
సరిగ్గా 23 ఏళ్ల క్రితం మాయమైన కుర్రాడు ఇప్పుడు వివాహితునిగా భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ఇంటికి తిరిగివస్తే, ఆ కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంటుంది? అది ఊహకు అందదు. ఇటువంటి ఘటన గురించి విన్నవారు తెగ ఆశ్చర్యపోతారు. సరిగ్గా ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
యూపీలోని సీతాపూర్(Sitapur)లో 23 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఒక కుర్రాడిని అతని జ్ఞాపకాలు ఇంటికి తిరిగివచ్చేలా చేశాయి. ఆ కుర్రాడు వివాహితునిగా మారి భార్య, ఇద్దరు పిల్లలలో పాటు గ్రామానికి తిరిగిరావడంతో అందరూ ఆశ్యర్యపోయారు. అతనిని చూసిన తల్లి షాక్నకు గురయ్యింది. అతనిని చూసేందుకు గ్రామస్తులు క్యూ కడుతున్నారు. బాల్యంలో అతని తలకు తగిలిన గాయం ఆధారంగా ఆ తల్లి అతను తన కుమారుడేనని గుర్తించింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుడిని గుర్తించారు. 23 ఏళ్ల క్రితం ఆ బాలుని తల్లి తన కుమారుడు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇన్నాళ్లకు కుమారుడిని కలుసుకున్న ఆ తల్లి భావోద్వేగానికి గురయ్యింది. ఈ ఉదంతం రెయుసా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం రేవాన్ గ్రామానికి చెందిన అరవింద్ మౌర్య(Arvind Maurya) 2002లో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. అప్పుడు అరవింద్ వయసు దాదాపు 18 ఏళ్లు. ఆ సమయంలో అరవింద్.. సోంపు విక్రయించేవాడు. కొడుకు అదృశ్యం కావడంతో తల్లి చంపకళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు తెలిసిన అన్నిచోట్లా వెదికింది. పలుదేవాలయాల చుట్టూ తిరుగుతూ, తన కుమారుడు క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ పూజలు చేసింది.
ఇప్పుడు ఇంటికి తిరిగివచ్చిన అరవింద్.. పోలీసులకు తాను ఇన్నాళ్లూ ఎక్కడున్నదీ, ఏం చేసినదీ తెలిపాడు. తాను ఇంటి నుంచి వెళ్లిపోయిన తరువాత పంజాబ్, హర్యానా తదితర ప్రాంతాలలో ఉంటూ, ఏవో పనులు చేసుకుంటూ కాలం గడిపానని తెలిపాడు. అదేసమయంలో తనకు వివాహం జరిగిందని, ఇద్దరు పిల్లలు కూడా పుట్టారని తెలిపాడు. ఇప్పుడు తన భార్య, పిల్లల కోరిక మేరకు పంజాబ్ నుంచి తన ఇంటికి తిరిగివచ్చానని తెలిపాడు.
అరవింద్ను, అతని కుటుంబ సభ్యులను విచారించిన తర్వాత పోలీసులు ఈ మిస్సింగ్ కేసు(Missing case)ను ముగించారు. అరవింద్ భార్య పూనమ్ మాట్లాడుతూ తన అత్తమామలను కలుసుకున్నానని, ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని అన్నారు. తనకంటూ ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. కాగా అరవింద్, పూనమ్లు 2014లో పంజాబ్లో వివాహం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు..
Comments
Please login to add a commentAdd a comment