విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్‌రేప్‌.. తమిళనాడులో వెలుగు చూసిన దారుణం | Three teachers arrested In Tamil Nadu Krishnagiri Full Details | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్‌రేప్‌.. తమిళనాడులో వెలుగు చూసిన దారుణం

Published Thu, Feb 6 2025 9:28 AM | Last Updated on Thu, Feb 6 2025 9:56 AM

Three teachers arrested In Tamil Nadu Krishnagiri Full Details

చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారిపోయారు. సభ్య సమాజం తల దించుకునేలా టీచర్లు వ్యవహరించారు. ఓ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో, ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వివరాల ప్రకారం.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ పాఠశాలలో మైనర్‌ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని గర్భం దాల్చింది. అసలు విషయం తన తల్లికి చెప్పడంతో ఆవేదన చెందిన ఆమె.. బిడ్డను గత నెల రోజులుగా పాఠశాలకు పంపించలేదు. స్కూలుకు సెలవు పెట్టించి అబార్షన్‌ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలిసింది.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే శిశు సంక్షేమ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితురాలితో ఫిర్యాదు చేయించారు. దీంతో, బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం, రంగంలోకి దిగిన శిశు సంక్షేమ శాఖ అధికారులు.. దారుణ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు..  ఉపాధ్యాయులు చిన్నసామి(57), ఆర్ముగం(45), ప్రకాశ్‌(37)ను అరెస్ట్‌ చేశారు. ఇక, ఈ ఘటన చర్చనీయాంశంగా మారడంతో స్థానికులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు మరోవైపు.. ఈ ఘటన అనంతరం వారిని జిల్లా ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ సస్పెండ్‌ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. 

ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో తమిళనాడులో వరుస లైంగిక దాడుల ఘటనలు స్టాలిన్‌ సర్కార్‌కు మచ్చ తెస్తున్నాయి. గత ఏడాది డిసెంబరు 23న అన్నామలై విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో, ప్రతిపక్ష బీజేపీ నిరసనలు చేపట్టింది. స్టాలిన్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement