
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఆప్ను నిందితుల జాబితాలో ఈడీ చేర్చనున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాం కేసులో అక్రమ ధనాన్ని ఆప్ ఎన్నికల ప్రచారాల కోసం కేటాయించారని ఈడీ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఆప్ను నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో ఆప్ను కూడా నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు సమాచారం.
ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ అభ్యర్థనలను విచారించిన సుప్రీంకోర్టు.. మద్యం పాలసీ వల్ల పార్టీ లాభపడిందనే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆప్ను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అయితే.. ఆప్ని నిందితుల జాబితాలో చేర్చడంపై ఈడీ న్యాయసలహాలు తీసుకోనుంది. తదనంతరం ధర్మాసనానికి సమగ్ర సమాచారం ఇవ్వనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ బుధవారం అరెస్టు చేసింది. ఆయన మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపిస్తూ దాదాపు 10 గంటలపాటు ఢిల్లీలోని ఆయన నివాసంలోనే ప్రశ్నించింది. ఈ పరిణామాలు రాజకీయంగా సంచలనంగా మారాయి. కేంద్రంలోని బీజేపీ, ఆప్ మధ్య విమర్శలు కొనసాగాయి.
మరోవైపు.. సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తున్న సందర్భంగా ఆప్ ఎంపీ నివాసం వద్ద ఆయన మద్దతుదారులు నిరసనలు తెలిపారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను విచారించిన విషయం తెలిసిందే. మరోసారి విచారణకు రావాలని కూడా ఇటీవలే నోటీసులు ఇచ్చింది.
ఇదీ చదవండి: Lumbini and Pokhara Airport Issue: చైనా ఆటలకు నేపాల్లో భారత్ కళ్లెం!
Comments
Please login to add a commentAdd a comment