వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి.. ఢిల్లీ వాసులకు స్వల్ప ఊరట | Sakshi
Sakshi News home page

వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి.. ఢిల్లీ వాసులకు స్వల్ప ఊరట

Published Fri, Nov 10 2023 11:42 AM

Overnight Rain Improves Delhi Air Quality More Showers Likely Friday - Sakshi

న్యూఢిల్లీ: రోజురోజుకీ పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులకు తాజాగా స్వల్ప ఊరట కలిగింది. ఢిల్లీతో సహ నోయిడా, గురుగ్రామ్‌, ఎన్సీఆర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి ఓ మోస్తారు వాన పడింది. ఇది రాజధానానిలో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పుకు దారితీసింది. గాలిలో ఉన్న విష‌పూరిత వాయులు కొంత వ‌ర‌కు క్లీన్ అయ్యాయి. గాలి నాణ్యత సూచి కూడా స్పల్పంగా మెరుగుపడింది.  

శుక్రవారం ఉదయంనాటికి దిల్లీలో సగటు గాలి నాణ్యత సూచీ (AQI) 408కి తగ్గింది. నిన్న సాయంత్రం ఇది 437గా నమోదైంది. శుక్రవారం కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించడంతో ఢీల్లి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కర్తవ్య పాత్‌, ఐటీఓ, ఢిల్లీ-నోయిడా సరిహద్దు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా పడిన వర్షపు జల్లులకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఢిల్లీ వ్యాప్యంగా చాలా చోట్ల గురువారం రాత్రి వరకు 400+  ఉన్న గాలి నాణ్యత సూచీ ఆ తరువాత 100 కంటే తక్కువ నమోదైంది. 

కాగా ఢిల్లీ–ఎన్సీఆర్‌ (దేశ రాజధాని ప్రాంతం)లో గత వారం రోజులుగా కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. వాయు కాలుష్యం పెరగడం, నాణ్యత సూచీ పడిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏడేళ్ళ తర్వాత కాలుష్యం దెబ్బతో స్కూళ్ళు మూతబడ్డాయి. ఇప్పటికే ఆఫీసులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పెట్టారు. దట్టమైన పొగ నిండిన రోడ్లతో, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ, ముక్కులకు మాస్కులు తగిలించుకొని సాహసించి జనం బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొంది.  
చదవండి: కశ్మీర్‌లో విపరీతమైన మంచు.. రహదారుల మూసివేత

పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు, వాహనాల నుంచి వెలవడే పొగ ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అటు కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఉన్నంతలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలని ఈ నెల 13 నుంచి సరి – బేసి విధానం పాటిస్తామని కేజ్రీవాల్‌ సర్కార్‌ ప్రకటించింది.

కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు, గాలి నాణ్యతను పెంచేందుకు దేశ రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించాలని ఆలోచన చేసింది. నవంబర్‌ 20 నుంచి 21 వరకు  రెండు రోజుల పాటు ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించాలని నిర్ణయించింది. ఈలోగానే వర్షాలు కురుస్తుండటం ప్రజలు, ప్రభుత్వానికి కాస్త ఉపశమనం లభించినట్లైంది.

Advertisement
Advertisement