
యార్డుకు 1,59,032 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,59,032 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,57,640 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.9,800 నుంచి రూ.13,500 వరకు లభించింది. తాలు రకం మిర్చి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 76,896 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.
పసుపు ధరలు
దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో 572 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
● కొమ్ములు 388 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ఠ ధర రూ.10,750, గరిష్ట ధర రూ.12,200, మోడల్ ధర రూ.11,700,
● కాయలు 184 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ఠ ధర రూ.10,750, గరిష్ట ధర రూ.12,200, మోడల్ ధర రూ.11,700, మొత్తం 429 క్వింటాళ్లు అమ్మకాలు జరిగినట్లు ఆయన తెలిపారు.
కీబోర్డులో గిన్నిస్ రికార్డు
పెదకాకాని: మ్యూజికల్ కీ బోర్డులో కొప్పురావూరుకు చెందిన ఉషారాణి రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్లో స్థానం దక్కించుకుంది. పెదకాకాని మండలంలోని కొప్పురావూరు గ్రామానికి చెందిన టి.ఉషారాణి స్ఫూర్తి మహిళా సంక్షేమ అభివృద్ధి సంస్థ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. 2024 డిసెంబరు 1వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ గంట సమయం పాటు 17 దేశాలకు చెందిన 1090 మంది ఒకే టైమ్లో నాన్స్టాప్గా కీ బోర్డు ప్లే చేయడం జరిగింది. ఈ వీడియో రికార్డును నాస్టర్ అగస్టీన్ దండంగి ఆధ్వర్యంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీడియోను వీక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ వారు కొప్పురావూరుకు చెందిన టి.ఉషారాణిని గిన్నిస్బుక్ రికార్డు కు ఎంపిక చేయడం జరిగింది. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ మణికొండలో నిర్వహించిన కార్యక్రమంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టీన్ దండంగి, బ్రదర్ అనిల్ కుమార్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్ల చేతుల మీదుగా సర్టిఫికెట్, మెడల్ను టి.ఉషారాణికి అందజేశారు.