
బీజింగ్: కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న సంతోషంతో ఉన్న ప్రజలకు మరో పిడుగులాంటి వార్త కలవరపెడుతోంది. తాజాగా చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ కారణంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 2020 మార్చి తర్వాత రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం చైనాలో కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వివిధ నగరాల్లో వేయికి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కఠిన ఆంక్షలతో పాటు లాక్డౌన్ విధించారు.
మరోవైపు.. దక్షిణ చైనాలోని టెక్ హబ్గా పిలువబడే షెన్జెన్లో ఒకే రోజు 66 మందికి పాజిటివ్గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు తెలిపారు. షెన్జెన్లో 1 కోటి 75 లక్షల మంది జనాభా ఉండటంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. దీంతో వారిని ఇళ్లకే పరిమితం చేస్తూ అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు కూడా నగరాన్ని విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. కాగా హువావే, టెన్ సెంట్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు షెన్జెన్లోనే ఉన్నాయి. షెన్జెన్ నగరం హంకాంగ్తో సరిహద్దును కలిగి ఉంది.
ఇదిలా ఉండగా.. 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్ చున్లో శుక్రవారం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. షాన్ డాంగ్ ప్రావిన్స్లోని యుచెంగ్లో కూడా లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. బీజింగ్లో నివాస ప్రాంతాల్లోకి ప్రవేశాన్నినిషేధించారు. దీంతో చైనా ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment