
తమిళనాడు: విడదీస్తారనే భయంతో పెళ్లి చేసుకున్న ఓ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని అరుంబాక్కం గ్రామానికి చెందిన మణికంఠన్(27) ఇళ్లకు టైల్స్ వేసే పనిచేస్తుంటాడు. ఇదివరకే వివాహం జరిగిన ఇతను భార్యను వదిలి ఒంటరిగా జీవిస్తున్నాడు.
ఈక్రమంలో కడలూరు జిల్లా నెల్లికుప్పం గ్రామానికి చెందిన కోకిల(19) కడలూరులోని ఓ ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికి ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి రెండు నెలల క్రితం ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసి కోకిల కుటుంబసభ్యులు కడలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకున్న ఇద్దరూ విచారణకు రావాలని పోలీసులు తరచూ ఫోన్ చేస్తున్నట్లు తెలిసింది.
దీంతో గురువారం ఉదయం బైకులో ఇద్దరూ కలిసి కడలూరుకు బయలుదేరారు. పోలీసులు ఇద్దరిని విడదీస్తారని భయంతో ఇద్దరూ లత్తేరి సమీపంలోని పట్టివూరు రైలు పట్టాల వద్దకు వెళ్లి ఇద్దరూ కౌగిలించుకొని పట్టాలపై తలపెట్టి పడుకున్నారు. ఆ సమయంలో రైలు వారిపై వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన ప్రయాణికులు జోలార్పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు.