
కన్నడ భామ రష్మికమందన్న మళ్లీ దక్షిణాదిలో అవకాశాలతో పుంజుకుంటోంది. తెలుగులో క్రేజీ నటిగా రాణించిన ఈమె ఆ తర్వాత బాలీవుడ్కు చెక్కేసింది. అక్కడ వరుసగా అవకాశాలను దక్కించుకుని నటిస్తోంది. అయితే హిందీలో ఈమె నటించిన రెండు చిత్రాలు బోల్తా కొట్టాయి. తాజాగా నటిస్తున్న యానిమల్ చిత్రంపై రష్మిక చాలా ఆశలు పెట్టుకుంది.
ఇకపోతే ప్రస్తుతం తెలుగులో పుష్ప–2, చిత్రంతోపాటు రెయిన్బో చిత్రంలో నటిస్తోంది. ఇక తమిళంలో సుల్తాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సరైన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత విజయ్కు జంటగా వారీసు చిత్రంలో నటించింది. ఆ చిత్రం సక్సెస్ అయినా, రష్మిక అందాలారబోత మినహా చేసిందేమీ లేదని విమర్శలను మూటకట్టుకుంది. అలాంటిది ఈ అమ్మడికి ఇప్పుడు మళ్లీ పాన్ ఇండియా చిత్రాలు నటించే అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటికే ధనుష్ కథానాయకుడుగా నటించే ద్విభాషా ( తమిళం, తెలుగు)చిత్రంలో రష్మిక నాయకిగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజాగా నటుడు విక్రమ్ హీరోగా నటించే పాన్ ఇండియా చిత్రంలో నటించే అవకాశం ఈ అమ్మడిని వరించినట్లు తాజా సమాచారం. ఇటీవల 2018 అనే సంచలన విజయాన్ని సాధించిన మలయాళ చిత్రం దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ తర్వాత పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇందులో నటుడు విక్రమ్ కథానాయకుడిగా నటించనున్నట్లు ఆయనకు జంటగా రష్మికమందన్నను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో నటుడు విజయ్సేతుపతి ప్రతినాయకుడిగా నటించనున్నట్లు, ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment