
న్యూఢిల్లీ: దేశంలో 13,34,385 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభలో లిఖతపూర్వకంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ గణాంకాలను ఇందులో కలపలేదని చెప్పారు. 68 నగరాల్లో 2,877 పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లకు అనుమతి ఇచ్చామన్నారు.
9 ఎక్స్ప్రెస్ రహదారులు, 16 జాతీయ రహదారుల వద్ద 1,576 చార్జింగ్ స్టేషన్లకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు. ఇండియాలో మొత్తం 27,25,87,170 రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 207 దేశాల్లో రిజిస్టర్ అయిన 205.81 కోట్ల వాహనాల్లో ఈ సంఖ్య 13.24 శాతమని వివరించారు. దేశంలో జాతీయ రహదారుల వెంట 1,056 పురుష టాయిలెట్లు, 1,060 మహిళల టాయిలెట్లు ఉన్నాయని మరో ప్రశ్శకు సమాధానంగా నితిన్ గడ్కరీ చెప్పారు.