
సియోల్: ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలను చల్లబరిచే అరుదైన పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా అధికారి ఒకరు సరిహద్దు సముద్ర జలాల్లో దారుణ హత్యకు గురైన ఘటనపై ఉత్తర కొరియా అధ్యక్షుడు క్షమాపణలు చెప్పారు. అధికారి మృతిపై ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ శుక్రవారం క్షమాపణ కోరారని, ఈ అనుకోని దురదృష్టకర సంఘటనకు ఆయన ఎంతో విచారం వ్యక్తం చేశారని ద.కొరియా అధికారులు ప్రకటించారు. (ఏడాదికి 100 కోట్ల టీకా డోసులు: చైనా)
ఇలా ఉ.కొరియా అధ్యక్షుడు క్షమాపణ చెప్పడం అత్యంత అరుదైన పరిణామమని విశ్లేషకులు అంటున్నారు. ఉ.కొరియా పట్ల ద.కొరియాలో పెరుగుతున్న వ్యతిరేకతను చల్లబరిచేందుకు, ఈ ఘటనపై ద.కొరియా అధ్యక్షుడిపై పెరుగుతున్న విమర్శలు తగ్గించేందుకు కిమ్ క్షమాపణ కోరి ఉంటారని విశ్లేషిస్తున్నారు.