
నందికొట్కూరులో చోరీ
నందికొట్కూరు: పట్టణంలోని సాయిబాబాపేటలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. స్థానికంగా నివాసముంటున్న షేక్ మహబూబ్బాషా ఇటీవల తన తమ్ముడు షేక్ రహంతుల్లా కుమారుడు అబ్దుల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా ఆర్ఆర్ వెంచర్లో ఉన్న తమ్ముడి ఇంటికి మహబూబ్బాషా కుటుంబ సభ్యులందరూ ప్రతి రోజు రాత్రి తోడుగా వెళ్లి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని 60 తులాల వెండి, రూ. 50 వేలు, విలువైన రెండు గడియారాలు, ముక్కుపుడక అపహరించారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూసుకునే సరికి తలుపు తెరిచి ఉండటంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ పరిశీలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు.
క్రీడా కేంద్రానికి ఇద్దరు ఎంపిక
నంద్యాల(న్యూటౌన్): భారత క్రీడల శాఖ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్నూలులో ఉన్న తైక్వాండో కేంద్రానికి నంద్యాలకు చెందిన పవన్తేజ, జంషీద్ హుసేన్ ఎంపికై నట్లు నంద్యాల లయన్స్క్లబ్ కార్యదర్శి రమేష్, నంద్యాల జిల్లా పారా ఒలంపిక్ కార్యదర్శి రమణయ్యలు పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులను గురువారం ఐఎంఏ మాజీ అధ్యక్షుడు రవికృష్ణ తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో కూడిన పాఠశాలలో నిరంతర సాధన కృషి చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో వెలుగోడు మాజీ జెడ్పీటీసీ లాలుస్వామి, కోచ్లు మహబూబ్బాషా, ఉదయ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ శాఖ స్కాలర్షిప్
మంజూరు
కర్నూలు(అర్బన్): పోస్టల్ శాఖ 2024–25 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన దీనదయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పోస్టల్ సూపరింటెండెంట్ జీ.జనార్దన్రెడ్డి నగదు ఉపకార వేతనంతో పాటు ప్రశంసా పత్రాలను అందించారు. గురువారం స్థానిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పరీక్షల్లో నగరంలోని ఎన్ఆర్ పేటలోని సెయింట్ జోసఫ్ ఇంగ్లీషు మీడియం స్కూల్కు చెందిన షేక్ మహ్మద్ ఫైజాన్, ఎం.జ్యోతి స్వరూప్రెడ్డి ప్రతిభ చాటారన్నారు. వీరికి రూ.6 వేల నగదు, ప్రశంసా పత్రాలను అందించామన్నారు. ఈ నేపథ్యంలోనే పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. స్టాంపుల సేకరణ, మై స్టాంప్, ధాయి ఆఖర్ లెటర్ రైటింగ్ గురించి అవగాహన కల్పించారు.