yogendra yadav
-
సెఫాలజిస్ట్ యోగేంద్ర ప్రెడిక్షన్... శశిథరూర్ ఆసక్తికర కామెంట్స్
తిరువనంతపురం: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతగా మ్యాజిక్ఫిగర్ దాటదని ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్రయాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్ స్పందించారు. మ్యాజిక్ ఫిగర్కు కావల్సిన 272 సీట్లు బీజేపీకి ఈసారి సొంతగా రావని యోగేంద్ర ఇటీవల చెప్పారు.ఎన్డీఏ కూటమి మొత్తం కలిసి మాత్రం మెజారిటీ సీట్లు సాధిస్తుందని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి మెరుగైన సీట్లు సాధిస్తుందని జోస్యం చెప్పారు. దీనిపై శశిథరూర్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.ప్రభుత్వ వ్యతిరేకత ఫ్యాక్టర్ వల్ల బీజేపీ 230 సీట్లకు కూడా పడిపోవచ్చన్నారు. ముందు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకేనే అవకాశం ఉందని థరూర్ పేర్కొన్నారు. -
‘ఇండియా’కు మద్దతు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమికి 18 చిన్న పార్టీలు, 50కి పైగా పౌర సంఘాలు మద్దతు ప్రకటించాయి. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆ కూటమిలోని పారీ్టల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించాయి. ‘ఇండియా గెలుస్తుంది: ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సామాజిక న్యాయం కోసం జాతీయ సదస్సు‘ పేరుతో వాటి నేతలు శుక్రవారం ఇక్కడ భేటీ అయ్యారు. ముఖ్యంగా విపక్ష అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోతున్న 100 నుంచి 150 లోక్సభ స్థానాల్లో ఈసారి వారికి దన్నుగా నిలుస్తామని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 20కి పైగా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు సదస్సుకు హాజరైనట్టు చెప్పారు. -
ప్రతిపక్షాలు బీజేపీ ఉచ్చులో పడరాదు!
యూనిఫాం సివిల్ కోడ్(యూసీ సీ)పై వివాదాన్ని మళ్లీ రాజేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేపట్టిన చర్య ఊహించదగిన ప్రతిస్పందనలనే రాబట్టగలిగింది. అనేక మంది ప్రతిపక్ష నాయకులు యూసీసీకి వ్యతిరేకంగా గళమెత్తారు. ముస్లిం సంస్థలు ఒక అడుగు ముందు కేసి దీన్ని మైనారిటీలకు, రాజ్యాంగానికి విరుద్ధమైన ప్రమాదకరమైన చర్యగా ఖండించాయి. రాజ్యాంగం వాగ్దానం చేసిన సమానత్వాన్ని అందరికీ అందించడం కోసం అంటూ యూసీసీని బరిలోకి దించింది బీజేపీ. అయితే లౌకికవాద రాజకీయాలు సంప్రదాయ (మైనారిటీ) మతనాయకులతో గొంతుకలుపుతూ దానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. దీంతో విషాదకరమైన, హాస్యస్ఫోరకమైన సైద్ధాంతిక పోరాటానికి వేదిక సిద్ధమైంది. లౌకికవాదం పేరుతో ప్రతిపక్షాలు యూసీసీకి వ్యతిరేకంగా నిలబడటం ఖాయమని ఊహించే బీజేపీ ఈ చదరంగాన్ని ప్రారంభించి ఉంటుంది. ఆరెస్సెస్, బీజేపీలు చట్టవిరుద్ధంగా హిందూ మతాన్నీ, సంప్రదాయాలనూ, జాతీయవాదాన్నీ ఆక్ర మించి ముందుకు వెళుతుంటే లౌకికవాద రాజకీయాలు ఆ మేర వెనకబడిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ ముందుకు తీసుకువచ్చిన ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ ప్రతిపక్షాలు పప్పులో కాలువేసి బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్ప డటానికి కారణమవుతున్నాయి. ఈ తిరోగమనం ఆగాలంటే, లౌకిక రాజకీయాలు ఉమ్మడి పౌరస్మృతి పట్ల సూత్రప్రాయమైన, ప్రగతిశీలమైన పాత్ర పోషించాలి. యూసీసీకి ఏ ఒక్క మతానికి చెందిన ఆచారాలు, సంప్రదాయాలతో ప్రమేయం ఉండదనీ, దీని ద్వారా వివిధ మతపరమైన సమూహాల్లోనూ, సమూహాల మధ్య రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వాన్ని పాదుకొల్పడమే ప్రధాన ఉద్దేశం అనే సంగతినీ గుర్తెరగాలి. స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమానతలను తొలగించి అందరికీ ఒకే విధమైన న్యాయాన్ని ప్రదానం చేయడం దీని ఉద్దేశమని గ్రహించాలి. యూసీసీని వ్యతిరేకించడం పేలవమైన రాజకీయం! 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు లౌకికవాదులకు ఇది చెడు రాజకీయ వ్యూహం అని చెప్పక తప్పదు. ఉమ్మడి పౌర స్మృతి ఆలోచన చట్టం ముందు సరళమైన, శక్తిమంతమైన హేతుబద్ధ సమానత్వాన్ని ప్రతిపాదిస్తోంది. పౌరు లందరినీ ఒకే శిక్షాసమ్మృతి ద్వారా పాలించగలిగితే, సివిల్ కోడ్కు అదే సూత్రాన్ని ఎందుకు వర్తింపజేయకూడదు? అలాగే వివిధ సంఘాలు వారి ప్రత్యేక ఆచారాలను సంప్రదాయాలను ఆస్వా దించవచ్చు, అయితే వ్యక్తుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఏ సంఘాన్నైనా అనుమతించవచ్చా? ఒక మతం లేదా సంస్కృతికి చెందినవారు తమ ఆచారం పేరుతో సొంత సమా జంలోని మహిళల సమానత్వ హక్కును హరించడాన్ని అనుమ తించవచ్చా? ఇవి బీజేపీ వాదనలు కావు. యూసీసీ కోసం మహిళా సంస్థల అసలు డిమాండ్ వెనుక ఉన్న కారణం ఇదే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఈ న్యాయబద్ధం కాని ఆదేశిక సూత్రము (సమానత్వం)ను కలిగి ఉంది. భారత భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన సివిల్ కోడ్ను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రాజ్యాంగంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూనే ఉన్న మనలాంటి వారు ఈ కీలక సూత్రాలలో ఒకదాని నుంచి అకస్మాత్తుగా వెనుదిరగలేరు. జాతీయ ఎన్నికలకు 10 నెలల ముందు, లా కమిషన్ అంతకు ముందు తిరస్కరించిన యూసీసీనే తిరిగి ప్రవేశ పెట్టాలని బీజేపీ భావించడం మైనారిటీలను దెబ్బతీయడానికి మరొక సైట్ను తెరవడమే. కాంగ్రెస్ వంటి పార్టీలు కుటుంబ చట్టాల సంస్కరణలను హిందువుల గొంతుకపైకి నెట్టేయ గలవనీ, అయితే ముస్లింలు, క్రిస్టియన్ల విషయంలో అలా చేయడానికి ధైర్యం చేయవనీ దీని ఉద్దేశ్యం. ముస్లిం, క్రైస్తవ వర్గాల సంప్రదాయవాద నాయకత్వంతో ప్రతిపక్షాలు గొంతు కలుపు తాయని ఊహించే బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది. ఇంతకు ముందు ట్రిపుల్ తలాక్ను వ్యతిరేకించి తప్పు చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు బీజేపీ పన్నిన యూసీసీ ఉచ్చులో పడిపోతున్నాయి. ప్రతిపక్షాలు యూసీసీ ఆలోచనను వ్యతిరేకించే బదులు, ‘యూనిఫాం’ సివిల్ కోడ్ను బీజేపీ ఏ విధంగా తప్పుగా వ్యాఖ్యా నిస్తుందో చెప్పాలి. ‘యూనిఫాం’ సివిల్ కోడ్ అంటే దేశంలో బహుళ కుటుంబ చట్టాల స్థానంలో ఒకే చట్టం ఉండాలి. పైగా ఆ చట్టం అన్ని మత వర్గాల సభ్యులకు వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం కోసం ఒకే విధమైన నిబంధనలను కలిగి ఉండాలి. ఇదే ముందుకు తేవాల్సిన వెర్షన్. కానీ బీజేపీ విమర్శ కులు ప్రతిఘటిస్తున్న సంస్కరణ ఇది. ఇది రాజ్యాంగ ఆదేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే అవుతుంది. సంఘ సంస్కర్తల దార్శనికత, రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం, స్త్రీవాద ఉద్యమం డిమాండ్ వంటివి ‘ఉమ్మడి పౌరస్మృతి’ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. ఏకరూప కోడ్ అనేది ఒకే రూపంలో కానీ ఒకే సూత్రంగా కానీ ఉండదు. బదులుగా, ఇది ఉమ్మడి సూత్రాలు, విభిన్న నియ మాలను కలిగి ఉంటుంది. ఇక్కడ, ఏకరూపత అంటే అన్ని మత, సామాజిక సంఘాలు ఒకే రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఉండడం. సమానత్వ హక్కును, వివక్షకు వ్యతిరేకంగా ఉన్న హక్కును, లింగ న్యాయం ఆలోచనను ఉల్లంఘించేలా ఏ కమ్యూ నిటీకి చెందిన కుటుంబ చట్టం అనుమతించబడదు. ఈ సూత్రా లను ఉల్లంఘించే ఏ ఆచారం లేదా కుటుంబ చట్టానికి స్థానం ఉండదు. అదే సమయంలో, ఈ ఉమ్మడి సూత్రాలు వివిధ సంఘాలకు వేర్వేరు రూపాలను తీసుకోవచ్చు, వాటి ప్రస్తుత లేదా క్రోడీకరించిన పద్ధతులపై ఇది ఆధారపడి ఉంటుంది. హిందూ ఆచారాల మాదిరిగా కాకుండా, ముస్లిం వివాహం ‘నిఖా నామా’పై ఆధారపడిన ఒప్పందం. ‘యూనిఫాం’ సివిల్ కోడ్కు ముస్లింలు దీనిని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, లేదా హిందువులు దానిని స్వీకరించాల్సిన అవసరం లేదు. వివిధ సంఘాలు అందరికీ ఉద్దేశించిన రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించనంత కాలం... వివాహం, విడాకులు, దత్తత, వారసత్వా నికి సంబంధించి పూర్తిగా భిన్నమైన, పరస్మర విరుద్ధమైన ఆచా రాలు, పద్ధతులను అనుసరించడం కొనసాగించవచ్చు. చాలా కాలంగా, లౌకిక రాజకీయాలు బీజేపీ చొరబడిన నేలను ఖాళీ చేశాయి. ప్రతిపక్షాల ఈ స్వీయ–ఓటమి రాజకీ యాలకు యూసీసీ మరొక ఉదాహరణగా మారకూడదు. బీజేపీ రచించిన స్క్రిప్ట్ ప్రకారం ఆడటానికి, మైనారిటీ వర్గాల సంప్రదాయవాద నాయకత్వంతో చేతులు కలపడానికి బదులుగా, లౌకిక రాజకీయాలు బీజేపీ బుకాయింపునకు ఎదు రొడ్డాలి. ప్రతిపాదిత యూసీసీ గణనీయమైన ముసాయిదాను సమర్పించమని అడగాలి. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు (‘ద ప్రింట్’ సౌజన్యంతో) -
పాఠ్యపుస్తకాల సలహాదారులుగా కొనసాగలేం
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైయినింగ్(ఎన్సీఈఆర్టీ) పాఠ్యపుస్తకాల సిలబస్లో కోతలపై ప్రధాన సలహాదారులుగా వ్యవహరిస్తున్న సుహాస్ పల్షికర్, యోగేంద్ర యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 9 నుంచి 12వ తరగతి వరకు పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకాల సిలబస్ నుంచి కొన్ని అంశాల తొలగింపు ఏకపక్షంగా, అహేతుకంగా ఉందని వారు పేర్కొన్నారు. హేతుబద్ధీకరణ అంటూ పాఠ్యాంశాలను వికృతీకరించి, వాటిని విద్యాపరంగా పనికిరానివిగా మార్చారని ఆరోపించారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అభిప్రాయం తెలుసుకోకుండా ఎన్సీఈఆర్టీ తీసుకున్న ఈ చర్య ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఆయా పాఠ్యపుస్తకాల్లో ప్రధాన సలహాదారుల జాబితాలో ఉన్న తమ పేర్లను వెంటనే తొలగించాలని కోరుతూ ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీకి లేఖ రాశారు. మహాత్మాగాంధీ మరణం దేశంలో మత సామరస్యతపై చూపిన సానుకూల ప్రభావం, ఆర్ఎస్ఎస్పై కొంతకాలం నిషేధం, 2002లో గుజరాత్ అల్లర్లు వంటి విషయాలను సిలబస్ నుంచి తొలగిస్తూ గత నెలలో ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. 2006–07లో ముద్రించిన ఎన్సీఈఆర్టీ 9 నుంచి 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాలకు వీరిద్దరూ ప్రధాన సలహాదారులుగా ఉన్నారు. పల్షికర్, యోగేంద్ర యాదవ్ రాజనీతి శాస్త్ర నిపుణులు. కాగా, యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అనే సంస్థను నడుపుతున్నారు. -
నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్..
Chitrangada Make Film Youngest Param Vir Chakra Awardee Yogendra Yadav: యే సాలీ జిందగీ, దేశీ బాయ్స్, ఐ, మీ ఔర్ మే, బజార్, బాబ్ బిస్వాస్ వంటి చిత్రాలతో నటిగా మంచిల గుర్తింపు తెచ్చుకుంది మోడల్, బ్యూటిఫుల్ హీరోయిన్ చిత్రాంగద సింగ్. 2018లో వచ్చిన 'సూర్మా' చిత్రంతో నిర్మాతగా కూడా మారింది. ఇప్పుడు తాజాగా మరో సినిమాకు నిర్మాతగా మారనుంది ఈ మోడల్. కార్గిల్ యుద్ధంలో పోరాడి 19 ఏళ్ల వయసులో పరమ వీర చక్ర అవార్డు అందుకున్న సుబేదార్ యోగేంద్ర యాదవ్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులు చేజిక్కించుకున్నట్లు శనివారం (జులై 30) చిత్రాంగద తెలిపింది. ''నిజమైన హీరోల గురించి, మన మధ్యలో తిరుగుతూ మరుగున పడిన గొప్ప వ్యక్తుల కథల్ని చెప్పడం నాకు ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. వాళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని, జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవసరం ఎంతైనా ఉంది. నిర్మాతగా 'సూర్మా' తర్వాత ఇది నా రెండో ప్రయత్నం' అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. సీఎస్ ఫిల్మ్స్ దీపక్ సింగ్తో కలిసి సంయుక్తంగా ఈ బయోపిక్ను నిర్మించనుంది చిత్రాంగదా. -
రైతు ఆదాయంపై అర్ధసత్యాలు
దేశంలోని రైతు కుటుంబాల పరిస్థితిపై ఇటీవలే వెలుగులోకి వచ్చిన జాతీయ గణాంకాల సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్) సర్వే వెల్లడించిన వాస్తవాలకంటే అది దాచిపెట్టిన నిజాలే ఎక్కువగా ఉంటున్నాయి. సగటు రైతు కుటుంబం నెలకు రూ. 10 వేల వరకు సంపాదిస్తోందని ఈ సర్వే చెబుతోంది కానీ, అది అర్ధసత్యం మాత్రమే. రైతు సంపాదిస్తున్న ప్రతి రూపాయి, సాగు ద్వారా మాత్రమే రావడం లేదు. ఇతర శ్రమలు, ద్రవ్యోల్బణం వంటివి తీసివేస్తే, పంట సాగు ద్వారా రైతుకు వచ్చే నెలవారీ ఆదాయం రూ. 3,798 మాత్రమే. మొత్తం రైతు కుటుంబ ఆదాయంలో ఇది చాలా చిన్న భాగమనే వాస్తవాన్ని ఈ సర్వే దాచిపెట్టింది. ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోని ఈ సగటు గణాంకాలు అటు రైతులకూ, ఇటు దేశానికీ మేలుకొలుపు కావాలి. దేశంలో గత కొద్ది నెలలుగా సాగుతున్న రైతుల ఉద్యమంలో బాగా ప్రాచుర్యం పొందిన నినాదాల్లో ‘మా తిండికోసం, మా పంటకోసం’ మేం పోరాడుతున్నాం అనేది ఒకటి. దేశంలోని రైతుల పరిస్థితులపై తాజాగా వెలువడిన ఒక అధికారిక సర్వే, ఈ నినాదం సంపూర్ణ సత్యమని చూపిస్తోంది. 2021 సెప్టెంబర్ 10న ప్రకటించిన కేంద్రప్రభుత్వ కీలక నివేదిక వెల్లడిస్తున్న అంశాలు... మన విధాన నిర్ణేతలు, రాజకీయ నేతలకు మాత్రమే కాకుండా రైతులు, రైతుల ఉద్యమాలకు కూడా మేలుకొలుపు కలిగిస్తున్నాయి. గ్రామీణ భారతంలో 2019లో వ్యవసాయ కుటుంబాలు, వారి స్వాధీనంలో ఉన్న భూమి, పశుగణం తదితరాల పరిస్థితి అంచనాపై ఎన్ఎస్ఎస్ 77వ నివేదిక పట్ల దేశం ఎంతో ఆసక్తితో వేచి చూసింది. ఎట్టకేలకు విడుదలైన ఆ సర్వే నివేదిక ప్రధానంగా ఒక అంశంపై దృష్టి పెట్టింది. సగటు వ్యవసాయ కుటుంబంపై ఉన్న రుణభారం రూ. 47 వేలనుంచి రూ. 74 వేలకు అమాంతంగా పెరిగిపోయిందని ఈ సర్వే తెలిపింది. ఇది కలవరపెట్టే అంశం. రైతుల పరిస్థితి మెరుగవుతోంది అని చెబుతున్న తరుణంలోనే వారు చెల్లించాల్సిన బకాయిలు అధికంగా పేరుకుపోతున్నాయి. కాని ఇది వ్యాధికాదు, వ్యాధి లక్షణం మాత్రమే. అసలైన సమస్య ఏదంటే రైతు ఆదాయమే. లేదా ఆదాయం లేకపోవడమేనని చెప్పాలి. రైతుల ఆదాయం గురించి ఈ సర్వే ఏం చెబుతోందంటే... దేశంలో సగటు రైతు కుటుంబం నెలకు రూ. 10 వేల దాకా ఆదాయం సంపాదిస్తోంది. నిజానికి పట్టణాల్లోని ఇళ్లలో పనిచేస్తున్న వారు సంపాదించే ఆదాయం కంటే ఇది తక్కువ. 2013లో నిర్వహించిన ఇదే సర్వేలో రైతు కుటుంబం నెలవారీ ఆదాయం రూ. 6,442లు ఉండగా, ఆరేళ్ల తర్వాత అంటే 2019లో సగటు రైతు కుటుంబం ఆదాయం రూ. 10,218లకు పెరిగింది. ఈ లెక్కలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. పైగా, ఇవి వెల్లడించిన అంశాల కంటే దాచి ఉంచినవే ఎక్కువ. ఈ లెక్కలు సగటు రైతు కుటుంబం నెలకు రూ. 10 వేల కంటే ఎక్కువ సంపాదిస్తోందన్న అభిప్రాయం కలిగిస్తున్నాయి. రైతు కుటుంబం మూల ఆదాయం తక్కువగానే ఉంటున్నప్పటికీ, అది హేతుపూర్వక రీతిలో పెరుగుతోందని ఈ లెక్కలు చెబుతున్నాయి. దీనికంటే వాస్తవాన్ని కప్పిపుచ్చే అంశం మరొకటి ఉండదు. ఇదెలాగో చూద్దాం మరి. ఎన్ఎస్ఎస్ సర్వే గణాంకాలతో సమస్య మొదటగా, రైతుల ఆదాయం అని చెబుతున్నది సగటు కుటుంబ ఆదాయమే కాబట్టి ఇది వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోంది. పదెకరాల కంటే ఎక్కువ భూమి కలిగి నెలకు దాదాపుగా రూ. 30 వేల వరకు సంపాదిస్తున్న బడా రైతులను కూడా సగటు కుటుంబాలలో కలిపేశారు. బడా రైతు కుటుంబాలు సంపాదిస్తున్న ఈ మొత్తం కంటే ప్రభుత్వంలోని నాలుగో గ్రేడ్ ఉద్యోగి సంపాదించేదే ఎక్కువగా ఉంటుందని గమనించాలి. ఒకటి నుంచి 2.5 హెక్టార్ల వరకు భూమిని సాగు చేస్తున్న మధ్యతరగతి రైతు కుటుంబ ఆదాయం నెలకు రూ. 8,571ల కంటే తక్కువగానే ఉంటుంది. రెండోది, ఇది వ్యవసాయం ద్వారా వస్తున్న ఆదాయం కాదు. వ్యవసాయ కుటుంబం సంపాదిస్తున్న ఆదాయం. ఈ రెండింటికి తేడాను అర్థం చేసుకోవడమే చాలా కీలకమైంది. రైతు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ రైతు కాదు. రైతు సంపాదిస్తున్న ప్రతి రూపాయి వ్యవసాయం ద్వారా మాత్రమే రావడం లేదు. వ్యవసాయ కుటుంబం అనే భావనను ఈ సర్వే విస్తృత ప్రాతిపదికన నిర్వచిస్తోంది. గ్రామీణ వ్యవసాయ కుటుంబం పంటల ద్వారా, లేక పశుపెంపకం ద్వారా అతి తక్కువ ఆదాయం మాత్రమే సంపాదిస్తున్నాయి. రైతు కుటుంబంలో తండ్రి పొలం పని చేస్తే, తల్లి పశువులను మేపుతుంది. కుమార్తె స్థానిక పాఠశాలలో బోధిస్తుంటే, రైతు కుమారుడు షాపు నడుపుతుంటాడు. వ్యవసాయ కుటుంబం ఇలాగే ఉంటుంది. ఒక రైతు కుటుంబం సంపాదిస్తున్న ఈ నాలుగు రకాల ఆదాయాన్ని కలిపేసి ఈ మొత్తాన్ని వ్యవసాయ కుటుంబ ఆదాయంగా లెక్కిస్తున్నారు. మొత్తంమీద చూస్తే పంట సాగు ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రైతు ఆదాయంలో చాలా చిన్న భాగం. ఇది ఊహాజనితమైన ఉదాహరణ కాదు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం రైతు కుటుంబం సంపాదించే ఆదాయంలో మూడోవంతు మాత్రమేనని తాజా సర్వే చెబుతోంది. ఒక నెలలో సగటు రైతు కుటుంబం రకరకాల పంటల సాగు ద్వారా రూ. 3,798లు సంపాదిస్తోంది. ఇక పశువుల పెంపకం ద్వారా రూ. 1,582లను, వ్యాపారం నుంచి రూ. 641లను, కూలీలు, వేతనాల ద్వారా రూ. 4,063లను ఆర్జిస్తోంది. మరో మాటలో చెప్పాలంటే, రైతు కుటుంబం తన సొంత భూముల్లో పనిచేయడం కంటే తన శ్రమను ఇతరత్రా వెచ్చించడం ద్వారానే ఎక్కువగా సంపాదిస్తోంది. కాబట్టి పైన చెప్పినట్లుగా రైతు వ్యవసాయం ద్వారా వస్తున్న ఆదాయం రూ. 3,798లు మాత్రమే. మన రైతులు ఎందుకు పట్టణాలు, నగరాలకు పరుగెడుతున్నారో, ప్రభుత్వోద్యోగాలకు ప్రతి ఒక్కరూ ఎందుకింతగా వెంపర్లాడుతున్నారో దీన్ని బట్టే అర్థమవుతుంది. మూడు, ఈ కనీస మొత్తాన్ని కూడా అతిశయించి చెబుతున్నారు. రైతు ఆదాయాన్ని అధికం చేసి చూపడంలో సర్వే పరిమితి దాటినట్లుంది. రైతుచేతికి వస్తున్న డబ్బు మొత్తంగా వ్యవసాయ ఉత్పత్తులను అమ్మగా వస్తున్నదేనని ఈ లెక్కలు చెబుతున్నాయి. పంటల సాగుకు అయ్యే ఖర్చులన్నీంటినీ రైతు నేరుగా చెల్లించిన తర్వాత రైతుకు మిగులుతున్న ఆదాయంగా ఇవి సూచిస్తున్నాయి. ఈ వ్యత్యాసమే రైతుకు లాభం అని అంచనా వేశారు. రైతు కుటుంబం సొంత శ్రమ, ఇతర పెట్టుబడులను సాగు ఖర్చులో కలపడం లేదు. నగదు రూపంలో చెల్లించని ఈ మొత్తాల విలువను కూడా లెక్కించినట్లయితే, మొత్తం పంట సాగు ఖర్చు, వశుపెంపకం ఖర్చులు ఎక్కువై రైతు లాభం అంటున్నది తగ్గిపోతుంది. ఈ సరైన పద్ధతిని మీరు అనుసరిస్తే, పంట సాగు ద్వారా రైతుకుటుంబానికి వచ్చే నెలవారీ ఆదాయం కేవలం రూ. 3,058లకు, పశుపెంపకం ద్వారా వచ్చే ఆదాయం రూ. 441లకు పడిపోతుంది. ఈ లెక్కన రైతు కుటుంబం మొత్తం ఆదాయం నెలకు రూ. 8,337లు మాత్రమే అని స్పష్టమవుతుంది. నాలుగు, రైతుల ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల కనిపిస్తోందంటూ సర్వే చెబుతున్నది అసత్యం. ఎందుకంటే ఇది ద్రవ్యోల్బ ణాన్ని లెక్కలోకి తీసుకోని సాధారణ లెక్కలు. 2013, 2019 మధ్యకాలంలో అంటే అప్పటి, ప్రస్తుత సర్వే నిర్వహించిన మధ్య కాలంలో రైతుల నామమాత్రపు ఆదాయం 59 శాతం పెరిగింది. కానీ ఈ లెక్కలను మీరు ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినట్లయితే, (2019 కోసం గ్రామీణ భారత్కి వినియోగదారీ ధరల సూచి, బేస్ ఇయర్ 2012), రైతు ఆదాయం పెరుగుదల 22 శాతం మాత్రమే. అంటే ముందే చెప్పినట్లుగా ఇది రైతు కుటుంబం మొత్తానికి అన్ని రకాల ఆదాయాలు కలిసి వచ్చిన ఆదాయ పెరుగుదల అన్నమాట. పంట సాగు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మాత్రమే మనం చూసినట్లయితే, ఈ ఆరు సంవత్సరాల్లో రైతు కుటుంబం ఆదాయం వాస్తవానికి క్షీణించిపోయింది. 2013లో రైతు పంట సాగు ద్వారా రూ. 3,081లు సంపాదించేవాడు. 2012 బేస్ ఇయర్లో ధర ప్రకారం ఇది రూ. 2,770లకు సమానం. ఈ బేస్ ఇయర్ని మనం నిలుపుకున్నట్లయితే, రైతుల తాజా నెలవారీ ఆదాయం (రూ. 3,798) కేవలం రూ. 2,645లకు సమానం. అంటే గత ఆరేళ్లలో రైతుల ఆదాయం 5 శాతం తగ్గిపోయిందన్నమాట. కాబట్టి ఈ సర్వేకి వాస్తవమైన శీర్షిక ఇలా ఉంటే యుక్తంగా ఉంటుంది. ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే చారిత్రాత్మక మిషన్ నిజానికి చారిత్రాత్మక తిరోగమనానికి దారితీస్తోంది’. యోగేంద్రయాదవ్ వ్యాసకర్త జై కిసాన్ ఆందోళన్ సహ సంస్థాపకుడు, స్వరాజ్ ఇండియా సభ్యుడు -
ఈ విజయం... నూతన శుభోదయం
ప్రపంచ క్రీడారంగంలో ఎన్నో ఆశలతో అడుగుపెడుతున్న దుర్బలులకు 1970లలో హాకీ, 1980ల వరకు క్రికెట్ ఓ గర్వకారణంగా, ఒక సామాజిక హోదాగా ప్రాతినిధ్యం వహించేవి. ఆనాటి భారతీయ హాకీ మా తరానికీ, మన జాతీయ గర్వానికీ ప్రతీకగా నిలిచి ఉండేది. ప్రస్తుతం క్రికెట్ చుట్టూ అలుముకుంటున్న జనబాహుళ్యపు ఉన్మాదం మన సాంస్కృతిక మొరటుదనానికి ప్రతీకగా ఉంటోంది. అవమానాల పాలైన భారతీయులకు – నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దేశం పొందుతూ వచ్చిన అన్ని వైఫల్యాలకు చికిత్సలాగా అప్పట్లో క్రికెట్ హీరోలు రంగంమీది కొచ్చారు. కానీ నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడు భారతీయ హాకీ సాధించిన ఈ పునరుజ్జీవనం... మరొక ప్రగాఢమైన, సానుకూల జాతీయవాదం మనలో ఇప్పటికీ మనగలుగుతోందని అందరికీ హామీనిచ్చింది. మరుగునపడి ఉండవచ్చు కానీ అది మన జాతీయ చైతన్యం నుంచి మాత్రం తొలగిపోలేదు. సాధారణంగా నేను పెందలకడనే లేచే వ్యక్తిని కాదు. కానీ ఈ మంగళవారం ఉదయం నాకు భిన్నంగా కనిపించింది. ఒలింపిక్ హాకీ సెమీ ఫైనల్లో భారత్–బెల్జియం మ్యాచ్ చూడటం కోసం నేనూ నాతోపాటు కుటుంబం మొత్తంగా త్వరగా నిద్రలేచాం. ఇరు జట్లమధ్య జరిగిన పోటీ అసంఖ్యాక భారతీయ అభిమానులకు లాగే మమ్మల్ని కూడా పరవశం నుంచి, ఆందోళన, బాధవరకు అనేక అనుభూతులతో కదిలించివేసింది. నిజానికి భారత హాకీ జట్టు గొప్పగా ఆడింది. కానీ ఆ పోటీలో ఓడిపోవడం మాకు అవమానం కలిగించలేదు. అంతకుముందు హార్దిక్ సింగ్ బ్రిటన్ జట్టుపై చేసిన ఏకైక, అద్భుతమైన గోల్ను చూస్తున్నప్పుడు కలిగిన ఆ మొదటి ఆనందం ఇప్పటికీ మనసులోంచి తొలిగిపోలేదు. లేదా మన మహిళల హాకీ జట్టు ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు కలిగిన చక్ దే మూమెంట్ గర్వాతిశయాన్ని కూడా మర్చిపోలేదు. ఆ ఘటన నాకు దాదాపు 50 ఏళ్ల క్రితం నాటి నా పాఠశాల రోజులను గుర్తుకు తెచ్చింది. నేను చదువుకున్న శ్రీ గంగానగర్ లోని ఎస్జీఎన్ ఖల్సా హయ్యర్ సెకండరీ స్కూల్లో గ్రామీణ సిక్కు అబ్బాయిలు ఎక్కువగా ఉండి ఆటలకు ఎంతో పేరుపొందింది. ఆ రోజుల్లో రాజస్తాన్ తరపున ఆడుతున్న 11 మందిలో 6 నుంచి 8 మంది సభ్యులు మా స్కూలుకి చెందినవారే. తర్వాత నేను చదివిన ఎస్జీఎన్ ఖల్సా కాలేజీ కూడా హాకీ, అథ్లెటిక్స్లో అదే రకమైన పేరు కలిగి వుండేది. నా తోటివారి లాగే నేను కూడా అప్పట్లో హాకీకి పెద్ద అభిమానిగా ఉండేవాడిని. అప్పటికే భారతీయ హాకీ తన స్వర్ణ యుగాన్ని దాటేసింది కానీ అంతర్జాతీయ ప్రతిష్ట, గుర్తింపు నుంచి ఇంకా దూరం కాలేదు. 1975లో కౌలాలంపూర్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన గేమ్లో అస్లామ్ షేర్ ఖాన్ చివరి నిమిషంలో చేసిన గోల్ మన హాకీ వైభవాన్ని నిర్వచించిన ఘటనగా మిగి లిపోయింది. ఆనాటి భారతీయ హాకీ మా తరానికీ, మన జాతీయ గర్వానికీ ప్రతీకగా నిలిచి ఉండేది. అలాగని మన జట్టు కచ్చితంగా గెలుస్తుందని చెప్పలేం కానీ దానికి ఒక ప్రతిష్ట అంటూ ఉండేది. నా తరంలో చాలామందికి లాగే, హాకీ పట్ల నా అనురక్తి మెల్లగా క్రికెట్ వైపుకు మళ్లింది. 1974–75 శీతాకాలం సీజన్లో క్లైవ్ లాయిడ్ జట్టు భారత్కు రావడంతో అది మొదలైంది. ఈ సీరీస్లోనే గార్డన్ గ్రీనిడ్జ్, వివియన్ రిచర్డ్స్, ఆండీ రాబర్ట్స్ తమ తొలి మ్యాచ్ ఆడారు. నాకు వ్యక్తిగతంగా జి. విశ్వనాథ్, బ్రిజేష్ పటేల్, బీఎస్ చంద్రశేఖర్ అంటే చాలా ఇష్టం. వీరంతా కర్ణాటకకు చెందినవారే. ఆ పోటీలో భారత్ సిరీస్ కోల్పోయింది కానీ తన గౌరవాన్ని మాత్రం నిలబెట్టుకుంది. 1976 ఒలింపిక్స్లో ఆస్ట్రో టర్ఫ్ని ప్రవేశపెట్టడంతో భారతీయ హాకీ ప్రాభవం మళ్లీ పుంజుకోలేనంతగా పతనమార్గం పట్టింది. 1980 నాటి మాస్కో ఒలింపిక్స్లో సులభంగా మన జట్టు స్వర్ణం సాధించిం దనుకోండి. ఆ సమయంలోనే క్రికెట్ ఆటకు ప్రాచుర్యం పెరగడం, 1983 ప్రపంచ కప్లో భారత క్రికెట్ జట్టు డ్రీమ్ విక్టరీ సాధించడం కాకతాళీయంగా జరిగిపోయింది. మా స్నేహితులు కొందరు ముందుకొచ్చి స్థానిక క్రికెట్ టీమ్ను నెలకొల్పారు. దానికి ఎలెవన్ స్టార్ క్లబ్ అని మహా గొప్ప పేరుండేది. అప్పటికింకా ప్రారంభించని నూతన ఏపీఎంసీ మైదానం మా క్రికెట్ గ్రౌండ్గా ఉండేది. క్రమంగా క్రికెట్ స్టార్లు (ఈ జాబితాలో నేను కపిల్ దేవ్ను చేర్చాను) కొత్త జాతీయ హీరోలు అయ్యారు. భారతజట్టు అప్పటికీ ప్రాధాన్యత లేని జట్టుగానే ఉండేది. ప్రత్యర్థులను అçప్పుడప్పుడూ ఓడిస్తూ మన గర్వాన్ని కాస్త పెంచుతూ వచ్చేది. భారత్ ఆడనప్పుడు నేను వెస్టిండీస్కి చెందిన వివియన్ రిచర్డ్స్, పాకిస్తాన్ ఆటగాడు జహీర్ అబ్బాస్ను ఆరాధించేవాడిని. మూడో ప్రపంచ దేశాలకు, అలీనోద్యమానికి సంఘీభావం తెలుపుతున్న రోజులవి. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు నేను క్రీడా ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాను. క్రికెట్ పట్ల నా ఆసక్తిని నా వృత్తిపట్ల అనురక్తి కనుమరుగు చేస్తూ వచ్చింది. హాకీ గతించిన జ్ఞాపకంలా ఉండేది. అలాంటి సమయంలో ‘లగాన్’ మళ్లీ ప్రేరణ కలిగించింది కానీ క్రికెట్ పట్ల నా ఆసక్తిని మాత్రం పెంచలేకపోయింది. ‘చక్ దే! ఇండియా’ భారత్ని ఆనందభాష్పాలతో ముంచెత్తింది కానీ వాస్తవ ప్రపంచంలో అలాంటిది ఏదీ మిగలలేదు. ఆ తర్వాత నా కుమారుడు కొన్నేళ్ల క్రితం నాలోని క్రీడాసక్తిని తిరిగి వెలిగించిన సమయానికి క్రికెట్ కొత్త గేమ్గా అవతరించింది. ట్వంటీ 20 టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ని, పేస్ని కూడా మార్చేసింది. ఈ సరికొత్త మార్పులను నేను చిన్నచూపు చూడలేదు. టీ20 మ్యాచ్లంటే నాకు ఇష్టం. సిక్సర్ల విందును మనం ఎందుకు ఆస్వాదించకూడదు? బ్యాట్స్మన్ల కోసం రూపొందిన ఒక ఫార్మాట్ ఇప్పుడు బౌలర్లకు స్వర్గధామం కావడం చూసి ఆశ్చర్యపడుతుంటాను. ఇప్పుడు భారతీయ క్రికెట్లోని ఈ టాలెంట్ పూల్ని చూసి నిజంగానే దిగ్భ్రాంతి చెందుతున్నాను. ఇప్పుడు క్రికెట్ ఒక విస్తరించిన వినోద పరిశ్రమగా మారిపోయింది. మనం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ హబ్కి చెందినవారమని నాకు తెలుసు. కానీ నా జాతీయ స్వీయగౌరవానికి అది అదనంగా దేన్నీ జోడించదు. ముఖానికి రంగు పూసుకుని, టీషర్టులు ధరించి ఇంటా బయటా క్రికెట్ చూస్తున్న భారతీయ అభిమానులను చూస్తుంటాను. కానీ వారి ఆనందపు అరుపులు, హోరుకేకల్లో నేను భాగం కాలేదు. 2007లో టీ20 ప్రపంచ కప్లో మన విజయం 1983 ప్రపంచకప్, 1975 ప్రపంచ హాకీ కప్ విజయంతో సమానమైంది కాదని నా అభిప్రాయం. ఈసారి ఒలింపిక్స్లో మన హాకీ జట్లపై కూడా నా అభిప్రాయం ఇదే. హాకీ కూడా మారిందనడంలో సందేహమే లేదు. నాలుగు క్వార్టర్ల ఫార్మాట్, గేమ్ తీరు, కొత్త నిబంధనలు చోటు చేసుకున్నప్పటికి మౌలికంగా అది ఒకనాటి క్రీడనే తలపిస్తుంది. ఆస్ట్రేలియా జట్టుపై భారత మహిళా జట్టు నెగ్గినప్పుడు 46 ఏళ్ల క్రితం అజిత్ పాల్ సింగ్ నేతృత్వంలోని జట్టు సాధించిన విజయానుభూతులను మళ్లీ గుర్తుకు తెచ్చాయి. ఇప్పటి మన మహిళా హాకీ ప్లేయర్ల విజయగాథలు 1970ల నాటి భారతీయ హాకీ క్రీడాకారుల విజయగా«థలకు తీసిపోవు. ఒలింపిక్ పతకాలు మనవాళ్లు గెలవకపోయినా నేను లెక్క చేయను. (భారత పురుషుల హాకీ టీమ్ కాంస్యం దక్కించుకోగా, శుక్రవారం గ్రేట్ బ్రిటన్తో జరిగిన ఉత్కంఠభరిత పోటీలో మన మహిళల టీమ్ తృటిలో కాంస్యం చేజార్చుకుంది.). ఒకటి మాత్రం నిజం మన పురుషులు, మహిళల హాకీ టీమ్ గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఇప్పుడు మన జాతీయ సంకేతాలుగా నిలుస్తారు. ఇది నా కథ మాత్రమే కాదు. వలస పాలనానంతర జాతీయవాదం నుంచి కఠినమైన అల్ట్రా జాతీయవాదం పెరుగుతున్న ప్రస్తుత సమయంలో ఇది ఒక తరం గాథ కూడా. క్రికెట్ చుట్టూ వలసవాద రాజకీయాల కథపై రాసిన ఆశీష్ నంది మనకో విషయం గుర్తుచేశారు. ‘మూలాలు మర్చిపోయిన, అవమానాల పాలైన, సంస్కృతి కోల్పోయిన భారతీయులకు– నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దేశం పొందుతూ వచ్చిన అన్ని వైఫల్యాలకు చికిత్సలాగా క్రికెట్ హీరోలు రంగంమీదికొచ్చారు’. ఈ నేపథ్యంలో భారతీయ హాకీ పునరుజ్జీవనం మరొక ప్రగాఢమైన, సానుకూల జాతీయవాదం మనలో ఇప్పటికీ మనగలుగుతోం దని నాకు హామీ ఇస్తోంది. అది మరుగున పడి ఉండవచ్చు కానీ మన జాతీయ చైతన్యం నుంచి మాత్రం తొలగిపోలేదు. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ సంస్థాపకులు (‘ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఈ ఫలితాలు కారుచీకట్లో కాంతిరేఖలు
ఆధునిక కాలంలో ఒక రాజకీయ అశ్వమేధ యజ్ఞం భగ్నమైంది. ఒక ఇంద్రజాల ప్రదర్శన మధ్యలోనే విచ్ఛిన్నమైపోయింది. అధికారం కోసం ఇంత తీవ్రాతితీవ్రమైన ప్రయత్నం ఈ మధ్యకాలంలో ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదు. బీజేపీ తన ఆధిపత్యాన్ని స్థిరపర్చుకోవాలంటే బెంగాల్ ఆ పార్టీ దాటవలసిన చివరి సరిహద్దుగా ఉండింది. అందుకే డబ్బు, మీడియా, సంస్థాగత యంత్రాంగం, చివరకు నరేంద్ర మోదీ.. ఇలా దేన్నీ, ఎవరినీ బీజేపీ వదిలిపెట్టకుండా రంగంలోకి దింపింది. కానీ బీజేపీని బెంగాల్లో ప్రజలు ఓడించారు. ఘోరావమానాల పాలు చేశారు. ఈసారి తీర్పు భిన్నమైంది. ప్రతిపక్షాలకు ఇది ఒక మార్గాన్ని చూపింది. ఏం చేయకూడదు అని గుర్తించినట్లయితేనే మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలం. ఎట్టకేలకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఈ చీకటి దినాల్లో తప్పనిసరిగా అవసరమైన ప్రారంభం ఇది. ఏం చేయకూడదు అని మనం గుర్తించినట్లయితేనే మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలం. సాధారణ ఎన్నికల రాజకీయాల గణాంకాలను దాటి చూస్తే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు నిజంగానే అద్భుతమని చెప్పాలి. సాధారణ సమయాల్లో ఒక జనరంజక ముఖ్యమంత్రి మూడోసారి కూడా అధికారంలోకి రావడం గొప్ప విశేషమేమీ కాదు. కానీ బీజేపీ ఓటు షేర్ పెరగడం గొప్ప ముందంజ గానే గుర్తించాల్సి ఉంటుంది. ముగ్గురు ఎమ్మెల్యేలను మాత్రమే కలిగివున్న ఒక రాజ కీయ పార్టీ నిజమైన ప్రతిపక్ష పార్టీగా అవతరించడంపై వేడుకలు జరుపుకోవడాన్ని పూర్తిగా సమర్థించవచ్చు. కాని ఇది సాధారణ ఎన్నికలు కావు. అధికారాన్ని కొల్లగట్టడానికి ఇంత తీవ్రాతితీవ్రమైన ప్రయత్నం ఈ మధ్యకాలంలో ఏ రాష్ట్రం లోనూ జరిగి ఉండదు. బీజేపీ తన ఆధిపత్యాన్ని స్థిరపర్చుకోవాలంటే బెంగాల్ ఆ పార్టీ దాటవలసిన చివరి సరిహద్దుగా ఉండింది. అందుకే సర్వతోముఖ దాడి ప్రారంభించడానికి బీజేపీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ఎంచుకుంది. డబ్బు, మీడియా, సంస్థాగత యంత్రాంగం, చివరకు నరేంద్ర మోదీ.. ఇలా దేన్నీ, ఎవరినీ బీజేపీ వదిలిపెట్టకుండా రంగంలోకి దింపింది. ఎన్నికల కమిషన్కు ఉన్న పవిత్రత నుంచి, కేంద్ర భద్రతా బలగాల తటస్థత, కోవిడ్ నిబంధనల వరకు ప్రతి అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మల్చుకుంది. బీజేపీ నేతలు తమ విజయాలను ఏకరువు పెట్టడం బెంగాల్ ఎన్నికల్లో జరిగినట్లుగా ఎక్కడా జరగలేదు. అయినప్పటికీ బీజేపీని బెంగాల్లో ప్రజలు ఓడించారు. ఘోరావమానాల పాలు చేశారు. ఆధునిక కాలంలో ఒక రాజకీయ అశ్వమేధ యజ్ఞం భగ్నమైంది. ఒక ఇంద్రజాల ప్రదర్శన మధ్యలోనే విచ్ఛిన్నమైపోయింది. బెంగాల్ని బీజేపీ కనుక కైవసం చేసుకుని ఉంటే ఏం జరిగి ఉండేదో కాస్త ఊహించండి మరి. వేడుకలు, విజయధ్వానాలు మరోవైపు ప్రతిపక్షంలో భయాందోళనలు.. కాని మన గణతంత్ర ప్రజాస్వామ్యం ఒక్క రోజులోనే తన స్థానాన్ని, ఔన్నత్యాన్ని గొప్పగా ప్రకటించుకుంది. కేంద్రపాలకులకు ఇంత భంగపాటు కలగడంతో అనూహ్య అవకాశాలకు వీలుకల్పించినట్లయింది. మనం ఇప్పుడు కరోనా మహమ్మారి సుడిగుండంలో ఎంతగా చిక్కుకుపోయామంటే, మోదీ వీర భక్తాగ్రేసరులు కూడా ప్రస్తుత కేంద్ర పాలనపై అనుమానాస్పద దృష్టితో చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ప్రతిష్టంభన నుంచి ఇంకా మనం బయటపడలేదు. పైగా సెకండ్ వేవ్ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ మరింత ఘోరమైన పరిస్థితుల్లో కూరుకుపోవచ్చు. పైగా చారిత్రాత్మక రైతాంగ నిరసనకు మనం సాక్షీభూతులుగా ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి తీర్పు రావడం అనేది ప్రస్తుత కేంద్రపాలకులు అఖండులు, అజేయులు కాదనే సత్యాన్ని తిరుగులేనివిధంగా దేశంముందు నిలి పింది. ఇక కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు ప్రతిపక్షాల స్థానాన్ని మరింతగా బలోపేతం చేసింది. గత ఏడేళ్లుగా బానిసత్వంలో మగ్గుతున్న దేశానికి ఈ తీర్పు తిరిగి ఊపిరి పోసినట్లయింది. ఇది మోదీ పాలన అంతానికి నాందీ వాచకం కానుంది. కేంద్రపాలకుల పతనం మొదలు కావచ్చు. కానీ ఈ గొప్ప అవకాశానికి మనం ఎలా స్పందిస్తాం అన్నదాని పైనే ఇది ఆధారపడి ఉంటుంది. ముందుగా ఈ తీర్పు దేనికి వ్యతిరేకమో గుర్తించడం చాలా అవసరం. ఈ తీర్పు మతతత్వ రాజకీయాలకు తిరస్కృతి కాదు. పైగా బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనతో ఉంటున్న ముస్లిం ఓటర్ల సమీకరణను లౌకిక రాజకీయాలకు సంకేతంగా చెప్పలేం. అలాగే కరోనా మహమ్మారి, లాక్డౌన్ కాలంలో మోదీ ప్రభుత్వం చేసిన అనేక తప్పులకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు కాదిది. కేరళను మినహాయిస్తే స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో అతిపెద్ద ప్రజారోగ్య సంక్షోభం ఏ రాష్ట్రంలోనూ ఎన్నికల అంశంగా కాలేదు. పెద్దనోట్ల రద్దు ఉదంతంలో లాగే ప్రజలు తమ ఆర్థిక బాధల పర్యవసానాలకు కారణాలపై ఇంకా అనుసంధానం కాలేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాల అసమర్థతపై కూడా ప్రజలు పెద్దగా దృష్టి పెట్టలేదు. కేరళలో ఎల్డీఎఫ్ విజయం అనేది వామపక్ష భావజాలం పట్ల విస్తృత ప్రజానీకం ఆమోదం అని చెప్పడానికి వీల్లేదు. అలాగే బీజేపీకి వ్యతిరేక ప్రచారంలో రైతు సంఘాలు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ విధానాల పట్ల రైతుల వ్యతిరేకతను కూడా ఈ తీర్పు పెద్దగా ప్రతిబింబించలేదు. అయినా సరే.. ఈ అసాధారణ అవకాశాన్ని మనం వినయపూర్వకంగానే అంగీకరించాల్సి ఉంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చెందిన విజయగాధగా చెప్పడానికి వీల్లేని అనేకానేక రోజువారీ సంభవించే కారణాల ప్రతిఫలనంగానే బీజేపీ ప్రస్తుత తిరోగమనం సంభవించింది. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రులకున్న ప్రజాదరణ ఒక కీలకాంశంగా పనిచేసింది. కానీ ఇది సుపరిపాలనపై ప్రజాతీర్పు కాదు. అదే నిజమైతే తమిళనాడులో ఏఐడీఎంకే చిత్తుగా ఓడిపోవలసి ఉండాలి. అలాగే అస్సోంలో సోనోవాల్ ప్రభుత్వం కూడా మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. అలాగే మమతా బెనర్జీ పాలనా రికార్డుకూడా తగుమాత్రమే ప్రభావం చూపింది. పశ్చిమ బెంగాల్లో, అస్సోంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ విజయానికి నిర్దిష్టమైన ఎన్నికల నిర్వహణే కీలకపాత్ర పోషించింది. ఈ అవకాశం ఎవరికి సంబంధించనిది అనే అర్థ సత్యాన్ని మనం బహిరంగంగా అంగీకరించాల్సిన సమయం ఇది. మమతా బెనర్జీ లేక ప్రశాంత్ కిషోర్, పినరయి విజయన్ లేక సీపీఎం, హేమంతా బిశ్వాస్ శర్మ లేదా సోనోవాల్.. ఇలా ఈ ఎన్నికల్లో ఎవరు విజేతలు అనే అంశంపై చాలా మంది తామే కారణమని ప్రకటించుకోవచ్చు. కానీ ఈరోజు పరాజితులెవ్వరు అనే విషయంపై రెండు అభిప్రాయాలు లేవు. అదేమిటంటే భారత జాతీయ కాంగ్రెస్. రాహుల్ గాంధీ కేరళ నుంచి తొలిసారి ఎంపీ అయ్యాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కాంగ్రెస్ పోగొట్టుకోకూడదు. అలాగే ఏడాది క్రితం పౌరసత్వ సవరణ చట్టంపై భారీ స్థాయి నిరసనలు చెలరేగిన అస్సాంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్ రానివ్వకుండా ఉండాల్సింది. పుదుచ్చేరిలో అధికారం కోల్పోయింది. బెంగాల్లో ఊసులేకుండా పోయింది. ప్రజా తీర్పు సందేశం అత్యంత స్పష్టంగా ఉంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ ఇక నాయకత్వం వహించలేదు. మోదీ అజేయత్వానికి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పదే పదే తూట్లు పొడుస్తూ వస్తున్నాయి. కానీ రాష్ట్రాల స్థాయిల్లో వ్యక్తమవుతున్న ఈ అసంతృప్తి జాతీయ వ్యాప్త సెంటిమెంట్గా మారడంలో వైఫల్యం చోటు చేసుకుంటోంది. ఈసారి తీర్పు మాత్రం భిన్నమైంది. ప్రతిపక్షాలకు ఇది ఒక మార్గాన్ని చూపింది. 2022 మొదట్లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజాతీర్పు ఇలాగే సాగితే మోదీ పాలన ముగింపునకు అది ప్రారంభం కాగలదు. మోదీ పరాజయం పొందవచ్చు. కానీ అది కాంగ్రెస్ చేత కాదు. మోదీ పట్ల పచ్చి వ్యతిరేకత వల్ల కూడా కాకపోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ఒక సవాలు కూడా ఉంది. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ ఇండియా సంస్థాపకులు -
సాగు చట్టాలపై సుదీర్ఘ పోరు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు చేపట్టనున్న పోరాట కార్యాచరణను ఆదివారం ప్రకటించింది. ప్రభుత్వ అణచివేతకు నిరసనగా 23న పగాడీ సంభాల్ దివస్, 24న దామన్ విరోధి దివస్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే 26న యువ కిసాన్ దివస్, 27న మజ్దూర్–కిసాన్ ఏక్తా దివస్ నిర్వహిస్తామని పేర్కొంది. కొత్త సాగు చట్టాలు రద్దయ్యే దాకా సుదీర్ఘ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని రైతు సంఘం నేత యోగేంద్ర యాదవ్ చెప్పారు. ఆ చట్టాలు రైతులకు డెత్ వారెంట్లు: కేజ్రీవాల్ కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు డెత్ వారెంట్లు అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభివర్ణించారు. ఆయన ఆదివారం పశ్చిమ ఉత్తరప్రదేశ్కు చెందిన పలువురు రైతు సంఘాల నేతలతో విందు భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త సాగు చట్టాలను అమలు చేస్తే దేశంలో వ్యవసాయ రంగం మొత్తం కార్పొరేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
రైతు ఉద్యమం భావి దార్శనికతా పత్రం
వ్యవసాయంపై సంవత్సరాలుగా అకడమిక్, రాజకీయ స్థాయిల్లో సాగిస్తూ వచ్చిన చర్చలు సాధించలేని ఫలితాన్ని రైతు ఉద్యమం సాధించింది. రైతుల మీదికి మీరు కత్తి ఝళిపించలేరని ఈ ఉద్యమం చాటి చెప్పింది. యూరప్, ఉత్తర అమెరికా జనాభాకు ఎన్నో రెట్లు మించిన జనాభాకు మన వ్యవసాయం ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలి. గ్రామీణ భారతం జాతీయ భవిష్యత్తుకు కీలకమైనది. భారత రైతాంగంపై నమ్మకాన్ని ప్రోది చేసే ఒక తీర్మానం చాలు.. వ్యవసాయ విధాన రూపకల్పనలో ఒక సరికొత్త పంథాను అది ఆవిష్కరిస్తుంది. ఈ రాజకీయ సంకల్పాన్ని సృష్టించి పెట్టడమే.. ప్రస్తుత రైతు ఉద్యమం విజయానికి నిజమైన కొలబద్ద అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రైతు ఉద్యమం భారత భావి దార్శనికతా పత్రం. కేంద్ర ప్రభుత్వ సాగుచట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత డిమాండుతో భారతీయ రైతాంగం గత రెండున్నర నెలలుగా సాగిస్తున్న చారిత్రక ఉద్యమం.. భవిష్యత్తుకు ఒక దార్శనికతను ఏర్పర్చింది. రైతులకూ, వ్యవసాయానికే కాకుండా గ్రామీణ భారతానికి, నిజానికి భారత భవిష్యత్తుకు కూడా ఈ ఉద్యమం ఒక విజన్ని నిర్దేశిస్తోంది. రైతాంగ ఉద్యమం ఇప్పటికే చరిత్ర సృష్టించింది. రైతులను ఒక్కసారిగా ఇది జాతీయ ప్రాధాన్యతలోకి తీసుకొచ్చింది. ఉద్యమం ఉనికిలో లేదని మీరు నటించవచ్చు. కాని వాస్తవానికి మన రాజకీయ వర్గానికి దేవుడి మీద భయంకంటే ఎక్కువగా ఓటు మీద భయాన్ని ఈ ఉద్యమం సమర్థవంతంగా కలిగించిందనే చెప్పాలి. రైతుల మీదికి మీరు కత్తి ఝళి పించలేరని ఈ ఉద్యమం చాటి చెప్పింది. అధికారంలో ఉన్నవారు తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలను మరీ తెలివిగా సమర్థిస్తున్న మార్కెట్ మౌలికవాదుల నోళ్లు మూయించిందీ ఉద్యమం. మార్కెట్ అనుకూల పండితులు ప్రబోధించే.. సంస్కరణలను వేగంగా అమలు చేయాలనే భాషను ఇకపై కార్పొరేట్ దగాకోర్లు మునుపటిలా ఉచ్చరించలేరు. కనీసం కొంతకాలమైనా ఈ పరిస్థితి కొనసాగుతుంది. అయితే రైతాంగ ఉద్యమం సాధించిన విజయం ఊహలకే పరి మితం అవుతుందంటే అంతకు మించిన విషాదం మరొకటి లేదు. వ్యవసాయ సంస్కరణలను విజయవంతంగా నిలిపివేయటమనేది ప్రస్తుత యథాతథ స్థితిని కొనసాగించేందుకు మాత్రమే పరిమితమైతే అదే పెద్ద విషాదమవుతుంది. కార్పొరేట్ వ్యవసాయ వాణిజ్య విధానాన్ని వెనక్కు నెట్టివేయడం అనేది రైతుల్లో ట్రేడ్ యూనియన్ తత్వాన్ని మాత్రమే ముందుకు తీసుకువస్తే అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలు భారతీయ రైతులు, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న పలువిధాల సంక్షోభాన్ని జాతి ముందుకు తీసుకొచ్చాయి. ఈ చట్టాలు భారతీయ రైతులు అనుభవిస్తున్న వ్యథలకు నాందీవాచకం మాత్రం కాదు. అలాగని సాగుచట్టాల రద్దు అనేది రైతుల అవసరాలను తీర్చే వరం కూడా కాదు. భారత్ భవిష్యత్తుకు గుండెకాయ రైతులే అనే భావనను ఈ మహోద్యమం మరింత ముందుకు తీసుకుపోయింది. భారతీయ వ్యవసాయం మూడు పరస్పరాధారిత సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం వ్యవసాయరంగంలో ఆర్థిక సంక్షోభంపై అందరూ దృష్టి పెడుతున్నప్పటికీ, మనందరినీ భయపెడుతున్న పర్యావరణ సంక్షోభాన్ని మర్చిపోకూడదు. ఈ రెండు సంక్షోభాలు కలిసి రైతులను మనుగడ సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఈ మూడు సంక్షోభాలను ఏకకాలంలో పరిష్కరించగల కొత్త ఒప్పందం కుదుర్చుకోవడం రైతులకు ఇప్పుడు చాలా అవసరం. ఈ కొత్త ఒప్పందాన్ని రూపొందించడానికి మన ఆదర్శాలు, విధానాలు, రాజకీయాలు కలిసి ముందుకు రావల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఆర్థిక సంక్షోభాన్ని సులువుగానే వర్ణించవచ్చు. దాదాపుగా మన జనాభాలో సగం వరకు (58 శాతం గ్రామీణ రైతు కుటుంబాలు) వ్యవసాయంలో మునిగితేలుతున్నప్పటికీ వ్యవసాయం ఆర్థికంగా చెల్లుబాటు కావడం లేదు. 86 శాతం రైతులు 5 ఎకరాల కంటే తక్కువ భూములను కలిగి ఉన్నారు. తలసరి దిగుబడి చాలా తక్కువ. పైగా పంట చేతికి రావడం కూడా అనిశ్చితంగానే ఉంటుంది. పంటలకు ధరలు చాలా తక్కువ. వ్యవస్థాగతంగానే ఇలా తగ్గిస్తూ వస్తున్నారు. రైతుల అన్ని రకాల ఆదాయ మార్గాలను కలిపి చూస్తే వారి సగటు నెల ఆదాయం రూ. 8 వేలకు మించడం లేదు. రైతు కుటుంబాల్లో సగం కంటే ఎక్కువగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. ఇప్పుడు మన ఆర్థిక వేత్తలు చెబుతున్నదేమిటంటే వ్యవసాయంపై ఆధారపడుతున్న జనాభాను తగ్గించాలనే. అయితే వ్యవసాయరంగం నుంచి తప్పించిన ఈ అదనపు జనాభాను ఏ ఖండానికి తరలించాలి అనే విషయం మాత్రం వీరు మర్చిపోతారు. లేదా ఇప్పటికే దేశం మొత్తంగా నిరుద్యోగం తాండవిస్తున్న నేపథ్యాన్ని పక్కనబెట్టి మన ఆర్థిక వ్యవస్థ లక్షలాది అదనపు ఉద్యోగాలకోసం వేచి ఉంటోం దని ప్రగల్భాలు పలుకుతుంటారు. కష్టపడి పనిచేసేవారికి గౌరవప్రదమైన ఆదాయాన్ని ఎక్కడ వెదుక్కోవాలి అనేదే అసలు సమస్య. మరోవైపున పర్యావరణ సంక్షోభాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. హరిత విప్లవం ఒక ముగింపుకొచ్చేసింది. సేంద్రియ వ్యవసాయం అద్బుతం గురించి, నీటి అధిక వినియోగంపై మనలో బలపడిపోయిన గుడ్డి విశ్వాసం వల్ల భీతిల్లే స్థాయిలో నేల సారం కోల్పోయి, భూగర్భ జలం దిగజారిపోతూ ఉంది. దీనికి జీవవైవిధ్య క్షీణత, విభిన్న రకాల విత్తనాలు తగ్గిపోవడం, జొన్నలు వంటి చిరుధాన్యాల పంటలు తగ్గిపోవడం, కూలీలను, పశుసంపదను కోల్పోవడం, అడవుల నిర్మూలన వంటివి పరిశీలిస్తే పర్యావరణ సంక్షోభం కొంతమంది పర్యావరణవాదులు ఆడే జూద క్రీడ కాదని అర్థమవుతుంది. ఇప్పుడు వాతావరణ మార్పు అనే సరికొత్త సవాలు గురించి ఆలోచిద్దాం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనిశ్చితంగా వస్తున్న వర్షరుతువు కారణంగా భారత వ్యవసాయం విధ్వంసం వైపు సాగిపోతోంది. వాతావరణ మార్పు ప్రభావం వల్లే మెట్టప్రాంతాల రైతుల ఆదాయాలు దారుణంగా పడిపోతున్నాయి. చివరగా రైతులు తమ ఉనికికి సంబంధించిన సంక్షోభంపట్ల స్పందించాల్సి ఉంది. గత రెండు దశాబ్దాల్లో 3.5 లక్షల మంది రైతులు దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. జాతీయ ఆర్థిక వ్యవస్థలో రైతు స్థానం క్షీణించిపోవడం, రైతుల స్థాయి రానురాను పడిపోవడం వారి గౌరవానికి భంగం కలిగిస్తోంది. రైతు రోజుకూలీగా మారిపోవడం, త్వరలోనే వలస కార్మికుడిగా ఆవతారమెత్తడం వంటి కారణాలతో తమ తదుపరి తరం వ్యవసాయాన్ని చేపట్టకూడదని భావించేలా చేస్తున్నాయి. నేడు రైతు ఉద్యమ లక్ష్యం కేవలం మూడు సాగుచట్టాల ప్రమాదాన్ని తప్పించుకోవడం లేదా కొన్ని ఆర్థిక లాభాలను రైతులపరం చేయడానికి మాత్రమే పరిమితమై లేదు. భారత వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఆర్థిక, పర్యావరణ, మనుగడ సంక్షోభాలను ఎలా అరికట్టాలనే దిశగానే ప్రస్తుత ఉద్యమం పయనించగలగాలి. దీని కోసం ఒక ఊహాత్మకమైన ముందజ వేయడం ఎంతైనా అవసరం. భారతీయ వ్యవసాయం భారతీయ పంధాలోనే సాగుతుంది. భారతీయ రైతులు గతం తాలూకా శిథిలాలు కాదు. వారు ఇక్కడ ఉండి జీవించగలగాలి. యూరప్, ఉత్తర అమెరికా జనాభాకు ఎన్నో రెట్లు మించిన జనాభాకు మన వ్యవసాయం ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలి. అందిస్తుంది కూడా. జ్ఞానం, టెక్నాలజీలను ఒడిసిపట్టడంలో భారత రైతులకు సాటి లేదు. భారతీయ గ్రామం చరిత్ర పెంట కుప్ప కాదు. గ్రామీణ భారతం అనేక అవకాశాల గడ్డ. మన జాతీయ భవిష్యత్తుకు అది కీలకమైనది. భారత రైతాంగంపై, వ్యవసాయరంగంపై నమ్మకాన్ని ప్రోది చేసే ఒక తీర్మానం చాలు.. వ్యవసాయ విధాన రూపకల్పనలో ఒక సరికొత్త పంథాను అది ఆవిష్కరిస్తుంది. దీనికి ప్రభుత్వం తన వంతుగా వ్యవసాయానికి మరింత అదనంగా బడ్జెట్లో కేటాయించాలి. వ్యవసాయ రంగానికి ఇంతవరకు ఇస్తున్న సబ్సిడీలు చాలా తక్కువ కావడంతో రైతులకు భవిష్యత్తులో సబ్సిడీలు పెంచాలి. సార్వత్రిక పంటల బీమా, రుణ ఉపశమనం, పునర్మిర్మాణం వంటి సమగ్ర చర్యలపైపు మన వనరులను మళ్లించాలి. వ్యవసాయంలో ప్రైవేట్ చొరవ మరింత అవసరమే కానీ అది ప్రభుత్వ మద్దతు, చొరవ కంటే తక్కువగా ఉండాలి.బడ్జెట్లో మరో 3 లేదా 4 లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ రంగానికి మళ్లిస్తే గ్రామీణ భారత్ కోసం ఒక సరికొత్త డీల్ సాకారమైనట్లే. జాతి మొత్తంగా దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇది మన రాజ కీయ నాయకత్వ సంకల్పానికి సంబంధించిన ప్రశ్న. ఈ రాజకీయ సంకల్పాన్ని సృష్టించి పెట్టడమే.. ప్రస్తుత రైతు ఉద్యమం విజయానికి నిజమైన కొలబద్ద అవుతుంది. యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా సంస్థాపకులు -
22 మందిపై కేసులు.. 200 మంది అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. రైతు గణతంత్ర పరేడ్ పేరిట రైతులు నిర్వహించిన ఈ ర్యాలీలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. నిరసనకారులు బారికేడ్లను తోసుకుని వచ్చి మరి పోలీసులపై దాడి చేశారు. ఈ హింసాత్మక ఘటనల్లో దాదాపు 300 మంది పోలీసులు గాయపడినట్లు సమాచారం. ఇక దాడులకు సంబంధించి 22 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. దాదాపు 200 మందిని అరెస్ట్ చేశారు. ఇక రైతు ర్యాలీకి సంబంధించి జారీ చేసిన ఎన్ఓసీని ఉల్లంఘించినందుకు గాను స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్తో పాటు ఇతర రైతు సంఘాల నాయకులు దర్శన్ పాల్, రజిందర్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, బుటా సింగ్ బుర్జ్గిల్, జోగిందర్ సింగ్ ఉగ్రహాలతో సహా మరి కొందరిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: వైరల్: 15 అడుగులో గోతిలో దూకిన పోలీసులు) హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్రం ఢిల్లీ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయడమే కాక రాజధానిలో అదనపు బలగాలను మోహరించించింది. ఎర్రకోట, జామా మసీద్ మెట్రో స్టేషన్లు మూసివేయడమే కాక సెంట్రల్ ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఇక నిన్న రాజధానిలో తలెత్తిన హింసాత్మక ఘటనలకు, తమకు ఎలాంటి సంబంధం లేదని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. కేంద్రం గందరగోళ పరిస్థితులను సృష్టించిందని.. అందువల్లే హింసాత్మక ఘటనలు తలెత్తాయి అని.. అల్లర్ల వెనక కుట్ర కోణం దాగి ఉందని వెల్లడించారు. -
‘చలో ఢిల్లీ’ రణరంగం
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గురువారం చేపట్టిన ‘చలో ఢిల్లీ’కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధానంగా బీజేపీ పాలిత హరియాణా, కాంగ్రెస్ పాలిత పంజాబ్ సరిహద్దులో పరిస్థితి రణరంగాన్ని తలపించింది. రైతులపై పోలీసులు బాçష్ఫవాయువు, వాటర్కెనన్లు ప్రయోగించారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పంజాబ్ రైతులు ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రానికి పెద్ద సంఖ్యలో పంజాబ్, హరియాణా రైతులు ఢిల్లీ సమీపంలోకి చేరుకోగలిగారు. అక్కడ వారిని పోలీసులు నిలువరించారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ శివార్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీకి బయలుదేరిన స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ను, ఇతర నిరసనకారులను గుర్గావ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంమీద పోలీసులు మొదటి రోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని భగ్నం చేయగలిగారు. రైతన్నలపై పోలీసుల జులుం పంజాబ్–హరియాణా షాంబూ సరిహద్దులో హరియాణా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పంజాబ్ రైతులు ట్రాక్టర్లలో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రైతులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. కానీ, రైతులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు కదిలారు. వారిని చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు భాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. కోపోద్రిక్తులైన రైతులు కొన్ని బారికేడ్లను ఘగ్గర్ నదిలో విసిరేశారు. అంతేకాకుండా సిర్సా, కురుక్షేత్ర, ఫతేబాద్, జింద్ జిల్లాల్లోనూ రైతులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. గురువారం సాయంత్రానికి ఉద్రిక్తతలు చల్లారాయి. చాలా ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలను సడలించడంతో రైతులు కాలినడకన, ట్రాక్టర్లపై ముందుకు కదిలారు. అమృత్సర్–ఢిల్లీ ప్రధాన రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కర్నాల్ పట్టణంలోనూ రైతులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించారు. హరియాణాలోని కైథాల్ జిల్లాలో భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు వాటర్ కెనన్లను ప్రయోగించారు. శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళుతున్న తమపై పోలీసులు బల ప్రయోగం చేయడం ఏమిటని రైతన్నలు మండిపడ్డారు. పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో అంబాలా వద్ద రైతులపైకి వాటర్ కేనన్ల ప్రయోగం -
ఆర్థికవేత్తల్లో ఇంత అయోమయమా?
మూడు వ్యవసాయ బిల్లులను కేంద్రప్రభుత్వం ఆమోదింపచేసుకున్న నేపథ్యంలో.. పైకి ఎన్ని ఆకర్షణీయ మాటలను చెప్పినా, వ్యవసాయ మార్కెట్లను ప్రయివేటీ కరించడం ద్వారా ప్రభుత్వం వ్యవసాయ రంగం నుంచి తప్పుకోబోతోందని రైతులు గ్రహిస్తున్నారు. ధాన్య సేకరణనుంచి, కనీస మద్ధతు ధరనుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గబోతోందని, సర్కారీ మండీల రద్దు ద్వారా తమ వ్యవసాయ రాబడులు మరింత అస్థిరతకు గురవుతాయని రైతులు అర్థం చేసుకుంటున్నారు. ఈ మూడుబిల్లులు తమ జీవితాలపై వేయబోతున్న ప్రభావాల గురించి పంజాబ్ రైతులు పోస్ట్ చేస్తున్న వీడియోలను గమనిస్తే అత్యుత్తమ వ్యవసాయ ఆర్థికవేత్తల కంటే భారతీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ క్షేత్ర వాస్తవాలను రైతులే చక్కగా అర్థం చేసుకుంటున్నారని స్పష్టంగా బోధపడుతుంది. భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ ఆర్థికశాస్త్రవేత్తలలో ప్రొఫెసర్ అశోక్ గులాటి అగ్రగణ్యులు. పైగా నేను చదివి, సంప్రదించి, గౌరవించే పండితులలో ఆయన ఒకరు. రైతుల పట్ల నిజమైన ఆర్తి కలిగి ఉన్న మంచి మేధావి ఆయన. నరేంద్రమోదీ నేతృత్వంలో నడుస్తున్న నేటి ప్రభుత్వంతోపాటు ఏ ప్రభుత్వాలనైనా వ్యతిరేకించే దన్ను కలిగినవారు. అవసరమైతే రైతు ఉద్యమాలను కూడా వ్యతిరేకించే దమ్ము కూడా ఉంది. అనేక సంవత్సరాలు వ్యవసాయరంగంపై చేసిన కృషికి తోడుగా, ఆయన కేంద్రప్రభుత్వం ఇటీవల రూపొందించి ఆమోదింపజేసుకున్న మూడు నూతన వ్యవసాయబిల్లులను స్వాగతించారు. వీటిని భారతీయ వ్యవసాయానికి 1991 ఉద్యమం అని కూడా ఆయన పిలిచారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ది ప్రింట్ చీఫ్ ఎడిటర్ శేఖర్ గుప్తా సైతం నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా గులాటి వాదనలను యథాతథంగా ఉల్లేఖించారు. విషాదకరమైన విషయం ఏమిటంటే గులాటి ఈ అంశంలో పూర్తిగా తప్పుచేశారు. ఇది పాక్షిక పాండిత్యానికి, తప్పుడు డేటాకు లేక పేలవమైన హేతువుకు సంబంధించిన తప్పిదం మాత్రమే కాదు. ఇది ప్రభుత్వ విధాన సలహాదారుగా తన అనుకూలతా స్థానం ఫలితంగా నెలకొన్న విస్పష్టమైన తప్పు (ఆయన ఇప్పటికీ ప్రభుత్వ సలహాదారుగానే ఉన్నారా?). ఇద్దరు ఆర్థికవేత్తలు జీన్ డ్రెజ్, అశోక్ కొత్వాల్ మధ్య జరిగిన లోతైన చర్చను చదివినప్పుడు నాకు ఇది మరింత స్పష్టంగా అర్థమైంది. సబ్సిడీ ధరతో పేదలకు ఆహార పంపిణీ చేయడానికి నగదు బదిలీ చేయాలని కొత్వాల్ ఇచ్చిన సలహాకు స్పందనగా డ్రెజ్.. ప్రభుత్వానికి సలహా ఇచ్చే ఆర్థికవేత్తకు, పేదల పక్షాన సలహా ఇచ్చే ఆర్థికవేత్తకు మధ్య తేడా గురించి ఒక స్పష్టమైన విభజన రేఖ గీస్తూ మాట్లాడారు. ఒక విధాన సలహాదారు ప్రభుత్వానికి తాను ఇచ్చే సలహాలు పూర్తిగా మంచి స్ఫూర్తితో అమలవుతాయని అంచనా వేస్తూనే తన సలహాలు అందించే ప్రయోజనాలు ఏమిటనే విషయంపై తప్పనిసరిగా ఆలోచించాల్సి ఉంది. ఒక విధానం పర్యవసానాలు ఏమిటి? వాస్తవ జీవితంలో ఆ విధానం క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతుంది అని పేదల పక్షం వహించే సలహాదారు తప్పక దృష్టి పెట్టాలి. పేదలకు సహాయం చేయడానికి ప్రత్యక్ష నగదు బదిలీ అనేది అత్యంత సమర్థవంతమైన, ఖర్చుతగ్గించే మార్గంగా కాగితంమీద బాగానే కనిపిస్తుందని, కానీ రేషన్ షాపుల ద్వారా ఆహార ధాన్యాల సరఫరా అనేది పేదలకు వాస్తవంగా వారి జీవితాలకు మేలు కలిగించే అంశంగా ఉంటుందని డ్రెజ్ నొక్కి చెప్పారు. ఇప్పుడు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లుల విషయంలో కూడా ఇదే వాస్తవం. సలహాదారులు–వ్యవసాయదారులు ప్రొఫెసర్ గులాటి మాటల్లో చెప్పాలంటే ఈ బిల్లులు అత్యుత్తమమైనవి. ఈ చట్టాలు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి, కొనుగోలుదారులు వ్యవసాయ ఉత్పత్తులను కొని, నిల్వ చేసుకోవడానికి మేలైన అవకాశాన్ని, స్వేచ్ఛను కలిగిస్తున్నాయి. తద్వారా వ్యవసాయ మార్కెటింగ్లో పోటీని సృష్టించవచ్చు. మార్కెటింగ్ వ్యయాలను తగ్గించి, రైతులకు మెరుగైన ధరలను కల్పించడం, అదే సమయంలో వినియోగదారులు చెల్లించే ధరలను తగ్గించడం వైపుగా వ్యవసాయంలో మరింత సమర్థవంతమైన పంపిణీని సృష్టించడంలో ఈ పోటీ అనేది సహాయపడుతుంది అని గులాటి ఆ వ్యాసంలో చెప్పారు. సైద్ధాంతిక మొండితనం కలిగిన వారు మినహా ఈ రకమైన సలహాలతో ఎవరు విభేదించగలరు? ఈ పోటీ వల్ల రైతులు కనీస మద్దతు ధరను పొందలేరంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రకటనల తప్పుడు ప్రచారానికి లోనవటం వల్లే ఈ బిల్లులను నిరసిస్తున్నారని స్వామినాథన్ అయ్యర్ రాస్తున్నారు. ఈ వాదనలోని హేతువు ఏమంత చెడ్డది కాదు. కానీ క్షేత్రవాస్తవాలపై వీరి అంచనాలు షాక్ కలిగిస్తున్నాయి. పైగా ఈ చట్టాలు ఎలా అమలవుతాయి అనే అంశంపై వీరి అంచనాలు మంచి జరుగుతుందనే సద్భావనపైనే ఆధారపడ్డాయి. సహజంగానే వీరి నిర్ధారణలు చాలా తప్పు అని తేలుతుంది. ఆర్థిక శాస్త్రంలోని తికమకలను అర్థం చేసుకోలేని మన దేశ రైతు పైన పేర్కొన్న మేధావుల కంటే ఈ చట్టాలపై మరింత మెరుగైన అంచనాను కలిగి ఉంటాడు. మేఖలా కృష్ణమూర్తి వంటి ఆంత్రోపాలజిస్టు కానీ, సుధా నారాయణన్ వంటి క్షేత్రవాస్తవాలకు సమీపంగా ఉండే ఆర్థికవేత్త కానీ ఈ చట్టాలు వ్యవసాయ మార్కెట్లపై వేసే ప్రభావంపై మరింత వివేచనతో ఉంటారు. సంస్కరణ–వాస్తవికత రైతులకు వరాలు వాగ్దానం చేస్తున్నాయని చెబుతున్న ఈ చట్టాల గురించి నాలుగు అంచనాలను మనం పరిశీలిద్దాం. మొదటి అంచనా ఏమిటంటే సర్కారీ మండీలకు తప్పనిసరిగా తమ ఉత్పత్తులను అమ్మాల్సి వస్తున్నందున తమ పంటలను బయట అమ్ముకునేటప్పుడు వీరికి తగిన అనుభవం ఉండదన్నదే. ఇది తప్పు. ఎందుకంటే మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో నాలుగింట ఒక భాగం మాత్రమే ఈ మండీల ద్వారా కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న ‘స్వేచ్ఛ’ను మన రైతుల్లో నాలుగింట మూడొంతుల మంది ఇప్పటికే ఆస్వాదిస్తున్నారు. రైతుల్లోని మెజారిటీకి ఇప్పుడు కావలసింది మండీల నుంచి స్వేచ్ఛ కాదు. మరింత చక్కగా నిర్వహించే మండీలు వారికి అవసరం. గత కొన్నేళ్లుగా విస్తృతంగా రైతులతో సమావేశమవుతూ వస్తున్న నేను రైతులు పదేపదే ఒక అంశంపై ఫిర్యాదు చేయడం గమనించాను. తమకు అందుబాటులో మండీలు లేవని, ఉన్నా సరైనరీతిలో అవి పనిచేయడం లేదని రైతులు ఆరోపించారు. రెండో అంచనా ఏమిటంటే, కమిషన్ ఏజెంట్ల నుంచి ఈ చట్టాలు రైతులను కాపాడతాయన్నదే. ఇది కూడా తప్పే. మండీలు రైతులను మోసగించలేవని చెప్పలేం కానీ వేలాదిమంది రైతులతో నేరుగా సంప్రదించలేని బడా వ్యవసాయ కంపెనీలు నెలకొల్పే ప్రైవేట్ మండీలకు ఈ సర్కారీ మండీల నిర్వహణదారులు తమ సేవలను అప్పనంగా అందించడానికి సిద్ధంగా ఉంటున్నారు. అంటే ఇకనుంచి రెండు రకాల దళారీల నుంచి రైతులు పీడనకు గురవుతారు. ఇంతవరకు కొనసాగుతూ వస్తున్న పాత కమిషన్ ఏజెంట్లు, ఇప్పుడు కొత్తగా ఆవిర్భవిస్తున్న కార్పొరేట్ సూపర్ దళారీలు. మూడో అంచనా ఏమిటంటే, మార్కెట్ న్యాయబద్ధంగానే పనిచేస్తుంది కాబట్టి తమ ఉత్పత్తులను నిల్వచేసే స్టాకిస్టులు లేక వ్యాపారుల ద్వారా అదనపు లాభాలను ఇప్పుడు రైతులు పొందగలుగుతారన్నదే. కానీ ప్రైవేట్ వ్యాపారులు తాను సంపాదించే అదనపు లాభాల్లో ఒక వాటాను రైతులకు ఇవ్వాలని ఎందుకనుకుంటారు? రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన ధరను ఇవ్వకుండా వీరు తమలోతాము కుమ్మక్కు కారని గ్యారంటీ ఏదైనా ఉందా? ఇంతవరకు జరిగిన విధంగానే కొన్ని సీజన్లలో రైతులకు మంచి ధర ఇస్తూ మిగతా సమయాల్లో రైతులను అణచివేయడాన్ని వీరు కొనసాగించరని ఎవరు హామీ ఇస్తారు? నాలుగో అంచనా ఏమిటంటే ప్రభుత్వం వ్యవసాయ మౌలిక పెట్టుబడిలో తన వాటాను పెంచడం ద్వారా రైతాంగానికి తోడ్పడుతుందన్నదే. ఇదో నయవంచన. ఈ 3 చట్టాలు విధానాలుగా మాత్రమే కాకుండా భవిష్యత్తు పర్యవసానాల సూచికలుగా ఉంటున్నాయని ఆర్థికవేత్తల కంటే బాగా రైతులు అర్థం చేసుకుంటారు. మదుపు, క్రమబద్ధీకరణ, విస్తృత కృషి రూపాల్లో వ్యవసాయం నుంచి తాను పక్కకు తప్పుకుంటున్నట్లుగా మోదీ ప్రభుత్వం ఈ చట్టాల రూపకల్పన ద్వారా స్పష్టంగా వెల్లడించింది. ప్రైవేట్ వ్యాపారులు ధాన్యపు గిడ్డంగులను, కోల్ట్ స్టోరేజీలు నిర్మించడంలో మదుపు పెడతారు కాబట్టి తాను వ్యవసాయ రంగంనుంచి తప్పుకోవచ్చని ప్రభుత్వ భావన. రైతులకు స్పష్టమైన సంకేతాలు రైతులకు భవిష్యత్ చిత్రపటం ఏమిటన్నది స్పష్టంగా తెలుసు. వ్యవసాయ రంగం నుంచి ప్రభుత్వం తప్పుకోవడం అంటే ఇంతవరకు తాము అనుభవిస్తున్న ఆ మాత్రపు స్వేచ్చను కూడా వారు పొగొట్టుకోవడమే అవుతుంది. ప్రభుత్వం ధాన్య సేకరణనుంచి కూడా తప్పుకోబోతోందని వారు గ్రహించగలరు. సర్కారీ మండీల రద్దు ద్వారా పర్యవసానాలు వీరికి చక్కగా తెలుసు. కనీస మద్ధతు ధరనుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గబోతోందని కూడా వీరు పసిగట్టగలరు. ఆర్థికవేత్తల కంటే రైతులే రాజకీయ సంకేతాలను స్పష్టంగా గ్రహించగలరు. ఇప్పటికే ఈ మూడుబిల్లులు తమ జీవితాలపై వేయబోతున్న ప్రభావాల గురించి పంజాబ్ రైతులు పోస్ట్ చేస్తున్న వీడియోలను గమనించినట్లయితే మన దేశంలోని కొందరు అత్యుత్తమ వ్యవసాయ ఆర్థికవేత్తల కంటే భారతీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ క్షేత్ర వాస్తవాలను రైతులే చక్కగా అర్థం చేసుకుంటున్నారని స్పష్టంగా బోధపడుతుంది. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త అధ్యక్షుడు, స్వరాజ్ ఇండియా స్వరాజ్ అభియాన్, జై కిసాన్ ఆందోళన్ సభ్యుడు మొబైల్ : 98688 88986 -
ఢిల్లీ అల్లర్లు : చార్జిషీట్లో పలువురు ప్రముఖులు
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలతో అట్టుడికిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోసుకుంది. ఈ కేసులో సహ కుట్రదారులుగా పలువురు ప్రముఖులును చేర్చడం తాజాగా సంచలనం రేపింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రఖ్యాత ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ , డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రాయ్ పేర్లను సప్లిమెంటరీ చార్జిషీట్లో ఢిల్లీ పోలీసులు చేర్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరో రెండు రోజుల్లో (సెప్టెంబరు,14న) ప్రారంభం కానున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం జాఫ్రాబాద్ ఘర్షణలో జేఎన్యు విద్యార్థులు దేవంగన కాలిత, నటాషా నార్వాల్, జామియా మిలియా ఇస్లామియాకు చెందిన గుల్ ఫిషా ఫాతిమా వాంగ్మూలం ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చారు. వీరితోపాటు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్ ముస్లిం సమాజానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్ వంటి కొందరు నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు చార్జిషీట్ పేర్కొంది. ఢిల్లీలో అల్లర్లు రేపేందుకు కొందరు కుట్ర పన్నారని ఫాతిమా తెలిపారనీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని తనతో చెప్పారని ఫాతిమా అంగీకరించారని తెలిపింది. ఇందులో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ పాత్ర ఉందని, ఆయనే అల్లర్లకు పథకం రూపొందించారన్న ఫాతిమా మాటలను ఉటంకిస్తూ ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ పొందుపర్చారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన హింసలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. -
సమానత్వానికి హైదరాబాద్ స్ఫూర్తి
లక్డీకాపూల్: దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని రాజకీయ, సామాజిక ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా సంఘటితంగా పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. శుక్రవారం బంజారాహిల్స్లోని లామకాన్లో సామాజిక న్యాయదినోత్సవాన్ని పురస్కరించుకుని పౌరసత్వం, రాజ్యాంగబద్ధత, సామాజిక న్యాయం, సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అంశంపై సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలకు జంట నగరాలు ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. సమైక్యతకు, సమానత్వానికి పట్టంకడుతున్న హైదరాబాద్ దేశానికి స్ఫూర్తిదాయకం కావాలన్నారు. దేశంలో అమలవుతున్న కుల వ్యవస్థ, మనుధర్మ స్మృతికి దళితులు, అట్టడుగు వర్గాల ప్రజ లు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక సామాజిక న్యాయానికి, లౌకిక వాదానికి వ్యతిరేకంగా పలు చర్యలు, చట్టాలు చేస్తోందన్నారు. ముస్లింలను టార్గెట్ చేస్తోంది... పౌరసత్వ సవరణ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ముస్లింలను టార్గెట్ చేస్తోం దని ధ్వజమెత్తారు. దేశ సరిహద్దులో నో ముస్లిం ప్లీజ్ అన్న బోర్డులు ఏర్పాటు చేయడం దీనికి నిదర్శనమని యోగేంద్ర యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ నాయకుడు పి.శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
ఆయనను అరెస్టు చేశారా? ఎక్కడా?
సాక్షి, బెంగళూరు/ న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యంగా న్యూఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గుమిగూడారు. సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు విధించిన 144 సెక్షన్ను ధిక్కరించి మరీ ఎర్రకోట వద్ద ఆందోళనకారులు గుమిగూడారు. ఇక్కడ ఆందోళనలకు పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఇక్కడ పెద్దసంఖ్యలో ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రకోట వద్ద స్వరాజ్ అభియాన్ పార్టీ చీఫ్ యోగేంద్ర యాదవ్తోసహా పలువుర్ని గురువారం ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని యోగేంద్ర ట్విటర్లో తెలిపారు. వామపక్ష నేతలు డీ రాజా, సీతారాం ఏచూరి, నిలోత్పల్ బసు, బృందా కరత్లను కూడా పోలీసులను అరెస్టు చేశారు. ఇటు బెంగళూరులో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహాను పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను పోలీసులు అరెస్టు చేయడంపై గుహా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. అయితే, నిషేధాజ్ఞలను ఉల్లంఘించడంతోనే గుహాతోపాటు నిరసనకారుల్ని అరెస్టు చేశామని బెంగుళూరు సిటీ పోలీసులు తెలిపారు. మరోవైపు గుహా అరెస్టుపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడ్డియూరప్ప ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుహా అరెస్టు గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘ఎక్కడా? కారణం లేకుండా పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. నేను పోలీసులకు వెంటనే ఆదేశాలు ఇస్తాను?’ అని యెడ్డియూరప్ప పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై, గూండాలపై చర్యలు తీసుకోవాలి కానీ, సామాన్య ప్రజలపై చర్యలు తీసుకోకూడదని, అలాంటిది ఏదైనా జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. -
పౌరసత్వ రగడ: పోలీసుల అదుపులో ప్రముఖులు
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అలాగే భారీగా పోలీసులను మోహరించారు. అయినప్పటికీ నిరసనకారులు, పలువురు ప్రముఖలు రోడ్లపైకి వచ్చి సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్దకు నిరసకారులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది నిరసకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తనను తీసుకెళ్లే సమయంలో ‘భారత్ మాతా కీ జై’ అంటూ యోగేంద్ర యాదవ్ నినాదాలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో పోలీసులు ఢిల్లీ-గురుగ్రామ్ హైవేపై బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. దీంతో 5 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు..16 మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేశారు. మరోవైపు బెంగళూరు టౌన్ హాల్ సమీపంలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఏఏపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉండగానే పోలీసులు లాక్కుని వెళ్లారు. సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణలోని చార్మినార్ వద్ద ఆందోళన చేపట్టిన పలువురు నిరసనకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘విధ్వంసపు పునాదులపైనే విశ్వాసాన్ని కూడగట్టాలి’
సాక్షి, హైదరాబాద్ : దేశంలో అన్ని వ్యవస్థల విధ్వంసం జరుగుతోంది.. ఆ పునాదులపైనే విశ్వాసాన్ని కూడగట్టాలని స్వరాజ్ అభియాన్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా శనివారం జరిగిన తెలంగాణ జనసమితి పార్టీ తొలి ప్లీనరీకి యోగేంద్ర యాదవ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కేశవరావు జాదవ్ గుర్తుకొస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గూర్చి ప్రొఫెసర్ జయశంకర్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడటానికి తనను హరియాణా నుంచి పిలిచారన్నారు. ఇది రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఇదే నిజమైన జాతీయవాదమని.. కోదండరాం కంటే పెద్ద జాతీయవాది తనకు కపడలేదన్నారు యోగేంద్ర యాదవ్. ప్రస్తుతం దేశ ప్రజలంతా నిరాశలో ఉన్నారని.. ప్రజాస్వామ్యంలో అంధకారం నెలకొందని యోగేంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నరేంద్ర మోదీ.. తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు నియంతల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రతి ఒక్కరు తమ కల్చర్ను నిలబెట్టుకుంటూ.. బీజేపీ మోనో కల్చర్కు వ్యతిరేకంగా పోరాడలని పిలుపునిచ్చారు. అన్ని సిద్థాంతాల్లో ఉన్న మంచిని గ్రహించి ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే సిద్ధాంతాన్ని తయారు చేయాలని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర పొరాటంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ ఈ రోజు దేశభక్తి గల సంఘంగా మభ్యపెడుతోందని మండి పడ్డారు. -
‘బీజేపీని అడ్డుకోకపోతే చావడం మేలు’
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకోకపోతే కాంగ్రెస్ పార్టీ చావాల్సిందేనని స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ అన్నారు. దేశ వ్యాప్తంగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి ప్రత్యమ్నాయంగా నిలవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడలంటే బీజేపీని అడ్డుకోని తీరలనీ, అది సాధ్యం కాకపోతే కాంగ్రెస్ చావడం మేలని అన్నారు. కాగా హోరాహోరీగా సాగిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే ప్రజామోదం ఉంటుందని ఎగ్జిట్పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొన్నాయి. ఎన్డీయే కూటమికి 300లక పైగా స్థానాలు వస్తాయని తెలిపగా.. యూపీఏ కేవలం 120 స్థానాలలోనే పరితమైదని పలు సర్వేల సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. -
మతాల మధ్య పోటీగా ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: కొంత మంది వ్యక్తులు వచ్చే లోక్సభ ఎన్నికలను హిందూ, ముస్లింల మధ్య జరిగే పోటీగా చిత్రీకరిస్తున్నారని స్వరాజ్ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ ఆరోపించారు. తెలంగాణ జన సమితి, స్వరాజ్ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ‘2019 లోక్సభ ఎన్నికల ఎజెండా, కార్యాచరణ, పౌరుల ప్రతిపాదన’ వంటి అంశాలపై సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టం పేరుతో ముస్లింలను ఇబ్బందులకు గురిచేస్తోందని యోగేంద్ర విమర్శించా రు. మతం పేరుతో పౌరసత్వాన్ని ముడి పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోందని, ప్రపంచంలో ఎక్కడ పుట్టిన సరే ముస్లింలు కాకుంటే భారత పౌరులుగా వారికి గుర్తింపు ఇస్తామనే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజా ప్రతిని ధుల ఎన్నిక విషయంలో మతం, డబ్బు, మద్యం ప్రధానాంశాలుగా కాకుండా నిస్వార్థం గా పని చేసే వారికి అవకాశం కల్పించే విధంగా మారాలని అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాల్లో కొత్త మార్పులను తీసుకురావడానికి మేధావులు, ప్రజా ఉద్యమకారుల ఆధ్వర్యంలో ‘రీక్లెయిమింగ్ ద రిపబ్లిక్’ పేరుతో ఒక ఎజెండా ను రూపొందించామని చెప్పారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ’ఇండియన్ సిటిజన్ యాక్షన్ ఫర్ నేషన్ (ఐ కేన్)’ అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. దీనిలో భాగంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ.. నిస్వార్థంగా పని చేసే వారిని లోక్సభ ఎన్నికల బరి లో నిలుపుతామని, దీని కోసం స్వతంత్ర ఎన్నికల ప్యానెల్ అభ్యర్థులను నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ ఎన్నికలో బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రచారం కోసం ఐ కేన్ ప్రత్యేక వాలంటరీ వ్యవస్థ పని చేస్తుందన్నారు. తెలంగాణలోని ప్రజలందరూ ఐ కేన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల తరఫున పోరాడే వారికి మద్దతు.. దేశవ్యాప్తంగా పర్యటించి మేధావులు, ప్రజల పక్షాన పోరాడే వారిని సంప్రదించి ఈ ఎజెండా రూపొందించామని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. ప్రజల ముందుకు ఈ ఎజెండాను తీసుకుపోవడానికి ఐ కేన్ పని చేస్తుందన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ, రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రజల తరఫున గళం వినిపించే వ్యక్తులు కావాలని, అటువంటి వారికి వచ్చే లోక్సభ ఎన్నికల్లో మద్దతుగా నిలిచేందుకు ఈ ఐ కేన్ పని చేస్తోందన్నారు. యోగేంద్ర యాదవ్ ప్రతిపాదించిన ఎజెండాను తెలంగాణ జన సమితి ముందుకు తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. -
సోషల్ మీడియా
జవాబు కావాలి ‘‘కనీస ఆదాయం అనేది చట్టపరమైన హక్కా? కనీసం అంటే ఎంత? పేదలను ఎంపిక చేసే విధానం ఏంటి? బడ్జెట్ ఎంత? ఈ అదనపు ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయి?– ఈ ప్రశ్నలకు రాహుల్ గాంధీ జవాబులివ్వగలిగితే 2019 ఎన్నికలకు సంబంధించి ఇది గొప్ప ఆలోచనగా అంగీకరించొచ్చు’’ – యోగేంద్ర యాదవ్, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు అభివృద్ధి ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సరికొత్త ఒడిశా రాష్ట్ర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉంది. ఎవరూ నిరుద్యోగులుగా ఉండకుండా, ఎవరూ దారిద్య్రరేఖకు దిగువన లేకుండా చూస్తాం. ఒకే నాణేనికి బొమ్మాబొరుసు లాంటి కాంగ్రెస్, బీజేడీలు ఒడిశా అభివృద్ధికి చేసిందేమీ లేదు’’ – అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు లెక్కలు ‘‘నేషనల్ స్టాటస్టికల్ కమిషన్లో ప్రభుత్వేతర సభ్యులంతా రాజీనామా చేశారు. దీంతో మరో సంస్థ పళ్లుపీకి నిర్వీర్యం చేసినట్టే. తమ అసమర్థ పాలనలో జరిగిన అవకతవకల డేటా అంతటినీ దాచిపెట్టడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది’’ – అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎంపీ నియంతృత్వం ‘‘ఒకే పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ, బలమైన ప్రధాని అనే అంశాలు వ్యవస్థలను బలహీనపరిచే రాజ్యాంగ నియంతృత్వానికి దారితీస్తాయి. అందువల్ల సంకీర్ణ ప్రభుత్వం చెడ్డదేమీ కాదు. డీమోనిటైజేషన్ లాంటి విధానపరమైన నిర్లక్ష్యపు ప్రయోగాలు జరుగవు. ఫెడరల్ స్ఫూర్తి విరాజిల్లుతుంది’’ – రూపా సుబ్రమణ్య జర్నలిస్ట్ -
పోలీసుల కస్టడీలో యోగేంద్ర యాదవ్
తిరువణ్ణామలై: సేలం–చెన్నై 8 వరుసల ఎక్స్ప్రెస్ వే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్ను తమిళనాడు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తిరువణ్ణామలై జిల్లాలోని చెంగమ్ వద్దకు చేరుకున్న తనతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారనీ, దాడికి పాల్పడ్డారని యోగేంద్ర ట్విట్టర్లో తెలిపారు. ‘ఆందోళనకారుల ఆహ్వానం మేరకు సంఘీభావం తెలిపేందుకు మేమిక్కడికి చేరుకున్నాం. కానీ రైతులను కలుసుకునేందుకు వెళ్లకుండా మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. మాపై దాడిచేస్తూ వ్యాన్లలోకి తోశారు’ అని ట్వీట్ చేశారు. -
మోదీజీ.. నా నోరు మూయించలేరు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని స్వరాజ్ అభియాన్ అధ్యక్షుడు, జై కిసాన్ ఆందోళన్ వ్యవస్ధాపకుడు యోగేంద్ర యాదవ్ ఆరోపించారు. రెవారిలో తన సోదరి ఆస్పత్రిపై ఐటీ దాడుల నేపథ్యంలో యోగేంద్ర యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సోదరి నిర్వహిస్తున్న నర్సింగ్ హోంపై ఢిల్లీ నుంచి వచ్చిన వంద మందికి పైగా అధికారుల బృందం దాడులకు పాల్పడిందని బుధవారం వరుస ట్వీట్లలో యాదవ్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పుడు తమ కుటుంబాన్ని టార్గెట్ చేసిందని, రెవారిలో మద్దతు ధర కోసం, రైతుల సమస్యలపై తన పాదయాత్ర ముగిసిన రెండు రోజుల అనంతరం తన చెల్లెళ్లు నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఐటీ దాడులు చేపట్టారని ఆరోపించారు. మోదీ తనపై, తన ఇంటిపై సోదాలు నిర్వహించవచ్చని తన కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఆస్పత్రిపై ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందాలు వైద్యులైన తన చెల్లెళ్లు, బావ, మేనల్లుడి చాంబర్లను స్వాధీనం చేసుకుని ఆస్పత్రిని సీల్ చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీయూలో నవజాత శిశువులున్నా పట్టించుకోలేదని వాపోయారు. అణిచివేత వైఖరితో మోదీ తన నోరు మూయించలేరని మరో ట్వీట్లో యాదవ్ స్పష్టం చేశారు. -
మౌలిక లక్షణం మలినం కారాదు
ఇక మేధావులు ప్రవచించే సెక్యులరిజంతో వచ్చిన చిక్కేమిటంటే, అసలు అది ఆ సిద్ధాంతం మౌలిక లక్షణాలనే సర్వ నాశనం చేసింది. మేధావులనేవారు సాధారణ ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, భాష నుంచి సుదూరంగా జరిగిపోయారు. ఇలాంటి మేధావుల చర్చలు ప్రధానంగా ఇంగ్లిష్ చానల్స్లో ఉంటాయి. కాబట్టి సెక్యులర్ అన్న ఆంగ్ల పదానికి భారతీయ భాషలలో సరైన అర్థం కనిపించదు. అధికారికంగా ఇచ్చిన అనువాదం ‘ధర్మ నిరపేక్షత’. కానీ ఈ అనువాదం దుర్వా్యఖ్యానంలా కనిపిస్తుంది. మన దేశంలో జరిగే చాలా బహిరంగ చర్చలు ఎలా ఉంటాయంటే, అవి బధిరుల సంభాషణలను మరిపిస్తూ ఉంటాయి. ఈ చర్చలు ప్రతి నాయకుల మధ్య జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శత్రువుల మధ్య సాగుతూ ఉంటాయనవచ్చు. వాదనలోని ఏ ఒక్క విషయాన్ని అంగీకరించకూడదని భీష్మించుకుని కూర్చున్నట్టే వారు ఉంటారు. ద్వంద్వ యుద్ధంలో ప్రత్యర్థిని ఓడించి తీరాలన్న పట్టుదలతో చర్చకు దిగినట్టు ఉంటుంది. ఇక మిత్రులైతే ఒకరి వాదనను ఒకరు బహి రంగంగా నిరాకరించుకోరు. అందుకే మన టీవీ చర్చలన్నీ అలా చెవులు చిల్లులు పడేటట్టు ఉంటాయి. చాలా చర్చలు సమర నాదాల తోనే సాగుతాయి. ఇంకా, దశ దిశ లేకుండా ఉంటాయి. ఈ కారణం గానే ఈ మధ్య ‘మైనారిటీల స్థితిగతులు’ అన్న అంశం మీద జరిగిన ఒక చర్చను చూశాక ముచ్చటగా అనిపించింది. సెక్యులర్వాద కార్య కర్తలు, మేధావులు కొందరు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో ఆ అంశం మీద తమ తమ విభేదాల గురించి వెల్లడించారు. ప్రముఖ సామాజిక, మానవ హక్కుల కార్యకర్త హర్షమందిర్ రాసిన వ్యాసంతో ఈ చర్చ ఆరంభమైంది. ఆరోగ్యకరమైన చర్చ అవశ్యం ముస్లింల పార్టీ అన్న ముద్ర పడడం వల్లనే మొన్నటి సాధారణ ఎన్ని కలలో కాంగ్రెస్ ఓటమి పాలైందంటూ ఆ మధ్య ఇండియాటుడే పత్రిక నిర్వహించిన గోష్టిలో ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ చేసిన ప్రకటన ఆధారంగా హర్ష ఆ వ్యాసం రాశారు. సోనియా అభిప్రాయానికి మరొక ఉదంతం కూడా జోడించారు. ఒక సందర్భంలో ముస్లింలను బురఖా, టోపీ లేకుండా రావాలంటూ చెప్పిన ఉదంతమది. ముస్లింలు ఈరోజు రాజకీయ అనాథలుగా మిగిలిపోయారని ఆయన వాదన. కానీ ప్రముఖ చరిత్రకారుడు, ఉదారవాద మేధావి రామచంద్ర గుహ దీనితో విభేదించారు. బురఖా ధరించడం ముస్లింల వెనుకబాటుతనానికి ప్రతీకగా కనిపిస్తుందనీ ఉదారవాదులైన మేధావులు ఎవరూ దానిని ఎట్టి పరిస్థితులలోను సమర్థిం చరాదనీ గుహ అభిప్రాయం. ఇంకా సుహాస్ పాల్షికార్, ఇరేన్ అక్బర్, ముకుల్ కేశవన్ వంటి మేధావులు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. అయితే, అసలే ముస్లింలు పెద్ద సవాలును ఎదుర్కొంటున్న తరుణంలో ఇలాంటి చర్చ జరగడం గురించి కొందరు మేధావులు కలత పడి ఉండవచ్చు. దీనిని నేను అంగీకరించను. ఎందుకంటే, తమని తాము ఆత్మశోధన చేసుకోవడానికి కష్ట కాలమే మంచి అవకాశం ఇస్తుంది. ఆచరణ ఎలా ఉందన్నదే ప్రశ్న సిద్ధాంతపరంగా, ఆచరణ స్థాయిలో సెక్యులరిజం ఎలా ఉన్నదీ అనే అంశం గురించి నిజాయితీగా చర్చించుకోవలసిన అవసరం ఉంది. ఇలాంటి చర్చ అనివార్యంగా జరగాలి కూడా. ఎందుకంటే మన గణతంత్ర రాజ్యం నిర్దే శించుకున్న పవిత్ర సిద్ధాంతం సెక్యులరిజం. 1975లో సెక్యులరిజం అన్న పదాన్ని మన రాజ్యాంగ పీఠికలో లాంఛనంగా చేర్చుకుని ఉండవచ్చు. కానీ మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో కీలక భాగమది. సెక్యులర్ కాని భారతదేశాన్ని మనం ఎంచుకోలేదు. అయినప్పటికీ ఆచరణలో ఈ పవిత్ర సిద్ధాంతం తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొంటున్నది. ఇందుకు కారణం సెక్యులరిజం ఆచరణాత్మకంగా, సిద్ధాంతపరంగా రెండు మౌలిక దోషాలతో ఉంది. వాటి గురించి నిజాయితీతో బహిరంగంగా చర్చిండానికి ఇదే అను కూల సమయం. ఆ రెండింటిని రాజకీయ సెక్యులరిజం సమస్య, మేధావుల సెక్యులరిజం సమస్య అనుకోవచ్చు. సెక్యులరిజాన్ని రాజకీయ రంగం పర స్పర విరుద్ధంగా, పక్షపాత దృష్టితో, ఒక సాధనం అన్న ధోరణి నుంచే ఆచ రిస్తుండడం మొదటి సమస్య. ఏదైతే మైనారిటీల హక్కుల పరిరక్షణే ఆశ యంగా మొదలైందో, కాలగమనంలో అదే ఇతరుల బలహీనతలను ఆధారం చేసుకుని మైనారిటీ మేధావులు ప్రయోగించడానికి ఉపకరించే సాధనంగా మారిపోయింది. వాస్తవాల వెల్లడిలో దాపరికమేల? మెజారిటీ మతోన్మాదం, మైనారిటీ మతోన్మాదం మధ్య వైరుధ్యాన్ని శాస్త్ర బద్ధంగా వివరించేందుకు ప్రారంభమైన ఆలోచనే, ఇప్పుడు ముస్లిం మైనా రిటీలను మతోన్మాద పంథాలో కదిలించడానికి జరుగుతున్న ప్రయత్నం నుంచి, వారిలో వ్యక్తమవుతున్న పురోగమన వ్యతిరేకతల నుంచి మన దృష్టిని మళ్లించేదిగా పరిణమించింది. హిందూ సామాజిక విధానంలోని రుగ్మతలను బాహాటంగా చర్చించడానికి చర్చలూ, అందులోని అవాంఛనీయ పరిణామా లను గురించి చెప్పడానికి ఒక విమర్శకుడు కనిపిస్తున్నారు. కానీ ఇతర మతా లలో కనిపించే అలాంటి రుగ్మతలను, అవాంఛనీయ పోకడలను చర్చించే విమర్శకులు తరచూ మౌన ప్రేక్షకులై పోతున్నారు. హిందువులు, వారి సంస్థలు చేస్తున్న దుర్మార్గాల మీద దాడి జరుగుతుంది. శల్యపరీక్షలు జరుగు తాయి. అదే విధంగా ఒక చర్చి, లేదా గురుద్వారా ప్రబంధక్ కమిటీ వంటి సంస్థలు చేసిన దుర్మార్గాల గురించి ఎలాంటి దాడి జరగదు. ఏ విధమైన∙శల్య పరీక్షలు ఉండవు. మైనారిటీలను లాలించడమనే ఆరోపణ తప్పయితే, ఒక సాధారణ ముస్లిం దుస్థితిని గురించి వస్త్వాశ్రయ దృష్టితో చేసిన సూచనలన్నీ కూడా కీడు చేసేవే అవుతాయి. ముస్లిం పురోహిత వర్గాన్ని లాలించడమనేది ఒక చేదునిజం. ఒకవేళ ఆరెస్సెస్, బీజేపీ ముస్లింలను ముస్లింతనానికే పరిమితం చేయాలని కోరుకుంటున్నాయని అనుకుంటే, సెక్యులర్ పార్టీలు చేస్తున్నది కూడా అదే. కొన్నేళ్లుగా సెక్యులర్ పార్టీలు ముస్లింలకు సంబంధించిన సమస్యలను మాత్రమే వెలుగులోకి తెచ్చి, వారి భద్రత గురించి మాత్రమే మాట్లాడి, వారి మత అస్తిత్వం గురించి మాత్రమే చెప్పి వారి ఓట్లను విజయవంతంగా తమ ఖాతాలో వేసుకోగలిగాయి. సాధారణ భారత పౌరులను చేసినట్టు సెక్యులర్ రాజకీయాలు ముస్లింలను ప్రజా సేవలకు, ప్రయోజనాలకు దగ్గర చేయలేదు. వెనుకబడిన ముస్లింలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో, కావలసిన సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో సెక్యులర్ పార్టీల ప్రభుత్వాలు అ«ధికారంలో ఉన్న రాష్ట్రాల చరిత్ర, బీజేపీ పాలిత రాష్ట్రాల రికార్డు కంటే భిన్నంగా ఏమీ లేదు. ఓటు బ్యాంకు రాజ కీయాలంటూ ఇతరులను విమర్శించే స్థితిలో బీజేపీ లేకపోవచ్చు. కానీ సెక్యులర్ పార్టీలు మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను బందీ లుగా చేసుకుని, వారి ఓట్లను రాబట్టుకోవడానికి సంక్షేమ పథకాల అమలు చేయడం కాకుండా, వారిలో భయాందోళనలు కల్పిస్తున్నారు. సెక్యులర్ పార్టీల ఈ ఘనతను గమనించిన తరువాత సెక్యులరిజం అంటే మైనారిటీ అనుకూల విధానం తప్ప మరొకటి కాదంటూ సంఘ్ పరివార్ చేస్తున్న ప్రచారంలో సాధారణ హిందువులు పడి పోవడం పెద్ద వింతేమీ కాదు. మూలాలను నాశనం చేసిన మేధావులు ఇక మేధావులు ప్రవచించే సెక్యులరిజంతో వచ్చిన చిక్కేమిటంటే, అసలు అది ఆ సిద్ధాంతం మౌలిక లక్షణాలనే సర్వ నాశనం చేసింది. మేధావులనేవారు సాధారణ ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, భాష నుంచి సుదూరంగా జరిగిపోయారు. ఇలాంటి మేధావుల చర్చలు ప్రధానంగా ఇంగ్లిష్ చానల్స్లో ఉంటాయి. కాబట్టి సెక్యులర్ అన్న ఆంగ్ల పదానికి భారతీయ భాషలలో సరైన అర్థం కనిపించదు. అధికారికంగా ఇచ్చిన అనువాదం ‘ధర్మ నిరపేక్షత’. కానీ ఈ అనువాదం దుర్వా్యఖ్యానంలా కనిపిస్తుంది. ఇది ప్రతికూలార్థం ఇచ్చేటట్టుగా కనిపించ డమే కాదు, సాంస్కృతికంగా అస్పష్టంగా అనిపిస్తుంది. సెక్యులర్ మేధావుల మాటలలో ఎక్కువగా తిలక ధారణ, బురఖా వంటి మత, సాంస్కృతిక చిహ్నాల పట్ల నిరసన కనిపిస్తుంది. సెక్యులరిజం, ఆధునిక విద్య మన మత వారసత్వం పట్ల ఒక సామూహిక నిరక్షరాస్యతను పెంచేశాయి. దీనితో జరి గిందేమిటంటే, సెక్యులరిజం అంటే ఏవో విదేశాలకు సంబంధించిన విధానం, పాశ్చాత్య ధోరణులు ఉన్న హేతువాదులకు పరిమితం, మన సంస్కృతీ సంప్రదాయాలలో ఇమిడేది కాదు అన్న అభిప్రాయాన్ని కలిగిస్తు న్నది. ఈ సిద్ధాంతాన్ని దారుణంగా ఖండిస్తున్నప్పటికీ ఎదురొడ్డి మాట్లాడు తున్నవారు గడచిన రెండేళ్ల నుంచి బాగా తక్కువగా కనిపిస్తున్నారు. ఒక విషయం స్పష్టం చేస్తాను. ఇది సెక్యులరిజంను వ్యతిరేకించడం కాదు. సెక్యులరిజం అనేది గణతంత్ర భారతం అవతరణకు ఆదిలోనే ఏర్ప రుచుకున్న సిద్ధాంతం. మనం ఇప్పుడు పిలుచుకుంటున్న సెక్యులరిజం అనే సిద్ధాంతం నిజంగా సెక్యులరిజంగా ఉండాలంటే, సిద్ధాంత పరంగానే కాకుండా, దాని ఆచరణ తీరును గురించి పునరాలోచించుకోవాలని నా విన్నపం. మనకు కావలసినది పొందికైన, నిబద్ధత కలిగిన రాజకీయ సెక్యు లరిజం. మనకు మేధో సెక్యులరిజం కూడా కావాలి. కానీ అది మన బహు ళత్వ, మత సంప్రదాయాల మూలాలు కలిగినదై ఉండాలి. ఇందుకు మనం గాంధీజీ నుంచి కొంత నేర్చుకోవలసి రావచ్చు. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్: 98688 88986 -
అవగాహన లేమితోనే వైఫల్యం
భారత్లో 20వ శతాబ్దపు కమ్యూనిస్టు వామపక్షం మరణించింది. కానీ 21వ శతాబ్దంలోకూడా అది తన ప్రాసంగికతను కొనసాగిస్తోంది. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక జవాబుదారితనం, పర్యావరణ స్వావలంబన కోసం నిలబడుతోంది. ఈ లక్ష్య సాధన కోసం అది కొత్త మార్గాలను అన్వేషించడంలో తపన పడుతోంది. ఈ సానుకూల అర్థంలో వామపక్షం భారత్కు పరాయిది కాదు. నిజానికి సూటిగా చెప్పాలంటే మన రాజ్యాంగ నిర్మాణపు భావజాలమే వామపక్ష స్వభావంతో ఉంటోంది. అందుకే.. వామపక్షం మరణించింది. కానీ వామపక్ష భావజాలం చిరకాలం వర్ధిల్లాలి. ఇటీవలే ఒక సోషల్ మీడియా కోణంగి నన్ను కమ్మీ–డాగ్ (కమ్యూనిస్టు కుక్క) అని పిలిచాడు. వెంటనే నేను తీవ్ర ఆలోచనలో మునిగిపోయాను. కుక్క అనే అంశాన్ని ఈ సందర్భంలో అర్థం చేసుకోవడం సులభమే. త్రిపురలో ప్రజా తీర్పు నేపథ్యంలో ప్రత్యేకించి బీజేపీ సోషల్ మీడియా పోకిరీలు పట్టలేని సంతోషంతో ఉండటమే కాకుండా కమ్యూనిస్టులపై తీవ్ర నిందాత్మక వ్యాఖ్యలు గుప్పిస్తున్న సందర్బం అది. దీన్ని పక్కనపెడితే, నేను కూడా తప్పకుండా కమ్యూనిస్టునే అయివుంటాను అని అతగాడు ప్రకటించిన అభిప్రాయమే నన్ను ఆలోచింపజేసింది. సోషల్ మీడియా కోణంగిలు నిరక్షర కుక్షిలే..! ‘వాట్సాప్ యూనివర్సిటీ’ ఉత్పత్తి చేసిన కోణంగిల– ట్రోల్స్–నిరక్షరాస్యత కింద నేను దీన్ని కొట్టిపడేయాలి. నన్ను కమ్యూనిస్టుగా పిలవడానికి నాకున్న ఏకైక అర్హత ఏమిటంటే నేను జేఎన్యూలో చదవడం, గడ్డం పెట్టుకున్న వారిని సమర్థించడం, తరచుగా గుడ్డ సంచీ వాడటమే. ఇది మినహా నా జీవితం పొడవునా నేను కమ్యూనిస్టు సిద్ధాంతం, దాని ఆచరణను విమర్శిస్తూ వచ్చాను. విద్యార్థిగా నేను సమతా యువజన్ సభలో చేరాను. ఇది జేఎన్యూలో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐకి వ్యతిరేకంగా పనిచేసే సంఘం. తర్వాత గాంధియన్–సోషలిస్ట్ స్రవంతికి చెందిన సమతా సంఘటన్, సమాజ్వాదీ పరిషత్తో పనిచేశాను. ఇవి కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలకు చాలా దూరంగా ఉంటాయి. విద్యావిషయకంగా నేను 1980లు, 1990లలో ప్రాబల్యంలో ఉండిన మార్క్సిస్ట్ ఛాందసత్వం పట్ల అసమ్మతి తెలి పాను. పైగా నేను పనిచేస్తున్న సీఎస్డీఎస్ (వర్ధమాన సమాజాల అధ్యయన కేంద్రం) తరచుగా వామపక్ష మేధావుల దాడికి గురయ్యేది. చాలా స్పష్టంగా ఈ బీజేపీ ట్రోల్స్కి ఇదేమాత్రం తెలీదన్నది స్పష్టం. నేను కొనసాగుతున్న మేధో ప్రపంచం అసలు ఉనికిలోనే ఉండదని వీళ్ల భావన కావచ్చు. వీళ్ల ప్రాపంచిక దృక్పథం చాలా సరళంగా ఉంటుంది. అదేమిటంటే పేదలు, విప్లవం గురించి మాట్లాడే ఎవరినైనా సరే వామపక్షం, కమ్యూనిస్టు, సోషలిస్టు, మావోయిస్టు, అర్బన్ నక్సలైట్, రెడ్ అని ముద్రలు వేసేయడమే వీరికి తెలిసిన విద్య. తగిన సాక్ష్యాధారాల విషయంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఈ ట్రోల్స్ మరికొంత లోతైన భావనను సూచిస్తున్నారు. అదేమిటంటే వామపక్షానికి మన కాలంలో అర్థం మారిందన్నదే. ఈరోజు వామపక్షానికి రెండు రకాల విశిష్ట అర్థాలున్నాయి. పాత అర్థంలో చూస్తే కమ్యూనిస్టులు అంటే మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నమ్మేవారు, సోవియట్ రష్యా తరహా ప్రభుత్వ సోషలిజాన్ని బలపర్చేవారు, భారత్లోని అనేక కమ్యూనిస్టు పార్టీలలో ఏదో ఒకదానికి చెంది ఉండేవారు అని అర్థం. వామపక్షానికి ప్రస్తుతం ఏర్పడిన కొత్త అర్థంలో సమానత్వ భావనవైపు నిలబడే ప్రతి ఒక్కరూ చేరతారు. కమ్యూనిస్టు వామపక్షాలు, గాంధియన్ సోషలిస్టులు, సోషలిస్టులు, అంబేద్కరి స్టులు, ఫెమినిస్టులు అందరూ ఈ కోవలోకి వస్తారు. ఈ అన్ని రకాల శ్రేణులకు చెందినవారు ఈ ముద్రను అంగీకరించరు. పైగా ఇది పెద్దగా ఉపయోగపడే వర్ణన కాదు కూడా. కానీ కొత్త ప్రపంచం వీళ్లను ఈ దృష్టితోనే చూస్తోంది. అంతర్గత పోరు అంతిమ పతనాన్ని ఆపగలదా? పాత వామపక్షం మరణించింది. త్రిపురలో 25 ఏళ్లుగా సాగిన సీపీఎం పాలన నాటకీయంగా పతనం కావడం.. భారతీయ కమ్యూనిస్టు పార్టీల పతనం, క్షీణతకు చెందిన సుదీర్ఘ ప్రక్రియను మరోసారి ఎత్తి చూపింది. 1970లలో వామపక్ష నిరోధక ప్రక్రియ మొదలయ్యాక, దాని ప్రభా వం కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపురలకు, జేఎన్యూకు మాత్రమే పరిమితమైపోయింది. 2011లో పశ్చిమబెంగాల్లో వామపక్ష పరాజయంతో కమ్యూనిస్టు పార్టీల అంతిమ పతనం ప్రారంభమయింది. వారు ఇప్పుడు కేరళలో పాలనలో ఉన్నప్పటికీ, సీపీఎంలో తీవ్రమవుతున్న అంతర్గత ముఠా పోరు దాని అంతిమ పతనాన్ని తిరగతోడే అవకాశాలను ఏరకంగానూ పెంపొందించదు. ఇక పార్లమెంటేతర కమ్యూనిస్టులుగా పేరొందిన చిన్న బృందం మావోయిస్టులు రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం అనే కాల్పనిక భ్రమను అనుసరిస్తున్నారు కానీ భారత భద్రతా బలగాల ముట్టడిలో అంతమయ్యేందుకు వీరు చేరువలో ఉన్నారు. స్వేచ్ఛ కోసం మానవ ఆకాంక్షను మరిస్తే ఎలా? పాత వామపక్ష మరణం అనేది ఏమాత్రం విస్మరించలేని ముగింపు. యుఎస్ఎస్ఆర్ తరహా సోవియట్ సోషలిజానికి చెందిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థ విఫలమైంది. రాజ కీయంగా అది ప్రవచించిన సోషలిస్టు ప్రజాస్వామ్యం నియంతృత్వం ముసుగులో పార్టీ నియంతృత్వాన్ని ప్రతి పాదించే వాస్తవ ఉద్దేశాన్ని కలిగివుంది. సోవియట్ యూనియన్, తూర్పు యూరోపియన్ కమ్యూనిస్టు వ్యవస్థల పతనం ఆ తరహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పును స్పష్టంగా సూచించింది. తన పాలనలో స్టాలిన్ లక్షలాదిమంది రైతులను వధించడం, పోల్పాట్ సాగిం చిన మారణకాండ వంటివి కమ్యూనిజం ముసుగులో కొనసాగిన నిరంకుశాధికారపు అతి చర్యలకు తిరుగులేని ఉదాహరణగా నిలిచిపోయాయి. కమ్యూనిస్టు రాజకీయ వ్యవస్థ స్వేచ్ఛకోసం మానవుడి తృష్ణను గుర్తించడంలో విఫలం కాగా, కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థ మార్కెట్ తర్కాన్ని, ఆర్థిక ప్రోత్సాహకాల అవసరాన్ని గుర్తించడంలో విఫలమైంది. ఉత్పత్తి సాధనాలపై ప్రభుత్వ యాజమాన్యం ఒక రకం సమానత్వాన్ని సృష్టించింది కానీ ఆర్థిక వ్యవస్థను అది అత్యల్ప సమతుల్యస్థితికి కుదించివేసి వాణిజ్యతత్వాన్ని, సృజనాత్మకతను చంపేసింది. ఇక ప్రభుత్వ సోషలిజం సృష్టించి పెట్టిన నిరంకుశాధికార వైపరీత్యం మార్కెట్లు దాంతో నడవవు అనే సత్యానికి అద్భుత తార్కాణంగా నిలిచిపోయింది. పైగా, పర్యావరణం, నిర్ణయాలను తీసుకోవడంలో కేంద్రీకరణకు సంబంధించిన ఈ ఆర్థిక వ్యవస్థల రికార్డు భయానకంగా మిగిలిపోయింది. నిస్వార్థ త్యాగమూర్తులు జాతి వ్యతిరేకులా? అంతర్జాతీయ కారణాలతోపాటు, భారత్లో కమ్యూనిస్టు వామపక్షం కుప్పగూలడానికి ఇక్కడి సమాజాన్ని అర్థం చేసుకోవడంలో దానికి ఎదురవుతున్న అసమర్థతే ప్రధాన కారణం. మన కమ్యూనిస్టుల సైద్ధాంతిక పార్శ్వం లోకి యూరోకేంద్రకవాదం జొరబడింది. దీంతో తాము పనిచేస్తున్న సమాజాన్ని వ్యవస్థాగతంగానే వీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మన దేశంలో అసమానత్వ కేంద్రంగా కులం ఉందన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో వీరు విఫలమయ్యారు. అలాగే భారత జాతీయ ఉద్యమం ప్రాధాన్యత స్వభావాన్ని అవగాహన చేసుకోవడంలో వైఫల్యం కూడా ఈ సమస్యలోంచే పుట్టుకొచ్చింది. మరింత లోతుగా చూస్తే, సగటు భారతీయుడి సాంస్కృతిక సున్నితత్వాన్ని తీర్చిదిద్దిన మత, సంప్రదాయిక ప్రపంచాన్ని గుర్తించి, ఎత్తిపట్టడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. వేలాది కమ్యూనిస్టుల నిస్వార్థపూరితమైన త్యాగాలను నిర్లక్ష్యం చేసి వారిని జాతి వ్యతిరేకులుగా ముద్రించడం తప్పే అవుతుంది. కానీ బయట నుంచి వారు భారత్కు తీసుకొచ్చిన సిద్ధాంతమే వారి అంతిమ వైఫల్యానికి దారితీయడం విషాదకరం. దీనర్థం ఏమిటంటే 20వ శతాబ్దపు కమ్యూనిస్టు వామపక్షం ధోరణి మరణించింది. ఇది ఒకందుకు మంచిదే, కానీ రెండో కోణంలో మరింత లోతుగా చూస్తే, వామపక్షం 21వ శతాబ్దంలోకూడా తన ప్రాసంగికతను కొనసాగిస్తోంది. ఈ కోణంలో వామపక్షం సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామిక జువాబుదారీతనం కోసం, పర్యావరణ స్వావలంబన కోసం నిలబడుతోంది. దోపిడీ, అన్యాయంతో కూడిన బలమైన పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ అది ‘వామపక్షం’ గానే ఉంటూ కొనసాగుతోంది. కానీ ఈ లక్ష్య సాధన కోసం అది కొత్త మార్గాలను అన్వేషించడంలో తపన పడుతోంది. ఈ సానుకూల అర్థంలో వామపక్షం భారత్కు పరాయిది కాదు. నిజానికి సూటిగా చెప్పాలంటే మన రాజ్యాంగ నిర్మాణపు భావజాలమే వామపక్ష స్వభావంతో ఉంటోంది. చివరగా... వామపక్షం మరణించింది. కానీ వామపక్ష భావాలు చిరకాలం వర్ధిల్లాలి. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు 98688 88986 -
ఇలాంటి చదువులు మారాలి
మన రుగ్మత పట్ల, మన ఇక్కట్లు, సమస్యల పట్ల విశ్వవిద్యాలయాలు స్పందించాలి. మన అవరోధాలను గమనిస్తూనే మన సమస్యలను పరిష్కరించడానికి అవి ఉపకరించాలి. మన విద్యా ప్రావీణ్యాన్ని విదేశీ సంస్థలు అంచనా వేయడం కాదు. దానికి ఆ సంస్థలు కితాబులు ఇవ్వడం కాదు. మన సామాజిక అవసరాల పట్ల, ప్రజలు ఉన్న పరిస్థితులకు ఎలా స్పందించాయి అన్న అంశమే ఆ పరిశోధనలకు గీటురాయి కావాలి. మనవైన పద్ధతులను అవగతం చేసుకోవడానికి ఆ పరిశోధనలు ఎలా సహకరిస్తున్నాయన్నదే ప్రమాణం కావాలి. విద్యను భారతీయం చేయడమనే విషయం గురించి నాలుగేళ్లలో మనం చాలా చర్చలు జరిపాం. కానీ బధిరుల సంభాషణ మాదిరిగా ఒకరి మాటతో ఒకరికి సంబంధం లేని విధంగా ఆ చర్చలు సాగాయి. ప్రభుత్వంలో ఉన్నవాళ్లలో ఎవరో ఒకరు విద్యను భారతీయం చేయడం గురించే అడపాదడపా ఏదో ఒక ప్రతిపాదన ముందుకు తెస్తూ ఉంటారు. ఆ ప్రతిపాదన తెలిసీ తెలియని వారు చేసినట్టు, తెలివితక్కువగా ఇంకా చెప్పాలంటే వినాశకరంగా కూడా ఉంటుంది. అలాంటి ప్రతిపాదనలను విద్యావేత్తలు, మేధావులు, విధాన రూపకర్తలు సహజంగానే అవహేళన చేస్తూ ఉంటారు. దీనితో ప్రభుత్వం ఏవో పైపై మెరుగులు దిద్ది ఊరుకుంటుంది. అక్కడితో ఆ సంగతి అంతా మరచిపోతారు కూడా. ఆఖరికి విమర్శకులు కూడా అలా మరచిపోయినవారిలో ఉంటారు. చివరికి తేలేదేమిటంటే ఎలాంటి అర్థవంతమైన చర్చకు చోటు ఉండదు. పడిపోతున్న ప్రమాణాలు విద్యావంతుడని చెప్పే ఒక వ్యక్తిని కలుసుకుంటే చాలు, విద్యను భారతీయం చేయడం గురించి చర్చించడం ఎంత అవసరమో మనం వెంటనే గ్రహించగలుగుతాం. దేశంలో ఉత్తమ విశ్వవిద్యాలయాలని పేర్గాంచిన వాటి నుంచి బయటకు వచ్చిన ఏ ఒక్క గ్రాడ్యుయేట్ అయినా కూడా ఏ భారతీయ భాషనూ చదవలేడు. ఆ భాషలో రాయలేడు. మన భాషలలో వచ్చిన అపార ఆధునిక సాహిత్యం గురించి వారికి చాలా తక్కువ మాత్రమే తెలుసు. ఇంగ్లిష్ కాకుండా, భారతీయ భాషలలో ఒక పుస్తకం చదవడం, లేదా ఒక వ్యాసం రాయడం ఆఖరిసారిగా ఎప్పుడు జరిగిందని బాగా పేరున్న ఓ మేధావిని అడగండి! అటు నుంచి వచ్చే సమాధానం చాలా ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. సంస్కృత భాషకు చెందిన ప్రముఖ అధ్యయన కేంద్రాలన్నీ భారతదేశానికి వెలుపలే ఉన్నాయి. ఒక్క భాషల విషయమే కాదు. విద్యావంతుడైన ఆధునిక భారతీయుడు మన పురాణాల మీద చాలా తక్కువ పరిజ్ఞానం మాత్రమే కలిగి ఉంటున్నాడు. ఆయుర్వేదం, యునానీ వైద్య విధానాలు నిరర్థకమని తర్ఫీదు పొందిన ఒక అల్లోపతి వైద్యుడు భావిస్తూ ఉంటాడు. రంగుల అద్దకంలో, నేత కళలో మనకున్న ఘనత గురించి వస్త్ర పరిశ్రమకు చెందిన ఇంజనీర్కు కూడా పరిజ్ఞానం ఉండదు. మంచి విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలని మనమంతా చెప్పుకుంటున్న చోట బోధిస్తున్న పాఠ్య ప్రణాళిక ఏది? అదంతా కొన్నేళ్ల క్రితం అమెరికా, యూరప్లో ఉపయోగించి వదిలేసిన పనికిమాలిన పాఠాల అనుకరణే. సాంస్కృతికంగా ఉండవలసిన ఆత్మ విశ్వాసం లోపిస్తున్నది. మన విద్యా విధానం సాంస్కృతిక నిరక్షరాస్యులను తయారుచేస్తున్నది. వారి సొంత గడ్డ మీద వారే అపరిచితులు. కాబట్టి అసలైన చర్చ మనం నిజంగా వాంఛించవలసినది విద్యను భారతీయం చేయడం అనే అంశం గురించి కాదు. మన విద్యా విధానాన్ని ఎలా భారతీయం చేయడం అనేదే అసలు చర్చనీయాంశం కావాలి. కానీ సమస్య ఏమిటంటే, విద్యను భారతీయం చేయాలంటూ ఊరూవాడా ఏకం చేస్తున్నవారు ఎవరూ కూడా ఆ అంశం గురించి మాట్లాడడానికి కనీసం అర్హత ఉన్నవారు కాదు. అటు విద్య గురించి, ఇటు భారతీయ సంస్కృతి గురించి మాట్లాడడానికి కూడా వారు అర్హత ఉన్నవారు కారు. ఇంకా, బోధన విషయంలో వారు మరీ నిరక్షరాస్యులు. మన సంస్కృతి, మేధోపరమైన మన సంప్రదాయాల గురించి కూడా వారికి పైపైన మాత్రమే అవగాహన ఉంది. విద్యను ఎలా భారతీయం చేయకూడదో వారిని చూసి నేర్చుకోవచ్చు. నిజానికి విద్యను భారతీయం చేయడమంటే అర్థం, భారతీయమైనదని చెప్పుకునే ప్రతి అంశాన్ని ఆకాశానికి ఎత్తడం మాత్రం కాదన్నది సుస్పష్టం. భారతీయం అంటే సాధారణంగా భావించే సంప్రదాయాల గురించి, మరీ ముఖ్యంగా గ్రంథస్థమైనదీ, బ్రాహ్మణవాద సంప్రదాయాన్ని చెప్పేదీ మాత్రమే కాకూడదు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి చేరిన జ్ఞానం గురించి పట్టించుకోకుండా మనకి మనం దూరంగా ఉండిపోవడం కాదు. మన సంప్రదాయంలో ఒక శాఖలా ఉన్న శ్రుత పాండిత్యంతోనే అంతా చెప్పడమూ కాకూడదు. మన భాషల పట్ల శ్రద్ధ అవసరం విద్యను భారతీయం చేయడమనే ఎజెండా పట్ల దీక్షతో ఉంటే అందులో మొదట ఉండవలసినది– ప్రాంతీయ భాషల పట్ల శ్రద్ధ. అలా అని ప్రపంచ స్థాయి అవకాశాలకు దగ్గర చేసే ఇంగ్లిష్ భాష నుంచి పిల్లలను దూరం చేయనక్కరలేదు. కానీ మన చిన్నారులకు ఇంగ్లిష్ మాధ్యమంతో విషయాన్ని బోధించే పద్ధతి మాత్రం అశాస్త్రీయం, అవాంఛనీయం. మాతృభాషలో బోధన జరగడమనే మంచి సూత్రాన్నీ, బహు భాషలు నేర్చుకునే అవకాశం కల్పించే త్రిభాషా బోధన సూత్రాన్నీ పునరుద్ధరించాలి. దీనితో పాటు సంస్కృతం, తమిళం, పర్షియన్ వంటి పురాతన హోదా కలిగిన భాషల బోధనకీ, నేర్చుకోవడానికీ జాతీయ స్థాయిలో ప్రాధాన్యం కల్పించాలి. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాలను మన భాషలలోకి అనువదించుకునే కృషిలో మనం వెనకబడిపోకూడదు. ప్రతి భారతీయుడు ఒక భారతీయ భాషలో అనర్గళంగా మాట్లాడేటట్టు, తడబాటు లేకుండా రాయగలిగేటట్టు చేయగలగాలి. భారతీయ మేధా సంప్రదాయాలను వివరించగలిగే సామర్ధ్యాన్ని సాధించుకోవడం కూడా విద్యను భారతీయం చేయడమనే ప్రక్రియలో తప్పనిసరిగా ఉండాలి. దేశంలోని ప్రతి విద్యార్థి అన్ని ప్రాంతాలకూ అన్ని మతాలకూ చెందిన పురాతన గ్రంథాల నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. గణతంత్ర భారతానికి పునాదిగా ఉన్న గడచిన రెండు శతాబ్దాల నాటి భారతీయ చింతనను కూడా అధ్యయనం చేయాలి. ఈ సాంస్కృతిక, సాహిత్య అంశాలే కాకుండా, ప్రతి శాఖకు చెందిన పరిజ్ఞానం ద్వారా మన మౌఖిక, గ్రాంథిక సంప్రదాయాల నుంచి మనం ఏమి గ్రహించామో ఎవరికి వారు తెలుసుకునేటట్టు ఉండాలి. అంటే తరగతి గదిలో చెప్పే పాఠాలకే పరిమితం కాకుండా, క్షేత్ర స్థాయిలో అనుభవజ్ఞుల ద్వారా కూడా వాస్తవిక అంశాలను తెలుసుకోవడమే దీని వెనుక ఉన్న పరమార్థం. ఇంజనీర్లు కుమ్మరులతో మాటామంతీ జరపాలి. శిల్పులు, బావులూ చెరువులూ తవ్వేవారు, చేనేత పనివారిని కూడా ఇంజనీర్లు కలుసుకోవాలి. ఔషధి గుణాలు కలిగిన మొక్కలను సేకరించేవారితో వైద్యులు ముచ్చటించాలి. సంప్రదాయకంగా ఉండే రోగ నివారణ పద్ధతులను గురించి తెలుసుకోవాలి. దేశవాళీ విత్తనాలను సేకరించేవారి, దేశీయమైన విధానాలను ఆవిష్కరించేవారి అనుభవాల నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు పాఠాలు నేర్చుకోవాలి. దేశీయమైన ఆలోచనలకు ప్రాధాన్యం వీటన్నిటితో పాటు విజ్ఞాన కేంద్రాలలో భారతీయమైన వాతావరణాన్ని నెలకొల్పడం కూడా విద్యను భారతీయం చేయడంలో భాగమవుతుంది. ఈ ఆఖరి సందర్భంలో విషయం భాష కాదు. మన ప్రశ్నలకు సమాధానాలను వెతకడం కోసం మనం ఉపయోగిస్తున్న వనరులు కూడా విషయం కాదు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఎలాంటి ప్రశ్నలను మనం అడగాలి? ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎవరి గురించిన ప్రశ్నలు అడగాలి? ఇప్పుడు మన జ్ఞానకేంద్రాలలో పెద్ద సమస్య ఒకటి ఉంది. అది– ఎవరివో అవసరాలకు స్పందిస్తూ, వేరే ఎవరివో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం. మన మేధాశక్తి అంతా ఇలాగే కాలం గడుపుతోంది. ఇలాంటి ధోరణిని పూర్తిగా మార్చివేయడం కూడా విద్యను భారతీయం చేయడమనే ప్రక్రియలో ప్రధానంగా ఉండాలి. పరిశోధన, నేర్చుకోవడం, బోధనాంశాల ఎజెండా మార్పులో కూడా ఆ ధోరణి అనివార్యమవుతుంది.ఒక సాధారణ భారతీయుడి అవసరాలు తీర్చడం ఎలాగో నిర్వచించడం గురించే వైద్య, వ్యవసాయ, ఇంజనీరింగ్, లేదా ఐటీ రంగాలలోని సరికొత్త పరిశోధనలన్నీ వాటి ధ్యేయంగా ఎంచుకోవాలి. సామాజిక శాస్త్రాలు, హ్యుమానిటీస్ రంగంలో జరిగే పరిశోధన వర్తమానానికి తగినట్టు ఉండాలి. అమెరికా, యూరప్ దేశాల పరిశోధనల నిబంధనలలో కూరుకుపోకుండా చరిత్రాత్మకమైన మన పరిశోధన పంథాను అర్థవంతం చేయాలి. మన రుగ్మత పట్ల, మన ఇక్కట్ల పట్ల, మన సమస్యల పట్ల విశ్వవిద్యాలయాలు స్పందించాలి. మన అవరోధాలను గమనిస్తూనే మన సమస్యలను పరిష్కరించడానికి అవి ఉపకరించాలి. మన విద్యా ప్రావీణ్యాన్ని విదేశీ సంస్థలు అంచనా వేయడం కాదు. దానికి ఆ సంస్థలు కితాబులు ఇవ్వడం కాదు. మన సామాజిక అవసరాల పట్ల, ప్రజలు ఉన్న పరిస్థితులకు ఎలా స్పందించాయి అన్న అంశమే ఆ పరిశోధనలకు గీటురాయి కావాలి. మనవైన పద్ధతులను అవగతం చేసుకోవడానికి ఆ పరిశోధనలు ఎలా సహకరిస్తున్నాయన్నదే ప్రమాణం కావాలి. ఇలాంటి వాదన చాలామంది ఆధునిక, బాగా చదువుకున్న భారతీయుల మనసులను అశాంతికి గురి చేయవచ్చు. ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవలసిందే. ఆధునికత అంటే ఎవరినో అనుకరించడం కాదు. ఎవరున్న సంకట స్థితి నుంచి వారిని తప్పించడానికి కొత్త పరిష్కారాలను అన్వేషించడమే ఆధునికత అంటే. విశ్వవ్యాప్తం కావడం గురించిన తృష్ణ రూపురేఖలు లేని స్థితి నుంచి ఆరంభం కాదు. దీనితో అందరూ ఏకీభవించకపోవచ్చు. అయినా కానీ విద్యను భారతీయం చేయడం గురించి మనం లోతైన చర్చను లేవదీయలేమా? యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్ : 98688 88986 -
ఘోరం.. చదువుల సారం
ఇప్పుడు వాస్తవంగా ఎదురవుతున్న సమస్య విద్యా ప్రమాణాల స్థాయి. మన పాఠశాలలు అందిస్తున్న విద్య స్థాయి అత్యంత నిరాశాజనకంగా ఉన్నదని ఆ నివేదిక వెల్లడించింది. 14–18 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలబాలికలు తమ మాతృభాషలో ఉన్న వచనాన్ని కూడా చదవలేకపోతున్నారు. నిజానికి మాతృభాషలో ఉన్న వాక్యాలను చదవగలిగే సామర్థ్యం వారికి ఎనిమిదేళ్లు నిండే సరికే రావాలి. ఈ సర్వే పరిధిని బట్టి 57 శాతం బాలబాలికలు ప్రాథమిక అంకగణితంలో లెక్క కూడా పరిష్కరించలేక పోతున్నారు. అంటే 591ని 4తో భాగహారం కూడా చేయలేకపోతున్నారు. దేశంలో విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో విశదీకరించే పెద్ద నివేదికలు రెండు గడచిన మాసంలో వెలువడ్డాయి. ఇందులో ఒకటి అధికారికమైనది కాగా, రెండోది అనధికారిక నివేదిక. ఈ రెండూ కూడా ఇప్పుడు బోధిస్తున్న విద్య దేశానికి ఏమి ఇస్తున్నదో ఒక సమగ్ర చిత్రాన్ని మన కళ్ల ముందు రూపు కట్టిస్తాయి. పాఠశా లల్లో బోధించే వివిధ పాఠ్యాంశాల నుంచి పిల్లలు ఏం నేర్చుకున్నారు అనే విషయాన్ని అధికారిక నివేదిక వివ రించింది. పిల్లలు ఏం చదువుకున్నప్పటికీ వాళ్ల సామ ర్థ్యం ఏపాటిది అనే విషయానికి అనధికారిక నివేదిక అద్దం పట్టింది. మరేదైనా ఇతర దేశంలో ఎక్కడైనా సరే, ఈ నివేదిక వ్యవహారం పత్రికలలో పతాకశీర్షికగా చోటు దక్కించుకునేది. భవిష్యత్తును గురించి లోతుగా ఆలో చించే మరే ఇతర దేశంలో అయినా ఇలాంటి సర్వేలను విశ్లేషిస్తూ పుంఖానుపుంఖాలుగా వార్తలు వెలువడేవే కూడా. ఇండియాలో తప్ప మరెక్కడైనా అయితే ఈ అంశం మీద గంటల తరబడి టీవీ చానళ్లలో చర్చలు జరి గేవి. కానీ ఇంకా విడుదలకు నోచుకోని ఒక సినిమా గురించీ, ఒక కల్పిత పాత్రను గురించీ చర్చించడానికి మాత్రం మనకు బోలెడు సమయం ఉంటుంది. కానీ భావి భారత పౌరుల శ్రేయస్సు కోసం చర్చించేందుకు మనకు సమయం ఉండదు. భారతీయులం మాత్రమే ఇలా వ్యవహరించగలం. విద్య నాణ్యాతా ప్రమాణాలే లక్ష్యంగా విద్య స్థితిగతుల వార్షిక నివేదిక –2017 (ఏఎస్ఆర్) పేరుతో వెలువడినది–అనధికారిక సర్వే. దీనిని ప్రఖ్యాత ప్రభుత్వేతర సంస్థ ‘ప్రాథమ్’ విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలలో విద్యా ప్రమాణాలలోని లోటు పాట్లను అందరి దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంతో ప్రాథమ్ దశాబ్దకాలంగా ఇలాంటి నివేదికలను విడుదల చేస్తు న్నది. ఈసారి వెలువరించిన నివేదిక మరీ ప్రత్యేకమై నది. దీనికి ‘మూలసూత్రాలకు ఆవల’ అని పేరు పెట్టారు. 14–18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న విద్యార్థులు విద్యను ఆకళింపు చేసుకుంటున్న స్థాయిల మీద ఈ నివేదిక ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. దేశంలోని 24 రాష్ట్రాలలో ఒక్కొక్క జిల్లా వంతున సర్వే కోసం ఎంచుకున్నారు. యువతీయువకులను ప్రశ్నలను అడిగేందుకు మొత్తం 23,000 ఇళ్లను ఎంపిక చేశారు. పక డ్బందీగా రూపొందించిన ఈ సర్వే కొంతమేర అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సర్వే ఉద్దేశం విద్యలో నాణ్యతా ప్రమాణాలు కాబట్టి ప్రశ్నలు అందుకు తగ్గట్టు కొన్ని తేలికగా ఉన్నాయి. రెండవది, అంటే అధికారిక సర్వే విద్యా పరిశోధన, శిక్షణ జాతీయ మండలి (ఎన్సీఈఆర్టీ) విడుదల చేసి నది. ఎంతో ప్రతిష్ట ఉన్న నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఇది. అంటే జాతీయ స్థాయిలో విద్య సాధించిన విజ యాల మీద నివేదిక. ఈ సర్వే చాలా విషయాలలో విస్తృత స్థాయిలో ఉంటుంది. ఇది దేశంలోని 701 జిల్లా లను తన పరిధిలోకి తీసుకున్న నివేదిక. లక్షా పదివేల పాఠశాలలు, 21 లక్షల విద్యార్థుల విద్యా ప్రమాణాలను గురించి వివరించింది. ఈ సర్వేకు ఉన్న విలువ ఏమి టంటే, ఇది చాలా విశ్వసనీయమైన గణాంకాలను అంది స్తుంది. అయితే చాలా కీలకాంశాలు గ్రాఫ్లు, పట్టికల వెనుక అందీఅందకుండా ఉంటాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సర్వే జాతీయ నివేదికను వెల్లడించ రాదని ఎన్సీఈఆర్టీ భావించింది. ఇప్పుడు మనకు లభ్యమైన సర్వేలు కేవలం జిల్లా స్థాయికి సంబంధించి నవే. ఒక్కొక్క జిల్లాకు సంబంధించి 12 నివేదికలు ఉంటాయి. ఇవి చదవడం కొంచెం కష్టమే. నిరాశాజనకమైన విద్య మనందరం భావిస్తున్నట్టే పిల్లలు పాఠశాలలో చేరడం ఇప్పుడు విద్యారంగాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య కాదని విద్య స్థితిగతుల వార్షిక నివేదిక –2017 కూడా పేర్కొ న్నది. ఎందుకంటే ప్రస్తుతం పాఠశాలలో చేరకుండా ఉండిపోయిన పిల్లలు 14 శాతమే. ఇప్పుడు వాస్తవంగా ఎదురవుతున్న సమస్య విద్యా ప్రమాణాల స్థాయి. మన పాఠశాలలు అందిస్తున్న విద్య స్థాయి అత్యంత నిరా శాజనకంగా ఉన్నదని ఆ నివేదిక వెల్లడించింది. 14–18 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలబాలికలు తమ మాతృభాషలో ఉన్న వచనాన్ని కూడా చదవలేకపోతు న్నారు. నిజానికి మాతృభాషలో ఉన్న వాక్యాలను చదవ గలిగే సామర్థ్యం వారికి ఎనిమిదేళ్లు నిండేసరికే రావాలి. ఈ సర్వే పరిధిని బట్టి 57 శాతం బాలబాలికలు ప్రాథమిక అంకగణితంలో లెక్క కూడా పరిష్కరించ లేకపోతున్నారు. అంటే 591ని 4తో భాగహారం కూడా చేయలేకపోతున్నారు. ఇందులో చాలామంది పాఠశా లలో కొద్దిపాటి ఇంగ్లిష్ను కూడా చదువుకుంటున్నారు. కానీ వారిలో దాదాపు సగం మంది ‘వాటీజ్ ది టైమ్’ వంటి సులభమైన వాక్యాలను కూడా చదవలేకపోతు న్నారు. ఆ వయసు పిల్లలు వాళ్ల వాళ్ల పాఠశాలల్లో నేర్చు కున్న దానిని బట్టి దేశానికి ఏమి ఇవ్వగలరో ఒక్కసారి పరిశీలిద్దాం. ఇది కూడా మనకున్న నమ్మకం స్థాయిని ఏ మాత్రం పెంచేదిగా లేదు. డబ్బులు కూడా లెక్కపెట్టలేరు పాఠశాలలకు వెళుతున్న ఆ వయసు పిల్లల్లో కనీసం నాలుగో వంతు మంది డబ్బులు లెక్కపెట్టలేరు. 40 శాతం మంది చేతి గడియారం చూసి సమయం ఎంత యిందో చెప్పలేరు. 60 శాతం మంది సమయం, పొడవు వెడల్పులను గణించి చెప్పలేరు. ఏదైనా ఒక ప్యాకెట్ మీద రాసిన నిబంధనలను చదవలేనివాళ్లు 46 శాతం ఉన్నారు. వీరంతా పాఠశాలలకు వెళ్లిన విద్యావంతులని చెప్పుకోదగినవారే. 36 శాతం మందికి మార్కెట్ అంచ నాలు తెలియవు. ఇంకా ఆశ్చర్యం, భారత దేశ పటం చూపించి మీ రాష్ట్రం ఎక్కడుందో గుర్తించమంటే గుర్తించ లేని వారు 58 శాతం ఉన్నారు. ఇంకా విశ్వసనీయమైన సర్వేను డీకోడ్ చేసి పరి శీలిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ప్రాథమిక విషయాలే మనలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ సర్వే చూసిన తరువాత వివిధ కాలాలలో వివిధ స్థాయిల లోని విద్యార్థులను గురించి బేరీజు వేసి చూడడానికి ఈ సర్వే మనకు అవకాశం ఇస్తుంది. కానీ ఇందులో విని పించే ఒక శుభవార్త కూడా ఉంది. సాధించడం అనే అంశానికి సంబంధించి బాలబాలికల మధ్య అంతరం గణనీయంగా తగ్గింది. ఆ మాటకొస్తే కొన్ని పాఠ్యాంశా లకు సంబంధించి బాలుర కంటే బాలికలే ముందంజలో ఉన్నారని కూడా చెప్పాలి. పట్టణ–గ్రామీణ ప్రాంతాల పాఠశాలలు; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యా ర్థులకు– అభివృద్ధి చెందిన వర్గాలకు చెందిన కుటుం బాల నుంచి వచ్చిన విద్యార్థులకు నడుమ అంత రం మాత్రం చాలా హెచ్చుగా కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య అంతరం కూడా ఎక్కువగానే ఉంది. ఈసారి వచ్చిన జాతీయ స్థాయి సాధన సర్వేలో బాగా కలవరపెట్టే అంశం విద్యా ప్రమా ణాలలో దారు ణమైన పతనం. గ్రామీణ ప్రాంత పాఠశాలలను చూస్తే చాలు నిజానికి ఈ సర్వేలు వెల్లడిస్తున్న అంశాలు దేశానికి కొత్తేమీ కావు. దేశంలోని సాధారణ పాఠశాలల స్థితి గతులను గురించి అవగాహన ఉన్నవారు ఈ సర్వే ఫలితాలను చూసి దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం కూడా జరగదు. ముఖ్యంగా గ్రామీణ భారతంలోని పాఠశాల లను చూస్తే అసలు ఆశ్చర్యం కలగదు. కానీ ఈ సర్వేల ఫలితాలు మన పాఠశాల విధానంలోని లోటుపాట్లకు అద్దం పడుతున్నాయని మాత్రం చెప్పవచ్చు. ఈ దుస్థితి నుంచి చదువును రక్షించుకోవడానికి జిల్లా స్థాయిలో తీసుకోవలసిన చర్యల గురించి ఈ నివేదికలు హెచ్చ రిస్తున్నాయి. అయితే నిజంగా వేసుకోవలసిన ప్రశ్న ఒకటి ఉంది. ఇదంతా ఎవరు వింటారు? విద్యాభివృద్ధి గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ, బడ్జెట్లో మాత్రం అరకొరగా కేటాయింపులు చేసే చోట ఈ ప్రశ్నకు ఆశా జనకమైన సమాధానాన్ని ఆశించడం సాధ్యం కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తరు వాత పరిస్థితి ఇది. విద్యను ఒక హక్కుగా ప్రకటించు కున్నాక కూడా నాసిరకం విద్యతోనే తరం తరువాత తరం పాఠశాలల ప్రాంగణాలను వీడి వస్తున్నాయి. ఆప రేషన్ బ్లాక్బోర్డ్ సహా, ఎన్నో కమిషన్లు మన విద్యారం గాన్ని క్షాళన చేయడానికి ఉద్దేశించినవే. కానీ ఫలితం మాత్రం ఆశాజనకంగా లేదని ఈ తాజా సర్వేలు నిర్ద్వం ద్వంగా వెల్లడిస్తున్నాయి. భావి భారతదేశం తరగతి గదులలోనే రూపుదిద్దుకుంటుందన్న వాస్తవం గ్రహించ డానికి మన రాజకీయ నాయకత్వానికి ఇంకా ఎంత సమయం కావాలో తెలియడం లేదు. విద్యారంగానికి కేటాయింపులు తక్కువగా చేయడమే కాదు, ఆ మంత్రిత్వ శాఖలను కూడా సరైన వ్యక్తులకు అప్పగిం చడం లేదు. సరైన వ్యక్తులు వచ్చినప్పటికీ విద్యను ఖర్చుగా పరిగణించే వాతావరణం ఎక్కువగా కనిపిం చడం వల్ల వారు చేయగలిగింది కూడా చేయలేకపోతు న్నారు. భారత్ కీర్తి పతాక అంతర్జాతీయంగా రెపరెప లాడుతున్నదని చెబుతున్న నాయకత్వం గ్రామీణ భార తంలోని విద్య స్థితిగతులను పట్టించుకొనకపోతే; బడుగు వర్గాలకు, ఉన్నత వర్గాలకు మధ్య విద్యాపర మైన అంతరాలు తొలగకపోతే ఎదురయ్యే పరిణామాలు దేశ భవిష్యత్తును మసకబారుస్తాయి. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు ‘ 98688 88986 యోగేంద్ర యాదవ్ -
రైతుకు చోటెక్కడ?
ఏమాత్రం రాజకీయ సంకల్పం లేకపోతే ఇలాగే ఉంటుంది. ఈ బడ్జెట్ రైతులకు ఎంతో కొంత మేలు చేస్తుందని ఎదురుచూసినవారికి దింపుడు కళ్లం ఆశలే మిగిలాయి. ఇలా ఆశ పెట్టుకోవడానికి కారణాలు లేకపోలేదు. అందులో మొదటిది– వ్యవసాయం పరిస్థితి ఎంతమాత్రం ఆశాజనకంగా లేదన్న వాస్తవాన్ని ఆర్థిక సర్వే గుర్తించింది. ఈ పరిస్థితితో సేద్యం భవిష్యత్తు మరింత క్లిష్టతరం కాగలదని కూడా సర్వే అంగీకరించింది. రెండు– గడచిన ఆరు మాసాలుగా దేశంలో పలుచోట్ల రైతాంగ ఆందోళనలు మిన్నంటు తున్నాయి. ఇది రైతుల ఆగ్రహాన్ని ప్రతిబింబించే పరిణామమే. మూడు– గ్రామీణ ప్రాంతాలవారు అసంతృప్తికి లోనైతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ బడ్జెట్ పరిగణనలోనికి తీసుకుంటుందని అంతా ఆశ పడ్డారు. పోనీ ఇవేమీ కాకున్నా, వచ్చే ఎన్నికల కోసమైనా తాజా బడ్జెట్ రైతులు కంటున్న కొన్ని కలలను నెరవేరుస్తుందని అంతా ఎదురుచూశారు. ఇలాంటి ఎదురుచూపులకు ఇంకొన్ని కారణాలు కూడా దోహదం చేశాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘భవంతార్ యోజన’ పథ కాన్ని దేశ వ్యాప్తంగా విస్తరిస్తారని చాలా నివేదికలు వెల్లడించాయి. కేంద్ర, రాష్ట్రాల మద్దతుతో ‘మార్కెట్ జోక్యం కలిగిన పథకం’ అమలు చేస్తారని కూడా నివేదికలు వచ్చాయి. బేషరతుగా లేదా పాక్షికంగా రుణమాపీ పథ కాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని కూడా చాలామంది ఆశించారు. సేద్యానికి అయిన వ్యయానికి యాభయ్ శాతం కలిపి, దిగుబడులకు హామీగా ప్రభుత్వం ధరలు ప్రకటిస్తుందని కూడా చాలామంది భావించారు. నిజానికి ఇలాంటి ధరల హామీ బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. అంతేకాకుండా చాలాకాలం నుంచి ఈ హామీని ఎటూ తేల్చకుండా ఉంచింది. దీనికే ఇప్పుడు మోక్షం వస్తుందని ఆశించారు. ఇన్ని అంశాల గురించి ఎదురు చూసినప్పటికీ అందులో ఒక్కటి కూడా సంతృప్తికరంగా లేదు. ఈ బడ్జెట్కు మనం పది మార్కులు వేయాలని నిర్ణయించారు. అయితే ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని ముగించాక ఎన్ని మార్కులు సాధించారో మనకే అర్థం కాలేదు. నాలుగు అంశాలు భారత రైతాంగానికి ఎంతో కీలకమైనవి. అయినా కూడా వాటి గురించిన ప్రస్తావనే లేదు. అవి– బీమా, పంటలకు నష్ట పరిహారం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాగు నీటి వ్యవస్థ. మొత్తం బడ్జెట్లో జరిగిన కేటాయింపులను గమనించిన తరు వాత ఆ నాలుగు అంశాలను ఆర్థికమంత్రి ప్రస్తావించలేదన్న సంగతి తెలు స్తుంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి చట్టబద్ధంగా కనీసం జరగవలసిన కేటాయింపు మొత్తం రూ. 80,000 కోట్లు. ఇక పంటల నష్టపరిహారం, సాగునీటి వ్యవస్థలకు జరిగే కేటాయింపులు మామూలే. అలాగే ప్రధాని ఫసల్ బీమా యోజన అంత ప్రోత్సాహకరంగా లేదు. మొత్తంగా సేద్యానికి కేటాయించిన బడ్జెట్లో 13 శాతం పెరిగింది. మొత్తం బడ్జెట్లో కూడా సేద్యం వాటా అంతే. అయితే ఈ పెంపు రైతాం గానికి ఏ విధంగా ఊతం ఇవ్వగలదు? మత్స్య, పశుసంవర్థక శాఖకు, గ్రామీణ మండీల మెరుగుదలకు ప్రకటించిన సానుకూల చర్యలు మేలు చేకూర్చే ఆలోచనే. అయితే మిగిలిన రంగాలకు ప్రభుత్వం ఇచ్చిన చేయూతతో చూస్తే ఇది తక్కువ. నిజం చెప్పాలంటే భారతీయ రైతాంగం కోరుకుంటున్న చేయూత ఈ స్థాయిలోది కాదు. గడచిన ఏడెనిమిది మాసాలుగా భారతీయ రైతాంగం ఆందోళనలు చేస్తూ, సంఘర్షించడానికి వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రావా లనీ, రుణ బాధ నుంచి విముక్తం కావాలనీ వారు కోరుకుంటున్నారు. సరిగ్గా ఈ విషయంలోనే రైతాంగం మనసును తాజా బడ్జెట్ తీవ్రంగా గాయపరి చింది. పూర్తిస్థాయిలో లేదా పాక్షికంగా గానీ, షరతులతో కూడిన లేదా బేష రతుగా గానీ రుణ మాఫీ గురించి ఈ బడ్జెట్లో ప్రకటించలేదు. బ్యాంకుల ద్వారా కార్పొరేట్ సంస్థలకు, చిన్న పరిశ్రమలకు రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం రైతుల విషయంలో మాత్రం అలాంటి ఔదార్యం చూపకపోవ డంతో వారి మనోభావాలు తీవ్రస్థాయిలో గాయపడినాయి. రైతులను పెద్దగా నిరాశపరిచిన మరొక అంశం– దిగుబడుల ధరల గురించి ప్రభుత్వం చేసిన అట్టహాసపు ప్రకటన. సేద్యపు ఖర్చులు + 50 శాతం కలిపి రైతులకు భరోసాగా ధర నిర్ణయిస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో చేసిన ప్రకటనను నెరవేరుస్తున్నట్టుగానే పటాటోపంగా ఆర్థిక మంత్రి ఈ ప్రకటన చేశారు. కానీ ఈ ప్రకటనలో అంత పస లేదని ఆర్థిక మంత్రికి కూడా బాగా తెలుసు. నిజానికి సేద్యపు వ్యయం + 50 శాతం అనే సూత్రాన్ని ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించింది. దీని స్వరూపం గురించి ఆ కమిషన్ ఎలాంటి శషభిషలు లేకుండా వివరించింది కూడా. ఇక్కడ వ్యయం అంటే సమగ్ర వ్యయం. అంటే, చెల్లించిన మొత్తం, కుటుం బం అందించిన శ్రమ, కౌలు అద్దె, కౌలు వడ్డీ. సాంకేతిక పరిభాషలో దీనినే సీ2 అంటారు. అలాగే రైతులు కనీస మద్దతు ధరను ఎలా పొందగలరు అన్న కీలక ప్రశ్న జోలికి కూడా ఆర్థికమంత్రి వెళ్లలేదు. మొత్తంగా గమనిస్తే ఈ బడ్జెట్ ఇస్తున్న సందేశం సుస్పష్టమే. రైతుల దయనీయ స్థితిని ఈ ప్రభుత్వం పట్టించుకోదు. అలాంటి ఉద్దేశం కూడా లేదు. రైతులకు ఎటువంటి మేలు చేయకున్నా వారి ఓట్లు తమకే దక్కుతాయన్న ధోరణిలో ఈ ప్రభుత్వం ఉంది. రైతుల కోణం నుంచి ఈ బడ్జెట్ను పరిశీలిస్తే రాజకీయ సంకల్పం కాస్త కూడా లేని వాస్తవం తెలుస్తుంది. ఇక వ్యవసాయం చేయాలా వద్దా అనేది రైతులు నిర్ణయించుకోవాలి. ఇదికాకుండా వారికి మిగిలివున్న ఏకైక మార్గం ఆందో ళన బాట పట్టడమే. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్ : 98688 88986 -
నిరసన వెనుక దాగిన సత్యం
ఈ నలుగురు న్యాయమూర్తులు.. ఎమర్జెన్సీ నాటి జడ్జీల్లా కాకుండా, తమ ఆత్మలను తాము అమ్మివేసిన ఆరోపణకు గురికావద్దని నిశ్చయించుకున్నారు. కానీ న్యాయవ్యవస్థ, రాజ్యాంగ క్రమం అనేవి జడ్జీలపైనే ఆధారపడి ఉండవు. అంతిమంగా అవి పౌరులందరి అప్రమత్తతపైనే ఆధారపడి ఉంటాయి. సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం అసలు సంక్షోభమే కాదన్న విషయంలో కాస్త స్పష్టత కలిగి ఉందాం. ఇది న్యాయస్థాన పరిధిని దాటి బట్టబయలైన ఉన్నత న్యాయమూర్తుల మధ్య వ్యక్తిగత పెనుగులాట కాదు. ఇది జడ్జి లోయా కేసును, అలాంటి మరి కొన్ని కేసులను ఎవరు విచారించాలన్న అంశానికి సంబంధించిన వివాదం కాదు. ఇది సుప్రీంకోర్టు రోస్టర్ని నిర్ణయించే అధికారం, విధి విధానాలకు చెందిన సాంకేతిక వివాదం కూడా కాదు. ఇది మన అత్యున్నత న్యాయస్థానాన్ని ఎత్తిచూపుతున్న తీవ్రమైన అవినీతి ఆరోపణ గురించిన సమస్య కూడా కాదు. వాస్తవానికి ఇది న్యాయవ్యవస్థ అంతర్గత వివాదానికి సంబంధించిన సమస్య కానే కాదు. నిస్సందేహంగా ఇది ఈ సంక్షోభంలో అదృశ్యంగా ఉండి వెనుకనుంచి వ్యవహారం నడుపుతున్న ఒక పాత్రధారికి చెందిన సమస్య. అదెవరో కాదు మోదీ ప్రభుత్వమే. ఇది న్యాయవ్యవస్థకు, కార్యనిర్వాహక వర్గానికి మధ్య సంబంధాలకు చెందిన సమస్య. ఇది సుప్రీంకోర్టు బెంచ్ని ఫిక్స్ చేయడం ద్వారా తేలిగ్గా వంగిపోయే న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకునే ప్రభుత్వ ప్రయత్నానికి సంబంధించిన సమస్య. ఎమర్జెన్సీకి ముందు, నాటి ప్రధాని ఇందిరా గాంధీ అలా డిమాండ్ చేయటమే కాదు, ప్రభుత్వానికి మద్దతునిచ్చే తరహా న్యాయవ్యవస్థను దాదాపుగా సాధించుకున్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా రాజీ పడిపోయిన న్యాయవ్యవస్థ ద్వారా ఇదే లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నిస్తోంది. నలుగురు న్యాయమూర్తుల నిరసన... ఈ ప్రాజెక్టులో మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న చివరి కీలకమైన ఆవరోధం కావచ్చు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఏ పరిణామానికైనా తోడుగా వచ్చే పుకార్లకు మనం లోనుకాకుండా ఉందాం. జడ్జీలు వారి ఉద్దేశాల మధ్య సంబంధంపై మీడియా, న్యాయవాదులు తీవ్ర అంచనాలు కడుతుం టారు. నిజానికి ఏ మానవ కార్యాచరణ అయినా సరే.. అసూయ, అత్యాశ, అహంభావం అనే లక్షణాలకు దూరంగా ఉండదు. కానీ న్యాయవ్యవస్థ సమగ్రతకు ప్రతిరూపంగా పేరుపడిన నలుగురు న్యాయమూర్తులు కనీవినీ రీతిలో చేపట్టిన సామూహిక చర్య ఇలాంటి అల్పమైన అంశాలకు పరిమితమై ఉండదు. ఈ నలుగురిలో ఏ ఒక్కరూ దీనివల్ల లబ్ధి పొందకపోగా, తమ చర్యకు గానూ ప్రతిదాన్నీ నష్టపోవలసి ఉంటుంది. జస్టిస్ గొగోయ్ తదుపరి చీఫ్ జస్టిస్గా పదవిని చేపట్టే అవకాశం కోల్పోయే ప్రమాదముంది. ఇక మిగిలిన ముగ్గురు జడ్జీలు చాలామంది రిటైర్డ్ జడ్జీలు చేజిక్కించుకునే పదవీ విరమణ అనంతర ప్రయోజనాలను కోల్పోవచ్చు కూడా. పైగా, వీరి ప్రెస్ కాన్ఫరెన్స్ భారీ కుట్ర ద్వారా పకడ్బందీగా కాకుండా అకస్మిక ఘటనగా పరిణమించింది. కాబట్టి వీరు తమ అంతరాత్మ ప్రబోధానుసారమే మాట్లాడారనే విషయాన్ని మనం నమ్మకుండా ఉండాల్సిన పనిలేదు. ఏ సందర్భంలోనైనా వారు రాజీపడాలనుకుని ఉంటే, రాజ్యాంగ బెంచ్ నుంచి వారిని మినహాయించే పనిని చీఫ్ జస్టిస్ తలపెట్టి ఉండకపోవచ్చు కూడా. సుప్రీం జడ్జీలు తమ అసమ్మతి వ్యక్తం చేయడానికి ఇది సరైన మార్గమేనా అనే వివాదంలో మనం చిక్కుకోకుండా జాగ్రత్త పడదాం. నిజం గానే న్యాయమూర్తులు మీడియా ద్వారా కాకుండా, వారి తీర్పుల ద్వారానే మాట్లాడాలని అందరూ భావిస్తారు. కానీ మన జడ్జీలు ఈ సమస్య ప్రజల దృష్టికి తప్పక తీసుకుపోయి తీరవలసిన అంశంగా ఆలోచించారు. జాతి రుణాన్ని తీర్చుకుంటున్నామని చెప్పడం ద్వారా వారు దాన్నే సూచించి ఉంటారు. అయితే పథకం ప్రకారం అల్లిన కథలు, లీక్ చేసిన ఉత్తరాలు వంటి నిజాయితీ రహిత రూపంలో కాకుండా బహిరంగంగా ప్రజల ముందే తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించినందుకు వీరికి మనం నిజంగానే కృతజ్ఞత తెలపాలి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు రోస్టర్ని ఎవరు, ఎలా నిర్ణయించాలి అనే సాంకేతిక వివాదానికి మనం పరిమితం కావద్దు. ప్రస్తుత ఏర్పాటు ప్రకారం ప్రధాన న్యాయమూర్తే రోస్టర్ని నిర్ణయిస్తారనడంలో వివాదమే లేదు. కానీ కోర్టులు ప్రతిరోజూ బడాబాబులకు చెబుతున్న– అవును, మీకు అధికారముంది, కానీ దాన్ని మీరు ఇష్టమొచ్చినట్లుగా ఉపయోగించకూడదు– అనే మాటలను చీఫ్ జస్టిస్ గుర్తుంచుకోవలసిన అవసరముంది. న్యాయవ్యవస్థకు కూడా కొన్ని విధి విధానాలు, సంప్రదాయాలు, ప్రమాణాలు ఉన్నాయి. తీవ్రమైన, సున్నితమైన అన్ని కేసులనూ సీనియర్ జడ్జీలకే ఇవ్వాలని ఎవరూ చెప్పడం లేదు. ఉన్న అభ్యం తరమల్లా ఏమిటంటే, కొందరు అగ్రశ్రేణి లేదా అనుకూలంగా ఉండని జడ్జీలను ప్రభుత్వ ప్రయోజనాలతో ముడిపడిన కేసులనుంచి పద్ధతి ప్రకారం దూరం పెట్టడం లేదా తొలగించడమే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలమేరకు ఇద్దరు లేదా ముగ్గురితో కూడిన చిన్న బెంచ్లతో నడుస్తోంది. చీఫ్ జస్టి్టస్ చలాయిస్తున్న ఈ అధికారమే కేసును తేల్చేస్తుంది లేక అడ్డుకుంటుంది. అందుకే ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చీఫ్ జస్టిస్ను ప్రసన్నుడిని చేసుకోవాలని లేదా గట్టిగా నొక్కి పట్టుకోవాలని భావిస్తూండవచ్చు. అందుచేత, జడ్జి లోయా కేసుకు మాత్రమే మన దృష్టిని పరిమితం చేయవద్దు. నిజంగానే ఇది చాలా కీలకమైన కేసు, దేశంలోనే రెండో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తిని ఇది చిక్కుల్లో పెట్టగలదనడంలో సందేహం లేదు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారం ప్రస్తుతానికి సందేహా స్పదంగా ఉంది. అది తన తార్కిక ముగింపునకు చేరుకోవాల్సి ఉంది. కానీ అసమ్మతి తెలుపుతున్న నలుగురు జడ్జీలు ఈ కేసునే కాక, ఇటీవలి గతానికి చెందిన ఇతర కేసులను కూడా ఎత్తి చూపుతున్నారు. ఈ ఏడాది తమ ముందుకు రానున్న కేసుల గురించి వారు ఆందోళన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న సందర్భంగా అయోధ్య వివాదంతో సహా కొన్ని కేసుల ఫలితాల మీద పాలకపార్టీ ఎన్నికల వ్యూహం ఆధారపడి ఉండబోతోంది. అందుకే మునుపెన్నటి కంటే కేంద్రప్రభుత్వానికి ఇప్పుడు స్నేహపూర్వకంగా ఉండే చీఫ్ జస్టిస్ కావాలి. ఈ నలుగురు న్యాయమూర్తులు– జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ గోగోయ్, జస్టిస్ లోకుర్, జస్టిస్ మాథ్యూలు ఎమర్జెన్సీ నాటి జడ్జీలలా కాకుండా, తమ ఆత్మలను తాము అమ్మివేసిన ఆరోపణకు గురికావద్దని స్పష్టపర్చుకున్నారు. కానీ న్యాయవ్యవస్థ, రాజ్యాంగ క్రమం అనేవి కేవలం జడ్జీలపై ఆధారపడి ఉండవు. అంతిమంగా అవి పౌరులందరి అప్రమత్తతపైనే ఆధారపడి ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం జరుగుతున్న ఈ సమరంలో ప్రజలు కూడా తమ వంతు సన్నాహకాలకు సిద్ధంగా ఉండేలా చేయాలి. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్ : 98688 88986 -
పాలక పార్టీకి పెను సవాలు
విశ్లేషణ సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా సాగవని గుజరాత్ ఎన్నికలు స్పష్టం చేశాయి. అయితే రైతు ఉద్యమాలు, యువత అసంతృప్తితో చేసే ఆందోళనల నుంచే అధికార పక్షానికి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావచ్చు. తమ పోరాటాన్ని సంఘటితంగా సమన్వయం చేసుకోవడం రైతు ఉద్యమాలకు సవాలు కానుంది. ఇప్పటికైతే యువతలోని అసంతృప్తి ఒక రూపు దిద్దుకోకుండా, చెల్లాచెదురుగానే ఉంది. కానీ, వ్యవసాయ సంక్షోభం కంటే మరింత ఎక్కువ సమస్యాత్మకంగా పరిణమించగలిగిన శక్తి దానికి ఉంది. 2018 ఎన్నికల సంవత్సరం కానున్నది. రెండు దఫాలుగా ఈ ఏడాది శాసన సభల ఎన్నికలు జరగనుండటం మాత్రమే అందుకు కారణం కాదు. లోక్సభ ఎన్నికలను ముందుకు జరిపి, ఈ ఏడాది చివరకే జరిపేసే అవకాశం ఉన్నం దువల్ల కూడా అలా అనడం లేదు. అలా జరిగినా లేకున్నాగానీ ఈ ఏడా దంతా రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినదిగానే ఉంటుంది. ఈ సంవత్సరం బడ్జెట్ ప్రసంగం ఎన్నికల ప్రసంగంలా ఉంటుంది. ఆర్థిక సర్వే సహా అన్ని ఆర్థిక గణాంకాలనూ ఎన్నికల రంగుటద్దాల నుంచే చూపిస్తారు. డొక్లామ్లో చైనా కదలికలు, పాకిస్తాన్తో సరిహద్దు ఘర్షణలు విదేశాంగ వ్యవ హారాలుగా ఉండవు. ప్రభుత్వ ప్రజాసంబంధాల వ్యవహారాలుగా, ఈవెంట్ మేనేజ్మెంట్గా ఉంటాయి. అయోధ్య వివాదంపై తీర్పు కోసం ఎదురు చూస్తారు గానీ, ఆ భూమిపై యాజమాన్యం ఎవరికి దక్కుతుందనే దాని కోసం కాదు... రాజకీయపరమైన కూడికలు తీసివేతల కోసం. అస్సాంలోని సంక్షోభాన్ని జాతీయ పౌరసత్వ రిజిస్టర్తో అనుసంధానిస్తారు గానీ, అక్కడి మానన విషాదాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకుని మాత్రం కాదు... ఆ రాష్ట్రానికి వెలుపల అది ఎన్నికలను రాల్చేదిగా ఎలా ఉపయోగపడుతుందనే దృష్టితోనే. మా దృష్టిలో ఎన్నికల సంవత్సరం అంటే అర్థం ఇదే. ఇలాంటి ఎన్నికలు ప్రతి ఐదేళ్లకు వచ్చేవి కావు. 2013, 2008, 2003 ఎన్నికల సంవత్సరాలే గానీ ఈ అర్థంలో కావు. ఎన్నికలతో అతిగా ముడిపడిపోయి ఉండటం ఈసారి పూర్తిగా భిన్నమైన స్థాయికి చేరుతుంది. ఎన్నికలు తప్ప ప్రభుత్వానికి మరేదీ పట్టదు. ప్రజల విమర్శలుగానీ, నిరసన ఉద్యమాలుగానీ, చివరికి ప్రజల దుస్థితిగానీ ఏదీ పట్టదు. వాస్తవికత సైతం ఎన్నికల అద్దంలో ప్రతి బింబిస్తేనే, అది కూడా ఏ మేరకు ప్రతిబింబిస్తుందో అంతమేరకే లెక్కలోకి వస్తుంది. ప్రజాస్వామిక సమంజçసత్వాన్ని ఎన్నికల విజయం స్థాయికి కుదించి వేయడం జరుగుతూ వస్తోంది. కాబట్టే చిన్నవైనా లేక పెద్దవైనా ప్రతి ఎన్నికల్లోకీ ప్రధాని రంగ ప్రవేశం చేస్తున్నారు. దేశ భవితే పణంగా.. ఈ ఎన్నికల్లో పణంగా ఒడ్డుతున్నది దేశ భవిత కాబట్టి కూడా ఈ ఎన్నికల ఏడాది అసాధారణమైనది. రానున్న పార్లమెంటు ఎన్నికలంటే కేవలం మోదీ రెండో దఫా అధికారంలోకి రావడం మాత్రమే కాదు, లేదంటే భారత రాజ కీయ పటంపై బీజేపీ ఆధిపత్యం పరిపూర్ణం కావడం కూడా కాదు. అలాగే రాహుల్గాంధీకి లేదా కాంగ్రెస్కు భవిష్యత్తు ఉన్నదా, లేదా అనే దానికి సంబంధించినవి మాత్రమే కూడా కావు. బీఎస్పీ, ఐఎన్ ఎల్డీ, ఆప్, లేదా వామపక్ష పార్టీల కథ ఇక ముగింపునకు వచ్చినట్టేనా అనేది తేలడం కూడా కాదు. మన రిపబ్లిక్ భవితకు సంబంధించినవి. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన రిపబ్లిక్ పునాదులపై అత్యంత దృఢ సంకల్పంతో దాడులు జరగడాన్ని దేశం చూసింది. కాంగ్రెస్ హయాంలో నీరు గారిన స్వయంప్రతిపత్తిగల సంస్థలు... అత్యవసర పరిస్థితి తదుపరి నేడు అత్యంత అధమ స్థాయికి చేరాయి. ప్రధాన స్రవంతి మీడియాలో అత్యధిక భాగం, ప్రత్యేకించి టెలివిజన్ మీడియా అధికార పార్టీ బాకాగా మారింది. స్వాతం త్య్రానంతర భారత చరిత్రలోనే మునుపెన్నడూ ఎరుగని విధంగా వైవి ధ్యానికి, మతమైనారిటీలకు రక్షణ కల్పించే రాజ్యాంగపరమైన అంశాలను ఓ ప్రహసం స్థాయికి దిగజార్చారు. ఈ నష్టాలలో కొన్ని తిరిగి వెనుకకు మర ల్చరానివి కావచ్చు. ఈ ప్రభుత్వానికి మరో దఫా అధికారం కట్టబెట్టడం అంటే ఈ అలవాట్లను మన రాజకీయ వ్యవస్థ జన్యువులలోకి చొప్పించడమే కావచ్చు. అందువల్లనే ఈ ఏడాది అంటే ఎన్నికలు గుర్రప్పందాలను వీక్షిం చడం కాదు. దేశ భవిష్యత్తును నిర్మించడమా లేక కూలదోయడమా అనే దాన్ని తేల్చేవి. 2018ని అర్థం చేసుకోవడానికి మనం ఉపయోగించాల్సినది ఈ సూక్ష్మదర్మినినే. ఎవరు ఈ గుర్రపు పందేలలో ముందున్నారు? ఎన్నికలు జరిగేది ఎన్నడు? జరగాల్సిన విధంగా 2019లోనేనా లేక డిసెంబర్ 2018 శాసనసభ ఎన్నికలతో పాటూనా? ఎన్నికల కూటములు ఎలాంటి రూపు తీసుకుంటు న్నాయి? అనే వాటి చూట్టూతే ఈ ఏడాదిలోని రాజకీయ ఊహాగానాలు చాలా వరకు సాగుతాయి. కానీ ఇవి అసలు ప్రశ్నలు కావు. వాటికి బదులుగా మనం దేనిపైన దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది? ఏ సమస్యల చుట్టూ ఎన్నికల పరమైన సమీకరణ జరుగుతుంది అనేదే అసలు ప్రశ్న. వాటిని దృష్టిలో ఉంచుకుని చూస్తేనే ఎవరు, ఎప్పుడు, ఎలా అనేవి అర్థమయ్యేది. ప్రతిపక్షం గట్టి పోటీ ఇస్తుంది కానీ.. ఈ ఎన్నికల్లో ఎవరు కొంత మెరుగైన స్థితిలో ఉన్నారనే ప్రశ్నకు మనకు తెలి యదని ఒప్పుకోవడమే అత్యుత్తమ సమాధానం అవుతుంది. కాకపోతే మనకు తెలిసిందల్లా గుజరాత్ ఎన్నికలకు ముందు అనిపించినంత ఏక పక్షంగా సాగే పోటీ ఇది కాదు అనేది మాత్రమే. గ్రామీణ ప్రాంతంలో అధికా రపార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటం అనేది కేవలం గుజరాత్కు మాత్రమే పరిమితమైనది కాదు. ఈ ఏడాది జరగనున్న శాసనభ ఎన్నికలలో చాలా వాటిలో బీజేపీ నిస్సందేహంగా గుజరాత్లో కంటే గట్టి పోటీనే ఎదు ర్కుంటుంది. హిమాచల్ప్రదేశ్లో వలే కాంగ్రెస్ కర్ణాటకను ఏమంత తేలికగా బీజేపీకి సమర్పించుకోకపోవచ్చు. మేఘాలయ, మిజోరాం, త్రిపురలో బీజేï ³కి ఉన్న పునాది చిన్నదే కాబట్టి ఆ రాష్ట్రాల్లో అది కొన్ని రాజకీయ ఫిరా యింపులు, జాతిపరమైన హింసకు మించి ఏమంత ఘనమైన ఫలితాలు సాధించకపోవచ్చు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలోని బీజేపీ ప్రభుత్వాలు ఎదు ర్కొంటున్న ప్రభుత్వ వ్యతిరేకత గుజరాత్లో కంటే చాలా ఎక్కువ. కాబట్టి బీజేపీ ముందు ముందు కొన్ని గట్టి పోటీలనే ఎదుర్కుంటుంది. అయితే ఫలి తాలు మాత్రం ఆ రాష్ట్రాల్లోని ప్రతిపక్షం పరిస్థితి మీద ఆధారపడి ఉంటాయి. ఏదో కొంత మోదీ వ్యతిరేక వాదం లేదా పార్లమెంటులో మొక్కుబడిగా గగ్గోలు పెట్టడాన్ని మినహాయిస్తే, గత మూడున్నరేళ్ల కాలంలో ఇంత ప్రభుత్వ వ్యతిరేకత దేశంలో కనబడలేదనుకోవడం సమంజసమే. బీజేపీని ఢీకొనగలి గిన పొందిక గల సమగ్ర దృక్పథాన్ని, జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళికను లేదా విశ్వసనీయతగల నాయకత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం అందించడంలో ఇంతవరకు విఫలమైందని చెప్పుకోవడం సమంజసమే. ఇప్పటికైనా ప్రతి పక్షం కొంత గట్టిగా బరిలో నిలవడాన్ని చూస్తామా? లేదంటే ప్రతిపక్షం ఇప్ప టికే ప్రయత్నించిన, విసుగెత్తించేసిన ప్రతిపక్ష కూటముల సమ్మేళనాలతో పతాక శీర్షికలకు ఎక్కడంతోనే సరిపెట్టుకుంటుందా? ఉత్తరప్రదేశ్లో ఎస్పీ– బీఎస్పీ కూటమీ, ఒడిశాలో బీజేడీతో, తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ కూటమీ ఏర్పడితే, నితీశ్కుమార్ తిరిగి ప్రతిపక్షంవైపు చేరితే... ఎన్నికల సమీకరణాల్లో ప్రతిపక్షం తీవ్రమైన పెనుమార్పులను తేగలుగుతుంది. అయి నాగానీ, విశ్వసనీయతగల ప్రతిపక్షాన్ని అందించడం అంటే పార్టీలను ఐక్యం చేయడం మాత్రమే కాదు. ఎందుకంటే, అసలు బీజేపీ అధికారంలోకి వచ్చిందే ఆ పార్టీల పట్ల ప్రజలు విశ్వసనీయతను కోల్పోయినందువల్లనే. ఈ ఏడాది కీలకమైన ప్రశ్న రాజకీయ, ఎన్నికలపరమైన పోరాటాలు ఏ సమస్యలపై రూపుదిద్దుకుంటాయనే దానికి సంబంధించినదే. తన నాలుగేళ్ల పాలన తర్వాత ఓటర్లకు, ప్రత్యేకించి గ్రామీణ ఓటర్లకు తాము సాధించిన విగా చూపడానికి తమ వద్ద ఏమీ లేదని గుర్తించగల నిశిత బుద్ధి మోదీకి ఉంది. తన ప్రత్యర్థులలో ఎవరికన్నా కూడా ఆయనే అత్యంత జనాదరణ గల నేతగా ఉన్నారు. అయినాగానీ ఎన్నికలపరంగా అది చాలా బలహీనమైన సానుకూలతేనని ఆయనకు తెలుసు. తీవ్ర సవాలును ఎదుర్కోవాల్సి వస్తే మోదీ మతతత్వవాదం, ఉన్మాదభరితమైన జాతీయవాదాలను ఆశ్రయిస్తారని గుజరాత్ ఎన్నికలు ఇప్పటికే స్పష్టం చేశాయి. కాబట్టి 2018లో హఠాత్తుగా ఎన్నడో మరచిపోయిన కొన్ని మసీదులు/దేవాల యాల వివాదాలు రచ్చకెక్కినా, అయోధ్య వివాదంపై కోర్టు తీర్పు దేశ వ్యాప్త ప్రచారాంశంగా మారినా, స్వల్పమైన సరిహద్దు సంఘ ర్షణ పెద్ద టెలివిజన్ యుద్ధంగా దర్శనమిచ్చినా ఆశ్చర్యపోకూ డదు. ప్రతిపక్షం దాన్ని ఉదారవాద/లౌకకవాద చర్చతో ఎదుర్కో వాలని ప్రయత్నించవచ్చు. లేదా కుల కూటములతో ఎదుర్కోవా లని అనుకోవచ్చు. కానీ వాటి వల్ల కలిగే ఎన్ని కలపరమైన ప్రయో జనాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. రైతు ఉద్యమాలు, యువతే అసలు సవాలు రైతు ఉద్యమాలు, యువత అసంతృప్తితో చేసే ఆందోళనలు అనే రెండు రంగాల నుంచి అధికార పక్షానికి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావచ్చు. గ్రామీణ ప్రాంతంలోని దైన్య పరిస్థితులు రైతు ఉద్య మాలుగా పరిణమించడాన్ని 2017లో మనం చూశాం. దాదాపు రెండు వందల రైతు సంస్థలు ఒక్కటై గిట్టుబాటు ధరలకు హామీని కల్పిం చాలని, ఒక్కసారికి మొత్తం రుణ మాఫీని ప్రకటించాలని కోరాయి. ప్రభుత్వం వ్యవసాయ రంగంలోని ఈ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి గానీ లేదా దాన్ని పరిష్కరించాలని ప్రయత్నించడానికి గానీ సుముఖంగా లేదు. కాబట్టే ఏవో కంటి తుడుపు చర్యలతో సరిపెట్టేసింది. తమ పోరా టాన్ని సంఘటితంగా సమన్వయం చేసుకునే విషయంలో రైతు ఉద్యమాల కున్న శక్తికి 2018 సవాలుగా నిలవనుంది. ఇప్పటికైతే యువతలోని అసం తృప్తి చాలావరకు ఒక రూపు దిద్దుకోకుండా, చెల్లాచెదురుగానే ఉంది. కానీ, వ్యవసాయ సంక్షోభం కంటే కూడా మరింత ఎక్కువ సమస్యాత్మకంగా పరి ణమించగలిగిన శక్తి దానికి ఉంది. విద్యావకాశాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని, ఉద్యోగ హక్కు కల్పించాలని కోరుతూ యువత సమన్వయంతో పోరాడే సూచనలు కనిపిస్తాయేమోనని మనం 2018లో ఎదురు చూడాలి. ఈ ఏడాదికి చిట్టచివరకు తేలే సమీకరణం చాలా సరళమైనదే. అది, వ్యవసాయ సంక్షోభం, యువతలోని అసంతృప్తి లేదా హిందూ–ముస్లిం సంఘర్షణగా ఉంటుంది. ఫలితాలను, కొంత కాలంపాటూ దేశ భవితను నిర్ణయించేది మాత్రం ఈ సమీకరణం ఎటువైపు మొగ్గుతుందనేదే. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్ : 98688 88986 -
భయానక రాజకీయ భవిత
కొన్ని పరిశోధనా ఫలితాలను బట్టి చూస్తే విద్వేషపూరితమైన ప్రచారం వల్ల బీజేపీ నిర్ణయా త్మకమైన ప్రయోజనాన్ని పొంది ఉండవచ్చు. ఇదే గనుక 2019 లోక్సభ ఎన్నికల ప్రచారా నికి ముందస్తు రిహార్సల్ అయితే, రాజకీయ చర్చ స్వభావంలో చాలా తీవ్ర పతనాన్ని మనం చూడబోతున్నాం. గుజరాత్ ఎన్నికలు మన రాజకీయాల భయానక భవితకు అద్దం పట్టాయి. అధికారంలోను, ప్రతిపక్షంలోను ఉన్న మన నేతలు భారతదేశం అనే భావన పట్ల ఎలా ద్రోహానికి పాల్పడ్డారో మనకు చూపాయి. ప్రత్యామ్నాయం అవసరాన్ని చాటాయి. ఇప్పుడు అందరూ ఎవరికివారు గెలుపు తమదేనని చెప్పుకోవడంలో తల మునకలై ఉన్నారు. ఎన్నికల్లో గెలిచామని బీజేపీ అంటుంటే, నైతిక విజయం తమదేనని కాంగ్రెస్ అంటోంది. ఇక టెలివిజన్ చానళ్లు ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో, టీఆర్పీ రేటింగుల్లో తామే విజయం సాధించామని చాటుకుంటున్నాయి. కానీ అందరూ కలసికట్టుగా ఓడిపోవటం వల్ల వారందరిలోనూ ఆందోళన లోతుగా గూడు కట్టుకుని ఉంది. గెలిచామని హోరెత్తించేస్తున్న ఈ గోల దాన్ని కప్పిపుచ్చలే కపోతోంది. ఇక్కడ గెలిచిన వారు ఎవరూ లేరు. గుజరాత్ ఎన్ని కల్లో దేశమే విలువైనదాన్ని దేన్నో పోగొట్టుకుంది. విజయాల గోల అతిశయాల హేల సాధారణంగానైతే, గుజరాత్ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షించకూడదు. అది, 1991 లోక్సభ ఎన్నికల నుంచి బీజేపీకి కంచుకోటగా ఉంటున్న రాష్ట్రం. అక్కడ మరోసారి ఎన్నికలంటే, అందులోనూ ఒక గుజరాతీ ప్రధానమంత్రిగా ఉండగా జరుగుతున్న ఎన్నికలంటే... పశ్చిమబెంగాల్లో వామపక్షాలు విజయం సాధించిన 2001 లేదా 2006 ఎన్నికల్లాగా అసలు చెప్పుకోదగినవే కాకుండా జరగాల్సినవి. కానీ ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గట్టి పట్టుదలతో పాల్గొనడం, నరేంద్ర మోదీ ఆయనపై ప్రతిదాడికి దిగడం, దిగువ క్షేత్రస్థాయి నుంచి వినవచ్చే అసమ్మతి స్వరాలు కలసి దేశం దృష్టిని ఆ ఎన్నికల మీదకు మరల్చాయి. ఇవి 2019లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ కావు. కానీ రాబోయే ఒకటిన్నరేళ్ల కాలంలో ఏ పరిణామాలు మన కళ్లకు కట్టనుండవచ్చనేదాన్ని అవి రేఖా మాత్రంగా చూపించాయి. బీజేపీ సాధించామని చెప్పుకుంటున్న విజయం బాగా అతిశయీకరించి చెప్పుకుంటున్నదేనని ఆ పార్టీకి బాగా తెలుసు. శాసనసభ ఎన్నికల్లో వరు సగా ఆరోసారి విజయం సాధించడం గొప్పే, అందులో సందేహం లేదు. కానీ 2014లో అది ఘన విజయం సాధించింది. పైగా ఇప్పుడు ప్రధాని, అధికార పార్టీ అధినేత ఇరువురూ గుజరాతీలే. ఈ నేపథ్యం నుంచి చూస్తే ఇది అంత ఘనంగా చెప్పుకోవాల్సిన విజయం కాదు. 1995 నుంచి బీజేపీ శాసనసభ ఎన్నికల్లో జైత్రయాత్రను ప్రారంభించినప్పటి నుంచి చూస్తే గుజరాత్లో అది గెలుచుకున్న సీట్లు, ఓట్ల శాతాల దృష్ట్యా ఇది అతి చిన్న విజయం. మరో 2 శాతం ఓట్లు బీజేపీ నుంచి అటు మళ్లితే అది ప్రతిపక్షంలో కూచోవాల్సి ఉండేది. ఈ పరిస్థితి అంటే, ఆ పార్టీ నిర్దేశించుకున్న ‘150 మిషన్’ లక్ష్యానికే కాదు, అంతకంటే మరింత వాస్తవికమైనవిగా పార్టీ తన ముందుంచుకున్న లక్ష్యాలకు సైతం చాలా దూరంగానే చతికిల పడిపోవడం అని అర్థం. కాంగ్రెస్ నైతిక విజయం సాధించానని చెప్పుకోవడం తక్కువ అతి శయీకరణేమీ కాదు. చేజారిన అవకాశం అయితే, చాలా కాలం తర్వాత ఆ పార్టీ ప్రచారంలో సందర్భశుద్ధితో కూడిన పొందిక, ఐక్యత, పోరాట స్ఫూర్తి సూచనలు కనిపించిన మాట నిజం. ఇలాంటి ప్రాథమిక అంశం సైతం ఒక విజయంగా కనిపించడం అనేది కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని వ్యక్తంచేసే వ్యాఖ్య అవుతుంది. మూడు దశాబ్దాల తర్వాత గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన అత్యుత్తమ ఫలితం ఇదే, నిజమే. ప్రత్యేకించి ఇటీవల అక్కడ ఆ పార్టీలో చీలికలు రావడం, ఫిరాయింపులు జరగడం నేపథ్యం నుంచి చూస్తే ఇది చెప్పుకోదగిన ఫలితమే. అయినాగానీ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలకంటే, అది చేజార్చుకున్న అవకాశాలే ఎక్కు వగా గుర్తుండిపోతాయి. ఇది నిజానికి కాంగ్రెస్కు సరిగ్గా తాను కోరుకునే అవకాశమే అందివచ్చిన సమయం. గుజరాత్లో గత నాలుగేళ్లుగా వ్యవసాయ సంక్షోభం వృద్ధి చెందుతూ వచ్చింది. వరుసగా సంభవించిన కరువు కాలాల్లో ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలమైంది. ఆ తదుపరి రెండేళ్లు సమృద్ధిగా పంటలు పండినా పెద్ద నోట్ల రద్దు, ధరలు పడిపోవడం, ప్రత్యేకించి పత్తి, వేరుశనగ ధరలు కుప్ప కూలడం కలసి రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బ తీశాయి. ప్రభుత్వ వ్యతిరేకత మొదలైంది. ప్రభుత్వ తలపొగరుతనం పట్ల సామాన్య పౌరుల్లో అసంతృప్తి ప్రారంభమైంది. ఈ అసంతృప్తిలో కొంత పాటీదార్లు తదితర ఉద్యమాల్లో సంఘ టితమైంది. అధికార పార్టీ పట్ల ఉన్న ఈ అసంతృప్తిని తమ పార్టీకి ఓటు వేసే దిశకు మళ్లించుకోవడం మాత్రమే కాంగ్రెస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. రైతుల గురించి కాంగ్రెస్ మాట్లాడటమే కాదు, రుణ మాఫీని సైతం వాగ్దానం చేసింది. బీజేపీ వ్యతిరేక ఓటర్లు కాగలిగిన వారిలో ఓ చిన్న భాగాన్నయినా అయినా కాంగ్రెస్ తమ పార్టీకి ఓటు చేసేవారిగా మార్చగలిగేదే. అదే జరిగి వుంటే గ్రామీణ గుజరాత్ నుంచి, ప్రత్యేకించి ఉత్తర గుజరాత్, సౌరాష్ట్రలలో బీజేపీ తుడిచి పెట్టుకుపోయేది. కాబట్టి ఇది కాంగ్రెస్ చేజార్చుకున్న పెద్ద అవకాశం. సమష్టి వైఫల్యం గురించి హెచ్చరిక గుజరాత్ ఎన్నికల ఫలితాల పర్యవసానాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఎలా ఉంటాయి అనే దృష్టి కోణం నుంచి మాత్రమే ఈ ఎన్నికలను చూడకూడదు. ఎన్నికలు ప్రజాస్వామిక రాజకీయాలకు అద్దం పడతాయి. మనం ఈ అనుభవాన్ని, మన ప్రజాస్వామిక రాజకీయాల భవితకు సంబంధించి అవి ఏమి చెబుతున్నాయనే దృష్టి నుంచి అంచనా కట్టాలి. ఈ దృష్టి కోణం నుంచి చూస్తే గుజరాత్ ఒక ఆరోగ్యకరమైన హెచ్చరిక. మన సమష్టి వైఫల్యం గురించి చేసిన హెచ్చరిక. సంస్థాగతమైన దుర్బలత్వం మొదటి వైఫల్యం. ఎన్నికల కమిషన్ ఎన్నికలను ప్రకటించడంలో అపరిమితమైన జాప్యం చేసింది. రాహుల్ గాంధీ ఇంటర్వ్యూను అడ్డుకుని, బీజేపీ నేతలు అలాంటి ప్రచారాన్నే చేస్తే దాన్ని అది అనుమతించించింది. ఇలా అది తన పక్షపాతాన్ని బహిరం గంగానే ప్రదర్శించింది. శేషన్ హయాం తదుపరి ఎన్నికల కమిషన్ ఎన్నడూ ఇంతగా పతనం కాలేదు. రాజకీయాల సారాంశం స్థాయిలో నెలకొన్న శూన్యం రెండో వైఫల్యం. బీజేపీ తన ఎన్నికల ప్రణాళికను ఎట్టకేలకు మొదటి దఫా పోలింగ్కు ఒక రోజు ముందుగానీ విడుదల చేయలేదు. అది కూడా గత్యంతరం లేక విడు దల చేసినదే. అర్ధమనస్కంగా చేసిన కొన్ని వాగ్దానాల దొంతర మాత్రమే అందులో ఉంది. చాలా వరకు అది అక్కడిది, ఇక్కడిది కత్తిరించి తెచ్చి అతికించిన బాపతుదే. కాంగ్రెస్ అంతకంటే శ్రద్ధగా రూపొందించిన ప్రణా ళికను సకాలంలోనే విడుదల చేసింది. కానీ అది పాటీదార్లకు రిజర్వేషన్లను వాగ్దానం చేయడం తర్కానికి, చట్టానికి కూడా విరుద్ధమైనది. ప్రచార కాలం అంతటా కాంగ్రెస్ ముస్లింల స్థితిగతుల పట్ల ఎలాంటి వైఖరిని తీసుకోకుండా జంకుతూనే ఉండిపోయింది. రాజకీయాలకు, విధానాలకు మధ్య పొంతన లేకుండా పోవడం పెరగడాన్ని ఇది సూచిస్తుంది. అధమస్థాయి ప్రచారానికి ఆమోదం! ఇకపోతే మూడో వైఫల్యం మరింత లోతైనది. అది, బహిరంగ చర్చ స్థాయి విషపూరితం కావడానికి సంబంధించినది. పార్టీలు పరస్పరం చేసుకున్న ఆరోపణలు చాలా అధమ స్థాయివి. కొన్ని సార్లు కాంగ్రెస్ కూడా అలాంటి ఆరోపణలకు దిగినా, ప్రధానంగా బీజేపీనే ఆ పని చేసింది. అయితే ఇది సమస్య కాదు. నిస్సిగ్గుగా ఆడిన అబద్ధాలు, వ్యగ్య దూషణలు, కాల్పనిక కథనాలు, కరడుగట్టిన మతతత్వంతోకూడిన అసత్యాలను వ్యాప్తి చేయడం తో కూడిన ఈ అధమ స్థాయి ప్రచారాన్ని సాగించినది దేశంలోని అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తే కావడం మాత్రమే ఈ వైఫల్యం కాదు. మీడియాలో వచ్చిన కొద్దిపాటి విమర్శలు మినహా ఇవన్నీ దాదాపుగా సాధారణ రాజకీయ ప్రచారంగా చెల్లుబాటు కావడం అసలు వైఫల్యం. ఎన్నికల తర్వాత వెల్లడిం చిన కొన్ని పరిశోధనా ఫలితాలను బట్టి చూస్తే ఈ విద్వేషపూరితమైన ప్రచారం వల్ల బీజేపీ వాస్తవంగా నిర్ణయాత్మకమైన లబ్ధిని పొంది ఉండవచ్చు. ఇదే గనుక 2019 లోక్సభ ఎన్నికల ప్రచారానికి ముందస్తు ట్రైలర్ అయితే, రాజకీయ చర్చ స్వభావంలో చాలా తీవ్ర పతనాన్ని మనం చూడబోతున్నాం. విషప్రచారం, శూన్యం పెరుగుతుండటం ఓటర్లను ఎన్నికల ప్రక్రియకు దూరం చేయడం గుజరాత్లో పోలింగ్ పడిపోవడంగా కొంత వరకైనా ప్రతిఫలించి ఉండవచ్చు. గుజరాత్ ఎన్నికలు మన రాజకీయాల భయానక భవితను చూపుతున్న చిన్న అద్దంలాంటివి. ప్రభుత్వంలోను, ప్రతిపక్షంలోను ఉన్న మన నేతలు భారతదేశం అనే భావన పట్ల ఎలా ద్రోహానికి పాల్పడ్డారో ఆ అద్దం చూపింది. ప్రత్యామ్నాయం అవసరం ఏమిటో ఈ ఎన్నికలు మరోసారి నొక్కిచెప్పాయి. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 -
పరువు తీసిన ప్రచారం
మణిశంకర్ నివాసంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ, మాజీ సేనాధిపతి, పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి, ఢిల్లీలో పాక్ హైకమిషనర్, మరి 15 మంది సమక్షంలో గుజరాత్లో బీజేపీని ఓడించేందుకు గూడుపుఠాణీ జరిగినట్టు ఒక కథ అల్లుకొని అదే అక్షరసత్యమన్నంతగా ఆరోపణలు చేశారు మోదీ. ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదు. ఈ విషయంలో ప్రధానికి బాసటగా నిలిచేందుకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ రంగంలో దిగారు. ఎన్నికలలో విజయం సాధించేందుకు నరేంద్ర మోదీ దేనికైనా సిద్ధమేనా? వ్యక్తిగత ప్రతిష్ఠ, పార్టీ ప్రయోజనం, దేశ హితం కన్నా రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గెలుపొందడమే ముఖ్యమా? గుజరాత్ ఎన్నికల క్షేత్రంలో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలూ, వ్యాఖ్యలూ దేశ పౌరులందరినీ ఈ ప్రశ్నలు అడిగేందుకు ప్రేరేపించాయి. ఎన్నికలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా నరేంద్ర మోదీ తన పూర్తి శక్తిని వినియోగించి ప్రచారం చేస్తారు. అది ఆయన రాజనీతి విశేషం. 2014 నాటి సార్వత్రిక ఎన్నికలలో దేశం నలుమూలలలోనూ మోదీ 300 సభలలో ప్రసంగించారు. సోషల్ మీడియానూ, ఎలక్ట్రానిక్ మీడియానూ సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నారు. నూటికి నూరుపాళ్ళు పోరాడారు. పూర్వ ప్రధాని మన్మోహన్సింగ్ ఇందుకు పూర్తిగా భిన్నం. తన పార్టీ ప్రచారపర్వంలోనే ఆయన అతిథిగా దర్శనమిచ్చేవారు. అటల్ బిహారీ వాజపేయి తన పార్టీలో అగ్రశ్రేణి ప్రచారకుడు. అత్యంత ప్రతిభాశాలి. గొప్ప వక్త. కానీ ఆయన రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో అంతగా విరగబడి ప్రచారం చేసేవారు కాదు. ఎన్నికలు జరిగే రాష్ట్రం చిన్నదైనా, పెద్దదైనా నరేంద్ర మోదీ పూర్తి శక్తియుక్తులను వినియోగిస్తారు. దీనివల్ల ప్రధాని పదవి చిన్నబోతుందని ఎవరైనా భావించవచ్చును. సమరశీలం కలిగిన నాయకుడు రంగంలో దిగి పోరాడటానికి వెనకాడడు అని కూడా అనుకోవచ్చు. ఎన్నికల ప్రచారానికి ప్రధాని అంత ఎక్కువ సమయం కేటాయిస్తే ప్రభుత్వ పనులు వెనకబడతాయి. కానీ ఇంతవరకూ ప్రభుత్వ కార్యక్రమాలు దెబ్బతిన్న దాఖలా కనిపించలేదు. ఆ విషయం ఎవ్వరూ చర్చనీయాంశం చేయలేదు. శాసనసభ ఎన్నికల కోసం పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయడం మాత్రం తప్పు. ఆ నిర్ణయం వెనుక ఏవో రాజకీయపరమైన ఇబ్బందులు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. మర్యాదలకు తిలోదకాలు ఎన్నికల బరిలో పోరాటానికి దిగడం రాజకీయవాది సహజగుణం. అయితే, ఇది కేవలం గోదాలో జరిగే కుస్తీ కాదు. రాజనీతిలో నీతి అనివార్యం. ఇందులో మర్యాద అనేది విడదీయలేని భాగం. కుస్తీలు పట్టే గోదాలలో సైతం కొన్ని మర్యాదలు పాటిస్తారు. ఎన్నికలలో గెలిచినవారు మాత్రమే గొప్ప నేతలు కాజాలరు. ఎన్నికలలో పోటీ చేసిన తీరుతో తమతో పాటు దేశాన్నీ, సమాజాన్నీ సమున్నతంగా నిలిపినవారే సిసలైన రాజనీతిజ్ఞులు. నాలుగు సంవత్సరాల కిందట కోట్లాది ఓటర్లు నరేంద్రమోదీ నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటించారు. గుండెబలం ఉన్న వ్యక్తీ, ప్రభావవంతమైన వక్త మాత్రమే కాకుండా కాంగ్రెస్ కంటే మెరుగైన పాలన ఇస్తారనే ఉద్దేశంతో ఆయనను గెలిపించారు. తన కంటే, తన పార్టీ కంటే అధికంగా దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తారన్న భరోసాతో మోదీకి మద్దతు ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల ఫలితం ఏమైనా కావచ్చు. కోట్లమంది ఓటర్ల హృదయాలలో నరేంద్రమోదీ పట్ల విశ్వాసం నిస్సందేహంగా సన్నగిల్లింది. పెద్దల పట్ల, సహచరుల పట్ల వినయంగా, సున్నితంగా వ్యవహరించడం అన్నది లేదు. అగ్రస్థానంలో ఉన్నవారి విషయంలో నరేంద్రమోదీ ఎన్నడూ మర్యాదగా ప్రవర్తించలేదు. ప్రత్యర్థుల గురించి తేలికగా మాట్లాడటం, వారిని పరిహసించడం మొదటి నుంచీ నరేంద్రమోదీ రాజకీయ శైలిలో భాగమే. ఒక దశలో ఎన్నికల సంఘం ప్రధానాధికారి లింగ్డోను బహిరంగంగానే ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాలు పాటు తన పదవికి తగినట్టు హుందాగా వ్యవహరించారనే అభిప్రాయం కలిగించారు. తనను తాను నిగ్రహించుకున్నారు. కానీ పెద్దనోట్ల నిర్ణయం బెడిసికొట్టిన అనంతరం ఈ వైఖరికి ఆయన స్వస్తి చెప్పారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ తన పదవికి గల ఔన్నత్యాన్ని మరచి అన్ని రకాల అడ్డగోలు మాటలూ మాట్లాడారు. తన స్థాయికి తగని ఆరోపణలూ, విమర్శలూ చేశారు. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఎంతో దూరంలో లేదు. శక్తివంచన లేకుండా కాంగ్రెస్ నాయకులు కూడా మాటకు మాట ఇచ్చుకున్నారు. మణిశంకర్ అయ్యర్ ప్రధానిని ఉద్దేశించి ‘నీచ్’అనే మాటను ప్రయోగించడం మర్యాదను ఉల్లంఘించడమే. ఈ విషయంలో రెండో అభిప్రాయం లేదు. ఒకటే వ్యత్యాసం ఏమంటే, పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు మణిశంకర్ ప్రధానికి క్షమాపణ చెప్పారు. కానీ ప్రధాని తాను అన్న అనరాని మాటలకు కానీ తన పార్టీ సహచరుల అవాకులు చవాకులకు కానీ చింతిస్తున్నట్టు చెప్పలేదు. ఏమైంది సత్యసంధత? రాజకీయాలలో హుందాగా వ్యవహరించడం కంటే సత్యం చెప్పడం ముఖ్యం. ఈ విషయంలో కూడా ప్రధాని తీరు చెప్పుకోదగినదిగా లేదు. అబద్ధాల చక్రవర్తిగా ఇంతవరకూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు తెచ్చుకున్నారు. ఈ కిరీటం కోసం మన ప్రధాని పోటీ పడుతున్నట్టు కొన్ని మాసాలుగా ఆయన తీరు చూసినవారికి అనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విషయంలో తప్పుడు లెక్కలు చెప్పడం, గుజరాత్ ఎన్నికలలో పాకిస్తాన్ సైన్యానికి ఆసక్తి ఉన్నట్లు కట్టుకథలు చెప్పడంతో మోదీ ప్రకటనలలో విశ్వనీయత బాగా తగ్గిపోయింది. సమీప ప్రయోజనం కోసం ప్రధాని ఎటువంటి అబద్ధమైనా చెప్పగలరని అనిపిస్తోంది. ఇటువంటి ప్రవర్తన వల్ల ప్రపంచ దేశాల దృష్టిలో మన దేశ గౌరవప్రతిష్ఠలు దెబ్బతింటాయనే ఆలోచన ఆయనకు ఉన్నదో లేదో తెలియదు. ట్రంప్ అసత్య ప్రసంగాలు విని అమెరికా పట్ల మనం చులకన అభిప్రాయం ఎట్లా ఏర్పరచుకుంటామో, అదే విధంగా మోదీ అసంగత ప్రసంగాలను గమనించిన ప్రపంచం ఇండియాను చూసి హేళనగా నవ్వదా? రాజకీయ ఎజెండా సత్యం, అసత్యం కంటే ముఖ్యమైనది. మోదీ ప్రధానిగా ప్రమాణం స్వీకరించిన సందర్భంలో దేశానికి మంచి రోజులు (అచ్చేదిన్) రాబోతున్నాయని హామీ ఇవ్వడం ద్వారా ఆయన దేశ ప్రజలకు సకారాత్మకమైన ఎజెండాను ప్రతిపాదించారు. ఈ ఎజెండా ఫలితాలను దేశ ప్రజలకు అందించవలసిన సమయం వచ్చింది. కానీ ప్రధాని ఈ ఎజెండాకు దూరంగా జరిగినట్టు కనిపిస్తున్నారు. గుజరాత్ అభివృద్ధి నమూనాను దేశం అంతటా అమలు చేసి చూపిస్తానని వాగ్దానం చేసిన నరేంద్రమోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలోనే అభివృద్ధి గురించి మాట్లాడలేకపోయారు. అక్కడ వికాస్ను అటక ఎక్కించి మతపరమైన ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చారు. గుజరాత్లో 22 సంవత్సరాలు అధికారంలో ఉండి బీజేపీ నాయకులు ఏమి సాధించారో, ఏమి సాధించలేకపోయారో లెక్క చెప్పవలసిన ప్రధానమంత్రి ఆ పని చేయకుండా రాహుల్గాంధీ మతం, పాకిస్తాన్, హిందూ–ముస్లిం వివాదం గురించి అదే పనిగా మాట్లాడారు. యువజన కాంగ్రెస్కు చెందిన ఒక నాయకుడికి ఐఎస్ఐతో సంబంధాలు అంటగట్టారు. ప్రజలలో ఆశాభావం రేకెత్తించడానికి బదులు భయసందేహాలను పెంచడానికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్కు పాకిస్తాన్, ముస్లిం అనేవి పర్యాయపదాలుగా మార్చడం ఈ క్రీడ లక్ష్యం. ముస్లింలను విమర్శించడం ద్వారా హిందువులను ఏకం చేయడం ఇందలి ఆంతర్యం. అందుకోసం ఎంత దూరమైనా పోతారా? ఎవరిమీద పడితే వారి మీద బురద చల్లుతారా? రాబోయే తరాలపైన ఇటువంటి ప్రచారం ప్రభావం ఎట్లా ఉంటుందో ప్రధాని ఆలోచించారా? లేదా ఎన్నికలలో గెలిచేందుకు ఏమి చేసినా తప్పు లేదని భావించారా? దేశ ప్రయోజనాలను దెబ్బతీసే ధోరణి అన్నిటి కంటే ముఖ్యమైన ప్రశ్న దేశభక్తికీ, దేశద్రోహానికీ సంబంధించింది. మణిశంకర్ అయ్యర్ నివాసంలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి, భారత్లో పాకిస్తాన్ హైకమిషనర్, తదితరులకు విందు ఇవ్వడంపైన ప్ర«ధాని చేసిన వ్యాఖ్యలు మన దేశ ప్రయోజనాలను నిశ్చయంగా దెబ్బతీస్తాయి. మణిశంకర్ పాకిస్తాన్ వెళ్ళి తనను అడ్డు తొలగించడానికి సుపారీ ఇచ్చారంటూ మరో దారుణమైన అరోపణ చేశారు. మణిశంకర్ పాకిస్తాన్లో భారత దౌత్యాధికారిగా కొన్ని సంవత్సరాలు పని చేశారు. అక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు. పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి కసూరీ భారత్కు మిత్రుడనే దౌత్యవేత్తల అభిప్రాయం. వారంతా కలిసి భారత్–పాకిస్తాన్ సంబంధాలను మెరుగుపరచడం ఎట్లా అన్న అంశంపైన మాట్లాడుకున్నారు. ఢిల్లీలోని మణిశంకర్ నివాసంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ, మాజీ సేనాధిపతి, పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి, ఢిల్లీలో పాక్ హైకమిషనర్, మరి 15 మంది సమక్షంలో గుజరాత్ ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు గూడుపుఠాణీ జరిగిందని తన మనస్సులో ఒక కథ అల్లుకొని అదే అక్షరసత్యమన్నట్టు ఎన్నికల సభలలో ఆవేశంగా ఆరోపణలు చేశారు మోదీ. ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదు. ఈ విషయంలో ప్రధానికి బాసటగా నిలిచేందుకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ రంగంలో దిగారు కానీ విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ జోక్యం చేసుకోకపోవడం విశేషం. పాకిస్తాన్పైన ఇంత పెద్ద ఆరోపణ చేసిన తర్వాత ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్ను వెనక్కి పిలవవలసిందిగా పాక్ ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం డిమాండ్ చేయకపోతే దౌత్యరంగంలో భారత్ పరువు గంగలో కలసిపోతుంది. స్వరాష్ట్రంలో ఎన్నికలు గెలవడంకోసం దేశ ప్రధాని అసత్య ప్రచారం చేశారని ప్రపంచ దేశాలకు తెలిసిపోతుంది. ప్రధాని స్థాయి కుంచించుకుపోతుంది. 1971లో తూర్పు పాకిస్తాన్ విమోచనకోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న జనరల్ కపూర్ కూడా మణిశంకర్ నివాసంలో జరిగిన సమావేశంలో ఉన్నారు. ఆయనపైన కూడా గూడుపుఠాణీ నిందవేయడం ద్వారా ప్రధాని భారత సైన్యాన్ని అవమానించారని చెప్పుకోవాలి. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పాకిస్తానీయులతో కలసి కుట్ర చేశారన్న అరోపణ చేయడం సమంజమని మోదీ భావిస్తున్నారా? ఈ ఆరోపణ నిజమే అయితే మన్మోçహన్సింగ్పైన దేశద్రోహం కేసు పెట్టి విచారణ జరిపించే సాహసం చేయగలరా? ఆ విధంగా చేయకపోతే ప్రధానమంత్రి దేశహితానికి విఘాతం కలిగించినట్టు కాదా? మన్మోహన్సింగ్ ఎన్నడూ లేనంత ఘాటుగా స్పందించి ప్రధాని దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్ ప్రజలు ఎన్నికలలో తమ తీర్పు ఇస్తారు. కానీ దేశప్రజలందరూ ప్రధాని ప్రవర్తన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవాలి. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్ : 98688 88986 యోగేంద్ర యాదవ్ -
కమలానికి పరాజయం తప్పదా?
సీఎస్డీఎస్ బృందం చేపట్టిన మూడు వరుస సర్వేలు కాంగ్రెస్పై బీజేపీ ఆధిక్యత వేగంగా క్షీణిస్తూ సున్నాకు చేరినట్టు వెల్లడించాయి. ఈ ధోరణి బీజేపీ ఓటమిని విస్పష్టంగా సూచిస్తున్నదని నేను భావిస్తున్నా. స్పష్టంగా, నిలకడగా సాగే ఇలాంటి ధోరణి వెనుకకు మరలేది కాదు. సాధారణంగా అది మరింత తీవ్రమౌతుంది. కాబట్టి బీజేపీ ఆధిక్యత సున్నా నుంచి రుణాత్మకమైనదిగా మారవచ్చు. రెండు పార్టీల మధ్య పోటీలో విచిత్రంగా నాలుగు శాతానికి మించిన ఆధిక్యతే కాంగ్రెస్ విస్పష్ట విజయానికి సరిపోతుంది. గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమిపాలు కావడం జరగొచ్చా? ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఓటమిని చవి చూడనున్నారా? జాతీయ రాజకీయాల తీరుతెన్నుల కథనం హఠాత్తుగా మారిపోనున్నదా? ఓ రెండు నెలల క్రితమైతే ఇలాంటి సందేహాలను నేను కొట్టి పారేసేవాడిని. బీజేపీ గుజరాత్లో అధికార పార్టీ మాత్రమే కాదు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు పాతుకుపోయినట్టు అది అక్కడ బాగా పాతుకుపోయి ఉన్న పార్టీ. 1991 లోక్సభ ఎన్నికల్లో అక్కడ సాధించిన దిగ్భ్రాంతికరమైన విజయం (26 లోక్సభ స్థానాలకు 20) తర్వాత బీజేపీ ఏ ఒక్క ఎన్నికల్లోనూ ఓడింది లేదు. అప్పటి నుంచి జరిగిన ఐదు శాసనసభ ఎన్నికల్లోనూ అది 10 శాతం పాయింట్ల పటిష్టమైన ఆధిక్యతను కనబరుస్తూనే వచ్చింది. బీజేపీ ఆధిపత్యం ఎన్నికలకే పరిమితం కాలేదు. పారిశ్రామిక, వాణిజ్య రంగాల నుంచి సహకార సంస్థలు, మీడియా, మేధావులు సహా మొత్తంగా గుజరాత్ సమాజంపైనే అది తన ఆధిపత్యాన్ని నెలకొల్పగలిగింది. దాని ప్రత్యర్థి కాంగ్రెస్ అత్యంత సత్తువలేని ప్రతిపక్షంలా కనిపించింది. ‘గుజరాత్ మోడల్’కు చుక్కెదురు అందువల్లనే నేను గుజరాత్ నుంచి వచ్చే వార్తల పట్ల ఏమంత శ్రద్ధ పెట్టలేదు. మరోసారి, అది కూడా ఒక గుజరాతీ ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ విజయం సాధిస్తుందని ముందుగానే నిర్ధారణకు వచ్చేశాను. సీఎస్డీఎస్ (సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్) బృందం గత ఆగస్టులో నిర్వహించిన తొలి రౌండు సర్వే బీజేపీ భారీ ఆధిక్యతలో ఉన్నదని తెలిపింది. ఆ ఆధిక్యత ఇక అధిగమించరానిదని అనిపించింది. పశ్చిమ బెంగాల్లో వామపక్షాల ప్రభ వెలిగిపోతున్నప్పటిలా, గుజరాత్లో బీజేపీ గెలుపు చెప్పుకోదగిన వార్తేమీ కాదు. అదే తర్కంతో చూస్తే, అది ఓడిపోవడం అంటే భూకంపం సంభవించడమే. భూకంపాలు ఎప్పుడూ వచ్చేవి కావు. కానీ గుజరాత్ పరిస్థితిని చూస్తే అంతా బాగా ఉన్నట్టేమీ లేదు. సుప్రసిద్ధమైన ‘గుజరాత్ నమూనా’భారీ ప్రచార ఆర్భాటమే తప్ప, వాస్తవంగా సాధించినది మాత్రం కొన్ని ఓ మోస్తరు విజయాలు మాత్రమేనని అందరికీ తెలుసు. విద్య, ఆరోగ్యం వంటి సామాజిక సూచికలకు సంబంధించి గుజరాత్ ఇంకా మధ్యస్త స్థాయి ఫలితాలను సాధిస్తున్న రాష్ట్రంగానే ఉంటూ వస్తోంది. ప్రత్యేకించి రైతులకు ఈ నమూనా వల్ల ఒరిగిందేమీ లేదు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం అది, అత్యంత బలమైన రైతు నిరసనలు వెల్లువెత్తిన రాష్ట్రం. నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయ్యాక గుజరాత్లోని పరిస్థితులు స్పష్టంగానే మరింత అధ్వానంగా దిగజారాయి. గ్రామీణ సంక్షోభం తీవ్రమైంది. వరుసగా వచ్చిన రెండు కరువు కాలాల్లో ప్రభుత్వం రైతులకు సరిపడేంత సహాయాన్ని అందించడంలో లేదా వాటిని పూర్తిగా గుర్తించడంలో విఫలమైంది. గత ఏడాదిగా, గుజరాత్ అల్లకల్లోలంగా ఉంది. మరెక్కడైనా అయితే అధికారపార్టీ ఎన్నికల్లో ఓటమి పాలు కాక తప్పదన్నట్టే ఉండేది. కానీ గుజరాత్ భిన్నమైనదని భావించాను. ప్రజలు అంసతృప్తితో ఉండటం, బీజేపీ ప్రభుత్వంపై భ్రమలు కోల్పోవడం, ఆగ్రహంతో కూడా ఉండటం మాత్రమే ఆ పార్టీ ఓడిపోవడానికి సరిపోవు. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ, సరిగ్గా బీజేపీ కావాలని కోరుకునే ప్రత్యర్థిలాగానే... ఎలాంటి దూరదృష్టి, వ్యూహంగానీ లేదా విశ్వసనీయతగల నాయకుడుగానీ లేనిదిగానే ఉన్నదని అనిపించింది. కాబట్టే ఎవరైనా గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోనున్నదనే వార్తను పట్టుకొస్తే ‘‘ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పకండి. వారు బీజేపీని ఓడించడానికి ఎవరికైనా ఓటు వేసేంత ఆగ్రహంతో ఉన్నారా? కాంగ్రెస్కైనా సరే ఓటు వేస్తారా?’’ అని ప్రశ్నించేవాడిని. ఓటర్లు అంతటి ఆగ్రహంతోనే ఉండి ఉండవచ్చని ఇప్పుడు అనుకుంటున్నా. ఆలోచించ శక్యంకానిదే జరగవచ్చు. పశ్చిమ బెంగాల్లో వామపక్షాలకు జరిగినదే సరిగ్గా జరగొచ్చు. బీజేపీ స్పష్టంగా ఓటమికి గురికావడం, పర్యవసానంగా కాంగ్రెస్కు విస్పష్టమైన విజయం లభించడమే గుజరాత్ ఎన్నికల ఫలితం కావచ్చునని అనిపిస్తోంది. సీఎస్డీఎస్ సర్వేలు ఏం చెబుతున్నాయి? ఈ నిర్ధారణ నా స్వీయాత్మక అంచనాపైనో లేక రాజకీయ ప్రాధాన్యలపైనో ఆధారపడి చేసినది కాదు. బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉన్న సర్వేలపై ఆధారపడి, ప్రత్యేకించి లోక్నీతి–సీఎస్డీఎస్ బృందం ఏబీపీ వార్తా సంస్థ కోసం చేపట్టిన మూడు వరుస ‘‘ట్రాకర్’’ సర్వేలపై ఆధారపడి నేను నా సొంత తార్కిక నిర్ధారణలను చేస్తున్నా. ఈ మూడు సర్వేలూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 నియోజక వర్గాల్లో 3,500 మందిని యథాలాపంగా ఎంపిక చేసి, వారి సమాధానాలను సేకరించి జరిపిన చక్కటి జనాభిప్రాయసేకరణలు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తప్ప అన్ని సర్వేల్లోనూ సమంజసమైనంత కచ్చితత్వంతో ఓట్ల శాతాలను లెక్కగట్టగలగడమనే రికార్డు ఈ బృందానికి ఉంది. అందువల్లనే ఆ బృందం సర్వేపై నేను నమ్మకాన్ని ఉంచాను. అంతేకాదు, ఈ బృందం తన సర్వే ఫలితాలను అన్నిటినీ సమంజసమైనంత పారదర్శకతతో బహిరంగంగా వెల్లడించింది. అందువల్లనే నేను ఈ సర్వే సమాచారాన్ని తీసుకుని ఉపయోగిస్తున్నా. (http://www.lokniti.org/pdf/Gujarat-Tracker-3-Report.pdf) ఒకప్పుడు ఈ లోక్నీతి–సీఎస్డీఎస్ సర్వే బృందాన్ని స్థాపించినప్పుడు నేనూ అందులో పాల్గొన్నా, గత నాలుగేళ్లుగా దానితో నాకు ఎలాంటి సంబంధమూ లేదని కూడా చెప్పాల్సి ఉంది. ఈ ట్రాకర్ జనాభిప్రాయ సేకరణలో మొదటి రౌండ్ ఈ ఏడాది ఆగస్టు నెల ప్రథమార్ధ భాగంలో జరిగింది. అందులో కాంగ్రెస్పై బీజేపీ 30 శాతం పాయింట్ల భారీ ఆధిక్యతతో ఉన్నట్టు తెలిసింది. అక్టోబర్లో జరిగిన రెండో రౌండ్కు వచ్చే సరికి దాని నివేదికలో నాటకీయమైన మార్పు జరిగింది. బీజేపీ ఆధిక్యత కేవలం 6 పాయింట్లకు పడిపోయిందని సీఎస్డీఎస్ బృందం ఆరౌండ్లో తేల్చింది. ఇదేమైనా జనాభిప్రాయాన్ని పొరపాటుగా జనాభిప్రాయాన్ని అంచనా కట్టడమా లేక ఓటింగ్ సరిళిలోని ధోరణిని అంచనా వేయడంలో జరిగిన పొరపాటా? నవంబర్ చివరి వారంలో జరిగిన తాజా రౌండులో ఆ ప్రశ్నకు సమాధానం లభించింది. బీజేపీ ఆధిక్యత సున్నాగా మారి, రెండు పార్టీలూ 43 శాతం ఓట్లతో గెలుపు ఓటములు తేలని స్థితిలో ఉన్నాయని మూడో రౌండు ఫలితాల నివేదిక తెలిపింది. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి, బీజేపీ ఓడిపోతుందనే ముందస్తు అంచనాను సీఎస్డీఎస్ బృందం ఇవ్వలేదు. నవంబర్ ఆఖరి వారంలో ఎన్నికలు జరిగితే బీజేపీకి 91 నుంచి 99 స్థానాలు రావచ్చని మాత్రమే అది చెప్పింది. మరి పోలింగ్ రోజున ఏం జరుగుతుంది? లోక్నీతి–సీఎస్డీఎస్–ఏబీపీ ప్రజాభిప్రాయ సేకరణ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. విస్పష్ట విజయం దిశగా కాంగ్రెస్ ఈ ధోరణి బీజేపీ విస్పష్టంగా పరాజయం పాలుకానున్నదని సూచిస్తున్నట్టు నేను భావిస్తున్నా. స్పష్టంగా, నిలకడగా సాగే ఇలాంటి ధోరణి సాధారణంగా వెనుకకు మరలేది కాదు. సాధారణంగా అది మరింత తీవ్రమౌతుంది. కాబట్టి బీజేపీ ఆధిక్యత సున్నా నుంచి రుణాత్మకమైనదిగా మారవచ్చు. రెండు పార్టీల మధ్య పోటీ జరిగేటప్పుడు విచిత్రంగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ శాతం పాయింట్ల ఆధిక్యతే విస్పష్ట విజయానికి కాంగ్రెస్కు సరిపోతుంది. ఎన్నికలకు ముందు జరిగే ఇలాంటి సర్వేలు సాధారణంగా అధికార పార్టీని ఎక్కువగా అంచనా వేసే ధోరణిని కనబరుస్తాయనే విషయాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకుని తీరాలి. కాబట్టి ఈ దశలో మనం అంచనా కట్టగలిగిన దానికంటే పెద్ద ఆధిక్యతే ఫలితాల్లో కనిపించవచ్చు. ఈ వ్యాసం శీర్షికలోని నా అంచనాను ఈ సర్వే వెల్లడించిన ఇతర అంశాలు కూడా బలపరుస్తున్నాయి. గుజరాత్ ప్రభుత్వం పట్ల ప్రజామోదం రేటింగ్లు నిలకడగా పడిపోతూ, ఇప్పుడు ప్రమాద సూచికను కూడా దాటేశాయి. ఈ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వనివారి సంఖ్య, మరో అవకాశాన్ని ఇచ్చేవారి సంఖ్యను మించిపోయింది. వ్యక్తిగత ప్రతిష్ట ఈసారి కీలకమైన అంశం అయ్యేట్టు కనిపించడం లేదు. అధారాలు ఇవిగో ముఖ్యమంత్రి జనాదరణ రేటింగ్లు ప్రత్యర్థులతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నా, బాగా తక్కువ స్థాయికి పడిపోయాయి. ప్రధాని ఇప్పటికీ అత్యంత జనాదరణగల నేతగా ఉన్నా, ఆయన రేటింగ్లు, కేంద్ర ప్రభుత్వ రేటింగ్లు కూడా పడిపోయాయి. హార్దిక్ పటేల్ సీడీలు, మత సమస్యలు ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రముఖ పాత్ర నిర్వహించడం లేదు. ఈ ఎన్నికల్లోని అసలు సమస్య ఆర్థిక వ్యవస్థే అనే విషయాన్ని కూడా ఈ సర్వే వెల్లడించింది. ఓటర్లు నిరుద్యోగం, ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందుతున్నారు. ధరల పెరుగుదల అంటే ప్రజలందరి కొనుగోలు శక్తి పడిపోవడం అనే అర్థం. కేవలం ఈ సీఎస్బీఎస్ సర్వే అనే కాదు. గుజరాత్ నుంచి వస్తున్న విశ్వసనీయమైన క్షేత్ర స్థాయి నివేదికలు సైతం ఈ నిర్ధారణను మరింతగా బలపరుస్తున్నాయి. ప్రధాని పాల్గొంటున్న సభలుసహా బీజేపీ ఎన్నికల సభలకు జనం బాగా తక్కువగా వస్తున్నారు. అదే సమయంలో, హార్దిక్ పటేల్ సభలకు భారీగా ప్రజలు వస్తున్నారు. రైతుల ఆగ్రహమూ, తాజాగా వేరుశనగ, పత్తి ధరలు పడిపోవడం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న చెప్పుకోదగిన అంశాలుగా కనిపిస్తున్నాయి. అలాగే గుజరాతీ వ్యాపారవేత్తల్లో కూడా వంచనకు గురయ్యామన్న భావన కనిపిస్తోంది. అయినా ఇంకా మారేది ఏమైనా ఉందా? మోదీ బహిరంగ సభలు మొత్తంగా ఆ మార్పును తెచ్చే ఇంద్రజాలాన్ని పునరావృతం చేస్తున్నట్టు అనిపించడం లేదు. మరి రిగ్గింగ్ మాటేమిటి? పంజాబ్, యూపీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) కుట్ర గురించి మాట్లాడిన వారిలో నేను లేను. ఏది ఏమైనా వీవీపీఏటీల (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్) మెషీన్ల పట్లా, యథాలాపంగా ఓటర్ స్లిప్పులను మెషీన్ లెక్కతో సరిపోల్చి చూసే విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్: 98688 88986 యోగేంద్ర యాదవ్ -
ఒకే దఫా రుణమాఫీ అవశ్యం
భారతీయ రైతుల ఆత్మహత్యలకు, దుస్థితికి తక్షణ కారణం రుణగ్రస్తతే. దేశ వ్యాప్తంగా 2016లో రుణగ్రస్తత 53 శాతానికి చేరుకోగా, కొన్ని రాష్ట్రాలలో ఇది 89 నుంచి 93 శాతానికి చేరుకుంది. సగటు రైతు రుణాలను చెల్లించే స్థితిలో లేడు. అందుకే రైతు రుణాలన్నింటినీ ఒకే దఫాలో మాఫీ చేయాలి. నవంబర్ 20, 21 తేదీల్లో దేశ రాజధాని రైతుల చారిత్రక సమావేశానికి సాక్షీభూతంగా నిలిచింది. ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ వద్ద వేలాదిమంది రైతులు కిసాన్ ముక్తి సంసద్ ఆధ్వర్యంలో హాజరయ్యారు. ఈ సంస్థ భారతీయ రైతులను శృంఖలాలనుంచి విముక్తి చేసే మార్గాలను వెతికే రైతు పార్లమెంట్. ఈ పార్లమెంట్లో రెండు చారిత్రక చట్టాలను ప్రతిపాదించి వాటిని బహిరంగ చర్చకు విడుదల చేశారు. వీటి వివరాలను www.aikscc.comలో చూడవచ్చు. ఈ మహా సంఘటన నూతన యుగపు రైతుల ఉద్యమానికి నాంది పలికింది. ఈ రైతు సమావేశం అనేక రకాలుగా చారిత్రకమైనది. మొదటగా, ఇది దేశంలోని రైతాంగ సంస్థలతో కూడిన అతి పెద్ద సంకీర్ణ కూటమికి ప్రాతినిధ్యం వహించింది. అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ (ఏఐకేఎస్సీసీ) రాజకీయ, సైద్ధాంతిక విభజనలకు అతీతంగా 184 సంస్థలతో కూడుకున్నది. రెండు, ఇది రైతాంగ ఉద్యమ చరిత్రలోనే, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులను ఏకం చేసి తీసుకొచ్చిన అరుదైన సందర్భం. మూడోది, ఇటీవలి చరిత్రలో భారతీయ రైతులకు చెందిన వివిధ విభాగాలు ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి. దీంట్లో రైతులు, కౌలుదార్లు, భూమి లేని కూలీలకు సంబంధించిన సంఘాలను ఒకటిగా చేయడంలో ఏఐకేఎస్సీసీ అత్యంత జాగరూకతతో వ్యవహరించింది. నాలుగు, ఈ సదస్సులో తొలి సెషన్ కేవలం మహిళా రైతులతోనే నిర్వహించడమైనది. మన వ్యవసాయానికి మహిళా రైతులే కేంద్రబిందువులుగా గుర్తించడం జాతీయ రైతు సంఘాల చరిత్రలో ఇదే మొదటిసారి. దేశంలో దాదాపు 70 శాతం వ్యవసాయ పనులను మహిళలే చేస్తున్నారు కానీ, రైతు ఉద్యమాల నాయకత్వం నుంచి వారిని పూర్తిగా మినహాయించారు. చివరిగా, ఇంత పెద్ద రైతాంగ కూటమి అతి క్లుప్తమైన, ముఖ్యమైన, ఆచరణీయమైన డిమాండ్లను ప్రతిపాదించడానికి అంగీకరించడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రభుత్వం నుంచి కొత్త ఒప్పందాన్ని డిమాండ్ చేయడానికి గాను, రైతులు ప్రధానంగా రెండు అంశాలపై దృష్టిపెట్టారు. తమ పంటలకు న్యాయబద్ధమైన, తగిన ప్రతిఫలమివ్వగల ధరలను అందించడం, రుణాలనుంచి పూర్తిగా విముక్తి చేయడం.. ఇవే వారి డిమాండ్లు. ఒకరకంగా చూస్తే వీటిలో కొత్త విశేషం ఏమీలేదు. రుణమాఫీ, మెరుగైన కనిష్ట మద్ధతు ధర (ఎమ్ఎస్పి) రైతు సంఘాలు చిరకాలంగా చేస్తున్న డిమాండ్లు. కానీ తొలిసారిగా రైతులు ఇతర అంశాలను పక్కనబెట్టి పూర్తిగా ఈ రెండు డిమాండ్లపైనే దృష్టి పెట్టారు. పైగా, అతి స్పష్టమైన సమర్థనతో, నిశిత విధాన రూపకల్పనతో రైతులు ఈ రెండు డిమాం డ్లను ఒక కొత్త భాషలో తీసుకురావడం మరీ విశేషం. నూతన యుగ రైతుల ఉద్యమం నూతన భాషలో మాట్లాడటం నేర్చుకుంది మరి. ‘వ్యవసాయ ఉత్పత్తులకు హామీ ఇచ్చే ధరలు రైతు హక్కు’ అనేది రైతుల తొలి డిమాండ్. వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయబద్ధమైన, తగిన ప్రతిఫలమివ్వగల ధరలను వీరు డిమాండ్ చేశారు. భారతీయ రైతులకు ఇదే నేడు అత్యంత ముఖ్యమైన అవసరం. వ్యవసాయ పంటల ఉత్పత్తిదారులు మొత్తంగా ఒక అన్యాయ వ్యవస్థ పాలబడ్డారు వ్యవసాయ ఉత్పత్తుల ధరలను సంవత్సరాల తరబడి ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తూ వచ్చారు. అదే సమయంలో వ్యవసాయ పెట్టుబడుల ఖర్చు ఊర్ధ్వ దశలో పెరుగుతూ పోయింది. 24 రకాల పంటలకు కనిష్ట మద్దతు ధరను ప్రభుత్వం లాంఛనప్రాయంగా ప్రకటిస్తున్నప్పటికీ, 10 శాతం రైతులు మాత్రమే ఈ హామీ నుంచి లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుత మార్కెటింగ్ సీజన్లో దేశంలోని వంద అగ్రశ్రేణి మండీలలోని ధరలను విశ్లేషించగా, ఖరీఫ్ సీజన్లో పండే ఎనిమిది ప్రధాన పంటల మార్కెట్ ధర కనీస మద్దతు ధరకంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. దీనివల్ల ఈ ఒక్క సీజన్లోనే దేశ రైతులు రూ. 36 వేల కోట్ల మేరకు నష్టపోయారు. పైగా, ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా అన్నిరకాల పంటలకు చాలా తక్కువగా ఉంటోంది. అందుకే వ్యవసాయ ఉత్పత్తి కోసం పెట్టే ఖర్చులో 50 శాతంకంటే అధికంగా తమకు దక్కేలా మద్దతు ధరపై హామీ ఇవ్వాలని రైతులు డిమాండు చేస్తున్నారు. బీజీపీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా జాతీయ రైతుల కమిషన్ సిఫార్సు చేసిన కనీస మద్దతు ధరను తమ చట్టబద్దమైన హక్కుగా అమలు చేయాలన్నది వీరి డిమాండ్. ఇది సాధ్యం కావాలంటే మొదటగా ప్రభుత్వం ధాన్య సేకరణ పరిమాణాన్ని పెంచాలి. రెండు. మార్క్ఫెడ్, నాఫెడ్, పౌర సరఫరాల శాఖలు సకాలంలో, సమర్థవంతంగా మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకోవాలి. మూడు, ప్రకటిత మద్దతు ధర కంటే మార్కెట్ ధరలు తగ్గిపోయినప్పుడు, ఆ వ్యత్యాసంతో కూడిన ధరను, లోటు ధర చెల్లింపు వ్యవస్థ ద్వారా రైతులకు చెల్లించాలి. నాలుగు, ప్రకటించిన ఏ సరుకునైనా కనీస మద్దతు ధరకంటే తక్కువ రేటుకు కొనుగోలు చేయడం నేరంగా ప్రకటించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రైతుల ఆత్మహత్యలకు, రైతుల దుస్తితికి తక్షణ కారణం రుణగ్రస్తత. రైతుల రుణగ్రస్తత నిష్పత్తి 1992లో 25 శాతం ఉండగా, 2016 నాటికి 52 శాతానికి పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇది 89 నుంచి 93 శాతానికి చేరుకుంది. సగటు రైతు తాను తీసుకున్న రుణాలను చెల్లించే స్థితిలో లేడు. దేశంలోని వ్యవసాయ కుటుంబాల్లో 68 శాతం మంది ప్రతికూల ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ రుణగ్రస్తతకు పంటల వైఫల్యం, ధరల పతనం, అధిక ఉత్పత్తి ఖర్చులు, నీటి కొరత, ప్రకృతి వైపరీత్యాలు వంటి రైతుల చేతుల్లో లేని అంశాలే కారణాలు. అందుకే దేశంలోని రైతులందరి మీద భారం మోపుతున్న వ్యవసాయ రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాలి. జాతీయ, సహకార, ప్రైవేట్ బ్యాంకుల రుణాలన్నింటికీ ఈ ఏకకాలపు మాఫీని అమలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి మద్దతివ్వాలి. రైతులు, కౌలుదారులు, వ్యవసాయ కూలీలు, ఆదివాసీ, మహిళా రైతులందరినీ తమ రుణమాఫీ నుంచి విముక్తి చేయాలి. చివరగా కేరళలో లాగా జాతీయ రుణ ఉపశమన కమిషన్ని తక్షణం ఏర్పర్చాలి. రైతులు చేస్తున్న ఈ రెండు డిమాండ్లు దేనికదే విడిగా లేవు. హామీ ఇచ్చినమేరకు ఆదాయాలు లేకుంటే రైతులపై రుణభారం తొలగదు. రుణాలను ప్రతి ఏటా పోగు చేస్తూపోతే తగిన ప్రతిఫలంతో కూడిన ధరలు లభించవు. ఈ రెండింటినీ పరిష్కరించినప్పుడే భారతీయ వ్యవసాయం, రైతుకు భవిష్యత్తు ఉంటుంది. మన రైతులు ఇప్పుడు ఫిర్యాదు చేసి ఊరుకోవడంతో సరిపెట్టుకోవడం లేదు. రైతుల ప్రతిపాదనలకు స్పందించిన బాధ్యత దేశం మీదే ఉంది. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 Twitter: @_YogendraYadav -
సంపూర్ణ విప్లవం నేటి అవసరం
1917 రష్యా విప్లవ ఘటనను సైతం బేషరతుగా సంస్మరించలేను. అయితే, దానికి సంబం ధించి కీర్తించదగినదీ ఉంది. అది విప్లవం అనే భావం. విప్లవం ఎలా జరిగిందనే దానితో నిమిత్తం లేకుండా, రష్యా విప్లవం ఒక భావం. మానవులు మునుపెన్నడూ ఎరుగని రీతుల్లో తమ సొంత భవితవ్యాన్ని మలచుకోగలరనే భావం సాధించిన విజయానికి అది మైలురాయి. ఆ స్ఫూర్తితో, 20వ శతాబ్దపు చరిత్ర వెలుగులో విప్లవం అనే భావనను తిరిగి మలచు కోవాల్సిన సందర్భంగానైతే రష్యా విప్లవ శత వార్షికోత్సవాన్ని జరుపుకోవాల్సిందే. అసత్యాలతో సంస్మరణ వ్యాసాన్ని రాసేదెలా? నవంబర్ 7 రష్యా విప్లవ శత వార్షికోత్సవం సందర్భంగా నన్ను ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఇది. ఆ విప్లవ శిశు వైన యూఎస్ఎస్ఆర్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్) 70 ఏళ్ల తర్వాత మరణించడం వల్ల తలెత్తిన సమస్య కాదిది. మరణానికి ఎవరూ అతీతులు కారు. చివరకు ఆ సోషలిస్టు ప్రయోగం విఫలం కావడం వల్ల మాత్రమే తలెత్తిన సమస్యా కాదిది. విజయమే ప్రతిదానికీ కొలబద్ధ కాజా లదు. ఆ విప్లవం, విప్లవానంతర రాజ్యం బతికున్న కాలంనాటి, దాన్ని విజ యవంతమైనదిగా పరిగణిస్తున్న కాలం నాటిæహేయమైన వాస్తవమే నిజమైన సమస్య. ఒక వికృత రాక్షసిని సృష్టించిన విప్లవ సందర్భాన్ని ఎలా ఉత్సవంగా జరుపుకోగలం? 1917–1921 మధ్య జరిగిన ఘటనలు తెలిసివచ్చాక కూడా లెనిన్ సహా ఆ విప్లవ నాయకులను ఆదర్శమూర్తులుగా ఎలా కీర్తించగలం? సోవియట్ ప్రభుత్వ పాలనలో కార్మికులను నిర్లక్ష్యం చేసి, రైతాంగాన్ని ఊచ కోత కోశారని తెలిశాక కూడా దాన్ని కార్మికవర్గ విజయంగా ఎలా వర్ణించ గలం? సోల్జినిత్సిన్ రచనలను చదివాక రష్యా విప్లవం ప్రత్యామ్నాయ ప్రజా స్వామ్యాన్ని ఆవిష్కరించిందని చెప్పుకోవడాన్ని మనం ఎలా నమ్మగలం? యూఎస్ఎస్ఆర్కు చెందిన తూర్పు యూరప్ ‘వలసల’ను సందర్శించాక కూడా ఆ విప్లవ వలసవాద వ్యతిరేకతకు ఎలా నీరాజనాలు అర్పించగలం? ఆ వ్యవస్థ నిరంకుశ ప్రభుత్వాధికారాన్ని, అది పాశ్చాత్య అభివృద్ధి నమూ నాను వెర్రిగా అనుకరించడాన్ని చూసిన మనం... ఆ ఆర్థిక నమూనా నుంచి ఎలా ఉత్తేజాన్ని పొందగలం? అందువల్లనే, బహుశా నేను ఆ వ్యవస్థను, సోవియట్ కమ్యూనిజాన్ని కీర్తించలేకపోవచ్చు. 1917 రష్యా విప్లవ ఘటనను సైతం నేను బేషరతుగా సంస్మరించలేను. అయితే, ఆ ఘటనకు సంబంధించి కీర్తించదగినది కూడా ఉంది. అది విప్లవం అనే భావం. విప్లవం ఎలా జరిగిందనే దానితో నిమిత్తం లేకుండా, రష్యా విప్లవం ఒక భావం, మానవులు మునుపెన్నడూ ఎరుగని రీతుల్లో తమ సొంత భవితవ్యాన్ని మలచుకోగలరనే భావం సాధించిన విజ యానికి అది మైలురాయి. ఆ స్ఫూర్తితో, 20వ శతాబ్దపు చరిత్ర వెలుగులో విప్లవం అనే భావనను తిరిగి మలచుకోవాల్సిన సందర్భంగానైతే రష్యా విప్లవ శత వార్షికోత్సవాన్ని జరుపుకోవాల్సిందే. చేదు అనుభవాల విప్లవం ఆశ్చర్యకరంగా, విప్లవం అనే భావన పుట్టుకొచ్చినది రాజకీయాల్లోంచి కాదు, భౌతికశాస్త్రం నుంచి. 18వ శతాబ్దిలో ఒక విచిత్రమైన పరివర్తన జరిగింది. అది భూమి తన కక్ష్యలో పరిభ్రమిస్తుండటమనే విప్లవాత్మక ఆలోచన నుంచి మానవులు తాము కోరుకున్న గమ్యానికి చేరుకోవడమనే విప్లవ భావన వరకు జరిగిన పరివర్తన. మొట్టమొదటిసారిగా 1789 ఫ్రెంచ్ విప్లవం నేప థ్యంలో ప్రయోగించిన విప్లవం అనే ఈ నూతన భావనలో నాలుగు విభి న్నమైన భావాలు ఇమిడి ఉన్నాయి. మొదటిది అస్తిత్వంలో ఉన్న సామాజిక ఆర్థిక క్రమం ఇలాగే శాశ్వతంగా నిలిచిపోబోవడం లేదు. మౌలికంగా భిన్న మైన వివిధ రీతుల్లో దాన్ని మార్చగలం, మార్చాలి. ఈ మార్పు హఠాత్తుగా బద్దలు కావడంగా సంభవించగల అవకాశం ఉంది. పాత వ్యవస్థ ఏదో ఒక రోజుకు పతనంగాక తప్పదు. సరికొత్త జీవన విధానానికి ప్రాతిపదికను సమకూర్చే కొత్త వ్యవస్థను నిర్మించాల్సి ఉంటుంది. అలాంటి నాటకీయమైన మార్పు తనంతట తానుగా వచ్చేది కాదు. ఆ మార్పును తేగలిగేది, తేవా ల్సినది మనుషులే. అందుకు ప్రజలను సమీకరించడం, సమష్టి కార్యాచరణ అవసరం. అంతేకాదు, ఈ మార్పునకు అవసరమైన రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికి సాధారణంగా హింసాత్మక కార్యాచరణ అవసరం. ఇకపై ప్రతి మనిషి, ఎవరైనాగానీ ఈ మార్పును తెచ్చే కర్తలు కావచ్చు. విప్లవానికి అగ్రగామిదళం అవసరం. అది, ఒక విప్లవ రాజకీయ పార్టీ ప్రాతి నిధ్యం వహించే కార్మికవర్గమే. నేర్పిన గుణపాఠాలు విప్లవం గురించిన ఈ అవగాహనే రష్యా విప్లవంలో ఇమిడి ఉంది. అది, యూరప్ ఖండపు 18 వ శతాబ్దపు చరిత్ర నుంచి స్వీకరించగా, 19 వ శతాబ్దపు చరిత్ర నుంచి వృద్ధి చెందినది. 20వ శతాబ్దపు విప్లవాల నిజ జీవిత అను భవం.. రష్యా, క్యూబా, వియత్నాం, కంబోడియా విప్లవాల అనుభవం ఉత్సా హాన్ని రేకెత్తించడం నుంచి భయకంపితులను చేయడం వరకు రకరకాలుగా ఉంది. ఈ 20వ శతాబ్దపు అనుభవం రష్యా విప్లవ భావన గురించి కొన్ని గుణ పాఠాలను నేర్పింది.ఒకటి, విప్లవాత్మక పరివర్తన గమ్యం ఒకే దిశగా సాగే మార్పు కాదు. విప్లవ పరివర్తన ప్రధాన లక్ష్యం ఆర్థికపరమైనది మాత్రమే అనేది మార్క్సిస్టు సైద్ధాంతిక ఆలోచన. 20వ శతాబ్దం ఈ ఆదర్శాన్ని విశాల ప్రాతిపదికగలదిగా మార్చింది. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మార్పును అందులో భాగం చేసింది. జైప్రకాష్ నారాయణ్, మానవ జీవితంలోని అన్ని రంగాలకు చెందిన ఈ సంపూర్ణ విప్లవం అనే భావనను ఆవిష్కరించారు. రెండు, విప్లవం, హఠాత్తుగా, నాటకీయంగా బద్దలై జరుగుతుందనే భావన నుంచి దాన్ని వేరు చేయాల్సిన అవసరం ఉంది. మౌలికమైన మార్పు రాత్రికి రాత్రే జరగాల్సిన అవసరం ఏమీ లేదు. నిలకడగా నిలవగలిగిన మార్పు ఏదైనా సాధారణంగా క్రమక్రమంగానే జరుగుతుంది. ఈ వ్యవస్థను ఒక్కొక్క ఇటుకగా మారుస్తూ రావాలి.మూడు, విప్లవం హింసాత్మకమైనదే కావాల్సిన అవసరమేమీ లేదు. విప్లవాత్మకమైన మార్పు సాఫీగా జరిగిపోయేదేమీ కాదని 20వ శతాబ్దపు అనుభవం చెబుతుంది. స్వీయ ప్రయోజనాలుగల శక్తుల ప్రతిఘటనను విప్లవకారులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, ఆ సంఘర్షణ హింసాత్మక మైతే... ప్రజల పేరిట జరిగే విప్లవం ఆ ప్రజలకే వ్యతిరేకమైనదిగా మారే అవకాశం ఉంది.నాలుగు, విప్లవ అగ్రగామిదళం అనే భావనను విyì చిపెట్టాల్సిన అవ సరమేమీ లేదు. కాకపోతే ఏ ఒక్క వర్గమో చరిత్ర ఎంచుకున్న సాధనం కాదు. ఒక పార్టీయే విప్లవానికి పరిరక్షణ వహించేదిగా మారడం అంటే అది వినా శనానికి బీజం వేయడమే.చివరగా, విప్లవ కార్యాచరణకు రంగస్థలిగా యూరప్ మీది నుంచి మన దృష్టిని మరల్చుకోవాలంటూ 20వ శతాబ్దం మనకు ఆహ్వానం పలికింది. విప్లవం అనే ఆధునిక భావన పుట్టింది యూరప్లోనే. కాబట్టి విప్లవం ముందుగా యూరప్లో జరుగుతుందని, ఆ తర్వాత మిగతా చోట్ల పునరా వృతమౌతుందని అనుకోవడం సహజమే. 20వ శతాబ్దపు రెండో భాగం ఈ ఊహాత్మక ప్రమేయాన్ని తలకిందులు చేసింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర యూరప్... విప్లవాలు జరగడానికి అతి తక్కువ అవకాశం ఉన్న ప్రాంతంగా మారింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా మొదలైన ప్రపం చంలోని ఇతర ప్రాంతాలపైకి ఇప్పుడు దృష్టి మళ్లింది. మరో ప్రపంచం సాధ్యమే 20వ శతాబ్దంలో విప్లవం అనే భావనలో వచ్చిన మార్పుల తర్వాత విప్లవం అనే ఆ భావంలో ఇంకా ఏమైనా మిగిలే ఉందా? ఉందనే అనుకుంటున్నా. రాజకీయ మౌఢ్యాన్ని కోల్పోయినా విప్లవం అనే భావంలోని మూల సారం ఇంకా మిగిలే ఉంది. మరో ప్రపంచం సాధ్యమే, దాన్ని మనం నిర్మించగలం అనేదే అది. రష్యా విప్లవం నుంచి 21వ శతాబ్దానికి వారసత్వంగా సంక్ర మించిన మౌలిక సారాంశ భావం అదే. ఈ సవరించిన విప్లవం అనే భావ నకు మనం స్వయంగా చేయాల్సిన దోహదం ఏమిటి? విప్లవం అనే భావాన్ని 21వ శతాబ్దం మూడు దిశలకు తీసుకుపోవచ్చని అనుకుంటున్నా.మొదటగా మనం, విప్లవానికి ముందుగా నిర్దేశితమైన లక్ష్యం ఉంటుం దనే భావంతో తెగతెంపులు చేసుకోవాలి. విప్లవాన్ని, అది సాగే క్రమంలో తన గమ్యాన్ని తాను అన్వేషించుకునేదిగా, పరివర్తన చెందించుకునేదిగా చూసి తీరాలి. రెండు, విప్లవం అనే భావన రాజకీయాలలోకి ప్రవేశించడంపై ఆధార పడినదిగా చూడటం. ఈ దృష్టి, రాజకీయ పార్టీ పట్ల, ఆధునిక రాజ్యం విప్ల వాత్మక మార్పునకు సాధనంగా చూడటం పట్ల వ్యామోహాన్ని పెంచింది. మార్పునకు ఇతర సాధనాలను గుర్తించే దిశగా మనం సాగాలి లేదా రాజ కీయాల పట్ల మన అవగాహననే మార్చుకోవాలి.చివరగా, విప్లవం గురించిన యూరోపియన్ భావన కేవలం బాహ్య మైన మార్పుపైనే దృష్టిని కేంద్రీకరించింది. మనిషి, మనిషి అంతరాత్మ కూడా విప్లవానికి సంబంధించి అంతే ముఖ్యమైన లక్షణంగా మనం జోడించాలి. ఇవన్నీ కలసి నా ప్రతిపాదనను చాలా తీవ్రమైనది, కలవరపరిచేది అనిపిం చేలా చేయవచ్చునేమో. కానీ, విప్లవమే అలాంటిది. విప్లవం అనే భావనలో విప్లవాన్ని తీసుకురావడమే రష్యా విప్లవానికి అత్యుత్తమ సంస్మరణ. - వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్ : 98688 88986 - యోగేంద్ర యాదవ్ -
కాలాతీత చింతనాపరుడు
విశ్లేషణ ఈ భువి మీద నివసించే ప్రజలంతా కలసి ఎన్నుకునే ఒక ప్రపంచ పార్లమెంట్, ఒక ప్రభుత్వం ఉండాలని ఆయన కోరుకున్నారు. ఏ రూపంలో ఉన్నప్పటికీ వలసవాదాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచం మీద అందరికీ సమాన హక్కులు ఉండాలని భావించారు. పౌరహక్కుల కోసం అమెరికాలో సాగిన ఉద్యమానికి మద్దతు ఇచ్చి, అందులో పాల్గొని అరెస్టయిన భారతీయుడు బహుశా లోహియా ఒక్కరే. మనిషి రంగు ఆధారంగా చెలరేగే జాత్యహంకారాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ప్రజలు నేను చెప్పేది వింటారు. కానీ అది నేను మరణించాక జరుగుతుంది’ ఈ మాటను రామ్ మనోహర్ లోహియా తరచూ చెప్పేవారు. ఈ సునిశిత వ్యాఖ్యను గురించి లోతుగా ఆలోచించడానికి ఆయన యాభయ్యో వర్ధంతి (అక్టోబర్ 12)కి మించిన సందర్భం మరొకటి ఉండదు. నిజం చెప్పాలంటే రామ్ మనోహర్ లోహియా 21వ శతాబ్దపు చింతనాపరుడు. తన కాలానికి అతీతంగా ఆలోచించినవారు. ఆధునిక భారత మహోన్నత రాజకీయ చింతనా సంప్రదాయంలో చివరివాడు కూడా ఆయనే. ఆ చింతనా ధోరణికి చెందిన వారిలో ప్రస్తుతం భారతదేశానికి తగిన ఆలోచనాపరుడు ఎవరు అని ప్రశ్నించుకుంటే నిస్సంశయంగా మళ్లీ లోహియా అనే చెప్పవచ్చు. కొత్త తరాల వారికి ఆయన ఎవరో కూడా తెలియదు కాబట్టి, అసలు లోహియా అంటే ఎవరు అన్న అంశం దగ్గర నుంచి మొదలుపెట్టడం అవసరం. 1910లో పుట్టిన లోహియా స్వాతంత్య్ర సమరయోధుడు. సోషలిస్ట్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష శిబిరాన్ని ఐక్యం చేయడానికి స్ఫూర్తిగా నిలిచినవారాయన. స్వతఃసిద్ధంగా విద్యావంతుడైన లోహియా జర్మనీలో పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన విరివిగా రచనా వ్యాసంగాన్ని నిర్వహించారు. ఒక్క రాజకీయ పరిణామాలను, సిద్ధాంతాలను విశ్లేషించడమే కాదు, చరిత్ర, పురాణాలు, తత్వశాస్త్రం గురించి కూడా ఆయన ఎన్నో రచనలు అందించారు. ఎందరో రచయితలకు, కళాకారులకు కూడా స్ఫూర్తి కేంద్రంగా ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే లోహియా నాయకుడు, ఆలోచనాపరుడు. ఇవాళ్టి రాజకీయాలలో అలాంటివారు అత్యంత అరుదు. మొదట అపోహలు తొలగించుకోవాలి లోహియా జీవితం నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే మొదట ఒక పనిచేయాలి. లోహియాకు సంబంధించి మన సమష్టి జ్ఞాపకాల నిండా పరుచుకుని ఉన్న గందరగోళాన్నీ, దురభిప్రాయాలనూ తుడిచి పెట్టాలి. ఆయన కాలంలోను, ఆయన తదనంతరం కూడా మేధావి వర్గం ఒక పద్ధతి ప్రకారం ఆయన పట్ల దురభిప్రాయాలను ఏర్పరుచుకుంది. ఆయన చేసిన మూడు ‘పాపాల’ను బట్టి మేధావి వర్గం ఎప్పటికీ క్షమించదేమో! యావద్భారతం అవతార పురుషునిగా, దైవాంశసంభూతునిగా ఆరాధిస్తున్న సమయంలో జవహర్లాల్ నెహ్రూను లోహియా విమర్శించారు. అలాగే కులం గురించి మాట్లాడడానికి ఎవరూ అంగీకరించని కాలంలో ఆయన అగ్రకుల ఆధిపత్యం గురించి నిలదీశారు. చివరిగా–ఇంగ్లిష్ భాష రద్దుకు ఉద్యమించారు. ఈ మూడు అంశాలే లోహియాను ఆయన సమకాలీన విధాన రూపశిల్పులకే కాదు, ఉదారవాదులకు, వామపక్షవాదులకు కూడా ఏమాత్రం గిట్టని వ్యక్తిగా నిలబెట్టాయి. ఈ కారణంగానే లోహియా విస్మృత నేతగా మిగిలారు. లేదంటే అసంగతాల ఆధారంగా గుర్తు చేసుకునే వ్యక్తిగా ఉండిపోయారు. రిజర్వేషన్లు అంటే! మూడు కారణాల వల్ల లోహియాను మనం తరచూ స్మరించుకుంటాం. మొదటిది– ఆయన కాంగ్రెస్ వ్యతిరేకత. రెండు– ఓబీసీలకు రిజర్వేషన్లు, మూడు– ఇంత క్రితం పేర్కొన్న ‘అంగ్రేజీ హఠావో’ నినాదం. లోహియా అసలు ఉద్దేశమేమిటో సరిగా అర్థం చేసుకోలేదనడానికి ఈ మూడు అంశాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇందులో ఆయన కాంగ్రెస్ వ్యతిరేకత లేదా కాంగ్రెసేతర వాదం 1960 దశాబ్దం నాటి ఒక వ్యూహం మాత్రమే. అప్పుడు ప్రతిపక్షాల అనైక్యత కారణంగా కాంగ్రెస్ ఎన్నికలలో విజయం సాధించేది. ‘శూద్రు’లకు రిజర్వేషన్ కల్పించాలని మొదటిగా వాదించినవారిలో లోహియా ఒకరు. ఆయన ఉద్దేశంలో ఈ కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించవలసిన వారు ఓబీసీలతో పాటు దళితులు, ఆదివాసీలు, స్త్రీలు కూడా. ఇందులో మళ్లీ కులం, వర్గం విభేదాలు కూడా ఉండవు. ఆయన దృష్టిలో రిజర్వేషన్ల అంతిమ లక్ష్యం సామాజిక న్యాయాన్ని సాధించడం ఒక్కటే కాదు. రిజర్వేషన్లు అంటే లోహియా దృష్టిలో స్త్రీపురుష సమానత్వాన్ని సాధించేందుకు, అన్ని కులాలకు సమాన హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన విస్తృత పోరాటం. అధికార భాషగా ఇంగ్లిష్ భాషను కొనసాగించడాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ వాస్తవిక అధికార భాషగా ఇక్కడి ప్రజా జీవితం మీద ఇంగ్లిష్ భాష సాగి స్తున్న స్వారీని మాత్రమే లోహియా వ్యతిరేకించారు. ఒక భాషగా ఇంగ్లిష్ను వ్యతిరేకించలేదు. ఆ భాషా సాహిత్యాన్ని కూడా నిరసించలేదు. ఆయనకు అందులో ఎంతో ప్రవేశం ఉంది. అలా అని ఆయన ఇంగ్లిష్ స్థానంలో హిందీని ప్రవేశపెట్టాలని కూడా భావించలేదు. ఇంగ్లిష్ స్థానంలో భారతీయ భాషలను ఉపయోగించాలని ఆశించారు. ఈ అంశాల గురించిన దురభిప్రాయాలను మనం వదిలించుకుంటే లోహియా అంటే ఏమిటో చూడడానికి అవకాశం కలుగుతుంది. గొప్ప చింతనాపరుడు లోహియా లోహియా యథాతథ స్థితిని ఛిద్రం చేయాలనుకునే తత్వం కలిగినవారు. ఒక ద్రష్ట. వలసవాద అనంతర కాలానికి చెందిన గొప్ప చింతనాపరుడు. నిఖార్సయిన భారతీయుడు. అదే సమయంలో సహేతుకమైన అంతర్జాతీయవాది. పెట్టుబడిదారీ విధానం –కమ్యూనిజం, జాతీయవాదం– అంతర్జాతీయ వాదం, సంప్రదాయం– ఆధునికత అనే 20వ శతాబ్దపు ద్వైదీభావపూరిత∙సూత్రాలకు అతీతంగా లోహియా మనకు మూడో మార్గాన్ని చూపారు. ఐరోపా చరిత్రలో మరోసారి జీవించాలని ఐరోపాయేతర సమాజాలు ఆలోచించలేవని, నిజానికి ముమ్మాటికీ అలా ఆలోచించరాదని కూడా ఆయన చెప్పారు. భారత వర్తమాన, భవిష్యత్ కాలాల గురించి తాజాగా ఆలోచించడానికి ఆయన వాకిలి తెరిచారు. సామ్యవాదం అనేది పెట్టుబడిదారీ విధానానికీ, కమ్యూనిజానికి భిన్నమైన సిద్ధాంతమని లోహియా భావన. 20వ శతాబ్దానికి చెందిన ఆ రెండు ఆర్థిక సిద్ధాంతాలు భారీ పరిశ్రమలు, విస్తృత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం, కేంద్రీకరణల యావలో పడినాయని ఆయన అన్నారు. అలాంటి నమూనా రావాలంటే వలస దోపిడీతోనే సాధ్యమని, మిగిలిన ప్రపంచంలో సమత్వానికి అవి ఉపకరించవని లోహియా వ్యాఖ్యానించారు. అందుకు ప్రత్యామ్నాయంగా, లేదా మూడో మార్గంగా ఆయన చిన్న తరహా సాంకేతిక పరిజ్ఞానం, గ్రామీణ పరిశ్రమలు, వికేంద్రీకరణలు పునాదిగా ఉండే సోషలిజాన్ని ప్రతిపాదించారు. ఉత్పత్తి సాధనాల మీద ప్రభుత్వం, ప్రైవేట్ ఆధిపత్యం గురించిన చర్చను పూర్వపక్షం చేసి, దీనికి ప్రత్యామ్నాయంగా ఆర్థిక ఆస్తుల మీద సహకార యాజమాన్యాన్ని ప్రతిపాదించారు. ఆధునికతకు అర్థం చెప్పినవాడు సాంస్కృతిక పరమైన ఉనికిని గురించి వర్తమానంలో జరుగుతున్న చర్చల విషయంలో కూడా లోహియా మూడో మార్గాన్ని చూపించారు. యుద్ధోన్మాద జాతీయ వాదానికీ, విధ్వంసక కాస్మొపోలిటన్ సంస్కృతికీ మధ్య సాంస్కృతిక పునాది కలిగిన అంతర్జాతీయ వాదం మెరుగైనదని లోహియా భావించారు. భారతీయ స్త్రీవాదానికి ద్రౌపది ప్రతీక అని ఆయన చెప్పారు. ఉత్తర, దక్షిణ భారతాల వారధిగా ఆయన రామాయణాన్ని పరిగణించారు. అలాగే మహా భారతం తూర్పు, పడమర ఐక్యతకు చిహ్నమని చెప్పారు. సంప్రదాయబద్ధమైన, సంప్రదాయ విరుద్ధమైన రెండు తరహాల రామాయణాలను ప్రవచించే విధంగా ఒక మేళాను నిర్వహించాలన్నది ఆయన కల. భారతదేశంలో నదుల దుస్థితిని గురించి మొదట గొంతెత్తినది కూడా ఆయనే. అలాగే పుణ్యక్షేత్రాల పరిశుభ్రత గురించి ఆయనే వివరించారు. చైనా కుట్రల గురించి మొదట హెచ్చరించినవారు, హిమాయల సరిహద్దుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం గురించి నెహ్రూను నిలదీసిన వారు కూడా లోహియానే. సాంస్కృతిక మూలాలే పునాదిగా రాజీలేని లౌకికవాద భావనలకు, ఆధునిక దృష్టికి, అంతర్జాతీయ దృష్టికి నిబద్ధునిగా కనిపించే వ్యక్తి లోహియా. అసలు ఈ భువి మీద నివసించే ప్రజలంతా కలసి ఎన్నుకునే ఒక ప్రపంచ పార్లమెంట్, ఒక ప్రభుత్వం ఉండాలని ఆయన కోరుకున్నారు. ఏ రూపంలో ఉన్నప్పటికీ వలసవాదాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచం మీద అందరికీ సమాన హక్కులు ఉండాలని భావించారు. పౌరహక్కుల కోసం అమెరికాలో సాగిన ఉద్యమానికి మద్దతు ఇచ్చి, అందులో పాల్గొని అరెస్టయిన భారతీ యుడు బహుశా లోహియా ఒక్కరే. మనిషి రంగు ఆధారంగా చెలరేగే జాత్యహంకారాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. వీటన్నిటితో పాటు లోహియా ఆధునికత గురించి కూడా ఒక కొత్త ఆలోచనా ధోరణికి శ్రీకారం చుట్టారు. అది 20వ శతాబ్దాన్ని శాసించిన ద్వైదీభావాలకు అతీతమైనది. అనుకరణతో కూడిన ఆధునికతను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దీనినే మనం పట్టణ ప్రాంత, విదేశీ భావాలు ఉన్న భారతీయులలో గమనిస్తూ ఉంటాం. పురాతనమైన ప్రతి అంశం కూడా ఔదలదాల్చదగినదని వాదించే సంప్రదాయవాదులను కూడా ఆయన నిరసించారు. ప్రతి ఆధునిక ఆవిష్కరణ పురాతన కాలంలోనే ఉన్నదని వాదించే వారి ధోరణిని వ్యతిరేకించారు. ఆయన దేశీయమైన ఆధునికత గురించి స్వప్నిం చారు. ఐరోపాకు ఇప్పటివరకు తెలియని ఒక ఆధునికతను సృష్టించాలని లోహియా విశ్వవిద్యాలయ స్నాతకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒకసారి బోధించారు. యాదృచ్ఛికమేమిటంటే, ఆ ఉపన్యాసం ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం విద్యార్థులను ఉద్దేశించి ఇచ్చారు. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్ : 98688 88986 -
కొత్త వ్యవస్థకు పురుటినొప్పులు?
విశ్లేషణ ఈ నిరసనలకు ఇన్ని కోణాలు ఉన్నా, ఒక సారూప్యత కూడా కనిపిస్తుంది. అది, ప్రస్తుత ప్రభుత్వం ఉన్నత విద్యాలయాల మీద అమలు చేయాలనుకుంటున్న కొత్త విధానాల పట్ల వ్యతిరేకత. ఆ కొత్త విధానాన్ని కేవలం కాషాయీకరణగా పేర్కొనలేం. నిజానికి అంతకు మించినదే. భగత్సింగ్ జయంతి పేరుతో అర్థంపర్థంలేని కార్యక్రమాలు చాలా జరిగిపోతున్నాయి. ఉత్సవాలు, నివాళి ఘటించడం, దండలు, ఉపన్యాసాలు.. ఒకటేమిటి! ఆ గొప్ప విప్లవకారుడు నవ్వుకుని ఉండేవాడు. కొన్నేళ్లుగా భగత్సింగ్ దేనికీ చెందని చిహ్నంగా మారిపోయాడు. ప్రత్యేకమైన సిద్ధాంతానికి చెందినవాడని అన డం లేదు. భగత్సింగ్ పట్ల మనం ఏర్పరుచుకున్న కల్పనకు ఇది పూర్తిగా విరుద్ధం. కానీ వాస్తవంగా భగత్సింగ్ అంటే ఏమిటి? దీనిని గుర్తు చేసుకోవడానికి ఆయన 110వ జయంతి ఉపకరిస్తుంది. ఆయన భారతదేశం పట్ల, ప్రపంచం పట్ల ప్రత్యేక దృక్పథం కలిగినవాడు. ఆయనను గుర్తుంచుకోవడానికి మంచి మార్గం ఏమిటంటే, ఆ గతం దగ్గరకు గాని, ఆయన జీవితం గురించి గాని చెప్పుకోవడం కాదు. ఒక గొప్ప విప్లవకారుడిని గుర్తుంచుకోవాలంటే ఉన్న మార్గం ఒక్కటే– వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి ప్రశ్నిం^è డమే. ఆ ప్రశ్న: భావి భారతాన్ని యువతరం ఎలా పునర్నిర్మించగలదు? అలాంటి ప్రశ్న వేయడానికి ఇది మంచి సమయం కూడా. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మున్నెన్నడూ జరగని రీతిలో విద్యార్థినుల నాయకత్వంలో జరిగిన నిరసన యువజన రాజకీయాల మీద మరోసారి దృష్టి సారించేటట్టు చేసింది. నిజానికి గడచిన రెండేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా– పుణేలోని ఎఫ్టిఐఐ, అలహాబాద్ విశ్వవిద్యాలయం, కోల్కతాలోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, జేఎన్యూ, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇప్పుడు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వరకు ఇలాంటి నిరసనలు వెల్లువెత్తడం చూశాం. ఈ నిరసనలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేని వేర్వేరు ఘటనలేనా? కాకపోతే వాటి మధ్య ఒక అంతస్సూత్రం ఏదైనా ఉందా? ఇది నిజమైతే ఇవి భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలవా? ఈ ప్రశ్న నుంచి తప్పించుకోవడం పెద్ద కష్టం కూడా కాదు. ఇవాళ్టి యువతరంలో సాధారణంగా కనిపించేవి– అన్నింటిని తేలికగా తీసుకోవడం, కెరీర్ పట్ల ధ్యాస, సరదా సరదా మాటలు, సామాజిక మార్పు కంటే సోషల్ మీడియా అంటేనే ఎక్కువ శ్రద్ధ చూపడం. సమస్య ఏమిటంటే తల నెరిసిన వారంతా తమ కంటే చిన్నవారిని గురించి ఇలాంటి అభిప్రాయాలే కలిగి ఉంటారు. తమకు ఉన్న పరిధిలోనే విజయాన్ని, గౌరవ ప్రతిష్టలను సాధించాలనుకునే వారు ప్రతి తరంలోను విరివిగానే ఉంటారు. అయితే వ్యవస్థను ధిక్కరించేవారు, కొత్తగా వ్యాఖ్యానించేవారు ఏ తరంలో అయినా స్వల్ప సంఖ్యలోనే ఉంటారు. ఈ తరం కూడా అందుకు భిన్నమేమీ కాదు. ప్రజా జీవితంతో నాకున్న అనుభవాన్ని బట్టి నేను ఒకటి చెప్పగలను. ఈ తరంలో కూడా సిద్ధాంతపరంగా ఆలోచించే యువతకు కొదవ లేదు. వారు తమ వ్యక్తిగత అభివృద్ధికి మించి ఆలోచించగలరని సాక్ష్యం ఇవ్వగలను. తాము నమ్మిన విలువలను కాపాడుకునేందుకు గట్టిగా నిలబడగలరని కూడా చెప్పగలను. అయితే వివిధ విశ్వవిద్యాలయాలలో జరిగిన ఘటనలన్నీ ఒకే విధమైనవి కావు. అవి వేర్వేరే. ఎఫ్టిఐఐ సంగతి చూస్తే, ప్రతిష్టాత్మకమైన ఆ సంస్థకు తగినస్థాయి వ్యక్తిని చైర్మన్ పదవిలో నియమించలేదన్న ఆక్రోశంతో నిరసన చెలరేగింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో నిరసన జ్వాలలు రేగాయి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపులు, స్త్రీ పురుష వివక్ష కారణంగా గొడవ మొదలైంది. జేఎన్యూ, ఢిల్లీ విశ్వవిద్యాలయాలలో ‘జాతి వ్యతిరేకత’ ఉదంతాలతో నిరసనలు మొదలైనాయి. మిగిలిన చోట్ల అలజడులన్నీ యాదృచ్ఛికంగా జరిగాయి. ఈ నిరసనల వెనుక ఉన్న రాజకీయాలు కూడా భిన్నమైనవే. జేఎన్యూ నిరసనల వెనుక వామపక్ష భావాలు కలిగిన విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్ ఉదంతంలో అంబేడ్కర్వాదులు ఉన్నారు. ఈమధ్యే విశ్వవిద్యాలయాలలో జరిగిన గొడవలకు ఇలాంటి ముద్రలు వేయలేం. అయితే ఈ నిరసనలకు ఇన్ని కోణాలు ఉన్నా, ఒక సారూప్యత కూడా కనిపిస్తుంది. అది, ప్రస్తుత ప్రభుత్వం ఉన్నత విద్యాలయాల మీద అమలు చేయాలనుకుంటున్న కొత్త విధానాల పట్ల వ్యతిరేకత. ఆ కొత్త విధానాన్ని కేవలం కాషాయీకరణగా పేర్కొనలేం. నిజానికి అంతకు మించినదే. ప్రస్తుత పాలనా వ్యవస్థ ఉన్నత విద్యా వ్యవస్థను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నది. నియంత్రణకు పాల్పడుతున్నది. ఈ నియంత్రణ అనేక రూపాలలో ఉంటుంది. విధేయులను తెచ్చి ఈ ఉన్నత విద్యాలయాల అత్యున్నత పీఠాలను అప్పగించడం అందులో ఒకటి. ఇది ఇంతకు ముందు కూడా లేకపోలేదు కాని, ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఇంతకు ముందు కాంగ్రెస్, వామపక్షాల హయాంలో కూడా ఇది జరిగింది. బీజేపీ హయాంలో తారస్థాయికి చేరుకుంది. విద్యార్థులకు సంబంధించినంత వరకు నియంత్రణ అంటే పరాధీనులను చేయడమే. దీని వెంటే రాజకీయాలకు దూరం చేయడమనే తంతు ఉంటుంది. బహిరంగ చర్చలకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు, ఇంకా విద్యార్థి నిరసనలకు అవకాశాలు లేకుండా చేయడం ద్వారా అది జరుగుతుంది. దీని మీదే విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రణ విధానానికి, ఉన్నత స్థాయి విద్యలో అలాంటి కొత్త విధానానికి నిరసనగాను వారు తిరగబడుతున్నారు. ఈ నిరసనలు, అలజడులు చివరికి దేనికి దారి తీస్తాయి? వీటికి కచ్చితమైన ముగింపులు త్వరలోనే వస్తాయి. ఒకటి మాత్రం నిజం, ప్రస్తుత పాలక వ్యవస్థ యువతను తమ కనుసన్నలలోకి తెచ్చుకోవడంలో ఎలాంటి ముందడుగు వేయలేకపోయింది. జేఎన్యూ, ఢిల్లీ విశ్వవిద్యాలయం, హెచ్సీయూ, గౌహతి, పంజాబ్ విశ్వవిద్యాలయాలలో జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికలే ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. ఒక విశ్వ విద్యాలయానికి మరొక విశ్వవిద్యాలయానికి విజేతలు మారారు కానీ, అన్నిచోట్లా పరాజితులు మాత్రం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), మద్దతుదారులే. ఈ ప్రతిఘటన భావి భారత రాజకీయాలకు ఆకృతినిస్తుందా? ఈ ప్రతిఘటనను క్రమబద్ధీకరించడం మీదే ఈ ప్రశ్నకు సమాధానం ఆధారపడి ఉంది. వ్యవస్థాపరంగా– ఈ ఆందోళనల మధ్య సమన్వయం కుదురుతుందా? రాజకీయంగా– సమాన విద్యావకాశాలు, స్తంభించిపోయిన ఉద్యోగావకాశాలు వంటి అంశాలతో విద్యా ప్రాంగాణాలకు బయట ఉన్న యువతలో రేగిన ఆగ్రహావేశాలను విద్యార్థుల నిరసనలతో జోడించడం సాధ్యమా? ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు. ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలను సంధించడం ఎలాగో భగత్సింగ్ మనకు బోధించాడు. భగత్సింగ్ ఈనాడు మన మధ్య ఉండి ఉంటే, బీహెచ్యూ విద్యార్థినుల ఆందోళనకు గర్విస్తూ, అవే ప్రశ్నలను అడిగి ఉండేవాడే. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 ‘ ‘ Twitter: @_YogendraYadav -
పతనానికి ఇది ప్రారంభమా?
విశ్లేషణ దేశంలోని ఏ ఇతర నాయకుల కంటే ప్రజాదరణ విషయంలో మోదీ అగ్రస్థానంలో ఉన్నమాట నిజమే కానీ ఆశలు నిలుపని ఆర్థిక ఫలితాలతో ప్రజల ఆలోచనలు మార్పు చెందుతున్నట్లుంది. మోదీ మ్యాజిక్ మళ్లీ పనిచేస్తుందా అనే ప్రశ్నకు బలమైన, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయమే సమాధానం. పాఠశాలకు వెళ్లిన రోజుల్లో హిందీ భాషలో రాసే ఉత్తరాల్లో మేం వాడుతూ వచ్చిన ‘‘ఇక్కడ అంతా బాగుంది’’ అనే పదబంధం గురించి చాలా జోకులు వేసుకునేవాళ్లం. ఇక్కడ అంతా బాగుంది. అలాగే చిన్న మామయ్య కాలం చేశారు. ఈ వార్త వినగానే అమ్మమ్మ బాగానే కన్నుమూశారు. ఈ సంవత్సరం వానలు పడనందున పంటలు పండలేదు. ఈ ఏడు వానలు తక్కువ కావటంతో పంట ఎండిపోయింది. అలాగే గ్రామంలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. పోతే, ప్రతిదీ బాగానే సాగుతోంది. మీరు కూడా బాగానే ఉన్నారని తలుస్తాను. నేటి మన దేశం గురించి ఎవరైనా ఒక ఉత్తరాన్ని ఈ శైలిలో తిరగరాస్తే, అది పై జోక్కు ఏమంత భిన్నంగా ఉండదు. మన దేశంలో అంతా సజావుగా సాగుతోంది. ఆదాయమా.. పడిపోయింది. ఉత్పత్తా.. తగ్గిపోయింది. ఎగుమతులా.. క్షీణించాయి. జీవన వ్యయమా.. పెరిగిపోయింది కానీ ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉంది. నిరుద్యోగిత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇక సంక్షోభంలో చిక్కుకున్న రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వ్యాపారులకు ఆశాభంగం కలుగుతోంది కానీ ప్రజలు మాత్రం సంతృప్తిగానే ఉన్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా కొందరు శిశువులు చనిపోయారు. మురికినీటి కాలువలో అత్యంత విషవాయువుల కారణంగా కొందరు చనిపోయారు. కొందరు తమ వాణిని వినిపించిన కారణంగా చనిపోతున్నారు. భయం కారణంగా కొందరు చడీచప్పుడు లేకుండా చనిపోతున్నారు. ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తున్నప్పటికీ ఇలాంటివి జరుగుతున్నాయి కానీ ప్రజాదరణ కారణంగా ప్రభుత్వం దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళుతోంది. ఇతర జోకులలాగే, దీంట్లోనూ ఒక నిగూఢ వాస్తవం ఉంది. దేశం ఒక అయోమయ దిశ గుండా సాగుతోంది. మన దేశానికి చెందిన వాస్తవం, అవగాహన అనేవి నేడు పూర్తిగా వ్యతిరేక ధ్రువాల్లో నిలుస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ గణాంకాలు ఒక దిశను చూపుతుండగా, ఒపీని యన్ పోల్స్ పూర్తిగా వ్యతిరేక ధ్రువాన్ని చూపుతున్నాయి. దేశానికి సంబంధించిన క్షేత్ర వాస్తవాలు ప్రభుత్వం గురించి ఒక చిత్రాన్ని చూపుతుండగా, ఒపీనియన్ పోల్స్ చిత్రణ దానికి భిన్నమైనదాన్ని అత్యంత స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ప్రతి ఆరునెలలకు ఒకసారి తాను చేపట్టే ఒపీనియన్ పోల్ను ఇండియా టుడే గత నెలలో విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలు జూలైలో జరిపినట్లయితే పాలక ఎన్డీయే కూటమి 2014లో సాధించిన దానికంటే అధిక మెజారిటీని సాధిస్తుందని అది అంచనా వేసింది. సర్వే ప్రకారం, ప్రధాని నరేంద్రమోదీకి ప్రజాదరణ అదే స్థాయిలో కొనసాగుతుండగా తక్కిన నాయకులు ఎవరూ ఆయనకు దరిదాపుల్లోకూడా లేరు. ప్రభుత్వ పనితీరుతో ప్రజలు బాగా సంతృప్తి చెందుతున్నారని ఆ సర్వే చెప్పింది. కానీ ప్రతిపక్షం మాత్రం ఆ సర్వే విశ్వసనీయతను ప్రశ్నించింది. అయితే, రెండు నెలల క్రితం ఏబీపీ న్యూస్ కోసం సీఎస్డీఎస్ సంస్థ నిర్వహించిన సర్వే కూడా దాదాపు అలాంటి ఫలితాలనే చూపించింది. గత నెలలో, భారత ఆర్థికవ్యవస్థకు చెందిన పలు వాస్తవాలు ప్రజల దృష్టికి వచ్చాయి. రద్దయిన పెద్దనోట్లు ఏమేరకు బ్యాంకుల్లోకి వచ్చాయన్న ప్రశ్నను నెలలపాటు తొక్కిపెడుతూ వచ్చిన రిజర్వ్ బ్యాంకు ఎట్టకేలకు, రద్దయిన పెద్దనోట్లలో చాలావరకు బ్యాంకుల్లో జమ అయిపోయాయని ఒప్పుకుంది. అంటే ప్రభుత్వం నల్లధనాన్ని నిరోధించడంలో విఫలమైనట్లు తేలిపోయింది. కొత్తగా ఉద్యోగాలను సృష్టిస్తున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఉపాధి రేటు వాస్తవానికి తగ్గుముఖం పట్టిం దని ఉపాధిపై ప్రభుత్వ గణాంకాలే సూచించాయి. నిజం చెప్పాలంటే ఈ అంశంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కంటే మోదీ ప్రభుత్వం పేలవమైన పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు కేవలం 5.7 శాతం మాత్రమే నమోదైనట్లు జాతీయ ఆదాయ (జీడీపీ) గణాంకాలు సూచించాయి. ఒక సంవత్సరంలోనే 2 శాతం క్షీణత అంటే రెండు లేక మూడు లక్షల కోట్ల రూపాయలను ప్రజలు నష్టపోయారని లెక్క. పారిశ్రామికోత్పత్తి క్షీణించింది, ఎగుమతులు పడిపోయాయి. రుతుపవన వర్షాలు బాగానే కురిసి, పంటలు బాగా పండినప్పటికీ, రైతుల ఆదాయం క్షీణించిపోయింది. జీఎస్టీ ప్రవేశంతో చిన్న తరహా వర్తకులు బాగా దిగాలు పడిపోయారు. జీఎస్టీని ఆత్రంగా అమలు చేయడం వల్ల దానితో రావల్సిన లాభాలు ఇప్పుడు సాధ్యం కావని స్పష్టంగా తెలిసిపోయింది. అదే సమయంలో, వినియోగదారులు దీని ప్రభావాన్ని మొత్తంగా భరించాల్సి వస్తోంది. ముడిచమురు ధరలు దాదాపు సగానికి పడిపోయినా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. గత కొద్ది నెలలుగా తగ్గుముఖంలో ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు మళ్లీ పెరగడం ప్రారంభించింది. ఆర్థిక వ్యవస్థలోని ఈ మాంద్యం పెద్దనోట్ల రద్దువల్లనో లేక మరే ఇతర కారణాల వల్లనో కలుగుతోందా అనేది అసలు ప్రశ్న కాదు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పెద్ద, సాహసోపేతమైన నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకుంటుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు లేక తర్వాతైనా తలెత్తకమానదు. మోదీ ప్రభుత్వంపై దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భిన్నమైన వార్తలు వస్తూనే ఉన్నాయి. పంచకులలో డేరా మద్దతుదారులు విధ్వంసం సృష్టించిన సమయంలో హర్యానా ప్రభుత్వ వైఫల్యం, గోరఖ్పూర్ ఆసుపత్రిలో చిన్నారుల మరణం, గుర్గావ్లో పిల్లాడి హత్య వంటివి దీనికి ఉదాహరణలు. ఈ సంఘటనలకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష బాధ్యత లేకున్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై మోదీ తన అపరాధ భావన, బాధ్యత నుంచి తప్పించుకోలేరు. వాస్తవానికి, అవగాహనకు మధ్య ఉన్న ఈ అంతరం తగ్గేదెలా: మోదీ ప్రభంజనం ముగియనుందా? మోదీ ప్రభుత్వ వికాస పతనానికి ఇది ప్రారంభమేనా? దేశ ప్రజల మానసిక స్థితి మార్పు చెందుతూ, ఈ దేశ వాస్తవాన్ని చూడడం వైపు మొగ్గు చూపుతోందా లేక మోదీ మరోసారి తన మంత్రదండాన్ని ప్రయోగించి అసలు వాస్తవాలను ప్రజలు మర్చిపోయేలా చేయనున్నారా? భవిష్యత్తు మాత్రమే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. ప్రజల దృష్టిలో మోదీ లేదా బీజేపీకి వ్యతిరేకంగా బలమైన, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం ఉంటుందా లేదా అనేదే ఈ ప్రశ్నకు సమాధానమిస్తుంది. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986, Twitter: @_YogendraYadav యోగేంద్ర యాదవ్ -
పాలక భావజాలం చేసిన హత్య
విశ్లేషణ తండ్రికంటే గౌరి ఎక్కువ వామపక్షవాది. కానీ, ఆమె లౌకికవాదం బసవన్న నాటి నుంచి కన్నడనాట సాంస్కృతికంగా వేళ్లూనుకుని ఉన్న సమానత్వవాద సాంప్రదాయపు కొనసాగింపే. ఇలాంటి లౌకికవాద సంప్రదాయం అంటేనే సంఘ్పరివార్కు భయం ఎక్కువ. దాన్ని పాశ్చాత్య మేధోవాదంగా తోసిపారేయలేరు. భావమయ జీవితాన్ని జీవించిన గౌరి అందుకు తగ్గట్టే ఒక భావజాలం చేతుల్లో హత్యకు గురయ్యారు. ఆ భావజాలం మన రాజ్యాంగానికి విరుద్ధమైనది, హిందూ మతంలోని వివిధ శాఖలను తన అస్తిత్వానికి ముప్పుగా భావించేది. గౌరీ లంకేశ్ను చంపింది ఏమిటి? ‘‘గౌరీ లంకేశ్ను చంపింది ఎవరు?’’ అనే ప్రశ్నా ఒక్కటే కావు. లంకేశ్ను చంపింది ఏమిటి? అనేది మరింత లోతైన, మరింత ఉపయుక్తమైన ప్రశ్న. బహిరంగ చర్చలో మనం అర్థవంతమైన సమాధానం చెప్పగల ప్రశ్న ఇది మాత్రమే. ఒక హత్య నాలుగు రకాల అపరాధాలతో కూడినదిగా ఉంటుంది: హత్యను చేసిన వారు ఎవరు, అందుకు కుట్ర పన్నినది ఎవరు, దానిని ప్రోత్సహించినవారు లేదా దాని వల్ల లబ్ధి పొందేవారు ఎవరు, అందుకు ఆమోదం తెలిపినవారు ఎవరు అనేవి. ఇందులో మొదటి రెండు అంశాలను మనం పోలీసులకు వదిలి పెట్టేయాలి. హంతకులు, కుట్రదారుల గురించి హడావుడిగా నిర్ధారణలు చేసేయాలని ప్రయత్నిం^è వద్దు. అందుకు బదులు, ఆమె హత్యకు ప్రేరేపించిన, అనుమతించిన మరింత విస్తృత నేపథ్యంపై దృష్టిని కేంద్రీకరిద్దాం. నోళ్లు మూస్తారా? లేకపోతే... ఈ వైఖరి, ప్రత్యేకించి గౌరీ లంకేశ్ విషయంలో మరింత సందర్భోచితమైనది. ఆమె కేవలం ఒక వ్యక్తి కాదు. ఆమె ఒక భావానికి ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి ఆమె హత్య ఆ భావాన్ని కడతేర్చాలని చేసిన ప్రయత్నమనే అనుకోవాలి. అంతే కాదు, నోళ్లు మూయండి లేదంటే చూస్కోండి అని మిగతా వాళ్లందరికీ సంకేతాన్ని పంపడమని కూడా అర్థం. ఈ సంకేతాలు బహిరంగంగా పంపినవి కాబట్టి, ఆమె హత్యకు దారి తీసిన నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి వాటి అంతరార్థాన్ని విప్పి చూడటం అవసరం. ‘ఎవరు చేశారు’ అనే దానికి సంబంధించి ఓ మాట. ఇంతవరకైతే, దీనికి సంబంధించి మనకు కొన్ని వాస్తవాలు తెలుసు. గౌరీ లంకేశ్ ఒక పాత్రికేయురాలు. లంకేశ్ పత్రికె అనే ఓ అసాధారణ పత్రికకు భయమెరుగని సంపాదకురాలు. తన సంపాదకత్వంలోని పత్రిక ద్వారా, కొము సౌహార్ద వేదికె వంటి సంస్థల ద్వారా బీజేపీ, దాని మిత్రపక్షాల హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆమె అవిశ్రాంత పోరాటాన్ని సాగిస్తున్నారు. గత ఏడాది ఒక బీజేపీ నేత ఆమెపై వేసిన పరువు నష్టం దావాలో ఆమె ఓడిపోయారు. ఆమె ఆ కేసులో చేసిన అప్పీలు ఇంకా పెండింగ్లో ఉంది. సంఘ్ పరివార్ అనుబంధ సంస్థల బెదింపులకు ఆమె పలుమార్లు గురయ్యారు. మనకు తెలిసినంత వరకు ఈ హత్యకు సంబంధించి వ్యక్తిగత కక్ష కోణం లేనే లేదు. ఈ సమాచారం, ఆమెను చంపడానికి కారణం ఆమె భావాలు, తన ఆలోచనలను బహిరంగంగా వెల్లడించాలనే ఆమె సంకల్పమే అనే తార్కిక నిర్ధారణకు రావడానికి చక్కగా సరిపోతుంది. అయితే ఆమె హంతకులు, హత్య కుట్రదారులకు సంబంధించి ఈ సమాచారం కచ్చితమైన నిర్ధారణలకు చేర్చలేదు. అందువల్ల ఆ నేర పరిశోధనను చేయాల్సినది టీవీ స్టూడియోలలో ఎంత మాత్రమూ కాదు. అలా అని పోలీసులపై విశ్వాసం ఉంచాలని కాదు. కాంగ్రెస్ లేదా బీజేపీ ఏది అధికారంలో ఉన్నాగానీ ఇలాంటి కేసుల్లో పోలీసు దర్యాప్తు నిర్లక్ష్యపూరితమైనదిగా ఉంటున్న మాట నిజమే. అయినాగానీ మనం దర్యాప్తును ముందే కాదన కూడదు. అ తర్వాత మనం దానిపై నిశిత పరిశీలన జరపవచ్చు. గౌరీ లంకేశ్ హత్యకు పథకం పన్నినది ఎవరో చెప్పే ఆధారాలు మనకు లేవుగానీ, ఆమె హత్యకు సంబరాలు చేసుకున్నవారు, దాన్ని సమర్థించినవారు ఎవరో చెప్పే ఆధారాలు బోలెడన్ని ఉన్నాయి. కొన్ని గంటల క్రితమే హత్యకు గురైన ఆ మహిళ గురించి వెక్కిరింతలు, తిట్లు, నిందలతో కూడిన వ్యాఖ్యలతో సోషల్ మీడియా మోత మోగిపోయింది. వాటిలో చాలా వరకు బాగా సుపరిచితమైన బీజేపీ విద్వేషపూరిత వ్యాఖ్యాతలవే. వారిలో కొందరిని ప్రధాన మంత్రి అంతటివారే ఫాలో అవుతున్నారు. ఈ హత్య సందర్భంగా, ఈ దుష్ప్రచార కార్యక్రమానికి, తమకు సంబంధం లేదని చెప్పుకోవడం అధికార పార్టీకి కీలకమైనది. కానీ, ఒక్క రవిశంకర ప్రసాద్ తప్ప మరే సీనియర్ బీజేపీ నేతా అలా నిర్ద్వంద్వంగా మాట్లాడింది లేదు. అసహ్యకరమైన వ్యాఖ్యానాలను చేస్తున్నవారిని ప్రధాని ఇంతవరకు ‘అన్ ఫాలో’ చేయలేదు. సంఘ్ భావజాల ప్రత్యర్థుల వరస హత్యలు లంకేశ్ హత్యకు ముందు జరిగిన మూడు హత్యలు ఇదే భయానకమైన పద్ధతిలో పునరావృతం అయ్యాయని కూడా మనకు తెలుసు. 2013లో జరిగిన హేతువాది డాక్టర్ నరేంద్ర దభోల్కర్ హత్య, మూఢ నమ్మకాలను వ్యతిరేకించే మరో ఉద్యమకారుడు కామ్రేడ్ గోవింద్ పన్సారే హత్య, వాటిని వెన్నంటి 2016లో జరిగిన విజ్ఞానశాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎం కల్బుర్గీ హత్య ఒకేవిధమైన పద్ధతిలో జరిగాయి. వీటిలో ప్రతి కేసులోనూ గుర్తు తెలియని హంతకులు సంఘ్ పరివార్ భావజాలానికి విరుద్ధమైన భావజాలాన్ని గలిగిన నిర్విరామ మేధో యోధులను కాల్చి చంపారు. ఇవేవీ మరేదో హింసా చర్యకు ప్రతీకారంగా జరిగిన హత్యలు కావు. రాజకీయ ప్రత్యర్థులను తుదముట్టించాలని చేసిన ప్రయత్నాలూ కావు. ఇవన్నీ ఒక భావాన్ని తుదముట్టించాలనే లక్ష్యంతో జరిగినవే. ఈ ముగ్గురు ‘హేతువాదులు’ ప్రచారం చేస్తున్నది ఏదో విపరీతపు ఆలోచన కాదు. ‘శాస్త్రీయ చింతన’ను పెంపొందింపజేయడం పూర్తిగా మన రాజ్యాంగబద్ధమైన ఆదర్శం. మన రాజ్యాంగానికి విరుద్ధమైన భావజాలం వారిని హత్య చేసింది. ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తేనే, గౌరీ లంకేశ్ హత్య ఈ క్రమంలో సరిగ్గా ఇమిడి పోతుంది. ఆమె భావాలు, మిగతా ముగ్గురి భావాలు ఒక్కటి కాని మాట నిజమే. కానీ, ఆమె మద్దతుదార్లు, ఆమెను నిందించేవారు అంతా కూడా ఆమెను ‘వామపక్షవాది’గా భావించారు. ఆమె నక్సలైట్ అనే బాధ్యతారహితమైన మాట సైతం కొంత వినిపించింది. ఇదేదీ వాస్తవం కాదు. కర్ణాటకకు చెందిన సుప్రసిద్ధ మేధో సంప్రదాయానికి గౌరి ప్రాతినిధ్యం వహించారు. అది ఈ వర్గాలు వేటిలోనూ ఇమిడేది కాదు. ‘గౌరీ లంకేశ్ పత్రికె’ సంపాదకురాలిగా ఆమె తన తండ్రి పీ లంకేశ్ వారసత్వాన్ని కొనసాగించారు. ఆయన, కన్నడ సాహిత్యంలోని ‘నవ్య’ సాంప్రదాయానికి చెందిన ముగ్గురు గొప్ప రచయితలలో ఒకరు. షిమోగాకు చెందిన ఈ ముగ్గురు రచయితలు, పీ లంకేశ్, పూర్ణచంద్ర తేజస్వి, యూఆర్ అనంతమూర్తి రామ్మనోహర్ లోహియా నుంచి ప్రేరణ పొందినవారు. దృÉý మైన కులవ్యతిరేక వైఖరిని సోషలిస్టు బ్రాండు రాజకీయాలు, సాంస్కృతికంగా వేళ్లూనుకుని ఉన్న లౌకికవాదాన్ని సమ్మిళితం చేశారు. తమ రచనలతో కర్ణాటకలోని ‘అభ్యుదయ’ కార్యకర్తలందరికీ ఉత్తేజాన్ని ఇచ్చిన దేవనార్ మహదేవ, సిద్ధలింగయ్య, డీఆర్ నాగరాజ్ వంటి తర్వాతి తరం కన్నడ మేధావులను వారు తీర్చిదిద్దారు. పరివార్ను భయపెట్టే లంకేశ్ లౌకికవాదం వారి సోషలిస్టు సాంప్రదాయం పేదలకు అనుకూలమైనది, సమానత్వవాదం అనే అర్థంలో ‘వామపక్షవాదం’. అయితే అది దాని సాంస్కృతిక ప్రాతిపదిక రీత్యా కమ్యూనిస్టు వామపక్షవాదం కంటే చాలా విభిన్నమైనది. ఈ సంప్రదాయం బసవన్న నాటి కాలం నుంచి వేళ్లూనికుని ఉన్న కన్నడ సమానత్వవాదంలో వేళ్లూనుకుని ఉన్నది. కొన్ని విషయాలలో గౌరి తమ తండ్రికంటే ఎక్కువగా సాంప్రదాయక వామపక్షవాది అయినా, ఆమె లౌకికవాదం మాత్రం ఈ సంప్రదాయపు కొనసాగింపే. తన తండ్రిలాగే ఆమె కూడా కన్నడంలోనే రాయాలని ఎంచుకున్నారు. సాంస్కృతికంగా వేళ్లూనుకున్న ఈ రూపంలోని లౌకికవాదం మన స్వాతంత్య్రోద్యమ కాలపు లౌకికవాద రూపానికి అనుగుణమైనది. ఈ సంప్రదాయం అంటేనే సంఘ్పరివార్ ఎక్కువగా భయపడుతుంది. ఈ రూపంలోని లౌకికవాదాన్ని ఈ నేలలో వేళ్లూనుకోనిదిగా, పాశ్చాత్య మేధోవాదంగా అది తోసిపారేయలేరు. నేటి శివశక్తుల కలయికను ఆపే యత్నమా? గౌరి పేరులోనే, హిందుత్వగా ఇప్పుడు మనకు అందిస్తున్నదానికి సవాలుంది. ఇది ఈ ఏడాది దేశంలోని చాలా ప్రాంతాల్లో దుర్గ, పార్వతి, భవానియర్గా కూడా పిలిచే ‘‘గౌరి’’ రాకను ఆహ్వానించే సమయం. ‘‘లంకేశ్’’ అంటేనే పరమ శివునికి పరమభక్తుడైన రావణుడు. గౌరీ లంకేశ్ పేరు శైవులలో ఉన్న రావణుని పూజించే సంప్రదాయాన్ని గుర్తుకుతెచ్చేదిగా ఉంటుంది. ఆ ఆచారం, ఏకరూపపైన హిందుత్వ బృహత్ లక్ష్యాన్ని భగ్నం చేస్తుంది. అలాంటప్పుడు, శరద్ మాసానికి (తెలుగు ఆశ్వయుజ మాసం) సరిగ్గా ముందు ఆమెను హతమార్చడం ద్వారా హంతకులు... శక్తిగా మహిళ ప్రవేశంచడాన్ని, మన కాలపు శివపార్వతుల కలయికను నివారించాలనే మరింత పెద్ద ప్రాజెక్టులో అనుకోకుండానే భాగస్వాములయ్యారా? గౌరీ లంకేశ్ భావమయ జీవితాన్ని గడిపారు. ఒక భావజాలం ఆమెను చంపడం అందుకు సరిగ్గా తగ్గట్టుగానే ఉంది. ఆ భావజాలం మన రాజ్యాంగానికి విరుద్ధమైనది, మన స్వాతంత్య్రోద్యమ విలువలను నిరాకరించేది, మన మేధో సాంప్రదాయలంటే భయపడేది, హిందూమతంలోని బహురూపాల శాఖలను తన అస్తిత్వానికి ముప్పుగా భావించేది. ఆమె మన కాలపు పాలక భావజాలం చేతిలో హత్యకు గురయ్యారు. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ ఇండియా అధ్యక్షులు, జైకిసాన్ సంస్థ సభ్యులు మొబైల్ : 98688 88986 -
వ్యవస్థల వైఫల్యానికి పరాకాష్ట
సందర్భం గుర్మీత్ వ్యవహారం మన రాజకీయ వ్యవస్థ వైఫల్యం లోతుగా విస్తరించినదని తేల్చింది. ఇది, బీజేపీకి, డేరా సచ్చా సౌదాకు మధ్య కుమ్మక్కు మాత్రమే కాదు. కాంగ్రెస్, అకాలీలు, ఐఎన్ఎల్డీ సహా హరియాణా, పంజాబ్లోని అన్ని ప్రధాన పార్టీలూ ఎప్పుడో ఒకప్పుడు డేరాతో అంటకాగినవే. ఆ పార్టీల నేతలలో ఏ ఒక్కరూ ఈ తీర్పును స్వాగతించ సాహసించ లేదు. అంటే మన రాజకీయ వ్యవస్థ అవకాశవాదపూరితమైనది, విలువలపరంగా రాజీపడి నది. ఏ చిన్న ఓటు బ్యాంకుపైనైనా ఆధారపడటానికి సిద్ధంగా ఉండేంత బలహీనమైనది. ‘రామ్ రహీమ్’గుర్మీత్ సింగ్కు శిక్ష విధించడం మనందరికీ ఎంతో కొంత సంతోషాన్ని కలిగించింది. ఒక దొంగ బాబా గుట్టు బట్టబయలైంది. అతగాడి సామ్రాజ్యాన్ని కుప్ప కూల్చనున్నారు. రాజకీయ వేత్తలు–బాబాల కుమ్మక్కు బంధంలో కనీసం ఒక్క పోగయినా తెగిపోయింది. చట్టబద్ధ పాలనను ఉల్లంఘించినవారిపై ప్రభుత్వం గట్టి చర్యలను తీసుకోవాల్సిన పరిస్థితి కలిగింది. చివరిగా, ఆలస్యంగానే అయినా చట్టం సుదీర్ఘ బాహువులకు మహా ఘరానా నేరగాడు పట్టుబడ్డాడు. చూడబోతే ఇది సరైన దిశగా వేసిన ముందడుగని అనిపిస్తోంది. ఇది కేవలం చాలా చిన్న ముందడుగే కాదు, తాత్కాలికమైనది, సంతృప్తితో అలసత్వం వహించడానికి ఏ మాత్రం వీల్లేనిది కూడా. అందువల్లనే నేను ఈ ఆశావాదాన్ని మీకు పంచబోవడం లేదు. గుర్మీత్ సింగ్ను శిక్షించినది కేవలం మొదటి ట్రయల్ కోర్టు మాత్రమే. సుదీర్ఘకాలం పాటూ సాగే అప్పీళ్ల తర్వాత చివరకు తుది తీర్పు వెలువడుతుంది. అతగాడు త్వరలోనే బయటకు వచ్చి, అంత వరకు బయటే గడిపినా గడపవచ్చు. ఇప్పటికైతే అతగాడు జైల్లోనే ఉన్నాడు. కానీ, జైళ్లలో సైతం వీఐపీల కోసం ప్రత్యేక మార్గం ఉంటుందని శశికళ, సంజయ్దత్ల అనుభవం మనకు గుర్తుచేస్తుంది. వారికి ప్రత్యేక సదుపాయాలు, ఆసుపత్రులలో సుదీర్ఘంగా గడిపే అవకాశం, అసాధారణమైన పెరోల్స్, ఇంకా ఏమి ఉండవని చెప్పగలం. గుర్మీత్, తన వారసురాలిని ఎంపిక చేసినా గానీ, భారీ ఎత్తున అతనికి ఉన్న అనుచర గణం, భౌతిక ఆస్తులు క్షీణిస్తున్నట్టు మనకు ఇంకా కనబడటం లేదు. ఏదిఏమైనా, ఇదంతా నిజం, గుర్తుంచుకోదగినది. అయితే, నాలోని అశాంతికి ప్రధాన కారణం ఇది కాదు. వ్యవస్థాగత వైఫల్యానికి సంకేతం నాకు సంబంధించి ‘రామ్ రహీమ్’వ్యవహారం, మన వ్యవస్థాగత వైఫల్యానికి సంకేతంగా నిలుస్తుంది. గత వారం రోజుల ఘటనలు ఈ వైఫల్యానికి ఉన్న నాలుగు పార్శా్వలను వెల్లడి చేశాయి. అవి: క్రిమినల్ న్యాయ వ్యవస్థ వైఫల్యం, ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం, రాజకీయ అధికార వ్యవస్థ వైఫల్యం, ఆధ్యాత్మిక సంరక్షణ వ్యవస్థ వైఫల్యం. ఎవరో ఒక వ్యక్తి సాధించిన అసాధారణమైన సాఫల్యత గురించి మనం ఎంత ఎక్కువగా మాట్లాడుతుంటే, అది అంతగా వంటబట్టిపోయిన మన వైఫల్యాలను నొక్కి చెబుతుంది. న్యాయవ్యవస్థ ఒక్కటే తన స్వతంత్రతను నిలుపుకున్న ఈ వారంలోనే మనం... మన నేర న్యాయ వ్యవస్థ వైఫల్యం గురించి మాట్లాడుకోవాల్సి రావడం విచిత్రమే. సీబీఐ కోర్టు న్యాయమూర్తి జగదీప్ సింగ్ ధైర్యాన్ని, నైతిక రుజువర్తనను సమంజసంగానే ప్రస్తుతించారని అందరమూ అంగీకరిస్తాం. పంజాబ్, హరియాణా హైకోర్టు, చట్టబద్ధ పాలనను ఎత్తిపట్టడం అనేది రాజ్యాంగపరమైన క్రమబద్ధత పట్ల చాలా మంది పౌరులలో విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పగలిగి ఉంటుంది. అది పంచకుల వాసులకే పరిమితం కాదు. ఇది, సుప్రీం కోర్టు మూడు తలాక్ల పద్ధతి చెల్లదని తీర్పు చెప్పి, సంచలనం రేకెత్తించిన వారం మాత్రమే కాదు. వ్యక్తిగత గోప్యత హక్కు కింద పౌరులకు ఉండే వ్యక్తిగత స్వేచ్ఛల విషయంలో అతి విస్తృత పర్యవసానాలను కలిగించే నిశితమైన తీర్పును కూడా ఇదే వారంలో సుప్రీం కోర్టు వెలువరించింది. అయినాగానీ, ఒక న్యాయమూర్తి తాను నిర్వర్తించవలసిన సాధారణ విధిని నిర్వహించినందుకు దేశం మొత్తం కీర్తించాల్సి వస్తే, అది కొంత విచిత్రమైనదే. దోషిగా ఆరోపణకు గురైనది గుర్మీత్ సింగ్ అంతటి శక్తివంతుడు ఎవరైనా అయితే, అలవాటుగా క్రమానుసారంగా ఇలా ఎప్పుడూ న్యాయాన్ని అందించడం చాలా అరుదు అనే వాస్తవానికి ఇది గుర్తింపు పత్రం అవుతుంది. మొదట ఫిర్యాదు చేశాక పదిహేనేళ్లు, కేసును న్యాయ విచారణకు చేపట్టినాక దాదాపు పదేళ్లు న్యాయం జరగడానికి పట్టాయనే అంశాన్ని మనం విస్మరించలేం. మన నేర న్యాయ వ్యవస్థలో ఉన్న లోటు పాట్లు ఇవి : బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం పట్ల విముఖత చూపడం, తొలుత చేసిన ఫిర్యాదును అసలు పరిశీలించడానికే తిరస్కరించడం, మరణశయ్యపై ఉన్న ధైర్యవంతుడైన ఒక పాత్రికేయుని మరణ వాంగ్మూలం నమోదుకు మూడురోజుల పాటూ నిస్సిగ్గుగా తిరస్కరించడం, శక్తివంతులు చట్టాన్ని వంచడానికి వాడే సుదీర్ఘమైన జాప్యాలు, అప్పీళ్లు తదితర పద్ధతులు. నిర్భయంగా ముందుకు వచ్చి నిలిచిన బాధితురాలు, అత్యంత సునిశితమైన పరిశీలన, నిజాయితీ గల దర్యాప్తు అధికారి, రుజువర్తనుడైన న్యాయమూర్తి ఒక్క చోట కలవడం యాదృచ్ఛికంగా సంభవించింది. కాబట్టే గుర్మీత్ సింగ్కు శిక్షపడింది. ఈ కేసు, మన నేర న్యాయ వ్యవస్థకు ఉన్న అడ్డగోలు నడత స్వభావాన్ని బట్ట బయలు చేస్తుంది. ఏ మంచి న్యాయవాది అయినా చెప్పేట్టు అది ఒక లాటరీ. అత్యున్నత నాయకత్వం కళ్లు మూసుకుంటే... పాలనా వ్యవస్థల వైఫల్యం మరీ కొట్టవచ్చినట్టుగా కనిపిస్తూ విస్మరించలేనిదిగా ఉంది. ముఖ్యమంత్రి మోహన్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హరియాణా ప్రభుత్వం, నిలకడగా పరిపాలనా స్థాయిని, శాంతిభద్రతలకు విఘాతాన్ని సహించగలిగే స్థాయిని నిరంతరాయంగా దిగజారుస్తూ వస్తోంది. బాబా రామ్పాల్ను ఎదుర్కొనాల్సి వచ్చినప్పుడు మొదట అది చచ్చుబడి పోయింది. దాన్ని పరిపాలనాపరమైన అనుభవరాహిత్యంగా లేదా అసమంజసత్వంగా తీసిపారేయవచ్చు. ఇక రెండవసారి పరిపాలన చచ్చుబడిపోవడం, జాట్ల రిజర్వేషన్ల ఆందోళన సందర్భంగా సంభవించింది. తమలో తాము కలహిస్తున్న మంత్రివర్గపు అలసత్వం వల్లనే అది జరిగిందనేది సుస్పష్టమే. ప్రభుత్వం, పౌరులకు కనీస స్థాయి శాంతిభద్రతలకు సైతం హామీని కల్పించలేనంతటి ఘోర వైఫల్యానికి గురైన వైనాన్ని ప్రకాశ్ సింగ్ కమిషన్ నివేదిక వివరంగా వెల్లడించింది. ఆ నివేదిక వెలువడ్డాక కూడా ఖట్టర్ ప్రభుత్వం కొనసాగడం ఏ మాత్రం సమంజసం కాదు. ఖట్టర్ ప్రభుత్వ పాలనాపరమైన వైఫల్యం పంచకులలో మరింత లోలోతులకు పతనమైంది. 25 నాటి హింసాకాండకు సంబంధించి ప్రతిదీ ముందుగా తెలిసినదే. తేదీ, సమయం, స్థలం, పాత్రధారులు అందరికీ తెలుసు. కాబట్టి, రాజకీయాభీష్టం కొరవడటం, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి పాటించాల్సిన అత్యంత ప్రాథమికమైన పద్ధతులను చేపట్టడానికి నిరాకరించడం మాత్రమే ఈ ఘటనలన్నిటికీ బాధ్యత వహించాలి అని చెప్పాల్సి వస్తుంది. ఉదాహరణగా చెప్పాలంటే అవి పంజాబ్లో కనిపించాయి. అత్యున్నత స్థాయి నాయకత్వం కళ్లు మూసుకుంటే, ఇక ఆ దిగువన ఉన్న వారంతా కునికిపాట్లు పడుతుండటమనే మరో వ్యవస్థాగతమైన సమస్య పెరుగుతుండటాన్ని ఈ వ్యవహారం పట్టి చూపింది. హరియాణా ప్రభుత్వం నిర్వా్యపకత్వం ప్రభుత్వ వైఫల్యంలోని ఒక అంశం మాత్రమే. చెలరేగిన అల్లరి మూకలను అదుపు చేయడానికి పోలీసులు పాటించాల్సిన అన్ని పద్ధతులూ పాటించాకే కాల్పులు జరి పారా? 38 మంది మృతి చెందడం అంటే మాటలా? నిర్వా్యపకత్వం తర్వాత అనవసర బలప్రయోగం జరిగిందా? డేరా ప్రతిష్ట దిగజారి ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ప్రశ్నలు ఎవరూ అడగడం లేదు. కానీ అవి శేష ప్రశ్నలై నిలుస్తాయి. మొత్తంగా చూస్తే, హరియాణా ప్రభుత్వ నేరపూరితమైన క్రియాశూన్యత, క్రియాత్మకతా ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి తాత్కాలికంగానైనా క్షీణిస్తున్నట్టు చూపుతుంది. కేంద్ర ప్రభుత్వానికి సిబ్బంది, యంత్రాం గం, లక్ష్యమూ ఉన్నా, క్రమబద్ధమైన పాలనకు తగిన వ్యవస్థలు లేవు. అంతా డేరా అంటకాగిన వారే రాజకీయ వ్యవస్థ వైఫల్యం మనం అనుకుంటున్న దానికంటే బాగా లోతుగా విస్తరించి ఉంది. ఇది, ముఖ్యమంత్రి ఖట్టర్తోపాటూ, ఆయన్ను గద్దె దించాలని నిరంతరం ఆశపడుతోన్న ఆయన సహచరుల హాస్యభరితమైన, విషాదకర వైఫల్యం మాత్రమే కాదు. ఇది కేవలం అధికార బీజేపీకి, డేరా సచ్చా సౌదాకు మధ్య ఉన్న కుమ్మక్కు మాత్రమే కాదు. కాంగ్రెస్, అకాలీలు, భారత జాతీయ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ)సహా హరియాణా, పంజాబ్లోని అన్ని ప్రధాన పార్టీలూ, ఇటీవలి చరిత్రలో ఎప్పుడో ఒకప్పుడు ఆ డేరా అంటకాగిన వేనని విస్మరించరాదు. 2014లో గుర్మీత్ డేరా తమకు ఇచ్చిన మద్దతుకు బీజేపీ ఇప్పుడు బదులు తీర్చుకుంటోందనేది స్పష్టమే. 2009లో కాంగ్రెస్ చేసినది, అంతకు ముందు ఐఎన్ఎల్డీ చేసినది కూడా అదే. ఈ ప్రాంతంలో ఎన్నికలపరంగా పరిగణనలోకి తీసుకోదగిన పార్టీల జాతీయ నేతలలో ఏ ఒక్కరూ ఈ తీర్పును స్వాగతించ సాహసించలేదు. ఏ ఒక్కరూ డేరాతో భావి ఒప్పందాలను పూర్తిగా నిరాకరించేవారు కారనేది స్పష్టమే. మన రాజకీయ వ్యవస్థ అవకాశవాద పూరితమైనది మాత్రమే కాదు, విలువల పరంగా రాజీపడినది, పైగా అది చేతికి అందివచ్చే ఏ చిన్న ఓటు బ్యాంకుపైన అయినా ఆధారపడటానికి సదా సిద్ధంగా ఉండేంత బలహీనమైన వ్యవస్థ. చివరగా, ఈ వ్యవహారం మన ఆధ్యాత్మిక పరిరక్షకుల డొల్లతనాన్ని బట్టబయలు చేస్తుంది. ఒకరి తర్వాత ఒకరుగా ఒక్కో బాబా బండారం బయటపడుతుంటే అసలు ఆధ్యాత్మిక సంరక్షణ అనే భావనే నవ్వి పారేసేదిగా మారుతుంది. అంతేకాదు, ఆధ్యాత్మిక గురువులను సాంప్రదాయక మార్మికవాదపు అవశేషాలుగా చూడటం కూడా సులువు అవుతుంది. అయితే, అలాంటి దృష్టి కార్పొరేట్ బాబాలు పెరుగుతుండటమనే అంశం నేది అత్యంత ఆధునికమైన పరిణామం అనే దాన్ని విస్మరించేలా చేస్తుంది. అది మన ఆధునికత హృదయంలోని రంధ్రాన్ని ప్రతిబింబిస్తుంది. ఆధునిక అభివృద్ధి మనకు భౌతికమైన సుఖసౌఖ్యాలను ఇవ్వవచ్చు కానీ, అది, మన ఆధ్యాత్మికమైన ఆకలిని తీర్చడంలో విఫలమైంది. అందువల్లనే మన బాహిర, అంతర జీవితాలతో అనుబంధాన్ని ఏర్పరచుకోగల ఆధ్యాత్మిక గురువులు సమాజానికి అవసరం అవుతున్నారు. మన ఆధునికత రామ్ లేదా రహీమ్లతో అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో విఫలమైనప్పుడు... గుర్మీత్ సింగ్ ఆ శూన్యంలోకి ప్రవేశించి తానే ‘రామ్ రహీమ్’ కాగలుగుతాడు. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు యోగేంద్ర యాదవ్ ‘ మొబైల్: 98688 88986 -
‘గోరఖ్పూర్’ చెప్పే పాఠం
విశ్లేషణ దేశ రాజకీయాలకు అరోగ్యమే ప్రాతిపదిక కావాలని నా ఆకాంక్ష. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య శాఖల ముందు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాలని నా కామన. పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభలలో ఆరోగ్య బడ్జెట్లపైనా, ఆరోగ్య విధానాలపైనా పెద్ద ఎత్తున చర్చలు సాగడం నా కోరిక! ఇవన్నీ జరిగి ఉంటే, గోరఖ్పూర్ విషాదాన్ని చూడాల్సి వచ్చేదే కాదు. అది జరిగినది ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లో కాబట్టి, అంతా ఆయనపైనా, బీజేపీపైనా, యూపీ ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. వారి నిర్లక్ష్యం క్షమార్హం కానిదేగానీ.. అలాంటి ప్రమాదాలు దేశంలోని ఏ ప్రభుత్వ అసుపత్రుల్లోనైనా జరిగే అవకాశం ఉందనేది నిజం. ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ‘‘ఆవో బచ్చో తుమే దిఖా ఝాన్కి హిందుస్థాన్ కీ...’’ (రండి పిల్లలూ చూపిస్తా మీకు భారతదేశం అంటే ఏమిటో) అనే పాట రేడియోలో వినవచ్చింది. సరిగ్గా అదే సమయంలో నేను, కేవలం ఆక్సిజన్ లేక పోవడం వల్లనే హిందుస్థాన్ను కను విప్పి ఒక్కసారైనా చూడకుండానే ఈ ప్రపంచాన్ని వీడిన గోరఖ్పూర్ శిశువుల గురించి అదే పనిగా ఆలోచిస్తున్నాను. ‘‘యే ధర్తీ హై బలిదాన్ కీ!’’ (త్యాగ ధరిత్రి ఇది) అనేది ఆ పాటలోని మరో చరణం. ఈ దేశ రాజకీయాలకు ఆరోగ్యమే ప్రాతిపదిక కావాలని నా ఆకాంక్ష. ప్రభుత్వ ఆసుపత్రుల ముందు, ఆరోగ్య శాఖల ముందు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాలని నా కామన. పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభలలో ఆరోగ్య బడ్జెట్లపైనా, ఆరోగ్య విధానాలపైనా పెద్ద ఎత్తున చర్చలు సాగడం నా కోరిక! ఇవన్నీ జరిగి ఉంటే, నేడు మనం గోరఖ్పూర్ విషాదాన్ని చూడాల్సి వచ్చేదే కాదు. గోరఖ్పూర్ విషాదం గురించి చాలానే చెప్పారు. కానీ, మాట్లాడినంత ఎక్కువగా దాని గురించి బహుశా ఆలోచించి ఉండకపోవచ్చు. ఆ విషాదం సంభవించి నది యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లో. కాబట్టి, అంతా ఆయనపైనా, బీజేపీపైనా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. వారి నిర్లక్ష్యం క్షమార్హంకానిదేగానీ... అలాంటి ప్రమాదాలు దేశంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైనా జరిగే అవకాశం ఉందనేది నిజం. ఈ ప్రమాదం, మనం ఎదుర్కొంటున్న పెద్ద రుగ్మతకు సంబంధించిన చిన్న లక్షణం మాత్రమే. గోరఖ్పూర్ నుంచి మనమేవైనా గుణపాఠాలను నేర్చుకోవాలంటే, చర్చను ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వానికే పరిమితం చేయడానికి బదులు దేశంలోని ప్రజారోగ్య వ్యవస్థ దుస్థితిని గురించి చర్చించడం అవసరం. వైద్య అవసరాలు పెరిగి, ఖర్చులు కొండెక్కి.. ఆసుపత్రి బిల్లులు, డాక్టర్ బిల్లులు నేడు సాధారణ కుటుంబం మెడ మీద కత్తిలా కదలాడుతున్నాయి. చాలా కుటుంబాల విషయంలో కుటుంబ సభ్యులలో ఎవరి కైనా ఏదైనా పెద్ద జబ్బు చేస్తే, ఆ కుటుంబం వెన్ను విరి గిపోవడమే అవుతోంది. కుటుంబ సభ్యులలో ఒకరు ఎవరైనా పెద్ద వ్యా«ధులకు గురికావడం... పేదరిక రేఖకు ఎగువన జీవిస్తున్న కుటుంబాలు పేదరిక రేఖకు దిగువకు దిగజారిపోవడానికి ముఖ్య కారణమని పరిశోధకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వారికి మంచి, చౌక చికిత్సను అందించడమూ లేదు, ప్రైవేటు వైద్యం చేయిం చుకునేవారికి సహాయం చేయడమూ లేదు. ఈ జీవన్మరణ పోరాటంలో పేద కుటుంబాలే కాదు, ఎంతో కొంత మెరుగ్గా ఉన్న కుటుంబాలు సైతం నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సగటు భారతీయుల ఆరోగ్యం మెరుగుపడింది. 1947లో 32 ఏళ్లుగా ఉండిన భారతీయుల సగటు జీవిత కాలం దాదాపు 68 ఏళ్లకు పెరిగింది. శిశు మరణాల సంఖ్య వెయ్యి జననాలకు 146 నుంచి 40కి తగ్గాయి. తల్లుల ప్రసవ కాల మరణాలు సైతం గణనీయంగా తగ్గాయి. ఆరోగ్య సదుపాయాలు సైతం చాలా మెరుగుపడ్డాయనడంలో సందేహం లేదు. డాక్టర్ల సంఖ్య, ఆసుపత్రుల సంఖ్య పది రెట్ల కంటే ఎక్కువే పెరిగింది. అయినా అది అవసరమైనదాని కంటే చాలా తక్కువే. అలాగే ఔషధాల ఉత్పత్తి సదుపాయాలు, వైద్య పరీక్షలు కూడా పెరిగాయి. ప్రభుత్వం తరచుగా తాము సాధించినవాటి గురించి చెప్పుకోవడానికి ఈ గణాంకాలనే ఉపయోగిస్తుంటుంది. కానీ ఇది అర్ధ సత్యం మాత్రమే. సగటు జీవిత కాలం, వైద్య సదుపాయాల విస్తరణ జరిగినా ప్రజలు అనుభవిస్తున్న బాధలు మాత్రం తగ్గలేదు, సరికదా, వాస్తవానికి మరింత పెరిగాయనేది పూర్తి సత్యం. సగటు జీవిత కాలం పెరుగుదల, శిశు మరణాల సంఖ్య తగ్గుదల కారణంగా వైద్యసదుపాయాల అవసరం మునుపెన్నటికంటే ఎక్కువగా పెరి గింది. తిండి, బట్ట, నివాసం వంటి అవసరాలు సమకూరాక విద్య, ఆరోగ్యం జీవితానికి అత్యావశ్యకాలుగా మారాయి. ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండటం వ్యాధులకు చికిత్స చేయించుకోవాలనే కోరికను, తప్పనిసరితనాన్ని కూడా సృష్టిస్తోంది. అంటే, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం వల్ల నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సదుపాయాల అవసరం తగ్గలేదు. నిజానికి ఆ అవసరం మరింత పెరిగింది. ప్రభుత్వ శ్రద్ధ లేకనే ప్రైవేటు వైద్యం ఆ అవసరాన్ని తీర్చాలంటే ప్రభుత్వం, ప్రభుత్వరంగ ఆరోగ్య సేవలను భారీ ఎత్తున విస్తరింపజేసి ఉండాల్సింది. కానీ అది జరగలేదు. స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో కనీసం 3 శాతాన్ని వైద్య రంగంపై ఖర్చు చేయాలనే డిమాండు గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతూ వస్తోంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య రంగంపై చేసే మొత్తం వ్యయం దాదాపుగా జీడీపీలో 1 శాతం వద్ద నిలిచిపోయింది. తాజా గణాంక సమాచారం ప్రకారం మనం ఆరోగ్య రంగంపై చేస్తున్న వ్యయం జీడీపీలో 1.2 శాతం మాత్రమే. కాగా, ఇది చైనాలో 2.9 శాతం, బ్రెజిల్లో 4.1 శాతం, బ్రిటన్లో 7.8 శాతం, అమెరికాలాంటి పెట్టుబడిదారీ దేశంలో 8.5 శాతం. ఆరోగ్య రంగంపై చేయాల్సిన కనీసమైన ఖర్చులో కేవలం మూడోవంతు మాత్రమే మన ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నది కఠోర సత్యం. ఆరోగ్యసేవల అవసరం పెరుగుదల, ప్రభుత్వం శ్రద్ధ కనబరచకపోవడం ఫలితమే ఆరోగ్యరంగ ప్రైవేటీకరణ. మహా నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు కొత్త ఆసుపత్రులు, వైద్యశాలలు భారీ ఎత్తున పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే గ్రామీణ ప్రాంత రోగులలో 72 శాతం, నగర ప్రాంత రోగులలో 79 శాతం ప్రైవేటు డాక్టర్ వద్దకు వెళ్లాలని కోరుకుంటున్నారు. తీవ్ర వ్యాధుల విషయంలో గ్రామీణ ప్రాంత రైతులలో 58 శాతం, నగర ప్రాంతాల ప్రజలలో 68 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటు ఆసుపత్రులనే ఎంచుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థ మందగించిందిగానీ, ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం వర్ధిల్లుతూనే ఉన్నాయి. దీనికితోడు అక్కడి ఫీజులు అసమంజసమైనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఒక సగటు భారతీయ కుటుంబం ఆరోగ్య సదుపాయాల కోసం చేసే ఖర్చు, ఆదాయంలో 7 శాతం మాత్రమే. కొత్త పరీక్షలు, శస్త్రచికిత్సలు, ‘‘సదుపాయాలు’’ ప్రవేశిస్తున్నాయి. అవి తరుచుగా ఈ రోజుల్లో ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు పెరి గిపోవడానికి కారణం అవుతున్నాయి. ప్రభుత్వ లేదా సొంత ఖర్చుతో సమకూర్చుకునే ఆరోగ్య బీమా సదుపాయం ఉన్నది 18 శాతం ప్రజలకే. మిగతా వారందరివీ దైవాధీనం బతుకులే. రాజకీయం చేస్తే తప్ప సమస్యలు పట్టవు గోరఖ్పూర్ ప్రభుత్వరంగ సేవల దుస్థితికి చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వ ఆరోగ్య సేవలను రాజకీయ సమస్యగా మారిస్తే తప్ప ఈ పరిస్థితి మెరుగుపడదు. ఈ సూచనను విని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ‘రాజకీయాలు’ ‘రాజకీయం’ అంటేనే అవి ప్రతి సమస్యకూ మూల కారణమే తప్ప, పరిష్కారాలు కావనిపించేం తగా మనం ఆ పదాలను ప్రతికూలాత్మకమైన అర్థాన్ని ఇచ్చేవిగా చేసేశాం. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒక సమస్యను రాజకీయమైనదిగా చేసిన ప్రతిసారీ, ఎన్నికల్లో ఓడిపోతామని రాజకీయవేత్తలు భయపడతారు, ప్రభుత్వాలు ఆ సమస్య పట్ల శ్రద్ధ చూపడం తప్ప గత్యంతరం లేని స్థితి ఏర్పడుతుంది. అది సమస్యను పూర్తిగా పరి ష్కారం చేయదుగానీ, కొంత పురోగతిని సాధిస్తుంది. ఆకలి, ద్రవ్యోల్బణం రాజకీయ సమస్యలుగా మారినప్పుడే దేశవ్యాప్తంగా రేషన్ దుకాణాలను ప్రవేశపెట్టారు. కొన్నేళ్ల క్రితం విద్యుత్ సరఫరాను, రోడ్ల పరిస్థితిని ఎన్నికల సమయంలో రాజకీయం చేశారు. ఫలి తంగా ఆ రెండు సమస్యల విషయంలోనూ గణనీయమైన మెరుగుదల కనిపించింది. పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక రైతులు రాజకీయంగా గొంతెత్తడంతో, ఆ రాష్ట్రాల ప్రభుత్వ విధానాలలో పెద్ద మెరుగుదల సంభవించింది. కాబట్టి రాజకీయం చేయడాన్ని నివారించడం కాదు, అందుకు బదులు ప్రతి ప్రధాన సమస్యను రాజకీయాల పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉంది. మహిళల పట్ల హింసకు, ప్రభుత్వ పాఠశాలలోని విద్య, ప్రభుత్వ ఆసుపత్రులలోని చికిత్స రాజకీయ సమస్యలుగా మారితే తప్ప... ప్రభుత్వం వాటిపట్ల మౌనంగానే ఉండిపోతుంది. పరిస్థితిలో ఏ మార్పూ ఉండదు, గోరఖ్పూర్ విషాదం పునరావృతం అవుతూనే ఉంటుంది. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు ‘ మొబైల్ : 98688 88986 -
రైతు ఉద్యమంలో కొత్త మలుపు
విశ్లేషణ మునుపెన్నడూ ఎరుగని రీతిలో 150కి పైగా రైతు సంస్థలు కలసి అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ కమిటీ అనే ఒకే వేదిక మీదకు వచ్చాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు, వివిధ రకాల పంటలకు ప్రాతినిధ్యం వహించే రైతు కూటమిగా అది రూపొందింది. చాలా కాలంగా వామపక్షాల నినాదంగా ఉన్న రైతు–కూలీ ఐక్యత వాస్తవమైంది. బహుశా మొదటిసారిగా రైతు సంస్థలు, సంఘాలన్నీ ఉమ్మడి అజెండాను అమోదించాయి. ఈ సంఘటన నిలవగలిగితే దేశ వ్యవసాయ సంక్షోభం సమస్యపై నిర్ణయా త్మకమైన జోక్యం చేసుకోగల బ్రహ్మాండమైన శక్తిసామర్థ్యాలు దానికి సమకూరగల అవకాశం ఉంది. భారత రైతు ఉద్యమం నూతన దశలోకి ప్రవేశి స్తోందా? ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానాన్ని చూపడానికి ఆరు వారాల సమయం చాలా తక్కువ. పున్ టాంబా రైతుల సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా రైతు ఆందోళనల స్వభావంలో కొంత కొత్తదనాన్ని సూచించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆరు రాష్ట్రాల రైతులను, రైతు సంఘాలను, ఉద్యమాలను అనుసంధానిస్తూ సాగిన ఆరు వారాల కిసాన్ ముక్తి యాత్ర కలిగించిన ప్రభావం దీన్ని రూఢి చేసింది. ఈ యాత్ర, మందసౌర్ పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించిన తర్వాత సరిగ్గా నెల రోజులకు, అంటే జూలై 6న అక్కడి నుంచే బయలుదేరింది. అది ఆరు రాష్ట్రాల మీదుగా ఢిల్లీకి చేరింది. క్షేత్ర స్థాయికి అతి సన్నిహితంగా సాగుతున్న రైతు ఉద్యమాల నూతన ప్రపంచంలోకి పరికించి చూడటానికి ఈ యాత్ర మంచి అవకాశం అయింది. ఈ యాత్ర ముగిశాక నేనిప్పుడు దేశ రైతు ఉద్యమాల చరిత్రలో మౌలికమైన పెను మార్పు ప్రారంభమైందని నిర్ధారణకు వచ్చాను. మూడో తరం రైతు ఉద్యమం మీడియా, ఈ మార్పునకు సంబంధించిన కొన్ని బాహ్య లక్షణాలను గుర్తించడం ఇప్పుడే మొదలైంది. జీన్స్ ధరించిన కొత్త తరం రైతు కార్యకర్తల గురించిన కథనాలు వెలువడ్డాయి. అలాగే స్మార్ట్ఫోన్లు, వాట్సాప్ల వాడకం కూడా ప్రజల దృష్టిని ఆకర్షించింది. అలాంటి కథనాలు అసలు విషయాన్ని విస్మరించేలా చేయవచ్చు. భారత వ్యవసాయరంగంలోని నూతన వాస్తవాలకు, మారుతున్న భారత రాజకీయాల స్వభావానికి తగ్గట్టుగా రైతు ఉద్యమాలు కూడా సర్దుబాటవుతున్నాయి. ఇవి, మూడో తరం రైతు ఉద్యమాలు. వలసపాలనలోని భారతదేశంలో పెల్లుబికిన రైతు తిరుగుబాట్లు మొదటి తరానికి చెందినవి. మాప్పిలా రైతు తిరుగుబాటూ, గాంధేయవాద చంపారన్, ఖేరా, బార్డోలీ రైతు ఉద్యమాలూ, బెంగాల్లోని తెభాగా పోరాటం చాలా వరకు బ్రిటిష్ వలసవాద భూమి కౌలు విధానాల అణచివేతకు ప్రతిస్పందనలు. రెండవ తరం రైతు ఉద్యమాలు 1980లలో సాగినవి. అవి, పల్లెటూరి మహేంద్ర సింగ్ తికాయత్, కార్యకర్తగా మారిన ఆర్థికశాస్తవేత్త శరద్ జోషి, స్వతంత్రుడైన మజుందార్ స్వామి నేతృత్వంలో సాగినవి. ఆధునిక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలో నిర్లక్ష్యానికి గురవుతున్న సాపేక్షికంగా మెరుగైన రైతుల నిరసన ఇది. ప్రాథమికంగా వారి పోరాటాలు గిట్టుబాటు ధరల సమస్యపై సాగినవి. ఆ ఉద్యమాలకు సమాంతరంగా పెద్ద భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా భూమిలేని పేద శ్రామికుల పోరాటాలు సాగాయి. ప్రధానంగా వాటికి నక్సలైట్లు నాయకత్వం వహించారు. నిజమైన ‘రైతు–కూలీ ఐక్యత’ ఇక మూడో తరం రైతు కార్యకర్తలు ఒక నూతన నేపథ్యాన్ని ఎదుర్కొంటున్నారు. గత తరంలో, భూకమతాల విఘటన (ముక్కలు చెక్కలు కావడం) జరిగింది. వ్యవసాయ రంగం మొత్తంగానే బికారిగా మారే పరిస్థితిని ఎదుర్కొంటోంది. సాగుబడి విస్పష్టంగానే లాభసాటి కాని కార్యకలాపం అయింది. వ్యవసాయరంగానికి సంబంధించిన ఆర్థిక, జీవావరణ సంక్షోభం భారత రైతు మనుగడకు సంబంధించిన సంక్షోభంగా మారుతోంది. నేటి రైతు ఉద్యమం, రైతు ఆత్మహత్యలనే వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. ఈ కొత్త రైతు ఉద్యమం, భూస్వామి, రైతు, భాగస్వామ్య రైతు లేదా భూమిలేని రైతు అనే సంప్రదాయక విభజనలను తుడిచిపెట్టేస్తోంది. గ్రామీణ భారతం పేదరికం పాలు కావడంతో నేటి రైతు ఉద్యమాలు రైతులలోని అన్ని విభాగాలను ఒక్కటి చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ‘రైతు–కూలీ ఐక్యత’ చాలా కాలంగా వామపక్షాల నినాదంగా ఉండేది. అయితే ఇటీవలి కాలంలోనే ఆ నినాదం రైతు ఉద్యమాలలో ప్రతిధ్వనించడం మొదలైంది.రైతు నిర్వచనాన్ని విస్తృత పరచడం వివిధ సామాజిక విభాగాలను కలుపుకుపోవడాన్ని ప్రోత్సహించింది. దళితులు, ఆదివాసులు చాలా ఎక్కువగా పనిచేసేది వ్యవసాయ కార్యకలాపాలలోనే. అయినా వారిని ప్రధాన స్రవంతి రైతు ఉద్యమాలు రైతులుగా చూడలేదు. ఈ పక్షపాత ధోరణి మారడం మొదలైంది. అలాగే దళిత, ఆదివాసీ సమస్యలను పట్టించుకోవడానికి రైతు ఉద్యమాలు సుముఖత చూపడం కూడా పెరిగింది. వ్యవసాయరంగంలోని ముడింట రెండు వంతుల శ్రమను చేస్తున్న మహిళా రైతులను గుర్తించడం పట్ల సుముఖత కూడా పెరిగింది. కనీ వినీ ఎరుగని రైతు ఐక్యత భావజాల పరంగా చెప్పాలంటే, ఈ నూతన రైతు ఉద్యమం పాత విభజనల నుంచి దూరంగా జరుగుతోంది. భూమిగలవారు, భూమిలేనివారి మధ్య వైరుధ్యంపై గతంలో దృష్టి కేంద్రీకృతమయ్యేది. నేడు అది, ఆ రెండు వర్గాలూ ఆర్థిక వ్యవస్థ బాధితులేననే గుర్తింపుపైకి మళ్లింది. భారత్ గీఇండియాగా (గ్రామీణ భారతం, పట్టణ ఇండియా అని) స్థూలంగా పేర్కొన్న పట్టణ– గ్రామీణ విభజనపై కూడా కొంత పునరాలోచన జరి గింది. ఎంతైనా ‘ఇండియా’ లోపల సైతం ‘భారత్’ లోని ఒక పెద్ద భాగం ఉంది. అంతేగానీ ‘భారత్’లో ‘ఇండియా’ ఉండటం కాదు. జీవావరణ సంబంధమైన సంక్షోభం రైతులు, రైతులుకానివారి పైన కూడా దుష్ప్రభావాన్ని చూపుతుందని, అనారోగ్యంతో ఉండే రైతులు దేశానికి అనారోగ్యకరమైన ఆహారాన్నే ఉత్పత్తి చేస్తారనే గుర్తింపు కూడా పెరుగుతోంది. భావజాలపరంగా పట్టువిడుపులు లేకుండా ఉండే వైఖరికి దూరంగా జరగడం రాజకీయ ఐక్యతను, విధానాలపై దృష్టిని కేంద్రీకరించడాన్ని అనుమతించింది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో 150కి పైగా రైతు సంస్థలు కలసి అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ కమిటీ (ఏఐకేఎస్సీసీ) అనే ఒక వేదిక మీదకు వచ్చాయి. అత్యంత వైవిధ్యభరితమైన రాజకీయ–భావజాలపరమైన వైఖరులు ఉన్న సంస్థలను కూడా ఈ సంఘటనలో భాగం చేసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు, వివిధ రకాల పంటలకు ప్రాతినిధ్యం వహించే రైతు కూటమిగా అది రూపొందింది. ఈ సంఘటన నిలవగలిగితే, వ్యవసాయ సంక్షోభం సమస్యపై నిర్ణయాత్మకమైన జోక్యం చేసుకోగల బ్రహ్మాండమైన శక్తిసామర్థ్యాలు దానికి సమకూరే అవకాశం ఉంది. రైతు సంఘాలకు ఉమ్మడి అజెండా బహుశా మొదటిసారిగా రైతు సంస్థలు, సంఘాలన్నీ ఉమ్మడి అజెండాను అమోదించాయి. ఏఐకేఎస్సీసీలో భాగంగా ఉన్న అన్ని సంస్థలూ, దానికి బయట ఉన్నవి సైతం న్యాయమైన, గిట్టుబాటు ధరలు, రుణ విముక్తి అనే రెండు అంశాల అజెండాపైనే తమ శక్తియుక్తులన్నిటినీ కేంద్రీకరించడానికి అంగీకరించాయి. రైతుకు ఇచ్చిన విశాలమైన అర్థానికి అనుగుణంగానే ఈ రెండు డిమాండ్లను కూడా మరింత సమగ్రమైన రీతిలో నిర్వచించారు. న్యాయమైన, గిట్టుబాటు ధరను భారత రైతాంగంలో పదింట ఒకరికి తక్కువ మందికే లబ్ధిని చేకూర్చే కనీస మద్దతు ధరకు, సేకరణకు పరిమితం చేయలేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అన్ని పంటలకు, అందరు రైతులకు నిజంగానే అందేలా చేయాలని నేటి రైతు ఉద్యమాలు డిమాండు చేస్తున్నాయి. లేదంటే ప్రభుత్వం ప్రకటించిన ధరకు, రైతుకు దక్కిన ధరకు మధ్య ఉండే లోటును తమకు చెల్లించాలని కోరుతున్నారు. అదేవిధంగా, రుణ విముక్తి డిమాండును కూడా, కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు లేదా గ్రామీణ సహకార బ్యాంకుల రుణాలకు పరిమితం చేయలేదు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల రుణ విషవలయాన్ని కూడా ఈ డిమాండులో భాగం చేశారు. ఈ మౌలిక మార్పు, ఈ కొత్త రైతుల నాయకత్వంలోని మార్పులో కనిపించింది. మధ్యస్థాయిలోని రైతు ఉద్యమ నాయకత్వం గ్రామీణ మూలాలూ, పట్టణాలతో పరిచయమూ ఉన్న నాయకులతో కూడినది. వారు రైతు కుటుంబాల నుంచి వచ్చినవారు. రైతుల బాధలను వారు అర్థం చేసుకోగలరు. అంతేకాదు, విధానకర్తల భాషలోనూ మాట్లాడగలరు. వారు క్షేత్ర స్థాయిలో పోరాటాలను నడపడమే కాదు, సమాచార హక్కు చట్టాన్ని, వ్యాజ్యాలను సాధనాలుగా వాడగలరు కూడా. నేటి నూతన రైతు ఉద్యమాలకు వెన్నెముకగా ఉన్నది ఈ యువ నాయకత్వమే. ఈ కొత్త తరం రైతుల ఉద్యమాలు అంతకు ముందటి వాటికంటే మరింత ప్రభావశీలమైనవా? మునుపెన్నటి కంటే నేడు రైతు పోరాటాల ఆవశ్యకత ఎక్కవగా ఉన్నా... వారిని సమీకరించడం గతంలో కంటే మరింత కష్టంగా మారింది. ఊహాత్మకతను, రాజీలేనితత్వాన్ని కలిగి ఉంటూ, అందరినీ కలుపుకుపోయే నాయకత్వం అందుకు అవసరం అవుతోంది. రైతు ఉద్యమాలు ఎదుర్కొంటున్న సవాలు ఇదే. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు ‘ మొబైల్ : 98688 88986 -
రుణమాఫీలో శషభిషలేల?
ఈ ‘మనం’ పరిధిలోకి భారతీయులంతా, అంటే రైతులతో సహా చేరితే అప్పుడు వేరే విధంగా ఉంటుంది. మనం బులెట్ రైళ్లను ఏర్పాటు చేసుకోగలిగితే, పన్ను మాఫీ చేయగలిగితే, సంస్థ లను కష్టాల నుంచి బయటపడవేసే చర్యలు తీసుకోగలిగి ఉంటే, కార్పొరేట్ సంస్థల భారీ రుణాలను సర్దుబాటు చేయగలిగితే, పెద్ద మొత్తంతో రక్షణ బడ్జెట్ను రూపొందించుకోగలిగితే, రైతుల విముక్తి కోసం కూడా రుణ మాఫీ భారాన్ని భరించగలం. అయితే ఇలాంటి వాదన రుణ మాఫీ గురించి లేవనెత్తుతున్న అన్ని అభ్యంతరాలకు, ప్రశ్నలకు సమాధానం కాబోదు. రైతుల రుణాలను మాఫీ చేసిన రాష్ట్రాల జాబితాలో కొత్తగా పంజాబ్ కూడా వచ్చి చేరడంతో, రాజకీయ వర్గాలు ఆ అంశం పట్ల మరింత మొగ్గును ప్రదర్శిస్తున్నాయి. రైతుల రుణాల మాఫీ పథకం అమలుకు మొదట తెలంగాణ, తరువాత ఆంధ్రప్రదేశ్ నాంది పలికాయి. ఆ తరువాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ ప్రకటించారు. ఆ వెంటనే మహారాష్ట్ర కూడా ఆ బాటలోనే ప్రయాణిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు తాజాగా పంజాబ్ అదే పని చేసింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో దేశ వ్యాప్తంగా కూడా రైతు రుణమాఫీ సౌకర్యం వర్తింప చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అదే సమయంలో రుణమాఫీ పథకాన్ని విధాన రూపశిల్పులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించడం కూడా కనిపిస్తున్నది. ఈ ‘అంటువ్యాధి’ విస్తరించకుండా చూడాలని పలువురు ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తలు హెచ్చరిస్తున్నారు. పత్రికలలో సంపాదక వ్యాఖ్య ఉండే పేజీలలో కూడా ఈ ‘తెలివితక్కువ ప్రజాకర్షక’పథకానికీ, ఎన్నికల రాజకీయాల ఒత్తిడులతో జరిగే నిర్ణయాలకీ వ్యతిరేకంగా వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే ‘నైతిక పతనాల’ను కోరి తేచ్చుకోవడమేనంటూ బ్యాంకర్లు మాట్లాడుతున్నారు. రుణమాఫీతో తలెత్తే సమస్యలతో ప్రభుత్వాల ఆర్థిక పరిపుష్టికి వాటిల్లే నష్టం గురించి ఆర్థికవేత్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదొక గిమ్మిక్ మాత్రమేననీ, దీనితో రైతుల దుస్థితిని రూపు మాపలేమని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత రిజర్వు బ్యాంక్ గవర్నర్ దీని గురించి గట్టిగా హెచ్చరించారు. ఇలాంటి రుణ మాఫీ పథకాలతో తమకు సంబంధం లేదని కేంద్ర ఆర్థికమంత్రి చేతులు దులిపేసుకున్నారు. ఆక్రందనల కథా కమామిషు అయితే ఇలాంటి వాదాలను ఒట్టి భేషజాలనీ, తమకు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగాలని రైతు ఉద్యమాలు ఖండిస్తుం టాయి. వారి అనుమానాలకు కావలసినన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. 2009 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో భారత పారిశ్రామిక రంగం ఒడిదుడుకులలో చిక్కుకుంటుందని ఊహిస్తూ నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రభుత్వం మూడు లక్షల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. అప్పుడు ఇలాంటి నైతిక ఆక్రందనలు మీరు ఎవరైనా విన్నారా? అలాగే కార్పొరేట్ రంగానికి ఇచ్చిన భారీ రుణాలలో సర్దుబాట్లు చేసినప్పుడైనా అలాంటి ఆక్రం దనలు వినిపించాయా? రైతుల రుణమాపీ చేయడంలోని నైతికత గురించి చర్చిస్తున్నప్పుడైనా, టెలికం, విద్యుత్ రంగాలను నష్టాల నుంచి బయటపడవేయడానికి ప్రభుత్వం హాస్యాస్పదమైన నిబంధనలకు తలొగ్గి నిర్ణయాలు తీసుకోవడం గురించి హెచ్చరికలు ఏమైనా వినిపించాయా? రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్న రిజర్వు బ్యాంక్ గవర్నర్ గొంతు నోట్ల రద్దు సమయంలో ఎందుకు మూగబోయింది? నిజానికి ఆర్థికమంత్రిగారి బాస్ గారే ఉత్తరప్రదేశ్లో రైతు రుణమాఫీ గురించి హామీ ఇవ్వలేదా? అయితే ఇవన్నీ రైతు రుణమాఫీ అంశంపై జరుగుతున్న చర్చలకు సమాధానం కాదు. టీవీ యాంకర్ల పరిభాషలో చెప్పాలంటే రెండు తప్పులు ఒక ఒప్పు అయిపోవు. ఈ అంశాన్ని మనం సూటిగా కచ్చితత్వంతో చర్చించాలి. అసలు రైతు రుణ మాఫీ న్యాయబద్ధమైనదేనా? ఈ రుణమాఫీని వ్యతిరేకించేవారి ఆలోచనల మాటెలా ఉన్నా, దాని గురించి కొంచెం చర్చిద్దాం. రైతు రుణమాఫీ అనే ఆలోచన మీద వచ్చే విమర్శకు మూలం, అర్థ రహితమైన ఒక ప్రశ్నలో ఉంది. ఆ ప్రశ్న: రుణ మాఫీయే భారత రైతాంగం దుఃఖానికి పరిష్కారం కాగలదా? దీనికి వెంటనే వచ్చే సమాధానం, ‘కాదు’ అనే. అనుకోని పరిణామాలతో వాణిజ్య వలయం ఛిన్నాభిన్నమైన పరిశ్రమకైతే రుణ మాఫీ పూర్తి పరిష్కారం కాగలదు. రుణమాఫీ అనేది చిరకాలంగా కష్టాలలో ఉన్న భారతదేశపు రైతు సమస్యలను తీర్చలేదు. అసలు వ్యవసాయమనేదే గిట్టుబాటు కాని, నష్టాలతో కూడిన వ్యవహారం. కాబట్టి రైతుల ఆదాయం అనే మౌలిక సమస్యను మనం పరిష్కరించకుంటే, రుణ మాఫీ అనేది వాళ్ల సమస్యలకు ఉపశమనం మాత్రమే అవుతుంది. లేదా మరోసారి రుణమాఫీ ఇవ్వడానికి దారితీస్తుంది. కాబట్టి రుణమాఫీ అనేది ఎవరి విషయంలోనూ సంతృప్తికరమైన చర్య కాబోదు. తప్పనిసరిగా వేసుకోవలసిన మరో ప్రశ్న: ప్రస్తుతం రైతు నెత్తి మీద రుణ భారాన్ని పూర్తిగా తొలగించకుండా, ఆదాయానికి సంబంధించిన వారి సమస్యను పరిష్కరించడం సాధ్యమేనా? అసలు అరకొర రుణమాఫీ అవసరమా? రైతు ఆదాయం మాటేమిటి? నైతిక ఒప్పందం వాదనల గురించి మొదట చర్చిద్దాం. రుణమంటూ తీసుకుంటే, దానిని తిరిగి చెల్లించాలి. ఇందులో సందేహం లేదు. తన చేతిలో లేని పరిస్థితులలో చిక్కుంటే తప్ప, ఒప్పందాలను గౌరవించవలసిందే. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి రుణమాఫీ చేసి వాటిని కష్టాల నుంచి బయటపడేయడానికి చర్యలు తీసుకునేటప్పుడు ఇదే అంశం ప్రాతిపదికగా ఉంటుంది. ఈ వాదన నీతిబద్ధమైనదే అయితే, ఇది రైతుల విషయంలో మరింత బలంగా వర్తిస్తుంది. దేశంలో అపార సంఖ్యలో ఉన్న రైతులు తమ రుణాలను చెల్లించే స్థితిలో ఏమాత్రం లేరు. జీవితావసరాలకు ఏమాత్రం చాలని స్థాయిలో వారి ఆదాయాలు ఉన్నాయి. లేదంటే ప్రతికూలంగా ఉన్నాయి. ఇందుకు కారణం రైతులు సోమరులో, అసమర్థులో కావడం మాత్రం కాదు. వారి ఉత్పత్తుల కొనుగోళ్ల వ్యవహారాలు ప్రతికూలంగా ఉండడం, రైతుకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వ విధానాలు, పర్యావరణంలో వచ్చిన మార్పులు అందుకు కారణమని మరచిపోరాదు. ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్న రైతుల మీద రుణ ఒప్పందాన్ని అమలు చేయమంటూ, అంటే రుణం తీర్చమంటూ ఒత్తిడి చేయడం అమానుషమే. ఆ ఒప్పందం మేలు చేసేది కాదు. ఈ వాదన గురించే ఇంకొంచెం చర్చిద్దాం. నిజం చెప్పాలంటే రైతు రుణ మాఫీ చేయవలసిన దుస్థితిలో ఉన్న పేదవాడు లేదా నిస్సహాయుడు మాత్రం కాదు. కానీ రైతు నెత్తి మీద ఉన్న రుణభారం మూలాలను మనం వెతకాలి. రోజురోజుకీ పెరిగిపోతున్న సాగు వ్యయానికి తగినట్టు రైతు ఆదాయం పెరగడం లేదు. అతడు రుణభారంలో కొట్టుమిట్టాడడానికి కారణం ఇదే. అసలు ఈ దుస్థితి ఎందుకు అంటే, గడచిన ఐదు దశాబ్దాలుగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే అందుకు కారణం. 1966–67 నాటి దుర్భిక్షం తరువాత విధానకర్తలు చాలినంతగా ఆహార నిల్వలను, అది కూడా చౌకగా ఇచ్చే అంశం మీద దృష్టి సారించారు. ఇది మెచ్చదగిన లక్ష్యమే. కానీ ఈ నైతిక బాధ్యత వెనుక ఉన్న ఆర్థిక భారాన్ని రైతుకు బదలాయించారు. వ్యవసాయోత్పత్తుల ధరలు తక్కువగా ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వ విధానాలను రూపొందించారు. ఇదే రైతాంగాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేసింది. అంటే గడచిన యాభై ఏళ్ల నుంచి లక్షల కోట్ల రూపాయలు దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులు రాయితీగా ఇస్తున్నారు. కాబట్టి దేశమే రైతుకు బోలెడంత రుణపడి ఉంది. బ్యాంకులకు వారు చెల్లించవలసిన రుణంలో ఇది చాలా తక్కువ. ప్రస్తుతం రైతుల రుణాలను మాఫీ చేయడం ప్రభుత్వం దగ్గరున్న అతి సులభమైన అవకాశం. ‘మనం’ అంటే ఎవరు? భారత్ అంటే ఏది? ఇప్పుడు చివరిగా ఆర్థికాంశం ప్రాతిపదికగా వినిపిస్తున్న వాదనల దగ్గరకొద్దాం. ఈ రుణమాఫీ వ్యవహారాన్ని మనం భరించగలమా? ఇది సాపేక్షంగా చూడవలసిన అంశం. అలాగే రాజకీయ అంశం కూడా. ఇది మన ప్రాధా మ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా ‘మనం’ ఎవరం, భారత్ అంటే ఏమిటి? అనే విషయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ‘మనం’ అంటే టీవీల ముందు కూర్చునేవారు, విధాన రూపకర్తలు. వారికి గ్రామీణ భారతంతో అసలు సంబంధమే లేదు. చాలా చిన్నదే కావచ్చు కానీ ఈ బలమైన వర్గం ఒక వాస్తవాన్ని గమనించాలి. భారతదేశ విజయ గాథ గ్రామీణ ప్రాంత వినియోగం మీదే ఆధారపడి ఉంది. ఈ ‘మనం’ పరిధిలోకి భారతీయులంతా, అంటే రైతులతో సహా చేరితే అప్పుడు వేరే విధంగా ఉంటుంది. భరించడం అనే అంశం భిన్న కోణం నుంచి దర్శనమిస్తుంది. మనం బులెట్ రైళ్లను ఏర్పాటు చేసుకోగలిగితే, పన్ను మాఫీ చేయగలిగితే, సంస్థలను కష్టాల నుంచి బయటపడవేసే చర్యలు తీసుకోగలిగి ఉంటే, పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థల భారీ రుణాలను సర్దుబాటు చేయగలిగితే, పెద్ద మొత్తంతో రక్షణ బడ్జెట్ను రూపొందించుకోగలిగితే– రైతుల విముక్తి కోసం కూడా రుణ మాఫీ భారాన్ని భరించగలం. అయితే ఇలాంటి వాదన రుణ మాఫీ గురించి లేవనెత్తుతున్న అన్ని అభ్యంతరాలకు, ప్రశ్నలకు సమాధానం కాబోదు. రుణమాఫీ గురించి యోచిస్తున్నప్పుడు మరికొన్ని ఇతర ప్రశ్నలను కూడా పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుంది. బకాయిలను సకాలంలో చెల్లించలేకపోయిన రైతులకు జరిమానా విధించకుండా ఆపగలమా? రైతు రుణమాఫీ వంటి పెద్ద చర్య తీసుకున్నప్పుడు గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రైతు తీసుకున్న రుణం మొత్తం చెల్లించాలని రైతును ఏ రీతిలో ఒప్పించగలం? వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి రైతులను ఎలా కాపాడుకోగలం? మార్కెట్ పరి స్థితులు, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలతో నిమిత్తం లేకుండా రైతుకు కనీస స్థాయి ఆదాయం లభించేటట్టు చేయడమనే మౌలికాంశాన్ని ఎలా పరిష్కరించగలం? ఈ అంశాలను గమనంలోకి తీసుకోని రుణమాఫీ విఫలమైనట్టే. కాబట్టి రైతు రుణమాఫీ వ్యతిరేకులకు నేను చెప్పేది ఒక్కటే. రుణమాఫీ తప్పా ఒప్పా అనే అంశం కాకుండా, రైతుకు ఒకే దఫా రుణమాఫీ చేసే మార్గం గురించి, వారికి చాలినంత ఆదాయం చేకూరే విధానాల వైపు చర్చను మళ్లించడం అవసరం. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ నెం: 98688 88986 Twitter: @_YogendraYadav -
పోలీసుల అదుపులో మేథాపాట్కర్
మంద్సౌర్: మధ్యప్రదేశ్లోని మంద్సౌర్ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న సామాజిక కార్యకర్తలు మేథాపాట్కర్, స్వామి అగ్నివేశ్, స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని, రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఐదుగురు రైతులు మృతిచెందారు. మృతుల కుటుంబాలను కలిసేందుకు వస్తుండగా మంద్సౌర్ బయట ధోల్దార్ టోల్ప్లాజా వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. శనివారం కర్ఫ్యూ ఎత్తివేసినందున ఇపుడిపుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయని, ఇపుడు వీరి పర్యటన వల్ల శాంతికి విఘాతం కలిగే ప్రమాదముందని పోలీసులు పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు ఉన్నందున అక్కడికి వెళ్లడానికి వీల్లేదని వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాహౌ-నీముచ్ జాతీయ రహదారిపై వారు బైఠాయించారు. వీరితో పాటు మరో 30మందిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. -
‘మంద్సౌర్’ దిశానిర్దేశం
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో ప్రారంభమై యావద్దేశానికి మార్గనిర్దేశం చేసిన రైతుల ఆందోళన స్థానికపరమైన సీజనల్ సమస్య కాదు. పంట నష్టం లేదా ప్రకృతి వైపరీత్యాలతో కూడిన ఒత్తిడి ఫలితమూ కాదు. ఈ నిరసన భారత వ్యవసాయ సంక్షోభంతో నేరుగా ముడిపడి ఉంది. మధ్యప్రదేశ్లోని మంద్సౌర్లో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన రైతాంగ ఉద్యమ చరిత్రలో నూతన దశకు ఆజ్యం పోసింది. జూన్ 6న జరిగిన పోలీసు కాల్పుల్లో కనీసం అయిదుమంది రైతులు చనిపోయారని ఇప్పుడు స్పష్టమవుతోంది. రైతుల ఆందోళన అంత త్వరగా సమసిపోదని కూడా స్పష్టమవుతోంది. అన్ని ఉద్యమాల్లోలాగే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇది ప్రారంభమైంది. జూన్ 1 నుంచి తాము పండిస్తున్న ఉత్పత్తుల్ని–ఆహార ధాన్యాలు, కూరగాయలు– నగరాలకు పంపకుండా నిలిపివేయాలని ఆ ప్రాంత రైతులు నిర్ణయించారు. ఇది వెంటనే మహారాష్ట్రలోని పలు జిల్లాలకు విస్తరించింది. దాని ఫలితంగా జూన్ 1, 2 తేదీల్లో ఏపీఎమ్సీ (వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సహకార సంస్థ) శాఖల్లో చాలావాటికి వ్యవసాయ ఉత్పత్తులు చేరలేదు. ప్రారంభంలో ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దీంతో చర్చలకు సిద్ధం కావలసి వచ్చింది. ఆ ఆందోళన ఇప్పుడు మధ్యప్రదేశ్కు వ్యాపించింది. ఆ రాష్ట్ర సీఎం కూడా రైతు అనుకూల సంస్థలతో ఒప్పందం గురించి ప్రకటించారు. కానీ ఇది అమ్ముడుపోవడమే అంటూ ఈ ఒప్పందాన్ని చాలా రైతు సంఘాలు తిరస్కరిం చాయి. మహారాష్ట్రలో రాష్ట్ర వ్యాప్త బంద్ విజయవంతం కావడంతో ఇతర రాష్ట్రాల్లోని రైతు సంఘాలు కూడా శక్తి పుంజుకున్నాయి. ప్రస్తుత రైతాంగ ఆందోళన ఎంత అసాధారణమైనదంటే, ప్రకృతి వైపరీత్యాలు, పంటల నష్టం జరిగిన సంవత్సరంలో ఇది చోటుచేసుకోలేదు. 2014–15, 2015–16 సంవత్సరాల్లో వరుస కరువులు ఎదుర్కొన్న తర్వాత గత వ్యవసాయ సీజన్లో మహారాష్ట్రలో సాధారణ వర్షపాతం దన్నుతో పంటలు బాగా పండాయి. సాధారణంగా రైతు ఆందోళనలు పంట నష్టాలతో ఉధృతమవుతుంటాయి. ఈ సంవత్సరం మహా రాష్ట్ర రైతులు అధిక స్థాయిలో కాకున్నప్పటికీ సాధారణ స్థాయిలో పంట లను పండించారు. చాలా సంవత్సరాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధిక వ్యవసాయ ఉత్పాదకతకు గాను అవార్డు అందుకుంటోంది కూడా. మరి రైతాంగ ఉద్యమాలు ఉన్నట్లుండి ఇలా పెచ్చరిల్లడానికి కార ణం ఏమిటి? ప్రస్తుత ఆందోళనను రెండు పరిణామాలు రెచ్చగొట్టినట్లు కనబడుతోంది. ఒకవైపు, పంటలు బాగానే పండటంతో రైతులు పండిం చిన పంటలకు ధరలు బాగా పడిపోయాయి. రెండోది, ఉత్తరప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం రైతుల రుణాలపై మాఫీని ప్రకటించిన ఘటన ఇతర రాష్ట్రాల్లోని రైతులు చిరకాలంగా చేస్తూవస్తున్న డిమాండ్లను మళ్లీ వారి దృష్టికి తీసుకువచ్చింది. ప్రధానంగా కాయధాన్యాల విషయంలో ధరలు కుప్పగూలిపోయాయి. దేశంలో కాయధాన్యాల కొరత ఏర్పడటంతో కేంద్రప్రభుత్వం క్వింటాల్ కంది పప్పు కనీస మద్దతు ధరను రూ. 4,500ల నుంచి రూ. 5,000ల వరకు పెంచింది. రైతులు కూడా ఎంతో సంతోషించారు. కాయధాన్యాల సాగు, ఉత్పత్తి బాగా పుంజుకుంది. కానీ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలుపుకోవడంలో విఫలమైంది. ప్రకటించిన ధర వద్ద ఉత్పత్తిని సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విఫలమయ్యాయి. క్వింటాల్కు రూ. 5 వేలు పొందడానికి బదులుగా రైతులు తమ పంటను రూ.3 వేలకే అమ్ముకోవలసివచ్చింది. మధ్యప్రదేశ్లో సోయా బీన్ పండించిన రైతులు, తెలంగాణలో మిర్చి రైతులు కూడా ఇదే విషాదాన్ని ఎదుర్కొన్నారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో టమోటా రైతులు తమ పంటను అత్యంత హీన స్థాయి ధరకు అమ్ముకోవడం కంటే రోడ్డుపై విసిరిపారేయడానికి నిర్ణయించుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అందుచేత పంట విఫలమైనప్పుడు మాత్రమే కాకుండా రుతుపవనాలు ఆశాజనకంగా ఉండి, పంటలు బాగా పండిన కాలంలో కూడా రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారని తేలుతోంది. ప్రస్తుత రైతాంగ ఆందోళనలకు ఇదే చోదక శక్తి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో రైతుల ఆందోళనకు వెనుక వాస్తవ ప్రాతిపదిక ఇదే. అది స్థానికమైనదీ, సీజనల్ సమస్య కాదు. పంట సంబంధమైన లేదా ప్రకృతి వైపరీత్యాలతో కూడిన ఒత్తిడి పర్యవసానం కాదు. ఈ నిరసన భారత వ్యవసాయ సంక్షోభంతో నేరుగా ముడిపడి ఉంది. నేటి భారత వ్యవసాయ సంక్షోభం మూడు రూపాల్లో ఉంది. మొదటిది భారత వ్యవసాయంలో పర్యావరణ సంక్షోభం. హరిత విప్లవంతో కూడిన ఆధునిక వ్యవసాయ విధానాలు జనం భరించదగినవి కావు. వనరులు, ఎరువులు, పురుగుమందులు, నీరు వంటివాటిని భారీగా వినియోగించడంతో కూడిన ఈ తరహా వ్యవసాయం ఇప్పుడు దాని అంతిమ దశకు చేరుకుంది. రెండు, భారత వ్యవసాయంలో ఆర్థిక సంక్షోభం. మన వ్యవసాయ ఉత్పాదకత దేశ అవసరాలకు, భూమి, వనరుల లభ్యతకు అనుగుణంగా లేదు. దీంతో ముడిపడిన మూడో అంశం రైతు ఉనికి సంక్షోభం. వ్యవసాయం రైతును బతికించే స్థాయిలో లేదు. రైతుల ఆత్మహత్యలు ఈ సంక్షోభంతోనే ముడిపడి ఉన్నాయి. ప్రస్తుత రైతుల ఆందోళనలో గుర్తించవలసిన అంశమేదంటే ఈ మౌలిక సమస్యను పరిష్కరించడంపై అది దృష్టి పెట్టడమే. తక్షణ, స్థానికపరమైన ఉపశమనం కోసం రైతులు డిమాండ్ చేయడం లేదు. రైతుల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తామని ఎన్నికల్లో పాలకపార్టీ చేసిన వాగ్దానాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. రైతులందరి రుణాల మాఫీని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దేశీయ రైతాంగ ఉద్యమాలు దీర్ఘకాలం నుంచి చేస్తూ వస్తున్న డిమాండ్లు ఇవి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా వీటి పరిష్కారానికి సంసిద్ధత చూపలేదు. ప్రస్తుతం పఢణవిస్ ప్రభుత్వం పాక్షికమైన, షరతులతో కూడిన రుణమాఫీ చేయడానికి అంగీకరించింది. కాని ఇది రైతులకు సంతృప్తి కలిగించేలా లేదు. కనీస మద్దతు ధరతోనే పంట దిగుబడులను సేకరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కానీ దీనికి ప్రాతిపదిక ఏది అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఇక శివరాజ్ చౌహాన్ చేస్తున్న ప్రకటనలు కూడా దీనికి భిన్నంగా లేవు. పైగా ఈ రెండు రాష్ట్రాల్లోని బీజేపీ సీఎంలు కేంద్రం నుంచి మద్దతు పొందుతున్నట్లు లేదు. ఈ స్థితిలో దేశంలోని మిగతా ప్రాంతాలపై మంద్సౌర్ రైతాంగ ఉద్యమం చూపే ప్రభావం ఏమిటన్నది చెప్పటం కష్టం. ప్రస్తుత ఆందోళన ఎంతకాలం కొనసాగుతుందో కూడా మనకు తెలీదు. కాని రైతుల వాస్తవ సమస్యలు పరిష్కారం కావటం లేదని మాత్రమే మనకు తెలుసు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులు మార్గదర్శనం చేశారు. ఇప్పుడు దేశంలోని మిగతా ప్రాంతాల్లోని రైతులు దాన్ని చేపట్టి ఈ పోరాటానికి తార్కిక ముగింపు ఇవ్వాల్సి ఉంది. రైతుల రాజకీయాల్లో కొత్త దశ కోసం మనం సిద్ధంగా ఉన్నాం. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 ‘Twitter : @_YogendraYadav -
వీరి వైఫల్యమే వారి వైభవం
నేడు రాజకీయ శూన్యమనే అంధకారంలో మోదీ తారలా వెలిగిపోతున్నాడు. మోదీ దూకుడును ప్రదర్శిస్తుండగా, విపక్షాలు కేవలం ప్రతిస్పందనల వరకే పరిమితమవుతున్నాయి. చూసేవాళ్లకు మోదీ సానుకూలమైన వ్యక్తిగా కనిపిస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు ప్రతికూల వైఖరితో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అవన్నీ మోదీ అనే గాలిబుడగ ఏదో ఒక రోజున తనంతట తానే పేలిపోక తప్పదనే అపోహలో కాలం గడుపుతున్నాయి. కేవలం మోదీని వ్యతిరేకించడం ద్వారానే మోదీని ఎదుర్కోవచ్చని వారు భ్రమ పడుతున్నారు. మూడేళ్ల మోదీ పాలనలో మూడు మౌలిక వాస్తవాలను గమనించవచ్చు. వీటిలో ఏ ఒక్క వాస్తవాన్నైనా చూడకపోవడమంటే అది దేశ రాజకీయాలను చూడకపోవడమే అవుతుంది. మొదటి వాస్తవం: నేడు నరేంద్ర మోదీ యావత్ దేశంలో ప్రజాదరణ గల ప్రధానమంత్రిగా గుర్తింపు పొందారు. రెండో వాస్తవం ఏమిటంటే, ఈ ప్రజాదరణ ఆయన చేసిన పనుల వల్లా, సాధించిన ఫలితాల వల్లా లభించింది కాదు, ఆయన ఇమేజ్ ఆధారంగా వచ్చింది. ఇక మూడో వాస్తవం, ఆయనకు ఇలాంటి ఇమేజ్ ఏర్పడడానికి మీడియా మెహర్బానీ కారణం కాగా, విపక్షాల దివాళాకోరుతనం వల్ల అది దినదినం వృద్ధి చెందింది. ఇలాంటి సర్వేలు సరే.....! మోదీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత కొద్ది రోజులుగా అనేక సర్వేలు వెలువడ్డాయి. ఈ సర్వేలన్నింటిలోనూ సామాన్య ప్రజలతో జరిపిన సంభాషణల ఆధారంగా ప్రధాని నరేంద్ర మోదీకి జనాదరణ ఏ స్థాయిలో ఉందో అంచనా వేశారు. ఇప్పటికిప్పుడే లోక్సభ ఎన్నికలు జరిగినట్టయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావొచ్చు అనే లెక్కలు కూడా దాదాపు అందరూ కట్టారు. ఒకానొక కాలంలో నేనూ అనేక సర్వేలు నిర్వహించిన వాడినే. కాబట్టి ఎన్నికలకు రెండేళ్ల ముందు జరిపే ఇలాంటి సర్వేలలో వెల్లడయ్యే జోస్యాలను తీవ్రంగా పరిగణించవలసిన అవసరం లేదని నేను చెప్పగలను. అయితే ప్రజాభిప్రాయం ఏ రీతిలో ఉందో, గాలి ఎటు వీస్తుందో అంచనా వేసుకోవడానికి మాత్రం ఈ సర్వేలు బాగా ఉపయోగపడతాయి. వేర్వేరు సర్వేల ఫలి తాలలో కొద్దో గొప్పో తేడాలున్నందున నేనిక్కడ అన్నింటికన్నా విశ్వసనీయమైనదని భావించే సీఏస్డీఏస్ (ఇఈ) లోక్నీతి సర్వేపై ఆధారపడుతున్నాను. నోట్ల రద్దు తరువాత అదే ఆదరణ మూడేళ్ల క్రితం అపూర్వ విజయం సాధించి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీకీ, అతని ప్రభుత్వానికీ ప్రజాదరణ నేటికీ బాగానే ఉందని ఈ సర్వేలన్నీ తేల్చాయి. అంతేకాదు, ప్రజాదరణలో ఎనిమిది శాతం పెరుగుదల ఉందని కూడా అవి నిర్ధారించాయి. 2014 నాటితో పోలిస్తే బీజేపీకి ఒడిశా, బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాలలో ఎక్కువ ఆధిక్యం లభించింది. అయితే ఇక్కడొక విషయం గుర్తు పెట్టుకోవాలి. అదేమిటంటే, గతంలో యూపీఏ ప్రభుత్వాల ప్రజాదరణ కూడా మూడేళ్ల దాకా చెక్కు చెదరలేదు. కాకపోతే మన్మో హన్Sసింగ్ కన్నా నరేంద్ర మోదీకి లభించిన ప్రజాదరణ ఎక్కువ అనేది కాదనలేని వాస్తవం. ప్రత్యేకించి గమనించాల్సిన విషయం ఏమిటంటే, నోట్ల రద్దు తర్వాత మోదీ ప్రజాదరణ తగ్గకపోగా, అది మరింత పెరిగింది. ఎవరి దృష్టి వారిది అయితే బీజేపీ వ్యతిరేకులు పై వాస్తవాల్లో మొదటిదాన్ని చూడడానికి ఇష్టపడరు. ఇక బీజేపీ మద్దతుదారుల విషయానికొస్తే, వారు రెండో వాస్తవాన్ని చూడడానికి నిరాకరిస్తారు. మోదీ ప్రజాదరణ ఇప్పటికీ తగ్గలేదంటే, దానికి కారణం తమ ప్రభుత్వం బాగా పని చేయడమేనని వారు భావిస్తారు. కానీ అసలు వాస్తవం అది కాదు. మోదీ ప్రభుత్వం తన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదు. ఉదాహరణకు, రైతులు పెట్టే పెట్టుబడికి ఒకటిన్నర రెట్ల పంట ధరలు, దేశంలోని యువజనులందరికీ ఉపాధి, మహిళలకు భద్రత, అవినీతిని రూపుమాపడం, విద్య, వైద్య సదుపాయాల్లో పెద్ద సంస్కరణలు... ఇలాంటి హామీలేవీ నేటికీ నెరవేరలేదు. ఇక సర్కారు వారు బాగా ప్రచారం చేసుకున్న స్వచ్ఛ్ భారత్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా, పంటల బీమా వంటి పథకాలేవీ నిర్దేశిత లక్ష్యాలకు చేరువలోకైనా చేరుకోలేదు. అయితే మోదీకి ప్రజాదరణ అపారంగా ఉందని చెప్పిన సర్వేలు సైతం నేడు దేశంలో నెలకొన్న నిరుద్యోగం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయన్నది గమనార్హం. గత మూడేళ్లలో ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయాయన్నది జనవాక్యం. రైతుల పరిస్థితి మునుపటికన్నా చాలా దయనీయంగా తయారైంది. మీడియా మద్దతుతోనేనా? సాధించిన ఘనతేదీ లేకున్నా మోదీ ప్రభుత్వానికి ఇంత జనాదరణ ఎలా వచ్చిందన్నది అసలు ప్రశ్న. మోదీ పలుకుబడిని మీడియా తీర్చిదిద్దడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన వ్యతిరేకులంటారు. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఈరోజున దేశంలో మీడియా మోదీని ఎంతగా ఆకాశానికెత్తుకుంటోందంటే, రాజీవ్ గాంధీ పాలనలో తొలి ఒకటి, రెండేళ్ల తర్వాత ఇంతగా మనం ఎన్నడూ చూడలేదు. దేశంలో మీడియాపై ప్రభుత్వ నియంత్రణ ఎమర్జెన్సీ తర్వాత ఎన్నడూ కనీ, వినీ ఎరుగని స్థాయిలో కొనసాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీడియా మోదీని ఆరాధిస్తోంది. ఆయన పాలనలోని ప్రతి లోపంపైనా అది పరదా కప్పెయ్యడానికే ఆత్రుత కనబరుస్తోంది. అది బీజేపీ కనుసన్నల్లో మసలుతూ, ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా ఎడతెరపి లేని క్యాంపెయిన్ కొనసాగిస్తోంది. రాబర్ట్ వాద్రా పాల్పడ్డ తప్పుడు పనులను బట్టబయలు చేయడానికి అది ఎంతో దూకుడును ప్రదర్శిస్తుంది కానీ బిర్లా సహారా డైరీల వ్యవహారంలో అంతులేని మౌనం దాలుస్తుంది. కపిల్ మిశ్రా లేవనెత్తే ప్రతి ఆరోపణనూ అలుపు లేకుండా ప్రచారం చేస్తుంది కానీ వ్యాపమ్ కుంభకోణం విషయంలో అది పల్లెత్తు మాట మాట్లాడదు. ఇంతటి పెంపుడు మీడియా దేశ చరిత్రలో బహుశా ఏ ప్రధానికీ లభించకపోవచ్చు. అయితే మోదీకి ఉన్న ప్రతిష్ట పూర్తిగా మీడియా దయాదాక్షిణ్యాల ఫలి తంగానే రూపుదిద్దుకుందనుకోవడం సరికాదు. సరుకు అసలు అమ్ముడుపోయే రకమే కానప్పుడు, వాణిజ్య ప్రకటన ఎంత గొప్పగా ఉన్నా సరే దాన్నెవరూ కొనరు కదా. నిజానికి మోదీ విజయం వెనుక దాగున్న రహస్యం ఆయన ప్రతిపక్షాలే. ఆయనను రాహుల్ గాంధీతో లేదా ఇతర నేతలతో పోల్చినప్పుడు తారలా మెరిసిపోతాడు. దిగజారిన కేజ్రీవాల్ ప్రతిష్ట జనాలకు ఎవరి పేర్లూ చెప్పకుండా తమకు ఇష్టమైన ప్రధానమంత్రి పేరు చెప్పమని అడగగా, 44 శాతం మంది నరేంద్ర మోదీ పేరు చెప్పారని సీఎస్డీఎస్ సర్వే వెల్లడి చేసింది. ఆయన తర్వాతి స్థానం రాహుల్ గాంధీది కాగా, ఆయన పేరు చెప్పింది 9 శాతం మంది మాత్రమే. రాహుల్, సోనియా, మన్మోహన్లను ముగ్గురిని కలిపినా వారి శాతం 14 మాత్రమే. మూడేళ్ల క్రితం ఈ వ్యత్యాసం ఇంత ఎక్కువగా లేదు. మోదీ పేరును 36 శాతం మంది చెప్పగా, రాహుల్, సోనియా, మన్మోహన్సింగ్ల ఉమ్మడి శాతం 19 వరకు ఉండింది. ప్రజలు ప్రధానిగా కోరుకునే వారిలో వీరు కాకుండా మిగతా ప్రతిపక్ష నాయకులెవరూ 3 శాతాన్ని దాటలేదు. రెండేళ్ల క్రితం 6 శాతం మంది తమ ఇష్టమైన ప్రధానిగా అరవింద్ కేజ్రీవాల్ పేరును సూచించగా, ఇటీవలి కాలంలో ఆయన మూటగట్టుకున్న అపఖ్యాతి మూలంగా ఆయనను మెచ్చేవారి శాతం 1 కన్నా తక్కువకు దిగజారింది. విపక్షాల దివాళాకోరుతనం నేడు రాజకీయ శూన్యమనే అంధకారంలో మోదీ తారలా వెలిగిపోతున్నాడు. మోదీ దూకుడును ప్రదర్శిస్తుండగా, విపక్షాలు కేవలం ప్రతిస్పందనల వరకే పరిమితమవుతున్నాయి. చూసేవాళ్లకు మోదీ సానుకూలమైన వ్యక్తిగా కనిపిస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు ప్రతికూల వైఖరితో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అవన్నీ మోదీ అనే గాలిబుడగ ఏదో ఒక రోజున తనంతట తానే పేలిపోక తప్పదనే అపోహలో కాలం గడుపుతున్నాయి. కేవలం మోదీని వ్యతిరేకించడం ద్వారానే మోదీని ఎదుర్కోవచ్చని వారు భ్రమ పడుతున్నారు. వారి వ్యూహం కేవలం మోదీ వ్యతిరేక మహాకూటమి వరకే పరిమితం. ఆలోచిస్తే అసలు మోదీ వ్యతిరేకులు చరిత్రను ఏ మాత్రం చదవలేదనిపిస్తుంది. అధికార పక్షపు అహంకారం కాదు, విపక్షాల దివాళాకోరుతనమే నేటి మన ప్రజాస్వామ్యంలో నెలకొన్న అసలైన విషాదం. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్: 98688 88986 ‘ Twitter: @_YogendraYadav -
అక్కడేమైంది జాతీయవాదం?
సందర్భం గడచిన 140 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత దుర్భిక్షం ప్రస్తుతం తమిళనాడులో నెలకొని ఉంది. అయితే మాత్రం మనం లెక్క చేస్తామా ఏమిటి? అసలు తమను ఓటు వేసి గెలిపించే అతి పెద్ద ఈ ఓటు బ్యాంకు మీద ప్రభుత్వాలు శీతకన్ను ఎలా వేయగలుగుతున్నాయి? ఆ దుర్భర పరిస్థితుల నుంచి తమిళనాడు రైతులను రక్షించవలసిన ఈ తరుణంలో మన ఘన జాతీయవాదం ఏమైపోయింది? ఆ రాష్ట్రంలో దారుణ దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న జిల్లాలు ఏడింటిలో గత వారం పర్యటించినప్పుడు నన్ను ఆ ప్రశ్నలే వెంటాడాయి. మిగతా దేశంలో మాదిరిగా కాకుండా, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలు బలహీనపడుతున్నప్పుడే తమిళనాడు అత్యధిక వర్షపాతానికి నోచుకుంటుంది. అయితే 2016లో ఇది జరగలేదు. ఈశాన్య రుతుపవనాల కాలంలో రాష్ట్రానికి అవసరమైన వర్షపాతంలో 62 శాతం లోటు కనిపించిందని అధికారులు చెప్పారు. వర్షపాతంలో 25 శాతం లోటు అంటేనే తీవ్రంగా పరిగణిస్తారు. ఇక 50 శాతం లోటు అంటే ప్రమాదకర స్థాయిగా భావిస్తారు. గడచిన ఏడాది వర్షపాతంలో వచ్చిన ఆ లోటు, ఎప్పుడో 1876లో ఒకసారి ఆ ప్రాంతం చవిచూసిందని రికార్డులు చెబుతున్నాయి. జలాశయాలు వాటి సామర్థ్యంలో 20 శాతానికి పరిమితమైనాయి. రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లాలలో 21 జిల్లాలు కరువు కోరలలో చిక్కుకున్నాయి. ఇందులో తమిళనాడు ధాన్యాగారం కావేరీ డెల్టా కూడా ఉంది. అక్కడ కూడా మేం పర్యటించాం. ఎక్కడ చూసినా రైతాంగం అనుభవిస్తున్న దుఃఖం కళ్లకు కడుతోంది. ఎకరాలకు ఎకరాలు బీళ్లు పడి ఉన్నాయి. నదులు, కాలువలు, చెరువులు ఎండిపోయాయి. బీడువారిన నేల మీదే గడ్డిపరకల కోసం వెతుకుతున్న పశువులు కనిపించాయి. ఈ ప్రాంతంలో ప్రధాన పంట వరి. ఈ సీజన్లో ఆ పంట పూర్తిగా పాడైందని ప్రతి చోట రైతులు చెప్పారు. పంట నష్టం కలిగించిన దిగ్భ్రాంతి, ఫలితంగా పెరిగిన రైతుల బలవన్మరణాల గురించే ఢిల్లీలో జంతర్మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టిన రైతులు ఎలుగెత్తి చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో సన్నగిల్లిన ఉపాధి అవకాశాలు వ్యవసాయ కూలీల మీద మరింత తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పంట నష్టం వెంటే తీవ్ర స్థాయి పశుగ్రాసం కొరత కూడా ఉంటుంది. దీనితో రైతులు ఆవులనీ, మేకలనీ అమ్ముకుంటున్నారు. కొన్నిచోట్ల తాగునీటి కొరత కూడా ఉంది. నిజానికి దీనికంతటికీ కారణం ప్రకృతి వైపరీత్యమని చెప్పలేం. మేం ఆయా ప్రాంతాలలో జరిపిన పర్యటన తరువాత ఇదంతా మానవ కల్పిత లేదా విధానాలతో ముడిపడి ఉన్న సమస్య అని అర్థమైంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉన్న కావేరీ జలాల వివాదం కారణంగా ఆ డెల్టా ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నది. రెండు ప్రాంతాల రాజకీయ నాయకులు సమస్యకు సానుకూల పరిష్కారాన్ని వెదికే పని చేయకుండా ఉద్రిక్తతలను మరింత ఎగదోయడానికే యత్నిస్తున్నారు. ఇందుకు సంబం«ధించి ట్రిబ్యునల్ తన తీర్పును ప్రకటించింది. దీనికి అన్ని పక్షాలు కట్టుబడి ఉండాలి. అయితే తీర్పు అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. జాతీయవాదం గురించి గొప్పగా ప్రబోధిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదంలో జోక్యం చేసుకోవడం లేదు. తమిళనాడు ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు భూగర్భ జలాల వృద్ధిని నిరోధిస్తున్నాయి. అలాగే సరిపడని పంటలతో పరిమితంగా ఉన్న జలాలు దుర్వినియోగమవుతున్నాయి. ప్రభుత్వ చేయూత కోసం రైతులు ఎదురు చూసే సమయం సరిగ్గా ఇదే. ఈ పరిస్థితులలో రైతులు, తమిళ ప్రజలు ప్రభుత్వ స్పందన కోసం ఆశించడానికి సరైన కారణాలే ఉన్నాయి. అయితే హిందీ భాషా ప్రాంతాలలోని రాష్ట్రాలలో జరిగే నాసిరకం పరిపాలనతో తమిళనాడు పరిపాలనా ప్రమాణాలను అంచనా వేయలేం. తమిళనాట విపరీత స్థాయిలో రాజకీయ విన్యాసాలు కనిపించే మాట నిజమే అయినా, మిగతా రాష్ట్రా లతో పోల్చినప్పుడు ఆ రాష్ట్రం చక్కని సంక్షేమ పథకాలను అమలు చేసిన వాస్తవం కూడా కనిపిస్తుంది. మధ్యాహ్న భోజన పథకం ఆరంభమైంది ఆ రాష్ట్రంలోనే. రేషన్ దుకాణాల ద్వారా చౌక ధరలకు సరుకులు అందించి ఉన్నతమైన ప్రజా పంపిణీ విధానాన్ని అమలు చేసిన రాష్ట్రాలలో తమిళనాడు చెప్పుకోదగినదిగా ఉంది. సునామీ అనంతర చర్య లతో ప్రకృతి వైపరీత్యాలను వేగంగా ఎలా ఎదుర్కోవచ్చో చూపించి, ఒక నమూనా రాష్ట్రంగా కూడా తమిళనాడు నిలబడింది. అయితే రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో, ఈ దుర్భిక్ష పరిస్థితులలో ఆశించిన స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న అక్కడి రైతాంగానికి అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిరాశే ఎదురైంది. ఇదంతా రాజకీయ సంకల్పం లేదనడానికి ప్రబల నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా చర్చినీయాంశంగానే ఉంది. దుర్భిక్ష పరిస్థితులు ఉన్నప్పుడు వేసవి సెలవులు ఇచ్చినప్పటికీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. అయితే తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి వరకు అలాంటి పనికి పూనుకోలేదు. ఇలాంటి కరువు పరిస్థితులలో తన బిడ్డ పాఠశాలలో అయినా కడుపునిండా తినే అవకాశం ఉంటుందని ప్రతి తల్లి ఈ పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే ఆ తల్లితో ప్రభుత్వం ఏకీభవించేటట్టు లేదు. కరువు తాండవిస్తున్న ప్రాంతాలలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. తమకు కొత్త జాబ్ కార్డులు గానీ, ఉపాధి కానీ ఇవ్వలేదని పర్యటనలో మేం కలుసుకున్న వ్యవసాయ కూలీలు చెప్పారు. ఒకవేళ పనిచేసినా సొమ్ము చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నదంటూ అనేక ఫిర్యాదులు విని పించాయి. ప్రభుత్వం లాంఛనంగా పంట నష్టం పరిహారాన్ని ప్రకటించింది. అయితే ఆ కొద్ది నష్ట పరిహారమైనా ప్రకటించిన దానికంటే చాలా తక్కువగానే ఇస్తున్నారని మేం కలుసుకున్న గ్రామీణులు ఆరోపించారు. అలాగే ఏ రైతూ కూడా ఇంతవరకు బీమా మొత్తాన్ని కూడా అందుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా చాలాచోట్ల వాణిజ్య, సహాకార బ్యాంకులు రుణ వసూళ్లకోసం నోటీసులు జారీ చేస్తూనే ఉన్నాయి. జాతీ యవాదం అంటే బాహ్య శత్రువును కనుగొనడం కాదు. నిజమైన జాతీ యవాదం అంటే దేశాన్ని కలిపి ఉంచడం. తమిళనాడు రైతులు సాగి స్తున్న హక్కుల యాత్ర సానుకూల జాతీయవాదాన్ని ప్రకటిస్తున్నది. వ్యాసకర్త: యోగేంద్ర యాదవ్ స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav -
గోమాత సాక్షిగా కొన్ని నిజాలు
గో రక్షణ కోసం కంకణం కట్టుకున్న వాళ్ల అసలు ఉద్దేశం ఈ సాకుతో ముస్లింలను వేటాడడం కానట్టయితే, వారు మొట్టమొదట చేయాల్సింది హిందూ సమాజంలో వేళ్లూనుకున్న వంచనను బట్టబయలు చేయ డమే. దేశంలో 25 కోట్ల హిందూ కుటుంబాలున్నాయి. మొత్తం 12 కోట్ల ఆవులున్నాయి. ఆవును పూజించే ప్రతి కుటుంబం ఒక్కో ఆవును పోషించి, అది పాలివ్వనప్పటికీ దానికి సేవ చేస్తూ ఉన్నట్టయితే ఆవుల రక్షణ దానంతట అదే జరుగుతుంది. కానీ రైతులు దూడలను, ముసలి ఆవులను పోషించే స్థితిలో లేరు. ఆవుల్ని పోషించలేని వారు వాటి పాలన కోసం గోశాలలకు చందాలిచ్చినా గోరక్షణ జరుగుతుంది. అంధురాలైన పహలూ ఖాన్ తల్లి తన ఒక్కగానొక్క కొడుకును గుర్తు చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమెను ఓదార్చడానికి మాటలు సరిపోవు. ఎనభై యేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన నాకు గుర్తుకొచ్చింది. బహుశా అప్పటికి పహలూ ఖాన్ తల్లి పుట్టే ఉండాలి. 1936లో హిసార్లో బక్రీద్ రోజున ఆవును బలి ఇచ్చారన్న వివాదంతో అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లలో మా తాతగారైన మాస్టర్ రామ్ సింగ్ను హత్య చేశారు. పహలూ ఖాన్ తల్లి చేతుల్ని నా చేతుల్లోకి తీసుకోగా, నా మనసు గదిలో ఫైజ్ అహ్మద్ ఫైజ్ పంక్తులు ప్రతిధ్వనించసాగాయి: ‘ఖూన్ కే ధబ్బే ధులేంగే కిత్నీ బర్సాతోం కే బాద్’ (ఎన్ని వర్షాకాలాల తర్వాత రక్తపు మరకలు తుడిచిపెట్టుకుపోతాయో). శ్రేష్ఠమైన భావన వెనుక... నేను గోరక్షణను సమర్థిస్తాను. మా ప్రాంతంలో బహుసంఖ్యాక సముదాయం ఆవును పవిత్రంగా భావిస్తుంది. వేదకాలంలో గోమాంసాన్ని తిని ఉండొచ్చు కానీ నేడు ఒక సగటు హిందువు పాటించే మత సంస్కారం అతన్ని గోమాంసం తినకుండా నిరోధిస్తుంది. మాంసాహారులైన హిందువులలో కొంత మందిని మినహాయిస్తే ఎక్కువ మంది ఆవు మాంసాన్ని తినరు. ఆ మాటకొస్తే అనేకానేక మత సంస్కారాల వలెనే గోరక్షణ అనే భావన కూడా చాలా అందమైంది. మానవీయ సంవేదనలను కేవలం తమ మానవజాతి రక్షణకే కాకుండా ఇతర ప్రాణుల రక్షణ వరకూ విస్తరించడమనేది శ్రేష్ఠమైన భావన అనడంలో సందేహం లేదు. ఒకవేళ ఆవు ఈ ఆదర్శానికి ప్రతీకగా నిలిస్తే ఎవరికైనా ఇందులో అభ్యంతరమేముంటుంది? హిందువులు పాటించే ధర్మం అతనిని గోహత్య చేయకుండా నిరోధిస్తున్నట్టుగానే, ముస్లింలు పాటించే ధర్మం అతనిని ఆవును చంపమని లేదా తినమని ఏమీ నిర్దేశించడం లేదు. ఖురాన్ షరీఫ్లోని రెండో సూరా ‘ఆవు’కు సంబంధించిన కథనాలపై ఆధారపడినదే. ఇస్లాంలో గోహత్య లేదా గోమాంసంపై పూర్తి నిషేధం ఏమీ లేదనేది వాస్తవమే. అయితే ఖురాన్ షరీఫ్ నిర్దేశాలన్నీ నిషేధం దిశలోనే ఉన్నాయి–పాలిచ్చే ఆవు, వ్యవసాయంలో ఉపయోగించే ఆవు, చిన్న దూడలు, ముసలి ఆవును బలివ్వడంపై నిషేధం ఉంది. హజరత్ మహమ్మద్ ఆవును పెంచాడు కాబట్టి ఆవు పెంపకాన్ని ‘సున్నత్’, అంటే ముస్లింల మతాచారానికి అనువైన పని గానే భావించారు. వాస్తవం ఏమిటంటే, పహలూ ఖాన్ గ్రామంలో నివసించే ముస్లింలు తరతరాలుగా గోపాలకులుగా ఉన్నారు. నేటి హరియాణాలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ముస్లింలు అధికంగా ఉండే మేవాత్ జిల్లాలోనే ఆవుల్ని ఎక్కువగా పెంచుతారు. ఈ వివాదం అనివార్యం కాదు అంటే అర్థం గోరక్షణ అనే సమస్యపై హిందువులూ, ముస్లింలూ ఒకరికొకరు వ్యతిరేకంగా నిలబడడం తప్పనిసరేమీ కాదు. ఈ అవగాహన ఆధారంగానే భారత రాజ్యాంగంలో గోరక్షణను ఆదేశిక సూత్రాలలో ఒకటిగా చేర్చారు. కాబట్టి నిజాయితీగా ప్రయత్నించినట్టయితే గోరక్షణ విషయంపై జాతీయ సమ్మతి ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం గోరక్షకులు తమను తాము ఇలా ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది: మనం చేయాల్సింది ఆవుల రక్షణా లేక ఈ సాకుతో ముస్లింలను వేటాడడమా? మన అసలు లక్ష్యం గోరక్షణే అయితే మనమొక చేదు నిజాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేడు ఆవుకు అసలైన ప్రమాదం గోమాంసాన్ని తినేవాళ్లతో లేదు, సరికదా ఆవు ఫోటోను పూజించే వాళ్లతోనే దానికి ముప్పు పొంచి ఉంది. చేదు నిజం ఏమిటంటే ఆవు విషయంలో హిందూ సమాజం వైఖరి వంచనతో కూడుకొని ఉంది. మాటల్లో హిందూ సమాజం ఆవును గోమాత అని చెబుతుంది. దానికి బొట్టూ, కుంకుమలు పెడుతుంది. కానీ దాని పేరుతో కొట్లాటలు సృష్టిస్తుంది. కానీ అదే హిందువు ఆవును రక్షించడం కోసం చేసే కృషి ఆవగింజంత కూడా ఉండదు. రక్షకులు విస్మరిస్తున్న వాస్తవం దేశంలో ప్రతి నగరంలో ఆవులు ప్లాస్టిక్నూ, చెత్తనూ తినటాన్ని మనం రోజూ చూస్తుంటాం. నిరుడు కరువు కాలంలో లక్షలాది ఆవులు మేత లభించక ఎండిపోయిన చేలూ, చెలకల్లో పడి తిరుగుతూ ప్రాణాలు విడిచాయి. వాటి దుస్థితిపై నేను వ్యాసాలు రాశాను. విజ్ఞప్తులు చేశాను. కానీ హిందూ సమాజం వాటి రక్షణకు ముందుకు రాలేదు. ఒకవైపు గోరక్షణ అంటూ గొంతులు చించుకుంటుండగా, మరోవైపు గోశాలలు మూతపడిపోతున్నాయి. అంటే ఆవులను కాపాడే ప్రథమ బాధ్యత ఉన్న హిందూ సమాజమే వాటిని ఈ దుస్థితికి నెట్టడంలో తొలి అపరాధి. మరో చేదు నిజం ఏమిటంటే గోహత్యకు బాధ్యత దానిని వధించే కసాయిది మాత్రమే కాదు. అది పాలివ్వడం మానెయ్యగానే దానిని అమ్మేసే, దూడలను వదిలేసే గోపాలకుడిదే గోవధలో మొదటి నేరం. ఆ తర్వాత ఆవును వధశాలకు చేరవేసే దళారీ పాత్ర ఉంటుంది. ఈ క్రమం చివరలో పెద్ద పెద్ద వధశాలలుంటాయి. వాటిలో లక్షలాది ఆవుల్ని వధించి వాటి మాంసాన్ని ఎగుమతి చేస్తారు. ఈ వ్యాపారంలో ఉన్న వాళ్లలో అత్యధికులు హిందువులే, ముస్లింలు కాదు! నిషేధం ఎప్పుడు విధించాలి? మూడో చేదు నిజం ఏమిటంటే, గోహత్య, గోమాం సంపై చట్టపరమైన నిషేధం విధించినంత మాత్రాన ఉపయోగమేమీ ఉండదు. దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో ఇప్పటికే గోహత్యపై నిషేధం అమలులో ఉంది. అయినా ఆవుల్ని పెంచే స్తోమత లేని రైతులు ముసలి ఆవుల్ని అమ్మేస్తారు. కాబట్టి గోరక్షణ వ్యవస్థను సరిచేయకుండా గోమాంసంపై నిషేధం విధించడమంటే అది ప్రతి వంటింట్లో పోలీసు అధికారి చొరబాటు వంటిదే. ఈ స్థితిలో అఖ్లాఖ్ వంటి దురంతాలు ప్రతి రోజూ జరుగుతూ ఉంటాయి. గోరక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేసినట్టయితే గోహత్యకు విరుద్ధంగా జాతీయ ఏకాభిప్రాయం సాధించవచ్చు. హైందవేతరులు కూడా దీనిని ఆమోదించే అవకాశం ఉంది. అయితే మొదట హిందూ సమాజం తన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. గో రక్షణ అంటే.. గో సేవ కూడా!l గోరక్షణ కోసం కంకణం కట్టుకున్న వాళ్ల అసలు ఉద్దేశం ఈ సాకుతో ముస్లింలను వేటాడడం కానట్టయితే, వారు మొట్టమొదట చేయాల్సింది హిందూ సమాజంలో వేళ్లూనుకున్న వంచనను బట్టబయలు చేయడమే. దేశంలో 25 కోట్ల హిందూ కుటుంబాలున్నాయి. మొత్తం 12 కోట్ల ఆవులున్నాయి. ఆవును పూజించే ప్రతి కుటుంబం ఒక్కో ఆవును పోషించి, అది పాలివ్వనప్పటికీ దానికి సేవ చేస్తూ ఉన్నట్టయితే ఆవుల రక్షణ దానంతట అదే జరిగిపోతుంది. కానీ నేడు రైతులు దూడలను, ముసలి ఆవులను పోషించే స్థితిలో లేరు. ఆవుల్ని పోషించలేని వారు వాటి పాలన కోసం గోశాలలకు చందాలిచ్చినా గోరక్షణ జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వాలు కూడా గోశాలల నిర్వహణలో సహాయం చేసినా అందులో అభ్యంతరం ఉండాల్సిందేమీ లేదు. కానీ ప్రధాన బాధ్యత స్వీకరించాల్సింది మాత్రం హిందూ సమాజమే. పహలూ ఖాన్ తల్లి గోసేవ కోసం సిద్ధంగా ఉంది. గోరక్షణ కోసం ప్రయత్నించే క్రమంలో ‘అమరుడైన’ మా తాతగారు కూడా బతికుంటే ఈ బాధ్యతను స్వీకరించేవారు. కానీ ఆవును కేవలం టీవీలో మాత్రమే చూడగలిగే గోరక్షకులు దీనిని స్వీకరించగలరా? వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav -
ఢిల్లీ గుణపాఠం కనువిప్పేనా?
సందర్భం ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎంసీడీ) ఎన్నికలకు ముందు రోజు సాయంత్రం నేను ఓలా విజ్డమ్ ట్యాక్సీని బుక్ చేశాను. పోలింగ్ జరగడానికి ముందురోజు ఇష్టాగోష్టి సమావేశంలో పాల్గొని ఇంటికెళుతూ మేం ఒక ట్యాక్సీని మాట్లాడుకున్నాం. మమ్మల్ని డ్రాప్ చేస్తూ, డ్రైవర్ ‘మీరు రాజకీయ పార్టీకి చెందినవారా’ అని అడిగాడు. నా ముఖాన్ని అతడు స్పష్టంగా గుర్తుపట్టలేకపోయాడు. అదేమంత పెద్ద విషయం కాదని అతడికి చెబుతూ మరుసటి రోజు జరగనున్న ఎంసీడీ ఎన్నిక గురించి ఏమనుకుంటున్నావని అడిగాను. అతడు సాంప్రదాయికంగా కాంగ్రెస్ ఓటరట. 2014లో లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా బీజేపీకి ఓటేశాడు. కానీ 2015లో అతడు కేజ్రీవాల్ పార్టీకి మారాడు. మరి ఈసారి? తన వార్డు అభ్యర్థుల పేర్లను అతడు గుర్తుపెట్టుకోలేదు కానీ ఈసారి మాత్రం మోదీకే ఓటేస్తానని చెప్పాడు. ఢిల్లీ మునిసిపల్ కౌన్సిస్ పనితీరు గురించి తన అభిప్రాయాన్ని అడిగాను. వాళ్లు ఒక్క పనీ చేయలేదు (కుచ్ కామ్ నíహీ కియా) అని నొక్కి చెప్పాడు. గత పదేళ్లుగా ఎంసీడిని పాలిస్తున్నది బీజేపీనే అని అతడికి గుర్తు చేశాను. కేజ్రీవాల్ మాకు ద్రోహం చేశాడు అని అతడు కొట్టిపడేశాడు. ఇప్పుడు తన నమ్మకం పూర్తిగా మోదీపైనే ఉందన్నాడు. ‘ఉత్తరప్రదేశ్లో ఆయన యోగి వంటి ఉత్తమ ముఖ్యమంత్రిని ఇచ్చారు. ఢిల్లీలో కూడా ఆయన మంచి ప్రభుత్వానికి హామీ ఇస్తారు’ అనేశాడు. నాకు మాటల్లేకుండా పోయాయి. భయపడ్డాను కూడా. అయితే రాజకీయాల గురించి ఆ వోలా డ్రైవర్ నాకు తెలియనిది కొంత చెప్పాడు. బీజేపీకి అనుకూలంగా పెద్ద స్థాయిలో ఓట్లు సైలెంటుగా బదిలీ అవుతున్నాయని ఎన్నికల ప్రచారం ముగింపు నాటికే తేలిపోయింది. ఎంసీడీ పనితీరుపై ఓటర్లు దృష్టి పెట్టలేదని స్పష్టమైంది. అయితే ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంపై నేను చేసిన విమర్శలపైనే వారు మరింత ఆసక్తి చూపారు. పోలింగు రోజున బీజేపీ పూర్తి ఆధిక్యత సాధించనుందంటూ పరిశీలకులు చేసిన అంచనాను ఎగ్జిట్ పోల్స్ ధ్రువపర్చాయి. తన సమీప ప్రత్యర్థిపై బీజేపీ 20 శాతం కంటే అదనంగా ఆధిక్యత సాధించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అంతటి ఆధిక్యత సహజంగానే సీట్ల పరి భాషలో సంపూర్ణమైన క్లీన్ స్వీప్ను సాధించిపెడుతుంది. అలాంటి ఫలితం భయాన్ని, విషాదాన్ని కూడా కలిగిస్తుంది. అత్యంత చెత్త పనితీరును ప్రదర్శించే దేశీయ మునిసిపాలిటీల్లో ఢిల్లీలోని మూడు మునిసిపాలిటీలుకూడా చేరిపోయి ఉంటాయనడంలో సందేహమే లేదు. ఢిల్లీలోని సగం జనాభాకు ఆశ్రయమిస్తున్న తూర్పు, ఔటర్ ఢిల్లీ ప్రాంతాలను సందర్శిస్తే, ఇక్కడి పట్టణ మౌలిక వసతులు యూపీ, బీహార్లోని పట్టణాలకంటే ఏమంత మెరుగ్గా ఉండవు. గత సంవత్సర కాలంగా ఢిల్లీనగరం చికున్ గున్యా, డెంగ్యూ వ్యాధులతో సతమతమైంది. ఇక వాయు కాలుష్యం అయితే అన్ని ప్రమాద హెచ్చరికలను అధిగమించేసింది. ఈ పరిస్థితికి ఎవరు కారణం అనే విషయంలో రెండు వాదనలకు తావులేదు. ఢిల్లీలోని మునిసిపల్ కార్పొరేషన్లు గత పదేళ్లుగా బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. పట్టణ ప్రభుత్వాలు ఎలా ఉండకూడదో ఈ మునిసిపాలిటీలు టెక్ట్స్ బుక్ ఉదాహరణగా నిలుస్తాయి. నిజం గానే ఢిల్లీ ప్రభుత్వం వద్ద వనరులు లేక అవి కునారిల్లుతున్నాయి. ఏమాత్రం పనిచేయని పాలకపార్టీకి ఢిల్లీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? స్పష్టంగానే దీనికి సమాధానం ఈవీఎం ట్యాంపరింగ్లో మాత్రం లేదు. బాధ్యతారహిత ఆరోపణలు చేయడానికి బదులుగా, ప్రజలు ఓటేస్తున్నారు కాబట్టే బీజేపీ గెలుస్తోందన్న వాస్తవాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. స్పష్టంగానే, బీజేపీకి ఓటు వేస్తున్నవారు పనిచేయని ఢిల్లీ మునిసిపాలిటీ కౌన్సిళ్లకు తాము రివార్డు అందిస్తున్నట్లు భావించడం లేదు. ఈ ఎన్నికల్లో తీవ్రమైన మునిసిపల్ సమస్యలను బీజేపీ పక్కకు దాటివేయిం చగలిగింది. దీనికి బదులుగా జాతీయవాదం, కశ్మీర్, గోవధ, జాతీయ భద్రత వంటి ఎంసీడీలకు సంబంధం లేని అంశాలపై చర్చించేలా ఓటర్లను, మీడియాను బీజేపీ ఏమార్చగలిగింది. బాగా చెడ్డపేరు వచ్చిన ప్రస్తుత కౌన్సిలర్లను మరోసారి నామినేట్ చేయకుండా చేసి ప్రజాగ్రహం తనపై మళ్లకుండా అది జాగ్రత్త పడింది. మరోవైపున ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఈ ఎన్నికను కేజ్రీవాల్పై వ్యక్తిగత రిఫరెండంగా మార్చి నిజమైన మునిసిపల్ సమస్యలపై చర్చను దారిమళ్లించింది.. చివరికి ఈ ఎన్నికలు సీఎం, పీఎంలకు మధ్య పాపులారిటీ పోటీగా మారిపోయాయి. ఢిల్లీ ప్రజలు సీఎంకు బదులుగా పీఎంను ఎంచుకున్న్టట్లుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మోదీ మ్యాజికల్ ప్రభంజనంతో దీన్ని వివరించలేం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 2015లో బీజేపీని తుంగలో తొక్కివేసిన రోజు కూడా మోదీ ఏమంత తక్కువ శక్తిమంతంగా లేరు. లోక్సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, హర్యానా విజయాలతో మోదీ పాపులారిటీ ఒక మెట్టుపైనే ఉండేది. ఇప్పటివలే కాకుండా మోదీ ఆనాడు పార్టీ స్థానిక వ్యతిరేక ఓటును కూడా ఎదుర్కొనలేదు. మనమిప్పుడు ఈ కష్టమైన ప్రశ్న నుంచి తప్పించుకోలేం. 2015లో మోదీ వేవ్ ఎందుకు పనిచేయలేదు. 2017లో మాత్రం పనిచేస్తున్నట్లు ఎందుకు కనిపిస్తోంది? తేడా ఎక్కడుందంటే 2015 ఫిబ్రవరి నుంచి ఆప్ ప్రభుత్వంతో ఢిల్లీ పొందిన అనుభవంలోనే ఉంది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆప్ తన నైతికాధికారాన్ని కోల్పోయింది. విద్యుత్ బిల్లులను పాక్షికంగా తగ్గిం చడం, స్కూల్ విద్య కోసం అదనపు నిధులను కేటాయించడం మినహా ప్రభుత్వం తన సమర్థతను ఏమాత్రం ప్రదర్శించక పోవడంతో సుపరిపాలనపై అది చేసిన వాగ్దానం తేలిపోయింది. హామీలను నెరవేర్చడానికి బదులుగా ఆప్ ప్రభుత్వం కేంద్రానికి, దాని ప్రతినిధి లెఫ్టినెంట్ గవర్నర్కి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ కాలం గడిపేసింది. ఆ ఆరోపణల్లో కొన్ని నిజమైనవే కావచ్చు. కాని ఈ ఆరోపణలపైనే ఎక్కువగా అది ఆధారపడినందువల్లే నా ఓలా డ్రైవర్ వంటి ఢిల్లీ ప్రజలను విసుగెత్తించేసింది. ఈ వ్యక్తిగత రిఫరెండాన్ని కోల్పోవడంతో అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తి ఆరాధన తనకే ఎదురు తగిలింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిసిన ఆప్ ఇప్పుడు నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలి పోతోంది. ఈ పార్టీ ఇప్పటికైనా కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటుందనే ఆశిద్దాం. ఢిల్లీలో ఎంసీడీ ఎన్నిక భారత రాజకీయాల్లో పెద్దన్నగా బీజేపీ వికాసానికి సంబంధించిన ఒక దశను పూర్తి చేసింది. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వాస్తవాన్నిగుర్తించనట్లయితే అవి కోలుకోవడం చాలా కష్టం. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 ‘ Twitter : @_YogendraYadav -
రాజభాష ప్రహసనం ఇంకానా?
హిందీని అధికారభాషగా చేయాలని చేసిన కృషి సాధించినది ఏదైనా ఉందంటే అది.. ప్రపంచంలో నాలుగో అతి పెద్ద భాషగా ఉన్న దానిని అంతరించిపోతున్న భాష స్థాయికి దిగజార్చడమే. హిందీ చుట్టూ ఉన్న అధికారిక పటాటోపమంతా కలసి దాన్ని ఇంగ్లిష్కు దాసోహం చేసింది. హిందీ ప్రత్యేక హోదా ఆ భాషకు మిగతా భాషలతో ఉన్న సంబంధా లను దెబ్బతీసింది. హిందీ మాట్లాడనివారంతా బడిలో అంతో ఇంతో హిందీని నేర్చుకోవా ల్సిందే. కానీ హిందీ మాట్లాడేవారు ఏదో ఒక ఇతర భారతీయ భాషను నేర్చుకోరు. మరో అధికారభాషా కమిటీ తన నివేదికను సమర్పించింది. అది సైతం మరిన్ని పవిత్ర సూచనలను చేసింది, వాటిని ఆమోదించారు కూడా. ఈ అంశంపై నిద్రాణంగా ఉన్న బహిరంగ చర్చ తిరిగి మొదలైంది. మొత్తంగా ఈ వ్యవహారమంతా మరోసారి అవే పాత ఫలితాల దిశగా సాగుతోంది. ఆ నివేదిక నిరపాయకరంగా కాగితాలకే పరిమితమూ కావచ్చు లేదా హిందీ, దానికి విరుద్ధంగా ఇతర భారతీయ భాషలు అనే రీతిలో చర్చను పెడదోవ పట్టించనూవచ్చు. హిందీని అధికార భాష(రాజభాష)గా అభివృద్ధి చేయాలనుకోవడం నిరర్థకమైనది, హానికరమైనది అని ఇప్పుడు నేను విశ్వసిస్తున్నాను. హిందీ స్థాయిని పెంపొందింపజేయడంపై మన అధికారిక వైఖరిని సమీక్షించు కోవాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ 14వ తేదీని హిందీ దివస్గా జరుపు కోవడాన్ని మానాలని కొన్నేళ్ల క్రితమే నేను కోరాను. తప్పుల కుప్పకు సంకేతం హిందీ దివస్: హిందీని అధికార భాషగా అభివృద్ధిపరచాలన్న భారత ప్రభుత్వ కృషి సాధిం చిన అసాధారణ విజయం ఏదైనా ఉందంటే అది... ప్రపంచంలో నాలుగో అతి పెద్ద భాషగా (మాండ్రైన్, స్పానిష్, ఇంగ్లిష్ తర్వాత) ఉన్న దానిని అంతరించిపోతున్న జాతులలో ఒక దాని స్థాయికి దిగజార్చడమే. హిందీ దివస్లు మన దేశ భాషావిధానంలో ఉన్న తప్పులన్నిటికీ సంకేతంగా నిలుస్తాయి. ఈ పరిస్థితి మారి తీరాల్సిందే. హిందీ దివస్ అనే జాతీయ స్థాయి తంతుకు స్వస్తి పలకడంతో మనం ఈ మార్పునకు శ్రీకారం చుట్ట గలుగుతాం. నా సూచన విడ్డూరంగా అనిపించొచ్చు. హిందీవాలా అని ∙పిలిపించు కుంటూ తిరిగే నేనే ఇలా అనడం వల్ల ప్రత్యేకించి అలా అనిపించొచ్చు. ఇందుకు నా మిత్రులు సైతం అభ్యంతరం తెలుపవచ్చు. ఈ తంతుకు మరింతగా జవసత్వాలను చేకూర్చాల్సిన అవసరం ఉందని, అధికార భాషగా హిందీకి ఉన్న నామమాత్రమైన అ«ధికారిక గుర్తింపునకు బదులుగా దాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాల్సి ఉన్నదని వారు వాదించవచ్చు. నేను వారితో విభేదిస్తాను. హిందీ చుట్టూ ఉన్న అధికారిక పటాటోప మంతా కలసి దాన్ని ఇంగ్లిష్కు దాసోహం చేసిందని అనుకుంటాను. అంత కంటే అధ్వానంగా అది హిందీకి ఇతర భారతీయ భాషలతో ఉన్న సంబంధ బాంధవ్యాలను తెంచేయడానికి తోడ్పడింది. ఆ భాషలన్నీ తమ సొంత మాండలికాలతో, శక్తులతో, సృజనాత్మకతతో ప్రవర్ధిల్లడం కొనసాగుతూనే ఉంది. మనం ముందుకు సాగాలీ అంటే ఈ వారసత్వంతో పూర్తిగా తెగ తెంపులు చేసుకోవడం అవసరం. అది ఎందుకో ఎలాగో వివరిస్తాను. ఇంగ్లిషుకు దాసోహమైన ‘రాజభాష’: అధికారికమైన రాజభాష అనే ముద్ర దేశంలో హిందీకి ఉన్న నిజమైన హోదాను కప్పిపెట్టేస్తుంది. నిజాన్ని గ్రహించడానికి మీరు ఒక్కసారి మీ చుట్టూ పరికించి చూస్తే సరిపోతుంది. సర్వవ్యాప్తమైన రాపిడ్ ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్సుల ప్రకటనలు, సదా తామరతెంపరగా పుట్టుకొస్తూనే ఉండే ఇంగ్లిష్ మీడియం ‘కాన్వెంట్’ స్కూళ్లు, అరకొర అధ్వానపు ఇంగ్లిష్లో తమ గురించి మంచి అభిప్రాయాన్ని కలిగించాలని చేసే దయనీయమైన ప్రయత్నాలు కనిపిస్తాయి. ఇవన్నీ భాషల విషయంలో కొట్టొచ్చినట్టుగా కనిపించే ఆధిప త్యాన్ని సూచిస్తాయి. ఇంగ్లిష్ అంతా ఆకాంక్షించే భాష. మరే గత్యంతరం లేని వారికే హిందీ. యూపీఎస్సీకి సంబంధించి అతి ముఖ్యమైన సివిల్ సర్వీసు పరీక్షల్లోని సీ–సాట్ (C-SAT)పేపర్పై వివాదం ఇంగ్లిష్దే ఆధిపత్యమని మరోమారు రుజువు చేసింది. భావి సివిల్ సర్వీసు అధికారుల భాషాపరమైన శక్తియుక్తులను... ఇంగ్లిష్ మూలం నుంచి అనువదించడం ద్వారానే నిర్ధారి స్తామనడం వలసవాద ఆలోచనా విధానం. అది ఒక జాతీ యస్థాయి కుంభ కోణానికి తక్కువదేమీ కాదు. అయినా ప్రభుత్వం ఆ పరీక్ష విషయంలో ముందుకే సాగింది. అధికారం భాష ఇంగ్లిషే. ఇతర భారతీయ భాషలతో సంబంధాలకు దెబ్బ: దీనికి సంబంధించి, హిందీకి పట్టిన గతి ఇతర భారతీయ భాషలకు పట్టిన గతికంటే భిన్నమైనదేం కాదు. అయినా హిందీకి ఉన్న ప్రత్యేక హోదా ఆ భాషకు మిగతా భాషలతో ఉన్న సంబంధాలను దెబ్బతీసింది. మన రాజ్యాంగం ఎక్కడా ‘‘జాతీయ భాష’’ అన్న ప్రస్తావనే లేదు. అయినా హిందీ మాట్లాడేవారు తమ మాతృభాషకు ఆ హోదా కావాలని భావిస్తుంటారు. ఇతరులు దీనిపట్ల నిరసనను వ్యక్తం చేస్తారు. హిందీ దేశంలోని అతి పెద్ద భాషే కావచ్చు. కానీ అది అతి పురాతనమైనదీ కాదు, ఆధునిక భారతీయ భాషల్లోకెల్లా అత్యంత సుసంపన్నమైనదీ కాదు. హిందీ మాట్లాడని ప్రతి ఒక్కరూ బడిలో అంతో ఇంతో హిందీని నేర్చుకోవాల్సిందే. కానీ హిందీ మాట్లాడేవారు మాత్రం ఇతర ఆధునిక భారతీయ భాషలను నేర్చుకోవడం నుంచి తప్పించుకుంటారు. నిజానికి సర్కారీ హిందీ, హిందీని దాని మూల భాషల, పదుల కొలదీ ఉన్న దాని ‘మాండలీకాల’ భాషాపరమైన, సాంస్కృతికపరమైన వారసత్వా నికి దూరం చేసింది. ఇక హిందీ, ఉర్దూ భాషల మధ్య అగాధాన్ని అది నిర్వి రామ కృషితో శ్రద్ధగా పెంపొందింపజేసింది. హిందీ చనిపోయింది లేదా చనిపోతోంది అని కాదు. తద్విరుద్ధంగా, అది ప్రవర్ధిల్లుతోంది, చాలా రంగాలకు వ్యాపిస్తోంది. ముంబై సినిమా, క్రికెట్ కామెంటరీ, వేగంగా వృద్ధి చెందుతున్న హిందీ మీడియా హిందీ భాషను సజీవంగా ఉంచాయి. వర్తమాన హిందీ సాహిత్యంలోని అత్యుత్తమ రచనలు మరే ఆధునిక భాషా సాహిత్యంతోనైనా సరితూగుతాయి. హిందీ భాషకు చక్కటి సాంప్రదాయక సాహిత్య విమర్శ, సామాజిక శాస్త్రాలపై పెంపొం దుతున్న విజ్ఞాన సంపదా ఉంది. ఇవన్నీ హిందీని అ«ధికారిక భాషగా పెంపొం దింపచేయడం వల్ల కాదు, చేసినా సమకూరినవి. అందువల్లనే ‘హిందీ దివస్’ను రద్దు చేయాలని నా ప్రతిపాదన. మన దేశ భాషా వైవిధ్యాన్ని, సంపదను సూచించే విధంగా వివిధ భారతీయ భాషల మధ్య అనుసంధానాలను బలవత్తరం చేసుకోవడం కోసం హిందీ దివస్ స్థానే ‘భాషా దివస్’ను జరుపుకోవాలి. అధికార వ్యవస్థ ఆ పని చేయ డానికి విముఖంగా ఉంటుంది. కాబట్టి హిందీ భాషను ప్రేమించేవారు ఈ ప్రహసనానికి తెరదించడానికి చొరవ చెయ్యాలి. హిందీని పూజించకండి వాడుకునేలా సంస్కరించండి: అందుకు బదులుగా వారు ఏం చెయ్యాలి? హిందీని పూజించడానికి బదు లుగా, ఆ భాషను వాడటమే దానికి చేయగల అత్యుత్తమమైన సేవ. మొద టగా మనం చేయాల్సినది, ఏమాత్రం అంతుబట్టనిదిగా అతిగా సంస్కృ తీకరించిన అధికారిక హిందీ స్థానంలో... ఉపయుక్తమైన, వాడుకోగలిగిన నిఘంటువులను తయారుచేయాలి. హిందీ తన పద కోశాన్ని సుసంపన్నం చేసుకోడానికి వీలుగా భాషా ‘మాండలీకాల’కు, ఇంగ్లిష్ సహా ఇతర భాష లకు తలుపులను తెరిచి ఉంచాలి. మోటారు మెకానిక్లు, వివిధ సేవలను అందించేవారు ఈ విషయంలో మార్గదర్శకులు కాగలుగుతారు. రెండు, మనం కొత్త తరం ఈ కృషిలో పాల్గొనేలా చేయాలంటే పిల్లల కోసం, పెద్ద పిల్లల కోసం సాహిత్యాన్ని సృష్టించాలి. గుల్జార్ ‘బోసీ కా పంచతంత్ర’ లేదా సుకుమార్ రే ‘అబోల్–తబోల్’ వంటిని అందుకు నమూనాలుగా ఉపయోగ పడతాయి. కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయికి చెందిన మంచి నాణ్యమైన పాఠ్యగ్రంథాలను రచించాల్సిన అవసరం ఉంది. మూడు, చీనీ, జపానీ భాషల్లా హిందీని కూడా ఇంటర్నెట్కు అను వైనదిగా మార్చాలి. నాలుగు, ఇంగ్లిష్ తదితర భాషల్లోంచి హిందీలోకి భారీ ఎత్తున అనువాదాలను చేసే కార్యక్రమాన్ని, ఒక జాతీయ ఉద్యమం స్థాయిలో చేపట్టడం అవసరం. ఇతర భారతీయ భాషల సాహిత్య వనరులు హిందీలో అందుబాటులో ఉండేలా చేయాలి. హిందీ కేవలం షాయరీలనేగాక న్యాయ పరిభాషను కూడా ఉర్దూ నుంచి స్వీకరించాలి. తమిళ సంప్రదాయ వార సత్వాన్ని, మలయాళ అచ్చు సంస్కృతిని, వర్తమాన కన్నడ సాహిత్యాన్ని, మరాఠీ ధిక్కార సాహిత్యాన్ని బెంగాలీ విద్యాసంబంధ రచనాశైలిని హిందీ స్వీకరించాలి. హిందీని ప్రచారం చే సే అత్యుత్తమ మార్గం దాన్ని ప్రచారం చేయడాన్ని ఆపేయడమే. దాని మానానికి దాన్ని వదిలేయడమే. అంటే నిశ్శబ్దంగా అది వివిధ ప్రజా సముదాయాలతో, భాషలతో అనుసంధానాలను పెంపొందిం చుకోనివ్వడమే. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav -
హత్య, ఆత్మహత్య మధ్య ఆప్
సందర్భం ఒక నైతిక, రాజకీయ నిర్మాణంగా ఆప్ చావును దాని ఎన్నికల యంత్రాంగం ఎంత కాలం పాటు ఆపగలుగుతుందో మనం చెప్పలేం. అది హత్యకు గురి అవుతుందా? లేదా ఆత్మహత్య చేసుకుం టుందా అనేది మనకు తెలియదు. ఏది జరిగినా అది ప్రజాస్వామ్యానికి మాత్రం మేలు చేయదు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఇప్పుడొక విచిత్రమైన, విషాదకర సన్నివేశాన్ని చూస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను అంతం చేసేందుకు బీజేపీ పూర్తి స్థాయి యుద్ధాన్ని నిర్వహిస్తోంది. కానీ అందులో అది విజయం సాధించలేకపోవచ్చు. మరోవైపు ఆప్ నాయకత్వం స్వీయవినాశనం అనే ప్రక్రియలో తలమునకలుగా ఉంది. హత్యా? లేక ఆత్మహత్యా? ఈ రెండిం టిలో ఏది ముందు జరుగుతుందో మనం ఊహించలేం! ప్రజాస్వామ్య ప్రయోజనాల రీత్యా ఈ రెంటిలో ఏది ఎక్కువ చెరుపు చేస్తుందో కూడా చెప్పలేం. ఆప్ తనకు పోటీదారు కాగలదనే విషయాన్ని బీజేపీ 2013లోనే పసిగట్టింది. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ తమకు దీర్ఘకాలిక ప్రమాదాన్ని తెచ్చిపెట్టగలిగే స్థితిలో లేదని, కానీ ఆదర్శవాదానికి ప్రాతినిధ్యం వహించే ఈ కొత్త పార్టీతో మాత్రం తమకు ముప్పు పొంచి ఉందని వారు ఆనాడే గ్రహించారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆప్ను దెబ్బ తీయడానికి బీజేపీ చట్టపరమైన, చట్టవిరుద్ధమైన అధికారాలన్నింటినీ ప్రయోగించింది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల్లో ఫెడరల్ సూత్రాలకు స్పష్టమైన ఉల్లంఘన. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్యాంగబద్ధమైన అధికారిగా కన్నా కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగానే ఎక్కువ పని చేశాడనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన అనేక రోజువారీ కార్యక్రమాలను సైతం నజీబ్ జంగ్ అడ్డుకున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు పాల్పడిన నిజమైన, ఊహాజనితమైన నేరాలన్నింటి పట్ల ఢిల్లీ పోలీసులు ఎంత క్రియాశీలకంగా స్పందించారంటే మరే రాష్ట్ర పోలీసులూ, మరే ఇతర పాలక పార్టీ పట్లా అంతగా స్పందించలేదు. పోలీసులు ఇవే ప్రమాణాలను అందరి పట్లా సమానంగా వర్తింపజేసినట్టయితే బీజేపీకి చెందిన డజన్ల కొద్ది ఎంపీలూ, వందల కొద్ది ఎమ్మెల్యేలు ఈపాటికి జైలులో ఉండాల్సింది. ఆప్ ఖాతాల్లో ఎలాగైనా సరే అవకతవకల్ని తవ్వితీయడం కోసం ఆదాయపన్ను శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ వేధింపులనే భావించాలి. స్వయంగా అక్రమ విదేశీ నిధుల స్వీకరణ ఆరోపణలెదుర్కొంటున్న బీజేపీ ఇతరులపై వేలెత్తి చూపడమంటే అది గురివింద గింజ సామెత వంటిదే. ప్రభుత్వ నిధులను పార్టీ ప్రచారానికి అక్రమంగా వినియోగించినందుకు ఆప్కు రూ. 87 కోట్ల జరిమానా విధిం చిన కమిటీ సిఫార్సు కూడా పక్షపాత వైఖరికి అతీతమైంది కాదు. అరవింద్ కేజ్రీవాల్ తదితరులపై అరుణ్ జైట్లీ పెట్టిన పరువు నష్టం కేసు విచారణ క్రమం కూడా అసాధారణ వేగంతో నడుస్తోందని చెప్పాలి. అధికార పార్టీ పన్నిన వ్యూహంలో భాగంగా ఆప్పై తలపెట్టిన ఈ ఏకపక్షమైన చర్యలను గోరంతలు కొండంతలు చేసి చూపడానికి మీడియాలోని ఒక సెక్షన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. బీజేపీ తన ఉక్కు పిడికిలిని మరింత గట్టిగా బిగించబోనున్నదనే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. షుంగ్లూ కమిటీ నివేదికను విడుదల చేయడాన్ని బట్టి ఇక వరుసగా అనేక చట్టపరమైన చర్యలుంటాయనేది తేటతెల్లం. పార్టీ కార్యాలయం కేటాయింపును రద్దు చేయడమనేది చాలా చిన్న చర్య. దీని తర్వాత కొందరు మంత్రులపైనా, ఢిల్లీ ప్రభుత్వంలోని కీలక అధికారులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేసే పరంపర మొదలు కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థికి ఓటమి ఎదురైంది. ఈ నెల 23న జరుగబోయే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడ ఆప్ ఓటమి పాలు కావచ్చు. అంతా బీజేపీ ఊహ ప్రకారం జరిగితే అది ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడంపై కూడా ఆలోచించవచ్చు. సాధారణంగా ఒక భారీ పాలక శక్తి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నప్పుడు కొత్త పార్టీ పట్ల సానుభూతి, సహకారం వ్యక్తం కావాలి. రోజు రోజుకూ కుదించుకుపోతున్న ఆప్ గట్టి సమర్థకుల సమూహం ఇంకా ఇదే నమ్ముతోంది. కానీ చీమ సైతం ఏనుగును ఢీకొనగలదనే కథను నమ్మడానికి ఇప్పుడెవరూ సిద్ధంగా లేరు. ఆప్ ప్రధానంగా మూడు వాగ్దానాలు చేసింది: రాజకీయాలలో నైతికత, సుపరిపాలన, ఓటర్లు కల్పిం చిన బలమైన అధికారం. రాజకీయాలలో నైతికత విషయంలో అది చాలా కాలం క్రితమే అర్హతను కోల్పోయింది. నమ్మదగని అభ్యర్థులను చేర్చుకోవడం, పార్టీ నిబంధనావళిని బేఖాతరు చేయడం, తమ సొంత లోక్పాల్నే పార్టీలోంచి అవమానకరంగా గెంటెయ్యడం వంటివన్నీ ఒక నైతిక నిర్మాణంగా ఆప్ మరణానికి ముందస్తు సూచికలే. సుపరిపాలన హామీ కూడా పూర్తిగా అబద్ధంగా తేలిపోయింది. పరి పాలన అనే వ్యవహారానికి సంబంధించిన మౌలిక వ్యాకరణాన్నే ఆప్ ప్రభుత్వం అర్థం చేసుకోలేదని పదే పదే రుజువయింది. ఆప్ ప్రభుత్వం ఢిల్లీ పరిపాలన విషయంలో రాజ్యాంగ నియమాలను ఎలా ఉల్లంఘించిందో ఢిల్లీ హైకోర్టు గతంలోనే వెల్లడించింది. ఈసీ ఎదుట విచారణలో ఉన్న లాభసాటి పదవులకు సంబంధించిన కేసు.. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంలో ఈ ప్రభుత్వం చట్టాన్ని ఎలా తోసిరాజందో తెలి యచెబుతోంది. నిజాయితీపరులుగా పేరున్న ముగ్గురు రిటైర్డ్ అధికారు లతో కూడిన షుంగ్లూ కమిటీ పలు వ్యవహారాల్ని బయటపెట్టింది. ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగానికి సంబంధించిన అనేక వ్యవహారాలను షుంగ్లూ కమిటీ బయటపెట్టింది. స్వయంగా సీఎం నిబంధనలను ఉల్లంఘిస్తూ తన దగ్గరి బంధువును మొదట రెసిడెంట్ డాక్టర్గా, ఆ తర్వాత ఆరోగ్యశాఖ మంత్రికి ఓఎస్డీగా నియమిం చారు. చాలామంది పార్టీ కార్యకర్తలకు అక్రమంగా ప్రయోజనాలు చేకూరుస్తూ లాభదాయకమైన పదవులు కట్టబెట్టారు. పైపెచ్చు, అవినీతి, ఫోర్జరీ, నైతిక పతనం తదితర ఆరోపణలతో పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. బీజేపీతో ఢీకొనగలిగే శక్తి తనకే ఉందని చెప్పుకున్న ఆప్కు పంజాబ్, గోవా ఫలితాలతో గర్వభంగం జరిగింది. ఓటమి తరువాత ఈవీఎంలను నిందించే హాస్యాస్పదమైన ఎత్తుగడను చేపట్టారు. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో ఇంటి పన్నును రద్దు చేస్తామనే హామీ కూడా ఆప్లో పేరుకుపోయిన నిరాశకే నిదర్శమని భావించవచ్చు. ఒక నైతిక, రాజకీయ నిర్మాణంగా ఆప్ చావును దాని ఎన్నికల యంత్రాంగం ఎంత కాలం పాటు ఆపగలుగుతుందో మనం చెప్పలేం. అది హత్యకు గురవుతుందా లేదా ఆత్మహత్య చేసుకుంటుందా అనేది కూడా మనకు తెలి యదు. ఎలా జరిగినా అది ప్రజాస్వామ్యానికి మాత్రం మేలు చేయదు. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav -
అధ్వాన పాలనకు నిలువుటద్దం
ఢిల్లీ నగరానికి ఉన్నవి మూడు ప్రభుత్వాలు, మూడూ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనాలే! మరిక ఓటరు ఏం చేయాలి? సాధారణంగా ఢిల్లీ ప్రజలు తమ జీవనంతో నేరుగా ముడివడి ఉన్న మున్సిపల్ ఎన్నికల పట్ల అతి తక్కువ ఆసక్తిని చూపుతారు, పోలింగూ తక్కువగానే ఉంటుంది. ఈసారి కూడా వారు ఉదా సీనంగానే వ్యవహరిస్తారా? లేదా నగరాన్ని ఈ దుస్థితిలోకి నెట్టిన పార్టీలనే గత్యంతరం లేక తిరిగి ఎన్ను కుంటారా? లేదా భవిష్యత్తు వైపు ముందడుగు వేస్తూ ఒక కొత్త ప్రత్యామ్నాయానికి అవకాశం ఇస్తారా? జవాబు ఢిల్లీతో పాటు దేశ రాజకీయాలకు కూడా ఒక ముఖ్య సంకేతంగా నిలుస్తుంది. మన దేశంలో మహానగరాలు ఎంత అధ్వానమైన స్థితిలో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మీరు ఢిల్లీకి రండి. ప్రభుత్వం పరిష్కారంలో భాగస్వామి కావడానికి బదులు సమస్యకు మూలం కావడం అంటే ఏమిటో చూడాలనుకుంటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ను చూడండి. దీనిని మార్చడంలో ప్రజాస్వామిక ప్రక్రియగా ఎన్నికలు సైతం ఎందుకు విఫలమవుతున్నాయో అర్థం చేసుకోవాలనుకుంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను పరిశీలించండి. మూడు ప్రభుత్వాల మహా నగరం మన నగరాలలో, మహానగరాలలో ప్రభుత్వం అనేది ఒక పజిల్ లాంటిది. ఎవరిపై ఏ బాధ్యత ఉందో, ఎవరి అధికార పరిధి ఏమిటో అధికారులకు తప్ప మరో మానవుడికి తెలియదు. ఢిల్లీవాసులకు అది ఒక నగరం. కానీ ఈ ఒక్క నగరంలో ఏక కాలంలో మూడు ప్రభు త్వాల పాలన నడుస్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్ర పాలన, ముఖ్యమంత్రి ద్వారా రాష్ట్ర పాలన, మేయర్, కమిషనర్ల ద్వారా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పాలన. భూముల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం తర ఫున డీడీఏ పర్యవేక్షిస్తుంది. భవనాల నిర్మాణాలకు కార్పొరేషన్ అనుమతి మంజూరు చేస్తుంది. కానీ దానికి సంబంధించిన నియమాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. రోడ్లు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. గల్లీ రోడ్లు నిర్మించే పనిని కార్పొరేషన్ చూసుకుంటుంది. కొన్ని ప్రాథమిక పాఠశాలలు, ఆసుపత్రులు కార్పొరేషన్ నిర్వహణలో ఉంటాయి. కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం చూసుకోగా, మరి కొన్నింటిని నేరుగా కేంద్రమే చూసు కుంటుంది. మురుగు కాల్వలు మొదలయ్యే చోట బాధ్యత కార్పొరేషన్ది కాగా, అవి అంతమయ్యే దశలో ఆ తలనొప్పిని భరించేది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి, ఇలాంటి గందరగోళం మధ్య ప్రభుత్వం నడపడం కన్నా ఖోఖో ఆడుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయనేది స్పష్టం. ఎవరికీ పట్టని సామాన్యుని గోడు ఇలాంటి పరిస్థితిలో సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో గత సంవత్సర కాలపు అను భవం నుంచి అర్థం చేసుకోవచ్చు. నిరుడు వర్షాకాలం తర్వాత ఢిల్లీలో డెంగ్యూ, చికున్గున్యా వంటి అంటు వ్యాధులు ప్రకోపించాయి. ప్రభుత్వ లెక్కల్లో కేవలం 15 వేల మందికి ఈ వ్యాధులు సోకినట్టు నమోదైనా, వాస్తవానికి వీటి బారిన పడ్డవారి సంఖ్య 35–40 వేల దాకా ఉంటుంది. తగిన వేతనాలు లభించక పోవడం మూలంగా పారిశుధ్య కార్మికులు పలుమార్లు సమ్మె చేశారు. తూర్పు, ఉత్తర ఢిల్లీలలోని రోడ్లపై చెత్త కుప్పలు పేరుకుపోయాయి. చలికాలం మొదలవుతూనే వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని సైతం మించిపోయింది. ఆ రోజుల్లో ఢిల్లీలో నివసించే ప్రతి వ్యక్తీ నలభై సిగరెట్లకు సమానమైన పొగను పీల్చాల్సి వచ్చింది. ఐఐటీ నిర్వ హించిన పరిశోధనలో ఢిల్లీలో కాలుష్య దుష్ప్రభావం ఫలితంగా గత సంవత్సరం 50 వేల మరణాలు సంభ వించాయని తేలింది. ఈ మహానగరంలో ప్రతి ముగ్గురు పిల్లలలో ఒకరు శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. పరిస్థితులు ఇంత ప్రమాదకరంగా ఉన్నా ప్రభు త్వాలు ఇంకా మేల్కోవడం లేదు. ఢిల్లీ నగరాన్ని నడి పించాల్సిన బాధ్యత గల నేతలూ, అధికారులంతా తమ తమ జేబులు నింపుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు లేదా పరస్పర రాజకీయ దూషణల్లో మునిగి ఉన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అంతమొందించేందుకు సుప్రీంకోర్టు ఒక ఏడాది క్రితం 42 మార్గదర్శకాల్ని జారీ చేసింది. కానీ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, బీజేపీ చేతిలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ వీటిలో ఒక్క మార్గదర్శకాన్నయినా సరిగా అమలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం ఢిల్లీకి రూ. 336 కోట్లు కేటాయించగా, మూడు మునిసిపల్ కార్పొ రేషన్లు కలసి ఖర్చు చేసింది కేవలం రెండు కోట్లు మాత్రమే. ఢిల్లీలో డెంగ్యూ, చికున్గున్యా విలయ తాండవం చేస్తున్న రోజుల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన వైద్యం కోసం బెంగళూరు వెళ్లగా, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఫిన్లాండ్ విద్యా వ్యవస్థను అధ్యయనం చేయడం కోసం అక్కడకు వెళ్లారు. అదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అమెరికా పర్యటనను ముగించుకొని రాగా, ఉత్తర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ యూరప్ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ నగరం మురికికీ, రోగాలకూ నెలవుగా మారిపోతోంది. ప్రభుత్వాలూ, పార్టీలూ నువ్వంటే నువ్వంటూ పరస్పర నిందారోపణల్లో మునిగి తేలు తున్నాయి. స్థానిక ఎన్నికలకైనా గుర్తురాని పౌర సదుపాయాలు ఇలాంటి పరిస్థితిలో ఎన్నికలు జరిగితే ఏం జరుగు తుంది? అన్ని పార్టీలూ ఢిల్లీలో మురికీ, చెత్తా లేకుండా చేయడానికి సంబంధించిన పథకాల్ని ప్రతిపాదించ వచ్చనీ, మురికికి తావులేని ఢిల్లీ అనే నినాదంతో కార్య క్రమాల్ని చేపట్టవచ్చనీ మీరు భావిస్తున్నారు కదా! కానీ ఏప్రిల్ 23న జరుగనున్న మున్సిపల్ ఎన్నికల తీరు తెన్నులెలా ఉన్నాయో గమనించండి. ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలోని 273 వార్డులకు ఎన్నికలు జరుగ బోతున్నాయి. రానున్న ఐదేళ్లలో నగరం స్వరూప స్వభావాల్లో రాగల మార్పు లేమిటో నిర్ణయించు కోవా ల్సిన తరుణమిదే. కానీ పెద్ద పార్టీలన్నీ మురికి, పారి శుధ్యం వంటి సమస్యలు మినహా అప్రధానమైన విష యాలన్నింటి గురించీ మాట్లాడుతున్నాయి. పదే ళ్లుగా మునిసిపల్ కార్పొరేషన్ను ఏలుతున్న బీజేపీ ఈ దుస్థితికి తనదే బాధ్యత అని గుర్తించడానికి బదులు మోదీ వెల్లు వను అడ్డు పెట్టుకొని గెలుపు కోసం ప్రయ త్నిస్తోంది. అపఖ్యాతి పాలైన కార్పొరేటర్లను వదిలించుకోవడానికి బీజేపీ పాత కార్పొరేటర్లందరికీ టికెట్లు నిరాకరించే ఎత్తు గడను చేపట్టింది. ఈ కసరత్తుతో ప్రజలు బీజేపీ ఆధ్వ ర్యంలో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అసమర్థతలనూ, మురికినీ, చెత్తనూ, అవినీతినీ మర్చిపోతారని అది ఆశిస్తోంది. మరోవైపు ఢిల్లీని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గత రెండేళ్లలో చేశామని చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అందుకే అది కూడా రోజుకో కొత్త హామీతో ముందుకొస్తోంది. తమ పార్టీ గెలిస్తే ఇంటి పన్నును రద్దు చేస్తుందనీ, పాత బకాయిల్ని మాఫీ చేస్తుందనీ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీని వల్ల పేదలకు ఒరిగే లాభ మేమీ లేదు. ఎందుకంటే గుడిసెల్లో నివసించే వారు, అధికారిక గుర్తింపులేని కాలనీల్లో ఉండేవారు అసలు ఇంటి పన్ను కట్టనే కట్టరు. కానీ ఈ ఇంటిపన్ను మాఫీ పథకంతో మున్సిపల్ కార్పొరేషన్ నడుం విరగడం మాత్రం ఖాయం. పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడానికే అగచాట్లు పడుతున్న కార్పొరేషన్ ఈ మాఫీతో దివాళా తీయక తప్పదు. ఇంతవరకు ఏదో మేరకు జరుగుతున్న పనులు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఎన్నికల్లో ఓటమి తప్పదనే అంచ నాతో, నిరాశ మూలంగానే కేజ్రీవాల్ అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా పోటీ పడుతోంది–అరిగి పోయిన అవే వాగ్దానాలతో, ఓటమి అలుముకున్న అవే ముఖాలతో. రాజధాని ఓటరు కొత్త దారి పట్టేనా? ఒక నగరానికి మూడు ప్రభుత్వాలు, మూడూ వైఫల్యా నికి నిలువెత్తు నిదర్శనలే! కాబట్టి ఇప్పుడు ఓటరు ఏం చేయబోతున్నాడనేది అసలు విషయం. సాధారణంగా ఢిల్లీలో మునిసిపల్ ఎన్నికల్లో పెద్దగా ఉత్సాహం కని పించదు. ప్రజలు తమ జీవనంతో నేరుగా ముడివడి ఉన్న ఈ ఎన్నికలపట్ల అతి తక్కువ ఆసక్తిని చూపుతారు, పోలింగూ తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా ప్రజలు ఎన్నికల్లో ఉదాసీనంగా వ్యవహరించి, ఆ తర్వాత ఫిర్యాదులు చేస్తారా? లేదా ఢిల్లీని ఈ దుస్థితి లోకి నెట్టిన పార్టీలనే గత్యంతరం లేక మరోసారి ఎన్ను కుంటారా? లేదా ఢిల్లీ ప్రజలు తిరిగి ఆ పాత బాటనే సాగడానికి బదులు భవిష్యత్తు వైపు ముందడుగు వేస్తూ ఒక కొత్త ప్రత్యామ్నాయానికి అవకాశం ఇస్తారా?. ఈ ప్రశ్నకు జవాబు ఢిల్లీతో పాటు దేశ రాజకీయాలకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన సంకేతంగా నిలు స్తుంది. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav -
యోగేంద్ర యాదవ్ కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: యోగేంద్ర యాదవ్ నేతృత్వంలోని స్వరాజ్ ఇండియా పార్టీకి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి ఉమ్మడి గుర్తు ఇవ్వాలన్న అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈవీఎంలలో అభ్యర్థుల ఫొటోలు ఉంటాయని, ఉమ్మడి గుర్తు లేనంత మాత్రానా ఎటువంటి నష్టం జరగదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. గుర్తింపులేని నమోదిత పార్టీలకు ఉమ్మడి గుర్తు కేటాయించలేమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో స్వరాజ్ ఇండియా పార్టీకి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు ఏప్రిల్ 22న జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృతుడైన యోగేంద్ర యాదవ్.. ప్రశాంత్ భూషణ్ తో కలిసి స్వరాజ్ ఇండియా పార్టీని స్థాపించారు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంపై విమర్శలు చేయడంతో వీరిద్దరూ బహిష్కరణకు గురయ్యారు. -
ఒక వెలుగు జడి.. ఒకింత శూన్యం..
నేను కళ్లు తెరిచాను. క్షణకాలం పాటు స్తంభించిన టీవీ తెర మళ్లీ వెలుగులు జిమ్మసాగింది. ఇందిరా గాంధీ చిత్రం అదృశ్యమైంది. రాజకీయ శూన్యపు బాధ అలాగే మిగిలిపోయింది. అయితే ఈ అంధకారంలో సైతం ఒక వెలుగురేఖ కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ రాజకీయపు రేఖ గీయాలనే ఆలోచన మనసులో రూపు దిద్దుకుంటోంది. సామాజిక న్యాయం, సెక్యులరిజం, సోషలిజం, జాతీయవాదాలకు ఒక కొత్త భాషనివ్వాల్సిన అవసరం ఉందని తోస్తోంది. నేపథ్యంలో ఎక్కడో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ చిత్రం కూడా కనిపిస్తోంది. టీవీ తెర పైన ప్రధానమంత్రి బొమ్మ. దాని చుట్టూ వెదజల్లుతున్న కాషాయ రంగు. హర హర మోదీ అనే నినాదాలు. ఎందుకో తెలియదు గానీ ఈ రంగుల ధూళి వెనుక ఇందిరా గాంధీ బొమ్మ ఉన్నట్టుగా కనిపించసాగింది. నా చెవికి ‘ఇందిరా ఈజ్ ఇండియా‘ అనే నినాదం వినిపించసాగింది. కొన్ని క్షణాలు పాటు కళ్లు మూసుకున్నాను. కళ్లు మూసుకుంటే పెద్ద చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశంలో ఒక పెద్ద రేఖను గీశాయి. ప్రతి విధానసభ ఎన్నికల్లోనూ మనం పెద్ద సందేశాన్ని వెదకలేం. కానీ ఉత్తరప్రదేశ్, తదితర రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఇమిడి ఉన్న సందేశాన్ని అర్థం చేసుకోకుంటే మాత్రం అది పెద్ద పొరపాటవుతుంది. ఇది కేవలం ఎన్నికల గణాంకాలకు, విజయం తేడాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ రికార్డు విజయం సాధించడం ఒక్కటే కూడా కాదిది. లోక్సభ ఎన్నికల తర్వాత మూడేళ్లకు కూడా బీజేపీ తన సీట్లనూ, ఓట్ల అంకెలనూ నిలబెట్టుకున్నదన్న విషయానికి పరిమితమైంది కూడా కాదు. బీజేపీ రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో స్థానిక ముఖం ఏదీ లేకుండానే బ్రహ్మాండమైన విజయం సాధించిందన్నది అసలు విషయం. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో భారీ వ్యతిరేకత ఏదీ లేనప్పటికీ అది ఈ విజయాన్ని సాధించగలగిందన్నది కూడా ముఖ్యమైన విషయమే. ఈ విజయం కేవలం ఉత్తరప్రదేశ్కు పరిమితమైంది కాదు. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ను తుడిచి పెడుతూ గెలుపు సాధించడం, గోవాలో స్పష్టమైన మెజారిటీని సాధించకుండా కాంగ్రెస్ను కట్టడి చేయడం కూడా చిన్న విషయాలేమీ కాదు. వీటిని ఇటీవల మహారాష్ట్ర, ఒడిశా స్థానిక ఎన్నికల ఫలితాల సంకేతాలతో కలిపి చూసినపుడు యావత్ దేశంలో బీజేపీ వెల్లువ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వెల్లువలో అది ఢిల్లీ, బిహార్లలో పొందిన పరాభవం కూడా కొట్టుకొనిపోయింది. దేశంలో బలాల సమతౌల్యపు సూచిక ఇప్పుడు స్పష్టంగా మోదీ వైపు మొగ్గింది. ప్రధానమంత్రి తన వ్యతిరేకులకన్నా, స్వయంగా తన పార్టీకన్నా కూడా పెద్ద శక్తిగా అవతరించారు. ఇంత పెద్ద విజయాన్ని కేవలం ఎన్నికల వ్యూహపు మహత్య్మం లేదా కూటమి వైఫల్యం అనే కోణంలో మాత్రమే అర్థం చేసుకోలేం. పంజాబ్లో కాంగ్రెస్ గెలుపుతోనూ దీన్ని కప్పి పుచ్చలేం. పంజాబ్లో గెలుపు నకు క్రెడిట్ కెప్టెన్ అమరిందర్ సింగ్కు దక్కుతుంది. నిజానికి పంజాబ్లో బీజేపీ ఓటమికి ముఖ్య కారణం దాని భాగస్వామి అకాలీ దళ్ సాగించిన భ్రష్ట పాలనే. పంజాబ్లో ప్రతి ఒక్కరూ దాన్ని ఏవగించుకో సాగారు. గోవా, మణిపూర్లలో బీజేపీ విజయం సాధించకున్నా, సహజంగా గెలవాల్సిన కాంగ్రెస్ కూడా గెలుపునకు దూరంగానే ఉండిపోయింది. వాస్తవం ఏమిటంటే ఈ ఫలి తాలతో బీజేపీ నరేంద్రమోదీ నాయకత్వంలో ఒక జాతీయ రాజకీయ ఆమోదాన్ని సాధిం చింది. ప్రతి ఎన్నికల విజయపు సారాంశం నైతిక విజయమే కావాలనేమీ లేదు. బీజేపీ అగ్రకులాలనూ, అత్యధిక వెనుకబడిన హిందూ కులాలనూ సమీక రించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి సహా బీజేపీ నేతలందరూ ముస్లిం ద్వేషాన్ని రెచ్చగొట్టారనడంలోనూ అనుమానం అక్కర్లేదు. తన విరోధుల వలెనే బీజేపీ వద్ద కూడా అత్యధిక సంఖ్యాకులైన రైతులు, శ్రామికులు, పేదల కోసం అని చెప్పుకోవడానికి ఏమీ లేదన్నది కూడా నిజమే. అయినా సామాన్య ప్రజల దృష్టిలో బీజేపీ ఇమేజ్ మతతత్వ, కులవాద రాజకీయాలు నెరపే పార్టీగా లేదు. ఉత్తరప్రదేశ్లోని సామాన్య ఓటరు కంటికి ప్రధానమంత్రిలో ఒక నైతిక తేజస్సు కనిపించింది. పేదలకు మేలు జరుగుతుందనే ఆశ కనిపించింది. ఎన్నికల ఫలితాలు బీజేపీయేతర రాజకీయాల దివాలాకోరుతనాన్ని నగ్నంగా నిలబెట్టాయి. మాయావతి తన ఓటమికి ఈవీఎంలను, ఎన్నికల కమిషన్ను తప్పు పడుతుంటే ’ఆడలేక మద్దెల ఓటిదనే’ సామెత గుర్తు రాక మానదు. ఉత్తరప్రదేశ్ ఓటర్లు 2014లో లాగానే సామాజిక న్యాయం పేరుతో సాగుతున్న కులవాద రాజకీయాలను మరోసారి తిరస్కరించారు. అట్లాగే సెక్యులరిజం పేరుతో ముస్లింలను కట్టి ఉంచే రాజకీయాలు ముస్లింలకు అనివార్యమైనప్పటికీ దానికి విస్తృత స్థాయి ఆమోదం లేదు. అటు మణిపూర్లో కాంగ్రెస్ సిద్ధాంతాల పేరుతో తెగల మధ్య విద్వేషాన్ని పెంచిపోషించినా, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ సెక్టేరియన్ అతివాదాన్ని ఆశ్రయించాలని చూసినా అవేవీ సఫలం కాలేదు. పంజాబ్ ఫలితాలను మరో కోణంలో కూడా చూడొచ్చు. ఎన్ని ప్రకటనలు చేసినా, మరెన్ని ఆశలు పెట్టుకున్నా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఒక గుణపాఠం వంటిది. పంజాబ్, గోవాలలో పెద్ద మార్పు వస్తుందనే ఆశతో దేశ దేశాల్లో ఎదురు చూస్తున్న వారందరి హృదయాలూ ఈ ఓటమితో ముక్కలైపోతాయి. పెద్ద పార్టీలు చెప్పే పెద్ద అబద్ధాలను అర్ధసత్యాలతో ఎదుర్కోలేమనేదే ఆ గుణపాఠం. అకాలీ దళ్, కాంగ్రెస్ రాజకీయాలను ఎదుర్కోవాలంటే అది ఆ పార్టీల నుంచే అరువు తెచ్చుకున్న నాయకులతో చేయాల్సిన పనికాదు. వేళ్లూనుకున్న పార్టీలకు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే పార్టీ తనలోని మరకల్ని కప్పిపెట్టలేదు. ప్రత్యామ్నాయ రాజకీయాలనేవి గారడీ విద్యతో నిర్వహించేవి కూడా కాదు. ఉత్తరప్రదేశ్లో ప్రత్యామ్నాయపు అవసరాన్ని ఎత్తిచూపితే, పంజాబ్ అబద్ధపు ప్రత్యామ్నాయాన్ని తోసిరాజంది. నేను కళ్లు తెరిచాను. క్షణకాలం పాటు స్తంభించిన టీవీ తెర మళ్లీ వెలుగులు జిమ్మసాగింది. ఇందిరా గాంధీ చిత్రం అదృశ్యమైంది. రాజకీయ శూన్యపు బాధ అలాగే మిగిలిపోయింది. అయితే ఈ అంధకారంలో సైతం ఒక వెలుగురేఖ కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ రాజకీయపు రేఖ గీయాలనే ఆలోచన మనసులో రూపు దిద్దుకుంటోంది. సామాజిక న్యాయం, సెక్యులరిజం, సోషలిజం, జాతీయవాదాలకు ఒక కొత్త భాషనివ్వాల్సిన అవసరం ఉందని తోస్తోంది. నేపథ్యంలో ఎక్కడో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ చిత్రం కూడా కనిపిస్తోంది. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav -
ఆ గొంతుకలను విందాం!
మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం చట్టపరమైన అనివార్యత కూడా అవసరమే. ఈ దృష్టితోనే 1996లో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ప్రధానమంత్రిని ఒక ప్రశ్న అడగాలని తప్పక ఆశిస్తారు–ఎవరి సలహా ఆశించకుండా ఒక్క దెబ్బతో పెద్ద నోట్లను రద్దు చేసే నిర్ణయం తీసుకోగలిగిన ప్రధాని 21 ఏళ్ల క్రితం ప్రముఖ పార్టీలన్నింటి ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ ప్రతిపాదనను అమలులోకి తెచ్చే సాహసం చేయగలరా అన్నదే ఆ ప్రశ్న. ఈ సందర్భాన్ని యాదృచ్ఛికమని అందామా లేక మరేదైనా సంకేతమా? మొన్న, అంటే మార్చి 8 – అంతర్జాతీయ మహిళా దినం. సరిగ్గా ఈరోజే ఐదు రాష్ట్రాల విధానసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ యాదృచ్ఛికత మనల్ని రాజకీయాల్లో మహిళల స్థితిగతుల గురించి ఆలోచించేలా చేస్తుంది. నానాటికీ తీసికట్టు మొట్టమొదటగా చెప్పాలంటే వారి పరిస్థితి ఏమంత బాగా లేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మొత్తం 4,823 మంది అభ్యర్థులు పోటీకి నిలబడగా వారిలో మహిళల సంఖ్య 445 మాత్రమే. అంటే కేవలం 9 శాతం. వెనుకబాటుతనం మూలంగా ఉత్తరప్రదేశ్లో ఇలా ఉందేమో అని మీరనుకుంటే, పంజాబ్ను తీసుకోండి. ఆ రాష్ట్రంలో పోటీకి నిలబడ్డ మొత్తం 1,145 మంది అభ్యర్థులలో 81 మంది, అంటే 7 శాతం మాత్రమే మహిళలు. ఇది అక్షరాస్యతతో ముడి వడిన సమస్య కూడా కాదు. ఎందుకంటే అక్షరాస్యతలో ఈ ఐదింటి కన్నా ముందున్న రాష్ట్రం గోవా. కానీ అక్కడ కూడా ఎన్నికల బరిలోకి దిగిన 251 మంది అభ్యర్థులలో 18 మంది, అంటే 7 శాతం మాత్రమే మహిళలు. రాజకీయ ఉద్యమాల్లో మహిళ భాగస్వామ్యానికి పేరుగాంచిన ఉత్తరాఖండ్లో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా లేకపోవడం అంతకన్నా ఆందోళన కలిగించే విషయం. ఆ రాష్ట్రంలో 637 మంది అభ్యర్థులలో మహిళా అభ్యర్థులు కేవలం 56 మందే. అంటే 9 శాతం కన్నా తక్కువే. ఇంకా ఘోరమైన విష యమేమిటంటే, మహిళల నాయకత్వంలో సాగే మణిపురీ సమాజం ఈ విష యంలో మిగతా అన్ని రాష్ట్రాల కన్నా వెనుకబడి పోవడం. అక్కడి మహిళలు ఆస్తులకు యజమానులు. మార్కెట్లు నిర్వహిస్తారు. అఫ్స్పా వ్యతిరేక ఉద్య మంలోనూ వారిదే ముందు వరుస. కానీ మణిపూర్లో ఎన్నికల గోదాలోకి దిగిన 265 మంది అభ్యర్థులలో 11 మంది, అంటే 4 శాతం మాత్రమే మహి ళలు. ఇటు మాయావతి నాయకత్వం ఫలితంగానైనా ఉత్తరప్రదేశ్లో మహిళల భాగస్వామ్యంలో పెంపుదల జరగలేదు, అటు ఇరోం షర్మిలా ఎన్నికలలో అడుగుపెట్టినందుకైనా మణిపూర్లో మార్పు రాలేదు. ఇది ఆ ఐదు రాష్ట్రాల సమస్య కాదు రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడం అనేది కేవలం ఈ 5 రాష్ట్రాలకో లేదా ఒక్క అభ్యర్థిత్వానికో మాత్రమే పరిమితమైన సమస్య కాదు. అన్ని రాష్ట్రాలలోనూ మహిళా అభ్యర్థుల నిష్పత్తి దాదాపు ఇదే స్థాయిలో ఉంది. అభ్యర్థులలో మహిళల సంఖ్య ఏ మేరకు తక్కువగా ఉంటుందో, చివరకు ఎన్నికయ్యే ప్రతినిధులలోనూ వారి నిష్పత్తి అదే స్థాయిలో ఉంటుంది. అయితే పురుషులతో పోలిస్తే మహిళా అభ్యర్థులు విజయం సాధించే రేటు కాస్త ఎక్కువ కాబట్టి విధానసభ, లోక్సభల్లో వారి నిష్పత్తి వారికి లభించే అభ్యర్థిత్వం కన్నా కాస్త ఎక్కువే ఉంది. ప్రస్తుతం దేశంలోని అసెంబ్లీలన్నింటిలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో మహిళలు 9 శాతం ఉన్నారు. లోక్సభలో 12 శాతం మహిళా సభ్యులున్నారు. గడచిన ఇరవై ఏళ్లలో ఈ నిష్పత్తిలో కాస్త మెరుగుదల ఉన్నప్పటికీ మొత్తంగా చూసినపుడు పరిస్థితిలో పెద్ద మార్పు లేదనే చెప్పాలి. ఇరవై ఏళ్లుగా పంచాయితీ, ముని సిపల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ లభిస్తుండడం వల్ల వారి ప్రాతినిధ్యం పెరిగినప్పటికీ దీని ప్రభావం విధానసభలలో తగినంత లేదు. కింది స్థాయిలో మహిళా నాయకత్వం రూపొందుతోంది. ఎన్నికల్లో మహిళలు పురు షులతో సమానంగా ఓట్లు వేస్తున్నారు. కానీ అన్ని రాజకీయ పార్టీలూ ఇప్ప టికీ పురుషుల గుప్పిట్లోనే ఉన్నాయి. అసలు సమస్యేమిటంటే రాజకీయ పార్టీ లేవీ మహిళలకు టిక్కెట్లు ఇవ్వడానికి సుముఖంగా లేవు. అసలు వాస్తవాలు వేరు వాస్తవానికి కనిపిస్తున్న ఈ అంకెలకన్నా మహిళల గొంతులు మరీ బల హీనంగా ఉన్నాయి. మహిళా అభ్యర్థులలో, చట్టసభలకు ఎన్నికైన మహిళ లలో ఒక పెద్ద భాగం పలుకుబడి గల రాజకీయ కుటుంబాలకు చెందిన కూతుళ్లదీ, కోడళ్లదీ. వీరికి స్వతంత్రమైన అస్తిత్వం అంటూ ఉండదు. ఏదో ఒక అనివార్య పరిస్థితిలో సదరు కుటుంబం పురుషుడికి బదులుగా మహిళను ముందుకు తీసుకొచ్చి ఎన్నికలలో నిలబెడుతుంది. అయితే ఆ మహిళ పురుషుల అదుపాజ్ఞలలోనే పని చేస్తుంది. ఈ మహిళా ప్రతినిధులకు మహిళా సమస్యలతో గానీ, మహిళా ఉద్యమాలతో గానీ ఎలాంటి సంబంధం ఉండదు. అట్లాగే చట్టసభలకు ఎన్నికయ్యే మహిళలకు మంత్రివర్గాల్లో స్థానం లభించడం కూడా అంతంత మాత్రమే. ఇకపోతే మహిళలు మహిళా లేదా బాల సంక్షేమ శాఖలకు మాత్రమే మంత్రులుగా ఉంటారు తప్ప హోంశాఖ, ఆర్థిక శాఖ వంటి శక్తిమంతమైన మంత్రిత్వశాఖలు వారికి నేటికీ అందని ద్రాక్షలుగానే ఉన్నాయి. ఈ విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ రికార్డు చాలా అధ్వానంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంటులకు ఎన్నికైన మహిళా సభ్యుల అంతర్జాతీయ సగటు 22 శాతంగా ఉంది. ఉత్తర యూరప్ లోని స్కాండినేవియన్ దేశాలలో మహిళా పార్లమెంటేరియన్ల శాతం 40 కన్నా ఎక్కువగా ఉంది. బొలీవియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో కూడా వీరి శాతం 40 దాటింది. ఆఖరుకు మన పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో సైతం మహిళా ఎంపీల సంఖ్య 20 శాతంకన్నా ఎక్కువగా ఉంది. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, మహిళా ప్రాతినిధ్యం అనే అద్దంలో భారత ప్రజాస్వామ్యపు కురూపితనం స్పష్టంగానే కళ్లకు కడుతుంది. ప్రజాస్వామ్యాన్ని కుదుపుతున్న వివక్ష మన చట్టసభలలో మహిళల గొంతు బలహీనంగా ఉండడం వల్ల దాని ప్రభావం కేవలం మహిళల పైనే కాకుండా మొత్తం ప్రజాస్వామ్యం పైనే పడు తోంది. ఎక్కువ మంది మహిళలు ఎన్నికైనంత మాత్రాన మన పార్లమెంటు, అసెంబ్లీలు ఎకాయెకిన గౌరవప్రదంగా, నిజాయితీకి నిలువుటద్దంలా మారి పోకపోవచ్చు కానీ, వారి ఉనికి వల్ల కొంత ప్రభావమైతే తప్పక పడుతుంది. పార్లమెంటు, విధానసభల సభ్యులు మహిళలు అయినప్పుడు మహిళలపై నిత్యం జరిగే హింస, లైంగిక వేధింపుల కేసుల విషయంలో పోలీసులపై, అధికారులపై తప్పక కొంత ఒత్తిడి పనిచేస్తుంది. కనీసం అధికార కారిడార్లలో ఊడలు దిగిన మగ పెత్తనం కొంతైనా తగ్గుతుంది. మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్న చోట్లలో రేషన్ కొరత, నీటి కొరత లేదా మద్యపానం పెచ్చ రిల్లడం వంటి అంశాలపై చర్చ తప్పకుండా జరుగుతుంది. మరేది జరగక పోయినా, కనీసం సాధారణ మహిళలలో తాము తమ సమస్యను ఎంపీ, ఎమ్మెల్యే లేదా అధికారి దృష్టికి తీసుకెళ్లగలమనే ధైర్యమయితే పెరుగుతుంది. ఇక అసలు విషయం ఏమిటంటే, పార్లమెంటు, విధానసభల్లో మహిళా ప్రతినిధుల సంఖ్య పెరిగేదెలా? ఇందుకోసం రాజకీయాల స్వభావ స్వరూ పాల్లో మార్పు రావాలన్నది తేటతెల్లం. నేతల సంస్కారంలో, పార్టీల సంస్కృ తిలో మార్పు రావాలి. అయితే ప్రపంచ దేశాల అనుభవాలను బట్టి చూస్తే ఇది మాత్రమే సరిపోదు. మహిళా రిజర్వేషన్ బిల్లును తేవాల్సిందే మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం చట్టపరమైన అనివార్యత కూడా అవసరమే. ఈ దృష్టితోనే 1996లో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. లోక్సభ, విధానసభలలో 33 శాతం సీట్లు మహి ళలకు కేటాయించాలనే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. అయితే ఈ బిల్లులో కొన్ని లోపాలున్నాయి. ఇరవై ఏళ్ల క్రితం నేను కూడా ఈ లోపాలను ఎత్తి చూపుతూ రాశాను. వాటిని సవరించాలని డిమాండ్ చేశాను. అయితే గడచిన 21 ఏళ్లలో ఈ దిశగా జరిగిన ప్రగతి శూన్యం. ఈ బిల్లు ఎప్పుడు పార్లమెంటు ముందుకు వచ్చినా ఏదో ఒక నాటకానికి తెరలేపి లేదా ఏదో ఒక సాకు చెప్పి దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. అనేక చర్చోపచర్చల తర్వాత 2010లో దీనిని రాజ్యసభలో ఆమోదించారు. కానీ ఆ తర్వాతి నాలుగేళ్లలో ఇది లోక్ సభలో చర్చకు నోచుకోలేదు. చివరకు లోక్సభ కాలవ్యవధి పూర్తి కావడంతో బిల్లు రద్దయిపోయింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలు ప్రధాన మంత్రిని ఒక ప్రశ్న అడగాలని తప్పక ఆశిస్తారు–ఎవరి సలహా ఆశించకుండా ఒక్క దెబ్బతో పెద్ద నోట్లను రద్దు చేసే నిర్ణయం తీసుకోగలిగిన ప్రధాని 21 ఏళ్ల క్రితం ప్రముఖ పార్టీలన్నింటి ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ ప్రతిపాదనను అమలులోకి తెచ్చే సాహసం చేయగలరా అన్నదే ఆ ప్రశ్న. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 , Twitter : @_YogendraYadav -
న్యాయపీఠంపై పేలిన బాంబు..!
సందర్భం అరుణాచల్ప్రదేశ్లో బర్తరఫ్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునఃస్థాపించే కేసులో ఇద్దరు న్యాయమూర్తుల బంధువుల ద్వారా తనను 86 కోట్ల లంచం అడిగారని నాటి సీఎం కలిఖో పుల్ పేర్కొన్నారు. దేశ అత్యున్నత న్యాయ పీఠపు గౌరవానికి ఇది భంగకరం. ఢిల్లీ అధికార పీఠంలో ఒక వార్త కలకలం రేపుతోంది. అక్కడ ఓ మహిళ అరవై పేజీల బాంబుతో తచ్చాడుతోంది. బాంబులోంచి పొగ వెలువడుతోంది. ఎవరూ దాని నుంచి దృష్టి మరల్చలేకపోతున్నారు. అలాగని దాన్ని ముట్టుకునే సాహసం కూడా ఎవరూ చేయలేక పోతున్నారు. ఈ బాంబు పేలితే ఎవరెవరు బలి అవుతారోననేదే అందరిలో నెలకొన్న ఆందోళన. ఆ బాంబు అరుణాచల్ప్రదేశ్ మాజీ సీఎం కలిఖో పుల్ వదిలి వెళ్లిన సూసైడ్ నోట్. ఈటానగర్లోనైనా, ఢిల్లీలోనైనా, ఇటు ప్రభుత్వాలూ, అటు న్యాయవ్యవస్థా కలిఖో వదిలి వెళ్లిన సూసైడ్ నోట్ను మింగలేక, కక్కలేక ఇబ్బంది పడుతున్నాయి. కలిఖో పుల్ కాంగ్రెస్కు చెందినవాడు. 2016 ఫిబ్రవరిలో కాంగ్రెస్ సీఎం నబామ్ టుకీకి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎత్తి కేంద్ర ప్రభుత్వ మద్దతుతో సీఎం అయ్యారు. సుప్రీం కోర్టు అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలనను, కలిఖోను గద్దెనెక్కించే నిర్ణయాన్నీ రాజ్యా ంగవిరుద్ధమైనవిగా ప్రకటించింది. తర్వాత కలిఖో ఆత్మహత్యకు పాల్ప డ్డారు. ఆయన శవం పైకప్పుకు వేలాడుతుండగా, నేలపై చుట్టూతా ఒక నోటుకు చెందిన పది ప్రతులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ‘మేరే విచార్’ (నా భావనలు) అనే శీర్షికతో హిందీలో టైప్ చేసిన ఆ అరవై పేజీల నోట్లో ప్రతి పేజీ పైనా మృతుడి సంతకం ఉంది. అంటే దీని విశ్వసనీయత నిర్వివాదమన్నమాట. (దీని పూర్తి పాఠం www.judicial reforms.org లో ఉంది.) కలిఖో పేల్చిన ఈ బాంబులో అసలైన పేలుడు పదార్థం నడి మధ్యలో ఉంది. ప్రజా జీవితంలో పాతుకుపోయిన అవినీతిని బట్ట బయలు చేస్తూ కలిఖో రాసిన భాగాల్లో ఉంది. అవన్నీ నిజమని భావించలేం. అయినా, రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం, నకిలీ బిల్లులు, డబుల్ బిల్లుల చెల్లింపులు, పట్టుబడినప్పుడు ఫైళ్లను మాయం చేసేయ డం, వందల కోట్ల రూపాయల్ని దిగమింగడం వంటి వాటిపై ఆయన రాసిన కథనాలను మాత్రం ఉత్తుత్త మాటలుగా కొట్టిపారెయ్యలేం. కాంగ్రెస్లో రెండు దశాబ్దాల అనుభవంతో పుల్ చేసిన తుది నిర్ధారణ చేదు అనుభవంగానే ఉంది.‘కాంగ్రెస్ పార్టీ తన ఖజానాకు కావలసిన డబ్బులు పంపే వాళ్లకే పెద్ద పీట వేస్తుంది. వాళ్లనే నాయకుల్ని చేస్తుంది. అలా వారు ఖజానాలోంచి ప్రజల సొమ్మును కొంత దోచుకొని అధిష్టానానికి అందజేస్తూ ఉండాలి, అలా వారికి ఆదాయం సమకూ ర్చాలి. ‘ప్రస్తుత రాష్ట్రపతి సహా కాంగ్రెస్ బడా నేతలందరి పేర్లను ఉద హరిస్తూ ఎవరెవరికి ఎంతేసి డబ్బు ఇచ్చారో ఆ నోట్లో కలిఖో రాశారు. కలిఖో చేసిన ఆరోపణల్లో అన్నింటికన్నా తీక్షణమైన భాగం న్యాయ వ్యవస్థకు సంబంధించింది. ఆయన సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులను, ఇద్దరు ప్రస్తుత న్యాయమూర్తులను పేర్కొంటూ వారిపై అవినీతి ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి సంబంధిం చిన అనేక కేసులలో పెద్ద మొత్తంలో లంచాలు తీసుకొని పలు అవినీతి కేసుల్ని కొట్టివేశారన్నది ఆ ఆరోపణల సారాంశం. అంతేకాదు, అరుణా చల్ప్రదేశ్లో బర్తరఫ్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునఃస్థాపించే కేసులో ఇద్దరు న్యాయమూర్తుల బంధువుల ద్వారా తనను 86 కోట్ల లంచం అడిగారని కూడా పుల్ పేర్కొన్నారు. ఈ నలుగురు న్యాయ మూర్తులలో ఇద్దరిపై ఇప్పటివరకు ఎలాంటి మచ్చా లేదు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో కలిఖో కక్ష పెంచుకొని ఆరో పణలకు పూనుకున్నారేమో. అయినా సరే, చట్టం మృతుడి చివరి వాంగ్మూలాన్ని లేదా సూసైడ్ నోట్ను సాక్ష్యంగా పరిగణిస్తుంది. పైగా ఇది దేశ అత్యున్నత న్యాయ పీఠపు గౌరవానికి సంబంధించిన విషయం కూడా. కలిఖో ఆత్మహత్య తర్వాత సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ ఆదేశించినప్పటికీ విచారణ ఎందుకు జరగలేదు? కేవలం కాంగ్రెస్ నేతల పేర్లున్న ఈ నోట్పై విచారణ జరిపించడానికి బీజేపీ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోంది? ఆత్మహత్య చేసుకోడానికి ముందు కలిఖో రాసిన నోట్పై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ కేంద్రానికి సిఫార్సు చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే ఢిల్లీలోని చాలా మంది పాత్రికేయులకు బిర్లా– సహారాల వద్ద జప్తు చేసుకున్న దస్తావేజులు అందుబాటులోకి వచ్చాయి. బిర్లా– సహారా డాక్యుమెంట్లపై విచారణ జరిపించాలని ప్రశాంత్ భూషణ్ అక్టోబర్లో డిమాండ్ చేశారు. సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి ఆలోచిస్తోంది. అదే సమ యంలో ఢిల్లీలోని ఒక పెద్ద వకీలు ఇంటిపై సోదా జరుగగా కోట్ల రూపాయల అక్రమ నగదు బైటపడింది. ఆ సొమ్ములో ఒక భాగం ఒక పెద్ద న్యాయమూర్తి కుమారుడిదని ఆ వకీలు చెప్పినట్టుగా ఆరోపణలు. నవంబర్–డిసెంబర్ నెలల్లో సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఒకనాటి తీర్పులనే పక్కన పెడుతూ, సహారా– బిర్లా కేసులో ఇలాంటి డైరీలపై, దస్తావేజులపై విచారణ జరపలేమనే ఒక కొత్త వ్యాఖ్య మొదలుపెట్టింది. జనవరిలో జస్టిస్ కేహర్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఒక కొత్త బెంచ్ బిర్లా–సహారా కేసును కొట్టివేసింది. సుప్రీంకోర్టు, ప్రభు త్వాల మధ్య ప్రతిష్టంభన తొలగిపోనున్నదనే వార్తలూ రాసాగాయి. ఈ ఘటనలన్నింటికీ పరస్పర సంబంధం లేకపోవచ్చు. ఇవన్నీ ఒక క్రమంలో జరగడం కేవలం యాదృచ్ఛికమే కావచ్చు కూడా. కొద్ది రోజుల క్రితమే ప్రధాన మంత్రి తన వద్ద విపక్ష నేతలందరి చిట్టాలు న్నాయని హెచ్చరిక స్వరంలో వ్యాఖ్యానించడం విదితమే. బహుశా ఆయన వద్ద మరి కొంతమంది చిట్టాలు కూడా ఉండొచ్చు. కలిఖో పుల్ అనే బాంబు పట్ల ఇంత మౌనం వహించడం వెనుక ఇదే కారణం కావచ్చునేమో! ప్రస్తుతం బాంబు ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ కార్యాల యంలో ఉంది. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన ఒక తీర్పు ప్రకారం న్యాయ మూర్తులపై విచారణకు ఆదేశాలు జారీ చేయడానికి ముందు ప్రధాన న్యాయమూర్తి సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరోపణ ప్రధాన న్యాయమూర్తి పైనే అయితే రాష్ట్రపతి ఇతర న్యాయ మూర్తుల సలహా కోరతారు. అయితే ఇందులో ఈసారి ప్రధాన న్యాయ మూర్తి, రాష్ట్రపతి ఇరువురి పేర్లూ ఉన్నాయి కాబట్టి కలిఖో పుల్ భార్య ఉపరాష్ట్రపతిని కలసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే అక్కడైనా ఈ రహస్యంపై పరదా తొలగిపోతుందా లేక దీనికి బిరడా మరింతగా బిగించేస్తారా అన్నది వేచి చూడాల్సిందే. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav -
హిందీ వచన రచనపై తాజా గాలి!
సందర్భం ప్రచురణా ప్రపంచంలో మౌలికత్వం, పెట్టుబడి, లాభాల మధ్య సంబంధాన్ని అనుపమ్ మిశ్రా ఎంతో అమాయకంగా సవాలు చేశాడు. ఆయన ‘ఆజ్ భీ ఖరే హై తాలాబ్’ను ఎంతమంది ఎన్నిసార్లు ప్రచురిం చారో! డజన్ల కొద్దీ ప్రచురణలతో అచ్చువేసిన ఈ పుస్తకం కాపీలను కొన్ని లక్షల్లో కొన్నారు, చదివారు. ఎలాంటి శబ్దం చేయకుండా మెల్లగా ఆయన నా మనసు గదిలోకి ప్రవేశించి కూర్చుండి పోయాడు. సరిగ్గా అట్లాగే కుర్చీలేవీ కదల్చ కుండా, చడీ చప్పుడు లేకుండా మన కాలం గదిలోంచి నిష్క్రమించాడు అనుపమ్ మిశ్రా. ఆయన ఉన్నాడన్న భావం నెమ్మదిగా రూపు దిద్దుకున్నట్టుగానే, ఆయనిక లేరన్న వాస్తవం కూడా గత రెండు నెలలుగా తరచూ మనసును మెలి పెడుతోంది. ఇపుడాయనను మన మధ్య నిలిపి ఉంచేదెలా అన్న ప్రశ్న నాలో మళ్లీ మళ్లీ తలెత్తుతోంది. అనుపమ్ మిశ్రా గురించి నేను దఫదఫాలుగా తెలుసుకున్నాను. మొట్టమొదట ఆయన మాటల్ని విన్నాను. ఆ తర్వాత ఆయన భావాలతో పరిచయం కలిగింది. తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని స్పృశించగలిగాను. ‘ఆజ్ భీ ఖరే హై తాలాబ్’ (నేటికీ నిటారుగా నిలిచిన చెరువులు)లో ఆయన రూపవిన్యాసం మొదట నన్నాకర్షించింది. తీర్చిదిద్దినట్టుండే ఫాంటు, సందర్భోచితంగా వేసిన అందమైన బొమ్మ, మనస్సును హత్తు కునే లేఅవుట్. నేను మరాఠీ, బంగ్లా భాషల్లో అనేక అందమైన పుస్తకాల్ని చూశాను. కానీ హిందీ పుస్తకాల డిజైన్ మాత్రం వాటిలోని భాషా దారిద్య్రానికి ప్రచార ప్రకటనలాగే ఉండేది. కానీ అనుపమ్జీ లోని సౌందర్య స్పృహ వెనుక ఉత్తుత్త మెరుగులు లేదా రంగుల్ని ప్రదర్శించి చూపాలన్న యావ ఉండేవి కాదు. కవర్ మినహా మిగతాదంతా పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో రూపొందిన ఆ పుస్తకం సాదాసీదాతనానికీ, సౌందర్యానికీ అద్భుతమైన నమూనా అని చెప్పొచ్చు. ఆ తర్వాత నా చూపు పుస్తకంలోని భాష వైపు మళ్లింది. మనం ఎట్లా మాట్లాడుతామో సరిగ్గా అట్లాగే రాయాలనే నియమాన్ని కచ్చితంగా పాటిస్తూ అనుపమ్ మిశ్రా రాసిన ప్రతి వ్యాసం హిందీ వచనానికి మేలైన ఉదాహరణగా నిలు స్తుంది. సంక్లిష్ట పదజాలం, అరువు తెచ్చుకున్న సామెతలు, సమతుల్యం లోపించిన వాక్యాల భారంతో కుంగిపోతున్న హిందీ వచన రచనపై వీచిన చల్లటి తాజా గాలి అనుకోవచ్చు. ఇంగ్లిష్లో రాసే వాళ్లకు ‘ది ఎకా నమిస్ట్’ శైలిని అలవర్చుకోండని సలహా ఇచ్చినట్టుగానే హిందీలో రాసే ప్రతి యువ రచయితకూ అనుపమ్ మిశ్రా రాసినవి చదవాలని నేను సిఫార్సు చేస్తాను. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించేందుకు ఏర్పాటైన సభలో తెలిసిందేమిటంటే భాషకు సంబంధించి అనుపమ్జీ ఇచ్చిన సలహాలతో సోపాన్ జోషీ త్వరలో ఒక ‘సై్టల్ షీట్’ తయారు చేయబోతు న్నారట. ఆయన ప్రేరణతో హిందీ రచనారంగంలో ఒక ప్రత్యేక శాఖ కూడా ఏర్పాటు కావచ్చనే ఆశ నాకు కలిగింది. ఆ తర్వాత కవర్ పేజీ వెనుక భాగంలో ఈ పుస్తకానికి కాపీరైట్లు ఏవీ లేవని పేర్కొన్న ప్రకటన కనిపించింది. ఎవరు కావాలనుకుంటే వాళ్లు దీన్ని అచ్చు వేసుకోవచ్చు. అయితే ఆ సమాచారం తెలిపితే రచయిత ఆనందిస్తాడు. అలా అనుపమ్ మిశ్రా ప్రచురణా ప్రపంచంలో మౌలి కత్వం, పెట్టుబడి, లాభాల మధ్య సంబంధాన్ని ఎంతో అమాయ కంగా సవాలు చేశాడు. ఆయనిచ్చిన ఈ పిలుపు వృ«థా ఏమీ కాలేదు. ఆయన ‘ఆజ్ భీ ఖరే హై తాలాబ్’ను ఎంతమంది ఎన్ని సార్లు ప్రచురించారో! డజన్ల కొద్దీ ప్రచురణలుగా, ముద్రణలుగా అచ్చువేసిన ఈ పుస్తకం కాపీ లను కొన్ని లక్షల్లో కొన్నారు, చదివారు. హిందీ ప్రచురణల చరిత్రలో ఒక గంభీరమైన అంశంపై చేసిన సాహిత్యేతర రచనకుగాను ఇంత ఎక్కువ సంఖ్యలో పాఠకుల ఆదరణకు నోచుకున్న పుస్తకం మరొ కటి లేదేమో! అనుపమ్జీ భాష నుంచి నేను ఆయన భావాల వైపు మళ్లాను. ‘ఆజ్ భీ ఖరే ౖహె తాలాబ్’, ఆ తర్వాత ఆయన రాసిన ‘రాజస్తాన్ కీ రజత్ బూందే’ (రాజస్తాన్ రజత బిందువులు), ఇంకా అనేక వ్యాసాల్లో నీటి విషయంలో సాంప్రదాయిక అవగాహనేమిటో వివరించి చెప్పారు. రాజ స్తాన్ వంటి నీటికి కటకటలాడే రాష్ట్రంలో ఆయన నీటిని కాపాడుకోవడం, నిల్వ చేసుకోవడం, వాడకానికి సంబంధించిన అనేక పద్ధతులను కని పెట్టారు. మన మనుగడ నిలబడాలంటే నీటిని కాపాడుకోవాల్సిందే. ఇందుకోసం ఆధునిక ఇంజనీరింగ్కు బదులు సాంప్రదాయిక జ్ఞానాన్ని నేర్చుకోవాలన్నది ఆయన అవగాహన. ఈ అవగాహన నుంచి ప్రేరణ పొందిన రాజేంద్రసింగ్ వంటి ఎంతోమంది కార్యకర్తలు పూనుకొని పురా తన చెరువులు, కొలనులు, బావులు, జోహడ్ (వాన నీటిని నిల్వ చేసి ఉంచే కుంటలు)లను పునరుద్ధరించారు. మృతప్రాయంగా మారిన అనేక నదులు ఈ పుస్తకం ఫలితంగా మళ్లీ జలకళను సంతరించుకోగలిగాయి. అయితే నీరు ఆయన రచనల్లో ఒక వస్తువు మాత్రమే. అనుపమ్జీ భావాలు మొత్తం సాంప్రదాయిక అవగాహనకూ, కౌశలానికీ వర్తిస్తాయి. ఆయన ఆలోచనలకు కేంద్రబిందువుగా ఉన్నది సమాజం–స్వావలంబన, శ్రమైకతత్వం, జ్ఞానోన్ముఖతలతో కూడిన సమాజం. తన కష్టసుఖాలను అర్థం చేసుకోవడానికి పరులపై ఆధారపడాల్సిన అవసరంలేని సమాజం. సాంప్రదాయిక సమాజా నికి సంబంధించిన ఈ అవగాహన కాల్పనికతగా తోచవచ్చు. కానీ ‘సాఫ్ మాథే కా సమాజ్’ (సదాలో చనతో కూడిన సమాజం) అనే ఊహ సమానత్వం, న్యాయం అనే స్వప్నాలతో పెనవేసుకున్నదే. మిశ్రా వ్యక్తిత్వం గురించి నేను చాలా ఆల స్యంగా తెలుసుకోగలిగాను. ఆయన హిందీ మహా కవి భవానీ ప్రసాద్ మిశ్రా కుమారుడు. కానీ ఈ విషయం లేదా ఈ భావన ఆయన మాటల్లో ఎక్కడా ధ్వనించేది కాదు. బిడియం, మర్యాద, సత్యనిష్ఠ లతో పాటు ప్రచారానికీ, కపటత్వానికీ ఆమడ దూరంలో నిలిచే స్వభావం ఆయనది. అనుపమ్జీలోని సాదా సీదాతనం మనల్ని హత్తుకుంటుంది. తన పుస్తకాల్లాగే అనుపమ్జీ సాదాసీదా వ్యవ హారశైలిలో సాదరత, రమ్యత, మర్యాదతనం కలగలిసి ఉన్నాయి. తన పరిమితులేమిటో స్పష్టంగా గ్రహించడం, ఆ పరిమితుల లోపలే తన బాధ్యతలను స్వీకరించడం, దృఢ సంకల్పం ఆయనలో చూడొచ్చు. డిసెంబర్ 19న అనుపమ్జీ కనుమూసిన తర్వాత ఇలాంటి నిరు పమాన వ్యక్తి జ్ఞాపకాలను ఎలా సజీవంగా నిలిపి ఉంచాలా అని పదే పదే ఆలోచిస్తున్నాను. ప్రతి చోటా అనుపమ్జీ పేరిట ఒక బావిని తవ్వాలి. అలా ఆ నీటి ఊటలో ఆయన సజీవంగా నిలిచిపోతాడు. లేదా భారతీయ భాషలలో సాంఘికశాస్త్రాన్ని మళ్లీ రచించడం కోసం ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలి. అలా ఆ భావజాల స్రవంతిలో ఆయన ఎల్ల ప్పుడూ సజీవంగా ఉండిపోతాడు. లేదా సాదాసీదాతనం, రమ్యత, సంకల్పంతో నిండిన ఉద్యమాన్నొకదాన్ని నిర్మించి ఆయన శక్తిని మనలోకి ఇంకించు కోవడం ద్వారా అనుపమ్జీని సజీవంగా నిలుపుకోవచ్చు. అనుపమ్జీ మొఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. బహుశా వెళ్తూ వెళ్తూ ‘తొందరే ముంది, తీరిక దొరికినప్పుడే నెమ్మదిగా ఆలోచించుకోవచ్చు’ అని అంటూ సెలవు తీసుకున్నాడేమో! (నిరుపమాన హిందీ రచయిత అనుపమ్ మిశ్రాకు నివాళి) - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav -
అసలు ఓటమి భారతీయతదే!
సందర్భం జేఎన్యూలో జరిగిన ఫిబ్రవరి 9 సంఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాకు ఇందోర్ నుంచి వచ్చిన ఒక టెలిఫోన్ కాల్ గుర్తుకొచ్చింది. ఆ రోజుల్లో దేశమంతటా దేశభక్తులకూ, దేశద్రోహులకూ ముద్రలు వేసే క్రమం జోరుగా సాగుతోంది. జేఎన్యూయైట్లూ, భుజానికి జోలెసంచీలు వేలాడేసుకునేవాళ్లూ, గడ్డం కలిగి ఉన్న వాళ్లూ వేధింపులకు గురవుతున్న రోజులవి. నేను కూడా టీవీ చర్చల్లో పాల్గొన్నాను. రెండు బృందాలకు విడిగా మూడో దృక్పథాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాను. ఆ సమయంలోనే ఆ కాల్ వచ్చింది. ‘నేను మిమ్మల్ని బాగా గౌరవిస్తాను. మీరు చాలా అర్థవంతంగా, గంభీ రంగా మాట్లాడుతారు. మీరు ఏదో ఒక పార్టీ పక్షం వహించడానికి బదులు దేశ ప్రయోజనాలనే పరమావధిగా భావిస్తారు. కానీ జేఎన్యూ సమస్యలో మీరు దేశద్రోహుల వైపు ఎందుకు నిలబడ్డారు?‘ ఇదీ అటువైపు నుంచి వచ్చిన ప్రశ్న. కాలర్ నిజంగానే బాధలో ఉన్నారు. నేను ఈ సమస్యకు సంబంధించిన వాస్త వాల్ని ఆయనకు తెలిపాను. ఫిబ్రవరి 9న జేఎన్యూలో జరిగిందని చెబుతున్న వాటి పట్ల అంత గట్టి నమ్మకంతో ఎందుకున్నారని ప్రశ్నించాను. కోర్టు ఆవ రణలో కన్హయ్యకుమార్పై దాడి చేసి కొట్టిన సంఘటన గురించి అడిగాను. అట్లాగే జాతీయవాదం విషయంలో జేఎన్యూకు చెందిన చాలా మంది అభిప్రాయంతో నాకు ఏకీభావం లేదని కూడా స్పష్టం చేశాను. అయితే ఆ సంఘటనలకు సంబంధించిన వాస్తవాల ఆధారంగా నేను వాళ్లతో ఏకీభవి స్తాను. ఏం చెప్పినా నా మాటలు కాలర్ను సంతృప్తి పర్చలేకపోయాయి. ఎందుకంటే అప్పుడాయన వాస్తవాలను పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. ‘ఒకవైపు భారతమాతకు అవమానం జరుగుతుంటే మీరు అవీ ఇవీ చెబు తున్నారు. అసలు ప్రశ్నపై మీరే వైపు నిలబడి ఉన్నారు?‘ అని సూటిగా అడిగారాయన. ఆయన ఆవేశంతో ఉన్నట్టుగా అనిపించింది. మరెప్పుడైనా శాంతంగా మాట్లాడుకోవచ్చని భావించాను. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఆయనతో సంభాషణ జరగలేదు. ఇందోర్ గుర్తుంది కానీ ఫోన్ చేసిన వ్యక్తి పేరు గానీ, అతని ఫోన్ నంబరు గానీ ఏవీ నా దగ్గర లేవిప్పుడు. ఇప్పుడు, ఈ సంఘటన జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నేను మనసులోనే ఆయనతో సంభాషిస్తున్నాను. అదేమిటో మీరూ వినండి. నిరుడు మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చాలా ఆవేశంగా ఉన్నారు కదా. కానీ జేఎన్యూలో జరిగిన పరిణామాల్లో చివరకు వెల్లడైన వాస్తవాలేమిటో చూడండి. మీరు ఏ వీడియో టేపు గురించి చాలా ఆవేశంగా మాట్లాడారో, చివరకు ఆ టేపు అసలైంది కాదనీ, నకిలీదనీ తేలిపోయింది. దానిని తారుమారు చేసి అందులో రెచ్చగొట్టే మాటల్ని జొప్పించారు. ఇప్పటికి సంవత్సర కాలం గడచిపోయింది కదా. జేఎన్యూ విద్యార్థి నేతలు నిజంగానే భారత్కు వ్యతి రేకంగా నినాదాలు చేసినట్టయితే పోలీసులు వాటికి సంబంధించిన సాక్ష్యాలను ఇంకా కోర్టుకు ఎందుకు సమర్పించలేకపోయారో మీరే ఆలోచించండి. మరో వైపు, కన్హయ్యకుమార్పై కోర్టు ఆవరణలో పట్టపగలే దాడి చేసి కొట్టారు కదా. సంవత్సరం గడచినా పోలీసులు నేరస్థులపై కేసు నమోదు చేయడానికి కూడా సిద్ధపడడం లేదు. అందుకే ఇదంతా మీ లాంటి వారిలో భావావేశాలను రెచ్చగొట్టడం కోసమే ఒక చిన్న విషయాన్ని అనవసరంగా ఒక పెద్ద వివాదంగా సృష్టించారేమో ఆలోచించండి. వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేశారేమో? ఆ సంఘటనకు సంబంధించిన వాస్తవాలను లేవనెత్తడం ద్వారా నేను విష యాన్ని పక్కదారి పట్టిస్తున్నానని మీరు భావించవద్దు. విషయం కేవలం వాస్తవ సంఘటనలకు మాత్రమే పరిమితమైంది కాదని మీరన్న మాటలు నాకు గుర్తు న్నాయి. దీన్ని నేను అంగీకరిస్తాను. మీ దృష్టిలో ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన విషయం కూడా కాదు. ప్రస్తుత పరిస్థితిలో బాహాటంగా చేసే దేశ వ్యతిరేక నినాదాలను పట్టించుకోకుండా ఉండగలిగే స్థితిలో మనం లేమన్న విష యాన్ని నేనూ అంగీకరిస్తాను. ఒక పెద్ద దేశం.. ఆత్మవిశ్వాసం తొణకిసలాడే దేశం ఇలాంటి చర్యల పట్ల ఊరకే నవ్వేసి ఉండిపోగలుగుతుంది. కానీ మన మింకా అక్కడి వరకు చేరుకోలేదు. మనం జాతి పట్ల విధేయంగా ఉన్నామా, లేదా అన్నదే అసలు సమస్య అని మీరన్నారు. ఇదే ప్రశ్నను నేను మరో విధంగా అడుగుతాను–జాతి పట్ల మనం ఏ భావాన్ని కలిగి ఉండాలి? దేశంపట్ల అభి మానానికి ఉండాల్సిన ధర్మాలేమిటి? నా అభిప్రాయాలను గౌరవిస్తానని మీరన్నారు. కాబట్టి వాటిని ఒప్పు కున్నా, ఒప్పుకోకున్నా కనీసం వాటిని శ్రద్ధగా విననైతే వింటారుగా! నిజానికి గత సంవత్సరం జేఎన్యూ చర్చలో భాగమైన రెండు సమూహాలూ దేశీయ లక్షణాలు కలిగినవి కావు. తమను తాము జాతీయవాదులుగా ప్రకటించుకున్న వాళ్లదీ, జాతివ్యతిరేకులనే ముద్ర పడిన వాళ్లదీ ఇద్దరివీ అరువు తెచ్చుకున్న భావ జాలంపై ఆధారపడినవే. జాతి గురించి డబ్బాకొట్టుకున్న వాళ్లు చెబుతున్న జాతీయవాదపు అవగాహన యూరప్ భావజాలానికి నకలు మాత్రమే. జాతీయ వాదంపై సాగిన ఈ చర్చలో భారతీయత అన్నది పూర్తిగా కనిపించకుండా పోయింది. నిజానికి దేశభక్తులు లేదా జాతీయవాదుల బృందం అంధ భక్తిని డిమాండ్ చేస్తూ వచ్చింది. నా దేశం సరైందేనా, కాదా అన్న ప్రశ్ననే లేవనెత్తగూడదు. దేశం పట్ల అభిమానం అంటే జాతికి సంబంధించిన ఏ విమర్శనైనా వ్యతిరేకించడమే. నా దేశం గొప్పది, ఎందుకంటే ఇది నాది కాబట్టి. భారతదేశాన్ని మాతృ భూమిగా, పితృభూమిగా, శ్రేష్ఠభూమిగా అంగీకరించేవాళ్లే దేశానికి యజమా నులు. మిగిలిన వాళ్లంతా కిరాయికి ఉంటున్న వాళ్లే. నిరుటి చర్చలో ఈ సమూ హం చాలా దూకుడుతనాన్ని ప్రదర్శించింది. గెలుపు తనదేనన్న తీరులో వ్యవహ రించింది. మిగిలిన వారందరి దేశభక్తినీ అది పరీక్షకు పెట్టింది. మరో సమూహానికి అసలు ఏ పేరూ లేదు. దానిని ఓసారి సెక్యులర్ అని పిలిచారు. మరోసారి వారు తమను తాము లిబరల్స్ (ఉదారవాదులు) అని చెప్పుకున్నారు. మొదటి సమూహం వీరిని జాతిద్రోహులని అన్నది. కానీ వారిని జాతి అలీనులు అనడం సరిగ్గా ఉంటుంది. వాళ్ల అభిప్రాయం ప్రకారం జాతి అనేది మన అపరిమిత విధేయతకు హక్కుదారేమీ కాదు. కుటుంబం నుంచి విశ్వాంతరాల దాకా మనమంతా వేర్వేరు విభాగాల్లో సభ్యులం మాత్రమే. ప్రతి స్థాయిలోనూ మనపై బాధ్యతలుంటాయి. ఏదో ఒక విభాగాన్ని మాత్రమే కళ్లు మూసుకొని గుడ్డిగా సమర్థించడమేంటి? ఈ సమూహానికి జాతి పట్ల వ్యతిరేకత ఏమీ లేదు కానీ దానిలో గందరగోళం లేదా సంకోచం ఉందని చెప్పొచ్చు. గత సంవత్సరం జరిగిన చర్చలో ఈ సమూహం ఆత్మరక్షణాయుతంగా, ఓటమికి గురైనట్టుగా వ్యవహరించింది. అయితే జాతీయవాదంపై ఈ రెండు బృందాల అవగాహనా యూరప్ నుంచి అరువు తెచ్చుకున్నదే. 19, 20 శతాబ్దాల్లో జాతీయవాదం అనేది ఒక సంకుచిత భావజాలంగా ఉండింది – ఒక జాతి, ఒక సంస్కృతి, ఒక భాష, ఒక మతం, ఒక రేస్. యూరప్కు జాతీయ సమైక్యత అంటే ఏకరూపకత మాత్రమే. నిరుటి చర్చలో తమను తాము జాతీయవాదులుగా చెప్పుకున్న వాళ్లు జర్మనీ, ఇటలీలకు చెందిన ఈ సంకుచిత జాతీయవాదాన్నే భారతదేశంలో కాపీ కొట్టా లని భావించారు. నిరుడు జాతీయవాదాన్ని వ్యతిరేకించిన బృందం జాతీయ వాదం తప్పనిసరిగా సంకుచితత్వమే అవుతుందని భావించింది. ఈ రెండు బృందాలూ అరువు తెచ్చుకున్న భావజాలం, అనారోగ్యకరమైన మనస్తత్వానికి చెందిన రెండు ముఖాలు మాత్రమే. నిజమైన జాతీయ లక్షణాలను అర్థం చేసుకోవడానికి మనం యూరప్కు వెళ్లాల్సిన అవసరం లేదు. భారత స్వాతంత్య్ర సంగ్రామానికి చెందిన జాతీయ వాదం దేశాభిమానంపై మనకు మెరుగైన అవగాహనను అందిస్తుంది. ఈ జాతీయవాదంలో జాతీయ సమైక్యత అంటే అర్థం ఏకరూపకత కాదు. మన జాతీయవాదం యూరప్కు చెందిన అవగాహన నుంచి వైదొలగుతూ బహు ళత్వానికి పెద్ద పీట వేసింది. భిన్నత్వంలో ఏకత్వం అనే తత్వాన్ని అందించింది. భారతీయ జాతీయవాదం జాత్యహంకారపూరితమైంది కాదు. అది తెల్ల చర్మాన్ని లేదా బైటివారిని వ్యతిరేకించలేదు. అందుకు భిన్నంగా మన జాతీయవాదం మనల్ని ఆఫ్రికా, ఆసియా, మిగతా ప్రపంచంలో బానిసత్వంలో మగ్గుతున్న వారితో జోడించింది. మన జాతీయవాదం మనల్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా నిలబెట్టేది కాదు, దేశం లోపలే ఉన్న వేర్వేరు కులాలను, ప్రాంతాలను, మతా వలంబికులను జోడించేది. నేను ఈ మొత్తం చర్చతో ఏకీభవించడం లేదన్న విషయాన్ని మీతో ఫోన్లో చెప్పింది గుర్తుండే ఉంటుంది. నేనలా ఎందుకన్నానో ఈపాటికి మీకు అర్థమై ఉంటుందని కూడా ఆశిస్తున్నాను. గత సంవత్సరం జరిగిన జేఎన్యూ చర్చలో దేశభక్తులు గెలవనూ లేదు, దేశద్రోహులు ఓడిపోనూ లేదు. నిజానికి యూరప్ జాతీయవాదం గెలిచింది. భారత జాతీయవాదం ఓడిపోయింది. నా దగ్గర మీ పేరు గానీ, ఫోన్ నంబరు గానీ ఏవీ లేవు. కానీ దేశాభిమానం అనేది ఊరూ పేరూ తెలియని వ్యక్తుల కలయికతోనే నిర్మితమవుతుంది కదా! - యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav -
ఆ కొంచెం కూడా పోవడం ఖాయం
పార్లమెంటులో అందరూ మేజాల్ని చరుస్తూ హర్షామోదాలు వ్యక్తం చేస్తుంటే నాకు దలేర్ మెహందీ పాడే పాట గుర్తుకొచ్చింది - 'మామ్లా గడ్బడ్ హై'! ఏ రాజకీయ నాయకుల నల్లధనాన్ని అడ్డుకునేందుకు ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారో, వాళ్లే దాన్ని స్వాగతిస్తుంటే మీరైతే ఏమంటారు? వ్యవహారం గందరగోళంగా(మామ్లా గడ్బడ్) ఉందనేగా! అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో చాలా నాటకీయంగా మాట్లాడుతూ, రాజకీయ పార్టీల నిధులలో పారదర్శకతను తేవడం కోసం ఒక ప్రతిపాదనను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. రాజకీయ పార్టీలు ఇకపై రూ. 2,000 లకు మించి నగదు స్వీకరించలేవు. రాజకీయాలలోకి స్వచ్ఛమైన సక్రమ ధనాన్ని తేవడం కోసం 'ఎలక్షన్ బాండ్లు' ప్రవేశపెడతామని కూడా ఆయనన్నారు. ఈ తీర్మానానికి పార్లమెంటు సభ్యులంతా మేజాల్ని చరుస్తూ మద్దతు పలికారు. టీవీ చానెళ్లు ఆహో ఓహో అంటూ ప్రశంసలు కురిపించాయి. మరుసటి రోజు దినపత్రికల సంపాదకీయాల్లో కూడా ఇప్పటికైనా సరైన దిశలో ఓ గొప్ప ముందడుగు వేశారన్న సంతోషం వ్యక్తమైంది. ఆర్థికమంత్రి పనైపోయింది.. బడ్జెట్ లెక్కాపద్దులూ పూర్తయ్యాయి. వాస్తవానికి ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన ఆ రోజున ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎలక్షన్ బాండ్ వ్యవహారం నిజానికి మూసిన డబ్బా పెట్టె లాంటిది. కానీ బడ్జెట్ పత్రాలు బైటికి వెలువడిన తర్వాత అర్థమైన విషయమేమిటంటే ఇది అరుణ్ జైట్లీ వేసిన మరో గూగ్లీ! అంటే బంతి ఏ దిశలో స్పిన్ అవుతుందో దానికి పూర్తిగా భిన్నమైన దిశలో తిరుగుతుంది! దీని ద్వారా రాజకీయాల్లో నల్లధనం అంతం కావడం మాట అటుంచి రాజకీయ అకౌంటింగ్లో ఇప్పటి దాకా ఏ కాస్తయినా నెలకొని ఉన్న పారదర్శకత కూడా తూడ్చిపెట్టుకుపోవడం ఖాయం. అందుకే రాజకీయాల్లో పారదర్శకత కోసం అనేక ఏళ్లుగా గొంతెత్తుతున్న 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్' వంటి సంస్థలు ఈ ప్రతిపాదనలతో తల పట్టుకున్నాయి. రాజకీయ పార్టీలకు నగదు రూపంలో లభించే చందాల పరిమితి 2 వేల రూపాయలు మించగూడదనేది ఆర్థిక మంత్రి చేసిన మొదటి ప్రతిపాదన. ఇప్పటివరకు అలాంటి పరిమితి ఏదీ లేదు కాబట్టి చూడగానే ఇది బాగానే కనిపిస్తుంది. వందల కోట్ల రూపాయల నగదు చందాలు ఊరూ పేరులేని వనరుల నుంచి లభించాయని చెప్పుకుంటున్న పార్టీలకు ఏదో మేరకు కళ్లెం వేసినట్టే అని అనిపిస్తుంది. కానీ కాస్త జాగ్రత్తగా గమనిస్తే దీనితో జరిగే మార్పేమీ లేదని గ్రహించవచ్చు. ప్రస్తుత చట్టం ప్రకారం పార్టీలు రూ.20 వేల లోపు లభించే చందాలకు లెక్కలు చూపాల్సిన అవసరం లేదు. దీనిని అడ్డు పెట్టుకొని అత్యధిక రాజకీయ పార్టీలూ, వాటి నేతలూ హవాలా, ప్రాపర్టీ, అవినీతి మార్గాల్లో అక్రమంగా ఆర్జించిన ధనాన్ని రాజకీయ చందాలుగా చూపిస్తూ బ్లాక్ను వైట్గా మార్చుకుంటున్నాయి. దీనిని అడ్డుకోవాలంటే రెండు రకాల నిబంధనలు అవసరం. మొదటిది, లెక్క చెప్పనవసరం లేని మినహాయింపు పరిమితిని పూర్తిగా తొలగించాలి. మిగతా సంస్థలకు వర్తించినట్టుగానే రాజకీయ పార్టీలు కూడా తమకు లభించే నిధుల లెక్కల్ని విధిగా చూపించేలా కట్టడి చేయాలి. నగదుగా లభించినా, చెక్ రూపంలో లభించినా, 50 వేలే అయినా, లేదా 50 లక్షలైనా అన్నింటికీ లెక్కలు చూపాలి. రెండోది, ఏ పార్టీ అయినా నగదు రూపంలో స్వీకరించే చందాల మొత్తానికి ఒక పరిమితి పెట్టాల్సింది. పార్టీలు తమ మొత్తం చందాలలో 10 శాతం మాత్రమే నగదు రూపంలో స్వీకరించవచ్చనే నిబంధనను రూపొందించాల్సింది. కానీ ఆర్థిక మంత్రి అలాంటిదేమీ చేయలేదు. ఇప్పుడు జరిగిందేమిటేటంటే, లెక్క చెప్పనవసరం లేని నగదు చందా పరిమితిని 20 వేల నుంచి 2 వేల రూపాయలకు తగ్గించారు. దీనితో జరిగే మార్పేమీ ఉండదు. నిన్నటి వరకు 'ఇవిగో 100 కోట్లు, వీటిని 20-20 వేల చొప్పున వేర్వేరు చందాలుగా చూపిస్తూ రిజిస్టర్లో ఎంట్రీ చేసెయ్' అని తమ అకౌంటెంట్లను పురమాయించిన రాజకీయ నేతలు ఇప్పుడు 'ఇవిగో 100 కోట్లు, వీటిని రెండేసి వేల రూపాయలుగా చూపిస్తూ రిజిస్టర్లో నమోదు చేయ్' అని ఆర్డరు వేస్తారంతే. నిన్నటి వరకు వందల కోట్ల అక్రమ ధనాన్ని సక్రమ ధనంగా మార్చుకున్న వాళ్లు ఈరోజు కూడా ఆ పనిని భేషుగ్గా చేసేస్తారు. ఈ కొత్త ప్రతిపాదనతో వాళ్లపై పడే ప్రభావమేమీ ఉండబోదు. కేవలం చార్టర్డ్ అకౌంటెంట్లు పడే కష్టం, వారి ఫీజులు పెరుగుతాయంతే. ఇక ఎలక్షన్ బాండ్ల ప్రకటన వెనుకున్న ఉద్దేశం రాజకీయ పార్టీలకు సక్రమ ధనాన్ని చందాగా ఇవ్వాలనుకునే వారికి ఆ ప్రక్రియ సులువుగా జరిగేలా చెయ్యడం. నిజమే, రాజకీయాల్లో అక్రమ ధనాన్ని అరికట్టడంతో పాటు సక్రమ ధనాన్ని ప్రోత్సహించడం కూడా అవసరమే మరి! కానీ ఈ సాకుతో ఆర్థిక మంత్రి వేసిన ఎత్తుగడ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైంది. రాజకీయ పార్టీలకు స్వచ్ఛంద దానానికి బదులు గుప్త దానం కోసమే ఈ ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో ఇప్పటి వరకూ కాస్తో కూస్తో మిగిలి వున్న పారదర్శకత కూడా ఈ ఎలక్షన్ బాండ్లతో హరించుకుపోతుంది. ప్రభుత్వ పథకం ప్రకారం ఒక వ్యక్తి ఏ పార్టీకైనా తన సక్రమ ధనాన్ని చందాగా ఇవ్వాలనుకున్నట్టయితే బ్యాంకుకు వెళ్లి అంతే మొత్తానికి సరిపడా ఎలక్ట్రానిక్ బాండ్లు ఖరీదు చేయాల్సి ఉంటుంది. బాండ్పై దాన్ని కొనుగోలు చేసే వ్యక్తి పేరూ, దానిని స్వీకరించే పార్టీ పేరూ ఏదీ ఉండదు. ఏ పార్టీకి కావాలనుకుంటే ఆ పార్టీ వాళ్ల చేతిలో ఆ బాండ్ను పెట్టెయ్యవచ్చు. దానం చేసే వాళ్లు తాము ఏ పార్టీకి దానం చేశారో చెప్పాల్సిన పని లేదు. స్వీకరించిన పార్టీలు తమకు ఏ వ్యక్తి నుంచి లేదా ఏ కంపెనీ నుంచి సదరు చందా ముట్టిందో చెప్పాల్సిన పని లేదు. ఇందులో అన్నింటికన్నా ప్రమాదకరమైన అంశం ఏమిటంటే పార్టీలు తమకు లభించిన మొత్తం బాండ్ల విలువెంతో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఎలక్షన్ బాండ్లతో రూ. 20,000 లోపు స్వీకరించే చందాలకు లెక్కలు చెప్పనవసరం లేదనే కనీస మినహాయింపు కూడా పూర్తిగా లేకుండా పోతుందన్న మాట. ఉదాహరణకు ఒక ప్రభుత్వం ఏదైనా కంపెనీకి ఒక పెద్ద డీల్ ద్వారా రూ. 5 వేల కోట్లు లాభం వచ్చేలా చేసిందనుకుందాం. ఇరు పక్షాల మధ్య ఫిఫ్టీ-ఫిఫ్టీకి ఒప్పందం కుదిరిందనుకుందాం. అప్పుడా కంపెనీ రూ. 2.5 వేల కోట్ల ఎలక్షన్ బాండ్లు ఖరీదు చేసి గుట్టు చప్పుడు కాకుండా అధికార పార్టీ చేతిలో పెట్టేస్తుంది. నేడున్న నిబంధనల ప్రకారం కంపెనీ ఏదైనా పార్టీకి రెండున్నర వేల కోట్లు ఇచ్చినట్టయితే ఆ వివరాన్ని బ్యాలెన్స్ షీట్లో చూపాల్సి ఉంటుంది. ఆ పార్టీకి సంబంధించిన ఆదాయ పన్ను వివరాల్లో సైతం దీన్ని పొందుపర్చాల్సి ఉంటుంది. కానీ జైట్లీ గారు ప్రవేశపెట్టిన ఈ 'సంస్కరణ'తో లావాదేవీల రికార్డులే మాయమైపోతాయి. ఈ ఒప్పందంలో వ్యవహారం గురించి కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది - కంపెనీ యజమాని, పార్టీ నేత. ఇలా సక్రమ ధనాన్ని అక్రమ మార్గాల్లో అందించే బ్రహ్మాండమైన ఏర్పాటు జరిగిందన్న మాట. మన దేశంలో నల్లధనానికీ, అవినీతికీ మూలం రాజకీయ అవినీతేనన్న విషయం అందరికీ తెలుసు. దానికి పునాదిగా వున్నవి ఎన్నికల ఖర్చు, రాజకీయ నిధులే. రాజకీయ నిధులలో అత్యధిక భాగం పార్టీ నేతల జేబుల్లోనైనా ఉంటుంది లేదా పార్టీల ఇనప్పెట్టెల్లోనైనా ఉంటుందనే విషయం కూడా అందరికీ తెలిసిందే. నిధులలో అత్యల్ప భాగాన్ని మాత్రమే బ్యాంకు అకౌంట్లలో నిల్వ చేస్తారు. ఆ కొద్ది భాగాన్నే ఆదాయ పన్ను శాఖ ఎదుటా, ఎన్నికల కమిషన్ ఎదుటా ప్రకటిస్తారు. ఈ స్వల్ప మొత్తాల్లో కూడా పెద్ద పెద్ద కుంభకోణాలు బైటపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీల నిధుల వ్యవహారాన్ని సంస్కరించాలంటే పార్టీలకు లభిస్తున్న డబ్బులో సక్రమమైనదే అత్యధికంగా ఉండే విధంగా చూడాల్సి ఉంటుంది. దాంతో పాటు ఈ డబ్బు లావాదేవీలను తనిఖీ చేయగల పటిష్టమైన వ్యవస్థ కూడా ఉండాలి. కానీ ఆర్థిక మంత్రి అలా చేయడానికి బదులు ఇప్పటి వరకు స్వల్ప పరిమితిలోనే అయినా అమలులో ఉన్న తనిఖీని పూర్తిగా లేకుండా చేసి దానిపై పరదా కప్పేశారు. దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నిధులనే నీళ్ల ట్యాంకుకు కన్నం పడి అందులోంచి నీరు లీక్ అవుతుందనుకుందాం. దాన్ని పూడ్చడానికి బదులు, ట్యాంకుకు మరెన్ని చిల్లులైనా పడనివ్వండి, కానీ అవి రెండు వేళ్లకన్నా ఎక్కువ వెడల్పుతో ఉండగూడదు అన్న చందంగా ఆర్థిక మంత్రి ఈ నిబంధనలు రూపొందించారు. అంతే కాదు, ట్యాంకు పైనున్న మూత కూడా తీసేశారు. ఎవరికి ఎన్ని లోటాలు కావల్సినా తోడుకోవచ్చు. అన్నింటికన్నా గమ్మత్తైన విషయమేమిటంటే అందరి కళ్లెదుటా పారదర్శకత అని రాసున్న ఒక పెద్ద స్క్రీన్ను పెట్టారు. ట్యాంకులోంచి నీళ్లు మునుపటికన్నా ఎక్కువ లీక్ అవుతున్నాయి. నీటి దోపిడీ జరిగిపోతోంది. కానీ అదిప్పుడు కళ్లకు కనిపించకుండా అయిపోయింది. అందరూ పారదర్శకత అనే స్క్రీన్ను చూసి చప్పట్లు కొడుతున్నారు. పార్లమెంటు సభ్యులు మేజాల్ని చరుస్తున్నారు. -Yogendra Yadav -
యోగేంద్ర యాదవ్తో ఎన్నికల విశ్లేషణ
-
కోదండరాం పార్టీ పెట్టాలి
-
కోదండరాం పార్టీ పెట్టాలి
జై కిసాన్ ఆందోళన్ కన్వీనర్ యోగేంద్ర యాదవ్ సూచన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అస్తవ్యస్తంగా ఉందని, దీన్ని సరి చేసేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం ఉందని జైకిసాన్ ఆందోళన్ కన్వీనర్, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ అన్నా రు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో పార్టీ రావాలని, ఇది ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. అవినీతి, అసమర్థ ప్రభుత్వా లను ఎదుర్కొని ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ఉండే వేదిక ఏర్పడాలని ఆకాంక్షించారు. స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, చైతన్యమైన మీడియా.. ఇలా నీతితో కూడిన సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు విలువలతో కూడిన రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మంగళవారమిక్కడ అడ్వొకేట్ జేఏసీ ఏర్పాటు చేసిన ‘ప్రత్యామ్నాయ రాజకీయం’ అంశంపై ఆయన మాట్లా డారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుండే పార్టీ నిజాయితీ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత గాలిలో కలసిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి, సమస్యల పరిష్కార దృష్టి.. ఇలా అనేక అంశాలతో అనుభవజ్ఞులతో కూడిన పార్టీ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. కోదం డరాం నేతృత్వంలో విలువలతో కూడిన పార్టీ ఏర్పాటు కావాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీలన్నీ ఒక సామాజిక ఎజెండాతో వచ్చి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అంతకు ముందు ఆయన తెలంగాణలోని పరిస్థితులపై కోదం డరాం, అడ్వొకేట్ జేఏసీతో చర్చించారు. అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయి కోదండరాం మాట్లాడుతూ అరవై ఏళ్ల పాటు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాల్లోకి రావడం తప్పదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పార్టీ ఏర్పాటును కాలమే నిర్ణయిస్తుందని పేర్కొ న్నారు. పాలనా వ్యవస్థలో అవినీతిని రూపు మాపేందుకు ప్రత్యామ్నాయ శక్తిగా పోరా డేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఉద్య మాలు చేసి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ పెత్తందారి దోపిడీయే కొనసాగుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందున్న పార్టీ కర్తవ్యాలు ఆ తర్వాత మారిపో వడం సమాజాన్ని అజ్ఞాతంలోకి నెట్టిందన్నారు. ‘‘ఆంధ్రా కాంట్రాక్టర్లకే పనులు, సినిమాలు వాళ్లవే, చివరకు జడ్జిల విషయంలోనూ అదే నిరూపితమవడం తెలంగాణ సమాజాన్ని తీరని అన్యాయానికి గురిచేసినట్టవుతోంది. యోగేంద్ర యాదవ్ చెప్పిన విషయాలను తప్పకుండా జేఏసీ స్వీకరిస్తుంది. అయితే, పార్టీ ఏర్పాటుపై కాలమే సమాధానం చెప్తుంది. అభివృద్ధి, నీతి తో కూడిన రాజకీయ వేదికగా జేఏసీ నిలుస్తుంది. దీనికి అన్ని వర్గాలు, సంఘాలు, వ్యక్తులు మాతో కలిసి రావాలి. జేఏసీ ఉద్యమం స్పష్టంగా, స్వచ్ఛంగా ఉండేం దుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి’’ అని కోదండరాం అన్నారు. బలమైన సామాజిక పోరు స్వరాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజల కోసం అధికారాన్ని ఉపయోగించాలని ఉద్యమ సమయంలోనే చర్చించుకున్నా మని, కానీ ఇప్పడలాంటి పరిస్థితులు కనిపించడం లేదని కోదండరాం అన్నారు. ఆ లోపాలను అధిగ మించేందుకే బలమైన సామాజిక పోరాటాలు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో పార్టీలను కాదు, వ్యక్తులను, వారి సంస్కృతిని కూడా మార్చుకోవాల్సి ఉందని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే ప్రత్యామ్నాయ వేదిక రావాలని, ఆ ఆకాంక్షలను అమల్లోకి తీసుకు వచ్చేందుకు పోరాడాలన్నారు. -
మున్సిపల్ ఎన్నికల బరిలో స్వరాజ్ ఇండియా!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఎన్నికల రాజకీయాల్లోకి అరంగ్రేటం చేయాలని యోగేంద్రయాదవ్ నేతృత్వంలోని స్వరాజ్ ఇండియా పార్టీ యోచిస్తోంది. త్వరలో జరగనున్న గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికలో పోటీ చేయాలా? వద్దా అనే విషయంపై పార్టీ త్వరలో ఒక నిర్ణయం తీసుకోనుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అనుపమ్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 2 న ప్రారంభమైన స్వరాజ్ ఇండియా పార్టీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కోసం అజిత్ ఝా నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. -
యోగేంద్ర, భూషణ్ల కొత్త పార్టీ ‘స్వరాజ్ ఇండియా’
ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో పోటీ న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లు ఆదివారం ‘స్వరాజ్ ఇండియా’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని, వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోవడం లేదని తెలిపారు. పార్టీకి యోగేంద్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. పంజాబ్లో కొత్త పార్టీ పెట్టిన ధరమ్వీర గాంధీ(సస్పెండైన పంజా బ్ ఆప్ ఎంపీ)కి మద్దతిస్తామని యోగేంద్ర చెప్పారు. ఆమ్ ఆద్మీకి(సామాన్యుడికి) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ద్రోహం చేశారని ఆరోపించారు. తమ పార్టీ ప్రత్యమ్నాయ రాజకీయాలను తీసుకొస్తుందని, వ్యక్తిపూజ రాజకీయాలకు పాల్పడదని అన్నారు. తమ పార్టీ తనంత తాను ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, ఎమ్మెల్యేలు, ఎంపీలపై విప్ ప్రయోగించదని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. విప్ను కేవలం అవిశ్వాస పరీక్షకే పరిమతం చేస్తామన్నారు. తమ సంస్థ ఇకముందూ కొనసాగుతుందని యోగేంద్ర, భూషణ్లు స్థాపించిన స్వరాజ్ అభియాన్ తెలిపింది. దీనికి భూషణ్ నాయకత్వం వహిస్తారు. -
'వాడి.. పారేయ్' నుంచి 'నాశనం చేయ్' వరకు!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతంలో గణనీయంగా మార్పు వచ్చిందని, ఒకప్పుడు నేతలను 'వాడి పారేయడం' ఆ పార్టీ సిద్ధాంతంగా ఉండేదని, ఇప్పుడు 'వాడి నాశనం చేయ్' అన్నట్టు ఆ పార్టీ సిద్ధాంతం మారిందని ఆప్ మాజీ నేత యోగేంద్ర యాదవ్ విమర్శించారు. తాజాగా సుచాసింగ్ ఛోటెపర్ను పార్టీ పంజాబ్ కన్వీనర్ పదవి నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో ఆప్పై ఆ పార్టీ బహిష్కృత నేత అయిన యోగేంద్ర యాదవ్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆప్ రెబెల్ ఎమ్మెల్యే పంకజ్ పుష్కర్తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నదని, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గొంతెత్తకుండా అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. టికెట్ ఆశావహుల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై ఛోటెపర్ను ఆప్ పదవి నుంచి తొలగించింది. -
రాజకీయ పార్టీగా ‘స్వరాజ్ అభియాన్’
న్యూఢిల్లీ: అక్టోబర్ 2లోగా రాజకీయ పార్టీని ప్రారంభిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృత ఆప్ నేతలు, స్వరాజ్ అభియాన్ సంస్థ ప్రతినిధులు యోగేశ్ యాదవ్, ప్రశాంత్ భూషణ్ తెలిపారు. తమ పార్టీలో ఆప్ తరహాలో కేంద్రీకృత నాయకత్వ వ్యవస్థ ఉండదని, పూర్తి పారదర్శకతతో పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పార్టీని ప్రారంభిస్తున్నామన్నారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై వీరు స్పష్టతనివ్వలేదు. -
విధివిధానాలు ఖరారు చేయండి
అందుకు సీజేఐని సంప్రదించండి: ‘కొలీజియం’ మెరుగుపై కేంద్రానికి ‘సుప్రీం’ నిర్దేశం న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం వ్యవస్థను మెరుగుపర్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ)ను ఖరారు చేయాలని కేంద్రానికి సూచించింది. జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కేంద్రానికి పలు విధివిధానాలను నిర్దేశించింది. ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి సారించాలని తెలిపింది. న్యాయమూర్తుల అర్హతలు, నియామక ప్రక్రియలో పారదర్శకత, ఎంపిక ప్రక్రియ పర్యవేక్షణకు సచివాలయం ఏర్పాటు, ఎంపికైన వారిపై ఫిర్యాదులు ఉంటే వాటిని పరిశీలించడానికి ప్రత్యేక యంత్రాంగం, ఇతర అంశాలపై పర్యవేక్షణ చేపట్టాలని వెల్లడించింది. న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకతను పెంచేందుకు ఈ ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను సంబంధిత కోర్టు వెబ్సైట్లో, కేంద్ర న్యాయశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ధర్మాసనం పేర్కొంది. సలహాలు, సూచనలు స్వీకరించాలని తెలిపింది. యూపీ లోకాయుక్తగా వీరేంద్ర సింగ్ న్యూఢిల్లీ/లక్నో: తన రాజ్యాంగబద్ధ అధికారాలను ఉపయోగించుకుంటూ.. యూపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి వీరేంద్ర సింగ్ను ఉత్తరప్రదేశ్ లోకాయుక్తగా సుప్రీం కోర్టు గురువారం నియమించింది. నియామకం దిశంగా రాష్ట్ర సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో.. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఈ నియమకాన్ని చేపట్టింది. ‘కరువు’పై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు కరువుపీడిత రాష్ట్రాల్లో ఆహార భద్రత చట్టం కింద ఉచితంగా ఆహార ధాన్యాలను అందుబాటులో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎనిమిది కరువుపీడిత రాష్ట్రాల స్పందన కోరింది. ఈ మేరకు బుధవారం జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ ఎస్ఏ బోడెలతో కూడిన ధర్మాసనం కేంద్ర వ్యవసాయశాఖ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఆమ్ఆద్మీ పార్టీ మాజీ నేత యోగేంద్ర యాదవ్ ఏర్పాటు చేసిన స్వరాజ్ అభియాన్ అనేసంస్థ ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. కరువు ప్రాంతాల్లో వెంటనే రైతులకు పంటనష్టానికి సంబంధించిన పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రాయితీపై పశువులకు దాణా సరఫరా చేయాలని స్వరాజ్ అభియాన్ తన పిటిషన్లో కోరింది. కేంద్రం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్షం ప్రదర్శిస్తున్నాయని తెలిపింది. -
'ఆత్మహత్యల పై సమాజం కూడా బాధ్యత వహించాలి'
-స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ అధ్యక్షుడు యేగేంద్రయాదవ్ మాగనూర్ (మహబూబ్నగర్ జిల్లా): రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాలతో పాటూ సమాజం కూడా బాధ్యత వహించాలని స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ అధ్యక్షుడు యేగేంద్రయాదవ్ అన్నారు. దేశంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల ఘటనలపై, వర్షాభావ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుండి ప్రత్యేక బృందం శనివారం మాగనూర్ మండలంలో పర్యటించింది. ఈ సందర్భంగా మండలంలోని గురావ్ లింగంపల్లి గ్రామంలో గత నెల 18న ఎల్లప్ప అనే రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని వారు పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ అధ్యక్షుడు యేగేంద్రయాదవ్ విలేకరులతో మాట్లాడుతూ మహాత్మాగాంధీ జయంతి రోజున ఈ యాత్రను ప్రారంభించామన్నారు. మొదట కర్ణాటకలో పరిశీలించి తర్వాత తెలంగాణకు వచ్చామన్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాలతో పాటూ, సమాజం కూడ బాధ్యత వహించాలని తెలిపారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటి సారిగా రైతుల పక్షాన ఉండి, రైతు ఆత్మహత్యల కుటుంబాలకు పరిహారం ప్రకటించడం గర్వకారణమన్నారు. ఈ యాత్ర మహబూబ్నగర్ తో పాటూ, రంగారెడ్డి, మెదక్, నిజామ్బాద్ జిల్లాలో రెండు రోజుల పాటూ కొనసాగుతుందని చెప్పారు. ఈ యాత్ర పూర్తి అయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు తెలిపారు. -
కొట్టి, ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు
న్యూఢిల్లీ: శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై పోలీసులు సోమవారం అర్థరాత్రి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత యోగేంద్ర యాదవ్ అన్నారు. ప్రత్యేకంగా తనను కొట్టారని, ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భూసేకరణ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పంజాబ్, హర్యానా, రాజస్థాన్ కు చెందిన రైతులకు యోగేంద్ర యాదవ్ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. వీరంతా దేశవ్యాప్త మద్దతును కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కిసాన్ ర్యాలీ పేరిట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్లతో ర్యాలీ తీసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా పోలీసుల తీరును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. -
'వారిద్దరూ పార్టీలోకి తిరిగి వస్తే సంతోషమే'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లు తిరిగి పార్టీలోకి వస్తే చాలా సంతోషమని ఆ పార్టీ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘ఒకవేళ అది జరిగితే... చాలా మంచిది’ అని ఓ టీవీ చానల్తో అన్నారు. పార్టీలోకి వారి పునరాగమనానికి తన ఒంటెత్తు పోకడలే అవరోధమనే ఆరోపణలను కేజ్రీవాల్ ఖండించారు. భూషణ్, యోగేంద్రలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈ ఏడాది ఏప్రిల్లో వారిని ఆప్ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. కాగా, కేజ్రీవాల్ తనను పార్టీలోకి తిరిగి ఆహ్వానించడంపై ప్రశాంత్ భూషణ్ తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ సమావేశంలో తన ఎమ్మెల్యేలతో మాపై దాడి చేయించి... ఇప్పుడేమో పార్టీలోకి తిరిగి రావాలని నిస్సిగ్గుగా కోరుతున్నారని ట్వీట్ చేశారు. -
ఆప్ నుంచి ప్రశాంత్భూషణ్, యోగేంద్ర ఔట్
న్యూఢిల్లీ: అసమ్మతి నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారంటూ సోమవారం రాత్రి వారిద్దరిని పార్టీ నుంచి బహిష్కరించింది. వీరితోపాటు అనంద్ కుమార్, అజిత్ ఝాలను కూడా బహిష్కరిస్తున్నట్టు తెలిపింది. వీరికి జాతీయ క్రమశిక్షణ కమిటీ రెండ్రోజుల కిందటే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆప్ ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగాన్ని పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని వారు సోమవారమే సమాధానమిచ్చారు. మార్చి 28న జరిగిన అక్రమ సమావేశం తర్వాత క్రమశిక్షణ కమిటీ ఏర్పాటైందని.. దానికి తమ నుంచి సమాధానం కోరే అధికారం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కేజ్రీవాల్ తొలి విడత ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు ఆ పదవికి రాజీనామా చేసే ముందు పార్టీ కార్యవర్గంలో ఎవరినీ సంప్రదించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. వీరి జవాబుతో కమిటీ సంతృప్తి చెందలేదని, అందుకే బహిష్కరణ వేటు వేసిందని పార్టీ ప్రతినిధి దీపక్ బాజ్పాయి తెలిపారు. -
ఇద్దరు నేతలకు షోకాజ్ నోటీసులు
పార్టీ మీద తిరుగుబాటు చేసిన యోగేంద్ర యాదవ్, ప్రశాంతభూషణ్ ఇద్దరికీ ఆమ్ ఆద్మీ పార్టీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. వాళ్లమీద వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు రెండు రోజుల గడువు ఇచ్చారు. అనంతరం ఇద్దరు నేతలనూ పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో నెగ్గిన కొన్నాళ్లకే పార్టీలో అసంతృప్తి బయల్దేరడం, దాంతో క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగడం తెలిసిందే. తర్వాత యోగేంద్ర యాదవ్, ప్రశాంత భూషణ్ ఇద్దరూ కలిసి 'స్వరాజ్ అభియాన్' అనే గ్రూపును ఏర్పాటుచేశారు. వాళ్లిద్దరినీ పార్టీలోని కీలక పదవులు, కమిటీల నుంచి ఇప్పటికే తప్పించారు. వాళ్లతోపాటు ఆనందకుమార్, అజిత్ ఝా అనే మరో ఇద్దరు సీనియర్ నేతలకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సమాంతర గ్రూపును ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ నాయకత్వాన్ని బహిరంగంగా సవాలు చేశారని ప్రశాంత భూషణ్పై ఆరోపణలు మోపారు. కొత్త పార్టీ ఏర్పాటుగురించి ఏమంటారని కూడా ఆ సమావేశంలో కార్యకర్తలను అడిగినట్లు నోటీసులో పేర్కొన్నారు. -
పార్టీలకతీతంగా 'స్వరాజ్ అభియాన్'
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఆమ్ఆద్మీపార్టీ బహిష్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ సొంత కుంపటిని ప్రారంభించారు. అయితే, అది పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని పేర్కొంటూ స్వరాజ్ అభియాన్ అని దానికి నామకరణం చేశారు. తమ సంస్థ దేశంలోని రైతులు, మహిళలు, సామాన్య పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతుందని ప్రకటించారు. నిరసనలు, ర్యాలీలు, ఉద్యమాల ద్వారా ప్రజల పక్షాన తమ పోరాటం ఉండనుందని తెలియజేశారు. అయితే, ఆప్ నుంచి బలవంతంగా బహిష్కరణకు గురైన ఈ నేతలు సొంతంగా పార్టీ పెడతారని భారీ ఊహగానాలు వచ్చిన విషయం తెలిసిందే. స్వరాజ్ అభియాన్ ప్రకటన సందర్భంగా మాట్లాడిన నేతలు భూషణ్, యోగేంద్ర.. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటూనే తమకు మద్దతు ఇస్తామని 75శాతం కార్యకర్తలు మాట ఇచ్చారని, 25శాతం మంది మాత్రం సొంతంగా పార్టీ పెట్టేందుకు మద్దతిచ్చారని చెప్పారు. అయితే, స్వరాజ్ అభియాన్ తమ పార్టీకి సంబంధించినది కానందున బుధవారం చర్యలు తీసుకుంటామని ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. -
‘స్వరాజ్ సంవాద్’కు వెళ్లొద్దు..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అసమ్మతి నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ నేతృత్వంలో అంబేద్కర్ జయంతి రోజున నిర్వహించనున్న ‘స్వరాజ్ సంవాద్’ సమావేశంలో పాల్గొనొద్దని తమ వలంటీర్లను ఆప్ హెచ్చరించింది. ఇలాంటివి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలని పేర్కొంది. ఆప్లోని కొంత మందిని ఆకర్షించేందుకు యోగేంద్ర, ప్రశాంత్.. స్వరాజ్ సంవాద్ను ఏర్పాటు చేశారు. ఈ నెల 14న నిర్వహించనున్న ఆ సమావేశంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం. కాగా, ఆప్ నేత ఆనంద్ కుమార్.. పార్టీ నాయకత్వాన్ని విమర్శించారు. స్వరాజ్ సంవాద్కు వెళ్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కొత్తగా నియమితుడైన ఒక పార్టీ అధికార ప్రతినిధి హెచ్చరించారని, ఇలాంటి నియంత్రృత్వ పోకడలు విడనాడాలన్నారు. -
ఆప్లో ముదురుతున్న సంక్షోభం
ఆప్ క్రమశిక్షణ కమిటీ నుంచి ప్రశాంత్భూషణ్ తొలగింపు అంతర్గత లోక్పాల్ రాందాస్కు కూడా ఉద్వాసన న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో సంక్షోభం ముది రింది. పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్లను తొలగించిన మర్నాడు.. ఆదివారం ప్రశాంత్ భూషణ్ను పార్టీ క్రమశిక్షణ కమిటీ నుంచి కూడా తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అలాగే, పార్టీ అంతర్గత లోక్పాల్ పదవి నుంచి నేవీ మాజీ చీఫ్ ఎల్.రాందాస్నూ సాగనంపింది. అది ఆయనను తొలగించడం కాదని, ఆయన పదవీకాలం ముగిసినందున కొత్త లోక్పాల్ కమిటీని ఎన్నుకున్నామని సీనియర్ నేత సంజయ్ సింగ్ చెప్పారు. కొత్త కమిటీలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు దిలీప్కుమార్, రాకేశ్ సిన్హా, విద్యావేత్త ఎస్పీ వర్మలకు స్థానం కల్పించారు. ముందుగా చెప్పకుండా తనను తొలగించడంపై రాందాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్పాల్గా మరో ఐదేళ్లు కొనసాగాలని గతనెలలోనే వారు తనను కోరారని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి రాందాస్ అంతర్గత లోక్పాల్గా ఉన్నారు. ప్రశాంత్ను తొలగించిన అనంతరం.. దినేశ్ వాఘేలా అధ్యక్షుడిగా కేజ్రీవాల్కు నమ్మకస్తులైన ఆశిశ్ ఖేతన్, పంకజ్ గుప్తా సభ్యులుగా పార్టీ క్రమశిక్షణ కమిటీని కూడా పునర్వ్యవస్థీకరించారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 22న నిర్వహించే పార్లమెంట్ ఘెరావ్ బాధ్యతలను ఇల్యాస్ ఆజ్మీ, ప్రేమ్సింగ్ పహడి తదితరులు సభ్యులుగా ఉన్న కమిటీకి అప్పగించారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ బాధ్యతల నిర్వహణను సంజయ్సింగ్ నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. ప్రశాంత్, యోగేంద్రలను జాతీయ కార్యవర్గం(ఎన్ఈ) నుంచి తొలగించడంతో ఇక మిగిలింది వారిని పార్టీ నుంచి పంపించేయడమేనని భావిస్తున్నాయి. మరోపక్క.. తాము కొత్త పార్టీని ప్రారంభించే అవకాశముందని ప్రశాంత్, యోగేంద్రలు మరోసారి సంకేతాలిచ్చారు. వారు ఆదివారం తమ అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మిత్రులే ద్రోహం చేశారు: కేజ్రీవాల్ శనివారం జాతీయ కార్యవర్గ మండలి భేటీలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రసంగాన్ని(ఎడిటెడ్ వీడియో) పార్టీ ఆదివారం యూట్యూబ్లో, ట్వీటర్లో పోస్ట్ చేసింది. అందులో.. ‘ఢిల్లీ మొత్తం మన వెంట నిలిచిన సమయంలో కొందరు మిత్రులు మనకు వెన్నుపోటు పొడిచారు. ఢిల్లీ ఎన్నికల్లో మన ఓటమికి కుట్రలు పన్నారు. వలంటీర్లను ప్రచారం కోసం ఢిల్లీ రాకుండా అడ్డుకున్నారు. విరాళాలు రాకుండా చూశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోతేనే పార్టీకి, కేజ్రీవాల్కు బుద్ధొస్తుందని ప్రశాంత్ ఎన్నికల ముందు మనలోనే చాలామందితో అన్నారు. నాకు వ్యతిరేకంగా యోగేంద్ర పనిచేస్తున్నారని రెండు ప్రముఖ ఆంగ్ల వార్తా చానళ్ల ఎడిటర్లు నాతో చెప్పారు. ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ తన మొదటి చాయిస్ కాదని చెప్పిన ప్రశాంత్.. అప్పుడే పార్టీని వదిలి ఎందుకు వెళ్లలేదు? నా సొంత మనుషులే నా నిజాయితీని శంకించారు. ప్రశాంత్, యోగేం ద్రలతో పోరులో నా ఓటమిని అంగీకరిస్తున్నా. ఎవరు కావాలో మీరే నిర్ణయించండి. నన్నో, లేక వారినో.. ఎన్నుకోండి’ అని ఉద్వేగంగా కేజ్రీవాల్ ప్రసంగించారు. -
ఆమ్ ఆద్మీ పార్టీలో తారాస్ధాయికి చేరిన సంక్షోభం
-
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..
న్యూఢిల్లీ : ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆ పార్టీ సహవ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. పార్టీలో ముందు నుంచి వ్యూహం ప్రకారమే గందరగోళం సృష్టించారని శనివారం ఆయన అన్నారు. ఆప్ వ్యవస్థాపక సభ్యులైన ప్రశాంత్ భూషణ్, మోగేంద్ర యాదవ్ లను ఆ పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించింది. వీరితో పాటు ఆజీత్ ఝా, శాంతి భూషణ్లను ఆప్ బహిష్కరించింది. శనివారం జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లకు అనుకూలంగా 23 ఓట్లురాగా, వ్యతిరేకంగా 200లకు పైగా ఓట్లు వచ్చాయని సమాచారం. -
ఆ ఇద్దరూ ఇక బయటకే!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో కుమ్ములాటలు పతాకస్థాయికి చేరుకున్నాయి. అసమ్మతి నేతలు ప్రశాంత్భూషణ్, యోగేంద్రయాదవ్ల ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. శనివారం జరుగనున్న జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కాగా, అసమ్మతి నేతలు, కేజ్రీవాల్ బృందం మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం శుక్రవారం పతాక స్థాయికి చేరుకుంది. కేజ్రీవాల్పై స్టింగ్ ఆపరేషన్ చేసిన ఓ ఆడియో టేప్ను అసమ్మతి వర్గం శుక్రవారం విడుదల చేసింది. ఈ టేపులో కేజ్రీవాల్... ఇద్దరు అసమ్మతి నేతలతో తాను కలిసి పనిచేయటం సాధ్యం కాదని కేజ్రీవాల్ అందులో అన్నారు. వాళ్లిద్దరూ ఉంటే తాను 66మంది ఎమ్మెల్యేలతో కొత్త పార్టీని పెట్టుకుంటానని కూడా కేజ్రీవాల్ ఆ టేప్లో అన్నారు. ఈ ఆడియో టేప్ విని తాము దిగ్భ్రాంతికి లోనయ్యామని.. తమను పార్టీనుంచి వెళ్లగొట్టాలని నిర్ణయించుకున్న తరువాత ఇక చర్చలు జరిపి ప్రయోజనం లేదని విలేకరుల సమావేశంలో యోగేంద్రయాదవ్ అన్నారు. పార్టీ వ్యవస్థాగత సిద్ధాంతాలు, అంతర్గత ప్రజాస్వామ్యం విషయంలో కేజ్రీవాల్ రాజీపడుతున్నారని ఇద్దరు నేతలు ఆరోపించారు. తాము ప్రస్తావించిన ఐదు డిమాండ్లను పరిష్కరిస్తే పార్టీలోని అన్ని పదవులనూ వదులుకుంటామన్నప్పటికీ పట్టించుకోలేదన్నారు. పార్టీ రాష్ట్ర శాఖలకు స్వతంత్ర ప్రతిపత్తి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కేజ్రీవాల్ ప్రయత్నించారన్న ఆరోపణలపై అంతర్గత లోక్పాల్తో విచారణ, పార్టీ నిర్ణయాల్లో కార్యకర్తల భాగస్వామ్యం పెంచటం, ఆర్టీఐ పరిధిలోకి పార్టీని తీసుకురావటం వంటి డిమాండ్ల విషయాలను పక్కన పెట్టారని అన్నారు. శనివారం జరుగనున్న జాతీయ మండలి సమావేశాన్ని వీడియో తీయాలని కోరినా స్పందించలేదన్నారు. తమను జాతీయ కార్యవర్గం నుంచి తప్పించగలరేమో కానీ పార్టీ నుంచి బహిష్కరించటం అంత తేలిక కాదని, అలా చేయాలంటే తప్పనిసరిగా అంతర్గత లోక్పాల్కు, క్రమశిక్షణాసంఘానికి నివేదించాల్సి ఉంటుందన్నారు. -
ఉంచుతారా.. ఊడకొడతారా..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో సంక్షోభం మరింత ముదరనుందా.. శనివారం జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ అంశంపై వివాదానికి తెరపడుతుందా.. లేక ఆ నేతలను జాతీయ కార్యవర్గ సభ్యత్వం నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటిస్తారా.. ఇలా పలు ప్రశ్నలు చుట్టుముడుతుండగా.. వారిని పక్కకు పెడతారనే విషయమే తెలుస్తోంది. అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వర్గం జరిపిన రాజీ చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో ఆ సమావేశంలో తమ అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోలేదని భూషణ్, యోగేంద్ర కేజ్రీవాల్కు లేఖ కూడా రాశారు. మరి ఆ లేఖపై కేజ్రీవాల్ స్పందిస్తారా.. లేఖ శనివారం నాటి సమావేశానికే వదిలేస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే, గురువారంనాటి సమావేశంలోని ప్రధాన అంశాలను ఒకసారి గమనిస్తే... 1.యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ ఇప్పటికీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్ మద్ధతుదారులు మరోసారి ఈ సమావేశంలో ఆరోపించారు. కానీ, అవన్నీ అవాస్తవాలని వారు కొట్టిపారేశారు. 2. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని తానెప్పుడూ కోరలేదని, సీనియర్ సభ్యులు తమపై ఈ ఆరోపణలు చేయడం చాలా బాధ కలిగించిందని, దిగ్భ్రాంతికి గురిచేసిందని ఈ సమావేశం అనంతరం మీడియాకు ప్రశాంత్ భూషణ్ తెలియజేశారు. 3. కానీ, అందుకు విరుద్ధంగా కేజ్రీవాల్ మద్దతుదారుడు సంజయ్ సింగ్ అదే మీడియాతో మాట్లాడుతూ చర్చలు ముగిసాయని, ఈ చర్చల్లో పార్టీ పరిస్థితుకన్నా భూషణ్, యోగేంద్ర వారి అహానికే ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. 4. 'యాదవ్, భూషణ్కు జాతీయ కన్వీనర్ పదవి ఇచ్చేందుకు కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. కానీ వారు మాత్రం మా అందరిపై ప్రజా వ్యతిరేకులమని ఆరోపణలు చేశారు. కానీ మేం వారిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు' అని అశుతోష్ అనే కేజ్రీవాల్ మద్ధతుదారుడు తెలిపాడు. 5. 'చర్చలు ముగిశాయి. కేజ్రీవాల్ను జాతీయ కన్వీనర్ పదవినుంచి తొలగించాలని వారు నొక్కి చెప్పారు. దానిపై జూలై 28న నిర్ణయం తీసుకుంటాం' అని ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా ట్విట్టర్లో పేర్కొన్నారు. 6.'ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ నుంచి భూషణ్ ను, యోగేంద్రను తొలగించామని, శనివారం వారి విషయంలో ఓటింగ్ నిర్వహిస్తాం' అని సిసోడియానే చెప్పారు. 7.తమ డిమాండ్లు నెరవేరిస్తే అన్ని పదవులు వదులుకుంటామని మార్చి 17న లేఖలు రాశారని, వాటి వెనుక ఉన్న ఉద్దేశం కేజ్రీవాల్ రాజీనామానేని ఆప్ మరోసారి ఈ సమావేశం అనంతరం ప్రస్తావించింది. 8.కానీ, ఆ వెంటనే స్పందించిన అసమ్మతిదారులు 'మేం రాజీనామా చేయం. మా డిమాండ్లు ఎప్పటికీ నెరవేరవు. ఎందుకంటే మమ్మల్ని జాతీయ కార్యవర్గం నుంచి పూర్తిగా తప్పించాలని చాలామంది చూస్తున్నారు' అని అన్నారు. 9.శనివారం ఆప్ మరోసారి ఇదే విషయంపై సమావేశం కానుంది. 24 గంటలు గడిచినంతలోనే ఆప్ నిర్వహించే రెండో సమావేశం ఇది కానుంది. 10. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆప్ రాష్ట్రాల్లోనూ విస్తరించాలనుకుంటుండటంతో ఎలాంటి వివాదాలు లేకుండా త్వరగా పార్టీలో సమస్యలకు ముగింపు పలకాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో యోగేంద్ర, భూషణ్ భవితవ్యం శనివారం తేలనుంది. -
కేజ్రీవాల్ కు సమన్లు
న్యూఢిల్లీ: మంగళవారం మధ్యాహ్నం రెండుగంటలకు కోర్టు ముందు హాజరు కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, యోగేంద్ర యాదవ్ లను ఢిల్లీ కోర్టు ఆదేశించింది.. న్యాయవాది ఆనంద్ కుమార్ దాఖలు చేసిన డిఫమేషన్ కేసలో ఆప్ నేతలు కోర్టుకు హాజరుకాకపోవడంపై కోర్టు సీరియస్ గా స్పందించింది. వారికి చట్టం మీద గౌరవం లేదంటూ వ్యాఖ్యానించింది. కాగా గత జూన్ 4 , 2014లో ఈ కేసులో బెయిలు మీద విడుదలైన సంగతి తెలిసిందే. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మయూరి సింగ్ ఈ ముగ్గురి నేతలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.