
వాషింగ్టన్: పాకిస్తాన్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలని పార్టీ మద్దతుదారులు తలపెట్టిన ఆందోళనల కారణంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉన్న అమెరికా పౌరులను ఆ దేశ అడ్వైజరీ హెచ్చరించింది. డిసెంబర్ 16వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది.
పాకిస్తాన్ లో శాంతి భద్రతలు అదుపు తప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్న అమెరికా పౌరులను అడ్వైజరీ హెచ్చరించింది. తమ దేశ పౌరులు పెషావర్లోని సెరెనా హోటల్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప ఖైబర్ ఫకున్ ఖ్వా ప్రాంతాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచనలు చేసింది. అయితే, సెరెనా హోటల్ పరిసర ప్రాంతాల్లో మిలిటెంట్లు దాడులు చేసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీ వరకు తాము చేసే సూచనలు తప్పకుండా పాటించాలని ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలని పార్టీ మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు మరణించగా.. మరికొందరు ఆందోళనకారులు గాయపడ్డారు. దీంతో, దాదాపు పదివేల మంది పీటీఐ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment