![145 Fell Ill After Having Biryani at Assam Government Event - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/4/biryani2.jpg.webp?itok=grxhhfoS)
డిస్పూర్: అస్సాంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ముఖ్య అతిథిగా హాజరైన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల 145 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఉన్నారు. వివరాలు.. మంగళవారం రాష్ట్రంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా డిఫు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అకాడమిక్ సెషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 8,000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక వీరందరికి బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చారు. ఇది తిన్న తర్వాత వారిలో పలువురు అస్వస్థకు గురయ్యారు. వీరిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ‘‘కార్యక్రమానికి వచ్చిన వారందరికి బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చాం. నేను కూడా అదే బిర్యానీ తిన్నాను. కాసేపటి తర్వాత అనారోగ్యానికి గురయ్యాను. చికిత్స తీసుకున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. నాతో పాటు మరో 145 మంది అస్వస్థతకు గురయ్యారు. అందరిని ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నాం. వీరిలో 28 మందిని డిశ్చార్జ్ చేయగా.. మరో 118మందికి చికిత్స కొనసాగుతోంది. అందరూ బాగానే ఉన్నారు’’ అని తెలిపారు.
(చదవండి: చద్ది బిర్యానీ పెట్టిందని వదినను..)
ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు కర్బీ ఆంగ్లాంగ్ డిప్యూటీ కమిషనర్ ఎన్జీ చంద్ర ధ్వాజా సింఘా తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి మంగళవారం రాత్రి ఆసుపత్రిలో మరణించాడు. అయితే అతను ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయాడా లేక వేరే కారణమా అనేది ఇంకా తెలియలేదు. అతడు తీసుకున్న ఆహార నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపారు. ఆసుపత్రిలో చేరిన వారు కడుపు నొప్పి, వాంతులతో బాధ పడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment