బీజింగ్: డ్రాగన్ దేశం చైనా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాలో ఉన్న ఏకైక భారతీయ జర్నలిస్టు తమ దేశం నుంచి వెళ్లిపోవాలని తాజాగా చైనా ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం ఈ నెల చివరి వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. దీంతో చైనాలో ఇప్పటివరకు ఉన్న ఒకే ఒక్క భారత మీడియా ప్రతినిధి కూడా అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది.
వివరాల ప్రకారం.. ప్రస్తుతం పీటీఐ రిపోర్టర్ ఒకరు చైనాలో ఉన్నారు. అయితే, భారత జర్నలిస్టుల వీసా రెన్యూవల్ చేసేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది. చైనాలో ఈ ఏడాది మొదటివరకు పలు భారత మీడియా సంస్థల నుంచి నలుగురు జర్నలిస్టులు విధులు నిర్వహించారు. హిందుస్థాన్ టైమ్స్కు చెందిన ఓ రిపోర్టర్ గత ఆదివారమే చైనా వదిలి వచ్చేశారు. దూరదర్శన్, ద హిందూకు చెందిన రిపోర్టర్లను ఏప్రిల్లోనే పంపించేశారు. ఇక, మిగిలిన పీటీఐ రిపోర్టర్ను కూడా చైనా ఇంటికి పంపించనుంది. కాగా, దీనిపై ఇరుదేశాల విదేశాంగ శాఖల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.
మరోవైపు.. విదేశీ మీడియా ప్రతినిధులకు సంబంధించి చైనా కండీషన్స్ పెడుతోంది. అయితే, జర్నలిస్టుల వీసాకు సంబంధించి భారత ప్రభుత్వం గత నెలలో ఓ ప్రకటన చేసింది. భారత్లో పనిచేసే చైనా జర్నలిస్టులకు ఎటువంటి ఆటంకాలు లేనప్పటికీ.. చైనాలో భారత జర్నలిస్టులకు మాత్రం ఇలాంటి వెసులుబాటు లేదని పేర్కొంది. ఇక, లడాఖ్, సిక్కిం వద్ద జరిగిన ఘర్షణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దు విషయంలో కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులకు వీసా రెన్యువల్ చేయలేదని వాదనలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: విషాదం: మాజీ ప్రధాని కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment