
మీరట్: ఉత్తరప్రదేశ్లో గత ప్రభుత్వాల హయాంలో గ్యాంగ్స్టర్లు, నేరగాళ్ల ఆటలు సాగాయని, అయితే యోగి ఆదిత్యనాథ్ వచ్చాక వారి ఆటల కట్టించారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం గ్యాంగ్స్టర్లు, క్రిమినల్స్ను జైళ్లకు పంపుతూ వారిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘జైలు..జైలు’ ఆట (కబడ్డీ ఆటలోని కూతను తలపించేలా) ఆడుతున్నారని మోదీ.. యోగి సర్కార్ను ప్రశంసించారు. ఆదివారం మీరట్లో మేజర్ ధ్యాన్చంద్ క్రీడా విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని సభలో ప్రసంగించారు.
‘గతంలో రాష్ట్రంలో నేరగాళ్లు, మాఫియా అక్రమాలు, ఆక్రమణల టోర్నీలు ఆడేవి. తమ కుమార్తెలపై అసభ్యంగా మాట్లాడిన వారు స్వేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నా ప్రజలు నిస్సహాయంగా చూడాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వాల వైఫల్యం కారణంగా అకృత్యాలు పెరిగి ఇళ్లు తగలబెట్టడంతో జనం సొంతింటిని వదిలి వలస వెళ్లాల్సిన దుస్థితి. కానీ, ప్రస్తుతం యోగి సర్కార్.. క్రిమినల్స్ను జైళ్లకు పంపుతూ వారితో జైలు ఆట ఆడుతోంది’ అని మోదీ అన్నారు. రూ. 700 కోట్లతో నిర్మించే స్పోర్ట్స్ వర్సిటీ 1,080 మంది బాల, బాలికలను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దనుంది.
Comments
Please login to add a commentAdd a comment