ఇంటి వద్ద ఓటింగ్‌ నేటి నుంచే.. | Sakshi
Sakshi News home page

Rajasthan: ఇంటి వద్ద ఓటింగ్‌ నేటి నుంచే..

Published Fri, Apr 5 2024 10:39 AM

Home voting in Rajasthan for first phase Lok Sabha elections starts today - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్‌ 5) నుంచి ప్రారంభమవుతోంది. పోలింగ్‌ కేంద్రాలలో ఓటింగ్‌ ఏప్రిల్‌ 19న జరగనుండగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏప్రిల్ 5 నుంచి 14 వరకు ఇంటి వద్ద ఓటింగ్ నిర్వహించనున్నారు.

రాజస్థాన్‌ రాష్ట్రంలో 58,000 మందికి పైగా ఓటర్లు ఇంటి వద్ద ఓటింగ్‌ను ఎంచుకున్నారని, వీరిలో 35,542 మంది మొదటి దశ లోక్‌సభ ఎన్నికల కోసం నమోదు చేసుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా ఇటీవల తెలిపారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఓటర్లకు ఇంటి ఓటింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. 

రాజస్థాన్‌లో మొదటి దశ లోక్‌సభ ఎన్నికల కోసం నమోదైన 35,542 మంది ఓటర్లలో 26,371 మంది సీనియర్ సిటిజన్లు ఉండగా 9,171 మంది దివ్యాంగులు ఉన్నారు. "ఇప్పటి వరకు, 58,000 మంది అర్హతగల ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు. వీరిలో 43,638 మంది సీనియర్ సిటిజన్లు, 14,385 మంది దివ్యాంగులు ఉన్నారు" అని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. రాజస్థాన్‌లో రెండు దశల్లో ఏప్రిల్ 19, 26 తేదీలలో పోలింగ్ జరుగుతుంది.

Advertisement
 
Advertisement