బంధువులతో కలిసి తల్లిదండ్రులను బలిచ్చిన మైనర్‌ | A Boy Kills Parents As Sacrifice To Cure Mentally Ill Brother | Sakshi
Sakshi News home page

తాంత్రిక పూజలకు తల్లిదండ్రులనే బలిచ్చిన మైనర్‌

Published Tue, Aug 9 2022 4:22 PM | Last Updated on Tue, Aug 9 2022 4:22 PM

A Boy Kills Parents As Sacrifice To Cure Mentally Ill Brother - Sakshi

రాయ్‌పుర్‌: మంత్రాలు, తాంత్రిక పూజల నెపంతో దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రాణం తీసేందుకు సైతం వెనకాడటం లేదు. అలాంటి సంఘటనే ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పుర్‌లో వెలుగు చూసింది. మానసికంగా బాధపడుతున్న సోదరుడికి నయమవుతుందని ఓ తాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి తల్లిదండ్రులనే అతి కిరాతకంగా చంపేశాడు ఓ 17 ఏళ్ల బాలుడు. అందుకు వారి బంధువులు కొందరు బాలుడికి సహకరించటం గమనార్హం. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఒకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. 

నందిగావూన్‌ గ్రామంలో మృతదేహాలను ఆగస్టు 1న స్వాధీనం చేసుకున్నట్లు రాయ్‌గఢ్‌ ఎస్పీ అభిషేక్‌ మీనా తెలిపారు. ‘ఆగస్టు 1వ తేదీన ఐపీసీ సెక్షన్‌ 302 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. మృతులు మహేశ్‌పుర్‌కు చెందిన సుక్రు యాదవ్‌(40), మన్మతి యాదవ్‌(45)లుగా గుర్తించాం.’ అని వెల్లడించారు ఎస్పీ మీనా. దర్యాప్తులో భాగంగా ఈ హత్యల్లో కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులను మరో ఏడుగురితో కలిసి తానే హత్య చేసినట్లు బాలుడు అంగీకరించాడు. 

పోలీసుల వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం నిందితుడి సోదరుడు మానసిక రోగిగా మారాడు. ఆ తర్వాత సద్గురు ఆశ్రమానికి చెందిన తాంత్రికుడు మోహన్‌ యాదవ్‌ దగ్గరకు తీసుకెళ్లారు. తల్లిదండ్రులు మంత్రాలు చేయటం ద్వారానే అతడు మానసిక రోగిగా మారినట్లు తాంత్రికుడు తెలిపాడు. వారిని హత్య చేస్తే మామూలు మనిషిలా మారతాడని సెలవిచ్చాడు. అలాగే ఆర్థిక పరిస్థితి సైతం మెరుగుపడుతుందని నమ్మించాడు. దీంతో బావ నర్సింగ్‌ యాదవ్‌, సోదరుడు రాజు రామ్‌ యాదవ్‌, భోలే శంకర్‌ యాదవ్‌, శంకర్‌ యాదవ్‌, ఖగేశ్వర్‌ యాదవ్‌, ఐశ్వర్య యాదవ్‌, దశరథ్‌ యాదవ్‌లతో కలిసి పథకం రచించాడు నిందితుడు. హత్య చేశాక మృతదేహాలను మహానది నదిలో పడేయాలని ప్రణాళిక వేశారు. నిందితుడి బావ జులై 30న ఓ వాహనం తీసుకుని భగ్వాన్‌పుర్‌కు వెళ్లాడు. అక్కడ ఓ తాడు, టవల్‌, ప్లాస్టిక్‌ సింక్‌ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత మీ కొడుకు అనారోగ్యానికి గురయ్యాడని చెప్పి బాధితులను వాహనంలో ఎక్కించుకున్నారు. సురాజ్‌గఢ్‌లోని మహానది వంతన వద్దకు తీసుకెళ్లి వారిని గొంతు కోసం హత్య చేశారు.

ఇదీ చదవండి: HIV: హెచ్‌ఐవీ పేషెంట్‌తో ప్రేమ.. ప్రాణం మీదకు తెచ్చుకుంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement