
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు చేపట్టనున్న పోరాట కార్యాచరణను ఆదివారం ప్రకటించింది. ప్రభుత్వ అణచివేతకు నిరసనగా 23న పగాడీ సంభాల్ దివస్, 24న దామన్ విరోధి దివస్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే 26న యువ కిసాన్ దివస్, 27న మజ్దూర్–కిసాన్ ఏక్తా దివస్ నిర్వహిస్తామని పేర్కొంది. కొత్త సాగు చట్టాలు రద్దయ్యే దాకా సుదీర్ఘ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని రైతు సంఘం నేత యోగేంద్ర యాదవ్ చెప్పారు.
ఆ చట్టాలు రైతులకు డెత్ వారెంట్లు: కేజ్రీవాల్
కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు డెత్ వారెంట్లు అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభివర్ణించారు. ఆయన ఆదివారం పశ్చిమ ఉత్తరప్రదేశ్కు చెందిన పలువురు రైతు సంఘాల నేతలతో విందు భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త సాగు చట్టాలను అమలు చేస్తే దేశంలో వ్యవసాయ రంగం మొత్తం కార్పొరేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.