ప్రధాని మోదీకి బైడెన్‌ ఫోన్‌.. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై చర్చ | Modi Speaks to Joe Biden Concerns Over Safety of Hindus | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి బైడెన్‌ ఫోన్‌.. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై చర్చ

Published Tue, Aug 27 2024 9:24 AM | Last Updated on Tue, Aug 27 2024 10:47 AM

Modi Speaks to Joe Biden Concerns Over Safety of Hindus

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రపంచంలోని వివిధ సమస్యలపై చర్చించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ తన ఎక్స్ హ్యాండిల్‌లో తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు. అక్కడి హిందువులకు రక్షణ కల్పించాలని అన్నారు.

బంగ్లాదేశ్‌, ఉక్రెయిన్‌లలో నెలకొన్న తాజా పరిస్థితులపై కూడా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షునితో చర్చించారు. ఉక్రెయిన్‌లో శాంతి, సుస్థిరతలను వీలైనంత త్వరగా తిరిగి తీసుకువచ్చే విషయంలో భారత్‌ మద్దతు ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన ఎక్స్ హ్యాండిల్‌లో.. ‘మేము ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితితో సహా వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై విస్తృత చర్చలు జరిపాం. శాంతి, సుస్థిరతలను వీలైనంత త్వరగా తిరిగి తీసుకువచ్చేందుకు భారతదేశ మద్దతును  పునరుద్ఘాటించాను. బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితిపై కూడా చర్చించాం. త్వరలోనే  సాధారణ స్థితిని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాం. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, ముఖ్యంగా హిందువులకు భద్రత కల్పించాలని కోరాను’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

భారత్‌, యూఎస్‌ల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై బైడెన్‌కు ఉన్న నిబద్ధతను మోదీ ప్రశంసించారు. ఈ ఫోను సంబాషణలో ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన కీవ్ పర్యటన గురించి అమెరికా అధ్యక్షునికి వివరించారు. తాను అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశానని తెలిపారు. దౌత్యానికి అనుకూలంగా భారతదేశ కట్టుబాటును, స్థిరమైన వైఖరిని ప్రధాని మరోమారు పునరుద్ఘాటించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement