
150 ఏళ్లుగా కొనసాగుతున్న సేవలు త్వరలో నిలిపివేత
బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా అనగానే వెంటనే గుర్తుకొచ్చేవి ట్రామ్లు. రహదారుల మధ్యలో పట్టాల మీదుగా పరుగులు తీసే ట్రామ్ల్లో ప్రయాణించడం ఒక మధురమైన జ్ఞాపకం. నగరంలో 150 సంవత్సరాలుగా కొనసాగుతున్న ట్రామ్ల సేవలను త్వరలో పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి స్నేహశిష్ చక్రబర్తి వెల్లడించారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆధునిక కాలంలో నగరంలో వేగవంతమైన ప్రయాణ సాధనాల అవసరం నానాటికీ పెరుగుతోందని అన్నారు.
తక్కువ వేగంతో ప్రయాణించే ట్రామ్ల వల్ల రోడ్లలో ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, తరచుగా ట్రాఫిక్ జామ్ల వల్ల జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందుకే ట్రామ్ల సేవలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ‘‘ట్రామ్లు 1873 నుంచి కోల్కతా సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. కానీ నగరంలో వాహనాల రద్దీ భారీగా పెరిగిపోతోంది. అందుకే ఇకపై ట్రామ్లను నడపలేం’’ అన్నారు.
పలు మార్గాల్లో వాటినిప్పటికే పూర్తిగా నిలిపేసినట్లు గుర్తుచేశారు. మిగిలిన మార్గాల్లోనూ ముగింపు పలుకుతున్నట్లు వివరించారు. ప్రజలకు ఇబ్బందులు తప్పించాలన్న ఉద్దేశంతోనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని వివరణ ఇచ్చారు. కేవలం మైదాన్– ఎస్ప్లాండే హెరిటేజ్ మార్గంలో మాత్రమే ఇకపై ట్రామ్లు నడుస్తాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment