
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అక్కడి పాలక పార్టీ ఆప్ను మరిన్ని సమస్యలు చుట్టుముట్టేలా కని్పస్తున్నాయి. దీనికి సంబంధించిన అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో ఆప్ను కూడా నిందితుల జాబితాలో చేర్చే విషయమై ఆలోచన చేస్తున్నట్టు సీబీఐ, ఈడీ పేర్కొన్నాయి. వాటి తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు సోమవారం సుప్రీంకోర్టుకు ఈ మేరకు నివేదించారు.
అవినీతి వ్యతిరేక చట్టం, నగదు అక్రమ తరలింపు (నిరోధక) చట్టంలోని సెక్షన్ 70 ప్రకారం ఈ చర్య తీసుకోదలచినట్టు వివరించారు. అయితే సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో ఆప్పై ప్రత్యేక అభియెగాలు మోపుతారా అన్న విషయమై మంగళవారం స్పష్టత ఇవ్వాల్సిందిగా ఆయనకు ధర్మాసనం సూచించింది. మద్యం విధానం కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్లపై వాదనల సందర్భంగా ఏఎస్జీ ఈ మేరకు ప్రకటన చేశారు.