విజయవంతం చేద్దాం
తిరుపతమ్మ చిన్న తిరునాళ్లను
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో చిన్న తిరునాళ్లను అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని నందిగామ డివిజన్ ఆర్డీఓ కె. బాలకృష్ణ ఆదేశించారు. మార్చి 14 నుంచి 18 వరకు ఐదు రోజుల పాటు జరిగే తిరునాళ్ల ఉత్సవాలకు సంబంధించి గురువారం ఆలయ బేడా మండపంలో అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమర్థంగా పనిచేయాలన్నారు. తిరునాళ్ల ఉత్సవాలు జరిగే ఐదు రోజులు పారిశుద్ధ్యం, తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మార్చి 17న పుట్టింటి పసుపు–కుంకుమ బండ్లకు విద్యుత్ దీప కాంతులు ఏర్పాటు చేసే సందర్భంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయం వద్ద పలు శాఖల సమాచార కేంద్రాలతో పాటు, తాగునీటి సౌకర్యం, తాత్కాలికంగా బస్టాండ్ల ఏర్పాటు ఉంటుందన్నారు. పుట్టింటి పసుపు కుంకుమ బండ్లకు ప్రభలు 11 అడుగులకు మించి ఉండకూడదన్నారు. సీసీ కెమెరాలు అన్నీ ఒకే చోట పెట్టకుండా గ్రామంలోకి వచ్చే అన్ని దారుల్లో ఏర్పాటు చేయాలని దేవాలయ అధికారులకు సూచించారు. పసుపు బండ్లు వచ్చే దారిలో తాత్కాలిక దుకాణాలు, ఆక్రమణలు ఉండకుండా పంచాయతీ అధికారులు ఇతర శాఖల సహకారంతో చర్యలు తీసుకోవాలన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు..
ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఈఓ బీహెచ్వీఎస్ఎన్ కిషోర్కుమార్ మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మునేటిలో భక్తులకు జల్లు స్నానాల ఏర్పాటుతో పాటు మునేరులో తాత్కాలిక కేశఖండనశాల ఏర్పాటు చేస్తామన్నారు.
ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ..
నందిగామ ఏసీపీ తిలక్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎటువంటి అవరోధం లేకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం తిరునాళ్ల ఉత్సవాల పోస్టర్ను అధికారులు, పాలకవర్గ సభ్యులు ఆవిష్కరించారు. తహసీల్దార్ ఎ. శాంతిలక్ష్మి, ఎంపీడీఓ జి. శ్రీను, ఆలయ ఈఈ ఎల్. రమ, వైద్యాధికారి పి. ఇందిర, జగ్గయ్యపేట సీఐ పి. వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఎంఎస్కే అర్జున్, ఇరిగేషన్ జేఈ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సమన్వయ సమావేశంలో ఆర్డీఓ బాలకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment