Farmers Union
-
రైతు సంఘాలతో కేంద్రం చర్చలు
చండీగఢ్: పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సారథ్యంలోని బృందం శుక్రవారం చండీగఢ్లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించింది. రెండున్నర గంటలకుపైగా జరిగిన ఈ చర్చల్లో సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాలకు చెందిన 28 మంది స భ్యుల ప్రతినిధి బృందం పాల్గొంది. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీల్లో ఈ రెండు రైతు సంఘాలు ఏడాదికిపైగా నిరసనలు సాగిస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం తరఫున వ్యవసాయ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుద్దియన్, ఆహారం, పౌరసరఫరా శాఖ మంత్రి లాల్ చంద్ తదితరులు పాలొ న్నారు. మహాత్మాగాంధీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప బ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఎంజీఎస్ఐపీఏ)లో జరిగిన చ ర్చలు సుహృద్భావ వాతావరణంలో సాగాయన్నా రు. రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం తీసు కున్న చర్యలను ఈ సందర్భంగా రైతు నేతలకు వివరించామని ప్రహ్లాద్ జోషి చెప్పారు. తదుపరి రౌండ్ చర్చలు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో 22న జరుగుతాయని మంత్రి చెప్పారు. నిరశనదీక్ష సాగిస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఖనౌరీ నుంచి ఆయన్ను అంబులెన్సులో తీసుకువచ్చారు. ఆయన ప్రయాణానికి నాలుగు గంటల సమయం పట్టిందని రైతు నేత కాకా సింగ్ కొట్ర చెప్పారు. -
మరింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీలో రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష(70) ఆదివారం 41వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన సారథ్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం–రాజకీయేతర) తీవ్ర ఆందోళన చెందింది. శనివారం స్ట్రెచర్ పైనుంచే మహా పంచాయత్ను ఉద్దేశించి ఆయన 11 నిమిషాలపాటు మాట్లాడారు. తిరిగి దీక్షా శిబిరంలోకి తీసుకెళ్లినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఆదివారం దల్లేవాల్ మగతలో ఉన్నారని, వాంతులు చేసుకున్నారని ఎన్జీవోకు చెందిన డాక్టర్ అవతార్ సింగ్ వెల్లడించారు. మూత్ర పిండాలు కూడా క్రమేపీ పనిచేయలేని స్థితికి చేరుకుంటున్నట్లు గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్(జీఎఫ్ఆర్)ను బట్టి తెలుస్తోందని చెప్పారు. దల్లేవాల్ కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారని ఎస్కేఎం నేతలు తెలిపారు. ఆయన దీక్షను విరమించినా కీలక అవయవాలు వంద శాతం పూర్తి స్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సరిగా నిలుచోలేని స్థితిలో ఉండటంతో బరువును కూడా కచ్చితంగా చెప్పలేకున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య సాయం అందించేందుకు పంజాబ్ ప్రభుత్వం ముందుకు రాగా ఆయన తిరస్కరించారు. దీంతో, పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. ఆదివారం దల్లేవాల్ను పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ నానక్ సింగ్, మాజీ డిప్యూటీ డీఐజీ నరీందర్ భార్గవ్ కలిసి మాట్లాడారు. పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లతో నవంబర్ 26 నుంచి నిరశన దీక్ష సాగిస్తుండటం తెలిసిందే. -
ఎంఎస్పీ పంజాబ్కే కాదు.. దేశమంతటికీ అవసరమే
చండీగఢ్: పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కేవలం పంజాబ్కే కాదు, దేశంలోని రైతులందరికీ అవసరమేనని నిరాహార దీక్ష చేస్తున్న పంజాబ్ రైతు నేత జగ్జీత్ సింగ్ దలేవాల్(70) పేర్కొన్నారు. ఈ విషయం కేంద్రానికి తెలిసేలా చేయాలన్నారు. ఈ పోరాటంలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల రైతులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద దలేవాల్ చేపట్టిన దీక్షకు శనివారంతో 40 రోజులు పూర్తయ్యాయి. దీన్ని పురస్కరించుకుని ఖనౌరీలో ఏర్పాటైన ‘కిసాన్ మహాపంచాయత్’నుద్దేశించి దలేవాల్ మాట్లాడారు. కార్యక్రం వేదికపైకి దలేవాల్ను స్ట్రెచర్పై తీసుకువచ్చారు. బెడ్పై పడుకుని సుమారు 11 నిమిషాలపాటు మాట్లాడారు. ‘ఎంఎస్పీ పంజాబ్ రైతులకు మాత్రమే దేశమంతటికీ అవసరమే. ఎంఎస్పీకి గ్యారెంటీ సహా మనం చేస్తున్న డిమాండ్లు సాధారణమైనవి కావన్న విషయం నాకు తెలుసు. వీటిని సాధించుకోవడం ఏ ఒక్కరి వల్లో అయ్యే పనికాదు కూడా. ఇప్పటి ఆందోళనల్లో రెండు రైతు సంఘాలు మాత్రమే పాలుపంచుకుంటున్నాయి. పంజాబ్ ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తోంది. ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఈ పోరులో పాల్గొనాలి. ఇది కేవలం పంజాబ్ డిమాండ్ మాత్రమే కాదు, యావద్దేశానిది. అనే సందేశాన్ని కేంద్రానికి వినిపించేలా చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నా’అని ఆయన పేర్కొన్నారు. ‘మనం గెలుస్తామనే విశ్వాసం నాకుంది. బల ప్రయోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయతి్నంచినా మనల్ని మాత్రం ఓడించలేదు. నాకేమైనా పట్టించుకోను. మళ్లీ రైతులు ఆత్మహత్యలకు పాల్పడే అవసరం రాకూడదనే నా ప్రయత్నమంతా’అని వివరించారు. ‘దలేవాల్ ప్రాణాలు ముఖ్యమని సుప్రీంకోర్టు అంటోంది. నేనూ మనిషిని సరే, దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడిన 7 లక్షల మంది సంగతేమిటని గౌరవ సుప్రీంకోర్టును అడుగుతున్నా’అని దలేవాల్ అన్నారు. -
సుప్రీంకోర్టుపైనే దుష్ప్రచారమా?
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్సింగ్ దలేవాల్ ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని పంజాబ్ ప్రభుత్వంపై మండిపడింది. పైగా సుప్రీంకోర్టు వల్లే దలేవాల్ దీక్ష కొనసాగిస్తున్నారంటూ పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నాయకులు మీడియాలో తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. దలేవాల్ దీక్షను భగ్నం చేయాలని తాము చెప్పడం లేదని, ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలని మాత్రమే సూచిస్తున్నామని వెల్లడించింది. దలేవాల్ గత ఏడాది నవంబర్ 26న దీక్ష ప్రారంభించారు. గురువారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. ఆయనకు వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వ అధికారులు లెక్కచేయడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల∙ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అలాగే రైతుల ఉద్యమంలో కోర్టు జోక్యం చేసుకోవాలని, కేంద్రానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దలేవాల్ దాఖలు చేసిన తాజా పిటిషన్నూ విచారించింది. ‘‘పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నేతలు మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దలేవాల్ దీక్షను భగ్నం చేయడానికి సుప్రీంకోర్టు ప్రయతి్నస్తోందని, అందుకు ఆయన ఒప్పుకోవడం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలి్పస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారు. దలేవాల్ పట్ల రైతు సంఘాల నాయకుల వ్యవహారాల శైలి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన దీక్షను భగ్నం చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని మేము ఏనాడూ ఆదేశించలేదు. దలేవాల్ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఆసుపత్రి తరించాలని మాత్రమే చెబుతున్నాం. ఆసుపత్రిలో ఆయన దీక్ష కొనసాగించుకోవచ్చు. దలేవాల్ ఆరోగ్యంపై మేము ఆందోళన చెందుతున్నాం. ఆయన రాజకీయ సిద్ధాంతాలకు సంబంధం లేదని నాయకుడు. కేవలం రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. రైతు నాయకుడిగా దలేవాల్ ప్రాణం ఎంతో విలువైంది. ఆసుపత్రిలో చికిత్స పొందేలా దలేవాల్ను ఒప్పించడానికి పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. మంత్రులు గానీ, అధికారులు గానీ ఒక్కసారైనా దీక్షా శిబిరానికి వెళ్లారా? రైతు సంఘాలతో సఖ్యత కుదుర్చుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు’’ అని ధర్మాసనం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
నేడు మళ్లీ ఢిల్లీ చలో
చండీగఢ్: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత సహా పలు డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం ఆదివారం తిరిగి మొదలవుతుందని రైతు సంఘం నేత సర్వాన్ సింగ్ పాంథర్ చెప్పారు. శంభు నుంచి శుక్రవారం మొదలైన ర్యాలీపై హరియాణా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో మొత్తం 16 మంది గాయపడ్డారని, వీరిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారని ఆయన వివరించారు. క్షతగాత్రుల్లో నలుగురు చికిత్స పొందుతుండగా మిగతా వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారన్నారు. ఈ పరిణామంతో శనివారం ర్యాలీని నిలిపివేశామని ఆయన శంభు వద్ద మీడియాకు తెలిపారు. తమ డిమాండ్లపై చర్చలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహా్వనం అందలేదని పాంథర్ చెప్పారు. తమతో చర్చలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. అందుకే, 101 మంది రైతుల బృందంతో కూడిన జాతాను ఆదివారం మధ్యాహ్నం నుంచి శాంతియుతంగా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. శుక్రవారం రైతులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో కేందరంలోని బీజేపీ ప్రభుత్వం అసలు స్వరూపం బట్టబయలైందని ఆయన వ్యాఖ్యానించారు. -
ప్రాణం పోయినా.. పరిహాసమేనా?
ఈ ఫొటోలో కనిపిస్తున్నది మహబూబాబాద్ మండలంలోని గుండాలగడ్డ తండాకు చెందిన భూక్య సంత్రాలి, ఆమె కుమారుడు మహేష్. వీరి కుటుంబ పెద్ద భూక్య హసిరాం తనకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి, పెసర పంటలు సాగు చేసేవాడు. ఇందుకోసం బ్యాంకులో, ప్రైవేటుగా రూ.8 లక్షల వరకు అప్పులు చేశాడు. పత్తి, పెసరకు తెగుళ్లు సోకడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు చేతికి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయాడు. అప్పులోళ్ల ఒత్తిడితో 2015 సెపె్టంబర్ 7న హసిరాం తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారించిన తర్వాత త్రిసభ్య కమిటీ అధికారులు వచ్చి హసిరాం కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని చెప్పి వెళ్లారు. తొమ్మిదేళ్ల నుంచి ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటికీ పరిహారం అందలేదని సంత్రాలి, మహేష్ వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: అప్పులు తీసుకుని పంటలు సాగు చేసి, నష్టాల పాలై బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలను కనికరించే నాథుడే కన్పించడం లేదు. ఎప్పటికప్పుడు కాలం కలిసి రాకపోతుందా.. కష్టాల నుంచి బయట పడకపోతామా..అనే ఆశతో సాగు చేస్తూ, పంటలు చేతికి రాక అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన రైతుల కుటుంబాలు సాయం కోసం ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు. దీంతో రైతు బీమా అమలుకు ముందు, రైతు బీమా అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన వేలాది మంది రైతుల కుటుంబాల పరిస్థితి నేటికీ దయనీయంగానే ఉంది. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2014 నుంచి 2022 వరకు 5,112 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా రు. ఇందులో రైతు బీమా అమల్లో లేని 2014–2018 సంవత్సరాల మధ్య బలవన్మరణాలకు పాల్పడిన వారు 4,125 మంది ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 175 మంది రైతులు చనిపోయినట్లు రైతు స్వరాజ్య వేదిక (ఆర్ఎస్వీ) సర్వే చెబుతోంది. త్రిసభ్య కమిటీ నివేదికే ప్రామాణికం రైతు బీమా అమల్లో లేని జూన్ 2, 2014 నుంచి ఆగస్టు 14, 2018 మధ్యకాలంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 194 జీఓనే వర్తించేది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను విచారించేందుకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అధికారులు ఇచ్చే నివేదికే పరిహారం ఇచ్చేందుకు ప్రామాణికం. అయితే ఆ కమిటీ పంపిన నివేదికలు పరిహారం అందించడానికి ప్రతిబంధకంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. అనేక కేసుల్లో సరైన విధంగా విచారణ జరిపి వాస్తవాలు నిర్ధారించకుండా, కూతురు పెళ్లి లేదా కొడుకు చదువు లేదా ఇంటి నిర్మాణం కోసం అప్పులు అయ్యాయంటూ నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కౌలు రైతు అయితే కౌలు కాగితాలు లేవనో, మరో కారణమో పేర్కొంటూ నివేదికలు పంపినట్లు చెబుతున్నారు. ఈ కారణాలతోనే 4,125 మందిలో కేవలం 1,600 కుటుంబాలకు మాత్రమే ఎక్స్గ్రేషియా అందిందని, మిగతా వాటిని తిరస్కరించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్గ్రేషియా రాని కుటుంబాలు ఏళ్ల తరబడి కార్యాలయాలు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండాపోతోంది. అయితే రైతు కుటుంబాలు ఇప్పటికీ ప్రభుత్వం ఆదుకోక పోతుందా, పరిహారం అందకపోతుందా అన్న ఆశతోనే ఎదురు చూస్తున్నాయి. ఇక 2018 ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో రైతు బీమా అమల్లోకి వచ్చాక అధికారులు ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబం దగ్గరికి వెళ్లడమే మానేశారు. దీంతో సొంత భూమి ఉన్న రైతుకు రైతు బీమా వస్తే వచ్చినట్టు లేదంటే లేదన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. కౌలు రైతుల సంగతేంటి..? సొంత భూమి లేని కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే 194 జీఓ వర్తించక, రైతు బీమా రాక.. ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం అందడం లేదు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా కౌలు రైతులు, రైతు కూలీలకు బీమా అమలైతే వారికి కూడా 194 జీఓ వర్తిస్తుంది. 194 జీఓ ఏం చెబుతోంది? జీవో 194 వర్తిస్తే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు, అప్పుల వారందరికీ వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రూ.లక్ష ఇచ్చే అవకాశం ఉంది. ఆ కుటుంబం అప్పుల నుంచి కొంత మేరకు బయట పడుతుంది. ప్రభుత్వం ఇల్లు, పెన్షన్ మొదలైన సౌకర్యాలు కల్పించనుండడంతో జీవితానికి భరోసా లభిస్తుంది. పిల్లలు చదువులు కొనసాగించేందుకు వీలవుతుంది. అయితే 194 జీవో ప్రకారం రైతు కేవలం వ్యవసాయం కోసమే అప్పు చేసినట్లుగా త్రిసభ్య కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది. పరిహారానికి సిఫారసు చేయాల్సి ఉంటుంది. అయితే మెజారిటీ కేసుల్లో త్రిసభ్య కమిటీ నివేదికలు రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా లేవని సమాచారం. కాగా పరిహారం అందని కుటుంబాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు అధికారంలో ఉన్నందున తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. హామీ ఇచ్చిన విధంగా ఆదుకోవాలి బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఎక్స్గ్రేషియా కోసం ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. కొందరికి కుటుంబం గడవటం కూడా కష్టంగా ఉంటోంది. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఈ కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ కుటుంబాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం చాలా అన్యాయం. సరైన విధంగా విచారణ జరిపించి ఆయా కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. కౌలు రైతులను, రైతు కూలీలను వెంటనే గుర్తించి బీమా పరిధిలోకి తీసుకురావాలి. – బి.కొండల్రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక సాయం కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నా.. నా భర్త ఎలవేణి వెంకటయ్య మాకున్న రెండు ఎకరాల భూమిలో వ్యవసాయ పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను చదివించేవాడు. అయితే పత్తి పంటకు నీళ్లు లేవని అప్పు చేసి రెండు బోర్లు వేశాడు. కానీ చుక్క నీళ్లు రాలేదు. దీంతో పాటు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి కోసం అప్పు చేశాడు. అసలు, వడ్డీ కలిపి రూ.6 లక్షలవడంతో వాటిని తీర్చలేననే బాధతో 2017 అక్టోబర్ 10న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడేళ్ల నుంచి పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. – ఎలవేణి స్వరూప, చౌటపల్లి, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా -
చట్టబద్ధత కోసం తీవ్ర ఒత్తిడి తెస్తాం
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సాధన కోసం మోదీ సర్కార్పై తీవ్రమైన ఒత్తిడి తెస్తామని లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీ పునరుద్ఘాటించారు. బుధవారం పార్లమెంట్ భవన కాంప్లెక్స్లో రాహుల్ను రైతు సంఘాల నేతలు కలిశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచి్చన 12 మంది రైతునేతల బృందం రాహుల్తో సమావేశమై రైతాంగ సమస్యలపై చర్చించారు. ‘‘ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మా మేనిఫెస్టోలో ప్రస్తావించాం. పూర్తిస్థాయి సమీక్ష తర్వాతే ఇది ఆచరణ సాధ్యమని చెప్పాం. ఈ విషయమై రైతునేతలతో కాంగ్రెస్ చర్చించింది. ఇక ‘ఇండియా’ కూటమి నేతలతో సమాలోచనల జరిపి ఎంఎస్పీ చట్టబద్ధత కోసం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తాం’ అని భేటీ తర్వాత రాహుల్ చెప్పారు. -
రైతుకు రొక్కమేది?
సాక్షి, అమరావతి, నెట్వర్క్: తాము అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేలు చొప్పున సాగు సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తొలి విడత సాయాన్ని ఇటీవలే జమ చేసిందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాతా సుఖీభవ ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని కోరాయి. వ్యవసాయదారులకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని వెంటనే జమ చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా రైతులతో పాటు కౌలు రైతులు, అటవీ, దేవదాయ, అసైన్డ్ భూసాగుదారులకు పెట్టుబడి సాయం అందించాలని కోరుతూ తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య కడపలో, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కాటమయ్య పుట్టపర్తిలో, ఆయా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, పి.జమలయ్య విజయవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా పీఎం కిసాన్ – వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించిందని గుర్తు చేశారు. తొలివిడత సాయాన్ని గత ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే జమ చేసిందని చెప్పారు. ఆ డబ్బులు దుక్కి పనులు, విత్తనాల కొనుగోలు లాంటి సాగు అవసరాలకు రైతులకు ఎంతగానో ఉపయోగపడేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున సాగు సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారని, ఈ హామీని వెంటనే అమలులోకి తేవాలని సూచించారు. తొలి విడత సాయం అందకపోవడంతో పెట్టుబడి ఖర్చుల కోసం ఖరీఫ్ సీజన్లో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేలు చొప్పున సాగు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని విడతల్లో ఎంత జమ చేస్తారో స్పష్టత ఇవ్వడంతో పాటు త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు కూడా జరపాలన్నారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పెంచి పంట రుణాలు అందించాలన్నారు. రూ.3 లక్షల వరకు వడ్డీ లేకుండా, రూ.5 లక్షల వరకు పావలా వడ్డీతో రైతు, కౌలురైతులకు రుణాలివ్వాలని కోరారు. సాగు చేస్తున్న భూమి దామాషాను పరిగణలోకి తీసుకొని పంటరుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాలువలు, మేజర్, మైనర్ కాలువలతోపాటు డెల్టా ప్రాంతంలోని మురుగునీటి కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. వ్యవసాయ మోటార్లకు బిగించిన స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించి ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం 2019లో తెచ్చిన పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించాలని, గ్రామ సభలోనే కౌలు రైతులను గుర్తించి స్వీయ ధృవీకరణ ఆధారంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. గుర్తింపు కార్డులు ఇప్పటివరకు జారీ చేయనందున కౌలు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని పచ్చి రొట్ట విత్తనాలు, అన్ని రకాల పంటల విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, ఎరువులు, పురుగు మందులు 90% సబ్సిడీపై అందించాలన్నారు. దేవదాయ, ధర్మాదాయ సాగు భూముల వేలం పాటలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గత సీజన్లో వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన కౌలురైతులకు కౌలు రేట్లు తగ్గించి నామమాత్రపు ధరతో లీజుకు ఇవ్వాలని కోరారు.ఏలూరులో ధర్నా..ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున సాగు సాయం కింద రూ.20 వేలు వెంటనే రైతులకు అందించాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, పోలవరం నిర్మాణం వేగంగా చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, బండ్లు, నాగలి తదితర పనిముట్లు కొనుగోలుపై 50 శాతం రాయితీ అందించాలన్నారు. ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీపై డీజిల్ సరఫరా చేయాలని, కల్తీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వెంటనే అందించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా చోడవరం తహసీల్దార్కు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సాయం అందకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఖరీఫ్ రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం కర్నూలులో డీఆర్ఓకు వినతిపత్రం అందచేశారు.తక్షణమే పెట్టుబడి సాయం ఇవ్వాలిసూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల పెట్టుబడి సాయం పంపిణీని కూటమి ప్రభుత్వం తక్షణమే ఆచరణలో పెట్టాలి. ఎన్ని విడతల్లో జమ చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరపాలి. తక్షణమే తొలి విడత సాయం అందించి రైతులకు అండగా నిలవాలి. లేదంటే దశలవారీగా ఆందోళన చేస్తాం.–జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంప్రతీ కౌలు రైతుకూ సాయంసామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతీ కౌలు రైతుకూ సాగు సాయం అందించాలి. గతంలో సీజన్కు ముందుగానే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సీసీఆర్సీ కార్డులు ఇచ్చారు. పంటసాగు హక్కుదారుల చట్టం 2019ని సవరించి స్వీయ ధ్రువీకరణతో ప్రతీ కౌలుదారుడికి సీసీఆర్సీ కార్డులివ్వాలి. సాగు సాయంతో పాటు సంక్షేమ ఫలాలన్నీ కౌలు రైతులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలి.–కె.కాటమయ్య, అధ్యక్షుడు, ఏపీ కౌలురైతు సంఘం -
Farmers movement: ఉద్యమం మరింత ఉధృతం
న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందుకు ఢిల్లీ రామ్లీలా మైదాన్లో గురువారం జరిగిన ‘ కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్’ వేదికైంది. ఈ మహాపంచాయత్కు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. 2021లో ఢిల్లీ సరిహద్దుల వెంట నెలల తరబడి ఉద్యమం, కేంద్రం తలొగ్గి వివాదాస్పద మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నాక ఢిల్లీలో జరిగిన అతిపెద్ద రైతు సభ ఇదే కావడం విశేషం. సాగు, ఆహారభద్రత, సాగుభూమి, రైతు జీవనం పరిరక్షణే పరమావధిగా, మోదీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలంటూ చేసిన తీర్మానాన్ని రైతు సంఘాలు ఆమోదించాయి. రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) అధ్వర్యంలో ఈ భారీసభ జరిగింది. ట్రాక్టర్లు తీసుకురావద్దని, శాంతియుత సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే లోక్సభ ఎన్నికల పూర్తయ్యేదాకా తమ ఉద్యమం కొనసాగిస్తామని రైతులు తీర్మానంలో స్పష్టంచేశారు. ‘ ఈ ఉద్యమం ఆగదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరిస్తుంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మాతో చర్చించాల్సిందే’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. -
Farmers movement, Delhi Chalo: కేసు నమోదయ్యాకే అంత్యక్రియలు
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద బుధవారం ‘ఢిల్లీ చలో’ఆందోళనల్లో పాల్గొన్న రైతులు హరియాణా పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో శుభ్కరణ్సింగ్(21) అనే యువ రైతు గాయాలతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. శుక్రవారం ఖనౌరీ వద్ద కొనసాగుతున్న ఆందోళనలో పలువురు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. శుభ్కరణ్ మృతికి బాధ్యులైన వారిపై పంజాబ్ ప్రభుత్వం కేసు నమోదు చేసే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని నేతలు తేల్చి చెప్పారు. శుభ్కరణ్ను అమరుడిగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్ మేరకు శుభ్కరణ్ కుటుంబానికి రూ.కోటి పరిహారంతోపాటు అతడి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ పంజాబ్ సీఎం మాన్ ప్రకటించారు. రైతు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని కూడా సీఎం స్పష్టం చేశారు. అనంతరం రైతు నేత సర్వాన్ సింగ్ పంథేర్ మీడియాతో మాట్లాడారు. ‘మాక్కావాల్సింది డబ్బు కాదు. మృతికి బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే మాకు ముఖ్యం. ఆ తర్వాతే అంత్యక్రియలు జరుపుతాం. ఇందుకు అవసరమైతే 10 రోజులైనా సరే వేచి ఉంటామని శుభ్కరణ్ కుటుంబసభ్యులు మాకు చెప్పారు’అని వివరించారు. రైతులపైకి టియర్ గ్యాస్.. హిసార్: హరియాణా పోలీసులతో శుక్రవారం మరోసారి రైతులు తలపడ్డారు. ఖనౌరీ వద్ద నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఖేరి చోప్తా గ్రామ రైతులను పోలీసులు అడ్డగించారు. కొందరు రైతులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొందరు రైతులతోపాటు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు వారిపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. గుండెపోటుతో మరో రైతు మృతి పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న దర్శన్ సింగ్(62) అనే రైతు గుండెపోటుతో చనిపోయినట్లు రైతు సంఘం నేతలు చెప్పారు. మరోవైపు ఆందోళనలకు సారథ్యం వహిస్తున్న రైతు సంఘాల నేతలు శుక్రవారం పలు అంశాలపై చర్చించారు. తదుపరి కార్యాచరణను 29న ప్రకటిస్తామని మీడియాకు తెలిపారు. శనివా రం కొవ్వొత్తులతో ర్యాలీ చేపడతామ న్నారు. పంజాబ్వ్యాప్తంగా బ్లాక్ డే అమృత్సర్: రైతులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ పంజాబ్ అంతటా రైతులు బ్లాక్ డే పాటించారు. శుభ్కరణ్ మృతిని నిరసిస్తూ అమృత్సర్, లూధియానా, హోషియార్పూర్ సహా 17 జిల్లాల్లో నిరసనలు చేపట్టినట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. -
Farmers movement: నేడు రైతు సంఘాల ‘బ్లాక్ డే’
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దు ల్లో ఖనౌరి వద్ద బుధవారం చోటుచేసుకున్న రైతు మరణంపై హరియాణా ముఖ్యమంత్రి, హోం మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం ‘బ్లాక్ డే’ గా పాటించాలని రైతులను కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హరియాణా సీఎం ఖట్టర్, రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ల దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 26వ తేదీన రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా, మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో మహాపంచాయత్లో చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం)లు కలిసి చేపట్టగా ఎస్కేఎం మద్దతు మాత్రమే ఇస్తోంది. 2020–21లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడిన ఎస్కేఎం నేతలెవరూ ‘ఢిల్లీ చలో’లో పాలుపంచుకోవడం లేదు. గురువారం ఎస్కేఎం నేతలు చండీగఢ్లో సమావేశమై సరిహద్దుల్లోని శంభు, ఖనౌరిల వద్ద నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, జోగీందర్ సింగ్ ఉగ్రహాన్, రాకేశ్ తికాయత్, దర్శన్పాల్ మీడియాతో మాట్లాడారు. ఖనౌరి వద్ద బుధవారం జరిగిన ఆందోళనల్లో శుభ్కరణ్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం ఖట్టర్, మంత్రి విజ్లపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిద్దరూ వెంటనే పదవులకు రాజీనామా చేయాలన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారంగా రూ.కోటి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతడికున్న రూ.14 లక్షల రుణాలను మాఫీ చేయాలన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తామన్నారు. ఎస్కేఎం(రాజకీయేతర)ను కూడా కలుపుకుని పోయేందుకు చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. -
దద్దరిల్లిన సరిహద్దులు
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ రుణాల రద్దుతో సహా ఇతర డిమాండ్లపై రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. రెండు రోజుల విరామం తర్వాత బుధవారం నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా తమ పోరాటం ఆగదని తేలి్చచెప్పారు. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలతో పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్లు దద్దరిల్లిపోయాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్లు, జేసీబీలపై నిరసనకారులు తరలివచ్చారు. సరిహద్దుల్లో వేలాది మంది గుమికూడారు. రక్షణ వలయాన్ని ఛేదించుకొని ముందుకు దూసుకెళ్లడానికి ప్రయతి్నంచారు. వాహనాలతో బారీకేడ్లను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానించారు. నిరసనకారులను చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు డ్రోన్తో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. శంభు బోర్డర్ పాయింట్ వద్ద బుధవారం మూడుసార్లు బాష్పవాయువు ప్రయోగం చోటుచేసుకుంది. డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు. ఖనౌరీలోనూ రైతుల ఆందోళన కొనసాగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ వెళ్లడానికి తమను అనుమతించడానికి డిమాండ్ చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. బాష్పవాయువు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి చాలామంది రైతులు మాసు్కలు, కళ్లద్దాలు ధరించారు. -
కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. చర్చలు విఫలం
చండీగఢ్: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత తదితర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీ చేసిన తాజా ప్రతిపాదనలను కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. అవి రైతులకు మేలు చేసేవి కాదని నేతలు జగ్జీత్సింగ్ దల్లేవాల్, శర్వాన్సింగ్ పంథేర్ తదితరులు సోమవారం కుండబద్దలు కొట్టారు. ప్రతిపాదనలపై సంఘాలన్నీ చర్చించుకున్న మీదట ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. తమ ‘ఢిల్లీ చలో’ ఆందోళన బుధవారం ఉదయం 11 నుంచి శాంతియుతంగా కొనసాగుతుందని ప్రకటించారు. దాంతో సమస్య మొదటికొచ్చింది. రైతు సంఘాలతో ఆదివారం సాయంత్రం మొదలైన కేంద్ర మంత్రుల కమిటీ నాలుగో దశ చర్చలు అర్ధరాత్రి తర్వాత ముగిశాయి. చర్చల్లో మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. ‘ఐదేళ్ల ఒప్పంద’ ప్రతిపాదనను మంత్రులు తెరపైకి తెచ్చారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న రైతుల నుంచి పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ పంటలకు ఐదేళ్లపాటు ఎంఎస్పీ చెల్లింపుకు సుముఖత వ్యక్తం చేశారు. వారి నుంచి ఎంత పంటనైనా కొనుగోలు చేస్తామన్నారు. ఇది వినూత్నమైన ఆలోచన అని అనంతరం గోయల్ మీడియాతో చెప్పారు. ‘‘ఐదేళ్లపాటు ఎంఎస్పీకి ఆయా పంటల కొనుగోలుకు ఎన్సీసీఎఫ్, నాఫెడ్ వంటి ప్రభుత్వ రంగ సహకార సంఘాలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఇందుకు ఒక పోర్టల్ అభివృద్ధి చేస్తాం’’ అని చెప్పారు. కనీస మద్దతు ధరకు ఇప్పటికిప్పుడు చట్టబద్ధత అసాధ్యమని తేల్చిప్పారు. ఈ ప్రతిపాదనపై రైతులు, నిపుణులతో చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పంథేర్ సోమవారం ఉదయం చెప్పారు. అప్పటిదాకా ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపేస్తున్నామన్నారు. కానీ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నామంటూ రైతు నేతల నుంచి రాత్రికల్లా ప్రకటన వెలువడింది. -
Farmers movement, Delhi Chalo: రెండో రోజూ ఉద్రిక్తత
చండీగఢ్: డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ ఉద్రిక్తతలు వరుసగా రెండో రోజు బుధవారం సైతం కొనసాగాయి. ఢిల్లీకి చేరుకోకుండా రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. పంజాబ్–హరియాణా శంభు సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఇక్కడికి చేరుకున్న వేలాది మంది రైతులు రాత్రంతా ట్రాక్టర్లపైనే ఉండిపోయారు. బుధవారం ఉదయం రక్షణ వలయాన్ని ఛేదించుకొని, ఢిల్లీవైపు వెళ్లేందుకు ప్రయతి్నంచారు. రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేసి, తమను అడ్డుకున్న పోలీసులపై నిరసనకారులు ఆగ్రహావేశాలతో రాళ్లు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టడానికి డ్రోన్లతో బాష్ప వాయువు గోళాలు ప్రయోగించారు. ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. శంభు బోర్డర్లో రోజంతా యుద్ధ వాతావరణం కనిపించింది. పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. హరియాణా ప్రభుత్వం రాష్ట్రంలో పలు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీకి చేరుకొని తమ గళం వినిపించడం తథ్యమని, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రైతులు తేలి్చచెప్పారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న తమ డిమాండ్లో ఎలాంటి మార్పు లేదని, ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రైతు సంఘం నేత జగజీత్ సింగ్ దలీవాల్ చెప్పారు. మరోవైపు, ఢిల్లీ సరిహద్దుల్లోనూ బుధవారం ఉద్రిక్తత కొనసాగింది. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. డ్రోన్లను కూల్చడానికి పతంగులు శంభు బోర్డర్ వద్ద పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను నేల కూల్చడానికి కొందరు యువ రైతులు వినూత్న ప్రయత్నం చేశారు. పతంగులు ఎగురవేశారు. పతంగుల దారాలతో డ్రోన్లను బంధించి, కూల్చివేయాలన్నదే వారి ఆలోచన. డ్రోన్లతో నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంభు సరిహద్దులో హరియాణా పోలీసులు డ్రోన్లు ప్రయోగించడం పట్ల పంజాబ్ పోలీసులు అభ్యంతరం తెలిపారు. తమ రాష్ట్ర భూభాగంలోకి డ్రోన్లను పంపొద్దని స్పష్టం చేశారు. తమ ఆందోళన కొనసాగిస్తామని, గురువారం పంజాబ్లో పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై బైఠాయిస్తామని రైతు సంఘాల నాయకులు చెప్పారు. నేడు మూడో దశ చర్చలు! రైతుల డిమాండ్ల విషయంలో రైతు సంఘాలతో నిర్మాణాత్మక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా బుధవారం చెప్పారు. చర్చలకు సానుకూల వాతావరణం కలి్పంచాలని, నిరసన కార్యక్రమాలు విరమించాలని రైతులకు సూచించారు. అసాంఘీక శక్తుల వలలో చిక్కుకోవద్దని చెప్పారు. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల జరిగిన రెండు దశల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చలకు ఇరుపక్షాలు సముఖంగా ఉన్నాయి. మూడో దశ చర్చలు గురువారం మధ్యాహ్నం చండీగఢ్లో జరుగనున్నట్లు తెలిసింది. -
Farmers movement: సర్కారు ‘మద్దతు’ లేదనే..!
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతన్న మరోసారి కన్నెర్రజేశాడు. డిమాండ్ల సాధనకు రాజధాని బాట పట్టాడు. దాంతో రెండు రోజులుగా ఢిల్లీ శివార్లలో యుద్ధ వాతావరణం నెలకొంది. అవసరమైతే మరోసారి నెలల తరబడి ఆందోళనలు కొనసాగించేందుకే రైతులు సిద్ధమవుతున్నారు. పంజాబ్, హరియాణాతో పాటు ఉత్తర యూపీకి చెందిన రైతులు భారీ సంఖ్యలో నిరసనల్లో పాల్గొంంటున్నారు. అన్ని పంటలకూ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించడంతో పాటు దానికి చట్టబద్ధత కల్పించాలన్నది వారి ప్రధాన డిమాండ్. దాంతోపాటు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు కూడా రైతులు పట్టుబడుతున్నారు. ఇంతకీ ఏమిటీ ఎంఎస్పీ? రైతు సంక్షేమానికి స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులేమిటి...? ఎంఎస్పీ కీలకం.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడంలో కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రైస్–ఎంఎస్పీ)ది కీలక పాత్ర. ► రైతుల నుంచి పంటను సేకరించేందుకు ప్రభుత్వం చెల్లించే కనీస ధరే ఎంఎస్పీ. ► ఇది వారికి మార్కెట్ ఒడిదొడుకుల బారినుంచి రక్షణతో పాటు స్థిరత్వాన్ని, ఆదాయ భద్రతను కల్పిస్తుంది. ► దీన్ని కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) నిర్ణయిస్తుంటుంది. ఈ విషయంలో ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ధోరణులు, డిమాండ్–సరఫరా తదితరాలను పరిగణనలోకి తీసుకుంటుని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ఎంఎస్పీపై సిఫార్సులు చేస్తుంది. వాటి ఆధారంగా సీసీఈఏ తుది నిర్ణయం తీసుకుంటుంది. సీఏసీపీ 1965లో ఏర్పాటైంది. ఇలా లెక్కిస్తారు... ఎంఎస్పీ లెక్కింపు సంక్లిష్టమైన ప్రక్రియ. ఇందుకోసం రైతులకయ్యే ప్రత్యక్ష, పరోక్ష ఉత్పత్తి వ్యయాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ► ఎరువులు, విత్తనాలు, కూలీల వంటివి ప్రత్యక్ష వ్యయం కాగా రైతు సొంత కుటుంబం పడే కష్టం, అద్దెలు తదితరాలు పరోక్ష వ్యయం. ► వీటిని స్థూలంగా ఏ2, ఎఫ్ఎల్, సీ2గా వర్గీకరిస్తారు. ► పంట ఎదుగుదల, ఉత్పత్తి, నిర్వహణ నిమిత్తం చేసే ఎరువులు, విత్తనాలు, కూలీల వ్యయం ఏ2 కిందకు వస్తుంది. ► ఈ అసలు ఖర్చులకు కుటుంబ కష్టం తదితర పరోక్ష ఉత్పత్తి వ్యయాన్ని కలిపితే ఎఫ్ఎల్. ► ఏ2, ఎఫ్ఎల్ రెండింటికీ మూలధన ఆస్తులు, రైతు చెల్లించే అద్దెలను కలిపితే వచ్చేదే సీ2. ► వీటికి తోడు పలు ఇతర అంశాలను కూడా సీఏసీఊ పరిగణలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు సాగు వ్యయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ప్రతి క్వింటా పంట దిగుబడికి అయ్యే వ్యయమూ అంతే. అలాగే మార్కెట్ ధరలు, వాటి ఒడిదొడుకులు, కూలీల వ్యయం తదితరాలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. వీటన్నింటితో పాటు సదరు పంట ఎగుమతులు, దిగుమతులు, మొత్తం నిల్వలు, డిమాండ్, తలసరి వినియోగం, ప్రాసెసింగ్ పరిశ్రమ ధోరణులు తదితరాలన్నింటినీ ఎంఎస్పీ లెక్కింపు కోసం సీఏసీపీ పరిగణనలోకి తీసుకుంటుంది. స్వామినాథన్ సిఫార్సులు... ► అన్ని పంటలకూ ఎంఎస్పీ హామీ ఇస్తూ చట్టం తేవాలి. ఎంఎస్పీ మొత్తం పంట సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం ఎక్కువగా ఉండాలి (దీన్ని సీ2+50 పద్ధతిగా పిలుస్తారు). ► రైతు ఆత్మహత్యలను అరికట్టేలా భూమి, నీరు, సేంద్రియ వనరులు, రుణం, బీమా, టెక్నాలజీ, పరిజ్ఞానం, మార్కెట్ల వంటి మౌలిక సదుపాయాలు వారందరికీ అందుబాటులో తేవాలి. ► రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి. ► రైతు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ద్వారా మెరుగైన ధర కలి్పంచాలి. ► వ్యవసాయోత్పత్తుల సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రమాణాలకు తగ్గట్టు ఉండాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ ఛలో’ యాత్ర: కేంద్రానికి రాకేశ్ టికాయత్ హెచ్చరిక
న్యూఢిల్లీ: రైతుల ‘ఢిల్లీ ఛలో’ యాత్రతో ఢిల్లీ నగర సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి బయల్దేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. సింగు బోర్డర్ వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. ఉద్రిక్తతలు చోటు చేసుకోవటంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో నిరనసన కారులు చెల్లాచెదురయ్యారు. శంభు బోర్డర్ వద్ద హైటెన్షన్ నెలకొంది. దీంతో రైతులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో భారత్ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల వేళ రైతుల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం సమస్యగా సృష్టిస్తే ఊరుకోమని అన్నారు. పలు రైతుల సంఘాలు భిన్నమైన సమస్యలపై పోరాటం చేస్తాయని తెలిపారు. కానీ, నేడు(మంగళవారం) చేపట్టిన రైతుల ‘ఢిల్లీ ఛలో’ మార్చ్ను సమస్యగా చిత్రీకరిస్తే ఊరుకోమని మండిపడ్డారు. తాము రైతులకు దూరంగా లేమని.. నిరసన తెలిపే రైతులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని గుర్తుచేశారు. #WATCH | On farmers' 'Delhi Chalo' march, farmer leader Naresh Tikait says "Protests are underway in the entire country...The government should sit with us and hold discussions and give respect to the farmers. Government should think about this issue and try to solve this..." pic.twitter.com/2itfTQ6AlR — ANI (@ANI) February 13, 2024 అదేవిధంగా రాకేశ్ టికాయత్ సోదరుడు నరేష్ టికాయత్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లపై చర్చ జరపాలని అన్నారు. దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం రైతులతో చర్చలు జరపి అంతేవిధంగా రైతులకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఆలోచించి రైతుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఇక.. రైతుల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా ‘భారత్ బంద్’ నిర్వహించాలని రాకేష్ టికాయత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భారత్ కిసాన్ యూనియన్(బీకేయూ) దేశంలోని అతిపెద్ద రైతు సమాఖ్యలలో ఒకటి. నేడు ప్రారంభమైన ‘ఢిల్లీ ఛలో’ రైతుల ఆందోళనలో అది చేరితే.. కేంద్రం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రైతు నిరసనకారుల్లో చర్చజరుగుతోంది. చదవండి: Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్ బంద్ -
Delhi Chalo: హస్తినలో హైటెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: పలు డిమాండ్ల సాధనతో మంగళవారం దేశ రాజధానిలో నిరసనకు సిద్ధమైన అన్నదాతల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధం అయ్యారు. ఉదయం నుంచే బారికేడ్లతో ఎక్కడికక్కడ సరిహద్దుల వద్ద నిలబడ్డారు. దీంతో అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు నెల రోజులపాటు ఢిల్లీలో సభలు, ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, నగరంలోకి ట్రాక్టర్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు పోలీసులు తేల్చి చెప్పారు. ఢిల్లీలో నెల రోజులపాటు 144 సెక్షన్ అమలవుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. నేటి నుంచి వచ్చే నెల 12వ తేదీ దాకా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జనం గుంపులుగా గుమికూడవద్దని పేర్కొన్నారు. రైతు సంఘాల ‘చలో ఢిల్లీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. రోడ్లను దిగ్బంధించడం, ప్రయాణికుల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిటీలో ట్రాక్టర్ల ర్యాలీలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. నగర పరిధిలో అనుమానిత వస్తువులు, పేలుడు పదార్థాలు, బాణాసంచా, ఇతర అనుమతి లేని ఆయుధాలు, ప్రమాదకరమైన రసాయనాలు, పెట్రోల్, సోడా సీసాలు రవాణా చేయడంపైనా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. #WATCH | Ambala, Haryana: Security heightened at the Shambhu border in view of the march declared by farmers towards Delhi today. pic.twitter.com/AwRAHprtgC — ANI (@ANI) February 13, 2024 రెచ్చగొట్టే నినాదాలు, ప్రసంగాలు, సోషల్ మీడియాలో అనుచిత మెసేజ్లు పంపడంపైనా నిషేధం ఉందన్నారు. భూసేకరణలో తీసుకున్న భూములకు పరిహారం పెంచడం, పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకురావడంతోపాటుఇతర డిమాండ్ల సాధన కోసం రైతులు మంగళవారం తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గత అనుభవాల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. రోడ్లపై బారికేడ్లు.. కొయ్యముక్కలు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాతోపాటు పలు రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. 13వ తేదీన పార్లమెంట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 2 వేలకు పైగా ట్రాక్టర్లతో ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. నిరసనకారులను ∙అడ్డుకోవడానికి వివిధ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సరిహద్దుల్లో రోడ్లపై మేకుల్లాంటి పదునైన కొయ్యముక్కలు బిగించారు. #WATCH | Delhi: Security heightened at Delhi borders in view of the march declared by farmers towards the National Capital today. (Visuals from Gazipur Border) pic.twitter.com/XeKWMWi1S9 — ANI (@ANI) February 13, 2024 రైతు సంఘాలతో మంత్రుల చర్చలు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా సోమవారం చండీగఢ్లో రైతు సంఘాల నేతలతో రెండో దశ చర్చలు ప్రారంభించారు. సంయుక్త కిసాన్ మోర్చా నేత జగజీత్ దలీవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వన్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. రైతుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందని, చలో డిల్లీ కార్యక్రమాన్ని విరమించుకోవాలని మంత్రులు కోరారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 2020–2021 కాలంలో చేపట్టిన రైతుల ఉద్యమం సందర్భంగా వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునేందుకు ఒప్పుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు -
Farmers movement: రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’
న్యూఢిల్లీ/చండీగఢ్: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన ‘ఢిల్లీ చలో’మార్చ్ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నిషేధాజ్ఞలను అమలు చేయడంతో పాటు వాహనాల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు కాంక్రీట్ దిమ్మెలు, స్పైక్ బారియర్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. టొహానా బోర్డర్ వద్ద ఇసుక కంటెయినర్లను, కాంక్రీట్ బారికేడ్లను, మేకులను రోడ్డుపై ఏర్పాటు చేశారు. సోమవారం చర్చలకు రావాల్సిందిగా రైతు సంఘాలను కేంద్రం ఆహా్వనించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా, పలు ఇతర రైతు సంఘాలు ఢిల్లీ మార్చ్కి పిలుపివ్వడం తెలిసిందే. దాంతో ట్రాక్టర్ ట్రాలీ మార్చ్ సహా ఎటువంటి నిరసనలు చేపట్టరాదంటూ హరియాణా ప్రభుత్వం 15 జిల్లాల పరిధిలో సెక్షన్ 144 విధించింది. శంభు వద్ద పంజాబ్తో సరిహద్దును మూసివేసింది. ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సరీ్వసులను, బల్క్ ఎస్ఎంఎస్లను మంగళవారం దాకా నిషేధించింది. 2020–21లో రైతులు ఏడాదికి పైగా నిరసనలు కొనసాగించిన సింఘు, ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లనే ఏర్పాటు చేసి, తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో కూడా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. నిరసనకారులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. యూపీ, పంజాబ్ సరిహద్దుల్లో 5 వేల మంది పోలీసులను నియోగించారు. మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నిరసనకారులు బారికేడ్లను తొలగించుకుని లోపలికి రాకుండా ఘగ్గర్ ఫ్లై ఓవర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఇనుపïÙట్లను అమర్చారు. ఏదేమైనా కనీసం 20 వేల మంది రైతులు ఢిల్లీ తరలుతారని రైతు సంఘాలంటున్నాయి. మోదీ సర్కారు నిరంకుశత్వంతో రైతులను అడ్డుకోజూస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ మండిపడ్డారు. దాన్ని ఢిల్లీ నుంచి శాశ్వతంగా పారదోలాలని పిలుపునిచ్చారు. -
Farmers movement: యూరప్లోనూ రోడ్డెక్కిన రైతు
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. భారత్లో కాదు, యూరప్లో! అవును. రైతుల నిరసనలు, ఆందోళనలతో కొద్ది వారాలుగా యూరప్ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల్లో అసలే జీవనవ్యయం ఊహించనంతగా పెరిగిపోయింది. దీనికి తోడు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో కొద్ది నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇవి చాలవన్నట్టు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పన్నుల భారం మోయలేనంతగా మారింది. ఇలాంటి అనేకానేక సమస్యలు యూరప్ వ్యాప్తంగా రైతులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే సమస్యకు ప్రధాన కారణమంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. ఉక్రెయిన్ను కాపాడే ప్రయత్నంలో తమ ఉసురు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. పరిష్కారం కోసం ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో పలు దేశాల్లో రైతులు వేలాదిగా ఆందోళన బాట పట్టారు. ఏకంగా వేల కొద్దీ ట్రక్కులు, ట్రాక్టర్లతో రోడ్లెక్కుతున్నారు. పట్టణాలు, రాజధానులను దిగ్బంధిస్తున్నారు. నడిరోడ్లపై టైర్లను, గడ్డిమోపులను కాలబెడుతున్నారు. ప్రభుత్వాల తీరు తమ పొట్ట కొడుతోందంటూ నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కొద్ది వారాలుగా పారిస్, బెర్లిన్ మొదలుకుని ఏ నగరంలో చూసినా, ఏ ఐరోపా దేశంలో చూసినా ఇవే దృశ్యాలు!! ఫిబ్రవరి 1న రైతులు ఏకంగా యూరోపియన్ పార్లమెంటు భవనంపైకి గుడ్లు విసరడం, రాళ్లు రువ్వారు! పలు దేశాల్లో పరిస్థితులు రైతుల అరెస్టుల దాకా వెళ్తున్నాయి... రైతుల సమస్యలు ఇవీ... ► యూరప్ దేశాలన్నింట్లోనూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది గిట్టుబాటు ధర లేమి. ► దీనికి తోడు ఏడాదిగా వారిపై పన్నుల భారం బాగా పెరిగిపోయింది. ఆకాశాన్నంటుతున్న పంట బీమా ప్రీమియాలు దీనికి తోడయ్యాయి. ► విదేశాల నుంచి, ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి చౌకగా దిగుమతవుతున్న ఆహారోత్పత్తులతో వారి ఉత్పత్తులకు గిరాకీ పడిపోతోంది. ► దక్షిణ అమెరికా దేశాల నుంచి చక్కెర, ఆహార ధాన్యాలతో పాటు మాంసం తదితరాల దిగుమతిని మరింతగా పెంచుకునేందుకు ఈయూ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ► అధికారుల అవినీతి, సకాలంలో సాయం చేయడంలో అలసత్వం మరింత సమస్యగా మారుతోంది. ► ఈయూ విధిస్తున్న పర్యావరణ నిబంధనలు మరీ శ్రుతి మించుతున్నాయన్న భావన అన్ని దేశాల రైతుల్లోనూ నెలకొంది. ► పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతూ 4 శాతం సాగు భూమిని నిరీ్ణత కాలం ఖాళీగా వదిలేయాలన్న నిబంధనను యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ► పైగా పలు దేశాలు ఏటా పంట మారి్పడినీ తప్పనిసరి చేశాయి. రసాయన ఎరువుల వాడకాన్ని 20 శాతం తగ్గించాలంటూ రైతులపై ఒత్తిడి తీవ్రతరమవుతోంది. ► సాగు అవసరాలకు వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్పై సబ్సిడీ ఎత్తేయాలన్న నిర్ణయం. దీంతో సాగు వ్యయం విపరీతంగా పెరుగుతోందంటూ చాలా యూరప్ దేశాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా యూరప్లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ► పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయోత్పత్తులు తమ పుట్టి ముంచుతున్నాయంటూ స్పెయిన్ రైతులు వాపోతున్నారు. ► నిధుల లేమి కారణంగా ఈయూ సబ్సిడీలు సకాలంలో అందకపోవడం రైతులకు మరింత సమస్యగా మారింది. ఇవీ డిమాండ్లు... ► ఆహారోత్పత్తుల దిగుమతులకు ఈయూ అడ్డుకట్ట వేయాలి. ► ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ప్రధానంగా ఆసియా దేశాలకు మళ్లించేలా చూడాలి. ► ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులను నిలిపేయాలి. ► సాగుపై ప్రభుత్వపరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. ► 4% భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధనను ఎత్తేయాలి. ► పలు పర్యావరణ నిబంధనలను వీలైనంతగా సడలించాలి. ► పెట్రోల్, డీజిల్పై సాగు సబ్సిడీలను కొనసాగించాలి. ఆందోళనలు ఏయే దేశాల్లో... జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలండ్, స్పెయిన్, రొమేనియా, గ్రీస్, పోర్చుగల్, హంగరీ, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా – సాక్షి, నేషనల్ డెస్క్ -
Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్ బంద్
నోయిడా: రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఫిబ్రవరి 16వ తేదీన భారత్ బంద్ను పాటించనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర సంబంధ చట్టం అమలుసహా రైతాంగ కీలక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త బంద్ పాటించాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. మంగళవారం ముజఫర్నగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)సహా దేశంలోని అన్ని రైతు సంఘాలు ఆ రోజు భారత్ బంద్లో పాల్గొంటాయి. ఆ రోజు రైతులు తమ పొలం పనులకు వెళ్లకండి. ఒక్క రోజు పనులకు సమ్మె పాటించండి. పొలాల్లో అమావాస్య రోజున రైతులు పనులకు వెళ్లరు. అలాగే ఫిబ్రవరి 16 కూడా రైతులకు అమావాస్యే. వర్తకసంఘాలు, రవాణా సంస్థలు ఆరోజు వ్యాపార కార్యకలాపాలు నిలిపేయాలని కోరుకుంటున్నా. దుకాణాలను మూసేయండి. రైతులు, కార్మికులకు మద్దతుగా నిలబడండి’’ అని తికాయత్ విజ్ఞప్తిచేశారు. -
మళ్లీ ఆందోళన బాటలో అన్నదాతలు
చండీగఢ్: పంజాబ్, హరియాణా రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు. పెండింగ్ డిమాండ్ల పరిష్కారానికి మూడు రోజులపాటు నిరసనలు తెలపాలన్న సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పిలుపు మేరకు ఆదివారం పంజాబ్, హరియాణా రైతులు ట్రాక్టర్ ట్రాలీల్లో వందలాదిగా చండీగఢ్కు చేరుకోవడం ప్రారంభమైంది. దీంతో, రైతులను అడ్డుకునేందుకు చండీగఢ్, పంజాబ్, హరియాణా పోలీసులు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. రైతులు ముందుగా మొహాలిలోని అంబ్ సాహిబ్ గురుద్వారాకు చేరుకుని, అక్కడి నుంచి సోమవారం చండీగఢ్ దిశగా తరలివెళ్తారని భావిస్తున్నారు. ఇలా ఉండగా, పంజాబ్ హరియాణా హైకోర్టు ఆదేశాల ప్రకారం..రైతులు రోడ్లపై బైఠాయించడం ధిక్కరణ కిందికి వస్తుందని పంచ్కుల పోలీస్ కమిషనర్ తెలిపారు. రైతుల ప్రవేశాన్ని నిరోధించేందుకు చండీగఢ్ యంత్రాంగం మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. చండీగఢ్–పంచ్కుల మార్గాన్ని మూసేసింది. -
రైతులంతా సంఘటితం కావాలి
సాక్షి, హైదరాబాద్:‘‘చట్టసభల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజల కోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి దేశంలో కొనసాగుతుండటం మనందరి దురదృష్టం..’’ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులు పోరాడాల్సి ఉందని చెప్పారు. ఈ సంఘర్షణ ప్రారంభ దశలో కలిసి వచ్చే శక్తులు కొంత అనుమానాలు, అపోహలకు గురవుతుంటాయని.. ఈ అడ్డంకులు దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు వచ్చిన 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమపథకాలను రైతు నేతలు తెలుసుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు జాతీయ రైతు ఐక్యవేదిక ఏర్పాటు కావాలని అభిప్రాయపడ్డారు. అనంతరం ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ ఆరా తీయగా.. కేంద్ర రైతు వ్యతిరేక, అసంబద్ధ విధానాలతో నష్టం జరుగుతోందని రైతు నాయకులు వివరించారు. తెలంగాణలో మాదిరిగా తమకూ సహకారం దొరికితే కష్టాల నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై కలిపి ముందుకెళదామని సీఎం కేసీఆర్ వారికి సూచించారు. ఇంకా వ్యవసాయ సంక్షోభం ఎందుకు? ‘‘దేశంలో సాగునీరుంది. కరెంటుంది. కష్టపడే రైతులున్నారు. అయినా వ్యవసాయ సంక్షోభం ఎందుకుంది? రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయి? కేంద్ర పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచాక కూడా కేంద్రంలో పాలనా వ్యవస్థ ఇంకా గాడిన పడకుండా, ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను మనం అన్వేషించాలి. అనేక వర్గాలు తమ ఆకాంక్షలను, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు సిద్ధపడుతుండటం ఎందుకో ఆలోచించాలి. దేశంలో రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడం లేదో, ఈ దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో చర్చించుకోవాలి. దేశంలో అవసరానికి మించి నీళ్లు ఉన్నా ప్రజలు సాగునీటికి, తాగునీటికి ఇంకా ఎందుకు ఎదురు చూడాల్సి వస్తోంది? దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యమున్నా 2 లక్షల మెగావాట్ల విద్యుత్ను కూడా వినియోగించుకోలేకపోతున్నాం. మేం తెలంగాణలో రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తూ, సాగునీటిని అందిస్తున్నపుడు.. ఇదే పనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయదు? తెలంగాణలో ఉన్నట్టు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్లు ఉన్నాయా?’’అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దేశ వనరులను సరిగా వినియోగించుకుంటూ.. రైతు వ్యవసాయ సంక్షేమ దిశగా సాగే సుపరిపాలన కోసం దేశంలోని రైతాంగమంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. దేశానికి కేసీఆర్ వంటి నాయకత్వం కావాలి! నిన్నటితరం రైతు సంఘాల నేతలు చరణ్ సింగ్, దేవీలాల్, జయప్రకాశ్ నారాయణ్, శరద్ పవార్ తదితరులతో కలిసి పనిచేసిన 80 ఏళ్ల వయసు పైబడిన పలువురు రైతు నేతలు కేసీఆర్తో సమావేశంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. దేశానికి సీఎం కేసీఆర్లాంటి నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, సాగునీరు తదితర రంగాల్లో తెలంగాణ ప్రగతిపై ప్రదర్శించిన డాక్యుమెంటరీ చూసి మెచ్చుకున్నారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి రైతు సంక్షేమ పథకాలు ఉంటే.. తాము కూడా ఎంతో అభివృద్ధి చెందేవారమని పేర్కొన్నారు. తెలంగాణ సహా ఢిల్లీ, ఒడిశా, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, హరియాణా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, అసోం, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలి తదితర రాష్ట్రాల రైతు సంఘాల నేతలు 100 మంది వరకు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం కూడా రైతుల సమావేశం కొనసాగనుంది. -
తెలంగాణలో రైతు సంక్షేమం అద్భుతం
సాక్షి, హైదరాబాద్/ తొగుట (దుబ్బాక): వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధితోపాటు రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని ఇతర రాష్ట్రాల రైతులు కొనియాడారు. తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి, సాగునీటిరంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు 25 రాష్ట్రాల నుంచి బయలుదేరిన దాదాపు 100 మంది రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎకరానికి ఏటా రూ. 10 వేల చొప్పున రైతుబంధు సాయం, రూ. 5 లక్షల రైతు బీమా అందించడం దేశ చరిత్రలోనే గొప్ప పరిణామమని యూపీ రైతు నాయకుడు హిమాంశ్ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ తెలంగాణకే కాదు.. దేశానికే రైతు బాంధవుడని కొనియాడారు. తెలంగాణ మాదిరి పథకాలను దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అమలు చేయాల ని డిమాండ్ చేశారు. అనంతరం వారు తెలంగాణకు హరితహారం పథకం అమలు తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. రాజీవ్ రహదారి వెంట అవెన్యూ ప్లాంటేషన్, ఓఆర్ఆర్పై పచ్చదనం, సిద్దిపేట జిల్లా ములుగు, సింగాయపల్లి, కోమటిబండ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల పునరుద్ధరణను పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ ఆయా కార్యక్రమాల ప్రత్యేకతను వివరించారు. ఆ తర్వాత రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ను సందర్శించారు. దీ న్ని అద్భుత కట్టడంగా అభివర్ణించారు. పంప్హౌస్ 8వ మోటారు నుంచి నీటి విడుదల ను తిలకించారు. అయితే ఈ క్రమంలో నీరు ఒక్కసారిగా ఎగసిపడటంతో అక్కడున్న ప్ర తినిధులంతా పరుగులు తీస్తూ ఒకరిపై ఒకరు పడిపోయారు. పశ్చిమ బెంగాల్కు చెందిన కొందరు రైతు సంఘాల ప్రతినిధు లు గాయపడటంతో వారికి స్థానికంగా ప్రా థమిక చికిత్స చేయించి హైదరాబాద్కు తరలించారు. రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి, గడా అధికారి ముత్యంరెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్, మల్లన్నసాగర్ ఎస్ఈ వేణు, సాయి బాబు, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. -
రైతుల ‘మహాపంచాయత్’
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత, వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్ (సవరణ) చట్టం–2022 రద్దుతోపాటు ఇతర డిమాండ్ల సాధనే ధ్యేయంగా మహాపంచాయత్లో పాల్గొనేందుకు రైతు సంఘాల పిలుపు మేరకు వేలాది మంది రైతులు ఢిల్లీకి తరలివచ్చారు. సోమవారం జంతర్మంతర్ వద్దకు చేరుకున్నారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ తదితర రాష్ట్రాల నుంచి రైతన్నలు తరలివచ్చారు. నగరంలో ఎక్కువ రోజులు ఉండేందుకే వారు సిద్ధపడి వచ్చినట్లు తెలుస్తోంది. తమ వెంట సంచులు, దుస్తులు తెచ్చుకున్నారు. రైతు సంఘాల నేతలు ఇచ్చిన జెండాలను చేతబూనారు. టోపీలు ధరించారు. జన్పథ్ మార్గంలోనూ తిరుగుతూ కనిపించారు. అన్నదాతల ఐక్యత వర్థిల్లాలని నినాదాలు చేశారు. హామీలను నెరవేర్చడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. జంతర్మంతర్కు చేరుకోకుండా రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు ఆరోపించారు. పోలీసులు మాత్రం ఖండించారు. మహాపంచాయత్ సందర్భంగా దేశ రాజధానిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తాము ఎవరినీ అడ్డుకోవడం లేదని చెప్పారు. డిమాండ్లు నెరవేరేదాకా తమ పోరాటం ఆగదని, అందుకోసం పూర్తిస్థాయి సిద్ధమై ఢిల్లీకి చేరుకున్నానని పంజాబ్ రైతు మాఘా నిబోరీ చెప్పారు. ప్రముఖ రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆదివారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ రైతుల మహాపంచాయత్ సందర్భంగా ఢిలీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు పలు మార్గాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. వాహనాలకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఢిల్లీ బోర్డర్ పాయింట్ల వద్ద 2020 నవంబర్ నాటి దృశ్యాలే మళ్లీ కనిపించాయి. ఘాజీపూర్, సింఘూ, తిక్రీ తదితర బోర్డర్ పాయింట్ల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే నగరంలోకి అనుమతించారు. సరిహద్దుల్లో వాహనాలు గంటల తరబడి బారులు తీరాయి. -
ఎంఎస్పీ కమిటీ తొలి భేటీకి 40 రైతు సంఘాలు దూరం
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరపై కేంద్రం నియమించిన కమిటీ ఆగస్టు 22న తొలిసారి సమావేశం కానుంది. అయితే, ఈ తొలి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) మంగళవారం ప్రకటించింది. కమిటీని తామిప్పటికే తిరస్కరించామని గుర్తు చేసింది. త్వరలో భావిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఎస్కేఎం నేత హనుమాన్ మొల్లా తెలిపారు. మరోవైపు ఎస్కేఎం నేతలను కనీస మద్దతు ధర కమిటీ భేటీకి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. 26 మందితో ఎంఎస్పీ కమిటీని జూలై 18న కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: కాంగ్రెస్కు ఆజాద్ షాక్.. ఆ బాధ్యతలకు నిరాకరణ.. కీలక పదవికి రాజీనామా! -
మేం ఎన్నికల్లో పాల్గొనడం లేదు
చండీగఢ్: పంజాబ్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) స్పష్టం చేసింది. అదేవిధంగా, రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్న పంజాబ్లోని 22 సంఘాల కూటమి ‘సంయుక్త సమాజ్ మోర్చా’ఎస్కేఎం పేరు వాడుకోరాదని పేర్కొంది. కేవలం రైతు సమస్యల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న 475 వేర్వేరు సంస్థలతో ఏర్పడిన వేదిక ఎస్కేఎం కాగా, పంజాబ్లోని 32 రైతు సంఘాలు అందులో ఒక భాగమని పేర్కొంటూ ఎస్కేఎం నేతలు దర్శన్ సింగ్ పాల్, జగ్జీత్ సింగ్ దల్లేవాల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక వేళ ఎస్కేఎం పేరును ఎవరైనా వాడుకుంటే చట్టపరంగా ముందుకు వెళతామన్నారు. ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత ఉద్యమాన్ని వాయిదా వేసినట్లు వారు చెప్పారు. రైతుల ఇతర డిమాండ్లపై తదుపరి కార్యాచరణను జనవరి 15న ఖరారు చేస్తామన్నారు. పంజాబ్లో రైతు సంఘాల రాజకీయ వేదిక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు నిరసనలు సాగించిన పంజాబ్లోని 22 రైతు సంఘాలు రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. రాజకీయ మార్పే లక్ష్యంగా రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని శనివారం ప్రకటించాయి. పంజాబ్లోని మొత్తం 32 రైతు సంఘాలకు గాను 22 రైతు సంఘాల ప్రతినిధులు శనివారం ఇక్కడ సమావేశమయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో పోటీ చేస్తామని భేటీ అనంతరం రైతు నేత హర్మీత్ సింగ్ కడియన్ మీడియాకు తెలిపారు. భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) నేత బల్బీర్ సింగ్ సింగ్ రాజేవాల్ తమ మోర్చాకు నేతగా ఉంటారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో జట్టుకట్టే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎన్నికల్లో ఎస్కేఎం పేరును మాత్రం వాడుకోబోమన్నారు. -
పంజాబ్లో ఆప్తో రైతు సంఘాల జట్టు
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)లో భాగంగా ఉన్న 25 రైతు సంఘాలు ప్రకటించాయి. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎస్కేఎం నేతృత్వంలో రైతు సంఘాలు ఏడాదిపాటు ఆందోళనలు కొనసాగించిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం లూథియానాలో జరిగిన సమావేశంలో ఎస్కేఎంలోని 32 రైతు సంఘాలకు 7 సంఘాలు ఎన్నికలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశాయి. అదేవిధంగా, ఎన్నికల్లో ఎస్కేఎం పేరును వాడుకోరాదని మిగతా సంఘాలను కోరాయి. రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్న 25 రైతు సంఘాలు తమ నిర్ణయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఎన్నికలకు దూరంగా ఉండే సంఘాలు.. కీర్తి కిసాన్ యూనియన్, క్రాంతి కారీ కిసాన్ యూనియన్, బీకేయూ క్రాంతికారీ, బీకేయూ సింధుపూర్, దోఆబా సంఘర్‡్ష కమిటీ, జై కిసాన్ ఆందోళన్. ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్న సంఘాల్లో సుమారు 12 వరకు ఆప్తో కూటమిగా ఏర్పడేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పంజాబ్ రైతుల ఆందోళనలకు ఆప్ మొదట్నుంచీ మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. రైతు నేతలైన బల్బీర్ సింగ్ రాజేవాల్, హర్మీత్ సింగ్ కదియాన్లు ఆప్ టికెట్పై పోటీ చేయనున్నారంటూ ఊహాగానాలు వచ్చాయి. -
రైతు నేత గర్నామ్ సొంత రాజకీయ పార్టీ
చండీగఢ్: రైతు ఉద్యమ ముఖ్య నేతల్లో ఒకరైన గుర్నామ్ సింగ్ చదుని సొంతంగా ‘సంయుక్త సంఘర్షణ మోర్చా’ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పాల్గొంటుందని చెప్పారు. స్వచ్ఛ రాజకీయాలు, మంచినేతలను ప్రోత్సహించడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మత్తు పదార్థం ఓపియం తయారీలో వాడే గసగసాల సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఈ పంట సాగుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా ఆందోళనలు కొనసాగించిన 40 రైతు సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) సభ్యుల్లో గుర్నామ్ సింగ్ చదుని కూడా ఒకరు. ఈయన హరియాణా బీకేయూ అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: సన్నిహితులపై ఐటీ దాడుల మీద అఖిలేశ్ స్పందన -
లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్సభ
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరిలో ముందస్తు కుట్రతోనే రైతులను బలితీసుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చడంతో విపక్షాలు బుధవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాకు ఉద్వాసన పలకాలని విపక్షాలు లోక్సభలో గట్టిగా డిమాండ్ చేశాయి. నినాదాలతో లోక్సభ దద్దరిల్లింది. విపక్ష సభ్యులు పట్టువీడకుండా నిరసనలు కొనసాగించడంతో సభ గురువారానికి వాయిదా పడింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలు విపక్ష పార్టీల ఎంపీలు వెల్లోకి దూసకెళ్లి మిశ్రాపై వేటు వేయాలని బిగ్గరగా నినాదాలు చేశారు. సిట్ తాజాగా వెల్లడించిన సంచలన విషయాల తాలూకు వార్తా కథనాలు కనిపించేలా ప్రతికలను చేతులతో పట్టుకొని గాల్లో ఊపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి సిట్ దర్యాప్తులో వెల్లడైన విషయాలపై చర్చించాలని వాయిదా తీర్మానానికి రాహుల్ గాంధీ నోటీసు ఇచ్చారు. దీన్ని అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ బిర్లా వీరి డిమాండ్ను పట్టించుకోకుండా∙విపక్ష ఎంపీల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్నాహ్యం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేమైన తర్వాత ఇవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. ‘ధరల పెరుగుదలపై ముఖ్యమైన చర్చ ఉంది. ఈ అంశాన్ని చర్చకు చేపట్టాలనేది మీ డిమాండే కదా. మీ స్థానాల్లోకి వెళ్లి కూర్చొండి’ అని స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. అయినా లాభం లేకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. పన్నెండు మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించడంతో రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. కుదించే ఆలోచన ప్రస్తుతానికి లేదు పార్లమెంటు శీతాకాల సమావేశాలను కుదించే ఆలోచన ప్రస్తుతానికైతే లేదని పార్లమెంటరీ వ్యవ హారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ‘ధరల పెరుగుదల, ఒమిక్రాన్ ముప్పు లాంటి ముఖ్యమైన అంశాలపై చర్చించాలన్న విపక్షాలు తీరా ఇవి చర్చకు వస్తే పాల్గొనకుండా పారిపోవడం విడ్డూరం. ఈ అంశాల్లో మాట్లాడటానికి వారికి ఏమీ లేనట్లే కనపడుతోంది. సమావేశాల నిడివిని కుదిస్తారని పుకార్లను వ్యాప్తి చేయడంలో ప్రతిపక్షాలు బిజీగా ఉన్నాయి’ అని విలేకరులతో అన్నారు. -
సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు రేపే
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్లుగా మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు రంగం సిద్ధమయ్యింది. ఈ చట్టాల ఉపసంహరణకు ఉద్దేశించిన కొత్త బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే దిగువ సభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో ఈ కొత్త బిల్లును అధికారులు చేర్చారు. సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలియజేసింది. ‘‘మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేవలం కొందరు రైతులు మాత్రమే నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమగ్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉంది’’ అని బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 29న లోక్సభకు కచ్చితంగా హాజరు కావాలని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. వివాదాస్పద సాగు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నంత మాత్రాన సరిపోదని, తమ డిమాండ్లను నెరవేర్చేదాకా పోరాటం కొనసాగిస్తామని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి. ట్రాక్టర్ల ర్యాలీ రద్దు ఈ నెల 29వ తేదీన పార్లమెంట్ వరకూ తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని రద్దు చేసినట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేత దర్శన్ పాల్ శనివారం ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని, ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 4న రైతు సంఘాలతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ముంబైలో ఆదివారం సంయుక్త షెట్కారీ కామ్గార్ మోర్చా(ఎస్ఎస్కేఎం) ఆధ్వర్యంలో కిసాన్–మజ్దూర్ మహాపంచాయత్ నిర్వహించనున్నారు. 100కు పైగా రైతు, కార్మిక సంఘాలు పాల్గొననున్నాయి. రైతుల త్యాగాలను కించపరుస్తారా?: కాంగ్రెస్ వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించిన ‘అభ్యంతరాలు, కారణాలు’ అనే పదాల పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ విమర్శలు గుప్పించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా కొనసాగుతున్న పోరాటంలో మరణించిన 750 మంది రైతుల త్యాగాలను ప్రభుత్వం కించపరుస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. 750 మంది రైతులు మరణిస్తే, కేవలం కొందరే ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వం చెప్పడం ఏమిటని నిలదీశారు. పంట వ్యర్థాల దహనం నేరం కాదు కేసుల ఉపసంహరణపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలి: కేంద్రం రైతాంగం డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. పంట వ్యర్థాలను దహనం చేయడాన్ని నేరంగా పరిగణించరాదంటూ రైతులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఆందోళన విరమించాలని కోరారు. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), పంటల వైవిధ్యంపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల డిమాండ్లపై ప్రధాని మోదీ హామీ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించే అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉందని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లిండంపైనా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాతా రైతులు ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదన్నారు. రైతన్నలు పెద్ద మనసు చేసుకొని, పోరాటం ఆపేసి, ఇళ్లకు తిరిగి వెళ్లాలని తోమర్ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ చట్టాల వల్ల దక్కే ప్రయోజనాల గురించి కొందరు రైతులను ఒప్పించలేకపోయామని, ఈ విషయంలో తమకు అసంతృప్తి ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. -
27న భవిష్యత్తు కార్యాచరణ వెల్లడి
ఘజియాబాద్: వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడే ఆగవని, భవిష్యత్తు కార్యాచరణను ఈనెల 27న జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ బుధవారం తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం చేసిన వాగ్దానాలపై కూడా మోదీ సర్కారును నిలదీస్తామన్నారు. ‘శనివారం మేము సమావేశం కానున్నాం. అక్కడ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తాం. జనవరి 1 నుంచి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. అదెలా చేస్తారో చెప్పాలని మేము ఆయన్ని అడుగుతాం’ అని తికాయత్ ట్వీట్ చేశారు. కేంద్ర తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏడాదికాలంగా నిరసన ప్రదర్శనలు కొనసాగించడంతో ఆఖరుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఈనెల 19న ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదు
లక్నో: దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, రైతులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ కోరారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు ఒక్కటే కాదు, ఇంకెన్నో అంశాలు ఉన్నాయని, వాటిపై కేంద్రం చర్చలకు వచ్చేదాకా అన్నదాతల పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటోందని, తమతో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని విమర్శించారు. రైతుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధత, విత్తనాలు, పాడి పరిశ్రమ, కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్కు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మద్దతు పలికారని తికాయత్ గుర్తుచేశారు. ఇదే డిమాండ్ను తాము లేవనెత్తుతున్నామని, ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోదీ దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. రాకేశ్ తికాయత్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఉగ్రవాదితో సరిపోల్చారు. లఖీమ్పూర్ ఖేరిలో రైతుల ఆందోళన, హింసాత్మక ఘటనలో ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో సోమవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ‘కిసాన్ మహా పంచాయత్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తికాయత్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు హాని చేస్తాయన్న నిజాన్ని గుర్తించిన ప్రభుత్వం వాటిని రద్దు చేస్తామని ప్రకటించిందని, సరైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అయితే, ఈ చట్టాల గురించి కొందరికి అర్థమయ్యేలా వివరించడంలో విఫలమయ్యామంటూ రైతుల నడుమ చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆ కొందరు తామేనని అన్నారు. ప్రజలను మభ్యపెడుతూ దేశాన్ని అమ్మేస్తుంటారు సంఘర్‡్ష విశ్రామ్(కాల్పుల విరమణ)ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే ప్రకటించిందని, రైతులు కాదని రాకేశ్ తికాయత్ ఉద్ఘాటించారు. పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయని, అప్పటిదాకా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. దేశమంతటా సభలు, సమావేశాలు నిర్వహిస్తామని, ప్రభుత్వ వ్యవహార ధోరణిని ప్రజలకు వివరిస్తామని అన్నారు. రైతుల పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘వారు (ప్రభుత్వం) ఒకవైపు మిమ్మల్ని హిందూ–ముస్లిం, హిందూ–సిక్కు, జిన్నా అంటూ మభ్య పెడుతుంటారు. మరోవైపు దేశాన్ని అమ్మేస్తుంటారు’’ అని తికాయత్ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి క్షమాపణ చెప్పినంత మాత్రాన పంటలకు కనీస మద్దతు ధర దక్కదని అన్నారు. చట్టబద్ధత కల్పిస్తేనే దక్కుతుందని చెప్పారు. ఈ అంశంపై ఒప్పటికే కమిటీని ఏర్పాటు చేశారని, నివేదిక ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) చేరిందని, నిర్ణయం తీసుకోవడానికి కొత్త కమిటీ అవసరం లేదని సూచించారు. నివేదిక ఇచ్చిన కమిటీలో నరేంద్ర మోదీ కూడా సభ్యుడేనని గుర్తుచేశారు. కమిటీ సిఫార్సులను ఆయన ఆమోదిస్తున్నారో లేదో స్పష్టం చేయాలని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించరేం? ప్రసార మాధ్యమాల తీరుపై రాకేశ్ తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా మీడియా కేవలం రైతులను మాత్ర మే ప్రశ్నిస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మీడియాకు సూచించారు. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారని తెలిపారు. కిసాన్ మహా పంచాయత్లో పలువరు రైతు సంఘాల నాయకులు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
మద్దతు ధరకు చట్టబద్ధత
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేలా చేసిన రైతన్నలు ఇక కనీస మద్దతు ధర కోసం పోరుబాట పట్టనున్నారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టబద్ధత కల్పించేంతవరరు ఉద్యమాన్ని కొనసాగించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీలో ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సమావేశమైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో బలప్రదర్శన చేయాలని నిర్ణయానికొచ్చింది. సోమవారం లక్నోలో మహాపంచాయత్ కార్యక్రమాన్ని నిర్వహించి, కేంద్రానికి రైతుల బలమేంటో మరోసారి చూపిస్తామని రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ చెప్పారు. ‘‘వ్యవసాయ రంగంలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా రైతన్నల కష్టాలు తీరవు. కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించడమే అతి పెద్ద సంస్కరణ’’ అని అన్నారు. పార్లమెంట్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణతో పాటు తాము చేస్తున్న డిమాండ్లన్నీ కేంద్రం నెరవేర్చేవరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరపై చట్టం చేసేవరకు ఉద్యమం కొనసాగేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఇందుకోసం మరోసారి ఈ నెల 27న సమావేశం కావాలని నిర్ణయించారు. రైతు సంఘాలు ఆరు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాయి. వీటిపై తమతో కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించేదాకా ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పాయి. 29న పార్లమెంట్ వరకూ ర్యాలీ తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలను రైతులు ముమ్మరం చేయనున్నారు. సోమవారం లక్నోలో కిసాన్ పంచాయత్తో పాటు ఈ నెల 26న ఢిల్లీలో అన్ని సరిహద్దుల్లో మోహరిస్తామని, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజు అంటే ఈ నెల 29న పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘం నేత బల్బీర్ సింగ్ రాజేవాలే వెల్లడించారు. 24న కేంద్ర కేబినెట్ సమావేశం న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అవసరమైన అధికార ప్రక్రియను త్వరితంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నెల 24న (బుధవారం) కేంద్ర మంత్రిమండలి సమావేశమయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించనుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే వ్యవసాయ చట్టాల రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసింది. ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల కంటే ముందుగానే కేబినెట్ సమావేశమై చట్టాల రద్దుపై చర్చించి దానికి అవసరమైన తీర్మానాన్ని ఆమోదిస్తుంది. ఆపై ఉపసంహరణ బిల్లుకు తుదిరూపమిస్తారు. ప్రధాని మోదీకి బహిరంగ లేఖ సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసింది. ఎంఎస్పీకి చట్టబద్ధతతోపాటు మొత్తం ఆరు డిమాండ్లపై రైతులతో తక్షణమే చర్చలు ప్రారంభించాలని పేర్కొంది. అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పింది. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది. ‘‘11 రౌండ్ల చర్చల తర్వాత ద్వైపాక్షిక పరిష్కార మార్గం కనుగొనడం కంటే మీరు(ప్రధాని మోదీ) ఏకపక్ష తీర్మానానికే మొగ్గుచూపారు’’ అని లేఖలో ప్రస్తావించింది. రైతు సంఘాల ఆరు డిమాండ్లు ► పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలి. ► గత ఏడాది కాలంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన 700 మందికి పైగా రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. ► రైతులపై నమోదు చేసిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి. ► పోరాటంలో రైతుల ప్రాణత్యాగాలకు గుర్తుగా ఒక స్మారక స్తూపం నిర్మించాలి. ► పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు–2020/21 ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి. ‘‘దేశ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ చట్టం–2021’ లో రైతులపై జరిమాన విధించే అంశాలను తొలగించాలి. హా లఖీమీపూర్ ఖేరి ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలి. -
సిరాలో తప్ప చట్టాల్లో నలుపు ఎక్కడ?
బస్తి(ఉత్తరప్రదేశ్): వ్యవసాయ చట్టాలను రాయడానికి వినియోగించిన సిరా మాత్రమే నలుపు అని, చట్టాల్లో ‘నలుపు’ ఎక్కడ ఉందని కేంద్ర మంత్రి వి.కె.సింగ్ రైతు సంఘాల నాయకుల్ని ప్రశ్నించారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను ఈ నాయకులు పట్టించుకోరా? అని నిలదీశారు. వివాదాస్పద సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి ప్రధాని మోదీ జాతికి క్షమాపణలు చెప్పిన మర్నాడు శనివారం కేంద్ర విమానాయాన శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్ విలేకరుల సమావేశంలో రైతు సంఘాలను తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఇటీవల ఒక రైతు సంఘం నాయకుడితో తాను జరిపిన సంభాషణని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘ఒక్కోసారి మనం విషయాలన్నీ ఎంతో బాగా అర్థం చేసుకుంటాం. కానీ వేరేవరో ఏదో చెప్పగానే గుడ్డిగా వారిని అనుసరిస్తాం. నన్ను కలిసిన ఒక రైతు సంఘం నాయకుడిని నేను ఇదే విషయాన్ని అడిగాను. చట్టాల్ని లిఖించడానికి వాడిన సిరాలో తప్ప నలుపు ఎక్కడ ఉందని సూటిగా ప్రశ్నించాను’’ అని వీకే సింగ్ అన్నారు. -
తదుపరి కార్యాచరణ ఏంటి?
న్యూఢిల్లీ: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే సరిపోదు, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆదివారం సింఘు బోర్డర్ పాయింట్ వద్ద సమావేశం కానుంది. ఎంఎస్పీతోపాటు ప్రతిపాదిత ట్రాక్టర్ ర్యాలీపై చర్చించనున్నట్లు ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ శనివారం చెప్పారు. సాగు చట్టాల రద్దు ప్రక్రియ పార్లమెంట్లో పూర్తయ్యేదాకా రైతుల పోరాటం ఆగదని అన్నారు. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ వరకూ ప్రతిరోజూ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని విరమించుకోలేదని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతన్నలు ప్రారంభించిన పోరాటానికి నవంబర్ 26న ఏడాది పూర్తి కానుంది. ఈ చట్టాలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తమ పోరాట కార్యక్రమంలో ఎలాంటి మార్పు ఉండబోదని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. ఈ నెల 26న ఢిల్లీ శివార్లలోని నిరసన కేంద్రాలకు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. కేసులను ఉపసంహరించాలి: మాయావతి కనీస మద్దతు ధరకు హామీనిస్తూ చట్టాన్ని తీసుకురావాలని బహుజన సమాజ్పార్టీ అధినేత మాయావతి శనివారం డిమాండ్ చేశారు. రైతులపై నమోదు చేసిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. -
ఎన్ని‘కలవర’మేనా!
ఏడాదిగా రైతులు ఉద్యమం చేస్తున్నా... అసలు ఆదో సమస్య కాదన్నట్లే వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ... దాని ప్రస్తావనే రానిచ్చేవారు కాదు. కేంద్రమంత్రులు, బీజేపీ సీఎంలు ఆందోళన చేస్తున్న రైతులను దేశద్రోహులు, విదేశీ నిధులతో కృత్రిమ ఉద్యమాలు నడుపుతున్నారని ఆరోపించే దాకా వెళ్లారు. మరి ఇప్పుడు ఆకస్మాత్తుగా మోదీ ఎందుకు జాతిముందుకు వచ్చారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా దేశానికి క్షమాపణ చెప్పారు. ఎవరెన్ని విమర్శలు చేసినా... అహంకారిగా ముద్రపడుతున్నా, ఒంటెత్తు పోకడలు పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమైనా... ఆత్మావలోకనం చేసుకున్న సందర్భాలు, వెనక్కితగ్గిన ఉదంతాలు చూడలేదనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. మరి తాజా వెనుకడుగు మాత్రం కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలను ఆశించి వేసిందేనని చెప్పొచ్చు. వచ్చే ఏడాది ఆరంభంలో (ఫిబ్రవరి– మార్చి నెలల్లో) ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా రైతు ఆందోళనల్లో పశ్చిమ యూపీ, పంజాబ్, హరియాణా రైతులే ముఖ్య భూమిక పోషించారు. ఇటీవలే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో వెంటనే పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నిర్ణయం వెలువడింది. ఇది ఎలక్షన్ ఎఫెక్ట్ అనేది సుస్పష్టం. సామాన్య ప్రజానీకంలో ధరాఘాతంతో పెల్లుబికిన ఆగ్రహాన్ని కొంతవరకైనా తగ్గించగలిగామని భావించిన బీజేపీ వ్యూహకర్తలు... రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులపైకి దృష్టి మళ్లించారు. ఆజ్యం పోసిన హరియాణా హరిణాయా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ రైతులపై దాడులు చేయాల్సిందిగా పరోక్షంగా బీజేపీ శ్రేణులను రెచ్చగొట్టడం, అరునెలలు జైలులో ఉండొస్తే నేతలు అవుతారని ఉద్భోదించడం... రైతులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. కర్నాల్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ అయూష్ సిన్హా రైతుల తలలు పగలగొట్టండని పోలీసులు ఆదేశాలు ఇస్తున్న వీడియో వైరల్ కావడం... పోలీసు లాఠీచార్జీలో 10 మంది రైతులు రక్తమోడగా... తర్వాత అందులో ఒకరు మరణించిన విషయం తెలిసిందే. ఇవన్నీ బీజేపీపై రైతుల ఆగ్రహాన్ని పెంచుతూ పోయాయి. హిమాచల్ ఓటమి... మరో కనువిప్పు ఇటీవలి ఉప ఎన్నికల్లో కొంచెం అటుఇటుగా అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల హవాయే కనపడింది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రమైన హిమాచల్ప్రదేశ్లో మాత్రం అందుకు భిన్నంగా బీజేపీ దారుణంగా దెబ్బతింది. అంతుకుముందు నాలుగు లక్షలకు పైగా మెజారిటీతో నెగ్గిన మండీ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్కు కోల్పోయింది. అలాగే ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ ఓటమిపాలైంది. ఇది కమలనాథులకు కనువిప్పు కలిగించి ఉండొచ్చు. ఎందుకంటే హిమాచల్ప్రదేశ్లో వచ్చే ఏడాది నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. పంజాబ్లో నాలుగు స్తంభాలాట! రైతు ఉద్యమంలో సిక్కులు ముందువరుసలో ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇదే రైతు చట్టాలపై ఎన్డీయేతో తమ సుదీర్ఘ బంధాన్ని శిరోమణి అకాలీదళ్ తెగదెంపులు చేసుకుంది. పంజాబ్ జనాభాలో దాదాపు 32 శాతం దళితులు ఉండటంతో బీఎస్పీతో అకాలీదళ్ జట్టుకట్టింది. మరోవైపు కాంగ్రెస్ సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా, దళితుడైన చన్నీని సీఎంగా పెట్టి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ను వీడిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే బీజేపీతో జట్టు కడతానని బహిరంగంగానే ప్రకటించారు. ఈ కొత్త కూటమి ఏమేరకు ప్రభావం చూపుతుందనే పక్కనబెడితే పంజాబ్ ఎన్నికలు చతుర్ముఖ పోరుగా మారనున్నాయి. అకాలీదళ్తో పాత అనుబంధం దృష్ట్యా హంగ్ అసెంబ్లీ వస్తే కెప్టెన్–బీజేపీ కూటమి ఎన్నోకొన్ని సీట్లతో కింగ్మేకర్ పాత్రను ఆశించొచ్చు. పశ్చిమంతో మొదలై పాకుతుందని...! పశ్చిమ యూపీలోని ఆరు రీజియన్లలో (26 జిల్లాల్లో) మొత్తం 136 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ ఏకంగా 103 అసెంబ్లీ స్థానాల్లో విజయం కేతనం ఎగురవేసింది. (27 లోక్సభ స్థానాల్లో 20 కాషాయదళానికే దక్కాయి). మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో ఏకంగా 312 చోట్ల నెగ్గి ఘన విజయం సాధించింది. రైతు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జాట్లు పశ్చిమ యూపీలో బలంగా ఉన్నారు. 18–20 శాతం దాకా ఉంటారు. 49 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల జనాభా 30 శాతం పైనే. 25 స్థానాల్లో ముస్లిం– జాట్లు కలిస్తే... జనాభాలో సగం కంటే ఎక్కువే ఉంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 5న కిసాన్ సంయుక్త్ మోర్చా... ముజఫర్నగర్లో నిర్వహించిన మహా పంచాయత్కు అనూహ్యంగా లక్షలాది మంది రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఇదే వేదిక పైనుంచి రాకేశ్ తికాయత్ బీజేపీ విభజన రాజకీయాలను ఎండగడుతూ... రైతుల ప్రయోజనాల దృష్ట్యా హిందూ– ముస్లింలు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని నినదించారు. ఇకపై రైతు వేదికల పైనుంచి ‘అల్లా హు అక్బర్’, ‘హరహర మహదేవ్’ నినాదాలను వినిపించి సామరస్యాన్ని చాటుతామని నొక్కిచెప్పారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా యూపీలో పనిచేస్తామన్నారు. త్యాగిలతో కలిపి వెనుకబడినవర్గాలైన సైనీ, కశ్యప్, గుజ్జర్లను కలుపుకొనిపోతే రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయవచ్చని భావించారు. సమాజ్వాదితో ఆర్ఎల్డీ జతకట్టడం ఈ ప్రాంతంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ. క్షేత్రస్థాయిలో మారుతున్న సమీకరణాలు బీజేపీ వ్యూహకర్తలకు ఉలికిపాటుకు గురిచేశాయి. నష్టనివారణ చర్యలకు దిగారు. సెప్టెంబరు 14న ప్రధాని మోదీ జాట్ రాజు రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ పేరిట యూనివర్శిటీ శంకుస్థాపన చేశారు. పశ్చిమ యూపీలో బలపడుతున్న రైతు ఐక్యతకు... సామాజికవర్గాల పునరేకీరణ తోడై... మొత్తం ఉత్తరప్రదేశ్కు పాకితే తట్టుకోవడం కష్టమనే నిర్ణయానికి బీజేపీ పెద్దలు వచ్చారు. అసలే 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలను 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా పరిగణిస్తారు. అందుకే కాషాయదళం భేషజాలను పక్కనబెట్టి... పోల్ మేనేజ్మెంట్కుదిగింది. మృత చట్టాలే... ఖననం చేసేద్దాం! కార్పొరేట్ మిత్రులకు లబ్ధికొరకే వ్యవసాయ చట్టాలను తెచ్చారని... తీవ్ర అపవాదును మూటగట్టుకొన్న బీజేపీ నిజానికి వీటి ద్వారా సాధించింది ఏమీలేదు. 11 దఫాలుగా రైతు సంఘాల ప్రతినిధుల చర్చలు జరిపిన కేంద్రం మొండిగా వ్యవహారించింది. ‘ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా... (చట్టాల రద్దు మినహా)’ ఏమైనా అడగండి... చర్చలకు సిద్ధం అంటూ పాడినపాటే పాడింది. చట్టాలను పూర్తిగా రద్దు చేయడమే తప్ప తాము మరోటి కోరుకోవడం లేదని రైతులూ తేల్చిచెప్పడంతో చర్చల్లో ఏమీ తేలలేదు. నిజానికి సుప్రీంకోర్టు ఈ మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై ఈ ఏడాది జనవరి 12నే ‘స్టే’ విధించింది. కోర్టులో వ్యవహారం ఎప్పటికి తేలుతుందో తెలియదు. కోల్డ్ స్టోరేజ్లో ఉన్న చట్టాల కోసం పార్టీ రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టడం వివేకవంతమైన చర్య కాదనేది బీజేపీ పెద్దలు నిర్ణయానికి వచ్చి... మోదీ ‘ఇమేజ్’కు భిన్నంగా వెనక్కి తగ్గుతూ నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలతో ఊదరగొడుతున్న బీజేపీకి యూపీలో తాజా నిర్ణయం ఏమేరకు కలిసొస్తుందో కాలమే చెప్పాలి. –నేషనల్ డెస్క్, సాక్షి -
విజయ సారథులు వీరే
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో ఒక డాక్టర్, ఒక రిటైర్డ్ టీచర్, ఆర్మీలో పని చేసిన వ్యక్తి , ఢిల్లీ పోలీసు మాజీ కానిస్టేబుల్ ఇలా ఎందరో ఉన్నారు. ఏడాది పాటు ఉద్యమాన్ని సజీ వంగా నిలిపి ఉంచడానికి వీరంతా పాటుపడ్డారు. రాకేశ్ తికాయత్ భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి అయిన రాకేశ్ తికాయత్ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై మోశారు. ఒకప్పుడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ అయిన ఆయన కరకు ఖాకీలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఉద్యమం నీరుకారిపోతున్న సమయంలో ఉద్వేగభరిత ప్రసంగాలతో నిరసనకారుల్లో మళ్లీ ఉత్తేజాన్ని నింపారు. 52 ఏళ్ల వయసున్న తికాయత్ ప్రభుత్వంతో చర్చల్లోనూ కీలకపాత్ర పోషించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నిరసనలు చేపడితే కేంద్రం దిగి వస్తుందన్న వ్యూహాన్ని రచించి ప్రభుత్వంలో కదలిక తెచ్చారు. దర్శన్పాల్ వృత్తిరీత్యా డాక్టర్ అయిన దర్శన్పాల్ దేశవ్యాప్తంగా రైతు సంఘాలను ఏకం చేశారు. 40 రైతు సంఘాలను ఒకే గూటికి తీసుకువచ్చి కిసాన్ ఏక్తా జిందాబాద్ నినాదంతో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. అఖిల భారత సంఘర్‡్ష సమన్వయ కమిటీ సభ్యుడైన దర్శన్ పాల్ పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రలకు ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. జోగిందర్ సింగ్ భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) అధ్యక్షుడు అయిన జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ ఒకప్పుడు ఆర్మీలో పని చేశారు. రైతు సంఘాల్లో అత్యధికం సింఘూ సరిహద్దుల్లోనే ఉద్యమిస్తే టిక్రీలో ఉద్యమాన్ని జోగిందర్ సింగ్ ఒంటిచేత్తో నడిపించారు. రైతు నిరసనల్లో దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లారు. రైల్ రోకోలు, బీజేపీ నేతల ఘొరావ్లలో జోగిందర్ సింగ్ ఎప్పుడూ ముందుండేవారు. బల్బీర్ సింగ్ రాజేవాల్ భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు అయిన బల్బీర్ సింగ్ రాజేవాల్ సూటిగా, సుత్తిలేకుండా మాట్లాడడంలో దిట్ట. 78 ఏళ్ల వయసున్న ఈ రైతు నాయకుడు కేంద్ర మంత్రులతో చర్చల సమయంలో తమ వాదనల్ని గట్టిగా వినిపించేవారు. అంతేకాదు రైతులు చేయాల్సిన నిరసనలపై బల్బీర్సింగే ప్రణాళికలు రచించి ముందుకి నడిపించారు. సుఖ్దేవ్ సింగ్ కొక్రికలన్ స్కూలు టీచర్గా పని చేసి రిటైర్ అయిన 71 ఏళ్ల సుఖ్దేవ్ సింగ్ పోలీసులతో ఘర్షణలు జరిగినప్పుడల్లా తానే ముందు ఉండేవారు. ఛలో ఢిల్లీ ఆందోళన సమయంలో పోలీసులకు ఎదురెళ్లి నిలుచున్న సాహసి. బీకేయూ, ఉగ్రహాన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుఖ్దేవ్ సహ రైతులకు రక్షణగా ఎప్పుడూ తానే ముందుండేవారు. -
‘దీక్షా’దక్షతకు సలాం
ఒకే డిమాండ్, ఒకే ఒక్క డిమాండ్ మూడు ‘నల్ల’ సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలనే ఆ ఒక్క డిమాండ్ సాధన కోసం రైతన్నలు ఏడాది పాటు సుదీర్ఘ పోరాటం చేశారు లాఠీలు విరిగినా, కేసులు పెట్టినా, హింస చెలరేగినా వాహనాలే యమపాశాలై ప్రాణాలు తీసినా అదరలేదు, బెదరలేదు, వెనకడుగు వెయ్యలేదు ఎండనక వాననక, గడ్డకట్టించే చలిని లెక్కచేయక కరోనా మహమ్మారికి బెదిరిపోక ఢిల్లీ, హరియాణా సరిహద్దుల్లోనే ఏడాదిగా మకాం వేసి చివరికి ఎలాగైతేనేం కేంద్రం మెడలు వంచారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన పోరాటం పంజాబ్లో మొదలై హరియాణాకి వ్యాపించి, ఉత్తరప్రదేశ్లో హింసకు దారి తీసి దేశవ్యాప్తంగా అన్నదాతల్ని ఏకం చెయ్యడంతో కేంద్రం దిగొచ్చింది. కరోనాని లెక్కచేయకుండా, చలి ఎండ వాన వంటి వాతావరణ పరస్థితుల్ని తట్టుకొని, భార్యాపిల్లల్ని విడిచిపెట్టి, రోడ్లపైనే నిద్రించి మొక్కవోని దీక్షతో ఏడాది పాటు సుదీర్ఘంగా సాగిన ఉద్యమంలో రైతన్నలు చివరికి విజయం సాధించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 2020 జూన్లో వ్యవసాయ చట్టాలను ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడంతో ఈ చట్టాలను దొడ్డదారిలో తెచ్చింది తమ పుట్టి ముంచడానికేనని రైతన్నలు బలంగా నమ్మారు. కిసాన్ సంఘర్‡్ష సమన్వయ కమిటీ సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా నిరసనలకు దిగింది. సెప్టెంబర్ 27న రాష్ట్రపతి ఆర్డినెన్స్ను ఆమోదించడంతో రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్3 న వివిధ రైతు సంఘాలు చేసిన రైతు నిరసనలు మొదట్లో పంజాబ్ చుట్టుపక్కల ప్రాంతానికే పరిమితమయ్యాయి. నవంబర్ 25న రైతు సంఘాలు ఛలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి దానిపై పడింది. కేంద్ర ప్రభుత్వం పదకొండు రౌండ్లు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఏడాదిన్నర పాటు చట్టాలను వెనక్కి తీసుకుంటామన్న కేంద్రం ప్రతిపాదనలకు కూడా రైతులు అంగీకరించలేదు. చట్టాల రద్దు తప్ప మరి దేనికీ తలవంచమంటూ పోరుబాట పట్టారు. ప్రతీ దశలోనూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యమాన్ని ఎంతలా అణిచివేయాలని చూస్తే అంతలా పైపైకి లేచింది. ఒక్కో ఎదురుదెబ్బ తగిలినప్పుడలా మరింత బలం పుంజుకుంటూ వచ్చింది. దేశవ్యాప్తంగా 40 సంఘాలకు చెందిన రైతులు ‘సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)’ పేరిట ఒకే గొడుకు కిందకు వచ్చి ఢిల్లీ, హరియాణా, యూపీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ వద్ద శిబిరాలు వేసుకొని అక్కడే మకాం వేశారు. కుటుంబాలను విడిచిపెట్టి వచ్చిన రైతులు సామూహిక వంటశాలలు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసుకొని ఏడాదిగా అక్కడే ఉంటున్నారు. ‘కిసాన్ ఏక్తా జిందాబాద్’ అన్న నినాదం ఢిల్లీలో మారుమోగడమే కాదు, అదే ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎర్రకోట సాక్షిగా మలుపు తిరిగిన ఉద్యమం ఒకానొక దశలో సాగు చట్టాలపై రైతుల ఉద్యమం నీరుగారిపోతుందని అందరూ భావించారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్రదినోత్సవం నాడు రైతు సంఘాల నాయకులు ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింస, ఘర్షణలు ఉద్యమాన్ని మరో మలుపు తిప్పాయి. కొంతమంది నిరసనకారులు ఎర్రకోట గోడలు మీదుగా ఎక్కి సిక్కు మతం చిహ్నమైన నిషాన్ సాహిబ్ జెండాని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జీలు, బాష్పవాయువు ప్రయోగాలతో రాజధాని రణరంగంగా మారింది. రైతు ఉద్యమం ఖలిస్తాన్ వేర్పాటువాద చేతుల్లోకి వెళ్లిపోయిందన్న ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో రైతులు సరిహద్దులు ఖాళీ చేసి వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఆ సమయంలో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ పెట్టుకున్న కన్నీళ్లు మళ్లీ ఉద్యమ నిప్పుకణికని రాజేసాయి. ఇంటి బాట పట్టిన నిరసనకారులందరూ తిరిగి ఢిల్లీ సరిహద్దుల్లో మకాం వేశారు. ఏడాదిగా జరుగుతున్న ఈ పోరాటంలో ఘర్షణలు, హింసాత్మక ఘటనలు, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యంతో 700 మందికి పైగా రైతులు మరణించారు. మరెందరో రైతులపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. యూపీకి వ్యాపించి, రణరంగంగా మారి: ఆ తర్వాత నుంచి రైతు సంఘం నాయకులు పక్కా ప్రణాళికతో రహదారులు దిగ్బంధించడం, రైలు రోకోలు, నిరసన ర్యాలీలు, బ్లాక్ డే వంటివి చేస్తూ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో రాకేశ్ తికాయత్ ర్యాలీలు చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రైతు ఉద్యమం ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ పాప్ స్టార్ రిహన్నా దీనిపై మనం ఎందుకు మాట్లాడడం లేదు అంటూ లేవనెత్తిన ప్రశ్నతో అంతర్జాతీయంగా అన్నదాతలకు మద్దతు లభించింది. టీనేజీ పర్యావరణవేత్త గ్రేటా థెన్బర్గ్ , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు లాయర్ అయిన మీనా హ్యారిస్ వంటివారు రైతుల గళానికి బలంగా నిలిచారు.మే 27న రైతు ఉద్యమానికి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా బ్లాక్ డే పాటించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో 200 మందికిపైగా రైతులు జంతర్మందర్ దగ్గర కిసాన్ సంసాద్ నిర్వహించారు. సెప్టెంబర్5న యూపీలోని ముజఫర్నగర్లో రైతు సంఘం నాయకులు బలప్రదర్శన చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఇదీ తమ బలం అంటూ చూపించారు. ఇక యూపీలోని లఖీమ్పూర్ఖేరిలో అక్టోబర్ 3న జరిగిన హింసాత్మక ఘటనలతో కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడింది. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకి వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన రైతన్నలపై ఎస్యూవీ దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు బలి కావడం , ఆ వాహనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నారన్న ఆరోపణలు మోదీ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో రైతులపై ప్రజల్లో సానుభూతి పెల్లుబుకింది. వచ్చే ఏడాది అత్యంత కీలకమైన యూపీ, పంజాబ్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతు ఉద్యమం అంతకంతకూ బలం పుంజుకుంటూ ఉండడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ఏడాది పాటు జరిగిన జరిగిన ఉద్యమం విజయతీరాలకు చేరుకుంది. సుప్రీం నిలిపివేసినా... ఉద్యమం ఆగలేదు! వ్యవసాయ చట్టాలపై ఒకవైపు రైతులు వివిధ రకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తూనే మరోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాల నాయకులు డిసెంబర్ 11న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టాల రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ కోర్టులో దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి విచారించడానికి ఈ ఏడాది జనవరి 7న సుప్రీం కోర్టు అంగీకరించింది. వ్యవసాయ చట్టాలపై నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక కమిటీ వేయడానికి జనవరి 11న అంగీకరించింది. ఆ మర్నాడు జనవరి 12న వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ నిపుణులు అనిల్ ఘన్వత్, అశోక్ గులాటీ, ప్రమోద్ జోషిలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికని మార్చి 19న సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో సమర్పించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దాని ప్రక్రియను పూర్తి చేస్తే ఇక న్యాయస్థానంలో కేసే ఉండదు. ఆ పిటిషన్లన్నీ ప్రయోజనం లేకుండా మిగిలిపోతాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
అన్నదాతల అలుపెరుగని పోరాటం.. వ్యవసాయ చట్టాల కథేంటంటే
అన్నదాతల ఆగ్రహానికి కారణమైన... వారిని అలుపెరుగని పోరాటానికి కార్యోన్ముఖులను చేసిన మోదీ సర్కారు తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలేమిటి? వాటిని కేంద్రం ఎలా సమర్థించుకుంది? రైతుల అభ్యంతరాలేమిటో చూద్దాం... 1. ది ఫార్మర్స్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్– ఎఫ్పీటీసీ) యాక్ట్ రైతులు తమ ఉత్పత్తుల ప్రాంతీయ వ్యవసాయ మార్కెట్లలో కాకుండా... వాటి పరిధిని దాటి దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకొనే స్వేచ్ఛను కల్పించింది. అధికధరలు ఎక్కడ లభిస్తే అక్కడ విక్రయించుకోవచ్చు. ఎక్కడి వ్యాపారులైనా... ఎక్కడికైనా వచ్చి పంట ఉత్పత్తులను కొనొచ్చు. రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాలను నిర్వీర్యం చేసింది. మార్కెట్ కమిటీలు వసూలు చేసే సెస్ను రద్దు చేసింది. ప్రభుత్వ వాదన: రైతులు స్థానిక వ్యాపారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా... తమ ఉత్పత్తులను డిమాండ్ ఉన్నచోటికి తరలించి మంచి ధరకు అమ్ముకోవడానికి ఈ చట్టం వీలుకల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ మార్కెట్ల (ఈ– మార్కెట్లు)లోనూ అమ్ముకోవచ్చు. ఎక్కడో హరియాణాలో ఉన్న వ్యాపారి కూడా ఆన్లైన్ ద్వారా తెలంగాణలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో సరుకు కొనుగోలు చేయవచ్చు. ప్యాన్ కార్డులు, ఇతర చట్టబద్ధ ధ్రువపత్రాలు ఉన్నవారెవరైనా సులువుగా ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు రంగంలోకి సులువుగా ప్రవేశించవచ్చు. రైతుల అభ్యంతరం: స్థానిక మార్కెట్లలో తమ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోతుంది. వ్యవసాయ మార్కెట్లు లేకపోతే కనీస మద్దతు గ్యారెంటీ ఏముంటుంది? అడిగే దిక్కెవరు? మూడు నుంచి ఐదెరకాల చిన్న కమతాలు ఉన్న రైతులు పంటను రవాణా ఖర్చులు భరించి ఎక్కడో సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోవడం సాధ్యమయ్యే పనేనా? కొనుగోలు ఒప్పందంలో ఏదైనా వివాదం తలెత్తినా సమస్య పరిష్కారం కోసం సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ను ఆశ్రయించవచ్చని చట్టంలో ఉంది... సామాన్య రైతులను ఆ స్థాయి అధికారిని కలుసుకొనే అవకాశం ఉంటుందా? నిర్ణీత వ్యాపార లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు లేని వ్యక్తులు వ్యాపారంలోకి వస్తే... రైతులు మోసపోయే అవకాశాలుంటాయి. 2. ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్, 2020 ఒప్పంద వ్యవసాయానికి (కాంట్రాక్టు ఫార్మింగ్) ఇది చట్టబద్ధతను చేకూర్చింది. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు రైతులు ఫలానా ధరకు తమ పంటను అమ్ముతామని కొనుగోలుదారుతో నేరుగా ఒప్పందం చేసుకోవచ్చు. అయితే కొనుగోలుదారులు రైతులకు ఏ పంటకు ఎంత కనీస మద్దతు ధర చెల్లించాలనేది ఈ చట్టంలో ప్రస్తావన లేదు. ప్రభుత్వ వాదన: రైతులు తమ పంట ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకొనే వీలు కలుగుతుంది. ముందస్తు ఒప్పందాల ద్వారా ఎవరికైనా అమ్ముకోవచ్చు. చట్టాల చట్రం నుంచి రైతుకు విముక్తి లభిస్తుంది. రైతుల భయం: వ్యవసాయరంగం కార్పొరేటీకరణకు ఇది బాటలు వేస్తుంది. బడా కంపెనీలదే గుత్తాధిపత్యం అవుతుంది. కనీసం మద్దతు ధర అనే భావన ప్రశ్నార్థకం అవుతుంది. కాంట్రాక్టు వ్యవసాయ విధానంలో సన్న, చిన్నకారులు రైతులు దోపిడీకి గురయ్యే ఆస్కారం ఉంటుంది. రైతుకు లభించే అమ్మకపు ధర మీద నియంత్రణ లేకపోతే... రైతుల బతుకులు గాలిలో దీపాలవుతాయి. వివాదాలు తలెత్తితే బడా కార్పొరేట్ కంపెనీలను ఎదురించి సామాన్య రైతు నిలబడగలడా? 3. నిత్యావసర వస్తువుల సవరణ చట్టం–2020 నిత్యావసర వస్తువుల నిల్వల పరిమితిపై ఇదివరకున్న ఆంక్షలను ఈ చట్టం ఎత్తివేసింది. అసాధారణ, అత్యయిక పరిస్థితులు తలెత్తితే తప్ప నిత్యావసర వస్తువుల నిల్వలపై ఆంక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకుండా చేసింది. వంటనూనెలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల తదితర ఆహార వినియోగవస్తువులను నిత్యావసరాల జాబితాలో నుంచి తొలగించింది. ఉద్యానపంటల ధరలు రిటైల్ మార్కెట్లో 100 శాతం పెరిగితే, ఆహారధాన్యాల ధరలు 50 శాతానికి పైగా పెరిగితేనే వ్యాపారులు, హోల్సేలర్ల వద్ద సదరు సరుకులు నిల్వలపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పరిమితులు విధించడానికి ఈ చట్టంలో వీలుకల్పించారు. మొత్తానికి ఈ నిబంధన మూలంగా రైతులపై పెద్దగా ప్రభావం ఉండదు కాని వినియోగదారులకు చేటు చేసేదే. పరిమితి లేకపోతే భారీగా నిల్వలు చేయడం ద్వారా బడా వ్యాపారులు కృతిమ డిమాండ్ను సృష్టించి నిత్యావసరాల ధరలను పెంచే ముప్పు పొంచి ఉంటుంది. జూన్ 5 2020: మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీచేసింది. ప్టెంబరు 14–22: ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడం, పెద్దగా చర్చలేకుండా లోక్సభ, రాజ్యసభలు మూజువాణి ఓటుతో ఆమోదించడం జరిగిపోయింది. సెప్టెంబర్ 27: రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చి అమలులోకి వచ్చాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
3 వ్యవసాయ చట్టాలు రద్దు
న్యూఢిల్లీ: రైతన్నల డిమాండ్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెట్టు దిగొచ్చారు. మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ జయంతి సందర్భంగా ఆయన శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇక విరమించాలని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. సాగు చట్టాల రద్దుకు రాజ్యాంగబద్ధ ప్రక్రియను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పూర్తి చేస్తామని వెల్ల డించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... ఒక వర్గం రైతులే వ్యతిరేకించారు ‘‘రైతులతోపాటు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా కొత్తగా మూడు చట్టాలను తీసుకొచ్చాం. దేశంలోని రైతులు.. ప్రధానంగా సన్నకారు రైతులు గరిష్టంగా లబ్ధి పొందుతారని ఆశించాం. కానీ, ఈ చట్టాల విషయంలో కొందరు రైతులను ఒప్పించలేకపోయాం. అనుమానాలను నివృత్తి చేసేందుకు పవిత్ర హృదయంలో మొదలుపెట్టిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొవ్వొత్తి కాంతి లాంటి స్పష్టమైన నిజాన్ని అర్థమయ్యేలా వివరించలేకపోయాం. సాగు చట్టాల వ్యవహారంలో దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నా. వాస్తవానికి ఎన్నెన్నో రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పురోగమన దృక్పథం ఉన్న రైతులు కొత్త సాగు చట్టాలకు అండగా నిలిచారు. ఒక వర్గం రైతన్నలు మాత్రమే వ్యతిరేకిస్తూ వచ్చారు. వారు కూడా మనవాళ్లే కాబట్టి ఒప్పించేందుకు పదేపదే ప్రయత్నించాం. చట్టాల అమలును రెండేళ్లపాటు నిలిపివేస్తామని చెప్పాం. అభ్యంతరాలున్న అంశాల్లో సవరణలు చేస్తామని సూచించాం. సుప్రీంకోర్టు కూడా సాగు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. మనమంతా కలిసి ముందుకు సాగుదాం నేడు గురు నానక్ జన్మించిన రోజు. ఒకరిపై నిందలు వేయడానికి ఇది సందర్భం కాదు. దేశ ప్రజలను నేను చెప్పేది ఏమిటంటే 3 సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించాం. గురుపూరబ్ పర్వదినాన్ని పురస్కరించుకొని నా విన్నపాన్ని మన్నించి, రైతు సోదరులు ఇళ్లకు, పొలాలకు తిరిగి వెళ్లాలి. కుటుంబాలను కలుసుకోవాలి. జీవితంలో కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాలి. మనమంతా మళ్లీ కొత్తగా ముందుకు సాగుదాం. పంటల సాగు విధానంలో శాస్త్రీయ మార్పులు దేశంలో రైతాంగం సాధికారతే లక్ష్యంగా వ్యవసా య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలు చేపట్టబోతున్నాం. జీరో బడ్జెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. ఈ తరహా వ్యవసాయంలో సహజ ఎరువులు, స్థానిక విత్తనాలే ఉపయోగిస్తారు. మారుతున్న దేశ అవసరాలకు అనుగుణంగా పంటల సాగు విధానంలో శాస్త్రీయ మార్పులు తీసుకొస్తాం. కనీస మద్దతు ధర(ఎం ఎస్పీ)ను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దుతాం. ఎంఎస్పీతోపాటు జీరో బడ్జెట్ ఆధారిత సాగుపై నిర్ణయాలు తీసుకోవడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు సభ్యులుగా ఉంటారు. రికార్డు స్థాయిలో సేకరణ కేంద్రాలు ఐదు దశాబ్దాల నా ప్రజాజీవితంలో అన్నదాతల వెతలను దగ్గరగా గమనిస్తూనే ఉన్నాను. వారికి ఎదురవుతున్న సవాళ్లు, కష్టనష్టాలు నాకు తెలుసు. మూడు కొత్త సాగు చట్టాల లక్ష్యం ఏమిటంటే రైతులను బాగు చేయడమే. ప్రధానంగా సన్నకారు రైతులకు సాధికారత కల్పించాలని ఆశించాం. 2014లో ‘ప్రధాన సేవకుడి’గా ప్రజలకు సేవలు చేసుకునేందుకు దేశం నాకు అవకాశం ఇచ్చింది. వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి అప్పటినుంచే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చా. సన్నకారు రైతుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టాం. వ్యవసాయ బడ్జెట్ను ఏకంగా ఐదు రెట్లు పెంచేశాం. ప్రతిఏటా రూ.1.25 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. రైతులు కష్టపడి పండించిన పంటలకు సరైన ధర దక్కేలా చర్యలు తీసుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ సదుపాయాలను బలోపేతం చేశాం. వెయ్యికి పైగా మండీలను (వ్యవసాయ మార్కెట్లు) ఈ–నామ్(ఎలక్ట్రానిక్–నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్)తో అనుసంధానించాం. పంటలను దేశవ్యాప్తంగా ఎక్కడైనా విక్రయించుకోవడానికి రైతులకు ఒక వేదికను అందుబాటులోకి తీసుకొచ్చాం. వ్యవసాయ మార్కెట్లలో సదుపాయాలను మెరుగు పర్చడానికి కోట్లాది రూపాయలు వెచ్చించాం. పంటలకు కనీస మద్దతు ధరను పెంచడమే కాదు, ప్రభుత్వ ఆధ్వర్యంలో పంటల సేకరణ కేంద్రాల సంఖ్యను రికార్డు స్థాయిలో పెంచాం. దేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్నన్ని సేకరణ కేంద్రాలు గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ లేవు. రైతాంగం ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రభుత్వం తన కృషిని చిత్తశుద్ధితో కొనసాగిస్తూనే ఉంటుంది’’ అని ప్రధాన నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. -
చట్టాల రద్దుపై కేంద్రానికి తికాయత్ అల్టిమేటం
ఘజియాబాద్: వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ తేల్చిచెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 26 దాకా గడువు ఇస్తున్నామని చెప్పారు. అప్పటిలోగా మూడు చట్టాలకు మంగళం పాడకపోతే ఢిల్లీలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం ఒకవేళ ఆ చట్టాలను ఈరోజే రద్దు చేస్తే పోరాటాన్ని ఇప్పుడే ఆపేస్తామని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల వద్ద సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి నవంబర్ 26న సంవత్సరం పూర్తికానుంది. -
11 నెలలకు.. తొలగిన అడ్డంకులు
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్తో ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్న ప్రాంతాల్లో బారికేడ్ల తొలగింపు ప్రారంభమైంది. రైతు ఆందోళనల కారణంగా టిక్రి, ఘాజీపూర్లలో రోడ్లపై ఏర్పాటు చేసిన అడ్డంకులను దాదాపు 11 నెలల తర్వాత గురువారం నుంచి పోలీసులు తొలగిస్తున్నారు. ఈ పరిణామంపై రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ..తమ వాదనకు మద్దతు దొరికినట్లయిందని వ్యాఖ్యానించారు. దేశ రాజధాని సరిహద్దు పాయింట్లను తామెన్నడూ దిగ్బంధించ లేదని స్పష్టం చేశారు. రోడ్లపై నిరసనలను పూర్తిగా ఎత్తివేయాలా వద్దా అనే విషయాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నిర్ణయిస్తుందని చెప్పారు. రహదారులపై అడ్డంకులకు పోలీసులే కారణమంటూ రైతు సంఘాలు ఇటీవల సుప్రీంకోర్టులో వాదించిన నేపథ్యంలో బారికేడ్లను తొలగించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. రోడ్లపై అడ్డంకులు ఏర్పాటు చేసింది పోలీసులే తప్ప, రైతులు కాదని భారతీయ కిసాన్ యూనియన్ నేతలు తెలిపారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పోలీసులు రోడ్లను తిరిగి తెరుస్తున్నారన్నారు. తదుపరి కార్యాచరణను ఎస్కేం త్వరలోనే నిర్ణయిస్తుందని చెప్పారు. సింఘు వద్ద రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాన్ని ఇప్పటికే ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం అధికారులు మూసివేశారని వారు చెప్పారు. టిక్రి, ఘాజీపూర్, సింఘుల వద్ద రైతు సంఘాలు గత ఏడాది నవంబర్ 26వ తేదీ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాల్లో పోలీసులు నాలుగైదు అంచెల్లో వైర్లతో కూడిన ఇనుప, సిమెంట్ బారికేడ్లను నిర్మించారు. సాగు చట్టాలను రద్దు చేయాలి: రాహుల్ ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లను పోలీసులు తొలగించిన విధంగానే మూడు వివాదాస్పద వ్యవ సాయ చట్టాలను కూడా ఉపసంహరించు కోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత ఇవ్వాలి: వరుణ్ గాంధీ రైతు సమస్యల విషయంలో యూపీ ప్రభుత్వ వైఖరిపై బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ ఘాటైన విమర్శలు చేశారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద పెచ్చరిల్లిన అవినీతి కారణంగా రైతులు తమ ఉత్పత్తులను దళారులకు తెగనమ్ముకుంటున్నారని అన్నారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని కోరారు. రైతు కుటుంబాలకు ప్రియాంక పరామర్శ యూపీలోని లలిత్పూర్లో ఎరువుల కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను శుక్రవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా పరామర్శించారు. అధికారులు, నేతలు, అక్రమార్కుల కారణంగా రైతుల ఎరువులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. -
నిరవధిక దిగ్బంధనాలు సబబు కాదు
సాక్షి, న్యూఢిల్లీ: నిరసనల పేరుతో నిరవధికంగా రహదారుల దిగ్బంధనాలు సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విషయం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నప్పటికీ నిరసనలు తెలపడానికి తామేమీ వ్యతిరేకం కాదని, అయితే ఈ విధంగా నిరవధికంగా రహదారులు దిగ్భంధనం సరికాదని దేశరాజధాని సరిహద్దుల్లోని సింఘూ బోర్డర్లో గత 11 నెలలుగా ధర్నాను కొనసాగిస్తున్న రైతు సంఘాలను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో అమిత్ సాహ్ని వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేసులో ఆందోళనలు జరుగుతున్నప్పటికీ రహదారులు బ్లాక్ చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. రైతులు రహదారులను బ్లాక్ చేయడంపై నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్ల ధర్మాసనం విచారించింది. ‘‘మొత్తానికి ఓ పరిష్కారం కనుగొనాల్సి ఉంది. న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉన్నా నిరసనలకు మేం వ్యతిరేకం కాదు. కానీ, ఈ రకంగా రహదారులు బ్లాక్ చేయడం సరికాదు. ప్రజలందరూ రహదారులపై హక్కు కలిగి ఉంటారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రైతుల్ని పోలీసులు నిలువరించిన తర్వాత రాంలీలా మైదానంలో బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని ఖండిస్తూ బీజేపీ ర్యాలీ నిర్వహించిందని రైతు సంఘాల తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేన్నారు. ఈ ర్యాలీలో 5 లక్షల మంది పాల్గొన్నారని, దీనిపై ఎందుకు సుమోటోగా విచారణ చేపట్టడం లేదు, ఎందుకు ద్వంద్వ ప్రమాణాలు పాటించారని దుష్యంత్ దవే పేర్కొన్నారు. రైతుల నిరసన వెనక దురుద్దేశం దాగుందని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. రైతుల సంఘాలు కౌంటరు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. ‘‘ఇదే అంశంపై వేర్వేరు పిటిషన్లు కోర్టు ముందుండటంతో ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని లేదా ఈ ధర్మాసనమే వాటినీ విచారించాలని కోరుతున్నారు. తొలుత కౌంటర్లు దాఖలు చేస్తే ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనానికి పంపడం అవసరమైతే... ఆ విషయం చెబుతాం. కౌంటరు మూడు వారాల్లో దాఖలు చేయండి. అనంతరం రెండు వారాల్లో రిజాయిండరు దాఖలు చేయండి’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘నూతన వ్యవసాయ చట్టాల చెల్లుబాటును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన తర్వాత నిరసనలు చేయడం ఏంటి?’ అని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
మీ నిరసనలతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు చేస్తున్న ధర్నాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో జంతర్మంతర్ దగ్గర శాంతియుతంగా సత్యాగ్రహం చేయడానికి అనుమతినివ్వాలని రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ‘ఇప్పటికే మీ ధర్నాలతో ఢిల్లీ గళం నొక్కేశారు. ఇంకా నగరం లోపలికి కూడా వస్తారా?’అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిరసన తెలిపే హక్కు ఉండొచ్చు. అదే సమయంలో పౌరులందరికీ నగరంలో స్వేచ్ఛగా, నిర్భయంగా తిరగడానికి సమాన హక్కులుంటాయి. వాటిని కాలరాయకూడదు’అని కోర్టు హితవు పలికింది. జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్ల ధర్మాసనం రైతులు చేస్తున్న ధర్నాలతో స్థానిక ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదో తెలుసుకున్నారా? అని ప్రశ్నించింది. రైతుల నిరసనలతో ప్రజల ఆస్తులు ధ్వంసమవుతున్నాయని పేర్కొంది. రైతులు ఇప్పటికే సాగు చట్టాలను సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, అలాంటప్పుడు మళ్లీ నిరసనలెందుకు? అని ప్రశ్నించింది. కోర్టులపై రైతులు నమ్మకం ఉంచాలని హితవు పలికింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హైకోర్టుని ఆశ్రయించిన రైతులు , దాని సత్వర విచారణకు మళ్లీ కోర్టుకి వెళ్లొచ్చని, ఇలా సత్యాగ్రహాలు చేయడం వల్ల ఒరిగేదేమిటని పేర్కొంది. శాంతియుతంగానే రైతులు నిరసన చేస్తారని రైతు సంఘాల తరఫున హాజరైన లాయర్ ప్రశ్నించగా ఆయనపై విరుచుకుపడింది. ‘శాంతియుతంగా నిరసనలంటే ఏమిటి? మీరు జాతీయ రహదారులను దిగ్బంధిస్తారు. రైళ్లను అడ్డుకుంటారు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ శాంతియుత నిరసనలంటే ఎలా?’అని బెంచ్ ప్రశ్నించింది. -
రైతుల ఆందోళనలతో ప్రతికూల ప్రభావమెంత?
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు పారిశ్రామిక, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం చూపాయని, ఆందోళనలు జరిగే ప్రాంతాల్లో కరోనా రక్షణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ, యూపీ, హరియాణా, రాజస్తాన్ ప్రభుత్వాలకు, పోలీస్ చీఫ్లకు కేంద్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. ఆందోళనలు జరిగే ప్రాంతాల్లో కరోనా ప్రొటోకాల్స్ ఉల్లంఘన, తదుపరి పరిణామాలు, వివిధ రంగాలపై ఆందోళనల ప్రభావంపై నివేదికలు సమర్పించాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, హోంశాఖ, ఆరోగ్య శాఖలను కమిషన్ ఆదేశించింది. రైతు ఆందోళనలపై పలు ఫిర్యాదులు కమిషన్కు అందాయని, వీటి కారణంగా దాదాపు 9వేల కంపెనీల యూనిట్లపై ప్రభావం పడిందని తెలిపింది. నిరసనలతో రవాణా రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైందని, పేషంట్లు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, పాదచారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయని కమిషన్ తెలిపింది. మార్గాల మూసివేతతో ఆయా ప్రాంతాల్లోని స్థానికులు ఇళ్లకు చేరుకోకుండా అడ్డుకున్నారని తెలిపింది. వీటిపై తీసుకున్న చర్యలను నివేదించాలని 4 రాష్ట్రాలను కోరింది. శాంతియుత పద్ధతుల్లో ఆందోళన జరిపే హక్కు అందరికీ ఉందని, కానీ ఈ విషయంలో మానవహక్కుల అంశం ముడిపడి ఉన్నందున జోక్యం చేసుకోవాల్సి వస్తోందని వివరించింది. రైతు ఆందోళనలతో పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలపై, ఉత్పత్తి, రవాణాపై, ఇతర ఇబ్బందులపై సమగ్ర నివేదికను అక్టోబర్ 10 నాటికి సమర్పించాలని ఐఈజీ(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్)ను కమిషన్ ఆదేశించింది. నిరసన ప్రదేశంలో హక్కుల కార్యకర్త గ్యాంగ్ రేప్కేసులో పరిహారంపై ఝజ్జర్ డీఎం ఇంతవరకు నివేదిక ఇవ్వలేదని, అక్టోబర్ 10 నాటికి తప్పక రిపోర్టు సమర్పించాలని పేర్కొంది. ఈ నిరసన కార్యక్రమాలతో సాధారణ ప్రజా జీవనానికి, జీవనోపాధికి ఎదురైన సమస్యల గురించి ఒక సర్వే నిర్వహించి నివేదికనివ్వాలని యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ను కమిషన్ కోరింది. -
కర్నాల్లో నిషేధాజ్ఞలు మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేత
కర్నాల్(హరియాణా): హరియాణాలోని కర్నాల్లో మినీ సెక్రటేరియట్ను ముట్టడిస్తామన్న రైతు సంఘాల పిలుపు నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం నిర్వహిం చతలపెట్టిన రైతు ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో 144వ సెక్షన్ అమల్లోకి తెచ్చినట్లు జిల్లా అధికార యంత్రాంగం సోమవారం ప్రకటించింది. మొబైల్ ఇంటర్నెట్నూ నిలిపేశారు. కర్నాల్లో నలుగురుకి మించి వ్యక్తులు గుమిగూడటం కుదరదంటూ నిషేధాజ్ఞలు జారీచేసింది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ముందస్తు చర్యగా ఆంక్షలు అమల్లోకి తెచ్చామని అదనపు డీజీపీ(లా అండ్ ఆర్డర్) నవ్దీప్ సింగ్ చెప్పారు. రైతు ఆందోళన సందర్భంగా తప్పుడు వార్తలు, పుకార్లను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేయకుండా ఆపేందుకు కర్నాల్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఎంఎస్, మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మంగళవారం అర్ధరాత్రి వరకు సేవలను స్తంభింపజేస్తారు. పొరుగున ఉన్న కురుక్షేత్ర, కైథాల్, జింద్, పానిపట్ జిల్లాల్లోనూ ఈ సేవలనుæ నిలిపేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలనూ రప్పించారు. గత నెల 28న కర్నాల్లో బీజేపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు బయల్దేరిన రైతులు.. జాతీయరహదారి వెంట ట్రాఫిక్కు అంతరాయం కల్గిస్తున్నారంటూ వారిపై పోలీసులు లాఠీచార్జికి దిగారు. ఈ ఘటనలో 10 మందికిపైగా రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక రైతు మరణించారు. లాఠీచార్జి కారణంగా ఆయన మరణించారని రైతు సంఘాలు చెబుతుండగా, గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. లాఠీ చార్జిని నిరసిస్తూ మినీ–సెక్రటేరియట్ను ముట్టడి స్తామని సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రకటించడం తెల్సిందే. ముందుగా కర్నాల్లో భారీస్థాయిలో పంచాయత్ను నిర్వహిస్తామని, తర్వాత మినీ– సెక్రటేరియట్ వద్ద ఆందోళన కొనసాగిస్తామని హరియాణా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నామ్ చెప్పారు. -
సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం !
న్యూఢిల్లీ: మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృత స్థాయికి తీసుకెళ్లాలని రైతు సంఘాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇందులోభాగంగా సెప్టెంబర్25వ తేదీన భారత్ బంద్కు పిలుపునివ్వాలని నిర్ణయించాయి. గురువారం ఢిల్లీ దగ్గర్లోని సింఘు సరిహద్దు వద్ద ప్రారంభమైన అఖిలభారత రైతు సమ్మేళనం ఈ మేరకు తీర్మానించింది. సాగు చట్టాలపై పోరుకు 9 నెలలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రెండ్రోజుల రైతు సమ్మేళనాన్ని గురువారం భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ లాంఛనంగా ప్రారంభించారు. ‘తొమ్మిది నెలలుగా ఉద్యమిస్తున్నా.. రైతులతో ఫలప్రదమైన చర్చలకు మోదీ సర్కార్ ముందుకు రాకపోవడం చాలా దారుణం. అయినా మేం మా ఉద్యమపథాన్ని వీడేదే లేదు. ఈ కాలంలో మేమేం కోల్పోయామో, మేం సంఘటితంగా ఏమేం సాధించామో సర్కార్కు తెలిసేలా చేస్తాం’ అని రాకేశ్ తికాయత్ అక్కడి రైతులనుద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ రైతు సమ్మేళనంలో 22 రాష్ట్రాల నుంచి రైతులు, వ్యవసాయ కార్మికుల సంఘాలు, సంస్థల తరఫున నుంచి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 18 అఖిలభారత కార్మిక సంఘాలు, తొమ్మిది మహిళా సంఘాలు, 17 విద్యార్థి, యువజన సంఘాల తరఫున వందలాది మంది రైతులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. సమ్మేళనంలో తొలి రోజున మూడు వేర్వేరు సెషన్స్ నిర్వహించినట్లు సంయుక్త్ కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పేర్కొంది. పారిశ్రామిక రంగ కార్మికులు, వ్యవసాయ రంగ కార్మికులు, గ్రామాల్లోని పేదలు, గిరిజనుల సమస్యలనూ ఆయా సెషన్స్లో చర్చించారు. సమ్మేళనంలో నిర్వహణ కమిటీ కన్వీనర్ ఆశిష్ మిట్టల్ సంబంధిత ముసాయిదాను రైతు నేతల ముందుంచారు. ‘మోదీ సర్కార్ రైతుల డిమాండ్లకు తలొగ్గి వివాదాస్పద చట్టాలను రద్దుచేసేలా, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేలా ఉద్యమాన్ని ఉధృతస్థాయికి తీసుకెళ్లాలి’ అని సమ్మేళనంలో తీర్మానించారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు హానికరమని ఈ సందర్భంగా ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సూర్య నారాయణ, రావుల వెంకయ్య, ఝాన్సీ, తెలంగాణ నుంచి టి.సాగర్, ప్రభు లింగం, కె.రంగయ్య, అచ్యుత రామారావు, జక్కుల వెంకటయ్య, రాంచందర్, గోపాల్ పాల్గొన్నారు. -
కృష్ణా నీటిపై కేంద్రం మౌనం తగదు: రైతు సంఘాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలంగాణ ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ నిబంధనలను పాటించాలని రైతు సంఘాలు కోరాయి. నీటి విషయంలో వైఎస్సార్ న్యాయంగా ముందుకెళ్లారన్నాయి. విద్యుదుత్పత్తి పేరుతో శ్రీశైలంలోని నీటిని అక్రమంగా తరస్తున్నారని, ప్రభుత్వ పోరాటం, కేఆర్ఎంబీ తీర్పుతో తెలంగాణ అక్రమ చర్యలకు అడ్డుకట్టపడుతుందని తెలిపాయి. ఇరు రాష్ట్రాలకు చట్టబద్ధమైన కేటాయింపులు జరగాలని, కృష్ణా నీటిపై కేంద్రం మౌనం తగదన్నాయి. -
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు ఆపాల్సిందే
కడప (సెవెన్ రోడ్స్): రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై వైఎస్సార్ జిల్లాలోని రైతు సంఘాలు, మేధావులు భగ్గుమంటున్నారు. ఎలాంటి నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్న తెలంగాణ ప్రభుత్వం నిత్య కరువు పీడిత రాయలసీమకు నీరందించే పథకాలపై అభ్యంతరాలు లేవనెత్తడాన్ని తప్పుబడుతున్నారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ వైఖరికి నిరసనగా ఈనెల 28వ తేదీన కడపలో ఆందోళన చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలవాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. శనివారం రాయలసీమ సాగునీటి సాధన సమితి జిల్లా కన్వీనర్ చంద్రమౌళీశ్వర్రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, రైతు స్వరాజ్య వేదిక నాయకుడు శివారెడ్డి తదితరులు మైదుకూరు, కమలాపురం ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథ్రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్.గోవర్దన్రెడ్డి, బి.హరిప్రసాద్, పీరయ్య తదితరులను కలిసి రైతుల ఆందోళనలో భాగస్వాములు కావాలని కోరారు. -
Mamata Banerjee: మోదీని గద్దె దించేద్దాం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికార బీజేపీ, ప్రధాని∙మోదీపై సమరభేరి మోగించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమని ప్రకటించారు. రాకేష్ తికాయత్, యుధ్వీర్ సింగ్ (భారతీయ యూనియన్) నేతృత్వంలో బుధవారం తనను కలుసుకున్న రైతు నాయకులతో మమత చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధరని కొనసాగించాలనే డికిసాన్మాండ్లతో గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న రైతన్నలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భేటీ తర్వాత తికాయత్ మీడియాతో మాట్లాడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి ఓటు వేయొద్దని విస్తృతంగా ప్రచారం నిర్వహించిన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్, ఇతర రైతు నాయకులు వచ్చే ఏడాది యూపీ సహా అయిదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లోనూ ఇదే ప్రచారాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ‘మేము ప్రకృతి విపత్తులతో పాటు రాజకీయ విపత్తుల్ని ఎదుర్కొంటున్నాం’’ అని మమత అన్నారు. రైతన్నలకు మద్దతుగా బీజేపీయేతర రాష్ట్రాలన్నీ ఏకం కావాలంటూ ఆమె విపక్షాలకు పిలుపునిచ్చారు. చర్చలకు సిద్ధం: తోమర్ రైతులతో చర్చల్ని పునరుద్ధరించడానికి తాము సిద్ధంగా ఉన్నామనివ్యవసాయ మంత్రి తోమర్ చెప్పారు. అయితే వ్యవసాయ చట్టాల్లో ఉన్న అభ్యంతరకర అంశాలను సహేతుకంగా చెప్పాలని రైతులకు సూచించారు. -
రైతుల ఉద్యమానికి నెలలు; ఈ నెల 26న ‘బ్లాక్ డే’
న్యూఢిల్లీ: కేంద్ర తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఉద్యమం ప్రారంభమై ఈ నెల 26వ తేదీకి 6 నెలలు అవుతుందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజున ‘బ్లాక్ డే’గా పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా శనివారం పిలుపునిచ్చింది. 40కి పైగా రైతుల సంఘాల ఐక్యవేదికే ఈ కిసాన్ మోర్చా. ఈనెల 26న ఇళ్లు, దుకాణాలపై నల్లజెండాలను ఎగురవేయాలని, వాహనాలకు నల్లజెండాలు కట్టుకోవాలని రైతు నేత బల్బీర్సింగ్ రాజేవాల్ శనివారం ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలకు నిరసనగా ‘చలో ఢిల్లీ’ నినాదంతో రైతులు నవంబరు 26న ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారని తెలిపారు. వణికించే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు చాలారోజుల పాటు ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధించిన విషయం తెలిసిందే. కేంద్రంతో పలుమార్లు రైతు సంఘాల చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. అప్పటినుంచి దేశనలుమూలల నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రి, సింఘు, ఘాజీపూర్లలోని ధర్నా స్థలాలకు వచ్చి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. మే 26తో మోదీ మొదటిసారి అధికారం చేపట్టి ఏడేళ్లు అవుతుందని రాజేవాల్ తెలిపారు. -
సుప్రీంకు ‘సాగు చట్టాల’పై నివేదిక
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను మార్చి 19వ తేదీన సీల్డ్ కవర్లో అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఈ విషయాన్ని కమిటీలోని సభ్యుడు పి.కె.మిశ్రా బుధవారం బయటపెట్టారు. మూడు కొత్త సాగు చట్టాల అమలుపై జనవరి 11న సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ వీటిని అమలు చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. చట్టాలను పూర్తిగా అధ్యయనం చేసి, భాగస్వామ్య పక్షాలతో చర్చించి, రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మార్చి 19న తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేశామని పి.కె.మిశ్రా పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణను న్యాయస్థానమే నిర్దేశిస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టు కమిటీ రైతు సంఘాలు, నిపుణులు, వ్యాపార, వాణిజ్య సంఘాలు, మార్కెటింగ్ బోర్డులు తదితర భాగస్వామ్య పక్షాలతో 12 దఫాలు చర్చలు జరిపి, పలుమార్లు అంతర్గతంగా సమావేశమై నివేదికను రూపొందించింది. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు: గోయెల్ అన్నదాతల ప్రయోజనాలను కాపాడడం కోసమే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయెల్ బుధవారం తేల్చిచెప్పారు. ఈ విషయంలో కొందరు వ్యక్తులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. కొత్త చట్టాల గురించి రైతులు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. వీటివల్ల మండీ వ్యవస్థకు ఎలాంటి నష్టం ఉండదన్న సంగతి రైతులకు తెలిసిందన్నారు. పార్లమెంట్ దాకా పాదయాత్ర కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను మున్ముందు మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే రెండు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణను దాదాపు ఖరారు చేసినట్లు మోర్చా నేతలు బుధవారం తెలియజేశారు. మే నెలలో పార్లమెంట్ వరకు పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. పాదయాత్ర తేదీని ఇంకా నిర్ణయించలేదని పేర్కొన్నారు. ఈ యాత్రలో రైతులతోపాటు మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు సైతం పాల్గొంటారని, వారంతా తమ పోరాటానికి మద్దతిస్తున్నారని రైతు సంఘం నాయకుడు గుర్నామ్సింగ్ చాదునీ చెప్పారు. పార్లమెంట్ వరకూ శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘జనవరి 26’ తరహా ఘటనలు పునరావృతం కానివ్వబోమన్నారు. -
హోలీ మంటల్లో ‘సాగు’ ప్రతులు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హోలికా దహనం నిర్వహించారు. కొత్త చట్టాల ప్రతులను ఆదివారం హోలీ మంటల్లో వేసి దహనం చేశారు. ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. అలాగే కనీస మద్దతు ధరపై మరో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 5వ తేదీని భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) బచావో దివస్గా పాటిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దేశవ్యాప్తంగా ఎఫ్సీఐ అధికారులను ఘెరావ్ చేస్తామని పేర్కొంది. కనీస మద్దతు ధర, ప్రజా పంపిణీ వ్యవస్థకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఎఫ్సీఐకి నిధుల కేటాయింపులను ప్రతిఏటా భారీగా తగ్గిస్తోందని గుర్తుచేసింది. ఆందోళనలను అణచివేసేందుకు హరియాణా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై సంయుక్త కిసాన్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. -
భారత్ బంద్ పాక్షికం
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ శుక్రవారం పంజాబ్, హరియాణా మినహా మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా విజయవంతమైంది. పంజాబ్, హరియాణాల్లో రోడ్డు, రైలు రవాణాను రైతులు అడ్డుకున్నారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో హైవేలను దిగ్బంధించారు. రైళ్లను అడ్డుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిర్వహిస్తున్న రైతు ఉద్యమానికి 4 నెలలు పూర్తయిన సందర్భంగా రైతు సంఘాల ఉమ్మడి వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ శుక్రవారం ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ కారణంగా 4శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయని, 35 ప్యాసెంజర్ రైళ్లను, 40 గూడ్స్ రైళ్లను రైతులు అడ్డుకున్నారని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యూపీలోని బల్లియాలో 20 మంది సీపీఐఎంఎల్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ ప్రభావం ఢిల్లీపై పెద్దగా లేదు. -
నేడే భారత్ బంద్
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా రవాణా సేవలపై ప్రభావం పడుతుందని అంచనా. అయితే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, పాండిచ్చేరిలో మాత్రం భారత్ బంద్ లేదు. సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన ప్రకారం శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు దేశవ్యాప్తం గా బంద్ నిర్వహిస్తారు. రవాణా సేవలను బంద్ సందర్భంగా అడ్డుకుంటామని రైతు నేత బల్బీర్ సింగ్ చెప్పారు. పలు ట్రేడ్ యూనియన్లు, సంఘా లు తమ బంద్కు మద్దతు తెలిపాయన్నారు. అంబులెన్స్, ఫైర్ వంటి ఎమర్జెన్సీ సేవలను మాత్రం అడ్డుకోమని తెలిపారు. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన ఆ తేదీకి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు నేత బూటా సింగ్ తెలిపారు. పాలు, కూరల రవాణాను కూడా అడ్డుకుంటామని కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ చెప్పారు. మేం పాల్గొనం రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్లో తాము పాల్గొనమని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య ప్రకటించింది. శుక్రవారం మార్కెట్లు తెరిచే ఉంచుతామని సమాఖ్య పేర్కొంది. చర్చల ద్వారానే చట్టాలపై ప్రతిష్ఠంభన వీడుతుందని, అందువల్ల సాగు చట్టాలపై చర్చలు జరపాలని సమాఖ్య కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ అభిప్రాయపడ్డారు. అయితే కిసాన్ మోర్చా మాత్రం పలు యూనియన్లు, పార్టీలు, సంఘాలు తమకు మద్దతు ఇచ్చినట్లు చెబుతోంది.బంద్ ప్రభావం పంజాబ్, హర్యానాల్లో మాత్రమే ఎక్కువగా ఉంటుందని కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు అభిమన్యు కోహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బంద్లో పాల్గొనాలని ట్రేడర్ల సమాఖ్యలకు రైతులు విజ్ఞప్తి చేశారని, సాగు చట్టాలు ట్రేడర్లపై కూడా పరోక్షంగా నెగెటివ్ ప్రభావం చూపుతాయని చెప్పారు. -
సాగు చట్టాలను రద్దు చేయాలి
శివాజీనగర: కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని బెంగళూరులో సోమవారం రైతులు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అలాగే ధరల పెరుగుదల, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వేల మంది రైతులు, దళిత, కార్మిక, విద్యార్థి సంఘాల వారు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినవారు మెజెస్టిక్ రైల్వేస్టేషన్ వద్ద సమావేశమై అక్కడ నుంచి చలో విధానసౌధకు సిద్ధం కావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఫ్రీడం పార్కులో సమావేశం జరిపారు. జాతీయ రైతు నేతలు రాకేశ్ తికాయిత్, డాక్టర్ సుదర్శన్ పాల్, యుద్ధవీర్సింగ్, రాష్ట్ర రైతు నాయకులు బి.నాగేంద్ర, జీసీ బయ్యారెడ్డి, కోడిహళ్లి చంద్రశేఖర్, కేవీ భట్ తదితరులు పాల్గొన్నారు. ‘వ్యవసాయ బిల్లులు రైతులకు వ్యతిరేకమైనవి. ఈ చట్టాల ద్వారా దేశంలో రైతుల వ్యవసాయాన్ని నాశనం చేసి కార్పొరేట్ వ్యవసాయాన్ని అమల్లోకి తేవాలనుకుంటున్నారు. ప్రభుత్వ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల పరం చేయడానికి సిద్ధమయింది’అని నేతలు కేంద్రంపై మండిపడ్డారు. ఢిల్లీలో నెలల తరబడి రైతులు ధర్నా చేస్తుంటే పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ఈ నెల 26న జరిగే భారత్ బంద్కు మద్దతునిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాటి నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు కేంద్రం భావోద్వేగ అంశాలను తెరపైకి తెస్తోందన్నారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. -
బెంగళూరుని ముట్టడిద్దాం
శివమొగ్గ (కర్ణాటక): కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదని రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ తేల్చి చెప్పారు. బెంగళూరుని కూడా ట్రాక్టర్లతో ముట్టడించాలని రైతులకు పిలుపునిచ్చారు. ‘‘ఢిల్లీని ముట్టడించిన మాదిరిగా బెంగళూరుని కూడా నిర్బంధించాలి. మీ ట్రాక్టర్లు తీసుకొని నగరం నలుమూలల నుంచి రండి’’ అని అన్నారు. కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన మహాపంచాయత్లో తికాయత్ మాట్లాడుతూ ఢిల్లీలో చేసిన ర్యాలీ మాదిరిగా అందరూ ట్రాక్టర్ల మీదే రండి, నగరంలోని 25 వేల పాయింట్లను బ్లాక్ చేస్తూ ఉద్యమించాలని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో గత మూడు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో సింఘు, తిక్రి, ఘజియాపూర్లలో రైతన్నలు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. మూడు చట్టాలను వెనక్కి తీసుకొని, కనీస మద్దతు ధరపై చట్టం చేసేదాకా తమ ఉద్యమం ఆగదని అన్నారు. రైతుల్ని వ్యవసాయ కూలీలుగా మార్చే ఈ చట్టాలతో పాటుగా పాలు, విద్యుత్, విత్తనాలు, పురుగుల మందులకు సంబంధించిన చట్టాలు కూడా చేస్తున్నారని, ఇవన్నీ రైతులతో పాటు ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తాయని అన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల రైతులు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న రుణాలు చెల్లించలేకపోతే భూముల్ని ధారాదత్తం చేయాల్సి ఉంటుందని అన్నారు. వచ్చే 20 ఏళ్లలో రైతుల భూములన్నింటినీ ఏదో ఒక రకంగా లాగేసుకోవడానికి కేంద్రం కుట్ర పన్నుతోందని రాకేశ్ తికాయత్ ఆరోపించారు. కేంద్రం దిగి రాకపోతే ఇక దేశవ్యాప్తంగా అన్ని నగరాలను ముట్టడిస్తామని చెప్పారు. -
ఎన్నికల్లో బీజేపీని ఓడించండి
కోల్కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని నందిగ్రామ్లో శనివారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పంచాయత్లలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతన్నల వెన్ను విరుస్తోందని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటాన్ని అణచి వేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ‘‘బీజేపీకి ఓటు వేయొద్దు. ఆ పార్టీకి అధికారం అప్పగిస్తే మీ భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతారు. మిమ్మల్ని భూమిలేని పేదలుగా మార్చేస్తారు. దేశాన్ని బడా కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెడతారు. మీరు ఉపాధి కోల్పోతారు’’ అని ప్రజలను అప్రమత్తం చేశారు. బీజేపీ మోసాలకు మారుపేరని దుయ్యబట్టారు. ఆ పార్టీ సంపన్నుల పక్షపాతి అన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారి పక్షాన తాము ఉంటామన్నారు. బీజేపీని వ్యతిరేకించేవారు రైతులు, పేదల పక్షాన ఉంటారని రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. కిసాన్ మహాపంచాయత్లలో ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ కూడా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తయిన ఇంట్లో సేదతీరుతున్న రైతులు -
రైతుల ఆందోళన : సరిహద్దుల్లో శాశ్వత గృహాలు
న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఆందోళనలు చేపట్టి 5 నెలల కావస్తున్నప్పటకి పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. దేశ రాజధానిలోని నిరసన ప్రదేశాలలో రైతులకు చలికాలంలో అవసరమయ్యే సదుపాయలు, ఇంటర్నెట్, విద్యుత్ కోతలతో పాటు ఇతరత్రా సదుపాయలపై కేంద్రం ఆంక్షలు విధించడంతో రైతులు తమ నిరసనను మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమయ్యారు. వంద రోజులే కాదు.. 500 రోజులైన వెనక్కి తగ్గేది లేదంటూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో తమ నిరసనను ఉధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా సమీపంలో తిక్రీ సరిహద్దులో 25 శాశ్వత నివాసాలను రైతులు నిర్మించుకున్నారు. దీనికి కిసాన్ సోషల్ ఆర్మీ నాయకత్వం వహిస్తోంది. Kisan Social Army has constructed a permanent shelter at Tikri border as protest against farm laws continues "These houses are strong, permanent just like the will of the farmers. 25 houses built, 1000-2000 similar houses to be built in coming days,"Anil Malik, Kisan Social Army pic.twitter.com/4ZudQTIAqj — ANI (@ANI) March 13, 2021 అంతేగాక ఈ ఇళ్ల నిర్మాణానికి కూడా కిసాన్ సోషల్ ఆర్మీ.. రైతులకు మద్దతుగా నిలుస్తోంది. ఇటుకలతో నిర్మిస్తున్న ఈ ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి దాదాపు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు ఖర్చు అవుతుందట. అయితే ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే వస్తు సామగ్రిని మాత్రమే రైతులు కొనుగొలు చేస్తున్నారని, కూలీల ఖర్చు మాత్రం వారికి ఉచితమని కిసాన్ ఆర్మీకి చెందిన అనిల్ మాలిక్ మీడయాతో పేర్కొన్నారు. అందువల్ల మున్ముందు కూడా 1000 నుంచి 2000 ఇళ్లను నిర్మించే యోచనలో రైతులు ఉన్నారని ఆయన అన్నారు. చదవండి: వందోరోజుకు రైతు ఆందోళనలు 500 రోజులైనా వెనక్కి తగ్గేది లేదు -
‘26వ తేదీన రాష్ట్ర బంద్’
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు భారత్ బంద్లో భాగంగా ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి నిర్ణయించింది. సమితి సమావేశం ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగింది. సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. 26న బంద్ను విజయవంతం చేయడానికి 17న విజయవాడలో సన్నాహక సమావేశం జరుపుతున్నట్లు తెలిపారు. 19న వ్యవసాయ మార్కెట్ కమిటీల ముందు నిరసన వ్యక్తం చేయాలని, 15న విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగే పోరాటంలో భాగస్వామ్యం కావాలని సమావేశంలో తీర్మానం చేశామన్నారు. సమావేశంలో రైతు సంఘాల నేతలు రావుల వెంకయ్య, వై.కేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ సరిహద్దుల్లో నినదించిన మహిళా రైతులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు సోమవారం మహిళా రైతుల నిరసనలతో మారుమోగాయి. కేంద్ర వ్యవసాయ చట్టాలను వాపసు తీసుకోవాలంటూ సింఘు, టిక్రీ, ఘాజీపూర్లలో రైతులు మూడు నెలలకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ సమస్యలతోపాటు మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారు చర్చించారు. ఇతర సంఘాలకు చెందిన కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమ అనుభవాలను వారు పంచుకున్నారు. పసుపు, ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించిన మహిళలు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. కొందరు భాంగ్రా నృత్యాలు చేశారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. రైతు నిరసనల్లో పాల్గొనే మహిళల సంఖ్య కూడా పెరుగుతోందని వారన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లు, కార్లు, టెంపోలు, జీపుల ద్వారా వారు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకున్నారని చెప్పారు. -
ఉద్యమ వేదికల వద్ద మహిళా దినోత్సవం
న్యూఢిల్లీ/భోపాల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమ వేదికల వద్ద సోమవారం అన్ని కార్యక్రమాలు మహిళల ఆధ్వర్యంలో జరగనున్నాయి. టిక్రీ, సింఘు, ఘాజీపూర్ ఉద్యమ కేంద్రాల వద్ద వేదిక ఏర్పాటు, ప్రసంగాలు, కార్యక్రమాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల నుంచి ఆహార పంపిణీ వరకు అన్ని కార్యక్రమాలను మహిళలే నిర్వహించనున్నారు. వేలాదిగా మహిళా రైతులు, విద్యార్థినులు, సామాజిక కార్యకర్తలు ఇందులో పాలుపంచుకోనున్నారు. వ్యవసాయ రంగంలో మహిళలు గణనీయ పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి సరైన గుర్తింపు లభించడం లేదనే ఉద్దేశంతో, వారికి సముచిత గుర్తింపు, గౌరవం అందించే లక్ష్యంతో మహిళా దినోత్సవం రోజు పూర్తిగా వారి ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో పాలు పంచుకోవడం కోసం పంజాబ్, హరియాణాల నుంచి వేల సంఖ్యలో మహిళలు వస్తున్నారని రైతు ఉద్యమ నేతలు తెలిపారు. సింఘు సరిహద్దు వద్ద ర్యాలీని సైతం నిర్వహించనున్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు గత మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, రైతు నేత, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ సింగ్ తికాయత్ మార్చి నెలలో మధ్యప్రదేశ్లో జరగనున్న పలు రైతు సభల్లో పాల్గొననున్నారు. మార్చి 8న షోపూర్లో, మార్చి 14న రేవాలో, మార్చ్ 15న జబల్పూర్లో జరిగే సభల్లో ఆయన పాల్గొని, రైతు ఉద్యమానికి మద్దతు కూడగడ్తారని బీకేయూ ప్రతినిధి వెల్లడించారు. ఉత్తరాఖండ్, రాజస్తాన్, కర్ణాటక, తెలంగాణల్లోనూ పర్యటిస్తారన్నారు. కాగా, తికాయత్పై మధ్య ప్రదేశ్లో 2012 నాటి ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ వారంట్ పెండింగ్లో ఉంది. ఆ సమయంలో జైతారిలో పవర్ప్లాంట్కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో తికాయత్ కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా చోటు చేసుకున్న హింసకు సంబంధించి తికాయత్ అరెస్టయ్యారు. బెయిల్పై విడుదలైన తికాయత్ ఆ తర్వాత కోర్టుకు హాజరుకాలేదు. దాంతో, వారంట్ జారీ అయింది. -
వందోరోజుకు రైతు ఆందోళనలు
చండీగఢ్: కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనలు 100వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో హరియాణాలో రైతు సంఘాలు కేఎంపీ ఎక్స్ప్రెస్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. శనివారం 11 గంటల నుంచి 4 గంటల వరకు హరియాణాలో పలు ప్రాంతాల్లో హైవేపై రాకపోకలను అడ్డుకున్నారు. తమ డిమాండ్లకు అంగీకరించడం లేదంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. రాస్తారోకో సందర్భంగా ఈ హైవేపై రాకపోకలను నియంత్రించిన పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు. సంయుక్త కిసాన్మోర్చా ఈ రాస్తారోకోకు పిలుపునిచ్చింది. మూడు చట్టాలను ఉపసంహరించుకునేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతు నేతలు చెప్పారు. తమ నిరసన శాంతియుతంగా ఉంటుందన్నారు. కేంద్ర అహంకారానికి నిదర్శనం సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన వందోరోజుకు చేరడం కేంద్ర దురహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ దుయ్యబట్టింది. భారత ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చగా అభివర్ణించింది. ఆందోళన చేస్తున్న రైతుల్లో చాలామంది పిల్లలు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడుతున్నారని, అలాంటి రైతులను అడ్డుకునేందుకు కేంద్రం రోడ్లపై మేకులు పరుస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శించారు. రైతులు తమ హక్కులను కోరుతున్నారని, ప్రభుత్వం వారిపై దమనకాండ జరుపుతోందని ట్వీట్ చేశారు. అన్నదాతలు వందరోజులుగా నిరసన చేస్తున్నా, బీజేపీ ప్రభుత్వం అబద్దాలు, అహంకారంతో కాలం గడిపిందని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. రైతాంగ ఉద్యమం చరిత్రాత్మకం సాక్షి , న్యూఢిల్లీ: సాగు వ్యతిరేక చట్టాలపై వంద రోజులుగా సాగిన ఉద్యమం దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమైందని ఆలిండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా అభివర్ణించాయి. శనివారం ఈ రెండు రైతు సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. 1930లో మహాత్మాగాంధీ నేతృత్వంలో జరిగిన దండి ఉద్యమం మాదిరిగా రైతు ఉద్యమం జరుగుతోందని స్పష్టంచేశాయి. రైతులు చేస్తున్న పోరాటం సామాన్యమైన విషయం కాదని, ఎన్నో ఇబ్బందులు, అటంకాలు, అవమానాలకి ఓర్చి ఇంత స్థాయిలో ఉద్యమిస్తున్న రైతాంగానికి ఏఐకేఎస్, ఎస్కేయూ ధన్యవాదాలు తెలిపాయి. బీజేపీ సర్కారు ఎన్నినిర్బంధాలు పెట్టినా రైతాంగం ఉద్యమించడం హర్షణీయమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పేర్కొన్నారు. -
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
‘‘కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ విద్యుత్ చట్టాలను తీసుకువచ్చింది. అవి రైతులకు వరాలు కావు.. మరణ శాసనాలు’’ అని నటులు, దర్శక, నిర్మాత, సామాజిక విశ్లేషకులు ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం రైతన్న. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాలను రద్దుచేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని పంజాబ్, హర్యానా, బీహార్, మహారాష్ట్రతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ కొత్త చట్టాలు రైతులకు మేలు చేస్తాయని, సవరణలు చేస్తాం కానీ రద్దు మాత్రం చెయ్యం అని కేంద్రం అంటోంది. రైతులంటే అంత గౌరవం ఉంటే మీరు తీసుకువచ్చిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని ‘రైతన్న’ చిత్రం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీగారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. -
సాగు చట్టాలపై సుదీర్ఘ పోరు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు చేపట్టనున్న పోరాట కార్యాచరణను ఆదివారం ప్రకటించింది. ప్రభుత్వ అణచివేతకు నిరసనగా 23న పగాడీ సంభాల్ దివస్, 24న దామన్ విరోధి దివస్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే 26న యువ కిసాన్ దివస్, 27న మజ్దూర్–కిసాన్ ఏక్తా దివస్ నిర్వహిస్తామని పేర్కొంది. కొత్త సాగు చట్టాలు రద్దయ్యే దాకా సుదీర్ఘ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని రైతు సంఘం నేత యోగేంద్ర యాదవ్ చెప్పారు. ఆ చట్టాలు రైతులకు డెత్ వారెంట్లు: కేజ్రీవాల్ కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు డెత్ వారెంట్లు అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభివర్ణించారు. ఆయన ఆదివారం పశ్చిమ ఉత్తరప్రదేశ్కు చెందిన పలువురు రైతు సంఘాల నేతలతో విందు భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త సాగు చట్టాలను అమలు చేస్తే దేశంలో వ్యవసాయ రంగం మొత్తం కార్పొరేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
వాళ్లను పెళ్లికి పిలవొద్దు.. పిలిచారనుకో..
లక్నో : ప్రజలెవరూ భారతీయ జనతా పార్టీ నేతలతో ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దని భారతీయ కిషాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు నరేశ్ తికైత్ ‘తుగ్లక్- ఇష్క్ దిక్తత్’ ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ నేతలను పెళ్లికి కూడా పిలవొద్దని, ఒక వేళ ఎవరైనా వారిని పెళ్లికి పిలిస్తే.. మరుసటి రోజు ఉదయం ఆ పెళ్లివారు 100 మంది బీకేయూ సభ్యులకు భోజనం పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్, సిసౌలీలోని మహా పంచాయత్లో తికైత్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ రైతులను పట్టించుకోవటం లేదని, అందుకే కాషాయ పార్టీతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదన్న నిర్ణయానికి వచ్చామని చెప్పారు. తాము రాముడి వారసులమని ఆయన అన్నారు. ( అసెంబ్లీకి సైకిల్పై వచ్చిన ఎమ్మెల్యే ) అమిత్ షా రైతులతో మాట్లాడటం లేదు కానీ, తమ పూర్వీకుల(రాముడు అనే ఉద్దేశ్యంతో) పేరు చెప్పి పశ్చిమ బెంగాల్లో ఓట్లు అడుక్కుంటున్నారని మండిపడ్డారు. కాగా, రైతు ఉద్యమంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం స్పందిస్తూ.. కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు చట్టాలపై రైతులతో చర్చలు జరపటానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం దశల వారీగా రైతులతో చర్చలు జరపటానికి వారిని పిలుస్తూనే ఉందని అన్నారు. -
రైతుల రైల్ రోకో
న్యూఢిల్లీ/హిసార్: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు గురువారం నాలుగు గంటలపాటు రైల్ రోకో చేపట్టాయి. ఆందోళనలతో రైలు సర్వీసులపై కొద్దిపాటి ప్రభావమే పడిందని రైల్వేశాఖ తెలిపింది. కొన్ని రైళ్లను ముందు జాగ్రత్తగా రైల్వేస్టేషన్లలోనే నిలిపివేసినట్లు వెల్లడించింది. పంజాబ్, హరియాణాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు రైలు పట్టాలపై బైఠాయించడంతో కొన్ని మార్గాల్లో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ అక్కడక్కడా ఆందోళనలు జరిగాయి. చాలా వరకు రాష్ట్రాల్లో రైల్ రోకో ప్రభావం నామమాత్రంగా కనిపించింది. దేశవ్యాప్త రైల్ రోకోకు భారీగా స్పందన లభించినట్లు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రకటించింది. మోదీ ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక వంటిదని వ్యాఖ్యానించింది. డిమాండ్లు సాధించేదాకా పోరాటం కొనసాగించేందుకు రైతులు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపింది. అవాంఛనీయ ఘటనలు లేవు ‘రైల్ రోకో సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలపై రైల్ రోకో ప్రభావం కొన్ని చోట్ల నామమాత్రం, మరికొన్ని చోట్ల అస్సలు లేనేలేదు. సాయంత్రం 4 గంటల తర్వాత రైళ్లు యథావిధిగా నడిచాయి’ అని రైల్వే శాఖ ప్రతినిధి తెలిపారు. రైల్ రోకో నేపథ్యంలో ముందుగానే రైల్వే శాఖ 25 రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించింది. ముందు జాగ్రత్తగా ముఖ్యంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్లో 20 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను మోహరించింది. హరియాణాలోని అంబాలా, కురుక్షేత్ర, చర్ఖిదాద్రి రైల్వేస్టేషన్లలో రైతులు పట్టాలపై బైఠాయించారని రైల్వే శాఖ వెల్లడించింది.పంజాబ్లో ఢిల్లీ–లూధియానా–అమృత్సర్ మార్గం, జలంధర్–జమ్మూ మార్గాల్లోని పట్టాలపై రైతులు కూర్చున్నారు. రాజస్తాన్లో రెవారీ–శ్రీగంగానగర్ స్పెషల్ రైలును మాత్రమే ఆందోళనల కారణంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. మీ పంటలను త్యాగం చేయండి: తికాయత్ చట్టాలను వాపసు తీసుకునే వరకు రైతులు ఇళ్లకు తిరిగి వెళ్లబోరని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. చేతికి వచ్చే దశలో ఉన్న పంటను త్యాగం చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ‘పంటకు నిప్పు పెట్టాల్సిన అవసరం వచ్చినా అందుకు మీరు సిద్ధంగా ఉండాలి. పంటలు కోతకు రానున్నందున రైతులు ఆందోళనలను విరమించి ఇళ్లకు వెళ్లిపోతారని ప్రభుత్వం భావించరాదు’అని తెలిపారు. ఆందోళనలను ఉధృతం చేయాలంటూ రైతు సంఘాలు ఇచ్చే పిలుపునకు సిద్ధంగా ఉండాలన్నారు. ‘మీ ట్రాక్టర్లలో ఇంధనం నిండుగా నింపి, ఢిల్లీ వైపు తిప్పి సిద్ధంగా ఉంచండి. రైతు సంఘాల కమిటీ నుంచి ఏ సమయంలోనైనా పిలుపు రావచ్చు’అని చెప్పారు. ఈ దఫా ఢిల్లీలో చేపట్టే ట్రాక్టర్ ర్యాలీలకు వ్యవసాయ పనిముట్లు కూడా తీసుకురావాలని రైతులను కోరారు. -
ఢిల్లీలో 26నాటి ఘటనపై న్యాయ విచారణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26వ తేదీన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. అప్పటి ఘటనలకు సంబంధించి ప్రభుత్వం రైతులపై తప్పుడు ఆరోపణలతో కేసులు బనాయించిందని ఆరోపించాయి. సింఘు వద్ద సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు శనివారం మీడియాతో మాట్లాడారు. పోలీసు నోటీసులు అందుకున్న రైతులు నేరుగా వారి వద్దకు వెళ్లకుండా, అవసరమైన సాయమేదైనా రైతు సంఘాల న్యాయ విభాగాల నుంచి పొందాలని సూచించారు. జనవరి 26వ తేదీ నాటి హింసాత్మక ఘటనలకు, రైతులపై తప్పుడు కేసులు నమోదు చేయడం వెనుక కుట్ర దాగుందని ఎస్కేఎం న్యాయ విభాగం సభ్యుడు కుల్దీప్ సింగ్ ఆరోపించారు. ఈ ఘటనలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న 16 మంది రైతుల ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదన్నారు. ఆ ఘటనలపై నమోదైన మొత్తం 44 ఎఫ్ఐఆర్లలో 14 ఎఫ్ఐఆర్లకు సంబంధించి 122 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారని, వారందరికీ న్యాయ, ఆర్థిక సాయం అందజేస్తామని మరో నేత రవీందర్ సింగ్ తెలిపారు. కొందరు రైతులపై దోపిడీ, హత్యాయత్నం వంటి కేసులు కూడా పెట్టారన్నారు. భోజనం ఖర్చుల కోసం జైలులో ఉన్న రైతులకు రూ.2 వేల చొప్పున ఎస్కేఎం అందజేస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు జైలులో ఉన్న 10 మంది రైతులకు బెయిల్ మంజూరు కాగా, మరో ఐదుగురి బెయిల్కు దరఖాస్తు చేశామన్నారు. తీవ్ర సెక్షన్ల కింద కేసులు నమోదు కాని వారిపై మొదట దృష్టి పెట్టినట్లు చెప్పారు. తీహార్ జైలులో ఉన్న 112 మంది రైతులను తమ న్యాయ విభాగం కలిసిందని వెల్లడించారు. ఇలా ఉండగా, ట్రాక్టర్ పరేడ్ సమయంలో ఎర్రకోట వద్ద జరిగిన ఘటనలకు కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న నటుడు దీప్ సిద్దు, ఇక్బాల్ సింగ్ అనే మరో వ్యక్తిని దర్యాప్తులో భాగంగా ఢిల్లీ నేర విభాగం పోలీసులు శనివారం ఘటనాస్థలికి తీసుకువచ్చి, సీన్ రిక్రియేట్ చేయించారు. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 500 మంది పోలీసులు గాయపడగా, ఒక ఆందోళనకారుడు చనిపోయిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు గాంధీజీ మనవరాలు మద్దతు ఘజియాబాద్: మహాత్మాగాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాచార్జీ(84) రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపారు. గాంధీ నేషనల్ మ్యూజియం చైర్ పర్సన్ కూడా అయిన భట్టాచార్జీ శనివారం ఘాజీపూర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులతో మాట్లాడారు. నిరసనలు శాంతియుతంగా కొనసాగించాలని వారిని కోరిన ఆమె.. రైతులపట్ల శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయ కార్యక్రమంలో భాగంగా మేం ఇక్కడికి రాలేదు. మనల్ని పోషిస్తున్న రైతుల కోసం మాత్రమే వచ్చాం. అన్నదాతల కష్టాన్ని విస్మరించరాదు. రైతులకు లబ్ధి దేశానికే లబ్ధి’అని ఆమె అన్నారని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) తెలిపింది. ఆమె వెంట మహాత్మా స్మారక్ నిధి చైర్మన్ రామచంద్ర రాహి, ఆల్ ఇండియా సర్వ్ సేవా సంఘ మేనేజింగ్ ట్రస్టీ అశోక్ సరన్, గాంధీ స్మారక్ నిధి డైరెక్టర్ సంజయ్ సింఘా, నేషనల్ గాంధీ మ్యూజియం డైరెక్టర్ అన్నామలై ఉన్నారు. -
పంజాబ్లో కిసాన్ మహా పంచాయత్
జాగ్రాన్(లూధియానా): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్, హరియాణా వంటి రాష్ట్రాల్లోనే జరిగిన కిసాన్ మహా పంచాయత్కు తాజాగా పంజాబ్ వేదికగా మారింది. లూధియానా జిల్లాలోని జాగ్రాన్ మార్కెట్లో గురువారం నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్లో 40 రైతు సంఘాలు బలప్రదర్శన నిర్వహించాయి. 30 వేల మందికిపైగా రైతులు పాల్గొన్నారు. పంజాబ్లోని వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై తరలివచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 40 రైతు సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. కొత్త వ్యవసాయ చట్టాలు రైతాంగాన్ని సర్వనాశనం చేస్తాయని భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) అధ్యక్షుడు బల్బీర్సింగ్ రాజేవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కిసాన్ మహా పంచాయత్లో ఆయన ప్రసంగించారు. రైతన్నల పోరాటం గురించి ఆందోళన జీవులంటూ తేలికగా మాట్లాడిన ప్రధాని∙మోదీ అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో మాట మార్చారని అన్నారు. రైతులది పవిత్ర పోరాటం అంటున్నారని గుర్తుచేశారు. ‘మోదీ పెద్ద అబద్ధాలకోరు, నాటకాల రాయుడు’ అని రాజేవాల్ మండిపడ్డారు. వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని వెల్లడించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై తప్పుడు చట్టాలు తెచ్చిందని దుయ్యబట్టారు. ఇది ప్రజా పోరాటం కొత్త సాగు చట్టాలతో కార్పొరేట్ వ్యాపారులకు లాభం తప్ప రైతులకు ఒరిగేదేమీ ఉండదని రాజేవాల్ విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులంతా శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని, విజయం తప్పకుండా వరిస్తుందని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం మేరకు తదుపరి పోరాట కార్యాచరణను రాజేవాల్ ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి నివాళిగా ఈ నెల 14న దేశవ్యాప్తంగా కొవ్వొత్తులు/కాగడాల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సర్ చోటూరామ్ను స్మరించుకుంటూ ఈ నెల 16న కిసాన్/మజ్దూర్ దినం పాటిస్తామని వెల్లడించారు. 18న దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు రైల్ రోకో చేపడతామని వివరించారు. సుదీర్ఘపోరాటానికి సిద్ధం కావాలని భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా ఉగ్రహన్) అధ్యక్షుడు జోగీందర్ సింగ్ రైతులకు సూచించారు. కాంట్రాక్టు వ్యవసాయం, ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వంటివి తామెప్పుడూ ప్రభుత్వాన్ని కోరలేదని పేర్కొన్నారు. వాటిని తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. అవసరమైతే సవరణలు: మంత్రి రాజ్నాథ్ నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ పునరుద్ఘాటించారు. ఈ చట్టాల్లో అవసరమైతే ప్రభుత్వం సవరణలు చేస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్లో పలు చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాక రాజ్నాథ్ మాట్లాడారు. ప్రభుత్వ చర్యలతో సాధారణ రైతన్నల్లో కొత్త విశ్వాసం, ఉత్సాహం వచ్చిందని చెప్పారు. -
దేశాన్ని నలుగురు నడిపిస్తున్నారు: రాహుల్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై దాడిని కాంగ్రెస్ తీవ్రం చేసింది. ఈ చట్టాలతో దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని, ఇవి రైతుల వెన్నెముకను విరిచేస్తాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ దేశాన్ని నలుగురు వ్యక్తులే నడిపిస్తున్నారని, వారెవరో అందరికీ తెలుసని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో గురువారం బడ్జెట్పై చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. తన ప్రసంగంలో వ్యవసాయ చట్టాలను విమర్శించేందుకే ప్రాధాన్యతనిచ్చారు. ‘విపక్ష సభ్యులెవరూ వ్యవసాయ చట్టాల్లోని విషయాలపై, వాటి ఉద్దేశాలపై మాట్లాడలేదని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు ఆ చట్టాల ఉద్దేశాలపై, అందులోని విషయాలపై నేను మాట్లాడుతాను. ఈ చట్టాల సాయంతో కార్పొరేట్లు భారీ మొత్తంలో ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి, ఇష్టమొచ్చినంత కాలం నిల్వ చేసి, దేశ ఆహార భద్రతను నాశనం చేస్తారు. అదే ఆ చట్టాల ప్రధాన ఉద్దేశం’అని రాహుల్ విమర్శించారు. కుటుంబ నియంత్రణ ప్రచార నినాదమైన ‘మనం ఇద్దరం.. మనకు ఇద్దరు’స్ఫూర్తితో ఈ దేశాన్ని నలుగురు వ్యక్తులు మాత్రమే నడిపిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కొత్త సాగు చట్టాలతో వ్యవసాయ మార్కెట్లు కనుమరుగవుతాయని, నిత్యావసర వస్తువుల చట్టం ప్రాధాన్యత కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆహార భద్రత వ్యవస్థను, గ్రామీణ ఆర్థిక రంగాన్ని కొత్త సాగు చట్టాలు నాశనం చేస్తాయి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు రైతులు విశ్రమించబోరు’అన్నారు. ‘నిజమే.. ఈ చట్టాలు రైతులకు ఎంచుకునే అవకాశం ఇచ్చాయి. అవి ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలను ఎంచుకునే అవకాశం’అని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మాత్రమే ఉద్యమించడం లేదని, దేశమంతా వారి వెనుక ఉందని, ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. ఉద్యమంలో 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, అయినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. రైతుల మృతికి నివాళిగా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ సభ్యులతో కలిసి సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ‘సాగు చట్టాలపై ప్రత్యేక చర్చ కావాలని కోరాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే, నిరసనగా, నేను ఈ రోజు రైతుల విషయంపైనే మాట్లాడుతాను’అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వ్యవసాయం కూడా బడ్జెట్లో భాగమేనని, అదీకాక, బడ్జెట్పై చర్చల్లో పాల్గొన్న సభ్యుడు సాధారణ అంశాలపై కూడా మాట్లాడవచ్చని నిబంధనల్లోనే ఉందని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి పేర్కొన్నారు. -
500 మంది ట్విటర్ ఖాతాలు రద్దు
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారి ట్విట్టర్ అకౌంట్లను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలపై సామాజిక మాధ్యమం ట్విట్టర్ చర్యలు మొదలు పెట్టింది. మొత్తం 500 మంది ట్విట్టర్ ఖాతాలను రద్దు చేసినట్టుగా తన బ్లాగ్లో ట్విట్టర్ పేర్కొంది. భారత్లో మరికొంత మందికి ట్విట్టర్తో యాక్సెస్ లేకుండా నిరోధించింది. అదే సమయంలో వినియోగదారుల స్వేచ్ఛను కాపాడతామని ట్విట్టర్ పేర్కొంది. వార్తా సంస్థలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయనేతల ఖాతాల్ని నిరోధించలేమంది. అలా చేస్తే భారత రాజ్యాంగం వారికి ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాసినట్టేనని ట్విట్టర్ కేంద్రానికి బదులిచ్చింది. రైతు ఉద్యమంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న పాకిస్తాన్, ఖలిస్తాన్ మద్దతుదారులకు చెందిన 1,178 ఖాతాలపై నిషేధం విధించాలని ఈ నెల 4న కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ సంస్థని ఆదేశించింది. రైతు నిరసనలపై తప్పుడు ప్రచారం చేస్తూ, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని కేంద్రం ట్విట్టర్కి తెలిపింది. దీనిపై ట్విట్టర్ చర్యలు చేపడుతూ మొత్తం 500 మంది అకౌంట్లను నిషేధించింది. కొంత మంది ఖాతాల్లో విద్వేషపూరిత ట్వీట్లను తొలగించింది. ‘కూ’లో స్పందించిన కేంద్రం అమెరికాకి చెందిన ట్విట్టర్ సంస్థ తన చర్యలన్నింటినీ బ్లాగ్లో పేర్కొనడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. ఈ అంశంపై కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శితో అపాయింట్మెంట్ కోరిన ట్విట్టర్ ఇలా బ్లాగ్లో పోస్టు చెయ్యడం అసాధారణమని ఐటీ శాఖ పేర్కొంది. ఐటీ శాఖ తన స్పందనని దేశీయంగా తయారు చేసిన ట్విట్టర్ తరహా ‘కూ’ యాప్లో పోస్టు చేసింది. కేంద్రం తన స్పందనని కూ యాప్లో ఉంచడంతో ఈ యాప్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
18న నాలుగు గంటలపాటు రైల్ రోకో
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీన దేశవ్యాప్తంగా రైల్ రోకో (రైళ్ల నిలిపివేత) చేపట్టనున్నట్లు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైలు రోకో నిర్వహిస్తామని తెలిపాయి. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి రాజస్తాన్లో టోల్ రుసుము వసూలును అడ్డుకుంటామని తెలియజేసింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు కేంద్రంలో అధికార మార్పిడిని ఆశించడం లేదని, తమ సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటున్నారని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. తమ పోరాటాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామని, రైతు సంఘాల నాయకులు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని చెప్పారు. ఆయన బుధవారం సింఘు బోర్డర్ పాయింట్ వద్ద రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దయ్యే దాకా పోరాటం కొనసాగుతుందని అన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చాలో(ఎస్కేఎం) చీలికలు తెచ్చే ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. త్వరలో దేశవ్యాప్తంగా రైతులతో భారీ సభలు నిర్వహిస్తామన్నారు. ‘‘రైతులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. చర్చల కోసం మా కమిటీ సిద్ధంగా ఉంది. సంప్రదింపులతోనే పరిష్కార మార్గం లభిస్తుంది’’ అని చెప్పారు. జనవరి 26న ఢిల్లీలో జరిగిన ఎర్రకోట ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని తికాయత్ ఆరోపించారు. రైతుల పోరాటం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. రైతుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసిందని విమర్శించారు. మత జెండాను ఎగురవేయడం దేశద్రోహం కాదన్నారు. -
‘40 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో 70 రోజులకు పైగా ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు ఉద్యమాన్ని దేశమంతా విస్తారమని తెలిపారు. హర్యానా, కురుక్షేత్ర జిల్లాలోని పెహోవాలో నిర్వమించిన 'కిసాన్ మహాపాంచాయతీ'లో ప్రసంగిస్తూ రైతు నాయకుడు ఈ ప్రకటన చేశారు. రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోదీ ఇంతవరకు ఒక్క ఆందోళనలో కూడా పాల్గొనలేదు. ఆయన చేసే పని ఏంటంటే దేశాన్ని విడగొట్టడం మాత్రమే. ఆందోళన జీవుల గురించి ఆయనకు అసలు ఏం తెలుసు. భగత్ సింగ్ నుంచి బీజేపీ నాయుకులు ఎల్కే అద్వానీ వరకు ప్రతి ఒక్కరు ఆందోళనలో పాల్గొన్నారు. మోదీ ఇలాంటి వాటికి దూరం. అందుకే ఆయనకు దీని గురించి తెలియదు’ అంటూ మండిపడ్డారు. ఈ ఏడాది అక్టోబర్ 2 వరకు రైతుల ఆందోళనను కొనసాగిస్తామని ప్రకటించారు రాకేశ్ తికాయత్. ‘‘ఆ తర్వత కూడా ఉద్యమం ఆగిపోదు. విడతల వారిగా రైతులందరం దీనిలో పాల్గొని ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఇక తర్వలోనే నలభై లక్షల ట్రాక్టర్లు.. మీరు విన్నది కరెక్టే.. నాలుగు కాదు 40,00,000 లక్షల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తాం’’ అని తెలిపారు. చదవండి: మేం రెడీ.. డేట్ ఫిక్స్ చేయండి: అన్నదాతలు -
ఆందోళన ఆపండి.. రైతులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇకనైనా విరమించాలని రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కొత్త సాగు చట్టాలకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఆందోళనలో భాగస్వాములైన సిక్కు రైతులను దూషిస్తూ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. మన రైతులను మనమే కించపర్చుకోవడం దేశానికి ఏమాత్రం మంచి చేయదని పేర్కొన్నారు. కొత్త చట్టాలను కొందరు రాజకీయ అంశంగా మార్చేశారని విమర్శించారు. రైతుల ఆందోళన వెనుక ఉన్న అసలైన కారణాలపై ప్రతిపక్షాలు మౌనం వహిస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ సోమవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎఫ్డీఐకి (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) మరో నిర్వచనం ఇచ్చారు. విదేశీ విధ్వంసకర సిద్ధాంతం(ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ) అనే కొత్త ఎఫ్డీఐ దేశంలో ఆవిర్భవించిందని అన్నారు. ఈ సిద్ధాంతం నుంచి దేశాన్ని రక్షించుకొనేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. వారంతా ఆందోళన్ జీవులు ‘‘దేశంలో ఆందోళన్ జీవి అనే కొత్త జాతి పుట్టుకొచ్చింది. నిష్ణాతులైన నిరసనకారులు ప్రతి ఆందోళనలో కనిపిస్తున్నారు. వారంతా ఆందోళనల నుంచి లాభం పొందాలనుకునే పరాన్నజీవులు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి లేకపోతే వారు బతకలేరు. రైతుల ఆందోళనలో పాల్గొంటున్న సిక్కులను ఖలిస్తాన్ ఉగ్రవాదులు అని సంబోధించడం తగదు. సిక్కుల సేవలు దేశానికి గర్వకారణం. పంజాబ్లో ఏం జరిగిందో మనం మర్చిపోకూడదు. దేశ విభజన వల్ల పంజాబ్ తీవ్రంగా నష్టపోయింది. 1984లో జరిగిన అల్లర్లలో సిక్కులు బాధితులయ్యారు. సంస్కరణలతో తోడ్పాటు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ), మండీ వ్యవస్థకు ఎలాంటి విఘాతం కలుగదు. ఈ చట్టాలతో మండీలు మరింత ఆధునికంగా మారుతాయి. కనీస మద్దతు ధర భవిష్యత్తులోనూ కచ్చితంగా కొనసాగుతుందని నేను హామీ ఇస్తున్నా. దేశంలో 80 కోట్ల మందికి రేషన్ సరుకులు ఎప్పటిలాగే అందుతాయి. దయచేసి తప్పుడు ప్రచారం సాగించకండి. కొత్త వ్యవసాయ చట్టాలతో వారు తమ పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకొనే స్వేచ్ఛ లభిస్తుంది. తద్వారా మంచి ధర పొందుతారు. పంటల సేకరణ విధానంలో సంస్కరణలు అవసరమని గతంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చెప్పారు. రైతన్నలు కొత్త చట్టాలను అర్థం చేసుకోవాలి. రైతులు ఆందోళన ఆపేయాలి. చర్చల కోసం అన్ని ద్వారాలు తెరుద్దాం. చర్చల కోసం మిమ్మల్ని మరోసారి ఈ సభ నుంచే ఆహ్వానిస్తున్నా. కొత్త సాగు చట్టాలకు ప్రతిపక్షాలు, ప్రభుత్వం, ఆందోళనకారులు ఒక అవకాశం ఇవ్వాలి. రైతులకు మేలు చేస్తాయో లేదో చూడాలి. లోపాలుంటే తొలగించడానికి సిద్ధం. కశ్మీర్లో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించడం సంతోషకరం. దీన్ని కాంగ్రెస్ నాయకులు ‘జి–23 సలహా’గా చూడొద్దు’’ అని ప్రధాని మోదీ కోరారు. తేదీ, సమయం మీరే నిర్ణయించండి: సంయుక్త కిసాన్ మోర్చా కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వంతో తదుపరి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని సంయుక్త కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు శివ్కుమార్ కక్కా సోమవారం ప్రకటించారు. చర్చల తేదీ, సమయాన్ని మీరే నిర్ణయించండి అని కేంద్రాన్ని కోరారు. దేశంలో ఆందోళన జీవి అనే కొత్త జాతి పుట్టుకొచ్చిందన్న ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఆందోళనకు ముఖ్యమైన పాత్ర ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వంతో చర్చలను తాము ఎప్పుడూ నిరాకరించలేదని చెప్పారు. ప్రభుత్వం పిలిచినప్పుడల్లా తాము వెళ్లామని, కేంద్ర మంత్రులతో చర్చించామని వెల్లడించారు. ‘‘కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కొనసాగుతుందని ప్రభుత్వం ఇప్పటికే వందల సార్లు చెప్పింది. అలాంటప్పుడు దానికి చట్టబద్ధత కల్పించడానికి అభ్యంతరం ఏమిటి?’’ అని రైతు సంఘం నేత అభిమన్యు కోహర్ ప్రశ్నించారు. చర్చలకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం రావాల్సి ఉందన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించకుండా ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహన్) పంజాబ్ ప్రధాన కార్యదర్శి సుఖ్దేవ్ సింగ్ విమర్శించారు. ఆకలితో వ్యాపారమా? దేశంలో ఆకలితో వ్యాపారం సాగించాలనుకుంటే సహించబోమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎంఎస్పీపై ప్రధాని మోదీ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు ఆందోళన విరమించాలన్న ప్రధానమంత్రి వినతిపై రాకేశ్ తికాయత్ సోమవారం ప్రతిస్పందించారు. ‘‘దేశంలో ఆకలితో వ్యాపారం చేయాలనుకుంటే అంగీకరించే ప్రసక్తే లేదు. ఆకలి పెరిగితే పంటల ధరలు పెరుగుతాయి. ఆకలితో వ్యాపారం చేయాలనుకుంటున్న వారిని దేశం నుంచి తరిమికొట్టాలి’’ అని అన్నారు. ఎంఎస్పీ ఉండదని రైతులు కూడా చెప్పడం లేదని, దానికి చట్టబద్ధత కావాలని మాత్రమే ఆశిస్తున్నారని గుర్తుచేశారు. మూడు సాగు చట్టాలను రద్దు చేసి, ఎంఎస్పీ కోసం కొత్త చట్టం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని సూచించారు. రైతుల పోరాటం రాజకీయ ప్రేరేపితం అన్న మోదీ వ్యాఖ్యలను తికాయత్ తప్పుపట్టారు. రైతుల్లో కులం, మతం ఆధారంగా చీలిక తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. సింఘు వద్ద తాత్కాలిక స్కూల్ ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద రైతుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక పాఠశాల దాదాపు 15 రోజుల తర్వాత పునఃప్రారంభమైంది. పంజాబ్లోని ఆనంద్ సాహిబ్కు చెందిన రైతులు ఈ పాఠశాలను డిసెంబర్లో ఏర్పాటు చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న రైతుల పిల్లలు చదువుకునేందుకు ఈ స్కూల్ను ఒక టెంట్లో నెలకొల్పారు. జనవరి 24న ఈ స్కూల్ను మూసివేశారు. ఫిబ్రవరి 5న మళ్లీ తెరిచారు. 1 నుంచి 7వ తరగతి వరకు బోధిస్తున్నారు. -
ఇది ప్రజా ఉద్యమం
గ్వాలియర్(మధ్యప్రదేశ్), చండీగఢ్, చర్ఖిదాద్రి (హరియాణా), భరూచ్(గుజరాత్): వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం ప్రజా ఉద్యమమని, ఇది విజయం సాధించి తీరుతుందని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ విశ్వాసం వ్యక్తం చేశారు. సాగు చట్టాలు రద్దయ్యేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, అప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసన కొనసాగిస్తామని, ఇళ్లకు వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు. రైతు ఉద్యమానికి ఖాప్ పంచాయత్లు, వాటి నేతలు గొప్పగా సహకరిస్తున్నారన్నారు. హరియాణాలో ఆదివారం జరిగిన ఒక కిసాన్ మహా పంచాయత్కు ఆయన హాజరయ్యారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ హరియాణాలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న స్వతంత్ర ఎమ్మెల్యే, సాంగ్వన్ ఖాప్ పంచాయత్ ముఖ్యుడు సాంబిర్ సాంగ్వన్ కూడా ఈ సభకు హాజరయ్యారు. ఖాప్ పంచాయత్లు హర్షవర్ధన మహారాజు కాలం నుంచి ఉన్నాయని, అప్పటి నుంచి సమాజానికి తమ వంతు సాయం చేస్తున్నాయని తికాయత్ గుర్తుచేశారు. రైతు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ప్రాంతాలపరంగా, మతాల పరంగా నేతల్లో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగాయని, అయితే, వారి ప్రయత్నాలేవీ సఫలం కాలేదని పేర్కొన్నారు.‘ఉద్యమ వేదిక మారదు.. ఉద్యమ నేతలు మారరు’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యమంలో కీలకంగా ఉన్న 40 మంది రైతు నేతలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఉద్యమ నేతల్లో విబేధాలు లేవని స్పష్టం చేశారు. పంజాబ్కు చెందిన బీకేయూ నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ ఈ ఉద్యమానికి వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. మరోవైపు, ఈ రైతు ఉద్యమం కొన్ని ప్రాంతాలకే పరిమితమని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రైతుల ఉద్యమంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో విలేకరులతో మాట్లాడుతూ విమర్శలు చేశారు. అధికారంలో ఉండగా, రైతుల కోసం ఏమీ చేయని కాంగ్రెస్కు.. రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వ్యవసాయం గురించి తోమర్కు ఏమీ తెలియదన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఆయన మాటలను సీరియస్గా తీసుకోవద్దని, కాంగ్రెస్ కూడా ఆయనను పట్టించుకోవడం మానేసిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగానే ఉందని, చర్చల విషయంలో ప్రభుత్వం ఒక ఫోన్కాల్ దూరంలోనే ఉందని ప్రధాని కూడా స్పష్టం చేశారని, అయినా రైతు ప్రతినిధుల నుంచి స్పందన లేదని కేంద్ర మంత్రి, రైతులతో చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. రైతు ఆత్మాహుతి రైతు ఉద్యమానికి మద్దతుగా ఒక 52 ఏళ్ల రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ శివార్లలోని టిక్రీ నిరసన కేంద్రానికి 2 కిమీల దూరంలో ఒక చెట్టుకు ఉరి వేసుకున్నారు. హరియాణాలోని జింద్కు చెందిన కరంవీర్ సింగ్గా ఆయనను గుర్తించారు. మృతదేహం వద్ద లభించిన లేఖను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ‘రైతు సోదరులారా.. మోదీ సర్కారు తేదీలపై తేదీలు ప్రకటిస్తోంది. ఈ నల్ల చట్టాలు ఎప్పుడు రద్దవుతాయో తెలియడం లేదు’ అని చేతిరాతతో ఉన్న ఆ లేఖలో ఉంది. దాదాపు రెండు వారాల క్రితం హరియాణాకే చెందిన మరో రైతు విషం తాగి ఆత్మాహుతికి పాల్పడ్డ విషయం తెలిసిందే. చట్టాలను వెనక్కు తీసుకోండి వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. అమెరికా నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామాను ప్రధాని తన ఇంటికి పిలిచి ఆతి«థ్యమిచ్చిన తరహాలోనే.. రైతులకు కూడా ఆతిథ్యమిచ్చి, సాగు చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పాలన్నారు. ప్రధాని మోదీ పెద్ద మనసు చేసుకుని రైతుల బాధ అర్థం చేసుకోవాలన్నారు. రైతుల నిరసనతో ప్రధాని మోదీకి నిద్ర కరవైందని ఎద్దేవా చేశారు. గుజరాత్లో గిరిజనులు, ముస్లింలు, దళితులు, ఓబీసీలు ఏకం కావాలన్నారు. గుజరాత్ స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. అహ్మదాబాద్, భరూచ్ల్లో భారతీయ ట్రైబల్ పార్టీతో కలిసి పోటీ చేస్తోంది. -
చక్కా జామ్ ప్రశాంతం
న్యూఢిల్లీ/చండీగఢ్/ఘజియాబాద్: కొత్త వ్యవసా య చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్తో రైతు సంఘాలు చేపట్టిన చక్కాజామ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. రైతుల నిరసనలకు మొదట్నుంచీ ముందు నిలుస్తున్న పంజాబ్, హరియాణా, రాజస్తాన్ రాష్ట్రాల్లో మూడు గంటలపాటు రోడ్ల దిగ్బంధనం పూర్తిస్థాయిలో జరిగింది. చాలా రాష్ట్రాల్లో అక్కడక్కడా రైతు సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఢిల్లీని చక్కాజామ్ నుంచి రైతు సంఘాలు మినహాయింపు ఇచ్చినప్పటికీ భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద ఇంటర్నెట్ సేవలను హోంశాఖ బంద్ చేసింది. ఢిల్లీలో మెట్రో రైలు స్టేషన్లను పాక్షికంగా మూసివేశారు. అక్టోబర్ 2వ తేదీ వరకు నిరసనలు కొనసాగిస్తామని, సాగు చట్టాల రద్దు డిమాండ్పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. చట్టాల రద్దు కోరుతూ రైతు సంఘాల ఉమ్మడి వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు చక్కా జామ్ చేపట్టాలని పిలుపునిచ్చింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మినహా మిగతా రాష్ట్రాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బాంధించాలని కోరింది. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద శనివారం యథావిథిగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. చక్కాజామ్కు మద్దతు తెలిపేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలపై ఢిల్లీలోని షహీదీ పార్కు వద్ద 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరియాణాలోని కుండ్లి– మనేసర్–పల్వాల్(కేఎంపీ) ఎక్స్ప్రెస్ హైవేపైకి వేలాదిగా రైతులు చేరుకున్నారు. రహదారిపై వాహనాలను అడ్డుగా ఉంచారు. పంజాబ్, రాజస్తాన్, హరియాణాల్లో రైతులు తమ ట్రాక్టర్–ట్రైలర్లను జాతీయరహదారులపై అడ్డుగా ఉంచారు. జాతీయ జెండాలను తమ ట్రాక్టర్లపై ఎగురవేశారు. చక్కాజామ్కు మద్దతుగా ఇతర రాష్ట్రాల్లో కూడా వివిధ సంఘాలు, పార్టీలు రాస్తారోకోలు చేపట్టాయి. రహదారులపై బైఠాయించిన రైతులను పెద్ద సంఖ్యలో పోలీసులు కొద్దిసేపు నిర్బంధించారు. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో రైతు సంఘాలు రోడ్లపై బైఠాయించాయి. మహారాష్ట్రలోని కరాడ్, కొల్హాపూర్ నగరాల్లో రాస్తారోకోలు జరిగాయి. కరాడ్లో రోడ్డుపైకి చేరుకున్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ సతీమణి సత్యశీల ఉన్నారు. కొల్హాపూర్లో స్వాభిమాన్ షేత్కారీ సంఘటన్ నేత రాజు శెట్టిని కొద్దిసేపు పోలీసులు నిర్బంధించారు. కర్ణాటకలో కొన్ని కన్నడ సంఘాలు, వివిధ రైతు సంఘాలు చాలా ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాయి. తమిళనాడులో చెన్నైతోపాటు ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఇంటర్నెట్ సేవలు బంద్ చక్కా జామ్ నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నిరసన కేంద్రాలైన సింఘు, సిక్రీ, ఘాజీపూర్ల వద్ద ఇంటర్నెట్ సేవలను కేంద్ర హోం శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ మూడింటితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నెట్ సేవలు శనివారం అర్ధరాత్రి వరకు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఇక్కడ జనవరి 29వ తేదీ నుంచే ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం బంద్ చేయించిన విషయం తెలిసిందే. జనవరి 26వ తేదీన ట్రాక్టర్ ర్యాలీ సమయంలో అల్లర్లు జరగడంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఢిల్లీలో భారీ భద్రత చక్కాజామ్ నిరసన నుంచి మినహాయించినప్పటికీ గణతంత్ర దినోత్సవం నాటి అనుభవాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ, రిజర్వు బలగాలను కలిపి దాదాపు 50 వేల మందిని మోహరించారు. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలపై నిఘా కోసం డ్రోన్ కెమెరాలను వినియోగించారు. మండీ హౌస్, ఎస్టీవో, ఢిల్లీ గేట్ సహా ఢిల్లీలోని 10 మెట్రో రైల్వే స్టేషన్లను మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు పాక్షికంగా మూసివేశారు. ఎర్రకోట, ఐటీవో వంటి ముఖ్య కూడళ్ల వద్ద భద్రతాబ లగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. పోలీసు యంత్రాంగం, అధికారులకు వ్యతిరేకంగా వ్యాపించే పుకార్లను అడ్డుకునేం దుకు సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచారు. సరిహద్దులతోపాటు అదనంగా ఏర్పాటు చేసిన పికెట్ల వద్ద పోలీసులు వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేశారు. గాంధీ జయంతి వరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు గాంధీ జయంతి(అక్టోబర్ 2) వరకు కొనసాగుతాయని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. చట్టాల రద్దు విషయంలో రాజీ పడేది లేదన్నారు. పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర లభించేలా చట్టం అమల్లోకి వచ్చాకే రైతులు ఇళ్లకు వెళతారని పేర్కొన్నారు. ‘ఈ విషయంలో భ్రమలు వద్దు. వేదికలు మారవు, నిరసనలు ఆగవు. వాళ్లు(ప్రభుత్వం) ఇనుప మేకులు నాటుతారు. మనం పంటలను విత్తుదాం’ అని తెలిపారు. ‘రైతులం మేమే, సైనికులమూ మేమే’ తమ ఉద్యమ నినాదమన్నారు. ‘రైతులు తమ పొలాల నుంచి పిడికెడు మట్టిని తీసుకువచ్చి, నిరసన కేంద్రాల వద్ద ఉన్న పోరాట మట్టిని వెంట తీసుకెళ్లాలి. ఈ మట్టితో మీ భూమిలో పోరాటాన్ని వ్యాపింపజేయండి. వ్యాపారులెవరూ మీ భూములను కబ్జా చేయాలని చూడరు’ అని పేర్కొన్నారు. ‘ఈ చట్టాలను ఇప్పుడు కాకుంటే. మరెప్పుడూ రద్దు చేయరు. దేశంలోని రైతులు తమ ఉత్పత్తులకు సగం ధరే పొందుతున్నారు. ఎంఎస్పీని పంజాబ్, హరియాణాల్లో మాత్రమే ఇస్తున్నారు. ఒక్క రాష్ట్రానికే ఈ పోరాటం పరిమితం అయిందంటూ వాళ్లు(ప్రభుత్వం) మనల్ని విభజించటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, మనది దేశవ్యాప్త పోరాటం’ అని తెలిపారు. ఉపాధి చూపే భూములను రైతులు కాంట్రాక్టు ఫార్మింగ్కు ఇవ్వవద్దని కోరారు. దేశంలోని రైతులంతా తమకు మద్దతుగా నిలిచారన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న రైతులకు నోటీసులిచ్చిన పోలీస్స్టేషన్ల ఎదుట కూడా రైతులు ఆందోళనలు చేపడతారని తికాయత్ అన్నారు. ‘ఒకప్పుడు అయోధ్యలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వేలాదిగామందికి నోటీసులు ఇవ్వలేదు. అక్కడి గుంపును ఎందుకు ఆపలేకపోయారు? అని ప్రశ్నించారు. రైతుల నుంచి భూములను ఎవరూ లాక్కోలేరని చెప్పారు. అందుకుగాను, రైతులు, సైనికులు ముందుకు రావాలన్నారు. ఘాజీపూర్ వద్ద బారికేడ్ల అవతల ఉన్న భద్రతా సిబ్బందికి చేతులో జోడిస్తూ ఆయన..‘మీ అందరికీనా వందనాలు. రైతుల పంట పొలాలను కాపాడాల్సింది మీరే’ అని తికాయత్ కోరారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద జవాన్లకు నమస్కరిస్తున్న రైతు నేత రాకేశ్ తికాయత్ -
కాంగ్రెస్ది రుధిర వ్యవసాయం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ రక్తంతో వ్యవసాయం చేస్తుందని, బీజేపీ అలా కాదని రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విపక్షంపై మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ విడుదల చేసిన ఒక పుస్తకంలోని వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు. తోమర్ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో అనంతరం వాటిని రికార్డుల నుంచి తొలగించారు. ‘మేం తీసుకువచ్చిన చట్టాలను నల్లచట్టాలని అంటున్నారు. ఆ చట్టాల్లో నలుపు(తప్పు) ఎక్కడ ఉందని, రైతులకు వ్యతిరేకంగా అందులో ఏం ఉందని రెండు నెలలుగా రైతులను అడుగుతున్నాం. రైతు వ్యతిరేకత ఎక్కడ ఉందో చూపిస్తే సరిదిద్దుతామని కూడా చెబుతున్నాం. వారి నుంచి జవాబు లేదు. వీరి(విపక్ష సభ్యులను చూస్తూ) నుంచీ జవాబు లేదు’అని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ మార్కెట్లు, కనీస మద్దతు ధర విధానం కొనసాగుతాయని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాల్లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తోమర్ పునరుద్ఘాటించారు. సవరణలకు సిద్ధంగా ఉన్నామంటే దానర్ధం చట్టాల్లో లోపాలున్నాయని తాము అంగీకరించనట్లు కాదని, రైతుల ఆందోళనలను గౌరవించి, సవరణలకు సిద్దమయ్యామని వివరించారు. రైతులే కాదు, వారి మద్దతుదారులు కూడా వ్యవసాయ చట్టాల్లో ఏ ఒక్క లోపాన్ని కూడా చూపలేకపోయారని తెలిపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమం చేయడం లేదని, కేవలం ఒక్క రాష్ట్రానికి చెందిన రైతులే ఉందోళనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వారిని కూడా కొందరు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు సమాచారంతో రెచ్చగొట్టారని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నీటితో వ్యవసాయం చేస్తారని అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ మాత్రం రక్తంతో వ్యవసాయం చేస్తుంది. రక్తంతో సాగు చేయడం బీజేపీకి తెలియదు’అని మండిపడ్డారు. వ్యవసాయ మార్కెట్లకు వెలుపల కోరుకున్న ధరకు, ఎలాంటి పన్ను లేకుండా తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం తాజా చట్టాలతో రైతులకు లభిస్తుందన్నారు. కాంట్రాక్ట్ వ్యవసాయంతో రైతులు పన్ను లేకుండానే తమ ఉత్పత్తులకు అమ్ముకోవచ్చని, ఒప్పందం నుంచి ఎలాంటి పరిహారం చెల్లించకుండానే వైదొలిగే అవకాశం కేంద్రం తీసుకువచ్చిన చట్టాల్లో ఉందని వివరించారు. కానీ, పంజాబ్లో అమల్లో ఉన్న చట్టం(పంజాబ్ కాంట్రాక్ట్ లా) అందుకు విరుద్ధంగా ఉందని, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రైతు.. జరిమానా చెల్లించడంతో పాటు జైలుకు కూడా వెళ్లేలా ఆ చట్టంలో నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. అంతే కాదు, ఆ చట్టం ప్రకారం తమ ఉత్పత్తులను అమ్మే రైతులు పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారని, అయితే, అహంకారం ఎక్కడ ఉందని, చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, చివరకు చట్టాల అమలును 18 నెలల పాటు నిలిపేసేందుకు కడా సిద్ధమైందని చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యుడు వినయ్ సహస్రబుద్ధే వ్యాఖ్యానించారు.సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ‘కరోనా కన్నా ముందే ఆర్థిక వ్యవస్థ మందగమనం ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రకటించిన అనాలోచిత లాక్డౌన్తో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో రైతులు న్యాయం కోసం యుద్ధం చేస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. సాగు చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలని కాంగ్రెస్ సభ్యుడు ప్రతాప్ సింగ్ బాజ్వా వ్యాఖ్యానించారు. రైతు నిరసన కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ‘బెర్లిన్ వాల్’తో పోల్చారు. జనవరి 26న రైతు ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన అల్లర్లపైనిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిజాలు మాట్లాడిన వారిని ద్రోహులంటున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై దేశద్రోహం కేసులు పెడ్తున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శించారు. విపక్ష సభ్యులకు తోమర్ సరైన, వివరణాత్మక జవాబు ఇచ్చారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ప్రసంగాన్ని ప్రజలంతా వినాలని ఆ ప్రసంగం వీడియో లింక్ను ట్యాగ్ చేశారు. సంప్రదాయాల ప్రకారమే.. వ్యవసాయ బిల్లులను రూపొందించే విషయంలో ప్రభుత్వం అన్ని సంప్రదాయాలను పాటించిందని, రాష్ట్రాలతో పాటు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను తీసుకుందని ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపింది. లోక్సభ సోమవారానికి వాయిదా సాగు చట్టాలకు వ్యతిరేకంగా లోక్సభలో విపక్షాల నిరసనతో శుక్రవారం కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ఫిబ్రవరి 3న ప్రారంభించిన బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీకి, ఆ తరువాత తన ప్రసంగాన్ని కొనసాగించే అవకాశమే లభించలేదు. శుక్రవారం కూడా సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు వెల్ వద్దకు దూసుకువెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో, సభను సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు. భయపడను: మీనా హ్యారిస్ .భారత్లో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్న రైతులకు తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సోదరి కుమార్తె, న్యాయవాది, రచయిత మీనా హ్యారిస్(36) మరోసారి తేల్చిచెప్పారు. రైతులకు మద్దతుగా ట్వీట్లు చేసినందుకు తనను దూషిస్తూ ఇండియాలో జరిగిన ప్రదర్శనల ఫొటోను ఆమె ట్విట్టర్లో తాజాగా షేర్ చేశారు. ‘‘భారతదేశంలోని రైతుల మానవ హక్కులకు మద్దతుగా మాట్లాడుతూనే ఉంటా. భయపడే ప్రసక్తే లేదు. నిశ్శబ్దంగా ఉండను’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. రైతుల పోరాటం గురించి మీనా హ్యారిస్ కొన్ని రోజులుగా వరుసగా ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పాప్ స్టార్ రిహన్నా, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి. వారిపై ప్రభుత్వ అనుకూల వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నాయి. గ్రెటానా.. ఆమెవరో నాకు తెలియదు: తికాయత్ రైతుల ఉద్యమానికి అంతర్జాతీయంగా లభిస్తున్న మద్దతుపై శుక్రవారం భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ స్పందించారు. విదేశాల్లోని ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు తమ ఉద్యమానికి మద్దతిస్తే ప్రభుత్వానికి సమస్య ఏంటని ప్రశ్నించారు. అయితే, ఉద్యమానికి మద్దతుగా ట్వీట్స్ చేసిన పాప్ సింగర్ రిహానా, నటి మియా ఖలీఫా, యువ పర్యావరణ వేత్త గ్రెటా థన్బర్గ్ సహా ఆ ప్రముఖులంతా ఎవరో తనకు తెలియదన్నారు. ‘ఎవరు వారంతా?’ అని ఆసక్తిగా మీడియాను ఎదురు ప్రశ్నించారు. వారెవరో వివరించిన తరువాత.. ‘వారు మా ఉద్యమానికి మద్దతిస్తే సమస్యేంటి? వారు మాకేమీ ఇవ్వడం లేదు. ఏమీ తీసుకెళ్లడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో చక్కా జామ్ లేదు నేడుతలపెట్టిన రహదారుల దిగ్బంధన కార్యక్రమం ‘చక్కా జామ్’ను ఢిల్లీలో నిర్వహించడం లేదని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద ఇప్పటికే ‘చక్కా జామ్’ పరిస్థితి ఉన్నందున ప్రత్యేకంగా ఆ కార్యక్రమం అవసరం లేదని భావిస్తున్నామంది. దేశవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని జాతీయ, రాష్ట్ర రహదారుల దిగ్బంధన కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, యూపీలోని శామలి జిల్లా భైన్స్వాల్లో శుక్రవారం జరిగిన రైతు మహాసభకు వేలాదిగా రైతులు హాజరయ్యారు. -
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై గురువారం రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమని, తక్షణమే వాటిని వెనక్కు తీసుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులతో చర్చల పేరుతో ఏకపాత్రాభినయం చేస్తున్నారని విమర్శించారు. విపక్ష సభ్యుల విమర్శలపై ప్రభుత్వం దీటుగా స్పందించింది. రైతుల సంక్షేమం కోసమే వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. రైతులను శత్రువులుగా చూస్తున్నారని, వారి నిరసన కేంద్రాలను దుర్బేధ్య కోటలుగా మారుస్తున్నారని విపక్ష సభ్యులు విమర్శించగా, రైతుల సంక్షేమం కోసం తాము చేపట్టిన చర్యలను ప్రభుత్వం ఏకరువు పెట్టింది. రైతుల దేశభక్తిని ప్రశ్నించే హక్కు ప్రభుత్వానికి లేదని, ఆహార రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి వారే కారణమని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో గురువారం పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు దీపిందర్సింగ్ హూడా వ్యాఖ్యానించారు. విపక్షాల విమర్శలను కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మధ్యప్రదేశ్కు చెందిన నేత జ్యోతిరాదిత్య సింధియా తిప్పికొట్టారు. గత ఆరేళ్లలో ప్రభుత్వం రైతుల కోసం, వారి ఆదాయాన్ని పెంచడం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించిందని వివరించారు. అంతకుముందు, జమ్మూకశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్లును హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. లక్ష కోట్ల అదనపు ఆదాయం రైతులకు అదనంగా లక్ష కోట్ల అదనపు ఆదాయం సమకూర్చే చర్యలు తీసుకుంటున్నామని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సభకు తెలిపారు. వ్యర్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా అది సాధ్యం చేస్తామన్నారు. త్వరలోనే ఘాజీపూర్ వద్ద పోగుబడిన వ్యర్థాలను కూడా తరలించి, ఇంధనంగా మారుస్తామన్నారు. ‘గోబర్ ధన్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. పశువుల పేడ, వ్యవసాయ వర్థాలు, నగరాల్లోని చెత్త, అటవీ వ్యర్థాలు.. వీటన్నింటిని ఇంధనంగా మారుస్తాం. అలా సమకూర్చుకునే దాదాపు లక్షకోట్ల రూపాయలను రైతులకు అందజేస్తాం. తద్వారా రైతుల ఆదాయం పెంచుతాం’అని వివరించారు. లోక్సభ మళ్లీ వాయిదా లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ప్రత్యేకంగా సభలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు గురువారం సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దాంతో సభ పలుమార్లు వాయిదా పడింది. సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాగానే, సాగు చట్టాలను రద్దు చేయాలంటూ విపక్ష సభ్యులు నినాదాలుచేశారు. 5 గంటలకు సభ మళ్లీ సమావేశమైన తరువాత కూడా విపక్షాలు నిరసన, నినాదాలు కొనసాగించాయి. నిరసనల మధ్యనే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆర్బిట్రేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆ తరువాత సభను స్పీకర్స్థానంలో ఉన్న మీనాక్షి లేఖ 6 గంటల వరకు వాయిదా వేశారు. -
ఎంపీలను అడ్డుకున్న పోలీసులు
న్యూఢిల్లీ/రాంపూర్: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీ శివార్లలోని ఘాజీపూర్ నిరసన కేంద్రం వద్దకు వెళ్లిన విపక్ష పార్టీల ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై అడ్డుగా పెట్టిన బారికేడ్లను దాటి, రైతులను కలుసుకునే అవకాశం ఎంపీలకు కల్పించలేదు. శిరోమణి అకాలీదళ్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్ సహా 10 విపక్ష పార్టీలకు చెందిన 15 మంది ఎంపీలు గురువారం ఘాజీపూర్ సరిహద్దుకు వెళ్లారు. ఎంపీల బృందంలో శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్, సుప్రియ సూలే(ఎన్సీపీ), కణిమొళి(డీఎంకే), తిరుచ్చి రవి(డీఎంకే), సౌగత రాయ్(టీఎంసీ) తదితరులు ఉన్నారు. అనంతరం ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఘాజీపూర్ భారత్– పాకిస్తాన్ సరిహద్దులా ఉందని, రైతులు జైళ్లో ఉన్న ఖైదీలుగా ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. రైతులను కలుసుకునేందుకు ప్రజా ప్రతినిధులమైన తమను పోలీసులు అనుమతించలేదని వివరించారు. గురువారం లోక్సభ భేటీ ముగిసిన అనంతరం ఎంపీలు సుప్రియ సూలే, సౌగత రాయ్ స్పీకర్కు స్వయంగా ఈ లేఖను అందజేశారు. మరోవైపు, ఢిల్లీ–యూపీ మార్గంలో ఉన్న ఘాజీపూర్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయినా, వేలాది మంది రైతులు తీవ్ర చలిని తట్టుకుంటూ నిరసన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ– మీరట్ హైవేపైనే కొందరు విశ్రమిస్తున్నారు. మరోవైపు, జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన ఆందోళనల సమయంలో మృతి చెందిన రైతు నవ్రీత్ సింగ్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పరామర్శించారు. ఉత్తర ప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో ఉన్న దిబ్డిబ గ్రామంలో నవ్రీత్సింగ్ కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చి, వారితో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిరసన తెలుపుతున్న రైతులను ఉగ్రవాదులని, వారి ఉద్యమాన్ని రాజకీయ కుట్ర అని అవమానించడం ఆపేయాలని ప్రియాంక డిమాండ్ చేశారు. రైతులు, పేదల బాధను గుర్తించలేని నాయకులతో ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. నవ్రీత్ సింగ్ త్యాగం వృధా పోదని వారి కుటుంబసభ్యులకు చెప్పడానికే తాను ఇక్కడికి వచ్చానన్నారు. దిబ్డిబ వెళ్తుండగా, ప్రియాంక వాహన శ్రేణిలో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్లోని 4 వాహనాలుæ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. -
బిల్ వాపసీ కాదంటే.. గద్దీ వాపసీ!
న్యూఢిల్లీ/జింద్(హరియాణా): ఒకవైపు, రైతు నిరసన కేంద్రాలను ప్రభుత్వం దుర్భేద్య కోటలుగా మారుస్తోంటే.. మరోవైపు, ఉద్యమ తీవ్రతను ప్రభుత్వానికి రుచి చూపిస్తామని రైతు నేతలు హెచ్చరిస్తున్నారు. ఉద్యమం ఇలాగే కొనసాగితే మోదీ సర్కారు అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోనట్లయితే అధికార పీఠం దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘ఇన్నాళ్లూ వ్యవసాయ చట్టాలను(బిల్ వాపసీ) వెనక్కు తీసుకోవాలనే డిమాండ్ చేశాం. ఆ చట్టాలను వెనక్కు తీసుకోనట్లయితే.. అధికారాన్ని వెనక్కు తీసుకునే(గద్దీ వాపసీ) నినాదాన్ని మన యువత ఇస్తే పరిస్థితేంటో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి’ అని హరియాణాలో బుధవారం జరిగిన రైతు మహా పంచాయత్లో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారికేడ్లను, ముళ్ల కంచెలను, రోడ్లపై మేకులను ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ.. ‘రాజు భయపడినప్పుడే.. కోటను పటిష్టం చేసుకుంటాడు’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రోడ్లపై ఏర్పాటు చేసిన మేకులపై తాను పడుకుని, ఇతర రైతులు తనపై నుంచి సురక్షితంగా దాటి వెళ్లేలా చూస్తానని ఉద్వేగభరితమయ్యారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమవుతోందని, ఖాప్ పంచాయత్ల నుంచి లభిస్తున్న మద్దతు చూస్తుంటే కచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు.ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను కేంద్రం కొనసాగిస్తోంది. ముఖ్యంగా వేలాది రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీ– మీరట్ హైవేపై ఉన్న ఘాజీపూర్ సరిహద్దు వద్ద భద్రత చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ మద్దతు గర్వకారణం రైతు ఉద్యమానికి అంతర్జాతీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించడం గర్వకారణమని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. అనధికార చర్చలు లేవు: తోమర్ రైతులతో అనధికార చర్చలు జరపడం లేదని బుధవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. నిరసన కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టడంపై స్పందిస్తూ అది స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన శాంతి భద్రతల సమస్య అని పేర్కొన్నారు. రైతు ప్రతినిధులతో ప్రభుత్వం జనవరి 22న జరిపిన 11వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన హింసకు సంబంధించి అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేసేవరకు ప్రభుత్వంతో చర్చల ప్రసక్తే లేదన్న రైతుల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘అది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. దానిపై వారు ఢిల్లీ పోలీస్ కమిషనర్తో మాట్లాడాలి. నాతో కాదు’ అని తోమర్ పేర్కొన్నారు. రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగా లభిస్తున్న మద్దతుపై బుధవారం బీజేపీ స్పందించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని ఆరోపించింది. ట్విటర్కి కేంద్రం వార్నింగ్ రైతు ఉద్యమానికి సంబంధించి వస్తున్న అసత్య ప్రచారాల ట్వీట్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమం ట్విటర్ని ఆదేశించింది. వెంటనే ఆ పని చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వ్యవసాయ చట్టాలపైన, రైతు ఆందోళనలపైన అవగాహన లేని వారంతా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారంది. రైతు మారణహోమం పేరుతో హ్యాష్ట్యాగ్ త్వరలో రాబోతోందన్న సమాచారం ఉందని అలాంటివి వెంటనే అడ్డుకోవాలంటూ ట్విటర్కి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నోటీసులు పంపింది.