సికింద్రాబాద్‌ – గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు | New bi weekly express train between Secunderabad and Goa | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌ – గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు

Published Sun, Jul 7 2024 4:54 AM | Last Updated on Sun, Jul 7 2024 4:54 AM

New bi weekly express train between Secunderabad and Goa

ప్రధాని, రైల్వేశాఖ మంత్రికిధన్యవాదాలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

గతంలో ఈ రైలు అవసరంపై రైల్వే మంత్రికి లేఖ రాసిన కిషన్‌రెడ్డి    

సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలనుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడి­గామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును (17039/17040) ప్రారంభించనుంది. ఈ బై వీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి గోవా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. ఇప్పటివరకు వారానికి ఒక రైలు 10 కోచ్‌లతో సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి గుంతకల్‌కు చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 కోచ్‌లతో కలుపుకుని గోవాకు చేరుకునేది. 

ఇది కాకుండా కాచిగూడ –యలహంక మధ్య వారానికి 4 రోజు­లు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్‌లను కలిపేవారు. ఈ 4 కోచ్‌లను తిరిగి గుంతకల్‌ వద్ద షాలిమార్‌ – గోవా మధ్య తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు. అయితే సికింద్రాబాద్‌ – గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలామంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ...రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఈ ఏడాది మార్చి 16న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు.

మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు అధికారంలోకి రావడంతో..ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. దీనిపై అశ్వినీ వైష్ణవ్‌ సానుకూలంగా స్పందించారు. దీంతో సికింద్రాబాద్‌–­వాస్కోడి­గామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. 

ఈ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్‌ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్‌ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్‌ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడిగామా చేరుకుంటుంది. కేంద్రం తీసు­కున్న ఈ నిర్ణయంపై జి.కిషన్‌రెడ్డి ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement