కి.మీ. పరిధిలో క్రమేపీ చేపట్టిన అభివృద్ధి పథకాలు సబర్మతీ నదీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దాయి. 1917 నాటి సబర్మతీ ఆశ్రమం, మహాత్ముని స్మృతి చిహ్నంగా ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపొందింది.తెలుగు రాష్ట్రాలు గోదావరి, కృష్ణా వంటి భారీ నదుల వరదకే కాకుండా... బుడమేరు, మానేరు వంటి వాగులు, ఉపనదులకూ వచ్చే వరదలూ; నగరాలను ఆనుకుని ప్రవహించే నదుల కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వాధినేతలు ఆ నదులను బాగుచేయడం ద్వారా ఆ యా ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధిని సాధించి ఆదాయం పొందడం తప్పు కాదు. అయితే ఈ అభివృద్ధి పేరుతో నిరుపేదలను బజారుపాలు చేసి కన్నీళ్ల సముద్రంలో ముంచడం సమంజసం కాదు.చదవండి: అకస్మాత్తుగా ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నగర రూపకల్పనలో లండన్, సింగపూర్ వంటి నమూనాల ప్రస్తావన ఉంది. తెలంగాణ మూసీ రివర్ ఫ్రంట్లో సబర్మతిని గుర్తు చేసే ‘బాపు ఘాట్’ ప్రస్తావన ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని అపురూప అత్యున్నత గాంధీజీ శిలా విగ్రహం నెలకొల్పే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు... ఇబ్బడిముబ్బడి సుస్థిర పర్యాటక రంగ ఆదాయాన్ని ఆశిస్తోంది. ఏది ఏమైనా ప్రతి రోజూ సుమారు 200 కోట్ల లీటర్ల నగరాల మురికినీరు, అంతకంటే ప్రమాద భరితమైన పారిశ్రామిక రసాయన వ్యర్థాల కాలుష్య జలాలతో లక్షలాది జనానికి మృత్యు స్పర్శ అందించే మూసీ కాలుష్యాన్ని నిర్మూలించే పునరుజ్జీవ సత్సంకల్పం సాధ్యం చేయగలిగితే, జన జీవన సౌభాగ్యానికి కంకణం ధరించినట్టే!- జయసూర్యసీనియర్ జర్నలిస్ట్ -
అమరావతికి తరలించడం సమంజసమేనా?
ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వ చర్యలూ, దాని ప్రాధాన్యతలపై సహజంగానే ప్రజలకు ఆసక్తి ఉంటుంది. కర్నూలు నుంచి న్యాయ సంస్థలు– ‘లోకాయుక్త’ మానవ హక్కుల కమిషన్, సీబీఐ కోర్టు, ఉన్నత ‘లా’ విద్యాసంస్థలు వంటి వాటిని అక్కడ నుంచి ‘అమరావతి’కి తరలిస్తున్నట్టు, స్థానికులు ఆందోళన చేస్తున్నట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో... గత పదేళ్ల పరిణామాల సమీక్ష తప్పడం లేదు.ఈ విషయంలో మొదట ఒకమాట అనుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం బాగుంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఎందుకు రెండుగా విభజించబడింది అనే విషయంలో పదేళ్ళ తర్వాత అయినా మనకు స్పష్టత అవసరం. ఇక్కడ రాష్ట్రాల్లో అయినా అక్కడ ఢిల్లీలో అయినా ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వంలోకి ప్రవేశించే ‘లెజిస్లేచర్’ కాకుండా, శాశ్వతమైన ‘ఎగ్జిక్యూటివ్’ అనే శక్తిమంతమైన వ్యవస్థ మరొకటి ఉంది. ఈ రెండింటిపై ‘జ్యుడిషియరీ’ ఉంది. ప్రభుత్వాలు ఉనికిలో లేని విరామాల మధ్య కూడా వాళ్ళు అధికారంలో ఉంటారు. అప్పటి ముఖ్యమంత్రి కె. కిరణ్కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే, 2014 ఫిబ్రవరి 20 నుంచి జూన్ 8 వరకు రాష్ట్రం ‘గవర్నర్ పాలన’లో ఉంది. దేశ ప్రాదేశిక భద్రత విషయమై గురుతరమైన బాధ్యత ఈ వ్యవస్థలకు ఉంటుంది. పరిపాలనలో కేంద్ర– రాష్ట్ర సంబంధాలు ఢిల్లీలో ‘హోమ్’శాఖ వద్ద ఎందుకు ఉంటాయో మనకు అర్థం కావాలి. అలాగే, 2014 మొదట్లో ‘యూపీఏ–2’ ప్రభుత్వంలో ఢిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలయినప్పుడు; అధికారుల కమిటీ కాకుండా, ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎందుకు అధ్యక్షుడుగా ఉన్నారో మనకు అర్థం కావాలి. అటువంటి గ్రహింపుతో మొత్తంగా భారత ప్రభుత్వం సమగ్రమైన తూర్పు దృష్టి (లుక్ ఈస్ట్) ‘డ్రైవ్’ అంతా కేవలం ఆగ్నేయ ఆసియా వైపు ఎందుకు ఉందో కూడా మనకు తెలియాలి. కీలకమైన కేంద్ర మంత్రిత్వశాఖలు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఎందుకు తమ కార్యకలాపాల వేగాన్ని పెంచుతున్నాయో మనకు తెలియాలి. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణం రాష్ట్ర రాజధాని ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. అది రాష్ట్ర పరిధిలోని అంశం. దానితో పనిలేకుండా కేంద్రం 2022 అక్టోబర్ నాటికి కాకినాడ వద్ద ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్’ సౌత్ ఇండియా కేంపస్ తెచ్చింది. మార్చి 2024 నాటికి బాపట్ల సమీపాన ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ దళాల కోసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పడింది. ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గ నైజేషన్’ (డీఆర్డీఓ) రూ. 100 కోట్లతో ‘మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్’ మచిలీ పట్టణం సమీపాన నాగాయలంక దగ్గరలోని గుల్లలమోద వద్ద నిర్మి స్తున్నది. గత ప్రభుత్వంలో జరిగిన పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా బాపట్ల–బందరు రెండూ కూడా విజయవాడ, గుంటూరు నగరాలతో సంబంధం లేని సొంత కలెక్టరేట్లతో జిల్లా కేంద్రాలుగా మారాయి.చదవండి: శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!కేంద్ర ఆర్థికశాఖ అనంతపురం జిల్లాలో ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్’ వంటి దేశంలోనే అత్యున్నత స్థాయి శిక్షణా సంస్థను 2022 నాటికి బెంగళూరు సమీపాన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించింది. అదే కాలానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అనంతపురం జిల్లా నుంచి పుట్టపర్తి ప్రాంతాన్ని వేరుచేసి; సత్యసాయి జిల్లా పేరుతో కొత్తగా మరో జిల్లా ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఈ సంస్థ ఆ కొత్త జిల్లాలో ఉంది. మరి వీటిలో దేన్నైనా ఇది ఇక్కడ కాదు, అని మరొకచోటికి తరలించే ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ; లేదా ‘కూటమి’లో భాగస్వామి అయిన బీజేపీ నడుపుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎందుకు అనడం లేదనే సందేహం మనకు రావాలి. అప్పుడు ఐదేళ్ళ ప్రభుత్వాల అవసరాల కంటే, విస్తృతమైన దేశప్రయోజనాల కోసం కేంద్రంలో – రక్షణ, వాణిజ్యం, ఉపరితల రవాణా, రైల్వే, స్పేస్ సైన్స్, వంటి కొన్ని మంత్రిత్వశాఖల్లో– ‘ఏపీ’ కోసం ఒక ప్రత్యేకమైన ‘ప్లానింగ్’ ఎందుకు జరుగుతున్నది? అనే ప్రశ్న వైపుకు అవి మనల్ని మన రాష్ట్రం ‘జాగ్రఫీ’ వైపుకు తీసుకువెళతాయి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?అయితే, జరిగినవి ఏవీ గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం మనపట్ల ప్రేమతో చేయలేదు. ‘మెతుకు ముట్టుకుంటే అన్నం సోకు తెలుస్తుంది’ అన్నట్టుగా, రాష్ట్ర విభజన జరిగి ఆ ‘షాక్’ నుంచి ఇంకా మనం కోలుకోక ముందే 2014 మధ్యలోనే బందరు వద్ద భూమి కూడా ఎంపిక చేసిన ‘మెరైన్ పోలీస్ అకాడమీ’ని ఇక్కణ్ణించి ఉత్తరాదికి వారు తరలించారు. అదే ఏడాది డిసెంబరులో ‘ఏపీ’కి కూడా మరొక ‘అకాడమీ’ ఇస్తున్నాం అన్నారు. ఇప్పటికి అటువంటిది ఏమీ లేదు. జరుగుతున్నవి అన్నీ ఇటీవల కొత్తగా వాడుకలోకి వచ్చిన ‘జియో – పాలి టిక్స్’లో భాగంగా దేశ ప్రాదేశిక అవసరాల మేరకు ‘బ్యురోక్రసీ’ స్థాయిలో జరుగుతున్న విధాన నిర్ణయాలు. ఇంతటి సమగ్రమైన వైశాల్యంతో మారిన కొత్త ‘మ్యాప్’లోని రాష్ట్రాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వం చూడగలిగినప్పుడే, ఇక్కడ అది అమలు చేయాల్సిన స్వల్పకాలిక – దీర్ఘకాలిక ‘ప్లానింగ్’ ఎలా ఉండాల్సిందీ దానికి అర్థమవుతుంది. అప్పుడు ఈ మొత్తంలో – ‘రాజధాని’ అనే అంశానికి ఉన్న జాగా ఎంతో కూడా మనకు అర్థమవుతుంది.- జాన్సన్ చోరగుడి అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం
‘ఈ స్పృహ ఈనాటిది కాదు. దీనికి యాభయ్యేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. మానవకారక కాలుష్యాల వల్ల ముంచుకొస్తున్న ముప్పు పర్యావరణ మార్పు దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయం చేయాలన్నది ఒప్పందం. అంతే తప్ప, ఆ పేరుతో పెట్టుబడుల్ని సాయంగా చూపి వ్యాపారం చేయడం కాదని ఇవాళ మనం నిర్దిష్టంగా డిమాండ్ చేస్తున్నాం. పదమూడేళ్ల కింద (2011 కోపెన్హాగెన్) మీరే అంగీకరించి, సంసిద్ధత ప్రకటించినట్టు ఏటా ఇవ్వాల్సిన లక్ష కోట్ల డాలర్ల పర్యావరణ ఆర్థిక సహాయాన్ని మీ మీ వ్యాపారాల వృద్ధికి బంగారు బాట చేసుకోకండి’ అని తాజాగా భారత్ స్పష్టం చేసింది. అజర్బైజాన్లోని ‘బాకు’లో ‘కాప్–29’ సదస్సు జరుగుతున్న సందర్భంలో భారత్ ఈ ప్రకటన వెలువరించింది. ఇవాళ 140 కోట్ల మానవ వనరుల శక్తిగా, మార్కెట్ ప్రపంచానికి గమ్యస్థానంగా ఉన్న భారత్, శాసించాల్సిన చోట నామమాత్రపు పాత్రకే పరిమితమౌతోంది. కారణం, పర్యావరణ స్పృహ, దూరదృష్టి, ప్రపంచ దృక్పథం కలిగిన నాయకత్వం లేకపోవడమేనన్నది కొట్టొచ్చినట్టు కనిపించే వాస్తవం. యాభై ఏళ్ల కింద, నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ చూపిన పర్యావరణ దృక్పథం, చేసిన ఆలోచనలు కాలం కన్నా ఎంతో ముందున్నాయి. తదుపరి అయిదారు దశాబ్దాల్లో అభివృద్ధి– పర్యావరణ పరిరక్షణ మధ్య తలెత్తబోయే ఘర్షణను గుర్తించారు. ఇదే విషయమై సంపన్న–పేద దేశాల మధ్య బంధాలకు సరికొత్త నిర్వచనాల అవసరాన్ని ఆమె సహేతుకంగా అంచనా వేశారు. అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను అవసరాలకూ, దామాషాకూ మించి కొల్లగొట్టడాన్ని పర్యావరణ నేరంగానే చూశారామె! విఘాతం కలిగించిన వారే మూల్యం/ నష్టపరిహారం చెల్లించాలన్న ఆలోచనకు ఆమె నాడే బీజం వేశారు. భారతదేశపు పర్యావరణ దృక్పథానికి, భావధారకు మూలాలు 1971–72 నాటి పాలకుల ఆలోచనల్లో, కేంద్ర ప్రభుత్వ చర్యల్లో కనిపిస్తాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న వివిధ నిర్ణయాలు, చేపట్టిన పలు చర్యలు దీన్ని ధ్రువీకరిస్తాయి. స్వీడన్ వినతి మేరకు ఐక్యరాజ్యసమితి చొరవతో మొదటి ప్రపంచ పర్యావరణ సదస్సు స్టాక్హోమ్లో 1972 జూన్లో జరిగింది. కానీ, అంతకు ముందే 1972 ఫిబ్రవరిలోనే ‘పర్యావరణ ప్రణాళిక–సమన్వయ జాతీయ కమిటీ’ (ఎన్సీఈపీసీ) భారత్లో ఏర్పాటయింది. దీని ఏర్పాటుకు ఇంది రాగాంధీ చొరవ కారణం. ఆ కమిటీయే 1985లో కేంద్ర ‘పర్యావరణ అటవీ మంత్రిత్వ’ శాఖగా రూపాంతరం చెందింది. 1971 డిసెంబరులో ఆమె సిమ్లాలో ఉన్నారు. పాక్తో యుద్ధం, బంగ్లాదేశ్ అవతరణ తర్వాతి పరిణామాల్లో... పాకిస్తాన్ ప్రధాన మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోతో ఆమె దౌత్య చర్చలు జరుపుతున్నారు. అంతటి ఒత్తిడిలోనూ, సిమ్లా నుంచే ఆమె బిహార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అభివృద్ధి పేరుతో చేపట్టిన ఒక ప్రాజెక్టుకు అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం బదలాయిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందనీ, అది పర్యావరణానికి హాని చేసే తప్పుడు చర్య అవుతుంది కనుక ఉపసంహరించుకోవాలనీ ఆ లేఖలో పేర్కొన్నారు.దక్షిణ ప్రపంచానికి గొంతిచ్చిన వైనంస్టాక్హోమ్ పర్యావరణ వేదికను ఇందిరాగాంధీ ఎంతో వ్యూహాత్మకంగా, ప్రభావవంతంగా వాడుకున్నారు. అక్కడ ఆమె ఒక అరుదైన ఆలోచనాత్మకమైన ప్రసంగం చేశారు. ఆతిథ్య స్వీడన్ కాకుండా ఆమె ఒక్కరే దేశాధినేత హోదాలో ‘ప్లీనరీ ప్రసంగం’ చేశారు. ‘ఆ సదస్సు తర్వాత పదేళ్లకు పైగా ఆ ఊపు ఆమెలో కనిపించింది. దాని ఫలితంగానే, ఇప్పటికీ దేశంలో గొప్ప రక్షణాయుధాలుగా ఉన్న పలు ప్రగతిశీల అటవీ, వన్యప్రాణి–సహజవనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఆ కాలంలోనే వచ్చాయ’ని ఆమె సమకాలికులైన ప్రభుత్వాధికారులు ఆయా సందర్భాల్లో వ్యాఖ్యానించేవారు. స్వల్ప జనాభా ఉన్న సంపన్న దేశాలు సౌఖ్యాలకు మరిగి, అసాధారణ స్థాయిలో ప్రకృతి సహజ వనరుల్ని కొల్లగొడుతూ చేస్తున్న పర్యావరణ హానిని ఆమె సోదాహరణంగా ఎండ గట్టారు. అభివృద్ధి–పర్యావరణ ఘర్షణను విడమర్చారు. కాలుష్య నివారణ కోసం విధించే కట్టుబాట్లు వెనుకబడ్డ దేశాల ప్రగతికి ప్రతిబంధకం అయ్యే తీరును ఎత్తిచూపడమే కాక ‘కాలుష్య కారకులే నష్టాల మూల్యం చెల్లించాల’నే వాదనను తెరపైకి తెచ్చి, మూడో ప్రపంచ దేశాల గొంతుకయ్యారు. ‘పర్యావరణ వాదననే మనం నెత్తికెత్తుకుంటే... యుద్ధం, పేదరికం వంటి సంక్షోభాలు అప్రాధాన్యమవుతాయేమో?’ అంటూ సదస్సు చైర్మన్గా ఉన్న యూఎన్ ప్రతినిధి మౌరిస్ స్ట్రాంగ్ వ్యక్తం చేసిన భయాన్ని ఆమె తిప్పికొట్టారు. ‘ప్రకృతి పరిరక్షణ’ అనేది అభివృద్ధి–పేదరిక నిర్మూలన బాధ్యతకు వ్యతిరేకం కాదనీ, అదే వారి జీవనప్రమాణాల వృద్ధికి దోహదపడుతుందనీ ఆమె అదే వేదిక నుంచి స్పష్టం చేశారు. సంపద, హోదా, అధికార పరంగా మనమెంత బలిష్టులమైనా, పర్యావరణ మార్పు విపరిణామాలకు ప్రభావితులం కాకుండా తప్పించు కోజాలమని ఆనాడే హెచ్చరించారు.పర్యావరణ స్పృహగల వారిప్పుడు వాడుతున్న ‘ఒకే పృథ్వి’ ‘జీవులున్న ఏకైక గ్రహం’ వంటి మాటల్ని ఇందిరా గాంధీ 70లలోనే వినియోగించారు. ‘ప్రపంచం ఏ మూల నుంచో తరచూ సమాచారం అందుతోంది, దేశం వెనుక దేశం అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసానికి తెగిస్తోంది, ఇలా సాగితే దీనికి ముగింపేమిటి?’ అని ఆమె ప్రశ్నించారు. సాటి మనుషుల్ని రక్షించడం, దోషుల్ని శిక్షించడమే కాదు, సకల జీవుల పట్ల కరుణతో ఉండాలని బుద్ధుడు, అశోకుడు 2 వేల ఏళ్ల కింద ఏర్పరచిన బాట, భారతీయ సంస్కృతిని ఆమె స్టాక్హోమ్ వేదిక నుంచి జగతికి వినిపించారు. అతి పురాతనమైన రుగ్వేదాన్ని ఉటంకిస్తూ ఇందిరాగాంధీ ఆనాడు స్టాక్హోమ్లో చెప్పిన ‘ప్రకృతి నుంచి తీసుకున్నంత, తిరిగి వెనక్కి ఇవ్వటం మానవ ధర్మం’ అన్న మాట, మనమంతా ఆచరించాల్సిన అక్షరసత్యం!- దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్(నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి) -
శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!
వర్తమానంలోని అనేక సమస్యలకు చరిత్రలోనే మూలాలు ఉంటాయి. అటువంటి చరిత్రను పనికిమాలినదిగా భావించిన పాలకుల హయాంలో సమస్యలకు పరిష్కారాలు ఎలా లభిస్తాయి? కరవుకాటకాలతో వెనుకబడి పోయిన రాయలసీమ వెతలు ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన ‘శ్రీబాగ్ ఒడంబడిక’లోని అంశాలను చిత్త శుద్ధితో అమలుకు ప్రయత్నించకపోవడమే ఈ నాటి రాయలసీమ దుఃస్థితికి ప్రధాన కారణం. ఒడంబడిక ప్రకారం దక్కిన రాజధాని ఎటూ చెయ్యి దాటిపోయింది. కనీసం అభివృద్ధికి కీలకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నా పూర్తవుతాయా?శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ ప్రజల భావోద్వేగాలతో పెనవేసుకున్న అనుబంధం. తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర అవతరణకు మూలం. పాలకుల నిరాదరణకు గురైన ఈ ఒడంబడికకు నేటికి 87 సంవత్సరాలు. అప్పట్లో ప్రస్తుత తెలంగాణ నైజాం నవాబు పాలనలో ఉండేది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. భాషాభిమానం, రాజకీయ కారణాలతో తమిళుల ఆధిపత్యంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలనే ఆలోచన మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలలో వచ్చింది. ఈ క్రమంలో 1913 (బాపట్ల)లో తొలి ‘ఆంధ్ర మహాసభ’ జరిగింది. అది భాష, సాంస్కృతిక వికాసం కోసం పరితపించిన వేదిక అయినా... అంతర్లీనంగా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు ప్రాంతం విడిపోవాలని దీని నిర్వాహకులకు ఉండేది. కారణాలు ఏమైనా రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతినిధులు ప్రారంభంలో సమావేశాలకు హాజరు కాలేదు. అయితే రాయలసీమ భాగస్వామ్యం లేకుండా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి వేరుపడటం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ఆంధ్ర మహాసభ పెద్దలు సీమ ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడం కోసం 1917లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సీమలో పర్యటించిన అనంతరం జరిగిన సభలలో సీమ ప్రాంత ప్రతినిధులు పాల్గొన్నారు.మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోవాలన్న మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలతో సీమ ప్రాంత పెద్దలు గొంతు కలపలేదు. కారణం అప్పటికే ఆంగ్లేయుల పాలనలో ఉన్న ఆ ప్రాంతం... విద్యాపరంగా అభివృద్ధి చెందింది. అలాగే కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీల వల్ల సీమతో పోల్చుకుంటే అభివృద్ధిలో ముందు ఉన్నది. సమీపంలో ఉన్న మద్రాసు నగరాన్ని వదులుకుని అప్పటికే అభివృద్ధిలో మెరుగ్గా ఉన్న కోస్తా ఆంధ్రతో కలిసి రాష్ట్రంగా ఏర్పడటం సీమ పెద్దలకు ఇష్టం లేదు. ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో జరిగిన అనుభవా లతో అనుమానాలు పెరిగాయి. 1926 ఆంధ్రమహాసభ ఆంధ్రా యూనివర్సిటీనీ వెనుకబడిన అనంతపురంలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. మద్రాసు శాసనసభలో ఈ అంశంపై జరిగిన తీర్మానంలో తమిళ శాసన సభ్యులు పాల్గొన వద్దని ఆనాటి ముఖ్యమంత్రి సూచించారు.వాస్తవానికి ఆంధ్ర మహాసభ తీర్మానం ప్రకారం... కోస్తా, సీమ సభ్యులు అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు ఓటు వేయాలి. అందుకు భిన్నంగా మధ్య కోస్తా సభ్యులు విజయవాడలో ఏర్పాటు చేయాలని ఓటు వేశారు. అయితే ముఖ్యమంత్రి సూచనను పక్కన పెట్టి తమిళ శాసన సభ్యులు కొందరు సీమ సభ్యులకు అనుకూలంగా ఓటు వేయడంతో 25 – 35 ఓట్లతో అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు తీర్మానం చేశారు. ఆంధ్ర మహాసభ తీర్మానం, అసెంబ్లీ ఆమోదాన్ని కాదని విశాఖలో ఏర్పాటు చేసి తొలి ఉప కులపతిగా రాయలసీమ వారికి అవకాశం ఇచ్చారు. ఈ పరిణామంతో పప్పూరి రామాచార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి లాంటి వారు... ‘ఉంటే మద్రాసుతో కలిసి ఉందాము లేకపోతె రాయలసీమ రాష్ట్రంగా (ప్రస్తుతమున్న సీమ నెల్లూరు ప్రకాశం జిల్లా, కర్ణాటక లోని బల్లారితో సహా) విడిపోదాం’ అని ప్రతిపాదన చేశారు.ఇదంతా గమనిస్తున్న ఆంధ్రమహాసభలోని పెద్దలు చర్చల నిమిత్తం రెండు ప్రాంతాల సభ్యులతో ఒక కమిటీని నియమించారు. 1937 నవంబర్ 16న మద్రాసు నగరంలోని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం (శ్రీబాగ్)లో కమిటీ సమావేశమయ్యింది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం అవతరించిన తర్వాత పాలనా ప్రాధాన్యతలపై ఒక ఒప్పందం చేసుకున్నారు. అదే ‘శ్రీబాగ్ ఒడంబడిక’. కోస్తా, సీమ ప్రజల పోరాటం... మరో వైపు పొట్టి శ్రీరాములు దీక్ష–ఆత్మార్పణల ఫలితంగా భారత దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న అవతరించింది.శ్రీబాగ్ ఒడంబడికలోని ముఖ్యాంశాలు:1. ఒక ప్రాంతంలో రాజధాని, మరో ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. ఎంపిక చేసుకునే హక్కు రాయలసీమకు ఉండాలి. 2. కృష్ణా, తుంగభద్రలలో నీటి వినియోగంలో రాయలసీమకు వాటా కేటాయించాలి. అందుకనుగుణంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. 3. రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వాన్ని సాధించేందుకు విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆంధ్రా యూనివర్సిటీ కింద ఒక కేంద్రాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయాలి. 4. జనాభా లెక్కల ప్రకారం కాకుండా సీమ, కోస్తా ఆంధ్రకు సమానంగా నియోజక వర్గాల ఏర్పాటు చేయాలి.ఈ ఒప్పందం ప్రకారం 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. కానీ, 1956లో తెలంగాణను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడంతో రాజధాని రాయలసీమ నుంచి తెలంగాణకు మారింది. అలా శ్రీబాగ్ ఒప్పందానికి తూట్లు పడటం ప్రారంభమయ్యింది. రాయలసీమ అభివృద్ధిలో అతి ముఖ్యపాత్ర పోషించే నీటి ప్రాజెక్టులనన్నా పూర్తి చేస్తున్నారా అంటే అదీ జరగడం లేదు. అదేమంటే శ్రీబాగ్ ఒప్పందానికి చట్టబద్ధత లేదనీ, అది కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందం అనీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తు న్నారు. నాటి కాంగ్రెస్ విభిన్న అభిప్రాయాలు ఉన్నవారి సంగమం. కమిటీ సభ్యులు కాంగ్రెస్లో ఉన్నంత మాత్రాన ఈ ఒప్పందం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా తేల్చడం సమంజసమేనా?చదవండి: హానికరమైన కొత్త జాతీయవాదంమద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం విడిపోవడంలో సీమ ప్రజల త్యాగం ఉన్నది. ప్రస్తుత సీమలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన వారికి ఇప్పటికీ హైదరాబాద్ కన్నా చెన్నై నగరంతోనే అనుబంధం ఎక్కువ. తెలుగు రాష్ట్రం కావాలనే కోరిక పుట్టిన ప్రారంభంలోనే... తమిళులు మదురై కేంద్రంగా తమిళ రాష్ట్రం కోసం తీర్మానం చేశారు. దీనికి కారణం ఎప్పటికైనా చెన్నై తెలుగు వారిదే అవుతుందేమో అని వారి ఆలోచన. నిజానికి పప్పూరి రామా చార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి ప్రతిపాదన ప్రకారం రాయలసీమ రాష్ట్రం ఏర్పడి ఉంటే (ప్రస్తుత రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బళ్ళారి, చెన్నై సమీప జిల్లాలతో కలిపి) చెన్నై మహానగరం మనదే అయ్యేది. దీన్నిబట్టి సమీపంలోని చెన్నై నగరాన్ని వదులుకుని తెలుగు రాష్ట్రం కోసం సీమ ప్రజలు త్యాగం చేశారని అర్థం చేసుకోవాలి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం కారణంగా శ్రీబాగ్ ఒప్పందం అంటే రాయలసీమకు రాజధాని మాత్రమే ఆన్న ప్రచారం జరుగుతోంది. ఇది సరికాదు. మరి నీటి ప్రాజెక్టుల సంగతేమిటి? శ్రీశైలం ప్రాజెక్టు నీటిని సత్వరం అందిపుచ్చుకునే విధంగా సిద్ధేశ్వరం ఆలుగునూ, పోతిరెడ్డి పాడునూ వెడల్పు చేయడం; రాయలసీమ ఎత్తిపోతల పథకం, తుంగభద్ర నీటిని ఉపయోగించుకునే విధంగా గుండ్రేవుల, కుందూపై రిజర్వాయర్లు నిర్మించడం; గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం; చెరువుల పునరుద్ధరించడం వంటి చర్యలే రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం. అందుకే రాయలసీమ సమగ్రాభివృద్ధి జరగాలి అంటే కచ్చితంగా శ్రీబాగ్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్రలపై సీమ ప్రాంత సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి అనుగుణంగా పై ప్రాజెక్టులు పూర్తి చేయాలి.శ్రీబాగ్ ఒడంబడికలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్ర నీటిని సీమకు అందించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. శ్రీబాగ్ ఒప్పంద స్ఫూర్తితో సీమ సమాజం ఇందుకోసం ముందుకు సాగాలి.- మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త -
‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
మహానది–గోదావరి నదుల మధ్య విస్తరించి యున్న భూభాగమే కళింగాంధ్ర. ఈ కళింగాంధ్రలోని అంతర్భాగం ఉత్తరాంధ్ర. ఇది ఇచ్ఛాపురం నుండి పాయకరావుపేట వరకు వ్యాపించి ఉంది. విస్తారమైన కొండకోనలు, అటవీ భూములు గల పచ్చని ప్రాకృతిక ప్రదేశం. ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడే తత్వం గలవారు. మైదాన, గిరిజన, మత్స్యకార ప్రజల శ్రమతో సృష్టించబడిన సంపద పెట్టుబడి వర్గాల పరమౌతున్నది. దాంతో ఇక్కడి ప్రజలు అనాదిగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రాంతం వెనుకబడినది అనేకంటే, వెనుకకు నెట్టి వేయబడిందన్నమాట సబబుగా ఉంటుంది.ఒక వ్యక్తి కాని, ఒక సమూహం కాని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవనోపాధి నిమిత్తం కాల పరిమితితో సంబంధం లేకుండా వెళ్లడాన్ని వలస అనొచ్చు. అనాదిగా ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవిస్తున్న ప్రధాన సమస్య ‘వలస’. ఇలా వలస వెళ్లినవారు ఆయా ప్రాంతాల్లో అనేక ఇడుములు పడటం చూస్తున్నాం. వీరికి ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు? మరో ముఖ్య సమస్య ఈ ప్రాంత భాష–యాస, కట్టు– బొట్టుపై జరుగుతున్న దాడి. నాగరికులుగా తమకు తాము ముద్రవేసుకొన్నవారు ఆటవికంగా ఉత్తరాంధ్ర జనాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషోద్యమంలాగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక భాషోద్యమం రావాలి. ఈ ప్రాంత వేషం–భాష అధికారికంగా అన్నిటా చలామణి కావాలి. తగువిధంగా గౌరవం పొందాలి. తెలంగాణ సాహితీవేత్తల వలె ఈ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు తమ మాండలిక భాషా సౌరభాలతో సాహిత్యాన్ని నిర్మించాలి.అనాదిగా ఈ ప్రాంతం పారిశ్రామికీకరణకు చాలా దూరంలో ఉంది. ఒక్క విశాఖపట్నం, పైడిభీమవరం తప్పితే ఎక్కడా పరిశ్రమల స్థాపన లేదు. ఉత్తరాంధ్ర అంతటా వ్యవసాయధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన ఎక్కువగా జరగాల్సి ఉంది. అయితే రెడ్ క్యాటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమల స్థాపన మాత్రం జరుగుతోంది. ఇవి ఉత్తరాంధ్ర ప్రజల జీవనానికి, మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఇండస్ట్రీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శతశాతం పూర్తయినవి దాదాపుగా లేవు. విశాఖ రైల్వే జోన్ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ఉత్తరాంధ్ర అంతట మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రహ దారుల నిర్మాణం పెద్ద యెత్తున జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ అడవి బిడ్డలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురై తీవ్ర అనారోగ్యం పాలౌతున్నారు. ఈ కొండకోనల్లో, అడవుల్లో విలువైన అటవీ సంపద ఉంది. అందువల్ల ఈ భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. 1/70 చట్టం అమలు సక్రమంగా జరగాలి. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉంది. దీనితో వచ్చే ఆదాయం గిరిపుత్రుల సంక్షేమానికే వినియోగించాలి. ఇక్కడ భూగర్భ జలాలలో కాల్షియం, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. కిడ్నీ, ఎముకల వ్యాధులతో తరచూ బాధపడటం చూస్తాం. అందువల్ల ఇక్కడి ప్రజలకు మంచినీరు అందివ్వాలి. నిర్మాణంలో ఉన్న పోర్టులను, హార్బర్లను వేగవంతం చేయాలి.చదవండి: రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనాకార్మికులలో 90 శాతానికి పైబడి అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో భవన నిర్మాణ రంగంలోనే అధికంగా ఉన్నారు. వీరి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులు మెరుగవ్వాలంటే, విభజన చట్టం సెక్షన్ 94(3)లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. అది వెనుకబడిన బుందేల్ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో ఉండాలి.చదవండి: మంచి పనిని కించపరుస్తారా?ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఈ పట్టణం ఇతర ప్రాంతాల పెట్టుబడి వర్గాల గుప్పిట ఉంది. విశాఖను మాత్రమే అభివృద్ధి చేస్తే ఒనగూరే లాభమేమిటి? నిజంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడుతుందా అనేది మాత్రం శేషప్రశ్నే. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి గతంలో జరిగిన వివిధ వామపక్ష, అస్తిత్వ జీవన పోరాటాల వలె మరికొన్ని ఉద్యమాలు రావాల్సి ఉందేమో!- పిల్లా తిరుపతిరావు తెలుగు ఉపాధ్యాయుడు -
మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని..
మానవ సమాజ పరి ణామ క్రమంలో పుట్టుకు వచ్చిన పెట్టుబడిదారీ వ్యవ స్థలో... యజమాని, కూలి వంటి వర్గాలు ఏర్పడ్డాయి. వర్గాల మధ్య అంతర్గత మైన అణచివేతలు, దోపిడీ కొనసాగింది. రైతులు, కూలీలు చేసిన ఉత్ప త్తులను యాజమానులు సంపదగా మలుచుకొని దోపిడీకి తెగబడ్డారు. మానవ సమాజాన్ని కారల్ మార్క్స్ అధ్యయనం చేసి దోపిడీ చేసే వర్గం సమాజంలో తక్కువగా ఉన్నదనీ, దోపిడీకి గురయ్యే వర్గం ఎక్కువగా ఉన్నదనీ చెప్పాడు. దోపిడీకి గురైన వారు ఐక్యంగా ఉండి తిరగ బడినప్పుడు మాత్రమే దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపాడు. దానికి మొదటగా 1848లో మొదటి ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ప్రవేశ పెట్టాడు. మానవ కల్యాణానికి వర్గ రహిత సమాజ నిర్మాణానికి కారల్ మార్క్స్ కృషి చేశాడు.1895 అమెరికాలోని షికాగో నగరంలో అణచి వేయబడిన కార్మికులు... తడిచిన రక్తంలో తడిచిన కండువాను ఎర్రజెండాగా ఎగురవేసి కార్మికుల హక్కులకై పోరాటం చేశారు. ఈ ఉద్యమం అణచివేత, ఆవేదన, దోపిడీ నుండి పుట్టుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వామపక్ష పార్టీలు విస్తరించాయి. ఈ విస్తరణలో భాగంగా శ్రీలంకలో వామపక్ష పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్లోని అన్ని వామ పక్షాలూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని గుర్తించాలి.భారతదేశం విభిన్న కులాలు, మతాలు, సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ వామపక్ష భావజాలా నికి స్థానం ఉంది. అయితే విస్తరించడానికి అడ్డంకులు ఉన్నాయి. భారతదేశంలో 1925లో కమ్యూ నిస్టు పార్టీ (సీపీఐ) స్థాపన జరిగింది. అయితే సిద్ధాంతపరమైన విభేదాల వలన ఇది అనేక పార్టీలుగా చీలిపోయింది. 1952లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడాలి. కానీ కుల, మత పార్టీలు పుట్టుకొచ్చాయి. భారతదేశంలో కమ్యూనిస్టులు శ్రమజీవుల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడ్డారు. కమ్యూనిస్టులు పోరాటాల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య పద్ధతులలో హక్కులను పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వామపక్ష పార్టీలలో మావోయిస్టులు తుపాకీ గొట్టం ద్వారానే హక్కులను సాధించుకుందామనే ఆలోచనతో పోరాటం చేస్తున్నారు. వారు చేస్తున్న పోరాట రూపం తప్పు కావచ్చు. కానీ లక్ష్యం సరైనదే.నరేంద్రమోదీ, అమిత్షాలు వామపక్ష పార్టీలే ప్రధాన బద్ధశత్రువులుగా చూస్తున్నారు. వామపక్ష భావాలు కలిగిన వారిపై ఉపా, రాజద్రోహం కేసులు పెడుతూ బెయిల్ రాకుండా సంవత్సరాల తరబడి జైల్లోనే ఉంచటం చూస్తున్నాము. ఇప్పుడు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా వందలమంది మావోయిస్టులను బలిగొంటున్నారు. వచ్చే ఏడాదికి నక్సలైట్లను నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనలు ఇస్తున్నారు. దానికి కారణం భారతదేశంలో వామపక్ష పార్టీలు లేకుండా చేయాలనే దుర్బుద్ధి తప్ప మరొకటి కాదు.చదవండి: ఆ ప్రాజెక్టుకు 10 లక్షల చెట్ల బలి!మావోయిస్టు పార్టీలే కాదు... పార్లమెంట్ పంథాలో పనిచేస్తున్న వామపక్షాలు కూడా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓట్లు కీలకమైనందున ఓట్లు రాబట్టడానికి వామపక్షేతర పార్టీలు అడ్డమైనదారులు తొక్కుతూ అధికారమే పరమావధిగా ఓటర్లను ప్రభావితం చేసే సాధనాలను ఆశ్రయిస్తున్నాయి. డబ్బు, మద్యం, సంక్షేమ పథకాల ఎర చూపి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. అందుకే అవి గెలుస్తు న్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి. కాని దోపిడీ శక్తులూ, వారికి అండగా ఉండే మతోన్మాద శక్తులూ అధికారం హస్తగతం చేసుకుంటున్నాయి. దీంతో కార్మికులు, కూలీలు, బడుగు బలహీనవర్గాల శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు. సామాజిక న్యాయం నినాదానికే పరిమితం అయ్యింది.వామపక్ష పార్టీలు ఎక్కడ అణచివేతలు, దోపిడీ ఉంటాయో అక్కడే ఉంటాయి. కొన్ని పార్టీల వారిని ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిని నిర్మూలిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అయితే ఉగ్రవాదులని అంటున్న వారికీ ప్రజా మద్దతు ఉన్న విషయాన్ని మరువరాదు. ఇదే తరుణంలో మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని ప్రత్యామ్నాయ ఆలోచనలకు పదును పెట్టాలి.చదవండి: గ్రామీణ భారత వెన్ను విరుస్తారా?ప్రజలు తమ వంతుగా ప్రజాస్వామ్య ఫలాలు పొందడానికి పాలకులను ఆలోచింప చేసే విధంగా చైతన్యాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వ దమన చర్యలను ప్రజాస్వామ్య పద్ధతులలో మావోయిస్టులు తిప్పిగొట్టాలి. ‘కన్నుకు కన్ను... చావుకు చావు’ అనే సిద్ధాంతం నుండి కాకుండా కమ్యూ నిస్టులు ఐక్య పోరాటం చేసి అణచివేతలను వర్గ రహిత సమా జాన్ని నిర్మించాలి. మితవాద, మతవాద శక్తుల నుండి దేశం తీవ్ర ప్రమాదం ఎదుర్కొంటున్న ఈ దశలో వామపక్ష, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా దానిని తిప్పికొట్టాలి. అందుకు తరుణమిదే! - చాడ వెంకటరెడ్డిసీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు -
ఇండ్లను ఎందుకు కూల్చుతున్నారు.. మూసీ సుందరీకరణ లక్ష్యం ఏమిటి?
రాజకీయ రంగస్థలంపై మూసీ ప్రక్షాళన, పారదర్శకత లోపించి తీవ్ర వివాదాస్పద మవుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్ల కూల్చివేతకు సంబంధించి హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అగ్రహం ప్రకటించింది. ‘రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలు ఇవ్వడం ఏమిటని, ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడుతారని, రాజకీయ భాష్యాలు చెప్పినట్లు చేస్తే జైళ్లకు పంపు తామ’ని హెచ్చరించింది. పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారనీ, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారనీ. ప్రభుత్వంపై, కమిషనర్ రంగనాథ్పై, అమీన్పూర్ తహసిల్దార్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూసీ ఆక్రమణల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్.టి.ఎల్. నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎఫ్.టి.ఎల్ బయట ఇల్లు నిర్మించుకున్న వారికి నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆదేశించింది.‘అసలు మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట జరుగుతున్న సుందరీకరణ లక్ష్యం ఏమిటి? మూసీ నదిని, ఆ నదిలో కలిసే వాగులను (గృహ, హోటల్, వ్యాపార, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, మురుగునీటిని) పూర్తి (ఐరోపా ప్రమాణాల) స్థాయిలో ప్రక్షాళన (శుద్ధి) చేసి స్వచ్ఛమైన జలాలు (నది)గా మార్చే లక్ష్యం ఏమైనా ఉందా? ప్రాజెక్టు పూర్తి అయితే, అంటే ఆ మురుగు నీటిని మూసీ నదిలో కలిసే నాటికి పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే ప్రక్రియ ఇందులో ఉందా? లేదా హైదరాబాద్ జంట నగరాలలోని మురుగు నీటిని శుద్ధి చేయకుండా మూసీలోకి వదిలేసి ఆ మురుగు నీటి ప్రవాహంపైనే, సుందరీకరణ చేపడతారా? ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. సమగ్రమైన ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్)ను ప్రజల ముందు ఉంచాలి. ప్రజల నివాసాలకు నష్టం కలిగే ఏ ప్రాజెక్టులో నైనా ముందు పునరావాసం కల్పించే ప్రక్రియ పూర్తయిన తరువాతనే, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వారి నివాసాలను చివరలో ఖాళీ చేయించే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. కానీ, అందుకు భిన్నంగా సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలు జీవితమంతా కష్టించి నిర్మించుకున్న ఇండ్లను ప్రాజెక్టు ప్రారంభంలోనే ఎందుకు కూల్చుతున్నారు? ఇదేనా కేసీఆర్ విధానాలకు ప్రత్యామ్నాయ ప్రజారాజ్యం?సామాన్య, మధ్యతరగతి వారికి ఒక ఇల్లు అనేది వారి మొత్తం జీవితపు కల. ఆ కల నిజం చేసుకోవడానికి జీవితంలో చాలా మూల్యం చెల్లిస్తారు. పట్టణంలో ఇల్లనే కల సాకారం కోసం సొంత ఊళ్ళలో ఉన్న పొలాలను, ఇతర ఆస్తులను అమ్ముతారు. అప్పులు తెస్తారు. అనేక కష్టాలతో వారి స్తోమతకు తగ్గ ఇల్లు నిర్మించుకుంటారు. ప్రాజెక్టు పేరుతో, పునరావాసం, ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా ఆ ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ప్రభుత్వాల, పెద్దల రియల్ ఎస్టేట్ దందాతో 10, 20 గజాల నేలపై ఇల్లు కట్టుకోవడం సామాన్య మధ్య తరగతికి ఒక గగన కుసుమంగా మారింది. అందుకే వీరు మురికి వాడలకు, దుర్గంధ నదుల పరివాహ ప్రాంతాలకు తరలు తున్నారు. చౌకగా వస్తుందని దుర్గంధపూరిత నది అంచునే స్థలం కొని, భారీ డబ్బుతో క్రమబద్ధీకరణ చేసుకొని, ఇండ్లు నిర్మించుకున్నారు. కూల్చివేతల భయంతో గుండె పోటు చావులకు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. 8 నెలల నిండు గర్భిణీ అనే కనికరం లేకుండా ఆమె ఇల్లు కూల్చడం దుర్మార్గం. ఒక బాధిత కుటుంబం 25 ఏళ్లుగా మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉంటూ నలుగురు కొడు కులకు పెళ్లి చేసింది. నిర్వాసితులైన వీరందరికీ ఒకే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లభించింది. ఒక్క ఇంట్లో ఇన్ని కుటుంబాలు ఎలా నివసించాలని వేదనకు గురవుతున్నారు వారు. హైడ్రాతో ప్రభుత్వానికి వచ్చిన కీర్తి, మూసి పేదల ఇళ్ల కూల్చివేతతో పాతాళంలోకి పోయింది.జల వనరులను, ప్రభుత్వ స్థలాలను, పార్కులను రక్షించవలసిందే. కానీ వాటిని ఆక్రమించి భారీ ఆస్తులుగా చేసుకున్నది సామాన్య పౌరులు కాదు. అధికారంలో ఉన్న బడాబాబులు, పెద్దలే. మూసీ నదీ గర్భంలో ఉన్న ఇళ్ల గుర్తింపునకు సంబంధించి మార్కింగ్ ప్రక్రియను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపినా, మరికొందరు ఇండ్లను వదిలిపెట్టడానికి ససేమిరా సిద్ధంగా లేరు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆశించిన స్థానిక ప్రజలు వాటిని తమకే కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. మూసి నిర్వాసితులు, డబుల్ బెడ్ రూమ్ సమీప ప్రజల మధ్య ఉద్రిక్తత నెలకొంది.బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలను గుర్తించి దాదాపు 15 వేల కుటుంబ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని 2022లోనే నిర్ణయించింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసి పరివాహక ప్రాంతంలో పది వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు. ఆ నిర్వాసి తులందరికీ వారి నివాసానికి, ఉపాధికి అనువైన చోట అన్ని మౌలిక వసతులతో కూడిన పునరావాస సౌకర్యాలను ప్రభుత్వం నిర్వాసితులకు కల్పించాలి. దౌర్జన్యంతో కాకుండా నిర్వాసితులను అన్ని విధాల ఒప్పించి మెప్పించి పునరావస కాలనీకి తరలించాలి.చదవండి: రిజిస్ట్రేషన్కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చాలి!శుద్ధీకరణ అంటే, మురుగు నీటిలో ఉన్న అశుద్ధ మూలకాలను, కాలుష్యాన్ని తొలగించడం. శుద్ధి చేసిన తర్వాత ఆ నీరు త్రాగడానికి అనువైన విధంగా 100% సురక్షితంగా ఉండాలి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజె క్టులో నేటి ప్రభుత్వం ఆ నది మురుగు జలాలను అలా స్వచ్ఛమైన తాగునీరుగా మారుస్తుందా? దేశంలోని చాలా నగరాల్లో మురుగు నీటి శుద్ధీకరణ వ్యవస్థలు ఎన్నో ఉన్నప్పటికీ, ఎక్కడా మురుగు నీటిని స్వచ్ఛ జలాలుగా మార్చిన చరిత్ర నేటికీ లేనేలేదు. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వ హయాంలో అంగీకరించారు. సీవరేస్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ల ద్వారా మురుగునీటి శుద్ధీకరణ 30–35% కంటే మించదనీ, తెలంగాణలోలోనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఈ పథకానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్టనీ, మూసీ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ అనీ రకరకాల పేర్లతో మంత్రులు, అధికారులే గందరగోళం చేస్తున్నారు. మూíసీ నదిని పూర్తి స్థాయిలో ఒక ఎకలాజికల్ ప్రాజెక్టు (ఒక స్వచ్ఛమైన నది)గా తీర్చి దిద్దాలనే లక్ష్యం ఏమైనా ప్రభుత్వానికి ఉందా?చదవండి: ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్ ఒక మేన్యువల్ను 1997లో ప్రకటించింది. ‘డిజైన్ మేన్యువల్ ఫర్ వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ ఇన్ ఇండియా’ (దేశంలోని వ్యర్థాల స్థిరీకరణ చెరువుల కోసం డిజైన్ మాన్యువల్). ఇది ప్రకటించి 27 ఏళ్ల అయింది. దీని అర్థం ఏమిటంటే... మురుగు నీటిని శుద్ధి చేయలేమని చేతులెత్తేసి, ఆ నీటిని తాగునీరులో కలవకుండా మురుగునీటిని కుంటలుగా స్థిరపరుస్తామని చెప్పడం. కోటిమంది హైదరాబాద్ నగర వాసులు వాడిన మురికి నీరు, వ్యాపార సముదాయాల వ్యర్థాలు, పరిశ్ర మలు వెదజల్లే విష పదార్థాలు మూసీ ద్వారా కృష్ణా నదిలో యధేచ్ఛగా కలుస్తున్నాయి. ఆ కలుషిత నీటినే ప్రజలు జీవజలంగా సేవిస్తున్నారు. మురుగు నీటి శుద్ధీకరణ పథ కాలకు ఎంత అందమైన పేర్లు పెట్టినా శుద్ధీకరణ వట్టిదే నని 75 ఏళ్ల దేశ చరిత్ర రుజువు చేస్తోంది. ఇది కఠిన వాస్తవం. మరి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ లిమిటెడ్ ప్రక్షాళన ఏ రకమైనదో... డీపీఆర్ను తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి.- నైనాల గోవర్ధన్ తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ -
రిజిస్ట్రేషన్కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చండి ప్లీజ్!
ప్రస్తుతం శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన సందడి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నిక కోసం పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రభుత్వం ఈ నెల 6వ తేదిని ఆఖరు తేదీగా ప్రకటించింది. ఈ ఓటు హక్కు కోసం 2021లోపు డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని ప్రకటించింది. ఆ యా పార్టీల అభ్యర్థులు, వ్యాపార సంస్థల నుండి పట్టభద్రులుగా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలనుకునే వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ సెల్ నెంబరు ద్వారా ఓటు నమోదు కోసం గ్రాడ్యుయేట్లను కోరుతున్నారు. అయితే పట్టభద్రులు తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తప్పనిసరి కావడంతో... చాలామంది రిజిస్ట్రేషన్కు వెళ్లడానికి బద్ధకిస్తున్నారు.వాస్తవానికి ఓటు హక్కును సులువుగా ఉపయోగించుకునేలా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల అనేక మంది పట్టభద్రులు ప్రత్యేకంగా ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి ఓటు నమోదు చేసుకోడానికి సమయం వెచ్చించడం లేదు. పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఉంచిన వెబ్ సైట్లో డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు నంబర్లను నమోదు చేసినా... మళ్లీ గెజిటెడ్ స్థాయి అధికారి సంతకంతో ధ్రువీకరించిన పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలనే షరతు చికాకు కలిగిస్తోంది. అందుకే చాలామంది తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు.చదవండి: స్టూడెంట్ లీడర్ టు సీఎం.. రేవంత్ రెడ్డి రాజకీయ పొలిటికల్ జర్నీఒకవేళ ఇదే మంచి ఆలోచన అని ప్రభుత్వం భావించినప్పుడు ఆ యా మండల స్థాయిలోనే ఒకరిద్దరు గెజిటెడ్ స్థాయి అధికారులను ఉంచి, అక్కడే ఓటు హక్కును ప్రభుత్వమే నమోదు చేస్తే బాగుండేది. ఈ విషయాన్ని అటు ఎన్నికల కమిషన్, ఇటు ప్రభుత్వం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్ని షరతులు ఉన్నా... వాటిని అధిగమించి తమ ఓటును రిజిస్టర్ చేసుకోవాలి. మంచి ప్రతినిధిని ఎన్నుకుని గొప్ప భవిష్యత్తుకు బాటలు వేయాలి.– సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా -
స్ఫూర్తిమంతమైన విజయపథంలో... సీఎం రేవంత్ రెడ్డి
ప్రత్యర్థులు ఎన్ని అవరోధాలు కల్పించినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధించారు అనుమల రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొంత స్తబ్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో రేవంత్ పాత్ర అంతా ఇంతా కాదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టాక దూకుడుగా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరు సాగించారు. ఈ సమయంలో పార్టీలో సీనియర్లు, జూనియర్లనే భేదం లేకుండా అందరినీ కలుపుకు పోయారు. కేసీఆర్ను గద్దెదించుతానని శపథం చేసి నిజంగానే ఆయన్నిఇంటికి పంపారు. 2023, డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ పదవీ ప్రమాణం స్వీకారం చేసి ప్రజా పాలనను ప్రారంభించారు.రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా) వంగూర్ మండలం కొండారెడ్డి పల్లెలో జన్మించారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్ పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ అయ్యారు. 2006లో మహబూబ్నగర్ జిల్లాలోని మిడ్జెల్ జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా గెలిచారు.మళ్లీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభ జన తర్వాత... అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రెండోసారి గెలిచారు. 2017లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి పాలైనా, మరుసటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా అత్యుత్తమ పని తీరును కనబరిచారు. దీంతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దృష్టిలో పడ్డారు. ఈ నేపథ్యంలో 2021లో రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది.అన్నీతానై 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తిచూపారు. వారి అవినీతిని బయట పెట్టారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రజలను నమ్మించి కాంగ్రెస్ను విజయ తీరాలకు చేర్చారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ కింద వైద్య చికిత్సకు పది లక్షల వరకు సాయం పెంచారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. గత 11 నెలల్లో తెలంగాణలో మహిళలు 101 కోట్ల ఉచిత బస్సు ప్రయాణ ట్రిప్స్ ఉపయోగించు కున్నారు. దీని వల్ల మహిళలకు 3,433 కోట్ల రూపా యలు ఆదా అయ్యాయి. రుణమాఫీని బీఆర్ఎస్ పదేళ్లలో సక్రమంగా అమలు చేయకుండా చేతులెత్తేసింది. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని కేవలం 8 నెలల్లోనే అమలు చేసింది కాంగ్రెస్. 22 లక్షల 22 వేల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. పేద లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్ను ఇస్తోంది.చదవండి: పింఛన్లు పెంచరా? మాటకు కట్టుబడరా?కేవలం 11 నెలల్లోనే సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో వేల కొలది ఉద్యోగాలను భర్తీ చేశారు. మూసీ నది పునరుజ్జీవానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూని వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నారు. 11 నెలల కాలంలోనే బీఆర్ఎస్ పాలనలోని చీకట్లను రేవంత్ రెడ్డి పారదోలి తెలంగాణను అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చేస్తున్నారు. అటువంటి ప్రియ ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు!- వెలిచాల రాజేందర్రావు (Velichala Rajender Rao)కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి(నవంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం) -
అధికార కేంద్రీకరణకు మార్గంగా.. జమిలి ఎన్నికలు
‘ఒకే దేశం – ఒకే సంస్కృతి – ఒకే పన్ను’ అంటూ నిరంతరం ప్రచారం చేసే అధికార బీజేపీ ఇప్పుడు ‘జమిలి ఎన్నికల’కు సన్నద్ధమవు తోంది. కేంద్ర మంత్రి వర్గం ఇటీవల జమిలి ఎన్నికలకు ఆమోదాన్ని తెలిపింది. దేశంలో సవివరమైన చర్చ జరగకుండానే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ చేసిన సూచనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జమిలి ఎన్నికలను పూర్తిగా సమర్థించేవారే కమిటీలో ఉన్నప్పుడు అది నిపుణుల కమిటీ ఎలా అవుతుంది? జమిలి ఎన్నికలు ఆచరణ సాధ్యంకాదనీ, ఇది అధికార కేంద్రీ కరణకు మార్గాన్ని సుగమం చేయడమేననీ, మన దేశ సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ మౌలిక సూత్రా లపైన దాడి చేయడమేననీ ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.దేశంలో తరచూ ఏదో ఒక ఎన్నిక జరుగు తున్నందు వల్ల అభివృద్ధికి ఆటంకమేర్పడుతుందనేది ఒక అభిప్రాయం. ప్రపంచంలోనే మన ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందనీ, దీనికి మన జీడీపీ గణాంకాలే రుజువనీ ప్రభుత్వ పెద్దలు చెబు తున్నారు. మరి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నిజంగా సరైనవనుకుంటే అభివృద్ధికి తరుచూ జరిగే ఎన్నికలు ఎలా ఆటంకమవుతాయి? దేశం ముందున్న మౌలిక సవాళ్ళ నుండి జనం దృష్టిని ప్రక్కదారి పట్టించేందుకే జమిలి ఎన్నికలను ప్రస్తావిస్తున్నారనేది ఒక విమర్శ. జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చనేది సమర్థకుల మరో వాదన. ఈ వాదనను సరిగ్గా విశ్లేషిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2023–24 సంవత్సరానికి ఎన్నికల కోసం కేంద్రం కేటాయించింది కేవలం రూ. 466 కోట్లు మాత్రమే. పైగా అది ఎన్నికల సంవత్సరం కాబట్టి. అదే 2022–23 సంవత్సరానికి కేటాయించినది రూ. 320 కోట్లు మాత్రమే. రాష్ట్రాలు కూడా ఎన్నికల ఖర్చును భరిస్తాయి. లక్షలాది కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రతిపాదిస్తున్న కేంద్రానికి ఈ ఎన్నికల ఖర్చు నిజంగా పట్టించుకోవలసినది కాదు. నిజానికి జమిలి ఎన్నికలు జరిపితేనే ఖర్చు పెరుగుతుంది. ఈ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో ఈవీఎమ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిని, రక్షణసిబ్బందిని కేటాయించాలి. వారి శిక్షణ కోసం కూడా ఖర్చు పెట్టాలి.ఎన్నికలు తరచూ జరగడం వల్ల ఇప్పటి వరకూ విధానపర నిర్ణయాలు చేయడంలో ఏనాడూ ఆటంకమేర్పడలేదు. ప్రజల ప్రయోజనాలకు, వారి స్వేచ్ఛకు జమిలి ఎన్నికలు విఘాతమే. ప్రభుత్వాల దూకుడుకు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు కళ్ళెం వేసేది ప్రజలు మాత్రమే. జమిలి ఎన్నికల వల్ల పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. పార్లమెంట్ లేదా అసెంబ్లీకి ఎన్నికైన ప్రజాప్రతినిధి వెంటనే మరణిస్తే ఏం చేస్తారు? అధికార పార్టీ మధ్యలో మెజారిటీ కోల్పోయి ప్రభుత్వం కూలిపోతే ప్రత్యామ్నాయమేమిటి? అటువంటి ప్రత్యామ్నాయం ప్రజాస్వామ్యయుతం అవుతుందా?చదవండి: ‘మహా’త్యాగం కాంగ్రెస్కు సాధ్యమా?అందుకే జమిలి ఎన్నికలకు బదులు, ఎన్నికల సంస్కరణలను తక్షణమే చేపట్టి దామాషా ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టాలి. పార్టీల మ్యానిఫెస్టోలను, వారి విధానాలను సమగ్రంగా విశ్లేషించుకుని రాజకీయ పార్టీలకు ప్రజలు ఓటు వేయడం న్యాయసమ్మతమైన, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య ప్రక్రియ. ప్రస్తుత పద్ధతిలో రాజకీయ పార్టీలకు లభించిన ఓట్ల శాతం, ఆయా పార్టీలు గెలిచిన సీట్లకు ఉన్న తేడా అసంబద్ధంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల ప్రక్రియను అమలు చేసే ఆలోచనను విరమించి ప్రజాస్వామ్య పటిష్ఠతకు, పరిరక్షణకు అవసరమైన అన్ని మార్పులను మన రాజకీయ వ్యవస్థ చేపట్టాలి. అధికార బీజేపీ దీనికి ముందుగా చొరవ చూపాలి.- వి.వి.కె. సురేష్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, మచిలీపట్నం డివిజన్ డివిజనల్ సంయుక్త కార్యదర్శి -
ఇది పరిష్కరించుకోదగిన మిత్రవైరుద్ధ్యం!
భారతదేశంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల సమాజం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తోంది. ప్రతి విషయంలోనూ కులం ప్రధానపాత్ర వహిస్తోంది. కులనిర్మూలన జరగక పోగా కులం వేళ్ళు మరింత బలంగా లోలోతుల్లోకి వెళ్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కుల నిర్మూలనైనా జరగాలి లేదా సంపద, అధికారాల్లో ఎవరి వాటా వారికైనా దక్కాలి. ఇవేవీ జరుగకపోగా వేలసంఖ్యలో విభజింపబడిన పాలిత కులాల మధ్య చెప్పలేనన్ని వైరుద్ధ్యాలు! తమకు దక్కాల్సిన వాటా కోసం ఉమ్మడి పోరాటాలు చేయకుండా తమలో తామే తన్నుకోవడం కనిపిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మధ్య వైరుద్ధ్యాలే కనిపిస్తున్నాయి. నిజానికివన్నీ మిత్ర వైరుద్ధ్యాలే తప్ప శత్రు వైరుద్ధ్యాలు కావు. వీటిని పరిష్కరించుకోకుండా దశాబ్దాలుగా తగవులాడుకుంటూనే ఉన్నారు.ఎస్సీల్లోని మాల–మాదిగలు, వారి ఉపకులాల మధ్య ఉండాల్సింది మిత్రవైరుద్ధ్యం కాగా అది శత్రువైరుద్ధ్యంగా కొనసాగుతుండడం బాధాకరం. ఇరువురికీ ఆరాధ్యుడు అంబేడ్కర్. ఆయన స్ఫూర్తితో దళిత జాతి విముక్తికై ఉమ్మడి పోరాటాలు చేయకుండా దశాబ్దాలుగా పాత వైరుద్ధ్యాలను మరింత విస్తృతం చేసి దళిత రాజ్యాధికార భావనకు మరింతదూరం జరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ‘దళిత మహాసభ’ దళితులపై జరిగిన పాశవిక దాడులను సమర్థంగా ఎదుర్కొంది. ఎండగట్టింది. దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచింది. అంబేడ్కర్ స్ఫూర్తితో, ఇంగ్లీషు చదువులతో, క్రైస్తవ చైతన్యంతో ఆంధ్ర మాలలు కొంతవరకైనా పాలక స్థాయికెదిగి ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. రాజకీయ పదవులూ గెలుచుకున్నారు. అలాగే మూడు దశాబ్దాల క్రితం మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన ‘మాదిగ దండోరా’ ఉద్యమం చరిత్రాత్మకమైనది. అది మాదిగల్లో ఆత్మగౌరవాన్ని, పోరాట పటిమను, అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకునేలా చేసింది. అది కేవలం వర్గీకరణ ఉద్యమంగానే ఉండిపోకుండా వికలాంగుల పెన్షన్, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది. కొందరు ఆధిపత్య కులాల వారు తమ పేరు చివర తమ కులాలను తెలియచేసే విశేషాలను పెట్టుకున్నట్లే.. మాదిగలు కూడా తమ పేరు చివర ‘మాదిగ’ పదాన్ని చేర్చుకోవాలని మంద కృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు ఆ కులంలో ఆత్మగౌరవాన్ని ప్రోది చేసింది. ఒక్క దళిత కులాల్లోనే కాదు పీడిత కులాలందరికీ ఆత్మవిశ్వాసాన్నిచ్చిందీ దండోరా ఉద్యమం. అయితే దండోరా ప్రధాన లక్ష్యం రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ సాధించడం.కానీ వర్గీకరణ విషయంలో మాల, మాదిగల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. దేశం మొత్తంగా కొన్నిచోట్ల మాలలు, మరికొన్ని చోట్ల మాది గలు రిజర్వేషన్లలో భాగాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నారన్నది వాస్తవం. వర్గీకరణ చేస్తే మాల, మాదిగ ఉపకులాలన్నీ రిజర్వేషన్ సౌకర్యాన్ని సమానంగా అనుభవించి అన్ని ఉపకులాలు పైకొస్తాయన్నది వర్గీకరణ కావాలనే వారి వాదం. వర్గీకరణ వల్ల దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందని వర్గీకరణను వ్యతిరేకించే వారి వాదన. ఎక్కడ మాలల్లో గానీ, మాదిగల్లో కానీ చైతన్యం ఎక్కువగా ఉంటే అక్కడ ఆయా కులాలవారు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఎక్కువ ఉపయోగించుకున్నారన్నది వాస్తవం.వర్గీకరణ కావాలనడంలో ఎవరి వాటా వారికి చెందాలన్న ప్రజాస్వామిక సూత్రముంది. ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణను ఒకసారి చేసినా కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల దాని అమలు నిలిపివేయబడింది. అప్పట్నుంచి వైరుద్ధ్యాలు మరీ ఎక్కువయ్యాయి. వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తమైంది. దీన్ని ఆసరాగా చేసుకొని పాలకపార్టీలు ఓట్లు రాజకీయాలాడటం మొదలు పెట్టాయి. దళితుల ఓట్లు కోసం వర్గీకరణను సమర్థించడం, వ్యతిరేకించడం రాజకీయ పార్టీలకు ఓ ఆటగా మారింది.చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!ఈ మధ్యనే సుప్రీంకోర్టు వర్గీకరణ చేయడం సరైన దేనని తీర్పునిచ్చింది. అందులో మెలిక పెట్టింది. క్రీమీలేయర్ పాటించాలని. తరతరాలుగా రాజకీయ, సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగపరమైన అధికారాలు అనుభవిస్తున్న వారికి లేని క్రీమీలేయర్ దళితుల వర్గీకరణకు కావాలనడం ధర్మ సమ్మతమేనా? కొందరు దళితనేతలు క్రీమీలేయర్ వద్దంటే మరికొందరు వర్గీకరణే వద్దంటున్నారు. మాయావతి లాంటి నాయకురాలు కూడా వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ఇలాంటి సందర్భాల్లో వర్గీకరణ అమలవుతుందా అనే అనుమానం రావడం సహజమే. అమలు కాకుండా ఉండటానికి వర్గీకరణ వ్యతిరేకులు, అమలు చేయడానికి వర్గీకరణ అనుకూలురు ఇంకా ఎన్నేండ్లు పోరాటాలు చేస్తూ తమ ఉమ్మడి లక్ష్యాన్ని మరిచిపోతారు?దళిత సోదర సోదరీమణులు తమ మధ్యనున్న వైరుధ్యాలను మిత్ర వైరుద్ధ్యాలుగా భావించి చర్చలతో వర్గీకరణ సమస్య విషయంలో ఏకీభావానికి వచ్చి దళిత రాజ్యాధికార భావనను సాకారం చేసే దిశగా పయనం కొనసాగిస్తే మంచిది. తమ అంతిమ లక్ష్యం దళిత సాధికారత, రాజ్యాధికారం అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఇరువైపుల వారికీ వర్గీకరణ సమస్య అతి చిన్నదిగా కనబడుతుంది.- డాక్టర్ కాలువ మల్లయ్యప్రముఖ కథా రచయిత -
విద్యారంగ మార్పుల గమ్యం ఎటువైపు?
అందరికీ విద్య లేకుండా ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టదన్నాడు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్. నేటి బాలలే రేపటి పౌరులు అన్నాడు తొలి ప్రధాని నెహ్రూ. కానీ దేశంలో ఇప్పటికీ అక్షరాస్యత రేటు 77% దాటలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే అక్షరాస్యత రేటు 66% కూడా లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. తమ మేనిఫెస్టోలో విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయి స్తామని చెప్పి 7.3% మాత్రమే కేటాయించింది కాంగ్రెస్. పక్కన ఉన్న తమిళనాడులో 13.4%,ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యకు 12.6% నిధులు కేటాయించారు.పాఠశాల విద్యను తీసుకుంటే పాఠశాలల మూసివేతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. 2022 –23 సంవత్సరంలో దాదాపు 8,500 పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్నారు. 1,864 స్కూళ్లలో విద్యార్థులే లేరు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ పాఠశాలల దగ్గరలోనే విద్యా శాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం. చట్ట ప్రకారం ప్రభుత్వ పాఠశాలకు కనీసం ఒక్క కిలోమీటర్ దూరం ఉంటే తప్ప అనుమతులు ఇవ్వకూడదు. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి మరొక ప్రధానమైన కారణం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య లేకపోవడం. ఇంకా బతుకుదెరువు కోసం గ్రామాల నుండి పట్టణాలకు వలసలు, జనాభా తగ్గుదల మొదలైన అంశాలు విద్యార్థులు తగ్గిపోవడానికి కారణాలు కావచ్చు. ఇంకా ఈ విషయంపై లోతైన అధ్యయనం చేసి కారణాలను కనుక్కోకుండా, ఆ కారణాలను నిర్మూలించకుండా, తక్కువ విద్యార్థులు ఉన్నారని అక్కడ ఉన్న టీచర్లను వేరే స్కూళ్లకు పంపించడం, విద్యార్థులే లేరని పాఠశాలలను మూసివేయడం మూర్ఖత్వం.పాఠశాలల్లో ఒక ప్రణాళిక ప్రకారం బోధన జరుగుతుందా లేదా చూసుకోవాలంటే విద్యాశాఖ అధికారులు ఉండాలి. అటువంటి అధికారుల పోస్టులు దాదాపు అన్నీ ఖాళీగా ఉన్నాయి. దిగ జారుతున్న ఈ పరిస్థితులను చక్కబెట్టి సుమారు 30 వేల పాఠశాలలను అభివృద్ధి చేసే బదులు, నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపి స్తామని అంటున్నారు. కామన్ స్కూల్కు భిన్నంగా ఇప్పటికే రకరకాల అంతరాలతో భ్రష్టు పడుతున్న పాఠశాల విద్యకు ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకొక అంతరాల దొంతర తయారు కాబోతున్నది.అలాగే ఉన్నత విద్యలో ప్రభుత్వ రంగంలో ఉన్న 17 స్టేట్ యూనివర్సిటీలను సమగ్రంగా అభి వృద్ధి చేసే బదులు భూకబ్జాదారులకు, విద్యా వ్యాపారులకు, కంపెనీలకు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో 50 ఎకరాల భూమిలో ఒక ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో 2 వేలకు పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ యూనివర్సిటీలలో బోధనేతర సిబ్బంది ఖాళీలు తీసుకుంటే అవి వేల సంఖ్యలో ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా యూనివర్సిటీలలోని పోస్టులను భర్తీ చేయలేదు.ప్రస్తుతమున్న యూనివర్సిటీలను, ఇంజనీరింగ్ కళాశాలలను, పాలిటెక్నిక్ కళాశాలలను, ఐటీఐలను సమగ్రంగా అభివృద్ధి చేసి నైపుణ్యాలను నేర్పవచ్చు. అలా చేయకుండా కొత్తగా స్కిల్ యూనివర్సిటీని స్థాపించడం ఎవరికోసమనే ప్రశ్న తలెత్తక మానదు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో భాగంగా 19 పేరెన్నిక గల విదేశీ కంపెనీలు హైద రాబాదుకు రాబోతున్నాయని తెలుస్తున్నది. ఇక్కడ 2 వేల మందికి నైపుణ్యాలను నేర్పిస్తామని అంటున్నారు. ఈ విదేశీ కంపెనీలకు నైపుణ్యం కలిగిన తక్కువ జీతానికి పనిచేసే, బానిస మనస్తత్వం కలిగిన కార్మికులను తయారుచేయడానికి వస్తుందా ఈ స్కిల్ యూనివర్సిటీ అనే అనుమానం కలుగు తుంది. ఇక్కడ ఫ్యాకల్టీని నియమించడంలో, విద్యార్థులకు అడ్మిషన్ కల్పించడంలో రిజర్వేషన్ల పద్ధతి పాటిస్తారా? ఫీజులు ఎంత ఉంటాయి అన్న వివరాలు ఇంకా అధికారికంగా తెలియవలసి ఉంది. చదవండి: సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు పాఠశాల స్థాయి నుండి అన్ని వసతులతో కూడిన వ్యాయామ విద్య లేకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడం అర్థరహితం. వేలాది ప్రభుత్వ పాఠశాలలకు ఆట స్థలాలు లేవు. క్రీడా పరికరాలు లేవు. అన్ని పాఠశాలలో పీఈటీ / పీడీ పోస్టులు మంజూరు చేయబడలేదు. పట్టణాలలో మెజారిటీ ప్రైవేటు పాఠశాలలకు ఆట స్థలాలే లేవు. అటువంటి పరిస్థితులలో స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపిస్తామనడం పునాది లేకుండా భవనం నిర్మించడమే. మొత్తానికి గత తొమ్మిది నెలల్లో తెలంగాణ విద్యారంగంలో వచ్చిన మార్పుల గురించి సమాజంలో లోతైన చర్చ జరగవలసి ఉన్నది.-ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆచార్యులు -
లంక కామ్రేడ్ల నుంచి స్ఫూర్తి పొందాలి!
భారత్ పొరుగు దేశమైన శ్రీలంకలో మార్క్సిస్టు నాయకులైన అనూర కుమార దిస్సనాయకే దేశ అధ్యక్షుడుగానూ, హరిణి అమరసూర్య ప్రధానమంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆసియా రాజకీయాల్లో పెను ఆసక్తికర, ఆహ్వానించదగిన పరిణామాలకు ఆస్కారం ఏర్పడింది. భారత దేశంలోని ఎన్డీయే– ఆరెస్సెస్ వినాశకర కూటమి ప్రభుత్వం శ్రీలంకలోని మితవాద పక్ష పాలకులతో ‘జోడీ’ కట్టి చిరకాలంగా వర్ధిల్లుతున్న భారత్–శ్రీలంక స్నేహ పూర్వక సంబంధాలలో ‘చిచ్చు’ పెట్టింది. ఈ విషమ పరిణామానికి సకాలంలో విరుగుడుగా వచ్చిందే సింహళంలో వామపక్ష పరిపాలన.శ్రీలంక సమగ్రాభివృద్ధిని కాంక్షించి, పాక్షిక ధోరణుల్లో గాక శ్రీలంక ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారాన్ని చేపట్టారు మార్క్సిస్టు నాయకులు. అలాంటి పరిణామాన్నే భారతదేశంలోనూ ఆవిష్కరించగల అవకాశం ఉన్నా... చీలికలు పీలికలుగా ఉన్న వామపక్షాలు ఒకే తాటిపైకి రాలేకపోతున్నాయి. నాయకులు తమ పదవులను త్యజించి విస్తృత ప్రాతిపదికన ఒకే ఒక పార్టీగా ఆవిర్భవించడానికి కృషి చేయడంలేదు. ఎన్టీయే కూటమి దుష్ట ఇజ్రాయెల్తో కలిసి దేశంలోని ప్రగతివాద శక్తులపై నిఘాపెట్టి నానా ఇబ్బంది పెట్టిన చరిత్ర తెలియంది కాదు. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే దేశంలోని వామ పక్షాలన్నీ ‘చిల్లర తగాదాలు’ మానుకుని ఐక్య వామపక్ష ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. ఇందుకు శ్రీలంక చూపిన ‘ఐక్య ఉద్యమ స్ఫూర్తి’ని భారత వామపక్షాలన్నీ తక్షణం పొందాల్సిన అవసరం ఉంది.ఇదే సందర్భంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశంలో ఆచరణలో నిజమైన ఫెడరల్ వ్యవస్థను పాదుకొల్పడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమతులమైన అధికారాల పంపిణీ నొక్కి వక్కాణించారు. ఫెడరల్ వ్యవస్థ సూత్రాల ప్రకారం, కేంద్రం ఇప్పుడు రాష్ట్రాలనుంచి వసూలు చేస్తున్న సెస్లు, ఇతర పన్నులను అదే దామాషా ప్రకారం రాష్ట్రాలకు పంచి తీరాల్సిందేనని భట్టి కోరారు. దీన్నిబట్టి చూస్తే, ఇరుగు–పొరుగైన శ్రీలంకలో అంతటి భారీ స్థాయిలో వామపక్ష నేతల ఆధ్వ ర్యంలో క్రమానుగతంగా సాగక తప్పని పరిస్థితులు ఎందుకు వచ్చాయో భారత వామపక్షాల నేతలు కేవలం గుర్తించడమేగాదు, ఆచరణలో దేశంలో ఐక్య ఉద్యమ నిర్మాణానికి పునాదుల్ని పటిష్టం చేసుకొనక తప్పదు. ఇటాలియన్ మాఫియా నుంచి, ఇజ్రాయెల్ గూఢచారుల నుంచి భారతదేశ తక్షణ రక్షణకు దేశంలోని వామపక్షాలన్నీ సిద్ధం కావాలి. నిరుపేదలైన షెడ్యూల్డ్ తరగతులకు చెందిన అట్టడుగు వర్గాల ప్రజలపైనే 13 రాష్ట్రాలలో దారుణమైన అత్యాచారాలు నమోదయ్యా యని తాజా నివేదికలు సాధికారికంగా ప్రకటించాయి. వీటన్నింటికి ముగింపు ఎప్పుడు? ఫెడరల్ వ్యవస్థ పునరుద్ధరణ ద్వారానేనని ఆ నివేదికలు తెలియజేస్తున్నాయి.చదవండి: ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?ఎన్డీయే – ఆరెస్సెస్ కూటమి ప్రభుత్వ నాయకులు ఈ దశలో, ముఖ్యంగా చైతన్యశీలి అయిన ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి 2025 నాటికి గానీ పదవీ విరమణ చేసే అవకాశం లేదు కాబట్టి, ఆ లోగా ‘ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒకే ప్రధాని’ అన్న నినాదంతో ప్రస్తుత కేంద్ర పాలకులు ఏ అఘాయిత్యం చేసే అవకాశం లేదు. ఈలోపు దేశీయ వామపక్షాలు, సంబంధిత వర్గాలన్నీ ఒక్క తాటిపై కదిలి రాగల కార్యాచరణ వ్యూహానికి శ్రీకారం చుట్టాలి.శ్రీలంకలో కమ్యూనిస్టు – మార్క్సిస్టుల అను భవం సుదీర్ఘ కాలంలో నేటి అమూల్యమైన దీర్ఘకాలిక ఫలితాన్ని శ్రీలంక ప్రజలకు ప్రసాదించగల్గింది. లంక పరిణామం ఆసియాలోని చుట్టు పట్ల దేశాల ప్రజాబాహుళ్యానికి సహితం ఆదర్శంగా పరిణమించింది. భారత వామపక్షాలు ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని ఏకం కావాలి. శ్రీలంక వామపక్షాలు సాధించి ఆదర్శనీయమైన విజయం నుంచి భారత ప్రజల భవిష్యత్తుకు అనువైన ఉమ్మడి వ్యూహ రచనకు నడుం బిగించాలి. ఇందుకు మొదటి షరతుగా నాయకత్వం రూపకల్పనకు అవసరమైన వ్యూహాన్ని సమష్టిగా రూపొందించుకోవాలి. ఇది తప్ప మరో మార్గం లేదు. ఈ సందర్భంగా శ్రీలంకలో భారత మాజీ హైకమిషనర్గా పనిచేసిన గోపాలకృష్ణ గాంధీ శ్రీలంక పరిణామాల్ని సమీక్షిస్తూ... విప్లవాత్మక భావాలు మార్చుకోకుండానే ప్రజాస్వామిక ధోరణులు కూడా బలపడటానికి అనువుగా రాజకీయ పక్షాల సిద్ధాంత ధోరణులు కూడా ఉండాలనీ, ఈ ధోరణుల్ని శ్రీలంక వామపక్షాలు పెంచుకుంటూ మార్పునకు అనుగుణమైన వ్యూహరచనను ఆశ్రయించాయనీ అన్నారు. భారత్–శ్రీలంక సంబంధాలలో కూడా పెను మార్పులకు అవకాశం ఉందని గోఖలే ఆశాభావం వెలిబుచ్చారు.- ఏబీకే ప్రసాద్సీనియర్ సందకులు abkprasad2006@yahoo.co.in -
సామాన్యుల ముఖ్యమంత్రి!
1988 మార్చిలో రాజ్య సభకు ఎన్నికయ్యాను. అప్పటికి ఒక మాసం ముందు త్రిపుర శాసన సభకు జరిగిన ఎన్నిక లలో, అప్పటికి పదే ళ్ళుగా అధికారంలో ఉన్న నృపేన్ చక్రవర్తిని ఓడించి, కాంగ్రెస్కు చెందిన సుధీర్ రంజన్ మజుందార్ ప్రభుత్వం కొలువు తీరింది. ప్రతిపక్షాలకు చెందిన కార్య కర్తలపై దాడులు, వారి ఆస్థులను ధ్వంసం చేయడం, ఇళ్ళను తగులబెట్టడం వంటి దుర్మా ర్గాలు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ నుండి ఒక అఖిలపక్షం ఆ రాష్ట్రంలో పర్యటించి, వారికి ధైర్యం చెప్పి, సాంత్వన కల్పించాలని మా సభలో మా సహచరులు దిపేన్ ఘోష్, సుకుమార్ సేన్, సురేన్ భట్టా చారి, గురుదాస్ దాస్ గుప్తా కోరారు. తెలుగు దేశం నుండి శివాజీ రావాలని కోరారు. సరేనన్నాను.శుక్రవారం సాయంత్రం రాజ్యసభ సమా వేశాలు ముగిసినాక, సాయంత్రం బయలుదేరి కలకత్తా చేరుకొన్నాం. విమానాశ్రయంలో బెంగాల్కు చెందిన మార్క్సిస్టు పార్టీ నాయకులు మాకు స్వాగతం పలికి, విమానాశ్రయంలోని విశ్రాంతి గదులలో ఏర్పాటు చేసిన బసలో మమ్మల్ని దించారు. అదే సమయంలో ఢిల్లీ వెళ్ళడానికి విమానాశ్రయానికి వచ్చిన బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు మమ్ములను పరి చయం చేసి, కాసేపు ముచ్చటించే ఏర్పాటు చేశారు. మరురోజు ఉదయం అగర్తలాకు విమా నంలో వెళ్లాము. మాతోపాటు బెంగాల్ మంత్రులు కూడా మూడు రోజులు పర్యటించారు. ఒక నివేదిక తయారు చేశాం. అదంతా రాజ్యసభలో ప్రస్తావించాం. ఆ కథ అంతటితో ముగిసింది.తరువాత పుష్కర కాలం గడిచినాక 2000 నవంబరులో జ్యోతిబసు తరువాత బుద్ధదేవ్ ముఖ్యమంత్రిగా – పదకొండు సంవత్సరాలు ఆదర్శవంతమైన, విశుద్ధ పరిపాలన అందించారు. మాతో సామాన్య కార్యకర్త మాదిరి సిగరెట్లు కాలుస్తూ, చేతిలో ఆంగ్ల నవల పట్టుకొని సంచరించిన బుద్ధదేవ్, ముఖ్యమంత్రిగా అధికార నివాసానికి మారకుండా, తానుండే సాదా–సీదా రెండు పడక గదుల ఆపార్టుమెంటులోనే కొనసాగారు. సాయంత్రం 5 గంటల కల్లా రైటర్స్ భవన్ నుండి బయటకొచ్చి, తోవలో పార్టీ కార్యాలయంలో కాసేపుండేవారు. ఇంటికొచ్చి పచ్చి వక్కను కత్తిరించుకొని నములుతూ, ఇంగ్లిష్ నవలను ఆస్వాదిస్తూ, టుంగుటుయ్యాలలో కూర్చుని సేదదీరేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా వారి శ్రీమతి ఒక పాఠ శాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, పబ్లిక్ ట్రాన్స్పోర్టు ట్రాం మీద ప్రయాణం చేసేవారు. ప్రతిరోజూ ఇంటివద్ద ఎవరినీ, సందర్శకులకు అనుమతించేది లేదు. ఎవరైనా ఆఫీసులో కలుసుకోవాల్సిందే.ఆగస్టు 8న మరణించిన బుద్ధదేవ్కు శ్రద్ధాంజలి ఘటిస్తూ, కొత్తగా రాజకీయాలలోకి అడుగు పెడుతున్న యువతరం వారిని ఆదర్శంగా తీసు కోవాలని ఆకాంక్షి స్తున్నాను. – డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త, రాజ్యసభ మాజీ సభ్యులు -
‘భూత్’ బంగ్లా సర్కార్!
దేశంలోని ప్రస్తుత సీనియర్ మోస్ట్ రాజకీయవేత్తల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఫోర్–ఓ (4.0) వెర్షన్. పదిహేనేళ్లపాటు మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్లైన్తో తిరిగారు. ఇంతటి అనుభవశాలి ఎందుకో కలవరపడుతున్నారు. అభద్రతా భావంతో తత్తరపాటుకు గురవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పేరు వింటేనే ఆయన సర్వేంద్రియాలు సంక్షో భానికి లోనవుతున్నవి. విజ్ఞత విలుప్తమైపోతున్నది. ఆయన జనంలోకి వెళితే ఈయన జ్వరపీడితుడవుతున్నారు. ఆ వేడికి భాష మరిగిపోతున్నది.విశాఖ సమీపంలో జరిగిన ఫార్మా కంపెనీ దుర్ఘటన సందర్భాన్నే తీసుకుందాము. బాధిత కుటుంబాలను ఓదార్చడానికి మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారు. చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ అనునయించి ధైర్యం చెప్పారు. అండగా నిల బడతానని భరోసా ఇచ్చారు. ఆయన రాకను పురస్కరించుకొని వేలాది జనం అక్కడ గుమిగూడారు. ఈ పరిణామం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించింది. ఆ తర్వాత కాసేపటికి జరిగిన ఒక గ్రామ సభలో ఆయన మాటలు అదుపు తప్పాయి.మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయాలంటూ చెలరేగిపోయారు.ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవు తారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే!ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొల కెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తున్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేకపోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి. రెండున్నర మాసాల్లోనే ‘95 మోడల్’ చూపెట్టిన చిన్న ఝలక్ మాత్రమే ఇది. ముందున్నది అసలైన నిజరూప దర్శనం. పేదలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు, ప్రైవేట్ గద్దలకు మాత్రం సమస్త వనరులను దోచిపెట్టాలన్నది ఆ మోడల్ నిత్యం జపించే తిరుమంత్రం. అందుకే ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. అందుకే ‘రైతు భరోసా’ ఆగిపోయింది.‘విద్యా దీవెన’, ‘విద్యా కానుక’లు ఆగిపోయాయి. పంటల బీమా, మత్స్యకార భరోసా వెనక్కు మళ్లాయి. ఇంటి దగ్గర దర్జాగా పెన్షన్లు తీసు కున్న అవ్వాతాతలను నాయకుల ఇళ్ల ముందు నిలబెట్టుకుంటున్నారు. నిరుపేదల బిడ్డలు సైతం సంపన్న శ్రేణితో సమానంగా అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించడానికి అంది వచ్చిన అవకాశాన్ని ఈ ’95 మోడల్ వచ్చీరాగానే తన్ని తగలేసింది. ఐబీ సిలబస్ను అటకెక్కించారు. ఇంగ్లిషు మీడియం ఉపసంహరణకు రంగం సిద్ధమైంది.పేదలు, బలహీనవర్గాలు, మహిళల సాధికారత కోసం కార్యక్రమాలు చేపట్టినందుకే మాజీ ముఖ్యమంత్రిని మన ‘95 మోడల్’ భూతంగా పరిగణిస్తున్నది. ఈ ధోరణి కొత్త కాదు. పేద ప్రజల పక్షాన నినదించిన ప్రతి గొంతుకనూ దయ్యాలు, భూతాల గొంతుకగా బ్రాండింగ్ చేయడం, దుష్ప్రచారానికి ఒడి గట్టడం శతాబ్దాలకు పూర్వమే ప్రారంభమైంది. 1848లో కార్ల్ మార్క్స్ ప్రచురించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో ‘యూరోప్ను కమ్యూనిస్టు భూతం వెంటాడుతున్నది’ అనే వాక్యంతో ప్రారంభమైంది. కమ్యూనిస్టు భావజాలాన్ని భూతంగా భావించే నాటి పాలక ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరికగా మార్క్స్ ఈ వాక్యాన్ని రాశారు.ఇప్పుడూ అంతే! ఐదేళ్ల కాలంలో రెండు లక్షల డెబ్బయ్ వేల కోట్ల ప్రజా ధనాన్ని ప్రజల అకౌంట్లలోకే బదిలీ చేసి అణ గారిన జీవితాలనూ, వాటితోపాటు ఆర్థిక వ్యవస్థను కూడా ఉద్దీపింపజేసిన దార్శనిక పాలనను భూతాల పరిపాలనగా ప్రచారం చేస్తున్నారు. వైద్యాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ, ప్రజా వైద్య విధానాన్ని రూపొందించిన ప్రభుత్వానిది భూతాల పాలనట! దాన్నిప్పుడు ప్రైవేట్ పెట్టు బడికి తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రగతిశీలమట! దయ్యాలు వేదాలు వల్లించడమంటే అచ్చంగా ఇదే కదా! ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అదే పని చేస్తున్నారు.ఏ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసిందనే అంశంపై చర్చ జరపడం ఒక భాగం. ఎవరిది ప్రజాస్వామ్య రాజ కీయమో, ఎవరిది దయ్యాలు – భూతాల రాజకీయమో తేల్చడా నికి ఇంకో చర్చ కూడా ఉన్నది. వారు ఏ రకంగా అధికారంలోకి వచ్చారన్నది పరిశీలించడానికి ఈ చర్చ జరగాలి. ఈ ముఖ్యమంత్రి తొలి రౌండ్లో ఏవిధంగా అధికారంలోకి వచ్చారన్నది జగమెరిగిన వెన్నుపోటు కథ. పార్టీ ఆయన స్థాపించినది కాదు. ఎమ్మెల్యేలను గెలిపించిందీ ఆయన కాదు. వదంతులను ప్రచారం చేసి, ఎమ్మెల్యేలను ‘వైస్రాయ్’లో నిర్బంధించి, మీడియాతో కుమ్మక్కయి, రాజ్యాంగ వ్యవస్థలను మచ్చిక చేసు కుని దొడ్డిదారిన అధికార పీఠమెక్కారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రయాణం. ఆయనే స్వయంగా పార్టీని నిర్మించుకున్నారు. ఇందుకు భారీ మూల్యాన్ని ఆయన చెల్లించుకోవలసి వచ్చింది. అయినా తలొగ్గ కుండా జనంలోకి వెళ్లారు. అలవికాని వాగ్దానాలను చేయడానికి నిరాకరించి కోరి ఓటమిని తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఐదేళ్లు గట్టిగా నిలబడి ఒంటరి పోరాటంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. భూతం ఎవరు? రాచబాటలో వచ్చినవారా? దొడ్డి దారిన ప్రవేశించిన వారా?ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో నాలుగో దఫా ఎలా అధికారంలోకి వచ్చారు? పెంపుడు మీడియాను ఉసిగొలిపి పాత ప్రభుత్వంపై అవాకులు చెవాకులు ప్రచారం చేశారు. సరిపోలేదు. కాళ్లావేళ్లా పడి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఎన్నికల సంఘాన్ని అదుపులో పెట్టుకున్నారు. ఇది కూడా సరిపోలేదని స్వతంత్ర పరిశోధకులు, సంస్థలు బల్లగుద్ది చెబుతున్నాయి. పోలింగ్ జరిగిన రోజు రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్లో 68 శాతానికి పైగా ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత తీరిగ్గా నాలుగు రోజుల సమయం తీసుకొని 81 శాతం పోలైనట్టు ప్రకటించింది. ఇది అసాధార ణమని ‘ఓట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్డీ) అనే సంస్థ వాదిస్తున్నది. గతంలో ఎన్నడూ ఈ తేడా ఒక శాతం కన్నా అధికంగా ఉండేది కాదు. ఈసారి ఏపీలో అది 12.5 శాతంగా నమోదైంది. ఈవీ ఎమ్ల మాయాజాలమే ఈ అధిక ఓట్ల నమోదుకు ప్రధాన కార ణమని వీఎఫ్డీ ఆరోపిస్తున్నది. ఎన్డీఏ మౌత్పీస్గా పనిచేసే ఓ జాతీయ చానల్ కూడా నిన్న ప్రసారం చేసిన ఒక సర్వే వివరాల్లో చంద్రబాబుకు 44 శాతం ప్రజల మద్దతున్నట్టు తేల్చింది. కూటమికి పడిన 56 శాతం ఓట్లలో ఇది 12 శాతం కోత. వీఎఫ్డీ చెబుతున్న అక్రమ ఓట్లకు ఈ నంబర్ సరిపోతున్నది.వీఎఫ్డీ ఈ వ్యవహారంపై ఒక సమగ్రమైన రిపోర్టును విడుదల చేసి, నెలరోజులు దాటినా ఇప్పటివరకూ ఎన్నికల సంఘం స్పందించలేదు. ఈ కృత్రిమ అధిక ఓట్ల నమోదు కార ణంగా కేంద్రంలోనూ, ఏపీ, ఒడిషాల్లోనూ గెలవాల్సిన పక్షాలు ఓడిపోయాయి. పోలింగ్ శాతంపై కొన్ని రోజుల తర్వాత చేసిన తుది ప్రకటనకూ, లెక్కించిన ఓట్లకూ కూడా తేడాలున్నాయి. సుమారు 390 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ తేడాలున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. కొన్ని నియోజకవర్గాల్లో లెక్కించిన ఓట్లు పోలయినట్టు ప్రకటించిన ఓట్ల కంటే తక్కువున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువున్నాయి. ఇదెలా సాధ్యం? ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లలో దయ్యాలు, భూతాలు దూరితేనే సాధ్యమవుతుంది.ఆ దయ్యాలూ, భూతాలు ఎట్లా దూరాయన్న రహస్యం విజేతలకు మాత్రమే తెలుస్తుంది. వారికి అనుబంధంగా పని చేసిన ఎన్నికల సంఘానికి మాత్రమే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై పలువురు మేధావులు గొంతెత్తి మాట్లాడారు. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయినా ఎన్నికల సంఘం మాత్రం నోరు విప్పలేదు. పైపెచ్చు, అనుమానం ఉన్న నియో జకవర్గాల్లో 5 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయంపై కూడా ఈసీ వక్రభాష్యాలు చెబుతున్నది. ఈవీఎమ్లపై అధికారికంగా ఫిర్యాదులు చేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తేవడం కూడా పలు అను మానాలకు తావిచ్చింది. ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా ఈ అంశంపై నోటికి తాళం వేసుకున్నది. కచ్చితంగా ఏదో జరిగిందన్నది అఖిలాంధ్ర ప్రజల నిశ్చితాభిప్రాయం. ఎన్నికల హామీల నుంచి, ఈవీఎమ్ల బాగోతం నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో కూటమి పెద్దల మాటలూ, చేతలు అదుపు తప్పుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థిని భూస్థాపితం చేసి పైకి రాకుండా కాంక్రీట్ పోయాలనే పైశాచిక ఆలోచనలు చెలరేగు తున్నాయి."మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు చంద్రబాబు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయాలంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవుతారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే!ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొలకెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తు న్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేక పోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి." – వర్ధెల్లి మురళి -
చరిత్ర కుహరాల నుంచి...
అణగారిన ప్రజలు తమకి ఓ గొప్ప పోరాట చరిత్ర ఉందని తెలిస్తే యధాతథ వాదాన్ని అంగీ కరించరు. వర్తమానంలో తమపై అమలయ్యే వివక్షను కచ్చితంగా ఎదిరిస్తారు. అది తమ తలరాత అని ఊరుకోకుండా తమపై రుద్దిన బానిసత్వంపై తిరగబడి తమదైన కొత్త సమాజాన్ని నిర్మించుకుంటా రని మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎప్పుడో చెప్పాడు. ఫూలే చెప్పిన పోరాటాల చరిత్రను... ప్రాచీన భారత దేశ చరిత్ర అంతా బౌద్ధానికి– వైదిక హిందూ మతానికి మధ్య జరిగిన ఘర్షణ అని బాబాసాహెబ్ అంబేడ్కర్ విశదీ కరించాడు. ఇంతకాలం కట్టుకథలు, పిట్టకథలు చరిత్రగా చలామణి అయినట్లే మన సినిమాలు కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మసిపూసి మారేడుకాయ చేస్తూ కొందరి జీవితాన్నే అందరి జీవితంగా కాకమ్మ కథలతో జనం కంట్లో కారం కొట్టి బతికేస్తున్నాయి.అయితే సింహాల నుంచి చరిత్రకారుడు పుట్టు కొచ్చాడు. వర్ణ అంధత్వంతో కునారిల్లిన నూరేళ్ళ వెండి తెరను బదబదాలుగా చించి పోగులు పెడుతూ సరికొత్త దారిని వేసుకుంటూ పోతున్నాడు పా. రంజిత్. అవును పా. రంజిత్ అసలైన చరిత్రను రక్తమాంసాలతో సిల్వర్ స్క్రీన్ మీద పరుస్తున్నాడు. తంగలాన్ ఈ దేశ మూలవాసుల అసలు చరిత్ర... చూసినవాళ్లకి కంటి మీద కునుకు పడ నీయని చరిత్ర! తంగలాన్ అందర్నీ తీవ్రంగా డిస్టర్బ్ చేస్తున్నాడు. కడుపులో చేయిపెట్టి దేవుతున్నాడు. కొందరు బాహాటంగానే వాంతులు చేసుకుంటున్నారు. మరికొందరికి రక్తం మరుగుతుంది, కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. చారెడు భూమి కోసం, కాసింత గౌరవం కోసం తమవాళ్ళు చేసిన హాహాకారాలు, కొండలు గుట్టలు దాటి నడిచిన యోజనాలు, కడచిన దారులు, చరిత్ర పొడవునా పారిన నెత్తురు కళ్ళముందు కదులుతూంటే గుండె చెరువవుతోంది.ఎవరు కాదని బుకాయించినా ఈ దేశ సాంస్కృతిక వారసత్వం బౌద్ధంలో ఉంది. నేటి దళితులు బౌద్ధ సాహి త్యంలో పేర్కొన్న నాగుల సంతతివారు. వారే బౌద్ధాన్ని అవలంబించి బుద్ధుని మార్గంలో నడి చిన శాంతి కాముకులు. కానీ బౌద్ధాన్ని చంపి, బౌద్ధులపై అంటరాని తనాన్ని రుద్దుతూ వారి మెడలో ముంతలు కట్టింది వైదిక బ్రాహ్మణ మతం. తర్వాత తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి దళితుల మెడలో ముంతను అంతే ఉంచి జంధ్యం వేసింది. వైష్ణవ మతంలోకి వెళ్ళిన దళితులను వెళ్లని వారి నెత్తిన కూర్చోబెట్టింది. ఈ చరిత్రను తంగలాన్లో పా. రంజిత్ కళ్ళకు కట్టించాడు.బౌద్ధంలో ‘హారీతి’ అనే దేవత ఉన్నట్టు తెలుగు శాస నాల్లో కూడా ఉంది. ఆమె ఒక ప్రకృతి దేవత. వజ్రయానంలో సిద్దులు చేసిన ప్రయోగాలు, సిద్దుల రసవాదం పక్కన పెట్టి వారిని ‘క్షుద్ర’ విద్యలు తెలిసిన మాంత్రి కులనీ, బుద్ధుడిని అశుభానికి గుర్తుగా ప్రచారం చేసింది పూజారి వర్గం. బౌద్ధాన్ని అవలంబించేవారిని ఉలిపి కట్టెలుగా, సమాజానికి కీడు చేసేవారిగా చిత్రించి వారిపట్ల ద్వేష భావం పెంచడాన్ని ఈ సినిమాలో సందర్భానుసారంగా చూపించాడు. తమిళనాడు నుంచి కోలార్ బంగారు గనులకు కూలికోసం గని తవ్వకం పనికి వెళ్లి అక్కడే స్థిరపడిన దళితులు 19వ శతాబ్దం చివరికి కేజీఎఫ్లో ఓ కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు. పండిత అయోతీదాసు కేజీఎఫ్ కేంద్రంగా ఆది ద్రావిడ ఉద్యమాన్ని నిర్మించాడు. దళితులు హిందువులు కాదు, ఆది బౌద్ధులని చెప్పి వారిలో ఆత్మగౌరవాన్ని నూరిపోసి ‘శాక్య బౌద్ధ సమాజాన్ని’ స్థాపించిన అయోతీదాసుకి కేజీఎఫ్ ఒక లిబరేటెడ్ లాండ్ (విముక్త భూమి). దీనికి కొనసాగింపుగా పెరియార్ 1932లో ద్రావిడ ఉద్యమాన్ని కేజీఎఫ్ నుంచే ప్రారంభించడం విశేషం.కేజీఎఫ్లో దళితులు ఇప్పటికీ కులానికీ, మత తత్వానికీ ఎదురు నిలుస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా నిర్మిస్తున్నారు. దాని వెనుక ఉన్న త్యాగాల చరిత్రను పట్టుకున్నాడు పా. రంజిత్. తంగలాన్ దళిత సమస్య తాలూకు ప్రతి అంశాన్నీ తడిమిందని చెప్పాలి. దళిత స్త్రీలు ఒకప్పుడు పైవస్త్రం రవిక వేసుకునే వీలు లేదు. అది కొన్ని ప్రాంతాలలో నిషేధం అయితే మరికొన్ని చోట్ల తమ పేదరికం వలన కూడా వారికి అది దక్కేది కాదు. వారు రవిక ధరించడం తమ జనంలో ఓ గొప్ప ఉత్సవం. ఈ సినిమాలో అటువంటి సన్నివేశం ఒకటి అద్భుతంగా చిత్రించాడు పా. రంజిత్.అలాగే దళితుల ఆహారం! వారంతా గని తవ్వకం పనికి కోలార్ వెళ్లినాక కథానాయకుడు తంగలాన్తో అతని భార్య గంగమ్మ ‘మావా చింతపండు పులుసు పోసి నెత్తళ్ళ కూర వొండేదా?’ అంటే అతడు ‘కాదుమే, ఎండు తునకలు కూర చెయ్’ అంటాడు. వారు తిండిలేక అలమటిస్తున్నప్పుడు ఒక అడవి దున్న కనిపిస్తే దానిని నరికి మాంసం తిని తిరిగి శక్తి తెచ్చుకుని పని మెదలు పెట్టాలి అనుకుంటారు. ఇవన్నీ వారి జీవితాలలో సహజాతి సహజం. దళిత సమాజంలో స్త్రీ–పురుష సంబంధాలలో ఒకప్పుడు కనిపించే అరమరికలు లేనితనం, గుంపులో ఒకరిపట్ల మరొకరికి ఉండే కన్సర్న్, సామూహికత, చక్కటి సంభాషణలు తంగలాన్ సినిమాకు గొప్ప సౌందర్యాన్ని అద్దాయనవచ్చు.తెగిపడిన శాక్యముని తలని అతికించడం, చరిత్రలో కానరాకుండా పోయిన బంగారం లాంటి మూలవాసుల చరిత్రను వెలికితీయడం... అనే రెండు ముఖ్యమైన కర్తవ్యా లను తంగలాన్ శక్తిమంతంగా నిర్వహించింది. భూమి కోసం, భుక్తికోసం, ఆత్మగౌరవం కోసం చరిత్ర పొడవునా దళితులు వేసిన పొలికేకలు ఈ సినిమాలో మనకి అడుగ డుగునా వినిపిస్తాయి. చరిత్ర కళ్ళకు కట్టినట్టు వాస్తవికంగా కనిపించడం తంగలాన్ విజయం! నూరేళ్ళ వెండితెరపై మట్టి పాదాల్ని తన సంతకంగా ముద్రించిన సిసలైన తంగలాన్ పా. రంజిత్, తంగలాన్ పాత్రలో పూర్తిగా నిమగ్నమై గొప్పగా దానికి జీవం పోసిన హీరో విక్రమ్, అతని భార్యగా నటించిన పార్వతి, ప్రకృతి దేవత ‘ఆరతి’గా నటించిన మాళవిక, ఇతర నటీనటులు; ఒళ్ళు గగుర్పొడిచే సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాష్, ‘అంటారానోళ్ల’ చరిత్రని సంగర్వంగా సమర్పించిన జ్ఞాన వేల్... అందరికీ జై భీమ్!'తమిళనాడు నుంచి కోలార్ బంగారు గనులకు కూలికోసం గని తవ్వకం పనికి వెళ్లి అక్కడే స్థిరపడిన దళితులు 19వ శతాబ్దం చివరికి కేజీఎఫ్లో ఓ కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు. పండిత అయోతీదాసు కేజీఎఫ్ కేంద్రంగా ఆది ద్రావిడ ఉద్యమాన్ని నిర్మించాడు. దళితులు హిందువులు కాదు, ఆది బౌద్ధులని చెప్పి వారిలో ఆత్మగౌరవాన్ని నూరిపోసి ‘శాక్య బౌద్ధ సమా జాన్ని’ స్థాపించిన అయోతీదాసుకి కేజీఎఫ్ ఒక లిబరేటెడ్ లాండ్ (విముక్త భూమి). దీనికి కొనసాగింపుగా పెరియార్ 1932లో ద్రావిడ ఉద్యమాన్ని కేజీఎఫ్ నుంచే ప్రారంభించడం విశేషం. కేజీఎఫ్లో దళితులు ఇప్పటికీ కులానికీ, మత తత్వానికీ ఎదురు నిలుస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా నిర్మిస్తున్నారు. దాని వెనుక ఉన్న త్యాగాల చరిత్రను పట్టుకున్నాడు పా. రంజిత్'.– చల్లపల్లి స్వరూపరాణి, వ్యాసకర్త, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ -
బీసీలకు దామాషా ప్రకారం.. పదవులు దక్కాలి!
‘‘అణగారిన జనం సకాలంలో పురోగమించకపోతే కులం అనే విసుర్రాయి కిందపడి నలిగిపోతారని నేను భయపడుతున్నాను. అణగారిన కులాలను బలపరచట మంటే కుల విద్వేషాలను ప్రోత్సహించినట్లు కాదు. మనుషుల్ని వారి పుట్టుకను బట్టి హీనులుగా పరిగణించే పద్ధతి మనలో అంతరించిపోయిన రోజు నా జీవితంలో సంతోషకరమైన రోజు అవుతుంది’’ అన్న ఛత్రపతి సాహూ మహరాజ్... బలహీనవర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ 1902 జులై 26న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు భారత సామాజిక ఉద్యమాల చరిత్రలో బడుగులు మరిచి పోలేని రోజు..వందేళ్ళ క్రితమే సాహూ మహరాజ్ కొల్హాపూర్ సంస్థానంలో దళితులను గ్రామాల్లో పట్వారీలుగా నియమించారు. కానీ స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్ళ తర్వాత కూడా బీసీ కులాల గణన చేసి జనాభా దామాషా ప్రకారం చట్ట సభల సీట్లు కేటాయించమని అడుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారంటే దేశంలో ఆధిపత్య వర్గాలు నేటికినీ పల్లెలను ఎంతగా తమ చేతుల్లో పెట్టుకుని అధికారాల్ని చలాయిస్తున్నారో అవగతమవుతుంది. కులగణన ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోయిందంటే పాలకులు ఇప్పటి దాకా ఎంత నిర్లక్ష్యంగా పాలిస్తూ వస్తున్నారో తెలుస్తుంది.బడుగులు బాగుపడకుండా ఈ దేశం బాగుపడ దని తెలిసి కూడా దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. ‘బీసీ సబ్ ప్లాన్’ను పెట్టాలనీ, దానికి అత్యధిక నిధులివ్వాలనీ బీసీలు వూరేగింపులు చేస్తున్నారంటే ఇంతకంటే దేశానికి దరిద్రం మరేముంటుంది! కులగణనను కాంగ్రెస్ తాత్సారం చేస్తుంటే, బీజేపీ కులగణన చేయనని చెబుతోంది. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీల హక్కుల కోసం చట్టసభలు మాట్లాడకుండా దాటవేస్తూ రావటం ప్రజాస్వామ్యాన్ని హననం చేసినట్లుగానే భావించాలి. సగం దేశంగా ఉన్న బీసీ కులాల జీవన విధానం ఎట్లా ఉందో తెలుసుకోకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో ఎట్లా నడిపిస్తారో మన సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య పాలకులే చెప్పాలి.దేశాన్ని మొత్తం ఆవరించి ఉన్న బీసీ ఉత్పత్తి కులాలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో కీలక స్థానాలలోకి, నాయకత్వ దశకు రాకుండా దేశం అభివృద్ధి చెందదు. ఆధిపత్య కులాల పెట్టుబడి దారుల చేతుల్లో అధికార పగ్గాలు ఉన్నంత కాలం బీసీలు దుర్భరమైన పరిస్థితుల్లోనే మగ్గిపోక తప్పదు. దేశం అన్ని రంగాల్లోకి దూసుకు పోవాలంటే దేశాన్ని ప్రభావితం చేయగల బీసీలు అన్నిరంగాల్లో శిరసెత్తుకుని నిలవాలి. ఉత్పత్తి కులాల చేతులు పడకుండా దేశం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.మనం చైనా దేశ జనాభాను దాటి ముందుకొచ్చాం. ఉత్పత్తి శక్తుల చేతుల్లోకి దేశ ప్రగతి రథచక్రాలు వచ్చినప్పుడే చైనా ప్రగతిని మించి ముందుకు సాగుతాం. నేటికినీ బడుగు వర్గాలకు, ఉత్పత్తి కులాలకు పాలించే లక్షణాలు లేవని మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినట్లే అవుతుంది. ఉత్పత్తి కులాలు ఉత్పత్తి శక్తులై పారిశ్రామికవేత్తలుగా తయారైనప్పుడే దేశం అన్ని రంగాల్లో అసలు సిసలు ప్రగతిని సాధిస్తుంది. దేశాన్నీ, రాష్ట్రాన్నీ పాలించే పాలకులు సాహూ మహరాజ్ లాగా ఆలోచించాలి. ఆధిపత్య వర్గాల నాయకులు తమ హ్రస్వదృష్టిని విడిచిపెట్టి బడుగుల భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి. తమ కులం గొప్పదని, బడుగుల కులాలు తక్కువన్న దుర్మార్గపు ఆలోచన నుంచి ఆధిపత్య కులాలు బైట పడాలి.బడుగుల బాగే దేశం బాగు అని ఆలోచించగలిగినవారే సాహూ మహారాజులు కాగలుగుతారు. సమ రాజ్యాన్ని నిర్మించగలుగుతారు. బహుజన హితం కోరి దేశం అభివృద్ధిని కాంక్షించి బడుగులకు పల్లెనుంచి పార్లమెంటు దాకా వాళ్ళ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. స్థానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ వాళ్ళ జనాభా ఎంతో అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. కుల గణన చేస్తామని తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీల కుల గణన చేసినాకే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోవాలన్నది బీసీల సామూహిక డిమాండ్. తమ వాటా స్థానాలను కోల్పోయిన బీసీలు తమ హక్కుల సాధనకు వారే గొంతెత్తి గర్జించాలి.– జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు (బలహీన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ సాహు మహారాజ్ ఉత్తర్వులు జారీ చేసిన రోజు... జూలై 26) -
అంబేడ్కర్ దారిలో అలుపెరుగక..
‘ఈ ప్రపంచాన్ని జయించడానికి ప్రేమతో మొదలవ్వు. ప్రేమ త్యాగమై, యుద్ధ గీతమై, అదో గొప్ప పోరాటాన్ని విశ్వవ్యాప్తం చేస్తుంది. నిన్ను విజేతగా నిలబెడుతుంది’ అంటారు 71 ఏళ్ల సాహితీ వేత్త, దళితోద్యమ నాయకుడు డా‘‘ కత్తి పద్మారావు. ఆయన జీవితం – సాహిత్యం – ఉద్యమాలు వేర్వేరు కావు. పరిణామ క్రమంలో ప్రవాహ సదృశ్యంగా కొన సాగుతూ వచ్చిన, గుణవాచి అయిన కాల ధర్మం! అంబేడ్కర్ దార్శనికతనూ, తాత్వికతనూ, వివేచనా నిపుణతనూ ఆకళింపు చేసుకున్న ప్రథమ శ్రేణి ఆచరణ శీలుడాయన.అంబేడ్కర్ మార్గంలో పూలే నుండి పెరియార్ మీదగా చార్వాకుడు, బుద్ధుని వరకూ... ఆ తరువాతి నవ్య సిద్ధాంతకర్తలనూ, చరిత్రకారులనూ పరి శీలించి ఆకలింపు చేసుకున్నారు. సంస్కృత పాండిత్యం వల్ల అపా రమైన అధ్యయనం, పరిశీలన, రచనా శక్తి అబ్బింది. జలపాతం సదృశ్యమైన వాక్చాతుర్యం, సమయ స్ఫూర్తి, ఉత్తేజ పరచటం, వాదనా పటిమలతో అత్యుత్తమ రీతిలో ప్రజ లకు చేరువయ్యారు. కారంచేడు, కొత్తకోట, నీరుకొండ, పిప్పర్ల బండ్ల పల్లి, చుండూరు, పదిరి కుప్పం, వేంపెంట, లక్షింపేట వంటి ఉద్యమాలలో నాయకునిగా నిలిచి, ప్రభుత్వాలతో పోరాడి, ప్రజాయుద్ధంతో విజ యాన్ని సాధించారు.కారంచేడు, చుండూరు వంటి ఉద్యమాలలో బాధితుల పక్షాన నిలబడి వారికి వందల ఎకరాల భూములు ఇప్పించి, బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ సహాయం ఏర్పాటు చేసి, ఉద్యోగాలు ఇప్పించి, చిల్లిగవ్వ కూడా ప్రభుత్వ సొమ్ములను ఆశించకుండా నిజాయితీగా, నిబద్ధతతో తమ రచనలను నమ్ముకుని, అమ్ముకుని జీవనం సాగిస్తున్న అక్షర సంపన్ను లాయన. పార్లమెంటు సాక్షిగా 111 మంది ఎంపీలతో ‘1989 ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టా’న్ని తీసుకు రాగలిగారు.‘బౌద్ధ దర్శనం’, ‘చార్వాక దర్శనం’, ‘దళితుల చరిత్ర,’ ‘బ్రాహ్మణవాద మూలాలు’, ‘కులం ప్రత్యామ్నాయ సంస్కృతి’, ‘పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ’, ‘భారత రాజకీయాలు – కులాధిపత్య రాజకీయం – ప్రత్యామ్నాయ వ్యక్తిత్వాలు’, ‘అంబేడ్కర్ చూపు’ వంటి 89 రచనలను అందించారు. ఆయన కుటుంబం అంతా కులాంతర వివాహాలు చేసుకున్నారు. స్వయంగా తన చేతుల మీదుగా కొన్ని వేల కులాంతర వివాహాలు జరిపించడం ద్వారా ఒక సామాజిక మార్పునకు మార్గదర్శిగా నిలిచారు. మొత్తంగా ఆయన రచనల సారాంశం... ఉద్యమ రూపం, ప్రశ్న, ప్రతిఘటన, ప్రగతిగా సాగుతుంది. సమకాలీన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, సామా జిక రంగాల్లో కత్తి పద్మారావు పాత్ర ఎవరూ తిరస్కరింపలేనిది. – శిఖా ఆకాష్, నూజివీడు, 93815 22247 (రేపు డా. కత్తి పద్మారావు 71వ జన్మదినం సందర్భంగా...) -
ఇది.. ప్రగతి, సంక్షేమాల బడ్జెట్!
‘‘సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు’’ అన్నారు అంబేడ్కర్ మహాశయుడు. అక్షరాలా ఈ మార్గంలోనే సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజసంక్షేమాన్ని నిర్భయంగా అందించేందుకు, నిజాయితీగా ప్రజల జీవితాలను గాడిన పెట్టేందుకు బడ్జెట్లో కేటాయింపులు జరిపింది. ‘అభయ హస్తం’ కింద ఎన్నికలలో ప్రకటించిన ఆరు హామీలు ఇవ్వాళ తెలంగాణ నిరుపేదల జీవితాల్లో విశేషమైన మార్పు తెస్తు్తన్నాయి. వాటిని నెరవేర్చేలా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. రూ. 2,91,159 కోట్ల బడ్జెట్ తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసాదించేందుకు, గత దశాబ్ద కాలంగా ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ బిడ్డలకు భరోసా కల్పించేందుకు తోడ్పడుతుంది.‘‘వెన్నెలలు లేవు–పున్నమ కన్నె లేదుపైడి వన్నెల నెలవంక జాడలేదుచుక్కలే లేవు ఆకాశ శోక వీధిధూమధామమ్ము దుఃఖ సంగ్రామ భూమి’’ – దాశరథి కృష్ణమాచార్యఅవును... దాశరథి స్థితికి దగ్గరగా... గత అరవై యేండ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో మాత్రమే కాదు, గత ప్రభుత్వ దశాబ్ద పాలనలో కూడా తెలంగాణ అదే నిస్తేజ పరిస్థితిని అనుభవించింది. సంక్షేమం మాటను ఆశ్రితులకు సమర్పయామి మంత్రం... రూల్స్ మాటున తమ రాజకీయ యవనికకు రూట్స్గా నిలబడ్డ బడా బాబులకు అప్పనంగా ప్రజల ఆస్తుల సంతర్పణ చేసింది బీఆర్ఎస్ సర్కారు. ఏ బడ్జెట్ చూసినా... కేటాయింపులు, ఆపై తటపటాయింపులతో తల్లడిల్లిపోయిన తెలంగాణ ప్రజానీకానికి నిజసంక్షేమాన్ని నిర్భయంగా అందించేందుకు, నిజాయితీగా ప్రజల జీవితాలను గాడిన పెట్టేందుకు కావాల్సిన కేటాయింపులను ఈ బడ్జెట్లో చేశాం. అటు అసెంబ్లీలో గౌరవ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖామాత్యులు భట్టి విక్రమార్క, ఇటు మండలిలో సోదరుడు, ఐటీ పరిశ్రమల శాఖా మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఒకవైపు సంక్షేమం, మరో వైపు పురోగామి నిర్ణయాలతో జనరంజక బడ్జెట్ను మిత్రులిద్దరూ ప్రవేశపెట్టారు.నిరుద్యోగులకు అభయం..దాదాపు లక్షన్నర ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు తమ కోర్సులను పూర్తి చేసుకొని ఉద్యోగ సాధనలోకి దిగుతున్నారు. వీరికి స్కిల్స్ అందించే స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన గత ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. దానివల్ల ప్రతీ యేటా నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ, ఉద్యమాలు చేసే స్థాయికి సమస్య పెరిగింది. అందుకే, విద్యార్థుల నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు దిగ్గజ సంస్థ టాటా టెక్నాలజీస్తో కలిసి రూ. 2,324 కోట్లతో 65 ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చుతున్నాం. యూనివర్సిటీల పునర్వై భవం కోసం రూ. 500 కోట్లను కేటాయించాం. నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తున్నాం. కృత్తిమ మేధలో నిపుణులను తయారు చేసేందుకు, హైదరాబాద్ను ఈ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సెప్టెంబర్ 5, 6 తేదీలలో ‘మేకింగ్ ఏఐ ఫర్ ఎవ్రీవన్’ ప్రధానాంశంగా నిర్వహించ తలపెట్టిన సమావేశం తెలంగాణ యువతకు కొత్త భవి ష్యత్తుకు మార్గం చూపిస్తుందని విశ్వసిస్తున్నాం. తెలంగాణ ప్రజల ఆయురారోగ్యాలకు శ్రీరామరక్షగా నిలిచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. ఈ పథకం కింద ఉన్న 1,672 చికిత్సలలో 1,375 చికిత్సలకు ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీ ధరలను 20 శాతం పెంచడంతోపాటుగా 163 వ్యాధులను కొత్తగా ఈ పథకంలో చేర్చాం. ప్రతీ ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు ఉండేలా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును తీసుకువస్తున్నాం. ఇవేకాదు, ఎస్సీ సంక్షేమానికి రూ. 33,124 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.17,056 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 9,200 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ. 3,003 కోట్లు కేటాయించాం.అభయహస్తం – పేదోళ్ల నేస్తం..రహదారులు అభివృద్ధికి జీవనాడులు అంటారు. అందుకే మా ప్రభుత్వం రహదారులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టే రీజినల్ రింగు రోడ్డుకు ఈ బడ్జెట్లో రూ.1,525 కోట్లు కేటాయించాం. దాదాపు రూ. 26,502 కోట్ల ప్రాథమిక అంచనాతో నిర్మించతలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో పరిశ్రమల ఏర్పాటు, వాణిజ్య సేవలు, రవాణా పార్కులు ఏర్పడి అనూహ్యమైన అభివృద్ధిని సాధించి తెలంగాణను దేశంలో నెంబర్ వన్గా మార్చు తాయి. రాష్ట్ర రహదారులు, భవనాల నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ. 5,790 కోట్లు కేటాయించాం.అభయ హస్తం క్రింద ఎన్నికలలో ప్రకటించిన ఆరు హామీలు ఇవ్వాళ తెలంగాణ నిరుపేదల జీవితాల్లో విశేషమైన మార్పును తెస్తు్త న్నాయి. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 68.60 కోట్ల మంది అక్కలు, చెల్లెండ్లు, తల్లులు తమ గమ్యాలకు చేరు కున్నారు. దీనికోసం రూ. 2,351 కోట్లను సోదరీమణులకు ఆదా చేశాం. అంతేకాదు 39,57,637 కుటుంబాల్లోని సోదరీమణులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. దీనికోసం ఇప్పటికే రూ. 200 కోట్లను కేటాయించాం. బడ్జెట్లో మరో రూ. 723 కోట్లను కేటాయించాం. గృహజ్యోతి పథకం ద్వారా అల్పాదాయ వర్గాల ఇళ్లలో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపాలనే సత్సంకల్పంతో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ను వినియోగించే కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఇప్పటికే ఈ పథకం కింద 45,81,676 ఇళ్లకు ఉచిత విద్యుత్ వెలుగులు అందించాం. దీని కోసం బడ్జెట్లో రూ. 583.05 కోట్లు కేటాయించాం. నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు ఇంది రమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. దీని కింద ప్రతీ నియోజక వర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మొత్తం 4 లక్షల 50 వేల ఇండ్లను నిర్మించాలని సంకల్పించాం.వెలుగుల తెలంగాణను నిర్మిస్తాం..ప్రతీకార రాజకీయాలకన్నా, ప్రగతి రాజకీయాలను విశ్వసిస్తాం. అందుకే, 2014 నాటికి ఉన్న రూ. 75,577 కోట్ల అప్పులను 2023 డిసెంబర్ నాటికి రూ. 6,71,757 కోట్ల రూపాయలకు చేర్చినప్పటికీ విశాల ఆలోచనలతో పొదుపు మంత్రాన్ని పఠిస్తూ, దుబారాను తగ్గిస్తూ, క్రమశిక్షణతో కూడిన పాలనకు బాటలేస్తున్నాం. ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు కలిపి ఇప్పటికే రూ. 42,892 కోట్లు చెల్లించాం. సంక్షేమానికి రూ. 34,579 కోట్లు ఖర్చు చేశాం. అంబేడ్కర్ మహాశయుడు చెప్పినట్టు, ‘‘సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు. పునాది ఎంత బలంగా ఉంటే, ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది.’’ అక్షరాలా మేం ఈ మార్గాన్నే ఎంచు కున్నాం.‘అది చేసేంతవరకూ చూడటానికి ఎప్పుడూ అసాధ్యంగా కనిపి స్తుంది’ అని నెల్సన్ మండేలా చెప్పినట్టు, మేం రుణమాఫీ ప్రకటించిన రోజు అందరూ సందేహించినవారే. కానీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 11 లక్షల మంది లక్షలోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ చేశాం. ఆగస్ట్ 15 లోపలే రెండు లక్షల రుణాలున్న రైతన్నలందరి రుణాలను మాఫీ చేసి ఈ దేశ స్వాతంత్యం వచ్చిన రోజు నాటికి తెలంగాణ రైతన్నకు రుణ స్వాతంత్య్రం కలిగిస్తాం. భూమిలేని రైతుకూలీ లకు యేడాదికి 12 వేల ఆర్థిక సాయం అందిస్తాం. పంట బీమా చేసి రైతన్న కష్టనష్టాల్లో అండగా ఉంటాం. వరి రైతుకు ఇచ్చిన మాట ప్రకారం రూ. 500 బోనస్ను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం.శ్రీధర్ బాబు బడ్జెట్లో మహాత్మాగాంధీ మాటను ఉట్టంకించినట్టు, ‘‘మనం చేసే పనులకు, చేయగలిగే సామర్థ్యానికి ఉన్న అంతరం ప్రపంచంలోని సమస్యలన్నింటిని పరిష్కరించడానికి సరి పోతుం’’దనే మాట అక్షర సత్యం. ఇవ్వాళ మేం ప్రవేశపెట్టిన రూ. 2,91,159 కోట్ల బడ్జెట్ తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసాదించేందుకు, గత దశాబ్ద కాలంగా ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ బిడ్డలకు భరోసా కల్పించేందుకు తోడ్పడుతుంది.– కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యాసకర్త రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు -
సభా సంప్రదాయాలు పాటించాలి!
18వ లోక్ సభ కొలువు తీరిన వెంటనే అధికార, ప్రతిపక్షాలు తమ తమ రంగులు బయట పెట్టాయి. మాటలు పార్లమెంటు గోడలు దాటినా... పనులు పాతవే అని నిరూపించాయి. ప్రొటెం స్పీకరు ఎంపిక మొదలుకొని తమ మధ్య ముందు ముందు విభేదాలు తప్ప ఏకాభిప్రాయం ఉండబోదని తెలియజెప్పాయి.సభలో అత్యంత సీనియర్ను ప్రోటెం స్పీకరుగా ఎంచుకొని గౌరవిస్తారు. అలా అయితే విపక్షానికి చెందిన సురేష్ని నియమించాలి. కానీ అధికార పక్షం తమ పార్టీకి చెందిన సభ్యుణ్ణి నియమించింది. అలా పరిమిత అధికారం, రెండు మూడు రోజుల తాత్కాలిక పదవీ కాలం ఉన్న గౌరవ స్థానం విషయంలోనే అధికార పక్షం సంకుచితంగా ఆలోచించింది. తర్వాత పాటించాల్సిన సంప్రదాయం పట్ల కూడా మౌనం దాల్చింది.అదేమిటంటే డిప్యూటీ స్పీకరు పదవి విపక్షాలకు ఇవ్వడం! అధికార పక్షం మౌనంలో నిరాకరణ అర్థమై, స్పీకరు పదవికి పోటీ నిలబెట్టింది విపక్షం. అది కూడా సంప్రదాయానికి విరుద్ధమే. ఎలాగూ గెలిచే బలం లేదు. పెద్ద మనసుతో స్పీకరు ఎన్నికను ఏకాభిప్రాయంతో జరగనిస్తే హుందాగా ఉండేది. అధికార పక్షపు వైఖరి కన్నా మెరుగైనదిగా భావించబడేది.ఇక స్పీకరు, తన మొదటి తీర్మానంలోనే తన ఉద్దేశ్యం తెలియబర్చారు. 49 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ హయాంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, దేశంలో పెట్టిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానం అది. ఎమర్జెన్సీని వ్యతిరేకించడం వందశాతం ఒప్పే కానీ ఇప్పుడా పని చెయ్యడం అంత ఎమర్జెన్సీయా? నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకరు కాంగ్రెస్ పార్టీని రక్షణలో పడేయడానికి అర్జెంటుగా పూనుకున్నట్లు ఉంది తప్పించి ఇదేమంత అత్యవసర కార్యక్రమం అనిపించలేదు.అధికార, ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏకాభిప్రాయంతో మెలగనక్కర లేదు. అలా మెలగడం మంచిది కూడా కాదు. సంప్రదాయాలనూ, ఉన్న చట్టాలనూ, ఎదుటి పక్షాలనూ, వారి వాదనలోని ఔచిత్యాన్నీ గౌరవించాలి. అంతిమంగా ప్రజల పట్ల తమ బాధ్యతను గుర్తించాలి. ఈ సారి ప్రజా తీర్పు ఇరు పక్షాలకూ పాఠాలు నేర్పింది. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఏకపక్ష ధోరణులు విడిచిపెట్టి ప్రజా పక్షం వహించాలని స్పష్టం చేసింది. ఆ స్ఫూర్తి ఇరు పక్షాలూ నిలపాలి. అర్థవంతమైన చర్చలకూ, ఆరోగ్యకరమైన సంప్రదాయాలకూ మరలా పట్టంగట్టాలి. – డా. డి.వి.జి శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం -
రిజర్వేషన్ల పితామహుడు..
భారత దేశంలో దళితులు, బీసీల వంటి సామాజికంగా వెనుకబడిన వర్గాలవారి ఉన్నతికి ప్రభుత్వ పరంగా ఇప్పుడు కొనసాగిస్తున్న అనేక సదుపాయాలు, హక్కులను 19వ శతాబ్దంలోనే తన కొల్హాపూర్ సంస్థాన ప్రజలకు అందించినవాడు సాహు మహరాజ్. 1894 ఏప్రిల్ 2న సింహాసనం అధిష్టించిన సాహు, వెనుకబడిన కులాల వారందరికీ పాఠశాలలు, వసతి గృహాలు ప్రారంభించి విద్యాబోధనను ఒక ఉద్యమంగా నడిపాడు.1902 జులై 26, భారతదేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడిన వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులను జారీ చేసింది. గ్రామ పరిపాలన రంగంలో వంశపారం పర్యంగా వచ్చే ముఖ్యులైన పటేల్ (పాటిల్), పట్వారీ (కులకర్ణి) వ్యవస్థని 1918లో రద్దు చేశారు.1919 సెప్టెంబర్ 6న అంటరానితనం పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. 1920 మే 3వ తేదిన వెట్టిచాకిరీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేశారు. అంబేడ్కర్ అస్పృశ్యుల హక్కుల సాధన కోసం స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు ఆర్థిక సాయం చేశారు. 1920లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్లి చదువుకునేందుకు ఆర్థిక సహాయం చేశాడు. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించాడు. 1919 జూన్లో బాల్య వివాహాల రద్దు చట్టం వచ్చింది.1919 జులై 12న కులాంతర, వర్ణాంతర వివాహాలను చట్టబద్ధం చేస్తూ చట్టం తెచ్చాడు. విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగస్టు 2న విడాకుల చట్టం చేశాడు. 1920 జనవరి 17న జోగిని, దేవదాసీ వ్యస్థను రద్దు చేశాడు. ప్రభుత్వం దేవదాసీల పునరావాసానికి చర్యలు తీసుకున్నాడు. 1918లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలను ఏర్పాటు చేశాడు. మహారాజుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రిజర్వేషన్ల పితామహుడు సాహు మహరాజ్ 1922 మే 6న మరణించాడు. – సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా (నేడు సాహు మహరాజ్ జయంతి) -
ప్రమాద రహిత రైల్వేలు కలేనా?
పశ్చిమ బెంగాల్లోని రంగపాణి రైల్వే స్టేషన్ సమీపంలో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డౌన్ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు వెనుక నుండి ఢీకొట్టడంతో చాలా మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. రైల్వేవారు భద్రతా ప్రమాణాల పట్ల సరియైన శ్రద్ధ, చిత్తశుద్ధి కనపరచడం లేదనటానికి ఈ ప్రమాదం ఒక నిదర్శనం. ఈ ప్రమాదం అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. గూడ్స్ రైలు నిర్దేశించిన వేగం కంటే అధిక వేగంతో నడపడానికి ఎందుకు అనుమతించారు? అసలు రెండు రైళ్లు ఒకే ట్రాక్పై వెళ్ళటానికి బాధ్యులు ఎవరు?ఈ సంఘటన మానవ తప్పిదమని, దుర్ఘటనకు గూడ్స్రైలు డ్రైవర్ కారణమని రైల్వే వర్గాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా మానవ వనరుల కొరత సంగతీ వెలుగులోకి వస్తోంది. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను దాదాపు ఇరవై వేలు ఏళ్లతరబడి నింపకుండా వదిలేశారు. ఈ మానవ వనరుల కొరత... రైలు డ్రైవర్లు ఎక్కువ షిఫ్టులలో పనిచేయడానికి దారితీస్తోంది. ఫలితంగా ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి.2016లో ప్రారంభించిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (కవచ్)ను ఫీల్డ్ ట్రయల్స్ కోసం కేవలం 1,500 కిలోమీటర్ల కంటే తక్కువ రైల్వే ట్రాక్లలో మాత్రమే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భారతీయ రైల్వేల మొత్తం ట్రాక్ దాదాపు 70 వేల కిలోమీటర్లు. కాలానుగుణంగా అవసరాలకు తగ్గట్టు కవచ్ వంటి భద్రతా వ్యవస్థల ఏర్పాటుతోపాటు, మౌలిక సదుపాయాల ఆధునికీకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.నాణ్యతతో కూడిన భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలి. ఈ దుర్ఘటనపై న్యాయవిచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించి శిక్షించాలి. అదేవిధంగా ఇటువంటి దుర్ఘటనలు మునుముందు ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ప్రభుత్వం, రైల్వే బోర్డు వారు, రైల్వే శాఖలోని అన్ని విభాగాల ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, సాంకేతిక నిపుణులు, మేధావులు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కూడిన ఒక సంఘాన్ని ఏర్పాటు చే సి; దాని సూచనలతో కఠినమైన భద్రతా నియమ నిబంధనలు రూపొందించాలి.వీటిని కఠినంగా అమలుపరచడానికి అవసరమైతే పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి. రైల్వేలోని అన్ని విభాగాలలో ఖాళీలను వెనువెంటనే భర్తీ చేయాలి. ఆధునిక అత్యంత సాంకేతికతతో వేగంగా నడిచే ‘వందే భారత్’ రైళ్ళతో సమానంగా అదే స్థాయిలో భద్రతతో కూడిన సురక్షితమైన ప్రయాణ పరిస్థితులు కల్పించినప్పుడే భారత రైల్వే పట్ల ప్రయాణికులకు ఒక భరోసా కలుగుతుంది. – దండంరాజు రాంచందర్ రావు, హైదరాబాద్ -
రాజకీయ చాతుర్యంలో.. ఆయనకు సాటి లేరు!
దేశ గమనాన్ని మలుపుతిప్పినవారు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు. నాటకీయ పరిణామాల మధ్య ప్రధాని పీఠాన్ని అధిష్టించి మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడపడం ఆయన పాలనాదక్షతకు ప్రతీక. అసలు ఆయన ప్రధాని కాకపోతే నేటి సరళీకరణ ఫలాలు మనకు కనిపించేవి కావేమో? దశ (అదృష్టం), దిశ (గమ్యం) రెండూ కొందరి జీవితాల్లో అనూహ్యంగా ట్విస్ట్ అవుతుంటాయి.దేశ రాజధానిలో మూడు దశాబ్దాల రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి, వానప్రస్థం స్వీకరించాలనుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత పాములపర్తి వెంకట నరసింహారావు విషయంలో ఇదే జరిగింది. 1991 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా డిల్లీ నుండి పెట్టే బేడాసర్దుకుని ఇంటిదారి పట్టేపనిలో ఉన్నారు. శ్రీ సిద్దేశ్వరి మఠం (తమిళనాడు)లో శేష జీవితం గడపటానికి వెళ్ళబోతున్నానని తన సన్నిహితులకు చెప్పారు.ఈ తరుణంలోనే 1991 మే 21 రాత్రి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృత్యువాత పడటంతో, దేశ రాజకీయ పరిస్థితి ఒక్క ఉదుటున తారు మారయింది. ఇంకో విడత ఎన్నికలు జరగాల్సి ఉంది; పార్టీ అధ్యక్షుని హఠాన్మరణంతో అగాథంలో పడిన కాంగ్రెస్ నాయకులు మరుసటి రోజు మధ్యాహ్నం వర్కింగ్ కమిటీ మీటింగు ఏర్పాటు చేసి, అధ్యక్షుని స్థానంలో సీనియర్ నేత పీవీ నర్సింహారావును నియమించారు.కేవలం అరగంట పాటు జరిగిన ఆ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులు, పార్టీ అధ్యక్షుని మరణ రీత్యా సంతాప తీర్మానం చేసి, తర్వాత తాత్కాలిక పార్టీ అధ్యక్షునిగా పీవీని నియమించారు. భర్తను కోల్పోయిన విషాదంలో, సోనియా గాంధీ పార్టీ కార్య కలాపాలకు దూరంగా ఉండాలనుకుంది. జూన్లో వెలువడిన 10వ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 232 సీట్లు సంపాదించి, అతి పెద్ద పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.గాంధీ కుటుంబీకులు రేసులో లేకపోవటంతో... అర్జున్ సింగ్, మాధవ్ రావ్ సింధియా, రాజేష్ పైలట్, శరద్ పవార్ లాంటి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత పదవికి బరిలోకి దిగినప్పటికీ ఎన్నికైన అత్యధిక ఎంపీలు, గాంధీ కుటుంబానికి విధేయత, అనుభవం ఉన్న పీవీ వైపే మొగ్గు చూపారు. ‘పార్లమెంటు పార్టీ నేత ప్రధాని పీఠానికి అర్హుడు కాబట్టి, ఈ పదవికి పార్టీ ఎంపీలు తమలోని నాయకుణ్ణి డెమాక్రటిక్ పద్ధతిలోనే ఎన్నుకోవాలని’ పాచిక విసిరారు శరద్ చంద్ర పవార్. రాజకీయ చదరంగం ఆటలో అప్పటికే ఆయన పేరొందిన ఆటగాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఆయన అనునాయిడూ, పూణె ఎంపీ అయిన సురేష్ కల్మాడి (ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ స్క్వాడ్రన్ లీడర్) మహారాష్ట్ర సదన్ నుండి, ఉత్తరాది కాంగ్రెస్ ఎంపీలను పవార్ లాబీ కోసం సమీకరణ చేస్తూ షాం–ఏ–దావతులు ఏర్పాటు చేశారు. ఇటు కేరళ హౌస్ నుండి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. కరుణాకరన్, పీవీ కోసం దక్షిణాది కాంగ్రెస్ ఎంపీలను ఏకతాటిపై తేవటానికి ప్రయత్నాలు జరిపారు. అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జూన్ 19 నాడు కాంగ్రెస్ నేతలతో కిక్కిరిసింది. 232 మంది నూతన ఎంపీలను పార్లమెంటరీ పార్టీ నాయకుణ్ణి ఎన్నుకోమని ఒకవేళ ఓటింగ్ నిర్వహిస్తే పవార్ 35 ఓట్లతో వెనుకంజలో ఉంటాడని తెలిసిపోయింది. వీరిని తన వైపు మరల్చుకోవటానికి ఆయనకు ఇట్టే సమయం పట్టదని గ్రహించిన పీవీ, పోటీకి దిగిన శరద్ పవార్ను ఆఖరి ప్రయత్నంగా, ఒక వైపు తీసుకెళ్లాడు.ఏకాంతంలో పవార్తో, ఈ మధ్యనే తన గుండెకు శస్త్ర చికిత్స జరిగిందనీ, వయోభారంతో రాజకీయ విధులు నిర్వర్తించటం ఎక్కువ కాలం సాధ్యపడక పోవచ్చని చెబుతూ... మరాఠీలో, ‘మీ హీ జబాబ్దారీ మాఝ్య ఖాంధ్యా వర్ కితీ దివస్ పేల్వూ (నేను ఈ భాధ్యత నా భుజాలపై వేసుకుని ఎన్ని రోజులని మోయగలను) అంటూ, ‘కొన్ని రోజులపాటు తనకు ప్రధానిగా అవకాశం ఇవ్వవలసిందిగా’ నవ్వుతూ కోరాడు పీవీ. పీవీ తాత్విక ధోరణితో మాట్లాడిన మాటలకు చలించి పోయారు పవార్ సాహెబ్.మరుసటి రోజు ఉదయం (జూన్ 20) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. హాజరైన ఎంపీలు అంతా హాలులోకి ప్రవేశించిన శరద్ పవార్ వైపే సస్పెన్స్తో చూస్తున్నారు. మీటింగు ఆరంభం కావటంతోనే పవార్, జేబులోనుండి తను రాసిన ఒక లెటర్ తీసి సభ్యుల ముందుంచారు. ‘పార్టీ నాయకత్వాన్ని నిర్ణయించడంలో సీపీపీని సమావేశ పరచాలన్న డిమాండ్ను కాంగ్రెస్ అధ్యక్షులు (పీవీ) అంగీకరించడాన్ని నేను స్వాగతిస్తున్నాను. సీపీపీ సభ్యులందరూ శ్రీ పీవీ నరసింహారావుకు మద్దతు ఇవ్వాలనీ, ఈ విషయంలో ఏకగ్రీవ నిర్ణయానికి రావాలనీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అందులో కోరారు.అంతే, మరునాడు (1991 జూన్ 21) రాష్ట్రపతి భవన్లో పీవీ నరసింహారావు తొమ్మిదవ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తను ప్రధాని అయ్యాక, శరద్ పవార్ను పార్టీ జాతీయ అధ్యక్షునిగా నియమిస్తానని రావు ప్రామిస్ చేసినట్టు అంటారు. కాని, ఏప్రిల్ 1992 ఏప్రిల్లో జరిగిన తిరుపతి కాంగ్రెస్ పార్టీ సదస్సులో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని తన అనుకూల సభ్యులతో పునర్వ్యవస్థీకరించి, అధ్యక్షునిగా పార్టీ పగ్గాలు సైతం నాటకీయంగా కైవసం చేసుకున్నారు అపర చాణక్యుడు పీవీ నరసింహారావు. (శరద్ పవార్ రాజకీయ ఆత్మకథ ‘లోక్ మాఝే సాంగతి’, రషీద్ కిద్వాయి రాసిన ‘24 అక్బర్ రోడ్’ ఆధారంగా) వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్ కమిషనర్ 9819096949.సందర్భం: - జిల్లా గోవర్ధన్ -
వీసీల నియామకాల్లో ప్రమాణాలు పాటించాలి..
విశ్వవిద్యాలయాలు సమాజాన్ని నడిపించే మేధావులను తయారుచేసే కేంద్రాల వంటివి. చరిత్రను మలుపు తిప్పే ఉద్యమ కేంద్రాలుగానూ అనేకసార్లు నిరూపించుకున్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ చరిత్రలో యూనివర్సిటీలు నిర్వహించిన పాత్ర అమోఘం. ఉస్మానియా, కాకతీయ వంటి యూనివర్సిటీలు మలి తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినది.తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల అనంతరం తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది. అయితే ఇదంతా సాకారం చేయటానికి తమ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టిన విశ్వ విద్యాలయాల పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా మారుతోంది.2014లో స్వరాష్ట్రం వచ్చిన నాటి నుండి గడిచిన పదేండ్లలో విశ్వ విద్యాలయాలపై ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. యూనివర్సిటీల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న విధంగా ఉంది. మౌలిక సదుపాయాలు కొత్తగా కల్పించినవి ఏమీ లేదు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలు లేక యూనివర్సిటీల మనుగడ ప్రశ్నార్థకమయ్యింది. అటెండర్ పోస్ట్ మొదలుకొని అధ్యాపక పోస్టు వరకూ ఎన్నో పోస్టులు ఖాళీ అయ్యాయి. అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. దీనికి తోడు చాలా యూనివర్సిటీలకు పెద్ద దిక్కు అయిన వైస్ ఛాన్స్లర్లు (వీసీలు) లేరు. ఇన్చార్జీలతోనే కాలం గడుపుతూ వచ్చింది గత ప్రభుత్వం.ఈ నేపథ్యంలో ‘మార్పు కావాలి –కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన అనుముల రేవంత్ రెడ్డి సర్కారు సైతం విశ్వవిద్యాలయాలను గాలికొదిలేసినట్లుగా కనిపిస్తోంది. వీసీల నియామకాలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని చెబుతున్నా అది సాకారం అయ్యేలా కనిపించడంలేదు. ఒకరిద్దరు వీసీ పదవితో పాటూ మరో ఉన్నత పదవినీ నిర్వహించడం చర్చనీయాంశం అయ్యింది.విద్యారంగంలో నిష్ణాతులుగా ఉండి, ప్రొఫెసర్గా పదేళ్ళ అనుభవం ఉండి, మంచి పాలనా దక్షుడై ఉన్నవారే వీసీ పదవికి అర్హులు. కానీ ఈ ప్రమాణాలతో సంబంధం లేకుండా మంత్రులూ, కాంట్రాక్టర్లూ తమకు అత్యంత సన్నిహితులూ, క్లాస్మేట్లూ అయినవారిని కొన్ని యూనివర్సిటీలకు ఉపకులపతులుగా నియమించాలని పావులు కదుపుతున్నట్లు యూనివర్సిటీ క్యాంపసుల్లో చర్చలు నడుస్తున్నాయి. వీసీల నియామకంలో మంత్రులు తమ తమ సామాజిక వర్గాలవారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.దీన్నిబట్టి విశ్వ విద్యాలయాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఎంత భయంకరంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకుల జోక్యం తగ్గి, విశ్వ విద్యాలయాల స్వయం ప్రతిపత్తి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే ఇప్పటికైనా ఉపకులపతుల ఎంపిక ప్రక్రియ, కేవలం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలో మాత్రమే కాకుండా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమక్షంలో, నిష్పక్ష పాతంగా, అందరి దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకునేవిధంగా సాగాలి.అభ్యర్థులు ఆయా విశ్వవిద్యాలయాలను ఏ రకంగా అభివృద్ధి చేస్తారో తెలియచేసే విజన్ డాక్యుమెంట్లను సైతం సేకరించి విశ్లేషించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలి. అలా కాకుండా ప్రమాణాలను తుంగలో తొక్కి, అయినవారికే వీసీ పదవులను వడ్డిస్తే యూనివర్సిటీలు స్వరాష్ట్రంలోనూ బాగుపడవు. ఇక అందులో చదువుకునే యువత ఏవిధంగా తయారవుతారో ఊహించాల్సిందే!– జవ్వాజి దిలీప్; జేఎన్టీయూ పరిశోధక విద్యార్థి, హైదరాబాద్ -
'ఆజాదీ'కి.. ఓ పర్యాయపదం..
నియంతలకు భయమెప్పుడూయుద్ధమంటేనో, బాంబులంటేనో కాదు..ప్రశ్నలంటే, ప్రశ్నించే శక్తులంటేనే!నాగులు కోరల్లో విషముంచుకుని బుసకొట్టేదిబలముందని కాదు..కాలి చెప్పుల అదుళ్లకు అదిరిన భయంతోనే...అబద్ధాలతో రొమ్మిరిచి నిలబడొచ్చనుకునే వాళ్ళు సత్యం ముందు కురుచనవుతున్నామని తెలిస్తే...కుట్రల చిట్టా పేరుస్తారు నిన్ను చిన్నగా చూపడానికి!సముద్రం తన గర్భాన రేగు అగ్నిపర్వతాల అలజడులను..అగుపడకుండా దాచగలదేమో కానీ బద్దలవకుండా ఆపలేదు!ఎగిసి పడే లావాను అడ్డుకోనూ లేదు!!అరుంధతీ...నీ గొంతెప్పుడూ ఏకాకి కాదు,వేల గొంతులు నినదిస్తాయి ఆజాదీ కోసం..నీ భుజమెప్పుడూ ఒంటరీ కాదు,మా భుజాలను నీ భుజంతో అంటుకడతాం ఆజాదీ కోసం..నీ అడుగులెప్పుడూ ఖాళీగా ఉండవులక్షలాదిగా నీ అడుగుల్లో అడుగులేస్తూ ప్రవహిస్తాం!మానవత్వపు పరిమళాలను పంచే ఆజాదీ కోసం..అరుంధతీ...నీ పేరిపుడు ‘ఆజాదీ’కి..ఓ పర్యాయపదం!– దిలీప్. వి, 8464030808 (హక్కుల గొంతుక అరుంధతీ రాయ్కి మద్దతుగా...) -
వామపక్షాలకు నూతనోత్తేజం!
పార్లమెంటు ఎన్నికలలో సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. రెండు సీట్లు గెలుపొంది వామపక్ష శ్రేణులకు నూతనోత్తేజాన్ని కలిగించింది. బిహార్లోని అరా, కరాకట్ లోక్సభ స్థానాల నుండి లిబరేషన్ అభ్యర్థులు సుధామ ప్రసాద్, రాజారామ్ సింగ్లు విజయ బావుటా ఎగురవేశారు. భారత గడ్డపై ఫాసిస్టు శక్తుల పెరుగుదల అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన నేపథ్యంలో ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చేందుకు లిబరేషన్ తన వంతు కృషి చేస్తూ ‘ఇండియా’ కూటమిలో భాగస్వామిగా మారింది.అరా, కరాకట్, నలందా, కొడర్మ సీట్లలో బరిలో నిలిచింది. నలందా నియోజకవర్గంలో గట్టి పోటీ ఇచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే సందీప్ సౌరభ్ రెండో స్థానంలో నిలిచారు. జార్ఖండ్లో కొడెర్మలో వినోద్ సింగ్ (బాగోదర్ ఎమ్మెల్యే) రెండో స్థానంలో నిలిచారు. బిహార్లో అజియాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా దానిని లిబరేషన్ నిలబెట్టుకుంది. ఇక్కడ శివ్ ప్రకాష్ రంజన్ విజయం సాధించారు.మొదట సాయుధ మార్గాన్ని అనుసరించిన లిబరేషన్ పార్టీ కాలక్రమంలో తన పంథాను మార్చుకుంది. ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ (ఐపీఎఫ్)ను ఏర్పాటు చేసి 1985 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల్లో పాల్గొంది. 1989 పార్లమెంటు, 1990 అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచి ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించింది. 1989లో తొలిసారిగా రామేశ్వర ప్రసాద్ను అరా నియోజకవర్గం నుంచి పార్లమెంటుకి పంపింది. ఆ తర్వాత జయంతా రోంగ్పి అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ నుంచి పలుమార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఇద్దరు ఎంపీలను బిహార్ నుంచి పార్లమెంట్కు పంపింది.1995 అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ పేరుతో పోటీ చేస్తోంది. 2010 ఎన్నికల్లో తప్ప మినహా ఆ పార్టీ ప్రతినిధులు మిగిలిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. గతంలో ఒంటరిగా పోటీ చేసి పదకొండు మంది సభ్యులను అసెంబ్లీకి పంపిన చరిత్ర లిబరేషన్కు ఉంది. జైలులో ఉండి శాసన సభకు గెలిచిన చరిత్రా ఉంది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లిబరేషన్ అపూర్వ విజయాల్ని సొంతం చేసుకుంది.19 స్థానాల్లో పోటీ చేసి 12 చోట్ల గెలిచింది. ఒక మహిళా ఎమ్మెల్సీ శాసన మండలిలో ప్రాతినిధ్యం కలిగి ఉంది. సీట్ల సంఖ్యలో తరుగుదల, పెరుగుదల ఉన్నప్పటికీ నికరమైన, స్థిరమైన ఓటు బ్యాంకు, బలమైన ప్రజా పునాది కలిగి ఉండటం విశేషం. జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం సుదీర్ఘ కాలంగా ఉంది. గతంలో అస్సాం, పంజాబ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. 25 రాష్ట్రాలలో పార్టీ, ప్రజా సంఘాల నిర్మాణం కలిగి ఉంది.‘రణవీర్ సేన’ లాంటి ప్రైవేటు సైన్యాలను ఎదుర్కొన్న వీరోచిత చరిత్ర లిబరేషన్ది. అణచివేతలపైనా, సామాజిక న్యాయం కోసం దశాబ్దాల తరబడి పోరాటాలు కొనసాగిస్తూ వస్తోంది. విద్య, వైద్యం, భూమిలేని పేదల కోసం, రైతుల హక్కుల కోసం, ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు నడిపింది. నిరంతరం పేదల కోసం పోరాడిన సుధామ ప్రసాద్, రాజారామ్ సింగ్లు పేదల హక్కుల్ని కాపాడడం కోసం పార్లమెంట్లో తమ గళాన్ని బలంగా వినిపించబోతున్నారు. – మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, 78932 30218. -
Eid Al-Adha 2024: మౌలిక విధులు..
ఇస్లామ్ ధర్మంలోని ఐదు మౌలిక సూత్రాల్లో ‘హజ్’ కూడా ఒకటి. కలిమా, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనే మౌలిక సూత్రాల్లో ఏ ఒక్కదాన్ని నమ్మక పోయినా విశ్వాసం పరిపూర్ణం కాదు. అందుకని ఈ ఐదు అంశాల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఇందులోని చివరి అంశం హజ్. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాం మక్కాలో నిర్మించిన దైవ గృహ సందర్శనా ప్రక్రియను ‘హజ్’ అంటారు.హజ్ అనేది ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ముస్లిం జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా తప్పక ఆచరించాల్సిన విధి. ఇది జిల్ హజ్జ్ నెల పదవ తేదీన మక్కాలో నిర్వహించబడుతుంది. అదేరోజు యావత్ ప్రపంచ ముస్లింలు ఈద్ జరుపుకొని ఖుర్బానీలు సమర్పిస్తారు. ఇస్లామీయ క్యాలండరులో ఇది చివరి నెల. దీని తరువాత కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.అందుకే ఈ నెలకు ఎనలేని ప్రాముఖ్యం ఏర్పడింది. ఈ నెలలోని మొదటి పదిరోజులూ చాలా ప్రాముఖ్యం కలిగినవి. ఈ దశకంలో దైవ కారుణ్యం కుండపోతగా వర్షిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చేసే ప్రతి సత్కార్యమూ గొప్ప ప్రాముఖ్యాన్ని కలిగి దేవుని కృపకు పాత్రమవుతుంది. ఈ దినాల్లో చేసిన ఆరాధనలు ప్రీతికరమైనంతగా, మరే ఇతర దినాల్లో చేసిన ఆరాధనలు కూడా దైవానికి అంతగా ప్రీతికరం కావు. ఈరోజుల్లో పాటించే ఒక్కొక్క రోజా (ఉపవాసం)... ఏడాది మొత్తం పాటించే రోజాలకు సమానం. ‘అరఫా’ (జిల్ హజ్ నెల 9వ తేదీ) నాటి ఒక్క రోజా రెండు సంవత్సరాల పాపాలను ప్రక్షాళన చేస్తుంది. అరఫా రోజు సైతాన్ ఘోర పరాజయాన్ని చవిచూస్తాడు. అవమాన భారంతో చితికి పోతాడు.‘అరఫా’ రోజు ‘లాయిలాహ ఇల్లల్లాహు వహదహూ లాషరీ కలహు, లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలాకుల్లి షయ్ ఇన్ ఖదీర్’ అనే దుఆ ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. దీనితో పాటు ‘తహ్ లీల్’ అంటే, ‘లాయిలాహ ఇల్లల్లాహ్’; ‘తక్బీర్’ అంటే, ‘అల్లాహుఅక్బర్’; ‘తహ్ మీద్’ అంటే, ‘అల్ హందులిల్లాహ్’; ‘తస్ బీహ్’ అంటే, ‘సుబ్ హానల్లాహ్’ అని తరచుగా ధ్యానిస్తూ ఉండాలి. అరఫా రోజే కాకుండా ‘అయ్యామె తష్రీఖ్’లో కూడా అంటే, పండుగ తరువాతి మూడు రోజులూ (జిల్ హజ్ నెలలోని 11, 12, 13 తేదీలు) వీలైనంత అధికంగా ఈ వచనాలు పఠించాలి. కనుక ఈ సుదినాలను సద్వినియోగం చేసుకుంటూ పండుగ ముందు రోజు పాటించే ‘అరఫా’ ఉపవాసం పాటించి, సత్కార్యాలు ఆచరిస్తూ దైవక్రృపకు పాత్రులు కావడానికి ప్రయత్నించాలి. దైవం మనందరికీ సన్మార్గ పథం అనుగ్రహించుగాక! – మదీహా అర్జుమంద్ (నేడు బక్రీద్) -
రాజకీయాలకు చట్టం బలి..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత సంతకం చేసిన ఫైళ్లలో ఒకటి ల్యాండ్ ‘టైటిల్ గ్యారంటీ చట్టం రద్దు’ ఫైల్. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని భూ సంస్కరణలలో భాగంగా భారత దేశంలో మొట్టమొదటిసారి అమలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.ఒక్కో గ్రామంలో భూ సమస్య పరిష్కారం కావడానికి తరతరాలు పడుతోంది. దీన్ని నివారించడానికి తెచ్చినదే ‘టైటిల్ గ్యారంటీ చట్టం.’ అప్పుడెప్పుడో శతాబ్దాల క్రితం చేసిన సర్వే తప్ప ఇటీవలి కాలంలో భూసర్వే జరగనే లేదు. అందుకే ఈ కొత్త చట్టం ప్రకారం సమగ్ర భూ సర్వే, డిజిటల్ ల్యాండ్ సర్వే చేసి ఏమైనా సమస్యలు ఉంటే సర్వే సెటిల్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అక్కడికక్కడే పరిష్కరించి పట్టా పాస్ బుక్కులు ఇచ్చారు. అయినా ఎన్నికల్లో దీన్ని ఎందుకు ప్రచారాస్త్రం చేశారు?‘సింగిల్ సెటిల్మెంట్తో భూ సమస్య పరిష్కారం అయితే మేమేం కావాలి? మా పూట ఎలా గడవాలి’ అని గ్రామాల్లో పూట గడుపుకునే పెద్ద మనుషుల నుండి రైతులను చెప్పులు అరిగేలా కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్న న్యాయవాదుల వరకు వ్యతిరేకించారు. అందుకే ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మారింది.తెలంగాణలో గొప్పలకు పోయి తెచ్చిన పట్టాదార్ పాస్ బుక్ చట్టం – 2020, ‘ధరణి’ పోర్టల్ వంటివి పెద్ద అక్రమాలకు తావిచ్చాయి. అందుకే ఆంధ్రప్రదేశ్లో చేసిన టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా ఈ చట్టాన్ని ఉదాహరణగా తీసుకుని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, గుడ్ గవర్నెన్స్, గుడ్ అడ్మినిస్ట్రేషన్ లాంటి సర్టిఫికేట్లు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ చట్టాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా ఎందుకు మలిచారు? అధికారం చేపట్టగానే రెండో సంతకం ఈ ఫైల్ మీదే ఎందుకు చేసినట్టు? ఈ సందర్భంగా భూ చట్టాల న్యాయ నిపుణులు ‘మంచి చట్టాన్ని చెత్త రాజకీయాలు చంపేశాయ’ని అంటున్నారు. – బందెల సురేందర్ రెడ్డి, మాజీ సైనికుడు -
శాంతాత్ముల సహనం..!
సీతమ్మను లంకాధిపతియైన రావణుడు అపహరించి తీసుకువెళ్ళి లంకలోని అశోకవనంలో దాచాడు. అది తెలుసుకున్న శ్రీరాముడు వెంటనే సముద్రాన్ని దాటి లంకకు చేరే ప్రయత్నం మొదలుపెట్టాడు. తెప్పలు కట్టుకుని దాటడానికి ఎదురుగా ఉన్నది చిన్న నది కాదు కాబట్టి, సముద్రుడిని ప్రసన్నం చేసుకోవడం ఒక్కటే మార్గం అని విభీషణుడు సలహా ఇచ్చాడు. దాన్ని అంగీకరించాడు శ్రీరాముడు, సముద్రుడిని దారి వదలమని ప్రార్థించడానికి పూనుకున్నాడు.సముద్ర తీరంలోని ఇసుకపై దర్భలతో తయారుచేయబడిన చాపమీద తన కుడిభుజాన్ని తలగడగా చేసుకుని శయనించి ఏకాగ్ర చిత్తంతో సాగరుడిని ప్రసన్నం కమ్మని ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తూ ఉండగా విభావరులొక మూడు గడిచాయట! అనగా మూడు రాత్రులు గడిచాయి శ్రీరాముడి జీవితంలో! మూడురోజులు ప్రార్థించినప్పటికీ సముద్రుడి నుండి సమాధానం రాకపోవడంతో సహనం కోల్పోయాడు శ్రీరాముడు.పక్కనే ఉన్న లక్ష్మణుడితో ‘తమ్ముడా, ఈ సముద్రుడు నన్ను అసమర్థుడిగా జమకట్టాడు. ఇతడితో సహనం పాటించడం వివేకంతో కూడుకున్న పని కాదు. ఇతడు దారికి రావాలంటే దండన ఒక్కటే ఇప్పుడు మిగిలున్న మార్గం. బాణాగ్ని చేత ఈ సాగరుడిని శోషింపజేసి, మన సైన్యం నడిచి వెళ్ళడానికి దారి కల్పిస్తాను!’ అని శక్తిమంతమైన ఒక బాణాన్ని సంధించి సముద్రుడి మీదికి వదిలాడు శ్రీరాముడు.దశదిశలలో దారుణ అగ్నిశిఖలను విరజిమ్ముతూ ఆ బాణం సముద్రంలో ప్రవేశించగానే, నిలువెల్లా వణికిపోతూ సముద్రుడు పరుగున వచ్చి శ్రీరాముడి ముందు నిలిచాడు. సుముద్రుడి అప్పటి అవస్థను ఏనుగు లక్ష్మణకవి తన ‘రామేశ్వర మాహాత్మ్యము’, ప్రథమాశ్వాసంలోని ఈ క్రింది కంద పద్యంలో అలతి మాటలలో వర్ణించాడు."కోపంబు సంహరింపుమునీ పదకమలములు గొలిచి నిల్చిన నన్నుంజేపట్టుము మ్రొక్కెద, నాచాపలము సహింపు రామ సద్గుణధామా!"‘కోపాన్ని ఉపసంహరించుకో శ్రీరామా! నీ పాదములపై వాలి వేడుకుంటున్న నన్ను సేవకుడిగా భావించి ఆదరించు! సద్గుణాలకు నెలవైన ఓ స్వామీ, నా తెలివితక్కువ చేష్టకు నన్ను దయతో మన్నించు!’ అని సముద్రుడు వేడుకున్నాడు. ధీరులు, శాంతాత్ములు, పరమాత్మ స్వరూపులుగా ఉండేవారి సహనాన్ని పరీక్షించే చాపల్యపు పనికి పూనుకుంటే, సముద్రుడంతటి వాడికైనా భంగపాటు తప్పదని పై సన్నివేశం బోధిస్తుంది. – భట్టు వెంకటరావు -
దేవుడు స్వతంత్రుడా?
ఈ సృష్టిలో నిజంగా స్వతంత్రులెవరైనా ఉన్నారా? లౌకిక ప్రపంచాన్ని గమనిస్తే... కుటుంబ సభ్యులు కుటుంబ యజమాని వశంలో ఉంటారు. ఆ యజమాని తనకు జీవనోపాధి ఇచ్చే మరో యజమానికి వశుడు. ఆ యజమాని కూడా చట్టానికీ, ప్రభుత్వానికీ లోబడవలసిందే. సవ్యమైన పాలన అందించే ప్రభువు కూడా ప్రజల అభీష్టాలకు అనుగుణంగా పాలించాలి. పూర్తి స్వతంత్రుడు కాలేడు. ఇక ప్రజాస్వామ్యమైతే, ప్రజలే స్వాములని పేరులోనే ఉంది. పాలకులు సేవకులు!ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే... జగత్తంతా దైవాధీనం. శివుడి ఆజ్ఞ లేకుండా చీమ చిటుక్కుమనడం కూడా జరగదని నమ్మకం. ‘నా వల్లనే ఈ జగత్తంతా నడుస్తుంది!’ – మత్తః సర్వ ప్రవర్తతే– అని గీతాచార్యుడి ప్రకటన. ‘పరమాత్మనైన నేను అధిష్ఠానంగా ఉంటుండగా, త్రిగుణాత్మకమైన నా మాయా శక్తి త్రిలోకాలను సృష్టిస్తుంది. భూతకోటి యావత్తూ ఈ మాయా శక్తి వశులై నడుస్తారు’ అంటాడు. అలాంటప్పుడు, ఇక ప్రాణులకు స్వాతంత్య్రం ఎక్కడ? ఏపాటి? పోనీ ఆ దైవం స్వతంత్రుడా అంటే, పూర్తి స్వతంత్రం ఆయనకూ లేదు. ఆ భగవంతుడిని తమ వశంలో ఉంచుకోగల వాళ్ళు కూడా ఉన్నారు.భాగవతంలో దుర్వాస మహర్షి అంబరీశుడిని అకారణంగా సంహరించబోగా, విష్ణుమూర్తి సుదర్శన చక్రం, తనకున్న దుష్ట శిక్షణ కర్తవ్యాన్ని అనుసరించి, తనంతట తానే మునీంద్రుడిని తరుముతూ వెళ్తుంది. దాన్ని తప్పించుకునే మార్గం తెలియక, తిరిగి తిరిగి ముని చివరికి విష్ణుమూర్తినే ప్రార్థిస్తాడు.‘నీ ఆయుధాన్ని ఉపసంహరించుకుని నన్ను రక్షించ’మని. ‘అంత స్వతంత్రం నాకెక్కడిది?’ అంటాడు విష్ణుమూర్తి. ‘అహం భక్త పరాధీనః, అస్వతంత్రః ఇవ ద్విజ!– ఓ మునీంద్రా, నేను నా భక్తుల అధీనంలో ఉండేవాడిని. అక్కడ నాకు స్వతంత్రం లేదు. నా హృదయం వాళ్ళకు బందీ. సద్గుణవతులైన స్త్రీలు, సత్పురుషులైన తమ భర్తలను వశం చేసుకొన్నట్టు, ఆ సాధువులు నన్ను వశం చేసుకుంటారు. నా ఆయుధాన్ని ఆపగల శక్తి అంబరీషుడికే ఉంది. నాకు లేదు!’ – ఎం. మారుతి శాస్త్రి -
గ్రామ రాజ్యం బీసీల పరం కావాలి!
తెలంగాణ పల్లెల్లో నేటికినీ కొనసాగుతున్న ఆధిపత్య వర్గాల పెత్తందారీతనాలు నామరూపాలు లేకుండా పోవాలంటే స్థానిక రాజ్యాలు (సంస్థలు) బహుజన వర్గాల చేతుల్లోకి రావాలి. స్థానిక రాజ్యాలైన గ్రామపంచాయతీ, మండల పరిషత్తు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్, కో ఆపరేటివ్ సొసైటీలు, డీసీసీబీలు, డీసీఎంఎస్లు, స్కూలు కమిటీలు, గ్రామ అభివృద్ధి కమిటీలలోకి పెద్దసంఖ్యలో చదువుకున్న బహుజన యువకులు రావాలి.అంటే బీసీ యువత పెద్దఎత్తున స్థానిక గ్రామీణ రాజకీయ రంగంలోకి రావాలి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి స్థానిక పాలనలో రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్ల స్థానాల్లోకి చదువుకున్న దళిత, గిరిజన, ఆదివాసీ, మైనారిటీ తెగలకు చెందిన యువత రావాలి. ఈ పని జరిగినప్పుడే గ్రామాలలో సామాజిక మార్పులు సాధ్యమవుతాయి.తరతరాలుగా బీసీ వర్గాలకు చెందినవాళ్ళు ఎంబీసీలు, సంచార, అర్థసంచార జాతులు, ఉత్పత్తి కులాలకు చెందినవాళ్ళు సంపద సృష్టికర్తలుగా ఉన్నారు. కానీ రాజకీయ రంగంలోకి మాత్రం రాలేదు. సమాజంలో సగానికిపైగా ఉన్న ఉత్పత్తి కులాలకు చెందినవారి భాగస్వామ్యం స్థానిక సంస్థల్లో లేకపోవడం వల్ల ఆ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన కులాల సమస్యల పరిష్కారాలు ఆ యా కులాలవారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నప్పుడే సాధ్యమవుతుంది.తరతరాలుగా విన్నపాలు, విజ్ఞప్తులు పట్టుకుని గ్రామ పంచాయతీలు, మండల, జడ్పీ కార్యాలయాలు, కలెక్టరేట్ల దగ్గర నుంచి సచివాలయాల వరకు చెప్పులరిగేలా తిరిగిన బహుజన కులాలవాళ్ళు తమ సమస్యల పరిష్కారానికి తామే స్థానిక రాజ్యాల నాయకులు కావటం చాలా మార్పులకు దారితీస్తుంది. ఇది బీసీలకు రాజకీయ న్యాయంగా మాత్రమే కాకుండా మొత్తంగా సామాజిక పరివర్తనగా చూడాలి.గ్రామాలు దేశానికి ఊపిరైతే ఆ గ్రామాలకు ఉత్పత్తి కులాలు, ఉత్పత్తి శక్తులే ప్రాణాలు. బీసీల్లో చదువుకున్న కొత్తతరం తనకున్న పరిశోధనాత్మక ఆలోచనలను గ్రామాభివృద్ధిపై పెడితే ఊహించని అద్భుత ఫలిలాలు వస్తాయి. గ్రామం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తన చుట్టూ ఉన్న సహజ వనరులను ఉపయోగించుకుని సంపద సృష్టించే కేంద్రంగా మారుతుంది. కులవృత్తులు నేడు కునారిల్లుతున్నాయి. అవి అత్యాధునిక రూపం దాల్చితేనే నేటి ప్రపంచానికి అవసరమైన సంపదలను అందించే కేంద్రంగా గ్రామాలను తయారుచేయడం సాధ్యమవుతుంది. ఇదంతా జరగాలంటే స్థానిక సంస్థలపై బహుజనుల అధికారం నెలకొనాలి.జనాభాలో బీసీల సంఖ్యను బట్టి దామాషా ప్రకారం అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలి. ఆ యా బీసీ కులాలవారు అన్ని రంగాల్లో శిరసెత్తుకుని నిలిచేందుకు తమ అస్తిత్వ ఉద్యమాలను కొనసాగించక తప్పదు. దీన్ని కులకోణంగా తప్పుడు విశ్లేషణలు చేసి బడుగుల చైతన్యాన్ని పక్కదారి పట్టించే పనిని ఆధిపత్య వర్గాలు విస్తృతంగా చేస్తూ ఉన్నాయి. కులగణన చేయాలని అస్తిత్వ కోణం నుంచి అడుగుతుంటే అడ్డుతగులుతూ కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటుదన్న వాదనలు తీసుకువస్తున్నారు.బీసీలు సంపూర్ణ రాజకీయ సాధికారత సాధించకుండా సమాజ వికాసం సంపూర్ణం కాదు. ఈ విషయాన్ని మరుగున పరుస్తూ బీసీల అస్తిత్వమే లేకుండా చేసేందుకు ఆధిపత్య వర్గాలు పనిచేయటం కొత్తేమీ కాదు. బడుగులకు విద్యా, ఉద్యోగ విషయాలలో రిజర్వేషన్లు ఇచ్చేందుకు మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేసే సమయంలో ఆధిపత్య వర్గాలు సృష్టించిన అలజడులు అన్నీ ఇన్నీ కావు. అన్ని పార్టీలలోని ఆధిపత్యవర్గాలు తెరవెనుకనుంచి చేసిన కుట్రలన్నీ చరిత్రలో పదిలంగా రికార్డయ్యే ఉన్నాయి.ఇపుడు బీసీల కులగణన చేయమంటే సమాజం కులాల పేరున విడిపోయి అల్లకల్లోలం అవుతుందన్న వాదనలు ఆధిపత్య వర్గాలు ముందుకు తెస్తున్నాయి. తెలంగాణ ప్రజలు స్వీయరాజకీయ అస్తిత్వం కోణం నుంచి 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం నిర్వహించి రాష్ట్ర సాధనలో విజయం సాధించి ప్రపంచ అస్తిత్వ ఉద్యమాలలో నిలిచారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలు ఇపుడు బహుజన స్వీయరాజకీయ అస్తిత్వాన్ని సాధించుకోవాలి. ఇది సాధించినప్పుడే స్వరాష్ట్రం సాధించుకున్న లక్ష్యం పరిపూర్ణమవుతుంది.ఈ దిశలోనే స్థానిక సంస్థల్లో బీసీలకు తమ జనాభా ఎంతో అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ విడుదల చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తానని వాగ్దానం చేసింది. జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా బడుగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.రాహుల్ గాంధీ, కులగణన చేస్తామని దేశమంతా చెబుతున్నారు. కులగణన చేసి స్థానిక సంస్థల్లో ‘మేమెంతో మా వాటా అంత రిజర్వేషన్లు ఇవ్వాల’నీ, ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీలు బెర్రగీసి అడుగుతున్నారు. ఈ విషయంలో బీసీలపై కాంగ్రెస్కు ఉన్నది అసలు ప్రేమా లేక ఓట్ల కోసం చేసిన వాగ్దానమా బట్టబయలు కావల్సి ఉంది. ఏం జరుగబోతుందోనని 2 కోట్ల మంది బీసీలు ఎదురు చూస్తున్నారు.– అభిప్రాయం: జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త కవి, రచయిత -
పారిభాషిక పదాలు.. సృష్టించుకోవాలి!
ఖగోళ శాస్త్రం వంటివాటిల్లో పరిశోధనలు చేస్తూనే బ్రహ్మ గుప్తుడు లాంటి భారతీయ గణిత మేధావులు ప్రపంచానికి సున్నా (0) ను అందించారు. సున్నా (0) విలువ కూడా భారతీయ గణిత వేదవేదాంగ సాహిత్యవేత్తే కనిపెట్టాడు. అయితే అది ఇంకా వెలుగులోకి రాలేదు. దీనికి కారణం గణితం, భౌతిక, రసాయనిక జీవ శాస్త్రాదులను బాగా కప్పివేసిన ఆధ్యాత్మిక, జ్యోతిష్య సంబంధ భావజాలం. ఆ ముసుగును తీసి భారతీయ గణిత, భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాదుల తేజాన్ని ప్రయోగశాలలో చూపించాలన్న ఆసక్తితో ముందుకు వెళ్ళేవారికి ఇక్కడ సరైన ఆదరణ లభించడం లేదు.సమస్త విజ్ఞానం మన వేదాలలోనే ఉందని మన ఆధ్యాత్మిక, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్తలు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా... ప్రయోగ శాలలో నిలవని విజ్ఞానం తుదకు అజ్ఞానంగానే మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రయోగశాలలో నిలవాలని తపించే భారతీయ వేదవేదాంగ శాస్త్రాలలో నిపుణులైనవారికి ఆర్థిక శక్తి లేమి అడ్డు వస్తోంది. కాస్త సైన్స్ చదువుకున్నవారు ఆధ్యాత్మిక జ్యోతిష్యాదులను అడ్డు పెట్టుకొని మాట్లాడే మాయగాళ్ళను సూడో సైన్స్గాళ్ళు అంటే, వీరు వారిని మరో విధంగా వెక్కిరిస్తారు. ఈ చర్చోపచర్చలు కాలక్షేపానికి తప్ప మరెందుకూ పనికిరావు. భారతీయ వేదవేదాంగ పురాణేతిహాసాలలో ఏ శాస్త్రం ఎంత ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే ఆ యా విషయాల గురించి మాట్లాడటానికి తగినంత పారిభాషిక (టెర్మినాలజీ) పదజాలం లేదన్నది అక్షర సత్యం.వేదవేదాంగ పురాణేతిహాసాల విజ్ఞానం కథా రూపంలో ఉంటుంది. కథా భాష, ప్రయోగ శాల భాష ఒక రీతిన ఉండదు. ఉదాహరణకు రాజకుమారి ఉద్యానవనంలో చెలికత్తెలతో ఆడుకుంటోంది. ఆకాశంలోని పక్షుల వరుసలను చూసింది. మొదటి వరుసలో ఒకటి, రెండవ వరుసలో రెండు ఇలా... పదవ వరుసలో పది! మొత్తం పక్షులు ఎన్ని అంటే అందరి పప్పులు ఉడికాక రాజకుమారి 55 అని సమాధానం చెబుతుంది.n(n+1/2) అనే ఆధునిక గణిత సూత్రం రాజకుమారికి తెలియకపోవచ్చును. అయితే వేగంగా 10+(9+1=10)+(8+2=10)+(7+3=10)+(6+4=10) +5=55 అని నోటితో గణించే మేధ రాజకుమారికి ఉండి ఉండవచ్చు. పదికి దగ్గరకు వచ్చి కూడికలు, తీసివేతలు వంటివి చేస్తే లెక్క సులభం అవుతుంది అని ఆమెకు తెలిసి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ రాజకుమారి మేధను సూత్ర బద్ధం చేస్తే, భారతీయ గణితం అందరికీ అర్థమవుతుంది. అయితే సూత్ర బద్ధం చేయడానికి కావలిసినంత టెర్మినాలజీని మనవారు మనకు అందించలేదన్నది నిజం. టెర్మినాలజీ లేకుండా ఆధ్యాత్మికతతో, జ్యోతిష్యాది గణింపుతో ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు.మన వేదవేదాంగ పురాణేతిహాసాల శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి కావల్సినంత టెర్మినాలజీని మనం పెంచుకోవాలంటే... మన పండితులు చాంధస భావాలకు అతీతంగా, అసూయాద్వేషాలకు అతీతంగా మెలగాలి. రేపటి తరానికన్నా మన శాస్త్రవిజ్ఞానాన్ని తెలిపే టెర్మినాలజీని పెంచే దిశగా పోయేటందుకు ఇంగ్లిష్ మీడియం వైపునకు వెళ్ళాలంటే కొందరు తెలుగు భాషాభిమానులకు కోపం వస్తుంది. మన సంప్రదాయం, మన పద్యం, మన ఛందస్సు అంటూ ఆవేశ పడిపోతారు.నిజమే... కొన్ని వందల ఏళ్ళ నుండి మన ఛందస్సులో కొందరు మహా కవులు, కవులు పద్యాలు రాస్తున్నారు. సంతోషమే. కానీ అదే ఛందస్సులో కంప్యూటర్కు చెందిన ద్విసంఖ్యా మానాది గణితాంశాలు ఉన్నాయని ఎందరికి తెలుసు? పోనీ కొందరికి తెలుసు అనుకుందాం. తెలిసినవారు ఆ యా అంశాలను ప్రయోగశాల వద్ద ఎంత మేర సక్సెస్ చేశారు? వారికి తెలిసినదానిని ఎంత మంది గణిత సూత్రాలుగా మలచారు?రేపటి తరమన్నా ఇంగ్లిష్ మీడియం వైపు నకు వెళ్ళి మన వేదాంగాదులలో ఉన్న విజ్ఞాన ఛాయలకు చక్కని టెర్మినాలజీ తయారుచేస్తే, మనం పశ్చిమ దేశాల కంటే ముందే ఉంటాము. మాతృభాష లోనే ఈ పని చెయ్యవచ్చు కదా అని కొందరు అనవచ్చు. అది సాధ్యం కాని పని. ఎందుకంటే మన మాతృభాషా పదజాలం కొంచెం ముందుకు వెళితే అది ఆధ్యాత్మికతలో కూరుకుపోతుంది. లేదా ఖగోళం, జ్యోతిషం అంటూ కాలక్షేపం చేస్తుంది.ఇంగ్లిష్ మీడియం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డేరింగ్ స్టెప్ వేశారు. దానిని అలాగే కొనసాగించాలి. ఛందస్సు కేవలం పద్యాలు రాసుకోవడానికి పుట్టింది కాదనీ, అందులో ద్విసంఖ్యా మాన గణితం, ఇంకా ఆధునిక గణితంలోకి ప్రవేశించని ఉదాత్తానుదాత్తాదుల గణితం ఉందనీ రేపటి తరమన్నా గమనించాలి.రెండు రెళ్ళు ఆరు అన్నది సాహిత్యంలో చెప్పుకోవడానికి ఆహ్లాదంగా ఉండవచ్చు. కానీ రెండు రెళ్ళు నాలుగు అన్నది నిజం. ఆ నిజం మాటున ఉన్న సైన్స్, మాథ్స్ వైపు వెళ్ళాలంటే ఆయా భారతీయ సబ్జెక్టులకు సరిపడ టెర్మినాలజీ తప్పక ఉండాలి.అభిప్రాయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు, వ్యాసకర్త విశ్రాంత ఉపాధ్యాయులు, 9849448947 -
రవి పరంజపే : చిత్రకారుల సంపద..!
అప్పుడెప్పుడో అనబడే రోజుల్లో.. బాగ్ లింగం పల్లి వీధుల్లో ఎడాపెడా తిరిగే ఆర్టిస్ట్ చంద్ర గారి వెంట ఆంజనేయులు అనే నీడ పడేది. ఆ ఇరుకు చీకటి నీడల్ని తడుముకుంటూ నాలుగడుగులు వేస్తే తగిలేదే బేచులర్ కొంప ఆఫ్ అంజనేయులు అండ్ ఫ్రెండ్స్. ఆ ఇరుకు మురికింట్లో మంచం పైనా, పరుపు కింద అట్టలు గట్టుకు పొయిన అట్టల మధ్య ఉండేది ఆంజనేయుల్స్ కలక్షన్ ఆఫ్ ఆర్ట్. వందలాది దేశీయ విదేశీయ బొమ్మల కత్తిరింపు కలెక్షనది. అవన్నీ అలా తలకిందుంచుకుని నిద్దరోతే కలలోనైనా బొమ్మలొస్తాయేమోనన్నది హనుమంతుల వారి థీరి.ఆంజనేయులుగారి రూముకి వెళ్ళినప్పుడల్లా ఆ బొమ్మలని తీసి చూస్తూ ఉండటం నాకో ముచ్చట. అంతటి ఆ బొమ్మల కలెక్షన్ లో ఒకసారి నాక్కనబడిందో నలుపు తెలుపుల ఇంద్రచాపం. దూరాన మైసూర్ మహరాజవారి ప్యాలెస్, దసరా సంరంభం, ఏనుగులు అంబారీలతో సహా బారులు తీరాయి. కొమ్ములూదుతున్న నల్లని శరీరాలు, చత్రాలు పుచ్చుకుని రాజ సేవకులు, దారికిరువైపులా జనం.. 1970-80 మధ్యలో అచ్చయిన పత్రికా ప్రకటన తాలూకు బొమ్మ అది. బహుశా నేనపుడే కళ్ళు తెరవడం, నడక, ప్రాకటం లాంటి వయసులోవుంటా. బొమ్మలాగే కింది సంతకం కూడా చక్కగా వుంది రవి పరంజపే అని.ఆనాటి నుండి మొదలైంది రవి పరంజపే గురించిన అన్వేషణ, నాకు తెలిసిన వారికెవరికి తెలీని పేరిది. ఎక్కడి వారో, ఇప్పుడెక్కడ వున్నారో చేప్పేవారే లేరు. కాలం గడుస్తూ వుంది, గూగ్లింగ్ సాగుతొంది, "నహీ ఉదాస్ నహీ" హేమంత్ కుమార్ పాట వినబడుతూనే వుంది. కృషో, దీక్షో, పట్టుదలో, అదృష్టమో 1098/A రుతిక, మోడల్ కాలని, పూనే. ఇది పరంజపే పతా, ఫొన్ నంబర్తో సహ దొరికింది,.ఫోన్ చేసి ఆయనతో మాట్లాడా, ఎక్జైంటింగా వుంది ఆయన్ని వింటుంటే, దయగల గొంతు, ప్రేమగా మాట్లాడారు, పూనే రమ్మన్నారు, నా బొమ్మలు పట్టుకు రమ్మన్నారు. ఆ దినం నుండి రెండు నెలలపాటు చాలా మంది స్థానిక చిత్రకారులతో మాట్లాడా. వారందరికీ ఆయన బొమ్మల లింక్ పంపించా. ఆయన వర్ణ విన్యాసాలు వివరించా. అందరూ నాకు మళ్ళేనే థ్రిల్లయ్యారనిపించింది. చివరకు ట్రైను ఎక్కేరోజు నన్ను నేనే మోసుకుని బయలుదేరా.. చలో మహారాష్ట్ర్, జై మహారాష్ట్ర్.ఉదయం 6 గంటలకు దిగి చూస్తే రోమింగ్ లేక ఫోన్ డెడ్, మొబైళ్ల పుణ్యమాని వీధులో పబ్లిక్ బూతులు, ఎస్టీడి షాపులు లేవు, ఒకే ఒక్క కాల్ ప్లీజని సెల్లున్న వాడినెవడినైనా అడుక్కుంటే అలీబాబా 27వ దొంగని చూసినట్టు నా వైపు అదో లుక్కు. ఇదంతా వ్రాయదగ్గ మరో చావు. అఫ్జల్ గంజ్ టూ లంగర్ హౌజ్ వయా తార్నాక సూత్రం తెలిసిన ఆటో వాడి ఆటోలో 9:30 కు మొడల్ కాలనీలో ఆడుగు పెట్టా. ఇంటి నెంబర్ దొరక బుచ్చుకొడానికి చాతకాల(మధ్యలో వొ యధార్థ జోక్ బాపు గారిని కలవడానికి మద్రాస్ వెల్లినపుడు ఆయనకు ఫొన్ చేస్తే ఆయనన్నారు "ఫలానా కాలనీకి వచ్చి ఫలనా చోట ఆగి ఫలానా బాపు ఇల్లెక్కడని అడగకండి! ఎవరికీ తెలియదు, మలయాళి సూపర్ స్టార్ ముమ్ముట్టి ఇల్లు అడగండి ఎవరైనా చెబుతారు, ఆయన ఇంటి ఎదురిల్లే మాది, చాలా ఈజీ ". సిగ్గులేకుండా మేమలాగే బాపుగారి చిరునామా కనుక్కున్నాం కూడా.)పూనా లెఖ్ఖ కాస్త తేడాగా వుంది పరంజపే ఇల్లు అడిగీ అడగంగానే అరకిలొమీటర్ దూరం నుండే జనాలు సినిమా థియేటర్ అడ్రస్ చెప్పినంత ఈజీగా చేప్పేశారు .పరంజపేది పెద్ద బంగళా. భక్తిగా, ప్రాణంగా చేసిన బొమ్మల పని సంపాదించి పెట్టిన ఇల్లది. ఇంటర్నెట్లో చూసి వూహించుకున్న బొమ్మలు వేరు, ఇక్కడి వాస్తవం వేరు. ఇంటి గోడలనిండా గోడలంత పెద్ద పెద్ద పెయింటింగులు, ఇంటర్నెట్లో చూసి ఇది పెన్సిల్ పనని, ఇది సాఫ్ట్ పేస్టలతో వేసిందని ఊహించిన బొమ్మలన్ని అయన ఆయిల్స్ లో, ఆక్రిలిక్కుల్లో చిత్రించినవి! జిగేలని గులాబీలో మెరిసిపోతూ నీలంలోకి జరిగిన అ వర్ణ సమ్మేళనం ఆయిల్లొ ఎట్లా జరిగిందో, అసలెట్లా జరుగుతుందో అంతు చిక్కని రహస్యం ఆ పెయింటింగుల నిండా ఆవరించుకుని వుంది. బొమ్మలమీంచి పొడుగ్గా సాగిన గీతలు బొమ్మ వెనుక డిజైన్ లోకి అల్లుకుపోవడం కేవలం రంగుపెన్సిల్కే కదా సాధ్యం అనే సంభ్రమానికి ఫుల్ స్టాపిస్తూ ఆయన ఆ గీతల్ని బ్రష్ పుచ్చుకుని కేన్వాస్ మీదికి లాగాడనేదే నిజమంత నిజం.తను కథలకు, అడ్వర్టైజ్మెంట్లకు వేసిన నలుపు తెలుపు బొమ్మలు!! రోట్రింగ్ పెన్ 90 డిగ్రీల కోణంలో నిలపెట్టి లాగితే రావాల్సిన లైనది, అటువంటి లైన్ ను పాయింట్ బ్రష్ తీసుకుని మందం చెడకుండా గీశాడాయన.(తరువాత ఆ బొమ్మలన్నింటినీ కుంచె మాంత్రికుడు మోహన్ గారికి చూపి బ్రష్ తో గీశాట్ట! అంటే నిస్సహాయంగా నవ్వడాయన) బొమ్మల స్టడీ అంటూ వీధులెంట తిరుగుతూ ఆయిల్ పేస్టల్స్ తో చేసిన స్కెచ్లు మహా అరాచకం, ఆయన చేతిలోని మైనం వీధులు గట్టిన వైనం చూడాల్సిందే (అద్రుష్టవశాత్తు ఆయన బొమ్మలన్ని పుస్తకాల రూపంలో వచ్చాయి) ఆయన వేసిన ప్రకృతి చిత్రాలు, కథల బొమ్మలు, అడ్వర్టైజ్మెంట్ డిజైన్లు, పొర్ట్రైట్లు, పెన్సిల్ స్కెచ్లు ఇదంతా ఒక ఎత్తైతే, ఆర్చిటెక్చర్ రంగంలో ఆయన గీసిన పర్ఫెక్టివ్ బొమ్మలు ఇంకా ఎత్తు. అవి వేయడం వెనుక కృషి, కష్టం గురించి చెప్పుకుంటూ పొతుంటే వినడానికే కష్టంగా వుంది, వేయడానికి ఆయన ఇంకెంత కష్టపడ్డారో చూస్తే తప్ప తెలీదు.ఒక శైలి కాదు, ఒక తరహాలో నిలవలేదు, ఇదే ఉపరితలమని భీష్మించుక్కూచ్చోలేదు, బొమ్మ రహస్యం తేల్చడానికి రంగు అంతు చూడటానికి ఈ చిత్రకారుడు చేసిన కృషి మాటలలో చెప్పలేనిది, వాక్యాలలో వ్రాయలేనిది. మాటల మధ్యలో, బొమ్మల మధ్యలో మీకు తెలుగు చిత్రకారుల గురించి తెలిసిందెంత అని అడిగా, ఆయనకేం తెలీదు, ఎవరి పేరూ వినలేదు (మనమేం తక్కువ గొప్పవాళ్ళమా మనమూ రవి పరంజపే పేరు వినలేదుగా, దీనానాధ్ దలాల్ గురించి తెలుసుకోలేదుగా). కళ్ళు మూసుకుని బాపు తదితర పెద్దల పేర్లు వల్లించా, చంకలోని సంచినుంచి బాపు కొన్ని తులనాత్మక బొమ్మలు లాంటి పుస్తకం చేతిలో పెట్టా, మాట్లాడక పుస్తకం అంతా తిరగేశారు, దయచేసి నాకు ఈ పుస్తకం ఇవ్వగలవా అని తీసుకున్నారు, మళ్ళీ వాటినొకమారు సుతారంగా తిరగేసి, ఏ బాపు సాబ్ మహాన్ హై బహుత్ కాం కియా ఇనోనే అన్నారు. మనకా సంగతి తెలుసు కాబట్టే ఏ రాష్ట్ర మేగినా ఎందు కాలిడినా బాపు గారే మన ట్రంప్ కార్డ్.బాక్ టూ పరంజపే.. ఆయనది ఒక బొమ్మ చూసినా, వంద చూసినా వినిపించేది సంగీతమే అది రేఖా సంగీతం. ఈయన వర్ణ జంత్రగాడు. ఈయనకు సంగీతమంటే ప్రాణం. భీం సేన్ జోషి నా మానసిక సాంగీతిక్ గురువు. 1951 నుండి అయన్ని ఆరాధిస్తున్నాను, ఆయన గొంతునుంచి ఏదైతే నేను విన్నానో దాన్నే నా బొమ్మల్లో వినిపించాలని నా ప్రయత్నం అంటారు పరంజపే. దాన్ని నూటికి నూరుపాల్లు నిరూపించారు కూడా. ఒక చిత్రకారునిగా పరంజపేని చూడాలనుకున్న నాకు ఆయన అంతకు మించి ఎంతో వినిపించారు. జీవితం పట్ల ఆయనకున్న దృష్టి గొప్పది. మానవతం పట్ల విశ్వాసం ఆశాజనకమైనది. దేశ విభజనకు పూర్వం నుంచి ఈనాటి దాక మనుషుల, దేశాల మధ్య ఏర్పడిన గీతలు, వాటి వెనుక స్వార్ధాలు, జిన్నాను కాంగ్రేస్ నుంచి తప్పిచడానికి గాంధీజీ మద్దతించిన ఖిలాఫత్ కుట్ర, రాజకీయాల దగ్గర్నుంచి కేవలం స్థల, కాల సాపేక్షాలైనా మతాల వరకు నిరశించారు.ఆయన భావనలో ధర్మం గొప్పది. కులాల్ని, మతాన్ని పట్టుకు అదే ధర్మం అనుకుంటున్నారు. అసలైన ధర్మాన్ని తెలుసుకోవడానికి సౌందర్య భక్తి ఒక్కటే మార్గమని, ఆ దృశ్య సౌందర్యం, శ్రావ్య సౌందర్యమే తన ధర్మమన్నారు.. ఆఖరుగా సెలవు తీసుకుని వెనక్కు తిరిగి గుమ్మం దాటుతున్న నన్ను పిలిచారు.. ఏమని వెనక్కి తిరిగి చూస్తే చేతులు జోడించి "అన్వర్ అప్కే బాపు సాబ్కో మేరా ప్రణామ్ బోలో" అన్నారు.1935 కర్ణాటకలోని బెల్గాంలో పుట్టిన రవి పరంజపె.. కేబీ కులకర్ణి గారి శిష్యరికంలో బొమ్మల్లో ఓనమాలు దిద్దుకున్నారు, బ్రతుకు తెరువుగా బొమ్మల్ని ఎంచుకుని బొంబాయి చేరిన రవి పరంజపే శాశ్విత నివాసం పూనె అయ్యింది. బొమ్మలకు సంభందించిన ప్రతి పనిలో నైపుణ్యాన్ని సాధించారాయన. లెక్కకు మించిన దేశ విదేశ పురస్కారాలు ఆయన్ని వరించాయి. 2008లో ప్రతిష్టాత్మకమైన భైరు రతన్ దమని సాహిత్య పురస్కారం ఆయన ఆత్మ కథకు లభించింది. చిత్రకళకు సంభంధించి ఈయన ఇప్పటికీ అర డజనుకు పైగా పుస్తకాలు వెలువరించారు. చిత్రకారులు, చిత్రకళపై ఆసక్తి వున్నవారు తప్పక చూడదగ్గ, చదవదగ్గ, నేర్చుకోదగ్గ సంపద ఇందులో వుంది.2022 జూన్ 11వ తేదీన గొప్ప చిత్రకారులు రవి పరంజపే కళ్ళు మూసారు. ఆయన స్ఫూర్తి దీపాన్ని వారి సతీమణి పట్టుకు నిలబడ్డారు. ఆ దీప కాంతిలో దారి పోల్చుకుంటూ నేటికీ చిత్రకారులు అనేకులు ఆయన ఇంటికి వస్తారు. ఆయన బొమ్మలని చూస్తారు. ఉత్తేజితులవుతారు. వర్క్ షాపులు నిర్వహించుకుంటారు. బొమ్మల గురించి కథలు కబుర్లు మాటాడుకుంటారు. బొమ్మలు వేస్తారు. బొమ్మలని శ్వాసిస్తారు. రవి పరంజపే గారు తన జీవితకాలంలో కల్చరల్ ఐకన్. ఆయన మరణానంతరం ఆయన ఇల్లు ఒక సాంస్కృతిక కేంద్రం. రష్యన్ చిత్రకారుడు ఇల్యారెపిన్ గురించి మన తెలుగు ఆర్టిస్ట్ మోహన్ గారు ఇలా అన్నారు. "ఇల్యా రెపిన్ చిన్న వయసులోనే 'సక్సెస్' రుచి చూశాడు. దేశంలోనూ, బయటా గొప్ప విఖ్యాతి. ఎంత ఖ్యాతి అంటే జారిస్టు సెన్సార్ మందకు ఆయన బొమ్మలు మింగుడు పడకపోయినా ఏమీ చేయలేక పోయారు. 20వ శతాబ్దారంభానికి ఆయన పేరు ప్రఖ్యాతులు అత్యున్నత శిఖరాలకు చేరాయి. అయినా సరే 1900వ సంవత్సరంలో ఆయన అకాడమీనీ, భవంతులనీ, ప్రశంసలనీ, సంపదలనీ వదిలి పీటర్స్బర్కు దూరంగా చిన్న గ్రామానికి వెళ్ళి అక్కడే కుటీరంలో ఉన్నాడు.ఆయన వ్యక్తిత్వం అయస్కాంతం లాంటిది. మాగ్జిమ్ గోర్కీ, అలెగ్జాండర్ కుప్రిన్, పావెల్ బునిన్ ఆ కుటీరానికి వచ్చేవారు. మయకోవ్స్కీ, సెర్గీ ఎసెనిన్ లాంటి ప్రముఖులంతా ఈ కుటీరంలో రెపిన్తో గడిపేవారు. లియో టాల్స్టాయ్ ఆయనకు ఆప్తమిత్రుడు. రష్యాలోని ప్రముఖ శాస్త్రజ్ఞులూ కళాకారులూ ఇక్కడికొచ్చి ప్రసంగాలిచ్చేవారు. ఈ కుటీరంపై పోలీసు నిఘా ఉండేది. వేగుల సమాచారం ఎప్పటికప్పుడు జార్కు చేరుతుండేది. ఆ కుటీరం ఇపుడు రష్యాలో పుణ్యతీర్థం లాంటిది. ఏటా లక్షమంది జనం అక్కడికెళ్లి ఇది రెపిన్ ఇల్లు, ఇది రెపిన్ తోట అని భక్తితో చూసి వస్తారు. గురజాడ ఇల్లు చూడడానికి మనమిలా విజయ నగరం వెళ్తామా"? – అన్వర్. -
ఆ విజయానికి అయిదు శతాబ్దాలు..
దక్షిణ భారత చరిత్రలో స్వర్ణయుగం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయల కాలం. అప్పట్లో కళింగరాజ్యం అత్యంత బలమైనది. దీన్ని గజపతులు పాలిస్తూ ఉండేవారు. వారి రాజ్యం ఒరిస్సా నుంచి ప్రస్తుత నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకూ విస్తరించి ఉండేది. ఉదయగిరి విజయనగర రాజ్య సరిహద్దుల్లో ఉండి రాజ్య ముఖద్వారంగా ఉండేది. ప్రతాపరుద్ర గజపతి కళింగాధిపతి. అతడు రాహుత్త రాయలను ఉదయగిరి కోట రక్షకునిగా నియమించాడు.ఉదయగిరిపై కొండవీటి రెడ్డిరాజులు, మహమ్మదీయ రాజులూ ఒక కన్నేసి ఉంచారు. కానీ బలమైన గజపతులతో తలపడలేక అదను కోసం ఎదురు చూశారు. ఇదే సమయంలో విజయనగర పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరిని ఎలాగైనా జయించాలని క్రీ. శ. 1513లో బయలుదేరాడు. గుత్తి, గండికోట మీదుగా తన సేనతో ఉదయగిరి రాజ్యంలో ప్రవేశించాడు. ఉదయగిరిలో ఘోర యుద్ధం జరిగింది. దుర్గ రక్షకుడు రాహుత్త రాయలకు అండగా ప్రతాపరుద్ర గజపతి తన సైనికులను పంపి కృష్ణరాయలను ఎదుర్కొన్నాడు.రాయలు తన చతురంగ బలగాలను ఎంతో చాకచక్యంగా నడిపినా దుర్గం వశం కాకపోవడంతో అసహనంతో ఊగిపోయాడు. చివరికి ఒక రోజు సైనికులకు ఉత్తేజాన్ని కలిగిస్తూ... దుర్గాధిపతి తలను రేపటి కల్లా కాలితో తంతానని శపథం చేశాడు. యుద్ధాన్ని ఉద్ధృతపర్చి సైనికులను ఉత్సాహపరిచాడు. తాను స్వయంగా యుద్ధరంగంలో దూకి సైనికులను కోట గోడల మీదికి ఎగబాకించాడు. దీనితో గజపతి సైనికులు హహాకారాలు చేస్తూ శరణు వేడారు. అలా అతి కష్టం మీద దుర్గాన్ని రాయలు చేజిక్కించుకొన్నాడు. శరణు కోరిన అందరినీ రక్షించాడు.దుర్గాధిపతి రాహుత్త రాయలు తన స్వర్ణ కిరీటాన్ని బంగారు పళ్లెరంలో పెట్టి శ్రీకృష్ణదేవరాయలకు సమర్పించాడు. అన్నట్లుగానే రాయలు దాన్ని కాలితో తన్ని తన పంతం నెగ్గించుకున్నాడు. రాహుత్త రాయలను బంధించాడు. 1514 జూన్ 9న సాధించిన ఈ విజయాన్ని రాయలు తన ‘ఆముక్తమాల్యద’లో చెప్పుకున్నాడు. చారిత్రక దృష్టి గల నంది తిమ్మన తన ‘పారిజాతాపహరణం’లోనూ, అల్లసాని పెద్దన ‘మనుచరిత్ర’లోనూ ఉదయగిరి ముట్టడిని అభివర్ణించారు. పాశ్చాత్య చరిత్రకారులు కృష్ణరాయల ఉదయగిరి ముట్టడి 18 నెలలు సాగిందని పేర్కొన్నారు. ఉదయగిరి విజయంతో రాయలు పూర్వ విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించినట్లయింది.ఉదయగిరి విజయం శ్రీ వెంకటేశ్వస్వామి దయ వల్లనే లభించిందని నమ్మిన రాయలు ఇక్కడి నుండి నేరుగా తిరుమలకు బయలుదేరాడు. క్రీ.శ. 1514 జూలై 6న స్వామి వారిని దర్శించుకున్నాడు. 30 వేల వరహాలతో స్వామి వారికి కనకాభిషేకం చేయించాడు. విలువైన ఆభరణాలు సమర్పించాడు. తాళ్ళపాక గ్రామాన్ని రాయలు స్వామి వారి పేరిట ధర్మంగా ఇచ్చాడు. విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఉదయగిరి దుర్గాన్ని సాధించటం అత్యంత ప్రతిష్ఠాత్మక విజయంగా భావిస్తారు. – ఈతకోట సుబ్బారావు, 94405 29785 (శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి రాజ్యాన్ని జయించి 510 ఏళ్లు) -
సరైన చోటు..?
మనం బస్సులో ఎక్కినప్పుడు కూర్చోవటానికి చోటు ఉందా లేదా అని వెతుక్కుంటాం. అది కూడా వెనక్కి అయితే కుదుపులు ఉంటాయని ముందు వరసల్లోనే కూర్చోవటానికి పోటీ పడతాం. రైల్లో ఎక్కినప్పుడు కూడా సౌకర్యంగా కిటికీ దగ్గర చోటుకు ఇష్టపడతాం. అంతేకాదు... సభలకు, సమావేశాలకు వెళ్ళినప్పుడు బాగా వినటానికి, చూడటానికి బాగుంటుందని ముందు వరుసల్లో చోటు చూసుకుంటాం. చదువుకునే రోజుల్లో విద్యార్థులు ముందు బెంచీల్లో చోటు కోసం ప్రతిరోజూ పోటీ పడుతుంటారు.కొన్ని గంటల సేపు ప్రయాణం చేయటానికే సౌకర్యవంతమైన చోటును చూసుకుంటున్నాం. ఆ కాసేపు అదేదో మన సొంత చోటులా భావిస్తూ అందులోకి ఎవరూ రాకుండా జాగ్రత్త పడుతున్నాం. మరి, శాశ్వతమైన చోటు సంపాదించుకోవాలంటే ఎంత ప్రయత్నించాలి? ఆ శాశ్వతమైన చోటు ఎక్కడుంది? దాని నెలా పొందాలి?శాశ్వతుడు, నిత్య సత్యుడు అయిన భగవంతుని హృదయంలో చోటు సంపాదించుకోవాలి. తరతరాలుగా వచ్చే ధన ధాన్యాలు, బంగారం వంటి సంపదలు వదలలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. కష్టాలు కోరకుండానే వచ్చినట్లు, సుఖాలు ఆ సమయానికి అవే వస్తాయి. అందుకోసం ఎంతో విలువైన జీవితాన్ని వృ«థా చేసుకోకూడదంటాడు భాగవతంలో ప్రహ్లాదుడు. ధర్మాన్ని ఆచరించటానికి తగిన మానవ జన్మను పొందటం చాలా కష్టం. ఈ అవకాశాన్ని మనుషులు సార్థకం చేసుకోవాలి.ధర్మాన్ని, సత్యాన్ని శ్రద్ధగా పాటించే వ్యక్తులకు దైవం హృదయంలో చోటు లభిస్తుంది. ఆ పరమ పురుషుని పాద పద్మాలను మన హృదయాలలో నిలుపుకోవాలి. మంచితనం, సత్ప్రవర్తన, సత్సాంగత్యం, భక్తి, పరిపూర్ణ విశ్వాసం వంటి వానితో దైవం హృదయంలో చోటు పొందాలి. అదే నిజమైన పొందవలసిన చోటు. భగవంతుడు మెచ్చుకుంటే మనకు లభించనిది ఏదీ లేదు. – డా. చెంగల్వ రామలక్ష్మి -
హానికరమైన ఉపేక్ష!
కురుక్షేత్ర సంగ్రామం మొదలైన నాటి నుండి జరిగిన సంగతులను తాను చూసి వచ్చి తన ప్రభువైన ధృతరాష్ట్రుడికి వర్ణించి చెబుతుంటాడు సంజయుడు. భీష్మ, ద్రోణాచార్యుల సర్వసేనాధిపత్యంలో పదిహేను రోజుల యుద్ధం తరువాత, రెండు రోజులు కర్ణుడి నాయకత్వంలో యుద్ధం జరిగింది. ఆ రెండు రోజుల యుద్ధం చివరన అర్జునుడి చేతిలో కర్ణుడు, భీముడి చేతిలో దుశ్శాసనుడు నిహతులయ్యారు.ఆ సంగతులను వివరించిన సంజయుడు, కౌరవుల విజయానికి సంబంధించిన ఆశలు అడుగంటిపోయేలా దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగి భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడని చెబుతాడు. అది విన్న ధృతరాష్ట్రుడు హతాశుడై, సంజయుడు అలా చెబుతున్నాడంటే దుర్యోధనుడు కూడా మరణించి ఉంటాడని ఊహించుకుని హాహాకారాలు చేస్తూ మూర్ఛపోతాడు.విదురుడి సహాయంతో, సంజయుడు సపర్యలు చేసిన అనంతరం మూర్ఛలోంచి తేరుకున్న ధృతరాష్ట్రుడు ‘నీవు మొదట చెప్పిన మాటలు నేను సరిగా వినలేదు. దుర్యోధనుడికి ఏ ప్రమాదము సంభవించ లేదు కదా!’ అంటాడు. ప్రపంచమంతా ఏమైపోయినా çఫరవాలేదు, దుర్యోధనుడు ఒక్కడు బ్రతికి ఉంటే చాలు అన్నట్లుగా ఉంటుంది ధృతరాష్ట్రుడి వైఖరి. ఈ వైఖరిని గట్టిగానే నిరసిస్తాడు సంజయుడు.కొడుకులంత రాజ్యంబును గొనగ శక్తులను దురాశను వారల యవినయములునీ వుపేక్షింతు; మానునే? యా విరుద్ధకర్మమున ఫలమొందక కౌరవేంద్ర!‘రాజ్యం మొత్తాన్నీ తామే కాజేయాలన్న దురాశతో నిండిన కాంక్షతో నీ కొడుకులు చేసే కానిపనులన్నిటినీ నీవు ఉపేక్షించి, చూస్తూ ఊరుకున్నావు. ఏనాటికైనా దాని ఫలితం అనుభవించాల్సిన సమయం రాకుండా ఉంటుందా? అదే ఇప్పుడు వచ్చింది చూడు!’ అని ధృతరాష్ట్రుడి మొహం మీదనే సంజయుడు అనడం ఆంధ్ర మహాభారతం, కర్ణపర్వంలోని పై తేటగీతి పద్యంలో కనబడుతుంది.ఈ మాటలు అనిపించుకుని కూడా ‘అది సరేలే, ఇంతకీ దుర్యోధనుడు క్షేమంగానే ఉన్నాడు కదా?!’ అంటాడు ధృతరాష్ట్రుడు. కళ్ళెదురుగా వినాశనానికి సంబంధించిన ఛాయలు కనపడుతున్నా చూడడానికి ఇచ్చగించని స్వార్థపూరిత ఉపేక్ష ధృతరాష్ట్రుడిది! ధృతరాష్ట్రుడి అంగవైకల్యం దృష్టి లేకపోవడం కాదు. దానిని అడ్డం పెట్టుకుని అతడు ప్రదర్శిస్తూ వచ్చిన ఉపేక్షయే! చెడు జరగకుండా ఆపగలిగే అధికారం చేతిలో ఉంచుకుని కూడా ఉపేక్షించడం ఊహించనంత వినాశనానికి దారితీస్తుందని ఇది తెలుపుతుంది. – భట్టు వెంకటరావుఇవి చదవండి: ఉద్యమ వాస్తవ చరిత్ర.. -
నమ్మకాన్ని వమ్ము చేయొద్దు!
పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్డీఏకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. మోదీ హవా లేదనేది స్పష్టమైంది. ‘భారతదేశాన్ని రక్షించండి! ప్రజాస్వామ్యాన్ని కాపాడండి!’ అని దేశవ్యాప్తంగా ‘ఇండియా’ కూటమి, దాని భాగస్వామ్య పార్టీలు, సోషల్ మీడియా మేధావులు, అనేకమంది జర్నలిస్టులు చేసిన కృషి, ప్రజల స్పందన ద్వారా భారతదేశ లౌకిక సమాఖ్య స్ఫూర్తి కాపాడ బడింది. 400 సీట్లకు పైగా సాధించాలన్న బీజేపీ కల నెరవేరలేదు. ఎన్డీఏ 293 సీట్లతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ‘ఇండియా’ కూటమి తన బలాన్ని పెంచుకొని 233 సీట్లు పొందగలిగింది.రామ జపం చేసిన అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది. యూపీలో అధికారంలో ఉండి కూడా కేవలం 37 సీట్లకే పరిమితమైంది. ‘ఇండియా’ కూటమి 43 స్థానాలు కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన కూటమిని విచ్ఛిన్నం చేసినందుకు ఎన్డీఏను ప్రజలు తిరస్కరించారు. 30 సీట్లు గెలుచుకొని ‘ఇండియా’ కూటమి బీజేపీని నివ్వెరపరిచింది. బెంగాల్లో మమతా బెనర్జీ తన పట్టు నిలబెట్టుకుంది. దక్షిణాదిన బలం పెంచుకోవాలని చూసిన బీజేపీ తమిళనాడులో ఒక్క సీటూ గెలవలేదు. కేరళలో ఒక్క స్థానం పొందింది. కర్ణాటకలో ఎనిమిది స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది.ఆంధ్రప్రదేశ్లో టీడీపీ– జనసేనలతో కలిసి 21 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణలో కేసీఆర్ వైఫల్యం బీజేపీకి అనుకూలించింది. జాతీయ రాజకీయాల్లో నేషనల్ ఫ్రంట్ పెట్టి ఆనాడు ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. నేడు మతోన్మాద ఎన్డీఏ పాలన మైనారిటీల పైనా, దళితులపైనా దాడులు కొనసాగిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పిస్తున్న విధానాలను చంద్రబాబు సమీక్ష చేసుకొని ఎన్డీఏ భాగస్వామ్యం విషయంలో పునరాలోచన చేయాలి. భారతదేశ లౌకిక ఫెడరల్ స్ఫూర్తిని కాపాడాల్సిన చారిత్రక కర్తవ్యం చంద్రబాబుపై ఉంది. బిహార్లో నితీష్ కుమార్ సైతం ఎన్డీఏ కూటమి నుండి వేరుపడకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రజల తీర్పును గౌరవించి ఫాసిస్ట్ శక్తులను మూడోసారి అధికార పీఠం ఎక్కకుండా నిరోధించాలి. – దినవహి హరినాథ్ -
సోషల్ మీడియా దన్నుగా...
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. 18వ లోక్ సభకు జరిగిన ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని చరిత్ర సృష్టించారు. సుదీర్ఘంగా 81 రోజులు సాగిన ఈ ఎన్నికల ప్రక్రియ, కేంద్రంలో మళ్లీ కమల వికాసమా లేక హస్త ప్రభంజనమా అనే ఉత్కంఠకు తెర లేపింది. భారత ప్రజల చైతన్యస్ఫూర్తి ఈ ఎన్నికల్లో మరోసారి రుజువయ్యింది.‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అనే నినాదంతో మూడోసారి అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావాలనుకున్న ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో వారు ఊహించిన ఫలితాలు రాలేదు. గత పదేండ్ల కాలంలో మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాలు ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం తగ్గేలా చేశాయి. కుల మతాలనూ, అయోధ్య రాముణ్ణీ ఎన్నికల్లో వాడుకొని లబ్ధి పొందాలని భావించినా ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూరలేదు.ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మోదీ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమం నడపడంలో కొంత వరకు సఫలం అయిందని చెప్పవచ్చు. ‘మోదీ 3.0 మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారు’ అనే అంశం ప్రజల్లోకి బాగా వెళ్ళి, బీజేపీ ఓటు బ్యాంక్కు గండి కొట్టింది. ఓటర్లు ప్రతిపక్షానికి కావలసినంత బలాన్ని ఇచ్చారు. విధానపరమైన నిర్ణయాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.ఈ సారి ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం... ముఖ్యంగా యూట్యూబర్లు ధ్రువ్ రాఠీ, రవీష్ కుమార్ వంటి వారు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచడంలో కీలకమైన పాత్ర పోషించారు. కేవలం ధ్రువ్ వీడియోలను 69 కోట్ల మంది ప్రజలు వీక్షించారంటే వారి ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.ఉత్తర భారత దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రొజెక్టర్లు పెట్టి మరీ ఈ వీడియోలను ప్రజలు వీక్షించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా పాలకులు నిర్ణయాలు తీసుకుని, ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ, కార్మిక– కర్షక సంక్షేమానికి పాటుపడుతూ, మహిళా సాధికారత సాధిస్తూ, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కృషి చేస్తారని ఆశిద్దాం. – పాకాల శంకర్ గౌడ్, ఉపాధ్యాయుడు -
Hanuman Jayanti: ఈ అద్భుత తెలివితేటలే.. శ్రీరామ–సుగ్రీవ మైత్రి కలిసేలా..
భారత దేశంలో అత్యధిక భక్తుల చేత నిత్యం ఆరాధించబడుతున్న దైవం ఆంజనేయ స్వామి. పురాణాల్లో ఏ దేవునికీ లేని ప్రత్యేకత హనుమంతుని సొంతం. హనుమంతుడు గొప్ప వ్యాకరణశాస్త్ర పండితుడు. బాల్యంలో కఠోర దీక్షతో, శ్రద్ధగా సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్నాడు. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాలు తెలిసిన వ్యక్తి. ఎదుటివారిని ఆకట్టుకునేలా ప్రసంగించే వాక్చాతుర్యం ఆయన సొంతం.ఈ అద్భుత తెలివితేటలే శ్రీరామ–సుగ్రీవ మైత్రిని కలిసేలా చేసింది. శ్రీరాముణ్ణి యజమానిగా, సుగ్రీవుణ్ణి మహారాజుగా ఇద్దరికీ సమ ప్రాధాన్యత నిచ్చాడు. లంకలో రావణునికి నీతి వచనాలతో హిత బోధ చేశాడు. మనం హనుమంతుని జీవిత చరిత్ర నుండి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎదుటి వారిని మెప్పించే నైపుణ్యం, యజమాని (మనం పని చేసే డిపార్ట్మెంట్/కంపెనీ) పట్ల పూర్తి విధేయత, నమ్మకం, సంపూర్ణ విశ్వసనీయతతో ఎలా ఉండాలి వంటివి నేర్చుకోవచ్చు.ఇంతేనా... ఆయన నుంచి నేర్చుకోవలసిన సుగుణాలు చాలానే ఉన్నాయి. ఎదుటివారిపట్ల సముచిత గౌరవం, నమ్మిన వారి కోసం ఏమైనా చేసే త్యాగనిరతి, శత్రువుల పట్ల సమ న్యాయబద్ధంగా వ్యవహరించే మాటతీరు, గురువు పట్ల నిస్వార్థ భక్తి భావన, రాజ్యం పట్ల సైనికుడిగా విద్యుక్త ధర్మం, నిరాడంబర జీవనం, అన్ని తెలిసినా ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస, ధర్మరక్షణ కోసం శ్రమించే వీరత్వం, ఆపద సమయంలో ప్రదర్శించే ఆత్మ విశ్వాసం లాంటివి ముఖ్యమైనవి.తాను ఎంత బలవంతుడైనప్పటికీ అతి సాధారణంగా జీవించడం హనుమంతుడు మనకు నేర్పాడు. సముద్రాన్ని దాటినా, లంకను సగం కాల్చినా, సీతమ్మను తీసుకువచ్చే బలం ఉన్నా... ఎప్పుడూ పొంగిపోలేదు. సుగ్రీవుని వేలాది సైన్యంలో తానూ ఒక సైనికుడిగా రాచకార్యంలో భాగంగానే ఈ పనులు నిర్వర్తించానని భావించాడు. ఇంత చేసి అంత చెప్పుకునే చాలామందికి హనుమాన్ కనువిప్పు. ఆధునిక భావి తరానికి చక్కని మార్గదర్శి. హనుమంతుని జీవనాన్ని అధ్యయనం చేసిన వారికే ఆ గొప్పతనం తెలుస్తుంది. – భైతి దుర్గయ్య (నేడు హనుమాన్ జయంతి) -
చిహ్నం విషయంలో చర్చ జరగాలి!
ఐదు దశాబ్దాల పైగా అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణకు జనగీతం ఏది? పదేళ్ల క్రితం ‘మా రాష్ట్రం’ అని చెప్పుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు దక్కింది. ఒక రాష్ట్రంగా చిహ్నం, విగ్రహం రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ అవతరణ పదేళ్ల తరువాత, కాంగ్రెస్ పార్టీవారి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ‘తెలంగాణ రాష్ట్ర గీతం’గా ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని కూడా మార్చి కొత్త చిహ్నాన్ని రూపొందిస్తోంది. ఈ సందర్భంగా రకరకాల చర్చలు మొదలయ్యాయి.దేశానికి ఒక జాతీయ గీతం ఉన్నట్లే రాష్ట్రానికి ఓ రాష్ట్ర గీతం ఉండాలని కోరుకోవడం సహజమే. రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల తరువాత ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... దానిపై వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి.జాతీయ గీతంలాగే రాష్ట్ర గీతం...జాతీయ గీతం ‘జన గణ మన’, జాతీయ గేయం ‘వందేమాతరం’... రెండింటినీ సమానంగా గౌరవించాలని మన రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యంగ సభలో ప్రకటించారు. అప్పటి నుంచి భారతీయులు ఆ యా గీతాలను అత్యంత గౌరవంతో ఆలాపిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాలను నిర్వహించే సమయంలో చిన్నా పెద్ద, అధికారి, అనధికారి అనే భేదం లేకుండా అందరూ గౌరవంగా నిలబడాలనేది ఒక నియమం. కనీసం జాతీయ గీతాలాపన సమయంలో మౌనంగా ఉండి తమ గౌరవాన్ని వ్యక్తం చేయాలి. అయితే అలా గౌరవించనివారూ ఉంటారు. అందుకు శిక్షలు ఉండవు. కాని, అవమానిస్తే మాత్రం నేరమే. రెండు జాతీయ గీతాలకూ, జాతీయ చిహ్నానికీ, జాతీయ పతాకానికీ సంబంధించి ఒక చట్టం కూడా చేసుకున్నాం.దేశ సౌభాగ్యాన్నీ, సంస్కృతీ వారసత్వాలూ, గొప్పదనాన్నీ ప్రతిబింబించే మన జాతీయ గీతాలను గర్వంగా భారతీయులమంతా ఎలా ఆలపిస్తున్నామో... అంతే గర్వంగా రాష్ట్రాల ప్రజలు తమ తమ రాష్ట్ర గీతాలను ఆలపించడం సహజం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లయినా ఇంతవరకూ రాష్ట్ర గీతం అంటూ ఏదీ లేకపోవడాన్ని కొందరు చర్చిస్తూ వచ్చారు. చరిత్ర, సంస్కృతి, వారసత్వాల పేర సాగిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడంతో చాలామంది స్వాగతించారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణలో ఉన్న పాత జిల్లాల అన్నింటి ప్రత్యేకతలనూ, వైశిష్ట్యాన్నీ అద్భుతంగా ఆవిష్కరించింది కనుక. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలందరినీ ఒక ఊపు ఊపింది కనుక. అలాగే దీని రచయిత అందెశ్రీ తెలంగాణ మట్టిమనిషి, ఉద్యమకారుడు. తన కలం, గళం ద్వారా ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయినవారు. అందుకే చాలామంది రాష్ట్ర గీత ప్రకటనను స్వాగతిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ కొత్త చిహ్నం..గత తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి అమలులో పెట్టిన ప్రభుత్వ చిహ్నాన్ని పక్కన పెట్టి, ప్రస్తుత ప్రభుత్వం మరో నమూనాను రూపొందిస్తున్నది. ఇప్పటికే దానిపై సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి వంటి రాజకీయ పార్టీల నేతలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ నమూనా చాలా బాగుందని కొందరూ, బాగులేదనీ మరికొందరూ అంటున్నారు.అసలు ఇప్పుడు రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం, రాష్ట్ర గీతం అంటూ ఒక గీతాన్ని ప్రకటించడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పోనీ వాటిని నిర్ణయించేటప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించాలి కదా? దాన్నీ ఈ ప్రక్రియలో భాగం చేయలేదనేది ప్రధానమైన విమర్శ. ఇది సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించి ఏమార్చడానికే అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.విధానం, సంవిధానం? దేశానికి కానీ, రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్రానికి కానీ ఒక ప్రత్యేక నిర్ణయ విధానం (పాలసీ) అంటూ ఒకటి ఉండాలి. ప్రజలందరికీ సంబంధించిన కొన్ని అంశాలపై నిర్ణయాలను కేవలం ‘మంత్రివర్గం’ తీసుకుంటే సరిపోదు. విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సి ఉంటుంది. సభలు, సదస్సులు, జిల్లా స్థాయి చర్చలు, సంప్రదింపులు జరపాలి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా వివిధ వర్గాలవారి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలూ, అసెంబ్లీ సమావేశాల్లో చేసిన చర్చలూ, నిర్ణయాలను అందరికీ అందుబాటులో ఉండేలా వైబ్సైట్లో పెట్టాలి. మొత్తంమీద రాష్ట్ర గీత ప్రకటన, ప్రభుత్వ చిహ్నం మార్పు వంటి అంశాల్లో అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరించడం అన్యాయం. – వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీఅభిప్రాయం: మాడభూషి శ్రీధర్ -
కళ.. విశ్వజనీనం!
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర గీతంపై ఒక తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ గీతానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు అనగానే చాలామందికి ఇది ఆత్మ గౌరవంతో ముడిపడిన వ్యవహారంగా కనబడింది. తెలంగాణ గీతానికి తెలంగాణేతర సంగీత దర్శకులు వుండ కూడదా? ఉంటే వచ్చే నష్టం ఏమిటి?తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న తరుణంలో ఎక్కడ చూసినా ‘జయ జయహే తెలంగాణ’ అన్న గీతాన్నే నాలుగున్నర కోట్ల గొంతుకలు ఒక్కటై నినదించాయి. పది జిల్లాల గొప్పతనం గురించి అత్యద్భుతంగా అల్లిన అక్షర మాలను అందెశ్రీ ఎంతో ప్రేమతో, తెలంగాణపై భక్తితో జాతికి అంకితం చేశారు. ఇంత వరకు బాగానే వుంది. కాని, తెలంగాణ సిద్ధించిన తర్వాత మాత్రం ఆ గేయానికి ప్రభుత్వం మాత్రం ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదన్నది అందరికీ తెలిసిన విషయమే.మరి అప్పటి ప్రభుత్వానికి ఆత్మ గౌరవం అంటే తెలియలేదమో. లేక అందెశ్రీ అక్షరాలపై వివక్ష వున్నదో తెలియదు కాని, దాన్ని రాష్ట్ర గీతంగా పెట్టటానికి మనసు రాలేదు. ఇన్నాళ్ళకు మొత్తానికి ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించింది. కాని, ఇప్పుడే అసలైన సమస్య మొదలైంది. తెలంగాణ జాతికి అంకితం చేసే గీతానికి మరింత వన్నె తెచ్చి యావత్ తెలంగాణకు ఒక గొప్ప రాష్ట్ర గీతం అందివ్వాలని ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణికి దానికి సంగీతం అందించే బాధ్యతను అప్పగించింది ప్రభుత్వం. వెంటనే మేధావులు, నాయకులు, కళాకారులు అందరూ ఒక్కసారిగా ఆంధ్ర వాళ్ల చేతిలో ఆత్మ గౌరవం ఎలా పెడతారు అని అడుగుతున్నారు.పాటకి అక్షరమే ప్రాణం. సంగీతం కేవలం పాటకి హంగు మాత్రమే. తెలంగాణేతరులు సంగీతం అందిస్తే తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతింటుందా? కళకు ప్రాంత, లింగ, వర్ణ విభేదాలు ఉండవు. అది విశ్వజనీనం. మరి ఈ విషయం అర్థమయ్యేలా ఈ విమర్శకులకు ఎలా చెప్పాలి? – రామ్ ఠాకూర్, విశ్లేషకులు, రచయిత -
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేయడంపై వయనాడ్ ప్రజలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘తప్పేముంది రాహుల్ ఇండియా కూటమిలో అగ్రనేత’ అని ఒకరు అనగా రాయ్బరేలీలో గెలిస్తే వయనాడ్ సీటును రాహుల్ వదిలేస్తారని మరొకరన్నారు. అయితే రాహుల్ వయనాడ్ను వదిలేయడం తమకు అంత మంచిది కాదని చెప్పాురు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని రాహుల్గాంధీ తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమికి మేలు చేస్తుందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)నేత కున్హలికుట్టి అన్నారు. ప్రధాని మోదీ కూడా గతంలో రెండు సీట్లలో పోటీ చేశారని కుట్టి గుర్తు చేశారు. -
ఈవీ రూ.10 లక్షల లోపయితే ఓకే
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం..మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ 2023లో రూ.16,675 కోట్లు ఉండగా..2025 నాటికి రూ. 62,532 కోట్లకు చేరే అవకాశముంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్ల విషయంలో వాహనదారులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నట్టు లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయాల్లో మెజారిటీ వ్యక్తులు రూ.8 నుంచి రూ.10 లక్షలలోపు ధర ఉంటే ఎలక్ట్రిక్ కారు కొనుగోలు సులువు అవుతుందనే అభిప్రాయపడ్డారు. ► పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తాము ఎలక్ట్రిక్ కారు కొనాలని భావిస్తున్నట్టు 44 శాతం మంది చెప్పారు. ►పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు 31% మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారేందుకు ప్రయతి్నస్తున్నట్టు తెలిపారు. ►2023లో మనదేశంలో 72,321 ఎలక్ట్రిక్ కార్లు రిజిస్టర్ అయ్యాయి. లోకల్ సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 5 శాతం మంది ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ఆసక్తి చూపారు. ఈ లెక్క ప్రకారం 2024లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ 2,00,000కు చేరే అవకాశముంది. ►ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు సంబంధించి దేశవ్యాప్తంగా 319 జిల్లాల్లో లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో 40 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ►తెలంగాణలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపైనే ప్రస్తుతం రిజి్రస్టేషన్ జీవితకాలపు ఫీజు రాయితీ ఉండగా, ఏపీలో కార్లు, జీపులపై కూడా రిజి్రస్టేషన్ ఫీజు పూర్తిగా రాయితీ ఇస్తున్నట్టు అధికారవర్గాల సమాచారం. ఎలక్ట్రిక్ కారు కొనాలనుకోవడానికి కారణం? ► పర్యావరణ హితంగా ఉండాలని.. 44% ►పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను తట్టుకునేందుకు 31% ►తక్కువ ధరలు 15% ►ఇతర కారణాలు 5% ►చెప్పలేం 5% ఎలక్ట్రిక్ కారు కొనకపోవడానికి కారణాలు ? ►సాధారణ కార్లతో పోలిస్తే అధిక ధర 21 శాతం ►మా ప్రాంతంలో సరిపడా చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం 21 శాతం ►ఎలక్ట్రిక్ కార్ల గురించి అవగాహన లేదు 12 శాతం ►ఈ సమయంలో కారు కొనాలనుకోవడం లేదు 26 శాతం ►నా బడ్జెట్కు తగిన మోడల్స్ ఈవీలో లేవు 7 శాతం ►ఇతర కారణాలు, కొనేంత డబ్బు లేదు 8 శాతం ►ఇది నాకు వర్తించదు 5 శాతం -
ఎన్నికల క్షేత్రంలో భేరి మోగింది
సార్వత్రిక ఎన్నికల భేరి మ్రోగింది. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన అది పెద్ద ఎన్నికల క్రతువుకు ముహూర్తం ఖరారైంది. దేశమంతా లోక్సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం జెండా ఊపింది. ఎన్నికల క్షేత్రంలో నువ్వా? నేనా?.. విజయమా? పరాజయమా? తేల్చుకోవాల్సిన సమయం అన్ని పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు ఆసన్నమైంది. పోయినసారి మాదిరిగా ఈసారి కూడా ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కింపుతో అందరి జాతకాలు బయటపడతాయి. ఎవరి ధీమా వారిది. కొందరిది అతి విశ్వాసం. ఇక సర్వేలు, ప్రీ-పోల్, పోస్ట్-పోల్ అంచనాలు, బెట్టింగులు, కోట్లాది రూపాయల డబ్బుల ఖర్చు, తాయిలాలు, ఆకర్షణలు, వికర్షణలు, ప్రలోభాలు, ఒత్తిళ్లు, బేరసారాలు, అలకలు, కులుకులు.. అన్నీ మామూలే. ఎన్నికలు రాగానే సహజంగా జరిగే పెద్దతంతులో భాగమే ఈ చర్యలు. ఓటరు మదిలో ఏముందో? చివరికి కానీ తెలియదు. ఓటింగ్ సరళి, ఎన్నికలు, రాజకీయాలు, దేశం గురించి పుంఖాను పుంఖంగా ఉపన్యాసాలు దంచే మేధావులు సగంమంది అసలు ఓటే వెయ్యరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదొక దురదృష్టకర సంప్రదాయం. 60-70 శాతం మంది వేసే ఓట్లే అధికారాన్ని నిర్ణయిస్తాయి. మిగిలినవారు ఎప్పటికీ ప్రేక్షకులుగానే మిగిలిపోతారు. గత లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లు 67 శాతం మాత్రమే. అందులో మహిళల భాగస్వామ్యం కాస్త ఆశాజనకంగా వుంది. 33శాతం మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా వున్నారన్నది పచ్చినిజం. ఈసారి ఎట్లా ఉంటుందో చూడాలి. యువత పెరిగిన సమాజంలోకి వచ్చేశాం. అక్షరాస్యత పెరిగిన కాలంలోకి ప్రవేశించాం. ఈ క్రమంలో కులాల కుంపట్లు రగులుతూనే వున్నాయి, అవి పెరుగుతూనే వున్నాయి. ఇదొక విషాదం. రేపు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎదుర్కోవాల్సిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం వున్నాయి. మొత్తం 545 స్థానాలు కలిగిన లోక్ సభలో, దేశ అధికార పీఠాన్ని అధిరోహించాలంటే 272 స్థానాల్లో గెలవాలి. 2014, 2019 రెండు పర్యాయలలోనూ బీజేపీ / ఎన్డీఏ అఖండంగా గెలిచి, అధికారాన్ని కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో బిజెపి మరింత బలపడింది, కాంగ్రెస్ ఘోరంగా చతికిలబడిపోయింది. గత ఎన్నికల్లో 303 సీట్లు సాధించుకున్న అధికార పార్టీ ఈసారి 370-400 సీట్లు సాధించాలనే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈసారి గెలిచి, అధికారంలోకి వస్తే? బీజేపీ హ్యాట్రిక్ సాధించడమే కాక, అత్యంత శక్తివంతమైన పార్టీగా స్థిరపడిపోతుంది. ఈ క్రమంలో తమ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసే పనిలోనూ పడిపోయింది. కూటమి నుంచి విడిపోయిన టీడీపీ వంటి పార్టీలను మళ్ళీ తీసుకొచ్చుకొని తన దొడ్లో కట్టేసుకుంటోంది. తటస్థంగా వున్న వైసీపీ, బీజేడీ వంటి పార్టీలతో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ వంటి కొన్ని పార్టీలు కూడా ఇంకా తటస్థంగానే వున్నాయి. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి ఒకే మాటపై వున్నారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని పదే పదే వెల్లడించారు. ఈ పదేళ్ల నరేంద్రమోదీ పాలనలో ప్రవేశపెట్టిన చాలా బిల్లులకు మద్దతు పలికారు. కేంద్రంతో ఎటువంటి తగాదాలు లేకుండా స్నేహపూర్వకంనే వ్యవహరించారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ది కూడా ఇంచుమించూ అదే తీరు. వీళ్ళిద్దరూ రాష్ట్ర ప్రయోజనాల వరకే తమను పరిమితం చేసుకున్నారు. కాకపోతే, ఈసారి బీజేడీతో ఎన్నికల బంధం ఏర్పరచుకోవడానికి బీజేపీ చూస్తోందని వింటున్నాం. సీట్ల సర్దుబాటు అంశం ఇంకా కొలిక్కిరాలేదు.దానిని బట్టిగానీ, ఆ ప్రయాణాన్ని అంచనా వేయలేం. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను తాజాగా ఈ.డి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఈ అంశం వేడివేడిగా వుంది. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - బీఆర్ఎస్ మధ్య బంధం ఏర్పడుతుందని నిన్నటి దాకా వార్తలు గుప్పుమన్నాయి. కవిత అరెస్టు నేపథ్యంలో ఈ బంధం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. దక్షిణాదిలో బలోపేతం కావాలనే లక్ష్య సాధనలో బీజేపీ ఎంత వరకూ విజయం సాధిస్తుందన్నది ఈసారి అనుమానమే. కర్ణాటక, కొంత తెలంగాణలో తప్ప, ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,కేరళలో బీజేపీ పుంజుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆంధ్రప్రదేశ్ వాతావరణం చూస్తుంటే, బీజేపీ చేపట్టిన పొత్తులు ఏ మాత్రం ఆ పార్టీకి లాభం తెచ్చిపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఒరిస్సాలో బీజేడీ బలంగా వుంది. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ కాస్త పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే ఏమీ చెప్పలేని వాతావరణమే కనిపిస్తోంది. వైసీపీ ఒక్కటి ఒక వైపు - మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఒక వైపు అన్నట్లుగానే వుంది. బీజేపీ -టీడీపీ -జనసేన ఒక పొత్తు కిందకు వచ్చాయి. షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్ కూడా తన బాణాలను ప్రధానంగా జగన్ వైపే ఎక్కుపెట్టి యుద్ధం చేస్తోంది. తమ పథకాలు, ప్రజలపై అత్యంత విశ్వాసంతో జగన్ వున్నారు. కొత్త పొత్తుతో బలమైన శక్తిగా మారుతామనే నమ్మకంలో చంద్రబాబు, పవన్ వున్నారు. ఏపీలో ఏమవుతుందో చూద్దాం! తెలంగాణ బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. కవిత అరెస్టు అంశం కూడా తెలంగాణ రాజకీయ పార్టీలలో కొంత ప్రభావం చూపించకపోదు. ఎత్తుజిత్తులు బాగా ఎరిగిన కెసీఆర్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దేశంలో మళ్ళీ నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన 'ఇండియా కూటమి' ఇంకా శక్తివంతంగా మారలేదు. ఆ కూటమిలోని నాయకుల మధ్య సయోధ్య పెద్దగా లేదన్నది బహిరంగ రహస్యం. ఆంధ్రప్రదేశ్లో ఈసారి జగన్ మోహన్ రెడ్డిని అధికార పీఠం నుంచి ఎలాగైనా దించాలని ప్రతిపక్షాలన్నీ అనుకుంటున్నట్లుగా, కేంద్రంలో నరేంద్రమోదీని దించాలని విపక్షాలు అనుకుంటున్నాయి. ప్రతిపక్షాలు అలా అలోచించడం సహజమైన అంశం. ఆ మేరకు బలోపేతం కావడంలోనే అసలు రహస్యం దాగి వుంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెద్ద ఎత్తున తేవాల్సిన అవసరం కూడా వుంది. కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత, నాయకత్వం పట్ల విశ్వసనీయత, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో బలంగా చెప్పగలగడం మొదలైన అంశాలు చాలా వున్నాయి. ఇవన్నీ సాధించకపోతే, కూటమి విజయం ఉత్తుత్తి ప్రగల్బాలుగానే మిగిలిపోతుంది. ప్రస్తుత వాతావరణాన్ని గమనిస్తే, బీజేపీ పాలన పట్ల, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏమీ లేదు. ఈ పదేళ్ల సామాజిక పరిణామాన్ని గమనిస్తే, హిందూ భావజాలం, ఐక్యత పెరిగాయనే చెప్పాలి. దేశంలోని మెజారిటీ ప్రజలైన హిందువుల 'ఓటుశక్తి'పై బీజేపీ పెంచుకున్న విశ్వాసం కూడా పెరుగుతూ వస్తోంది. పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధిలేమి, ప్రభుత్వ ఉద్యోగాలు సన్నగిల్లడం, అధిక ధరలు మొదలైనవి అధికార పార్టీకి సవాళ్లు విసురుతున్నాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదనే మాటలు వినపడుతున్నాయి. నరేంద్రమోదీ - అమిత్ షా ద్వయం తప్ప, మిగిలినవారికి స్వతంత్రత లేదని, కేంద్ర మంత్రులు సైతం డమ్మీలుగా మారిపోయారని, అంతా పిఎంఓ, గుజరాత్ గణమే చక్రం తిప్పుతున్నారనే మాటలు బలంగా వినపడుతున్నాయి. వీటన్నిటిని దాటుకుంటూనే నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ఇన్నాళ్లూ వరుస విజయాలు నమోదు చేసుకుంటూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లోనూ కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ, బీజేపీ అధికారంలో ఉండడం చారిత్రక అవసరంగా భావించి, మౌనముద్ర వహిస్తున్నారనే మాటలు వినవస్తున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకి ఎంత ముఖ్యమో, కాంగ్రెస్కు అంతకంటే ముఖ్యం. అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంత ముఖ్యమో, చంద్రబాబుకు అంతకంటే ముఖ్యం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
ఈల వేశారు జనం! వెల్లివిరిసింది జ(గ)నం!
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ముఖ్యమంత్రి జగన్ YSRCP సిద్ధం సభ కొత్త ఊపు తీసుకొచ్చింది. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగబోతున్న ఎన్నికల యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కోసం వారి తరఫున నిలబడటానికి మీరంతా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునివ్వడం, ముఖ్యమంత్రి స్పీచ్ కోసం లక్షలాది మంది తరలి రావడం పట్ల చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ఖాళీ అయ్యింది బంగాళా ఖాతపు జల సంద్రం రాయల సీమలో మోహరించింది జన సముద్రం ఈల వేశారు జనం వెల్లివిరిసింది జ(గ)నం అదొక జగన ఘన ప్రభంజనం, ఆడబిడ్డలకు అన్న అంజనం జగనన్న కలిగించాడు ఎంతో ప్రమోదం ప్రజలందరికీ అన్న సర్వ ఆమోదం - డాక్టర్ రాం కేసరి, అమెరికా సభలో సీఎం జగన్ ఏమన్నారంటే.. జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జన సముద్రం తరలి వచ్చింది. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ప్రతి సీమ బిడ్డకూ మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. పెత్తందార్లకు – పేదలకు మధ్య సంగ్రామం. మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపుతట్టాం. ఈ మంచి కొనసాగాలన్నా, భవిష్యత్లో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మళ్లీ గెలవాలి. పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాసు పట్టుకొని సైకిల్పై వస్తుంది. పేదల రక్తం తాగేస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
ఈ యుగం బాబాసాహెబ్దే!
ఇవ్వాళ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ను భుజానికి ఎత్తుకుంటున్నారు. ఇందులో కొందరు అంబేడ్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించేవారూ ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... బాబాసాహెబ్ ఏం చెప్పారో దానికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీయ చూస్తున్నవారూ ఉండటం! విభిన్న భౌగోళిక ప్రాంతాలూ, అనేక జాతులూ, మతాలూ, కులాలూ, భాషలూ ఉన్న భారతదేశం సమాఖ్య లౌకిక రాజ్యంగా విలసిల్లాలని అంబేడ్కర్ ఆశించారు. ఆ మేర రాజ్యాంగంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కానీ నేడు కొందరు పాలకులు, ప్రభుత్వాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడిచే విధంగా అడుగులు వేస్తుండడం విషాదకరం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, సిద్ధాంత అన్వ యం గురించి ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాణం గురించి, కుల నిర్మూలనా సిద్ధాంత ప్రతిపాదన గురించి చర్చ జరుగుతోంది. ఆయన తన జీవిత కాలంలో విస్తృతంగా రచనలు చేశారు. ఆయన మేధో సంపన్నత ఆయన గవేషణ పద్ధతిలోనే ఉంది. ముఖ్యంగా వేదాలను పరిశీలించిన పద్ధతి వినూత్నమైనది, విప్లవాత్మకమైనది. ఎందుకంటే అంతకుముందు వేదాల గురించి పరిశోధించిన మాక్స్ ముల్లర్, సురేంద్ర దాస్ గుప్తా, సర్వేపల్లి రాధాకష్ణన్ వంటివారు ఎవరూ కూడా వేదాలు అశాస్త్రీయమైన భావాలతో రూపొందాయని చెప్ప లేకపోయారు. ముఖ్యంగా శంకరాచార్యులు, రామా నుజాచార్యులు, మధ్వాచార్యులు తమ తమ కోణాల్లో వేద సమర్థుకులుగా భాష్యం రాసు కున్నారు. అంబేడ్కర్ ఒక్కరే వేదాలను, భగవద్గీ తను హింసాత్మక గ్రంథాలుగా పేర్కొన్న సాహస వంతుడు. అలాగే ఆయన ‘శాక్రెడ్ ఆఫ్ ఈస్ట్’ పేరుతో వచ్చిన 50 వాల్యూమ్స్ చదివి రాసుకున్న నోట్స్ ఎంతో విలువైనది. దాన్ని ముద్రిస్తే ప్రపంచ మూల తత్త్వ శాస్త్రానికి ఎంతో విలువైన సమా చారం జోడించగల గ్రంథాలు అందుబాటులోకి వస్తాయి. ఆయన తాత్త్విక దర్శనాలు శాస్త్రీయమైన చర్చతో కూడి ఉంటాయి. మార్క్స్, ఎంగెల్స్లు రాసిన ‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’, ఎంగెల్స్ రాసిన ‘డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్’, మోర్గాన్ రాసిన ‘ఏన్షియంట్ సొసైటీ’ వంటి వాటి స్థాయిలో... ఆయన తాత్విక, సామాజిక, రాజకీయ చర్చలు ఉంటాయి. వేదాల గురించి అంబేడ్కర్ ఇలా అన్నారు. ‘వేదాలు హిందువుల మతసాహిత్యంలో అత్యు న్నత స్థానాన్ని ఆక్రమించుకున్నాయని చెప్పడం వాటిని గురించి చాలా తక్కువ చెప్పినట్టే అవుతుంది. వేదాలు హిందువుల పవిత్ర సాహిత్యం అని చెప్పినా సరిపోనిదే అవుతుంది. ఎందుచేతనంటే అవి తప్పు పట్టడానికి వీలు లేనివి. వాటిని అపౌరు షేయాలని నమ్ముతారు కాబట్టి’. అంటే వేదాలు మానవ కల్పితాలు కావు అని అర్థం. మానవ కల్పితాలు కాకపోవడం వల్ల సాధారణంగా ప్రతి మానవుడు చేసే తప్పిదాలకు, దోషాలకు, పొరపాట్లకు అవి అతీతంగా ఉంటాయి. అందుచేతనే అవి అమోఘమైనవిగా భారతీయులు నమ్ముతున్నారు. అయితే అంబేడ్కర్ వేదాలను మానవ మాత్రులైన రుషులే రచించారని చెప్పారు. ఒకరిని ద్వేషించే, అపహాస్యం చేసే, హింసను ప్రోత్సహించే ఏ గ్రంథా లైనా అవి విశ్వజనీనమైనవి కావు అని అంబేడ్కర్ చెప్పారు. అంబేడ్కర్ ప్రతిభ బహుముఖీనం. ప్రధానంగా ఆయన తాత్వికులు. ముందు తన్ను తాను తెలుసుకున్నారు. తర్వాత తన చుట్టూ ఉన్న సమా జాన్ని కూడా తెలుసుకున్నారు. తనకూ సమాజానికీ ఉండే అంతఃసంబంధాలను అధ్యయనం చేశారు. సమాజానికి అంతః ప్రకృతి అయిన రాజ్యాన్నీ, దాని అంగమైన ప్రభుత్వాన్నీ, వాటి పునాదుల్నీ పరిశోధించారు. వాటికీ తనకూ ఉండే వైరుధ్యాలనూ బయటకు తీశారు. ఈ దృష్టితో చూసిన ప్పుడు భారతావనిలో బుద్ధుని తర్వాత అంత లోతైన నైతిక వ్యక్తిత్వం అంబేడ్కర్దే అవుతుంది. ఆయన సామాజిక జీవితానికి పునాది బుద్ధుని బోధనా తత్వంలోనే అంతర్లీనంగా ఉంది. ఆయన బోధనలో ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, ఆచరణ, దుఃఖ నివారణ, సంఘ నిర్మాణం, నైతికత, త్యాగం, ప్రధానమైనవి. ఆయన ఎంతో నిబద్ధంగా జీవించారు. రాత్రి పది గంటలకు ఆయన అన్నం తినేటప్పుడు పుస్తకాల జ్వలనంతో పాటు ఆకలి మంట కూడా రగులుతూనే ఉండేది. లండన్ వీధుల్లో అర్ధాకలితో తిరిగారు. ఆయన ధనాన్ని జ్ఞానానికి ఎక్కువ ఖర్చు చేశారు. ఆకలి తీర్చుకోవడానికి తక్కువ డబ్బు వాడేవారు. కాల్చిన రొట్టె ముక్క లను ఒక కప్పు టీలో ముంచి తిని అనంత అధ్యయనం చేసిన త్యాగశీలి ఆయన. ఈరోజు స్కాలర్షిప్తో చదు వుకుంటున్న కొందరు దళిత విద్యార్థులు తమ ఉపకార వేతనాన్ని విలాసాలకు వాడుతున్న వైనం చూస్తుంటే అంబేడ్కర్ నుంచి వీరు ఎంత నేర్చు కోవాలో అర్థమవుతుంది. అంబేడ్కర్ పరీక్షల కోసం చదవలేదు. విజ్ఞానం కోసం, అవగాహన కోసం సిద్ధాంత నిర్మాణం కోసం, సాక్ష్యాధారాల కోసం చదివారు. రాత్రంతా చదువుతూ కనిపించే అంబేడ్కర్తో రూవ్ుమేట్ ఎప్పుడైనా చదువు ఆపు అంటే...‘నా పరిస్థితులు, నా పేదరికం, నేను ఎంత త్వరగా విద్యార్జన పూర్తి చేస్తే అంత మంచిది. నా కాలాన్ని నేను ఎంత విద్యార్జనలో గడిపితే, ఎంత సద్వి నియోగం చేసుకుంటే అంత మంచిది’ అని చెప్పే వారు. ఆయన చదువు పట్ల చూపిన నిబద్ధతని ఈనాటి దళిత విద్యార్థి లోకం అనుసరించినట్లయితే మేధోసంపన్నత వీరి సొంతమై వీరు భారత దేశ పునర్నిర్మాణానికి ముందుకు వస్తారు. నీటి వినియోగం పైన అంబేడ్కర్ పెట్టిన శ్రద్ధ ఏ జాతీయ నాయకుడూ పెట్టలేదు. అంతగా పట్టించుకోలేదు. ఆయన ప్రణాళికలు నిర్దిష్టమై నవి. కార్మి కుల అభివృద్ధి కోసం, వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆయన పోరా డారు. గ్రామీణ శ్రామి కులను పారిశ్రామిక పనుల్లో ఉపయోగించుకుంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొలంబియా, హార్వార్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో అంబేడ్కర్ మీద జరిగి నంత పరిశోధన భారతదేశంలో జరగడం లేదు. అన్ని కేంద్రీయ, రాష్ట్రీయ, దేశీయ విశ్వ విద్యాలయాల్లోనూ అంబేడ్కర్ పరిశోధనా కేంద్రాలు నిర్మించి... తగినన్ని నిధులు ఇచ్చి ప్రోత్సహించటం ద్వారా ఆయన రచనల లోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విద్యా అంశాలపై పరి శోధనలు జరిగేలా చూడాలి. ఆయన నడిపిన పత్రికలు, ఆయన నిర్మించిన సంస్థలు, పార్టీలు, ఆయన ప్రణాళికలు దేశ భవిష్యత్తుకు మార్గదర్శ కాలు. ముఖ్యంగా భూమినీ, పరిశ్రమలనూ జాతీయం చేయాలనే ఆయన ఆలోచన... దళిత, బహుజన, మైనారిటీలు రాజకీయ అధికార సాధన మీద ఆధారపడి ఉంది. అంబేడ్కర్ ముందటి భారతదేశం వేరు. ఆయన తర్వాతి భారతదేశం వేరు. అందుకే అంబేడ్కర్ యుగ కర్త. ఈ యుగం ఆయనదే. ఆయన మార్గంలో నడుద్దాం. డాక్టర్ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాల ప్రకారమే భారత్లో సమాఖ్య ప్రభుత్వాలు పూర్తిగా నడవక పోయినా... రాజ్యాంగ మౌలిక సూత్రాలను మాత్రం గత ఆరు దశాబ్దాల్లో అవి అతిక్రమించ లేదనేది వాస్తవం. ఒక వేళ అటువంటి పరిస్థితులు తలెత్తినా న్యాయవ్యవస్థ ఎప్పటికప్పుడు తన న్యాయ సమీక్షాధికారం ద్వారా రాజ్యాంగాన్ని రక్షిస్తూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ భావజాలం పుణికిపుచ్చుకున్న బీజేపీ ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే దేశం’ అంటూ నియంతృత్వ భారతాన్ని నిర్మించడానికి వడి వడిగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. భారత రాజ్యాంగం బోధిస్తున్న బహుళత్వం, పరస్పర సహకారం, రాష్ట్రాల హక్కులు, స్థానిక స్వయం పరిపాలన వంటి వాటిని తుంగలో తొక్కడానికే అఖండ ఏకైక భారత్ ప్రాపగాండా అనేది స్పష్టం. ఈ దేశంలోని వేల కులాలు, విభిన్న జాతులు, మతాలు, ప్రాంతాల అస్తిత్వాలను కనుమరుగు చేసి మెజారిటీ మతాన్నీ, భాషనూ ఇతరులపై రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను ఇంతకన్నా ఏవిధంగా అర్థం చేసుకోవాలి? ‘రాష్ట్రాలు మిథ్య, కేంద్రమే నిజం’ అన్న రీతిలో కేంద్రంలోని అధికార పార్టీ విధానాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మాత్రం చైతన్యరహితంగా తన పాత పద్ధతుల్లోనే వ్యవహ రిస్తూ అనేక రుగ్మతలతో కునారిల్లుతోంది. దేశ నవ నిర్మాణంపై స్పష్టమైన జాతీయ విధానాలు లేని మిగతా జాతీయ పార్టీలు నామమాత్రంగానే మను గడ సాగిస్తున్నాయి. మరో పక్క చాలా ప్రాంతీయ పార్టీలు అవినీతికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్గా ఉంటూ జాతీయ రాజకీయాల్లో ప్రభావ వంతమైన పాత్రను పోషించే స్థితిలో లేవు. ఈ పరిస్థితులను అనువుగా తీసుకుని బీజేపీ ఈసారి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ సాధించడంతో పాటూ, దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవాలని వ్యూహం పన్నుతోంది. నిజంగా ఈ వ్యూహం ఫలిస్తే రాజ్యాంగానికి భారీ సవరణలు చేపట్టి దాని మౌలిక స్వరూపాన్ని మార్చడం బీజేపీకి సులువవుతుంది. మెజారిటీ మతం దేశ ప్రజలందరి మతం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ మతానుయాయుల సంస్కృతే మొత్తం దేశ సంస్కృతిగా చలామణీ అవుతుంది. ఇప్పటికే మైనారిటీలు, నిమ్నవర్గాల ఆహార విహారాలపై ఛాందసవాదుల దాడులు, ఆంక్షలను చూస్తూనే ఉన్నాం. బీఫ్ను ఆహారంగా తీసుకున్న వారు మత విలువల్ని కించపరచిన వారుగా దాడులకు గురవుతున్నారు. ఎక్కువగా ఉత్తరాదికి పరిమితమైన మూక దాడుల సంస్కృతిని దక్షిణాదికీ, ఈశాన్య భారతానికీ ఛాందస వాదులు విస్తరింపచూస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ మైన భారత్లో ఇప్పటి వరకు ఎలాంటి సైనిక, ప్రజా తిరుగుబాటులు జరుగలేదంటే అందుకు రాజ్యాంగం ఇచ్చిన లౌకిక ప్రజాస్వామ్య విలువలే ప్రధాన కారణం. అన్ని కులాలూ, జాతులూ, మతాలూ, భాషలూ, ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం, హక్కులు కల్పించడమనే మౌలిక సూత్రం రాజ్యాంగంలో ఉన్నది కాబట్టే తిరుగుబాట్లు తలెత్తలేదు. కానీ ఒకే దేశం, ఒకే జాతి లాంటి నినాదాలను ముందుకు తెచ్చి కేంద్రీకృత నియంతృత్వ విధానాలనూ, ఫాసిజాన్నీ దేశంలో అమలు చేయడానికి నేడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ తన నియంతృత్వ ధోరణిలో భాగంగానే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలను రాత్రికి రాత్రే తీసుకుని ప్రజలను ఇక్కట్ల పాలు చేసింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య దేశ నిర్మాణంలో భాగంగా డాక్టర్ అంబేడ్కర్... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజికంగా వెనుక బడిన కారణంగా వారికి రాజ్యాంగంలో రిజర్వే షన్లు పొందుపరచి... విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించారు. కానీ అంబేడ్కర్ నిర్దేశించిన రిజ ర్వేషన్ల స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ఆర్థికంగా వెనుకబాటు ఆధారంగా 10 శాతం అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లను ఎటువంటి కమిషన్ వేయ కుండా, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మూడు రోజుల్లోనే పార్లమెంట్లో ఆమోదింపచేసుకున్న మోదీ ప్రభుత్వాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? 6 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కు సామా జిక న్యాయాన్ని పాటిస్తూ అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులనిచ్చి ముఖ్యమ్రంతి జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. 135 కోట్ల జనా భాను పాలించే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కనీసం అయిదు ప్రాంతాలకు అయిదు గురు ఉపప్రధానులను చేస్తే తప్పేమిటి? 1955 లోనే మొదటి ‘రాష్ట్రాల విభజన కమిషన్’కు భారత రాజ్యాంగ పిత అంబేడ్కర్ ఓ లేఖ రాస్తూ... ఉత్తరాదిన ఢిల్లీని మొదటి దేశ రాజధానిగానూ, దక్షిణాదిన ఉన్న హైద్రాబాద్ను దేశ రెండో రాజ ధానిగానూ చేయాలని ప్రతిపాదించారు. ఇంత వరకు కాంగ్రెస్ కాని, బీజేపీ కానీ ఈ ప్రతిపాదనను పట్టించుకోలేదు. పాలన, అధికార వికేంద్రీకరణ జరిగితేనే కదా అన్ని ప్రాంతాల ప్రజలకూ న్యాయం జరిగేది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా... 135 కోట్ల జనాభాకు కేవలం 29 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అన్ని అంశాల్లో అమెరికాను ఆదర్శంగా తీసుకుంటున్న భారత్ రాష్ట్రాల సంఖ్య విషయంలో ఎందుకు తీసుకోదో అర్థం కాదు. 35 కోట్ల జనాభాకన్నా తక్కువే ఉన్న అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. స్వయం నిర్ణ యాధికారాలూ, సొంత సుప్రీంకోర్టు, సొంత రాజ్యాంగం, సొంత జెండా, ఎజెండా కలిగి ఉండే స్వేచ్ఛ అక్కడి రాష్ట్రాలకు ఉంది. అందుకే అక్కడ రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయి. బాబా సాహెబ్ సూచించినట్లు భారత్లో 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చొప్పున ఏర్పాటు చేస్తే మేలు జరిగి ఉండేది. జాతీయ వాదం ముసుగులో దళిత, మైనార్టీలపై దాడులు చేస్తే... దేశ జనాభాలో 35 శాతం ఉన్న ఈ వర్గాలు ఎలా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతాయి? అందుకే బీజేపీ పాల కులు దుందుడుకు పోకడలకు పోకుండా అంబే డ్కర్ ఆశయాల సాధనకు పాటు పడితే దేశం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. డా. గాలి వినోద్ కుమార్ వ్యాసకర్త ఫౌండర్ చైర్మన్, నవ భారత్ నిర్మాణ్ ఛారిటబుల్ ట్రస్టు (ఈ వ్యాసం Apr 14, 2023 రోజున sakshi.comలో ప్రచురితమైనది) -
తెలుగు సాహిత్యంలో అంబేడ్కర్ శకం..
అంబేడ్కర్ కోట్లాది భారతీయ దళితుల దాస్య విమోచకుడు మాత్రమే కాదు; భారతీయ దళిత సాహిత్యానికి ఆద్యుడు, ఆఢ్యడు కూడా. అంబేడ్కర్ తన గురుత్రయంగా ప్రకటించుకున్న గౌతమబుద్ధుడు, సంత్ కబీర్, మహాత్మాజ్యోతిబా పూలేల తాత్త్విక ఆలోచనా విధానమే అటు అంబేడ్కరిజానికీ, ఇటు భారతీయ దళిత సాహిత్యానికీ సిద్ధాంత భూమిక అయింది. తెలుగు దళిత సాహిత్యానికి అంబేడ్కర్ ఆంధ్రదేశ్ పర్యటన ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ గొప్ప ప్రేరణ ఇచ్చింది. నందనార్ హరిశ్చంద్రుడి పట్టువదలని పూనికతో అంబేడ్కర్ 1942 సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో అడుగుపెట్టారు. అప్పటికి దళిత నాయకులుగా ఉన్న ఈలివాడపల్లి, పాము రామ్మూర్తి, కుసుమ ధర్మన్న, బొజ్జా అప్పలస్వామి వంటి వారు ఆ పర్యటనలో పాల్గొన్నారు. అంబేడ్కర్ మరణించిన దశాబ్దాలకు గానీ ఆయన జీవితం, రచనలు చదివే అవకాశం తెలుగు దళితులకు దక్కలేదు. 1968లో మొదటిసారి యెండ్లూరి చిన్నయ్య రాసిన డా.అంబేడ్కర్ జీవిత చరిత్ర గ్రంథ రూపంలో వచ్చింది. ఆ కాలంలోనే అంబేడ్కర్ రచించిన ‘ఇన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్’ గ్రంథానికి యెండ్లూరి చిన్నయ్య, బోయి భీమన్నల అనువాదాలు వచ్చాయి. ఆ తర్వాత అంబేడ్కర్ జీవితచరిత్రను గ్రంథస్థం చేసినవారిలో బి. విజయభారతి, అమూల్యశ్రీ, బోయ జంగయ్య, పి.అబ్బాయి, ఉదయకీర్తి, బొనిగెల రామారావు, బూతం స్వామి వంటి వారున్నారు. తెలుగునాట మొదటిసారిగా అంబేడ్కర్ను సాహిత్యంలో ప్రస్తావించిన ఘనత మహాకవి గుర్రం జాషువాకే దక్కుతుంది. 1947లో వెలువరించిన ఆయన కావ్యం గబ్బిలంలో ‘కలడంబేడ్కరుండు నా సహోదరుడు’ పద్యంలో గబ్బిలాన్ని అంబేడ్కర్ దీవెనలు తీసుకోమంటారు, పద్యకావ్యాలు, శతకాలు, గేయాలు, వచన కవితలు, నాటకాలు, బుర్రకథలు, హరికథలు ఒకటేమిటి అన్ని ప్రక్రియల్లోనూ అంబేడ్కర్ ఆవిష్కరించబడ్డారు. బోయి భీమన్న ‘నమస్సుల్, డాక్టరంబేడ్కరా?’ మకుటంతో సుప్రభాతం, రాపాక ఏకాంబరం ‘అంబేడ్కరో! సమరసింహా!’, చోడగిరి చంద్రరావు ‘భీమరాయ శతకం’ వెలువరించారు. దళిత ఉపాధ్యాయ కవులు మల్లవరపు జాను, జల్లి రాజగోపాలరావు, మల్లవరపు వెంకటరావు, బుంగా ఆడమ్బాబు, రాచమల్లు దేవయ్య, తోటకూర జార్జి, పలివెల సుదర్శనరావు, గుర్రం ధర్మోజి, నక్కాఅమ్మయ్య, మద్దా సత్యనారాయణ వంటి వారు అంబేడ్కర్కు పద్యనీరాజనాలు పలికారు. భీమన్న ‘జయ జయ జయ అంబేడ్కర! జయ దళిత జనస్వర!’ గేయం దళితుల జాతీయగీతంగా ప్రసిద్ధికెక్కింది. నీల్ సలామ్ కావ్యంలో ‘వ్రాయుటబ్బిన నీ పేరె వ్రాయవలయు’ అన్నారు కందిపాటి గోపాలరావు. మాష్టార్జీ గేయం ‘అందుకో దండాలు బాబా అంబేడ్కరా! / అంబరాన ఉన్నట్టి సుక్కలు పాడవంగో’ ఆల్టైమ్ రికార్డు. గోరటి వెంకన్న ‘వైతాళికా! ఈ యుగము నీదిరా! బొద్ధాళికా! ఈ జగము నీదిరా!’ అని ఆలాపిస్తే, జయరాజు ‘జాగోరే జాగో అంబేడ్కర్/ జగజ్జన నేత అంబేడ్కర్’ అని తమ బతుకు ఆశగా వర్ణిస్తారు. పావన ప్రసాద్ ‘దేశానికి రక్షణ కవచం / అంబేడ్కర్ తత్త్వం కాదా’ అని ప్రశ్నిస్తే, బోయి భీమన్న ‘పాటలలో అంబేడ్కరు’ పేరుతో ప్రత్యేకంగా ఒక గ్రంథాన్నే ప్రచురించారు. దళిత సామాజిక సాహిత్యోద్యమాలలో భాగంగా ఎందరో కవులు వేలాది గేయాలను ఆలపించారు. సవేరా, శ్రమశ్రీ, భీమసేన, రాంచందర్, శుక్తి, భీమసేన, లెల్లె సురేశ్, ఉదయ భాస్కర్, నాగబత్తుల గోపాలకృష్ణ వంటి కవులు పదుల సంఖ్యలో అంబేడ్కర్కు గేయ హారతిపట్టారు. నగేష్ బాబు, ఖాజా సంపాదకత్వంలో వెలువడిన ‘విడి ఆకాశం’ కవితా సంకలనానికి ‘అంబేడ్కరిస్టు ప్రేమ కవిత్వం’ అని ఉపశీర్షిక పెట్టారు, ‘అతడు జాతిబువ్వ, అతడు వెలుగుతోవ్వ, అతడు పాలబువ్వ, అతడు నిప్పురవ్వ' అని అంబేడ్కర్ ఏమిటో తెలియజేస్తాడు ఎండ్లూరి సుధాకర్. శిఖామణి అంబేడ్కర్ విగ్రహాన్ని ‘శతాబ్దాలుగా ఘనీభవించిన దళితాగ్రహం’గా భావిస్తాడు. అంటే డ్కర్ను దళితుల అన్నంగిన్నెతో పోలుస్తారు నేతల ప్రతాప్ కుమార్. ‘నీ పురుటి నొప్పులతో రాజ్యాంగాన్ని కాదు / తరాల స్వప్నాల్ని ప్రసవించావు / నువ్వు మాకు తండ్రివా! తల్లివా’ అని అంబేడ్కర్లో అమ్మతనాన్ని దర్శిస్తారు కలేకూరి ప్రసాద్. చల్లపల్లి స్వరూప రాణి ‘ఇప్పుడు మనువు / అగ్రహారం వీడి / అంబేడ్కర్ కాలనీకొచ్చాడు / బాబా! నాకు పాలను నీళ్ళను వేరు చేసే జ్ఞానాన్నివ్వ’మని వేడుకొంటారు. సతీష్ చందర్, తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్, బన్న అయిలయ్య, జి.వి.రత్నాకర్, పైడి తెరేష్బాబు, విరియాల లక్ష్మీపతి, కొలకలూరి ఇనాక్... అంబేడ్కర్ను కవిత్వంలో ఆవిష్కరించారు. అంబేడ్కర్ భావజాలంపై అనేక గ్రంథాలు వెలువడ్డాయి. కత్తి పద్మారావు అంబేడ్కర్ జీవిత చరిత్ర పేరుతో బహత్ గ్రంథాన్ని వెలువరించారు. కె.జి. సత్య మూర్తి ‘అంబేడ్కర్ సూర్యుడు’ రాశారు. అంబేడ్కర్ మెమోరియల్ ట్రస్టు మూడు దశాబ్దాలకు పైగా అంబేడ్కర్ వర్ధంతి అయిన డిసెంబరు 6న స్మారకోపన్యాసాలు ఏర్పాటుచేసి, వాటిని గ్రంథరూపంలో తెస్తోంది. హైద రాబాద్ బుక్ ట్రస్టు వంటి సంస్థలు అంబేడ్కర్ భావజాలాన్ని అనువాదాల రూపంలో తెలుగులో అందించడం అభినందనీయం. అంబేడ్కర్ జీవిత చరిత్రను తెలుగులో చలనచిత్రంగా రూపొందించిన డాక్టర్ పద్మావతి దళితులకు గొప్ప ఉపకారం చేశారు. ఆ సినిమాకు సి. నారాయణరెడ్డి అంబేడ్కర్ జీవితాన్ని ప్రతిఫలించే భావస్పోరకమైన గీతాల్ని అందించారు. సౌదా అరుణల ‘జాతిపిత అంబేడ్కర్’, పాటిబండ్ల ఆనందరావు ‘రాజగృహ ప్రవేశం’ నాటకాలు రంగస్థలం మీద అటు ప్రయోగానికీ, ఇటు ప్రయోజనానికీ పెద్దపీట వేశాయి. జయభేరి, ప్రజాబంధు, రిపబ్లికన్ జ్యోతి, గబ్బిలం, ఏకలవ్య, నీలిజెండా, బహుజన కెరటాలు, దళిత కిరణాలు, సమాంతర వంటి దళిత పత్రికలు అవి బతికినంతకాలం అంబేడ్కర్ భావజాలాన్ని ప్రచారం చేశాయి. ఈ వ్యాసకర్త 15 సంవత్సరాల క్రితమే ‘అంబేడ్కర్ శకం’ పేరుతో సేకరించి సంకలించిన దాదాపు 500 పుటల అంబేడ్కర్ పద్య, గేయ, వచన కవితా సంపుటి అముద్రితంగా ఉండి పోయింది. ఒక్కో ప్రక్రియలో ఇలాంటి ఒక్కో బృహత్తర సంపుటి రావలసిన అవసరం ఉంది. విశ్లేషణ: డాక్టర్ శిఖామణి తేది: 14/4/2023 -
ఆ ధర్మం సమస్త పీడితులకు వ్యతిరేకం
బీజేపీ అగ్రశ్రేణి మంత్రులైన అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్తో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా తాము సనాతన ధర్మాన్ని పరి రక్షిస్తున్నామని ప్రకటించారు. సనాతన ధర్మం బ్రాహ్మణిజా నికి చెందిన పురాతన తత్వశాస్త్రం. దాని మూలాలు ఋగ్వేదంలో ఉన్నాయి. ఇది ఇతర సంస్కృత గ్రంథాల ద్వారా ఉద్భవించింది. మనుధర్మాన్ని రచించిన బ్రాహ్మణ రచయితలు దాని రచనా సమయానికి.. అభ్యాసం, ఆధ్యాత్మిక సిద్ధాంతాలనే సనాతన ధర్మంగా సంశ్లేషించారు. ఇది ఉత్పాదక శ్రమకు, ఉత్పత్తిలో పాల్గొనే సామాజిక ప్రజారాశు (శూద్ర, ‘ఛండాల’, వనవాసు)లకు వ్యతి రేకంగా నిలిచింది. ఆ తత్వాన్ని బీజేపీ అగ్రశ్రేణి మంత్రులు, నేతలు ఇప్పుడు తమ సొంతం చేసు కున్నారు. ఇటీవలే ఈ అంశంపై విలేఖరుల సమావేశంలో ప్రసంగించిన బీజేపీ సీనియర్ అధికార ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్, ‘సనాతన ధర్మం ప్రతి ఒక్కరికీ శాశ్వ తమైన చట్టం’ అని నిర్వచించారు. ఆయన అభి ప్రాయం ప్రకారం సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వారు దాని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే శూద్రులు, దళితులు, ఆదివాసీలందరూ ఈ సనాతన ధర్మాన్ని ఎలా అంగీకరించగలరు? చివరగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ‘దీనికి సరైన సమాధానం కావాలి’ అని చెప్పారు. ఇప్పుడు అసలు రహస్యం బయటపడింది. సనాతన ధర్మం పక్షాన వీరంతా నిలిచారు. సనాతన ధర్మంలోనే ఉత్పత్తి కాలుష్యం అనే సిద్ధాంతానికి మూలాలు ఉన్నాయి. తాజాగా, 45 ఏళ్ల యువకుడైన ఉదయనిధి స్టాలిన్పై కేంద్రప్రభుత్వం యుద్ధం ప్రకటించినట్లు కనిపించింది. నిజానికి ఇది శూద్ర దళితులకు, ఆది వాసీలందరికీ వ్యతిరేకంగా సాగిన సంప్రదాయ యుద్ధ పద్ధతి మాత్రమే. కొత్తగా పునరుద్ధరించిన ఈ పురాతన సనాతన భావజాలం... ఉదయనిధి స్టాలిన్పై, ‘ఇండియా’ కూటమిపై దాడి చేయడానికి బీజేపీకి ఒక ఆయుధ మయ్యింది. కరుణానిధి మనవడూ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడూ అయిన ఉదయ నిధి స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అకస్మాత్తుగా అఖిల భారత ద్రవిడ సైద్ధాంతిక హీరో అయిపోయాడు. ఈ క్రమంలో ఉదయనిధి తలకి ఒక ఆలయ పూజారి వెల కట్టారు. దీనిపై బీజేపీ మౌనంగా ఉంది. 2023 సెప్టెంబరు 2న ‘సనాతన నిర్మూలన’ అనే అంశంపై ‘తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ చెన్నైలో ఏర్పాటు చేసిన సదస్సులో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగించారు. ‘కొన్ని విష యాలను కేవలం వ్యతిరేకించలేము, వాటిని రద్దు చేయాల్సి ఉంటుంది. మనం డెంగ్యూ, దోమలు, మలేరియా లేదా కరోనా వైరస్ని వ్యతిరేకించి ఊరు కోలేం. వాటిని మనం నిర్మూలించాలి. సనాతనాన్ని వ్యతిరేకించే బదులు దానిని నిర్మూలించాల్సి ఉంది.’ సనాతన ధర్మాన్ని కుల అసమానతతో కూడిన, సామా జిక వ్యతిరేక భావజాలంగా ఉదయనిధి నిర్వచించారు. బీజేపీ మంత్రులు సనాతన ధర్మాన్ని ఒక శాశ్వత చట్టంగా నిర్వచిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ హయాంలో గానీ, ఇప్పుడు బీజేపీ హయాంలో గానీ సనాతన ధర్మం అనే భావన భారత దేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీలకు వ్యతిరేకమనే అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మంలో అంటరానితనం, శ్రమ వ్యతిరేకత, స్త్రీల అసమానత వంటి వాటికి లోతైన మూలాలు ఉన్నాయి. వేద గ్రంథాల తరువాత, మనుధర్మం సనాతన ధర్మ భావ జాలాన్ని సంశ్లేషించింది. డా‘‘ అంబేడ్కర్, పెరియార్ రామసామి నాయకర్ ఆ మొత్తం ప్రక్రియపై లోతైన విశ్లేషణ చేశారు. దాంట్లో భాగంగానే పెరియార్ మను ధర్మంపై దాడి చేశారు. సనాతన ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చేశారు. వ్యవసాయ చట్టాల ద్వారా శూద్ర వ్యవ సాయ దారుల చేతులు కట్టేయాలని బీజేపీ భావించింది, కాని వారు పోరాడారు. ఇప్పుడు బీజేపీ శక్తులు సనాతన ధర్మ వ్యతిరేకమైన, శక్తిమంతమైన ద్రావిడ స్థావరంపై దాడి చేయాలనుకుంటున్నాయి. అందుకే సనాతన ధర్మంపై ఓ యువకుడి విమర్శను ఢిల్లీలో ద్విజ శక్తులు నరహంతకంగా వక్రీకరించి, దానిపై తీవ్రంగా దాడి చేశాయి. కేంద్రప్రభుత్వం మొత్తం దీనిపై దృష్టి సారించింది. అధికార బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఉద్దేశపూర్వకంగానే ఉదయనిధి ప్రసంగాన్ని, 80 శాతం మంది ప్రజలపై మారణహోమంగా వక్రీకరించారనేది సుస్పష్టం. శూద్ర, దళిత, ఆదివాసీలు కూడా వీరిలో భాగమనే అర్థంలో ఆయన వక్రీకరించారు. ధర్మం అనే భావనను న్యాయం అనే అర్థంలో మలుచుకుంటున్నారు. ఇది ప్రాచీన గ్రీకు లేదా యూరోపియన్ కోణంలో చెప్పిన న్యాయానికి సమానం కాదు. అంటే వేదాలు పేర్కొన్న ఈ ధర్మం ప్రకారం బ్రాహ్మణులు రూపొందించిన కుల నియమాలను శూద్రులు తప్పక పాటించి బానిసలుగా, వ్యవసాయ పనివాళ్లుగా బతకాలి. ద్విజులు కలుషితమైనదిగా భావించే వ్యవసాయం చేయకూడదు. శూద్ర, దళిత, ఆదివాసీలను వదిలేయండి... సనాతన ధర్మంలో అన్ని కులాల మహిళలకు స్థానం లేదు. పైగా వారు సనాతన ధర్మం విధించిన అనాగరిక దోపిడీ, మూఢనమ్మకాల బంధితులు. జాతీయ పాలకులు బహిరంగంగా ఇలాంటి భావజాలాన్ని కలిగి ఉండి, ఆదిమ భావ జాలంపై విమర్శ చేసేవారిపై దాడి చేస్తే దేశం అంధ కారంలోకి జారిపోతుంది. బీజేపీ/ఆరెస్సెస్లో పనిచేస్తున్న శూద్ర, ఓబీసీ, దళిత ఆదివాసీలు ఈ కొత్త పరిణామాన్ని చాలా నిశితంగా పరిశీలించవలసి ఉంటుంది. సనాతన ధర్మాన్ని అంగీకరించడం ద్వారా వ్యవస్థపై ఎలాంటి సైద్ధాంతిక నియంత్రణ లేకుండానే అధికార స్థానాలను కొద్దిమంది అనుభవించవచ్చుగాక. కానీ ఉత్పాదక అత్యధిక ఉత్పా దక శక్తులతోపాటూ దేశం మొత్తం చీకటి యుగాల్లోకి నెట్టివేయబడుతుంది. కంచ ఐలయ్య షెపర్డ్ (వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త) -
పీఎల్ఐ స్కీముపై అభిప్రాయాలు చెప్పండి - కేంద్రం
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని మరింత సమర్ధమంతంగా అమలు చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా స్కీముపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా పరిశ్రమ వర్గాలను కోరింది. స్కీము అమలు గురించి చర్చించేందుకు జూన్ 27న వర్క్షాప్ నిర్వహించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పీఎల్ఐ అమలు ప్రక్రియలో లబ్ధిదారులకు ఏవైనా సవాళ్లు, సమస్యలు ఉంటే వాటిని అమలు చేస్తున్న శాఖలు లేదా విభాగాల దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. తద్వారా సానుకూలమైన సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు, స్కీమును మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని పేర్కొంది. రూ. 3,400 కోట్లకు క్లెయిమ్స్ వచ్చినప్పటికీ 2023 మార్చి ఆఖరు నాటికి స్కీము కింద ప్రభుత్వం రూ. 2,900 కోట్లు మాత్రమే విడుదల చేసిన నేపథ్యంలో వర్క్షాప్ నిర్వహణ ప్రాధాన్యం సంతరించుకుంది. పీఎల్ఐ లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి వారితో తరచుగా సంప్రదింపులు జరపాలని వివిధ విభాగాలకు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో 2021లో టెలికం, ఫార్మా తదితర 14 రంగాలకు రూ. 1.97 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం పీఎల్ఐ స్కీమును ప్రకటించింది. -
వడి వడిగా నీలివిప్లవం దిశగా..!
ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన సహజ వనరు లకు నిలయం. ప్రపంచంలోని చిన్న దేశాలైన సింగపూర్, మలేసియా, మారి షస్, ఐరోపా దేశాలు గొప్పగా అభి వృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఆ దేశాల్లో ఉన్న సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడమే. ఆయా దేశాల స్థూల ఉత్పత్తిలో(జీడీపీ) దాదాపు 35 శాతం ఈ వనరుల ద్వారానే వస్తుంది. అలాంటి గొప్ప అవకాశం మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. 2019లో అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి మన సముద్ర తీర వనరులను వినియోగించుకొని నీలి విప్లవం సృష్టించడానికి శ్రీకారం చుట్టారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ అతి పెద్ద తీర రేఖ కలిగిన రాష్ట్రం. ఎన్నో పోర్టులను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. దీన్ని గమ నించే జగన్ ప్రభుత్వం చిన్న మధ్య తరహా పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ‘ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల విధానం 2022– 2027’ ప్రకారం అద్భుతమైన మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతీ తీర రేఖ కలిగిన జిల్లాలో ఎగుమతుల హబ్ని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర పరిశ్రమల విధానాల్లో సైతం ‘బ్లూ ఎకానమీ’కి సంబంధించిన అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో సైతం బ్లూ ఎకానమీ పెట్టుబడులపై ప్రధానంగా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టు అభివృద్ధికి సహక రిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చిన్న మధ్య తరహా పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తోంది. మేఘవరం పోర్టు (శ్రీకాకుళం), కాయప్ట్సీన్ పోర్టు (కాకినాడ), ముళ్లపేట పోర్టు (మచిలీపట్టణం), నిజాంపట్నం, వాడరేవు లాంటి పోర్టులను రూ. 30,000 కోట్లతో నిర్మిస్తుంది. వీటి ద్వారా దాదాపు 100 మిలియన్ డాలర్ల ఎగుమతుల వ్యాపారం జరగబోతోంది. కడపలోని ఉక్కు, యురేనియం; నెల్లూరులో మైకా; కోస్తా జిల్లాల నుండి అరటి, కొబ్బరి, పంచదార, పండ్లు లాంటి భారీ ఆదాయాన్ని సమకూర్చే వాటిని మన రాష్ట్రం నుండే ఎగుమతి చేయొచ్చు. కేంద్రం నిర్మిస్తున్న పారిశ్రామిక కారిడార్లలో మన రాష్ట్రంగుండా మూడు వెళ్తున్నాయి. అందులో ముఖ్యమైంది విశాఖపట్నం – చెన్నై పారిశ్రామిక కారిడార్. ఈ చిన్న మధ్య తరహా పోర్టుల అభివృద్ధి వలన విదేశీ పెట్టుబడులు పెరిగి రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. దేశంలో ఏపీ చేపల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. బ్లూ ఎకానమీలో చేపల ఉత్పత్తి, ఎగుమతులు చాలా కీలకం. కేవలం చేపల ఉత్పత్తే కాకుండా దానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. ఐరోపా దేశాల తరహాలో ఫిషింగ్ లాండింగ్ కేంద్రాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. 6 ఫిషింగ్ హార్బర్లతో వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా అభివృద్ధి చేస్తుంది. దేశంలోనే మొదటిసారిగా ౖ‘వెఎస్సాఆర్ మత్స్యకార భరోసా’ ద్వారా ప్రతి కుటుంబానికీ మత్స్యకారులు ఎవరైనా మరణిస్తే 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రంలో అద్భుతమైన ఖనిజ సంపద ఉంది. బ్లూ ఎకానమీలో సముద్రపు ఖనిజాల వెలికితీత చాలా ముఖ్యమైన లక్ష్యం. కృష్ణ – గోదావరి బేసిన్లోని సహజ వాయువు, విశాఖపట్నంలో పాలి మెటాలిక్ నొడ్యూల్స్ వెలికితీతకు మంచి అవకాశాలు ఉన్నాయి. మడ అడవుల అభివృద్ధి, సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చడం వంటి విధానాలు కూడా బ్లూ ఎకానమీలో ప్రధానం. రాష్ట్రంలో పగడపు దిబ్బలు ఉన్నాయి. అరుదైన లోహాలు సము ద్రాల్లో లభ్యం అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చక్కటి ప్రణాళికలను రూపొందిస్తోంది. విద్యారంగంలో సైతం బ్లూ ఎకానమీ ద్వారా మెరైన్ ఇంజ నీరింగ్, షిప్ బిల్డింగ్, ఆఫ్ షోర్ ఇంజనీరింగ్ వంటి కోర్సులకు అధిక అవకాశం ఉంది. ఫిషింగ్ విశ్వ విద్యాలయం పూర్తయినవెంటనే ఈ రంగాల్లో విద్య అవకాశాలు విరివిగా వస్తాయి. రాష్ట్రం కర్కట రేఖ మీద ఉన్నందున మంచి సూర్యరశ్మి సముద్రంపై లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన విద్యుత్తును సముద్రాల్లో తయారు చేయాలని సంకల్పించింది. కేంద్రం ఇటీవల లక్షద్వీప్లో సముద్ర ఉష్ణ శక్తి ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అదే తరహాలో మన రాష్ట్రంలో 3 సముద్రపు ఉష్ణ శక్తిప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కగా ముందుకు సాగుతోంది. వచ్చే 2030–2035 నాటికి ప్రభుత్వం తీసుకున్న విధానాల వలన రాష్ట్రంలో బ్లూ ఎకానమీ ద్వారా 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సుస్థిరత్వం సాధ్యం అవుతుందనేది ఒక అంచనా. - కన్నోజు శ్రీహర్ష, వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు -
బిల్ గేట్స్ (బిజినెస్ మాగ్నెట్) రాయని డైరీ
మిస్ పౌలా నవ్వారు. ఆమె నవ్వు సియాటిల్ నగరంలా అందంగా ఉంది. నన్ను అర్థం చేసుకున్న సిటీ సియాటిల్. అక్కడే నేను పుట్టాను. పర్వతాల అరణ్య జ్వాలలపై నాకు ప్రేమ కలిగిందీ అక్కడే. ‘‘ఏంటి నవ్వుతున్నారు మిస్ పౌలా?’’ అని అడిగాను. సియాటిల్లోని మొత్తం ఏడు లక్షల యాభై వేల మంది జనాభాకు కాస్త దూరంగా ఉండే కాఫీ షాప్లో ఇద్దరం పక్కపక్కన కూర్చొని ఉన్నాం. నేను ఆమె వైపు జరిగి కూర్చుంటే ఆమె నావైపు ఒరిగి కూర్చున్నారు. ‘‘మన గురించి ఏవో రాస్తున్నారు..’’ అన్నారు పౌలా.. నవ్వుతూనే. నేనూ నవ్వాను. ‘‘మీరెందుకు నవ్వుతున్నారు బిల్!’’ అన్నారామె. ‘‘ఏవో రాస్తున్నారు కానీ, ఏవేవో రాయడం లేదు. నయం కదా..’’ అన్నాను. ఇద్దరం కాసేపు మౌనంగా ఉండిపోయాం. మా భుజాలు వాటి కబుర్లలో అవి ఉండిపోయాయి. ‘‘మీ నవ్వు పొయెట్రీలా ఉంటుంది బిల్..’’ అన్నారు పౌలా హఠాత్తుగా! 67 ఏళ్ల వయసులో ఆమె కారణంగా సియాటిల్ నగరాన్ని నేను, 60 ఏళ్ల వయసులో నా కారణంగా పొయెట్రీని ఆమె ఇష్టపడుతున్నామా? అయినా నా నవ్వు పొయెట్రీలా ఉంటుందని ఆమె అన్నారే గానీ పొయెట్రీని తను ఇష్టపడతానని అన్లేదుగా!! ‘‘పొయెట్రీ అంటే మీకు ఇష్టమా?’’ అని అడిగాను. ఆమె నవ్వి, ‘‘ఎవరికుండదూ..!’’ అన్నారు. ‘‘బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్లక్కూడానా?’’ అన్నాను. ‘‘ఓయ్..’’ అంటూ తన భుజంతో నా భుజాన్ని నెట్టేశారు పౌలా. ఆమెలో ఏదో మాయ ఉంది. యాన్ విన్బ్లాడ్లో ఉన్నట్లు, జిల్ బెనెట్లో ఉన్నట్లు, మెలిందాలో ఉన్నట్లు! అసలు ఆడవాళ్లలోనే ఈ మాయ ఉంటుందా?! మెలిందా నాకు విడాకులు ఇవ్వడానికి విన్బ్లాడ్ కానీ, జిల్ బెనెట్ గానీ కారణం కాదు. పౌలాకు నేను దగ్గరవ్వడానికి మెలిందా కానీ మరొకరు కానీ కారణం కాదు. ప్రేమ, స్నేహం.. ఇవి మాత్రమే నడిపిస్తాయి జీవితాన్ని. జెఫ్రీ ఎప్స్టైన్ నా స్నేహితుడు. అతడితో మాట్లాడవద్దంటుంది మెలిందా. అతడి మీద కేసులు ఉన్నాయని, అతడు జైలుకు వెళ్లాడని, అతడితో స్నేహం వదిలేయమని అంటుంది. ‘‘ఎలా వదిలిపెట్టడం మెలిందా?’’ అంటే.. ‘‘పోనీ నన్నొదిలేయ్’’ అంటుంది!! జైల్లో జెఫ్రీ ఆత్మహత్య చేసుకుని చనిపోయాక కూడా మెలిందా మనసు కరగలేదు. ఎందుకుండాలి ఒక మనిషి పట్ల మరొక మనిషి అంత కఠి నంగా!! మెలిందాతో ఆ మాటే అన్నాను. కోపంతో నన్ను వదిలి వెళ్లింది. కానీ ప్రేమ, టెన్నిస్ ఎవర్నీ ఒంటరిగా ఉండనివ్వవు. నా జీవితంలోకి పౌలా ప్రవేశించారు. నాలానే పౌలా టెన్నిస్ అభిమాని. మొదటి సారి కలిసినప్పుడు.. ‘‘మీ..రూ..’’ అంటూ నన్నలా చూస్తూ ఉండిపోయారు పౌలా. రెండోసారి మేము కలుసుకున్నప్పుడు ‘‘మీ..రూ..’’ అంటూ తనను అలా చూస్తూ ఉండిపోయాన్నేను. మనసుకు నచ్చిన వాళ్లతో కలిసి కూర్చోడానికి టెన్నిస్ టోర్నమెంట్ల తర్వాత కాఫీ షాపులు బాగుంటాయి. అయితే ఒక్కటే నిరాశను కలిగిస్తుంది. కాఫీ షాపులలో ఎన్ని గంటలు కూర్చున్నా డ్యూటీకి వెళ్లడం కోసమైతే ల్యాప్టాప్ని తగిలించుకుని పైకి లేవవల సిందే. పౌలా ఈవెంట్ ఆర్గనైజర్. ‘‘ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు బిల్..’’ అన్నారు పౌలా తన భుజంతో మళ్లీ నా భుజాన్ని నెట్టేస్తూ. మా ముందున్న టేబుల్ మీద ఆవేళ్టి ట్యాబ్లాయిడ్స్ ఉన్నాయి. ‘బిల్ గేట్స్కి మళ్లీ ప్రేమ దొరికింది’.. అన్నిటిపైనా ముఖ్యాంశం ఒకటే! ‘అవునా! బిల్ గేట్స్కి ప్రేమ దొరికిందా?!’’ అంటూ నా కళ్లలోకి చూసి నవ్వారు పౌలా. మాధవ్ శింగరాజు -
‘పెద్దలు’ కుమ్మక్కైతే న్యాయం గతేమిటి?
మన రాజ్యాంగం ఎవరో ఒకరు రచించిన పుస్తకం కాదు. అది అంబేడ్కర్ వంటి మహానుభావులు నిర్మించిన ఒక సంవిధానం. రాజ్యాంగ నియమాలతో పాటు కొన్ని సంప్రదాయాలూ అనేక ఏళ్ల నుంచీ కొనసాగుతున్నాయి. అందులో సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థ ఒకటి. ఈ వ్యవస్థ ద్వారా న్యాయమూర్తుల నియామకాలనూ, బదిలీలనూ చేపడతారు. అయితే ఈ కొలీజియం వ్యవస్థ పార్లమెంట్ చేసిన చట్టం ద్వారానో లేదా రాజ్యాంగ నిబంధనలను అనుసరించో ఏర్పడింది కాదు. అది సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా పరిణామం చెందిన వ్యవస్థ. సుప్రీంకోర్టు కొలీజియానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మార్గదర్శకత్వం వహిస్తారు. నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. హైకోర్టు కొలీజియానికి ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తి నాయకత్వం వహిస్తారు. ఇద్దరు సీనియర్ హైకోర్టు న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. కొలీజియం సిఫార్సు చేసినవారిని ప్రభుత్వం నియమిస్తుంది. అయితే ఇటీవల కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలనే ప్రతిపాదన చేస్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ వివాదాస్పదమయింది. సుప్రీం కోర్టు ధర్మాసనాలు ఇచ్చిన అనేక తీర్పుల వల్ల... నియమాల కన్నా ఎక్కువగా సంప్రదాయాల ఆధారంగానే స్వతంత్ర న్యాయవ్యవస్థ నిర్మితమవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే కొలీజియం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యవస్థలో ప్రభుత్వ ప్రతి నిధి ఉండాలనే ప్రతిపాదన న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తినే దెబ్బ తీసేవిధంగా ఉందని పలువురు న్యాయనిపుణులు అంటు న్నారు. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధికి స్థానం గురించి మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం మాట్లాడుతూ... ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుల అభిప్రాయాలను ప్రస్తావించారు. ఆ సందర్భంగా రాజ్యాంగ మౌలిక నిర్మాణం లేదా స్వభావాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే సమాఖ్య, కార్యనిర్వాహకవర్గం, స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ ముఖ్య విభాగాలు అని రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన సంగతిని పేర్కొన్నారు. కొలీజియంలో పార్లమెంట్, ప్రభుత్వ పెద్దలకు స్థానం కల్పించడానికి చేసిన 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్నీ, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్జేఏసీ) చట్టాన్నీ సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్నీ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ‘పెద్దలు’ (ముగ్గురు) పరోక్షంగా సుప్రీం ఇచ్చిన ఈ తీర్పును ఒప్పుకోవడం లేదనీ, ఆ నిర్ణయాన్ని మరో దారిలో అమలుచేయాలని చూస్తున్నారనీ ట్విట్టర్ వేదికగా ఆయన అన్నారు. ‘1967–77 సంవత్సరాల మధ్య దేశ చరిత్రను ధన్ఖర్, బిర్లా, రిజిజులు చదివే ఉంటారని నేను భావిస్తున్నాను. రెండు భిన్న విషయాలను ధన్ఖర్ కలగలిపి వేశారు. రాజ్యాంగంలోని ప్రతీ లేదా ఏదైనా ఒక నిబంధనను పార్లమెంటు సవరించ గలదా; ఆ సవరణ న్యాయ వ్యవస్థ సమీక్ష పరిధిలోకి రాదా అన్నది ఒక అంశం. 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సరైనదేనా అన్నది రెండో అంశం. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీసుకున్న నిర్ణయం సరైనదనీ, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం కేసులో తప్పుడు నిర్ణయం తీసుకున్నదనీ అభిప్రాయపడేందుకు ఆస్కారమున్నది. నిజానికి న్యాయశాస్త్ర పండితులు అనేక మంది ఇదే విధంగా అభిప్రాయపడుతున్నారు’ అని చిదంబరం అన్నారు. అంతేకాదు ‘‘న్యాయవ్యవస్థ నిర్ణయాల కంటే పార్లమెంటు నిర్ణయాలే సర్వోన్నతమైనవనే వాదనను అంగీకరించామను కోండి. జరిగేదేమిటి? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. జమ్మూ –కశ్మీర్లో వలే ఒక రాష్ట్రాన్ని విభజించి పలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడాన్ని మీరు ఆమోదిస్తారా? వాక్ స్వాతంత్య్రాన్నీ, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే స్వేచ్ఛనూ, ఏ వృత్తినైనా ఆచరించే, ఏ వ్యాపారాన్ని అయినా చేసే స్వేచ్ఛను రద్దుచేయడాన్ని మీరు ఒప్పుకుంటారా? స్త్రీ పురు షులను సమానంగా పరిగణించని, హిందువులు, ముస్లింల పట్ల రాజ్య వ్యవస్థ భిన్న రీతుల్లో వ్యవహరించడాన్ని అనుమతించి... స్వలింగ సంపర్కులకు హక్కులు నిరాకరించే చట్టాలను మీరు ఆమోదిస్తారా? ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు, యూదులు, ఇతర మైనారిటీ వర్గాలకు రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులను రద్దు చేయడాన్ని మీరు అంగీకరిస్తారా? ఏడవ షెడ్యూలు నుంచి రాష్ట్ర జాబితాను తొలగించి, శాసన నిర్మాణాధికారాలు అన్నిటినీ పార్లమెంటుకు అప్పగించడాన్ని మీరు సమ్మతిస్తారా? ఒక నిర్దిష్ట భాషను యావద్భారతీయులు తప్పనిసరిగా నేర్చుకు తీరాలనే ఆదేశాన్ని మీరు పాటిస్తారా? నేరారోపణకు గురైన ప్రతీ వ్యక్తి అమాయ కుడుగా నిరూపణ కానంతవరకు అతడిని అపరాధిగా భావించాలని నిర్దేశిస్తున్న చట్టాన్ని మీరు అంగీకరిస్తారా? పార్లమెంటు నేడు అటువంటి చట్టాలు చేయదు, చేయలేదు. చేసినా వాటిని సమీక్షించి తిరస్కరించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉన్నది. ఇందుకు భిన్నంగా ‘పార్లమెంటరీ పూర్ణాధిపత్యం, న్యాయవ్యవస్థ సంయమనం’ సిద్ధాంతం కింద అటువంటి చట్టాలపై న్యాయ సమీక్ష జరగదు’’ అని చిదంబంరం పేర్కొన్నారు. రాజ్యాంగ సంవిధాన మౌలిక స్వభావాన్ని మార్చడానికి వీలులేదని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పినా, దశాబ్దాలుగా స్థాపితమైన సంప్రదాయాలు మార్చడానికి ప్రయత్నాలు జరుగు తున్నాయి. 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా... ప్రధానమంత్రీ, ఇతర ముఖ్యమైన మంత్రులూ, నాయకులూ తమ బాధ్యతను మరచి రాజ్యాంగ మౌలిక స్వరూ పాన్ని దెబ్బతీయడానికి ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొలీజియంలోని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు కాకుండా చీఫ్ జస్టిస్, ప్రధాన మంత్రి, న్యాయమంత్రి కలిసి న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో పాల్గొనే విషయాన్ని ఈ ‘ముగ్గురు’ పెద్దలు నిర్ణయిస్తారట. ఇదే జరిగితే న్యాయం బతుకు తుందా? - మాడభూషి శ్రీధర్ డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
భారత రత్న ఇవ్వాలి!
ఈ ఏడాది పద్మ పురస్కారాలు ప్రకటించారు కానీ దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ను ప్రకటించలేదు. ఎన్నో త్యాగాలూ, సేవలూ చేసినవారికి ప్రదానం చేసే ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రతి ఏడాదీ ప్రకటించి వారిని గౌరవించుకోవడం మన విధి. 1954 నుండి భారత రత్న పురస్కారాన్ని ఇస్తున్నారు. ఇప్పటివరకు 48 మందికి ఈ అవార్డును అందించారు. చివరిసారిగా 2019లో ముగ్గురికి ఇచ్చారు. సామాజిక సేవకుడు నానాజీ దేశ్ముఖ్ (మరణానంతరం), కళాకారుడు డాక్టర్ భూపేన్ హజారికా (మరణానంతరం), మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు ఈ అవార్డును ప్రదానం చేశారు. భారత రత్నకు వ్యక్తులను ఎంపిక చేసే ప్రక్రియ పద్మ అవార్డుల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ అవార్డుకు వ్యక్తులను సిఫార్సు చేసే ప్రక్రియ ప్రధాన మంత్రి నుంచి మొదలవుతుంది. వ్యక్తుల పేర్లను ఆయనే భారత రాష్ట్రపతికి పంపిస్తారు. కులం, వృత్తి, జెండర్... ఇలా ఎలాంటి భేదం లేకుండా ఎవరి పేరునైనా భారత రత్నకు పరిశీలించొచ్చు. ప్రతి ఏటా ముగ్గురికి భారత రత్న ఇవ్వొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పద్మ పురస్కారాలను ప్రకటించినట్లుగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం లేదు. అలా ప్రకటించాలని ప్రత్యేక నిబంధనలు ఏమీ లేకపోయినప్పటికీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ ఏడాది దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్ వంటి మహనీయులకూ గొప్ప సంఘ సంస్కర్తలైన ఫూలే దంపతులకూ, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య వంటి త్యాగ ధనులకూ, ధ్యాన్ చంద్ వంటి క్రీడాకారులకూ భారతరత్న పురస్కారం ఇచ్చి ఉంటే బాగుండేది. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజా భివృద్ధి కోసం పాటుపడిన విశిష్ట వ్యక్తులకు భారతరత్నను ప్రదానం చేయడం ద్వారా వారి త్యాగాలను ఈ తరానికి మరొక్కసారి పరిచయం చేసినట్లు అవుతుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – ఎం. రాం ప్రదీప్, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా -
బడ్జెట్లో సంక్షేమ మార్గం పడతారా? భారత్కు ఈ ఘనత ఎలా సాధ్యపడింది?
కేంద్రం ప్రతియేటా ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ కారణంగా ప్రభావితం అయ్యే వర్గాల ప్రజలలో బడ్జెట్ ముందు సహజంగానే కొంత ఉత్కంఠ నెలకొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్లో పెద్ద ఎత్తున సంక్షేమ పథ కాలు ఉండొచ్చునన్న అంచనాలు ఉన్నాయి. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గత 8 ఏళ్లుగా వల్లె వేస్తున్నారు. అంటే – దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం కలగజేయడం, వారి జీవన ప్రమాణాలు పెంచడం తమ లక్ష్యం అని చెప్పుకొంటూ వస్తున్నారు. పేదలకు గృహనిర్మాణం, పారిశుద్ధ్యం మెరుగుదల, పేద కుటుంబాలన్నింటికీ గ్యాస్ సిలిండర్ల సరఫరా, నగదు బదిలీ పథకాలు, రైతాంగానికి పెట్టుబడి సాయం (పీఎం కిసాన్), వృద్ధాప్య పెన్షన్లు, ఆయుష్మాన్ భారత్, పేదలకు ఉచిత రేషన్ తదితర పథకాలన్నీ తమ సంక్షేమ విధానానికి చిహ్నంగా బీజేపీ అభివర్ణించుకొంటున్నది. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్ని అంది స్తున్నప్పుడు ‘సబ్ కా వికాస్’ ఆచరణలోకి రావాలి కదా! దేశ జనాభాలో 1 శాతం మంది ధనికుల చేతుల్లో 40 శాతం దేశ సంపద చిక్కుకుని ఉందనీ; 50 శాతం జనాభా అంటే... 65 నుంచి 70 కోట్ల మంది ప్రజల చేతుల్లో కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉన్నదనీ తాజా గణాంకాలు వెల్లడించాయి. మరోపక్క ఈ 8 ఏళ్లల్లో బ్యాంకుల 14.38 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలను రద్దు చేశారు. అయినప్పటికీ ఇంకా బ్యాంకుల నిరర్థక ఆస్తుల గ్రాస్ రేటు 6.5 శాతంగా ఉంది. పెట్రో ధరల పెరుగుదల చరిత్రలో లేనంతగా ఈ 8 ఏళ్లల్లో పెరిగింది. డీజిల్పై 512 శాతం, పెట్రోల్పై 194 శాతం, గ్యాస్ సిలిండర్లపై 185 శాతం భారం మోపారు. అన్ని వస్తువులపై గరిష్ఠంగా వేస్తున్న జీఎస్టీ, గృహనిర్మాణ వస్తువుల ధరల పెరుగుదల... తదితర భారాలతో పోల్చితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ఎందుకూ కొరగాకుండా ఉంది. ఉద్యోగాల సృష్టి చేయలేని ఆర్థికాభివృద్ధి వల్ల ఎటువంటి లాభం లేదని గత కొన్నేళ్ల అనుభవాలు తెలియ జేస్తున్నాయి. ఉపాధి, ఉద్యోగాలు లేకుండా ఉన్న యువత సంఖ్య 21.8 కోట్లుగా ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తు న్నాయి. దేశంలో ఇంకా అనేక ప్రాంతాలకు రైలు రవాణా విస్తరించాల్సి ఉండగా, దేశంలోని ఎగువ మధ్యతరగతి వారి కోసం ‘వందే భారత్’ రైళ్లను ప్రవేశపెట్టారు. రైల్వే ట్రాక్ల సామర్థ్యం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, వాటిని పూర్తి స్థాయిలో పటిష్ఠపర్చకుండా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ రైళ్లను ఒక్కొక్కటి రూ. 120 కోట్ల వ్యయంతో దశల వారీగా మొత్తం 475 ప్రారంభించాలని సంకల్పించడం ఆశ్చర్యం కలిగించకమానదు. 2014లో అధికారంలోనికి వచ్చిన బీజేపీ ఈ 8 ఏళ్లలో సంక్షేమబాట నుంచి క్రమంగా వైదొలుగుతూ వస్తోంది. 2016లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొన్న రెండు ప్రధాన నిర్ణయాలు దేశ ఆర్థికరంగాన్ని అతలా కుతలం చేశాయి. మొదటిది పెద్లనోట్ల రద్దు; రెండోది జీఎస్టీ అమలు. వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని మార్చి వేస్తామని చెప్పి కార్యాచరణ చేపట్టకపోవడంతో రైతులు రెట్టింపు నష్టాల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. దానివల్ల ఆహార ధాన్యాల నిల్వలు పడిపోతు న్నాయి. గోదాముల్లో ఇప్పుడు కేవలం 4.92 కోట్ల మెట్రిక్ టన్నుల గోధుమలు, బియ్యం మాత్రమే నిల్వ ఉన్నట్లు భారత ఆహార సంస్థ తెలియజేసింది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యరంగంపై కొంతమేర అనివార్యంగా వ్యయాన్ని పెంచింది. టీకాల కొనుగోలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా పెంపుదల వంటి మౌలిక సదుపాయాలపై గణనీయంగా ఖర్చు చేసింది. అయినప్పటికీ, ఆ మొత్తం.. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 2 శాతానికి మించలేదు. ఇక, విద్యారంగాన్ని పరిశీలిస్తే, 2012–13లో యూపీఏ ప్రభుత్వం జీడీపీలో 3.36 శాతం నిధుల్ని కేటాయించగా, ఎన్డీఏ వచ్చిన ఈ 8 ఏళ్లల్లో విద్యారంగంపై చేస్తున్న వ్యయంలో నామమాత్రపు పెరుగుదల మాత్రమే ఉంది. నూతన విద్యా విధానాన్ని ఘనంగా ప్రకటించినప్పటికీ అందుకు అనుగుణంగా కేటాయింపులు పెంచలేదు. మధ్యాహ్న భోజన పథకానికి (ప్రధాన మంత్రి పోషణ్) వెచ్చిస్తున్న నిధుల్లో గత 7 ఏళ్లుగా ఎలాంటి పెరుగుదలా లేదు. కీలకమైన విద్యారంగంలో కేటాయింపులు పెంచకుండా దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లగలరు? ఎంతో కీలకమైన పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్ డీ) రంగంలో ఇతర దేశాలు 3 శాతం మేర కేటాయింపులు చేస్తుంటే భారత్ కేటాయింపులు గత దశాబ్ద కాలంగా 1 శాతం మించడం లేదు. 2008, 2009 సంవత్సరాలలో భారత్ అత్యధిక స్థాయిలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల్ని, 2.5 శాతం జీడీపీ మేర ఆకర్షించింది. కానీ, ఆ మొత్తం క్రమంగా తగ్గిపోతూ 2021 నాటికి 1.4 శాతానికి చేరింది. నిరుద్యోగిత పెరుగుదల వల్ల ప్రజల పొదుపు గణనీయంగా పడిపోయింది. క్యాపిటల్ ఫార్మేషన్లో కీలకమైన పొదుపు మొత్తాలు సన్నగిల్లడంతో... కేంద్ర ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు వివిధ మార్గాల ద్వారా అప్పులు తెచ్చుకొంటోంది. ఈ 8 ఏళ్లల్లో కేంద్రం కొత్తగా చేసిన అప్పులు రూ. 91 లక్షల కోట్లు దాటాయి. అయితే, బ్రిటన్ను పక్కకు తోసి భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇదెలా సాధ్యపడింది? ఇందులో కేంద్ర ప్రభుత్వం చొరవను సమీక్షించినట్లయితే, గత 20 సంవత్సరాలలో, ఇతర దేశాలకంటే భారత్ ఐటీ రంగంలో వడివడిగా ముందుకుసాగింది. ఐటీ ఆధారిత సేవలు, ఉత్పత్తుల రంగంలో భారత్ అగ్రగామిగా ఉంది. ఈ రంగం అభివృద్ధికి కేంద్రం చేసింది నామ మాత్రమే. సేవల రంగంలో కూడా మిగతా అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ అగ్రస్థానంలో ఉంది. (క్లిక్ చేయండి: సీతమ్మ వాకిట్లో... మధ్యతరగతి) క్లుప్తంగా చెప్పాలంటే, దేశ ఆర్థికాభివృద్ధికి ఐటీ, సేవల రంగాలు మాత్రమే గణనీయంగా దోహదం చేస్తున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు ఎక్కువగా ఐటీ, సేవల రంగాల్లోనే వస్తున్నాయి. ఇతర కీలక రంగాలలో ఎఫ్డీఐలను ఆకర్షించాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తిరంగంలో వృద్ధి ఆశాజనకంగా లేదు. దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగం పట్ల ఇంతకు ముందు మాదిరిగానే చిన్నచూపు చూస్తున్నారు. ‘మేకిన్ ఇండియా’ ఎందుకు చతికిల పడిందో ఆత్మావలోకనం చేసుకోవాలి. దేశంలో 15 కోట్ల మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ ఎంఇ) ఊతం కల్పించాలి. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ వ్యయం ఇంకా పెరగాలి. ఆహార ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించి దేశీయ రైతాంగాన్ని మరింత ప్రోత్సహించాలి. నూతన వార్షిక బడ్జెట్లోనైనా ప్రధాని దేశంలో 60 కోట్లు పైబడి ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలపై కనికరం చూపిస్తారా? - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్. -
Union Budget 2023: సీతమ్మ వాకిట్లో... మధ్యతరగతి
బడ్జెట్ ఏమి తెస్తుందో లేదో తెలియదు కానీ, ప్రతిసారీ కావల్సినన్ని చెణుకులు, మీమ్స్ మాత్రం తెస్తోంది. .... మధ్యతరగతి ఇళ్లలో తండ్రి, కొడుకుల మధ్య తరచూ వినబడే సంభాషణట ఇది వినండి... ‘కొనడం ఎన్ని రోజులు పోస్టుపోన్ చేస్తావ్ నాన్నా, ఈ ఫోన్ చూడు.’ – ... దీనికి ఏమైందిరా? ‘నాన్నా... ఎన్ని సార్లు అడుగుతావ్? రోజుకు 50 సార్లు హ్యాంగ్ అవుతోంది, మాట్లాడుతూంటేనే కట్ అవుతోంది.’ – ...అవును, కానీ మంచి ఫోనురా... ‘మంచిదే కానీ, పాతదయిపోయింది. కొత్తది కొనాల్సిందే...’ – .. సరే, చూద్దాం... ఆ తర్వాత రోజు.. ‘ఫోన్ సంగతి ఏమైంది నాన్నా...’ – సరే ఫస్ట్కు చూద్దాం... ఓ నెల తర్వాత.. ‘..ఫొటోస్, ఫైల్స్ మిస్సవుతున్నాయి నాన్నా..’ – ..ఏదీ చూద్దాం.. ‘..చూడడానికి ఏముంది.. అన్నీ పోయాయి.. కొత్తఫోన్ కొను నాన్నా. – ..అలాగే చూద్దాం.. మధ్యతరగతి జీవితాల్లో చూద్దాం... అంటే వారాలు నెలలు సంవత్సరాలు.. అన్నమాట! కొడుకు తండ్రిౖ వైపు ఆశగా చూస్తూనే ఉంటాడు.. ఏదో ఒకరోజు కొనివ్వకపోతాడా...అని. విచిత్రం ఏమిటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అంతే.. ఈసారైనా బడ్టెట్లో ఏదైనా ఉండకపోతుందా అని ఇలా.. కొడుకుకు దొరికిన సమాధానమే కనిపిస్తుంది.. నెక్స్ట్ బడ్జెట్లో చూద్దాం.. అని. అందుకే ప్రతి బడ్జెట్లో శాలరీ శ్లాబ్లు.. తాయిలాలు ఏముంటాయో చూద్దాం అని ఆశపడడం, ఊసూరుమనడం.. నెక్స్ట్ బడ్జెట్ మీద ఆశలు పెట్టుకోవడం.. ఇదీ వరుస సరే చూద్దాం.. ఈ బడ్జెట్లో ఎలా ఉంటదో. వంటింట్లో కూడా జీఎస్టీతో తిరగమోత పెట్టి, రేట్ల ఘాటు నషాళానికి అంటించిన ఆర్థిక మంత్రి సీతారామన్ మొన్నీమధ్య మాట్లాడుతూ– ..‘ నేను కూడా మధ్యతరగతి నుంచే వచ్చాను, వారి ఒత్తిళ్లు, బాధలు నాకు తెలుసు .. ’ అని చెప్పడంతో ఇప్పటిదాకా పడ్డ వాతలు, పెరిగిన గ్యాస్, పెట్రోల్, నిత్యావసరాలు..అన్నీ మరచిపోయి మధ్యతరగతి బడ్జెట్వైపు ఆశగా చూస్తోంది. ‘గాలి పీల్చుకోనిస్తున్నాం, నీళ్లు తాగనిస్తున్నాం, తిండి తిననిస్తున్నాం.. ఇది చాలదా, ఇంకేం కావాలి..’ –పోయిన బడ్జెట్ మధ్యతరగతికి ఏమిచ్చింది.. అంటే ఓ నెటిజన్ సరదా కామెంట్. కానీ, ఓ నెటిజన్ సీరియస్ కామెంట్ చూడండి.. ‘‘సమాజాన్ని స్టేబుల్గా ఉంచేదే మధ్యతరగతి. బిజినెస్ క్లాస్కు సేవలతో, కింది తరగతికి తన పన్నులతో సపోర్ట్ చేసేదే.. మిడిల్క్లాస్. గత న లభై ఏళ్లుగా మిడిల్ క్లాస్ పెరుగుతోంది. పన్నులు చెల్లించేవారు పెరుగుతున్నారు. కాగా, పెట్రోల్, కరెంట్, కూరగాయలు, నిత్యావసరాలు.. ఇలా పెరిగిన ప్రతి రేటు మధ్యతరగతి జీవితాన్ని ఎక్కడ ఉన్నవాడిని అక్కడేవుండేట్లు చేస్తోంది. బడ్జెట్లో సరైన సపోర్ట్ లేకుంటే సమాజం, ప్రభుత్వం కూడా నష్టపోతుంది...’ దీనికి సపోర్ట్గా మరో నెటిజన్ పొలిటికల్ అనాలసిస్ ఇదీ.. ‘‘సాధారణంగా పాలిటిక్స్కు, ఓటింగ్కు దూరంగా ఉండే మిడిల్ క్లాస్ మోదీకి దగ్గరవుతున్నారు. వీరు మోదీ ర్యాలీలకు, సభలకు హాజరవడం చూస్తున్నాం. అలా కాకపోయినా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, మోదీ చెబుతున్న నేషనలిజాన్ని నెత్తికెత్తుకుంటూ ఆయనకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. చాలా మంది మధ్యతరగతి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన మోదీ టీమ్ నడిపిస్తోన్న హిందుత్వాన్ని బలోపేతంచేస్తున్నాయి... దీనికితోడు మోదీ తరచుగా చెప్పే ఆధునికత్వాన్ని కూడా మధ్యతరగతే ముందుకు తీసుకెళ్తోంది... వీరి సపోర్ట్ లేకుండా మోదీ విజన్ సాధ్యం కాదు.. గతంలో కంటే మిడిల్ క్లాస్ పాపులేషన్ బాగా పెరుగుతోంది. ఇది మోదీకి అనుకూలమైన విషయమే. ఈ సెక్షన్ను విస్మరించడం మోదీ గవర్నమెంట్కు అంత మంచిది కాదు.. ఈ విషయం ఆర్థిక మంత్రికీ తెలిసే ఉండాలి..’’ విద్య, వైద్యం, దైనందిన జీవితంలో పెరిగిన రేట్లు.. ప్రతిదీ మధ్యతరగతి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తదో.. ఆర్థికంగా ఎలా ఎదగకుండా చేస్తదో చెబుతూ వీటన్నింటినీ బడ్జెట్ పరిశీలించాలంటూ తన సొంత అనుభవాన్ని ఓ నెటిజన్ ఇలా పంచుకున్నారు.. ‘‘మా నాన్న ఫ్రెండ్ ఓ స్టాక్ బ్రోకర్. ఇరవై ఏళ్ల క్రితం ఆయనిచ్చిన సలహాతో మంచి షేర్లలో పెట్టుబడి పెట్టాడు. ఇప్పటికి వాటి ధర 200 రెట్లు పెరిగింది.. మేం నిజానికి లక్షాధికారులం కావాలి.. కానీ కాలేదు. కారణం చూడండి.. కొన్న రెండు సంవత్సరాలకు రెసిషన్ వచ్చింది.. నాన్న ఉద్యోగం పోయింది. 20 శాతం షేర్లు అమ్మితే ఇల్లు గడిచింది. ఆ తర్వాత ఏదో చిన్న ఉద్యోగం సంపాదించాడనుకోండి. కానీ, మరో 20 శాతం మా తాత హార్ట్ సర్జరీ కోసం అమ్ముకున్నాం. మరికొన్ని షేర్లు నాకు, తమ్ముడి చదువులకు హరించుకుపోయాయి. కొద్ది రోజులకు మరికొన్ని అక్క పెళ్లికి హారతి.. ఇలా ఒక్కో సమస్య షేర్లను తినేసింది. నాకేం అర్థమయ్యిందంటే సమాజంలో ఏం తేడా చేసినా.. అంటే మాంద్యం వచ్చినా, ఉద్యోగాలు పోయినా, ట్యాక్సులు పెరిగినా, మెడికల్ బిల్లులు పెరిగినా, చదువుల ఖర్చు పెరిగినా, రెగ్యులర్గా ఉండే కరెంట్, పాలు, నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్.. ఇవన్నీ నిరంతర మధ్యతరగతిని ఎదగకుండా జాగ్రత్త కాపలా కాస్తుంటాయి.. పై చదువులు బాగా చదివినట్లే ఉంటుంది, శాలరీ పెరిగినట్లే ఉంటుంది.. లైఫ్లో రిస్క్, సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి.. వీటన్నింటినీ బడ్జెట్ పరిగణనలోకి తీసుకోవాలి...’ ఇదీ ఉద్యోగుల పరిస్థితి బడ్జెట్ ప్రసంగంలో ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటనపై ఉద్యోగులు ఇలా ఎదురు చూస్తున్నారంటూ చెణుకులు సరే చూద్దాం.. ఈసారి బడ్జెట్ ఎప్పటిలాగే మీమ్స్, జోక్స్ మిగులుస్తుందా.. కాసిన్ని ఆశలు మిగులుస్తుందా.. -
Telangana: అందరు టీచర్లకు బదిలీ అవకాశం ఇవ్వాలి
తెలంగాణ ప్రభుత్వం దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. దాదాపు 25 వేల నుండి 30 వేల మంది ఉపాధ్యాయులు ఇప్పుడు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం గత సంవత్సరం 317 జీవో ద్వారా కొత్త జిల్లాలకి సీనియర్, జూనియర్ లిస్టుల పేరుతో ఉపాధ్యా యులను కేటాయించింది. మొత్తం లక్ష 5 వేల మందిలో 25 వేల మంది ఒక జిల్లా నుండి మరొక జిల్లాకి బదిలీ అయ్యారు. మిగతా 80 వేల మంది పని చేసే చోటే మళ్ళీ పోస్టింగ్ పోందినారు. ఇప్పుడు అందరు టీచర్లకు బదిలీ అవకాశం ఇవ్వాలి. నచ్చిన చోట ఖాళీ ఉంటే వెళ్ళే వెసులు బాటు ఇవ్వాలి. కొందరి లబ్ధి కోసం 317 జీవో అమలు చేసి మళ్ళీ ఇప్పడు వేరే జిల్లాలకి బదిలీ అయిన టీచర్లకు 2 సంవత్సరాల సర్వీస్ రూల్ ఉండాలనడం అర్థం లేని నిబంధన. ఇక 80 వేల ఉద్యోగాల్లో భాగంగా ఇప్పటికే వివిధ ఉద్యోగాలకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం, నోటిఫికేషన్లు జారీ కావడం జరుగుతోంది. కానీ టెట్ ముగిసి 8 నెలలు అవుతున్నా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్ జారీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడం వల్ల 4 లక్షల మంది అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. టెట్లో ఉత్తీర్ణత పొందనివారూ, కొత్తగా డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన బ్యాచులవారూ మరో టెట్పై ఆశలు పెట్టుకున్నారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఖాళీల వివరాలు వెల్లడి అవుతాయి. సంవత్సరం క్రితం ఆర్థిక శాఖ అనుమతి కోసం 9,600 పోస్టులతో విద్యాశాఖ అధికారులు ఫైల్ పంపినారు. అది ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. ఇప్పుడు టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడే 10 వేల ఖాళీలను కూడా పాత ఖాళీల్లో కలిపి భారీ డీఎస్సీ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరు కుంటున్నారు. – రావుల రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు -
చెయ్యి తోని చెయ్యి ఎప్పుడు గల్పుతరు?
పొద్దు మీకింది. ఎప్పటి తీర్గనే చౌరస్తల ఉన్న పాన్ డబ్బ కాడ్కి బోయిన. పాన్ డబ్బ మా అడ్డ. దినాం పొద్దు మీకంగనే మా దోస్తు లందరు గాడ జమైతరు. నాత్రి తొమ్మిది గొట్టె దాంక ముచ్చట బెడ్తం. నేను బోకముందు మా దోస్తులు ఏం మాట్లాడుకుండ్రో నా కెర్క లేదు. గని నేను బోయినంక గీ తీర్గ ముచ్చట బెట్టిండ్రు. ‘‘మొన్న ఓటర్ల దినాన మా వాడ కట్టు ఓటర్లు మీటింగ్ బెట్టిండ్రు’’ అని యాద్గిరి అన్నడు. ‘‘మీటింగ్ బెట్టి ఏం జేసిండ్రు’’ అని సత్నారి అడిగిండు. ‘‘తీర్మానాలు జేసిండ్రు’’ ‘‘గయేంటియో జర జెప్పు’’ ‘‘గ్యాస్ బండ దర బెంచిండ్రు. బస్ చార్జిలు బెంచిండ్రు. కరెంటు చార్జిలు గుడ్క బెంచిండ్రు. మనం గుడ్క ఓటు దర బెంచాలె. ఓటును అగ్వ దరకు అమ్మే సవాల్ లేదు. ఉద్దెర నడ్వదు. అంత నగతే. గిట్ల నగతిస్తె గట్ల ఓటేస్త మనాలె. గుండు గుత్త ఓట్ల కోసం కుల పెద్దకు రూపాయ లిచ్చినమని లీడర్లు జెప్తె నమ్మొద్దు. ఓటరు అంటె ఎవడు. దేవునసుంటోడు. దేవునికి ఏ తీర్గ పూజలు జేస్తరో గదే తీర్గ లీడర్లు ఓటర్కు పూజలు జెయ్యాలె’’ అని యాద్గిరి ఇంకేమొ జెప్పబోతుంటె ఇస్తారి అడ్డం దల్గి – ‘‘నోటుకు ఓటు గాకుంట ఇంకేమన్న తీర్మానాలు జేసిండ్రా?’’ అని అడిగిండు. ‘‘చేసిండ్రు. ఓటు ఏసెతంద్కు బోయెటోల్లని మోటర్ల దీస్క బోవాలె. లైన్ల శానసేపు నిలబడే పనిబడ్తె కాల్లు నొవ్వకుంట తలా ఒక కుర్సి ఏసి కూసుండ బెట్టాలె. ఎండ దాకకుంట షామియానాలు ఎయ్యాలె. షామియాన ఏసేటి మోక లేకుంటె తలకొక ఛత్రి బట్టే సౌలత్ బెట్టాలె. ఎండ కాలంల ఓట్లేసే పని బడ్తె సల్లటి సోడలు తాపియ్యాలె. గదే సలికాలమైతె ఛాయ్, కాఫి ఇయ్యాలె’’ అని యాద్గిరి జెప్పిండు. ‘‘కూట్లె రాయి దీయనోడు ఏట్లె రాయెట్ల దీస్తడు అని బీఆర్ఎస్ లీడర్లు అంటుంటరు. గని గాల్లే గురువింద ఇత్తు అసుంటోల్లన్న సంగతిని యాది మరుస్తున్నరు’’ అని ఇస్తారి అన్నడు. ‘‘గా సంగతేందో జెర జెప్పు’’ అని సత్నారి అన్నడు. ‘‘హుజూరాబాద్ బై ఎలచ్చన్ల ముంగట దలిత బందు పద్కం బెట్టిండ్రు. ఎట్లన్న జేసి గెల్వాలని గా నియోజక వర్గంల అమలు జేసిండ్రు. వాసాల మర్రిల 75 మంది దళితులకు గీ పద్కం కింద తలా పది లచ్చల రూపాయ లిచ్చిండ్రు. అటెంకల నియోజక వర్గంకు 500 మందికి దలిత బందు పద్కం కింద తలా పది లచ్చలు ఇస్తమన్నరు. మల్ల గిప్పుడు 200 మందికే ఇస్తమంటున్నరు. బడ్జెట్ బెట్టి యాడాదైంది. గని పోయిన పది నెలలల్ల ఒక్కడంటె ఒక్క నికి గుడ్క ఈ పద్కం కింద రూపాయలియ్య లేదు. బీఆర్ఎస్ సర్కారొస్తె దేసమంత దలిత బందు పద్కం బెడ్త మని కేసీఆర్ అన్నడు. రాస్ట్రంలనే అమలు జెయ్యనోడు దేసంల అమలెట్ల జేస్తడు’’ అని ఇస్తారి అన్నడు. ‘‘హాత్ సే హాత్ యాత్ర సంగతేంది?’’ ‘‘వొచ్చె నెల ఆరో తారీకు కెల్లి రాస్ట్రంల హాత్ సే హాత్ జోడో యాత్ర జేస్తమని కాంగ్రెస్ లీడర్లు అంటున్నరు. ముందుగాల చబ్బీస్ జన్వరి కెల్లి గీ పాదయాత్ర జేద్దామను కున్నరు. రాహుల్ గాంది బారత్ జోడో పాదయాత్ర కశ్మిర్లకు బోయింది. గని జమ్ముల చబ్బీస్ జన్వరి దినాన గాకుంట ముప్పై తారీకు రాహుల్ జెండ ఎగిరేస్తడట. బారత్ జోడో కతమైన చబ్బీస్ జన్వరి దినాన్నే హాత్ సే హాత్ జోడో పాదయాత్ర షురువు జేద్దామని కాంగ్రెస్ లీడర్లు అను కున్నరు. గని జమ్ముల రాహుల్ పబ్లిక్ మీటింగ్ వాయిద బడ బట్కె తెలంగానల పాదయాత్ర గుడ్క వాయిద బడ్డది. యథా లీడర్ తథా క్యాడర్.’’ ‘‘హాత్ సే హాత్ జోడో అంటె చెయ్యితోని చెయ్యి గల్పుడు. చెయ్యి తోని చెయ్యి ఎప్పుడు గల్పుతరు. కుస్తి పట్టేటి ముంగట గల్పుతరు. చెయ్యి తోని చెయ్యి గల్పుడు అంటె చెయ్యిచ్చుడు. గీ రొండిట్ల ఏం జేస్తమని కాంగ్రెస్ జెప్తున్నది’’ అని సత్నారి అడిగిండు. ‘‘కోడి గుడ్డు మీద బూరు బీక్తున్నవు. పస్కలొచ్చినోనికి దునియంత పచ్చగనే కండ్ల బడ్తదట’’ అని ఇస్తారి అన్నడు. ‘‘గాంది బవన్కు వొచ్చేటి సవాల్ లేదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గీనడ్మ గాంది బవన్కు వొచ్చిండు. రేవంత్ రెడ్డిని గల్సిండు. ఇద్దరం గల్సి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర జేద్దామన్నడు. మునుగోడు బై ఎలచ్చన్లప్పుడు కాంగ్రెస్ కిలాఫ్ మాట్లాడిన వెంకట్ రెడ్డి మీద డిసిప్లినరీ యాక్షన్ దీస్కోవాలెనని కొండా సురేక అంటున్నది. ముందుగాల్ల లీడర్ సే లీడర్ జోడో అయినంకనే హాత్ సే హాత్ జోడో అంటె బాగుంటది’’ అని సత్నారి అన్నడు. ‘‘ఆది శంకరాచార్య అందరి కన్న ఫస్టు కన్యాకుమారి కెల్లి కశ్మీర్ దాంక పాదయాత్ర జేసిండ్రు. మల్ల గిప్పుడు శంకరాచార్య తీర్గనే రాహుల్ గాంది గుడ్క కన్యాకుమారి కెల్లి కశ్మీర్ దాంక పాదయాత్ర జేసిండని కశ్మీర్ మాజి ముక్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఒక్క తీర్గ తారీఫ్ జేసిండు. గాయిన శంకరాచార్య అనంగనే రాహుల్కు ముగ్గురు దేవులల్ల ఒక్కడైన శంకరుడు యాది కొచ్చిండు. యాదికి రాంగనే గాయిన చెయ్యి సూబెట్టిండు. బారత్ జోడో యాత్ర అనేటి తపస్సు జేసిన. చేసినంకనే మీకు అరచెయ్యి అంటె అభయ ముద్ర సూబెడ్తున్న అని రాహుల్ గాంది అన్నడు’’ అని యాద్గిరి జెప్పిండు. నాత్రి తొమ్మిది గొట్టినంక ఎవలింటికి గాల్లు బోయినం. (క్లిక్ చేయండి: మామా రాహుల్ గాంది పెండ్లెందుకు జేస్కోలేదే?) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
విశ్వసనీయతే అధికారానికి సోపానం
విశ్వసనీయత గల నాయకులకు అధికారం దగ్గరగా ఉంటుంది. అనేక మంది నాయకులు అనేక దశాబ్దాలుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పరిపాలన సాగించారు. విశ్వసనీయత కోల్పోయినప్పుడు ప్రజలు వారిని గద్దెదించారు. ఉదాహరణకు ఏ సామాజిక మాధ్యమాలూ లేనటువంటి కాలంలోనే ఇందిరాగాంధీ తప్పు చేస్తే ప్రజలు ఓడించి, అధికారానికి దూరం చేశారు. అందుకే విశ్వసనీయత రాజకీయాల్లో చాలా అవసరం. విశ్వసనీయతతో జ్యోతిబసు మూడు దశాబ్దాలు పరిపాలించారు. లాలూ 15 సంవత్సరాలు, ఒకప్పుడు బిజూ పట్నాయక్, ఇప్పుడు నవీన్ పట్నాయక్, కరుణానిధి, జయలలిత, వైఎస్, మమతా బెనర్జీ, ఎన్టీఆర్... ఇలా అనేక మందిని మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కొత్తగా కేజ్రీవాల్ ఢిల్లీ లోనూ విశ్వసనీయతతో గెలుస్తూ వస్తున్నారు. నా విశ్లేషణ ప్రకారం భారతదేశ రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుల్లో నరేంద్ర మోదీ మొదటి వరుసలో ఉంటారంటే అతిశయోక్తి లేదు. గుజరాత్లో మూడు సార్లు హ్యాట్రిక్ విజయం సాధించి, మరో మూడుసార్లు గుజ రాత్ను బయట ఉండి గెలిపించిన నాయకుడిగా ఖ్యాతి చెందారు. అదే విధంగా 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రధాని అభ్యర్థిగా ప్రజలు నరేంద్ర మోదీని నమ్మి భాజపాను గెలిపించారు. ఇప్పుడు హ్యాట్రిక్ దిశగా 2024 పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. బెంగాల్లో కమ్యూనిస్టుల తర్వాత మమతా బెనర్జీ వరుసగా మూడుసార్లు ప్రజల అచంచల విశ్వాసంతో అధికారాన్ని చేపట్టారు. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఐదో సారి అధికారాన్ని నిలబెట్టుకుంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత తమ ప్రభావాన్ని ప్రజల్లో నిలబెట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టి రామారావు ప్రజల్లో విశ్వసనీయ నేతగా మన్ననలు పొందారు. ఒంటిచేత్తో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. పేదప్రజల మనిషిగా సుస్థిర స్థానాన్నిపొందారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మన్నన, విశ్వాసాలు పొందారు. అదే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పటికీ, మరో 13 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికల్లోనూ ఎవరో ఒకరితో పొత్తుతోనే గెలుపొందారు. ఒంటరిగా ఎప్పుడు కూడా గెలవలేకపోయారు. 1999 ఎన్నికల్లో భాజపాతో జట్టుకట్టి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో తిరిగి భాజపాతో జట్టుకట్టారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్ళి ఓటమి పాలయ్యారు. 2014లో మళ్ళీ భాజపా, జనసేనతో జట్టుకట్టి విజయం సాధించారు. 2019లో తెలుగుదేశానికీ, ఎన్టీఆర్కూ బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని పరువు పోగొట్టుకున్నారు. ఒకసారి అటల్ బిహారీ వాజ్పేయి చరిష్మాతో పొత్తులో విజయం సాధించారు. మరోసారి నరేంద్ర మోదీ హవాలో గెలుపొందారు. కానీ ఎన్నడూ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేదు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమౌతున్న నేపథ్యంలో చంద్రబాబు మాత్రం పొత్తుల కోసం తహతహలాడుతున్నారు. జనసేనతో కలవాలనీ, భాజపాతో కూడా కలిసి పనిచెయ్యాలనీ ఉవ్విళ్ళూరుతున్నారు. 2014 పొత్తులను మళ్ళీ పునరావృతం చెయ్యాలనే గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఒంటరి పోరుతోనే బరిలోకి దిగాలని నిశ్చయించారు. ఏది ఏమైనా రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. - రఘురామ్ పురిఘళ్ళ బీజేపీ సీనియర్ నాయకులు, న్యూఢిల్లీ -
దేశ శ్రేయస్సుకు మార్పు అనివార్యం
భారతదేశం మతపరమైన చట్టాలు, మత బోధనల చట్రంలో ఇరుక్కోని సర్వ సత్తాక లౌకిక శ్రేయో రాజ్యం. ప్రపంచంలోనే అత్యంత బలమైన పునాదులతో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ప్రజాస్వామిక దేశం. నిజమే! కానీ ఇప్పుడు అధికారం కోసం లౌకికవాదానికి తూట్లు పొడిచే ఎత్తుగడలు దేశ లౌకికతత్వంతో పాటు సమాఖ్య స్పూర్తికీ పెను ముప్పుగా నిలువ బోతున్నాయి. మతం పేరుతో, కులం పేరుతో దేశాన్ని విడగొట్టే యత్నాలతో వచ్చే సాధారణ ఎన్నికలకు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటు న్నాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆధ్వ ర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్) జాతీయ పార్టీ ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారి దేశ ఎన్ని కల రణ క్షేత్రంలో దూకుతోంది. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో వచ్చే ఎన్నికలకు వెళతామని ఖమ్మం సభలో ప్రకటించటం ఆయా వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ప్రాజెక్టులు పచ్చగా మార్చాయి దేశంలో వరుసగా రెండు సంవత్సరాలు కోవిడ్ సృష్టించిన కల్లోలంతో ప్రపంచ దేశాలన్నీ అతలాకు తలమయ్యాయి. పలు రంగాలు పూర్తిగా దెబ్బతిని ప్రభుత్వాలు నడవడం దుర్లభం అయిపోయింది. కానీ తెలంగాణలో ఎనిమిదేళ్లుగా అమలవుతున్న సమ్మిళిత అభివృద్ధి పథకాలు తెలంగాణ ను కోవిడ్ నష్టం నుండి తొందరగానే విముక్తం చేశాయి. పారిశ్రామిక రంగం కాస్త దెబ్బతిన్నా... వ్యవ సాయ రంగం మాత్రం ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి సాధించింది. అందుకు కారణం... సమృద్ధి వర్షాలతో సముద్రం పాలయ్యే నీటిని బీడు భూములకు మళ్లించటమే. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్... నిరంతరం కరువుతో నకనక లాడే ఉత్తర తెలంగాణను ఇప్పుడు పచ్చని సీమగా మార్చింది. ‘మిషన్ కాకతీయ’ పాడుపడిన పల్లెల్లో కొత్త కళను తెచ్చింది. ఫలితంగా రాష్ట్రంలో 2021– 22లో 378 శాతం వరి ఉత్పత్తి పెరిగి తెలంగాణ ఇప్పుడు ‘రైస్బౌల్ ఆఫ్ ఇండియా’గా రూపాంతరం చెందింది. పత్తి ఉత్పత్తి 61 శాతం పెరిగి తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధిలో కీలకంగా మారింది. 2020–21లో తెలంగాణ వ్యవసాయం – అనుబంధ రంగాల అదనపు స్థూల విలువ 9.09 శాతం వృద్ధిని సాధించింది. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నది. పండిన పంటను మద్దతు ధరతో కొనుగోలు కూడా చేస్తున్నది. సమాఖ్య స్ఫూర్తి చెదరకుండా... ఇక విద్య, వైద్యంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి మిషన్ భగీరథతో నూటికి నూరుశాతం గ్రామాలకు రక్షిత మంచినీళ్లందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ముందడుగు వేసింది. ఇప్పుడు దేశమంతా తెలంగాణ మోడల్ అభివృద్ధి సంక్షేమం కావాలంటే, వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని ఆదరించా లని కేసీఆర్ ఇచ్చిన పిలుపును దేశం ఆసక్తిగానే గమనిస్తున్నది. ఇదే సభలో పాల్గొన్న కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు సైతం దేశ సమాఖ్య స్పూర్తికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక ప్రజలపైనే ఉందని పిలుపునిచ్చారు. ఉమ్మడి జాబితాల్లోని అంశాలపై ఇప్పటికే కేంద్రం అంతర్గత భద్రత, వ్యవసాయ, సహకారం, విద్యుత్ తదితర అంశాలపై రాష్ట్రాలతో చర్చించకుండానే చట్టాలను చేసుకుపోతోంది. అలాగే మరోవైపు రాష్ట్రాలు చేస్తున్న శాసనాలను గవర్నర్లతో నియంత్రించే ప్రయత్నాలు చేస్తు న్నది. ఈ తీరు భారత సమాఖ్య స్పూర్తికి భంగం కలిగించేలా ఉంది. ఈ నేపథ్యంలో అనేక జాతులు, మతాలు, భాషలు, కులాలు, జీవన విధానాలూ ఉన్న సువిశాల భారత దేశ ‘భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతి’ని ముందుకు తీసుకు వెళ్లడం ఇప్పుడు అత్యవసరం. ఈ విధిని నిర్వహించడంతో పాటూ... సమాఖ్య స్పూర్తికి దెబ్బ తగలకుండా తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అజెండా దేశమంతా విస్తరించాలంటే ఒక్కసారి భారత రాష్ట్ర సమితికి అవకాశం ఇచ్చి చూడాలి. మతం, కులం పేరుతో రాజకీయాలు చేసే చోట అభివృద్ధి–సంక్షేమంతో వచ్చే గుణాత్మక మార్పుతోనే లౌకిక స్ఫూర్తికి కొత్త శక్తి వస్తుంది. (క్లిక్ చేయండి: వ్యవస్థకు రక్షణ రాజ్యాంగమే!) - డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ -
Republic Day: వ్యవస్థకు రక్షణ రాజ్యాంగమే!
ఇవ్వాళ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. మన రాజ్యాంగం అతి దీర్ఘమైన రాజ్యాంగంగా పేరు పొందింది. దీని రచనను పూర్తి చేయడానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. రాజ్యాంగం భారతదేశ అత్యున్నత చట్టం. ఈ పత్రం ప్రాథమిక రాజకీయ నియమావళి, ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణం, విధానాలు, అధికారాలు, ప్రభుత్వ సంస్థల విధులను గుర్తించేలా నిర్దేశించింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పౌరుల విధులనూ నిర్దేశించింది. రాజ్యాంగమే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేది. అదే ప్రభుత్వం, పౌరుల మధ్య... నమ్మకం, సమన్వయాన్ని సృష్టిస్తుంది. రాజ్యాంగాన్ని తెలుసుకోవడం భారత పౌరుని ప్రాథమిక విధుల్లో ఒకటి. అప్పుడే సార్వభౌమ గణతంత్ర సభ్యునిగా, భారతదేశంలోని ప్రతి పౌరుడూ ప్రతిరోజూ వినియోగించుకోవలసిన రాజ్యాంగ హక్కులను పొందుతాడు. ప్రతి పౌరుడి అభివృద్ధి అతని హక్కులు, విధులపై అతనికి ఉన్న అవగాహనపైనే ఆధారపడి ఉంటుంది. ఏ దేశ రాజ్యాంగం అయినా దేశ ప్రగతి కోసం మంచి పాలన, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని ఇవ్వాలి. మన రాజ్యాంగం ప్రకారం జరిగిన ఈ 72 సంవత్సరాల పాలనా కాలంలో దేశం ఎంతో ప్రగతి సాధించింది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం విషయంలో 5వ ర్యాంకులో ఉన్నాం. తయారీ రంగంలో 30వ ర్యాంకులో ఉన్నాం. ఇక వివిధ ఆహార ధాన్యాల, తృణధాన్యాల ఉత్పత్తిలో మనం మొదటి 5 స్థానాన్ని ఆక్రమించాం. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికీ మనం 20 శాతం పేదరికంలోనే ఉన్నాం. 12 శాతం నిరుద్యోగిత రాజ్యమేలుతోంది. విపరీతమైన ఆదాయ అసమానతలూ ఉన్నాయి. వివిధ ప్రపంచ సూచికలలో మనం ఆందోళనకరమైన స్థానాల్లో ఉన్నాం. ఉదాహరణకు ఉగ్రవాద సూచికలో 8వ స్థానం, అవినీతిలో 28వ ర్యాంక్, హ్యాపీ ఇండెక్స్లో 44 ర్యాంక్లో ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమం – రెండింటి కోసం అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు చాలానే ఉన్నా ఇప్పటికీ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే విధానాలు ఉత్తమమైనవే కానీ వాటి అమలులో మాత్రం లోపాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సమస్యలన్నింటినీ మనం ఎప్పటికప్పుడు అధిగమించాలి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ చట్టాలు వంటి ఇటీవలి విధానాలు ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభన సృష్టించాయి. అయితే ఈ సమస్యలన్నీ తగిన రాజ్యాంగ సవరణలతో పరిష్కరించబడతాయి. సానుకూల ఫలితాలను, సమాజ అభ్యున్నతికి హామీ ఇచ్చే విధానాలను సులభంగా స్థాపించగలిగే విధంగా మన చట్టాలను సవరించడం కొనసాగించాలి. రాజ్యాంగాన్ని సముచితంగా అమలు చేయడానికి రాజకీయ రంగంలో, కార్యనిర్వాహక యంత్రాంగంలో నైతిక విలువలు ఉండాలి. ప్రజలు అవసరమైన చోట ప్రశ్నించే అవకాశం ఉండాలి. ప్రతి పౌరుడూ ఇతరుల హక్కులను గౌరవించాలి. చట్టబద్ధంగా, నైతికంగా తన విధులను నిర్వర్తించాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ సారాన్ని ఆస్వాదించగలరు. (క్లిక్ చేయండి: సకల శక్తుల సాధన సబ్ప్లాన్) – డాక్టర్ పి.ఎస్. చారి, మేనేజ్మెంట్ స్టడీస్ నిపుణులు -
ఒక దేశం – ఒకే పువ్వు
ఎవరో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు వీచే ముందు గాలులు అనుమతి తీసుకోవాలని వీచే ముందు గాలులు తమ దిశ దశ ఏమిటో ఎటో వివరాలు తెలియ జేయాలని ఎవరో కొత్త చట్టం తెచ్చారు గాలులు ఎంత దూరం పోవాలనుకున్నాయో అవి ఎంత వేగంగా వీచాలనుకున్నాయో వివరాలు సమర్పించనిదే అనుమతి దొరకదని ఎవరో కొత్త చట్టం తెచ్చారు ఇప్పుడిక్కడ సుడిగాలులకు అనుమతి లేదు మేం కడుతున్న ఆ పేకమేడల్ని సంరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది అందువల్ల ఈ చట్టాలు సత్వరమే అమల్లోకొస్తున్నాయి! తమ చుట్టాలకు అనుగుణంగా ఎవరో ఇక్కడ కొత్త చట్టాలు తెచ్చారు ఒడ్డును తాకే కెరటాలక్కూడా ఒక హెచ్చరిక! ఎగిసెగిసి పడటం మళ్లీ తిరిగి వెళ్ళడం బలం పుంజుకుని మళ్లీ నీటి పిడికిళ్ళతో తిరిగి రావడం ఇవన్నీ ఇప్పుడిక కుదరదు తిరుగుబాట్లు, ఉద్యమాలు, హోరెత్తిపోవడాలు నిషిద్ధం ఎంతటి ఉధృతి ఉన్నా బుద్ధిగా ఒడ్డులోపల మాత్రమే నిశ్శబ్దంగా ప్రవహించాల్సి ఉంటుంది! తోటలోని మొక్కలన్నీ ఒకే విధంగా పూయాలని పూచే పూల రంగు కూడా ఒకటిగానే ఉండాలని కొత్త చట్టం అమలులో కొచ్చింది ఒకే రంగు మాత్రమే కాదు ఏ పువ్వు రంగు ఎంత గాఢంగా ఉండాలో కూడా వారు నియమించిన వారి అధికారులే నిర్ణయిస్తారట! ఒక దేశం – ఒకే పువ్వు!! ఈ చట్టాలు చేసిన గౌరవనీయులకు ఎవడు చెప్పాలి? తోటలో అన్ని మొక్కల పూలు ఒకే రకంగా ఉండవని – ఉండటానికి వీలే లేదని – ఒక రంగులో అనేక రంగులుంటాయని కూడా వారికి ఎవడు చెప్పాలి? గాలులు, కెరటాలు ఎవరి చట్టాలకూ లొంగవనీ గాలి ఎవరి పిడికిలిలోనో ఖైదీగా ఉండదని కెరటం ఎవరి జీవోలతోనో వెనక్కి మళ్ళదని ఎంతటి వారైనా సరే, వాటిని గమనిస్తూ వాటికి అనుగుణంగా బతకాల్సిందే తప్ప మరో మార్గం లేదని! లేకపోతే, అవి సృష్టించే సునామీలో అడ్రసు లేకుండా గల్లంతు కావల్సిందేనని నామరూపాలు లేకుండా నశించాల్సిందేనని వారికి ఎవరైనా చెప్పండి! కనీస గౌరవమైనా... కాపాడుకొమ్మని!! – డాక్టర్ దేవరాజు మహారాజు (దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఉద్యమ నేపథ్యంలో) -
National Voters Day 2023: ప్రజల చేతిలోని పాశుపతాస్త్రం
ఈ రోజు భారత ఎన్నికల సంఘాన్ని స్థాపించిన రోజు. 2011 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవంగా కూడా జనవరి 25ను జరుపు కొంటున్నాం. దీని ఉద్దేశం ఓటర్లుగా భారత పౌరులకు ఉన్న హక్కులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించడమే. ఎన్నిల సంఘం (ఈసీ) పనితీరు, నిర్ణయం తీసుకునే స్వతంత్రతను నిర్ధారించడానికి రాజ్యాంగ సభ ఆర్టికల్ 324 ద్వారా రాజ్యాంగ హెూదాను ఇచ్చింది. తక్కువ అక్షరాస్యత, ఉనికిలో లేని ఓటర్ల జాబితా యుగంలో వయోజన ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలను నిర్వహించడానికి శాశ్వతమైన స్వయంప్రతిపత్తి గల కమిషన్ను ఏర్పాటు చేయడం రాజ్యాంగ సభ దూరదృష్టికి ప్రతీక. ఈసీ నిష్పాక్షికత, విశ్వసనీయత ఆధారంగా ఇప్పటివరకు 17 లోక్సభ ఎన్నికలు; రాష్ట్రపతి ఎన్నికలు 16 సార్లు, అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మరో 16 సార్లు ఎన్నికలు నిర్వహించింది. అలాగే 399 సార్లు శాసనసభ ఎన్నికలు నిర్వహించింది. 400వ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చాలావరకు రాజకీయపార్టీల, ప్రజల విశ్వాసాన్ని ఎన్నికల సంఘం చూరగొన్నదనే చెప్పాలి. పటిష్ఠమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి బలమైన, సమ్మిళిత ఎన్నికల భాగస్వామ్యం చాలా కీలకం. శక్తిమంతమైన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సక్రమంగా, విశ్వసనీయంగా ఉండాలి. అదే సమయంలో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ సందర్భంగా ‘మనం విధులను నిర్వర్తించ కుండా వదిలేస్తే, హక్కుల కోసం పరుగు తీయాల్సి ఉంటుంది. అవి మనల్ని ఇష్టానుసారంగా తప్పించుకుంటాయి’ అన్న మహాత్మాగాంధీ మాటలు గుర్తు కొస్తున్నాయి. 94 కోట్లకు పైగా నమోదిత ఓటర్లను కలిగి ఉన్న భారత్... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. గత సార్వత్రిక ఎన్నికలలో (2019) 67.4 శాతం ఓటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. మిగిలిన 30 కోట్ల మంది ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకురావడం ఇప్పుడు మనముందున్న పెద్ద సవాల్. యువత లోనూ, పట్టణ ఓటర్లలోనూ ఉన్న ఉదాసీనత; బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వలసపోవడం వంటి అనేక కారణాల వల్ల ఇంతమంది ఓటింగ్లో పాల్గొనలేదని చెప్పవచ్చు. 2022 నవంబర్ 5న హిమాచల్ప్రదేశ్ కల్పాలో మరణించిన మొట్టమొదటి భారత ఓటర్ శ్యామ్ శరణ్ నేగీకి నివాళులు అర్పించే గౌరవం నాకు లభించింది. ఆయన తన 106వ ఏట మరణించే ముందు కూడా ఓటు హక్కును ఉపయోగించుకుని ఓటు వేయకుండా ఉండే ఉదాసీన పౌరులకు తమ విధి ఏమిటో తెలియచేశారు. ఆయన స్ఫూర్తిని అందరూ అందుకోవాలి. యువ ఓటర్లే భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు. 2000 సంవత్సరం తర్వాత జన్మించిన తరం మన ఓటర్ల జాబితాలో చేరడం ప్రారంభించింది. ఓటర్లుగా వారి భాగస్వామ్యం మొత్తం శతాబ్దమంతా ప్రజాస్వామ్య భవిష్యత్తును రూపుదిద్దబోతోంది. అందువల్ల ఓటు వేసే వయస్సు వచ్చేలోపు పాఠశాల స్థాయిలోనే ప్రజాస్వామ్య బీజం విద్యార్థుల్లో నాటడం అత్యంత క్లిష్టమైనదే కాదు, ముఖ్యమైనది కూడా. ప్రజాస్వామ్యంలో, ఓటర్లకు తాము ఓటు వేసే అభ్యర్థి నేపథ్యం గురించి తెలుసుకునే హక్కు ఉంది. ఈ కారణంగానే అభ్యర్థులపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల గురించి వార్తాపత్రికల్లో తెలియ జేయాలి. ఇప్పటికీ ఎన్నికల్లో కండబలాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించేవారు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం ఉండకూడదు. ఎన్నికల్లో ధనబలాన్ని అరి కట్టడం పెద్ద సవాల్గా మిగిలిపోయింది. చట్టాన్ని అమలు చేసే సంస్థల కఠినమైన నిఘా కారణంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో చాలా వరకు ఇటువంటి విపరీత ధోరణులకు అడ్డుకట్ట పడింది. ఎన్నికలను ప్రభావితం చేయగల స్థాయిలో ఇవ్వాళ సోషల్ మీడియా ఉంది. అందులో నకిలీ వార్తల ప్రచారం జరగకుండా చూడాల్సి ఉంది. ఎన్నికలను అన్ని జాగ్రత్తలతో నిర్వహించడం ఎన్నికల సంఘం విధి. ఎన్నికల ప్రక్రియలో ఓటరే ప్రధాన భాగస్వామి. అందుకే ఓటు వేయడానికి కావలసిన స్నేహపూర్వక, సుహృద్భావ వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఓటర్లు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనేలా ఈసీ తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి కంకణబద్ధమై ఉంది. పౌరులు ఓటరుగా తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి గర్వపడగలిగితే అది వారు ఎన్నుకున్న ప్రభుత్వ పాలనా స్థాయి మీద కూడా ప్రభావం చూపుతుంది. పౌరు లందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు! (క్లిక్ చేయండి: నిర్లక్ష్యానికి గురవుతున్న బాలికా విద్య) - రాజీవ్ కుమార్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం) -
Pakistan: భారత్ పట్ల వ్యతిరేకతే కొంప ముంచిందా?
దాయాది దేశం పాకిస్తాన్లో స్వాతంత్య్రానంతరం రాజ్యం, పాలనా వ్యవస్థా, ప్రజాస్వామ్య స్ఫూర్తీ నిర్వీర్యం అవుతూ వచ్చాయి. భారత్ వ్యతిరేక విధానమే అక్కడి రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికీ, వచ్చిన ప్రభుత్వం స్థిరంగా నిలబడక పోవటానికీ ప్రాతిపదికగా ఉంది. అందుకే భారత్లో మత, ప్రాంతీయ విద్వేషాలను రగిలిస్తోంది. ఉగ్రవాదుల్ని తయారుచేసి సరిహద్దులు దాటిస్తోంది. భారత్పై మూడుసార్లు యుద్ధం చేసింది. అవకాశం దొరికిన ప్రతిసారీ భారత్ను ఛిన్నాభిన్నం చేయాలనేది దాని ప్రధాన ధ్యేయం. ఇందుకోసం పెంచిపోషించిన ఉగ్రవాదులే ఆ దేశానికి ఇప్పుడు ప్రమాదకరంగా తయారయ్యారు. పాక్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న దురవస్థకు నేపథ్యం ఇదే. పొరుగు దేశాన్ని అస్థిర పరచడంలో ఉన్న శ్రద్ధ సొంత ప్రజల బాగోగులపై లేకపోవడంతో చివరికి పాక్ మును పెన్నడూ లేని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంది. ప్రకృతి శక్తులు ఈ స్థితిని మరింత దిగజారుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం అక్కడ బియ్యం, గోధుమలు, వంటగ్యాస్ వంటి కనీస అవసరాల కోసం ప్రజలు అర్రులు చాచాల్సి వస్తోంది. గత సంవత్సరంతో పోల్చి చూస్తే... గ్యాస్ సిలిండర్ ధర అప్పుడు రూ. 2,373 ఉండగా, ఇప్పుడు రూ. 2,680కి చేరింది. పెసర పప్పు కిలో రూ. 172 ఉండగా నేడు రూ. 260గా ఉంది. అలాగే కేజీ చికెన్ రూ. 203 ఉండగా, ఈ ఏడాది రూ. 366కు పెరిగింది. 20 కిలోల గోధుమ పిండి ధర రూ.1,112 ఉండగా, ఈ ఏడాదికి రూ.1,812కు చేరింది. పరిస్థితి తీవ్రతకు ఈ ధరవరలు అద్దం పడుతున్నాయి. ప్రస్తుతం విదేశీ మారకం నిల్వలు 4.5 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరడంతో మూడు వారాలకు సరిపడా దిగుమతులకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో ఆ దేశం ఆర్థిక సహాయం కోసం యూఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాల వైపు చూస్తోంది. పాకిస్తాన్లో 2010 నుంచి 2020 వరకు ఎకనామిక్ గ్రోత్ కేవలం 1.5 శాతం మాత్రంగానే ఉంది. ద్రవ్యోల్బణం రేటు 28.7 శాతంగా ఉంది. అప్పులు కూడా పుట్టడం లేదు. తమది చెప్పుకోవడానికి అణ్వస్త్ర దేశమైనా అప్పుల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్వయంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వాపోయారు. గత 70 ఏళ్ల కాలంలో ప్రభుత్వాలు ఆర్థిక పరమైన సవాళ్లను ఎదుర్కోలేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ స్వయంగా పెంచి పోషించిన ‘తెహ్రీక్ ఇ తాలిబాన్’ పాకిస్తాన్కు కొత్త తలనొప్పిగా మారింది. తాలిబన్లు పాకిస్తాన్కు అత్యంత కీలక ప్రాంతాలైన ఖైబర్ఫక్తున్ఖ్వా, బెలూచిస్తాన్, పంజాబ్ లాంటి ప్రదేశాల్లో.. సైన్యం, పోలీ స్లు టార్గెట్గా పనిచేస్తూ అనేక ఉగ్రవాద సంస్థలను తమలో కలుపుకొని పాకిస్తాన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇక్కడ చెప్పవలసిన మరో అంశం ఏంటంటే పాకిస్తాన్లోని ‘బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ’ని తాలిబన్లు తమ సంస్థలో విలీనం చేసుకున్నట్లు కూడా పాకిస్తాన్ నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ యువకులనూ తాలిబన్లు సైన్యంలో చేర్చుకుంటూ, ఆయుధ శిక్షణ కూడా అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ తాలిబన్ల మీద పాకిస్తాన్ యుద్ధం చేయాల్సి వస్తే ఎదుర్కోలేని దుస్థితి ప్రస్తుతం నెలకొంది. అఫ్ఘానిస్తాన్ను వదిలి వెళ్లేటప్పుడు నాటో దళాలు సుమారు 22,000 వాహనాలు, 64,000 మిషన్గన్స్ను అక్కడే వదిలి వెళ్లాయి. ఎమ్ 16, ఏకే 47 రకానికి చెందిన ఆయుధాలు సుమారుగా మూడు లక్షలకు పైగా అక్కడ ఉన్నట్లుగా సమాచారం. కాబట్టి ఇంత ఆధునికమైన ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ కలిగిన తాలిబన్ల మీద పాకిస్తాన్ సైన్యం ఏ విధంగా విజయం సాధించగలదు? తినడానికి తిండి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాలిబన్లను ఎదిరించగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది. గణాంకాల ప్రకారం పాక్లో కేవలం 68 శాతం మంది పిల్లలు మాత్రమే ప్రాథమిక విద్యను పూర్తిచేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వీటితో పాటుగా ప్రపంచంలోనే అతి తక్కువగా అక్షరాస్యత కలిగిన దేశాల్లో ఒకటిగా తయారయింది. అక్కడ 34.8 శాతం యువత తీవ్రవాదం వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పొరుగున ఉన్న భారత్తో సత్సంబంధాలు ఏర్పరచుకోవటమే పాకిస్తాన్కు మంచిదని రక్షణ నిపుణులు పాక్కు సలహా ఇస్తున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందనీ, అక్కడి మీడియా కూడా ప్రశంసిస్తోంది. మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకుంటోందని పాకిస్తాన్ దినపత్రిక ‘ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’ కీర్తించింది. అమెరికా, రష్యాలు కూడా భారత్తో బలమైన సంబంధాలు కోరుకుంటున్నాయని పేర్కొంది. స్వాతంత్య్ర కాలం నుంచి కశ్మీర్ పాకిస్తాన్దే అంటూ నానాయాగీ చేసిన పాకిస్తాన్... కశ్మీర్ అంశంపైన సామరస్య పూర్వకంగా ఒక నిర్ణయానికి రావాలనీ, తద్వారా రెండు దేశాలూ అభివృద్ధి సాధిస్తాయనీ పాక్ కొత్త హితవచనం అందుకుంది. భారత్తో మూడు యుద్ధాల్లో తలపడటం వల్ల కష్టాలూ, పేదరికం, నిరుద్యోగం మిగిలాయి. మూడు యుద్ధాలతో ఇప్పుడు తాము పాఠాలు నేర్చుకున్నాం అంటున్నారు పాక్ నాయకులు. ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నామనీ, కశ్మీర్ వంటి సమస్యలపై భారత ప్రధాని మోదీతో నిజాయతీగా చర్చలు జరపాలనీ పాక్ ప్రధాని పిలుపునిచ్చారు. నిజంగా ఈ పిలుపు సాకారమైతే కేవలం పాక్ మాత్రమే కాదు... ఇండియా కూడా లాభపడుతుంది. (క్లిక్ చేయండి: హేతువాదమే మౌఢ్యానికి విరుగుడు) - డాక్టర్ ఎ. కుమార స్వామి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ, నిజాం కాలేజ్ -
మన క్రీడాకారిణులకు బాసట ఏది?
బుధవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్రశ్రేణి భారతీయ మహిళా రెజ్లర్లు... భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు భ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై దిగ్భ్రాంతికరమైన ఆరోపణలు చేశారు. తమను ఆయన లైంగికంగా వేధిస్తున్నారనీ, నిరంకుశంగా వ్యవ హరిస్తున్నారనేవి వారి ఆరోపణలు. ఈ ఉదంతం భారత క్రీడారంగంలోని మురికిని మరోసారి ఎత్తిచూపింది. క్రీడా సంస్థల నాయకత్వంలో ఉన్న పురుషాధిపత్యం, రాజకీయాలతో వారికున్న అవినాభావ సంబంధాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. ఆ మధ్య హరియాణా క్రీడా మంత్రి, భారత హాకీ మాజీ క్రీడాకారుడు అయిన సందీప్ సింగ్పై మరో ప్రముఖ అథ్లెట్, మహిళా కోచ్ చండీగఢ్లో చేసిన ఆరోపణలూ దాదాపూ ఇటువంటివే. క్రీడాకారిణులకు మద్దతు ఇవ్వడమే తమ విధిగా ఉండాల్సిన మన క్రీడాధికారులు వాస్తవానికి తమ రాజకీయ బలాన్ని వారిని వేధించడానికి అనుకూలంగా మలచుకుంటున్నారు. తమ వేధింపులను ఎదిరించినవారిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నారు. కుటుంబపరమైన మద్దతు ఏమాత్రం లేకుండా నెలలు, సంవత్సరాల తరబడి శిక్షణ పొందుతూ... రక్తం, చెమట, కన్నీళ్లను పణంగా పెడుతున్న మహిళలు వీరు. వీరికి మరో వృత్తిని ఎంచుకునే అవకాశమూ ఉండదు. అవినీతి పరులైన అధికారుల చేతుల్లో వీరు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు. విషాదకరమైన విషయం ఏమిటంటే, క్రీడల్లో మహిళలపై వేధింపునకు సంబంధించి ఇటీవల వెలికివస్తున్న కేసులు నిజానికి సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే. మహిళా రెజ్లర్లు తమ ప్రెస్ కాన్ఫ రెన్సులో ఎత్తి చూపినట్లుగా ఈ ప్రత్యేక సమస్యకు సంబంధించిన నిజమైన రూపం చాలా భారీ స్థాయిలో, అంత్యంత సంక్లిష్టంగా ఉంటోంది. క్రీడాకారిణులు చేస్తున్న ఫిర్యాదులను స్వీకరించడానికి ఇంతవరకు నెలకొల్పిన సమస్యా పరిష్కార నిబంధనలు ఏమాత్రం తమ ప్రభావం చూపలేదని స్పష్టమవుతోంది. పైగా తమను వేధింపులకు గురి చేస్తున్న వారి గురించి బయటపడి ఫిర్యాదు చేయడానికి ఇవి మహిళల్లో ఏమాత్రం విశ్వాసం కలిగించలేదని కూడా స్పష్టమవుతోంది. వందలాది క్రీడాకారిణులు మౌనంగా ఉంటూ అధికారులకు లోబడి ఉండటానికి ప్రధాన కారణం వారు క్రీడల నుంచి బయటపడటానికి మరొక అవకాశం లేకపోవడమేనని చెప్పాలి. శక్తిమంతులైన రాజకీయ నియామకాల ద్వారా పదవుల్లోకి వచ్చి రాజకీయ సంరక్షణలో ఉంటున్న వారికి వ్యతిరేకంగా పోరాడటం అంత సులభం కాదని మహిళా అథ్లెట్లు, వారి కుటుంబాలకు బాగా తెలుసు. ఇక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్పాల్సి ఉంది. మన అంతర్జాతీయ క్రీడాకారిణులలో చాలామంది తమను సపోర్టు చేయడానికి తమ కుటుంబాలు తమ వనరులను మొత్తంగా వెచ్చిస్తున్నారని చెబుతూ వచ్చారు. అధికారిక ప్రవేశ ద్వారాలను వారి ముఖాలమీదే మూసివేసిన సమయంలో, జంతర్ మంతర్ వద్ద మన మహిళా రెజ్లర్ల ప్రెస్ కాన్ఫరెన్స్ని చూస్తున్నప్పుడు... కీలకమైన ప్రాక్టీస్ సీజన్లో ఇలా బయటికి వచ్చారంటే వారు ఎంత నిస్పృహకు గురై ఉంటారో కదా అని చూసేవారికి బాధ, ఆగ్రహం కలుగుతాయి. హరియాణాలో సైతం ఆ జూనియర్ మహిళా కోచ్ రాష్ట్ర క్రీడా మంత్రికి వ్యతిరేకంగా న్యాయం పొందడానికి ఒకచోటు నుంచి మరొక చోటుకి పరుగులు తీశారు. కానీ హరియాణా ప్రభుత్వం మాత్రం నిందితుడి పక్షానే నిలిచింది. ఆ రకంగా మహిళా క్రీడా కమ్యూ నిటీ మొత్తానికి అది ప్రతికూల సందేశాన్ని అందించింది. ఆరోపణలకు గురైనవారు, వారి రాజకీయ ప్రభుత్వ యంత్రాంగానికి చెందినవారు బాధితురాలినే అవమానిస్తున్నారు. పైగా లైంగిక వేధింపు కేసుల వల్ల ఆపాదించబడే సామాజిక కళంకాన్ని భరిస్తూ... తమ కెరీర్నే నిలిపివేయగలిగిన విధ్వంసకరమైన అధికారాన్ని చలాయిస్తున్న మొత్తం అధికార యంత్రాంగాన్ని ఒంటరి బాధితురాలు ఎదురించి నిలబడటం చాలా కష్టం కూడా. 1990లలో నాటి టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు, హరియాణా పోలీస్ ఐజీ ఎస్పీఎస్ రాథోడ్కు వ్యతిరేకంగా గళమెత్తిన టెన్నిస్ క్రీడాకారిణి రుచికా గిర్హోత్రాకు చెందిన ముఖ్యమైన ఉదంతాన్ని మననం చేసు కోవలసి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగానూ, అనేక కుల ప్రాతిపదిక సంస్థలు ఆనాడు నిందితుడి పక్షానే నిలబడ్డాయి. ఆరోపణకు గురైన రాథోడ్ నిజానికి ప్రమోషన్ పొంది హరియాణా డీజీపీ అయ్యారు. తీవ్రమైన శత్రుపూరిత వాతావరణంలో రుచిక తన జీవి తాన్నే ముగించుకున్నారు. న్యాయం కోసం కుటుంబం సాగించిన పోరా టంలో ఆమె తండ్రి కూడా మరణించారు. ఆమె సోదరుడు జనం కంట పడకుండా ఎంతో దూరంలో జీవితం గడపాల్సి వచ్చింది. ఆమె సన్ని హిత మిత్రుడి కుటుంబం, ఇతర మహిళా సంస్థలు ఎంతో శ్రమ కోర్చి ఈ కేసును ప్రతి స్థాయిలోనూ ముందుకు తీసుకెళుతూ 19 ఏళ్ల పాటు పోరాడారు. అయినప్పటికీ నిందితుడైన రాథోడ్ ఆరునెలల జైలు శిక్షను, వెయ్యి రూపాయలు జరిమానాను మాత్రమే పొందాడు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే నాటి నుంచి నేటివరకు మన క్రీడాకారిణుల జీవితాల్లో పెద్దగా మార్పు లేదు. తన జీవితాన్ని ముగించుకోవాలనే నిస్పృహతో కూడిన ఆలోచనల గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన వినేశ్ ఫోగాట్ దీన వదనం చూసి దేశ ప్రజలు, ముఖ్యంగా క్రీడా సమాజం దిగ్భ్రాంతి చెంది ఉండాలి. ఈ రెండు కేసు ల్లోనూ ప్రసుతం అధికారంలో ఉన్న బీజేపీని, క్రీడాధికారులను తప్పక కఠిన ప్రశ్నలు వేసితీరాలి. క్రీడాకారిణులు పతకాలు తీసుక వస్తున్నప్పుడు వారు సాధించిన ఉజ్వల కీర్తిని తమ సొంతం చేసుకుని మురిసిపోవడంలో రాజకీయ నేతలు, క్రీడా సమాఖ్య అధిపతులు ముందు ఉంటున్నారు. కానీ మరోవైపున తమకు జరుగుతున్న అన్యా యానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి క్రీడాకారిణులు ప్రయత్నించిన ప్రతిసారీ ఏమాత్రం సిగ్గూ శరమూ లేకుండా నిందితులనే కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. వీరందరూ ఇప్పుడు సమాధానం చెప్పి తీరాలి. క్రీడాకారిణులను వేధించిన కేసుల్లో అవసరమైన సమర్థ న్యాయ ప్రక్రియను తక్షణం ఏర్పర్చాల్సిన అవసరం ఉంది. అత్యున్నత స్థాయు ల్లోని క్రీడా విభాగాలు, సమాఖ్యలు, ప్రభుత్వ క్రీడా విభాగాలు అన్నింటిలో లైంగిక వేధింపులకు వ్యతిరేక కమిటీలను తప్పక ఏర్పర్చాలి. ఈ ప్రక్రియను అనుసరించనప్పుడు, సంబంధిత అధికారులనే జవాబుదారీగా చేయాలి. మైదానంలో అత్యున్నతంగా పోరాడుతూనే తమకు న్యాయం జరగాలని గట్టిగా పోరాడుతున్న మన క్రీడాకారిణులకు సంఘీ భావం పలకడం ఈ దేశంలో క్రీడలను ప్రేమించే ప్రతి ఒక్కరి బాధ్యత. - జగ్మతి సాంగ్వాన్ వాలీబాల్ క్రీడాకారిణి, ‘ఐద్వా’ జాతీయ ఉపాధ్యక్షురాలు (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
నగదు బదిలీతో ఆర్థిక వ్యవస్థకు మేలే!
ఏపీలో ఇప్పుడున్న పాలక పక్షానికి (వైఎస్సార్సీపీ) గత మూడున్నర ఏళ్ల క్రితం ఎకాఎకిన 151 అసెంబ్లీ సీట్లను ప్రజలు కట్టబెట్టారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వైసీపీ ప్రభుత్వం – నూతన పరి పాలనా సంస్కరణలతో, తాను చేసిన వాగ్దానాల మేరకు... సంక్షేమ పథకాలు, ఉద్యోగకల్పన, పరిపాలనా వికేంద్రీ కరణతో శరవేగంగా దూసుకపోతూ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాల్లోకెల్లా బాగా ప్రాచుర్యం పొందినవి రెండు – ఒకటి యువతకు భారీ ఉద్యోగ కల్పన. రెండు – నగదు బదిలీ పథకం. నగదు బదిలీ పథకం విషయంలో ‘పేదల్ని కూర్చోబెట్టి పోషిస్తున్నా’ రంటూ అనేకమంది అక్కసు వెళ్ళగక్కుతూ వస్తున్నారు. వాస్తవానికి ప్రజలకు చేస్తున్న ఈ నగదు బదిలీ వల్ల ఖజానాకు ఒక్క పైసా నష్టం రాకపోగా; నగదు బదిలీ జరిగిన మరుసటి వారంలోపే దానిలో అత్యధిక భాగం తిరిగి చిల్లర వ్యాపారులకు – తద్వారా రాష్ట్ర ఖజానాకే చేరుతుంది ఆ డబ్బంతా! ఈ ద్రవ్య సంచయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నిత్యం ఆదాయం వస్తూనే ఉంటుంది. నగదు బదిలీ పథకం వల్ల ప్రజలకు కొత్తగా తెలిసిందేమంటే – ఇంత భారీగా ప్రజ లకు ఇవ్వగలిగిన సొమ్ము – ఇప్పటి వరకు గత పాలకులు తమకు దక్కకుండా చేశారనే విషయం. ఇక ఉద్యోగ కల్పన విషయానికి వస్తే... గత ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా; ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతుల్లో ఉద్యోగ నియామకాలు చేసి, దళారీల దోపిడీకి తలుపులు బార్లా తెరిచాయి. ఇంతే కాదు, ఇలాంటి అస్థిర ఉద్యోగాల వల్ల అటువంటి ఉద్యో గులు – ఎప్పుడు ఊడిపోతుందో తెలియని ఉద్యోగాలతో రాజీ పడలేక, నాణ్యమైన సేవలు అందించలేక అస్థిర జీవనం కొనసాగించే వారు. అలాంటి తరుణంలో – వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన భారీ ఉదార ఉద్యోగ కల్పన వల్ల కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ ఉద్యోగాల కల్పన వల్ల యువతకు సుస్థిర జీవనం సాగించే అవకాశంతో పాటు; తమ మీద తమకు ఆత్మ విశ్వాసం పెరిగింది. వీరికిచ్చే జీతాల వల్ల రాష్ట్ర ఖజానాపై పెను భారం పడుతుందన్న ప్రతిపక్షాల చీకటి ప్రచారాలు కూడా సరైన వాదనకు నిలబడేవి కావు. కారణం – ఇన్ని లక్షల మందికి చెల్లించే వందల కోట్ల జీతాల మొత్తాలు మరుసటి రోజే మార్కెట్లోకి వెళ్ళి పోతున్నాయి ఖర్చుల రూపంలో. ఖర్చులోనే ఆదాయ ముంటుందన్న ఆర్థిక సూత్రం మేరకు మళ్ళీ వీరి ఖర్చు ప్రభుత్వ ఖజానాలకు ఆదాయంగా మారుతోంది. అందువల్ల వీరి జీతాలను ఖర్చుగా భావించనక్కర్లేదు. పై పెచ్చు ఈ భారీ ఉద్యోగిత వల్ల పాలనా, సేవా సౌకర్యాలు అత్యంత సామాన్యుని ఇంటి ముంగిట వరకు చేరటంతో – పౌర సమాజానికి సమయం, డబ్బు ఆదా అవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత నిచ్చి, ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు చదువుకొనే విద్యార్థులకు అనేక ఫీజు రాయితీలు కల్పిస్తూ; ప్రభుత్వ రంగ విద్యా సంస్థ ల్లోని సౌకర్యాలను మెరుగుపరుస్తూ గ్రామీణ నిరుపేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తేవటం వల్ల... సమీప భవిష్యత్తులో నాణ్యమైన ప్రమాణాలు కల విద్యార్థి సమూహం సమాజంలోకి ధీమాగా అడుగు పెడుతుంది. ఇక వైద్య రంగాన్ని గమనిస్తే – వైద్య, ఆరోగ్య రంగాలలో భారీ ఉద్యోగితను కల్పించటం; ప్రభుత్వ రంగ వైద్య ఆరోగ్య సంస్థలను అభివృద్ధి పరచడం... తద్వారా అందని ద్రాక్షగా తయారైన వైద్యాన్ని సామాన్యుని ముంగిటకు తెచ్చినట్టయింది. రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తిన సమస్యలూ, గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఫలితంగా మిగిలిన అప్పులూ... వెరసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణను భారం చేశాయి. అంతకు ముందు ఐదేళ్లల్లో ఏనాడూ ప్రజా సంక్షేమాన్ని అంతగా పట్టించుకోని చంద్రబాబు ఎన్నికల సంవత్సరంలో మాత్రం ఎడాపెడా రాష్ట్రమంతటా రోడ్లు వేయించ పూనుకున్నాడు. వేగుల ద్వారా – ప్రభుత్వంపై ఉన్న తారాస్థాయి అసంతృప్తి సమాచారాన్ని తెలుసుకొన్న తాను దోమలపై దండయాత్ర అంటూ, పంచాయితీలకు ఎన్నికల సంవత్సరం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా నిధులిచ్చాడు. ఈ ‘ఆఖరు క్షణం ఖర్చుల’ వల్ల రాష్ట్రానికి మూడు విధాల నష్టం వాటిల్లింది. కాంట్రాక్టర్లు, స్థానిక నాయకులతో చేతులు కలిపి భారీగా అవినీతికి పాల్పడటం మొదటిది కాగా; ఈ అవినీతి వల్ల పనుల్లో నాణ్యత తగ్గటం రెండోది. ఈ పర్యవసానాల వల్ల రాష్ట్ర బొక్కసం మొత్తం ఖాళీ అవ్వడం మూడోది. ఫలితంగా జగన్ తన పాలనను ‘మైనస్ జీరో బడ్జెట్’ నుండి మొదలు పెట్టాడని చెప్పాలి. ఎందుకంటే – అప్పటికే రాష్ట్రానికి ఉన్న అప్పు – 2 లక్షల 64 వేల, 451 కోట్లు కాగా, చేతిలో చిల్లిగవ్వ లేకుండా రాష్ట్ర బొక్కసం మొత్తం ఖాళీ కావటం వల్ల వైఎస్ జగన్ ప్రభుత్వానికి తొలిరోజు నుండే ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై కనీసంగా వెయ్యి కోట్ల రూపాయిలు వడ్డీ ప్రతి నెలా చెల్లించాల్సి వస్తోంది. అయినా కూడా పేదల కోసం మొద లెట్టిన నగదు బదిలీ పథకం అప్రతిహతంగా కొనసాగించే విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే! (క్లిక్ చేయండి: ఆస్తుల విభజన చేసేది ఎన్నడు?) - మాకా రాజేంద్రన్ సామాజిక విశ్లేషకుడు -
మామా రాహుల్ గాంది పెండ్లెందుకు జేస్కోలేదే?
పొద్దుగాల ఛాయ్ దాక్కుంట గూసున్న. యాద్గిరి మామొచ్చిండు. ‘‘ఊల్లె అందరు బాగుండ్రానె.’’ ‘‘అందరెట్ల బాగుంటరురా? కొంత మందే బాగున్నరు. (మామ రాజకీయాలు మాట్లాడుడు షురువు జేసిండని మనసుల అనుకున్న.) మన ఊల్లె ఏంది. దేసంలనే పది మంది కోట్లు కమాయించి మజా జేస్తుంటె కడ్మ జెనం ఆకలితోని సస్తున్నరు’’ అని అన్నడు. ‘‘సంటర్ సర్కార్ బీదోల్లకు ఐదు కిలల వొంతున బియ్యం ఫిరీగ ఇస్తున్నది. ఇంకేం జెయ్యాలెనే?’’ ‘‘బియ్యం ఫిరీగ ఇయ్యంగనే అయిపాయెనా? గ్యాసు బండ దర మూడింతలు బెర్గె. సంక్రాంతి పండ్గ దినాన వందే బారత్ రేల్ గాడిని షురువు జేసిండ్రు. లష్కర్ కెల్లి ఎన్మిదిన్నర గంటలల్ల విశాకపట్నం బోతది. గని గాడి ఛార్జిలే మొగులు మీదున్నయి. ఎగ్జిక్యూటివ్ కిలాస్ టికిట్ దర 3,170 రూపా యలు. గని గాలి మోటర్ టికిట్ దర 3,900. గాల్లు, గీల్లతో పండ్గ నాడు సీట్లు నిండినయి. ఆవలి దినం కెల్లి సగం కన్న ఎక్వ సీట్లు కాలిగున్నయి. ఒక్క దినం యేసానికి మూతి మీసం గొరిగిచ్చుకున్న తీర్గున్నది గీ రేల్ గాడి సంగతి.’’ ‘‘మామా రాహుల్ గాంది పెండ్లెందుకు జేస్కోలేదే?’’ ‘‘నెహ్రూ ప్రతాని అయినప్పుడు గాయిన పెండ్లాం లేదు. ఇందిరా గాంది ప్రతాని కుర్సి మీద గూసున్నప్పుడు గామె మొగడు లేడు. మొరార్జి దేశాయ్ ప్రతాని అయినప్పుడు గాయిన పెండ్లాం లేదు. గదే తీర్గ పీవీ నరసింహారావు ప్రతాని కుర్సి మీద గూసున్నప్పుడు గాయిన పెండ్లాం లేదు. వాజపేయి అయితే పెండ్లే జేస్కోలేదు. మోదీకి పెండ్లాం ఉన్నా లేనట్టే లెక్క. పెండ్లాం లేకుంటనే ప్రతాని అయ్యేటి మోక దొర్కుతదని రాహుల్ గాంది పెండ్లి జేస్కోలేదు. పెండ్లాం లేకుంటె ఎంత లాబమో ఒకపారి వాజపేయి జెప్పిండు. రొండు దినాలల్ల పోక్రాన్ అను పరీచ్చ జేస్తరనంగ అబ్దుల్ కలాం అప్పటి ప్రతాని వాజపేయి దగ్గరకు బోయిండు. అనుపరీచ్చ జేస్తమన్న సంగతిని మనద్దరికి తప్పిడ్సి ఎవ్వల్కి ఎర్క గాకుంట సూడుండ్రి అన్నడు. మీకు పెండ్లాం లేదు, నాకు పెండ్లాం లేదు. గసు వంటప్పుడు గీ సంగతి మనిద్దరికి దప్పిడ్సి కడ్మోల్లకు ఎట్ల ఎర్కైతది వయా అని వాజపేయి అన్నడు.’’ ‘‘కేసీఆర్ సంగతేంది మామా?’’ ‘‘కమ్మంల కేసీఆర్ బీఆర్ఎస్ పుట్టుక సబ బెట్టిండు. నగరమంత గులాబి జెండలు ఎగిరేసిండ్రు. సబకొచ్చిన లీడర్ల కోసం అర్వై మూడు తీర్ల తెలంగాన వొంటకాలను జేపిచ్చిండ్రు. నాటుకోడి కూర, బొమ్మి డాయిల పుల్సు, కొర్రమీను కూర, రొయ్యల ఫ్రై, బిర్యాని అసుంటియి గూడ ఉన్నాయి. ఏడు తీర్ల స్వీట్లను గుడ్క జేపిచ్చిండ్రు. సబకు వొచ్చినోల్ల గురించి ఎన్మిది లచ్చల మంచినీల్ల సీసలు బెట్టిండ్రు. నూట నల్వయి ఫీట్ల పొడ్గు, అర్వై ఫీట్ల ఎడల్పుతోని పెద్ద స్టేజి గట్టిండ్రు. కేరల ముక్యమంత్రి విజయన్, డిల్లీ ముక్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ ముక్యమంత్రి బగవంత్ మాన్, యుపి మాజీ సీఎం అకిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రతాన కార్యదర్శి డి. రాజా గీ సబకొచ్చిండ్రు. విజయన్, డి.రాజా అంగ్రేజీల స్పీచ్ గొడ్తె కడ్మోల్లు హిందిల మాట్లాడిండ్రు. గాల్ల మాటలు అర్తం గాక జెనం లొల్లి బెట్టిండ్రు. గిప్పుడు మనది జాతీయ పార్టీ, ఏ బాస ఎవ్వలు మాట్లాడినా లొల్లి బెట్టకుంట ఇనాలె అని కేసీఆర్ అన్నడు.’’ ‘‘కేసీఆర్ ఏమని స్పీచ్ గొట్టిండే?’’ ‘‘వొచ్చేటి లోక్సబ ఎలచ్చన్ల మోదీ ఇంటికి బోతడు. మనం డిల్లికి బోతం. దేసమంత రైతు బందు, దలిత బందు పద్కాలు బెడ్తం. 70 వేల టీఎంసీల నీల్లు దొర్కుతున్నా 20 వేల టీఎంసీల నీల్లు వాడుతున్నం. కాలేశ్వరం అసువంటి ప్రాజెక్టులు లేకపోయె బట్కె దేసంల 50 వేల టీఎంసీల నీల్లు ఫుజూల్గ బోతున్నది. బీఆర్ఎస్ సర్కారొస్తె దేసమంతట కాలేశ్వరం అసువంటి ప్రాజెక్టులు గట్టిపిస్తది అన్కుంట కేసీఆర్ స్పీచ్గొట్టిండు. చింతకాని మండలంల వందనం అనేటి ఊరున్నది. గా ఊరుకు బోరుతోని నీల్లు ఇస్తున్నరు. బోరు నడ్సెతందుకు వాడేటి కరెంటును బీఆర్ఎస్ పుట్టుక సబకు మల్పిండ్రు. దాంతోని తాగెతందుకు నీల్లు లేక వందనం ఊరోల్లు తిప్పలబడ్డరు. యాడాదిల ప్రతాని అవుడెట్ల అనేటి వయ్యి గురించి కేసీఆర్ ఒక్క తీర్గ లెంకుతున్నడు. వొస్తరా’’ అన్కుంట మా యాద్గిరి మామ బోయిండు. (క్లిక్ చేయండి: రాజకీయ సంక్రాంతి.. యథా లీడర్ తథా క్యాడర్) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
PDSU: ‘ప్రగతిశీల’ శక్తులన్నీ ఒక్కటి కావాలి!
హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా 1974లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) ఏర్పడి మరో ఏడాదికి 50 ఏళ్లు నిండనున్నాయి. అసమానమైన పోరాటాలతో, త్యాగాలతో ఇరు రాష్ట్రాల ప్రజలపై పీడీఎస్యూ చూపిన ప్రభావం ఎవ్వరూ చెరపలేనిది. ఈ సంస్థకు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా 1980 దశకం నాటికే నా ప్రత్యక్ష నిర్మాణ సంబంధం ముగిసిపోయింది. కానీ సోదరుడు కామ్రేడ్ కూర రాజన్న ద్వారా మా ఇంటి తలుపు తట్టిన అమరుడు కామ్రేడ్ జార్జిరెడ్డి జ్ఞాపకం, ఎంతోమంది గుండెల్ని రగిలించిన ఆయన ప్రస్థానం.. నేను పుట్టి పెరిగిన సిరిసిల్ల ప్రాంత రైతాంగ పోరాటాల వెల్లువతో పెనవేసుకుపోయింది. అదే విప్లవోద్యమంతో ముడిపడి పోయి రెండు తరాల విప్లవ విద్యార్థులతో నా ఇన్నేండ్ల ప్రయాణాన్ని నిర్దేశిస్తూ వస్తోంది. అందుకే నాకిది జ్ఞాపకం మూత్రమే కాదు, వర్తమాన నిజం. అలాంటి జ్ఞాపకాలన్నింటినీ తట్టిలేపుతూ, గతం–వర్తమాన పరిస్థితులను బేరీజు వేసుకుంటూ 2023 జనవరి 21న, పీడీఎస్యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగడం అపూర్వమనే భావించాలి. కామ్రేడ్ జార్జిరెడ్డి ఆధ్వర్యాన ఏర్పడిన పీడీఎస్యూ, ఆయన అమరుడైన ఏప్రిల్ 14 (1974)ననే పీడీఎస్యూగా ఆవిర్భవించింది. అది మొదలు అధిక ధరలపై, పలు సమస్యల సాధనకై పోరాడింది. కామ్రేడ్స్ భూమయ్య, కిష్టాగౌడ్ల ఉరిశిక్షల రద్దుకై ఉద్యమించింది. రైల్వే కార్మికుల సమ్మెకు మద్దతుగా నడిచింది. శ్రీకాకుళ గోదావరి లోయ పోరాటాలకు సంఘీభావంగా నిలిచింది. శ్రామికవర్గ అంతర్జాతీయతను ఎలుగెత్తి చాటి, ప్రపంచ పౌరుడిగా అవతరించిన చేగువేరా త్యాగనిరతిని పునికి పుచ్చుకుంది. అందుకే మతోన్మాదుల చేతుల్లో జార్జ్, చాంద్ పాషాల హత్యలు మొదలు... రాజ్యమే యుద్ధం ప్రకటించడంతో జంపాల, శ్రీపాద శ్రీహరిల నుండి చంద్రశేఖర్, రియాజ్ల వరకూ డజనుల కొలది విద్యార్థి వీరులు అమరు లైనారు. మరి ఎంతోమంది విద్యాలయాల నుండి పయనమై సమాజపు విముక్తిలో అంతర్భాగమైనారు. ఇందులో కొందరు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో నిలబడి బూర్జువా పార్లమెంటరీ రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. ఈనాడు విప్లవ విద్యార్థి ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యల ప్రత్యేక సందర్భంలో పలు పీడీఎస్యూలన్నీ ఒకే తాటి మీదకు రావడమనేది, ప్రధాన ఎజెండా కావాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు గతం కంటే తీవ్రంగా యావద్దేశం హిందుత్వ రాజకీయాల ఫాసిస్టు దాడికి గురవుతోంది. ప్రారంభం నుండీ ఇలాంటి ఉన్మాద దాడుల్లోనే రక్తసిక్త పసిగుడ్డుగా పుట్టిన పీడీఎస్యూ అనతి కాలంలోనే ఎమర్జెన్సీ ఫాసిస్టు దాడికి గురయ్యింది. చితాభస్మంలోంచి లేచిన ఫినిక్స్ పక్షిలాగా మారిన పీడీఎస్యూ నేడు అప్రకటిత ఎమర్జెన్సీని ఎదుర్కొంటూనే మునుముందుకు సాగుతోంది. అయితే పీడీఎస్యూలో సంభవించిన చీలికలు ఉద్యమ గమనం మందగించడానికి కారణమయ్యాయి. నాకు సమకాలికులుగా ఉన్న చాలామంది కామ్రేడ్స్ ప్రత్యక్షంగా ఎదుర్కొన్న 1984 నాటి చీలికను చూసి కొందరు పీడ విరగడయిందని (గుడ్ రిడెన్స్) భావించిన వాళ్లున్నారు. కానీ అసలు పీడ అక్కడ నుండే మొదలయ్యింది. ఆ తర్వాతి 45 ఏళ్లలో 1986 రాజీవ్గాంధీ నూతన విద్యా విధానం, రిజర్వేషన్లు, ఎల్పీజీ, విద్యా కాషాయీకరణ – కార్పొరేటీకరణ లాంటి ఎన్నో పరిణామాలు వచ్చాయి. విద్యాహక్కు చట్టం తర్వాత కూడా ఎన్నో పాఠశాలలు మూసివేయబడి, సార్వజనీన విద్య (కామన్ స్కూల్ ఎడ్యుకేషన్) అనేది కనుమరుగై పోయింది. వాటన్నిటిపై ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం బలాబలాలు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. రెండు తరాలూ... అధిక ధరలు, ఆకలి చావులు, అన్నార్థుల ఆవేదనలు, దేశ సంపదను దోచుకెళ్తున్న పిడికెడు మంది బడా దోపిడీ దారులకు వ్యతిరేకంగా సాగే పోరాటాలతో మమేకం కావాలని కోరుకోవడం ఆహ్వానించతగ్గది. సమ్మేళనం బాధ్యతను నెత్తికెత్తుకున్న నిర్వాహకులకు విప్లవాభినందనలు. ఇది బయటి వ్యక్తి మాటగా కాకుండా మీతో నేను, నాతో మీరుగానే స్వీకరించాలని నా విజ్ఞప్తి. – అమర్ (జనవరి 21 పీడీఎస్యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా) -
ఆర్వీఎంపై అనుమానాలు సహజమే!
2019 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా 91.2 కోట్ల మంది ఓటర్లు ఉంటే... వారిలో 32.6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇందుకు అనేక కారణాలు. అందులో ముఖ్యమైనది బతుకు తెరువు కోసం వలసపోవటం. ఓటింగ్ శాతంపై సుప్రీంకోర్టుకు కూడా అనేక వినతులు అందాయి. వ్యాజ్యాలూ దాఖలయ్యాయి. ఆ నేపథ్యంలోనే 2015లో సుప్రీంకోర్టు ఓటింగ్ శాతం పెంచే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (సీఈసీ) ఆదేశించింది. దీంతో ఎన్నికల సంఘం అనేక అంశాలను పరిశీలించింది. ఇప్పటికే పరోక్ష ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్, ఇంటర్నెట్ ఓటింగ్, ముందస్తు ఓటింగ్ వంటి విధానాలు అమల్లో ఉన్నాయి. అయితే ఆ విధానాలను అత్యధికులు ఉపయోగించుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు కోట్లాదిగా ఉన్న వలస ఓటర్ల కోసం కేంద్ర ఎన్నికల సంఘం, ఒకేసారి అనేక (72) నియోజకవర్గాల పరిధిలో ఉన్నవారు రిమోట్ ఓటింగ్ మిషన్ (ఆర్వీఎం)ను ఉపయోగించి ఓటువేయడానికి అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది. ఈ ఆర్వీఎంలను పరిశీలించేందుకు, వాటి పనితీరుపై అభ్యంతరాలను తెలిపేందుకు, జనవరి 16, సోమవారం ప్రయోగాత్మక పరిశీలనా ప్రదర్శనకు రావాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం.. గుర్తింపు పొందిన 8 జాతీయ పార్టీలను, 57 రాష్ట్ర పార్టీలను ఆహ్వానించింది. పరిశీలన తర్వాత తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా జనవరి 31 నాటికి అందించాలని ఈసీ కోరింది. అయితే ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో 16 ప్రతిపక్షాలు సమావేశమై తాము ఆర్వీఎంలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే అనేక పార్టీలు ఆర్వీఎంల అవసరం లేదని పేర్కొన్నాయి. దీంతో ఆర్వీఎంలపై మరింత చర్చించి తమ అభిప్రాయాలను చెప్పాలని ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగించింది. ఈవీఎంలపై అనుమానాలే పూర్తిగా తగ్గని వేళ, ఈ ఆర్వీఎంలపై మరిన్ని సందేహాలు రావడం సహజమే. – డాక్టర్ తాతా సేవకుమార్, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ -
Vemana: లోకకవి మన వేమన!
వానకు తడవని వారూ, ఒక్క వేమన పద్యం కూడా వినని తెలుగువారూ ఉండరని లోకోక్తి. అలతి పదాలతో సమాజంలోని రుగ్మతలను తూర్పార బట్టిన మనో వైజ్ఞానికుడు వేమన. సమకాలీన వ్యవస్థలపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంఘసంస్కర్త, విప్లవకారుడు వేమన. 1839లో తొలిసారిగా బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అనేకమంది ఆయనపై పరిశోధన చేశారు. ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు కేంద్ర సాహిత్య అకాడమీ వారి సహకారంతో వేమన జీవిత చరిత్రను 14 భాషలలోకి అనువదించడానికి కారకులయ్యారు. ఆంగ్ల, ఐరోపా భాషల్లోకీ; అన్ని ద్రవిడ భాషల్లోకీ వేమన పద్యాలు అనువాదమయ్యాయి. సి.ఇ. గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమన సాహిత్యానికి ముగ్ధులై ఆయనను లోక కవిగా కీర్తించారు. వేమన 1602–1730 మధ్య కాలానికి చెందిన వాడనీ కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వాడనీ అంటారు. జనబాహుళ్యంలో ఉన్న వివరాల ప్రకారం, వేమన అసలు పేరు బెధమ కోమటి చినవేమారెడ్డి. ఈయన అన్న పేరు బెధమ కోమటి పెదవేమారెడ్డి. వేమన జన్మించిన ప్రాంతంపై అనేక రకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ చివ రిగా ఆయన అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న కటారు పల్లె ప్రాంతానికి చెందిన వారని నిర్ధారించారు. అందుకే ఆ ప్రాంతంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వేమన జయంతి ఉత్సవాలను జరపడానికి నిర్ణయించుకుంది. వేమన భోగలాలసుడుగా తిరుగుతూ ఒకానొక దశకు వచ్చేటప్పటికి ఓ సాధువు ద్వారా ఆత్మ జ్ఞానం పొంది అన్నింటినీ త్యజించి యోగిలా మారిపోయాడని అంటారు. సంసార బాధలనుండి ఉపశమనం పొందడానికి తనను ఆశ్రయించే అభాగ్యులకు తన పద్యాల ద్వారా తత్వాన్ని బోధించడం మొదలు పెట్టాడు. తన మాటల ద్వారా తనలో జ్ఞానజ్యోతిని మొట్ట మొదటగా వెలిగించిన తన ప్రేయసి విశ్వద పేరును, తనకు కష్ట కాలంలో అండగా నిలిచిన మిత్రుడు అభిరాముడి పేరును తన పద్యాలకు మకుటంలో చేర్చి వారికి శాశ్వత కీర్తిని ప్రసాదించాడు వేమన అనేది కొందరి అభిప్రాయం. అయితే అసలు ఇవన్నీ కూడా ప్రక్షిప్తాలనీ... వేమన చిన్న నాటి నుంచే జ్ఞానశీలి అనీ, తదనంతరం స్నేహితుల ప్రభావంవల్ల దారితప్పి, ఆపై పరివర్తన వచ్చి యోగిగా మారాడనీ అంటారు. ఆయన పద్యమకుటానికి ‘సృష్టి కర్తకు ప్రియమైన వేమా వినుము’ అని పండితులు మరో అర్థాన్ని చెప్పారు. బ్రౌన్ ఈ అర్థాన్నే తీసుకొని వేమన పద్యాలను ఇంగ్లిష్లోకి అనువదించారు. వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక రీతులు, సామాజిక చైతన్యానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఆయన కవిత్వంలో స్పృశించని అంశమే లేదు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు; మతం పేరిట జరుగుతున్న అరాచకాలు, దోపిడీలు, విగ్రహారాధనలోని మౌఢ్యం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు... ఒకటే మిటి? కనిపించిన ప్రతి సామాజిక రుగ్మత మీద వేమన తనకలం ఝుళిపించాడు. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకునేట్లు వారికి పరిచితమైన భాషలో స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా శక్తిమంతంగా వ్యక్తీకరించారు. వేమన పద్యా లన్నీ ఆటవెలది చందస్సులోనే చెప్పాడు. కవిత్రయం అంటే తిక్కన, వేమన, గుర జాడ అంటాడు శ్రీశ్రీ. ‘వేమన కవిత్వం గాయానికి మందు రాసినట్లు కాక, ఆ గాయం చేసిన కత్తికే ముందు మందు పూసినట్లుంటుంది’ అంటారు రాళ్ల పల్లి అనంత కృష్ణ శర్మ. తన పద్యాలలో సామ్యవాద సిద్ధాంతాన్ని ఎప్పుడో ఎలిగెత్తి చాటిన సామ్యవాద ప్రజా కవి వేమన. (క్లిక్ చేయండి: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట) - పి. విజయబాబు అధికార భాషా సంఘం అధ్యక్షులు, ఏపీ (జనవరి 19 వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా) -
మనోభావాలు ముఖ్యం.. ఆచితూచి వ్యవహరించాలి
గీత వృత్తికి చెందిన గౌడ కులస్థుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో... వారి సంక్షేమార్థం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భువనగిరి జిల్లా ‘నందనం’ అనే గ్రామంలో 8 కోట్ల రూపాయల వ్యయంతో నీరా శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం పట్ల సర్వతా హర్షం వ్యక్తమైంది. హైదరాబాద్లో ట్యాంక్బండ్పై నెక్లెస్ రోడ్డులో ఒక నీరా హబ్ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో దానికి ‘వేదామృతం’ అని పేరు పెట్టారు. అదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. హైదరాబాద్లోని కొంతమంది బ్రాహ్మణ వర్గం నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహా దారైన డాక్టర్ రమణాచారిని కలిసి నీరాపానీయానికి ‘వేదామృతం’ అనే నామకరణం ఎంత వరకు సమంజసమైనది అని ప్రశ్నిస్తూ వినతి పత్రం సమర్పించారు. దీంతో వాద ప్రతివాదాలు ఊపందుకున్నాయి. హిందువుల పవిత్ర గ్రంథాలలో ‘వేదాలు’ అనేవి చాలా ప్రాధాన్యం సంతరించుకొన్నవనీ, అవి ప్రపంచానికి మార్గదర్శకాలనీ, నీరాకు వేదామృతం అనే పేరు పెట్టడం హైందవ జాతిని అవమానించేదిగా ఉందనే విషయాన్ని తెరమీదకు తీసుకువచ్చారు ఈ పేరును వ్యతిరేకించేవారు. అయితే కల్లుగీత వృత్తిపై ఆధారపడిన గౌడ కుల సంఘాలు, నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వేదామృతం పేరును సమర్థించడంతో సమస్య జటిలమైందని చెప్పాలి. ఆయుర్వేద వైద్యపరంగా నీరా అనేది సర్వరోగ నివారిణి అనీ, ముఖ్యంగా క్యాన్సర్ను కూడా నివారించే ఔషధ గుణాలున్నాయనేది వారి వాదం. వేదాల్లో సురాపానం గురించి ఉందనీ, ‘సుర’ అంటే అమృతం అనీ, దేవతలూ, రాక్షసులూ దానిని సేవించారని ప్రకటనలు ఇవ్వడం సరికాదు. వేదాలకు భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రాముఖ్యం, పవిత్రతను దృష్టిలో పెట్టుకుని గౌడ సోదరులు వేదామృతం అనే పేరును సమర్థించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సమాజంలోని అన్ని వర్గాల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: నిజంగా కులగణన అవసరమేనా?) – డాక్టర్ మాచర్ల మొగిలి గౌడ్ రిటైర్డ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, చేవెళ్ల -
Caste Census: నిజంగా కులగణన అవసరమేనా?
భారతదేశంలో కులాల వారీగా జనాభాను లెక్కించాలని చాలా రోజుల నుంచి కొంత మంది కుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా ఈ కులగణనకు జెండా ఊపడంతో, కులగణన వలన జరిగే ప్రయోజనాలు, సమస్యలు అనే విషయంపై చర్చ మొదలైంది. కులగణన అనే తేనె తుట్టెను నితీష్ కుమార్ కదిలించడం వెనక రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని విమర్శకుల వాదన. కులాల వారీ జనాభా లెక్కల సేకరణ డిమాండ్ వెనక సామాజిక అభివృద్ధి కోణం ఉంటే సమర్థనీయమే. అభిలషణీయమే. ఇక స్వాతంత్య్రానంతరం కొంత మంది మాత్రమే ఈ దేశాన్ని పాలించడంలో, దేశ వనరులను అను భవించడంలో ముందంజలో ఉన్నారు. ఆ పనిలో తాము కూడా ముందు ఉండాలని దూరాలోచన కులగణన సమర్థకుల మనసుల్లో ఉంటే... ఈ విషయంలో వాదాలూ, ప్రతి వాదాలూ, సమస్యలు అనేకం ఉత్పన్నం కావచ్చు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశంలోని అనేక వర్గాలు వెనుకబడి ఉన్న మాట నిజమే. స్వాతంత్య్రానంతరం ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక దృష్టి కోణంతోనే పాలనను సాగించి, నిమ్న వర్గాల ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ప్రజల సమగ్ర అభివృద్ధికి బాటలు పరిచిందనేది కాదనలేని నిజం. అయితే ఇంకా ఆయా వర్గాలు వెనకబడే ఉన్నాయనీ, అభివృద్ధి ఫలాల్లో ఎవరి వాటా వారికి అందాలంటే కులగణనే మార్గమనీ కొందరంటున్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ భద్రతకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రజా సంక్షేమానికి ఇవ్వడం లేదనేది కొంతమంది విజ్ఞుల అభిప్రాయం. ఏ కులం వారు ఎంతమంది ఈ దేశంలో ఉన్నారు అనే విషయం తెలిస్తే, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయపరమైన పదవులు ఏయే కులాల వారికి ఎన్ని దక్కాలి అనే విషయంపై లెక్కలు తేలుతాయని కుల గణనను సమర్థించే నాయకులు చెప్పే మాటలు వాస్తవ విషయంలో నిజం కాకపోవచ్చు. దేశంలో ఇప్పటికే కొన్ని బీసీ కులాల వాళ్ళు తమ కులాలను ఎస్సీలో చేర్చండి అనీ, ఎస్టీల్లో చేర్చండి అనే డిమాండ్లను మొదలుపెట్టారు. కొన్ని ఆధిపత్య కులాలవారు తమను బీసీ వర్గాల్లో చేర్చండి అనే డిమాండు లేవదీస్తున్నారు. ఈ కులగణన చేపడితే ఇటువంటి అనేక డిమాండ్లూ, సమస్యలూ చుట్టు ముట్టవచ్చు. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం 1871లో కులాల వారీగా భారతదేశాన్ని విభజించి చూసే ప్రణాళిక అల్లింది. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. భారతీయుల్లో జాతీయాభిమానం పెరిగి, భారతదేశంలో తమ పెత్తనం చేజారిపోతుందని ఊహించిన బ్రిటిష్ పాలకులు భారతీయ సమాజాన్ని కులాల వారీగా, మతాల వారీగా విభజించడానికే ఈ కులాల వారీ గణనను ప్రారంభించారనేది వాస్తవం. ఈ దేశ సమగ్రత, సమైక్యత, శక్తి మంతమైన భారత్ నిర్మాణం ఇత్యాది విషయాల్లో దేశంలోని మిగతా పార్టీల కంటే భారతీయ జనతా పార్టీది భిన్నమైన దృక్పథం. కులాల వారీగా భారతీయ సమాజాన్ని విభజిస్తే– భారతీయ సంస్కృతికి తాను వారసుణ్ణి అనే భావన లుప్తమై, ప్రజల్లో అసంఘటిత భావాలు ప్రబలి, జాతి వ్యతిరేక శక్తులు బలపడతాయని ఆ పార్టీ భావించే... ఇంతవరకు కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చింది. నిజంగా కులగణన అవసరమేనా? ఓట్లను అమ్ముకోకుండా ప్రజలు నీతి, నిజాయతీ, దేశ అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన నాయకులను ఎన్నుకుంటే సరిపోదా? కులాల లెక్కల వల్ల దేశంలో సౌభ్రాతృత్వ వాతావరణం నెలకొంటుందా? కుల గణనను సమర్థించే వారందరూ ఈ విషయాలను గమనంలో ఉంచుకుంటే కొంత ప్రయోజనం ఉంటుంది. (క్లిక్ చేయండి: స్తబ్ధత నుంచి చైతన్యంలోకి...) - ఉల్లి బాలరంగయ్య రాజకీయ సామాజిక విశ్లేషకులు -
YSR Pension Kanuka: ఒక పోస్ట్మాస్టర్ పెన్షన్ కథ!
నాపేరు తబ్బిబ్బు మహానందప్ప. నా వయసు 84 సంవత్సరాలు. నేను ఉమ్మడి కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో జన్మించాను. ఆ కాలంలోనే అంటే 1961 లో పీయూసీ చదివి కర్నూల్ మెడికల్ కాలేజీలో 1961–63 సంవత్సరాలలో 3 సంవత్సరాల కాంపౌండర్ కోర్సు, 1965లో హిందీ ప్రవీణ ప్రచారక్ కోర్సులను పూర్తి చేశాను. ఆ తర్వాత 1970లో గ్రామంలోనే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగం రావడంతో ఆ ఉద్యోగం చూసుకుంటూ స్వగ్రామంలోనే స్థిరపడ్డాను. పోస్ట్ మాస్టర్ ఉద్యోగం అదనపు శాఖా ఉద్యోగం (ఈడీ) కావడంతో జీతం చాలా తక్కువ వచ్చేది. ఉద్యోగం ప్రారంభంలో నా జీతం 30 రూపాయలు మాత్రమే. అలవెన్సు కింద మరో 15 రూపాయలు ఇచ్చేవారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా 36 ఏళ్ళు పనిచేసి 2006 సంవత్సరంలో పదవీ విరమణ చేశాను. తపాలా శాఖ కేంద్ర ప్రభుత్వం అధీనంలోనిదే అయినా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు పదవీ విరమణ తర్వాత ఎలాంటి పెన్షన్ లేదు. పోస్ట్ మాస్టర్గా సుదీర్ఘ కాలం పని చేసినప్పటికీ కంటి తుడుపుగా గ్రాట్యుటీ పేరుతో కేవలం 48 వేల రూపాయలు మాత్రమే చేతిలో పెట్టి సాగనంపారు. ఆ డబ్బులు కనీస అవసరాలను కూడా తీర్చలేక పోయాయి. అరకొర జీతంతోనే మా బ్రాంచ్ పోస్టాఫీసు పరిధిలోని తొమ్మిది గ్రామాలకు సేవలను అందించాను. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు మా బ్రాంచ్ ఆదాయం నెలకు రెండువేల రూపాయలు ఉండేది. నేను రిటైర్ అయ్యే నాటికి ఆ ఆదాయం నెలకు 25 వేల రూపాయలకు పెరిగింది. నా జీతం మాత్రం ‘గొర్రె తోక బెత్తెడు’ అన్న చందాన పదవీ విరమణ నాటికి 2,800 రూపాయలే. గ్రామీణ ప్రజలకు తపాలా సేవలను అందించడంతోపాటు కాంపౌండర్గా శిక్షణ పొంది ఉండటంవల్ల వైద్యసేవలు కూడా అందించాను. పదవీ విరమణ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం మాత్రమే కనబడింది. నా జీవన పోరాటంలో భాగంగా మైదుకూరులో నివాసం ఉంటూ ఈ వయసులో కూడా వైఎస్ఆర్ జిల్లా, దువ్వూరు మండలం, గుడిపాడులో ఒక ప్రైవేటు విద్యాసంస్థలో పార్ట్ టైం హిందీ బోధకుడిగా పనిచేస్తున్నాను. జగనన్న ప్రభుత్వం అందచేసే ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ కింద గత నెల దాకా 2,500 రూపాయలు అందించేవారు. తాజాగా ఈ మొత్తాన్ని మరో 250 రూపాయలు పెంచడం ఆనందదాయకం. పెరిగిన మొత్తంతో కలిపి 2,750 రూపాయలు జనవరి 1వ తేదీ కానుకగా అందుకున్నాను. మా వార్డ్ వాలెంటీర్ ‘యాష్మిన్’ అనే అమ్మాయి ప్రతి నెలా ఒకటో తేదీనే మా ఇంటి కొచ్చి ఠంచనుగా పింఛన్ అందచేస్తోంది. ఈ పింఛనే నా ఆత్మగౌరవాన్ని కాపాడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు. (క్లిక్ చేయండి: అనారోగ్య అగ్రరాజ్యం.. బయటపడిన అమెరికా డొల్లతనం) – టి. మహానందప్ప, రిటైర్డ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, మైదుకూరు -
Sharad Yadav: ‘మండల్’ అమలు వ్యూహం ఆయనదే!
దేశరాజధానిలో 2023 జనవరి 12న తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూసిన శరద్ యాదవ్ (75) మృతి దేశవ్యాప్తంగా ఆయన అనుయాయులను, ఆరాధకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఈ యువ ఎమర్జెన్సీ వ్యతిరేక విద్యార్థి నేత 1974 జయప్రకాష్ నారాయణ్ ఉద్యమ సమ యంలో 27 ఏళ్ల ప్రాయంలోనే పార్ల మెంటు స్థానంలో గెలుపొంది జాతీయ నేతగా మారారు. ఓబీసీ భావన, దాని వర్గీకరణ జాతీయ నిఘంటువుగా మారడానికి చాలాకాలానికి ముందే ఆయన శూద్ర, ఓబీసీ, సామాజిక శక్తుల ప్రతినిధిగా, సోషలిస్టు సిద్ధాంతవేత్తగా ఆవిర్భవించారు. రామ్మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్ (బిహార్కి చెందిన క్షురక సామాజిక బృందానికి చెందిన నేత)ల సోషలిస్టు సిద్ధాంత భూమిక నుంచి ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించిన నూతన యువ శూద్ర, ఓబీసీ నేతల బృందంలో శరద్ యాదవ్ ఒక భాగమై ఉండేవారు. ఈ బృందంలోని ఇతర నేతలు తమ సొంత రాష్ట్రాలకే పరిమితమై పోగా, ఈయన మాత్రం జాతీయ ప్రముఖుడిగా మారారు. ఈ యువ బృందానికి చెందిన ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్లు జాతీయ రాజకీయాల నుంచి వెనుదిరిగి రాష్ట్ర రాజ కీయాలకు పరిమితమైపోగా, శరద్ యాదవ్ మాత్రం పార్లమెంటులోనే ఉండిపోయారు. ఏడు సార్లు లోక్సభ సభ్యుడిగా, మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా నెగ్గిన శరద్ యాదవ్ పార్లమెంటులో పేదల అనుకూల సమరాల్లో పోరాడుతూ వచ్చారు. హిందీలో చక్కటి వక్త, తార్కిక చింతనాపరుడైన శరద్ యాదవ్ రాజకీయ వ్యూహకర్తగా ఉండేవారు. ఈయన రాజకీయ వ్యూహం ఫలితంగానే నాటి ఉప ప్రధాని, జాట్ నేత అయిన దేవీలాల్ నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలోనూ... మండల్ నివేదికలోని ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని వీపీ సింగ్ అమలు చేయవలసి వచ్చింది. జనతా దళ్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పరిణామాల గురించి శరద్ యాదవ్ వివరించి చెప్పారు. ‘మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిందిగా జనతా దళ్ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి మేము సోషలిస్టు నేతలందరినీ సమీకరించడం ప్రారంభించాము. ఇది జరగకుండా శూద్రులకు నిజమైన న్యాయం కలగదని మేము బలంగా నమ్మాము. మండల్ కమిషన్ సిఫార్సులను వీపీ సింగ్ సన్నిహితులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని అధిగమించడానికి ఆయన ఉపప్రధాని, ప్రముఖ జాట్ నేత దేవీలాల్ చౌదరి అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. చరణ్ సింగ్ జోక్యం కారణం గానే జాట్లను వెనుకబడిన వర్గాల జాబి తాలో మండల్ చేర్చలేక పోయారని తనకు తెలుసు. అయినప్పటికీ అనేక మంది స్థానిక జాట్ నేతలు, బృందాలు రిజ ర్వేషన్ కేటగిరీలో తమను చేర్చాల్సిందిగా తమ తమ రాజకీయ నేతలను ఒత్తి డికి గురి చేశారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న వీపీ సింగ్ గొప్ప ఎత్తు వేశారు. జాట్లను రిజర్వేషన్ జాబితాలో చేర్చడానికి తాను వ్యతిరేకమే అయినప్పటికీ, ప్రముఖ జాట్ నేత అయిన దేవీలాల్ జాట్లను చేర్చకుండా మండల్ సిఫార్సులను అమలు చేయబోరని వీపీ సింగ్కు కచ్చితంగా తెలుసు. జనతాదళ్ జనరల్ సెక్రెటరీ, పరిశ్రమల మంత్రీ అయిన చౌదరి అజిత్ సింగ్ కూడా వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ప్రచారం ప్రారంభించారు, ఓబీసీ జాబితాలో జాట్లను చేర్చాల్సిందేనని నొక్కి చెప్పసాగారు. దీంతో దేవీలాల్ రాజకీయ డైలమాలో చిక్కుకున్నారు. జాట్లను వెనుకబడిన వర్గంగా చేర్చిన ఘనత అజిత్ సింగ్కు దక్కకూడదని ఆయన కోరుకున్నారు. మరోవైపు, జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చకుంటే తన సొంత జాట్ కమ్యూనిటీ నుంచి ఆగ్రహాన్ని చవిచూసే ప్రమాదాన్ని కూడా దేవీలాల్ కోరుకోలేదు. కాబట్టి, ఇది మండల్ కమిషన్పై చర్చకు ముగింపు పలుకుతుందని వీపీ సింగ్ భావించారు. ‘‘1990 ఆగస్టు 3న, వీపీ సింగ్ నాకు కబురంపి ‘సోదరా శరద్! చౌదరి దేవీలాల్ని ఇక ఏమాత్రం నేను సహించలేన’ని చెప్పారు. దేవీలాల్తో మాట్లాడతాననీ, ఈ అధ్యాయానికి శాశ్వతంగా ముగింపు పలుకుతాననీ నేను వీపీ సింగ్కు హామీ ఇచ్చాను. అయితే దేవీ లాల్ని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించవద్దని నేను వీపీ సింగ్ను అభ్యర్థించాను. కానీ అప్పటికే దేవీలాల్కి ఉద్వాసన పలుకుతున్న ఆదేశాన్ని తాను రాష్ట్రపతికి పంపేసినట్లు వీపీ సింగ్ సమాధాన మిచ్చారు. దీంతో నేను సంభాషణను ముగించాల్సి వచ్చింది. మరుసటి రోజు తన కార్యాలయానికి రావలసిందిగా వీపీ సింగ్ కబురంపారు. నేను వెళ్లాను. దేవీలాల్ గురించి చర్చించుకున్నాము. నన్ను విశ్వాసంలోకి తీసుకోవాలని వీపీ సింగ్ భావించారు. అలాగైతేనే నేను దేవీలాల్తో జతకట్టబోనని ఆయన భావించారు. దేవీలాల్ పక్షంలో నేను చేరినట్లయితే ప్రధానమంత్రిగా తాను ఎక్కువ కాలం కొనసాగలేనని వీపీ సింగ్ భావిస్తున్నారని దీనర్థం. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న నేను మండల్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేస్తున్నట్లు ప్రకటించాలని వీపీ సింగ్ను కోరాను. ఆయన 1990 ఆగస్టు 15న దీనిపై ప్రకటన వెలువరించడానికి మొదట అంగీకరించారు. కానీ ఆగస్టు 9వ తేదీనే ఆయన దాన్ని ప్రకటించాల్సి వచ్చింది. అలా ప్రకటించకపోయి ఉంటే నేను ఢిల్లీలో జరగనున్న దేవీ లాల్ ర్యాలీలో చేరడం తప్ప మరొక అవకాశం నాకు ఉండేది కాదు. మండల్ సిఫార్సులను అమలు చేస్తే అవి సమానతా సమాజాన్ని విశ్వసించి, దానికోసం కలగన్న అంబేడ్కర్, కర్పూరీ ఠాకూర్, లోహియా, జయప్రకాష్ నారాయణ్ స్వప్నాలు సాకారమవుతాయని నేను భావించాను. 1990 ఆగస్టు 6న వీపీ సింగ్ నివాసంలో సాయంత్రం 6 గంటలకు క్యాబినెట్ సమావేశం జరిగింది. మండల్ కమిషన్ సిఫార్సుల అమలు ఈ సమావేశ ప్రధాన ఎజెండా. సన్ని హితులు హెచ్చరిస్తున్నప్పటికీ, ఆ మరుసటి రోజు అంటే 1990 ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు కల్పిస్తూ మండల్ కమిషన్ చేసిన రికమంండేషన్ను అమలు చేస్తామని ప్రకటించింది. చివరకు 1990 ఆగస్టు 13న ఓబీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. ఆగస్టు 10 నుంచే ఆధిపత్య కులాలు రిజర్వేషన్కి వ్యతిరేకంగా నిర సనలు ప్రారంభించాయి. నెలరోజుల పాటు విద్యార్థులు, బ్యూరోక్రాట్లు, టీచర్లు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యతిరేక నిర సనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. రహదారులు దిగ్బంధనకు గురయ్యాయి.’’ – ‘ది శూద్రాస్– విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ అనే పుస్తకం నుంచి. అయితే, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసేలా వీపీ సింగ్ ప్రభుత్వాన్ని ప్రేరేపించడంలో; వీధుల్లో మండల్ అనుకూల, వ్యతిరేక పోరాటాలను రగుల్కొల్పడంలో నాటి యువ శరద్ యాదవ్ తగిన పాత్ర పోషించకపోయి ఉంటే, భారతీయ శూద్ర/ఓబీసీలు ఈ రోజు దేశంలో ఈ స్థాయికి చేరుకుని ఉండేవారు కాదు. ఆర్ఎస్ఎస్/బీజేపీ శక్తులను నియంత్రిస్తున్న ద్విజులు మండల్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఆనాడు శూద్ర/ఓబీసీలు భారీ స్థాయిలో మండల్ అనుకూల సామాజిక సమీకరణకు పూనుకోకపోయి ఉంటే, నేడు ఓబీసీలు తమకు నాయకత్వం వహించి, నరేంద్రమోడీ భారత ప్రధాని కావ డానికి ద్విజులు అమోదించి ఉండేవారు కాదు. చివరగా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ శూద్ర/ఓబీసీ నేతలు నేటి తమ రాజకీయ ప్రతిపత్తికి గాను శరద్ యాదవ్ అనే గొప్ప పోరాటకారుడికి ఎప్పటికీ రుణపడి ఉంటారు. - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మోదీ చేసిన అప్పు 100 లక్షల కోట్లు.. బీఆర్ఎస్ సర్కారు అప్పు ఎంతంతే?
ఇండియన్ ‘లోన్’ మోదీకి ముందున్న 14 మంది ప్రధానులు చేసిన అప్పు రూ. 56 లక్షల కోట్లయితే, మోదీ ఎనిమిదిన్నరేళ్లలో రూ. 100 లక్షల కోట్లు అప్పు చేశారు. పుట్టబోయే ప్రతి బిడ్డపై 1.25 లక్షల రూపాయల రుణభారం మోపారు. – కేటీఆర్ కామెంట్ ....... కౌంటర్.. ‘స్టేట్’మెంట్ తెలంగాణ అప్పు రూ. 3.12 లక్షల కోట్లయ్యింది. రెండేళ్లలోనే బీఆర్ఎస్ సర్కారు రూ. 87 వేల కోట్ల అప్పును చేసింది. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. మన పిల్లలకు అప్పు మిగులుస్తున్నారు. సరాసరి తలసరి రూ. 94 వేల అప్పును మోపుతున్నారు – బండి సంజయ్, కిషన్రెడ్డి విమర్శలు ....... అప్పుల ‘మధ్య’తరగతి.. ‘‘కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చేమోగానీ, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం..’’ అంటారు. కళ్ల తడి కామన్ కానీ, ఈ రోజుల్లో అసలు అప్పు చేయకుండా జీవితం దాటనేలేం. కుటుంబాలన్నీ అప్పుల కుప్పలే. ‘ఈఎంఐ’.. అని రుణాల పేరు పోష్గా మారిందంతే. వాయిదాల్లేకుండా బతికేదెవ్వరు.. ఇంటికి, బండికి, చదువుకు, పెళ్లికి.. చిట్లు.. ఒక్కటేమిటి ముఖ్యంగా మధ్యతరగతి బతుకంటేనే అప్పులు కదా...! చిన్నప్పుడు ‘తీసివేతలు’ నేర్పుతున్నప్పుడు లెక్కల మాస్టారు ‘ఒకటి అప్పు తీసుకోరా ..’ అని ఎప్పటి నుంచి చెప్పారో, అప్పటినుంచి బతుకు లెక్కంతా అప్పులే. రుణాలు తీసుకుంటూనే ఉన్నాం. వడ్డీలు, కిస్తులు కడుతూనే ఉన్నాం. అప్పూ గొప్పే... రిచ్ క్లాస్లో ఇదేం నామోషీ కాదు. అంబానీ నుంచి అదానీ దాకా అపరకుబేరులైనా అప్పు చేయా ల్సిందే. నిజానికి ఇలాంటి వారికే ఎక్కువ అప్పు లిస్తారు కూడా. ఈ రేంజ్లో ఉన్న వారికి రెడ్ కార్పెట్ వేసి అప్పులిచ్చి గౌరవించడం, ఎగ్గొడితే ఫ్లయిట్లలో విదేశాలకు పంపడం కూడా మనకు తెలిసిందే కదా.. అప్పుకు మారుపేరైన.. ‘ఈఎంఐ’ల్లో పుట్టి (హాస్పిటల్ చార్జీలు కూడా ఈఎంఐలో కట్టేంతగా ఉంటాయి), ఈఎంఐల్లో పెరిగి, ఈఎంఐలతో చదువుకుని, ఈఎంఐల్లో పోవడమే మధ్య, పేద తరగతి జీవితం. కానీ, అప్పుల్లోనూ అంత ఖదర్గా బతికే బిజినెస్, రిచ్ క్లాసూ ఉంది. రుణ.. పురాణం నిజానికి ఈ అప్పు లొల్లి, అప్పుల్లోనూ పేద ధనిక తారతమ్యం పురాణాల కాలం నుంచీ ఉన్నట్టుంది. బూడిద పూసుకుని, కనీసం ఒంటిపై బ్రాండెడ్ బట్టల్లేకుండా పులి చర్మాలు, నారచీరలు ధరించి శ్మశానాల్లో తిరుగుతూ ఉండే ‘శంకరుడి’కి కుబేరు డెప్పుడయినా లోన్ ఆఫర్ చేసిన సందర్భాలు కనిపిస్తాయా..? గడ్డ కట్టుకు పోయే చలిలో హిమాలయాల్లో నివసించే శివుడు కనీసం ‘హోమ్లోన్’కు అప్లయి చేసుకున్న దాఖలాలూ లేవు. యుగాల తరబడి అదే నందీశ్వరుడిని యూజ్ చేశాడే కానీ, ఎవరైనా శివుడికి ‘వెహికల్ లోన్’ అరేంజ్ చేశారా..? పుష్పక విమానంలో తిరిగే కుబేరుడు ఆఫర్ చేశాడా.. ఎందుకంటే ఆయన పేద దేవుడు. పైగా ఎవరేం అడిగినా ఇచ్చేసే భోళా శంకరుడాయే.. ‘కొల్లాటరల్ సెక్యూరిటీ’ చూపే శక్తి లేదు. ప్రధానుల, ముఖ్యమంత్రుల రికమండేషన్ కూడా లేనట్టుంది. ... ఇప్పటి మన రైతులు, పేదోళ్ల పరిస్థితిలాగా! అదే, విష్ణుమూర్తిని చూడండి. ఆయన మ్యారేజీకి కుబేరుడు ఎంత డబ్బిచ్చాడు! తిరుపతి వెంకన్నఇంకా కిస్తులు కడుతూనే ఉన్నాడు. ఆయనకు ఆ అప్పెలా వచ్చింది. ఆ అప్పు ఎందుకు తప్పు కాలేదు..? ఎందుకంటే ఆయన బాగా రిచ్చి. స్వయంగా లక్ష్మీదేవియే అర్ధాంగి. దేవుళ్లలో బాగా పలుకుబడి ఉన్నవాడు. ఘనంగా అల వైకుంఠపురంలో ఆ మూల సౌధాల్లో నివసిస్తాడు. పెద్దోళ్లందరికీ కావలసినవాడు. ఇంకేం ఎంతైనా అప్పు పుట్టుద్ది... మన రిచ్ పీపుల్ లాగా. – ఇక మన ఆర్థిక మంత్రి సీతారామన్ లాంటి వాళ్లెవరైనా ఉంటే దేవుళ్లలో ఇప్పటికే వెంకన్న రుణం అంతా ‘రైటాఫ్ ’ అయిపోయేది. అప్పు.. సంపన్నం ఇది చూడండి.. మనం ఆరాధనగా చూసే అమెరికా, సింగపూర్ తలసరి అప్పులు ఎక్కువే. అక్కడ సింగపూర్లో ఒక్కొక్కరిపై 97.46 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి. జపాన్, కెనడా, బెల్జియం వంటి సంపన్న దేశాల వారి తలసరి అప్పులు ఎక్కువ. రిచ్నెస్ అలా ఉంటది మరి. అప్పుల్లోనూ.. పూర్ ఆఫ్గానిస్థాన్ , డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బురుండి, మడగాస్కర్, లైబీరియా వంటి చిన్న దేశాల్లో తలసరి అప్పు తక్కువే. విదేశాల నుంచి అప్పులు దొరకడం కష్టం. ఆదాయమే సరిగ్గా లేని వాళ్లకు అప్పులెలా ఇస్తారు.. అదీ సంగతి ....... .. ఇంతకీ బీఆర్ఎస్కైనా, బీజేపీకైనా చెప్పొచ్చేదేమంటే.. ఎంత అప్పుంటే అంత దర్జా.. ఎంత దర్జా ఉంటే అంత అప్పు... కనుక ‘పక్కోడు చేసే అప్పులు..’ పెరుగుతున్నాయని చింతించవలదు. డబ్బున్నోడికి అప్పు ఈజీ కదా.. అంటే అప్పుంటే డబ్బు, దర్పం ఉన్నట్టే కదా! అంటే మనం బాగానే ఉన్నాం అనుకుంటే సరి. ....... కానీ, ‘...మన మీద పడే అప్పులపై ’ చింతించే మిడిల్ క్లాస్ ఒకటి ఉందండోయ్.. ‘ఇప్పటికే ఏళ్ల తరబడి ఇంటి లోన్ కడుతున్నాను, ఈ మధ్యే పిల్లాణ్ణి స్కూల్లో వేయడానికి ఓ లక్ష అప్పు చేశాను, కరోనా మింగిన నాలుగు లక్షల తాలూకు అప్పు, వడ్డీ అలాగే ఉన్నాయి. రెండో అమ్మాయి స్కూల్లో చేరడానికి రెడీ అవుతోంది. ఈ ఖర్చులిలా ఉండగా మన ‘డబుల్ ఇంజన్ సర్కార్లు’ వాళ్లు చేసిన అప్పులన్నీ మనతోనే కట్టిస్తారు.. వాళ్ల జేబు లోంచి కట్టరుగా... అని మా ఆవిడ భయంగా అడుగుతోంది..’ – కేటీఆర్, సంజయ్ ΄పోటా పోటీ ‘అప్పుల’ విమర్శలు చూసి ఓ నెటిజన్ పోస్టు ఇది. ఆలోచించదగ్గ ఆందోళనే. అక్కడిదాకా రాకుండా చూడండి. ఇప్పటికే అప్పులు కట్టలేక చస్తున్నాం. (క్లిక్ చేయండి: బయటపడిన అమెరికా డొల్లతనం) -
అనారోగ్య అగ్రరాజ్యం.. బయటపడిన అమెరికా డొల్లతనం
అమెరికా అనగానే మనలో చాలామంది పులకించిపోతారు. అది అకారణమైనా సకారణమైనా అగ్ర రాజ్యాన్ని బలంగా నమ్ముతారు. అందుకు కొన్ని సత్యాలు, కొన్ని అర్ధసత్యాలు, మరిన్ని అసత్యాలు కారణం కావచ్చు. అలాంటి దేశాన్ని ‘అనారోగ్య దేశం’ అనటం నమ్మశక్యం కాదు. అంతగా దాని ప్రతిష్ఠ నెలకొని ఉంది. అయితే అక్కడ కొన్ని అంశాల్లో ప్రగతి తక్కువేమీ కాదు. వాటిలో జీవన ప్రమాణాలు పెరగడం, ఎక్కువ మందికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం, పొగత్రాగడం తగ్గటం, వివాహపూర్వ గర్భిణీలు తగ్గడం, జాతుల మధ్య వివక్ష అంతరాలు తగ్గడం లాంటివి ముఖ్యమైనవి. వీటిని పరిశీలించినప్పుడు సాధారణంగా ఆశావహ అంచనాతో అమెరికా అన్ని విధాలా ఆరోగ్యకరమైన దిశగా పయనిస్తోంది అనుకుంటాము. కానీ గత రెండు దశాబ్దాల పరిణామాలను నిశితంగా గమనిస్తే వీటిలో వాస్తవం ఉన్నట్లు కనిపించదు. కోవిడ్–19 నేపథ్యంలో బయటపడిన అమెరికా డొల్లతనం, ఇటీవలి ‘వాల్స్ట్రీట్ జర్నల్’ లోని గణాంక వివరాలు ఇందుకు తార్కాణం. అమెరికాలో శిశుమరణాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. 2019లో కోవిడ్–19 ముందు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో– ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) దేశాల్లో అమెరికా స్థానం చాలా దేశాల కన్నా ఈ విషయంలో అథమ స్థితిలో ఉంది. అమెరికన్ల జీవన ప్రమాణం జర్మనీ కన్నా 2.5 ఏళ్లు, కెనడా కన్నా 3.2 ఏళ్లు, ఫ్రాన్స్ కన్నా నాలుగు సంవత్సరాలు తక్కువగా ఉంది. యూరో పియన్ యూనియన్, ఆసియాకు చెందిన ఓఈసీడీ దేశాల్లోకన్నా తక్కువగా... 33వ స్థానంలో ఉంది. కోవిడ్ మృత్యుహేల అమెరికాలోని పరిస్థితులను మరింత దిగజార్చింది. కోవిడ్ మరణాలు అన్ని సంపన్న దేశాల్లో కన్నా అక్కడ ఎక్కువగా నమోద య్యాయి. అమెరికాలో ప్రతి లక్ష మందికి 332 మరణాలు సంభవించగా ఫ్రాన్స్లో ఇవి 240, జర్మనీలో 194, కెనడాలో 128. అలాగే అమెరికాలో జీవన ప్రమాణం 2021లో 76.4కి పడిపోయింది. ఇది 1996 తర్వాత అతి తక్కువ. దీనితో అక్కడ ఓ పాతిక సంవత్సరాల ప్రగతి తుడిచిపెట్టుకు పోయినట్లయింది. ఇదే సమయంలో అక్కడ మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుదల మరో రకపు ప్రతికూలత సూచిస్తోంది. అక్కడి పౌర సమాజంలో అధిక సంఖ్యాకులలో గల ఊబకాయం అనేక రకాల రుగ్మతలకు కారణంగా పరిగణిస్తున్నారు. జీవన ప్రమాణాలు ఉండవలసిన స్థాయిలో ఉండకపోవడానికి ఇదొక కారణంగా పేర్కొంటున్నారు. 2000 నుండి 2020 సంవత్సరం వరకూ ఊబకాయులు 30.5 శాతం నుండి 41.9 శాతానికి పెరిగారు. ఊబకాయం అనేక వ్యాధులకు కారకం. వాటిలో ముఖ్యమైనది చక్కెర వ్యాధి. మొత్తంగా అమెరికాలోని ఈ పరిస్థితులను గమనించినప్పుడు... అక్కడి గొప్పదైన సంపద, వైద్య సాంకేతికత, అత్యంత ఎక్కువ ఆరోగ్య సంరక్షణ తలసరి వ్యయం, ప్రజారోగ్య వ్యవస్థ వంటి సమస్తం సంక్షోభంలో ఉండి అత్యంత పేలవంగా పనితీరు కనపరుస్తూ ఉన్నట్లు స్పష్టమౌతుంది. మెరిసేదంతా బంగారం కాదనే నానుడిని అమెరికా ప్రస్తుత పరిస్థితి నిరూపిస్తోంది. (క్లిక్ చేయండి: జీవ వైవిధ్యం రక్షణ లక్ష్యాలు నెరవేరేనా?) – బి. లలితానంద ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ -
ఎం.కె. స్టాలిన్ (తమిళనాడు సీఎం) రాయని డైరీ
మనిషిని చూస్తే శుభ్రంగా ఉన్నాడు. సంప్ర దాయంగా ఉన్నాడు. ధోతీ–చొక్కా ధరించి ఉన్నాడు. శ్రీమతితో కలిసి నడుస్తున్నాడు! ‘‘ఈయన రవి కదా, మన తమిళనాడు గవర్నర్!’’ అన్నాను... ఫొటోలో అలా శుభ్రంగా, సంప్రదాయంగా, ధోతీ–చొక్కా ధరించి, శ్రీమతితో కలిసి నడుస్తున్న వ్యక్తిని రఘుపతికి చూపిస్తూ. ‘‘ఆమా తలైవా. అలాగే అనిపిస్తోంది..’’ అన్నారు రఘుపతి. ఆయన ‘లా’ మినిస్టర్. ‘‘అనిపించడం కాదు, కనిపిస్తున్నది ఆయనే’’ అని నవ్వారు పెరియస్వామి. ఆయన రూర ల్ మినిస్టర్. ఆయన చేతిలో మరికొన్ని ఫొటోలు ఉన్నాయి. ఆ ఫొటోల్లో కూడా రవి శుభ్రంగా, సంప్రదాయంగా ఉన్నారు. రాజ్భవన్ పొంగల్ ఈవెంట్కు వచ్చిన వారందరినీ వారి దగ్గరకు వెళ్లి మరీ ఆత్మీయంగా పలకరిస్తున్నారు. పొంగల్ శుభాకాంక్షలు చెబుతున్నారు. నీలగిరి ట్రైబల్స్ కొందరు ఎంపికగా తెంపుకొచ్చి, గుత్తిగా ముడి వేసి తెచ్చిన కొండపూల బొకేను అపురూపంగా స్వీకరిస్తున్నారు. కేరళ నుంచి వచ్చిన బ్రాహ్మణులు పూజలు నిర్వహించి ఇచ్చిన ‘పరివట్టమ్’ను భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా తన తలకు చుట్టుకుంటున్నారు. ఆ ఫొటోలను పెరియస్వామికి తిరిగి ఇచ్చేస్తూ... ‘‘ఇంత శుభ్రమైన, సంప్రదాయ బద్ధమైన మనిషి మొన్న అసెంబ్లీలో అలా ఎందుకు బిహేవ్ చేశారంటారూ!!’’ అన్నాను. రఘుపతి, పెరియస్వామి మాట్లాడలేదు. ఆ ప్రశ్న అందరిలోనూ ఉంది. సమాధానం గవర్నర్ రవి మాత్రమే చెప్పగలిగింది. రవికి, తమిళనాడుకు సంబంధమే లేదు. బిహార్ అతడి రాష్ట్రం. కేరళ అతడి క్యాడర్. ఢిల్లీ అతడి వర్క్ప్లేస్. మేఘాలయకు, నాగాలాండ్కు గవర్నర్గా ఉన్నారు. అలాగే ఇప్పుడు తమిళనాడుకు. మేఘాలయకు గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన మేఘాలయను మేఘాలయ అనే అన్నారు. నాగాలాండ్కు గవర్నర్గా ఉన్నప్పుడు నాగాలాండ్ను నాగాలాండ్ అనే అన్నారు. తమిళనాడును మాత్రం తమిళనాడు అనడం లేదు. ‘తమిళగం’ అంటున్నారు. బయటా అదే మాట. అసెంబ్లీలోనూ అదే మాట! తమిళనాడు అంటే ‘తమిళభూమి’ అనే అర్థం వస్తుంది కనుక.. అప్పుడది భరత భూమికి సంబంధం లేని స్వతంత్ర దేశంగా అనిపించే ప్రమాదం ఉంది కనుక.. తమిళ నాడును ‘తమిళుల ప్రాంతం’ అనే అర్థం వచ్చేలా ‘తమిళగం’ అనడమే కరెక్ట్ అని తను గవర్నర్గా వచ్చినప్పటి నుంచీ రవి అంటూనే ఉన్నారు. కాన్స్టిట్యూషన్ని రవి కాస్త ఎక్కువగా చదివినట్లున్నారు. ఎక్కువ చదివితే ముఖ్యమైనవి కొన్ని తక్కువగా అనిపిస్తాయి. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలలో గవర్నర్ తల దూర్చకూడదని, వేలు పెట్టకూడదని, కాలు దువ్వకూడదని ఆర్టికల్ 163 (1) లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన అసెంబ్లీ ప్రసంగంలోంచి మహనీయులు పెరియార్ని, అంబేద్కర్ని, కామరాజ్ని అన్నాదురైని తొలగించి, తమిళనాడుకు బదులు తమిళగంను చేర్చి, అలా ఎలా చేస్తారని ప్రశ్నించినందుకు వాకౌట్ చేసి.. గవర్నర్ రవి ఎవరి ఔన్నత్యాన్ని నిలబెట్టినట్లు! రాజ్యాంగానిదా, రాజ్భవన్దా? రాజ్యాంగ నియమాలను శిరసావహించని ఈ పెద్దమనిషేనా ఇప్పుడు పొంగల్ సంప్రదాయాలను గౌరవిస్తూ కనిపిస్తున్నది!! ‘‘ఫొటోలు మనకెందుకు పంపారట?’’ అని పెరియస్వామిని అడిగాను. ‘‘పొంగల్ ఈవెంట్కి పిలిచినా మనం వెళ్లలేదని పొంగల్ ఈవెంట్నే మనకు పంపారు’’ అన్నారు నవ్వుతూ పెరియస్వామి. ఆ నవ్వుకు ఆయన చేతిలోంచి ఒక ఫొటో జారి కింద పడింది. ‘హ్యాపీ పొంగల్ – ఇట్లు మీ ప్రియమైన రవి’.. అని ఆ ఫొటో వెనుక రాసి ఉంది! -మాధవ్ శింగరాజు -
ధర్మాన మాటల్ని వక్రీకరించి.. సోషల్ మీడియాలో గోల..
ఇన్నాళ్లకొకరు (ధర్మాన ప్రసాదరావు) ఉత్తరాంధ్ర వివక్ష మీద గొంతు విప్పి మాటాడేరు. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటు చేయకుంటే కనీసం మా ఉత్తరాంధ్ర ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. అలా అయితే ఉత్తరాంధ్రకు గల సహజవనరుల సాయంతో, ఆర్థిక కేటాయింపులతో, పాలనా ఏర్పాటుతో... ఏ నగరానికీ లేని ఓడరేవు, విమానాశ్రయం; భారీ, మధ్యతరగతి పరిశ్రమలతో మహానగరంగా ఎదగాల్సిన విశాఖను రాజధానిగా చేసి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తామని రాజకీయ ప్రకటన చేశారు. విశాఖను పాలనా రాజధాని చేయాలన్నదే ప్రసాదరావు కోరుకునేది. అది మరింత బలంగా విన్పించడానికి విశాఖను పాలనా రాజధానిగా చేయకపోతే, కనీసం ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలనన్నారు తప్పా ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలనేమీ అనలేదు. అయినా ప్రసాదరావు మాటల్ని వక్రీకరించి, ఒక్కదాన్నే పట్టుకొని సోషల్ మీడియాలో గోల చేస్తున్నారు. నిజానికి ప్రసాదరావు ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలని డిమాండ్ చేస్తే బాగుండేది. అయినా, ఈ సందర్భంలో ప్రసాదరావు ఆమాత్రం అనడం ఘనతే! ఇప్పటిదాకా ఇలాంటి ప్రకటనలు ఉత్తరాంధ్ర పౌరసమాజం నుండి అరాకొరా (కె.ఎస్.చలం, నల్లి ధర్మారావు, అట్టాడ అప్పల్నాయుడు తది తరులు) వచ్చేయి తప్పా రాజకీయశక్తుల నుంచి రాలేదు. పాలకవర్గ పార్టీల నుంచీ రాలేదు, కమ్యూనిస్టు, విప్లవకారుల నుంచీ రాలేదు. చాలా ఆశ్చర్యంగా ధర్మాన ప్రసాదరావు ప్రకటనపై విచ్చిన్నకారుడు, సమైక్య వ్యతిరేకి వంటి వ్యక్తిగత దాడి మాత్రమే కాక ప్రసాదరావు రాజకీయ ప్రయాణాన్నీ, ఆ ప్రయాణంలో ఉత్తరాంధ్రకు అతను చేసినదేమిటీ, ఇపుడెందుకిలా ప్రకటించాడంటూ... ఉత్తరాంధ్రేతరులే కాక ఉత్తరాంధ్రులూ ప్రశ్నిస్తున్నారు. విచిత్రంగా ఒక్క నల్లి ధర్మారావు తప్పా, ఉత్తరాంధ్ర గురించి తొలినాడు గొంతు విప్పిన కె.ఎస్. చలం గానీ ఇంకెవరుగానీ ఇపుడేమీ మాటాడడం లేదు. స్పందనా రాహిత్యం ఉత్తరాంధ్ర స్వభావంలోకి ఇంకిపోయినట్టుంది. తొలి తరం రచయితలు తప్పా వర్తమాన రచయితలెవరికీ ఉత్తరాంధ్ర జీవన సంక్షోభానికి కారణమయిన రాజకీయార్థిక విషయాలమీద అవగాహనా లేదు, ఆసక్తీ లేదు. అణు విద్యుత్ వ్యతిరేక పోరాటం, నిర్వాసితుల పోరాటాలు, విశాఖ ఉక్కు కర్మాగార కార్మిక పోరాటం వంటివాటిని వీరు సాహిత్యీకరించలేదు. అటు రచయితలుగానీ, ఇటు మేధావులుగానీ ఉత్తరాంధ్ర వివక్షమీద ప్రాంతీయవాద దృష్టితో స్పందించటం లేదు. విశాఖలో స్థిరపడిన (వ్యాపారాలు, ఉద్యోగాలు, రాజకీయాలు చేసి) వారు ఉత్తరాంధ్ర గురించి వ్యాఖ్యానిస్తుంటారు, ఉత్తరాంధ్రుల తరఫున బాధ్యత తీసుకుంటారు. రాజకీయాల్లో, సాహిత్య, సాంస్కృతికాంశాల్లో ఉత్తరాంధ్రపై వివక్ష చూపి, ‘వెనక బడిన జిల్లా’ అనే టాగ్ తగిలించి సానుభూతి చూపుతారు ఉత్తరాంధ్రేతరులు. పాతిక లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా ఎనిమిదిలక్షల ఎకరాలకు మాత్రమే ఇప్పటికీ సాగునీరు అందుతోంది. నాగావళి, వంశధార వంటి పద్దెనిమిది నదులూ, అధిక వర్షపాతం వల్ల అయిదువందల టీఎంసీల నీరు లభ్యమవుతున్నా... సాగునీరందించే ప్రాజెక్టులు పూర్తికాక పోవటంతో నీళ్లన్నీ సముద్రం పాలవుతోన్నవి. వ్యవసాయాధార పరిశ్రమలు లేక, ఉన్నవి మూత పడి ఇటు రైతులూ, అటు కార్మికులూ నష్ట పోతున్నారు. ఉపాధుల్లేక ఏటా ఏభయి వేలమంది ఇక్కడినుంచి వలసలు పోతున్నారు. వలసల నివారణకుగానీ, వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకుగానీ, విశాఖ వంటి నగరంలోని పరిశ్రమలను అభివృద్ధి చేయడానికిగానీ ప్రత్యేక రాజకీయ నిర్ణయాలు, ఆర్థిక కేటాయింపులూ, అధికార యంత్రాంగమూ ఉండాలి. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు ఒనగూరలేదు. ప్రత్యేక రాష్ట్ర మయితే ఒనగూరే అవకాశాలుంటాయి, ఒనగూరకపోతే కనీసం వీటికోసం తమదయిన ప్రాంతంలో ప్రజలు ఉద్యమించగలరు. పాలనా యంత్రాంగాన్ని ప్రభావితం చేయగలరు. సమగ్ర ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రమనేది ఉపకరిస్తుందే తప్పా నష్టపెట్టదు. గనక ధర్మాన ప్రసాదరావేమీ విచ్చిన్నకారుడు కాడు, వారి ప్రకటనేమీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ క్రీడలో భాగం కాదు. ఉత్తరాంధ్రుల లోలోపలి భావాన్నే ప్రసాదరావు పలికేరు. ఇపుడు కాకపోతే మరొకప్పుడయినా ఉత్తరాంధ్ర తన లోలోపలి ఆకాంక్షను కోటిగొంతులతో బహిరంగ పరచగలదు! (క్లిక్ చేయండి: అనూహ్య వ్యూహం ‘గృహ సారథి’) – వంశధార సూరి, శ్రీకాకుళం -
రాజకీయ సంక్రాంతి.. యథా లీడర్ తథా క్యాడర్
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కోని బొందల గడ్డ దిక్కు బోయిండు. రొండంత్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. ఆకలైతున్నా బేతాలునికి వొండుకోబుద్ది గాలేదు. నాబి కాడ సల్ల బడితె నవాబ్ కైన జవాబ్ జెప్పొచ్చు అనుకోని ఆన్లైన్ల చికెన్ బిర్యాని దెప్పిచ్చుకుండు. తిన్నంక కతల వయ్యి సద్వుకుంట గూసున్నడు. సరింగ నాత్రి ఒకటి గొట్టంగ, విక్రమార్కుడు హారన్ గొట్టిండు. బేతాలు డింట్ల కెల్లి ఇవుతలి కొచ్చిండు. మోటరెన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. ఎప్పటి లెక్కనే విక్రమార్కుడు మోటర్ నడ్పలేదు. ఎన్కకు దిర్గి సకినాలు, నూల ముద్దలు ఇచ్చిండు. ‘‘గియెందుకిస్తున్నవ్?’’ అని బేతాలుడు అడిగిండు. ‘‘సంక్రాతి పండ్గని.’’ ‘‘లీడర్లు బిర్యాని పొట్లాలు ఇచ్చిన తీర్గ ప్రేమతోని నువ్వు గివ్వి నాకిచ్చినందుకు శెనార్తిలు. ఏం పండ్గనో ఏమో! ఒక్క దినం ఏసంకు మూతి మీసం గొర్గిచ్చుకును డెందుకో! అన్ని పండ్గలేమొ గని సంక్రాతి పండ్గకు అందరు సంత ఊర్లకు బోవాలనుకుంటరు. మోకేకా ఫాయిదా ఉటాయించి బస్సు చార్జిలు డబల్, త్రిబల్ జేస్తరు. రేల్ గాడిలల్ల నిలబడెతంద్కు గూడ జాగ దొర్కదు. భారత్ జోడో అన్కుంట రాహుల్ గాంది పాద యాత్ర జేస్తున్నడు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, బీహార్ ముక్యమంత్రి నితీశ్ కుమారే గాకుంట యువగళం పేరు మీద లోకేశ్ గుడ్క పాదయాత్రలు జేస్తమంటున్నరు. గాల్ల తీర్గనే పాదయాత్ర జేస్కుంట పండ్గకు ఊర్లకు బోతె బాగుంటదని జెన మనుకుంటున్నరు. యథా లీడర్ తథా క్యాడర్.’’ ‘‘ముగ్గుల సంగతేంది?’’ ‘‘కిసాన్ సర్కార్ అన్కుంట బీఆర్ఎస్, రామరాజ్జెమన్కుంట బీజేపీ, ఇందిరమ్మ సర్కార్ అన్కుంట కాంగ్రెస్ జెనంను ముగ్గుల దించెతంద్కు ఒక్క తీర్గ కోషిస్ జెయ్యబట్టినయి.’’ ‘‘పతంగులెక్కిస్తున్నరా?’’ ‘‘ఫాంహౌస్ల సుతాయించిన మాంజతోని బీఆర్ఎస్ పతంగు లెక్కిస్తున్నది. ఈడీ, సీబీఐ మాంజతోని బీజేపీ పతంగులెక్కిస్తున్నది. సర్పంచుల మాంజ సుతాయించి కాంగ్రెస్ పతంగులెక్కి స్తున్నది. మేడినిండియా మాంజ అనుకుంటనే చైన మాంజతోని బీజేపీ పతంగులెక్కిస్తున్నదని అను కుంట ఆల్ పిరీ మాంజతోని ఆప్ పతంగులెక్కి స్తున్నది. సీపీఐ, సీపీఎం తోక పతంగులు ఎక్కిస్తున్నయి. బీఆర్ఎస్, బీజేపీ పతంగుల నడ్మనే పేంచి నడుస్తున్నది’’ అని బేతాలుడన్నడు. ‘‘రాజకీయ బోగి మంటలు గిన ఉన్నయా?’’ ‘‘ఎందుకు లెవ్వు. లీడర్లు దినాం జెనంల మంటలు బెడ్తున్నరు. గీ నెలల కమ్మంల బీఆర్ఎస్ లచ్చల మందిల మంట బెడ్తది. బీజేపీ గుడ్క గిదే నెలల లష్కర్ల లచ్చల మందితోని మంటలు షురువు జేస్తనని జెప్పింది. జన సేన, టీడీపీ గల్సి ఆంద్రల మాటల మంటలు బుట్టిస్తమంటున్నయి. అమెరికల డల్లాస్ల గుడ్క తెలుగోల్ల నడ్మ కులం, రాజకీయ మంటలు లేసినయి.’’ ‘‘రాజకీయ కోడి పందాల సంగతేంది?’’ ‘‘సంక్రాంతనంగనే కోడి పందాలే యాదికొ స్తయి. కోల్ల కాల్లకు చిన్న కత్తులు గట్టి దంగల కిడుస్తరు. గవ్వి ఒక్క తీర్గ ఫైటింగ్ జేస్తయి. గా కోల్ల మీద కోట్ల రూపాయలు బిట్టు గడ్తరు. గీ నడ్మ ఆన్లైన్ కోడి పందాలు షురువు జేసిండ్రు. గివ్వి యాడాదంత నడుస్తనే ఉంటాయి. లీడర్ల నడ్మ దినాం తిట్ల పందా లుంటయి. గీ రాజకీయ కోల్ల నాల్కలే కత్తులు. అసల్ కోడి పందాలల్ల రెండు కోల్లు ఉంటె ఒకటి సస్తది. రాజకీయ కోల్ల పందాలల్ల ఒక కోడి ఓడి పోతె ఇంకొక కోడి గెలుస్తది. గియ్యాల ఓడిన కోడి రేపు గెల్సినా గెలుస్తది. సంక్రాతి దినాలల్ల నోములు జేసేటి ఆడోల్లు వాడకట్టుల సకినాలు, నూల ముద్దలు బంచుతరు. కుర్సి నోములు జేసేటి లీడర్లు కొత్త కొత్త పద్కాలు బెట్టి జెనంకు రూపాయలు బంచుతరు. నిండ ముంచుతరు.’’ ‘‘వహవ్వా, ఏం చెప్పినవ్ బేతాలా!’’ ‘‘గది గంట్లుండ నియ్యి. ఉప్పరిపల్లి మూసీ నది ఒడ్డుకు మొసల్లు ఎందుకొచ్చినయి. గీ సవాల్కు జవాబ్ ఎర్కుండి గూడ జెప్పకుంటివా అంటె నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతా లుడన్నడు. ‘‘బేతాలా! సంక్రాతిని మకర సంక్రాంతంటరు. మకరము అంటె మొసలి. రాజకీయ మొసల్లు ఎట్లున్నయో అర్సుకునేతంద్కు పండ్గ నాడు అసలు మొసల్లు మూసీ నది ఒడ్డుకొచ్చినయి’’ అని విక్రమార్కుడు జెప్పిండు. చౌరస్తల రెడ్ సిగ్నల్ బడ్డది. మోటరాగింది. ఎన్క తలుపు దీస్కోని కిందికి దిగిన బేతాలుడు బొందలగడ్డ దిక్కు ఉర్కిండు. (క్లిక్ చేయండి: తమ్ముండ్లూ రాండ్రి! గాలిగొట్టి పోండ్రి!) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
అంబేడ్కర్ అనంతర భారతం ఇదేనా?
దేశ రాజకీయాలను ప్రభావితం చేసే చారిత్రాత్మక వేదికగా ఖమ్మం సిద్ధమైంది. ఒకనాడు ఎర్రకొండగా ఉన్న స్తంభాద్రి ఇప్పుడు ఎర్రకోటపై ప్రజల అజెండాను ఎగుర వేసే ఒక మహాశక్తికి శంఖారావ క్షేత్రం అవుతోంది. బీఆర్ఎస్ ఒక మహోన్నత సమాజ నిర్మాణం వైపు అడుగులు వేస్తూ సృజనాత్మక మార్పుకు నడుంబిగించే సభకు ఖమ్మం గుమ్మం స్వాగతం పలుకుతోంది. దేశం అన్ని రంగాల్లో దివాళా తీసింది. ఎంతో స్ఫూర్తితో నిర్మించుకున్న ప్రభుత్వ రంగం కొడిగట్టే దీపమవుతోంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతున్న తరుణంలో ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ గొంతు విప్పబోతుంది. ఎమర్జెన్సీ తర్వాత అన్ని ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడటంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు కదిలిన లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ వెంట దేశం నడిచింది. ఆనాడు ప్రజాస్వామ్య పరిరక్షణకు లెఫ్ట్, రైట్లందరూ కలిసి నడిచారు. ఇవ్వాళ కూడా కేంద్రంలో పెద్దలు రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తీరును చాటిచెబుతూ దేశంలోని ప్రజాస్వామిక శక్తులందర్నీ కూడగట్టవలసిన అవసరం ఉంది. దేశానికి అత్యవసరమైన ఆర్థిక విధానాలను రచించుకోవాలి. 2014 నుంచి దేశం ఉత్పత్తిని పెంచుకోవటంలో పూర్తిగా వెనుకడుగు వేస్తూ ఉంది. ప్రభుత్వ రంగ ఆస్తులను మాత్రం తెగనమ్మటంలో ముందుంది. తక్షణం ఈ అమ్మకాల నుంచి దేశాన్ని కాపాడాలి. సహజ వనరులను, అడవి సంపదలను గుత్తకు అప్పజెబుతున్న తీరుకు అడ్డుకట్టవేయాలి. నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగాన్ని తగ్గించడానికి యువతను ఉత్పత్తి రంగంలో ఎక్కువగా వాడుకోవాలి. భారీగా పెరిగిపోయిన ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు జరపాలి. అంబేడ్కర్ పేరు జెప్పి ఆయన ఆశయాలను నిర్వీర్యం చేస్తున్న తీరును ఎత్తి చూపాలి. ఒక కులానికి వ్యతిరేకంగా మరొక కులాన్నీ, ఒక మతానికి వ్యతిరేకంగా మరో మతాన్నీ రెచ్చగొట్టి విద్వేష భారతాన్ని రచిస్తున్న తీరుకు అడ్డుకట్టవేయాలి. భారత గడ్డపై పుట్టిన వాళ్లనే పరాయి వాళ్లను చేస్తున్న తీరు ప్రమాదకరమైనది. దేశభక్తి కావాలి కానీ విద్వేషభక్తి ఉండకూడదు. ఒక్క భాషపైననే ప్రేమకాకుండా దేశ ప్రజలు మాట్లాడే అన్ని భాషలపై ప్రేమ ఉండాలి. ఇతరులపై గుడ్డి ద్వేషాన్ని పెంచే భావజాలం ఏదైనా అది విషాన్ని నింపటం కంటే ప్రమాదకరమైనది. చివరకు పాఠ్యప్రణాళికల్లో కూడా మతభావనలు చూపించే దశకు పోవటం అన్యాయమని ఎవరైనా అడిగితే వారిని జాతివ్యతిరేకి అంటున్నారు. లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థలను పరిరక్షించకపోతే దేశం కుప్పకూలుతుంది. మహాత్మాగాంధీ, జ్యోతిబాఫూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ అనంతర భారతం ఇదేనా? దేశాన్ని సంపన్న భారతం చేయమంటే వలసల భారతంగా మార్చేశారు. వారి దుందుడుకు విధానాల పట్ల మొత్తం జాతిని మేల్కొలిపి ముందుకు నడిపించటానికే ఖమ్మం వేదికగా ప్రజల అజెండాకు రూపకల్పన జరుగుతోంది. కమండలాలకు సరైన సమాధానం చెప్పి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం నిలిపిన లల్లూప్రసాద్ యాదవ్లాగా, ములాయంసింగ్ యాదవ్లాగా, ఒక వీపీసింగ్ లాగా దేశంలోని వలస భారతానికి ధైర్యం చెప్పే సత్తా ఒక్క కేసీఆర్కే ఉంది. తమకు అనుకూల రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక పద్ధతీ, తమకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలపైన కక్షకట్టే రాజకీయాలూ పోవాలి. తమకు అను కూలురైన సీఎంలు లేకపోతే గవర్నర్తో పాలి స్తామనే సంస్కృతి ఫెడరల్ వ్యవస్థను పెను ప్రమాదంలో పడవేస్తుంది. సంప్రదాయాల్లోకి, విశ్వాసాల్లోకి, నమ్మకాల్లోకి, మతాల్లోకి, కులాల్లోకి, గనుల్లోకి, గుడుల్లోకి, బడుల్లోకి, వనాల్లోకి, అడవుల్లోకి మన ఇంటి గడపల్లోకి, మంది మెదడుల్లోకి అన్నిట్లోకి తమ పాత భావాలను, ఛాంద సత్వాన్ని చొప్పించి ప్రజాస్వామ్యాన్ని లౌకికత్వాన్ని అవహేళన చేస్తున్నారు. ఎవరు తమను ప్రశ్నించినా ఈడీలు, బేడీలు వేస్తున్నారు. అన్ని వ్యవస్థలూ కళ్లముందే ధ్వంసం అవుతున్నప్పుడు ఇదేమి న్యాయమని అడిగితే నేరుగా జైలుకే పంపించేస్తున్నారు. ఇది ఫాసిజం కంటే ప్రమాదకమైనది. ఇపుడు తక్షణంగా దేశాన్ని రక్షించుకునేందుకు దేశభక్తియుత ఉద్యమాలు రావాలి. అటువంటి ఉద్యమాన్నే కేసీఆర్ ఖమ్మం వేదికగా ప్రారంభి స్తున్నారు. ఆ ఉద్యమంలో దేశ ప్రజ అంతా భాగం కావాలి. (క్లిక్ చేయండి: జాతీయత కొరవడిన పార్టీ.. స్వార్థ ప్రయోజనానికే పెద్దపీట) - జూలూరి గౌరీశంకర్ ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ (జనవరి 18న ఖమ్మంలో బీఆర్ఎస్ జనగర్జన) -
జాతీయత కొరవడిన పార్టీ.. స్వార్థ ప్రయోజనానికే పెద్దపీట
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ సారథ్యంలో అప్రతిహతంగా పురోగమిస్తున్న భారత్ కీర్తి బావుటా విశ్వ వినీలాకాశంలో ఇప్పుడు మరింత పైఎత్తున ఎగురుతోంది. మొట్ట మొదటి సారిగా జీ–20 అధ్యక్ష హోదా చేపట్టి విశ్వవేదికపై తన సత్తాను భారత్ మరో మారు చాటి చెప్పింది. ఐరోపా యూనియన్ సహా 19 దేశాలు సభ్యులుగా ఉన్న గొప్ప వేదిక ఇది. ప్రపంచ జీడీపీలో 90 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 80 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ–20 దేశాలవే. ప్రపంచ ఆర్థిక వ్యవహారాల్లో జీ–20 పాత్ర ఏమిటో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాల తలరాతను శాసిస్తూ లాభార్జనే ధ్యేయమైన రెండు ఆర్థిక నమూనాలు ఇప్పుడు ప్రపంచంలో కొనసాగుతున్నాయి. ఆధిపత్యం చలాయిస్తూనే తమ ఉత్పత్తులతో విదేశా లను ముంచెత్తే పాశ్చాత్య నమూనా ఒక వైపు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలకు అప్పుల వలవేసి దివాలా తీయించే చైనా నయా వలసవాద నమూనా మరొక వైపు ఉన్నాయి. దీనికి పూర్తి భిన్నంగా విశ్వ మానవ సౌభ్రాతృత్వ స్ఫూర్తితో భారత్ ముందుకు సాగుతోంది. కోవిడ్ కష్ట కాలంలో ప్రపంచాన్ని భారత్ ఆదుకున్న తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇటువంటి భారత్ జీ–20కి నాయకత్వ స్థానంలో ఉండి చేయగలిగింది ఎంతో ఉంది. డిసెంబర్ ఒకటో తేదీన జీ–20 అధ్యక్ష హోదా స్వీకరించిన భారత్, వచ్చే 12 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 200 పైగా సమావేశాలు నిర్వ హించాలని నిశ్చయించింది. అందుకోసం రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు డిసెంబర్ 5న ఒక సన్నాహక సమావేశానికి కేంద్రం ఆహ్వానం పలికింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్ సహా దాదాపు అన్ని పార్టీల అధ్యక్షులు హాజరైన ఆ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు. దేశాన్ని ఉద్ధరిస్తానని ‘భారాసా’గా పేరు మార్చుకున్న తెరాస అధ్యక్షుడు యావత్ దేశానికి గర్వకారణమైన ఒక కీలక సమావేశాన్ని బహిష్కరించి దేశం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాల విషయంలో ఆ పార్టీ నిబద్ధత ఏ పాటిదో ఆదిలోనే అర్థమయ్యింది. దేశ హితం కన్నా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనానికే పెద్దపీట వేయడం ఇందుకు కారణం. వచ్చే ఏడాది సెప్టెంబర్లో జరగనున్న జీ–20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి వ్యూహాలపై చర్చలు జరిపేందుకు, సూచనలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరుకాని కేసీఆర్, అందుకు కారణాలేమిటో చెప్పగలరా? సొంత లాభాపేక్షే తప్ప తెలంగాణ ప్రజానీకం బాగోగుల గురించి ఆయనకు ఏమాత్రం పట్టింపులేదని దీనివల్ల స్పష్టంగా తెలియడం లేదా? కేంద్ర ప్రభుత్వం ఆయనను ఆహ్వానించినప్పటికీ, సమావేశానికి కావాలనే హాజరు కాకపోవడం... జాతీయ రాజకీయాల్లో కీలక, క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్కు ఎంత మాత్రం తగని పని. జాతీయ రాజకీయాల్లో రాణించడానికి కావలసిన కలుపుగోలుతనం ఇదేనా? చారిత్రక అవకాశాలను ఇలా చేజేతులా వదిలేసుకోవడం కేసీఆర్కు అలవాటైన పనే. జీ–20 సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు అనేక అవకాశాల తలుపులు తెరవబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి తమ రాష్ట్రాల్లో తాజా పెట్టుబడులకు బాటలు వేయడానికి మంచి అవకాశం లభిస్తోంది. తెలంగాణకు చెందిన అనేకమంది సౌదీ అరేబియాలో ప్రవాసం ఉంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా సౌదీ అరేబియాను తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి సౌదీ అరేబియా రాజకీయ నాయకత్వంతో చర్చలు జరిపి సానుకూల ఫలితం రాట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఉంది. జీ –20 అధ్యక్ష హోదా భారత్కు దక్కడంతో ఎంతో స్ఫూర్తి పొందిన సిరిసిల్ల పట్టణానికి చెందిన హరిప్రసాద్, స్వయంగా జీ–20 లోగో నేసి ప్రధానమంత్రికి పంపించారు. హరిప్రసాద్ వంటి వారి నుంచి స్ఫూర్తి పొంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ హితం కోసం కాకపోయినా.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానైనా కేంద్రంతో కలిసి ముందడుగు వేస్తారా? (క్లిక్ చేయండి: సందేహాలు తీరకుండా చర్యలెలా?) - కిశోర్ పోరెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి -
ఆదివాసుల హృదయ దీపాలు
తూర్పు గోదావరి జిల్లా కొండ అడవుల్లో డాక్టర్ ఊర్మిల పింగ్లె తీసిన ఇక్కడ కనిపిస్తున్న ఫొటో... హైమండార్ఫ్ దంపతులు కలిసి ఉన్న దాదాపు తుది చిత్రం. పదవీ ఉద్యోగాలు లేకపోయినా మానవ శాస్త్రవేత్తగా తనతో యాభై ఏళ్లుగా వెన్నెముకలా ఉండి అలుపెరగకుండా కలిసి పని చేసిన బెట్టీ సాహచర్యం గురించి లోతుగా తలపోస్తున్నట్టు క్రిస్టోఫ్ హైమండార్ఫ్ కనిపిస్తున్నారు ఈ చిత్రంలో. ఆ తర్వాత కొద్ది రోజులకే హైదరాబాద్లో 11 జనవరి 1987 నాడు బెట్టీ అని అందరూ అభిమానంగా పిలిచిన ఎలిజబెత్ హైమండార్ఫ్ గుండెపోటుతో హఠాత్తుగా ప్రాణాలు విడిచారు. ఆమె మరణం క్రిస్టోఫ్ హైమండార్ఫ్ను బాగా కుంగదీసింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకే ఆయన కూడా తనువు చాలించారు. భారత్ ఈశాన్య ప్రాంతంలోని కొన్యక్ నాగాలు, ఆపతానీలు, హైదరాబాద్ నిజాం సంస్థానంలోని చెంచులు, కొండ రెడ్లు, రాజ గోండులు, ఇంకా నేపాల్ షేర్పాలు, మధ్య ప్రదేశ్ భిల్లులు.. ఈ జాతుల గురించి క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ చేసిన పరిశోధనలు ఇప్పటికీ ప్రామాణికంగా నిలుస్తున్నాయి. అయితే వీటన్నింటిలో ఆదిలాబాద్ రాజ్ గోండులతో ఆయన 1940ల్లో ఏర్పరచుకొని, జీవన పర్యంతం కొనసాగించిన బాంధవ్యానికి సాటి రాగలిగి నది ఏదీ లేదు. మార్లవాయి గ్రామంలో రాజ్ గోండుల మధ్య వారిలో ఒకరిగా ఒక గుడిసెలో జీవిస్తూ వారి సంప్రదాయాలు, పురాణాలను, వారి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సాధికారికంగా నమోదు చేస్తూ, ఆదివాసీ జీవన దృక్పథ సార్వజనీనమైన విలువను గుర్తుండి పోయేలా ఆవిష్కరించగలిగారు. హైదరాబాద్ సంస్థానంలోని ఆదివాసీలను దాదాపు మూడు సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన తరువాత 1945లో, ఆయన విశ్లేషణల నాణ్యతను చూసిన నిజాం ప్రభుత్వం ఆయనను గిరిజన తెగలు, వెనుకబడిన తరగతుల సలహాదారుగా నియమించింది. సంస్థానంలోని ఆదివాసీల అభ్యున్నతికి కీలకమైన నూతన ప్రణాళికల రూపకల్పన, వాటి అమలు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆ పదవిలో ఉంటూ కుమ్రం భీం తిరుగుబాటు, వీర మరణం తరువాత పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయి, తీవ్రమైన నిరాదరణకు గురవుతున్న ఆదిలాబాద్ జిల్లా గోండుల కోసం తొలి పాఠశాలలు ఏర్పరిచి, భూములు లేని వేలాది ఆదివాసీ కుటుంబాలకు దాదాపు 160 వేల ఎకరాల భూమిని పట్టాలతో సహా అందించి వారి సమగ్ర పునరుజ్జీవనానికి గొప్ప పునాది వేయగలిగారు హైమండార్ఫ్. 1950లో లండన్కు వెళ్లి పోయిన తర్వాత కూడా తరచుగా ఆదిలాబాద్ను సందర్శిస్తూ గోండుల బాగోగుల గురించి తెలుసుకుంటూ ఉండేవారు హైమండార్ఫ్ దంపతులు. 1960ల తరువాత బయటి నుండి వచ్చిన చొరబాటుదారుల దురాక్రమణకు ఆదివాసీల భూములు గురికావడం, వారి పరిస్థితి మళ్లీ హీనం కావడం హైమండార్ఫ్ దంపతులను ఎంతో బాధించేది. తమను ఎంతో ఆదరించి, అభిమానించిన గోండుల సన్నిధిలో మార్లవాయి లోనే తమ సమాధులు ఉండాలని హైమండార్ఫ్ దంపతులు కోరుకున్నారు. బెట్టి మరణం తర్వాత, ఆమె అస్థికలను మార్లవాయికి తీసుకు వచ్చి, ప్రేమాభిమానాలతో తరలివచ్చిన వేలాది ఆదివాసీల సమక్షంలో మార్లవాయి గ్రామం పక్కనే ఖననం చేశారు. క్రిస్టోఫ్ అవశేషాలను కూడా ఆయన మరణించిన చాలా ఏళ్ళ తర్వాత బెట్టి సమాధి పక్కనే పూడ్చి మరో సమాధి నిర్మింపజేశారు. బెట్టి వర్ధంతినే హైమండార్ఫ్ దంపతుల ఉమ్మడి సంస్మరణ దినంగా ప్రతి ఏడాది మార్లవాయి గ్రామంలో 11 జనవరి నాడు నిర్వహిస్తూ వస్తున్నారు. గత కొన్నే ళ్లుగా ఇది పెద్ద కార్యక్రమంగా వికసిస్తూ వస్తున్నది. మార్లవాయి గ్రామ గుసాడి నృత్య కళాకారుడు కనక రాజుకు పద్మశ్రీ గౌరవం దక్కడం దీనికి తోడయ్యింది. తమ జాతి సంస్కృతిని అధ్యయనం చేసి, తమ అభ్యున్నతి కోసం పరితపించిన మానవ శాస్త్రవేత్త దంపతులకు ఆ జాతి నుంచి లభించిన ఇటువంటి ఆరాధనకు సాటిరాగల ఉదాహరణ మరెక్కడా లేదేమో! 1980వ దశకం నుండి చివరిదాకా హైమండార్ఫ్ దంపతులను బాగా ఎరిగిన, క్రిస్టోఫ్తో కలిసి రెండు పరిశోధన గ్రంథాలను కూడా రాసిన ఊర్మిళ పింగ్లె, బెట్టి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు: ‘తనను కలిసిన వారందరి పట్లా గొప్ప అనురాగం చూపుతూ... గొప్ప చమత్కారం, హాస్య దృష్టిలతో జీవ చైతన్యం ఉట్టిపడుతూ ఉండేది అమె. ఆదివాసీ సమాజాల పరిస్థితి పట్ల ఎనలేని సానుభూతితో వారి అభ్యున్నతి కోసం అంతటా వాదిస్తూ ఉండేది. తన భర్తకు నిజమైన ఆత్మబంధువుగా నిలిచిన వ్యక్తి!’ (క్లిక్ చేయండి: అజ్ఞానం కంటే అహంకారం ప్రమాదం) - సుమనస్పతి రెడ్డి ఆకాశవాణి విశ్రాంత అధికారి (జనవరి 11 హైమండార్ఫ్ దంపతుల సంస్మరణ దినం) -
Gruha Saradhi: అనూహ్య వ్యూహం ‘గృహ సారథి’
‘గృహ సారథి’ పేరుతో ఈ ఏడాది 5.20 లక్షల మంది యువతను సూక్ష్మ (గ్రాస్ రూట్స్) స్థాయి క్రియాశీల రాజకీయాల్లో భాగస్వామ్యుల్ని చేయాలని ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఈ ‘గృహ సారథులు’ ప్రతి 50 కుటుంబాలకు ఇద్దరు చొప్పున వారి అవసరాలు ప్రభుత్వం వద్ద ‘పెండింగ్’ కనుక ఉంటే, వాటి పరిష్కారం కోసం పార్టీ తరఫున పనిచేస్తారు. ఆ కుటుంబాల్లోని మహిళా సభ్యుల అవసరాలు తెలుసుకోవడం కోసం వీరిలో ఒక యువతి కూడా ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఎన్నికల ముందు– ‘మా పార్టీ మీ గుమ్మం వద్ద’ అన్నట్టుగా వీరు ప్రజలకు అందుబాటులో ఉంటారు. వీరి పనితీరును సమీక్షించడానికి మరో 45 వేల మంది ‘కన్వీనర్లు’ ఉంటారు. ఎనభై శాతం పైగా నిర్లక్ష్యానికి గురైన వర్గాల యువత గత మూడేళ్ళుగా వలంటీర్లు, గ్రామ సచివాలయాలల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది సర్వీస్ ఇప్పటికే ప్రభుత్వం ‘రెగ్యులరైజ్’ చేసింది. మళ్ళీ అవే వర్గాలకు ఆ వ్యవస్థతో సమాంతరంగా, అధికార రాజకీయ పార్టీ శ్రేణులుగా పని చేయడానికి మరో కొత్త అవకాశం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రంగంలో ఇంత పెద్ద ‘రిక్రూట్మెంట్’ జరగడం ఇది ప్రథమం. ఈ ‘గృహ సారథి’ వ్యవస్థ వల్ల తాత్కాలిక ప్రయోజనం వారిని నియ మించిన పార్టీకి ఉంటే, దీర్ఘకాలిక ప్రయోజనం పెద్ద సంఖ్యలో రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తున్న ఈ యువతది అవుతుంది. ఇన్నాళ్లూ పార్టీ శ్రేణులుగా తలల లెక్కకు తప్ప దేనికీ పనికిరాని ఈ యువతకు, ఇక ముందు ‘బూత్’ స్థాయిలో అధికార పార్టీ ప్రతినిధులుగా కొత్త గుర్తింపు రాబోతున్నది. అంటే– భవిష్యత్ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేయడానికి వర్ధమాన వర్గాల నుంచి వైసీపీ ‘నర్సరీ’లో సరికొత్త మానవ వనరు సిద్ధమవుతున్నదన్న మాట! సరిగ్గా ఇక్కడే తెలుగునాట మూడు దశాబ్దాల దళిత బహుజన రాజకీయాల ప్రస్తావన అనివార్యం అవుతున్నది. అప్పట్లో క్షేత్రస్థాయి శ్రేణుల పాటవ నిర్మాణాన్ని (కెపాసిటీ బిల్డింగ్) పట్టించుకోకుండా, కేవలం కొందరు నాయకుల వ్యక్తిగత ‘ఫోకస్’ తాపత్రయం కారణంగా, అప్పటి ఆ రాజకీయాల ఆయుష్షు అర్ధంతరంగా ముగిసింది. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పలుకుబడి వర్గాల ‘లాబీయింగ్’కు ‘చెక్’ పెట్టి మరీ, సాంఘిక సంక్షేమంలో– అర్హులైన అన్ని ఉపకులాలకు ఫలాలు అందే విధంగా ‘హైబ్రిడ్ మోడల్’ ప్రవేశపెట్టింది. దాంతో కాలం చెల్లిన ఒత్తిడి పెంచే ‘ట్రిక్స్’ ఇక్కడా మొదలయ్యాయి. ‘ఒకప్పటి ఎస్సీ కార్పొరేషన్ కాలం నాటి బడ్జెట్ ఏది? ఆ పథకాలు ఇప్పుడు ఏవి?’ అని ఇటీవల కొందరు వాపోతున్నారు. దామాషా మేరకు పంపిణీ లక్ష్యం కోసం, స్వీయ సామాజిక వర్గాల ఒత్తిళ్లనే జగన్ పట్టించుకోవడం లేదు. లొంగడం లేదు. చిత్రం– ఇప్పటికీ ఇక్కడ సమస్య ఏమంటే – ‘రాజ్యాధికారం’ అంటే, కాపుకొచ్చిన తోటలో పంట దింపుకోవడం కాదనీ, వీరికి అర్థం కావడం లేదు. దాన్ని ఆశించేవారు, అందుకు తమదైన నేల బాగుచేసి, అందులో అనువైన విత్తనాలు జల్లి ముందుగా మనదైన పంట పండించాలి. రాష్ట్ర విభజన తర్వాత, మారిన సమీకరణాలతో– ‘పోస్ట్ మండల్’ ‘పోస్ట్ ఎకనామిక్ రిఫారమ్స్’ కాలానికి తగిన సరి కొత్త రాజకీయాలు... కేవలం సాంప్రదాయ రాజకీయాలు మాత్రమే తెలిసిన ఈ పార్టీలకు అవగాహన లేదు. నిశ్శబ్దంగా ఆ ఖాళీ జాగాను ఆక్రమించి, గత మూడున్నర ఏళ్లుగా తన సంక్షేమ–అభివృద్ధి ప్రయోగాలను ఇక్కడ అమలు చేస్తున్నారు జగన్. గత ఏడాది జరిగిన తొలి పార్టీ సమీక్షలో– జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ‘అవుట్ రీచ్ అప్రోచ్’తో మనం పనిచేయాలి అని ఒక కొత్త పదప్రయోగం చేశారు. దాని భావం అర్థమైతే, ఆయన విమర్శకులకు సగం పని భారం తగ్గుతుంది! ఇటీవల బహిరంగ సభల్లో జగన్ ‘ఇది కులాల మధ్య యుద్ధం కాదు, వర్గాల మధ్య యుద్ధం’ అన్న తర్వాత, ఆ ప్రకటనపై వ్యాఖ్యానించలేని దశలో ఇక్కడి రాజకీయ పక్షాలు మిగిలిపోవడం, ‘అకడమిక్’ వర్గాల్లో అధ్యయనం అవసరమైన అంశం. (క్లిక్ చేయండి: రోడ్ షోలు – పౌర హక్కులు – కోర్టు తీర్పులు) ‘గృహ సారథి’ నియామకం ప్రపంచీకరణ దుష్పరిణామాలను ఎదుర్కోవడానికి సామాజిక శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్న – ‘గ్రీన్ పాలిటిక్స్’ దిశలో ఒక ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే – ‘సోషల్ కేపిటల్’, ‘ఫంక్షనల్ పాలిటిక్స్’ థియరీల ఆచరణకు ఇదొక పెద్ద ముందడుగు అవుతుంది. లోతులు తెలియని విమర్శకులు కురచ దృష్టితో దీన్ని తక్కువచేసి చూడ్డం తేలికే గానీ, వీరిని నియమించిన పార్టీ కంటే, ఆ పార్టీ శ్రేణులకు దీనివల్ల కలిగే ప్రయోజనం విలువైనది. - జాన్సన్ చోరగుడి అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
Andhra Pradesh: రోడ్ షోలు – పౌర హక్కులు – కోర్టు తీర్పులు
ఆంధ్రప్రదేశ్లో రోడ్ షోలపై పరిమితులు విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం సహేతుకమైనదేనా? ఇది ఎమర్జెన్సీని తలపిస్తోందా? ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనా? ఈ జీఓ బ్రిటిష్ కాలం నాటిదా? మరి కోర్టు తీర్పులు ఈ అంశాలపై ఎలా ఉన్నాయి? రోడ్ షోలు, ర్యాలీల పేరుతో ఎక్కడపడితే అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, ప్రభుత్వాన్నీ, మంత్రులనూ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్లో తూలనాడుతూ, చెప్పు చూపుతూ హెచ్చరికలు చేయడం, బూతులు తిట్టడం, ‘వర్కవుట్’ కాకపోతే ఎవరు ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చనే రీతిలో మాట్లాడటం, మంత్రులను బూతులతో సంబోధించడం... ఇవన్నీ చట్టబద్ధత కిందికే వస్తాయా? భావప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)ఏ, ఆర్టికల్ 19(1)బీ కిందికి వస్తాయా? మరి న్యాయస్థానాల తీర్పులు ఏం చెబుతున్నాయి? ఒకసారి పరిశీలిద్దాం! ఈ దేశంలో ఏ శాసనాలు అయినా, వాటిని అనుసరించి జారీ చేసే ఏ ఉత్తర్వులు అయినా భారత రాజ్యాంగం ప్రకారమే ఉంటాయి తప్ప... ఇతర దేశాలకు చెంది ఉండవు అనేది సగటు మనిషికి కూడా తెలుసు. భారత రాజ్యాంగ రూపకల్పనలో బ్రిటిష్, అమెరికా వంటి దేశాల రాజ్యాంగాల్లోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వంటి అంశాలు కొన్ని అవసరమైన మార్పులతో స్వీకరించారు. ఆ విధంగా ఈ దేశంలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఎన్నో కొనసాగుతున్నాయి. ఇవి భారతదేశ చట్టాలు గానే పరిగణించాలి. అంతేకానీ వాటిని బ్రిటిష్ చట్టాలు అని ప్రచారం చేయడం ప్రజల్ని తప్పుదారి పట్టించడం అవుతుంది. పౌరుల హక్కులను అతిక్రమించి రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నప్పుడు వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అనీ, మరీ ముఖ్యంగా పోలీసుల దేననీ న్యాయస్థానాలు వివిధ కేసుల్లో తీర్పులు ఇచ్చాయి. ఉదాహరణకు కేరళ హైకోర్టులో ‘పీపుల్స్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ కేసులో రోడ్షోలఫై దాఖలైన ‘రిట్ అఫ్ మాండమస్’పై జస్టిస్ కె. బాలకృష్ణన్, జస్టిస్ పి. సుబ్రమణియన్, జస్టిస్ జె. కోషితో కూడిన త్రిసభ్య ధర్మాసనం సమగ్ర విచారణ జరిపి తీర్పునిచ్చింది. ఈ విచారణలో కొన్ని ఇతర రాష్ట్రాల తీర్పులను కూడా ఉటంకించారు. కాగా కామేశ్వర ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో, ప్రదర్శనలు– నినాదాలు కూడా భావ ప్రకటనా స్వేచ్ఛకిందికి వస్తాయా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. డిమాన్స్ట్రేషన్కి సంబంధించి, భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానాలను కూడా పేర్కొంది. ఆ ప్రకారం చూస్తే, పవన్ కల్యాణ్ మంత్రులను గాడిదలని సంబోధించడం, చెప్పులు చూపుతూ హెచ్చరికలు చేయటం వంటివన్నీ ఆర్టికల్ 19(1)ఏ ఆర్టికల్ 19(1)బీకి విరుద్ధమైనవీ, శిక్షార్హమైనవీ. ఇక కేసు విషయానికి వస్తే... వాహనదారులు, పాదచారులు సంచరించే ప్రధాన రహదారులపై రోడ్ షోలు, ర్యాలీలు అంటే పౌరుల హక్కులను కాలరాయడమే అనీ, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, వాణిజ్య సముదాయాలు, బస్సుస్టేషన్, రైల్వేస్టేషన్ వంటి ప్రదేశాలకు పౌరులు సంచరించకుండా చేయడం అంటే పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేననీ ధర్మాసనం పేర్కొంది. పౌరుల ఈ హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వం మరీ ముఖ్యంగా పోలీసులదేననీ, ట్రాఫిక్ను నియంత్రించే హక్కు ఎవరికీ లేదు అని కోర్టు అభిప్రాయ పడింది. సభను నిర్వహించుకునే హక్కు పార్టీలకు ఉన్నా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించటానికి వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 49, పోలీస్ యాక్ట్ సెక్షన్ 29 కింద శిక్షార్హులు. వీధుల్లో కవాతులు, ప్రదర్శనలు నియంత్రించే అధికారం పోలీసులకు ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తుల రక్షణ చట్టం(ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ) 1984, సబ్ సెక్షన్ 3 ప్రకారం, ఊరేగింపులు ప్రదర్శనల పేరుతో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే, ఐదేళ్ల పాటు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. ఈ వివరాలన్నీ ఉటంకిస్తూ, రోడ్ షోలు, ఊరేగింపులు, ప్రదర్శనలకు సంబంధించి ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలనీ, ఆ ప్రకారం కఠిన నిబంధనలను అమలు చేయాలనీ, లేదంటే పోలీసులకు కష్టసాధ్యమనీ కోర్ట్ అభిప్రాయపడింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడినట్టే అని వ్యాఖ్యానించింది. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించదలచుకున్నవారు ముందుగా కనీసం ఆరు రోజుల ముందు పోలీసు అధికారుల అనుమతి పొందాలి. అనుమతి పొందినా రోడ్డు మొత్తం ఆక్రమించడానికి వీలు లేదు. ర్యాలీ ఏం జరుగుతున్నా ట్రాఫిక్కి అంతరాయం కలగకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సర్క్యులర్లు జారీ చేయాలి. ర్యాలీలో పెద్ద పెద్ద బ్యానర్లు నిషిద్ధం. పోలీసులు బ్యానర్ సైజులు నియంత్రించాలి. ఇదీ రోడ్ షోలు, ర్యాలీలకు సంబంధించి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో గౌరవ న్యాయస్థానం తీర్పునకు లోబడి ఉందా? అప్రజాస్వామికంగా ఉందా? ప్రజాస్వామ్యవాదులు ఒకపరి ఆలోచించండి!! - పి. విజయ బాబు కానిస్టిట్యూషన్ లా నిపుణులు -
జీవ వైవిధ్యం రక్షణ లక్ష్యాలు నెరవేరేనా?
కెనాడా నగరం మాంట్రియల్లో 2022 డిసెంబర్లో జరిగిన 15వ జీవవైవిధ్య సదస్సులో కుదిరిన ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాలను ఆహ్వానించవలసిందే. అయితే వాస్తవ పరిస్థితులను చూస్తే లక్ష్యాలు నెరవేరతాయా అనిపిస్తోంది. భారత్ సహా 190 దేశాల ప్రతినిధులు పాల్గొని చర్చించి ఒక ఒప్పందం చేసుకున్నారు. 2030 నాటికి ఈ ధరిత్రిపై 30 శాతం జీవవైవిధ్యం కాపా డాలన్నది ఒప్పందంలో ప్రధాన అంశం. ఈ విశ్వంలోగల జీవరాశులన్నిటినీ కలిపి జీవావరణం అంటున్నాం. జీవరాశులన్నీ సురక్షితంగా ఉంటేనే జీవవైవిధ్యం చక్కగా ఉంటుంది. అయితే ఇప్పటికే జీవవైవిధ్యం గణనీయంగా ధ్వంసమైపోయింది. ఇందుకు ప్రధానకారణం మానవ కార్యకలాపాలే. 1972లో స్టాక్హోమ్లో జరిగిన ధరిత్రి పరిరక్షణ సదస్సు తర్వాత ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో ఇంతవరకు 27 కాప్ సదస్సులు జరిగాయి. మొత్తం సదస్సుల్లో క్యోటో ఒప్పందం, గతంలో జరిగిన మాంట్రి యల్ ఒప్పందం, పారిస్ సదస్సు, 2021లో జరిగిన గ్లాస్గో, 2022లో ఈజిప్టు షర్మెల్ షేక్ నగరంలో జరిగిన సదస్సుల్లో జరిగిన ఒప్పందాలను ఇప్పటివరకు అమలు చేయలేదు. చేసినా అరకొర నిర్ణయాలే తీసుకొని అమలు చేశారు. గ్లాస్గో ఒప్పందంలోనే 2030 నాటికి సాధించవలసిన లక్ష్యా లను నిర్ణయించారు. వీటిలో చాలా తక్కువగానే సాధించారనీ, రానున్న ఐదేళ్ల కాలంలో సైతం సాధించే అవకాశం కనిపించడంలేదనీ, ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ ఆయా ప్రభుత్వాలు సమర్పించిన ఐదేళ్ల ప్రణాళికలను బట్టి గ్లాస్గో సదస్సుకు ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన జీవ వైవిధ్య సదస్సు చేసిన నిర్ణయాలను, లక్ష్యాలను సాధించడం సాధ్యమేనా? ఇప్పటికే 14 లక్షల జీవజాతులు అంతరించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధకుల అంచనా మేరకు గడచిన నాలుగు వందల కోట్ల సంవత్సరాల జీవపరిణామ క్రమంలో జీవవైవిధ్యం ఏర్పడింది. దీని పరిరక్షణకు ముందు వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావలసి ఉంది. ఇందులో భాగంగా కృత్రిమ ఎరువులు, పురుగు మందులను నిలిపి వేసి సంప్రదాయ సేద్యాన్ని చేపట్టాలి. ఇది చాలా నెమ్మదిగా, దీర్ఘకాలం అమలు చేయవలసిన ప్రక్రియ. 2030 నాటికి ఈ మార్పును సాధించగలమా? జీవ వైవిధ్య రక్షణ ఒప్పందం అమలు చేయాలంటే ధనిక దేశాలు... పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు సమకూర్చాలనీ, లేకపోతే ఒప్పందం నుండి వైదొలగుతామనీ కాంగో చివరిలో హెచ్చరించింది. అనేక దేశాలు ఈ బాటను ఎంచుకొనే అవకాశం ఉంది. వ్యవ సాయానికిచ్చే సబ్సిడీలను కొనసాగించాలని భారత్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు డిమాండ్ చేశాయి. అమెరికా తదితర కొన్నిదేశాలు 60 శాతానికి పైగా సబ్సిడీలు ఇస్తున్నాయి. సబ్సిడీల విషయాన్ని తుది ఒప్పందం పత్రంలో చేర్చారా లేదా అన్న సందేహాలు వ్యక్తమ య్యాయి. సబ్సిడీలు లేకపోతే వ్యవసాయం సంక్షోభంలో పడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే ఆర్థిక రంగానికి హాని కలిగించే సబ్సిడీలను తగ్గించాలని ఒప్పందంలో చేరుస్తామని ఒప్పందం రూపొందించిన దేశాలు చెప్పాయి. ఈ లక్ష్యాలను 2030 నాటికి సాధించాలంటే కేవలం ఆసియా – పసిఫిక్ ప్రాంత దేశాలకే 300 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని ఆ ప్రాంత ఐరాస ఆర్థిక, సామాజిక కమిషన్ (యుఎన్ఈపీ) అంచనా వేసింది. 2025 నాటికి 20 బిలియన్ డాలర్లు మాత్రమే ఆర్థిక సహాయం చేస్తామని సంపన్న దేశాలు అంగీకరించాయి. మరి లక్ష్యాలు సాధిం చడం సాధ్యమవుతుందా? వాతావరణ విపత్తులు.. పర్యావరణ కాలుష్యం, భూతాపం పెరుగుదల మూలంగా అధికమయ్యాయి. 200 ఏళ్లకు పైగా పారిశ్రామికీకరణ, పెట్రో ఉత్పత్తులు, వ్యవసాయానికి వినియోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగుమందులు, విచ్చలవిడిగా అడవుల నరికివేత పెరిగాయి. మన దేశంలో 75 జిల్లాల్లో వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తున్నాయని వివిధ అధ్యయనాలతో పాటూ, వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి జాతీయ బ్యాంకు ప్రకటించింది. ఇక అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతుందనేది వాస్తవం. ఇందుకు తాజా ఉదాహరణలు లక్ష దీవులు, నికోబార్ దీవుల్లో జరుగుతున్న విధ్వంసం. ఈ ప్రాంతాల్లో వందలు, వేల ఎకరాల భూభాగంలో పచ్చదనం నాశనం అవుతోంది. ఫలితంగా వేలాదిమంది ఆదివాసీ తెగల జన జీవనం మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బ తింటోంది. వందలాది పక్షులు, జంతువుల రకాలు, ఇతర లెక్కలేనన్ని జీవరాసులు అంతరించిపోతాయి. సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతాల్లో నెలకొని ఉన్న జీవ వైవిధ్యం మళ్లీ కనిపించదు. ప్రపంచ వ్యాప్తంగా అడవుల్లో నివసించే జంతువులు, పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు తదితర అనేక రకాల జీవులలో 1970 నుంచి ఇప్పటి వరకు 69 శాతం నశించాయని లివింగ్ ప్లానెట్ రిపోర్టు (ఎల్పీఆర్)– 2022 నివేదిక తెలిపింది. ప్రపంచ జంతుజాల నిధి సంస్థ పరిధిలో ఎల్పీఆర్ పనిచేస్తోంది. భారత ప్రభుత్వం వాతావరణంపై 2023లో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. గతేడాది పారిస్ ఒప్పందంలో భాగంగా జాతీయ నిర్ణయ కార్యాచరణలు (ఎన్డీసీలు) రూపొందించింది. తక్కువ కాలుష్యం వెలు వరించే దీర్ఘకాలిక కార్యాచరణను మన ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 2070 నాటికి కాలుష్య రహిత వాతావరణం సాధిస్తామని పారిస్ సదస్సులో ప్రకటించింది. మరి ఈ లక్ష్యాలను సాధించి మన దేశమన్నా మాట నిలుపుకొంటుందేమో చూడాలి. (క్లిక్ చేయండి: లోహియా లోకదర్శన సులోచనాలు!) – టీవీ సుబ్బయ్య, సీనియర్ జర్నలిస్ట్ -
అజ్ఞానం కంటే అహంకారం ప్రమాదం
సంవత్సరం ఇప్పుడే ప్రారంభమైంది. మనం ఇప్పటికీ కాసింత సరదాగా ఉండేందుకు అర్హులమే అని నా అభిప్రాయం. నిస్సందేహంగా మిగిలిన 357 రోజుల్లో అంటే మున్ముందు జరిగే కార్యక్రమాలు మనల్ని ఉద్వేగంతో ముంచెత్తుతాయి. కానీ ఇప్పటికైతే మనం కాస్త తేలిగ్గానే ఉండగలం. కాబట్టి ఇంటర్నెట్ నుంచి నేను కూడబెట్టిన కొన్ని రత్నాలను మీతో పంచుకోనివ్వండి. నాకు బాగా నచ్చే అంశాల్లో ఒకటి అల్బర్ట్ ఐన్స్టీన్ పలుకులు. ‘ఈ=ఎంసీ స్క్వేర్’ అనే ఆయన సుప్రసిద్ధ సూత్రీకరణను నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేక పోయాను. కానీ ఆయనకు సంబంధించిన ఇతర వివే కంతో నేను అనుసరించి సాగుతాను. ఆయనకు చెందిన ఈ కోణం మనకు పెద్దగా తెలియకపోవడం సిగ్గుచేటు. కాబట్టి ఈరోజు మనకు పెద్దగా తెలియని ఐన్స్టీన్ గురించి మీకు చెప్పనివ్వండి. ఐన్స్టీన్ చెప్పారంటూ కీర్తిస్తున్న కొన్ని అద్భుతమైన విషయాల్లోని విశేషమైన ఉదాహరణలతో నేను దీన్ని ప్రారంభిస్తాను. ఈ సమయంలో నా మనసును విశే షంగా ఆకర్షించిన ఉల్లేఖనలను నేను ఎంపిక చేసుకుంటాను. ‘అజ్ఞానం కంటే ప్రమాదకరమైన ఒకే ఒక్క అంశం ఏమిటంటే అహంకారం’. ‘ఏ మతిహీనుడైనా తెలుసుకోవచ్చు, విషయమేమిటంటే దాన్ని అర్థం చేసు కోవాలి’. ‘బలహీనులు ప్రతీకారం తీర్చుకుంటారు, బలవంతులు క్షమిస్తారు, తెలివైనవారు పట్టించుకోకుండా ఉంటారు’. ‘నేను నేర్చుకునేదానికి అడ్డుతగిలే ఒకే ఒక విషయం ఏమిటంటే, అది నా చదువు మాత్రమే’. ‘మూర్ఖత్వానికీ, మేధాతనానికీ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, మేధాతనానికి దానివైన హద్దులుంటాయి’. ‘విజ్ఞానానికి ఏకైక వనరు అనుభవమే’. నాకు బాగా ఇష్టమైనవాటిల్లో రెండు మరీ సార వంతంగా ఉండి, ముక్కుసూటిగా ఉంటాయి. మొదటిది ఇదీ: ‘మీరు దాన్ని సులభంగా వివరించలేనట్లయితే, దాన్ని మీరు తగినంత అర్థం చేసుకోలేరు’. రెండోది ఇదీ: ‘చిలిపితనం వర్ధిల్లాలి! ఈ ప్రపంచంలో ఇదే నన్ను సంరక్షించే దేవదూత’. ఇప్పుడు ఐన్స్టీన్ చెప్పినవాటిల్లో నిర్దిష్ట విభాగాలకు చెందిన వ్యక్తులకు వర్తించే అంశాలకు వస్తాను. ఉదాహరణకు, మన రాజకీయ నేతలు వాటిని ఉపయుక్తంగా వాడుకునే సలహాలు ఆయన ఇచ్చారు. ‘సమాధానాలు ఉన్న వ్యక్తులు చెప్పేది వినవద్దు, ప్రశ్నలు ఉన్న వ్యక్తులు చెప్పేది మాత్రమే వినాలి’ అని ఆయన అన్నారు. ‘ఆలోచన లేకుండా అధికారాన్ని గౌర వించడం అనేది సత్యానికి మహా శత్రువు’ అని ఐన్స్టీన్ చెప్పింది మరింత ప్రాసంగికమైనది. ఐన్స్టీన్ వివేకంలో ఎక్కువ భాగం మన లాంటి సామాన్యులను లక్ష్యంగా చేసుకున్నది. ‘మీ జీవితాన్ని గడపడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఏదీ అద్భుతం కాదన్నట్టుగా, మరొకటి ఏమిటంటే ప్రతిదీ అద్భుతమే అన్నట్టుగా.’ సులభంగా అలిసిపోయే వారికీ, లేదా ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో నిస్పృహ చెందేవారికీ కూడా ఒక హామీ ఉంటుంది. ‘మీరు నిజంగా ఏం చేయాలని అనుకుంటున్నారో దాన్ని ఎన్నటికీ వదిలిపెట్టొద్దు. అన్ని వాస్తవాలు చేతిలో ఉన్న వ్యక్తులకంటే పెద్ద స్వప్నాలు కనే వ్యక్తి చాలా శక్తి మంతుడు.’ బహుశా, తడబడటాన్నీ, పడిపోవడాన్నీ అధిగమించాలంటే ఇదే మార్గం. ‘జీవితం అనేది సైకిల్ స్వారీ లాంటిది. మీ సమతౌల్యాన్ని సాధించాలంటే, మీరు ముందుకు కదులుతూనే ఉండాలి.’ ఐన్స్టీన్ చెప్పిన కొన్ని విషయాలను తీసుకుంటే, ఆయన 2023 నాటి భారతదేశాన్ని మనసులో ఉంచుకుని చెప్పారా అని మీరు ఆశ్చర్యపడేలా చేస్తుంది. దీన్ని గురించి ఆలోచించండి: ‘హాని తలపెట్టేవారి వల్ల ప్రపంచం ప్రమాదకరంగా లేదు, దానికేసి చూస్తూ కూడా ఏమీ చేయకుండా ఉండటం వల్ల ప్రమాదం ఉంటోంది’. ఇది కూడా చూడండి: ‘నిత్యం విశ్రాంతి లేనితనంతో వచ్చే విజయం కంటే కూడా ప్రశాంతమైన, నిరాడంబర జీవితం మరింత సంతోషాన్ని తీసుకొస్తుంది’. బహుశా, ఐన్స్టీన్ని ప్రపంచం కనీవినీ ఎరుగనంత గొప్ప శాస్త్రవేత్తగా భావిస్తున్నారు. అయినా సరే, భౌతిక శాస్త్రం మీద ఉన్నంత గ్రహణ శక్తి ఆయనకు దేవుడి మీదా ఉంది. ‘యాదృచ్ఛికత అనేది దేవుడు అజ్ఞాతంగా ఉండిపోవడానికి ఎంచుకున్న మార్గం’. అలాగే చిన్న పిల్లల గురించీ, వారికి ఏది ప్రేరణ కలిగిస్తుందో ఆయన బాగా అర్థం చేసుకున్నారు. ‘మీరు మీ పిల్లలు తెలివైన వారిగా ఉండాలని కోరుకుంటున్నట్లయితే, జానపద సాహస గాథలు చదివి వినిపించండి. మీరు వారిని మరింత తెలివైనవారిగా ఉండాలని కోరుకుంటు న్నట్లయితే, వారికి మరింత ఎక్కువ అద్భుత గాథలను చదివి వినిపించండి’. మానవుల గురించిన ఐన్స్టీన్ గ్రహణశక్తి ఎంత లోతైనదో, ఎంత పదునైనదోనని నాకులాగే మీక్కూడా ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగించినట్లయితే– ఆయనకు తనపట్ల తనకు ఉన్న అవగాహన కూడా అంతే సరిసమానంగా పదునుగా ఉంటుందని నేను చెబుతాను. ‘ఒక గొప్ప శాస్త్రవేత్తను రూపొందించేది మేధస్సేనని చాలామంది జనం చెబుతుంటారు. వారి అభిప్రాయం తప్పు. నడవడికే దానికి కారణం’. దీన్నే ఐన్స్టీన్ మరింత స్పష్టంగా చెబుతారు: ‘సహజాతా లనూ, ప్రేరణనూ నేను విశ్వసిస్తాను. ఒక్కోసారి, నాకు కారణం తెలియకుండానే నేను చెప్పినది సరైనది అని భావిస్తుంటాను’. పైగా, ప్రపంచాన్ని అర్థం చేసుకోవ డానికి ఆయన ఊహాశక్తే ఆయనకు అంతర్ దృష్టిని ఇచ్చి ఉంటుందనిపిస్తుంది. ‘నా ఊహాశక్తి ఆధారంగా స్వేచ్ఛగా చిత్రించే కళాకారుడిగా నేను ఉంటాను. జ్ఞానం కంటే ఊహ ముఖ్యమైనది. జ్ఞానం పరిమితి కలది, ఊహాశక్తి ఈ ప్రపంచాన్ని చుట్టేస్తుంది’. చివరగా, మహాత్మాగాంధీ గురించి ఐన్స్టీన్ ఇలా చెప్పారు: ‘రక్తమాంసాలు కలిగిన ఇలాంటి వ్యక్తి ఒకరు భూమ్మీద నడియాడి ఉంటారనే విషయాన్ని రాబోయే తరాలు నమ్మలేవు’. గాంధీని ఇప్పటికే మర్చిపోతున్న తరుణంలో, అలా మర్చిపోతున్న తరాల్లో మనమే మొదటివాళ్లుగా ఉంటున్నామా? (క్లిక్ చేయండి: బంగారు బాల్యంలో నేర ప్రవృత్తి) - కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ -
బంగారు బాల్యంలో నేర ప్రవృత్తి
18 ఏళ్ల వయస్సు నిండని నేరం ఆరోపింపబడ్డ ప్రతి బాలుడు, బాలిక 2015 నాటి ‘బాల నేరస్థుల పరిరక్షణ చట్టం’ ప్రకారం జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజే బోర్డు) ముందు విచారణ ఎదుర్కోవలసి ఉంటుంది. నేరం చేసిన తేదీ నాటి వయస్సు ప్రామాణికం అవుతుంది. అధికారిక జనన ధ్రువీకరణ పత్రం అందుబాటులో లేనట్లయితే మెడికల్ బోర్డుచే ధ్రువీకరీంపబడ్డ వయస్సు ఆధారంగా కోర్టు విచారణ పరిధి నిర్ణయమవుతుంది. అరెస్టు చేసిన రోజు నుండి తుది తీర్పు దాకా జేజే బోర్డు విచారిస్తుంది. ఈ బోర్డులో మొదటి శ్రేణి జ్యుడీషియల్ న్యాయాధికారి, రాష్ట్ర ప్రభుత్వం చేత నియమింపబడే ఇరువురు సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. ఇరువురిలో ఒకరు మహిళ, మరొకరు చైల్డ్ సైకాలజిస్ట్ ఉంటారు. బెయిలుపై విడుదలయ్యేంత వరకు లేదా తుది తీర్పు దాకా నిందితులను ప్రభుత్వ సంక్షేమ అధికారుల పర్యవేక్షణలోని అబ్జర్వేషన్ హోమ్లో ఉంచుతారు. నేరం రుజువయితే నిందితులకు కారాగార శిక్ష బదులుగా జేజే బోర్డు సభ్యులు మందలించి విడుదల చేయటం లేదా మూడు సంవత్సరాలు మించకుండా సంస్కరణ గృహానికి పంపించటం లేదా విడుదల చేసి కొన్నాళ్ల పాటు మంచి ప్రవర్తనకై జిల్లా ప్రొబేషనరీ అధికారి పర్యవేక్షణలో ఉంచటం లేదా సామాజిక సేవ చేసే ఉత్తర్వులు లేదా జరిమానా చెల్లింపుకు ఆదేశాలివ్వటం జరుగుతుంది. ఇందుకై జిల్లా ప్రొబేషనరీ అధికారి ఇచ్చే సామాజిక దర్యాప్తు నివేదికను పరిగణనలోకి తీసుకుంటారు. ఇరువురు సభ్యుల తీర్పులో ఏకాభిప్రాయం రానట్లయితే జ్యుడీషియల్ అధికారి తీర్పు చలామణి అవుతుంది. నేరం రుజువు కాలేదని జేజే బోర్డు తీర్పిస్తే దానిపై అప్పీలు లేదు. 16 ఏళ్లు పైబడిన నిందితుల కేసుల్లో లేదా అతి హేయమైన నేరం చేసిన కేసుల్లో మాత్రమే అప్పీలు ఉంటుంది. విచారణ ప్రక్రియ మధ్యలో నిందితులు 18 ఏళ్ల వయస్సు దాటినా, జేజే బోర్డు మాత్రమే కేసు కొనసాగిస్తుంది. నేరం రుజువై ప్రభుత్వ సంస్కరణ గృహానికి పంపబడిన వారిని మంచి పౌరులుగా పరివర్తన తేవటానికి వృత్తి విద్య, కౌన్సెలింగ్ లాంటివి చేపడతారు. హత్య, మానభంగం, లైంగిక అత్యాచారం లాంటి అతి హేయమైన నేరం గురించి 16–18 ఏళ్ల వయసున్న నిందితుడు మానసికంగా, భౌతికంగా తను చేస్తున్న నేరం పరిణామాల గురించి అర్థం చేసుకునే పరిపక్వత ఉండీ నేరం చేసినాడని జేజే బోర్డు ప్రాథమిక అంచనాకు వస్తే ఆ కేసును బాలల కోర్టుకు నిందితుడిని పెద్ద వాడిగా భావించి ఇతర కేసుల్లాగే విచారణ జరిపే నిమిత్తం బదిలీ చేసే విచక్షణాధికారం ఉంది. ఇదిలా ఉండగా 16–18 ఏళ్ల వయసున్న నిందితులు చేసిన అతి హేయమైన నేరంపై జేజే బోర్డు ఒక నిర్ణాయిక ప్రాథమిక అంచనాకు రావడానికి మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా ‘బరున్ చంద్ర ఠాకూర్ వర్సెస్ మాస్టర్ భోలు’ అనే కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం 2022 జూలై 13న ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి అనుగుణంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ముసాయిదా మార్గదర్శకాలు తయారు చేసి, తగిన సలహాలు, సూచనలు 2023 జనవరి 20 లోగా ఇవ్వాల్సిందిగా బహిరంగంగా ప్రజలను, నిపుణులను కోరింది. ఒకసారి మార్గదర్శకాలకు తుది రూపు వస్తే, అన్ని జేజే బోర్డులు నిందితులు చేసిన అతి హేయమైన నేరంపై ఏకరూప ప్రాథమిక అంచనా తీర్పు వెలువరించే అవకాశముంది. తద్వారా హత్య, లైంగిక దాడి లాంటి అతి హేయమైన కేసులకు పాల్పడిన16 ఏళ్లు నిండిన నిందితులను బాలల కోర్టులో విచారణ జరిపే అవకాశముంది. అయినా కూడా 18 సంవత్సరాల వయస్సులోపు వారికి మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించరాదని చట్టం చెప్తోంది. కొద్ది మాసాల క్రితం జూబ్లీహిల్స్ లోని అమ్నీసియా పబ్ వద్ద ఇన్నోవా వాహనంలో బాలికపై సామూహిక అత్యాచార ఆరోపణ కేసులో 16 ఏళ్లు నిండిన నలుగురు బాలురను మామూలు నిందితుల మాదిరే విచారణ జరపాలని జేజే బోర్డు పోక్సో కోర్టుకు పంపించటం మనందరికీ విదితమే. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ 2021 వార్షిక నివేదిక ప్రకారం మన దేశంలో బాలబాలికల మీద 2019లో 32,269 కేసులు, 2020లో 29,768 కేసులు, 2021లో 31,170 కేసులు నమోదైనాయి. దీన్ని బట్టి బాల బాలికల్లో హింసాత్మక, నేర ప్రవృత్తి స్థాయి మనకు అవగతమవుతుంది. దీనికి తల్లిదండ్రుల నిరాదరణ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు కొన్ని కారణాలు. వీటిని పరిహరించడం ద్వారానే రేపటి పౌరులను నేర ప్రపంచంలోకి వెళ్లకుండా ఆపగలం. (క్లిక్ చేయండి: మహిళలు రోడ్డెక్కాలంటే భయం.. అదే పెద్ద సమస్య!) - తడకమళ్ళ మురళీధర్ విశ్రాంత జిల్లా జడ్జి -
Telidevara Bhanumurthy: ఆ ఏడు పోతేమి... ఈ ఏడు వస్తేమి?
కొత్త యాడాదొచ్చింది. యాడాదే గాకుంట బోన్గిరి కెల్లి మా యాద్గిరి మామ గుడ్క ఇంటికొచ్చిండు. ఎప్పుడు మాట్లాడినా రాజకీయాల గురించే మాట్లాడ్తుంటడు. రామాయనం, బారతం గూడ రాజకీయాలే అంటడు. రామునికి కైక వెన్నుపోటు పొడ్వబట్కె పద్నాల్గేండ్లు అడ్విలల్ల దిర్గిండు. పార్టి ఫిరాయించ బట్కె విబీషనుడు లంకకు రాజైండు. వెన్నుపోటు, గోడదుంకుడు ఎప్పటి సందో ఉన్నయని జెప్తుంటడు. ఊరంత ఒక దిక్కైతె ఊసు కండ్లోడు ఒక దిక్కు. అందరు ఎడ్డెం అంటె గాయిన తెడ్డెం అంటడు. ‘‘హ్యాపీ న్యూ ఇయర్ మామా’’ అన్న. చిన్నగ నగిండు. ‘‘కొత్త యాడాదిల సంతోసంతోని ఉండుమంటె ఎక్కిరిచ్చిన తీర్గ నవ్వుతవేందే?’’ అని అడ్గిన. ‘‘కొత్త క్యాలండర్ రాంగనే అంత యాడనన్న కొత్తగైతదార! సూర్యు డేమన్న కొత్తగున్నడా? మొగులు మీది కెల్లి చెంద్రుడు కిందికి దిగొచ్చిండా?’’ ‘‘శానమంది మందు గొట్టిండ్రు. డాన్స్ జేసిండ్రు. కేకులు గోసిండ్రు. అందరు జోష్ మీదుంటె నువ్వు హోష్ గురించి మాట్లాడ్తవేంది?’’ ‘‘కొత్త యాడాదిని మనాయించె తంద్కు నడి నాత్రి దన్క పబ్లను, బార్లను తెర్సి ఉంటెతంద్కు పర్మిసన్ ఇచ్చిండ్రు. తెలంగాన 215 కోట్ల మందు గొడ్తె ఆంద్రల 142 కోట్ల రూపాయల మందు గొట్టిండ్రు. సర్కార్ ఎవ్వలితోని నడుస్తున్నదో ఎర్కెనార? మందుతోని నడుస్తున్నది.’’ ‘‘వహవ్వా! క్యా ఖూబ్’’ ‘‘తొమ్మిదేండ్లు చెంద్రబాబు ముక్యమంత్రి కుర్సి మీద గూసున్నడు. ఏడేండ్లు అపొజిషన్ లీడర్ కుర్సి మీద గూసోని రికార్డ్ బిటాయించిండు. ఆక్రి మోక ఇయ్యుండ్రి. మల్ల ముక్యమంత్రిని జెయ్యుండ్రి అన్కుంట జెనంను బత్మిలాడుతున్నడు. గిదేం కర్మ రాస్ట్రంకు అన్కుంట మీటింగ్లు బెట్టి పల్ల పల్ల ఏడుస్తున్నడు. గా నడ్మ కందుకూరుల సన్నటి బాటల మీటింగ్ బెట్టిండ్రు. దాంతోని మెస్లెతందుకు గుడ్క జాగ లేక జెనం ఒగల మీద ఒగలు బడి ఎనిమిది మంది సచ్చిండ్రు. గిదే పెద్ద కర్మ రాస్ట్రంకు అయ్యింది. చెంద్రబాబు హన్మంతున్ని జెయ్యబోతె బోడ కోతి అయ్యింది. కొత్త యాడాది పస్టు తారీకు గుంటూర్ల టీడీపీ చెంద్రన్న కానుకలు పంచుడు ప్రోగ్రాం బెట్టింది. చెంద్రబాబు స్టేజి ఎక్కుతున్నప్పుడే గాదాని ఒక తంతె కూలింది. తంతెను బాగ జేసినంకనే గాయిన స్టేజ్ ఎక్కిండు. కానుకల కోసం ఆడోల్లు ఒగల నొగలు నూక్కున్నరు. కొందరు కింద బడ్డరు. కింద బడ్డోల్లను తొక్కుకుంట బోయిండ్రు. దాంతోని ముగ్గురు ఆడోల్లు సచ్చిండ్రు. పోయిన యాడాది ఆక్రిల చెంద్ర బాబు బెట్టిన మీటింగ్ల తొమ్మిది మంది సస్తె కొత్త యాడాదిల బెట్టిన మీటింగ్ల ముగ్గురు సచ్చిండ్రు. గివన్ని జూస్తె పచ్చ మీటింగ్ల కర్మేంది రాస్ట్రంకు అని జెనం అన్కుంటున్నరు. కొత్త యాడాదొచ్చినా బాబు మారలే. గాయిన కర్మ మీటింగులు సుత మారలే’’ ‘‘పప్పు లోకేశ్ సంగతేందే?’’ ‘‘అందరు పాదయాత్ర జేస్తున్నరు. ఎన్కట మా నాయిన గుడ్క పాదయాత్ర జేసిండు. బారత్ జోడో అన్కుంట రాహుల్ గాంది గూడ పాదయాత్ర జేస్తున్నడు. ఇయ్యాల గాకున్నా రేపన్న ముక్యమంత్రిని గావాలంటె పాదయాత్ర జెయ్యాలె. నడిస్తినా అంటే తిన్నది అర్గుతది. బొర్ర రాకుంట ఉంటుంది అని లోకేశ్ అన్కుండు. అయ్యగారి తాన్కి బోయిండు. మంచి మూర్తం బెట్టిచ్చు కుండు. 27 తారీకున కుప్పం కెల్లి ఇచ్చాపురం దాన్క పాదయాత్ర జేస్తనని జెప్పిండు. యువ గలం పేరు మీద 400 దినాలు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర జేస్తనన్నడు. యెంబడి పస్పు బస్తలు గూడ గొంచ బోతనని జెప్పిండు. జెనం మీద పస్పు సల్లుకుంట పాదయాత్ర జేస్తనన్నడు. పాదయాత్ర జేస్కుంట టీడీపీని ‘బలవంతం’ జేస్తడు, గిదేందని అడ్గకురా గాయిన ‘బలవంతం’ అంటె ‘బలోపేతం’ అని అనుకుంటడు.’’ (క్లిక్ చేయండి: తమ్ముండ్లూ రాండ్రి! గాలిగొట్టి పోండ్రి!) ‘‘మామా! సలికాలం గూడ ఉబ్బరిస్తున్నదెందుకే?’’ ‘‘కొత్త యాడా దొచ్చిందని సలి గూడ మందు గొట్టి గరమైందిరా. రేల్ గాడి సైమమయింది వొస్తరా’’ అన్కుంట యాద్గిరి మామ ఊరికి బోయిండు. - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
BJP: దక్షిణాదిలో బలపడుతోంది
దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతాపార్టీ దృష్టి అని తరచుగా మనం వింటున్నాం, వార్తలను చదువు తున్నాం. భారతీయ జనతాపార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం కర్ణాటక, పాండిచ్చేరిలో మాత్రమే అధికారంలో ఉంది. అయితే పాండిచ్చేరి చాలా చిన్న రాష్ట్రం. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో బలం పెంచుకోవా లనీ, ఇక్కడ కూడా భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చెయ్యాలనీ అనేక సంవత్సరా లుగా భాజపా అనుకుంటోంది. కేరళ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో భాజపా గణనీయమైన ఓటు బ్యాంకును సంపాదించింది. అయితే సీట్ల విషయంలో ఆశించిన ఫలితాలు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓట్ల శాతం పెంచుకోగలిగింది కానీ సీట్లు మాత్రం రాలేదు. ఇప్పుడు పట్టుదలగా 2024 ఎన్నికల కోసం గట్టి ప్రయత్నాల్లోనే ఉంది. రెండు బలమైన కూటములైన యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య భాజపా ఈసారి తన సత్తా చాటాలని చూస్తోంది. తమిళనాడు విషయానికి వస్తే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భంగపడినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకుని నాలుగు శాసనసభా స్థానాలను గెలుచుకొంది. ముగ్గురు మాజీ రాష్ట్ర అధ్యక్షులకు కేంద్రంలోనూ, ప్రభుత్వంలోనూ సముచిత స్థానం కల్పించింది. రాష్ట్ర పార్టీ పగ్గాలను ఐపీఎస్ అధికారీ, యువకుడూ అయిన అన్నామలైకు అప్పగించి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కేంద్ర నాయకత్వం. జయలలిత మరణానంతరం ఏఐఏడీఎంకే బలహీనపడటం తెలిసిందే. ఆ విధంగా ఏఐఏడీఎంకే స్థానాన్ని భాజపా భర్తీ చెయ్యాలని చూస్తోంది. 5 దశాబ్దాలుగా ప్రాతీయ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీ ఎంకేలు ఏలిన చోట జాతీయ పార్టీగా భాజపా... యువ రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో తమిళనాడులో దూసుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో రెండు ప్రాంతీయ పార్టీలయిన – వైసీపీ, టీడీపీల మధ్య ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని మాత్రమే గెలిచినప్పటికీ 2019 పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్, కాంగ్రెస్లకు షాక్ ఇచ్చి ఏకంగా 4 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొంది. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికలలో మరో రెండు శాసనసభ స్థానాలను గెలిచి మొన్న మునుగోడులో టీఆర్ఎస్కు గట్టి సవాల్ విసిరింది. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఒకవైపు, యువ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తన పాదయాత్రతో మరోవైపు కేసీఆర్కు చెమటలు పట్టిస్తున్నారు. మరోవైపు డా. కే. లక్ష్మణ్ను రాజ్యసభ సభ్యుడిగానూ, ఓబీసీల జాతీయ అధ్యక్షుడి గానూ చేశారు. డీకే అరుణ, ఎంపీ అరవింద్, ఈటెల రాజేందర్ లాంటి వారు ఈసారి ఎలాగైనా తెలంగాణలో కాషాయ జెండా ఎగుర వెయ్యాలని తీవ్రంగా పనిచేస్తున్నారు. మొత్తం మీద దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ స్థిరమైన వేగంతో ముందుకు సాగుతోంది. (క్లిక్ చేయండి: అమృతోత్సవ దీక్షకు ఫలితం?!) - రఘురామ్ పురిఘళ్ళ బీజేపీ సీనియర్ నాయకులు raghuram.bjp@gmail.com -
GM Mustard: ఆధారాలు లేకుండానే అనుమతులా?
ప్రశ్నలు వేయడం, వాటికి సమాధానాలు కనుక్కోవడంతోనే సైన్స్ ప్రస్థానం మొదలవు తుందని మా సైన్స్ టీచర్ చెబుతూండేది. ఇంకోలా చెప్పాలంటే... సైన్స్ ఎల్లప్పుడూ ప్రశ్నలకు సిద్ధంగా ఉంటుందీ అనాలి! దీనివల్ల సాంఘిక, ఆర్థిక ఆందోళనలకు తావిచ్చే, పర్యావరణ విధ్వంసానికి దారితీసే అపోహలను తొలగించుకోవచ్చు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలపై వ్యాఖ్యానం చేయవచ్చు. అయితే ఆర్థిక ప్రయోజనాల కారణంగా సత్యాన్వేషణ తాలూకూ గొంతుకలను నొక్కివేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రదర్శించే సాక్ష్యాలు కూడా నమ్మదగ్గవిగా ఉండవు. విషయం ఏమిటంటే... జన్యుమార్పిడి పంటలపై ఎప్పుడు చర్చ మొదలైనా, సాక్ష్యాల ఆధారంగా ముందుకెళ్లాలని కొందరు శాస్త్రవేత్తలు చెబుతూంటారు. తద్వారా శాస్త్రీయ సమాచారం, వాదం, ప్రజా విచారణలన్నీ పక్కకు తొలగిపోయేలా చేస్తూంటారు. దేశంలోకి మొట్టమొదటి జన్యుమార్పిడి పంట బీటీ కాటన్ను 2001లో వాణిజ్యస్థాయిలో విడుదల చేశారు. అప్పట్లో జరిగిన జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) సమావేశాల్లో పాల్గొన్న వారిలో నేనూ ఉన్నాను. జన్యుమార్పిడి పంటల ప్రవేశంపై తుది నిర్ణయం తీసుకునే ఈ జీఈఏసీ సభ్యులతోపాటు, ‘జెనిటిక్ మ్యానిపులేషన్ అండ్ ద మానిటరింగ్ కమిటీ’కి సంబంధించిన పర్యవేక్షణ బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొంది. బీటీ పత్తి విత్తనాన్ని అభివృద్ధి చేసిన మహికో – మోన్శాంటో సభ్యులు, కొంతమంది పౌర సమాజపు ప్రతినిధులు కూడా అందులో ఉన్నారు. రెండు నెలలు ఆలస్యంగా నాటినా ఆ ఏడాది పత్తి పంట దిగుబడి యాభై శాతం ఎక్కువైనట్లు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం చెబుతోందని సమావేశంలో ప్రస్తావించారు. బీటీ కాటన్ కారణంగానే ఇలా జరిగిందనడంతో ఆశ్చర్యం వేసింది నాకు. ఆ సమాచారం తప్పనీ, అశాస్త్రీయమైందనీ, దాన్ని ఏదైనా పరిశోధన సంస్థతో నిర్ధారించాలనీ నేను పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్, అప్పటి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ను కోరాను. సాధారణ పరిస్థితుల్లో ఎదిగేందుకు ఐదు నెలల సమయం తీసుకునే పంటలో రెండు నెలలు ఆలస్యంగా విత్తినా అధిక దిగుబడి సాధించడం దాదాపు అసాధ్యం. వ్యవసాయ పరి శోధనల్లో విత్తనాలు వేసే సమయం చాలా ముఖ్యమైన అంశమన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అంశంలో ఒక ప్రైవేట్ కంపెనీకి మినహాయింపు ఇస్తే, భవిష్యత్తులో యూనివర్సిటీ శాస్త్రవేత్తలను కూడా విత్తిన సమయం గురించి పట్టించుకోవద్దని చెప్పే అవకాశం ఏర్పడుతుంది. జీఈఏసీ ఛైర్మన్కు నేను వేసిన ప్రశ్న ఏమిటంటే– రెండు నెలలు ఆలస్యంగా విత్తినా దిగుబడి పెరగడ మంటే... అది రైతులకు చాలా ప్రయోజనకరమైంది కాబట్టి, రైతులందరూ రెండు నెలలు ఆలస్యంగా విత్తుకోవాలని ఎందుకు సలహా ఇవ్వకూడదూ? అని! ఈ సమావేశం పూర్తయిన తరువాత సాయంకాలం ఐసీఏఆర్ ఉన్నతాధికారి ఒకరు నాతో మాట్లాడుతూ, బీటీ విత్తనాల ట్రయల్స్ ఇంకో ఏడాది చేయాల్సిందిగా మహికో–మోన్శాంటో కంపెనీని కోరినట్లు తెలిపారు. అవసరమైనంత మేర అన్ని పరీక్షలు పూర్తి చేసినట్లు మోన్శాంటో చెప్పినా జన్యుమార్పిడి పంటల అనుమతిని ఒక ఏడాది ఆలస్యం చేయగలిగామన్నమాట. ఆ సమావేశంలో ప్రశ్నలేవీ వేయకుండా ‘సాక్ష్యాల’ ఆధారంగా అనుమతులిచ్చి ఉంటే ఏడాది ముందుగానే జన్యుమార్పిడి పంటలు దేశంలోకి వచ్చేసి ఉండేవి. బీటీ వంకాయపై నిషేధం దేశంలోకి బీటీ వంకాయ అనుమతిని నిరాకరిస్తూ 2010లో అప్పటి పర్యావరణ శాఖ మంత్రి జైరామ్ రమేశ్ ఒక ప్రకటన చేశారు. ‘డెసిషన్ ఆన్ కమర్షియలైజేషన్ ఆఫ్ బీటీ బ్రింజాల్(బీటీ వంకాయ వాణిజ్యీకరణ మీద నిర్ణయం)’ పేరుతో అప్పట్లో 19 పేజీల డాక్యుమెంట్ ఒకటి విడుదలైంది. దీనిపై శాస్త్రవేత్తలు ఎన్ని మాటలు చెప్పినా నా అంచనా ప్రకారం ప్రతి వృక్ష శాస్త్రవేత్తా కచ్చితంగా చదవాల్సిన డాక్యుమెంట్ అది. దేశ విదేశాల్లోని శాస్త్రవేత్తలతో, ఏడు దఫాలుగా ప్రజలతో సంప్రదింపుల తరువాత జైరామ్ రమేశ్ ఆ డాక్యుమెంట్ను విడుదల చేశారు. జన్యుమార్పిడీ టెక్నాలజీపై రైతులు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు దేశం మొత్తమ్మీద వంకాయ పండించే ప్రాంతాల్లో సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. జాగరూకత, ముందస్తు జాగ్రత్త, సిద్ధాంతాల ఆధారంగా జైరామ్ రమేశ్ ఒక నిర్ణయం తీసుకుంటూ... ఏ కొత్త టెక్నాలజీ అయినా ఆయా సముదాయాల సామాజిక, సాంస్కృతిక విలువలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. మీడియాలో ఒక వర్గం జన్యుమార్పిడి పంటలపై బహిరంగ విచారణను తోసిపుచ్చింది. అంతా బూటకం అని కొట్టి పారేసింది కూడా. అయితే ప్రజలు లేవనెత్తిన కీలకమైన అభ్యంతరాలను మంత్రి గుర్తించి తగు నిర్ణయం తీసుకోవడం మాత్రం నాకు ఆనందం కలిగించింది. అంతేకాదు... జన్యుమార్పిడి విత్తన సంస్థల అధ్యయనాల నియమాలు, సమాచారాన్ని విశ్లేషించిన తీరు, ఫలితాలన్నింటినీ ప్రస్తావిస్తూ డాక్యుమెంట్ను రూపొందించడమూ ప్రశంసనీయమైన అంశం. జాగరూకతతోనే ముందుకు వాస్తవ పరిస్థితులకూ, కొందరు సేకరించే సాక్ష్యాలకూ మధ్య ఉన్న అంతరం సైన్స్ ఆధారిత పద్ధతుల అవసరాన్ని మరోసారి నొక్కి చెబుతోంది. శాస్త్రపరమైన విచారణను పరిమితం చేయడం మార్కెట్ పోకడల్లో ఒకటి. వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు మార్కెట్లు సైన్స్ను తొక్కేసేందుకూ ప్రయత్నిస్తూంటాయి. జీఎం ఆవాల విషయంలో జరుగుతున్నదీ అదే. జీఈఏసీ ఇటీవలే దీనికి పర్యావరణ అనుమతులు ఇచ్చేసింది. ఈ డీఎంహెచ్–11 జన్యుమార్పిడి ఆవాల పంట దిగుబడి సామర్థ్యం ఎంతన్నది ఐసీఏఆర్కూ తెలియక ముందే పర్యావరణ అనుమతులు రావడం గమనార్హం. దేశ వంటనూనె దిగుమతులను ఈ సరికొత్త ఆవాల ద్వారా తగ్గించుకోవచ్చు అన్న భావనను కలిగిస్తున్నారు. అయితే దీని దిగుబడి చాలా తక్కువ అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే అదెంత తప్పుడు భావనో అర్థమైపోతుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం... జీఎం ఆవాల పరీక్షలకు అన్ని ప్రోటోకాల్స్ను ఢిల్లీ యూనివర్సిటీ స్వయంగా సిద్ధం చేసింది. విద్యార్థినే ప్రశ్నాపత్రం తయారు చేయమని అడగటం లాంటిది ఇది. అంతేకాదు... హెర్బిసైడ్ల(గడ్డిమందుల)ను తట్టుకునే ఆవాల వెరైటీ బీటీ వంకాయ మాదిరిగా కనీస పరీక్షలను కూడా ఎదుర్కోలేదు. జీఎం ఆవాల పరీక్షల్లో ఆరోగ్య నిపుణులు ఎవరూ లేకపోవడం, తేనెటీగలపై జీఎం ఆవాల ప్రభావం ఏమిటన్నది పరిశీలించకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లోపాలు. ఇన్ని లోపాల మధ్య జీఈఏసీ విత్తనాల వృద్ధికి ఎలా అనుమతిచ్చిందో అర్థం కావడం లేదు. సైన్స్ అంటే సత్యాన్ని వెతకడం. ఇటాలియన్–బ్రిటిష్ ప్రొఫెసర్ మైకెలా మాసిమీ 2017లో లండన్ రాయల్ సొసైటీ అవార్డు అందుకుంటున్న సందర్భంగా చేసిన ప్రసంగంలో అచ్చంగా ఈ వ్యాఖ్యే చేశారు. ‘‘ప్రజలకు సైన్స్ విలువను అర్థమయ్యేలా చేయడం మన బాధ్యత అని నేను నమ్ముతున్నాను. కచ్చితత్వం, సాక్ష్యాలు, సిద్ధాంతాలపై విశ్వాసం, కచ్చితమైన పద్ధతులను అవలంబించడం వంటి వాటిని కూడా నిశితంగా పరిశీలించాలి’’! (క్లిక్ చేయండి: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!) - దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
TS SSC Exam 2023: పిల్లకాకిపై ఉండేలు దెబ్బ!
గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ; రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్సీ ఈఆర్టీ) వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ అటు విద్యార్థులనూ, ఇటు ఉపాధ్యాయులనూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అటువంటి వివాదాస్పద ఉత్తర్వుల జాబితాలో తాజాగా 2022 డిసెంబర్ 28న పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఇచ్చిన జీఓఎమ్ఎస్ నం. 33 ఒకటి. వాస్తవానికి ఈ ఉత్తర్వు విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సి ఉండగా సమ్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు 11 పేపర్లుగా రాసిన అనంతరం చాలా ఆలస్యంగా డిసెంబర్లో మేలుకోవడమే విద్యా శాఖ అలసత్వానికి నిదర్శనం. కోవిడ్కు ముందు 10వ తరగతి విద్యార్థులకు 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించేవారు. హిందీ మినహా మిగిలిన అన్ని సబ్జెక్ట్లను రెండు పేపర్లుగా విభజించి పరీక్షలు నిర్వహించేవారు. గత రెండు, మూడు ఏళ్లుగా కోవిడ్ మహమ్మారి కారణంగా భౌతికంగా తరగతులు సరిగా జరుగకపోవడం వల్ల, విద్యార్థులు ఆన్లైన్ తరగతులు సరిగా వినకపోవడం వల్ల విద్యార్థుల్లో తగ్గిన అభ్యసన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని పేపర్ల సంఖ్య తగ్గించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర విద్యాశాఖ జీఓ 33 ద్వారా 11 పేపర్లను 6 పేపర్లకు తగ్గించడంతో పాటుగా... ఎస్సీఈఆర్టీ ద్వారా మోడల్ పేపర్లను కూడా విడుదల చేసింది. కానీ ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ రెండు సబ్జెక్ట్ల పరీక్షలను ఒకేరోజు ఒక్కొక్క పేపర్ను ఒక గంట ముప్పై నిమిషాలపాటు నిర్వహించాలని ఉత్వర్వులలో పేర్కొనడం హాస్యాస్పదంగా మారింది. వాస్తవానికి నిర్వాహణలో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఒక పేపరు రాసిన వెంటనే ఆ పేపరును తీసుకొని మరో పేపరును విద్యార్థికి స్పల్ప సమయం తేడాతో ఇస్తారు. రెండు పేపర్లను చదువుకోవడానికి మరో ఇరవై నిముషాల సమయం అదనంగా ఇచ్చినా మూడు గంటల ఇరవై నిముషాల పాటు ఈ రెండు పరీక్షలు ఒకే రోజు నిర్వహించడం వలన విద్యార్థికి చాలా అన్యాయం జరుగుతుంది, ఇటు పరీక్ష నిర్వాహకులకూ ఇబ్బందే. అందుకని ఈ రెండు పరీక్షలను వేరు వేరు రోజులలో నిర్వహించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్తో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖను కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గతంలో ఒక్కొక్క సబ్జెక్ట్ రెండు పేపర్లు ఉండగా ఇప్పుడు ఒక సబ్జెక్ట్లోని అన్ని పాఠాలను మొత్తం చదివి ఒకే రోజు పరీక్షను రాయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరమున్నది. రెండు పేపర్ల విధానంలో పరీక్షలు ఉన్న సందర్భాలలో సంక్షిప్తరూప ప్రశ్నలు ఎక్కువగా ఉండి విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు వ్యాసరూప ప్రశ్నల సంఖ్యను పెంచడం వలన రాసే సమయం అధికంగా పెరగడమేకాక, ఛాయిస్ విధానాన్ని తగ్గించడం వలన విద్యార్థులు అన్ని ప్రశ్నలకు జవాబులు రాయడానికి సమయం సరిపోక 10 జీపీఏను సాధించడం కష్టంగా మారింది. అలాగే 2022 డిసెంబర్ 30 నాడు స్పెషల్ రివిజన్ క్లాసుల పేరిట ఎస్సీఈఆర్టీ వారు మరో వివాదస్పద ఉత్తర్వును ఇచ్చారు. వారాంతపు సెలవులను, సెలవు దినాలను కూడా మినహాయించకుండా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలనేది దాని సారాంశం. ఇది ఇబ్బందులతో కూడుకున్నది. గ్రామీణ ప్రాంతాల్లో... చుట్టుపక్కల రెండు, మూడు గ్రామాల నుండి విద్యార్థులు తమ హైస్కూల్కు వస్తారు. ముఖ్యంగా అమ్మాయిలను సాయంత్రం 6 గంటల వరకు ఉంచడం వల్ల... తలెత్తే రవాణాసౌకర్యం సమస్య ఎలా పరిష్కరించాలి. ముఖ్యంగా భద్రతాపరమైన అంశాలపై జవాబుదారు ఎవరనే ప్రశ్న తలెత్తుతున్నది. పాఠశాలలో కేవలం మధ్యాహ్నా భోజన సౌకర్యం మాత్రమే ఉన్నది. ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు విద్యార్థులకు ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్ ఎవరివ్వాలి? జాయిఫుల్ లర్నింగ్కు, ఆర్టీఈకి విరుద్ధంగా వారాంతపు, ప్రభుత్వ సెలవు దినాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఎస్సీఈఆర్టీ గతంలో ఎప్పుడూ నేరుగా ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చేది కాదు. ఏ ఆదేశాలైనా పాఠశాల విద్యాశాఖాద్వారానే వచ్చేవి. కాని ఈ మధ్యకాలంలో నేరుగా పాఠశాల విద్యాశాఖతో సంబంధం, సమన్వయం లేకుండానే పాఠశాలకు సంబంధించిన పనిదినాలపైనా, సెలవులపైనా పాఠశాల విద్యాశాఖ జారీచేసిన అకడమిక్ క్యాలెండర్కు భిన్నంగా ఎస్సీఈఆర్టీ దాని పరిధిని దాటి ఆదేశాలు ఇస్తోంది. దీంతో అసలు ఎవరి ఆదేశాలను పాటించాలో అర్థంకాక ఉపాధ్యాయులలో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకొని వివాదాలు లేకుండా రాష్ట్ర విద్యాశాఖ, టీఎస్ఎస్సీఈఆర్టీలు ఇప్పటికైనా విధానాల రూపకల్పన చేస్తే భవిష్యత్తులో ఎటువంటి విమర్శలు, వివాదాలు లేకుండా విద్యావ్యవస్థ సజావుగా కొనసాగుతుంది! (క్లిక్ చేయండి: రామప్ప దేవాలయానికి పొంచి ఉన్న ముప్పు) - డాక్టర్ ఏరుకొండ నరసింహుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టీచర్స్ యూనియన్ -
Vemana: వేమనకు కొండంత వెలుగు
వేమన పద్యం ఒకటైనా రాని తెలుగువారు ఉండరు. తెలుగు జాతి ఉన్నంతకాలం వేమన పద్యాలు ప్రజల నాలుకలపై నిలిచే ఉంటాయి. తెలుగు నేలపై నడయాడిన వేమన తెలుగు సాహిత్యానికి ఒక కొండగుర్తుగా నిలుస్తారు. భాషలో, భావంలో ప్రజలకు సాహిత్యాన్ని చేరువ చేసిన ఘనత వేమనది. సమాజంలోని అన్ని అసమానతలు పోయి మనుషులు మానవీయంగా ఎదగాలని వేమన కోరు కున్నారు. ఉన్న స్థితి నుండి సమాజం మరో అడుగు ముందుకు సాగాలని తపించారు. ఆటవెలదులనే ఈటెలతో సమాజ సంస్కరణకు పూనుకొన్నారు. ఆ తర్వాత అనేక తరాల కవులకు మార్గ దర్శకంగా నిలిచారు. దేశ విదేశాల పండితులను సైతం వేమన పద్యాలు ఆకర్షించాయి. పాశ్చాత్య భాషలలోనూ అనువాదమయ్యాయి. తెలుగు సమాజానికి వెలుగులు నింపిన వేమనకు కొండంత వెలుగును ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19న వేమన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్ణయించింది. డిసెంబర్ 30న ఈ విషయమై జీఓ 164ను విడుదల చేసింది. కర్ణాటక ప్రాంతంలో తెలుగువారు స్వచ్ఛందంగా వేమన జయంతిని జరుపుకొనే సంప్రదాయం ఉంది. వందేళ్ళ నాడే కట్టమంచి రామలింగారెడ్డి తదితరుల ప్రోత్సాహం కూడా అందులో ఉంది. ప్రజల ఆకాంక్ష లను గుర్తించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2017 డిసెంబర్ 22న వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తాలుకా స్థాయిలో రూ. 25,000, జిల్లా స్థాయిలో 50,000, రాష్ట్ర స్థాయిలో రూ.10 లక్షలు... మొత్తం అరవై తొమ్మిదిలక్షల రూపాయలు ప్రతి ఏడాదీ కేటాయిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఇందులో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ధార్వాడ విశ్వ విద్యాలయంలో 1980లలోనే ‘వేమన పీఠం’ ఏర్పాటు చేసిన విషయం కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్లోనూ సాంస్కృతిక శాఖ వేమన జయంతిని కర్ణాటక రాష్ట్రంలో లాగా నిర్వహించాలని 2018 లోనే వేమన సంఘాలు, అభిమానులు కోరడమైంది. అప్పటి మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడమయింది. వేమన సమాధి ప్రాంతమైన కటారుపల్లి గ్రామం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉంది. స్థానికుల ఒత్తిడితో అప్పటి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష వేమన జయంతి విషయమై 10 సెప్టెంబరు 2019న అసెంబ్లీలో ప్రశ్నించారు. కనీస చర్చ కూడా జరగడానికి సభాపతి అవకాశం ఇవ్వలేదు. సాంస్కృతిక శాఖ కోట్లకు కోట్లు వేరు వేరు సాహిత్య, సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలు ఆ రోజులలో చేసింది. అనేకమంది కవుల కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించింది. వేమనపై కనీసం ఒక సదస్సు నిర్వహించమని కోరినా పట్టించుకోలేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సాంస్కృతిక శాఖ పక్షాన వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని వేమన సంఘాలు కోరుతూ వచ్చాయి. 2019 నుండి ఈ ప్రక్రియ మొదలై నేడు అది సాకార మైంది. వేమన రాష్ట్ర స్థాయి పండుగ నిర్వహించబోతున్న ఈ సందర్భంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం. సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గంలోని కటారుపల్లి గ్రామంలోని వేమన సమాధి ప్రాంతంలో ప్రారంభ రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించాలి. రాష్ట్రంలోని వివిధ జోన్లలో ఒకో సంవత్సరం ఒకోచోట కార్యక్రమం ఉండేలా చేయాలి. జిల్లా, నియోజక వర్గ, మండల, గ్రామ స్థాయి వరకూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 19న కార్యక్రమాలు చేయాలి. విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా వేమన పద్యపోటీలు, సదస్సులు నిర్వహించాలి. మాజీ డీజీపీ పర్యాటకశాఖ సంస్థ ఛైర్మన్ చెన్నూరు అంజనేయరెడ్డి 2003లో ప్రత్యేక శ్రద్ధతో కటారుపల్లిలో వేమన సమాధిప్రాంతం, పరిసరాలలో అభివృద్ధి కోసం 3 కోట్లు కేటాయించారు. కోటిన్నర రూపాయల దాకా ఖర్చు జరిగింది. మిగతా నిధులు పూర్తి స్థాయిలో వినియోగించలేదు. తక్షణం నిధులు కేటాయించి పూర్తి స్థాయి పనులు చేపట్టాలి. వేమన సాహిత్యంపై అధ్యయనానికీ, విస్తరణకూ ఒక ప్రత్యేక పరిశోధనా సంస్థనూ, గ్రంథాలయాన్నీ నెలకొల్పాలి. ఆధునిక తరానికి వేమన గురించి తెలిసేలా ప్రత్యేక వెబ్సైట్ నడపాలి. ప్రామాణిక వేమన పద్యప్రతిని రూపొందించడానికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలి. పాఠ్య పుస్తకాలలో వేమన పద్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేమనతో ముడిపడిన కొండవీడు, గండికోట, నల్లచెరువు, పామూరు తదితర స్థలాలకు గుర్తింపు తీసుకురావాలి. జాతీయకవిగా వేమన గుర్తింపునకై కృషి జరగాలి. (క్లిక్ చేయండి: ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..) - డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి కార్యదర్శి; వేమన ఫౌండేషన్, అనంతపురం -
Demonetisation: పెద్ద నోట్ల రద్దు ఫలితమేంటి?
2016 నవంబర్ 8న ప్రధాని ప్రకటించిన నోట్ల రద్దుపై వ్యాజ్యాలను విన్న అత్యున్నత న్యాయస్థానం ఆ ప్రక్రియలో ప్రభుత్వం పరిధి మీరడం లాంటిదేమీ లేదనీ, అంతా పద్ధతి ప్రకారమే జరిగిందనీ తీర్పు వెలువరించింది. నలుగురు న్యాయమూర్తులు ఇదే అభిప్రాయం వెలిబుచ్చగా, ఒక్కరు మాత్రం సరికాదంటూ విభేదించారు. న్యాయస్థానం మద్దతు ప్రభుత్వానికి కొంచెం ఊరట. ఒకవేళ ఆ ప్రక్రియని న్యాయస్థానం తప్పుపట్టి ఉన్నా వాస్తవంలో పెద్ద ప్రభావం ఏమీ ఉండేది కాదు గానీ ప్రభుత్వం వైపు నుండి తప్పు జరిగినట్లు భావన స్థిరపడి పోయేది. ఎప్పుడో జరిగిపోయిన నిర్ణయం.. పర్యవసానాలు కూడా అనుభవమై పోయాక అది, తప్పో ఒప్పో అన్నది కేవలం మేధోమధనం కోసమే. అయినా విధాన పరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం ఎటూ జోక్యం చేసు కోదు. అది దాని పరిధిలోని అంశం కాదు. పెద్ద నోట్ల రద్దు విషయంలో రిజర్వ్ బ్యాంకును సంప్రదించకుండా ఏకపక్షంగా, హఠాత్తుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నది పిటిషనర్ల వాదన. అయితే ఆరు మాసాల ముందు నుండే సంప్ర దింపుల ప్రక్రియ జరిగినట్లు, ప్రకటన వరకూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి నట్లు ప్రభుత్వం చెప్పడంతో న్యాయస్థానం ఆ ప్రక్రియ చట్టబద్ధతను సమర్థించింది. ప్రభుత్వానికి ఆ హక్కు ఉందని తెలియజేసింది. ఒక న్యాయమూర్తి మాత్రం నోట్ల రద్దు ప్రతిపాదన రిజర్వు బ్యాంకు నుండి కాకుండా కేంద్రం నుండి రావడాన్నీ, ప్రకటించే ముందు పార్లమెంట్ను విశ్వాసంలోకి తీసుకోకపోవడాన్నీ తప్పు పట్టారు. వారి అభిప్రాయం కూడా గమనంలోకి తీసుకుని ప్రభుత్వం భవిష్యత్లో ఈ తరహా పెద్ద నిర్ణయాల్లో ఇలాంటి వైఖరి తీసుకోకుండా ఉంటే సబబుగా ఉంటుంది. భిన్న వాదనల్ని పక్కకు పెట్టి నిష్పక్షపాతంగా చూస్తే పెద్ద నోట్ల రద్దు ప్రకటించక ముందు ప్రభుత్వం ఇంకొంత జాగ్రత్త వహించి అన్నికోణాల్లో ఆలోచించి ఉంటే బాగుండేది. తీవ్రంగా నష్టపోయిన అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తక్కువ తగిలేది. జనజీవనం, సామాన్యుల నగదు లావాదేవీలు కుదుపు నుండి తొందరగా కోలుకొనేవి. వెరసి ఆర్థిక వ్యవస్థకు లాభం జరిగేది. (క్లిక్ చేయండి: 2023లో మన విదేశాంగం ఎటు?) పెద్దనోట్ల రద్దు వల్ల ఒనగూడే ప్రయోజనాలు ఇవి అంటూ ప్రధాని ఏవైతే చెప్పారో (నల్లధనం తగ్గుదల, నకిలీ నోట్ల నివారణ, తీవ్రవాదులకు ఫండింగ్) వాటిలో ఎన్ని సాధ్యమయ్యాయో ఇప్పటికీ లెక్కలు లేవు. అధ్యయనం చేసి ఆ గణాంకాల్ని వెలికితీస్తే గానీ అసలు వాస్తవం బోధపడదు. నిర్ణయం చట్టబద్ధమే కావొచ్చు కానీ ఫలితం ఏమిటి అన్నది ప్రధానం. ఔషధం సరియైనదా, కాదా... సరియైనదే అయినా వికటించిందా, లేక అనుకున్న ప్రభావం చూపిందా అన్నదే గీటురాయి. – డాక్టర్ డి.వి.జి. శంకర రావు; మాజీ ఎంపీ, పార్వతీపురం -
Warangal: రామప్ప దేవాలయానికి పొంచి ఉన్న ముప్పు
తెలంగాణకే తలమానికమైన అపురూపమైన వరంగల్ రామప్ప దేవాలయం మళ్లీ ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. అది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినందుకు ప్రతి తెలుగువాడూ, భారతీయుడూ ఎంతో సంతోషించారు. ఆ సంతోషాన్ని సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్టింగ్ పనులు ఆవిరి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే ఆర్కియ లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పరిరక్షణ, నిర్వహణలో ఈ కట్టడం ఉంది. అది యాత్రికుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందటంలో చూపిస్తున్న శ్రద్ధ కట్టడ పరిరక్షణలో చూపడం లేదు. 2010లో కోస్టల్ కంపెనీ దేవాదుల సొరంగం తవ్వకాలు చేపట్టిన తరుణంలో అది పేల్చిన బాంబుల కారణంగా రామప్ప గుడి విలవిల లాడి గోడలు బీటలు వారిన విషయం సర్వదా విశదమే. ఈ విధ్వంసాన్ని అతి విషాదకరంగా పలు పత్రికలు ప్రపంచానికి వెల్లడి చేసినా ఏఎస్ఐ అంతగా ప్రతిస్పందించ లేదనే విమర్శ ఉంది. దీంతో కళాకారులు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, ప్రజాసంఘాల వారు ‘రామప్ప పరిరక్షణ కమిటీ’గా ఏర్పడి ఆందోళనలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ రామప్ప గుడి చుట్టూ ఇరవై కి.మీ.ల దూరంలోని వెంకటాపురం, నల్లగుంట, పెద్దాపురం తదితర గ్రామాల పరిధిలో ఓపెన్ కాస్టు తవ్వకాలు జరుపడానికి సంవత్సరానికి మూడు పంటలు పండే పంట పొలాలను సర్వేచేసి స్వాధీనం చేసుకునే దిశలో సింగరేణి ఉండగా ‘రామప్ప పరిరక్షణ కమిటీ రంగంలోకి దిగింది. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి సింగరేణి కంపెనీ అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు సద్దుమణగ చేశారు. ఇదే సమయంలో ఏఎస్ఐతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదన పత్రాలు యునెస్కోకు వెళ్లడం, రెండు సార్లు తిరస్కరణకు గురికావడం... చివరికి ప్రపంచ వారసత్వ సంపదగా రామప్పకు గుర్తింపు పొందడం తెలిసిందే. కాగా సంవత్సరం క్రితం ‘మళ్ళీ ఓపెన్ కాస్టు తవ్వకాలు ప్రారంభం’ అనే వార్త వచ్చింది. రామప్ప పరిరక్షణ కమిటీ , ఇతర ప్రజా సంఘాలూ తిరిగి ఆందోళన వ్యక్తం చేయడంతో సింగరేణి కంపెనీ యాజమాన్యం రామప్ప గుడి పరిసరాల్లో ఓపెన్ కాస్టులు తవ్వబోమని మీడియా ద్వారా హామీ ఇచ్చింది. అయితే మళ్ళీ రామప్పగుడికి ఓపెన్ ముప్పు రానున్నదనీ, పరిసర గ్రామాల్లో సింగరేణి అధికారులు ఓపెన్ కాస్టుకు సంబం ధించిన సర్వేలు చేస్తున్నారనే విషయం వెలుగు చూసింది. అందుకే ఈ ప్రయత్నాలను పత్రికా ముఖంగా కమిటీ ఖండిస్తున్నది. (క్లిక్ చేయండి: వేయి రేఖల వినూత్న సౌందర్యం) – నల్లెల్ల రాజయ్య తదితర ‘రామప్ప పరిరక్షణ కమిటీ’ సభ్యులు -
ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా
పేదరికం పేగు తెంచుకొని పుట్టినందుకు పూటకుపూట అన్నం కోసం దేవులాడుకుంటున్నాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా మీ ప్రచార ఆర్భాట గాలానికి గుచ్చిన రూపాయి ఎరకు ఆశపడి కష్టాల కొక్కెను గొంతులో ఇరికించుకున్నాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా మీ మోచేతి మత్తు కోసం గుటకలు మింగే మా మొగోళ్ళు మా బాధలను గాలికొదిలేసి మీ చెప్పులతో స్నేహం చేస్తున్నారు ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా జనమంతా మీతోనే ఉన్నారని నమ్మించడానికి మీరు చల్లిన నూకలు ఆకలి గుంపును అదిమి పట్టడానికే అని తెలిసికూడా మీ మాయల ఉచ్చులోపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా మీరు విదిలించే కానుకల కిట్లు మా ఇంట్లో కొత్త సంవత్సర శోభ తెస్తాయని ఇంటిల్లిపాది పనులు మానుకొని బారులు తీరి మీ కుతంత్రం కాళ్ళకింద పడి ఊపిరి వదిలేశాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా ఈ ప్రపంచాన్ని నోటు నడిపించినంత కాలం... ఈ నోట్లు పెద్దోళ్ళ పెరట్లో కాస్తున్నంత కాలం... మా కూలి బతుకుల్లో విచ్చుకున్న ఆకలి గాయాలు నిత్యం ఏడుస్తూనే ఉంటాయి ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా – డాక్టర్ ఎన్. ఈశ్వర రెడ్డి, ప్రొఫెసర్, యోగివేమన యూనివర్సిటీ, వైస్సార్ కడప జిల్లా (గుంటూరు తొక్కిసలాటలో కూతురును కోల్పోయిన ఒక తల్లి రోదిస్తూ... ‘మా రాత అట్టా రాసుందయ్యా’ అన్న వాక్యం విన్న బాధతో) -
ఆధునికతకు అంబేడ్కరిజాన్ని జోడించాలి
యువతరాన్ని అంబేడ్కర్తో అనుసంధానం చేయాలి. వాస్తవిక సమాజ పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తూ యుక్తవయసులోనే విప్లవాత్మకమైన ఆలోచనలు చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. అత్యధిక ఆదాయాన్ని సంపాదించిపెట్టే వృత్తిగా నిలచే బారిష్టర్ను చదివే అవకాశం ఉన్నా, సమాజానికీ, దేశానికీ ఉపయుక్తంగా నిలచే అర్థశాస్త్రాన్ని కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పూర్తిచేసిన ఆయన వ్యక్తిత్వం నేటి తరానికి అవగతం కావా ల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ని ఒక రివల్యూషనరీ థింకర్గా చెప్పవచ్చు. అంబేడ్కర్ ఆలోచనలే పునాదిగా ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ స్థాపన జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అగ్ర రాజ్యాల ఆర్థిక వ్యవస్థలు సైతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా... భారతీయ ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరకుండా తగిన సుస్థిరత్వాన్ని కలిగి ఉందంటే అలా ఉండటానికి అంబేడ్కర్ ఆలోచనలు, ప్రయత్నాలు సఫలీ కృతం అయ్యాయనే అర్థమవుతుంది. ఎకనామిక్స్లో చదువు పూర్తయిన తర్వాత మాత్రమే ఆయన బారిష్టర్ చదువు కున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పీహెచ్డీని పూర్తిచేసిన ఆయన ప్రతిభను ప్రస్తుత తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ను దర్శించిన ఆలోచనలు అంబేడ్కర్ సొంతం. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత చైనా ఎప్పటికైనా భారత్కు ముప్పు తెస్తుందని గుర్తించిన వ్యక్తి అంబేడ్కర్, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం చైనాకు బదులు భారత్కు వచ్చే విధంగా కృషిచేయాలని ఆయన చేసిన సూచనలను నాటి నేతలు పక్కన పెట్టడం అందరికీ తెలిసిందే. దీని పర్యవసానాలను చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చైనా తన వీటో అధికారాన్ని భారత్కు వ్యతిరేకంగా 9 పర్యాయాలు వాడుకుంది. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించడం, పారిశ్రామికీకరణతో కలిగిన మార్పులు, ఎకనామిక్ హోల్డింగ్.. వంటి అంశాలు నేడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. కానీ వీటిని అంబేడ్కర్ 1927–28లోనే ప్రస్తా వించారనే విషయం చాలా మందికి తెలియదు. అంబేడ్కర్ను కేవలం రాజ్యాంగ నిర్మాతగా మనం పిలుస్తుంటాం. ఆయన చేసిన పనుల్లో ఒకటిగా మాత్రమే ఇది నిలుస్తుంది. దీనితో పాటు దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులూ, స్థితిగతులపై సమగ్ర అవగాహనా, ఆలోచనా భవిష్యత్ ప్రణాళిక కలిగిన ఏకైక వ్యక్తిగా ఆయన్ని పేర్కొనవచ్చు. దేశాన్ని ఆధునికత, పట్టణీకరణ, పారిశ్రామికీకరణతో కూడిన నాగరికత కలిగి స్వయం సమృద్ది సాధించిన దేశంగా పునర్నిర్మించాలని ఆకాంక్షించిన ఏకైక తత్వవేత్త అంబేడ్కర్. అంబేడ్కర్ ఆలోచనలు, ఆకాంక్షలు, ఆశయాలను నేటి యువతలోనికి చొప్పించి భవిష్యత్ భారతావనిని పునర్నిర్మించే ప్రయత్నం జరగాలి. ఈ ప్రయత్నం చేసే దిశగా ఆంధ్ర విశ్వ విద్యాలయంలో నెలకొల్పిన ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చైర్’ కృషిచేస్తుంది. గ్రంథాలయాలు, బ్యాంక్లు, తరగతులు, అభ్యసన విధానాలు, ఆర్థిక వ్యవస్థలు డిజిటల్ రూపంలోకి మారిపోయాయి. వీటినే ఆధారంగా చేసుకుని డిజిటల్ మాధ్యమాలను లాభదాయకంగా చేసుకుంటూ సమకాలీన యువతకు, సమకాలీన విధానాలతో అబేడ్కర్ ఆలోచనలు, తత్వాలను చేరువ చేసే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుంది. సోషల్ సైంటిస్ట్లతో పాటు సోషల్ ఇంజనీర్స్ను సమ న్వయం చేస్తూ, సమ్మిళితంగా పనిచేస్తే సమస్యలకు సాంకేతికంగా పరిష్కారాలను చూపడం సాధ్యపడుతుంది. అంబేడ్కర్ను కేవలం సోషల్ సైన్స్ విభాగాలకే పరిమితం చేయకుండా టెక్నాలజీకి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీతో పాటు ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసిస్తున్న అన్ని విభాగాల విద్యార్థులను ఐక్యం చేస్తూ డిజిటల్ మాధ్యమాలు వేదికగా అంబేడ్కర్ను వైవిధ్యమైన కోణాలలో పరిచయం చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: ‘భీమా కోరేగావ్’ స్ఫూర్తితో పోరాడుదాం!) - ఆచార్య ఎం. జేమ్స్ స్టీఫెన్ ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పీఠం’ ప్రొఫెసర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం -
Pakhal Tirumal Reddy: వేయి రేఖల వినూత్న సౌందర్యం
పీటీ రెడ్డిగా విఖ్యాతులైన పాకాల తిరుమల రెడ్డి (1915– 1996) ప్రపంచ స్థాయికి చెందిన తెలంగాణ కళాకారుల్లో అగ్రగణ్యుడు. కరీంనగర్ జిల్లా, అన్నవరం గ్రామంలో 1915 జనవరి 4వ తేదీన జన్మించారు. ప్రాథమిక విద్య చదివే రోజుల్లో ఆయన్ని ప్రోత్సహించింది ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సత్తార్ సుభాని. తన బంధువును కలిసేందుకు ఒక రోజు రెడ్డి హాస్టల్కు వెళ్లాడు పీటీ. ఆ రోజు స్కౌట్స్ డే. ముఖ్య అతిథి బాడెన్ పావెల్. బాడెన్ రూపానికి 17 ఏండ్ల పీటీ కాంతి వేగంతో ప్రాణం పోస్తున్నారు. అది గమనించిన కొత్వాల్ పీటీని పిలిపించుకొని తన పెయింటింగ్ వేస్తావా అని అడిగారు! మిడాస్ టచ్!! రెడ్డి హాస్టల్ నిబంధలను సవరించి ప్రతిభావంతులైన కళాకారులకూ స్కాలర్షిప్ ఇవ్వవచ్చని పీటీని ‘సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్’లో చేర్పించారు కొత్వాల్. ముంబైలోని ఆ వినూత్న ప్రపంచంలో సూజా, కేకే హెబ్బార్, ఎమ్ఎఫ్ హుస్సేన్ తదితరులు సహ విద్యార్థులు. తన 22వ ఏట చిత్రించిన సెల్ఫ్ పోర్ట్రెయిట్ అంతర్ వ్యక్తినీ చూపిందని అధ్యాపకులు మెచ్చుకున్నారు. జేజేలో 1935 నుంచి 42 వరకు చిత్రకళను అభ్యసించి డిప్లొమా పొందారు, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ ర్యాంక్తో! దేశ విభజన సందర్భంలో హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ మాండలికాన్ని తన రచనలలో శాశ్వతం చేసిన యశోదా రెడ్డిని వివాహం చేసుకున్నారు. కార్పెంటరీ ఇండస్ట్రీ నెలకొల్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ హుందాతనాన్ని తెలిపే ఫర్నిచర్ పీటీ రెడ్డి సమకూర్చిందే. శిల్పీ, దారుశిల్పీ; ఆయిల్, వాటర్ కలరిస్ట్ అయిన పీటీ కళా ప్రపంచానికి కానుకగా ఏమి ఇచ్చారు? ఒక్క మాటలో భారతీయ సాంస్కృతిక తాత్విక సౌందర్య భరిత వేయి దళాల పరిమళ భరిత పుష్పం! మన జ్ఞాపకాల పొరల్లో మసకబారిన ఆ కళారూపాలు చూడవచ్చా? ‘స్వధర్మ’లో మూడు అంతస్తులలోని ప్రత్యేక గ్యాలరీలలో పీటీ రెడ్డి కళా రూపాలు కొలువై ఉన్నాయి. వారి కుమార్తె లక్ష్మీ రెడ్డి దంపతులు ఎంతో శ్రద్ధగా కాపాడుతున్నారు. చిరునామా సులభం. నారాయణగూడ మెట్రో పిల్లర్ 1155. కళాకారులు, చరిత్రకారులు అపా యింట్మెంట్ తీసుకుని సందర్శించవచ్చు. (క్లిక్ చేయండి: అతడి మరణం ఓ విషాదం!) - పున్నా కృష్ణమూర్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ (జనవరి 4న పీటీ రెడ్డి జయంతి) -
Savitribai Phule: మహిళా విద్యా ప్రదాత
విద్య ద్వారా సమాజంలో ఉన్న అసమానతలను చదును చేయాలని... 18వ శతాబ్దంలోనే మహాత్మ జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులు ప్రయత్నించారు. మొక్కవోని వారి దీక్ష వల్ల అప్పటి సమాజంలో హీన స్థితిలో ఉన్న స్త్రీల జీవితాలకు అండ దొరికింది. భర్త జ్యోతిబా ఫూలే ప్రోత్సాహంతో స్వయంగా చదువుకున్న సావిత్రీబాయి దేశంలో మహిళా విద్యకు దారిదీపం అయింది. 1840లో 9 ఏళ్ల సావిత్రీబాయి వివాహం 13 ఏళ్ల జ్యోతిబా ఫూలేతో జరిగింది. స్త్రీలకు విద్య చాలా అవసరం అని గ్రహించి ముందు తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పాడు జ్యోతిబా. భారతదేశ చరిత్రలోనే స్త్రీ విద్యను మొట్ట మొదట ప్రవేశపెట్టిన వాడు జ్యోతిబాఫూలే. తన పొలం దగ్గర మామిడి చెట్టు నీడలో మొట్ట మొదటి పాఠశాల పెట్టాడు. ఆ పాఠశాలలో ఆయన అక్క సుగుణబాయి, భార్య సావిత్రీ బాయి విద్యార్థులు! స్త్రీ విద్యా ప్రయోగశాలగా ఆ పాఠశాల చరిత్రలో మిగిలిపోయింది. 1848లో ఓ భవంతిలో స్త్రీల కోసం పాఠశాలను ఏర్పాటు చేశాడు ఫూలే. చదువు నేర్చుకునే క్రమంలో సావిత్రీబాయి ఎన్నో పుస్తకాలు చదివి స్త్రీ ఎంత దారుణ స్థితిలో ఉందో అర్థం చేసుకుంది. అదే సమయంలో అమెరికా నల్లజాతి వివక్ష వ్యతిరేక పోరాట నాయకులు థామస్ క్లార్క్ జీవిత చరిత్ర చదివి స్ఫూర్తి పొందింది. బ్రాహ్మణ స్త్రీలతోపాటూ బహు జన స్త్రీ జనోద్ధరణకు భర్తతో పాటూ నడుం బిగించింది. స్త్రీ జనోద్ధరణకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకూ ఆమే ఇన్చార్జ్గా వ్యవహరించింది. 1851లో పూణేలో అమ్మాయిల కోసం మరో స్కూలు ప్రారంభించారు. మెల్లమెల్లగా పూలే దంప తులు 18 పాఠశాలలను స్థాపించారు. అయితే నాటి ఛాందసవాదులు సావిత్రీబాయి మామగారిని... ఆయన కొడుకూ, కోడలూ శ్రాస్త విరుద్ధంగా వ్యవహ రిస్తున్నారని రెచ్చగొట్టారు. దీంతో ఫూలే దంపతులను మామగారు ఇంటి నుండి వెళ్లగొట్టారు. అయినా ఆ దంప తులు తమ మార్గాన్ని మార్చు కోలేదు. ఆత్మహత్య చేసుకోబోతున్న కాశీ బాయి అనే గర్భవతి అయిన బ్రాహ్మణ వితంతు మహిళను కాపాడి ఆమె కన్న పిల్లవాడిని దత్తత తీసుకుని ‘యశ్వంతరావు’ అని పేరు పెట్టుకొని పెంచి పెద్ద చేశారు. 1876–77లో మహా రాష్ట్రలో భయంకరమైన కరువు వచ్చి జనాలు ఆకలితో అలమటిస్తుంటే తమ ‘సత్య శోధక సమాజ్’ ద్వారా ఆహార సేకరణ చేసి ఆదుకున్నారు. ఆమె మంచి ఉపాధ్యాయురాలే కాదు, కవయిత్రి కూడా. ఆమె రచించినటువంటి ‘కావ్య పుష్పాలు’ అనే సంపుటి చాలా గొప్పది. ప్లేగు వ్యాధి గ్రస్థులకు సేవ చేస్తూ ఆ వ్యాధికే బలై 1897 మార్చి 10వ తేదీన తుది శ్వాసవిడిచి ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మహనీయురాలు సావిత్రీబాయి. (క్లిక్ చేయండి: ‘భీమా కోరేగావ్’ స్ఫూర్తితో పోరాడుదాం!) – తండ సదానందం, టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ (జనవరి 3 సావిత్రిబాయి ఫూలే జయంతి) -
దేశంలో ఆకలి కేకలు ఆగాలంటే...
దేశానికి ‘స్వాతంత్య్రం’ వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ప్రజల మౌలిక అవసరాలను పరిష్కరించటంలో పాలక ప్రభుత్వాలన్నీ విఫలమైనాయి. కూడు, గూడు, గుడ్డ లేక పేదలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. కోట్లాది మంది పేదలు ఆహారం కోసం హాహా కారాలు చేస్తున్నారు. ప్రపంచ ఆకలి సూచిలో (గ్లోబల్ హంగర్ ఇండెక్స్) భారత స్థానం దిగజారుతూ వస్తున్నది. 2021లో 101 స్థానంలో ఉండగా 2022లో 107వ స్థానానికి దిగజారింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికలో 121 దేశాలు ఉన్నాయి. వీటిల్లో చైనా, టర్కీ, కువైట్ సహా 17 దేశాలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఐర్లాండ్కి చెందిన ‘కన్సర్న్ వరల్డ్ వైడ్’, జర్మనీకి చెందిన ‘వెల్త్ హంగర్ హైఫ్’ సంస్థలు ఈ నివేదికను రూపొందించాయి. ఈ 121 దేశాల్లో ఆసియా ఖండంలో భారతదేశం కంటే అఫ్గానిస్తాన్ మాత్రమే వెనకబడి ఉంది. పాకిస్తాన్ 99, బంగ్లాదేశ్ 84, నేపాల్ 81, శ్రీలంక 64 స్థానాల్లో మనకంటే మెరుగ్గా ఉన్నాయి. 2020లో గ్లోబల్ ఇండెక్స్ స్కోర్ 38.8గా ఉండి నేడు 29.1గా నమోదు అయ్యింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్ఐ) ప్రపంచ స్థాయిలో, రీజనల్ స్థాయిలో ఆకలిస్థాయిని వెల్లడిస్తుంది. 29.17 స్కోర్తో భారతదేశం ‘అత్యంత సీరియస్’ అన్న లేబుల్ పొందింది. ఆసియా రీజియన్లోనూ, మొత్తం ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆకలి స్థాయిలో భారత్ ఉందని నివేదిక వెల్లడించింది. జీహెచ్ఐ నివేదికను పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల, పిల్లల మరణాలు వంటి అంశాలను ఆధారంగా చేసుకుని 100 పాయింట్ స్కేల్లో లెక్కిస్తారు. సున్నా వస్తే ఉత్తమ (ఆకలి లేదు) స్కోర్, 100 వస్తే చెత్త స్కోర్, అంటే ఆకలి బాగా ఎక్కువగా ఉండటంగా పరిగణిస్తారు. దేశంలో పోషకాహార లోపం 2018–20లో 140 శాతం ఉంటే 2019–21 నాటికి 163 శాతానికి పెరిగింది. ప్రపంచంలో పోషకాహార లోపం ఉన్న జనాభా 828 మిలియన్లు ఉంటే, ఇండియాలోనే 224.3 మిలియన్ల మంది ఉన్నారు. 117 దేశాల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన నివేదికలో భారతదేశంలో 22.4 కోట్ల మంది పోషకాహారం లభించక బాధపడుతున్నారు. ఇందులో 15 నుంచి 49 ఏళ్ల లోపు వయస్సుగల మహిళలు 51 శాతం అని నివేదిక పేర్కొన్నది. 2019లో చిన్నారుల స్థితిపై యునిసెఫ్ నివేదిక ప్రకారం 5 ఏళ్ల లోపు 69 శాతం పిల్లలు సరైన పౌష్టికాహారం లేక ప్రాణాలు కోల్పోతున్నారు. 4.66 కోట్ల మంది వయస్సుకు తగ్గ ఎత్తు పెరగటం లేదు. 2.56 కోట్ల మంది చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు ఉండటం లేదు. 5 నుంచి 23 సంవత్సరాల లోపు పిల్లల్లో కేవలం 10 శాతం మందికే పోషక విలువలు గల ఆహారం లభిస్తున్నదని కేంద్ర ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా డేటా తెలుపుతున్నది. భారతదేశంలో 20 కోట్లకు పైగా వలస కార్మికులు ఉన్నారు. వీరు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. మరో 20 కోట్ల మంది దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. కనీస ఆదాయం లేక 23 కోట్ల మంది రోజు వారీ కూలీలు, చిరు వ్యాపారులు... పస్తులు, అర్ధాకలితో జీవిస్తున్నారు. భారత ఆహార సంస్థ గోదాముల్లో ఆహార ధాన్యాలు ముక్కిపోతున్నా పేదలకు, అన్నార్తులకు అందించకపోవటం ఏమిటని సుప్రీమ్ కోర్టు అనేక సార్లు ప్రశ్నించింది. గోదాముల్లో 7.10 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. గత ఆరేళ్ల కాలంలో 40 వేల టన్నుల ఆహార ధాన్యాలు పాడై పోయాయి. దీన్ని గమనిస్తే ఆహార ధాన్యాలు పాడైనా ఫరవాలేదు, పేదలకు మాత్రం పంపిణీ చేయం అన్నదే పాలకుల విధానంగా ఉంది. దేశం అభివృద్ది బాటలో పయనిస్తున్నదనీ, ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధిని సాధించటమే కాకుండా ఎగుమతి చేసే స్థాయిలో ఉందనీ మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. కేంద్రం చెబుతున్న దానికీ, గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలకూ పొంతన లేకుండా ఉంది. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా రైతాంగం అధిక సంఖ్యలో నిరసనలు చేస్తున్నారు. కోటి 40 లక్షల మంది రైతులు వ్యవసాయం నుంచి ఎందుకు వైదొలిగారు? ఆహార ధాన్యాల ఎగు మతిదారుగా భారత్ ఉంటే రైతాంగం ఎందుకు వ్యవసాయం నుంచి వైదొలుగుతున్నారు? నేటికీ దేశంలో 27 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితుల ఎందుకు ఉన్నాయి? దేశంలో పండిన పంటలను దేశ అవసరాలకు ఉపయోగించినప్పుడే ఏ దేశమైనా స్వావలంబన సాధించినట్టు చెప్పవచ్చు. ప్రజలకు ఆహారం అందుబాటులో లేక ఆకలి కేకలు పెడుతుంటే, వారి ఆకలి తీర్చకుండా ఎగుమతులు చేయటం స్వావలంబన సాధించటం కాదు. దేశ ప్రజల పేదరికానికీ, వారి ఆకలి ఆర్తనాదాలకూ దేశ పాలకులు అమలు జరిపిన విధానాలే కారణం. సామ్రాజ్యవాదం, బడా బూర్జువా, భూస్వామ్య వర్గంతో లాలూచి పడిన పాలక ప్రభుత్వాలన్నీ దేశ సహజ వనరులన్నిటినీ వారికి కట్టబెడుతూనే ఉన్నారు. ఫలితంగా దేశాభివృద్ధి కుంటుపడటమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతూ వచ్చాయి. ఈ పరిస్థితి మారాలంటే... సహజ వనరులన్నీ దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చేయాలి. సామ్రాజ్యవాద దోపిడీని అరికట్టాలి. పారిశ్రామిక అభివృద్ధిలో పాత్రధారులైన కార్మికులకూ పరిశ్రమల్లో హక్కు కల్పించాలి. అలాగే గ్రామీణ పేదలకు భూమి పంపిణీ జరగాలి. అప్పుడే దేశంలో ఆకలి కేకలు ఆగిపోతాయి. (క్లిక్: సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు వాడేవారు పేదలు కారని వాదిస్తారు.. కానీ) - బొల్లిముంత సాంబశివరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతు కూలీ సంఘం (ఏపీ) -
సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు వాడేవారు పేదలు కారని వాదిస్తారు.. కానీ
సంక్షేమ పథకాలూ, వాటిని అమలుచేసే ప్రభుత్వాలపై విమర్శ పెరిగింది. తాము చెల్లిస్తున్న పన్నులతోనే వాటిని అమలు చేస్తున్నారనీ, అలగా జనానికి మా సొమ్ము ఖర్చవుతోందనీ, తమకు అన్యాయం జరుగుతోందనీ మధ్య, ఉన్నత మధ్య తరగతి ప్రజల వాదన. సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తారు. వీటిని ఎగేసే అవకాశాలు, ఎగ్గొట్టించే వృత్తి సంస్థలు ఉన్నాయి. పేదలు, మధ్య తరగతి ప్రజలు పరోక్ష పన్నులు చెల్లిస్తారు. బీడీలు, సబ్బులు, బియ్యం, ఉప్పు పప్పుల పన్నులు ఇలాంటివి. వీటిని తప్పించుకోలేరు. మనం సమాజం నుండి చాలా పొందుతాము. మనం వాడే రోడ్లు, భవనాలు, గ్రంథాలయాలు, విద్యా, వైద్యాలయాలు ప్రజాధనంతో నిర్మించినవే. వాటిపై ప్రభుత్వం నిరంతరంగా నిర్మాణ, నిర్వహణ ఖర్చులు పెడుతూ ఉంటుంది. ఈ ఖర్చుల కోసం ప్రజలు పన్నులు చెల్లించాలి. ఎవరు ఏ సౌకర్యాలను వాడుతున్నారు, ఎవరు వేటిపై పన్నులు చెల్లించాలి, అని తేల్చటం కష్టం. అందుకే సంపాదనలపై ప్రత్యక్ష పన్నులు, వినియోగాలపై పరోక్ష పన్నులు విధిస్తారు. శ్రమ శక్తి మాత్రమే కలిగిన కార్మికులు సమాజ సౌకర్యాలను తక్కువ వాడుతారు. వాళ్ళు స్థానిక ప్రయాణాలే గాని సుదీర్ఘ ప్రయాణాలు తక్కువ చేస్తారు. చదువుకోనివారు విద్యాలయాలను వాడరు. తులనాత్మకంగా ఆస్పత్రులను కూడా తక్కువ వాడుతారు. చదువరులు, అందులో వైద్య, ఇంజినీరింగ్, వ్యవసాయం మొదలగు వృత్తి విద్యలను అభ్యసించినవారు ఎక్కువగా ప్రజాధనాన్ని ఉపయోగిస్తారు. సమాజం నుండి ఎక్కువగా నేర్చుకుంటారు. సమాజ సంపద, మౌలిక సదుపాయాలనూ ఎక్కువగా వినియోగిస్తారు. పేదల కంటే, వృత్తి నిపుణులు, ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎక్కువ మోతాదులో సమాజానికి తిరిగి ఇవ్వాలి. కాని వాళ్ళు సమాజానికి అనగా ప్రభుత్వానికి చెల్లించ వలసినదాని కంటే తక్కువే చెల్లిస్తారు. అందుకే మేము ఎక్కువ పన్ను చెల్లిస్తున్నాము, మా డబ్బుతో పేదలు, శ్రామికులు బతుకుతున్నారన్న వీరి ప్రచారంలో వాస్తవం లేదు. కార్పొరేట్ సంస్థల అధిపతులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, సంపన్నులు ప్రభుత్వాల నుండి మౌలిక సదుపాయాలు, బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు. తమ వాణిజ్యంలో ప్రజలకు భాగస్వామ్య కల్పనలో భాగంగా ప్రజల సొమ్మును సేకరిస్తారు. నామమాత్రపు సొంత డబ్బుతో లాభాలు సంపాదిస్తారు. పేదలు, శ్రామికులు, దిగువ మధ్య తరగతి ప్రజలకు తమ శ్రమ శక్తియే సంపాదన వనరు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సౌకర్యాలు, రాయితీలు వారి శ్రమ శక్తి ఉపయోగానికి సౌకర్యాలుగా మారుతాయి. వారు శ్రమ శక్తిని ఎక్కువగా వాడే వెసులుబాటు కలుగుతుంది. దీంతో వారి దిన కూలీ పెరగదు. కాని వారి శ్రమ సాంద్రత, నిపుణత, ఉత్పత్తి స్థాయి, వారు పని చేసే సంస్థల యాజమాన్య లాభాలు పెరుగుతాయి. సమాజం ప్రగతి సాధించి, దేశ సంపదలు అభివృద్ధి చెందుతాయి. సంక్షేమ పథకాలు, రాయితీలు సమాజ శ్రేయస్సు, దేశోన్నతి సాధనాలు. ప్రజలకు సామాజిక దృక్పథం అవసరం. సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు, టీవీలు వాడేవారు పేదలు కారని కొందరు వాదిస్తారు. ఇవి నాగరిక పేదరిక అవసరాలు. సెల్ ఫోన్ రోజు కూలి పని సంపాదనలో, అందుకు అవసరమైన సాధనాల సమకూర్పులో, పని స్థలాల నిర్ణయంలో సహాయపడుతుంది. నగరాల్లో పనిస్థలాలకు చేరుకోడానికి మోటర్ సైకిళ్ళు అవసరం. రాజ్యాంగం ప్రకారం మనది సంక్షేమ రాజ్యం. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమానికి కృషి చేయవలసిందే. అటువంటి కార్యక్రమాలకు ఎవరూ అడ్డు తగలకూడదు. (క్లిక్ చేయండి: తలరాత మార్చే చైతన్యదీప్తి.. గడప గడపలో నూతన శోభ!) - సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
తలరాత మార్చే చైతన్యదీప్తి.. గడప గడపలో నూతన శోభ!
అద్దె చెల్లించాల్సిన బాధ తప్పి సొంత ఇంట్లో ఉన్నామనే సంతోషం ఉందని నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతున్నప్పుడు చాలామంది మహిళలు చెబుతున్నారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. నూతన సంవత్సర శోభ పల్లె గడప తొక్కిందని చెప్పడానికి ఇది కేవలం ఒక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్రంలో కోకొల్లలుగా మనకు కనిపిస్తున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగు పడటమే నిజమైన అభివృద్ధి అని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం... పాలనను ప్రజల గడప వద్దకు తీసుకెళ్లింది. సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కరోనా విపత్తు సృష్టించిన ఆర్థిక అల్లకల్లోలం నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తూనే... పేదల జీవితాలకు ఆసరాగా నిలబడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వం అందుకుంటున్న ప్రతి పథకం లోనూ ప్రజలకు ప్రస్పుటంగా కనిపిస్తోంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ప్రజల గుమ్మం ముందుకు వెళుతున్న క్రమంలో.. పేదల జీవితాల్లో వస్తున్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరిన అక్కాచెల్లెమ్మల కళ్లల్లో, ఎవరి మీదా ఆధార పడకుండా ఒకటో తేదీ వేకువనే అందుతున్న పెన్షన్తో గౌరవంగా బతుకుతున్న అవ్వాతాతల ముఖాల్లో, ఆసరా–చేయూతతో తన కాళ్ల మీద నిలబడి ఆత్మగౌరవంతో జీవిస్తున్న అక్కల ఆత్మీయ పలకరింపుల్లో, పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి అండగా నిలిచిన ‘అమ్మఒడి’ అందుకుంటున్న చెల్లెమ్మల సంతోషంలో, అన్నం పెడుతున్న అమ్మను గౌరవించడాన్ని బాధ్యతగా తీసుకొని ఇంటి ముందుకు ప్రభుత్వం పంపించిన వాహనం నుంచి బియ్యం తీసు కుంటున్న మహిళల మోముల్లో, వ్యవసాయాన్ని పండగ చేయడానికి అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాల సేవలు అందుకుంటున్న రైతన్నల ఆనందంలో... ఒకరేమిటి... ఊరిలో అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతున్న సంతృప్తిలో కొత్త సంవత్సరం శోభ కనిపిస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో పడుతోంది. మిల్లర్లు, దళారుల బెడద లేకుండా మద్దతు ధరకు రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు. ఊరికే కొత్త రూపుతెచ్చిన గ్రామ సచివాలయాలు... ప్రజల ముంగిటకు పాలనను తీసుకొచ్చి ప్రజల అవసరాలు తీర్చి వారి ముఖాల్లో సంతోషానికి కారణంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందుబాటులోకి రావడంతో నూతన సంవత్సరం శోభ ఇనుమ డిస్తోంది. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో లక్ష మందికి ఒకేసారి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగులు తమ ఇళ్లతో పాటు వారు పనిచేస్తున్న సచివాలయం పరిధిలోని ఇళ్లకూ నూతన సంవత్సరం శోభను తీసుకురావడానికి, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన సందేశాన్ని మోసుకెళ్లడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్ ఈ జనవరి 1 నుంచి రూ. 2,750 పెంచారు. పెన్షన్ పెంపుతో 64 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. రైతు భరోసాను అర కోటి మందికి పైగా రైతులకు అందిస్తున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద దాదాపు 4 లక్షల మంది అక్కాచెల్లెమ్మలు లబ్ధి పొందుతున్నారు. జగనన్న చేదోడు 3 లక్షల మందికి, జగనన్న తోడు దాదాపు 5.5 లక్షల మందికి... ఇలా చెప్పుకొంటూపోతే, పల్లె గడపలో ప్రభుత్వం నుంచి పథకాలు అందుకోని వారు ఉండరనే చెప్పాలి. అందుకే ప్రగతిపథం వైపు అడుగులేస్తున్న ప్రతి ఇంటి గడపలో నూతన సంవత్సరం శోభ కనిపిస్తోంది. చదువు ఒక్కటే పేదల తలరాత మారుస్తుందని నమ్మిన ప్రభుత్వం ఇది. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే దృఢ సంకల్పం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఉండటం వల్లే ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచితంగా ట్యాబ్లు ఇచ్చి... అందులో బైజూస్ పాఠాలు అందిస్తున్నారు. ఒకప్పుడు కేవలం కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమయిన ఇలాంటివి ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో సాకారం కావడం.. రాజ్యాంగం ఇచ్చిన సమాన అవకాశాలు పొందే హక్కును రక్షించడమే. నాణ్యమైన చదువులతో పైకొస్తున్న ప్రతి విద్యార్థి.. ఒక తరం తలరాత మార్చే చైతన్యదీప్తి. ఈ వెలుగులతో కొత్త సంవత్సరం శోభ పల్లె గడప తొక్కింది. (క్లిక్ చేయండి: బాబోయ్! హ్యాండిల్ విత్ కేర్...) - కైలే అనిల్ కుమార్ ఎమ్మెల్యే, పామర్రు, కృష్ణా జిల్లా -
Telidevara Bhanumurthy: తమ్ముండ్లూ రాండ్రి! గాలిగొట్టి పోండ్రి!
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కోని బొందల గడ్డ దిక్కు బోయిండు. గాడ రొండంత్రాల బంగ్లల బేతాలు డుంటున్నడు. ఎటూ పొద్దుబోక టీవీ జూస్కుంట గూసున్నడు. విక్రమార్కుడు బొందల గడ్డకు బోయిండు. బేతాలుని ఇంటి ముంగట మోటరాపి హారన్ గొట్టిండు. హారన్ సప్పుడినంగనే బేతాలుడు ఇంట్ల కెల్లి ఇవుతల కొచ్చిండు. మోటరెన్క సీట్ల గూసున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్పబట్టిండు. ‘‘నన్ను గూసుండ బెట్టుకోని ఎత్తుగడ్డలు, గుంతలని సూడకుంట మోటర్ నడ్పుతవు. నీ మోటర్ ట్రాఫిక్ల ఇర్కపోవచ్చు. నీకు తిక్క లేవొచ్చు. కోపం రావొచ్చు. యాస్ట లేకుంట ఉండె తంద్కు నీకు గిప్పుడు నడుస్తున్న ఒక కత జెప్త ఇను’’ అని మోటరెన్క సీట్ల గూసున్న బేతాలుడన్నడు. ‘‘నీకు కత జెప్పుడు, నాకు ఇనుడు అల్వాటే గద’’ అని మోటర్ నడ్పుతున్న విక్రమార్కుడన్నడు. ‘‘గీనడ్మ తెలంగానలున్న కమ్మం పట్నంల తెలుగు దేసం శంకు సప్పుడు సబ బెట్టింది. గాడ కిష్నుని యేసంల శంకమూదుతున్న ఎన్టీఆర్ కటౌట్ బెట్టిండ్రు. పచ్చ జెండలు ఎగిరేసిండ్రు. పచ్చ తోర్నాలు గట్టిండ్రు. బుక్క గులాల్లెక్క తెలుగు దేసమోల్లు ఒకల మీద ఒకలు పస్పు జల్లుకుండ్రు. శంకు సప్పుడు సబ కాడ రెండేల్లు సూబెడ్తున్న చెంద్రబాబు కటౌట్ గుడ్క బెట్టిండ్రు. ‘తెలుగుదేసం పిలుస్తున్నది కదలిరా. సైకిల్ పంపు దీస్కోని ఉర్కిరా’ అని రాసి ఉన్న బ్యానర్లను గట్టిండ్రు’’ అన్కుంట బేతాలుడు ఇంకేమొ జెప్పబోతుంటె – ‘‘సైకిల్ పంపు దీస్కోని వొచ్చుడెందుకు?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘గాలిబోయిన టీడీపీ సైకిల్ల గాలిగొట్టెతంద్కు. శంకు సప్పుడు సబకు చెంద్రబాబొస్తుంటె జెనం గాయిన మీద పస్పు జల్లిండ్రు. నందమూరి సుహాసిని పస్పుతోని గాయినకు బొట్టు బెట్టింది. కడ్మ టీడీపీ ఆడి లీడర్లు గాయినకు మంగలార్తి ఇచ్చిండ్రు. పచ్చంగి దొడుక్కున్న గాయిన గాల్లకు రెండేల్లు సూబెట్టిండు. ‘తెలుగుదేసం జిందాబాద్, చెంద్రబాబు జిందాబాద్’ అని తెలుగు దేసపోల్లు లాసిగ వొల్లుతుండగ గాయిన స్టేజ్ ఎక్కిండు. ముందుగాల పచ్చ రంగు శంకం దీస్కోని ఊదిండు. గని జెర్ర సేపటికే గాయినకు దమ్మొచ్చింది. ఇక దాంతోని శంకమూదుడాపి గాయిన గిలాస నీల్లు దాగిండు.’’ ‘‘తెలుగుదేసంను ఇడ్సిపెట్టి పోయిన తెలుగు తమ్ముండ్లూ మల్లొక్కపారి మీ ఇంటికి రాండ్రి. సైకిల్ పంపుచర్లు జుడాయించి గాలి గొట్టుండ్రి. టీడీపీ తెలంగానలనే పుట్టింది. తెలంగానలనే పెరిగింది. (‘తెలంగానలనే సచ్చింది’ అని ఎన్కకెల్లి ఎవడో లాసిగ వొల్లిండు) నేను ఒక్క తీర్గ బత్మిలాడంగ బత్మిలాడంగ బిల్స్ గేట్స్ పట్న మొచ్చిండు. కుద్దు నేనే గాలి మోటర్ అడ్డంకు బోయి గాయినకు మంగలార్తి ఇచ్చిన. మూడు నచ్చత్రాల హోటల్ల ఉంచి కుద్దు నేనే ఒక కోపుల చాయ్ ఇచ్చిన. గాయినకు ఒక్క తీర్గ మస్క గొట్టి హైటెక్ సిటీ దెచ్చిన. గాలి మోటర్ల దునియ అడ్డను నేనే గట్టిపిచ్చిన. నేను జెయ్యబట్కెనే ఇయ్యాల పట్నంల కరోన టీక తయ్యారైంది. తెలంగాన, ఆంద్ర నాకు రొండు కండ్లు. గీ రొండు కండ్లు ఒక్కటి గావాలని సిగ్గు శరం లేనోల్లు అంటున్నరు. ఏ కన్నుకు ఆ కన్ను ఉంటెనే నాకు మల్ల ముక్యమంత్రి అయ్యేటి మోక దొరుక్తది. టీడీపీ సైకిల్ ఒక గిర్రల ఆంద్ర తమ్ముండ్లు గాలిగొడ్తున్నరు. ఇంకొక గిర్రల తెలంగాన తమ్ముండ్లూ గాలి గొట్టుండ్రి. మీరు గాలిగొడ్తెనే నా సైకిల్ నడుస్తది. నా సైకిల్ నడుస్తనే బీజేపీ కాడికెల్లి అన్ని పార్టిలు నా దిక్కు జూస్తయి. నాతోని సోపతి జేస్తయి అన్కుంట చెంద్రబాబు సుత్తిగొట్టిండు.’’ ‘‘తెలంగానలనే గాకుంట ఆంద్రల గుడ్క చెంద్రబాబు సబలు బెట్టిండా?’’ ‘‘గిదేం కర్మ రాస్ట్రంకు సబలు బెట్టిండు. ముక్యమంత్రి కుర్సి పోయిన కాన్నుంచి నాకు బువ్వ దిన బుద్దయితలేదు. కన్ను మలుగుతలేదు. కన్ను మల్లకుంటె కలలు యాడబడ్తయి. కలలు బడక ఆకర్కి కలల గుడ్క ముక్యమంత్రి అయ్యేటి మోక దొరుక్త లేదు. ఫికర్ తోని బక్కగైన. నన్ను ముక్యమంత్రిని జేస్తిరా అంటె అందరి ఇండ్లకు పచ్చ రంగేపిస్త. ఇండ్లకే గాకుంట బళ్లకు, గుళ్లకు, సర్కార్ దప్తర్లకు పచ్చరంగు ఏపిచ్చి ఆంద్రప్రదేస్ను బంగారి రాస్ట్రం జేస్త. గిదేం కర్మ రాస్ట్రంకు...’’ అని గాయిన ఇంకేమొ మాట్లాడబోతుంటె – ‘నువ్వే కర్మ రాస్ట్రంకు’ అని ఎన్కకెల్లి ఎవడో లాసిగ వొల్లిండు. చెంద్రబాబుతోని ముచ్చట బెట్టెటప్పుడు బిల్గేట్స్ తప్పిజారి గూడ గాయిన ఈపు ఎందుకు సూబెట్టలేదు? గీ సవాల్కు జవాబ్ ఎర్కుండి గూడ జెప్పకుంటివా అంటె నీ మోటర్ టైర్లల్ల గాలి బోతది’’ అని బేతాలుడన్నడు. ‘‘ఈపు గిన గండ్లబడ్తె చెంద్రబాబు యాడ ఎన్నుపోటు పొడుస్తడోనని బిల్గేట్స్ బయపడ్డడు’’ అని విక్రమార్కుడు జెప్పిండు. ఇంతల బొందల గడ్డ వొచ్చింది. బేతాలుడు మోటర్ దిగి ఇంటి దిక్కు బోయిండు. (క్లిక్ చేయండి: కొంపలు ముంచే కొత్త దుక్నాలు) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
BC Census: బీసీ జన గణనతోనే న్యాయం
జనాభా కులాలుగా విడగొట్ట బడిన దేశం మనది. ఆధిపత్య కులాలు దేశంలోని భూమి, ఇతర వనరులు; విద్య, ఉద్యోగ అవకాశాలను అధికంగా అను భవిస్తున్నాయి. సంపద వారి చేతుల్లో ఉన్నందు వల్ల చదువు కోగలరు కాబట్టి... ఉద్యోగావకాశాలూ సహజంగా వారికే అధికంగా లభిస్తాయి. అయితే దేశంలో సంఖ్యాపరంగా వీరి సంఖ్య తక్కువ. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా అధికంగా ఉంది. రాజ్యాంగం అందరికీ సమాన అవ కాశాలు వాగ్దానం చేసింది. అవకాశాల్లో సమాన భాగం కాకపోయినా... కనీస భాగం పొందాలంటే రిజర్వేషన్లు ఒక్కటే మార్గమని రాజ్యాంగ సభ భావించి రాజ్యాం గంలో అందుకు తగిన ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కాలంలో కొత్త కులాలనూ, వర్గాలనూ రిజర్వేషన్ వర్గాల్లో కలపడంతో రిజర్వేషన్ వర్గాల వారికి అవకాశాలు పలుచబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కులాల జన గణన జరిగితే ఎవరి దామాషా ప్రకారం వారు అవకాశాలను పొందవచ్చుగదా అనే ఆలోచన బయలుదేరింది. ముఖ్యంగా వందలు, వేలా దిగా ఉన్న బీసీ కులాలు ఈ డిమాండ్ను బలంగా విని పిస్తున్నాయి. ఇలా కుల గణన జరిగితే ఒనగూరే ఇతర ప్రయోజనాలనూ వారు పేర్కొంటున్నారు. వెనుక బడిన మెజార్టీ ప్రజల సంక్షేమానికి తగిన పథకాల రూపకల్పనకు ఈ డేటా చాలా అవసరం. విద్య, ఉద్యోగ రంగాల్లో ఎవరి వాటా వారు పొందడానికి వీలు కలుగుతుంది. ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని ఎన్నో వందల కులాలను వెలుగులోకి తీసుకురావచ్చు. ఫలితంగా అత్యధిక పేదలు ఉన్న బీసీల్లో తమ వాటా తమకు లభిస్తుందన్న సాంత్వన లభిస్తుంది. ఎవరి వాటా వారికి లభిస్తే సామాజిక అశాంతి తగ్గి శాంతి భద్రతలు మెరుగవుతాయి. ప్రభుత్వం తన దృష్టిని అభివృద్ధి కార్యక్రమాలపై నిలపడానికి అవకాశం ఏర్పడుతుంది. కులగణనపై సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం... కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనపరంగా కష్టమని తెలిపింది. దీంతో బీసీలు బాగా అసంతృప్తికి లోనయ్యారు. 1931 కులగణన తర్వాత బీసీ జనగణన జరగలేదు. అయితే 1979లో జనతా ప్రభుత్వం బీపీ మండల్ సారథ్యంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులవారిని గుర్తించి వారి అభివృద్ధికి సిఫార్సులు చేయమని ఒక కమిటీని నియమించింది. ఈ మండల్ కమిషన్ 1980లో సమర్పించిన నివే దికలో భారత్ మొత్తం జనాభాలో 52 శాతం వెనుక బడిన తరగతులవారేననీ, వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ సిఫార్సు చేసింది. బీసీల సమగ్ర అభివృద్ధి కోసం అనేక సిఫార్సులు చేసినా అవన్నీ అటకెక్కాయి. 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అత్యంత దారుణ వ్యతిరేక పరిస్థితుల్లో అమలులోకి వచ్చాయి. నిజానికి ఇప్పుడు బీసీల జనాభా మరింతగా పెరిగి ఉండాలి. వారూ వీరూ చెప్పే లెక్కలన్నీ కాకి లెక్కలే. ఒక్కసారి కుల గణన జరిపితే అభివృద్ధి ఫలాల్లో ఎవరి వాటా వారు అడగడానికి వీలు ఉంటుంది. సామాజిక న్యాయం సాకారమవుతుంది. (చదవండి: కులాంతర వివాహాలు శాస్త్రబద్ధమే) - డాక్టర్ పరికిపండ్ల అశోక్ సామాజిక కార్యకర్త -
కృష్ణా జలాలకు ‘ఇదేం ఖర్మ బాబూ...’
జగన్ మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా మరో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ పేరు పెట్టారు. నిజానికి తెలుగు నిఘంటువులో ‘ఖర్మ’ అనే పదమే లేదు. తెలుగు భాష పట్ల అపారమైన గౌరవం ఉన్న ఎన్టీ రామారావు తన పార్టీకి తెలుగుదేశం అనే పేరు పెట్టారు. అటువంటి పార్టీకి నేడు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు అర్థం పర్థంలేని ఒక పదాన్ని సృష్టించి ఆ పేరుతో ప్రజలను పెడతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే తరుణంలో రాష్ట్రాభివృద్ధికి అడు గడుగునా అడ్డు పడుతున్నారంటూ ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ బాబూ’ అంటూ ప్రత్యర్థులు ఆయన్ని విమర్శి స్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు విమర్శలను పట్టించుకోవడం కానీ, తన తప్పుల వల్ల ప్రజలకు, పర్యావరణానికి హాని జరుగుతున్నా పశ్చాత్తాప పడటం కానీ చేయరు. ఆయన చట్ట విరుద్ధ పనుల్లో... కృష్ణానదీ తీరాన నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనంలో ఇప్పటికీ నివసిస్తుండటం ఒకటి. ఈ ప్రాంతంలోని నివాస ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విడుదల అవుతున్న కాలుష్యం కారణంగా కృష్ణానది చివరి రిజర్వాయర్ అయిన ప్రకాశం బ్యారేజ్ వద్ద నిల్వ చేస్తున్న జలాలు పెద్ద ఎత్తున కలుషిత మవుతున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర పొల్యూషన్ బోర్డు ‘వాటర్ క్వాలిటీ ఆఫ్ రివర్స్ 2021’ పేరిట విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. 2022, అక్టోబర్ 13న బోర్డు అప్డేట్ చేసిన వివరాల ప్రకారం... విజయవాడ కృష్ణా బరాజ్ వద్ద గల ఈ నీరు పానయోగ్యంగా ఏ మాత్రం లేదని స్పష్టమయింది. కృష్ణా కరకట్ట ప్రాంతంలో గుంటూరు జిల్లా పరిధిలో 48 భవనాలు, కృష్ణా జిల్లా పరిధిలో 18 భవనాలు ఉన్నాయి. వీటిలో చంద్రబాబు నివాసంతో పాటు వందలాది మంది రోగులకు నిలయమైన ప్రకృతి వైద్యశాల కూడా అక్కడే ఉంది. ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలకు డ్రైనేజ్ సదుపాయం లేదు. వీరు వాడే నీరంతా కృష్ణా బరాజ్ వద్ద గల నీటిలోనే కలిసి పోతోంది. ఫలితంగా ఈ జలాలు కలుషితమవుతున్నాయి. కేంద్ర పొల్యూషన్ బోర్డు నివేదిక ప్రకారం నదీజలాల్లో బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బి.ఒ.డి.) ఐదు రోజుల సగటు విశ్లేషణల్లో లీటర్కు రెండు మిల్లీ గ్రాముల కన్నా తక్కువ ఉండాలి. గుంటూరు జిల్లా అమరావతి వద్ద కృష్ణా జలాల్లో బి.ఒ.డి. 1.4 మిల్లీగ్రాములుండగా అదేనీటిలో కృష్ణా బరాజ్ వద్ద బి.ఒ.డి. 2.6 మిల్లీ గ్రాములకు పెరిగి పోయింది. అయితే ఈ నీటినే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని లక్షలాది మంది ప్రజలు మంచి నీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. కృష్ణా బరాజ్కు కుడివైపున నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనంలో మాజీ ముఖ్యమంత్రి నివసించడం ‘రివర్ కన్సర్వెన్సీ యాక్ట్’ను ఉల్లంఘించడమే. ఈ యాక్ట్ ప్రకారం నదిని ఆనుకుని 500 మీటర్ల వరకూ ఎటువంటి నిర్మాణాలను చేయకూడదు. కానీ మాజీ ముఖ్యమంత్రి నివసిస్తున్న భవనం నదికి వందమీటర్ల దూరంలోనే ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ 1996 మార్చి ఎనిమిదో తేదీన విడుదల చేసిన జీఓ నం. 111 ప్రకారం... నదికి సమీపాన ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. ఎటువంటి వ్యర్థ పదార్థాలు నదిలో వదలకూడదు. భారత శిక్షాస్మృతి సెక్షన్ 277 ప్రకారం నీటి వనరులను కలుషితం చేసే వారికి మూడు నెలల జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించవచ్చు. ప్రస్తుతం చంద్రబాబు నివాస ప్రాంతంలో ఉన్న కట్టడాలన్నీ నదీ ‘పరిరక్షణ చట్టం–1884’ నిబంధనలకు విరుద్దంగా నిర్మించినవేనని స్వయానా అప్పటి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 2015 జనవరిలో చెప్పడమే కాక... వివిధ శాఖల నుంచి నోటీసులు కూడా ఇప్పించి వీటన్నిటినీకూల్చి వేస్తామని హడావిడి చేశారు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివసిస్తున్న లింగమనేని ఎస్టేట్ భవనం కూడా ఈ కూల్చివేత భవనాల జాబితాలో ఉంది. నదీ తీర ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టడం నిషిద్ధం. ఇదే విషయాన్ని అప్పటి ఆయన మంత్రి వర్గ సహచరుడే ప్రకటించినప్పటికీ చంద్రబాబు పెడచెవిన పెట్టారు. వందలాది కోట్ల రూపాయల వ్యయంతో కృష్ణా పుష్కరాలను నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ నదికి పవిత్ర హారతులు కూడా ఇచ్చారు. ఒకవైపు పుణ్య స్నానాలు చేస్తూ, హారతులు ఇస్తూ... మరోవైపు ఆ నదినే వ్యర్థాలతో అపవిత్రం చేయడం అత్యంత శోచనీయం. చంద్రబాబు నాయుడు పంతాలకు, పట్టింపులకు పోకుండా ఆ ప్రాంతంలోని తన నివాసాన్ని వేరే చోటికి తరలించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. అలాగే ఈ ప్రాంతంలోని మిగిలిన అక్రమ కట్టడాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం తొలగించాలి. కృష్ణా నది శుద్ధికి శ్రీకారం చుట్టాలి. (క్లిక్ చేయండి: విజ్ఞానమే పరిష్కారం! చిట్కాలు కావు!) - వి.వి.ఆర్. కృష్ణంరాజు ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
సమస్యే లేదు – వేరే అర్థం ఎందుకు?
పత్రికలలో ‘‘2500 ఏళ్లుగా పాణిని వ్యాకరణాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అనే వార్త చదివి తెల్లబోయాను. రిషిరాజ్ పోపట్ అనే 27 ఏళ్ల యువకుడు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పీహెడీ చేస్తున్నారట. అతడు చేసిన ప్రతిపాదన ఇది. సంస్కృత వ్యాకరణం పన్నెండు సంవత్సరాలు చద వాలని ప్రసిద్ధి. పూర్వం అలా చదివేవారు. ఇరవై ఏడేళ్ల యువకుడు ఇంగ్లీషులో చదివి ఇలా చెప్పడం ఒక వింత. తమ జీవితాలను విద్యాతపస్సులకు అంకితం చేసిన మునులు వరరుచి, పతంజలి. వారు వ్యాకరణ శాస్త్ర గ్రంథాలను రచించిన వారు. పతంజలి ముని యోగ శాస్త్రాన్ని రచించిన వారు. ప్రపంచంలో చాలా యోగాలకు ఆయన యోగశాస్త్రం మూలం. ‘మహా భాష్యం వా పాఠయేత్, మహా రాజ్యం వా పాలయేత్’ అని ఆర్యోక్తి. పతంజలి ముని వ్యాకరణ మహా భాష్యాన్ని పాఠం చెప్పడం ఒక పెద్ద రాజ్యాన్ని పాలించడంతో సమానం. మహా భాష్యమైనా పాఠం చెప్పాలి. మహా రాజ్యమైనా ఏలాలని పై సంస్కృత సూక్తికి అర్థం. తరువాత కైయటుడు, భట్టోజి దీక్షితులు, నాగేశ భట్టు మొదలైన వారు బహుశాస్త్ర పండితులు. వీరు వ్రాసిన గ్రంథాలన్నీ అర్థం చేసుకోవడమే గొప్ప విషయం. వీరందరినీ కించపరిచే ఇతడు చెప్పిన విషయాన్ని పరిశీలించాలి. ఒక పదం తయారు చేయడంలో రెండు సూత్రాలు ఒకేసారి ప్రవర్తిస్తూంటే వానిలో ఏ సూత్రం ప్రవర్తింప చేయాలనే విష యంలో పాణిని ముని ‘విప్రతిషేధే పరం కార్యమ్’ అనే సూత్రం చెప్పారు. సమానమైన బలం కలిగిన రెండు సూత్రాలకు వైరుధ్యం కలిగినపుడు వరుస క్రమంలో తరువాత ఉన్న సూత్రం ఎంచు కోవాలి అని పాణిని మునిని అనుసరించిన గ్రంథకర్తలు తెలిపారు. ‘‘ఈ పద్ధతి వ్యాకరణం ద్వారా అనేకమైన తప్పు రూపాలను తయారు చేస్తుంది’’ అని ఇతడి ప్రతిపాదన. కాబట్టి ఇతడు ఈ సూత్రానికి వేరే అర్థం చెబుతున్నారు. ఒక పదం తయారు చేసే క్రమంలో ఒకచోట రెండు సూత్రాలు ప్రవర్తించవలసినపుడు వాటికి వైరుధ్యం వస్తే ఆ పదంలో రెండో భాగంలో ప్రవర్తించ వలసిన సూత్రాన్నే ప్రవర్తింప చేయాలి. ఈ పద్ధతిని అవలంబిస్తే సుమారు అన్ని పదాల తయారీలో సరైన సమాధానం లభిస్తుందని ఇతడి ప్రతిపాదన సారాంశం. ఉదాహరణానికి మంత్ర + భిస్ అని ఉన్నపుడు 7 అ – 3 పా – 103 సంఖ్యగల సూత్రంచే మంత్రంలోని త్ర వర్ణమందు గల అకారానికి ఏ కారం వస్తుంది. దీనివల్ల మంత్రేభిః అనే అసాధు రూపం ఏర్పడుతుంది. 7 అ – 1 పా – 9 సంఖ్యగల సూత్రంచే భిస్ కు ఐస్ వస్తుంది. మంత్ర + ఐస్ = మంత్రైః అని తయారవుతుంది. ఇది సరి అయిన రూపం. కాబట్టి రెండు సూత్రాలకు విప్రతిషేధం వస్తే వరుస క్రమంలో తరువాతి సూత్రం అని చెప్పకూడదు. మంత్ర + భిస్ అనే చోట తరువాత ఉన్న ఐస్ కి భిస్ వస్తోంది. ఇది పదంలో కుడివైపున జరిగే కార్యం. దానిని విధించే సూత్రాన్ని ఎంచుకోవాలని పాణిని అభిప్రాయం. దీనివలన మంత్రైః అనే సరి అయిన రూపం ఏర్పడుతుందని రిషి రాజ్ ప్రతిపాదనం. సూత్ర గ్రంథాలలో అల్పాక్షరాలలో అనల్పమయిన అర్థాన్ని ఇముడ్చుతారు. దానిలో సారం చాలా ఉంటుంది. దోషం ఉండదు. ఇలాంటి సూత్రాలు విద్యను కంఠస్థం చేయడానికి ఉపయోగిస్తాయి. కాని విద్యార్థికి సూత్రంలో భావం ఎలా తెలుస్తుంది? గురువుల వల్ల, సూత్ర గ్రంథాల అధ్యయనం వల్ల, సూత్రాలపై రాసిన వ్యాఖ్యల వల్ల తెలుస్తుంది. సూత్ర గ్రంథాలకు గురుశిష్య పరంపరగా వచ్చిన అర్థమే గ్రంథకర్త అభిప్రాయం అయ్యే అవకాశాలు అధికం. అలాగే గురు శిష్య పరంపరగా ఈ సూత్రాల అధ్యయనం సాగేది. ఒక సూత్రానికి కొత్త అర్థం చెప్పి పూర్వ గ్రంథాలు చెప్పినది తప్పు అనడం సమంజసం కాదు. కాత్యాయనునికి వరరుచి అని మరో పేరు. ఆయన వార్తికాలన్నీ మహా భాష్యంలో ఉన్నాయి. విడిగా లేవు. పతంజలి యోగ శాస్త్రం వ్రాశారు. వీరి వ్యాకరణ భాష్యాన్ని మహా భాష్యం అంటారు. బహువచనే ఝల్యేత్ 7 అ – 3 పా – 103 సూ. ఝలాదౌ బహు వచనే సుపి పరే అతోఙ్గ స్యైకార స్సా్యత్ రామేభ్యః ఇది పతంజలి భాష్యం. పై సూత్రం మంత్ర + భిస్ అన్నచోట త్ర కారానికి ఏత్వం విధించగలదు. ఇది తరువాతి సూత్రం కనుక మంత్రే + భిస్ అని అయ్యే అవకాశం ఉంది. అతో భిస ఐస్ 7 అ – 1 పా – 9 సూ. ‘అకారాన్తా దఙ్గా ద్భి స ఐస్ స్యాత్, రామైః’ ఇది భాష్యంలోనిది. మంత్ర + భిస్ అని ఉన్నపుడు పై సూత్రం చే ఐస్ వచ్చి మంత్రైః అని అవుతుంది. విప్రతిషేధే పరం కార్యమ్ ఈ సూత్రం చేత సమాన బలం కలిగిన రెండు సూత్రాలు ఒక చోట ప్రవర్తించవలసి వస్తే తరువాత ఉన్న సూత్రం ప్రవర్తించాలి. కానీ ఇక్కడ వరుసలో పూర్వం ఉన్న సూత్రం ప్రవర్తించిన రూపమే సరియైనది. కారణ మేమిటి ? అతో భిస ఐస్ 7 అ – 1 పా – 9 సూ. వృక్షైః, ఇహ పరత్వా దేత్వం ప్రాప్నోతి. ... కృతైత్త్వే భూత పూర్వ మకారం భవిష్యతి. ఐస్తు నిత్యమ్. ... కృతే ప్యేత్వే ప్రాప్నోతి అకృతేపి ప్రాప్నోతి. నిత్యత్వా ధైత్వే కృతే విహత నిమిత్తత్వాత్ ఏత్వం న భవిష్యతి. – వ్యాకరణ మహాభాష్యం (244 పు.) 7 అ – 3 పా – 103 వ సూత్రం పర సూత్రం కనుక దాని చేత మంత్ర + భిస్ అనే చోట త్ర కారంలో అకారానికి... ఏత్వం చేస్తే ఆ ఏకార స్థానంలో పూర్వం ఉన్నది అకారం కనుక అపుడు కూడా భిస్కు ఐస్ వస్తుంది. కావున ఐస్ నిత్యం. ఐస్ చేస్తే ఝలాది వర్ణం పరంగా లేదు కనుక ఏత్వం రాదు అని భాష్యకారులు చెప్పారు. మంత్రలోని త్ర కారంలో ఉన్న అకారానికి వచ్చిన ఏ కారం అకారం వంటిది ఎలా అవుతుందని ప్రశ్న. సంస్కృత వ్యాక రణంలో ‘యథోత్తరం మునీనాం ప్రామాణ్యమ్’ అని నియమము. పాణిని ముని సూత్రాలకు భాష్యం లేకపోతే అవి అర్థం కావు. పాణిని ముని సూత్రాలకంటే కాత్యాయన ముని వార్తికాలకు, అంతకంటె పతంజలి ముని భాష్యానికి ప్రామాణ్యం ఎక్కువ. వార్తికాలు, భాష్యం లేకపోతే పాణిని సూత్రాలు మొత్తం సంస్కృత పద సముద్రానికి లక్షణం చెప్పలేవు. పతంజలి ముని ఒక శ్లోకం ఉదాహరించారు. శ్లో. ఏత్వం భిసి పరత్వాచ్చే దత ఐస్క భవిష్యతి కృత ఐత్వే భూత పూర్వా్య ధైస్తు నిత్య స్తథాసతి ఇది కాత్యాయన ముని వార్తికం అయి ఉంటుంది. కాబట్టి ఈ కారిక, పతంజలి ముని వచనం ప్రమాణంగా తీసుకుని ఐస్ను విధించే సూత్రం నిత్యమని చెప్పడం సముచితమే. ‘త్రిముని వ్యాకరణమ్’ అని ఆర్యోక్తి. ముగ్గురూ వ్యాకరణ విషయంలో ప్రామాణికులే. పరం కంటే నిత్యం బలమయినది. కనుక ఏత్వం రాకుండా ఐస్ వచ్చిందని భావం. పర సూత్రం కంటె నిత్యం బల మయినదని ‘పూర్వ పర నిత్యాన్తరఙ్గానా ముత్తరోత్తరం బలీయః’ అనే పరిభాష తెలుపుతుంది. కావున పర సూత్రమైన ‘బహువచనే ఝల్యేత్’ అనే సూత్రాన్ని నిత్య సూత్రమైన ‘అతో భిస ఐస్’ బాధించింది. మంత్ర + ఐస్ = మంత్రైః అయ్యింది. ‘అతో భిస ఐస్’ నిత్య సూత్రమెలా అవుతుంది? ఏత్వం ఒక వర్ణానికి చెందిన విధి కదా అని ప్రశ్న. ఒక వర్ణానికి చెందిన విధిలో ఆదేశం స్థానివంటిది కాదని నిషేధం ఉంది. అపుడు ఏకారం అకారం వంటిది కాదు. ఇక్కడ భాష్యం వార్తికం ఎలా సరిపడతాయని ఆక్షేపం వస్తుంది. ‘అచః పరస్మిన్ పూర్వవిధౌ’ అనే సూత్రానికి మహాభాష్యంలో ‘అజాదేశః పరనిమిత్తకః పూర్వస్య విధిం ప్రతి స్థానివద్ భవతి. కుతః పూర్వస్య ఆదేశాద్’ అనే వాక్యాలున్నాయి. మంత్ర + భిస్ అనే చోట ‘బహువచనే ఝల్యేత్’ అనే సూత్రంచే త్రకారంలో ఉన్న అకారానికి ఏత్వం వచ్చి మంత్రే + భిస్ అయ్యింది. ఇప్పుడు ‘అతో భిస ఐస్’ అనే సూత్రం చేత ‘భిస్’నకు ఐత్వం వస్తున్నపుడు ఆదేశం అయిన ఐస్ కంటే పూర్వ మందున్న ఏకారానికి స్థానివద్భావం చేస్తే భిస్ నకు ఐస్ ప్రాప్తించి మంత్రైః అవుతుంది. కాబట్టి పైన పతంజలి ముని, కాత్యాయన ముని పేర్కొన్నట్లు ‘అతో భిస ఐస్’ నిత్య సూత్రం అయ్యింది. పరం కంటె నిత్యం ప్రబలం కనుక మంత్రైః అనే రూపం సిద్ధిస్తోంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి తప్పు, సమస్య, గందర గోళం లేవు. రిషి రాజ్ పోపట్ పరిశోధన చేసి ఒక సూత్రానికి కొత్త అర్థం చెప్పి సంస్కృత వ్యాకరణ మార్గంలో ఋషి పుంగవులను, ఋషి తుల్యులను కించ పరిచాడు. తాను విప్రతిషేధే అనే సూత్రానికి కొత్త అర్థం చెప్పడం వల్ల కొన్ని రూపాలు కుదరడం లేదు. ఇది అతడి ప్రసంగం చూసి చేసిన విమర్శ. అతడి సిద్ధాంత గ్రంథాన్ని విమర్శిస్తే అదో పెద్ద గ్రంథమవుతుందేమో! (క్లిక్ చేయండి: జ్ఞాపకాలు విప్పి చెప్పిన కథనాలు) - డాక్టర్ చిఱ్ఱావూరి శివరామ కృష్ణ శర్మ వ్యాసకర్త రీడర్ (విశ్రాంత) ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్టణం -
Telidevara Bhanumurthy: కొంపలు ముంచే కొత్త దుక్నాలు
తెలంగానకు బోక శానొద్దు లైంది. ఒక్కపారి గా రాస్ట్రంకు బోయొస్తె బాగుంటదని నారదుడు అనుకుండు. తిట్టేటి నోరు, తిరిగేటి కాలు ఊకుండయి. నారదుడు తంబూర దీస్కుండు. ఒకపారి టింగ్ టింగ్ మన్నడు. చిర్తలు గొట్టుకుంట నారాయన, నారాయన అనుకుంట మొగులు మీది కెల్లి ఎల్లిండు. పట్నం దిక్కు గాయిన రాబట్టిండు. నడ్మల నర్కం దిక్కు బోతున్న యముని దున్నపోతు ఎదురైంది. ‘‘యాడికి బోతున్నవ్ నారదా’’ అని అడిగింది. ‘‘తెలంగాణల ఏమైతున్నదో ఎర్క జేస్కునే తంద్కు బోతున్న. నా సంగతి కేంగని నువ్వు పట్నం ఎందుకు బోయినవు’’ అని నారదుడు అడిగిండు. ‘‘మా దున్నపోతుల సంగం ఎలచ్చన్లు ఉంటె ఒక్క తీర్గ రమ్మని నన్ను బిలిస్తె బోయుంటి.’’ ‘‘మీ సంగం ఎలచ్చన్లు ఎట్లయినయి?’’ ‘‘సూద్దామని బోయిన నన్ను సుట్ట కుదురును జేసినయి. దున్నపోతుల సంగం ప్రెసిడెంటును జేసినయి.’’ ‘‘నర్క లోకం దున్నపోతును ప్రెసిడెంట్ నెట్ల జేస్తరని తెలంగాన దున్నపోతులు లొల్లి బెట్టలేదా?’’ ‘‘లొల్లి బెట్టెతంద్కు మా దున్నపోతులేమన్న కాంగ్రెస్ పార్టీయా?’’ ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ అసువంటి రాజకీయ పార్టీల గాలి దాక్తె దున్నపోతులల్ల గుడ్క రాజకీయాలు షురువైతయేమో!’’ అని నారదుడు అన్నడు. ‘‘నువ్వు తక్వోనివి గావు నారదా! మా దాంట్ల రాజకీయాలు షురువైతె మేము మేము కొట్లాడు కుంటుంటె సూసి మురుద్దామనుకుంటున్నవు. గీ నడ్మ కాంగ్రెస్, బీఆర్ఎస్ కొత్త దుక్నాలు దెర్సినయి. ఇంతకుముందు తెలంగానల టీఆర్ఎస్ అనేటి కిరాన దుక్నముండేది. గా దుక్నంను హోల్సేల్ దుక్నం జేసి డిల్లిల దెర్సిండ్రు. బీఆర్ఎస్ అని పేరు బెట్టిండ్రు. దుక్నంల కేసీఆర్ గూసుండు. వాస్తు జూసి మంచి మూర్తంల దుక్నం దెర్వబట్కె గిరాకి మంచి గైతదని గాయిన అనుకుండు. గని గాయిన ఒకటను కుంటె ఒకటైంది. కుమార స్వామి, అఖిలేశ్ యాద వ్లే దుక్నం కాడ్కి వొచ్చిండ్రు. గాల్లది ఉద్దెర బ్యారమే. గాల్లు దప్పిడ్సి డిల్లిల ఎవ్వలు గా దుక్నం గురించి ముచ్చట బెట్టలే.’’ ‘‘కాంగ్రెస్ దుక్నాల సంగతేంది?’’ అని నారదుడు అడిగిండు. ‘‘గిప్పుడున్న అంగడిల ఒకల్లను జూసి ఒకల్లు ఓరుస్త లేరు. కండ్లల్ల మన్ను బోసుకుంటున్నరు. భారత్ జోడో యాత్ర జేస్కుంట ప్రేమ దుక్నాలు దెరుస్తున్న. గీ దుక్నాలు కడ్మ దుక్నాల సుంటియి గాదు. గిన్వి ఎవ్విటిని అమ్మయి, కొనయి. అందర్కి ప్రేమను పంచిస్తయి. బువ్వబెడ్తె అర్గిపోతది. బట ్టలిస్తె చిన్గిపోతయి. గని నా ప్రేమ అర్గేది గాదు అని రాహుల్ గాంధి అన్నడు.’’ ‘‘ఇంతకు గాయిన ప్రేమ నెట్ల పంచుతున్నడు?’’ ‘‘కాంగ్రెస్సోల్లు గండ్లబడ్తె గాలియెంబడి ముద్దు లిస్తున్నడు. చిన్న పోరనికి చెప్పులేస్తున్నడు. బుడ్డ పోరగాన్ని ఎత్తుకోని ముక్కు చీమిడి దీస్తున్నడు. కాలేజి పోరగాల్లకు సేకెండిస్తున్నడు. ఛాయ్ దాక్కుంట ముసలోల్ల మంచి చెడ్డ లర్సుకుంటు న్నడు. రాహుల్ గాంధి భారత్ జోడో అన్కుంట పాదయాత్ర జేస్తుంటే పార్టీ తోడో అన్కుంట తెలం గానల కాంగ్రెస్ లీడర్లు కొట్లాడుకుంటున్నరు’’ అని దున్నపోతు అన్నది. ‘‘ఎందుకు కొట్లాడుకుంటున్నరు?’’ అని నార దుడు అడిగిండు. ‘‘రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన కాడికెల్లి తెలంగాన సీనియర్ కాంగ్రెస్ లీడర్లు లోపట లోపట మండుతున్నరు. మునుగోడుల కాంగ్రెస్ ఓడిపోంగనే గాయిన మీద్కి లేసిండ్రు. టీపీసీసీ కమిటీలు ఎయ్యంగనే రేవంత్ను తిట్టుకుంట గాల్లు శిగమూగ బట్టిండ్రు. భట్టి విక్రమార్క ఇంట్ల కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్కుమార్ రెడ్డి, మధుయాష్కి, దామోదర్ రాజ నర్సింహ, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, ప్రేంసాగర్ రావు అసువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లు మీటింగ్ బెట్టిండ్రు. టీడీపీకెల్లి కాంగ్రెస్లకొచ్చిన రేవంత్ రెడ్డి టీపీసీసీ కమిటీలల్ల టీడీపీలకెల్లి వొచ్చి నోల్లకే మోక ఇచ్చిండు. ముంగటి సంది కాంగ్రెస్ల ఉన్నోల్లను పక్కకు బెట్టిండు. సేవ్ కాంగ్రెస్ అన్కుంట గాల్లు లొల్లిబెట్టబట్టిండ్రు. ‘హాత్ సే హాత్’ ప్రోగ్రాంకు డుమ్మాగొట్టిండ్రు. ఇగ దాంతోని టీపీసీసీ కుర్సిలకు సీతక్కనే గాకుంట పన్నెండుమంది కాంగ్రెస్ లీడర్లు రాజినామ జేసిండ్రు. కొట్లాడుకుంటున్న కాంగ్రెస్ లీడర్లల్ల కొంతమందిని గుంజి గాల్ల చేతులల్ల తామర పువ్వులు బెట్టెతంద్కు బీజేపీ రడీగున్నది.’’ ‘‘బీఆర్ఎస్ దుక్నం సంగతేంది?’’ ‘‘డిల్లిల బీఆర్ఎస్ హోల్సేల్ దుక్నం బెట్టినంక కేసీఆర్ పట్నమొచ్చిండు. రొండు మూడు దినా లైనంక పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గాయినను గల్సిండు. ఆంద్రప్రదేస్, పంజాబ్, హర్యానా, మహా రాస్ట్ర, ఒడిసా, కర్నాటక రాస్ట్రాలల్ల బీఆర్ఎస్ దుక్నాలు దెరుస్తమని కేసీఆర్ జెప్పిండు. ఆ దుక్నాల ముంగట ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని రాసిన బోర్డులు బెడ్తమని అన్నడు. మల్ల గలుస్త’’ అన్కుంట దున్నపోతు నర్కం దిక్కుబోయింది. నారాయన, నారాయన అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు. (క్లిక్ చేయండి: మందల బడి మురుస్తాంది గొర్రె) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
అమరజీవి త్యాగాన్ని గుర్తుచేస్తూ... సాయి చంద్ పాదయాత్ర
ప్రముఖ సినీనటుడు సాయి చంద్ ‘మా భూమి’ (1980) చిత్రంతో పరిచయమై, పేరు తెచ్చుకుని ఇటీవల కాలంలో శేఖర్ కమ్ముల ‘ఫిదా’ (2017) చిత్రంలో తెలంగాణ మాండలికంలో తండ్రి పాత్రను గొప్పగా రక్తి కట్టించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకుని 69 ఏళ్లు నిండి 70వ సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా... డిసెంబర్ 15న మదరాసు నుంచి సుమారు మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే పడమటి పల్లె గ్రామానికి కాలినడకన ఒంటరిగా బయల్దేరారు. సోమవారానికి ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకుంది. 7వ రోజైన బుధవారానికి కావలికి సమీపంలో కొనసాగింది. పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంటరిగా దీక్ష ప్రారంభించినట్లుగానే సాయిచంద్ తన అనుచరుడు భీమినేని రాయుడుతో తన నడకను మద్రాసు తెలుగు మిత్రుల వీడ్కోలుతో ప్రారంభించారు. మద్రాసు, మైలాపూరులోని స్పీకర్ బులుసు సాంబమూర్తి ఇంటి ఆవరణలో పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు నిరాహారదీక్ష చేసి భారత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడానికి శ్రీకారం చుట్టారు. పొట్టి శ్రీరాములు స్మారక స్థలి నుంచి బయలు దేరిన సాయిచంద్ ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో, సింగ రాయకొండకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పడమటి పల్లెకు నడుస్తూ ఉన్నారు. 1956లో జూన్ 25న సంస్కర్త, పోరాటశీలి త్రిపురనేని రామస్వామి చౌదరి మనవడిగా; ప్రఖ్యాత రచయిత, మేధావి త్రిపురనేని గోపీచంద్ కుమారుడిగా సాయిచంద్ జన్మించారు. తొలిదశ నుంచీ అభ్యుదయ భావాలు పుష్కలంగా ఉన్న సాయిచంద్ బాల్యం విజయవాడలో గోరాగారి నాస్తిక కేంద్రంలో సాగింది. రచయిత, గాయకుడు కూడా అయినటువంటి సాయిచంద్ ప్రస్తుత సమాజానికి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చెయ్యాలని ఈ నడక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 1876లో ధాత కరువు వచ్చి తిండీ, నీళ్ళు లేక ప్రజలు, పశువులు అలమటించాల్సి వచ్చింది. అప్పట్లో కనిగిరి తాలూకాలోని పడమటి పల్లె అనే కుగ్రామం నుంచి బతుకు తెరువు కోసం పొట్టి శ్రీరాములు కుటుంబం తమిళ సీమకు తరలి వెళ్లింది. మదరాసు నగరం జార్జి టౌన్లోని అన్నా పిళ్ళై వీధిలో 163వ నంబరు గల గృహంలో 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించారు. శ్రీరాములుకు 12 ఏళ్ళు రాకుండానే తండ్రి గురవయ్య గతించారు. ప్రాథమిక విద్య మద్రాసులోనే జరిగింది. తర్వాత బొంబాయిలోని విక్టో రియా జూబిలీ టెక్నికల్ ఇనిస్టిట్యూట్లో చదువుకున్నారు. 1920 ప్రాంతంలో శానిటరీ ఇంజనీరింగ్ చదువు కార ణంగా రైల్వే శానిటరీ ఇంజనీరుగా బొంబాయిలో ఉద్యోగం లభించింది. ఆ సమయంలో తల్లి, భార్య, ఒక కుమారుడు చాలా తక్కువ వ్యవధిలో కనుమరుగవడం గొప్ప విషాదం. పదేళ్ళ తరువాత గాంధీజీ ప్రభావానికి లోనైన తర్వాత 1930 ఏప్రిల్లో ముఖాముఖి కలిశారు. గాంధీజీ అనుమతి పొంది, ఉద్యోగానికి అదే నెలలో రాజీనామా చేసి సబర్మతీ ఆశ్రమం బయలుదేరారు. ఇదీ స్థూలంగా పొట్టి శ్రీరాములు జీవిత నేపథ్యం. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరికతో తొలి సమావేశం బాపట్లలో 1913లో జరిగింది. ఆ తరువాత నాలుగు దశాబ్దాలకు పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు ఎందుకు బలిపెట్టవలసి వచ్చిందో చరిత్రలోకి వెళ్లి చూడాలి. తెలుగు వారి ప్రత్యేక రాష్ట్రం కోసం ఎస్కే ధార్ కమీషన్ (1948), జేవీపీ కమిటీ (1949), మరో మూడు కమిటీలు రిపోర్టులిచ్చాయి. అయితే సి. రాజగోపాలా చారి, జవహర్లాల్ నెహ్రూ, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి వంటివారి సొంత ఆలోచనల కారణంగా చాలా పరిణామాలు సంభవించాయి. గాంధీజీకి వియ్యంకుడై 1952 జనవరి 26 దాకా అధికారం చలాయించిన, సొంత భాష ప్రయోజనాల కోసం తపించిన తమిళుడైన సి. రాజగోపాలాచారి తెలుగు వారికి పెద్ద రాష్ట్రం ఏర్పడటాన్ని వ్యతిరేకించారంటారు. బెంగాల్ వంటి ప్రాంతాల్లో మాదిరిగా కమ్యూనిస్టు పార్టీ తెలుగు ప్రాంతంలో స్థిరపడి తనకి ఇబ్బంది కలిగించకూడదని నెహ్రూ భావనలు, నీలం సంజీవ రెడ్డి స్థానిక రాజకీయ ప్రయోజనాలు వెరసి రాష్ట్ర అవతరణను అడ్డుకున్నాయి. వీటన్నిటినీ గమనించిన పొట్టి శ్రీరాములు చలించి తన వంతుగా నిరాహారదీక్షకు దిగారు. దీక్ష ప్రారంభించిన తర్వాత కూడా అదేమీ పెద్ద ప్రభావం చూపబోదని పలు నివేదికలు మదరాసు నుంచి ఢిల్లీ వెళ్ళాయి. అయితే పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ అయిన తర్వాతనే తెలుగువారి మనోభీష్టం బయటి ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఆ కారణంగానే 1956లో తెలుగు, తమిళం, కన్నడం మలయాళం భాషలవారికి ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇంతటి ఘనమైన త్యాగ చరిత్రను, పొట్టి శ్రీరాములు వంటి సాధారణవ్యక్తి నిరుపమాన త్యాగాన్ని తెలుగు వారికి గుర్తు చెయ్యాలని 66 ఏళ్ళ అవివాహితుడైన సాయి చంద్ తన కాలినడకతో తెలియచెప్పాలని ప్రయత్నిస్తున్నారు! (క్లిక్ చేయండి: కొత్త సంవత్సరం బాగుంటుందా?) - డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి -
సున్నా వడ్డీ రుణాలు.. గిరిజన రైతులకు మేలు
ఏజెన్సీ ప్రాంతాలలో వ్యవసాయం చేసే గిరిజన కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బ్యాంకులు ఈ చిన్న, సన్న కారు రైతులకు రుణాలు ఇవ్వకపోవడమే. ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వడ్డీ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుండి ఏజెన్సీ ఏరియాకి వస్తుం టారు. బ్యాంకు రుణం దొరకని రైతులు తప్పనిసరి పరిస్థితిలో ఈ వడ్డీ వ్యాపారుల నుండి విత్తనాలు, ఎరువులు, అప్పు తీసుకుంటారు. వ్యాపారులు 10 నుంచి 15 శాతం వడ్డీ వసూలు చేస్తారు. సుమారు 20 శాతం పంట డబ్బులను బయానా (అడ్వాన్స్)గా పొందడమే గాక, వాటికి వడ్డీ చెల్లించకపోవడం కొసమెరుపు మోసం. తిండి గింజల కోసం ఆరుగాలం కష్టించే రైతులు... ప్రత్యామ్నాయంగా పత్తి తదితర వాణిజ్య పంటలు పండించినా ఆదాయం అంతంత మాత్రమే వస్తుండటంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ లోని కొన్ని ఆదివాసీ ప్రాంత రైతులకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వక పోవ డంతో బ్యాంకు రుణాలు అందటం లేదు. 2016లో గిట్టుబాటు ధర లభించని ఒక కుటుంబం (ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లోని కుంటగూడ గ్రామం) వడ్డీ వ్యాపారికి రూ.60 వేల విలువైన ఎడ్లను అమ్మివేసి, తమ పిల్లలను చదువు మాన్పించి, కూలి పనులకు కుదిర్చింది. వడ్డీ వ్యాపారులకు భయపడి కొందరు రాత్రివేళ ఇళ్ళు చేరడం, లేదా గూడేలు వదిలి పోవడం జరుగుతోంది. ఇక రోజువారీ ‘గిరిగిరి’ వ్యాపారం వర్ణించ లేనిది. గిరిజనుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని, వడ్డీ వ్యాపారులు చేస్తున్న మోసాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఏజెన్సీలో వడ్డీ వ్యాపార నిబంధన చట్టం–1960ను రూపొందించింది. దీని ప్రకారం నాము, సిరి నాము పేరుతో పంటల మీద వడ్డీకి అప్పులు ఇవ్వడం నిషేధించబడింది. ఈ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 5,948 షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాలన్నింటికీ వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం లైసెన్స్ పొందకుండా రుణాలు ఇవ్వరాదు. అనుమతి లేకుండా వ్యాపారం చేస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ. 1000 వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు. అయితే చట్టాన్ని అమలు చేయడంలో ఉన్న సాచివేత ధోరణి వల్ల ఏజెన్సీ రైతుల కష్టాలు అలాగే ఉండిపోయాయి. ప్రస్తుతం ఏపీలో ‘వైఎస్సార్ రైతు భరోసా’, తెలంగాణలో ‘రైతుబంధు’ పథకాల ద్వారా అందే సాయం వల్ల కొంత మేలు జరుగుతోంది. రైతులందరికీ పెట్టుబడిగా ఇవ్వబోయే ముందస్తు సాయం, రుణాలు సకాలంలో అందించి ఏజెన్సీ ప్రాంత అన్నదాతలను ఆదుకోవాలి. ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు ఇస్తే ఈ రైతులకు మేలు జరుగుతుంది. (క్లిక్ చేయండి: యావజ్జీవ శిక్ష అంటే జీవిత శేషభాగం) – గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవం) -
Natural Skills: సహజ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలి
ఈ మధ్యన ఒకటి–రెండు సందర్భాలలో మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఒకరిద్దరు చురుకైన విద్యార్థులను కలవడం సంభవించింది. వాళ్లతో మాటా–మాటా కలిపి, వారి–వారి ప్రొఫెషనల్ విద్యాభ్యాసంలో భాగంగా ఏం నేర్చుకుంటున్నారూ, అధ్యాపకులు ఏం నేర్పిస్తున్నారనీ ప్రశ్నిస్తే, వారిదగ్గర నుండి ఆశించిన సమాధానం రాలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత ఏరకమైన మెషిన్లమీద పనిచేస్తావని ప్రశ్నిస్తే తెలియదని అమాయకంగా వచ్చింది జవాబు. కంప్యూటర్ ఇంజనీరింగ్ తరువాత సరాసరి ఏదైనా ప్రోగ్రామింగ్ చేయగలరా అంటే దానికీ జవాబు లేదు. సివిల్ ఇంజనీరింగ్ తరువాత ఎలాంటి ప్రాజెక్టులలో పనిచేయాలని అనుకుంటున్నావని అడిగితే అసలే అర్థం కాలేదు. అందరూ విద్యార్థులూ ఇలాగేనా అంటే కావచ్చు, కాకపోవచ్చు. స్వతహాగా తెలివైన కొందరి విషయంలో మినహాయింపు ఉండవచ్చు. ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులన్నీ ఇటీవల కాలంలో ‘నాలెడ్జ్ బేస్డ్’ (అంతంత మాత్రమే) తప్ప ‘స్కిల్ బేస్డ్’ కాకపోవడమే బహుశా దీనికి కారణం కావచ్చు. ఇదిలా ఉంటే ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా రకరకాల వృత్తి నిపుణులు మన దేశంలో, రాష్ట్రంలో కోకొల్లలు. వారంతా స్వయంశక్తితో వారి వారి వృత్తుల్లో ఎలా ప్రావీణ్యం సంపాందించుకున్నారో అనేది కోటి రూకల ప్రశ్న. వారిలో గ్రామీణ వృత్తులు మొదలుకుని, పట్టణాలలో, నగరాలలో పనిచేస్తున్న వాహనాలు, ఎయిర్ కండీషన్లు వంటి వాటిని బాగుచేసే మెకానిక్కులు చాలామందే ఉన్నారు. వీరు రిపేర్లు చేయడానికి వచ్చేటప్పుడు తమ వెంట ఒక జూనియర్ కుర్రవాడిని తీసుకు వస్తారు. అతడు కొంతకాలానికి సీనియర్ అయిపోతాడు. అందుకే ఇటువంటివారు నేర్చుకున్న విద్య భావితరాలవారికి అందుబాటులోకి తీసుకువచ్చే విధానం ప్రవేశపెట్టాలి. వీరికి సంబంధిత విద్యార్హతలు లేకపోయినా ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ చెప్పేటప్పుడు ఉపయోగించుకునే విధానం రూపొందిస్తే మంచిదేమో! యాభై, అరవై ఏళ్ల అనుభవంతో చేస్తున్న సూచన ఇది. చేతి గడియారం పనిచేయకపోతే, కంపెనీ షోరూమ్కు పోయి ఇస్తే బాగుచేసి ఇవ్వడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి కాబట్టి, ఎప్పటిలాగే, ఆలవాటున్న ఒక రిపేర్ షాప్కు పోయాను ఇటీవల. ఆ చిన్న షాప్లో ఎప్పటిలాగే ఇద్దరు నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ కూర్చున్నారు. ఆ ఇద్దరిలో సీనియర్ వ్యక్తి (బహుశా) బ్యాటరీ కొత్తది వేయాలని చెప్పి రూ. 220 అవుతుందన్నాడు. నేను సరే అనగానే ఐదు నిమిషాలలో ఆ పని కానిచ్చి నా చేతిలో పెట్టాడు. గత ఏభై ఏళ్లుగా... తన తండ్రి కాలం నుంచి అక్కడే రిపేర్లు చేస్తున్నామనీ, గడియారాలు రిపేరు చేసే విద్య ఎప్పటినుంచో తనకు వచ్చనీ, ఎలా అబ్బిందో తెలియదనీ, ఎక్కడా నేర్చుకున్నది కాదనీ అన్నాడు. ఇటీవల మనం వాడుకునే వస్తువులు చెడిపోయినప్పుడు ఎక్కువగా కంపెనీల సర్వీసింగ్ మెకానిక్లను పిలవకుండా స్వంతంగా నేర్చుకున్న పనితనంతో తక్కువ ధరకు సర్వీసు చేసి పోతున్న లోకల్ టాలెంట్లనే వినియోగదారులు ఆశ్రయించడం వీరికి ఉన్న విశ్వసనీయతను తెలియ జేస్తోంది. ఇటువంటి నేచురల్ టాలెంట్ ఉన్న వారు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. మా చిన్నతనంలో ఖమ్మం పట్టణంలో మేమున్న మామిళ్ళ గూడెం బజారులో (లంబాడి) రాము అని ఆర్టీసీలో మెకానిక్గా పని చేస్తున్న వ్యక్తి ఉండేవాడు. అతడు ఏ మెకానికల్ ఇంజనీరింగ్ చదువు కోలేదు. కాని అద్భుతమైన రీతిలో మెకానిజం తెలిసిన వ్యక్తి. ఆ రోజుల్లో ఖమ్మంలో కార్లు, జీపులు బహుశా చాలా తక్కువ. వాటికి కానీ, లారీలకు కానీ ఏ విధమైన రిపేర్ కావాలన్నా రామునే దిక్కు. రాముకు సహజ సిద్ధంగా అబ్బిన విద్య అది. అప్పట్లో హైదరాబాద్లో మా బంధువు లబ్బాయి ఒకడిది అద్భుతమైన మెకానికల్ బ్రెయిన్. ఇంకా కంప్యూటర్లు ప్రాముఖ్యం చెందని రోజుల్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్లలో నైపుణ్యం సంపాదించాడు. ఎట్లా నేర్చుకున్నాడో, ఎవరికీ తెలియదు. ఇంటర్మీడియేట్ చదవడానికి ప్రయత్నం చేశాడు. కుదరలేదు. స్నేహితుల సహాయంతో అమెరికా చేరుకున్నాడు. చిన్నగా హార్డ్వేర్ మెకానిజంలో పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో కంపెనీలు అప్పట్లో అతడి మీద ఆధారపడేవి. అంచెలంచెలుగా ఎదిగి ఫార్మల్ డిగ్రీలు లేకపోయినా నైపుణ్యం ప్రాతిపదికగా అక్కడ స్థిరపడిపోయాడు. అతడా విద్య ఎలా నేర్చుకున్నాడు? చాలా కాలం క్రితం ఆంధ్రాబ్యాంక్లో కొఠారి చలపతి రావు అనే ఆయన పనిచేసేవారు. అక్కడ చేరడానికి ముందర కొన్ని చిన్నచిన్న ఉద్యోగాలు కూడా చేశాడు. ఇంకా అప్పటికి కంప్యూటర్లు పూర్తి స్థాయిలో వాడకంలోకి రాలేదు. కేవలం మామూలు గ్రాడ్యుయేట్ మాత్రమే అయిన కొఠారి చలపతిరావు స్వయంగా నేర్చుకుని ఆంధ్రా బ్యాంక్ కంప్యూటర్ సిస్టం ఏర్పాటు చేశాడు. ఆయన్ని అంతా కంప్యూటర్ భీష్మ పితామహుడు అని పిల్చేవారు. ఆయన ఆ విద్య ఎలా నేర్చుకున్నాడు? వీరిలాంటి అనేకమంది సహజ నైపుణ్యం ఉన్నవారిని ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీలలో క్వాలిఫికేషన్ లేకపోయినా అయినా ఉపయోగించుకోవాలి. అప్పుడే సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థులకు మంచి నైపుణ్యం అందుబాటులోకి వస్తుంది. (క్లిక్ చేయండి: గట్టివాళ్లే చట్టానికి గౌరవం) - వనం జ్వాలా నరసింహారావు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, తెలంగాణ ప్రభుత్వం -
సాహిత్యకారుల్లో చాతుర్వర్ణాలు.. అవేంటో తెలుసా!
ఇటీవల సాహిత్య సభల్లో – అది పుస్తకా విష్కరణ సభ గానీ, ఇంకోరకం సభ గానీ– ఒక ధోరణి అంటువ్యాధి లాగా తయారైంది. ఆ సభలకి సంబంధించిన దాదాపు అన్ని ఆహ్వాన పత్రాల్లోనూ ఇలా ఉంటుంది: ‘‘ముఖ్య అతిథి, గౌరవ అతిథి, విశిష్ట అతిథి, ఆత్మీయ అతిథి’’– అని నాలుగు రకాల అతిథులూ, వారి పేర్లూ ఉంటాయి. ఇంతకీ, ఈ అతిథుల్లో ఎవరు ముందో, ఎవరు తర్వాతో, ఎవరు ఎక్కువ గొప్పో, ఎవరు తక్కువ గొప్పో తేల్చడం కష్టం. ఆ ఆహ్వాన పత్రంలో, ఏ వరసలో ఆ మాటలు రాశారో, బహుశా ఆ వరసలోనే వాళ్ళ అంతస్తు లేదా హోదా వుంటుందనుకోవాలేమో! అతిథుల్లో ఈ నాలుగు రకాల్నీ చూస్తే, చాతుర్వర్ణ వ్యవస్థ అంటారే అది గుర్తొస్తుంది. ఈ హైరార్కీని (అంతస్తుల వారీ సంబంధాలను) 11వ శతాబ్దంలో, రాజాస్థాన కవులు పాటిం చారో లేదో తెలియదు. కానీ, ఈ 21వ శతాబ్దంలో, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాల కాలంలో మాత్రం, ఆధుని కులూ, ఉత్తరాధునికులూ, అభ్యుదయ వాదులూ, విప్లవ వాదులూ, దళిత వాదులూ, స్త్రీ–పురుష సమానత్వ వాదులూ... ఇలా అన్ని రకాల వారూ ఈ హైరార్కీని పాటిస్తు న్నారు. నోరు తెరిస్తే, ‘చాతుర్వర్ణ వ్యవస్థ’, ‘మనువాదం’, ‘బ్రాహ్మణీయ సంస్కృతి’, ‘ఫ్యూడల్ సంస్కృతి’, ‘పితృస్వామ్య సంస్కృతి’ అని మైకులు బద్దలయ్యేలాగా నినాదాలిస్తారు. మళ్ళీ ఆ అసమాన సంస్కృతినే పాటిస్తారు. అటు సభా నిర్వాహకులకు గానీ, ఇటు అతిథులుగా ఆహ్వానం పొందిన సాహిత్యకారులకు గానీ, ‘ఇదేమి పద్ధతి?’ అనే ఆలోచనే రావడం లేదు. ఈ మధ్య, ఇలాంటి ఆహ్వాన పత్రాలు మూడు వేరు వేరు సభలకి సంబంధించినవి, ఫోనులో నాకు అందాయి. వాటిని పంపిన వాళ్ళతో, ‘చాతుర్వర్ణాల్లాగా, ఇన్ని రకాల అతిథు లేమిటండీ?’– అంటే, ఒకరు ‘నిజమే’ అనీ; ఇంకొకరు ‘ఈసారి ఇలా జరగకుండా చూసుకుంటాం’ అనీ; మరొకరు, రాయ డానికి బద్ధకం వేసి, ఎమోజీలు అంటారే, ఒక నవ్వు బొమ్మా, రెండు నమస్కారాల బొమ్మలూ జవాబుగా పంపారు. కొందరు అతిథులు తమ పేరుకు ముందుగానీ, కిందగానీ, తమకు ఉన్న డిగ్రీల్నీ (డాక్టర్, ప్రొఫెసర్), ఇంతకు ముందు అనుభవించిన పదవుల్నీ (డైరెక్టర్, వైస్–ఛాన్సలర్), పొందిన అవార్డుల్నీ (అకాడెమీలో, పీఠాలో ఇచ్చిన వాటిని), ఇంకేమైనా అదనపు బిరుదులు వుంటే వాటినీ, ఆహ్వాన పత్రంలో రాయమంటారని విన్నాను. రైలు ఇంజను వెనక వరసగా రైలు పెట్టెల్లాగా ఆ విశేషణాల్ని పేర్చ మంటారన్నమాట! చాతుర్వర్ణ విమర్శను, ‘నిజమే’ అని అంగీకరించినాయన, ‘‘ఇంతకీ, ఈ సభల్లో ‘పంచములు’ ఎవరంటారు?’’ అని ప్రశ్న వేశాడు. ‘‘ఇంకెవరు? సభకి వచ్చి, ఈ గొప్ప అతిథులందరూ కూర్చున్న వేదికని ముట్టుకోడానికి వీల్లేనంత దూరంగా (అస్పృశ్యత), ప్రేక్షక స్థానాల్లో కూర్చుంటారే వారే పంచములు!’’ అని జవాబిచ్చాను. సాహిత్యసభల్లో పాటిస్తున్న ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఈ నాటిది కాదు. పాతికేళ్ళ కిందట, హైదరాబాదు యూనివర్సిటీలో, ఇతర విద్యార్థి సంఘాల వారి లాగే, ఒక దళిత విద్యార్థి సంఘం వారు, వాళ్ళ సభకి సంబంధించి ఒక ఆహ్వాన పత్రాన్ని నాకు ఇచ్చారు. ఆ పత్రంలో అన్ని అంతస్తుల అతిథుల పేర్లూ రాసి, ఆ పత్రాన్ని ఖరీదైన కవరులో పెట్టి ఇచ్చారు. ‘‘ఇదేమిటి బాబూ! సభకి వచ్చే వాళ్ళల్లో ఇన్ని తేడాలు ఎందుకు? ‘వేదిక మీద వాళ్ళే ముఖ్యులు, వేదిక కింద ఉన్న వాళ్ళు ముఖ్యులు కారు’– అనా? ‘వక్తలు’ అని, ఆ సభలో మాట్లాడేవారి పేర్లు రాస్తే సరిపోతుంది గదా? మాట మాట్లాడితే ‘బ్రాహ్మణీయ సంస్కృతి నశించాలి!’ అంటారు. అసమానత్వాన్ని సూచించే పద్ధతిని మీరూ పాటిస్తే ఎలా? పైగా, ఇంత ఖరీదైన కవరు ఎందుకూ? ఆ డబ్బులేవో ఇతర వాటికి ఖర్చు చెయ్యవచ్చు గదా?’’ అన్నాను. దానికి, ఆ ఉద్యమకారుడి జవాబు: ‘‘మీ కమ్యూనిస్టులు చెయ్యడం లేదా ఈ రకంగా? ఈ కవరంటారా, ఒకతను చందాగా ఇచ్చాడు’’ అని. దానికి నా జవాబు: ‘‘కమ్యూనిస్టులు ఎప్పుడో చెడిపోయారు. వాళ్ళు బూర్జువా పార్టీలకి తోకలుగా తయారయ్యారు. మరి మీరు ‘బ్రాహ్మణీయ సంస్కృతి నశించాలి! మనువాదం నశించాలి!’ అని భీకరంగా నినాదాలిస్తారే? ఈ విషయంలో, మీకూ మనువాదులకీ తేడా ఏమిటి?’’ అంటే జవాబు లేదు. జవాబు చెప్పాలంటే వారికి కష్టం. ఎందుకంటే, వారు ఆరాధ్య దైవంగా భావించే అంబేడ్కర్ అధ్యక్షతన తయారైన రాజ్యాంగంలోనే, చాతుర్వర్ణాలను తలపించే నాలుగు రకాల ‘బిరుదులు’ ఇచ్చే ఏర్పాటు ఉంది. పౌరులందరూ సమానులే అని ఒక వైపు చెపుతూనే, కొందరు భారతరత్నలు, కొందరు పద్మ విభూషణులు, కొందరు పద్మభూషణులు, మరికొందరు పద్మశ్రీలు! సాధారణ ఉద్యమకారులే కాదు, విప్లవవాదులు కూడా మనుషుల మధ్య ఉండే ఈ రకం అసమాన విభజనను (ఒక రకం వ్యక్తిపూజని) వ్యతిరేకించరు. ఎందుకంటే, ప్రపంచంలో ఎవ్వరూ చేయించుకోనన్ని వ్యక్తి పూజలు చేయించుకున్న ‘మహా మహో పాధ్యాయులైన కామ్రేడ్స్ స్టాలిన్, మావో’ల్ని ఎవరైనా విమర్శిస్తే ఈ విప్లవవాదులు సహించలేరు. సాహిత్య సభలలో, అతిథులందరూ వేదికను ‘అలంకరించి’, ఒకరు మాట్లాడుతుండగా, మిగతా వాళ్ళు ఇద్దరేసి చొప్పున చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అసలు ఒకరు మాట్లాడుతూ ఉంటే, మిగతా వక్తలందరూ, ఆ టైములో శ్రోతలే. వాళ్ళూ ప్రేక్షకులున్న చోటే కూచుని శ్రద్ధగా వినాలి. తమ వంతు వచ్చినప్పుడు, వేదిక మీదకి వెళ్ళి మాట్లాడాలి. ఇది తర్క బద్ధమైన ప్రవర్తన. సమానత్వ భావన. దీనికి విరుద్ధంగా జరిగే సభలకి ఆత్మగౌరవం గల వారెవరైనా వెళ్ళగలరా? (క్లిక్ చేయండి: ఎలా ఉంటే స్వతంత్రత?) - బి.ఆర్. బాపూజీ రిటైర్డ్ ప్రొఫెసర్ -
Ram Prasad Bismil, Ashfaqulla Khan: అమర మిత్రులు!
దేశ స్వాతంత్య్రం కోసం అనేక మంది యువ కిశోరాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. వారిలో రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్ ముఖ్యులు. వయసుకు మించిన పరిణతితో దేశం కోసం ఉరితాడును ముద్దాడి నూరేళ్ల ఖ్యాతిని ఆర్జించారు. బిస్మిల్ 1897 జూన్ 11వ తేదీన, అష్ఫాఖ్ 1900 అక్టోబర్ 22న ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జన్మించారు. రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖ్ల కుటుంబ నేపథ్యాలు ఉత్తర దక్షిణ ధ్రువాల్లాంటివి. బిస్మిల్ సనాతన హిందువు, ఆర్యసమాజ సభ్యుడు. అష్ఫాఖ్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ముస్లిం. భిన్న సామాజిక జీవన నేపథ్యాల నుండి వచ్చినా వీరు గొప్ప స్నేహితులయ్యారు. బిస్మిల్ మొదట్లో అష్ఫాఖ్ను ఒక పట్టాన నమ్మలేదు, కాని అచంచలమైన అష్ఫాఖ్ దేశ భక్తికి, అంకిత భావానికి బిస్మిల్ చలించి పోయాడు. ఇద్దరూ యుక్త వయసులోనే పదునైన కవిత్వం రాశారు. సామ్రాజ్యవాద భావ జాలాన్ని తుత్తునియలు చేశారు. మాతృదేశ స్వాతంత్య్ర ఉద్యమ అవసరాల కోసం ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా 1925 ఆగస్టు 9వ తేదీన అష్ఫాఖుల్లా ఖాన్, రాం ప్రసాద్ బిస్మిల్, చంద్ర శేఖర్ ఆజాద్ లాంటి మరికొందరు విప్లవకారులు కలిసి ‘కకోరీ’ గ్రామం వద్ద ప్రభుత్వ ఖజానాతో పోతున్న రైలును దోపిడీ చేశారు. పట్టుమని పదిమంది కూడా లేని యువకులు ఏకంగా బ్రిటిష్ ఖజానాకే గురి పెట్టి, రైలునే దోచేయడం ఆంగ్లాధికారులకు తల తీసేసినంత పనైతే, ఉద్యమకారులకు కొత్త ఉత్సాహాన్ని అందించి నట్లయింది. సెప్టెంబర్ 26న రాంప్రసాద్ బిస్మిల్ను అరెస్టుచేశారు. అష్ఫాఖ్ తప్పించుకున్నాడు. కొన్నాళ్ళ పాటు బనారస్లో అజ్ఞాత జీవితం గడిపి ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీలో మిత్రుడు చేసిన నమ్మక ద్రోహంతో పోలీసులకు పట్టుబడ్డాడు. చివరికి 1927 డిసెంబర్ 19వ తేదీన అష్ఫాఖ్, రాంప్రసాద్ బిస్మిల్లను ఉరితీయాలని తీర్పు వెలువడింది. ప్రాణత్యాగానికి ఏనాడో సిద్ధపడ్డ ఈ ఇద్దరు ప్రాణ మిత్రులు మాతృదేశ విముక్తి కోసం ఉరి కంబాన్ని ఎక్కబోతున్నందుకు గర్వపడుతున్నామని ప్రకటించారు. ఇద్దరినీ వేర్వేరు జైళ్ళలో ఒకేరోజు ఉరి తీశారు. భూప్రపంచం ఉన్నంత వరకు దేశం పట్ల బాధ్యతను గుర్తుచేస్తూ అష్ఫాఖ్, బిస్మిల్ల త్యాగం, స్నేహం సజీవంగా ఉంటాయి. హిందూ – ముస్లిం ఐక్యతను చాటుతూ... మతోన్మాదులకు సవాల్ విసురుతూనే ఉంటుంది! (క్లిక్ చేయండి: వారధి కట్టాల్సిన సమయమిది!) – ఎం.డి. ఉస్మాన్ ఖాన్ (డిసెంబర్ 19 రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్లను ఉరితీసిన రోజు) -
జీ20 అభివృద్ధికి మన స్టార్టప్ మార్గదర్శనం
ఆవిష్కరణ–ఆధారిత ఆర్థిక పునరుద్ధరణ, పునర్నిర్మాణం, వృద్ధికి స్టార్టప్లు ఇంజిన్గా మారాయి. ప్రతి దేశంలో పెరుగుతున్న అవసరాలు, భవిష్యత్తు విలువ ఆధారిత పంపిణీ నిర్మాణంలో స్టార్టప్లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 90 ట్రిలియన్ల డాలర్లుగా ఉంది. దీనిలో స్టార్టప్ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 3 ట్రిలియన్ల డాలర్ల వరకు ఉంది. స్టార్టప్ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వేగంగా మారుతున్న పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడానికి వినూత్న ఆవిష్కరణలు సహక రిస్తాయి. పరిస్థితులకు తగిన ఆవిష్కరణలను అందిం చగల సామర్థ్యం కేవలం స్టార్టప్లకు మాత్రమే ఉంది. కోవిడ్ మహమ్మారి సమయంలో స్టార్టప్ల ప్రాధాన్యం, సామర్థ్యం స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి. స్టార్టప్ల పాత్ర ప్రాణాలను రక్షించడంలో మాత్రమే కాకుండా తిరిగి ఆర్థిక చైతన్యం సాధించడానికి ఉపయోగపడింది. సుస్థిర ఆర్థిక లక్ష్యాల సాధనలో ఆర్థిక వ్యవస్థలకు స్టార్టప్లు సహాయం చేస్తున్నాయి. దేశాలతో సంబంధం లేకుండా సహకారం, ఆవిష్కరణల రంగంలో స్టార్టప్లు పనిచేస్తున్నాయి. దేశాల మధ్య సహకారం, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్టార్టప్లు వేదికలనూ, సాధనాలనూ అందిస్తున్నాయి. ఉద్యోగాల కల్పన, సాంకేతిక పురోగతి, దీర్ఘకాలిక వృద్ధి, సంక్షోభ నిర్వహణ పరంగా స్టార్టప్లు ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషించనున్నాయి. స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటుకు ‘జీ20’కి అధ్యక్షత వహిస్తున్న భారతదేశం చొరవ తీసుకుంది. స్టార్టప్లకు సహకారం అందించడం, స్టార్టప్లు, కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, ఇన్నోవేషన్ ఏజెన్సీలు, ఇతర కీలక పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య సహకారం పెంపొందించడానికి స్టార్టప్–20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ కృషి చేస్తుంది. భారతదేశ స్టార్టప్ రంగంలో నేడు 107 యునికార్న్లు, 83,000 కంటే ఎక్కువ గుర్తింపు పొందిన స్టార్టప్లు పనిచేస్తున్నాయి. వీటి అభివృద్ధికి అవసరమైన ఆవిష్కరణ రంగం సమర్థంగా పనిచేస్తోంది. భారతదేశ స్టార్టప్ రంగం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ రంగంగా గుర్తింపు పొందింది. కొత్తగా ప్రారంభించిన స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ద్వారా జీ20 దేశాలలో వ్యూహాత్మక సహకారం ద్వారా వినూత్న స్టార్టప్లకు సహకారం అందించి ప్రపంచంలో సమగ్ర స్టార్టప్ వ్యవస్థ అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది. జీ20లో సభ్యత్వం ఉన్న ప్రతి దేశం అభివృద్ధికి అవసరమైన సౌకర్యాల కల్పనకు స్వయంగా చర్యలు అమలు చేస్తోంది. స్టార్టప్–20 ఎంగే జ్మెంట్ గ్రూప్ అన్ని సభ్య దేశాలతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం ఉన్న రంగాల్లో సభ్య దేశాల మధ్య సహకారం, సమ న్వయం సాధించి ఆర్థిక సహకారానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ప్రారంభ సంవత్స రంలో అమలు చేయాల్సిన మూడు ప్రాధాన్యతా అంశాలను ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది: 1. పునాదులు, కూటముల ఏర్పాటు : జీ20 ఆర్థిక వ్యవస్థల అంతటా స్టార్టప్లకు బహుళ నిర్వచనాలు ఉన్నాయి. మొదటి ప్రాధాన్యతా అంశంగా ఏకాభి ప్రాయం ద్వారా స్టార్టప్ అంటే ఏమిటి అనే అంశానికి స్పష్టత నివ్వాలనీ, దీనికి సంబంధించిన పదజాలం రూపొందించాలనీ ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది. స్టార్టప్ల కోసం హ్యాండ్ బుక్ను సిద్ధం చేయడానికి ఏకాభిప్రాయ ఆధారిత నిర్వచనాలు, పదజాలం అంచనా వేయబడతాయి. అంతేకాకుండా, జీ20 ఆర్థిక వ్యవస్థల్లో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య ప్రపంచ సహకారం పెంపొందించడానికి వ్యవస్థను రూపొందించడం, దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం తన మొదటి లక్ష్యంగా స్టార్టప్– 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ పెట్టుకుంది. 2. ఆర్థిక అంశాలు: ఆర్థిక అంశాలను రెండవ ప్రాధాన్యతా రంగంగా స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది. స్టార్టప్లకు సులువుగా నిధులు అందేలా చేయడం, సహకారం అందించడం, నూతన అవకా శాలు గుర్తించడం లాంటి అంశాలకు రెండవ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. 3. సమగ్ర, సుస్థిర అభివృద్ధి: కీలకమైన ఎస్డీజీ (సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు) వ్యత్యాసాలను తగ్గించి వేగంగా అభివృద్ధి సాధించడానికి అవసరమయ్యే పరిస్థితులు కల్పించే అంశాన్ని స్టార్టప్–20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ మూడవ ప్రాధాన్యతా రంగంగా గుర్తిం చింది. దీనిలో భాగంగా ఒకే విధమైన ప్రయోజనాల కోసం వివిధ దేశాల్లో పనిచేస్తున్న సంస్థల మధ్య సమన్వయం (మహిళా పారిశ్రామికవేత్తలు లాంటివి) సాధించే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. జీ20 దేశాల్లో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న తన లక్ష్యాన్ని సాధించడానికి స్టార్టప్–20 కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. స్టార్టప్ 20 దీనిలో భాగంగా 6 కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రారంభ కార్యక్రమం 2023 జనవరి 28న (హైదరాబాద్) జరుగుతుంది. శిఖరాగ్ర సదస్సు 2023 జూలై 3న (గురుగ్రామ్లో) జరుగుతుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా కార్యక్రమాలు జరుగుతాయి. అదనంగా, భారతదేశ స్టార్టప్ రంగం సాధించిన అభివృద్ధిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొని రావడానికి భారీ స్టార్టప్ షోకేస్ నిర్వహించాలన్న ఆలోచన కూడా ఉంది. జీ20 సభ్య దేశాలు ఆమోదించి అంగీకరించే విధాన ప్రకటనను స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ సిద్ధం చేసి అందజేస్తుంది. చర్చల ద్వారా మార్గ దర్శకాలు, ఉత్తమ విధానాలు, వ్యవస్థలు, ముఖ్యమైన తీర్మానాల లాంటి అంశాలకు సంబంధించి స్టార్టప్–20 ప్రచురణలు తీసుకు వస్తుంది. స్టార్టప్ రంగ అభివృద్ధికి దోహదపడే విధంగా ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన భారతదేశ పరిశీ లనలో ఉంది. అభివృద్ధి, సమన్వయ కార్యక్రమాలకు ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ వేదికగా పనిచేస్తుంది. జీ20 అధ్యక్ష హోదాలో భారతదేశం ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే స్ఫూర్తిని ప్రపంచానికి అందించాలని భావిస్తోంది. అదే స్ఫూర్తితో, స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ స్టార్టప్లకు సహకారం అందించి అన్ని దేశాల మధ్య సమన్వయం సాధించడానికి కృషి చేస్తుంది. విభిన్న భాగస్వామ్యం ద్వారా అందరి భవిష్యత్తులో స్టార్టప్ను ఒక భాగంగా చేయడానికి ప్రపంచ దృక్పథంతో పనిచేయాలని స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఆకాంక్షిస్తోంది. (క్లిక్ చేయండి: గుజరాత్, హిమాచల్ ఫలితాలు; వాస్తవాలు గ్రహించాల్సింది ఎవరు?) - డాక్టర్ చింతన్ వైష్ణవ్ మిషన్ డైరెక్టర్, అటల్ ఇన్నోవేషన్ మిషన్; స్టార్టప్–20 అధ్యక్షుడు -
Education Report 2021: అధ్యాపకుల కొరతే కారణం
పాఠశాల విద్యారంగంలో మౌలిక వసతులతో పాటు మానవ వనరుల కొరత తీవ్రంగా ఉందని యునెస్కో ఆధ్వర్యంలో వెలువడిన ‘విద్యా నివేదిక–2021’ చాటుతోంది. ఆ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 15.51 లక్షల పాఠశాలలు ఉండగా, వాటిలో 21.83 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. 91.30 లక్షల మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. అందులో 7 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే కావడం గమనార్హం. ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య ఏటా తగ్గుతూ ఉంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉంది. ఈ పాఠశాలల్లో గణితం, సైన్స్, సోషల్, భాషా సబ్జెక్టులను బోధించేందుకు తప్పనిసరిగా అధ్యాపకులు ఉండాల్సి ఉంది. కానీ ప్రత్యేకించి సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. నీతి ఆయోగ్ 2019లో విడుదల చేసిన పాఠశాల విద్యా నాణ్యతా సూచీ ప్రకారం దేశంలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో కేవలం 30 శాతానికే గణితంలో ప్రావీణ్యం ఉందని తేలడం వంటి ఉదంతాలే ఇందుకు నిదర్శనం. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటం విద్యా వ్యవస్థపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. 2,021 లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్లో 21,077, ఉత్తర ప్రదేశ్లో 17,683 బడులు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా పని చేస్తున్నాయి. దేశంలో ఇప్పుడు సుమారుగా 11.16 లక్షల మంది ఉపాధ్యాయుల అవసరం ఉంటుందని యునెస్కో స్పష్టం చేసింది. టీచర్ల నియామకం జరుపకుండా ఏళ్ల తరబడి ఒప్పంద ఉపాధ్యాయులు, విద్యావలంటీర్లతో సరిపెడుతుండటంతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. ఈ క్రమంలో సర్కారీ విద్యావ్యవస్థను బలహీనపరుస్తూ, పరోక్షంగా ప్రైవేటు పాఠశాలల విశృంఖల విద్యా వ్యాపారానికి ప్రభుత్వాలే కారణమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరగడం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని అనేక ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయి. ఆయా పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మరోమార్గం లేకే ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు. హరియాణాలో 2020వ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 20 లక్షల విద్యార్థులు ఉండగా ఈ ఏడాది వారి సంఖ్య 25 లక్షలకు పెరిగింది. ఈ ఏడాది తెలంగాణలో సుమారు రెండు లక్షలకుపైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోకి అదనంగా వచ్చి చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరుతున్న తరుణంలో టీచర్లు తగ్గి పోతుండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రంలో ఇప్పటికీ 18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ఎంతైనా అవసరం. (క్లిక్ చేయండి: దేశభక్తి అంటే తిరంగా సెల్ఫీ కాదు!) – మోటె చిరంజీవి, వరంగల్ -
గుజరాత్, హిమాచల్ ఫలితాలు; వాస్తవాలు గ్రహించాల్సింది ఎవరు?
డిసెంబర్ 8న వెలువడిన గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వివిధ కోణాల నుంచి చారిత్రకంగా విశేష ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఆ రాష్ట్ర చరిత్రలో ఒకే రాజకీయ పార్టీకి 156 శాసనసభ స్థానాలు లభించడం మొదలు, వరసగా ఏడవసారి అధి కారంలోకి రావడం వరకు ఐదారు కీలక అంశాలు ఉన్నాయి. ఈ ఫలితాలతో పాటే వెలువడిన హిమాచల్ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర సంప్రదాయాన్ని పునరావృతం చేశాయి. అక్కడ ఒక పార్టీకి రెండుసార్లు వరసగా అధికారం ఇచ్చే పద్ధతి లేదు. 25 స్థానాలకు పరిమితమైన బీజేపీ, 40 స్థానాలు సాధించిన కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తున్నది. ఓడిన పార్టీల నేతల నోటి నుంచి వచ్చే మొదటిమాట గెలుపోటములు రాజకీయాలలో సహజం. యాపిల్ సాగు శాసించే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపీకీ, కాంగ్రెస్కీ ఓట్లలో తేడా ఒక శాతం కంటే తక్కువ. దీనితో బీజేపీ ఓడినా గెలిచినట్టే. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఘనతలు బీజేపీ అండతో పోరాడిన ప్రధాని నరేంద్ర మోదీవే. ఈ ఫలితాలు చూసిన తరువాత తప్పక వేసుకోవలసిన ప్రశ్న ఈ ఎన్నికల నుంచి వాస్తవాలు గ్రహించవలసిన వారు నిజంగా ఎవరు? బీజేపీ వ్యతిరేకత తప్ప మరొక ఎజెండా జోలికిపోని రాజకీయ పార్టీలా? ప్రజా తీర్పు ప్రజాతీర్పే, బీజేపీ పట్ల మా గుడ్డి వ్యతిరేకత మాదే అన్న ధోరణిలో ఉండిపోతున్న మేధావులూ, ఉదారవాదులా? మేం ప్రజాతీర్పును గౌరవిస్తున్నామంటూ రాజకీయ పార్టీలు చూపిస్తున్న కనీస మర్యాదను మేధావులుగా, ఉదారవాదులుగా చలామణీ అవుతున్నవారు చూపిస్తున్నారా అంటే సమాధానం దొరకదు. వీరందరి అభిమతం ప్రజాస్వామ్య పరిరక్షణే కావచ్చు. దానిని శంకించనక్కర లేదు. కానీ ప్రజాతీర్పును గౌరవించడం దగ్గర బీజేపీ యేతర శిబిరం ప్రదర్శిస్తున్న ఆత్మహత్యాసదృశమైన వైఖరి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేదు. వీరు ఒక రాజకీయ పార్టీ మీద, ఒక దేశ సార్వభౌమాధికారం మీద విమర్శల విషయంలో ఉండవలసిన లక్ష్మణరేఖను విస్మరిస్తున్నారు. ముస్లింల మీద జరిగిన కొన్ని దాడులను చూపిస్తూ హిందూ మెజారిటేరియన్ వాదాన్ని అంతర్జాతీయంగా రుద్దాలన్న ప్రయత్నం పట్ల సాధారణ భారతీ యులు ఆగ్రహంతో ఉన్నారని 2019 లోక్సభ ఎన్నికలు, తాజా గుజరాత్ ఎన్నికలలో రికార్డు స్థాయి ఫలితాలు చెప్పాయి. ఈ మేధావులు కష్టపడి నిర్మిస్తున్న హిందూ మెజారిటేరియన్ సిద్ధాంతం ముస్లింలకు రక్షణ కల్పించేది కాదు. నిజానికి మైనారిటీలకు అనాలి. కానీ వీరు మైనారిటీ అంటే కేవలం ముస్లింలు అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఇదే హిందూ ఫోబియాకు జన్మనిచ్చింది. అది బీజేపీకి ఉపయోగపడుతోంది. సాధారణ హిందువు, సాధారణ ముస్లిం కోరుకునేది శాంతినే! పీఎఫ్ఐ లాంటి పచ్చి హిందూ, భారత వ్యతిరేక సంస్థల ప్రభావంలో పడినవారు తప్ప సాధారణ ముస్లింలు మత కల్లోలాలను కోరుకోరు. బీజేపీ పాలనలో నిస్సందేహంగా మత కల్లోలాలు లేవు. ఢిల్లీ మత కల్లోలాలు, దసరా సందర్భంగా జరిగిన తాజా అలజడులు పీఎఫ్ఐ వంటి సంస్థల కారణంగానే జరిగాయి. అది ఇంటెలిజెన్స్ సమాచారం కూడా. ఆ వర్గం నుంచి ఒక్క అభ్యర్థిని కూడా నిలపకున్నా, గుజరాత్ తాజా ఫలితాల ప్రకారం ముస్లింలు అత్యధికంగా ఉన్న 19 నియోజక వర్గాలలో 17 బీజేపీకి దక్కాయి. బీజేపీ పట్ల తమకు గుడ్డి వ్యతికత అయితే లేదని వారే ప్రకటించినట్టయింది. గుజరాత్ శాసనసభలో ముస్లింల సంఖ్య తగ్గడం ఇవాళ్టి పరిణామం మాత్రం కాదు. 1980 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో 12 మంది ముస్లింలు చట్టసభకు వెళ్లారు. అప్పుడే కాంగ్రెస్ ΄పార్టీ ‘ఖామ్’ పేరుతో ఒక ఓటుబ్యాంక్ సమీకరణను తెర మీదకు తెచ్చింది. అదే క్షత్రియ, హరిజన్, ముస్లిం, ఆదివాసీ, ముస్లిం సమీకరణ. గడచిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు మహమ్మద్ జావెద్ ఫిర్జాదా, ఘియాజుద్దీన్ షేక్, ఇమ్రాన్ ఖెడావాలా గెలిచారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఆరుగురు ముస్లింలను అభ్యర్థులుగా నిలిపింది. వీరిలో ఖెడావాలా మాత్రమే బీజేపీ, ఎఐఎంఐఎం సవాళ్లను ఎదుర్కొని సభలో ప్రవేశించ బోతున్నారు. గుజరాత్తో సంబంధం లేకున్నా, ఈ ఎన్నికలతో పాటే జరిగిన రాంపూర్ (ఉత్తరప్రదేశ్) నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం గురించి చెప్పడం అసందర్భం కాబోదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ఈ నియోజకవర్గంలో ఏడు దశాబ్దాలుగా ముస్లిం అభ్యర్థులే గెలుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆజంఖాన్ మీద క్రిమినల్ కేసులు, అరెస్టు తదితర కారణాలతో పదవి రద్దయింది. దీనితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ తరఫున అసీమ్ రజా బరిలో ఉండగా, బీజేపీ అభ్యర్థిగా ఆకాశ్ సక్సేనా నిలిచారు. సక్సేనా 33,000 భారీ ఆధిక్యంతో సమాజ్వాదీ అభ్యర్థిని ఓడించారు. గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటన, దానితో 135 దుర్మరణం పాలైన సంగతిని ఒక వర్గం మీడియా మృతుల మీద సానుభూతిగా కంటే, బీజేపీకి వ్యతిరేకాస్త్రంగానే భావించినట్టు కనిపిస్తుంది. ఆ ఘటన బీజేపీ గెలుపు మీద ప్రభావం చూపుతుందని ప్రచారం చేసింది. ఆ జిల్లాలో (మోర్బీ) మూడు అసెంబ్లీ నియోజక వర్గాలు మోర్బీ, టంకారా, వాంకనెర్ ఉన్నాయి. వీటిని 2017 ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాలను గెలుచుకుంది. బీజేపీ విజయాన్ని... కాంగ్రెస్ ఓట్లు చీల్చడం, హిందూత్వ వంటి అసహజ విశ్లేషణలతో తక్కువ చేయడానికి ప్రయత్నించడం కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కానేకాదు. మరి హిమాచల్లో జరిగిన దానిని ఏమనాలి? బీజేపీ ఓటును ‘ఆప్’ చీల్చినందునే కాంగ్రెస్ గెలిచిందంటే ఒప్పుకుంటారా? బీజేపీని ప్రస్తుతం ప్రజలు ఆదరిస్తున్నారు. దీనిని అంగీకరించడమంటే... బీజేపీని బలోపేతం చేయడం కాదు, ప్రజా తీర్పును గౌరవించడం! ఆ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడమనేది రాజ్యాంగ హక్కు. ఈ రెండింటినీ గుర్తించాలి. ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి రస్మృతి, పౌరసత్వ సవరణ చట్టం వీటన్నిటికీ రాజ్యాంగ ఆమోదం ఉంది. కానీ వీటన్నిటి లోనూ మైనారిటీ వ్యతిరేకతనే మేధావులు వెతకడానికి ప్రయత్నించారు. దేశ ప్రయోజనాల కోసం ఏ అడుగు వేసినా, ఏది చేసినా బీజేపీని బోనులో నిలబెట్టే ప్రయత్నం మానడం లేదు. మెజారిటీ ప్రజల మౌనాన్ని వీరు అలుసుగా తీసుకుంటున్న మాట కూడా వాస్తవం. ఆ మౌనం వెనుక ఏమున్నదో ఇప్పటికే ఎన్నో పర్యాయాలు రుజువైంది. బీజేపీని ఓడించడానికి అవాస్తవాలను జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ప్రచారం చేయడం సాధారణ ప్రజలకీ, యువతరానికీ కూడా మింగుడు పడడం లేదు. పీఎఫ్ఐ, కొందరు మౌల్వీలు చేస్తున్న హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక వ్యాఖ్యలను ఖండించడం దగ్గర మేధావులు, ఉదారవాదులు ప్రదర్శిస్తున్న ఊదాసీన వైఖరి, సెలెక్టివ్ పంథా కూడా మైనారిటీలకూ, మెజారిటీలకూ మధ్య అగాధాన్ని తగ్గించడానికి బదులు పెంచుతోందన్న స్పృహ వారికి లేదు. ఇప్పుడు అయోధ్య అంశం లేదు. జ్ఞానవాపి, మధుర ఎన్నికల అంశాలుగా లేవు. అయినా బీజేపీ రికార్డు విజయం సాధించింది. కారణం సంక్షేమ పంథా. షాహీన్ బాగ్కీ, బీజేపీ వ్యతిరేక రైతు ఉద్యమానికీ ఇచ్చిన గౌరవం ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టినప్పుడు మేధావులు ఎందుకు ఇవ్వలేకపోయారన్న ప్రశ్న సగటు భారతీయుడిని ఎప్పటికీ తొలుస్తూనే ఉంటుంది. పరిణామాలను పక్షపాతం ఆధారంగా విశ్లేషించడం కాదు, ప్రజాతీర్పులు, ప్రజల అభిప్రాయాల కోణం నుంచి చూడాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ! రాజకీయ పార్టీ మీద ఆగ్రహం వ్యవస్థల మీద, ఆ వ్యవస్థలకు సంబంధించిన విలువల మీద ఆగ్రహంగా మారకూడదు. (క్లిక్ చేయండి: విమర్శను ఆహ్వానించే స్ఫూర్తి లేదా?) - డాక్టర్ గోపరాజు నారాయణరావు సీనియర్ జర్నలిస్ట్ -
India's G20 Presidency: భారత్కు అందివచ్చిన గొప్ప అవకాశం
ఈ డిసెంబర్ 1 నుంచి జీ20 దేశాల కూటమికి నాయకత్వం వహించే బాధ్యత భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ భుజ స్కంధాలపై పడింది. ప్రపంచం లోని 20 అగ్రదేశాల కూటమికి భారత్ నేతృత్వం వహించే అవకాశం లభించడం గౌరవమే కాదు.. ఓ గొప్ప అవకాశం కూడా! 1999లో జీ20 దేశాల కూటమి ఏర్పాటయింది. బలమైన ఆర్థిక వ్యవస్థల్ని అనుసంధానించి పరస్పర సహకారం, ప్రోత్సాహంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నది కూటమి ప్రధాన లక్ష్యం. జీ20 కూటమిలో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ భాగ స్వామిగా ఉంది. కూటమి ఏర్పడింది 1999లో అయినా తొలి శిఖరాగ్ర సదస్సు జరిగింది మాత్రం 2008లో వాషింగ్టన్ డీసీలో. ఆ సమయంలోనే చోటుచేసుకొన్న ‘ఆసియా ఆర్థిక సంక్షోభం’ నుంచి బయటపడడానికి జీ20 దేశాల కూటమి కృషి చేసింది. అప్పటి నుంచి అంత ర్జాతీయ స్థాయిలో శక్తిమంతమైన సంస్థలలో ఒకటిగా జీ20 అవతరించింది. 2016లో చైనాలో జరిగిన జీ20 కూటమి శిఖరాగ్ర సభలలో ‘సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ’ కోసం కృషి చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత జీ20 కూటమిలో సభ్యత్వం లేని దేశాలతో కూడా వర్తక, వాణిజ్య సంబంధాలు ముమ్మరం అయ్యాయి. గత ఏడెనిమిది సంవత్సరాలలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించ డంలో జీ20 కూటమి దేశాలతో భారత్ నెరపిన దౌత్య, వర్తక, వాణిజ్య సంబంధాలు కీలకంగా దోహదం చేశాయి. ఇటీవల, ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేయడంలో అగ్రరాజ్యాలు విఫలం అయ్యాయి. రష్యాపై పలు ఆంక్షలు విధించినా భారత్ తన చమురు అవసరాల కోసం ఇప్పటికీ రష్యాపైనే ఆధారపడుతూ పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిణా మాల దృష్ట్యా జీ20 కూటమికి భారత్ నేతృత్వం వహిం చడంవల్ల ఒరిగేదేమిటన్న ప్రశ్నలు అనివార్యంగా ఎదురవుతున్నాయి. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన 2022 జీ20 శిఖరాగ్ర సదస్సులో, ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా వైదొలగాలన్న పిలుపును కొన్ని దేశాలు గట్టిగానే విన్పించాయి. అంతకుముందే రష్యా అధినేత పుతిన్కు ‘నేటి యుగం యుద్ధాలది కాదు’ అంటూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఎటువంటి శషబిషలు లేకుండా కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పడంతో భారత్ తన వాణిజ్య అవసరాల కోసం మాత్రమే రష్యాతో సంబంధాలు నెరపుతున్నదే తప్ప, ఆ దేశం ప్రదర్శిస్తున్న యుద్ధోన్మాదాన్ని ఏమాత్రం ఉపేక్షించడం లేదన్న సంకేతం బలంగానే వెళ్లింది. అంతేకాదు... అంతర్జాతీయ సదస్సులలో చేసిన తీర్మానాలకు కట్టుబడటంలో భారత్ చిత్తశుద్ధితో వ్యవ హరిస్తోందన్న వాస్తవం కూడా తేటతెల్లం అయింది. ఉదాహరణకు క్యోటో ప్రోటోకాల్, పారిస్ కాప్ 21, అంతకుముందు రియో, కోపెన్ హెగన్ సదస్సులలో చేసిన తీర్మానాలకు అనుగుణమైన చర్యలు తీసుకోవడంతో పర్యావరణ పరిరక్షణ, భూతాప నియంత్రణలలో 63 దేశాల పనితీరుపై వెలువడ్డ నివేదికలో భారత్కు 8వ స్థానం లభించగా... చైనాకు 51, అమెరికాకు 52వ స్థానాలు లభించాయి. భారతదేశం తను అనాదిగా నమ్మే ‘వసుధైక కుటుంబం’ (ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం) అనే భావనను ముందుకు తెచ్చి పరస్పర సహకారం, భాగస్వామ్యం అత్యంత అవశ్యం అని చాటి చెబుతోంది. కలిసికట్టుగా సమస్య లను ఎదుర్కోనట్లయితే... కుటుంబంలో ఎవరో ఒకరికి ఇబ్బంది కలుగుతుందనేది భారత్ చెప్పే మాట. కానీ, చైనా వంటి కొన్ని దేశాలు ‘నేను నా దేశం’ (గ్రూప్ జీరో) ముఖ్యం అనే ధోరణిలోనే సొంత ప్రయోజనాల కోసం ఇతర దేశాల ప్రయోజనాలను దెబ్బతీసే విధం గానూ, అంతిమంగా ప్రపంచ మానవాళికి ముప్పు కలి గించే విధంగానూ ముందుకు సాగుతున్నాయి. జీ20 కూటమికి నేతృత్వం వహించడం వల్ల భారత్కు సమీప భవిష్యత్తులో కొన్ని సానుకూలతలు అందివస్తాయి. అందులో ప్రధానమైనది అంతర్జాతీయ ఉగ్రవాదానికి అందుతున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేయించగలగడం లేదా తగ్గించగలగడం. అలాగే దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా నుంచి అక్రమ చొరబాట్లు, ఆక్రమణలను నివారించడం; హిందూ మహా సముద్రంలో చైనా సైనిక పాటవ వ్యాప్తిని తగ్గించగలగడం, ముడిచమురు చౌకగా లభించే దేశాల నుండి దిగుమతి చేసుకోవడం. డిజిటల్ రంగంలో తను సాధించిన ప్రగతినీ, సాంకేతిక పరిజ్ఞానాన్నీ ఇతర దేశాలకు అందించడం; ఆహార భద్రత, పోషకాహార పంపిణీలకు సంబంధించి పేద దేశాలకు బాసటగా నిలవడం... తదితర రంగాలలో భారత్ కీలకమైన పాత్ర పోషించబోతోంది. కోవిడ్ టీకాతో సహా వివిధ రకాల టీకాలను విస్తృతంగా అభివృద్ధి పరుస్తున్న భారత్ నుంచి సహాయ సహకారాలు ఆశిస్తున్న దేశాల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ రంగంలో తాను సాధించిన ప్రగతిని ఆసియాలోని ఇతర దేశాలతోపాటు ఆఫ్రికా దేశా లతో పంచుకోవడంతో అంతర్జాతీయంగా భారత్ పేరు ప్రతిష్ఠలు గణనీయంగా పెరిగాయి. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ నివారణలో భారత్ పోషించిన పాత్ర, ఆ దేశానికి అందించిన ఆర్థిక సాయం ఐక్యరాజ్యసమితి ప్రశంసలకు నోచుకొంది. సాధిస్తున్న అభివృద్ధికి సమాంతరంగా పాత, కొత్త సవాళ్లు ఉమ్మడిగా భారత్కు ఎదురవుతున్నాయి. ‘ఇది యుద్ధాల శకం’ కాదని నరేంద్ర మోదీ రష్యా–ఉక్రెయిన్ ల యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని వాఖ్యానించినప్పటికీ... యుద్ధం అన్నది అనేక రూపాలలో భారత్ను అస్థిరపరుస్తూనే ఉంది. తూర్పున అరుణాచల్ప్రదేశ్ సరిహద్దులలో చైనా దురాక్రమణ నిరాఘాటంగా జరుగుతూనే ఉంది. కశ్మీర్ బోర్డర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం చేస్తున్న యుద్ధం ఆగలేదు. ఇంకా, కంటికి కనిపించని సైబర్వార్, ఇన్ఫ ర్మేషన్ వార్ వంటివి ఎటూ ఉండనే ఉన్నాయి. వీటికితోడు వాతా వరణ మార్పుల వల్ల ఏర్పడే విపత్తులు, మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్న కొత్తకొత్త వైరస్ల విజృంభణ తదితర సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమైన మార్గదర్శనం చేయా ల్సిన అవసరం భారత్పై ఉంది. నూతన పదబంధాలను సృష్టించడంలో మన ప్రధాని నరేంద్ర మోదీని మించిన వారెవరున్నారు? ఆయన సృష్టిం చిన పదబంధమే ‘ఎకానమీ విజన్’. జీ20 కూటమి దేశాల మధ్య పరస్పర అనుసంధానత, బాధ్యతల భాగస్వామ్య విధానమే ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘ఎకానమీ విజన్ విధానం. ‘నేను నా దేశం’ (గ్రౌండ్ జీరో) అనే విధానానికి పూర్తిగా విరుద్ధమైనదే ఇది. ప్రపంచం అంతా ఒకే భూమి. ప్రపంచ జనాభా అంతా ఒకటే కుటుంబం. ఒకప్పుడు దీనిని ‘యుటోపియన్ థియరీ’గా అభివర్ణించేవారు. ‘అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి’ అనే భారత ప్రాచీన ధర్మం ఇమిడి ఉన్న విధానాలతో నరేంద్ర మోదీ జీ20 దేశాల కూటమికి దిశానిర్దేశం చేయనున్నారు. శిలా జాల ఇంధనాల వాడకాన్ని నిరోధించి హరిత ఇంధనాలను పెద్దఎత్తున వినియోగంలోకి తీసుకురావడం, సూర్య రశ్మి (సోలార్ ఎనర్జీ)ని విరివిగా ఉపయోగించుకోవడం; పవన విద్యుత్ వినియోగం పెంచడం వంటి చర్యల ద్వారా పటిష్ట కార్యాచరణకు ప్రధాని సమాయత్తం అవుతున్నారు. నరేంద్ర మోదీ తన నాయకత్వ పటిమను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే ఓ మహత్తర అవకాశం నేడు లభించింది. గతంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయిలకు ఏవిధంగానైతే వారి విశిష్ట నాయ కత్వానికి వివిధ సందర్భాలలో అంతర్జాతీయ ఖ్యాతి లభించిందో... అలాగే నేడు ప్రధాని నరేంద్ర మోదీకి మరింత ఖ్యాతి దక్కడానికి జీ20 దేశాల నాయకత్వం అందివచ్చిన ఓ చక్కటి అవకాశం. దానిని ఆయన ఫల ప్రదం చేసి దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేస్తారని ఆశించవచ్చు. (క్లిక్ చేయండి: సుప్రీం స్వతంత్రతే దేశానికి రక్ష) - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఏపీ -
GN Saibaba Poems: ఒంటరి గానాలాపన
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) 2013 అక్టోబర్ నెలలో మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడనే నెపంతో ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యుడు, కవి, రచయిత ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను అరెస్ట్ చేసింది. ఆయన జైలుశిక్షకు ఎనిమిదేళ్ళు నిండాయి. బాంబే హైకోర్టు ఈ కుట్రకేసును కొట్టివేసినా, సుప్రీంకోర్టు ఆ తీర్పును సస్పెండ్ చేసింది. ఇవ్వాళ ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. సాయిబాబా ఈ కేసు నుండి బయట పడతారు, ఎనిమిదేళ్ళ సాయి జైలు జీవితం పరిసమాప్తి అవుతుందని ప్రజాస్వామిక వాదులు ఆశగా చూస్తున్నారు. ఇవాళ్టి కోనసీమ జిల్లాలోని అమలాపురం పక్కన చిన్న గ్రామంలో జన్మించారు సాయిబాబా. కొబ్బరి చెట్ల ఆకుల ఆవాసంలో, కిరోసిన్ దీపం వెలుగులో చదువుకొని, తన జ్ఞానపరిధిని ఢిల్లీ వరకు విస్తరించుకున్నారు. ఆదివాసులపై జరుగుతున్న దాడినీ, మధ్య భారతంలోని వనరుల దోపి డీనీ, బహుళజాతి సంస్థలు నిర్వహిస్తున్న మైనింగ్ అక్రమ దోపిడీనీ, ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. 2013లో అరెస్టు అయిన నాటికే సాయిబాబా ప్రజల గొంతుగా ఉన్నాడు. వికలాంగుడైనా ఆయన దృఢచిత్తుడు. జైలు జీవితమంటే జ్ఞాపకాల మధ్య జీవించడమే. ఈ ఎనిమిదేళ్ళ నిర్బంధంలో సాయిబాబా కవిగా రూపొందిన క్రమం చాలా చిత్రమైనది. జైలు కవిగా ‘నేను చావును ధిక్కరిస్తున్నాను’, ‘కబీరు కవితలు’, ‘ఫైజ్ అహ్మద్ ఫైజ్ అనువాదం’... అనేవి ఆయన కవిగా వ్యక్తీకరించుకున్న రచనలు. ‘నేను చావును ధిక్కరిస్తున్నాను’ విరసం ప్రచురణగా వచ్చింది. దీని ఆంగ్ల పుస్తకాన్ని స్పీకింగ్ టైగర్ బుక్స్, న్యూఢిల్లీ వారు ప్రచురించారు. సుదీర్ఘ కాలం జైలు జీవితంలోని అనుభవాన్ని సాయి కవిత్వం ద్వారా వ్యక్తీకరించాడు. జైలు, జైలు అధికారులు, సిబ్బంది నాలుగు గోడల మధ్య ఒక స్వాప్నికుని నిర్బంధం. క్లాసులో పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ జైలు వంటి తరగతి గదిలో తన వంటి ఖైదీలతో జీవితాన్ని పంచుకునే విధానం... తన సహచరి, తోబుట్టువులు, తను పాఠాలు చెప్పే పిల్లలు... ఇవన్నీ సాయిబాబా కవితా వస్తువులు. తన రాజకీయ విశ్వాసాల కారణంగా తను ఎంచుకున్న వస్తువు కవితాత్మకంగా మలిచిన తీరు, కవిత్వ పరిభాషలో పరిణతి. విప్లవం, ప్రేమ, దిగాలు పడిన రాత్రులు, నూతన ఉదయాలు, జైలు గది కిటికీపై వాలిన ఒంటరి పిచ్చుక. ఈ కవిత్వం నిర్బంధితుని ఒంటరి గానాలాపన! సాయిబాబా విడుదల కావాలని ఢిల్లీలో విద్యార్థులు ప్రదర్శన చేస్తే ఏబీవీపీ ఆ విద్యార్థులపై దాడిచేసింది. ఆయన చేసిన నేరం మనుషులందరికీ ఒకే విలువ ఉండాలని ఘోషించడం. – అరసవిల్లి కృష్ణ, విరసం అధ్యక్షులు -
అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమా?
దేశంలో గవర్నర్ల వ్యవస్థ రాను రానూ వివాదాస్పదంగా మారుతోంది. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాలు చేస్తూ ఫెడరల్ స్ఫూర్తికే భంగం కలిగిస్తున్నారు గవర్న ర్లు. వారి బాధ్యత రాజ్యాంగ పరిరక్షణతో పాటూ, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలూ, సూచనలూ ఇవ్వడం. శాసనసభలో ఎవరికీ మెజారిటీ రాని సందర్భంలో ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరిని తొలుత ఆహ్వానించాలనే అంశంలో, రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు గవర్నర్ పాత్ర కీలకం. రాష్ట్ర శాసన సభ, మండలిలో ఆమోదించిన బిల్లు లను లాంఛనంగా ఆమోదించడం గవర్నర్ విధి. కొన్ని ప్రత్యేక, అసాధారణ సందర్భాలలో బిల్లులను రాష్ట్రపతికి పంపవచ్చు. లేదంటే గవర్నరే బిల్లులపై తన అభిప్రాయంతో సహా తిరిగి చట్ట సభలకు పంపవచ్చు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నుండి తిరిగి వచ్చిన బిల్లులను, గవర్నర్ అభిప్రాయానికి అనుగుణంగా సవరించినా, లేదా యధావిధిగా మరోసారి ఆమోదించి పంపినా గవర్నర్కు వాటిపై ఆమోద ముద్ర వేయడం తప్ప వేరే మార్గం లేదు. బీజేపీయేతర పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్న తీరు అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమా? అనే చర్చను తెరపైకి తీసుకువచ్చింది. తెలంగాణలో గవర్నర్ వద్ద శాసనమండలి, శాసనసభ ఆమోదించి పంపిన ఏడు బిల్లులు రెండు నెలలకు పైగా.. కేరళ శాసననసభ ఆమోదించిన ఆరు బిల్లులు నెలలు తరబడీ, తమిళనాడు శాసనసభ ఆమోదించిన 20 బిల్లులను అనేక మాసాలుగా ఆయా రాష్ట్రాల గవర్నర్లు పెండింగ్లో పెట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రభుత్వాలు లేని రాష్ట్రాలలో గవర్నర్లను ఉపయోగించు కొని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం కొత్తేమీ కాదు. ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ... గవర్నర్ల నుండి రప్పించిన తప్పుడు నివేదికల ఆధారంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను డిస్మస్ చేసి రాష్ట్రపతి పాలనను విధించి, గవర్నర్ల ఆధ్వర్యంలో కేంద్రం పాలన సాగించడం చూశాం. కేరళలో ఎన్నికైన కమ్యూ నిస్టు ప్రభుత్వమే మొదటిసారిగా ఆర్టికల్ 356 బారిన పడింది. ఇప్పటి వరకు 41 ప్రభుత్వాలు అలా డిస్మిస్ కాబడ్డాయి. 1977లో జనతాపార్టీ అప్పటివరకు ఉన్న గవర్నర్లను డిస్మిస్ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకొంది. కాంగ్రెస్ హయాంలో కూడా ఈ విధంగానే గవర్నర్ల మార్పు కొనసాగింది. 1984లో ముఖ్యమంత్రి పదవి నుండి ఎన్టీ ఆర్ను నాటి గవర్నర్ రాంలాల్ పదవీచ్యుతుణ్ణి చేసిన ఉదంతాన్నీ, కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేసిన ఎస్ఆర్ బొమ్మై చారిత్రాత్మక కేసునూ ఎలా మరవగలం? బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం పరాకాష్ఠకు చేరింది. గతంలో గోవా, మణిపూర్, ఉత్తరాఖంఢ్ వంటి రాష్ట్రా లలో అత్యధిక శాసనసభ్యులు ఎన్నికైన పార్టీని విస్మరించి, బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటుకు గవర్నర్లు సహ కరించారు. అరుణాచల్ ప్రదేశ్లోనైతే 2016లో గవర్నర్ ఆజ్ఞ మేరకు శాసనసభ సమావేశాలను ముందుకు జరిపి, ముఖ్యమంత్రి లేకుండానే ఏకంగా ఒక హోటల్లో అవిశ్వాస పరీక్ష నిర్వహించారు. 2019లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ మెజారిటీ లేనప్పటికీ తెల్లవారు జామున బీజేపీకి చెందిన ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, వారి పార్టీ ఎమ్మెల్యేల రిసార్ట్ రాజకీయాలనూ, ఆ సందర్భంగా గవర్నర్ వ్యవహరించిన తీరునూ ప్రజలంతా గమనించారు. సర్కారియా కమిషన్తో పాటు, అనేక కమిషన్లు గవర్నర్ వ్యవస్థ తీరును తప్పు పట్టాయి. దాని ప్రక్షాళనకు అనేక సిఫార్సులు చేశాయి. కానీ అవన్నీ బుట్ట దాఖలే అయ్యాయి. గవర్నర్ వ్యవస్థను లోతుగా పరిశీలిస్తే... అది ఆరవ వేలు లేదా అపెండిక్స్ లాంటిదని అర్థమవుతోంది. దాన్ని రద్దు చేయడమే ఏకైక మార్గం. ఈ విషయంలో భారత కమ్యూనిస్టు పార్టీ తీర్మానం కూడా చేసింది. గవర్నర్ వ్యవస్థ రద్దయితే... అది నిర్వహించే బాధ్యతలను న్యాయ వ్యవస్థకూ, శాసన సభలోని సెలెక్ట్ కమిటీ లేదా స్టాండింగ్ కమిటీకి అప్పగించవచ్చు. ఉదాహరణకు మెజారిటీ లేని సందర్భంలో సీఎంగా ఎవరిని ఆహ్వానించాలి, ప్రమాణ స్వీకారం, బలాబలాలు లాంటి వివాదాస్పద అంశాలను న్యాయవ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలి. సంక్లిష్ట సమస్యలపై బిల్లులను కూలంకషంగా చర్చించేందుకు సెలెక్ట్ కమిటీకి నివేదించవచ్చు. లేదా స్టాండింగ్ కమిటీలకు అందించవచ్చు. ఆ కమిటీలు సూచించిన ప్రతి పాదనలతో బిల్లులపై చర్చించి చట్టసభలు ఆమోదిస్తే, గవర్నర్ జోక్యం ఇక అవసరం ఉండదు. (క్లిక్ చేయండి: సుప్రీం స్వతంత్రతే దేశానికి రక్ష) - కూనంనేని సాంబశివరావు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి -
వామపక్షాల తీరు మారాలి.. పక్క పార్టీల వైపు ఆశగా చూస్తూ..
భారత్లో కమ్యూనిస్టుల పరిస్థితి దారుణంగా తయారైంది. వారు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అవకాశవాద, స్వార్థ రాజకీయాలు అనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. పదే పదే తప్పులు చేయడం వీరికి అలవాటై పోయింది. బీజేపి మతతత్త్వపార్టీ అంటూ వేలెత్తి చూపే ఈ కమ్యూనిస్టులు కేరళలో పచ్చి ముస్లిం మతతత్త్వ పార్టీ అయిన ముస్లిం లీగ్తో కలిసి తమ స్వార్థ రాజకీయాలు చేస్తుంటారు. గతంలో నిరు పేదల పక్షాన పోరాడుతారనే కాస్తో కూస్తో పేరు ఉండేది. ఇటీవల కాలంలో పోరాటాలు పక్కన పారేసి తమ పబ్బం ఎలా గడుపుకోవాలనే ఆరాటమే వీరిలో ఎక్కువైంది. గతంలో ఖమ్మంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వామపక్ష పార్టీ ముఖ్య నాయకుడు డబ్బులకు అమ్ముడుపోయి పక్క పార్టీకి సహాయపడినట్లు అదే వామపక్ష పార్తీలకే చెందిన మరో కీలక నాయకుడు విమర్శించడం తెలిసిందే. ఇలాంటి వాదంతోనే ప్రస్తుతం తెలంగాణలో తమ పబ్బం గడుపుకోవడానికే టీఆర్ఎస్ పార్టీతో దోస్తీ చేస్తున్నారు. గతంలో ఇవే కమ్యూనిస్టు పార్టీలను అవమానకరంగా దూషించిన కేసీఆర్ పంచన చేరి ఆయన పారేసే ఒకటి, రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయొచ్చని ఆశపడుతున్నారు. బీజేపి మతతత్త్వ పార్టీ అని వేలెత్తి చూపుతున్న ఈ సోకాల్డ్ వామపక్షీయులు టీఆర్ఎస్ దోస్తీ చేస్తున్న పచ్చి మతతత్త్వ పార్టీ అయిన మజ్లిస్ పార్టీతో ఎలా కలుస్తారో ప్రజలకు చెప్పాలి. అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే పొత్తు అని చెప్పి తప్పించు కుంటారేమో. మతతత్త్వం పేరుతో బీజేపీని పదే పదే విమర్శించే వీరు ఎంఐఎం వైఖరిని విమర్శించిన దాఖలాలు లేవు. మొన్నటిదాక టీఆర్ఎస్ను అవినీతి, అక్రమాల పుట్ట అని వేలెత్తి చూపిన వీరు... తాము చేతులు కలుపగానే టీఆర్ఎస్ నీతిమంతంగా మారిపోయిందా? కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరిస్తుందని టీఆర్ఎస్ చేసిన అబద్ధపు ప్రచారాన్ని గుడ్డిగా నమ్మిన వామపక్షాలు, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ పర్య టనను అడ్డుకోవాలని విఫలయత్నం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే నోముల నరసింహయ్యను టీఆర్ఎస్లో కలిపేసుకొని తమను నిర్వీర్యం చేసిన విషయాన్ని కూడా మరిచి పోయారని ఆ పార్టీల కార్యకర్తలే దుయ్యబడుతున్నారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్తో చేతులు కలిపి టీఆర్ఎస్పై దుమ్మెత్తి పోసిన వీరు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతోపాటు మళ్ళీ బీజేపీని తిట్టిపోస్తున్నారు. అంతకు ముందు ఇవే వామపక్షాలు తెలుగు దేశం పార్టీతో అంటకాగిన విషయం తెలిసిందే. దీనిని బట్టి అర్థమమ్యే విషయం ఏంటంటే వీరంతా తమ స్వార్థం కోసం ఎవరితోనైనా, ఎప్పు డైనా కలిసి పోతారనీ, సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఏమి ఉండవనీనూ. ఈ పార్టీల జాతీయ స్థాయి నాయకులు కూడా తక్కువేమీ తిన లేదు. మన రాష్ట్ర నాయకులకు వారే మార్గదర్శకులు. ఈ పార్టీలకు చెందిన అగ్రనాయకుల్లో కొందరు కోట్లకు పడగలెత్తారనీ, కొందరికి ప్రముఖ జాతీయ టీవీ ఛానళ్లలో, పత్రికల్లో వాటాలు కూడా ఉన్నాయనే విమ ర్శలున్నాయి. దేశమంతా రాష్ట్రాల వారీగా ఇతరులతో జట్టు కట్టడానికి వీరంతా చెప్పే ఏకైక కారణం బీజేపీ హిందూ మతతత్త్వాన్ని ఎదుర్కొని సెక్యులరిజాన్ని కాపాడటం. ఇక్కడ ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ అన్న... ‘భారత్లో సెక్యులరిజం అంటే హిందువులను అవమానించడం, మైనార్టీల పేరుతో అన్య మతస్థులను నెత్తికెత్తుకోవడం’ అన్న మాటలు గుర్తు చేసుకోవాలి. ఈ వామపక్ష భావాలవారు ప్రధానంగా సామాజిక కార్యకర్తల ముసుగులో, స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైన తీస్తా సెతల్వాద్ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం గతంలో అక్రమంగా కేసుల్లో ఇరికించేందుకు ఎంతగా ప్రయత్నించారో ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలున్నాయంటే చాలు ఇలాంటి వారు మేధావుల రూపం లోనో, మరో రూపంలోనో బీజేపీకి వ్యతిరేకంగా కల్పిత ఉద్యమాలు సృష్టిస్తుంటారు. వామపక్షాల నాయకులు తమ పార్టీల బలోపేతానికి కృషి చేయకుండా పక్క పార్టీల వైపు ఆశగా ఎదురు చూస్తుండడం వీరి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా వామపక్షాలు మేలుకొని తమ పార్టీల పటిష్టతకు పూనుకోకపోతే గతంలో మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలనేవి ఉండేవి అని చెప్పుకునే దుఃస్థితి వస్తుంది. (క్లిక్ చేయండి: అదో.. ఆరో వేలు లాంటి వ్యవస్థ.. రద్దు చేయడమే మేలు!) - శ్యామ్ సుందర్ వరయోగి సీనియర్ జర్నలిస్ట్ -
మేము ఎన్నారైలు అయ్యాము కదా.. ఇంకా తెప్ప ఎందుకు..!?
గడచిన ముప్ఫై ఏళ్లలో కొత్తగా ఎగువ మధ్యతరగతిగా మారిన వర్గాలను, ఈ రోజు మీరు ఇంత భద్రంగా ఉండడానికి, ఇవీ కారణాలు అని చెప్పి వారిని ఒప్పించడం అంత తేలిక ఏమీ కాదు. కొన్నివేల రూపాయలతో కొన్న స్థలం నుంచి ఇప్పుడు నమ్మశక్యం కానంత ‘రిటర్న్స్’ వచ్చేట్టుగా మీ ఆస్తి విలువ పెరిగింది అంటే– అప్పట్లో దాన్ని కొనడం తప్ప, అదనంగా మీరు చేసింది ఏమీలేదు, అని వాళ్లనిప్పుడు ఒప్పించడం కష్టం. మీ పిల్లల జీతాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి కూడా– ‘మార్కెట్ ఎకానమీ’ కారణం తప్ప, అందులో మన పనితనం ఏమీ లేదు. ఇవన్నీ సంపద పంపిణీ క్రమంలో, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల వల్ల మనకు అందిన ఫలాలు. అయితే, ఇలా కొత్తగా ఎగువ మధ్యతరగతిగా ‘ప్రమోట్’ అయిన వారే చిత్రంగా ఇప్పుడు మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలనూ, వాటిని అమలుచేస్తున్న ప్రభుత్వ ఉదార వైఖరినీ తప్పు పడుతున్నారు. ఇటువంటి ధోరణి మునుపు ఉందా అని వెనక్కి చూస్తే, 1970–80 దశకాల మధ్య కాలంలో అమలైన సంక్షేమం పట్ల ఈ తరహా విమర్శ దాదాపు లేదనే చెప్పాలి. కారణం– స్వాత్యంత్య్రం తర్వాత, కేంద్ర ప్రభుత్వ ‘సంక్షేమ విధానాల’ వల్ల కులాలతో సంబంధం లేకుండా ఆర్థికంగా చితికి ఉన్న అన్ని వర్గాలు ఎంతోకొంత మేలుపొందాయి. కులీన వర్గాలుగా పేర్కొనే ఎగువ మధ్యతరగతి ఇప్పటిలా ప్రభుత్వ ఉదారవాద చర్యల్ని తప్పుపట్టేది కాదు. అప్పట్లో ఎక్కువమంది స్వాగతించిన – రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ వంటి నిర్ణయాలు అటువంటివే. అప్పట్లో భద్రతతో స్థిరపడి ఉన్న కులీన వర్గాలలోని విద్యాధికులు, దేశంలో జరుగుతున్న మార్పు ‘ప్రాసెస్’లో చురుకైన భాగస్వామ్య పాత్ర పోషించారు. వారు ఇక్కడ చదివి, విదేశాల్లో ఉన్నత విద్య తర్వాత ఇండియా తిరిగివచ్చి, దేశం చేస్తున్న ప్రగతి యజ్ఞంలో తమదైన పాత్ర పోషించారు. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు (బయోకెమిస్ట్), డాక్టర్ యలవర్తి నాయుడమ్మ (లెదర్ టెక్నాలజీ) అటువంటివారే. ఇటీవల డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఇంకా రెండేళ్ల పాటు చీఫ్ సైంటిస్ట్గా కొనసాగే అవకాశాన్ని ఈ నవంబర్ 30 నాటికి వదులుకుని, ఇండియాలో బాలల ఆరోగ్య రంగంలో చేయాల్సింది చాలా ఉందని వెనక్కి రావడం ఈ ధోరణికి కొనసాగింపే అవుతుంది. ఇప్పుడైనా ఇది చర్చించాల్సిన అంశం ఎందుకైందంటే– ‘ఏరు దాటి మేము ‘ఎన్నారై’లు అయ్యాము కదా, మా వెనక వచ్చేవారి కోసం ఇంకా తెప్ప ఎందుకు ఉండాలి’ అని పేద కుటుంబాల కోసం అమలవుతున్న ప్రభుత్వ పథకాల పట్ల వారికున్న దుగ్ధను దాచుకోవడం లేదు. లేని వంకలు వెతికి మరీ ప్రభుత్వానికి మసిపూయడానికి వీరు చేస్తున్న ప్రయత్నంలో దాపరికం ఏమీలేదు. అది తెలుస్తున్నది. ఈ క్రమంలో వాదన కోసం, వీరికి ఆక్షేపించడానికి మరేదీ కనిపించక కొందరు– ‘రోడ్లు సంగతి ఏమిటి?’ అంటున్నారు. కానీ మూడేళ్ళకు ముందు రోడ్ల పరిస్థితి ఏమిటి, ఈ మూడేళ్ళలో క్రమం తప్పకుండా కురుస్తున్న వానలు వల్ల గట్లకు నీళ్లు తన్నుతూ నిండుతున్న చెరువులు, వాగుల సంగతి వీరికి పట్టదు. అంతేనా ‘కరోనా’ కాలంలో అత్యవసర వైద్యసేవల కోసం చేసిన వ్యయం గురించి కానీ, దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు పడిన గండి గురించి గానీ – ఎంతో సౌకర్యంగా వీరు తమ వాదనలో దాటవేస్తారు. నిజానికి వీరి సమస్య వేరు. అదేమో పైకి చెప్పుకోలేనిది. ఈ ప్రభుత్వం ప్రతి రంగాన్నీ క్రమబద్ధీకరించడంతో, మునుపటిలా వీరి ఆస్తుల విలువ పెరగడం లేదు. విషయం ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒకప్పుడు బలుపుగా కనిపించిన వాపులన్నీ పొంగు తగ్గి నరాలు బయటపడి, అన్ని రంగాలు మళ్ళీ సాధారణ ఆరోగ్య స్థితికి చేరు తున్నాయి. ఈ మూడేళ్ళలో ఇక్కడ రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీలు, డీజీపీ ఇప్పటికీ ఇక్కడ పనిచేయడానికి సుముఖత చూపడం, ‘బ్యూరోక్రసీ’కి ఇక్కడున్న పని అనుకూల వాతావరణంగా చూడాల్సి ఉంటుంది. కానీ కొందరికి ఇవేమీ జరగకూడదు. జరుగుతున్నవి ఎలాగోలా మధ్యలో ఆగిపోవాలి. అయితే ఎలా? ప్రభుత్వంపై ఫిర్యాదు ఉన్నవర్గాలు ఇప్పుడు పెద్దగా లేవు. ఫిర్యాదు ఉన్న వారి సమస్యేమో – ‘బ్లాక్ అండ్ వైట్’లో చెప్పలేనిది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యక్షుడు క్లావ్ స్వాబ్ 2004 ఫిబ్రవరి 10న హైదరాబాద్లో మాట్లాడుతూ– ‘సమాజంలో ప్రతి ఒక్కరికీ వికాసం పొందే అవకాశం కల్పిస్తే తప్ప, మనకు ఎంతమాత్రం భద్రత ఉండదు’ అనే హెచ్చరిక అయినా వీళ్ళకిప్పుడు అర్థం కావడం ఎంతైనా అవసరం. (క్లిక్ చేయండి: ‘మై హూ నా’ హామీ తీరేదెన్నడు?) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
నియంతృత్వ రాజకీయాలు అభివృద్ధికి గొడ్డలిపెట్టు
రాజకీయాలను ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేయాల్సిన కొన్ని పార్టీలు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుండి ‘ఆగర్భ శతృత్వం’తో పని చేస్తున్నాయి. అందులో ఎక్కువగా కుటుంబ పార్టీలు ఉండడం విశేషం. నిస్వార్థ రాజకీయాలు దేశంలోకి వస్తే తమ పీఠాలు కదిలిపోతాయన్న ఆందోళనతో ‘వ్యక్తిత్వ హననం’ చేస్తూ కుటిల రాజకీయా లకు తెరతీశాయి. ఇప్పుడు ఆ వరుసలోకి కేసీఆర్ సారథ్యం లోని టీఆర్ఎస్ అగ్రస్థానం తీసుకున్నది. గత నెల నుండి తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆందో ళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉండే వర్గాలకు కేసీఆర్ నియంతృత్వ, ధన రాజకీయాలు తెలంగాణ అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారాయి. రాజ్యాంగబద్ధంగా ఎంపిక చేసిన గవర్నర్ను ఒక మహిళ అని కూడా చూడకుండా అడుగడుగునా అవమాన పరుస్తున్న కేసీఆర్ అండ్ కో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో తొక్కింది. రోజూ ప్రజాస్వామ్య పాఠాలు వల్లించే కమ్యూని స్టులకు కొత్తగా కేసీఆర్ స్నేహం దొరికింది. సీఎంను మెప్పించడం కొరకు ‘కోతికి కొబ్బరిచిప్ప’ దొరికినట్లుగా గవర్నర్పై అవాకులు చవాకులు పేలుతున్నారు. అతి చిన్న వయసులో మంత్రిపదవి కూడా లెక్కపెట్టకుండా ‘న్యాయం కోసం’ రాజీనామా చేసిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్... అక్కడి కమ్యూనిస్టుల దురాగతాలు ఒక్కొక్కటి బయటపెడుతూంటే ఆ అక్కసును కమ్యూనిస్టులు ఇక్కడ వెళ్ళగక్కడం విచిత్రం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు చదువుకొనే విశ్వవిద్యాలయ అధ్యాపకుల నియామక బిల్లు లోని లొసుగులతో ప్రభుత్వ పెద్దలు తప్పు చేసేందుకు అవ కాశం ఉంది. దానికి తగిన సవరణలు చేయాలని గవర్నర్ సూచిస్తే తమ వందిమాగధులలో దుష్ప్రచారం చేయిస్తూ కేసీఆర్ వ్యవస్థకు తీరని ద్రోహం చేస్తున్నారు. ఇప్పటికే అణ గారిన వర్గాలకు చెందిన యువత చదువులపై సమ్మెట దెబ్బలా ఎక్కడా లేనివిధంగా తన అస్మదీయులకు, తస్మదీ యులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలను కట్టబెట్టింది. ఎనిమిదేళ్ళలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసింది. కాబట్టి గవర్నర్ పేరు చెప్పి నియామకాలు జరగకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రప్రభుత్వం తలపెట్టిన కామన్ రిక్రూట్ బోర్డు 1953లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. రిజ ర్వేషన్ల విషయంలో విధిగా పాలించాల్సిన రోస్టర్ పాయింట్లు ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క విధంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ బోర్డు ఏ రోస్టర్ విధానాన్ని పాటించి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నది అనేది ప్రశ్న. ఓవైపు పోడు భూములకు సంబంధించిన పట్టాలు గిరిజనులకు ఇస్తాం అంటూనే, మరోవైపు వాళ్ళపై నిఘా పెట్టండని అటవీ అధి కారులను ఉసిగొల్పి ఓ నిజాయితీ గల ఆఫీసర్ హత్యకు కేసీఆర్ ప్రభుత్వం కారణమైంది. ప్రభుత్వ భూములను అమ్ముతూ, అలా వచ్చిన ఆదా యాన్ని తమ సొంత నియోజకవర్గాలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్రావులు తరలించుకు పోతున్నారు. రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, విద్య, వైద్య వ్యవస్థలు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్నట్లు తయారయ్యాయి. గవర్నర్ దగ్గర ఎన్నో బిల్లులు ఆగా యని ఓ వైపు చెబుతున్నారు. ముఖ్యమంత్రి తప్పని సరిగా వెళ్ళాల్సిన చోటు రాజ్భవన్. కానీ ఆయన ప్రతి దానినీ రాజకీయ కోణంలో చూస్తూ గవర్నర్ ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. గ్లోబరీనా టెండర్లను తనవారికి ఇప్పించి ఆ సంస్థ తప్పిదాలతో ఎందరో ఇంటర్ విద్యార్థులు మరణించినా కేసీఆర్ కనికరించలేదు. వాళ్ళ కుటుంబాలకు ఓదార్పు కలి గించలేదు. అలాగే ధరణి పోర్టల్ అనే భూమాయను సృష్టించి రైతులు ఆత్మహత్యలు చేసుకొనేందుకు కారణం అవుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు ఎమ్మా ర్వోలపై పెట్రోల్ దాడులు చేయడం ఈ రాష్ట్రంలోనే చూశాం. చివరికి ఆర్థిక శాఖమంత్రి హరీశ్రావు నిర్వహించే ఆరోగ్య శాఖ వైఫల్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు విక టించి మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ఎవరి పాపమో కేసీఆర్ ప్రజలకు చెప్పాలి. గరీబులను వంచించే సరికొత్త ‘గడీ’గా కేసీఆర్ ప్రగతి భవన్ను నిర్మించుకొని కుట్రలకు, కుహకాలకు కేంద్రంగా దానిని తయారు చేశారు. బూర నర్సయ్యగౌడ్ లాంటి సీనియర్ నాయకుడు భాజపాలోకి రాగానే బెంబేలెత్తిన కేసీఆర్ మునుగోడులో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో సరిక్రొత్త కుట్ర రాజకీయాలకు తెరతీశారు. ప్రగతి భవన్లో కూర్చొని ‘ఫాంహౌస్ బ్లాక్ బస్టర్ సినిమా’కు స్క్రిప్ట్ రచించారు. అనామకులు ఎవరో ఏదో మాట్లాడుకున్న వీడి యోలకు లేని స్క్రిప్ట్ తయారుచేసి జనం మీదకు వదిలారు. నిఖార్సుగా, నిజాయితీగా రాజకీయం చేసే భాజపాపై బురద చల్లేందుకు సరిక్రొత్త ‘కపట నాటకం’ కేసీఆర్కు పనికివచ్చింది. తన ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు తెలం గాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఎదిగిన భాజపాను బూచిగా చూపిస్తూ... సొంతపార్టీ వారిపైనే బ్లాక్ మెయి లింగ్కు పాల్పడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలపై, ముఖ్యంగా భాజపాపై ఎదురుదాడికి దిగాలని ప్రగతి భవన్ మీటింగ్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయడం తెలంగాణలో జరుగుతున్న దాడుల రాజకీయానికి నాందిగా కనిపిస్తుంది. టీఆర్ఎస్ వాళ్లు ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడికి దిగారు. ఇది రాష్ట్ర ప్రజలు కళ్ళారా చూశారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న బాధ్యత గల వ్యక్తులు ఇలాంటి అరాచకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కిందిస్థాయి కార్యకర్తల మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయో ఆలోచించవచ్చు. రాష్ట్రంలో శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న ఓ రాజకీయ పార్టీ అధ్యక్షురాలైన శర్మిళను మహిళ అని కూడా చూడకుండా కారుతో సహా అరెస్ట్ చేసిన పోలీసుల అత్యుత్సాహం చూస్తే కేసీఆర్ హయాంలో ఇక్కడి స్వేచ్ఛకున్న హద్దులు బహిర్గత మవుతున్నాయి. కేసీఆర్ నియంతృత్వ ధోరణిని ఈ సంఘ టన బహిర్గతం చేస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ అబద్ధాలు ప్రచారం చేయడంలో గోబెల్స్ను మించిపోయారు. దుబ్బాక నుండి మునుగోడు ఎన్నికల వరకు కరెంట్ మీటర్లు కేంద్రం పెట్టబోతోందనీ, అలాగే కేంద్రం రాష్ట్రానికి ‘నయా పైసా’ ఇవ్వలేదనీ రోజూ దుష్ప్రచారం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే సీఎంలు వెళ్ళి ఆహ్వానిస్తారు. ఇప్పటికి మూడుసార్లకు పైగా ప్రధాని రాష్ట్రానికి వస్తే సీఎం కేసీఆర్ ఆయనను ఆహ్వా నించకుండా ముఖం చాటేశారు. మునుగోడు ఎన్నికలలో దశాబ్దాలుగా కాంట్రాక్టులు చేస్తున్న రాజగోపాల్ రెడ్డిపై 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అంటూ దుష్ట ప్రచారానికి తెరలేపారు. మరి మిషన్ భగీరథ, కాకతీయ, సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టింది ఎవరు? అందులో కమిషన్ ఎంత ముట్టిందని మాత్రం వీళ్ళను ప్రశ్నించడం ‘సమాఖ్య వ్యవస్థ’పై దాడి అవుతుంది కాబోలు! రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ‘గాడిపసరం’లా కట్టేసి ఇలా ఏ ముఖ్యమంత్రీ వాడలేదు. కానీ రోజూ ‘ఈడీ, సీబీఐ దాడులు’ అని గింజు కుంటారు! ఈ రాష్ట్రంలో ‘జన్మకో శివరాత్రి’లా జరిగే ముఖ్యమంత్రి పర్యటన నాడు ప్రతిపక్షాల నాయకులను, కార్యకర్తలను ‘హౌస్ అరెస్టు’లు చేస్తున్నారు. ఏ సభ, పాదయాత్ర జరుపు కోవాలన్నా హైకోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాల్సిన దుఃస్థితి నెలకొన్న కేసీఆర్ పాలన కేసీఆర్ చేరదీసిన మేధా (తా)వులకు స్వర్గంలా ఉందట. ధర్నా చౌక్ కూడా లేకుండా చేసి, సచివాలయానికి రాని సీఎం కేసీఆర్ను గొప్ప ప్రజా స్వామ్య వాదిగా వీరు కీర్తిస్తున్నారు. అయితే వేయి శవాలను తిన్న రాబందు కూడా ఏదో ఒక రోజు కుప్పకూలక తప్పదు. కాలం ప్రతి దానికీ సమాధానం చెబుతుంది. చరిత్రలో కూలి పోయిన ఎందరో నియంతలు ఇందుకు ఉదాహరణ. (క్లిక్ చేయండి: ఉగ్రవాద లెక్కలు పరమ సత్యాలా?) - డాక్టర్ కె. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు -
Konijeti Rosaiah: మాటల తూటాల అజాత శత్రువు
అరుదైన రాజకీయ నాయకుడు కొణిజేటి రోశయ్య. ఆయన వాగ్ధాటికి అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లేవి. గొప్ప హాస్య చతురతతో పాటూ ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన శైలి. ప్రభుత్వ శాఖలన్నింటిపైనా అపారమైన పట్టు, అవగాహన ఆయనకున్నాయి. వివాదాలకు దూరంగా ఉంటూ, మంచి సలహాదారుగా కూడా వ్యవహరించేవారు. రాజనీతిలో అపర చాణక్యుడు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన చిరునామా. మాటల మాంత్రికుడిగా వినుతికెక్కారు. తన ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేయడమే కాదు, మాటల తూటాలు కూడా పేల్చేవారు. చట్టసభ లోపల, బయట కూడా ఒంటిచేత్తో ప్రతిపక్షాల్ని మాట తూలకుండా ఆటలాడుకునేవారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. రోశయ్య ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్జీ రంగా శిష్యులు. నిడుబ్రోలులోని రామానీడు రైతాంగ విద్యాలయంలో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. ఆయన భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు; 1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు; 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్థిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరు పొందారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు పొందారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా, చాలా కాంగ్రెస్ కేబినెట్లలో కీలక మంత్రిగా పని చేయడం సామాన్య విషయం కాదు. తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహించారు. 1995–97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ప్రతిపక్షంలో ఉంటే నెగటివ్ పాలిటిక్స్ చెయ్యచ్చు. అదే ప్రభుత్వంలో ఉంటే, నిర్మాణాత్మకమైన పాత్రతో పాజిటివ్ పాలిటిక్స్ నడపచ్చు అనేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పధ్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్న తరువాత ఆరోగ్యం సహకరించినప్పుడల్లా సాహితీ, సాంస్కృతిక కార్యాక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై అలరింపజేసేవారు. 2018 ఫిబ్రవరి 11న ఆదివారం నాడు టి. సుబ్బిరామిరెడ్డి లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్యను గజ మాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని రోశయ్య అనేవారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందించిన సహకారంతోనే చట్టసభల్లో తగిన గుర్తింపు లభించిందని విన మ్రంగా చెప్పేవారు. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసు కుంటూ.. తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించానని తాను పాల్గొనే కార్యక్రమాలలో ఆత్మ సంతృప్తితో చెప్పేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘ కాలంపాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోశయ్యదే. కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో బాధపడుతూ 2021 డిసెంబర్ 4న హైదరాబాదులో కన్నుమూశారు. ప్రజాజీవితంలో ఆయన ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఓ రుషి మాదిరి సేవలందించారు. (క్లిక్ చేయండి: వివక్ష ఉందంటే ఉలుకెందుకు?) - తిరుమలగిరి సురేందర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ (డిసెంబర్ 4న కె. రోశయ్య ప్రథమ వర్ధంతి) -
ఛాయ్ అమ్మిన... గుజరాత్ గట్టిన...
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ల బొందల గడ్డ దిక్కు బోయిండు. గాడ రెండంత్రాల బంగ్లల బేతా లుడు ఉంటున్నడు. విక్రమార్కుడు మోటరాపిండు. హారన్ గొట్టిండు. బేతాలుడు ఇంట్లకెల్లి ఇవుతలి కొచ్చిండు. మోటరెక్కి ఎన్క సీట్ల ఆరాంగ గూసుండు. విక్రమార్కుడు మోటర్ నడ్పబట్టిండు. గప్పుడు బేతాలుడు – ‘ఎండలు మండుతున్నా. వానలు దంచిగొడ్తున్నా, సలి ఒక్క తీర్గ వొన్కిస్తున్నా తాతీల్ దీస్కోకుంట దినాం మోటర్ దీస్కోని వొస్తవు. ఎత్తుగడ్డలు, గుంతలని సూడకుంట మోటర్ నడ్పు తవు. ఏ బర్రెన్న నీ మోటర్కు అడ్డం రావొచ్చు. ఎంటిక మందంల టక్కర్ దప్పొచ్చు. నువ్వు ఎంత హారన్ గొట్టినా ఎవడన్న సైడియ్యక పోవచ్చు. నీ మోటర్ ట్రాఫిక్ల ఇర్కపోవచ్చు. నీకు యాస్ట రావొచ్చు. యాస్ట మర్సెతందుకు గిప్పుడు నడుస్తున్న ఒక కత జెప్త ఇను’’ ‘‘చెప్పెతందుకు నువ్వుంటె ఇనెతందుకే నేనున్నా’’ అని విక్రమార్కుడు అన్నడు. ‘‘గుజరాత్ అసెంబ్లి ఎలచ్చన్లు అయితున్నయి. గా రాస్ట్రంల ఇర్వై ఏడేండ్ల సంది బీజేపీ సర్కారే ఉన్నది. ఇంతకుముందు గుజరాత్ల కాంగ్రెస్, బీజేపీ నడ్మనే పోటీ ఉండేది’’ అన్కుంట బేతాలుడు ఇంకేమో జెప్పబోతుంటె – ‘‘గిప్పుడు కొట్లాడ్త లెవ్వా?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘నన్ను చిడాయించెతంద్కు నువ్వు గిసువంటి సవాల్లు అడ్గుతుంటవని నాకెర్క లేదనుకుంటున్నవా? గిప్పుడు సుత కొట్లాడ్తున్నయి. గుజరాత్లనే గాకుంట దేసంలున్న అన్ని రాస్ట్రా లల్ల ఎప్పటి సందో బీజేపీ, కాంగ్రెస్లు ఎలచ్చన్ల కొట్లాడ్తనే ఉన్నయి. గీపారి గుజరాత్ అసెంబ్లి ఎలచ్చన్ల దంగలకు చీపిరి కట్ట బట్కోని ఆప్ దిగింది.’’ ‘‘రొండు పెద్ద పార్టిల నడ్మల చిన్న పార్టి ఆప్ నెగులుకొస్తదా?’’ ‘‘ఎంత చెత్త ఉన్నా ఊకేది చీపిరితోనే. గా రొండు పార్టీలను మా చీపిరితోని ఊకి పారేస్తం. ఢిల్లిల గా రొండు పార్టీల మా చీపిరి తోని ఊకినం. పంజాబ్ల సుత ఊకి పారేసినం. గుజరాత్లో గుడ్క ఊకి పారేస్తం. ఆప్ సర్కార్ దెస్తం అని కేజ్రీవాల్ అన్నడు. అనుడే గాకుంట ఒక కాయితం మీద రాసిచ్చిండు.’’ ‘‘గుజరాత్ల ఆప్కు గెల్సేంత బలమున్నదా?’’ ‘‘బలం లేదు గని మా సర్కార్ గినొస్తె సర్కార్ జీతగాల్ల జీతాలు బెంచుతం. ఫిరీగ కరెంటు ఇస్తం. పాత పింఛను విదానం దెస్తం. రోగాలు గినొస్తె దవకాన్ల ఫిరీగ ఇలాజ్ జేపిస్తం అసువంటి వాగ్దానాలు ఆప్ జేసింది. గంతేగాకుంట చీపిరికట్ట బట్టుకోని కేజ్రీవాల్ గుజరాత్ అంత ఒక్క తీర్గ తిర్గిండు. ఊర్లల్ల కాంగ్రెస్కు బలముంటె పట్నాలల్ల బీజేపీకి బలమున్నది. వైసు పోరగాల్లు, పోరిలు ఆప్ అంటె ఇస్టంతోని ఉన్నరని అంటున్నరు.’’ ‘‘కాంగ్రెస్ సంగతేంది?’’ ‘‘ఒకప్పుడు గుజరాత్ల కాంగ్రెస్ సర్కారే ఉండేది. శాన ఏండ్ల సంది మల్ల గా రాస్ట్రంల గెల్సెతంద్కు కాంగ్రెస్ ఒక్క తీర్గ కోషిస్ జేస్తున్నది. మెల్లమెల్లగ సీట్లు పెంచుకొంటున్నది. గుజరాత్ల మొత్తం 182 సీట్లు ఉన్నయి. 2002ల బీజేపీకి 127 సీట్లు వొచ్చినయి. గని 2007ల 117కు, 2012ల 115కు, 2017ల 99 సీట్లకు పడిపోయినయి. బీజేపీకి సీట్లు తక్వ అయితుంటె కాంగ్రెస్కు సీట్లు పెర్గినయి. ఎలచ్చన్లు రాంగనే ప్రతాని మోది సెంటిమెంట్ రాజేస్తుండు. గిప్పుడు గాయినకు గా మోక ఇయ్యొద్దని కాంగ్రెస్ అనుకున్నది. భారత్ జోడో యాత్రల రాహుల్ గాంది ఉన్నడు. గాయిన గుజరాత్ల ఊకూకె ప్రచారం జేస్తలేదు. ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ సి.ఎం. అశోక్ గెహ్లత్ కాంగ్రెస్ దిక్కు కెల్లి ప్రచారం జేస్తున్నరు. ‘మున్సిపల్ కార్పొరేషన్ ఎలచ్చన్లు వొచ్చినా మోది ప్రచారం జేస్తడు. అసెంబ్లి ఎలచ్చన్లు వొచ్చినా ప్రచారం జేస్తడు. రావనాసురుని లెక్క ప్రతానికి పది తల్కా యలున్నయి. గుజరాత్ల చిన్నప్పుడు ఒక రేల్టేషన్ల ఛాయ్ అమ్మిన అని మోది జెప్పిండు. గని గాయిన ఛాయ్ అమ్మిన అని జెప్తున్న జమాన్ల గాడ రేల్టేషనే లేదు. లేని రేల్టేషన్ల మోది ఛాయ్ ఎట్ల అమ్మిండు’ అని ఖర్గే అడిగిండు.’’ ‘‘బీజేపీ ప్రచారం ఎట్ల జేసింది?’’ ‘‘అమిత్ షా మాట్లాడుకుంట గోద్రా అల్లర్లు గుర్తు జేసిండు. మల్ల బీజేపీ వస్తెనే గుజరాత్ల ఎసు వంటి కొట్లాటలు ఉండయని జెప్పిండు. ఉత్తరప్రదేశ్ ముక్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లు దెస్తనని జెప్పిండు. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఖిలాప్ కొట్లాడిన నర్మదా బచావో లీడర్ మేథాపాట్కర్ రాహుల్ గాందితోని గల్సి భారత్ జోడో యాత్రల నడ్సింది. గుజరాత్ రాస్ట్రం రాకముందు గుజరాతీలు, మహారాష్ట్రుల నడ్మ కాంగ్రెస్ కొట్లాటలు బెట్టింది. మేము గసుంటోల్లం గాదు. జై శ్రీరాం అంటం. కార్పరేట్ సంస్థలకు పెద్ద పీట ఏస్తం. నేను తినను. ఎవ్వర్ని తిననియ్యను. శాన పెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ బొమ్మ బెట్టి పిచ్చిన. ‘గుజరాత్నంత మీరే గడ్తె కూలిన మోర్బీ ఫూల్ గుడ్క మీరే గట్టిండ్రా?’ అని అడిగితె మోదీ ఏమన్నడు? గీ సవాల్కు జవాబ్ జెప్పకుంటివా అంటె నీ మోటర్కు టక్కరైతది’’ అని బేతాలుడన్నడు. ‘‘మోర్బీ ఫూల్ నేను గట్టలేదు. కూలోల్లు గట్టిండ్రు అని మోదీ అన్నడు’’ అని విక్రమార్కుడు జెప్పిండు. ఇంతల బొందల గడ్డ వొచ్చింది. బేతాలుడు మోటర్ దిగి ఇంట్లకు బోయిండు. (క్లిక్ చేయండి: కలిసి ఏడుద్దాం – నా కల నిజం చేద్దాం) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
వివక్ష ఉందంటే ఉలుకెందుకు?
వివక్ష సృష్టికర్తలు, వివక్ష లేదని చెప్పడమో లేక దాన్ని తక్కువ చేసి చూపడమో చేస్తూ వుంటారు. అందులో భాగంగానే బాధితుల ఆక్రందనల్ని ప్రమాదకరమైన అలవాట్లుగా చూపిస్తుంటారు. ఈ మధ్య ఒక వైపు దళితుల మీద వివక్ష వుందని చెబుతూనే మరోవైపు వివక్ష తీవ్రతనూ, పరిమాణాన్నీ పలుచన చేసి చూపించే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. నవంబర్ 17న ‘సాక్షి’లో పి. కృష్ణమోహన్ రెడ్డి రాసిన ‘ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?’ వ్యాసంలో ఈ ధోరణి కనిపిస్తుంది. ఆధారాల కంటే సొంత అవసరాలనే నిజాలుగా ప్రచారంచేసే పోస్ట్– ట్రూత్ మేధావులు పెరిగిపోయారు. ఇక్కడి వివక్షని తెలుసు కోవడానికి విదేశాల రిపోర్టులు అవసరం లేదనీ... నిజాన్ని గుర్తించే జ్ఞానం వుంటే సరిపోతుందనీ తెలుసుకోలేకపోతున్నారు. కులం కొనసాగింపు కోసం కొత్తకొత్త వాదనలు కనిపెడుతున్నారు. దళితులు ప్రతి విషయాన్నీ కుల కోణం నుంచి చూస్తున్నారని ఆందోళన చెందటం అందులో మొదటిది. తమ తప్పును కప్పిపుచ్చు కోవడానికి అన్ని కులాలు వివక్ష ఎదుర్కొంటున్నాయి అంటారు. దళితులు ఎదుర్కొనే అంటరానితనం భిన్నమైందని ఒప్పుకోరు. ‘కొన్ని సంఘటన లను చూపించి’ దేశమంతా వివక్ష ఉందనడం సరి కాదంటారు. 2021లోనే దేశంలో 50,900 దాడులు నమోదు అయినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో చెప్పింది. ఇన్ని దాడులు చెదురు మదురు ఘటనలుగా కనిపించడం ఆశ్చర్యమే. దళితులు ఇక్కడి వివక్షనే ఎదిరించడం ‘అధర్మ’మట. ఆఫ్రికాలో అపార్తీడ్కూ, అమెరికాలో జాతి వివక్షకూ వ్యతిరేకంగా దళితులు సంఘీభావం ప్రకటించడం వీళ్ళకి కనబడదు. ఎక్కడో వివక్ష ఉంది కాబట్టి ఇక్కడ దళితులు దాన్ని అనుభవించాలంటారు! ఆస్ట్రేలియాలో ఆదివాసీలకు జరిగిన అన్యాయానికి ఆ దేశ అధినేత క్షమాపణ చెప్పాడు. అమెరికాలో నల్ల జాతీయుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ క్షమాపణలు చెప్పారు. అలాంటి ఊరట కలిగించే మాట ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? రిజర్వేషన్లు సమానత్వానికి వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. కానీ వీళ్ళకు కులం, అంటరానితనం అసమానత్వంగా కనబడవు. అమెరికాలో ‘పౌర హక్కుల చట్టం 1964’ ప్రకారం జాతి, మతం, లింగం వంటి అంశాల వల్ల ఒక వ్యక్తిని వివక్షకు గురి చేయకూడదు. ఈ చట్టం లోని ‘టైటిల్ సెవెన్’ ప్రకారం ప్రభుత్వంతో కలిసి పనిచేసే వ్యక్తులు, సంస్థలు... కాంట్రాక్టులు, వ్యాపారాల్లో అఫర్మే టివ్ యాక్షన్ ప్లాన్ అమలు చేసి తీరాలి. అంటే నల్ల జాతీయులు, లాటిన్ అమెరికన్స్, మహిళలు, మైనారిటీలు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి తప్పకుండా ఉద్యోగావకాశాలు కల్పించాలి. నియామకాలలో డైవర్సిటీ ఇండెక్స్ పాటించి తీరాలి. ఇది రిజర్వేషన్ లాంటిదే. అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీల్లో డైవర్సిటీ ఇండెక్స్, హాలీవుడ్ సినిమాల్లో నల్ల జాతీయులు కనిపించడం వంటివి అఫర్మేటివ్ యాక్షన్లో భాగమే. దౌర్భాగ్యం ఏంటంటే... బతుకుదెరువు కోసం వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న మన వాళ్ళు అక్కడ కూడా కుల వివక్షను పెంచి పోషిస్తున్నారు. అందుకే అక్కడి దళితులు నల్లజాతీయుల లాగే తమకూ రక్షణ చట్టాలు కావాలని ఉద్యమాలు చేస్తున్నారు. అకడమిక్స్లోనూ వివక్ష రాజ్యమేలుతోంది. దానికి వ్యతిరేకంగా పోరాడే విద్యార్థులనూ, ఉద్యోగులనూ కులవాదులుగా చిత్రించడం ‘అలవాటైన దుర్మార్గం’ కాదా? దళితులు ఇప్పుడిప్పుడే చదువుకు దగ్గర అవుతున్నారు. వాళ్లకి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు విష వలయాలుగా మారటం అన్యాయం కాదా? అంబేడ్కర్ మీద అక్కసు వెళ్లగక్కడం మరో పోకడ. గతంలో అమెరికాకి చెందిన నల్లజాతి నాయకులు ఇండియా వచ్చి గాంధీని కలిసి ఆహ్వానించారు గాని అంబేడ్కర్ని కలవలేదని పెద్ద రహా స్యాన్ని కనిపెట్టినట్టు ప్రచారం చేస్తున్నారు. గాంధీని పిలిచారు కాబట్టి అంబేడ్కర్ వివక్ష మీద పోరాటం చెయ్యలేదని చెప్పగలరా? గాంధీ ఒక దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిస్తున్న నేతగా ప్రపంచాన్ని ఆకర్షించాడనే సంగతిని మరువరాదు. అంబేడ్కర్ను తక్కువ చేసి చూపాలనే దుగ్ధతో అనవసరమైన పోలికలు తీసుకొస్తే ఎలా? ‘అంబే డ్కర్ ఎంతో సహనంతో ఇప్పటిదాక నామీద దాడి చెయ్యకపోవడం అతని గొప్పతనమే’ అని గాంధీ స్వయంగా ‘హరిజన’ పత్రికలో ఎందుకు రాసుకున్నాడో తెలిస్తే లోతు అర్థమౌతుంది. దేశంలో చాక్లెట్ కొన్నా పన్ను కట్టాల్సిందే. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ... మిగిలిన పౌరుల్లాగానే పన్ను కడుతున్నారు. అందులోంచే సంక్షేమ కార్యక్రమాలకూ, పారిశ్రామిక వసతుల కోసం, కార్పొరేట్ లకూ, భూమి ఉన్న రైతులకూ రాయితీలు ఇవ్వడం కోసం ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. రాయితీల్లో తొంబై శాతం పైగా లబ్ధి దారులు పైకులాలవారే. ఈ రాయితీలతో పోల్చుకుంటే రిజర్వేషన్ల విలువ అతి స్వల్పం. దేశాన్నే ప్రైవేట్ చేతుల్లో పెడుతుంటే పట్టించు కోకుండా తరతరాలుగా అణచివేతకు గురైనవారికి ఇస్తున్న రిజర్వేషన్ల మీద దాడిచేయడం ఏమిటి? కులం పేరుతో ఎవరి పట్లయినా వివక్ష చూపడం జరిగినా, దాడి జరిగినా నైతికంగా అందరూ బాధ్యత వహించాలి. దాన్ని అందరూ గర్హించాలి. (క్లిక్ చేయండి: మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. !?) - ప్రొఫెసర్ శ్రీపతి రాముడు ఆచార్యులు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇన్క్లూజివ్ పాలసీ, హెచ్సీయూ -
ఇందుకే బీసీలు వైఎస్ జగన్ వెంట ఉంటారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు బీసీలపై ఎక్కడలేని ప్రేమ ఒలక బోస్తున్నాయి. 2019 ఎన్ని కల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు పొందడంలో బీసీలు ప్రముఖ పాత్ర పోషించారు. అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల ఆత్మగౌరవం ప్రతిబింబించే విధంగా వారికి వందలాది నామినేటెడ్ పదవులు ఇచ్చారు. వారి సంక్షేమానికి అత్యధికంగా నిధులు ఇచ్చారు. దీంతో బీసీలు శాశ్వతంగా జగన్ వెంట నడవడానికి సిద్ధమయ్యారని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న బీసీలను వైసీపీ నుంచి వేరు చేసి వారి మద్దతు పొందేందుకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన లాంటి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్టీఆర్ కాలంలో టీడీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన మంచిని చంద్రబాబు క్లెయిమ్ చేసుకోవడం విడ్డూరం. 2014లో బీసీ డిక్లరేషన్ విడుదల చేసి అధికారం లోకి వచ్చిన తర్వాత టీడీపీ ఆ డిక్లరేషన్లోని అంశాలను పట్టించుకోలేదు. అందుకే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బీసీలు మద్దతు పలికారు. మరి ఇప్పుడు టీడీపీకి వారు ఓట్లెలా వేస్తారు? బీజేపీ కూడా ఇటీవల ఏపీలో బీసీలతో సామాజిక చైతన్య సభ నిర్వహించి బీసీలకు పలు హామీలు ఇచ్చింది. చట్టసభలలో తమకు రిజర్వేషన్లు కావాలనీ, దేశవ్యాప్తంగా బీసీల జనాభా లెక్కించాలనీ అనేక దశాబ్దాలుగా బీసీలు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. స్వయంగా బీసీ అయిన ప్రధాన మంత్రి ఈ డిమాండ్లను పట్టించు కోవడం లేదు. ఏ ముఖంతో రాష్ట్ర బీజేపీ నాయకులు బీసీలను ఓట్లడుగుతారు? తనకు కులం అంటగట్ట వద్దని అంటూనే కాపుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. కాపులను బీసీలలో చేర్చే అంశంపై బీసీలు, కాపుల మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పరిణామాలతో బీసీలు పవన్ కల్యాణ్కు మద్దతు తెలిపే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 83 వేల కోట్ల రూపాయలు నేరుగా బీసీల ఖాతాలలో వేయడం విశేషం. రాష్ట్రంలో ఉన్న 17 మంత్రి పదవులలో 11 మంత్రి పదవులు బీసీలకు కేటాయించారు. అదే విధంగా 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి 56 చైర్మన్లను కేబినెట్ హోదాతో నియమించడం, ఆ 56 కార్పొరేషన్లలో 732 మంది బీసీలను డైరెక్టర్లుగా నియమించడం తెలిసిందే. జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్ల పదవుల్లో 50 శాతం పైగా బీసీలకు కేటాయించడమూ నిజమే కదా. బీసీ ఉద్యమ నాయకులు ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపి బీసీల గొంతును పార్లమెంట్లో బలంగా వినిపించే అవకాశాన్ని సృస్టించారు. ఇంత చేసిన జగన్ వెంట బీసీలు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. (క్లిక్ చేయండి: ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్ అజేయుడే!) - కైలసాని శివప్రసాద్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. !?
భారతదేశంలో మరణానికి ముందు వెనుకల కూడా సనాతనమైన, అమానవీయమైన సాంప్రదాయాలు మనిషిని వెంటాడుతున్నాయి. ఆ సంప్రదాయాల్లో పడి గంజిలో పడ్డ ఈగల్లా బయ టకు రాలేక, అందులో పడి చావలేకా... కొట్టుమిట్టాడుతున్నాం. అద్దె ఇంట్లో ఆత్మీయులు, కుటుంబ సభ్యులు మరణిస్తే కనీసం అక్కడ ఉండి కర్మకాండలు నిర్వహించుకోవడానికి వీలులేని దయనీయ సామాజిక వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అందుకే అద్దె ఇంట్లో ఉండేవారు అంతిమ దశలో తమకంటూ సొంత గుడిసె అయినా ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఓ తల్లి తన కుమారుణ్ణి ఊరు చివర చిన్న గుడిసె అయినా పరవాలేదు, సొంత ఇల్లు కట్టమని వేడుకుంది. దీంతో ఆమె కుమారుడు లోన్ తీసుకుని సొంతిల్లు కట్టి తల్లి భయాన్ని పోగొట్టాడు. కరీంనగర్ పట్టణంలో బస్వరాజు కనకయ్య, భార తమ్మ అనే రజక దంపతులు ఎన్నో ఏళ్ళుగా తమ చేతనైన పనిచేసుకొని బతుకుతున్నారు. వాళ్లకు ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి స్వప్న దివ్యాంగురాలు. ఒక కాలు పని చేయదు. రెండో అమ్మాయి సరితకు పెళ్ళయ్యింది. నిజానికి బసవయ్యకు పెళ్లయిన ఒక కుమారుడు ఉన్నా అతడు తొమ్మిదేళ్ల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. అప్పుడు కూడా అప్పటి అద్దె ఇంటి యజమాని ఇంటికి రానివ్వలేదు. ఇపుడు బసవరాజు కనకయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడి మరణించాడు. ఆసుపత్రి యాజమాన్యం ఆయన బతికే అవకాశం లేదని, ఇంటికి తీసుకుపోతే బాగుంటుందని చెప్పింది. ఆ స్థితిలో ఉన్న కనకయ్యను ఇంటికి తీసుకుపోతే, ఇంటి యజమానులు రానీయలేదు. గత్యంతరం లేక కరీంనగర్ పట్టణంలోని శ్మశానంలోకి తీసుకెళ్ళారు. ప్రాణం ఉండగానే కనకయ్యను శ్మశానంలోకి తీసుకెళ్ళిన కుటుంబం ఆయన చావుకోసం ఎదురు చూసింది. ఒక రోజు తర్వాత కనకయ్య కన్నుమూశాడు. మరణానంతరం జరగాల్సిన కర్మకాండ అంతా ముగించుకొని మాత్రమే తిరిగిరావాలని ఇంటి యజమాని చెప్పడంతో ఇద్దరు ఆడపిల్లలతో మృతుని భార్య 14 రోజులు శ్మశానంలోనే గడిపింది. హైదరాబాద్లోని అపార్ట్మెంట్లలో ఎవరైనా అద్దెకు ఉండి, అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, ఆ కాంపౌండ్ నుంచి శవాన్ని తీసివేయాలి. ఒకవేళ ఆసుపత్రిలో మరణిస్తే అటునుంచి అటే సొంత ఊరికైనా తీసుకెళ్ళాలి. లేదా నేరుగా శ్మశానానికి తీసుకెళ్ళాలి. కొన్ని గ్రామాల్లో మరొక వింత సాంప్రదాయం ఉంది. ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళి, చికిత్స పొందుతూ మరణిస్తే, ఆ వ్యక్తి మృతదేహాన్ని రానివ్వని గ్రామాలు కూడా ఉన్నాయి. పది సంవత్సరాల క్రితం మంథని దగ్గర్లోని ఒక ఊరి ప్రజలు ఇట్లాగే ప్రవర్తిస్తే, పోలీసుల సహకారంతో ఆ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. దీనికి నేనే ప్రత్యక్ష సాక్షిని. అదేవిధంగా తిరుపతి పట్టణంలో, దాని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినట్టు, జరుగుతున్నట్టు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలిసింది. విశాఖతో పాటు అనేక చోట్ల ఇంటి అద్దె కోసం వచ్చిన వాళ్ళను కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు ఉంటే ఇంటి యజమానులు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. మనిషికి మరణం తథ్యమనీ, అది ఎప్పుడైనా, ఎవరికైనా రావొచ్చనీ తెలిసి కూడా మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారనేది అర్థం కాని ప్రశ్న. దీనికి గాను నేను ఎవ్వరినీ నిందించడం లేదు. కానీ దీని గురించి ఆలో చించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కొందరు పుట్టించిన సాంప్రదాయాలు కారణమవుతున్నాయని భావించక తప్పదు. ఇంట్లో ఒక మరణం జరిగితే, కొందరు పురోహి తుడిని సంప్రదిస్తుంటారు. ఇటీవల ఇటువంటి వారి సంఖ్య మరింత పెరిగింది. ఆ పురోహితుడు... వ్యక్తి ఏ ముహూర్తంలో చనిపోయాడో నిర్ణయించి దుర్ముహూర్తమైతే, దానికి శాంతి ఉపాయాలు సూచించి, కొన్నిసార్లు కొన్ని నెలల పాటు మరణించిన ఇంటిని విడిచి పెట్టాలని సూచిస్తున్నారు. దీనిని చూసి ఇంటి యజమానులలో... తమ ఇంట్లో వేరే వాళ్ళ మరణం జరగరాదని, మృతదేహాన్ని ఇక్కడపెట్టరాదనే ఛాందస భావనలు కూడా బాగా పెరుగుతున్నాయి. తమ ఇంట్లో పెళ్లి జరగబోతున్న వారు సొంత బంధువుల అంత్యక్రియలకూ హాజరు కావడానికి ఇష్టపడటం లేదు. ఇట్లా మరణం చుట్టూ అల్లుకున్న ఈ ప్రవర్తన మన సమాజం డొల్లతనాన్ని చూపెడుతున్నది. నిజానికి మన రచనలలో, ప్రసంగాల్లో మృత దేహాన్ని పార్థివ దేహం అంటారు. అంటే పంచభూతాలతో నిండిన శరీరం జీవం పోవడం వల్ల... వాయువును, అగ్నిని, నీటిని, తన సహజ స్వభావాన్ని కోల్పోయి కేవలం మట్టిగా మిగిలిందని చెబుతారు. మట్టి మట్టిలో కలుస్తుంది. పంచ భూతాలతో నిండిన శరీరంలో మట్టి మిగిలినందున ఎంతో పవిత్రమైందిగా చూడాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండడం వింత సాంప్రదాయంగా భావించొచ్చు. కానీ చావును ఒక భయంకరమైన ఘటనగా చూపించి, దాని చుట్టూ ఒక మూఢనమ్మకాన్ని సృష్టించి, ఆ అంధ విశ్వాసాన్ని సమాజం అంతటా వ్యాప్తి చేస్తున్నారు. ఇటువంటి మూఢ నమ్మకాలను తొలగించకుండా, సమాజంలో మానవత్వాన్ని నింపలేం. ఈ మూఢ నమ్మకాలను ప్రేరేపిస్తున్న వారే ముందుకు వచ్చి, ఇవి సరైనవి కావని చెప్పాలి. లేదా అవి శాస్త్రీయమైనవైతే వాటిని ఆధారాలను, శాస్త్రాలను బయటపెట్టాలి. ఒకవేళ వాళ్ళు ఆ పని చేయలేకపోతే, మానవత్వమున్న ప్రతి ఒక్కరం దీని మీద ఒక కార్యాచరణకు పూనుకోవాలి. అదే విధంగా ప్రభుత్వం వైపు నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్లో కొన్ని మార్పులు చేయాలి. ఇంటి యజమానులు ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడితే, శిక్షించడానికి వీలుగా ఆ చట్టంలో సవరణలు చేసి, వాళ్ళను శిక్షార్హులుగా చేయాలి. దీని గురించి న్యాయనిపుణులు, ప్రజా ప్రతినిధులు ఆలోచిం చాలి. మన దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న పట్టణీకరణ, అద్దె ఇండ్ల సమస్యలను పెంచుతున్నది. కావున ఇది కోట్ల మంది సమస్య. రాజకీయ పార్టీలు, సంఘాలు మానవత్వంతో తమ పాత్రను నిర్వహించాల్సి ఉంది. (క్లిక్ చేయండి: 66 ఏళ్లుగా సర్వసాధారణం.. ఇప్పుడెందుకు వివాదం!) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
World AIDS Day 2022: ఒక్క ‘షాట్’తో ఎయిడ్స్కు దూరం
ఎయిడ్స్పై మానవుని పోరాటం చివరి దశకు చేరింది. అందువల్ల ఎయిడ్స్ రోగులు ధైర్యంగా ఉండవచ్చు. 2020లో జరిగిన అధ్యయనాల ప్రకారం హెచ్ఐవీ రోగుల్లో 40 శాతం మంది డిప్రెషన్తో బాధపడుతున్నారు. కొందరు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. నిజానికి ఎయిడ్స్ ఉన్నా పెళ్లి చేసుకోవచ్చని రోగులు గుర్తించాలి. ఎయిడ్స్పై అవగాహన పెంచడానికి 1988 నుంచీ ప్రతీ ఏడాదీ డిసెంబర్ 1వ తేదీని ‘ప్రపంచ ఎయిడ్స్ దినం’గా పాటిస్తున్నాము. ఈ ఏడు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా ‘సంఘీభావంతో – ఎయిడ్స్ నివారణ బాధ్యతల్లో భాగస్వామ్యం కావాలి’ అనే నినాదాన్ని ఇచ్చాయి. జీవితాంతం మాత్రలు వాడటానికి 70 శాతం రోగులు ఇష్టపడటం లేదు. అందుకే మధ్యలో మందులు ఆపేయడం, అస్తవ్యస్థంగా మందులు వాడడం ద్వారా అర్థాంతరంగా హార్ట్ ఎటాక్ లేదా పక్షవాతం, టీబీ, కేన్సర్లు, అంధత్వం, మెనింజైటీస్, ఇతర అవకాశవాద సంక్రమణ వ్యాధులకు గురవుతూ నిర్వీర్యమై పోతున్నారు. ఒకప్పుడు ఎయిడ్స్ అంటే మరణవాంగ్మూలం అనేవారు. అయితే నాలుగు దశాబ్దాల్లో శాస్త్రవేత్తలు ఈ వ్యాధిపై విజయం సాధించి చికిత్సను అందుబాటులోకి తెస్తున్నారు. అత్యంతాధునికమైన ‘బ్రాడ్లీ నూట్రలైజింగ్ ఏంటీ బాడీస్’ (బీఎన్ఏబీఎస్) చికిత్స త్వరలో అందుబాటులోకి వస్తుంది. మూడు లేక నాలుగు బీఎన్ఏబీఎస్ల ను కలిపి రోగి శరీరంలోకి పంపిస్తే అవి అన్ని రకాల హెచ్ఐవీ స్ట్రెయిన్స్నీ పూర్తిగా నిర్మూలిస్తాయని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ‘నేచర్’ ధ్రువీకరించింది. ‘న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్’లో తాజాగా వెలువడిన పరిశోధన ఫలితాల ప్రకారం ఓకాబ్రియా ఇంజక్షన్ సంవత్సరానికి ఒకటి లేదా రెండు పర్యాయాలిస్తే హెచ్ఐవీ సమూలంగా నాశన మవుతుందని తేలింది. హెచ్ఐవీని పూర్తిగా నయం చేయడానికి (సీఆర్ఐపీఆర్) ‘క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్ స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్’ అని పిలువబడే జీన్ ఎడిటింగ్ విధానానికి అమెరికా ‘ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్డీఏ) ఆమోదం తెలిపింది. ఏంటీబాడీస్ ఇంజక్షన్లను వాడటం, కిక్ అండ్ కిల్ లాంటి అత్యాధునిక వైద్య విధానాన్ని అనుసరించడం వంటివాటి ద్వారా ఈ రోజో రేపో ఎయిడ్స్పై పూర్తి విజయాన్ని మన వైద్యులు ప్రకటించనున్నారు. (క్లిక్: అందమైన అమ్మాయి.. ఆమె ఓ డాక్టర్! టీనేజ్ అఫైర్ను గుర్తు చేసుకుని.. చివరికి) - డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ప్రముఖ వైద్యనిపుణులు, అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ సభ్యులు (డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినం) -
ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్ అజేయుడే!
‘‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా... దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.’’ గురజాడ దేశభక్తి గీతం ఒక్కటే చాలు ఆయనకు ప్రపంచ స్థాయి కవుల పక్కన చోటివ్వడానికి అని శ్రీశ్రీ అన్న మాటలు అక్షర సత్యాలు. దేశం, దేశంపై ప్రేమ, దేశభక్తి అంటే ఏంటో వంద సంవత్సరాల కిందటే మనిషి కోణంలోంచి ఆలోచించి చెప్పాడు గురజాడ. రెండువేల ఆరువందల సంవత్సరాల ముందే గౌతమ బుద్ధుడు అన్న ‘బహుజన హితాయ బహుజన సుఖాయ’ వాక్యంలోనూ, బౌద్ధ నైతిక ధర్మంలోనూ దుఃఖంలేని మానవ సమాజమే ముఖ్యం. బౌద్ధ ధర్మంలోని సారాన్ని హృదయానికి హత్తుకున్నవాడు కాబట్టే గురజాడ ‘దేశభక్తి’ లాంటి ప్రపంచస్థాయి గీతాన్ని రాయగలిగాడు. ఈ దేశంలోంచి బౌద్ధం తరిమి వేయబడినపుడే మతపరంగా భారతదేశం ఆత్మహత్య చేసుకుంది అన్నాడు గురజాడ. మనిషిని పట్టించుకోని ఏ మతం అయినా, విషయమైనా మానవజాతి ప్రగతిని కోరే వారి దృష్టిలో అసమ్మతం అయిందేనన్నది వాస్తవం. దేశమంటే చెట్లు, గుట్టలు, నదీనదాలు కాదు. మట్టి మాత్రమే కాదు, దేశమంటే మను షులు. దేశభక్తంటే ఆ మనుషులపై భక్తి, ప్రేమ... ఆ మనుషుల బాగోగులను చూడటమే. మనిషి కేంద్రంగా, మనిషి బాగోగులు లక్ష్యంగా, మానవాభివృద్ధి ధ్యేయంగా పాలన సాగించేవాడే మంచి పాలకుడు. దేశమును ప్రేమించడమంటే అదే. అలాంటి పాలన నందించే అతికొద్దిమంది నాయకులలో యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అతనికి కావాల్సింది తన ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ అందించడం. కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గాలకతీతంగా అందరికీ మేలు చేసే పనులు చేయడం. అందుకే దాదాపు 31 లక్షల మందికి మూడున్న రేళ్లయినా పూర్తికాక ముందే ఇండ్ల స్థలాలు ఇచ్చారు. దాదాపు రెండు లక్షల మందికి ఇప్పటికే ఇళ్లు కట్టించారు. లక్షలాది ఇళ్ల నిర్మాణ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల వాగ్దానాలను 95 శాతం పైగా నెరవేర్చారు. విద్య, వైద్యం, సేద్యం, తిండి, బట్ట, ఇల్లు... ఇలా మనిషి మనుగడకు సంబంధించిన అన్ని అవసరాలనూ రాజకీయ విలువలనూ కాపాడుతూ, కమిట్మెంట్ రాజకీయాలను నడుపుతూ తీర్చడం సామాన్య విషయం కాదు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుతూ సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తున్నారు. ఇలాంటి మనిషి కేంద్రంగా సాగుతున్న పాలన తెలుగుదేశం లాంటి ప్రధాన ప్రతి పక్షానికీ, తెలుగు రాష్ట్రాల్లో తద్వారా దక్షిణాదిలో బలపడాలని అనుకుంటున్న బీజేపీకీ, ఏ రాజకీయ సిద్ధాంత అవగాహన లేక నోటి కొచ్చింది మాట్లాడుతూ ఎవరితోనైనా సరే పొత్తు పెట్టుకోవాలని చూసే పవన్ కల్యాణ్కూ నచ్చవు. ద్వేషపూరిత రాజకీయాలను రెచ్చ గొడుతూ అధికారంలోకి రావాలని చూడటమే వీరి ఉద్దేశ్యం. దేశభక్తంటే వీరికి మతభక్తి. కులాలను రెచ్చగొట్టడం. ప్రాంతీయ విభేధాలను రెచ్చ గొట్టడం. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఏవీ వీరికి పట్టవు. ఏం చేసైనా సరే అధికారంలోకి రావడం వీరి ఉద్దేశ్యం. ప్రజల కనీసావరాలను తీర్చే ఒక్క ప్రణాళిక కానీ, రాష్ట్ర ప్రగతి పథానికి ఉపయోగపడే ఒక్క పథకం కానీ లేకుండా ప్రజల సెంటిమెంట్లను రెచ్చ గొట్టి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న వీరికి 2019 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన అనేక ఉప ఎన్నికల్లోనూ జరిగిన ఆశా భంగమే 2024 ఎన్నికల్లో జరుగుతుందన్నది వాస్తవం. గురజాడ చెప్పిన దేశమును ప్రేమించుమన్నా అన్న సూక్తినీ, దేశభక్తి నిర్వచనాన్నీ హృదయానికి హత్తుకొని పరిపాలన కొనసాగిస్తూ ఆంధ్ర ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్ అజేయుడే! (క్లిక్ చేయండి: మూడు రాజధానుల ప్రతిపాదన అందుకే..) - కాలువ మల్లయ్య ప్రముఖ సాహితీవేత్త -
హాస్టల్ విద్యార్థుల స్థితి మెరుగు పడాలంటే...
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురు కులాలు, కేజీబీవీలు, సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఆహారం విషతుల్యమైన ఘటనలు దిన దినం పెరిగిపోతున్నాయి. తాగే నీళ్ళు కూడా కలుషితమై పిల్లలకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. దీంతో విద్యా ర్థులూ, వారి తల్లిదండ్రులూ భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి నవంబర్ మొదటి వారం వరకు గడిచిన పది నెలల్లో ఇలాంటి ఘటనలు 34 జరుగగా, ఇందులో 2,147 మంది విద్యార్థులు అస్వస్థ తకు గురైనట్లు ‘హక్కు ఇనిషియేటివ్’ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడ యింది. ఇవి కూడా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తమ సంస్థ వెళ్లి సేకరించిన వివరాలేననీ, బయటికి రాని ఫుడ్ పాయిజ నింగ్ ఘటనలు అనేకం ఉన్నాయనీ ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. రాష్ట్రంలోని గురుకులాలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని సరైన ప్రదేశంలో నిల్వ చేయకపోవడం కారణంగా పురుగులు పడుతున్నాయి. ఆ బియ్యాన్ని సరిగా కడుగక పోవడం, పాడైపోయిన కూరగాయలు వండటం, వంటగది శుభ్రంగా ఉంచకపోవడంతో వండే భోజనంలో బొద్దింకలు, బల్లులు పడి ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వసతి గృహాల్లోనే ఉండి పర్యవేక్షణ జరుపవలసిన వార్డెన్లు స్థానికంగా ఉండకపోవటం వలన... వంట మనుషులు నిర్లక్ష్యంగా వంటచేస్తున్నారు. దీంతో పిల్లలు తినే ఆహారం, నీరు విషతుల్యం అవుతున్నాయని అస్వస్థతకు గురైన విద్యార్థులు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లాలోని గిరిజన మహిళా కళాశాల ఘటన నుంచి నవంబరు నెలలో సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్లోని కేజీబీవీలో అటుకుల అల్పాహారంలో పురుగులు వచ్చిన ఘటన వరకూ... రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 34 ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగినట్లు హక్కు ఇనిషియేటివ్ సంస్థ తన నివేదికలోవెల్లడించింది. ఇందులో ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబాబాద్, గద్వాల, నల్లగొండ, వికారాబాద్లో రెండు చొప్పున... సిద్ధిపేట, ఆసిఫాబాద్ , నిర్మల్, సంగారెడ్డిలో మూడు చొప్పున; మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, నారాయణపేట, ఖమ్మం, జనగామ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఘటనలు జరిగాయి. ఇందులో అత్యధికంగా జులై 15న బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో 150 మంది వరకు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, సిద్ధిపేట మైనారిటీ గురుకులంలో 120 మందీ, ఖమ్మం జిల్లాలో తనికెళ్ళ గిరిజన మహిళా డిగ్రీ కాలేజీలో 100 మందీ, గట్టు మండలం బాలికల గురుకుల విద్యాలయంలో వంద మంది వరకూ అస్వస్థ తకు గురై ఆస్పత్రి పాలయ్యారు. రాష్ట్రంలో అన్ని సాంఘిక సంక్షేమ, గురుకుల, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల వార్డెన్లకు ‘ముఖ చిత్ర గుర్తింపు హాజరు యాప్ (ఫేస్ రికగ్నిషన్ ఎటెండెన్స్ యాప్) ప్రవేశ పెట్టాలి. వార్డెన్ వసతి గృహంలోనే ఉండి వంట గది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి, నాణ్యమైన నిత్యావసరాలు, కూరగాయలతో ఆహారం వండించాలి. మిషన్ భగీరథ తాగు నీళ్ళు తెప్పించాలి. విద్యార్థులతో కలిసి మూడు పూటలా భోజనం చేయాలి. అంతే గాకుండా అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం అడు గులు వేస్తుందని ఆశిద్దాం. (క్లిక్ చేయండి: వారి పోరాటం ఫలించాలంటే...) - నల్లెల్ల రాజయ్య వరంగల్ పౌర స్పందన వేదిక ప్రధాన కార్యదర్శి -
కార్పొరేట్ కత్తిరింపు మొదలైతే... వారి అస్తిత్వానికి ముప్పు!
పారిశ్రామికీకరణ కర్కశ పాదాల కింద ఎన్నో చేతివృత్తులు నలిగి పోయాయి. ఇంతకాలం మైల పనిగా భావించిన వృత్తుల్లో సైతం ఎన్నో మార్పులు వచ్చాయి. దాంతో సాంప్రదాయిక మంగలి (నాయీ బ్రాహ్మణ) వృత్తిపై కార్పొరేట్ కన్ను పడింది. కేశాలంకరణకు, రూప సౌందర్యానికి ఎంతైనా ఖర్చుపెట్టేవాళ్లు పెరుగుతున్న క్రమంలో వారి అవసరాలు తీర్చే రీతిలో కులవృత్తి మంగళ్ళు ఎదిగివచ్చే పరిస్థితులు లేవు. దీన్ని కార్పొరేట్లు చేజిక్కించుకొని, క్షుర కర్మ ఒక కుల వృత్తి అనే ముద్రని తుడిచేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం 45 శాతం కస్టమర్లు మాములు కటింగ్ చేయించుకోగా మిగతావారు చూడచక్కగా కనబడేందుకు సెలూన్లకు వస్తున్నారు. ఐదేళ్లలో ఈ ఫ్యాషన్ కస్టమర్ల సంఖ్య 60 శాతం పెరిగిందట. 2014లో రిలయన్స్ రిటైల్ తరపున హెయిర్ కటింగ్ షాపులు ఆరంభిస్తామన్న ప్రకటన రాగానే క్షురకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో ఆ ప్రతిపాదన వెనక్కి పోయింది. ఈ నవంబర్ మొదటివారంలో మరో వార్త వచ్చింది. నేచురల్స్ స్పా సంస్థలో 49 శాతం భాగస్వామ్యాన్ని కొనుగోలుకు ముకేశ్ అంబానీ సిద్ధపడినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన నేచురల్స్కి దేశంలోని ప్రముఖ నగరాల్లో 700 పైగా సెలూన్లు ఉన్నాయి. 2025 నాటికి ఆ సంఖ్యను 3,000కి పెంచాలనే ఆలోచనతో ముకేశ్ పావులు కదుపుతున్నారని వార్త. ఆయన సొంత సొమ్ముతో కొన్ని దుకాణాలు తెరిచినా కొంత కాలం తర్వాత ఫ్రాంచైజీ విధానాన్ని మొదలు పెడతారు. బ్రాండ్ పేరు కస్టమర్లలో చొచ్చుకు పోయాక ఆ పేరుతో షాపు తెరిచేందుకు వచ్చినవారి నుండి డిపాజిట్లు వసూలు చేసి రోజువారీ వ్యాపారంలో కమిషన్ తీసుకుంటారు. సొంత షాపుల బేరాలు దెబ్బ తింటే మంగలి కులంవారు ఈ సెలూన్లలో పనికి కుదరక తప్పదు. వారు తమ అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు తమ వృత్తిలోనే కూలీలుగా మారే దుఃస్థితి వస్తుంది. అందుకే కార్పొరేట్లు ఈ వ్యాపారంలోకి రాకుండా ప్రభుత్వాలు అడ్డుకోవాలని నాయీబ్రాహ్మణ సంఘాలు కోరుతున్నాయి. (క్లిక్ చేయండి: ఆ వృత్తిని మాకు మాత్రమే పరిమితం చేయాలి) – బి. నర్సన్, రచయిత 94401 28169 -
Praja Sangrama Yatra: ప్రజల గోస అరుసుకోవాలనే!
తెలంగాణలో మెజారిటీ వర్గాల ప్రయోజనాల కోసం ‘బీసీ బంధు’, అణగారిన ఎస్టీ బిడ్డల కోసం ‘గిరిజన బంధు’ను తీసు కురావడమే లక్ష్యంగా, సకల జనులు కలలుగన్న తెలంగాణ పునర్నిర్మాణమే ధ్యేయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కుమార్ తలపెట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర ఐదో విడత నవంబర్ 28న ప్రారంభమయ్యింది. భావి సామాజిక తెలంగాణ కోసం బండి సంజయ్ ఇప్పటికే నాలుగు విడతల్లో పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన్రు. గతేడాది ఆగస్టు 28 వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రకు, టీఆర్ఎస్ప్రభుత్వం అడుగడు గున అడ్డంకులు సృష్టించింది. అయినా వెనకడుగు వెయ్య కుండా, వెన్ను చూపకుండా ఇప్పటి వరకు విడతలుగా 21 జిల్లాల్లో 1,178 కిలోమీటర్లు నడిచి బండి సంజయ్ తెలంగాణ ప్రజల మనసులు గెలుచు కున్నారు. నవంబర్ 28న నిర్మల్లోని ఆడెల్లి పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, ఆశేష జనవాహిని మధ్య ముధోల్ నుంచి పాదయాత్ర ప్రారం భమయింది. 8 అసెంబ్లీ నియోజకవర్గాల సహా... ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గాల్లో 225 కిలోమీటర్ల మేర కొనసాగే ఈ పాద యాత్ర డిసెంబర్ 17న, కరీంనగర్లో నిర్వహించే బహిరంగ సభతో ముగుస్తది. టీఆర్ఎస్ ప్రభుత్వ తొమ్మిదేండ్ల ఏలుబడిలో మన బిడ్డలకు ఉద్యోగాలు రాలే. మన పొలాలకు నీళ్లు రాలే. మన డబ్బా ఇండ్లు డబుల్ బెడ్రూం కాలే. మన ఊరికి నిధులు రాలే. మన రైతుల అప్పులు తీరలే. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడలే. తెలంగాణకు దళితుడే ముఖ్యమంత్రి అనీ, దళితులకు మూడెకరాల భూమి ఇస్తమనీ దళితులను మోసం చేసిన్రు. కేజీ టు పీజీ ఉచిత విద్య మాటలకే పరిమితమైంది. రైతులకు రుణమాఫీ, ఉచిత ఎరువుల హామీలు అమలుకే నోచుకోలే. బీసీ రుణాలను మూలకు పడేసి ఐదేండ్లు కావొస్తున్నది. పోడు భూముల్లో మొక్కలు నాటాలని ఒక వైపు అధికారులకు ఆదేశాలు ఇచ్చేదీ ప్రభుత్వమే. ఇంకోవైపు పోడు భూములకు పట్టాలిస్తామని ఆశ పెట్టేదీ ముఖ్యమంత్రే. ఈ రెండు నాలుకల నిర్వాకం వల్ల అధికారులు, పోడు రైతుల మధ్య గొడవలయ్యి, అమాయకుల ప్రాణాలు పోతున్నయ్. (చదవండి: ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. సంయమనం పాటించాలి) భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని, మౌలిక లక్ష్యాలైన జాతీయవాదం, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్యం, సామాజిక ఆర్థిక వ్యవస్థకు గాంధేయ విధానాలను అన్వ యించడం విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తం. దోపిడీ నుంచి విముక్తి, సమానతపై ఆధారపడ్డ సమాజం (‘సమతా యుక్త్, శాసన్ ముక్త్’)తో పాటు, విలువలతో కూడిన రాజకీయాలను ప్రచారం చేస్తం. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పార్టీగా, మలిదశ ఉద్యమంలో తెలంగాణ బిల్లుకు సహకరించి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పార్టీగా బీజేపీకి తెలంగాణ ఆకాంక్షలపై స్పష్ట మైన అవగాహనతో పాటు, అవసరమైన ప్రణాళికలు ఉన్నయ్. ప్రజారంజక పాలన తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొనాలని స్వాగతిస్తున్నం. (చదవండి: ఓబీసీల వర్గీకరణకు మోక్షం ఎప్పుడు?) - డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఉపాధ్యక్షులు, బీజేపీ తెలంగాణ శాఖ (‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ 5వ విడత సందర్భంగా) -
కలిసి ఏడుద్దాం – నా కల నిజం చేద్దాం
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కొని బొందల గడ్డ కాడ్కి బోయిండు. గాడ రొండం త్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. విక్రమార్కుడు మోటరాపి హారన్ గొట్టిండు. బేతాలుడింట్ల కెల్లి ఇవుతలి కొచ్చిండు. ఎన్క సీట్ల ఆరాంగ గూసుండు. విక్రమార్కుడు మోటర్ నడ్ప బట్టిండు. గప్పుడు బేతాలుడు– ‘‘ఎండ గొడ్తున్నా, ఆనదంచి గొడ్తున్నా, సలి వొన్కిస్తున్నా తాతీల్ దీస్కోకుంట దినాం వొస్తవు. గుంతలు, ఎత్తుగడ్డలని సూడకుంట మోటర్ నడ్పుతవు. ఎవడన్న నీ మోటర్కు అడ్డం రావొచ్చు. ఎంటిక మందంల టక్కర్ గాక పోవచ్చు. నీ మోటర్ ట్రాఫిక్ల ఇర్కపోవచ్చు. నీకు యాస్ట రావొచ్చు. నువ్వు యాస్ట మర్సెతంద్కు ఒక మజేదార్ ముచ్చట జెబ్త ఇను’’ అని అన్నడు. ‘‘చెప్పుడు నీ పని. ఇనుడు నా పని’’ అని విక్ర మార్కుడన్నడు. ‘‘చెంద్రబాబుకు ముక్యమంత్రి కుర్సి ఉన్నా నిద్ర రాదు. లేకున్నా నిద్ర రాదు’’ అన్కుంట బేతా లుడింకేమో జెప్పబోతుంటె అడ్డం దల్గి, ‘‘ఎందుకు రాదు’’ అని విక్రమార్కుడ డిగిండు. ‘‘చెంద్రబాబు ముక్యమంత్రిగ ఉండంగ కుర్సి దిగితె పౌరన్ ఎవలన్న గా కుర్సిల గూసోవొచ్చనేటి బయంతోని నాత్రిపూట గుడ్క నిద్ర పోలేదు. ఏం జేస్తె ముక్యమంత్రి కుర్సి వొస్తదా అని పగటీలి నాత్రి పూట ఒక్క తీర్గ ఆలోచన జేస్తుండ బట్కె గాయినకు నిద్రొస్తలేదు.’’ ‘‘ముక్యమంత్రి కుర్సి కోసం గిప్పుడు గాయినేం జేస్తున్నడు?’’ ‘‘గీ నడ్మ గాయిన పవన్ కల్యాన్ తాన్కి బోయిండు. గ్లిజరిన్ కంట్లె ఏస్కుంటె నీకు ఏడ్పొస్తది. గని గ్లిజరిన్ లేకున్నా నాకు ఏడ్పు వొస్తది. నా పెండ్లాంను తిట్టిండ్రనుకుంట అసెంబ్లిల నేను పల్ల పల్ల ఏడ్సిన. నువ్వు నేను గల్సి జెనం తాన్కి ఏడ్సు కుంటబోదాం. మోదీని బత్మిలాడు. గాయినను గుడ్క మనతోని గల్సి రమ్మను. ముగ్గురం గల్సి ఏడిస్తిమా అంటె మన ఏడ్పుల జగన్ సర్కార్ కొట్క బోతది. కాపుదనంకు కమ్మదనం గలిస్తె ఎదురుండదు అని చెంద్రబాబు పవన్తోని అన్నడు. అనుడే గాకుంట గిదే నాకు ఆక్రి మోక అన్కుంట ఒక్క తీర్గ ఏడ్సిండు.’’ ‘‘మల్ల మున్పటి లెక్క టీడీపీతోని సోపతి జెసెతంద్కు బీజేపీ రడీగున్నడా?’’ ‘‘అసల్ లేదు. సైకిల్ బిరక్ ఫేలైంది. పయ్య లల్ల గాలిబోయింది. గిప్పుడు గది శీకట్ల ఉన్నది. తెల్లా రంగనే మా తామరపువ్వు విచ్చుకుంటది. పగటీ లంత గట్లే ఉంటది. శీకట్ల ఉండేటి టీడీపీ తోని మా పార్టి సోపతి జేసే సవాల్ లేదు అని బీజేపీ ఎంపీ జి.వి.ఎల్. నరసింహారావు అన్నడు. జనసేన తోని పొత్తు గూడ్తం. గా పార్టితోని గల్సి వొచ్చేటి అసెంబ్లి ఎలచ్చన్ల పోటీ జేస్తం. టీడీపీకి మాకు జమా యించదు. చెంద్రబాబును సస్తె నమ్మం అని ప్రతాని అన్నడు.’’ ‘‘చెంద్రబాబు గిన జెనం తాన్కి బోయిండా?’’ ‘‘గీ నడ్మ మూడు దినాలు చెంద్రబాబు కర్నూలు జిల్లల దిర్గిండు. గిప్పుడున్నది శాసనసబ గాదు. కౌరవుల సబ. నేను ముక్యమంత్రినైతె గది పాండవుల సబ అయితది. నేను ముసలోన్ని అయిన. నాకు గిదే ఆక్రి మోక. నన్ను ముక్యమంత్రి కుర్సి మీద గూసుండబెడ్తె అమరావతిని రాజదాని జేస్త. ఇంద్రుని రాజదాని అమరావతి. గదే తీర్గ గీ చెంద్రుని రాజదాని గుడ్క అమరావతే అని చెంద్ర బాబు అన్నడు.’’ ‘‘ముక్యమంత్రి కుర్సి కోసం చెంద్రబాబు ఇంకేం జేసిండు?’’ ‘‘బాబు ఒక సన్నాసి తాన్కి బోయిండు. గాయిన కాల్లు మొక్కిండు. మల్ల ముక్యమంత్రిని గావాలంటె ఏం జెయ్యాలని అడిగిండు. దినాం తెల్లారి నాలుగ్గొట్టంగనే నిద్ర లెవ్వాలె. నెత్తిమీది కెల్లి తానం జెయ్యాలె. శివుని గుడికి బోవాలె. లింగంకు అబిసేకం చేసి మారెడాకులతోని పూజ జెయ్యాలె. శ్రీశైలం బోవాలె. వెయ్యిమందికి మెడల ఏస్కునే తంద్కు బంగారి లింగాలు ఇయ్యాలె. పెయ్యికి బూడ్ది బూస్కోవాలె అని జెప్పిండు. సన్నాసి జెప్పిన తీర్గనే చెంద్రబాబు జెయ్య బట్టిండు. గట్ల జేస్తుండంగ ఒక నాత్రి గాయినకు కల బడ్డది. గా కలల శంకరుడు గండ్లబడ్డడు. దేవా! జగన్ సర్కార్ను గూలగొట్టెతంద్కు నాకు పాశుపతాస్త్రం ఇయ్యి అని శివున్ని అడిగిండు. గాయినకు శంకరుడా అస్త్రమిచ్చిండా? జవాబు ఎర్కుండి గూడ జెప్పకుంటివా నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతాలుడన్నడు. ‘‘అన్ని అస్త్రాలను మించిన వెన్నుపోటు అస్త్రం నీ తాన ఉండంగ వేరె అస్త్రంతోని పనేంది అని శంకరుడున్నడు’’ అని విక్రమార్కుడు జెప్పంగనే మోటర్ దిగి బేతాలుడు బొందల గడ్డ దిక్కు బోయిండు. తోక: గీ నడ్మ కుల నిర్మూలన సబకు మా సత్నారి బోయిండు. ‘‘సార్! మీ స్పీచ్ అదిరింది’’ అని ఒక పెద్దాయనతోని గాడు అన్నడు. ‘‘ఇంతకు మీరేంటోల్లు’’ అని గాయిన సత్నారి నడిగిండు. (క్లిక్ చేయండి: పవన్ కల్యాన్ గూడ జన సేనను తెలుగుదేసంల కల్పుతడేమో..) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్