Operation Smiling Buddha: బుద్ధుడు నవ్విన వేళ | 51 Years Since India First Nuclear Test Operation Smiling Buddha, Know Its History And Unknown Facts In Telugu | Sakshi
Sakshi News home page

Operation Smiling Buddha: బుద్ధుడు నవ్విన వేళ

May 19 2025 6:29 AM | Updated on May 19 2025 4:54 PM

51 years since India first nuclear test Operation Smiling Buddha

భారత తొలి అణు పరీక్షకు 51 ఏళ్లు 

అణుసత్తాను ప్రపంచానికి చాటిన ప్రయోగం 

51 ఏళ్ల క్రితం. 1974 మే 18. ఆ రోజు థార్‌ ఎడారిలోని ఇసుక మేటల్లో పుట్టిన ‘భూకంపం’ యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘ఆపరేషన్‌ స్మైలింగ్‌ బుద్ధ’ పేరుతో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో భారత్‌ తొలి అణుపరీక్ష నిర్వహించింది.

 శాస్త్ర సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటింది. ఐరాస భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల తర్వాత అణుపరీక్ష చేసిన తొలి దేశంగా అవతరించింది. పోఖ్రాన్‌–1 న్యూక్లియర్‌ టెస్ట్‌గా పిలిచే ఈ ప్రయోగాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ సారథ్యంలో అత్యంత రహస్యంగా చేపట్టారు.

ఏ దేశాలు వ్యతిరేకించాయి? 
అణుబాంబుల బాధిత దేశమైన జపాన్‌ మొట్టమొదట ఈ పరీక్షలను తీవ్రంగా ఖండించింది. భారత్‌పై కఠిన ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. 
ఆ్రస్టేలియా సైతం ఇదే పాట పాడింది. రెండ్రోజుల తర్వాత జరిగిన ఐరాస నిరాయుదీకరణ సమావేశంలో ఆ్రస్టేలియా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ అణుబాంబురహిత అవని కోసం అంతా ఎదురుచూస్తుంటే పేలుళ్లతో అందరి ముఖం మీద భారత్‌ చెంప వాచిపోయేలా కొట్టింది’’ అని ఆ్రస్టేలియా ప్రతినిధి జాన్‌ క్యాంప్‌బెల్‌ వ్యాఖ్యానించారు. ద.కొరియా, మలేసియా, న్యూజిలాండ్‌ సైతం ఇలాగే స్పందించాయి.

అమెరికా కన్నుగప్పి...
1974 ప్రయోగంలో అణు విచ్చిత్తి సిద్ధాంతంతో తయారైన అణుబాంబును పరీక్షించారు. అత్యధిక పీడనం, ఒత్తిడితో అత్యల్ప పరిమాణంలోకి ఇమిడ్చిన ప్లుటోనియంను పేలేలా చేశారు. కేంద్రక విచ్చిత్తిలో బరువైన ఫ్లుటోనియం అణువులోని కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక ఉష్ణశక్తి వెలువడుతుంది. ఆ క్రమంలో జరిగే భారీ విస్ఫోటం పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంది. 

రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన అణుబాంబులు ఈ రకానివే. ఈ ప్రయోగం కోసం కోసం ముంబై సమీపంలోని కెనడా ఇండియా రియాక్టర్‌ యుటిలిటీ సర్వీసెస్‌ (సిరస్‌) నుంచి తెప్పించిన ఆరు కిలోల ప్లుటోనియం వాడారు. అది పేలడానికి పొలోనియం–బేరియం పేలుడు పదార్థాన్ని జతచేశారు. దాన్ని పేల్చే వ్యవస్థను చండీగఢ్, పుణెల్లో అభివృద్ధిచేశారు. షట్కోణాకృతిలోని 1,400 కిలో బాంబు అమెరికా నిఘా కంటికి చిక్కకుండా ఇసుకతో కప్పేసి రైలు మార్గాన థార్‌కు తరలించారు!

చాన్నాళ్ల క్రితమే బీజం 
అణుబాంబు తయారీ కోసం భారత్‌ 1967 నుంచే విస్తృత పరిశోధనలు మొదలు పెట్టింది. ప్రఖ్యాత అణు భౌతిక శాస్త్రవేత్త రాజా రామన్న సారథ్యంలో పీకే అయ్యంగార్, రాజగోపాల చిదంబరం వంటి 75 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అణుబాంబు తయారీలో తలమునకలయ్యారు. 1972 సెపె్టంబర్‌ 7న ప్రధాని ఇందిర బాబా ఆటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌)ను సందర్శించారు. అణుపరీక్షపై ముందుకెళ్లాలని శాస్త్రవేత్తల బృందానికి దిశానిర్దేశం చేశారు. 

ప్రయోగానికి ఒక రోజు ముందు, అంటే 1974 మే 17న రాజా రామన్నకు ఇందిర ఫోన్‌ చేశారు. ‘‘డాక్టర్‌ రామన్నా! ఇక మనమేంటో చూపిద్దాం. మనం చేసే పని దేశానికి ఎంతో మేలు చేకూరుస్తుంది’’ అన్నారు. ఆ మర్నాడు జరిగిన అణుపరీక్షకు పోఖ్రాన్‌ టెస్ట్‌ రేంజ్‌లోని ఇండియన్‌ ఆర్మీ బేస్‌ వేదికైంది. అణుపరీక్ష అత్యంత శాంతియుతంగా జరిగిందని విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రపంచదేశాలు మాత్రం భారత్‌ అణ్వస్త్ర వ్యాప్తికి పాల్పడుతోందని కుతకుతలాడాయి. మనపై ఆంక్షల కత్తి దూశాయి.

ఆ మీట నొక్కిందెవరు?
మే 18 ఉదయం 8.05 గంటలకు శాస్త్రవేత్త ప్రణబ్‌ రేబతిరంజన్‌ దస్తీదార్‌ ఫైరింగ్‌ బటన్‌ నొక్కారు. ‘‘బటన్‌ను నొక్కేందుకు అంతా ఆసక్తి చూపారు. దాంతో ట్రిగ్గర్‌ తయారీలో కీలకపాత్ర పోషించిన ప్రణబ్‌కే చాన్సివ్వాలని నిర్ణయించాం’’ అని రాజా రామన్న తన ‘ఇయర్స్‌ ఆఫ్‌ పిల్‌గ్రిమేజ్‌’ పుస్తకంలో వెల్లడించారు. నాడు బార్క్‌ గ్రూప్‌ డైరెక్టర్‌గా ఉన్న ప్రణబ్‌ తర్వాత ఐరాస అణుఇంధన సంస్థ డైరెక్టర్‌గా చేశారు. భారత తొలి దేశీయ అణుఇంధన జలాంతర్గామి తయారీలో కీలకపాత్ర పోషించారు.

‘స్మైలింగ్‌ బుద్ధ’ ఎందుకు? 
1974లో బుద్ధ పూరి్ణమ మే 18న వచి్చంది. అందుకే ప్రయోగానికి ఇందిర ఆ పేరు పెట్టారు. ఆ మేరకు సైంటిస్ట్‌ రాజా రామన్నకు రహస్య సందేశం పంపారు. ప్రయోగం విజయవంతం అయ్యాక ‘ఎట్టకేలకు బుద్ధుడు నవ్వాడు’ అంటూ ఆయన ఇందిరకు మెసేజ్‌ పంపారు.

1998లో పోఖ్రాన్‌–2 
అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో రెండు దశాబ్దాల పాటు భారత్‌ అణుపరీక్షలకు దూరంగా ఉంది. ఆ సమయంలో పుష్కలంగా కూడగట్టుకున్న అణు సాంకేతికతను జోడించి 1998లో ‘ఆపరేషన్‌ శక్తి’ పేరిట మళ్లీ అణుపరీక్షలకు దిగింది. దీన్నే పోఖ్రాన్‌–2 అని కూడా అంటారు. అప్పుడూ మే లోనే ప్రయోగం జరగడం విశేషం. అమెరికా నిఘా సంస్థ సీఐఏ కళ్లుగప్పి మే 11న థార్‌ ఎడారిలో మరోసారి దిగి్వజయంగా ప్రయోగం నిర్వహించింది. అణు, హైడ్రోజన్‌ బాంబులను ఏకకాలంలో పేలి్చంది. రెండు రోజులకు మే 13న మరో రెండు అణుబాంబులను పేల్చింది.     

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement