
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఐ.పోలవరం: ఐ.పోలవరం మండలం ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారధిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యానాం సుంకరపాలెం నుంచి ముమ్మిడివరం వైపు బైక్పై వస్తున్న ఇద్దరి వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన ఇద్దరూ తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన యాళ్ల వీరేంద్ర(26), ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన వేమవరపు సాంబశివ(14)గా పోలీసులు గుర్తించారు. పోతుకుర్రులో జరిగే పుట్టినరోజు వేడుకలకు బంధువుతో కలసి వారు మోటారు సైకిల్పై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి స్థానిక ఎస్సై మల్లికార్జునరెడ్డి సిబ్బందితో కలసి వెళ్లి మృతదేహాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సుంకరపాలెం గ్రామానికి చెందిన యాళ్ల వీరేంద్ర లోడ్ ఆటో నడుపుతూ తండ్రి సూరిబాబుకు అండగా ఉండేవాడు. సూరిబాబుకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఉన్న ఒక్క కొడుకూ ఆటో నడుపూతూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. వీరేంద్ర మృతితో సుంకరపాలెంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. సాంబశివ కొత్తలంక హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు.
కౌలు రైతు ఆత్మహత్య
తాళ్లరేవు: మండల పరిధిలోని పి.మల్లవరం పంచాయతీ పత్తిగొంది గ్రామానికి చెందిన కౌలు రైతు పశ్చెట్టి వెంకటేశ్వరరావు(45) ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలో సొంత భూమితోపాటు కొంత కౌలుకి తీసుకుని వ్యవసాయం చేశాడు. వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పులు తీర్చలేక కొంతకాలం హైదరాబాద్లో పనిచేశాడు. ఇటీవల తిరిగి వచ్చి కాకినాడలో కూలిపని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి యానాం బీచ్కు వెళ్లి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వరరావును యానాం పోలీసుల సహకారంతో కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. యానాం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతునికి భార్య నాగలక్ష్మి, వివాహమైన కుమార్తెలు శ్రీదేవి, జ్యోతిశ్రీ ఉన్నారు. వెంకటేశ్వరరావు ఆకస్మిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
యువకుడి ఆత్మహత్య
అల్లవరం: ఎంట్రుకోన పంచాయతీ పరిధిలో వాసర్లవారిపాలేనికి చెందిన వాసర్ల వెంకట సాయి సునంద్ (24) బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంటిలో ఫ్యాన్కు ఊరి వేసుకుని మృతి చెందాడు. ఫంక్షన్ నిమిత్తం వేరే ఊరు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే లోగా ఫ్యాన్కు వేలాడుతున్నాడని తండ్రి వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. కొన ఊపిరితో ఉన్న వెంకట సాయిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి వీర వెంకట సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై హరీష్కుమార్ కేసు నమోదు చేశారు.
మృతదేహం స్వాధీనం
పెరవలి: పెరవలి మండలం లంకమాలపల్లి గ్రామం వద్ద బ్యాంక్ కెనాల్లో ఒక మృతదేహాన్ని బుధవారం స్వాధీనం చేసుకున్నామని పెరవలి ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కొవ్వూరు మండలం పంగిడి గ్రామానికి ఆవుగడ్డ మల్లికార్జున(40)గా అతనిని గుర్తించామని చెప్పారు. కాలువలో మృతదేహం కొట్టుకుంటూ ఇక్కడకు వచ్చి తుప్పల్లో ఆగిపోయిందని చెడు వాసన రావటంతో గ్రామస్తులు పరిశీలించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వచ్చి మృతదేహాన్ని పైకి తీసి పోస్టుమార్టం కోసం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెంకటేశ్వరరావు తెలిపారు.
బీరు బాటిళ్లతో దాడికి
పాల్పడిన నలుగురి అరెస్టు
కాకినాడ రూరల్: కాకినాడ అర్బన్ 3వ డివిజన్ పరిధిలోని గుడారిగుంటలో ఒక మద్యం దుకాణం వద్ద ఈ నెల 9న రాత్రి జరిగిన గొడవ హింసాత్మకంగా మారడంతో ఇద్దరు వ్యక్తులపై బీరు బాటిళ్లతో దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను సర్పవరం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి ఎస్సై పి.శ్రీనివాస్కుమార్ వివరాల ప్రకారం గుడారిగుంటలో మద్యం దుకాణం వద్దకు వీరు 9న రాత్రి 8గంటల సమయంలో వెళ్లారు. చిన్న విషయమై గొడవ పడి బీరు బాటిళ్లతో ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులు గుడారిగుంటకు చెందిన సీకోటి రాజు, పెయ్యల ప్రసాద్, సీకోటి ప్రసాద్, కలాడి అర్జునరావుపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
Comments
Please login to add a commentAdd a comment